కాశీపంచకము
(శ్రీశంకరాచార్య విరచితము)
(శ్రీస్వామి తత్త్వవిదానందసరస్వతివారి ఆంగ్లవివరణకు స్వేచ్ఛానువాదము.)
మున్నుడి
అందరికీ నమస్కారం. సన్మిత్రులు, హితైభిలాషులు శ్రీకాశావజ్ఝల నరసింహమూర్తి గారు, ఒకసారి ప్రసంగవశాత్తు శ్రీశంకరాచార్యులవారు రచించిన 'కాశీపంచకము' గురించి, దానికి శ్రీతత్త్వవిదానందసరస్వతిస్వాములవారు చేసిన ఆంగ్లవివరణ గురించి తెలియ జేశారు. దాని లోని కొంతభాగాన్నికూడా నాకు చెప్పారు. అది వినగానే నాలో ఏదో తెలియని ఉత్సుకత, అభినివేశము పొటమరించాయి. ఇంత గొప్పదైనది, గంభీరమైనది ఇంగ్లీషులోనే ఎందుకుండాలి? మన తెలుగులో ఎందుకుండకూడదు? అని అనిపించింది. నేనే ఈపని ఎందుకు చేయకూడదు? అన్న భావనకూడా వచ్చింది. అప్పుడు ఈవిషయాన్ని శ్రీనరసింహమూర్తి గారికి చెప్పి, ఆపుస్తకం పిడిఎఫ్ కాపీని నాకు పంపించ మని కోరాను. దానికి వారు ఎంతో సంతోషించి, నాకు ఆ పిడిఎఫ్ కాపీని పంపారు. అప్పటికప్పుడు, అనగా ది.13-9-2021న దాని ప్రింటు తీసి, స్వేచ్చానువాదం చేయడం ప్రారంభించాను. సన్మిత్రుల సహకారంతో అది ది.5-10-2021న పూర్తయింది. ఈవిషయమై కొన్నివిషయాలు మీముందుంచడం తప్పనిసరి. ఇందులో శ్రీశంకరాచార్యుల వారు కాశీ యాత్ర అంటే భౌతికయాత్ర కాదని, అది మన లోలోపల యదార్థమైన, శాశ్వతమైన దాని కోసం చేసే యాత్ర అని, దానిని దర్శించి, అనుభవించితే ఏయాత్రలూ అవుసరం లేదని ప్రబోధించారు.దానికి శ్రీతత్త్వవిదానందస్వాములవారు చాలాచక్కటి , ప్రౌఢమైన ఆంగ్లవివరణ యిచ్చారు. వారికి కృతజ్ఞతాపూర్వక ప్రణామములు సమర్పించుచున్నాను.
ఇక్కడ నా పసితనంలో జరిగిన ఒక సంఘటనను మీకు తెలియజేయాలను కుంటున్నాను. అప్పుడు మేము రాజమండ్రిలోని చందాసత్రంలో వుండేవారము. నేను పాలుత్రాగే పసివాడిని. అప్పుడు శ్రీఉమామార్కండేయేశ్వరస్వామి దేవాలయంలో ఒక గొప్పవారు వచ్చి, దివ్యంగా 'శివార్చన' చేశారు. దాన్ని చూడాలని మాతల్లిగారు (మాకు సద్గురువులు కూడా) కృష్ణవేణుగారు, కుతూహలపడ్డారు. అప్పటికి మాతండ్రిగారు స్వర్గస్తులై ఎంతోకాలము కానందున, అప్పటి పరిస్థితులలో మామాతామహులు మాతల్లి గారిని బయటకు వెళ్ళుటకు అనుమతించలేదు. దానికి మాతల్లిగారు ఈశ్వరా, నీదర్శనం నాకు లభించలేదు, నేను అంతటి అదృష్టానికి నోచుకోలేదా! అని బాధపడినారు. ఆరాత్రి ధ్యానంలో వారికి నిలువెత్తు శివలింగం దర్శనమిచ్చిందట! ఆ ఆనందంలో మాతల్లిగారు, ఆశువుగా ఈపాట పాడారట.
"ఎందో కలడని, దేముడెందెందో కలడని, ఏగెదరు అంధులగుచు నరులూ!"
"స్థావరజంగ మహాశివ తత్త్వాదులయందు నిండియున్న సాక్షిభూతుని,
సర్వేశ్వరుని, తనలో గాంచకలేక, ॥ఎందో కలడని ॥
సరిగ్గా ఈభావాన్నే శ్రీశంకరాచార్యులవారు, శ్రీతత్త్వవిదానందసరస్వతిస్వాముల వారు మనకు ప్రబోధించారు.
ఈవిషయం నాకు తెలియజేసి ఎంతో ప్రోత్సహించిన శ్రీకాశావఝ్ఝల నరసింహమూర్తిగారికి, నన్ను ప్రోత్సహించిన సన్మిత్రురాలు, దైవమిచ్చిన సహోదరి శ్రీమతి బండి భ్రమరాంబ గారికి నా కృతజ్ఞతాభివందనములు తెలియజేస్తున్నాను.
నేను అంతగా విద్యావంతుడను కానందున, ఇందలి దోషములునావిగా భావించి, తెలియజేసినచో, సరిదిద్దుకొనగలవాడను. దీని ముఖ్యోద్దేశ్యమును గ్రహించి, నిజతీర్థయాత్రా ఫలమును పొందగలరని చదువరులను కోరుచూ, ఆశిస్తున్నాను.
ఇట్లు,
బుధజనవిధేయుడు.
ఉపోద్ఘాతం.
ప్రపంచములోని ఏ ధర్మమునకైనా మూడు దృక్పథాలుంటాయి. అవి , మొదటిది కర్మ లేక ఆచారక్రియలు చేయుట, రెండవది ఉపాసన అనగా భక్తి, మానసిక ఆరాధన, మూడవది జ్ఞానము-ఎఱుక, లేదా వేదాంత పరిజ్ఞానము.ఈమూడు అంశాలు హిందూ ధర్మములో చాలా చక్కగా పొందు పర్చబడినవి. పాశ్చాత్యనాగరికతలో తాత్త్వికత మతము నుండి వేరుచేయబడి, భక్తి, ఆచారక్రియలకు పరిమితం చేయబడినది. అరిస్టాటిల్ వంటి గొప్ప తత్త్వవేత్తలు మతము విషయములో ఏమీ చేయలేదు. కాని బెట్రాండ్ రస్సెల్, నీట్చే వంటి వారు నియమబద్ధ మతమునకు విరుద్ధముగా చెప్పినారు. కాని హిందూ ధర్మము లో మతము, తాత్త్వికతల యొక్క చక్కటి సమన్వయాన్ని చూస్తాము. ఇక్కడ మతం తత్త్వానికి అడ్డురాదు. తత్త్వవేత్తలు మతానికి విరోధులు కారు. ఉదాహరణకి, శ్రీశంకరా చార్యులవారు జ్ఞానమునకు పెద్దపీట వేసినా, వారు కొన్ని పరిమితులతో కర్మ కాండ లను కూడా అనుమతించినారు. ఏ తత్త్వవేత్తకూడా నిషిద్ధకర్మలను అనుమతించలేదు. శ్రీశంకరాచార్యులవారు కామ్యకర్మలను అనగా కోర్కెలను తీర్చు కర్మలను పొందు పర్చలేదు. శ్రీమద్భగవద్గీత కూడా కామ్యకర్మలను నిరసించి, ఎటువంటి జంకులేకుండా, తిరస్కరించింది. కాని నిత్యనైమిత్తిక కర్మలు అనగా విధివిహితములైన కర్మలు చాలా బాగుగా, యోగమునకు అంగముగా అనగా జ్ఞానసముపార్జ, పరమాత్మలో లయించు టకు మొదటిమెట్టుగా స్వీకరించబడినవి.
కర్మలేని జీవితముండదు. కాని ఆకర్మ స్వస్వరూపజ్ఞానం పొందేదిగా పరిణమించాలి. కర్మకు నిరంతరం కొనసాగే గుణంవుంది. కాలానుగుణంగా కర్మలు పెరిగి, చివరకు కాలానికి లొంగనివిధంగా మారాయి. వేదాంతం యీకర్మలన్నింటికీ స్థానం యివ్వలేదు. కైవల్యో పనిషత్ (3) "నకర్మణా, నప్రజాయా, ధనేన, త్యాగేనైకే అమృతత్త్వమానసుః" అని చెప్పింది. అంటే మోక్షము కర్మలద్వారాగాని, సంతానంద్వారాగాని, ధనంమూలకంగాగాని రాదు. వైరాగ్యంద్వారానే మోక్షాన్ని పొందుతారు. కర్మలను తత్త్వవిచారణనుండి తప్పించినచో, అవి కేవలము భౌతికముగా, పునరావృతమయ్యేవిధంగా మారి, బుద్ధిని మందగింప జేస్తాయి. కర్మలను సరియైన దృక్కోణంలో, విధివిహితంగా, సమర్పణాభావంతో చేయగలిగితే, అవి తత్త్వముగా పరిణితిచెంది, కర్మయోగంగా మారి, బుద్ధిని, మనస్సును, నిర్మలంగా వుంచుతాయి. అందువల్లనే శ్రీశంకరాచార్యులవారు "కర్మయోగము 'ఫలాభిసంధి' అనగా చేసిన కర్మల ఫలితములపై అనురక్తిని నశింపచేయుటకు గొప్ప పనిముట్టు" అని మరలమరల ఉల్లేఖించారు.
సాధారణంగా మనం భవిష్యత్తులో ఫలవంతములయ్యే కర్మలపట్ల ఆసక్తిగావుంటాము. దానిని సమర్థించడానికి ఎటువంటి కారణాన్నైనా చూపించడానికి సిద్ధపడతాము. మన మనస్సు రెండుపనులు ఒకేసారి చేయడానికి తగనందున మన పనిచేసే నిబద్ధతను, ఫలితంపై మనకుండే కోరిక నియంత్రిస్తుంది. అందువల్ల చివరలో కారణమే కార్యంగా రూపు దిద్దుకుంటుంది. కాని కర్మయోగం ఫలితంపై ఆసక్తిలేని కర్మ. దీన్నే భగవద్గీత 6-1లో "అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతియః" అనగా విధివిహితములైన కర్మలను ఫలితమును ఆశించకుండా చేయవలెను" అని చెప్తోంది. అందువలన మోక్షగామి నిత్యనైమిత్తిక కర్మలను విధిగా నిత్యము, ఆయా సందర్భములలోనూ, ఎటువంటి ఫలాపేక్షలేకుండా నిర్వర్తించాలి.
భక్తికూడా హిందూతత్త్వములో చాలాచక్కగా పొందుపర్చబడ్డది. భగవద్గీత 14-26లో "మాంచయో వ్యభిచరేణ భక్తియోగేన సేవతేసగుణాన్ సమతిత్త్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే" అనగా నన్ను ఎవరైతే నిశ్చల భక్తియోగముతో కొలిచెదరో, అతడు సత్త్వరజస్తమో గుణములను లయముచేసి, పరబ్రహ్మమగుటకు అధికారి అవుతాడు.అదే నిష్కామభక్తి. ప్రతిఫలాపేక్షరహిత భక్తి. అది స్వస్వరూప జ్ఞానము పొందుటలో ఉపయోగిస్తుంది. కాని ఆభక్తి వేదాంత నిర్వచనానికి లోబడనిచో, అది మూఢనమ్మకంగా మారి, సాధకుని ఉన్నతికి దోహదపడదు. అది కర్మయోగముగా మారవలసియుంటుంది.
ఎపుడైతే మతము తత్త్వమునుండి వేరుపడుతుందో, కర్మలు, నమ్మకాలు బలపడ తాయో, అది పరిణామక్రమమును కోల్పోతుంది. అనగా సాధకునికి ఉన్నతి కలుగదు. ఎవరు, ఎంతో సమర్థతతో, ఆడంబరంగా, విస్తారమైన కర్మకాండలు చేసినప్పటికీ, అతనిలో పరిణామక్రమము సంభవింపదు అనగా ఆధ్యాత్మికోన్నతి కలుగదు. ఎప్పుడైతే ఏదైనా మతము సమాజమునకు మూలస్తంభమైన మనుష్యుని పరిణామ క్రమమునకు ప్రేరేపించదో, ఆమతము నిష్ప్రయోజనమవుతుంది. ఇలాగే కొన్ని ప్రాచీనమతాలు వాటియొక్క తత్త్వమునుండి ఆచారక్రియలు, నమ్మకాలు వేరుపడినందున, వాటియొక్క పరిణామశక్తిని, క్రమమును కోల్పోయినవి. పురాణములను పరిశీలించు చున్ననూ, తత్త్వమును మనస్సునందుంచుకొనవలెను. ఇది శ్రీశంకరాచార్యులవారి ఉద్భోధలలో ముఖ్యమైనది. వారు కర్మలలోని దుర్గుణములను తొలగించి, కర్మలను స్వస్వరూపజ్ఞానము పొందుటకు ముఖ్యకారణమైన కర్మయోగముగా మార్చినారు. శ్రీశంకరాచార్యుల వారి సిద్దాంతములు తత్త్వమును, స్వస్వరూపజ్ఞానమునకు ముఖ్య కారణమైన భక్తిసారస్వతముగా మార్చినవి. వారు భక్తిని భక్తియోగముగా మార్చినారు. యాంత్రికముగా జపము చేయుటయే సాధకుని గమ్యముకాదు. శ్రీశంకరులవారి సిద్ధాంతములు మనలను కర్మ, భక్తులనుండి జ్ఞానమువైపు మరల్చుటకు దోహద పడతాయి.
మతము పౌరాణిక వివరాలను యథాతథంగా తీసుకొంటుంది. కాని అథ్యాత్మికత భాషకు అందనిదైయుంటుంది. ఎవరైతే ఆపౌరాణిక వివరాల అంతరార్థాన్ని తెలుసుకోరో వారు ద్వైతమనే పంజరంలో బంధింపబడతారు. ఎవరైతే తనకు పరమాత్మకు తేడా వుందని భావిస్తారో, అప్పుడు మిగిలినవారి ఆత్మలకు తేడా నిజమని భావిస్తారు. అప్పుడు ఏకత్త్వము, అభిన్నత్త్వము (ఆత్మవత్ సర్వభూతాని) పూర్తిగా మరుగైపోతుంది. కావున ఆధ్యాత్మిక సాధకులు భాషయొక్క అవరోధాన్ని దాటవలసియుంటుంది.
హిందూ పౌరాణిక సారస్వతము ప్రతీకాత్మకమైయున్నది. "పరోక్షప్రియ ఇవహిదేవాః" (ఐతరేయోపనిషద్ 1-3-14) అనగా దేవతలు పరోక్షప్రియులు. దార్శనికులు ప్రతీకాత్మక భాషతో సత్యాన్ని ఆవిష్కరించడాన్ని ప్రేమిస్తారు. ఉదాహరణకు సూర్యకాంతిలో ఏడు రంగులున్నవని చెప్పుటకు "సప్తాశ్వరధ మారూఢం" అనగా ఏడు గుఱ్ఱములు పూన్చిన రథములో ప్రయాణించువాడు అని చెప్తారు. భాష అర్థంలేనిదిగా కనపడుతుంది. కాని ప్రతీకాత్మకత దార్శనికుల యొక్క అద్భుతమైన పరిశీలనా విధానాన్ని తెలియజేస్తుంది. అలాగే గ్రహణసమయంలో సూర్యచంద్రులను ఒకపాము మింగుతుందని చెప్పబడింది. నిజానికి సూర్యచంద్ర మండలాలు నీడతో కప్పబడతాయి. ఆనీడనే పామని చెప్పారు. ఆభావచిత్రణను అర్థం చేసుకొంటే వారి సాహిత్య భావనను పొగడకుండా వుండలేము.
కాశీ యాత్రికులచే కిక్కిరిసిన ప్రాచీననగరం. మిగిలిన ప్రాచీననగరాల లాగే కాశీకూడా సన్నని సందులతో కూడినది. కాశీలోని ఘట్టాలు, గంగలో స్నానమాచరించాలనే కోరికతో వచ్చే జనాలతో రద్దీగా వుంటాయి. అయినప్పటికీ మనం వ్యక్తిగత ప్రయోజనాలను విస్మరించి గంగలో మునకలు వేస్తాము. కాశీ, గంగలపై మనకు గల అకుంఠిత ప్రేమ అన్ని అసౌకర్యాలను అధిగమింపజేస్తుంది. గంగలో శాస్త్రప్రకారం స్నానమాచరించితే మనకున్న పాపాలన్నీ తొలగిపోయి, చనిపోయిన తర్వాత స్వర్గ వాసానికి అర్హుడౌతాడని నమ్ముతారు. కాని కాశీ, గంగకు సంబంధించిన ప్రతీ అంశము లోనుఒక లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత వుంది. ఒకసారి "కాశీపంచకాన్ని" అధ్యయనం చేస్తే సాహిత్యస్థితినుండి ఉన్నత ఆధ్యాత్మికస్థితికి ఎదగడానికి దోహదపడుతుంది.
శ్రీశంకరాచార్య విరచిత "కాశీపంచకము"
శ్లో॥1॥ మనోనివృత్తిః పరమోపశాన్తిః సాతీర్థవర్యా మణికర్ణికాచ।
జ్ఞానప్రవాహా విమలాది గంగా సా కాశికాహం నిజబోధరూపా॥
తా॥ నేను నాయొక్క పవిత్రమైన పూర్తి ఎఱుక గలిగిన కాశీపట్టణాన్ని. నిశ్శబ్దనీరవపూర్వకమైన మనస్సుతో అనుభవించే పరమశాంతియే పవిత్రమైన వాటిలోకెల్ల పవిత్రమైన మణికర్ణికాఘట్టము. ఎల్లప్పుడూ ప్రవహించే చైతన్యస్రవంతియే దివ్యగంగ.
'కాశికాహం' అనుటలో నేను కాశీని అనే అర్థం ఉండనేవున్నది. "కాశః ప్రకాశః అస్య అస్థి ఇతికాశీ" అనగా అన్నియూ తనలోనే ప్రకాశించుచున్న పూర్తి ఎఱుకతో నున్న ఆత్మయే కాశి. ఈభావాన్నే శ్రీశంకరాచార్యులవారు దక్షిణామూర్తిస్తోత్రం(1)లో "విశ్వం నిజాంతర్గతం" అనగా ఈవిశ్వమంతా తనఆత్మలోనే ఉన్నది" అని తెలియజేశారు.
నేను అనునది వేదాంతములో అత్యంత కీలకాంశం. నేనెవడను? నేను అనునది సకల జీవరాశులలో సామాన్యమైన ప్రాథమిక అనుభవం. జాగ్రదావస్థలో వున్న అన్నింటిలోనూ 'నేను' అనేది వున్నది. ప్రతీదీ సంతోషం, బాధ, మతము, దైవము ఇలా అన్నీ నేను అనేది ఉంటేనే వున్నాయి. ఈజాగృతమైన చైతన్యము యొక్క మూలము నేను. ఈ 'నేను' యొక్క సారాంశమేమిటి?
వేదాంతులకు మూలమనేది ప్రధానము. మనం ఈప్రపంచంయొక్క రూపాన్ని తీసుకొని దాని మూలన్ని పరిశోధిస్తే, దాన్ని ఈశ్వరుడు దేనిలోంచేనా గాని, లేదా శూన్యంలోంచి గాని సృష్టిచేశాడనే నిర్ణయానికి వస్తాము. ఈవిధమిన ద్వైతము వేదాంతసిద్ధాంతములకు విరుద్ధముగానున్నది. మనం ఈ విశ్వమునకు "చైతన్యము" మూలమైనదిగను, విశ్వమంతా జాగ్రదవస్థలో వున్నదానినిగనూ, భావింపవలసి వుంటుంది. జాగ్రదావస్థకు నేను అన్నది ప్రాథమిక ఎఱుక. మనం, నేను తండ్రిని, వాద్యకారుడిని, ధనవంతుడను, అమెరికనును, బ్రాహ్మణుడను అనేటువంటి భావాలను ఆపాదించుకుని సంతోషపడటం కన్నా, 'నేను' అనేదానియొక్క మూల ప్రకృతిని కనుగొనవలసియుంటుంది. పైన చెప్పిన భావాలు నిజంకాదు. ఇటువంటి వేటినీ 'నేను'కు ఆపాదించరాదు. నేను అనేది ఉన్నస్థితియొక్క ఎఱుక. ఆ స్వయంప్రకాశిక ఎఱుకయే కాశి.
కుండ వున్నదని మనం ఎలా గ్రహిస్తాము? అది దాని ఉనికిని ప్రకటించలేదు. ఒక చైతన్యవంతమైన జీవి దాని వునికిని కనులతో చూసి, మనస్సుతో గ్రహించి, ధృవీకరించవలసియుంటుంది. ప్రకాశము రెండు రకాలు. ఒకటి బాహ్యమైన వెలుతురు లేదా ప్రకాశము కుండకు తన వునికిని తెలుసుకునే జ్ఞానము వుంటేనే దానికి స్వయంప్రకాశకత్వము వుంటుంది. కుండను గుర్తించాలంటే , దానిని ఒకరి గ్రహింపుశక్తి లోనికి ప్రవేశపెట్టబడాలి. జాగ్రదావస్థలో వున్నజీవికి తెలియనిదానియొక్క వునికి వుండదు. కాబట్టి కుండకు స్వయంప్రకాశకత్త్వము లేనందున , అది పరప్రకాశకమైనందున, అనగా వేరే వెలుతురు వలన ఫ్రకాశక మైనందున, ఇతరుల దృష్టిలోపడి, మనస్సుతో గ్రహించగలిగిన తర్వాతే దాని వునికి తెలుస్తుంది. కాని నేను అనేదానికి స్వయంప్రకాశము వుంటుంది.
నేను అనేది, భావన, గ్రహింపులకు ముందరే వుంటుంది. (అనగా నేను అనేది ఏర్పడిన తర్వాతనే భావనలు, ఇతరముల గ్రహింపుశక్తి వస్తాయి.) నేను అనేది ఒక ఆలోచనకాదు. ఇది మనస్సుకన్నా ముందున్నది (ప్రాచీనమైనది). కాలము, దూరము అనేవి మనస్సు యొక్క విభిన్నరూపాలు. ఒక భావన వుంటేనీ కాలముంటుంది. ఈశరీరంతో ఒకదానిని గుర్తిస్తేనే దూరముంటుంది. మనం ఈశరీరంతో గుర్తిస్తేనే దూరమునకు లోబడివుంటాము. మనం మనస్సుతో గుర్తిస్తేనే కాలప్రవాహంతో కలసిపోగలం. కాబట్టి 'నేను' అనేది శరీరము, మనస్సుకన్నా ముందున్నది. కాని కాలములేని, దూరమునకు లొంగని స్వయంప్రకాశిక చైతన్యమే 'కాశి'.
పురాణములు ఈప్రపంచమునకు కాశి కేంద్రబిందుదువని చెపుతున్నాయి. అనంతానికి కేంద్రబిందువు ప్రతీచోటావుంటుంది. పరమాత్మ అనంతుడు. ప్రతి మనుజుని హృదయము లోనూ ఆయన కేంద్రీకృతుడై వున్నాడు. ఆకేంద్రము 'నేను' లేదా 'కాశి'. భౌతికశరీరము ఈప్రపంచములో ఒక బిందువు లేదా ఒక గుర్తు. కానీ నేను కాదు. ఈప్రపంచమంతా నిరంతర చైతన్య ప్రవాహములో పుడుతుంది, వుంటుంది, కొనసాగుతుంది, చివరకు అందులోనే లయిస్తుంది.
"సాతీర్థవర్యా మణికర్ణికాచ" కాశిలోని మణికర్ణికాఘట్టము పేరెన్నికగన్న శ్మశానము. కాని అత్యంత పవిత్రమైనది. కాశి చుట్టుపక్కల ప్రాంతాలనుండి చాలా మృతదేహాలు అంత్యసంస్కారములకు ఈఘట్టమునకే వస్తాయి. భక్తులు ఇక్కడే స్నానాలు, ఇతర పుణ్యకర్మలాచరిస్తారు. ఈఘట్టము శారీరక భౌతిక గుర్తింపుని వ్యతిరేకిస్తుంది. ఋతములో జాగృతమై యుండుటకు భౌతికముగా మరణించాల్సియుంటుంది. ఈశరీరాన్నే నేను అనుకుంటే , మనం ఏమనుకున్నప్పటికీ, సత్యానికి దూరంగానే వుంటాము. సత్యమునకు హేతుబద్ధమైన వివరణ సత్యముకాదు. మనం ఈశరీరంనుండి మనగుర్తింపుని తొలగించుకుని, పూర్తిగా బహిర్గతమగుటకు తయారైనప్పుడు, ఆసత్యం తనంతతానే తెలుస్తుంది.
ఈశరీరం గుర్తింపు మూడువిధములుగా వుంటుంది. 1. అహం అనగా నేను శరీరాన్ని. 2. మమ: 'నాయొక్క'. 3. మహ్యం: ఈశరీరం నాకోసం వుంది. మనం కర్మయోగాన్ని అనగా నిష్కామకర్మను 'మహ్యం' అనేదాన్ని నాశం చేయడానికి ఆచరిస్తాము. ఈశరీరాన్ని మనం నిష్కామకర్మలను చేయడానికి సరియైన మార్గంలో ఉపయోగించాలి. ఆఫలితాలను సమాజానికిగాని, పరమాత్మకుగాని అర్పించవలసియుంటుంది. ఎలాఅంటే, గాలి తనకోసం కాకుండా ఈసమస్త సృష్టికోసం వీస్తుంది. అలాగే ఈశరీరము, బుద్ధియొక్క సామర్థ్యాన్ని మనస్వార్థంకోసం కాకుండా, సర్వమానవాళి హితంకోసం వినియోగించాలి. 'మమ' అనేదాన్ని భక్తియోగం, ప్రతిఫలాపేక్షలేని సమర్పణతో నశింపజేయాలి. ఈసందర్భంగా 'నమమ' అనునది చాలా ప్రధానమైనది. అనగా 'నమే' నాదికాదు. ఈ సృష్టిలో ప్రతీదీ ఈశరీరంతో సహా సర్వం పరమాత్మకు సంబంధించినదే! కాని నేను చేస్తున్నానుఅనే అజ్ఞానాన్ని, నేను ఈశరీరాన్ని కాను అనే భావనతోటి దూరం చేయాలి. ఇదే సాంఖ్యయోగం.
ఉపశాంతి: బాధలనే అగ్నిని ఉపశమింపజేయుట. తాపములు మూడు. ఆధ్యాత్మిక-ఈశరీరానికి సంబంధించిన అనారోగ్యం మొ॥వి. ఆదిభౌతిక: జంతువులు, దొంగలు మొ॥న ఇతరప్రాణులద్వారా సంభవించే బాధలు, ఆధిదైవిక-దైవికమైన కరువు, భూకంపాలు మొ॥వి. ఉపశాంతికి పరమ అనే విశేషణాన్ని ఎందుకు జేర్చాలి? మనం నిద్ర పోయినప్పుడు మనబాధలు అన్నీపోతాయి. మేల్కొనగానే అన్నిబాధలు అంటే తాపత్రయాలు తిరిగి వస్తాయి. మనం ఎప్పుడు మేల్కొంటామా అని అవి ఎదురు చూస్తాయి. ఆవిధంగా మనం నిద్రలో పొందే శాంతి తాత్కాలికం. శాశ్వతమైనది కాదు. జాగ్రదావస్థలో కూడా మనోరుగ్మతలను పోగొట్టడానికి మత్తుపదార్థాలను తీసుకొనుటకూడా వుంది. కాని ఆ మత్తుపదార్థముల ప్రభావం పోగానే మన బాధలు తిరిగి వచ్చేస్తాయి. దీని వలన, అలాపొందిన తాత్కాలిక శాంతి పోయిన తర్వాత, ఇంకా ఎక్కువ చిరాకు, అశాంతి పొందుతాము. ఎలాఅంటే, మెరుపుకాంతిలో క్షణకాలం వస్తువులు మెరిసి, వెంటనే చీకటి ఎలా అలుముకొంటుందో, అలాగ. మనకు నిజమైన శాశ్వతమైన మనఃశాంతియే కావాలి. అశాశ్వతమైనది కాదు.
మనకు బాధలనుండి శాశ్వతమైన విముక్తి కావాలి. దానినే 'నిర్వాణ' అని అంటారు. 'వాణ' అనగా బాధలు. నిర్వాణ అనగా బాధలనుండి విముక్తి. ఈవిముక్తి అనేది దాదాపు వ్యతిరేకభావంతోనే నిర్వచిస్తారు. అది నిజంగా నిర్వచింపలేనిది. అది మాటలకందని నిర్వచనం. ఏదైతే బాధలనుండి విముక్తి కలుగజేస్తుందో, దానిని శబ్దాలతో వ్యక్తీకరించలేము, నిర్వచింపలేము. ఆ అంతఃశ్చేతన తన అన్నివిభేదాలను అధిగమిస్తుంది. మనం నేను అనేదానికి కట్టుబడి, ఆఅంతరంగంలో వున్ననిశ్శబ్దనీరవాన్ని కనుగొనాలి. ఇక్కడ భౌతికమైన నిశ్శబ్దం ముఖ్యమైనదికాదు. మన మనస్సులో వచ్చే ఆలోచనలు యదార్థము కాదు అనే ఆలోచన వస్తే, ఆలోచనాస్రవంతి ప్రమాదకరము కాదు. మనం ఎప్పుడైతే జాగ్రదావస్థలో చూసేవాటిని నిజంగాను, వేరేగానూ అనుకుంటామో, అప్పుడు మనం మానసికంగా మన కోర్కెలు తీర్చుకోవడానికి, ఆనందానికి, వాటిపై ఆధారపడతాము. మన ఆనందంకోసం, బాధలు పోగొట్టుకొనడానికి, దానిని తారుమారు చేయడానికూడా ప్రయత్నం చేస్తాము. ఇది మనలో లోతుగా పాతుకుపోయిన లోలత్వము, అజ్ఞానము తప్ప మరేమీ కాదు.
ఈ ఆలోచనాస్రవంతి నిజాన్ని కప్పిపుచ్చే తెరలాగా పనిచేస్తుంది. మన మనస్సు ప్రతీ ఉదయం ఒక ప్రపంచాన్ని తయారుచేసి మన ఎదురుగా నిలబెడుతుంది. మనం దాన్ని నిజమని విశ్వసించి, ఆప్రపంచంలో మనంకూడా ఒకపాత్రలాగా భ్రమిస్తాము. మనస్సు చూపించే ఈచిత్రాన్ని మనం భ్రమ అని తెలుసుకుంటేనే తప్ప, యదార్థాన్ని తెలుసుకోలేము. ఈ అజ్ఞానపూరిత మనస్సు చూపించే వస్తు, విషయ విభజన, భుహుళత్వము(వివిధత్వము), మిథ్య అనగా, యదార్థము కానిది. ఈనిజాన్ని గ్రహించాలంటే, మనం మనస్సు నుండి విడివడి, ఒక సాక్షిలాగా గమనించాలి. అప్పుడది దానంతటదే నిశ్శబ్దంగా ప్రశాంతంగా మారిపోతుంది.
మనం మనస్సుతో ఏకీకృతమైతే, అనగా మనస్సునే నేనుగా భావిస్తే, అది భావనలతో కలిగించే రూపాలను యదార్థమనుకుంటాము. వాటిపై మన దృష్టి కేంద్రీకరించి, అనురక్తి, ఆసక్తి పొందినట్లయితే, దానిని భ్రమ అని గుర్తించలేము. మనస్సు నుండి విడివడి, దృష్టిని మరల్చి, నిరాసక్తత కలిగివుండాలి. మనస్సును నిరంతరం సాక్షిలాగా గమనిస్తూవుండాలి. దానితో ప్రమేయంలేకుండా, ప్రేమతో వ్యవహరించాలి. ఇదే యోగం. ప్రారంభంలో యోగంలో చాలా నెమ్మదిగా ఎదుగుదల వుంటుంది. కాబట్టి పట్టుదలతో ఆలోచనలను విరమించాలి. ఎప్పుడైతే మనస్సును ఒక సాక్షిలాగా గమనిస్తామో, అప్పుడు మనస్సు నిర్మలమవుతుంది. మీప్రతీచర్యను యాంత్రికంగా చేయకండి. ఉదాహరణకు, మనం ఆహారం తీసుకునేటప్పుడు మాట్లాడితే, తినడం యాంత్రికమవుతుంది. మాట్లాడటం మానివేసి, తినే పదార్థరుచిని పూర్తిగా అనుభవించి, ఆస్వాదించండి. ఇదికూడా ఒక యోగమే! ఇలాగే నడుస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు గమనించుకోండి.
మనస్సు ఆందోళన చెందినప్పుడు, 'నేను' అనేదికుడా ఆందోళన చెందుతుంది. ఎందువల్లనంటే, నేను, మనస్సు ఒకటేనని అనుకుంటున్నాము కాబట్టి. అవి పరిమాణాత్మకంగా ఒకదానికొకటి వ్యతిరేకంగా వుంటాయి. నేను అనేది నిశ్చలమైనది. కాని ఆలోచించండం మార్పు చెందేది. మనస్సునే నేను అనుకుంటే, మనం దానిలో బంధింపబడతాము. మనం మనస్సునుండి విడివడి, దానిని గమనించడం మొదలుపెడితే, మనస్సులో మెదిలేవాటిని మనం గ్రహిస్తున్నాము అని తెలుసుకొంటాము. మనస్సు ఒక క్షేత్రము. అందులో వచ్చే ఆలోచనలు మొ॥నవి ఆక్షేత్రంలో భాగాలు. యోగములో తనను తాను వ్యతిరేకించుకోరాదు. భౌతికప్రయోజనాలకోసం మనస్సుయొక్క అవగుణాలను పెంచుకొనరాదు. మనస్సులోని అవగుణాలు అనగా, ద్వేషం, అసూయ, స్వార్థం మొ॥నవి అన్నివిధాలా నిర్మూలించాలంటే, మనస్సును క్రమబద్ధ శ్వాసక్రియ (ప్రాణాయామం), ధ్యానం, గ్రంథాలను పఠించుట, వినుట మొ॥న ప్రక్రియలద్వారా శుద్ధిచేసుకోవాలి. ఎప్పుడైతే మనస్సు శుద్ధికాబడినదో, అప్పుడు మనం, మనస్సును కామని, దానిని ఒకసాక్షిగా చూసేవారమని తెలుస్తుంది. మనస్సు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్స్రర్యాలనే అరిషడ్వర్గాలతో నిండిపోతుందో, అప్పుడు మనలను మనం ఒక సాక్షిగా గుర్తించలేము. మనలోని అంతరాళాల లోలోపల ఉన్నదాన్ని తెలుసుకుంటేతప్ప, మనక్స్సును అధిగమించి, మనం మనస్సుకామని తెలుసుకోలేము. ఎప్పుడైతే మనస్సు నిర్మలమౌతుందో, అప్పుడే దాన్ని మనం అధిగమించగలుగుతాము.
ఈ భౌతికప్రపంచానికి లోబడిన కలుషితమైన మనస్సు మనలను వెనక్కు నెట్టివేస్తుంది. అంతఃకరణ (మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము) శుద్ధి చాలా ముఖ్యమైన మొదటిమెట్టు. ఎపుడైతే మనస్సు నిర్మలమైనదో, అప్పుడది రాజసతామస గుణాలను వదలి, సాత్త్వికగుణాన్ని అలవరచుకొంటుంది. అప్పుడు తేలికగా 'నేను' అనేది మనస్సు కాదని తెలుసుకుంటాడు. నేను అనేది తెలివితేటలకు ముందున్న తెలివి అనగా మనస్సు, బుద్ధికన్నా ముందున్నది. (ఇక్కడ మనము అర్థం చేసుకొనవలసినదేమిటంటే, అంతఃకరణ ద్వారా గ్రహించినదాన్ని అర్థంచేసుకొని, అనుభవించేదే 'నేను'). ఆ అంతఃశ్చేతనలోనే భంగపరచ లేని శాంతి వున్నది. ఆ నీరవనిశ్శబ్దమే చైతన్యము. అది శూన్యం కాదు. అదే 'కాశి'.
కాశీలో గంగ వున్నది. అది విమల అనగా శుద్ధమైనది. గంగలో ఎన్నివిధములైన విషపదార్థాలు, రసాయినాలు పోసినప్పటికీ, దాని జలములు పరిశుద్ధముగానే వున్నవి. తక్కిన ఏనదికీ ఇటువంటి తనంతతానే శుభ్రపరచుకొను విధానము లేదు. ఉదాహరణకు, కాన్పూరుపట్టణము చేరుసరికి గంగ శుద్ధముగానే వుంటుంది. కాని, కాన్ల్పూరులోని చర్మకారపరిశ్రమలు వారి వ్యర్థాలను గంగలో పారబోస్తున్నందున, విషతుల్యముగా మారుతుంది. కాని పది మైళ్ళలోపే గంగనీరు మరలా తనంతతానే పరిశుద్ధమౌతుంది. సీలువేసిన పాత్రలోనున్న గంగాజలము చాలాకాలము పాడవకుండా వుంటాయి. కాశీలోని గంగ కాలాతీత ఎఱుకకు, కొనసాగుతున్న చేతనత్త్వమునకు, శాశ్వతమైన ఆత్మకు ప్రతీకగా వున్నది. అంతఃకరణయొక్క చేష్టలే అంతఃశ్చేతనయొక్క విషయములు.
2.శ్లో॥ యస్యామిదం కల్పితమింద్రజాలం, చరాచరంభాతి మనోవిలాసమ్।
సచ్చిత్సుఖైకా పరమాత్మరూపా, సాకాశికాహం నిజబోధరూపా॥
నేను నాయొక్క పవిత్రమైన పూర్తి ఎఱుక కలిగియున్న కాశి పట్టణాన్ని. ఇంద్రజాలంలా భ్రమకల్పించే ఈసమస్త చరాచర సృష్టి ఇందులోనే కల్పించబడింది. మనస్సు ఆటలాడుకొనే భ్రాంతియే ఈప్రపంచము. కాని యదార్థమేమిటంటే, హృదయాంతరాళాలలో నిండియున్న పరిపూర్ణరూపుడైన పరమాత్మ మాత్రమే శాశ్వతుడు.
ఆత్మయొక్క అజ్ఞానమనస్సులో గోచరమయ్యే ఈప్రపంచమంతా మనస్సుయొక్క కల్పన మాత్రమే. ఎలాగంటే, ప్రొజెక్టరు లోంచి వచ్చే వెలుతురులో, ఫిల్ము కదలికవల్ల తెరపై కదలాడే సినిమా వచ్చినట్లు. సంసారంలోని ఆనందం, బాధ, ప్రేమ, ద్వేషం, కాలదూరాదులతో సహా అన్ని అంశాలూ, ఈసినిమాలో ఉంటాయి. అందులో పర్వతాలు, నదులు, వనాలు, పువ్వులు, జంతువులు, పక్షులు మొదలైన సమస్త జీవరాశి వుంటుంది. అంతా ప్రొజెక్టరు వెలుతురులో ఎలా కదులుతూ కనపడతాయో, దానికి ఈ కదిలే ప్రపంచానికి తేడాఏమీలేదు.
ఈప్రపంచమంతా మనం నిద్రపోయినప్పుడు ఎక్కడకు పోయినట్లు? నిద్ర లేచిన వెంటనే, మన అజ్ఞానమనస్సులో 'నేను' అనేది , ఆతర్వాత శరీరం మేల్కొంటాయి. ఈప్రపంచమంతా, ఈజీవి పుట్టడానికి అవుసరమైన శరీరంతో కలసి మేల్కొంటుంది. ఈశరీరం, ప్రపంచం రెండూ ఒకేసారి మేల్కొని, సమన్వయం చెందుతాయి. ప్రొజెక్టరు వెలుతురులో కదులులుతున్న ఫిల్ము ఎలాగైతే సినిమాను చూపిస్తుందో, అలాగే జాగ్రదావస్థలో మనస్సు యొక్క కల్పనవల్ల ఈప్రపంచం ఏర్పడుతుంది. పూర్తి ఎఱుకతో వున్న చైతన్యమే ఆ వెలుతురు. అదే 'కాశి' ఆఫిల్మే చిత్తచాంచల్యము, మనోవిలాసము. దీనిలోనే సకల జీవ, నిర్జీవ, చరాచర ప్రపంచమంతా వెలుగులోకి వస్తుంది.
కొన్నిసార్లు అసలైన, శాశ్వతమైన దానికంటె, ఈప్రపంచం చాలా ఆకర్షణీయంగా, స్వచ్చంగా, నిజంగా గోచరిస్తుంది. ఎలాగంటే హెచ్. డి.టివిలో వచ్చే టెన్నిస్ మాచ్, ప్రత్యక్షవీక్షణం కన్నా ఆకర్షణీయంగా వుంటుంది. అయినా యదార్థానికది కల్పితము, ఊహాజనితము, ఆళీకము (కల వంటిది). ఇలా క్రమంగా దృక్కోణాన్ని సాధకులు అలవర్చుకోవాలి.
అప్పుడు మనకు వచ్చే ప్రశ్న, నిజమైనది, శాశ్వతమైనది ఏది? సచ్చిత్సుఖైక - శాశ్వతమైన ఎరుకతో కూడిన ఆనందము - సచ్చిదానందము. నిజాన్ని తెలుసుకోవాలంటే, మనం నామరూపాలకు ఆలవాలమైన బుద్ధిని అధిగమించాల్సివుంటుంది. నామరూపాలు, ప్రేమ, ద్వేషము మొదలైన అన్నిరకాల ద్వందాలను అధిగమించాల్సివుంటుంది. 'నేను' అనేదాని చుట్టూ చాలా గందరగోళం వుంది. నేను అనేది జాగ్రదావస్థలో గోచరమయ్యేవాటికి ఏవిధంగానూ కట్టుబడియుండదు. అది అనిర్వచనీయము, గుర్తింపులేనిది, ఖండితము కానిది, ప్రాథమిక ఎఱుక కలిగియున్నది. అది స్వయంసిద్ధమైన, శాశ్వతమైన ఆత్మస్వరూపము.
ఈజీవితంలో మనకు కావలసినదేమిటి? మనకు ధనము, అధికారము, కుటుంబము మొదలైనవి కావాలనుకుంటాము. నిజంగా మనకు కావలసినది ఆనందం. మనం ఆనందాన్ని ధనము, అధికారము మొదలైన వాటితో మాత్రమే పొందాలనుకుంటాము. కాని అవన్నీ తప్పుడు మార్గాలు. ఆమార్గాలద్వారా ఆనందాన్ని పొందాలనుకో కూడదు. ఎందుకంటే అవి, చంచలమైన యదార్థంకానివి. అందువలన అవి శాశ్వతానందాన్ని యివ్వలేవు. ఒక మంచి సినిమాను మనం చూసినప్పుడు, మనం ఎలా ఆనందాన్ని పొందుతాము? ఆనందం సినిమాతెరలోంచి మనలోకి వస్తుందా, లేదా మనలోంచి తెరపైకి వెళుతుందా? నిజానికి అది మనలోంచే తెరపైకి వెళుతుంది. ఆనందం బయటి వస్తువు లోంచి హృదయములోకి రాదు. ఈయదార్థాన్ని మనం ఒప్పుకోము. ఎవరైతే ఈనిజాన్ని తెలుసుకొంటారో, వారు ప్రపంచాన్ని జయిస్తారు. ఈనిజాన్ని ఎలా తెలుసుకోవాలి? 'నేను' అనేదాన్ని పూర్తిగా గ్రహించడానికి, అర్థంచేసుకోవడానికి, దానియొక్క పూర్తి ఎఱుక కలిగియుండాలి. ఎప్పుడైతే ఆత్మయొక్క స్వస్వరూపజ్ఞానాన్ని తెలుసుకున్నామో (అనుభవించామో), అప్పుడు అంతఃకరణ చేసే ఆలోచనా మాయాజాల మంతా కరిగిపోయి, అప్పటికప్పుడే, అంతర్గత వాస్తవికరూపం అనుభవానికివచ్చి, అసలైన ఆనందం కలుగుతుంది.
హృదయాంతరాళాలలో నున్న 'నేను' అనేదే పరమాత్మరూపం. అది ఈశరీరము, అంతఃకరణతో కూడినదికాదు. సాధారణంగా మనం, నేను అనేదాన్ని - నేను కానిదాని దృక్కోణంలోంచి చూస్తాము. ఉదాహరణకు ఒక ధనవంతుడు, తనకున్న సంపదనుంచే తనను తాను చూసుకుంటాడు, గుర్తించుకుంటాడు. తల్లిదండ్రులుగాని, భార్యాభర్తలుగాని, వారి గుర్తింపును బంధుత్వము ద్వారానే చూస్తారు. మనకు తెలుసున్నదానిద్వారా, అది వేరే అయినందున, నేను అనేదాన్ని నిర్వచించుకోరాదు. కావున ప్రతీవారూ తమస్వంత గుర్తింపును విడనాడాలి. ఈగుర్తింపులు సరైనవికాకపోగా, నిజానికి దోవతప్పిస్తాయి. నిజమైన జ్ఞానవంతులు, దేనితోనూ తమ గుర్తింపును కొనసాగించరు. కాని సామాన్యులు తాము ఊహించే ప్రతీదానిలోనూ తమను చూసుకొంటారు. నీవు ఎవరివీ కాకు! ఎవరివీ కాకుండావుండు! అప్పుడు మాత్రమే నిజమైన 'నేను' అనేది మహిమాన్వితంగా ప్రకాశిస్తుంది, అనుభవానికి వస్తుంది.
శ్లో:3: కోశేషు పంచస్వధిరాజమాన, బుద్ధిర్భవానీ ప్రతిదేహగేహమ్।
సాక్షీశివః సర్వగతోన్తరాత్మా, సాకాశికాహం నిజబోధరూపా॥
నేను నాయొక్క పవిత్రమైన పూర్తి ఎఱుకగల్గిన కాశి పట్టణాన్ని. ఆంతటా నిండియుండి సాక్షిగా వున్నవాడు, లోపలనుండి అన్నింటినీ నడిపేవాడే శివుడు. ప్రతీశరీరంలోనూ, పంచకోశాలలోపల విరాజమానమగుచూ, వున్న బుద్ధియే శివుని శక్తియైన భవాని.
'సాఅహం' అనగా 'నేను అది'. 'సా'అనగా ఆ వాస్తవము. వాస్తవికతను 'అది' అనే పదంతో తప్ప వేరే మాటతో వివరించలేము. సత్యము, వాస్తవికత అనేది సాధారణంగా భాషకందని లోతైన భావం కలదిగా వుంటుంది. అయినప్పటికీ, దాన్ని మాటలతోనే వ్యక్తపరచ వలసియుంటుంది కాబట్టి సత్యము అనే సంకేతమునిచ్చే మాటలను వాడుతాము. అటువంటి మాటలలో ఒకటి "తత్ - అది". "ఓంతత్సదితి నిర్దేశో బ్రహ్మణాస్త్రివిధ స్మర్తః" (గీత 17-23). పరబ్రహ్మను ఓం, తత్, సత్ అని మూడు విధాలుగా సూచిస్తారు. 'స' అనునది ఏకాత్మకము. 'సాః' అనునది పురుషవాచకము. 'సా' అనునది స్త్రీవాచకము. 'తత్' అనునది నపుంసక వాచకము. కాని అర్థం మారదు. లింగమనేది భాషకేగాని, తేజోపూరితమైన చైతన్యమునకు లేదు.
నేను స్వయంప్రకాశక చైతన్యమైన 'కాశిక'ను. జాగ్రత్స్వప్నావస్థలు దానిలోనే వుంటాయి. అన్ని అవస్థలు అంతమయ్యే 'సుషుప్తి' కూడా ఒక అనుభవమే! అదికూడా ఈ చైతన్యములోనే ప్రకాశమానమవుతుంది. ఆచైతన్యమే అన్నింటికీ మూలము, ఆధారము. మనుజునికి అనుభవములోనికి వచ్చే వెలుతురులకు వెలుతురు. అదే నాయొక్క (కాశి) ప్రవృత్తి.
'కాశిక' అనగా ఈ పరిమితమైన శరీరము, బుద్ధిలో వుండే అపరిమితమైన జ్ఞప్తి, జ్ఞాపకము, తెలుసుకొనుట, ఆత్మ, అనంతము. అదే ఈ శరీరం చేసే అన్ని ఆలోచనలు, వ్యవహారాలకు సాక్షిగా వుంటుంది. అది జాగ్రత్, స్వప్న, సుషుప్త్యవస్థలలో జరిగే అన్ని క్రియలనూ సాక్షిగా చూస్తుంది. ఆ అనంతమైనది, ఈ పరిమితమైన దానితో మమేకమైతేనే, మనకు ఒకదానియొక్క స్పృహ, జ్ఞప్తి వస్తాయి. అదే వ్యక్తీకరింపబడిన చైతన్యము. ఆవిధంగా ప్రతిబింబించే అన్ని అవస్థలకూ సాక్షీభూతమయ్యే ఆత్మయే కాశి.
ఆత్మ సర్వగతము, అంతటా నిండియున్నది. సాధారణంగా మనం 'అంతా' అనునది వెలుపల, లేదా బయట వున్నదను కొంటాము. 'వెలుపల' అంటే ఏమిటి? అది జాగ్రదా వస్థకు వెలుపల వుండదు. కుండ శరీరానికి వెలుపల వుంటుంది. కాని, దాన్ని 'తెలుసుకునేది' కాదు. ఆ చైతన్యపూరిత స్థలము వెలుపల ఎలా వుంటుంది? ఉనికిని గ్రహింపు(తెలుసుకొనుట)నుండి వేరు చేయ లేము. మనం 'అంతా' అని అంటే, అదంతా చైతన్యములోనే వున్నది. ఈ జాగదావస్థ అంతా ఆప్రకాశవంతమైన జ్ఞానముతోనే నిండియున్నది. దానినంతయునూ, తెలిసినది, తెలియనిది అని రెండువిధములుగా విభజించవచ్చును. కాని తెలుసుకొనేది, తెలిసినదానిలోనూ, తెలియనిదానిలోనూ కూడా వ్యాపించియుంటుంది. విషయము లోపల, బయట అని విభజింపబడినచో, అప్పుడు ఆకాశమువలే సర్వవ్యాపకమైన తెలుసుకొనేది, ఆ లోపల, బయటా అంతా నిండి యుంటుంది. అన్ని ద్వందాలకు అతీతంగా ఆకాంతిలో చైతన్యము ప్రజ్వరిల్లుతూ వుంటుంది. అది సంతోషము, బాధ, సుఖము, దుఃఖము, స్నేహితుడు, శతృవు, గౌరవము, అవమానము, తన, ఇతర వంటి అన్ని ద్వందాలకూ అతీతంగావుంటుంది. విభజనలు, వ్యతిరేకములు బంధిస్తాయి. మనం ఎంతవరకూ ఈ ద్వందాలకు లోబడి, కలవరపడుతూ వుంటామో, అంతవరకూ మనం ఈ బంధాలలో చిక్కుకొని వుంటాము.
మనకు ఈద్వందాలను ఆపాదించుకుంటే, ఆబంధాలకు కట్టుబడిపోతాము. ఒక్కొక్కసారి ఈబంధం ఎంత బలంగా వుంటుందంటే, ఈ శరీరమే నేను అనుకునేంతగా వుంటుంది. ఒక్కొక్కసారి ఇది మేధోగర్వంలాగా సున్నితంగా వుంటుంది. ప్రతీ బంధము మనలను ద్వందాలతో బాధితులుగా చేస్తుంది. కాబట్టి నిర్ద్వందముగా, ద్వందాలకు అతీతంగా, వుండాలి. బంధాలకు అతీతంగా, కాంతులకు మూలమైన కాంతిలాగా ఎదిగి, అన్ని శారీరక, మానసిక అనుభవములకు అతీతంగా, ఒక సాక్షిలాగా వుండాలి.
సాధారణంగా స్వప్నావస్థ చాలాకొద్దిసేపే వుంటుంది. ఏదో పీడకల వస్తేతప్ప, అది మనలను ప్రభావితం చేయదు. మనం జాగ్రదావస్థలాగా, నిద్రాస్థితినికూడా సాక్షిలాగా, గమనించినా, అది మనలను ప్రభావితం చేయలేదు. ఈబంధమంతా, జాగరూకతతో కూడిన ఎరుకతోనే వుంటుది. కాబట్టి మనం జాగ్రదావస్థలోని విషయాలపట్ల, కలవరపడకుండా, వాంఛించకుండా, ఆసక్తిలేకుండా వుంటేనే, వాటిని అధిగమించగలుగుతాము. ఒక పవరు హౌస్ లోని విద్యుశ్ఛక్తి ఫిలమెంటులో ప్రవహించగానే ఎలా ప్రకాశిస్తుందో, అలాగే అనంతమైన ఆత్మ, కాశి కూడా ఈపరిమితమైన అంతఃకరణతో కూడిన శరీరంతో సంయోగించి, పంచకోశాలలోనూ ప్రతిఫలిస్తుంది.
మనజీవితంలో, వివిధదశలలో, మనలను బంధించే ఈకోశాలనే 'నేను' అనుకొని పొరపాటు పడుతున్నాము. మనం భావించడాన్నిబట్టే బంధాలుంటాయి. అది పాపహేతు వవుతుంది. ఒరలోని కత్తిలాగా, ఈ పరిమిత శరీరంలో అనంతాత్మ వుంది. అన్నమయ కోశం(భౌతికశరీరం), ప్రాణమయకోశం(ముఖ్యప్రాణం) అన్ని కదలికలూ కలిగిస్తుంటే, మనోమయకోశం(మనస్సు), విజ్ఞానమయకోశం(కర్త, పురికొల్పేవాడు), ఆనందమయకోశం (అహంకారం, అనుభవించేవాడు), మనలను శరీరం, మనస్సు అని భావించుకుంటే, అవి కోశాల్లాగా వ్యవహరిస్తాయి. కాని మనం అలా భావించకుండా, సాక్షిలాగా వాటిని గమనిస్తుంటే, అవి మనకు కోశాల్లాగా వ్యవహరించవు. ఎటువంటి పొరపాటు లేకుండా, మనలను మనం కర్తగాభావించకుండా వుంటే, బుద్ధి ఎటువంటి కర్మలకు ప్రేరేపించినప్పటికీ, అది కోశములాగా వ్యవహరించదు. అలాగే, నేను అనుభవిస్తున్నాను అనే భావాన్ని విడనాడితే, అహంకారం ఎప్పుడూ బాధించదు. మనలను మనం పొరపాటుగా గుర్తించు కొనటమే బంధాలకు మూలం. ఈ పొరపాటునే మాయ, అవిద్య, అజ్ఞానం అంటారు. స్వస్వరూపజ్ఞానం లేకపోవడం, అవిద్య, అజ్ఞానం, ఈ విశ్వ ఆవిర్భావానికి మూలమైన విశ్వమాయలో ఒకభాగం. అదే పరబ్రహ్మయొక్క సృష్టిశక్తి. దీనినే ప్రతీకాత్మకంగా భవానీ, శివునియొక్క పత్నిగా అభివర్ణిస్తారు.
మీకు స్వస్వరూపజ్ఞానం వున్నందున శరీరం కారు. ఎవరైనా తాను శరీరం అనుకుంటే, వారికి ఆశరీరం గురించి తెలియదు. ఈవిషయాన్నే భగవాన్ రమణమర్షులవారు సద్దర్శనం-26 లో "దేహోనజానాతి" ఈశరీరానికి తెలియదు అని బోధించారు. ఎవరికైతే ఈవిషయం తెలుస్తుందో, వారు శరీరంకారు. కళ్ళు తమనితాము చూసుకోలేవు. కళ్ళు ఎప్పుడు ఏమి చూడగలవో, ఎప్పుడు ఏమి చూడలేవో, మనకు తెలుసు. అందువలన మనం కళ్ళు కాము. కుండవంటి వస్తువును మనం ఒక భావన ద్వారా గుర్తించగలం. కాని కుండ తనను తాను గుర్తించుకోలేదు. ప్రతీవారూ ఆలోచననూ, ఆలోచనారాహిత్యాన్ని కూడా తెలుసుకొన గలరు. అందువలన ఎవరూ మనస్సు కారు. ప్రతీవారూ వారి ఆలోచనకు మూలమైన తెలివికలవారైనందున, ఆలోచనగురించి తెలుసుకొనియుంటారు. కాబట్టి మనలను మనం మనస్సుతోగాని, దాని ఆలోచనతోగాని, గుర్తించుకోవడం పొరపాటు.
ఇదే తర్కం కర్తకు కూడా వర్తిస్తుంది. తనను శరీరంతోగాని, పనిచేసే అంగాలతోగాని, గుర్తించుకుంటేనే కర్త అవుతాడు. అలాగే జ్ఞానేంద్రియాలే నేను అనుకుంటేనే తప్ప, నేను అనుభవిస్తున్నాను అనే భావనవుండదు. కాబట్టి అయిదువిధాలుగా వున్న ఈ 'ఉపాధి' అనే పరిమిత శరీరాన్నే నేను అనుకోవడమే ప్రాథమికమైన పొరపాటు. ఈపొరపాటును మనం సరిచేసుకోవాలి. నష్టదాయకమైన షేర్లలో పెట్టుబడి పెట్టడమనేది, ఈతప్పుడు గుర్తింపు అంతటి తీవ్రమైన తప్పుకాదు. ఈపొరపాటుకే మరోపేరు, అవిద్య, అజ్ఞానం. దీనికి మూలం సృష్టి ఆవిర్భావంలోనే వున్నది. 'ప్రతిదేహ గేహం' ఇది సార్వత్రికమైన అజ్ఞానము, మాయ. అదే భవాని. విశ్వనిర్మాణసూత్రం.
శివుడు, పరమాత్మ విశ్వవ్యాపకుడు. ఇదే మనప్రకృతి. దీనితోనే మనలను మనం గుర్తించుకోవాలి. పైన చెప్పినటువంటి అయిదింటితో గుర్తించుకోరాదు. నేను అనేదానికి పూర్తి అర్థం పురుషుడు. అదే శివుడు, పరమాత్మ. బుద్ధియే ప్రకృతి, భవాని . ఇందులోనే పరమాత్మ ప్రతిఫలిస్తాడు. గీత 13-22లో "పురుషః ప్రకృతిస్తోహిభుంక్తే ప్రకృతిజాన్ గుణాన్" అనగా పురుషుడు ప్రకృతితో మమేకమైతే, ప్రకృతిలోని గుణాలతో బాధింపబడతాడు అని తెలియజేస్తోంది. "భవాన్ సంసారిణం కరోతి ఇతి భవానీ" శివుడిని సంసారిగా చేసేది భావాని, ప్రకృతి.
ఎప్పుడైతే తనను కాశి, ప్రకాశకత్త్వముగా గుర్తిస్తాడో అప్పుడు ఈ పంచకోశములు నిర్వీర్యమయి, అన్నిగుర్తింపులు తొలగిపోయి, పరమాత్మకు తనకు గల బేధం తొలగిపోతుంది. ప్రకృతిసిద్ధంగా తదనుగుణంగా, శరీరము, అంగములు పనిచేస్తుంటాయి. ఇంకోవిధంగా చెప్పాలంటే, మనం భావిస్తేనే ఈబంధాలన్నీ వుంటాయి. కాబట్టి, మనస్సుకు, అహంకారానికి, అనుభవాలకు సాక్ష్లిగా వుండిపోవాలి. ఎప్పుడైతే అహంకారానికి లొంగక, సాక్షిగా వున్నామో, అహంకారం ఉనికిని కోల్పోయి, నశిస్తుంది. అప్పుడప్పుడు క్రియాత్మకమైన అహం రావచ్చు. కాని అది ప్రమాదకరం కాదు. మనస్సును గమనించడం మొదలుపెట్టగనే, అది శుద్ధమగుట ప్రారంఅభమవుతుంది. నేను కాశీని, నేను శివుడను, పరమాత్మను, అనే అహం మనలను బంధింపదు.
శ్లో॥4॥ కాశ్యాంహి కాశతే కాశీ, కాశీ సర్వ ప్రకాశికా।
సాకాశీ విదితాయేన, తేనప్రాప్తాహి కాశికా॥
తా॥ నిజానికి కాశీపట్టణం చైతన్యముతో ప్రకాశిస్తూవుంటుంది. అదే ఆత్మ. ఆకాశీ అన్నింటినీ ప్రకాశింపజేస్తూవుంటుంది. ఈవిధంగా కాశీని ఎవరైతే తెలుసుకొంటారో, వారు తప్పక కాశీని చేరుకోగలరు(పొందగలరు).
కాశీ వెలుతురుకే వెలుతురునిచ్చే చైతన్యము. అదే ఆత్మ. జాగ్రదావస్థలో మనకు కనపడే రంగులు, రూపాలకు వెలుగు మన కంటిచూపు. అలాగే శబ్దాలకు వెలుగు చెవి. అన్నిఆలోచనలకు వెలుగు మనస్సు. కాని ఈవెలుగులన్నింటికీ వెలుగు ఒక్కటే, అదే చైతన్యము. నిద్రాస్థితిలో కూడా ఆచైతన్యం మనస్సును, అది చూపించేవాటిని ప్రభావితం చేస్తుంది. నిద్రాస్థితిలో సూర్యుడు, చంద్రుడు, కన్ను, చెవి, మనస్సు మొదలగు అన్ని వెలుతురులు లేనప్పటికీ, వీటన్నింటినీ తన వెలుతురుతో ప్రభావితం చేసేది చైతన్యము. ఈప్రకాశించే చైతన్యమే శివుడు, పరమాత్మ. ఆ ఎరుక కలిగిన శరీరమే కాశీ పట్టణము.
ఆజ్ఞాచక్రం మనశరీరంలో కనుబొమలమధ్య, భృకుటిలో వుంటుంది. అక్కడే మనం దృష్టిని కేంద్రీకరించి కుమారుని, అనగా శివుని(పరమాత్మయొక్క) తేజస్సును దర్శిస్తాము, అనుభవిస్తాము. ఆధునిక శరీరశాస్త్రము ప్రకారం ఇక్కడే పిట్యూటరీ గ్రంధి వుంటుంది. ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే, ఆజ్ఞాచక్రాన్ని రెండు రేకులుండే పద్మంలాగా వుంటుందని వర్ణిస్తారు. అలాగే పిట్యూటరీగ్రంధికి కూడా రెండు ఖండములు(భాగాలు) వుంటాయి. ఈశక్తికేంద్రాన్ని వేదాంతశాస్త్రంలో పద్మంగా పేర్కొన్నారు. ఎవరైతే తమ మనస్సును ఆజ్ఞాచక్రంపై కేంద్రీకరించి, ఆప్రకాశం, చైతన్యంలో లయమవుతారో, వారే శివుడు(పరమాత్మ) అవుతారు. శివోహం, శివోహం, నేనే శివుడను, నేనే శివుడను, అహం బ్రహ్మాస్మి, నేనే పరబ్రహ్మను.
ఈ చైతన్యానికి కేంద్రబిందువైన ఆజ్ఞాచక్రమే శివునియొక్క మూడవకన్ను. ఈభౌతిక నేత్రాల చూపు చంచలమైనది, తాత్కాలికమైనది. కనులు మూసినపుడు, పరధ్యానంలో వున్నప్పుడు, నిద్రపోయినపుడు, పోవునది. కాని చైతన్యవంతమైన మూడవకన్ను కాలాతీతము, నిత్యమైనది. అది మూడు అవస్థలలోనూ ప్రకాశిస్తూనేవుంటుంది. అది రేయి పవలు లేని సూర్యుని వంటిది. (మనం ఈభూవాతావరణం దాటి రోదసీలోనికి వెఌనపుడు ఈ అనుభవం కలుగుతుంది.) ఎవరైతే 'కాశీని' తెలుసుకొంటారో, వారికి ఈఅనుభవం దక్కుతుంది. దానికోసం మనం, మన కనుబొమల మధ్య దృష్టిని కేంద్రీకరించి, ధ్యానం చేయవలసి వుంటుంది.
ఈశ్లోకం ధ్యానాన్ని వివరించేదికూడా. దీన్ని పూర్తిగా పరిశీలిద్దాం. (ఇవి శ్రీ తత్త్వవిదానందసరస్వతి స్వాములవారు వివరించిన ధ్యాన పద్ధతులు).
ధ్యానం:1: మీరు కదలకుండా, సుఖవంతంగా కూర్చోండి. వెన్నెముక, మెడ, శిరస్సు, ఒకేరేఖలో, నిలువుగా వుంచండి. కనులను అర్థనిమీలితం (సగంమూవ్సి) చేసి, చిరునవ్వును మీ పెదాలపె వుంచండి(ప్రదర్శించండి). ఈచిరునవ్వు మీలోపల ద్వందాలకు సమస్థితిని తెలియజేస్తుంది. (మిమ్ములను ఏమానసికమైన ఒడిదుడుకులూ ఏమీచేయ లేవని తెలియజేస్తుంది.) మీకనులను దగ్గరగా లాగి, అరమూతలతో వున్న మీకనులను మనస్సుతో గమనించండి. మీకనులను గమనిస్తున్న మీమనస్సును గమనించండి. నెమ్మదిగాల్ మనస్సును దాటివెఌ, (మనస్సునుండి విడివడి) మనస్సును గమనించండి. ఒకవేళ ఆలోచనలు వస్తే రానీయండి. వాటిని అంచనావేయకండి, అసలు గుర్తించకండి. ఆలోచన పోతే, పోనీయండి. ఎప్పుడైతే మీరు మనస్సును గమనించడం మొదలుపెట్టారో, అప్పుడది నిశ్శబ్దమౌతుంది. (పనిచేయడం మానేస్తుంది, ఆలోచనలు ఆగిపోతాయి). అలాగే సాధన కొనసాగిస్తే, గమనించడానికి మనస్సు వుండదు. మిమ్మల్ని మీరే గమనించుకుంటారు. ఇదే అంతఃశ్శాంతి. (అమనస్కయోగము).
ధ్యానం:2: ఆతర్వాత 'శాంభవీముద్ర'. "అంతర్లక్ష్యం బహిర్ దృష్టిర్నిమేషవర్జిత సాముద్రా శాంభవీ" కళ్ళనుతెరచి, కనురెప్పలు వాల్చకుండా, మనస్సును మీలోపల కేంద్రీకరించండి. రెండుమూడుసార్లు కళ్ళని మూసి తెరవండి. ఆతర్వాత ఎదురుగా దృష్టిని సారించండి. కాని ఎదురుగా వున్నదాన్ని చూడకండి. (గమనించకండి). మీమనస్సును మీలోపలకు కేంద్రీకరించండి. మీకు వీలైనవంతవరకూ కళ్ళను ఆర్పకండి. అలా చేస్తున్నప్పుడు మీరు, దృష్టికి, ద్రష్టకు (చూపుకు, చూసేదానికి) తేడాలేని స్థితిని పొందుతారు. అప్పుడు ఆత్మయొక్క పూర్తి ఎరుక మాత్రమే వుంటుంది. ఇటువంటి బేధరహితమైన దృష్టి (సమస్థితి) యే కాశి. ఈవిధమైన సాధన అంతశ్ఛేతననూ, అంతశ్శాంతిని నెలకొల్పుతుంది. మనస్సును దాని ఇష్టంవచ్చినట్లు వదిలేస్తే, అది మనలను వెర్రివాళ్ళను చేస్తుంది. సాధనచేస్తే, అది మనకు లొంగి, మనంచెప్పినట్లు చేస్తుంది. ఆవిధంగా లభించిన అంతశ్శాంతియే శివుడు. అంతులేని ఆనందము. ఇదే మన సహజస్థితి. దీనినే మనం పొందవలసినది.
ధ్యానం:3: నిటారుగా కూర్చుని, చేతులు తొడలపై పెట్టుకోవాలి. నేత్రాలను సగం మూయండి. పెదాలపై చిరునవ్వును పెట్టండి. ఆనవ్వును మీలో అంతర్గతమవ్వనివ్వండి. (మీమనస్సులోకి పంపించండి). దీన్ని ఎప్పుడూ వదలకండి. మీకళ్ళను గమనించండి. కళ్ళలో కొద్దిపాటి కదలికలు సామాన్యమే. ఎందువల్లనంటే, దృష్టియే కాలము, అనగా అస్థిరము. మీకనుపాపలను దగ్గరగాలాగి, అంతర్ దృష్టిని రెండు కనుబొమలమధ్య నున్న భృకుటిపై కేంద్రీకరించండి. అలామూసిన కనులతో, భృకుటిని గమనిస్తూవుంటే, ద్రష్ట దృశ్యము, అనగా చూచునది, చూడబడేది, దృష్టి అనగా చూచుటలో లయించిపోతాయి. ఇదే ఇతరము లేమియూలేని పూర్తి ఎరుక. ఇది తనపై తాను కేంద్రీకరించుకున్న, భేదంలేని శుద్ధమైన ఎరుక.(స్వస్వరూపజ్ఞానం). అదే కాశీ. నీవు అహంకారము, మనస్సు, శరీరము, కర్త, కావు. నీవే ఆప్రకాశమైన ఎరుకవు. కాశీవి. నీవే శివుడవు(పరమాత్మవు).
ఆత్మ, కాలదూరములు, పరిణామములేని ఎరుక. అది ఛేదము, భేదము లేనిది. అది భౌతికస్పృహ కానిది. ఎటువంటి వ్యక్తిత్వము లేనిది. అది సత్-చిత్, స్వస్వరూపజ్ఞానం కలది. అది ఎటువంటి లోపము (కొరత) లేని పరిపూర్ణము. అది జ్ఞానేంద్రియములను చైతన్యపరచి, శరీరంలో జీవంపోస్తుంది. నిశ్శంకోచంగా నేను శివుడను. "చిదానంద రూపః శివోహం, శివోహం" నేను పూర్తి ఎరుకగల పవిత్రమైనవాడను, శివుడను, పరమాత్మను.
ధ్యానం చివరలో కాస్త వెసులుబాటుగా కూర్చుని, కొద్దిసేపు కళ్ళను మూసి వుంచండి. తర్వాత నెమ్మదిగా కళ్ళను తెరవండి. ఈవిధంగా ఈధ్యానప్రక్రియలను ప్రతిరోజూ 15 నిముషాలపాటు, కనీసం 41 రోజులపాటు క్రమంతప్పకుండా సాధన చేయండి. మనస్సు కదులుతూవుంటే, (ఆలోచనలు వస్తూవుంటే), జాగ్రదావస్థలో విషయాలను కలుగజేస్తుంది. విషయములు నిజంకావు. కాని అజ్ఞానంవల్ల నిజములుగా భ్రమింపజేస్తాయి. మనం విషయాలకు లోబడి, ఆసక్తి కలిగియుంటే, అవి నిజం కాదని తెలుసుకోలేము. ఎప్పుడైతే ఒక్కసారి మనం జాగ్రదావస్థలోని విషయాలపట్ల నిర్లిప్తత వహించి, అంతశ్శాంతిని పొందామో, అప్పుడు ఈవిషయాలపట్ల మనం ఏమీ చేయనవసరంలేదు. అవి వస్తూ, పోతూ వుంటాయి. అవి వాటి లక్షణంప్రకారం ప్రవర్తిస్తూ, పోతూవుంటాయి. మీలక్ష్ల్యం మీలోని శుద్ధమైన ఎరుక. ఈఅసత్య విషయాలు కావు. ఇదే స్వస్వరూప జ్ఞానం. అప్పుడు నిన్ను నీవు శివుని(పరమాత్మ)గా తెలుసుకుంటావు. ఇదేనిజమైన కాశీయాత్ర.
శ్లో॥5॥ కాశీక్షేత్రం శరీరం, త్రిభువనజననీ వ్యాపినీ జ్ఞానగంగా,
భక్తిః శ్రద్ధాగయేయం, నిజగురుచరణధ్యానయోగః ప్రయాగః।
విశ్వేశోయం తురీయః సకలజనమనఃస్సాక్షిభూతోన్తరాత్మా,
దేహేసర్వం మదీయే యదివసతి పునస్తీర్థమన్యత్కిమస్తి॥
తా॥ ఈశరీరమే ముఖ్యతీర్థాయాత్రాస్థలమైన కాశి. సర్వవ్యాపితమైన జ్ఞానప్రవాహమే త్రిభువనమాత అయిన గంగ. శ్రద్ధ, నమ్మకములే గయాపట్టణము. సద్గురువుల చరణ ధ్యానయోగమే ప్రయాగ. నాల్గవది అయిన ఆత్మయే విశ్వేశ్వరుడు. ఈశరీరంలో అధిష్టానమై, అంతఃకరణకు సాక్షి అయిన ఆఆత్మ అన్ని ప్రాణులలోనూ ఉంటుంది. (ఆత్మవత్ సర్వభూతాని). అలాగ అన్నియూ ఈదేహములోనే ఉండగా, వేరే తీర్థయాత్రలు చేయవలసిన అవుసరమేమున్నది?
ఈశ్లోకం 'స్రగ్ధర' అనే చంధస్సులో వున్నది. వేదాంతంలో 'నహినిందాన్యాయం' అనే న్యాయంవుంది. "నహినిందా నింద్యంనిందితం అపితు స్తుత్యంస్తోత్రం" అక్కడ నిందయొక్క ఉద్దేశ్యం నిందించడం కాదు, స్తుతించడమే! (దీనినే 'నిందాస్తుతి' అనికూడా అంటారు.) పైకి కవి నిందిస్తున్నట్లు కనబడినా కవిభావన మాత్రం దాని కీర్తిని పెంచడమే, తగ్గించడం కాదు.
ఒకప్పుడు శ్రీరామకృష్ణపరమహంసను, మీరు కాశీయాత్ర చేస్తారా, అని అడిగితే, నాకు ఆసక్తిలేదు, ఎందుకంటే, నాహృదయంలోనే శివుణ్ణి చూస్తున్నాను, అని బదులిచ్చారట.ఆయన వారిశిష్యులకు తీర్థయాత్రలు చేసేబదులు, వారి హృదయంలో మొక్కవోని శ్రద్ధాభక్తులు కలిగియుండాలని ప్రభోదించారు. వారు తీర్థయాత్రలను తక్కువచేయకుండా, ఏదైతే ముఖ్యమో దాన్ని తెలియజేశారు.
యాత్రీకులు సాధారణంగా కాశితోపాటు గయ, ప్రయాగకూడా సందర్శిస్తారు. శ్రీశంకరులవారు ఈమూడింటినీ ప్రతీకలుగా చెప్పారు. ఈశరీరమే పవిత్రమైన కాశీనగరం. కాశీలో గంగ ప్రవహించినట్లే, ఈదేహములో చైతన్యం ప్రవహిస్తూవుంటుంది. గంగ, స్వర్గమర్త్యపాతాళలోకాలలో ప్రవహిస్తూవుంటుంది కాబట్టి, గంగను 'త్రిలోక సరిత్తు' అని పిలుస్తారు. స్వర్గంలో ప్రవహిస్తుంది కాబట్టి మందాకిని అంటారు. అలాగే ఏదైతే చివరికి తెలుసుకోవాలో ఆ ఆత్మ, జాగ్రత్స్వప్నసుషుప్తులనే మూడు అవస్థలకూ సాక్షిగా ఈ శరీరంలో వుంటుంది.
శ్రద్ధ అనగా జ్ఞానసముపార్జనపై ఆసక్తియే గయ. గయలో ప్రజలు శ్రార్థము, పితరులను సంతృప్తిపరచు కర్మలను చేస్తారు. "శ్రద్ధయా కృతం శ్రార్థం" అది ప్రేమ, శ్రద్ధతోటి చేయాలి కాబట్టి 'శ్రార్థం' అనబడింది. సాధారణంగా యాత్రీకులందరూ ఈకర్మకాండను చేస్తారు. కాని, ఈశ్రార్థము పూజాదులవలె పవిత్రము, శుభము కాదనే తప్పుడు అభిప్రాయముతో వుంటారు. మృత్యువుపట్ల వారికున్న భయమే ఇటువంటి తప్పుడు అభిప్రాయానికి మూలహేతువు. మృత్యువుతో సంబంధమున్న ప్రతీదానినీ అసహ్యించు కొంటారు. కాని మృత్యువుకూడా జననంలాగా సహజమే! ఒకసారి ఒక దుఃఖితురాలైన మహిళ, తన కొడుకును బ్రతికించమని బుద్ధభగవానుని ప్రార్థించింది. దానికి వారు, ఆమృతదేహాన్ని బ్రతికించగలనని, అందులకుగాను, మృత్యువులేని గృహంనుండి గుప్పెడు బియ్యం తీసుకురమ్మని చెప్పారట.ప్రార్థన లాగే శ్రార్థముకూడా పవిత్రమైనదే. అందులో మనం భగవంతుని పితరుల రూపంలో కొలుస్తాము.
ధ్యానమే ప్రయాగ. గంగ, యమున, అదృశ్యవాహిని సరస్వతి, మూడునదుల సంగమము. అలాగే, ఆపరమాత్మ పాదాలకడ, తమ శరీరము, బుద్ధి, అహంకారాదుల న్నింటినీ సమర్పించి, ధ్యానంలో స్వస్వరూపజ్ఞానం పొందుతారు. ఆపరమాత్మే, సద్గురువుగాను, ఆత్మగాను, దర్శనమిస్తాడు. చివరిగా పరమాత్మ, గురువు ఆత్మతో ఏకీకృతమౌతారు. పాదాలపై ధ్యానమనగా, శరణాగతి, ఆత్మసమర్పణము.
జిజ్ఞాసువు, సాధకుడు, తనలోని అంతశ్శాంతికి బద్ధుడై, తన ఆత్మకే సమర్పితమౌతాడు. అదే ధ్యానయోగం. ఇందులో, తాను అంతఃకరణ అనుకునేది, అందులో ప్రతిఫలించే నిజమైన 'నేను'తో సంయోగిస్తుంది కాబట్టి, ఇది 'యోగం'. ఈయోగమే 'ప్రయాగ'.
ఆత్మ, తురీయము, నాల్గవది. అది జాగ్రత్స్వప్నసుషుప్తులలో వున్న ప్రతీదాన్నీ ప్రకాశింపజేసి, పరిణామక్రమాన్ని తీసుకొస్తుంది. జాగ్రదావస్థలోని విషయాలు ఆత్మను ప్రభావితం చేయలేవు. ఆత్మ ఎటువంటి విషయానికీ అంటుకోదు. అవస్థలు ఆత్మకు సంభవించవు. దివారాత్రాలు సూర్యునికెట్లా లేవో , అలాగే అత్మకుఏవీ సంభవించవు. ఆ తురీయమే, చిట్టచివరిదే, శివుడు, పరమాత్మ. మనస్సును గమనించడం మొదలుపెడితే, ఎరుకను గమనించడం మొదలవుతుంది. అప్పుడు నీవు శరీరివి కావు. ఈ శరీరజ్ఞానానికి (భౌతికజ్ఞానానికి) అతీతమైన శివుడు, పరమాత్మవి.
శివుడే విశ్వేశ్వరుడు. విశ్వానికి ప్రభువు. విశ్వముకూడా జాగ్రదావస్థలో వున్న విషయమే! మనం, స్పర్శ, రుచి, వాసన, దృష్టి, శ్రవణాదుల ద్వారా అనుభవించేదే విశ్వము.(ప్రపంచము).దానికి ప్రభువెవ్వరు? 'నేను' అనే స్వస్వరూప సంపూర్ణఎరుకయే ప్రభువు. ఆకాశి, శివుడు, పరమాత్మయే నీవు. నీలోలోపల, అంతరాత్మలో శివుడు, పరమాత్మ కొలువైవున్నాడు. తనలోవున్న ఈ అంతరాత్మను తెలుసుకొనుట ఎట్లు? నేను శరీరాన్ని, పనులుచేసే శరీరాంగాలను, జ్ఞానేంద్రియాలను, అంతఃకరణను కాను, అని తెలుసుకోవాలి. ఎటువంటి వాసనలూలేని, దేనికీ ప్రభావితంకాని, నిర్మలమైనవాడిని 'నేను' అని తెలుసుకోవాలి. ఇదే సత్యానికి మార్గము. ఎప్పుడైతే దీనిని తెలుసుకున్నామో, అప్పుడు మనం ఆ నిర్మలమైన అంతరాత్మలో లయమౌతాము. ఆఅంతరాత్మయే మనస్సుకు సాక్షిగా మారుతుంది. ఎలాగ, ఒక సూర్యుడు లక్షలాది వానచినుకులలో ప్రతిఫలిస్తాడో, ఒకే విద్యుశ్ఛక్తి బల్బులను వెలిగిస్తుందో, అలాగ ఈ అంతరాత్మే సకలజీవరాశులలోనూ ప్రతిఫలిస్తూ వుంటుంది. శివుడు(పరమాత్మ), భవాని, గంగ, గయ, ప్రయాగ అన్నీ ఈశరీరంలోనే వున్నాయి. ఇంకా దీన్ని దేనితో పవిత్రీకరించాలి? పవిత్రీకరించేది తీర్థము. మనలను శుద్ధిచేసేవి వేరే ఏమీలేవు. సూతసంహిత "ఆత్మతీర్థం పరంతీర్థం" అని చెప్తోంది. మనుజులు శుద్ధి, పవిత్రత చెందాలని, దేవుళ్ళను, తీర్థాలను వెతుక్కుంటూ తిరుగుతారు. కాని వారు అన్నిటికంటె పవిత్రమైన కాశి ఆత్మరూపంలో తమలోనే వున్న విషయాన్ని తెలుసుకోరు. కొంతమందిని ప్రోగుచేసుకొని, ఒక టూరిస్టు బస్సులో వివిధ తీర్థయాత్రా స్థలాలు పర్యటించడంతో సరిపోదు. అది దేశసమైక్యతకు పనికి వస్తుందేమోగాని, తనని తాను తెలుసుకొనుటకు పనికిరాదు. జిజ్ఞాసువు, తీవ్రసాధకుడు, తనలోని అంతశ్శాంతిని, ఆనందాన్ని, యోగముద్వారాగాని, లేదా ఈ "కాశీపంచకము"లో వున్నటువంటి, ఊహకందనటువంటి యదార్థములను గుర్తించుట(అనుభవించుట)ద్వారా గాని పొందాలి. ఇదియే నిజమైన "కాశీయాత్ర".
"హరిః ఓం తత్సత్"
శ్రీకృష్ణార్పణమస్తు.
(శ్రీశంకరాచార్య విరచితము)
(శ్రీస్వామి తత్త్వవిదానందసరస్వతివారి ఆంగ్లవివరణకు స్వేచ్ఛానువాదము.)
మున్నుడి
అందరికీ నమస్కారం. సన్మిత్రులు, హితైభిలాషులు శ్రీకాశావజ్ఝల నరసింహమూర్తి గారు, ఒకసారి ప్రసంగవశాత్తు శ్రీశంకరాచార్యులవారు రచించిన 'కాశీపంచకము' గురించి, దానికి శ్రీతత్త్వవిదానందసరస్వతిస్వాములవారు చేసిన ఆంగ్లవివరణ గురించి తెలియ జేశారు. దాని లోని కొంతభాగాన్నికూడా నాకు చెప్పారు. అది వినగానే నాలో ఏదో తెలియని ఉత్సుకత, అభినివేశము పొటమరించాయి. ఇంత గొప్పదైనది, గంభీరమైనది ఇంగ్లీషులోనే ఎందుకుండాలి? మన తెలుగులో ఎందుకుండకూడదు? అని అనిపించింది. నేనే ఈపని ఎందుకు చేయకూడదు? అన్న భావనకూడా వచ్చింది. అప్పుడు ఈవిషయాన్ని శ్రీనరసింహమూర్తి గారికి చెప్పి, ఆపుస్తకం పిడిఎఫ్ కాపీని నాకు పంపించ మని కోరాను. దానికి వారు ఎంతో సంతోషించి, నాకు ఆ పిడిఎఫ్ కాపీని పంపారు. అప్పటికప్పుడు, అనగా ది.13-9-2021న దాని ప్రింటు తీసి, స్వేచ్చానువాదం చేయడం ప్రారంభించాను. సన్మిత్రుల సహకారంతో అది ది.5-10-2021న పూర్తయింది. ఈవిషయమై కొన్నివిషయాలు మీముందుంచడం తప్పనిసరి. ఇందులో శ్రీశంకరాచార్యుల వారు కాశీ యాత్ర అంటే భౌతికయాత్ర కాదని, అది మన లోలోపల యదార్థమైన, శాశ్వతమైన దాని కోసం చేసే యాత్ర అని, దానిని దర్శించి, అనుభవించితే ఏయాత్రలూ అవుసరం లేదని ప్రబోధించారు.దానికి శ్రీతత్త్వవిదానందస్వాములవారు చాలాచక్కటి , ప్రౌఢమైన ఆంగ్లవివరణ యిచ్చారు. వారికి కృతజ్ఞతాపూర్వక ప్రణామములు సమర్పించుచున్నాను.
ఇక్కడ నా పసితనంలో జరిగిన ఒక సంఘటనను మీకు తెలియజేయాలను కుంటున్నాను. అప్పుడు మేము రాజమండ్రిలోని చందాసత్రంలో వుండేవారము. నేను పాలుత్రాగే పసివాడిని. అప్పుడు శ్రీఉమామార్కండేయేశ్వరస్వామి దేవాలయంలో ఒక గొప్పవారు వచ్చి, దివ్యంగా 'శివార్చన' చేశారు. దాన్ని చూడాలని మాతల్లిగారు (మాకు సద్గురువులు కూడా) కృష్ణవేణుగారు, కుతూహలపడ్డారు. అప్పటికి మాతండ్రిగారు స్వర్గస్తులై ఎంతోకాలము కానందున, అప్పటి పరిస్థితులలో మామాతామహులు మాతల్లి గారిని బయటకు వెళ్ళుటకు అనుమతించలేదు. దానికి మాతల్లిగారు ఈశ్వరా, నీదర్శనం నాకు లభించలేదు, నేను అంతటి అదృష్టానికి నోచుకోలేదా! అని బాధపడినారు. ఆరాత్రి ధ్యానంలో వారికి నిలువెత్తు శివలింగం దర్శనమిచ్చిందట! ఆ ఆనందంలో మాతల్లిగారు, ఆశువుగా ఈపాట పాడారట.
"ఎందో కలడని, దేముడెందెందో కలడని, ఏగెదరు అంధులగుచు నరులూ!"
"స్థావరజంగ మహాశివ తత్త్వాదులయందు నిండియున్న సాక్షిభూతుని,
సర్వేశ్వరుని, తనలో గాంచకలేక, ॥ఎందో కలడని ॥
సరిగ్గా ఈభావాన్నే శ్రీశంకరాచార్యులవారు, శ్రీతత్త్వవిదానందసరస్వతిస్వాముల వారు మనకు ప్రబోధించారు.
ఈవిషయం నాకు తెలియజేసి ఎంతో ప్రోత్సహించిన శ్రీకాశావఝ్ఝల నరసింహమూర్తిగారికి, నన్ను ప్రోత్సహించిన సన్మిత్రురాలు, దైవమిచ్చిన సహోదరి శ్రీమతి బండి భ్రమరాంబ గారికి నా కృతజ్ఞతాభివందనములు తెలియజేస్తున్నాను.
నేను అంతగా విద్యావంతుడను కానందున, ఇందలి దోషములునావిగా భావించి, తెలియజేసినచో, సరిదిద్దుకొనగలవాడను. దీని ముఖ్యోద్దేశ్యమును గ్రహించి, నిజతీర్థయాత్రా ఫలమును పొందగలరని చదువరులను కోరుచూ, ఆశిస్తున్నాను.
ఇట్లు,
బుధజనవిధేయుడు.
ఉపోద్ఘాతం.
ప్రపంచములోని ఏ ధర్మమునకైనా మూడు దృక్పథాలుంటాయి. అవి , మొదటిది కర్మ లేక ఆచారక్రియలు చేయుట, రెండవది ఉపాసన అనగా భక్తి, మానసిక ఆరాధన, మూడవది జ్ఞానము-ఎఱుక, లేదా వేదాంత పరిజ్ఞానము.ఈమూడు అంశాలు హిందూ ధర్మములో చాలా చక్కగా పొందు పర్చబడినవి. పాశ్చాత్యనాగరికతలో తాత్త్వికత మతము నుండి వేరుచేయబడి, భక్తి, ఆచారక్రియలకు పరిమితం చేయబడినది. అరిస్టాటిల్ వంటి గొప్ప తత్త్వవేత్తలు మతము విషయములో ఏమీ చేయలేదు. కాని బెట్రాండ్ రస్సెల్, నీట్చే వంటి వారు నియమబద్ధ మతమునకు విరుద్ధముగా చెప్పినారు. కాని హిందూ ధర్మము లో మతము, తాత్త్వికతల యొక్క చక్కటి సమన్వయాన్ని చూస్తాము. ఇక్కడ మతం తత్త్వానికి అడ్డురాదు. తత్త్వవేత్తలు మతానికి విరోధులు కారు. ఉదాహరణకి, శ్రీశంకరా చార్యులవారు జ్ఞానమునకు పెద్దపీట వేసినా, వారు కొన్ని పరిమితులతో కర్మ కాండ లను కూడా అనుమతించినారు. ఏ తత్త్వవేత్తకూడా నిషిద్ధకర్మలను అనుమతించలేదు. శ్రీశంకరాచార్యులవారు కామ్యకర్మలను అనగా కోర్కెలను తీర్చు కర్మలను పొందు పర్చలేదు. శ్రీమద్భగవద్గీత కూడా కామ్యకర్మలను నిరసించి, ఎటువంటి జంకులేకుండా, తిరస్కరించింది. కాని నిత్యనైమిత్తిక కర్మలు అనగా విధివిహితములైన కర్మలు చాలా బాగుగా, యోగమునకు అంగముగా అనగా జ్ఞానసముపార్జ, పరమాత్మలో లయించు టకు మొదటిమెట్టుగా స్వీకరించబడినవి.
కర్మలేని జీవితముండదు. కాని ఆకర్మ స్వస్వరూపజ్ఞానం పొందేదిగా పరిణమించాలి. కర్మకు నిరంతరం కొనసాగే గుణంవుంది. కాలానుగుణంగా కర్మలు పెరిగి, చివరకు కాలానికి లొంగనివిధంగా మారాయి. వేదాంతం యీకర్మలన్నింటికీ స్థానం యివ్వలేదు. కైవల్యో పనిషత్ (3) "నకర్మణా, నప్రజాయా, ధనేన, త్యాగేనైకే అమృతత్త్వమానసుః" అని చెప్పింది. అంటే మోక్షము కర్మలద్వారాగాని, సంతానంద్వారాగాని, ధనంమూలకంగాగాని రాదు. వైరాగ్యంద్వారానే మోక్షాన్ని పొందుతారు. కర్మలను తత్త్వవిచారణనుండి తప్పించినచో, అవి కేవలము భౌతికముగా, పునరావృతమయ్యేవిధంగా మారి, బుద్ధిని మందగింప జేస్తాయి. కర్మలను సరియైన దృక్కోణంలో, విధివిహితంగా, సమర్పణాభావంతో చేయగలిగితే, అవి తత్త్వముగా పరిణితిచెంది, కర్మయోగంగా మారి, బుద్ధిని, మనస్సును, నిర్మలంగా వుంచుతాయి. అందువల్లనే శ్రీశంకరాచార్యులవారు "కర్మయోగము 'ఫలాభిసంధి' అనగా చేసిన కర్మల ఫలితములపై అనురక్తిని నశింపచేయుటకు గొప్ప పనిముట్టు" అని మరలమరల ఉల్లేఖించారు.
సాధారణంగా మనం భవిష్యత్తులో ఫలవంతములయ్యే కర్మలపట్ల ఆసక్తిగావుంటాము. దానిని సమర్థించడానికి ఎటువంటి కారణాన్నైనా చూపించడానికి సిద్ధపడతాము. మన మనస్సు రెండుపనులు ఒకేసారి చేయడానికి తగనందున మన పనిచేసే నిబద్ధతను, ఫలితంపై మనకుండే కోరిక నియంత్రిస్తుంది. అందువల్ల చివరలో కారణమే కార్యంగా రూపు దిద్దుకుంటుంది. కాని కర్మయోగం ఫలితంపై ఆసక్తిలేని కర్మ. దీన్నే భగవద్గీత 6-1లో "అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతియః" అనగా విధివిహితములైన కర్మలను ఫలితమును ఆశించకుండా చేయవలెను" అని చెప్తోంది. అందువలన మోక్షగామి నిత్యనైమిత్తిక కర్మలను విధిగా నిత్యము, ఆయా సందర్భములలోనూ, ఎటువంటి ఫలాపేక్షలేకుండా నిర్వర్తించాలి.
భక్తికూడా హిందూతత్త్వములో చాలాచక్కగా పొందుపర్చబడ్డది. భగవద్గీత 14-26లో "మాంచయో వ్యభిచరేణ భక్తియోగేన సేవతేసగుణాన్ సమతిత్త్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే" అనగా నన్ను ఎవరైతే నిశ్చల భక్తియోగముతో కొలిచెదరో, అతడు సత్త్వరజస్తమో గుణములను లయముచేసి, పరబ్రహ్మమగుటకు అధికారి అవుతాడు.అదే నిష్కామభక్తి. ప్రతిఫలాపేక్షరహిత భక్తి. అది స్వస్వరూప జ్ఞానము పొందుటలో ఉపయోగిస్తుంది. కాని ఆభక్తి వేదాంత నిర్వచనానికి లోబడనిచో, అది మూఢనమ్మకంగా మారి, సాధకుని ఉన్నతికి దోహదపడదు. అది కర్మయోగముగా మారవలసియుంటుంది.
ఎపుడైతే మతము తత్త్వమునుండి వేరుపడుతుందో, కర్మలు, నమ్మకాలు బలపడ తాయో, అది పరిణామక్రమమును కోల్పోతుంది. అనగా సాధకునికి ఉన్నతి కలుగదు. ఎవరు, ఎంతో సమర్థతతో, ఆడంబరంగా, విస్తారమైన కర్మకాండలు చేసినప్పటికీ, అతనిలో పరిణామక్రమము సంభవింపదు అనగా ఆధ్యాత్మికోన్నతి కలుగదు. ఎప్పుడైతే ఏదైనా మతము సమాజమునకు మూలస్తంభమైన మనుష్యుని పరిణామ క్రమమునకు ప్రేరేపించదో, ఆమతము నిష్ప్రయోజనమవుతుంది. ఇలాగే కొన్ని ప్రాచీనమతాలు వాటియొక్క తత్త్వమునుండి ఆచారక్రియలు, నమ్మకాలు వేరుపడినందున, వాటియొక్క పరిణామశక్తిని, క్రమమును కోల్పోయినవి. పురాణములను పరిశీలించు చున్ననూ, తత్త్వమును మనస్సునందుంచుకొనవలెను. ఇది శ్రీశంకరాచార్యులవారి ఉద్భోధలలో ముఖ్యమైనది. వారు కర్మలలోని దుర్గుణములను తొలగించి, కర్మలను స్వస్వరూపజ్ఞానము పొందుటకు ముఖ్యకారణమైన కర్మయోగముగా మార్చినారు. శ్రీశంకరాచార్యుల వారి సిద్దాంతములు తత్త్వమును, స్వస్వరూపజ్ఞానమునకు ముఖ్య కారణమైన భక్తిసారస్వతముగా మార్చినవి. వారు భక్తిని భక్తియోగముగా మార్చినారు. యాంత్రికముగా జపము చేయుటయే సాధకుని గమ్యముకాదు. శ్రీశంకరులవారి సిద్ధాంతములు మనలను కర్మ, భక్తులనుండి జ్ఞానమువైపు మరల్చుటకు దోహద పడతాయి.
మతము పౌరాణిక వివరాలను యథాతథంగా తీసుకొంటుంది. కాని అథ్యాత్మికత భాషకు అందనిదైయుంటుంది. ఎవరైతే ఆపౌరాణిక వివరాల అంతరార్థాన్ని తెలుసుకోరో వారు ద్వైతమనే పంజరంలో బంధింపబడతారు. ఎవరైతే తనకు పరమాత్మకు తేడా వుందని భావిస్తారో, అప్పుడు మిగిలినవారి ఆత్మలకు తేడా నిజమని భావిస్తారు. అప్పుడు ఏకత్త్వము, అభిన్నత్త్వము (ఆత్మవత్ సర్వభూతాని) పూర్తిగా మరుగైపోతుంది. కావున ఆధ్యాత్మిక సాధకులు భాషయొక్క అవరోధాన్ని దాటవలసియుంటుంది.
హిందూ పౌరాణిక సారస్వతము ప్రతీకాత్మకమైయున్నది. "పరోక్షప్రియ ఇవహిదేవాః" (ఐతరేయోపనిషద్ 1-3-14) అనగా దేవతలు పరోక్షప్రియులు. దార్శనికులు ప్రతీకాత్మక భాషతో సత్యాన్ని ఆవిష్కరించడాన్ని ప్రేమిస్తారు. ఉదాహరణకు సూర్యకాంతిలో ఏడు రంగులున్నవని చెప్పుటకు "సప్తాశ్వరధ మారూఢం" అనగా ఏడు గుఱ్ఱములు పూన్చిన రథములో ప్రయాణించువాడు అని చెప్తారు. భాష అర్థంలేనిదిగా కనపడుతుంది. కాని ప్రతీకాత్మకత దార్శనికుల యొక్క అద్భుతమైన పరిశీలనా విధానాన్ని తెలియజేస్తుంది. అలాగే గ్రహణసమయంలో సూర్యచంద్రులను ఒకపాము మింగుతుందని చెప్పబడింది. నిజానికి సూర్యచంద్ర మండలాలు నీడతో కప్పబడతాయి. ఆనీడనే పామని చెప్పారు. ఆభావచిత్రణను అర్థం చేసుకొంటే వారి సాహిత్య భావనను పొగడకుండా వుండలేము.
కాశీ యాత్రికులచే కిక్కిరిసిన ప్రాచీననగరం. మిగిలిన ప్రాచీననగరాల లాగే కాశీకూడా సన్నని సందులతో కూడినది. కాశీలోని ఘట్టాలు, గంగలో స్నానమాచరించాలనే కోరికతో వచ్చే జనాలతో రద్దీగా వుంటాయి. అయినప్పటికీ మనం వ్యక్తిగత ప్రయోజనాలను విస్మరించి గంగలో మునకలు వేస్తాము. కాశీ, గంగలపై మనకు గల అకుంఠిత ప్రేమ అన్ని అసౌకర్యాలను అధిగమింపజేస్తుంది. గంగలో శాస్త్రప్రకారం స్నానమాచరించితే మనకున్న పాపాలన్నీ తొలగిపోయి, చనిపోయిన తర్వాత స్వర్గ వాసానికి అర్హుడౌతాడని నమ్ముతారు. కాని కాశీ, గంగకు సంబంధించిన ప్రతీ అంశము లోనుఒక లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత వుంది. ఒకసారి "కాశీపంచకాన్ని" అధ్యయనం చేస్తే సాహిత్యస్థితినుండి ఉన్నత ఆధ్యాత్మికస్థితికి ఎదగడానికి దోహదపడుతుంది.
శ్రీశంకరాచార్య విరచిత "కాశీపంచకము"
శ్లో॥1॥ మనోనివృత్తిః పరమోపశాన్తిః సాతీర్థవర్యా మణికర్ణికాచ।
జ్ఞానప్రవాహా విమలాది గంగా సా కాశికాహం నిజబోధరూపా॥
తా॥ నేను నాయొక్క పవిత్రమైన పూర్తి ఎఱుక గలిగిన కాశీపట్టణాన్ని. నిశ్శబ్దనీరవపూర్వకమైన మనస్సుతో అనుభవించే పరమశాంతియే పవిత్రమైన వాటిలోకెల్ల పవిత్రమైన మణికర్ణికాఘట్టము. ఎల్లప్పుడూ ప్రవహించే చైతన్యస్రవంతియే దివ్యగంగ.
'కాశికాహం' అనుటలో నేను కాశీని అనే అర్థం ఉండనేవున్నది. "కాశః ప్రకాశః అస్య అస్థి ఇతికాశీ" అనగా అన్నియూ తనలోనే ప్రకాశించుచున్న పూర్తి ఎఱుకతో నున్న ఆత్మయే కాశి. ఈభావాన్నే శ్రీశంకరాచార్యులవారు దక్షిణామూర్తిస్తోత్రం(1)లో "విశ్వం నిజాంతర్గతం" అనగా ఈవిశ్వమంతా తనఆత్మలోనే ఉన్నది" అని తెలియజేశారు.
నేను అనునది వేదాంతములో అత్యంత కీలకాంశం. నేనెవడను? నేను అనునది సకల జీవరాశులలో సామాన్యమైన ప్రాథమిక అనుభవం. జాగ్రదావస్థలో వున్న అన్నింటిలోనూ 'నేను' అనేది వున్నది. ప్రతీదీ సంతోషం, బాధ, మతము, దైవము ఇలా అన్నీ నేను అనేది ఉంటేనే వున్నాయి. ఈజాగృతమైన చైతన్యము యొక్క మూలము నేను. ఈ 'నేను' యొక్క సారాంశమేమిటి?
వేదాంతులకు మూలమనేది ప్రధానము. మనం ఈప్రపంచంయొక్క రూపాన్ని తీసుకొని దాని మూలన్ని పరిశోధిస్తే, దాన్ని ఈశ్వరుడు దేనిలోంచేనా గాని, లేదా శూన్యంలోంచి గాని సృష్టిచేశాడనే నిర్ణయానికి వస్తాము. ఈవిధమిన ద్వైతము వేదాంతసిద్ధాంతములకు విరుద్ధముగానున్నది. మనం ఈ విశ్వమునకు "చైతన్యము" మూలమైనదిగను, విశ్వమంతా జాగ్రదవస్థలో వున్నదానినిగనూ, భావింపవలసి వుంటుంది. జాగ్రదావస్థకు నేను అన్నది ప్రాథమిక ఎఱుక. మనం, నేను తండ్రిని, వాద్యకారుడిని, ధనవంతుడను, అమెరికనును, బ్రాహ్మణుడను అనేటువంటి భావాలను ఆపాదించుకుని సంతోషపడటం కన్నా, 'నేను' అనేదానియొక్క మూల ప్రకృతిని కనుగొనవలసియుంటుంది. పైన చెప్పిన భావాలు నిజంకాదు. ఇటువంటి వేటినీ 'నేను'కు ఆపాదించరాదు. నేను అనేది ఉన్నస్థితియొక్క ఎఱుక. ఆ స్వయంప్రకాశిక ఎఱుకయే కాశి.
కుండ వున్నదని మనం ఎలా గ్రహిస్తాము? అది దాని ఉనికిని ప్రకటించలేదు. ఒక చైతన్యవంతమైన జీవి దాని వునికిని కనులతో చూసి, మనస్సుతో గ్రహించి, ధృవీకరించవలసియుంటుంది. ప్రకాశము రెండు రకాలు. ఒకటి బాహ్యమైన వెలుతురు లేదా ప్రకాశము కుండకు తన వునికిని తెలుసుకునే జ్ఞానము వుంటేనే దానికి స్వయంప్రకాశకత్వము వుంటుంది. కుండను గుర్తించాలంటే , దానిని ఒకరి గ్రహింపుశక్తి లోనికి ప్రవేశపెట్టబడాలి. జాగ్రదావస్థలో వున్నజీవికి తెలియనిదానియొక్క వునికి వుండదు. కాబట్టి కుండకు స్వయంప్రకాశకత్త్వము లేనందున , అది పరప్రకాశకమైనందున, అనగా వేరే వెలుతురు వలన ఫ్రకాశక మైనందున, ఇతరుల దృష్టిలోపడి, మనస్సుతో గ్రహించగలిగిన తర్వాతే దాని వునికి తెలుస్తుంది. కాని నేను అనేదానికి స్వయంప్రకాశము వుంటుంది.
నేను అనేది, భావన, గ్రహింపులకు ముందరే వుంటుంది. (అనగా నేను అనేది ఏర్పడిన తర్వాతనే భావనలు, ఇతరముల గ్రహింపుశక్తి వస్తాయి.) నేను అనేది ఒక ఆలోచనకాదు. ఇది మనస్సుకన్నా ముందున్నది (ప్రాచీనమైనది). కాలము, దూరము అనేవి మనస్సు యొక్క విభిన్నరూపాలు. ఒక భావన వుంటేనీ కాలముంటుంది. ఈశరీరంతో ఒకదానిని గుర్తిస్తేనే దూరముంటుంది. మనం ఈశరీరంతో గుర్తిస్తేనే దూరమునకు లోబడివుంటాము. మనం మనస్సుతో గుర్తిస్తేనే కాలప్రవాహంతో కలసిపోగలం. కాబట్టి 'నేను' అనేది శరీరము, మనస్సుకన్నా ముందున్నది. కాని కాలములేని, దూరమునకు లొంగని స్వయంప్రకాశిక చైతన్యమే 'కాశి'.
పురాణములు ఈప్రపంచమునకు కాశి కేంద్రబిందుదువని చెపుతున్నాయి. అనంతానికి కేంద్రబిందువు ప్రతీచోటావుంటుంది. పరమాత్మ అనంతుడు. ప్రతి మనుజుని హృదయము లోనూ ఆయన కేంద్రీకృతుడై వున్నాడు. ఆకేంద్రము 'నేను' లేదా 'కాశి'. భౌతికశరీరము ఈప్రపంచములో ఒక బిందువు లేదా ఒక గుర్తు. కానీ నేను కాదు. ఈప్రపంచమంతా నిరంతర చైతన్య ప్రవాహములో పుడుతుంది, వుంటుంది, కొనసాగుతుంది, చివరకు అందులోనే లయిస్తుంది.
"సాతీర్థవర్యా మణికర్ణికాచ" కాశిలోని మణికర్ణికాఘట్టము పేరెన్నికగన్న శ్మశానము. కాని అత్యంత పవిత్రమైనది. కాశి చుట్టుపక్కల ప్రాంతాలనుండి చాలా మృతదేహాలు అంత్యసంస్కారములకు ఈఘట్టమునకే వస్తాయి. భక్తులు ఇక్కడే స్నానాలు, ఇతర పుణ్యకర్మలాచరిస్తారు. ఈఘట్టము శారీరక భౌతిక గుర్తింపుని వ్యతిరేకిస్తుంది. ఋతములో జాగృతమై యుండుటకు భౌతికముగా మరణించాల్సియుంటుంది. ఈశరీరాన్నే నేను అనుకుంటే , మనం ఏమనుకున్నప్పటికీ, సత్యానికి దూరంగానే వుంటాము. సత్యమునకు హేతుబద్ధమైన వివరణ సత్యముకాదు. మనం ఈశరీరంనుండి మనగుర్తింపుని తొలగించుకుని, పూర్తిగా బహిర్గతమగుటకు తయారైనప్పుడు, ఆసత్యం తనంతతానే తెలుస్తుంది.
ఈశరీరం గుర్తింపు మూడువిధములుగా వుంటుంది. 1. అహం అనగా నేను శరీరాన్ని. 2. మమ: 'నాయొక్క'. 3. మహ్యం: ఈశరీరం నాకోసం వుంది. మనం కర్మయోగాన్ని అనగా నిష్కామకర్మను 'మహ్యం' అనేదాన్ని నాశం చేయడానికి ఆచరిస్తాము. ఈశరీరాన్ని మనం నిష్కామకర్మలను చేయడానికి సరియైన మార్గంలో ఉపయోగించాలి. ఆఫలితాలను సమాజానికిగాని, పరమాత్మకుగాని అర్పించవలసియుంటుంది. ఎలాఅంటే, గాలి తనకోసం కాకుండా ఈసమస్త సృష్టికోసం వీస్తుంది. అలాగే ఈశరీరము, బుద్ధియొక్క సామర్థ్యాన్ని మనస్వార్థంకోసం కాకుండా, సర్వమానవాళి హితంకోసం వినియోగించాలి. 'మమ' అనేదాన్ని భక్తియోగం, ప్రతిఫలాపేక్షలేని సమర్పణతో నశింపజేయాలి. ఈసందర్భంగా 'నమమ' అనునది చాలా ప్రధానమైనది. అనగా 'నమే' నాదికాదు. ఈ సృష్టిలో ప్రతీదీ ఈశరీరంతో సహా సర్వం పరమాత్మకు సంబంధించినదే! కాని నేను చేస్తున్నానుఅనే అజ్ఞానాన్ని, నేను ఈశరీరాన్ని కాను అనే భావనతోటి దూరం చేయాలి. ఇదే సాంఖ్యయోగం.
ఉపశాంతి: బాధలనే అగ్నిని ఉపశమింపజేయుట. తాపములు మూడు. ఆధ్యాత్మిక-ఈశరీరానికి సంబంధించిన అనారోగ్యం మొ॥వి. ఆదిభౌతిక: జంతువులు, దొంగలు మొ॥న ఇతరప్రాణులద్వారా సంభవించే బాధలు, ఆధిదైవిక-దైవికమైన కరువు, భూకంపాలు మొ॥వి. ఉపశాంతికి పరమ అనే విశేషణాన్ని ఎందుకు జేర్చాలి? మనం నిద్ర పోయినప్పుడు మనబాధలు అన్నీపోతాయి. మేల్కొనగానే అన్నిబాధలు అంటే తాపత్రయాలు తిరిగి వస్తాయి. మనం ఎప్పుడు మేల్కొంటామా అని అవి ఎదురు చూస్తాయి. ఆవిధంగా మనం నిద్రలో పొందే శాంతి తాత్కాలికం. శాశ్వతమైనది కాదు. జాగ్రదావస్థలో కూడా మనోరుగ్మతలను పోగొట్టడానికి మత్తుపదార్థాలను తీసుకొనుటకూడా వుంది. కాని ఆ మత్తుపదార్థముల ప్రభావం పోగానే మన బాధలు తిరిగి వచ్చేస్తాయి. దీని వలన, అలాపొందిన తాత్కాలిక శాంతి పోయిన తర్వాత, ఇంకా ఎక్కువ చిరాకు, అశాంతి పొందుతాము. ఎలాఅంటే, మెరుపుకాంతిలో క్షణకాలం వస్తువులు మెరిసి, వెంటనే చీకటి ఎలా అలుముకొంటుందో, అలాగ. మనకు నిజమైన శాశ్వతమైన మనఃశాంతియే కావాలి. అశాశ్వతమైనది కాదు.
మనకు బాధలనుండి శాశ్వతమైన విముక్తి కావాలి. దానినే 'నిర్వాణ' అని అంటారు. 'వాణ' అనగా బాధలు. నిర్వాణ అనగా బాధలనుండి విముక్తి. ఈవిముక్తి అనేది దాదాపు వ్యతిరేకభావంతోనే నిర్వచిస్తారు. అది నిజంగా నిర్వచింపలేనిది. అది మాటలకందని నిర్వచనం. ఏదైతే బాధలనుండి విముక్తి కలుగజేస్తుందో, దానిని శబ్దాలతో వ్యక్తీకరించలేము, నిర్వచింపలేము. ఆ అంతఃశ్చేతన తన అన్నివిభేదాలను అధిగమిస్తుంది. మనం నేను అనేదానికి కట్టుబడి, ఆఅంతరంగంలో వున్ననిశ్శబ్దనీరవాన్ని కనుగొనాలి. ఇక్కడ భౌతికమైన నిశ్శబ్దం ముఖ్యమైనదికాదు. మన మనస్సులో వచ్చే ఆలోచనలు యదార్థము కాదు అనే ఆలోచన వస్తే, ఆలోచనాస్రవంతి ప్రమాదకరము కాదు. మనం ఎప్పుడైతే జాగ్రదావస్థలో చూసేవాటిని నిజంగాను, వేరేగానూ అనుకుంటామో, అప్పుడు మనం మానసికంగా మన కోర్కెలు తీర్చుకోవడానికి, ఆనందానికి, వాటిపై ఆధారపడతాము. మన ఆనందంకోసం, బాధలు పోగొట్టుకొనడానికి, దానిని తారుమారు చేయడానికూడా ప్రయత్నం చేస్తాము. ఇది మనలో లోతుగా పాతుకుపోయిన లోలత్వము, అజ్ఞానము తప్ప మరేమీ కాదు.
ఈ ఆలోచనాస్రవంతి నిజాన్ని కప్పిపుచ్చే తెరలాగా పనిచేస్తుంది. మన మనస్సు ప్రతీ ఉదయం ఒక ప్రపంచాన్ని తయారుచేసి మన ఎదురుగా నిలబెడుతుంది. మనం దాన్ని నిజమని విశ్వసించి, ఆప్రపంచంలో మనంకూడా ఒకపాత్రలాగా భ్రమిస్తాము. మనస్సు చూపించే ఈచిత్రాన్ని మనం భ్రమ అని తెలుసుకుంటేనే తప్ప, యదార్థాన్ని తెలుసుకోలేము. ఈ అజ్ఞానపూరిత మనస్సు చూపించే వస్తు, విషయ విభజన, భుహుళత్వము(వివిధత్వము), మిథ్య అనగా, యదార్థము కానిది. ఈనిజాన్ని గ్రహించాలంటే, మనం మనస్సు నుండి విడివడి, ఒక సాక్షిలాగా గమనించాలి. అప్పుడది దానంతటదే నిశ్శబ్దంగా ప్రశాంతంగా మారిపోతుంది.
మనం మనస్సుతో ఏకీకృతమైతే, అనగా మనస్సునే నేనుగా భావిస్తే, అది భావనలతో కలిగించే రూపాలను యదార్థమనుకుంటాము. వాటిపై మన దృష్టి కేంద్రీకరించి, అనురక్తి, ఆసక్తి పొందినట్లయితే, దానిని భ్రమ అని గుర్తించలేము. మనస్సు నుండి విడివడి, దృష్టిని మరల్చి, నిరాసక్తత కలిగివుండాలి. మనస్సును నిరంతరం సాక్షిలాగా గమనిస్తూవుండాలి. దానితో ప్రమేయంలేకుండా, ప్రేమతో వ్యవహరించాలి. ఇదే యోగం. ప్రారంభంలో యోగంలో చాలా నెమ్మదిగా ఎదుగుదల వుంటుంది. కాబట్టి పట్టుదలతో ఆలోచనలను విరమించాలి. ఎప్పుడైతే మనస్సును ఒక సాక్షిలాగా గమనిస్తామో, అప్పుడు మనస్సు నిర్మలమవుతుంది. మీప్రతీచర్యను యాంత్రికంగా చేయకండి. ఉదాహరణకు, మనం ఆహారం తీసుకునేటప్పుడు మాట్లాడితే, తినడం యాంత్రికమవుతుంది. మాట్లాడటం మానివేసి, తినే పదార్థరుచిని పూర్తిగా అనుభవించి, ఆస్వాదించండి. ఇదికూడా ఒక యోగమే! ఇలాగే నడుస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు గమనించుకోండి.
మనస్సు ఆందోళన చెందినప్పుడు, 'నేను' అనేదికుడా ఆందోళన చెందుతుంది. ఎందువల్లనంటే, నేను, మనస్సు ఒకటేనని అనుకుంటున్నాము కాబట్టి. అవి పరిమాణాత్మకంగా ఒకదానికొకటి వ్యతిరేకంగా వుంటాయి. నేను అనేది నిశ్చలమైనది. కాని ఆలోచించండం మార్పు చెందేది. మనస్సునే నేను అనుకుంటే, మనం దానిలో బంధింపబడతాము. మనం మనస్సునుండి విడివడి, దానిని గమనించడం మొదలుపెడితే, మనస్సులో మెదిలేవాటిని మనం గ్రహిస్తున్నాము అని తెలుసుకొంటాము. మనస్సు ఒక క్షేత్రము. అందులో వచ్చే ఆలోచనలు మొ॥నవి ఆక్షేత్రంలో భాగాలు. యోగములో తనను తాను వ్యతిరేకించుకోరాదు. భౌతికప్రయోజనాలకోసం మనస్సుయొక్క అవగుణాలను పెంచుకొనరాదు. మనస్సులోని అవగుణాలు అనగా, ద్వేషం, అసూయ, స్వార్థం మొ॥నవి అన్నివిధాలా నిర్మూలించాలంటే, మనస్సును క్రమబద్ధ శ్వాసక్రియ (ప్రాణాయామం), ధ్యానం, గ్రంథాలను పఠించుట, వినుట మొ॥న ప్రక్రియలద్వారా శుద్ధిచేసుకోవాలి. ఎప్పుడైతే మనస్సు శుద్ధికాబడినదో, అప్పుడు మనం, మనస్సును కామని, దానిని ఒకసాక్షిగా చూసేవారమని తెలుస్తుంది. మనస్సు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్స్రర్యాలనే అరిషడ్వర్గాలతో నిండిపోతుందో, అప్పుడు మనలను మనం ఒక సాక్షిగా గుర్తించలేము. మనలోని అంతరాళాల లోలోపల ఉన్నదాన్ని తెలుసుకుంటేతప్ప, మనక్స్సును అధిగమించి, మనం మనస్సుకామని తెలుసుకోలేము. ఎప్పుడైతే మనస్సు నిర్మలమౌతుందో, అప్పుడే దాన్ని మనం అధిగమించగలుగుతాము.
ఈ భౌతికప్రపంచానికి లోబడిన కలుషితమైన మనస్సు మనలను వెనక్కు నెట్టివేస్తుంది. అంతఃకరణ (మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము) శుద్ధి చాలా ముఖ్యమైన మొదటిమెట్టు. ఎపుడైతే మనస్సు నిర్మలమైనదో, అప్పుడది రాజసతామస గుణాలను వదలి, సాత్త్వికగుణాన్ని అలవరచుకొంటుంది. అప్పుడు తేలికగా 'నేను' అనేది మనస్సు కాదని తెలుసుకుంటాడు. నేను అనేది తెలివితేటలకు ముందున్న తెలివి అనగా మనస్సు, బుద్ధికన్నా ముందున్నది. (ఇక్కడ మనము అర్థం చేసుకొనవలసినదేమిటంటే, అంతఃకరణ ద్వారా గ్రహించినదాన్ని అర్థంచేసుకొని, అనుభవించేదే 'నేను'). ఆ అంతఃశ్చేతనలోనే భంగపరచ లేని శాంతి వున్నది. ఆ నీరవనిశ్శబ్దమే చైతన్యము. అది శూన్యం కాదు. అదే 'కాశి'.
కాశీలో గంగ వున్నది. అది విమల అనగా శుద్ధమైనది. గంగలో ఎన్నివిధములైన విషపదార్థాలు, రసాయినాలు పోసినప్పటికీ, దాని జలములు పరిశుద్ధముగానే వున్నవి. తక్కిన ఏనదికీ ఇటువంటి తనంతతానే శుభ్రపరచుకొను విధానము లేదు. ఉదాహరణకు, కాన్పూరుపట్టణము చేరుసరికి గంగ శుద్ధముగానే వుంటుంది. కాని, కాన్ల్పూరులోని చర్మకారపరిశ్రమలు వారి వ్యర్థాలను గంగలో పారబోస్తున్నందున, విషతుల్యముగా మారుతుంది. కాని పది మైళ్ళలోపే గంగనీరు మరలా తనంతతానే పరిశుద్ధమౌతుంది. సీలువేసిన పాత్రలోనున్న గంగాజలము చాలాకాలము పాడవకుండా వుంటాయి. కాశీలోని గంగ కాలాతీత ఎఱుకకు, కొనసాగుతున్న చేతనత్త్వమునకు, శాశ్వతమైన ఆత్మకు ప్రతీకగా వున్నది. అంతఃకరణయొక్క చేష్టలే అంతఃశ్చేతనయొక్క విషయములు.
2.శ్లో॥ యస్యామిదం కల్పితమింద్రజాలం, చరాచరంభాతి మనోవిలాసమ్।
సచ్చిత్సుఖైకా పరమాత్మరూపా, సాకాశికాహం నిజబోధరూపా॥
నేను నాయొక్క పవిత్రమైన పూర్తి ఎఱుక కలిగియున్న కాశి పట్టణాన్ని. ఇంద్రజాలంలా భ్రమకల్పించే ఈసమస్త చరాచర సృష్టి ఇందులోనే కల్పించబడింది. మనస్సు ఆటలాడుకొనే భ్రాంతియే ఈప్రపంచము. కాని యదార్థమేమిటంటే, హృదయాంతరాళాలలో నిండియున్న పరిపూర్ణరూపుడైన పరమాత్మ మాత్రమే శాశ్వతుడు.
ఆత్మయొక్క అజ్ఞానమనస్సులో గోచరమయ్యే ఈప్రపంచమంతా మనస్సుయొక్క కల్పన మాత్రమే. ఎలాగంటే, ప్రొజెక్టరు లోంచి వచ్చే వెలుతురులో, ఫిల్ము కదలికవల్ల తెరపై కదలాడే సినిమా వచ్చినట్లు. సంసారంలోని ఆనందం, బాధ, ప్రేమ, ద్వేషం, కాలదూరాదులతో సహా అన్ని అంశాలూ, ఈసినిమాలో ఉంటాయి. అందులో పర్వతాలు, నదులు, వనాలు, పువ్వులు, జంతువులు, పక్షులు మొదలైన సమస్త జీవరాశి వుంటుంది. అంతా ప్రొజెక్టరు వెలుతురులో ఎలా కదులుతూ కనపడతాయో, దానికి ఈ కదిలే ప్రపంచానికి తేడాఏమీలేదు.
ఈప్రపంచమంతా మనం నిద్రపోయినప్పుడు ఎక్కడకు పోయినట్లు? నిద్ర లేచిన వెంటనే, మన అజ్ఞానమనస్సులో 'నేను' అనేది , ఆతర్వాత శరీరం మేల్కొంటాయి. ఈప్రపంచమంతా, ఈజీవి పుట్టడానికి అవుసరమైన శరీరంతో కలసి మేల్కొంటుంది. ఈశరీరం, ప్రపంచం రెండూ ఒకేసారి మేల్కొని, సమన్వయం చెందుతాయి. ప్రొజెక్టరు వెలుతురులో కదులులుతున్న ఫిల్ము ఎలాగైతే సినిమాను చూపిస్తుందో, అలాగే జాగ్రదావస్థలో మనస్సు యొక్క కల్పనవల్ల ఈప్రపంచం ఏర్పడుతుంది. పూర్తి ఎఱుకతో వున్న చైతన్యమే ఆ వెలుతురు. అదే 'కాశి' ఆఫిల్మే చిత్తచాంచల్యము, మనోవిలాసము. దీనిలోనే సకల జీవ, నిర్జీవ, చరాచర ప్రపంచమంతా వెలుగులోకి వస్తుంది.
కొన్నిసార్లు అసలైన, శాశ్వతమైన దానికంటె, ఈప్రపంచం చాలా ఆకర్షణీయంగా, స్వచ్చంగా, నిజంగా గోచరిస్తుంది. ఎలాగంటే హెచ్. డి.టివిలో వచ్చే టెన్నిస్ మాచ్, ప్రత్యక్షవీక్షణం కన్నా ఆకర్షణీయంగా వుంటుంది. అయినా యదార్థానికది కల్పితము, ఊహాజనితము, ఆళీకము (కల వంటిది). ఇలా క్రమంగా దృక్కోణాన్ని సాధకులు అలవర్చుకోవాలి.
అప్పుడు మనకు వచ్చే ప్రశ్న, నిజమైనది, శాశ్వతమైనది ఏది? సచ్చిత్సుఖైక - శాశ్వతమైన ఎరుకతో కూడిన ఆనందము - సచ్చిదానందము. నిజాన్ని తెలుసుకోవాలంటే, మనం నామరూపాలకు ఆలవాలమైన బుద్ధిని అధిగమించాల్సివుంటుంది. నామరూపాలు, ప్రేమ, ద్వేషము మొదలైన అన్నిరకాల ద్వందాలను అధిగమించాల్సివుంటుంది. 'నేను' అనేదాని చుట్టూ చాలా గందరగోళం వుంది. నేను అనేది జాగ్రదావస్థలో గోచరమయ్యేవాటికి ఏవిధంగానూ కట్టుబడియుండదు. అది అనిర్వచనీయము, గుర్తింపులేనిది, ఖండితము కానిది, ప్రాథమిక ఎఱుక కలిగియున్నది. అది స్వయంసిద్ధమైన, శాశ్వతమైన ఆత్మస్వరూపము.
ఈజీవితంలో మనకు కావలసినదేమిటి? మనకు ధనము, అధికారము, కుటుంబము మొదలైనవి కావాలనుకుంటాము. నిజంగా మనకు కావలసినది ఆనందం. మనం ఆనందాన్ని ధనము, అధికారము మొదలైన వాటితో మాత్రమే పొందాలనుకుంటాము. కాని అవన్నీ తప్పుడు మార్గాలు. ఆమార్గాలద్వారా ఆనందాన్ని పొందాలనుకో కూడదు. ఎందుకంటే అవి, చంచలమైన యదార్థంకానివి. అందువలన అవి శాశ్వతానందాన్ని యివ్వలేవు. ఒక మంచి సినిమాను మనం చూసినప్పుడు, మనం ఎలా ఆనందాన్ని పొందుతాము? ఆనందం సినిమాతెరలోంచి మనలోకి వస్తుందా, లేదా మనలోంచి తెరపైకి వెళుతుందా? నిజానికి అది మనలోంచే తెరపైకి వెళుతుంది. ఆనందం బయటి వస్తువు లోంచి హృదయములోకి రాదు. ఈయదార్థాన్ని మనం ఒప్పుకోము. ఎవరైతే ఈనిజాన్ని తెలుసుకొంటారో, వారు ప్రపంచాన్ని జయిస్తారు. ఈనిజాన్ని ఎలా తెలుసుకోవాలి? 'నేను' అనేదాన్ని పూర్తిగా గ్రహించడానికి, అర్థంచేసుకోవడానికి, దానియొక్క పూర్తి ఎఱుక కలిగియుండాలి. ఎప్పుడైతే ఆత్మయొక్క స్వస్వరూపజ్ఞానాన్ని తెలుసుకున్నామో (అనుభవించామో), అప్పుడు అంతఃకరణ చేసే ఆలోచనా మాయాజాల మంతా కరిగిపోయి, అప్పటికప్పుడే, అంతర్గత వాస్తవికరూపం అనుభవానికివచ్చి, అసలైన ఆనందం కలుగుతుంది.
హృదయాంతరాళాలలో నున్న 'నేను' అనేదే పరమాత్మరూపం. అది ఈశరీరము, అంతఃకరణతో కూడినదికాదు. సాధారణంగా మనం, నేను అనేదాన్ని - నేను కానిదాని దృక్కోణంలోంచి చూస్తాము. ఉదాహరణకు ఒక ధనవంతుడు, తనకున్న సంపదనుంచే తనను తాను చూసుకుంటాడు, గుర్తించుకుంటాడు. తల్లిదండ్రులుగాని, భార్యాభర్తలుగాని, వారి గుర్తింపును బంధుత్వము ద్వారానే చూస్తారు. మనకు తెలుసున్నదానిద్వారా, అది వేరే అయినందున, నేను అనేదాన్ని నిర్వచించుకోరాదు. కావున ప్రతీవారూ తమస్వంత గుర్తింపును విడనాడాలి. ఈగుర్తింపులు సరైనవికాకపోగా, నిజానికి దోవతప్పిస్తాయి. నిజమైన జ్ఞానవంతులు, దేనితోనూ తమ గుర్తింపును కొనసాగించరు. కాని సామాన్యులు తాము ఊహించే ప్రతీదానిలోనూ తమను చూసుకొంటారు. నీవు ఎవరివీ కాకు! ఎవరివీ కాకుండావుండు! అప్పుడు మాత్రమే నిజమైన 'నేను' అనేది మహిమాన్వితంగా ప్రకాశిస్తుంది, అనుభవానికి వస్తుంది.
శ్లో:3: కోశేషు పంచస్వధిరాజమాన, బుద్ధిర్భవానీ ప్రతిదేహగేహమ్।
సాక్షీశివః సర్వగతోన్తరాత్మా, సాకాశికాహం నిజబోధరూపా॥
నేను నాయొక్క పవిత్రమైన పూర్తి ఎఱుకగల్గిన కాశి పట్టణాన్ని. ఆంతటా నిండియుండి సాక్షిగా వున్నవాడు, లోపలనుండి అన్నింటినీ నడిపేవాడే శివుడు. ప్రతీశరీరంలోనూ, పంచకోశాలలోపల విరాజమానమగుచూ, వున్న బుద్ధియే శివుని శక్తియైన భవాని.
'సాఅహం' అనగా 'నేను అది'. 'సా'అనగా ఆ వాస్తవము. వాస్తవికతను 'అది' అనే పదంతో తప్ప వేరే మాటతో వివరించలేము. సత్యము, వాస్తవికత అనేది సాధారణంగా భాషకందని లోతైన భావం కలదిగా వుంటుంది. అయినప్పటికీ, దాన్ని మాటలతోనే వ్యక్తపరచ వలసియుంటుంది కాబట్టి సత్యము అనే సంకేతమునిచ్చే మాటలను వాడుతాము. అటువంటి మాటలలో ఒకటి "తత్ - అది". "ఓంతత్సదితి నిర్దేశో బ్రహ్మణాస్త్రివిధ స్మర్తః" (గీత 17-23). పరబ్రహ్మను ఓం, తత్, సత్ అని మూడు విధాలుగా సూచిస్తారు. 'స' అనునది ఏకాత్మకము. 'సాః' అనునది పురుషవాచకము. 'సా' అనునది స్త్రీవాచకము. 'తత్' అనునది నపుంసక వాచకము. కాని అర్థం మారదు. లింగమనేది భాషకేగాని, తేజోపూరితమైన చైతన్యమునకు లేదు.
నేను స్వయంప్రకాశక చైతన్యమైన 'కాశిక'ను. జాగ్రత్స్వప్నావస్థలు దానిలోనే వుంటాయి. అన్ని అవస్థలు అంతమయ్యే 'సుషుప్తి' కూడా ఒక అనుభవమే! అదికూడా ఈ చైతన్యములోనే ప్రకాశమానమవుతుంది. ఆచైతన్యమే అన్నింటికీ మూలము, ఆధారము. మనుజునికి అనుభవములోనికి వచ్చే వెలుతురులకు వెలుతురు. అదే నాయొక్క (కాశి) ప్రవృత్తి.
'కాశిక' అనగా ఈ పరిమితమైన శరీరము, బుద్ధిలో వుండే అపరిమితమైన జ్ఞప్తి, జ్ఞాపకము, తెలుసుకొనుట, ఆత్మ, అనంతము. అదే ఈ శరీరం చేసే అన్ని ఆలోచనలు, వ్యవహారాలకు సాక్షిగా వుంటుంది. అది జాగ్రత్, స్వప్న, సుషుప్త్యవస్థలలో జరిగే అన్ని క్రియలనూ సాక్షిగా చూస్తుంది. ఆ అనంతమైనది, ఈ పరిమితమైన దానితో మమేకమైతేనే, మనకు ఒకదానియొక్క స్పృహ, జ్ఞప్తి వస్తాయి. అదే వ్యక్తీకరింపబడిన చైతన్యము. ఆవిధంగా ప్రతిబింబించే అన్ని అవస్థలకూ సాక్షీభూతమయ్యే ఆత్మయే కాశి.
ఆత్మ సర్వగతము, అంతటా నిండియున్నది. సాధారణంగా మనం 'అంతా' అనునది వెలుపల, లేదా బయట వున్నదను కొంటాము. 'వెలుపల' అంటే ఏమిటి? అది జాగ్రదా వస్థకు వెలుపల వుండదు. కుండ శరీరానికి వెలుపల వుంటుంది. కాని, దాన్ని 'తెలుసుకునేది' కాదు. ఆ చైతన్యపూరిత స్థలము వెలుపల ఎలా వుంటుంది? ఉనికిని గ్రహింపు(తెలుసుకొనుట)నుండి వేరు చేయ లేము. మనం 'అంతా' అని అంటే, అదంతా చైతన్యములోనే వున్నది. ఈ జాగదావస్థ అంతా ఆప్రకాశవంతమైన జ్ఞానముతోనే నిండియున్నది. దానినంతయునూ, తెలిసినది, తెలియనిది అని రెండువిధములుగా విభజించవచ్చును. కాని తెలుసుకొనేది, తెలిసినదానిలోనూ, తెలియనిదానిలోనూ కూడా వ్యాపించియుంటుంది. విషయము లోపల, బయట అని విభజింపబడినచో, అప్పుడు ఆకాశమువలే సర్వవ్యాపకమైన తెలుసుకొనేది, ఆ లోపల, బయటా అంతా నిండి యుంటుంది. అన్ని ద్వందాలకు అతీతంగా ఆకాంతిలో చైతన్యము ప్రజ్వరిల్లుతూ వుంటుంది. అది సంతోషము, బాధ, సుఖము, దుఃఖము, స్నేహితుడు, శతృవు, గౌరవము, అవమానము, తన, ఇతర వంటి అన్ని ద్వందాలకూ అతీతంగావుంటుంది. విభజనలు, వ్యతిరేకములు బంధిస్తాయి. మనం ఎంతవరకూ ఈ ద్వందాలకు లోబడి, కలవరపడుతూ వుంటామో, అంతవరకూ మనం ఈ బంధాలలో చిక్కుకొని వుంటాము.
మనకు ఈద్వందాలను ఆపాదించుకుంటే, ఆబంధాలకు కట్టుబడిపోతాము. ఒక్కొక్కసారి ఈబంధం ఎంత బలంగా వుంటుందంటే, ఈ శరీరమే నేను అనుకునేంతగా వుంటుంది. ఒక్కొక్కసారి ఇది మేధోగర్వంలాగా సున్నితంగా వుంటుంది. ప్రతీ బంధము మనలను ద్వందాలతో బాధితులుగా చేస్తుంది. కాబట్టి నిర్ద్వందముగా, ద్వందాలకు అతీతంగా, వుండాలి. బంధాలకు అతీతంగా, కాంతులకు మూలమైన కాంతిలాగా ఎదిగి, అన్ని శారీరక, మానసిక అనుభవములకు అతీతంగా, ఒక సాక్షిలాగా వుండాలి.
సాధారణంగా స్వప్నావస్థ చాలాకొద్దిసేపే వుంటుంది. ఏదో పీడకల వస్తేతప్ప, అది మనలను ప్రభావితం చేయదు. మనం జాగ్రదావస్థలాగా, నిద్రాస్థితినికూడా సాక్షిలాగా, గమనించినా, అది మనలను ప్రభావితం చేయలేదు. ఈబంధమంతా, జాగరూకతతో కూడిన ఎరుకతోనే వుంటుది. కాబట్టి మనం జాగ్రదావస్థలోని విషయాలపట్ల, కలవరపడకుండా, వాంఛించకుండా, ఆసక్తిలేకుండా వుంటేనే, వాటిని అధిగమించగలుగుతాము. ఒక పవరు హౌస్ లోని విద్యుశ్ఛక్తి ఫిలమెంటులో ప్రవహించగానే ఎలా ప్రకాశిస్తుందో, అలాగే అనంతమైన ఆత్మ, కాశి కూడా ఈపరిమితమైన అంతఃకరణతో కూడిన శరీరంతో సంయోగించి, పంచకోశాలలోనూ ప్రతిఫలిస్తుంది.
మనజీవితంలో, వివిధదశలలో, మనలను బంధించే ఈకోశాలనే 'నేను' అనుకొని పొరపాటు పడుతున్నాము. మనం భావించడాన్నిబట్టే బంధాలుంటాయి. అది పాపహేతు వవుతుంది. ఒరలోని కత్తిలాగా, ఈ పరిమిత శరీరంలో అనంతాత్మ వుంది. అన్నమయ కోశం(భౌతికశరీరం), ప్రాణమయకోశం(ముఖ్యప్రాణం) అన్ని కదలికలూ కలిగిస్తుంటే, మనోమయకోశం(మనస్సు), విజ్ఞానమయకోశం(కర్త, పురికొల్పేవాడు), ఆనందమయకోశం (అహంకారం, అనుభవించేవాడు), మనలను శరీరం, మనస్సు అని భావించుకుంటే, అవి కోశాల్లాగా వ్యవహరిస్తాయి. కాని మనం అలా భావించకుండా, సాక్షిలాగా వాటిని గమనిస్తుంటే, అవి మనకు కోశాల్లాగా వ్యవహరించవు. ఎటువంటి పొరపాటు లేకుండా, మనలను మనం కర్తగాభావించకుండా వుంటే, బుద్ధి ఎటువంటి కర్మలకు ప్రేరేపించినప్పటికీ, అది కోశములాగా వ్యవహరించదు. అలాగే, నేను అనుభవిస్తున్నాను అనే భావాన్ని విడనాడితే, అహంకారం ఎప్పుడూ బాధించదు. మనలను మనం పొరపాటుగా గుర్తించు కొనటమే బంధాలకు మూలం. ఈ పొరపాటునే మాయ, అవిద్య, అజ్ఞానం అంటారు. స్వస్వరూపజ్ఞానం లేకపోవడం, అవిద్య, అజ్ఞానం, ఈ విశ్వ ఆవిర్భావానికి మూలమైన విశ్వమాయలో ఒకభాగం. అదే పరబ్రహ్మయొక్క సృష్టిశక్తి. దీనినే ప్రతీకాత్మకంగా భవానీ, శివునియొక్క పత్నిగా అభివర్ణిస్తారు.
మీకు స్వస్వరూపజ్ఞానం వున్నందున శరీరం కారు. ఎవరైనా తాను శరీరం అనుకుంటే, వారికి ఆశరీరం గురించి తెలియదు. ఈవిషయాన్నే భగవాన్ రమణమర్షులవారు సద్దర్శనం-26 లో "దేహోనజానాతి" ఈశరీరానికి తెలియదు అని బోధించారు. ఎవరికైతే ఈవిషయం తెలుస్తుందో, వారు శరీరంకారు. కళ్ళు తమనితాము చూసుకోలేవు. కళ్ళు ఎప్పుడు ఏమి చూడగలవో, ఎప్పుడు ఏమి చూడలేవో, మనకు తెలుసు. అందువలన మనం కళ్ళు కాము. కుండవంటి వస్తువును మనం ఒక భావన ద్వారా గుర్తించగలం. కాని కుండ తనను తాను గుర్తించుకోలేదు. ప్రతీవారూ ఆలోచననూ, ఆలోచనారాహిత్యాన్ని కూడా తెలుసుకొన గలరు. అందువలన ఎవరూ మనస్సు కారు. ప్రతీవారూ వారి ఆలోచనకు మూలమైన తెలివికలవారైనందున, ఆలోచనగురించి తెలుసుకొనియుంటారు. కాబట్టి మనలను మనం మనస్సుతోగాని, దాని ఆలోచనతోగాని, గుర్తించుకోవడం పొరపాటు.
ఇదే తర్కం కర్తకు కూడా వర్తిస్తుంది. తనను శరీరంతోగాని, పనిచేసే అంగాలతోగాని, గుర్తించుకుంటేనే కర్త అవుతాడు. అలాగే జ్ఞానేంద్రియాలే నేను అనుకుంటేనే తప్ప, నేను అనుభవిస్తున్నాను అనే భావనవుండదు. కాబట్టి అయిదువిధాలుగా వున్న ఈ 'ఉపాధి' అనే పరిమిత శరీరాన్నే నేను అనుకోవడమే ప్రాథమికమైన పొరపాటు. ఈపొరపాటును మనం సరిచేసుకోవాలి. నష్టదాయకమైన షేర్లలో పెట్టుబడి పెట్టడమనేది, ఈతప్పుడు గుర్తింపు అంతటి తీవ్రమైన తప్పుకాదు. ఈపొరపాటుకే మరోపేరు, అవిద్య, అజ్ఞానం. దీనికి మూలం సృష్టి ఆవిర్భావంలోనే వున్నది. 'ప్రతిదేహ గేహం' ఇది సార్వత్రికమైన అజ్ఞానము, మాయ. అదే భవాని. విశ్వనిర్మాణసూత్రం.
శివుడు, పరమాత్మ విశ్వవ్యాపకుడు. ఇదే మనప్రకృతి. దీనితోనే మనలను మనం గుర్తించుకోవాలి. పైన చెప్పినటువంటి అయిదింటితో గుర్తించుకోరాదు. నేను అనేదానికి పూర్తి అర్థం పురుషుడు. అదే శివుడు, పరమాత్మ. బుద్ధియే ప్రకృతి, భవాని . ఇందులోనే పరమాత్మ ప్రతిఫలిస్తాడు. గీత 13-22లో "పురుషః ప్రకృతిస్తోహిభుంక్తే ప్రకృతిజాన్ గుణాన్" అనగా పురుషుడు ప్రకృతితో మమేకమైతే, ప్రకృతిలోని గుణాలతో బాధింపబడతాడు అని తెలియజేస్తోంది. "భవాన్ సంసారిణం కరోతి ఇతి భవానీ" శివుడిని సంసారిగా చేసేది భావాని, ప్రకృతి.
ఎప్పుడైతే తనను కాశి, ప్రకాశకత్త్వముగా గుర్తిస్తాడో అప్పుడు ఈ పంచకోశములు నిర్వీర్యమయి, అన్నిగుర్తింపులు తొలగిపోయి, పరమాత్మకు తనకు గల బేధం తొలగిపోతుంది. ప్రకృతిసిద్ధంగా తదనుగుణంగా, శరీరము, అంగములు పనిచేస్తుంటాయి. ఇంకోవిధంగా చెప్పాలంటే, మనం భావిస్తేనే ఈబంధాలన్నీ వుంటాయి. కాబట్టి, మనస్సుకు, అహంకారానికి, అనుభవాలకు సాక్ష్లిగా వుండిపోవాలి. ఎప్పుడైతే అహంకారానికి లొంగక, సాక్షిగా వున్నామో, అహంకారం ఉనికిని కోల్పోయి, నశిస్తుంది. అప్పుడప్పుడు క్రియాత్మకమైన అహం రావచ్చు. కాని అది ప్రమాదకరం కాదు. మనస్సును గమనించడం మొదలుపెట్టగనే, అది శుద్ధమగుట ప్రారంఅభమవుతుంది. నేను కాశీని, నేను శివుడను, పరమాత్మను, అనే అహం మనలను బంధింపదు.
శ్లో॥4॥ కాశ్యాంహి కాశతే కాశీ, కాశీ సర్వ ప్రకాశికా।
సాకాశీ విదితాయేన, తేనప్రాప్తాహి కాశికా॥
తా॥ నిజానికి కాశీపట్టణం చైతన్యముతో ప్రకాశిస్తూవుంటుంది. అదే ఆత్మ. ఆకాశీ అన్నింటినీ ప్రకాశింపజేస్తూవుంటుంది. ఈవిధంగా కాశీని ఎవరైతే తెలుసుకొంటారో, వారు తప్పక కాశీని చేరుకోగలరు(పొందగలరు).
కాశీ వెలుతురుకే వెలుతురునిచ్చే చైతన్యము. అదే ఆత్మ. జాగ్రదావస్థలో మనకు కనపడే రంగులు, రూపాలకు వెలుగు మన కంటిచూపు. అలాగే శబ్దాలకు వెలుగు చెవి. అన్నిఆలోచనలకు వెలుగు మనస్సు. కాని ఈవెలుగులన్నింటికీ వెలుగు ఒక్కటే, అదే చైతన్యము. నిద్రాస్థితిలో కూడా ఆచైతన్యం మనస్సును, అది చూపించేవాటిని ప్రభావితం చేస్తుంది. నిద్రాస్థితిలో సూర్యుడు, చంద్రుడు, కన్ను, చెవి, మనస్సు మొదలగు అన్ని వెలుతురులు లేనప్పటికీ, వీటన్నింటినీ తన వెలుతురుతో ప్రభావితం చేసేది చైతన్యము. ఈప్రకాశించే చైతన్యమే శివుడు, పరమాత్మ. ఆ ఎరుక కలిగిన శరీరమే కాశీ పట్టణము.
ఆజ్ఞాచక్రం మనశరీరంలో కనుబొమలమధ్య, భృకుటిలో వుంటుంది. అక్కడే మనం దృష్టిని కేంద్రీకరించి కుమారుని, అనగా శివుని(పరమాత్మయొక్క) తేజస్సును దర్శిస్తాము, అనుభవిస్తాము. ఆధునిక శరీరశాస్త్రము ప్రకారం ఇక్కడే పిట్యూటరీ గ్రంధి వుంటుంది. ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే, ఆజ్ఞాచక్రాన్ని రెండు రేకులుండే పద్మంలాగా వుంటుందని వర్ణిస్తారు. అలాగే పిట్యూటరీగ్రంధికి కూడా రెండు ఖండములు(భాగాలు) వుంటాయి. ఈశక్తికేంద్రాన్ని వేదాంతశాస్త్రంలో పద్మంగా పేర్కొన్నారు. ఎవరైతే తమ మనస్సును ఆజ్ఞాచక్రంపై కేంద్రీకరించి, ఆప్రకాశం, చైతన్యంలో లయమవుతారో, వారే శివుడు(పరమాత్మ) అవుతారు. శివోహం, శివోహం, నేనే శివుడను, నేనే శివుడను, అహం బ్రహ్మాస్మి, నేనే పరబ్రహ్మను.
ఈ చైతన్యానికి కేంద్రబిందువైన ఆజ్ఞాచక్రమే శివునియొక్క మూడవకన్ను. ఈభౌతిక నేత్రాల చూపు చంచలమైనది, తాత్కాలికమైనది. కనులు మూసినపుడు, పరధ్యానంలో వున్నప్పుడు, నిద్రపోయినపుడు, పోవునది. కాని చైతన్యవంతమైన మూడవకన్ను కాలాతీతము, నిత్యమైనది. అది మూడు అవస్థలలోనూ ప్రకాశిస్తూనేవుంటుంది. అది రేయి పవలు లేని సూర్యుని వంటిది. (మనం ఈభూవాతావరణం దాటి రోదసీలోనికి వెఌనపుడు ఈ అనుభవం కలుగుతుంది.) ఎవరైతే 'కాశీని' తెలుసుకొంటారో, వారికి ఈఅనుభవం దక్కుతుంది. దానికోసం మనం, మన కనుబొమల మధ్య దృష్టిని కేంద్రీకరించి, ధ్యానం చేయవలసి వుంటుంది.
ఈశ్లోకం ధ్యానాన్ని వివరించేదికూడా. దీన్ని పూర్తిగా పరిశీలిద్దాం. (ఇవి శ్రీ తత్త్వవిదానందసరస్వతి స్వాములవారు వివరించిన ధ్యాన పద్ధతులు).
ధ్యానం:1: మీరు కదలకుండా, సుఖవంతంగా కూర్చోండి. వెన్నెముక, మెడ, శిరస్సు, ఒకేరేఖలో, నిలువుగా వుంచండి. కనులను అర్థనిమీలితం (సగంమూవ్సి) చేసి, చిరునవ్వును మీ పెదాలపె వుంచండి(ప్రదర్శించండి). ఈచిరునవ్వు మీలోపల ద్వందాలకు సమస్థితిని తెలియజేస్తుంది. (మిమ్ములను ఏమానసికమైన ఒడిదుడుకులూ ఏమీచేయ లేవని తెలియజేస్తుంది.) మీకనులను దగ్గరగా లాగి, అరమూతలతో వున్న మీకనులను మనస్సుతో గమనించండి. మీకనులను గమనిస్తున్న మీమనస్సును గమనించండి. నెమ్మదిగాల్ మనస్సును దాటివెఌ, (మనస్సునుండి విడివడి) మనస్సును గమనించండి. ఒకవేళ ఆలోచనలు వస్తే రానీయండి. వాటిని అంచనావేయకండి, అసలు గుర్తించకండి. ఆలోచన పోతే, పోనీయండి. ఎప్పుడైతే మీరు మనస్సును గమనించడం మొదలుపెట్టారో, అప్పుడది నిశ్శబ్దమౌతుంది. (పనిచేయడం మానేస్తుంది, ఆలోచనలు ఆగిపోతాయి). అలాగే సాధన కొనసాగిస్తే, గమనించడానికి మనస్సు వుండదు. మిమ్మల్ని మీరే గమనించుకుంటారు. ఇదే అంతఃశ్శాంతి. (అమనస్కయోగము).
ధ్యానం:2: ఆతర్వాత 'శాంభవీముద్ర'. "అంతర్లక్ష్యం బహిర్ దృష్టిర్నిమేషవర్జిత సాముద్రా శాంభవీ" కళ్ళనుతెరచి, కనురెప్పలు వాల్చకుండా, మనస్సును మీలోపల కేంద్రీకరించండి. రెండుమూడుసార్లు కళ్ళని మూసి తెరవండి. ఆతర్వాత ఎదురుగా దృష్టిని సారించండి. కాని ఎదురుగా వున్నదాన్ని చూడకండి. (గమనించకండి). మీమనస్సును మీలోపలకు కేంద్రీకరించండి. మీకు వీలైనవంతవరకూ కళ్ళను ఆర్పకండి. అలా చేస్తున్నప్పుడు మీరు, దృష్టికి, ద్రష్టకు (చూపుకు, చూసేదానికి) తేడాలేని స్థితిని పొందుతారు. అప్పుడు ఆత్మయొక్క పూర్తి ఎరుక మాత్రమే వుంటుంది. ఇటువంటి బేధరహితమైన దృష్టి (సమస్థితి) యే కాశి. ఈవిధమైన సాధన అంతశ్ఛేతననూ, అంతశ్శాంతిని నెలకొల్పుతుంది. మనస్సును దాని ఇష్టంవచ్చినట్లు వదిలేస్తే, అది మనలను వెర్రివాళ్ళను చేస్తుంది. సాధనచేస్తే, అది మనకు లొంగి, మనంచెప్పినట్లు చేస్తుంది. ఆవిధంగా లభించిన అంతశ్శాంతియే శివుడు. అంతులేని ఆనందము. ఇదే మన సహజస్థితి. దీనినే మనం పొందవలసినది.
ధ్యానం:3: నిటారుగా కూర్చుని, చేతులు తొడలపై పెట్టుకోవాలి. నేత్రాలను సగం మూయండి. పెదాలపై చిరునవ్వును పెట్టండి. ఆనవ్వును మీలో అంతర్గతమవ్వనివ్వండి. (మీమనస్సులోకి పంపించండి). దీన్ని ఎప్పుడూ వదలకండి. మీకళ్ళను గమనించండి. కళ్ళలో కొద్దిపాటి కదలికలు సామాన్యమే. ఎందువల్లనంటే, దృష్టియే కాలము, అనగా అస్థిరము. మీకనుపాపలను దగ్గరగాలాగి, అంతర్ దృష్టిని రెండు కనుబొమలమధ్య నున్న భృకుటిపై కేంద్రీకరించండి. అలామూసిన కనులతో, భృకుటిని గమనిస్తూవుంటే, ద్రష్ట దృశ్యము, అనగా చూచునది, చూడబడేది, దృష్టి అనగా చూచుటలో లయించిపోతాయి. ఇదే ఇతరము లేమియూలేని పూర్తి ఎరుక. ఇది తనపై తాను కేంద్రీకరించుకున్న, భేదంలేని శుద్ధమైన ఎరుక.(స్వస్వరూపజ్ఞానం). అదే కాశీ. నీవు అహంకారము, మనస్సు, శరీరము, కర్త, కావు. నీవే ఆప్రకాశమైన ఎరుకవు. కాశీవి. నీవే శివుడవు(పరమాత్మవు).
ఆత్మ, కాలదూరములు, పరిణామములేని ఎరుక. అది ఛేదము, భేదము లేనిది. అది భౌతికస్పృహ కానిది. ఎటువంటి వ్యక్తిత్వము లేనిది. అది సత్-చిత్, స్వస్వరూపజ్ఞానం కలది. అది ఎటువంటి లోపము (కొరత) లేని పరిపూర్ణము. అది జ్ఞానేంద్రియములను చైతన్యపరచి, శరీరంలో జీవంపోస్తుంది. నిశ్శంకోచంగా నేను శివుడను. "చిదానంద రూపః శివోహం, శివోహం" నేను పూర్తి ఎరుకగల పవిత్రమైనవాడను, శివుడను, పరమాత్మను.
ధ్యానం చివరలో కాస్త వెసులుబాటుగా కూర్చుని, కొద్దిసేపు కళ్ళను మూసి వుంచండి. తర్వాత నెమ్మదిగా కళ్ళను తెరవండి. ఈవిధంగా ఈధ్యానప్రక్రియలను ప్రతిరోజూ 15 నిముషాలపాటు, కనీసం 41 రోజులపాటు క్రమంతప్పకుండా సాధన చేయండి. మనస్సు కదులుతూవుంటే, (ఆలోచనలు వస్తూవుంటే), జాగ్రదావస్థలో విషయాలను కలుగజేస్తుంది. విషయములు నిజంకావు. కాని అజ్ఞానంవల్ల నిజములుగా భ్రమింపజేస్తాయి. మనం విషయాలకు లోబడి, ఆసక్తి కలిగియుంటే, అవి నిజం కాదని తెలుసుకోలేము. ఎప్పుడైతే ఒక్కసారి మనం జాగ్రదావస్థలోని విషయాలపట్ల నిర్లిప్తత వహించి, అంతశ్శాంతిని పొందామో, అప్పుడు ఈవిషయాలపట్ల మనం ఏమీ చేయనవసరంలేదు. అవి వస్తూ, పోతూ వుంటాయి. అవి వాటి లక్షణంప్రకారం ప్రవర్తిస్తూ, పోతూవుంటాయి. మీలక్ష్ల్యం మీలోని శుద్ధమైన ఎరుక. ఈఅసత్య విషయాలు కావు. ఇదే స్వస్వరూప జ్ఞానం. అప్పుడు నిన్ను నీవు శివుని(పరమాత్మ)గా తెలుసుకుంటావు. ఇదేనిజమైన కాశీయాత్ర.
శ్లో॥5॥ కాశీక్షేత్రం శరీరం, త్రిభువనజననీ వ్యాపినీ జ్ఞానగంగా,
భక్తిః శ్రద్ధాగయేయం, నిజగురుచరణధ్యానయోగః ప్రయాగః।
విశ్వేశోయం తురీయః సకలజనమనఃస్సాక్షిభూతోన్తరాత్మా,
దేహేసర్వం మదీయే యదివసతి పునస్తీర్థమన్యత్కిమస్తి॥
తా॥ ఈశరీరమే ముఖ్యతీర్థాయాత్రాస్థలమైన కాశి. సర్వవ్యాపితమైన జ్ఞానప్రవాహమే త్రిభువనమాత అయిన గంగ. శ్రద్ధ, నమ్మకములే గయాపట్టణము. సద్గురువుల చరణ ధ్యానయోగమే ప్రయాగ. నాల్గవది అయిన ఆత్మయే విశ్వేశ్వరుడు. ఈశరీరంలో అధిష్టానమై, అంతఃకరణకు సాక్షి అయిన ఆఆత్మ అన్ని ప్రాణులలోనూ ఉంటుంది. (ఆత్మవత్ సర్వభూతాని). అలాగ అన్నియూ ఈదేహములోనే ఉండగా, వేరే తీర్థయాత్రలు చేయవలసిన అవుసరమేమున్నది?
ఈశ్లోకం 'స్రగ్ధర' అనే చంధస్సులో వున్నది. వేదాంతంలో 'నహినిందాన్యాయం' అనే న్యాయంవుంది. "నహినిందా నింద్యంనిందితం అపితు స్తుత్యంస్తోత్రం" అక్కడ నిందయొక్క ఉద్దేశ్యం నిందించడం కాదు, స్తుతించడమే! (దీనినే 'నిందాస్తుతి' అనికూడా అంటారు.) పైకి కవి నిందిస్తున్నట్లు కనబడినా కవిభావన మాత్రం దాని కీర్తిని పెంచడమే, తగ్గించడం కాదు.
ఒకప్పుడు శ్రీరామకృష్ణపరమహంసను, మీరు కాశీయాత్ర చేస్తారా, అని అడిగితే, నాకు ఆసక్తిలేదు, ఎందుకంటే, నాహృదయంలోనే శివుణ్ణి చూస్తున్నాను, అని బదులిచ్చారట.ఆయన వారిశిష్యులకు తీర్థయాత్రలు చేసేబదులు, వారి హృదయంలో మొక్కవోని శ్రద్ధాభక్తులు కలిగియుండాలని ప్రభోదించారు. వారు తీర్థయాత్రలను తక్కువచేయకుండా, ఏదైతే ముఖ్యమో దాన్ని తెలియజేశారు.
యాత్రీకులు సాధారణంగా కాశితోపాటు గయ, ప్రయాగకూడా సందర్శిస్తారు. శ్రీశంకరులవారు ఈమూడింటినీ ప్రతీకలుగా చెప్పారు. ఈశరీరమే పవిత్రమైన కాశీనగరం. కాశీలో గంగ ప్రవహించినట్లే, ఈదేహములో చైతన్యం ప్రవహిస్తూవుంటుంది. గంగ, స్వర్గమర్త్యపాతాళలోకాలలో ప్రవహిస్తూవుంటుంది కాబట్టి, గంగను 'త్రిలోక సరిత్తు' అని పిలుస్తారు. స్వర్గంలో ప్రవహిస్తుంది కాబట్టి మందాకిని అంటారు. అలాగే ఏదైతే చివరికి తెలుసుకోవాలో ఆ ఆత్మ, జాగ్రత్స్వప్నసుషుప్తులనే మూడు అవస్థలకూ సాక్షిగా ఈ శరీరంలో వుంటుంది.
శ్రద్ధ అనగా జ్ఞానసముపార్జనపై ఆసక్తియే గయ. గయలో ప్రజలు శ్రార్థము, పితరులను సంతృప్తిపరచు కర్మలను చేస్తారు. "శ్రద్ధయా కృతం శ్రార్థం" అది ప్రేమ, శ్రద్ధతోటి చేయాలి కాబట్టి 'శ్రార్థం' అనబడింది. సాధారణంగా యాత్రీకులందరూ ఈకర్మకాండను చేస్తారు. కాని, ఈశ్రార్థము పూజాదులవలె పవిత్రము, శుభము కాదనే తప్పుడు అభిప్రాయముతో వుంటారు. మృత్యువుపట్ల వారికున్న భయమే ఇటువంటి తప్పుడు అభిప్రాయానికి మూలహేతువు. మృత్యువుతో సంబంధమున్న ప్రతీదానినీ అసహ్యించు కొంటారు. కాని మృత్యువుకూడా జననంలాగా సహజమే! ఒకసారి ఒక దుఃఖితురాలైన మహిళ, తన కొడుకును బ్రతికించమని బుద్ధభగవానుని ప్రార్థించింది. దానికి వారు, ఆమృతదేహాన్ని బ్రతికించగలనని, అందులకుగాను, మృత్యువులేని గృహంనుండి గుప్పెడు బియ్యం తీసుకురమ్మని చెప్పారట.ప్రార్థన లాగే శ్రార్థముకూడా పవిత్రమైనదే. అందులో మనం భగవంతుని పితరుల రూపంలో కొలుస్తాము.
ధ్యానమే ప్రయాగ. గంగ, యమున, అదృశ్యవాహిని సరస్వతి, మూడునదుల సంగమము. అలాగే, ఆపరమాత్మ పాదాలకడ, తమ శరీరము, బుద్ధి, అహంకారాదుల న్నింటినీ సమర్పించి, ధ్యానంలో స్వస్వరూపజ్ఞానం పొందుతారు. ఆపరమాత్మే, సద్గురువుగాను, ఆత్మగాను, దర్శనమిస్తాడు. చివరిగా పరమాత్మ, గురువు ఆత్మతో ఏకీకృతమౌతారు. పాదాలపై ధ్యానమనగా, శరణాగతి, ఆత్మసమర్పణము.
జిజ్ఞాసువు, సాధకుడు, తనలోని అంతశ్శాంతికి బద్ధుడై, తన ఆత్మకే సమర్పితమౌతాడు. అదే ధ్యానయోగం. ఇందులో, తాను అంతఃకరణ అనుకునేది, అందులో ప్రతిఫలించే నిజమైన 'నేను'తో సంయోగిస్తుంది కాబట్టి, ఇది 'యోగం'. ఈయోగమే 'ప్రయాగ'.
ఆత్మ, తురీయము, నాల్గవది. అది జాగ్రత్స్వప్నసుషుప్తులలో వున్న ప్రతీదాన్నీ ప్రకాశింపజేసి, పరిణామక్రమాన్ని తీసుకొస్తుంది. జాగ్రదావస్థలోని విషయాలు ఆత్మను ప్రభావితం చేయలేవు. ఆత్మ ఎటువంటి విషయానికీ అంటుకోదు. అవస్థలు ఆత్మకు సంభవించవు. దివారాత్రాలు సూర్యునికెట్లా లేవో , అలాగే అత్మకుఏవీ సంభవించవు. ఆ తురీయమే, చిట్టచివరిదే, శివుడు, పరమాత్మ. మనస్సును గమనించడం మొదలుపెడితే, ఎరుకను గమనించడం మొదలవుతుంది. అప్పుడు నీవు శరీరివి కావు. ఈ శరీరజ్ఞానానికి (భౌతికజ్ఞానానికి) అతీతమైన శివుడు, పరమాత్మవి.
శివుడే విశ్వేశ్వరుడు. విశ్వానికి ప్రభువు. విశ్వముకూడా జాగ్రదావస్థలో వున్న విషయమే! మనం, స్పర్శ, రుచి, వాసన, దృష్టి, శ్రవణాదుల ద్వారా అనుభవించేదే విశ్వము.(ప్రపంచము).దానికి ప్రభువెవ్వరు? 'నేను' అనే స్వస్వరూప సంపూర్ణఎరుకయే ప్రభువు. ఆకాశి, శివుడు, పరమాత్మయే నీవు. నీలోలోపల, అంతరాత్మలో శివుడు, పరమాత్మ కొలువైవున్నాడు. తనలోవున్న ఈ అంతరాత్మను తెలుసుకొనుట ఎట్లు? నేను శరీరాన్ని, పనులుచేసే శరీరాంగాలను, జ్ఞానేంద్రియాలను, అంతఃకరణను కాను, అని తెలుసుకోవాలి. ఎటువంటి వాసనలూలేని, దేనికీ ప్రభావితంకాని, నిర్మలమైనవాడిని 'నేను' అని తెలుసుకోవాలి. ఇదే సత్యానికి మార్గము. ఎప్పుడైతే దీనిని తెలుసుకున్నామో, అప్పుడు మనం ఆ నిర్మలమైన అంతరాత్మలో లయమౌతాము. ఆఅంతరాత్మయే మనస్సుకు సాక్షిగా మారుతుంది. ఎలాగ, ఒక సూర్యుడు లక్షలాది వానచినుకులలో ప్రతిఫలిస్తాడో, ఒకే విద్యుశ్ఛక్తి బల్బులను వెలిగిస్తుందో, అలాగ ఈ అంతరాత్మే సకలజీవరాశులలోనూ ప్రతిఫలిస్తూ వుంటుంది. శివుడు(పరమాత్మ), భవాని, గంగ, గయ, ప్రయాగ అన్నీ ఈశరీరంలోనే వున్నాయి. ఇంకా దీన్ని దేనితో పవిత్రీకరించాలి? పవిత్రీకరించేది తీర్థము. మనలను శుద్ధిచేసేవి వేరే ఏమీలేవు. సూతసంహిత "ఆత్మతీర్థం పరంతీర్థం" అని చెప్తోంది. మనుజులు శుద్ధి, పవిత్రత చెందాలని, దేవుళ్ళను, తీర్థాలను వెతుక్కుంటూ తిరుగుతారు. కాని వారు అన్నిటికంటె పవిత్రమైన కాశి ఆత్మరూపంలో తమలోనే వున్న విషయాన్ని తెలుసుకోరు. కొంతమందిని ప్రోగుచేసుకొని, ఒక టూరిస్టు బస్సులో వివిధ తీర్థయాత్రా స్థలాలు పర్యటించడంతో సరిపోదు. అది దేశసమైక్యతకు పనికి వస్తుందేమోగాని, తనని తాను తెలుసుకొనుటకు పనికిరాదు. జిజ్ఞాసువు, తీవ్రసాధకుడు, తనలోని అంతశ్శాంతిని, ఆనందాన్ని, యోగముద్వారాగాని, లేదా ఈ "కాశీపంచకము"లో వున్నటువంటి, ఊహకందనటువంటి యదార్థములను గుర్తించుట(అనుభవించుట)ద్వారా గాని పొందాలి. ఇదియే నిజమైన "కాశీయాత్ర".
"హరిః ఓం తత్సత్"
శ్రీకృష్ణార్పణమస్తు.