"ముందుమాట"
అందరికీ నమస్కారం. నేనుగతంలో బ్రహ్మసూత్రములను చదవాలని కోరుకున్నాను. అప్పుడు నాకు శ్రీనోరి శ్రీనాథవెంకటసోమయాజులు గారి "బ్రహ్మసూత్రదర్శనము" లభించింది. వారు చాలా గ్రంథములు, భాష్యములు, సూత్రములు వగైరాలెన్నియో పరిశీలించి, చాలాగొప్పగా బ్రహ్మసూత్రము లకు వివరణలు యిచ్చారు. నిస్సందేహంగా చాలా గొప్ప రచన. కాని, ప్రస్తుత సామాజిక పరిస్థితులలో అంతటి గంభీరమైన భాషను చదివి, అర్థంచేసుకునే విధంగా ప్రజానీకం ఉన్నారా? అనే ప్రశ్న ఉదయించింది. ఇంకాస్త తేలికగా, వాడుకభాషలో వివరణ వుంటే బాగుంటుంది అని నా మనస్సుకుఅనిపించింది. కాని నేనుఅంతటి విద్యావంతుడను కానందున,ఎటువంటిప్రయత్నము చేయలేకపోయాను. కొంతకాలానికి, నాకు ఫేస్ బుక్ లో "పరశురామం" గ్రూపులో, శ్రీమతి చెల్లూరి విజయలక్ష్మిగారు పోస్టు చేసిన బ్రహ్మసూత్రముల వివరణ నాకుకనపడింది. వారు బ్రహ్మసూత్రములకు చాలా తేలికభాషలో, సామాన్య ప్రజానీకానికి కూడా సులువుగా అర్థమయ్యే భాషలో వివరించారు. అప్పుడు ఇన్నేళ్ళ నాఅన్వేషణకు తగినసమాధానం, ఫలితం కనిపించిందని అనుకున్నాను. అంతకు ముందే నేను, బ్రహ్మజ్ఞానానికి, తత్త్వవిచారణకు సంబంధించిన కొంత సమాచారం "తత్త్వవిశ్లేషణ" అనే నా వెబ్ సైట్ లో పొందుపర్చాను. కాని బ్రహ్మసూత్ర వివరణ కూడా అందులో చేర్చితే, అది సంపూర్ణమవుతుంది, అనే భావన ఉండేది. ఇప్పుడు శ్రీమతి చెల్లూరి విజయలక్ష్మిగారు వివరించే బ్రహ్మసూత్రాలను నా వెబ్ సైట్ లో ఉంచితే చాలా బాగుంటుందన్న భావన వచ్చింది. తదుపరి శ్రీమతి విజయలక్ష్మిగారిని ఫోనులో సంప్రదించి, వారు రోజుకొక సూత్రంగా వివరిస్తున్న బ్రహ్మసూత్రములను ఒకే సంపుటంగా ఎడిట్ చేసి, కోరిన జిజ్ఞాసువులకు అందించుటకు, నా తత్త్వవిశ్లేషణ వెబ్ సైట్ లో పొందుపర్చుటకు, వారి అనుమతి కోరాను. వారు ఎంతో విశాల హృదయంతో, నాకోరికను మన్నించి, అనుమతిని దయచేశారు. అందులకుగాను వారికి నేను అనేకానేక కృతజ్ఞతాభివందనములు తెలియ జేస్తున్నాను. ఈమహా యజ్ఞమునకు శ్రీమతి చెల్లూరి విజయలక్ష్మిగారు మూల స్తంభము వంటివారు. కాబట్టి వారికి ప్రథమ తాంబూలం ఇవ్వాలి. ఎందుకంటే ఎంతో లోతుగా అన్వేషిస్తేనే గాని బ్రహ్మసూత్ర వివరణ చెయ్యలేరు. శ్రీమతి విజయలక్ష్మిగారు ఎంతగా శ్రమించారో, నేను అవగతం చేసుకున్నాను. కాబట్టి ప్రప్రథమంగా వారికి నా కృతజ్ఞతాభి వందనములు, ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను.
నేను ముందర, శ్రీమతి విజయలక్ష్మిగారు ఫేస్ బుక్ లో పెట్టే బ్రహ్మసూత్రాలను ఏరోజుకారోజు మాయొక్క "సుబోధ" వాట్సప్ గ్రూప్ లో పెట్టేవాడిని. వాటన్నింటినీ భద్రపరచి, మళ్ళీ వాటిని గంపగుత్తగా నాకు పంపించారు శ్రీమతి బండి భ్రమరాంబగారు. వారు కూడా బ్రహ్మజ్ఞానులు, నిరంతర యోగాభ్యాసకులు. కాబట్టి వారు వీటిని ఇంత జాగ్రత్తగా కాపాడి, తిరిగి నాకు పంపించారు. లేకపోతే ఈపనిని నేను చేసి ఉండేవాడిని కాను. కాబట్టి దైవప్రసాదిత సహోదరి, శ్రీమతి బండి భ్రమరాంబగారికి నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏమిటంటే, సాధ్యమైనంత వరకూ అక్షరదోషాలు లేకుండా జాగ్రత్త పడినాను. వయోభారంవల్ల ఎక్కువ శ్రద్ధ పెట్టలేక పోయినాను. ఏమైనా అక్షరదోషాలు వుంటే మన్నించి, సరిచేసుకొని చదువుకొనవలసినదిగా ప్రార్థన.
ఇక చివరిగా, అతి ముఖ్యమైనది ఏమిటంటే, నాకు ప్రతీ విషయంలోను మార్గదర్శిగా వ్యవహరించి, వెన్నుదన్నుగా నిలచి, తగు సలహాలనిచ్చి, ప్రోత్సహించి, నన్ను ముందుకు నడిపిన ప్రాణమిత్రులు శ్రీకాశావజ్ఝల వెంకటనరసింహ మూర్తి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు, ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ఇంతమంది, వారివారి పంథాలలో ఎంతో కృషి చేస్తేనే ఈ బృహత్కార్యం పూర్తయిందని, చదువరులు గ్రహించకోర్తాను.
ఈ మహత్కార్యంలో పాల్గొన్న ప్రతీవారికీ, చదువరులకు ఆ పరమాత్మ బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కలిగించి, జీవన్ముక్తి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ఇట్లు,
బుధజనవిధేయుడు.
శ్రీరామ జయరామ జయజయ రామ
బ్రహ్మ సూత్రములు
ఉపోద్ఘాతం
బ్రహ్మసూత్రాలను సూత్రప్రాయంగా చిన్న చిన్న మాటలలో చెప్పడం వలన దానికి భాష్యాలు వస్తే కానీ అర్ధం కావని వాటిని ఎవరో మహాత్ములు మాత్రమే అర్ధం చేసుకోగలరు కానీ సామాన్యులకు సాధ్యం కాదు. వేదాంతమార్గంలో ఉన్నవారు వాటిని అర్ధం చేసుకుని అనేక రకాల భాష్యాలు రచించడం జరిగింది. ఇప్పటికీ భాష్య రచనలు వస్తూనే ఉన్నాయి. శంకరాచార్యులకన్నా ముందు బ్రహ్మసూత్రాలకు భాష్యం వ్రాయడం జరిగింది. శ్రీగోవిందపాదాచార్యుల ఆదేశంతో శ్రీశంకరాచార్యులు కాశీ క్షేత్రం వెళ్లి బ్రహ్మ సూత్రాలకు భాష్యం వ్రాశారు. అంతకు ముందు 10 మంది వరకు భాష్యం వ్రాశారు. ఒక మహాత్ముడు అందరూ వ్రాషిన భాష్యాలు పరిశీలించి, శంకరుల భాష్యం ఒక్కటే అనుకూలంగా ఉందని ప్రశంశించారు. అదే పరమతాత్పర్యం అని వర్ణించబడింది. గోవిందపాదాచార్యులు అద్వైతమతానికి పునాది వేస్తే దానిని శంకరులు అద్వితీయంగా వ్యాప్తి చేశారు. వారి కృషిని, మేధాశక్తిని, పరిశీలనా శక్తిని పాశ్చాత్యులు ఇప్పటికి ఆశ్చర్య పోతుంటారు. ఇంతటి మేధాశక్తి గల ఈమహాత్ముడు చెప్పిన మార్గాన్ని అనుసరిస్తూ వేదాలకు అంతంలో ఉన్న ఉపనిషత్తులయొక్క భావాలను సమన్వయం చేస్తూ అద్భుతంగా అందించిన గ్రంథం బ్రహ్మసూత్రములు. ఇవి కేవలం ఉపనిషత్తుల మీద ఆధారపడి ఉన్నాయి. ఏ పురాణాలు ఇతిహాసలమీద ఆధారపడి లేదు. శృతులలో ఉన్న వైరుధ్యాన్ని తొలగించడానికి బ్రహ్మసూత్రాలు రచించడం జరిగింది. బ్రహ్మసూత్రాలు ఎలా వచ్చాయి? ఎక్కడ నుండి తెచ్చారు? వేదం చెప్పిన మార్గాన్ని అనుసరిస్తూ మనకు షట్ దర్శనాలు వచ్చాయి. వేదాంతచర్చ అంతా దీనిలోని ఉంది .వాటికి ఎక్కువ ప్రచారం లేకపోవడం వలన వాటి జోలికి ఎవరు పోవడం లేదు. 1.వైశేషిక దర్శనం:-కణాద మహర్షి, 2.న్యాయదర్శనం:-గౌతమ మహర్షి , 3.సాంఖ్య దర్శనం:-కపిల మహర్షి , 4.యోగదర్శనం :-పతంజలి మహర్షి , 5.పూర్వ మీమాంస :-జైమిని మహర్షి 6.ఉత్తరమీమాంస:-వేదవ్యాసమహర్షి రచించారు. పూర్వమీమాంస కర్మకాండకు, సంబంధించినది. 5 దర్శనాలలో కర్మకాండ గురించి వివరించి 6వ దర్శనం నుంచి జ్ఞానకాండ మొదలైనది. 5 దర్శనాలు చక్కగా పరిశీలించి, విశ్లేచించి, విచారణచేసి, గ్రహించి వేదవ్యాసుడు ఉత్తర మీమాంస సూత్రాలు అధ్యయనం చెయ్యడం జరిగింది. ఇవి కేవలం ఉపనిషత్తుల మంత్రాల మీద ఆధారంగాచేసుకొని, ఉత్తర మీమాంస జ్ఞానకాండకు జీవన్ముక్తిని మోక్షాన్ని అందించడమే వీటి ప్రధాన లక్ష్యం. వేదాంత శ్రవణం పాపహరణం అన్నట్లుగా వేదాంతం వినడం కూడా గొప్ప విషయమే. పూజలు, యజ్ఞయాగాది క్రతువులు, నోములు, వ్రతాలు, రకరకాల కర్మలు పుణ్యం కోసం చేస్తూ ఉంటాము. పుణ్య కర్మలు చేస్తే పుణ్య ఫలాలు అనుభవిస్తారనడంలో సందేహం లేదు. అది గొప్ప విషయమే. ఉపనిషత్తులు నీవు పరమాత్మవే అని తెలియజేస్తున్నా మోక్షాన్ని అందుకోవడం సాధ్యం కాదనీ, జ్ఞానం అందుకోవడం వీలయ్యే పని కాదనీ, జ్ఞానబోధ చేసేవారు లేరనీ, తెలుసుకునే తీరికలేక వినలేమనీ, లౌకిక వ్యవహారాలలో ఎప్పుడు బిజీగా ఉంటున్నామనీ చాలా మంది చెబుతుంటారు. ఆ పుణ్యకర్మలన్నీ చేస్తే ఎంత పుణ్యమో, వేదాంతం వింటే అంత పుణ్యం. ఎందుకంటే వాసనా క్షయం పాపహరణం, వేదలు ఉపనిషత్తులు ఏమి చెప్పినా నీవు పరమాత్మవే తత్త్వమసి అనే చెబుతాయి. మోక్షస్థితిలో నిలిచిపోవాలి అనుకునే వారికి వేదాంత శ్రవణం చేస్తుంటే తన యదార్ధ స్వరూపం తెలుసుకొని, తాను పరమాత్మను అనే భావం వస్తుంది. ప్రతి నిత్యం శ్రవణం చెయ్యడం వలన క్రమంగా నేను దేహాన్ని అనే భావన తొలగిపోయి నేను పరమాత్మను అనే భావన స్థిరపడుతుంది. వాసనా క్షయం పాపహరణం, వేదాంతం వింటే మోక్షం వస్తుంది. ఒకవేళ ఏదో రకంగా మనసు నిలకడగా లేకపోయినా, చెవుల్లో ఆ శబ్దాలు పడతాయి కనుక అది పాప హారణమే. ప్రతి రోజు శ్రవణం, ధ్యానం చేస్తుంటే ఆభావన స్థిరపడుతుంది. బ్రహ్మాన్ని గురించి సూత్రప్రాయంగా తెలియజేసేవి, పరమాత్మ తత్త్వాన్ని తెలియజేసేది, బ్రహ్మతత్త్వాన్ని తెలియజేసేది బ్రహ్మసూత్రాలు. ఉత్తర మీమాంసకు వేదాంత మీమాంస అని పేరు. ఈ బ్రహ్మసూత్రాలు ఎందుకు చెప్పవలసి వచ్చింది? ప్రతి మనిషి పుట్టినస్థితి నుంచి చివరి క్షణం వరకు తాను పొందబోయే ఆనందం గురించి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. 1.ఆనందం కోసం కొందరు మణులు, రత్నాలు జాతి రాళ్లు ధరిస్తారు. 2.కొందరు మంత్రాలను ఉపదేశం పొంది మంత్రసిద్ధి సాధిస్తారు.3.కొందరు నోములు, వ్రతాలు, వైదిక కర్మలు ఆచరిస్తూ పురాణాలు, ఇతిహాసాలు వింటూ ఉంటారు. కొందరు జపధ్యానాలు, సత్కర్మలు చేస్తూ ఆనందం పొందుతారు. శాశ్వతమైన, అఖండమైన, అనంతమైన, ఆనందం మోక్షనందమే. అందులో ఉండే ఆనందం మోక్షానందం అనుభవించే వారికి తెలుస్తుంది. రకరకాల కర్మల వలన ఆనందం వస్తుందో రాదో తెలియదు కాని కర్మఫలాలు మాత్రం వస్తాయి. దానిని అనుభవించడానికి జన్మలు రావడం మరల కర్మలు చెయ్యడం, పునరపి మరణం పునరపి జననం ఈ జననం జనన మరణ చక్రంలో బంధీలౌతారు. ప్రవహించే నదిలో ఒక సుడిగుండం నుండి తప్పించుకొని మరియొక సుడిగుండంలో చిక్కుకునే కీటకంలా మానవుడు కూడా ఒక జన్మ నుండి మరొక జన్మకు కర్మ బంధాలతో చిక్కుకొని మార్గం చెప్పేవారు లేక, రకరకాల కష్టాలతో అశాంతితో గడిపేస్తున్నారు. జన్మ దుఃఖం, జరా దుఃఖం నుండి తప్పించుకోవడానికి బ్రహ్మజ్ఞానం పొంది, అహం బ్రహ్మాస్మి స్థితికి చేరుకునే ప్రయత్నం చెయ్యడమే సాధకుడి కర్తవ్యం. శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వగలిగే జ్ఞానం ఉపనిషత్తులు, వేదాలు పరిశీలించి అర్ధంచేసుకుని బాదరాయణుడు వేదవ్యాసులు సూత్రం రూపంలో అందించిన జ్ఞానమే బ్రహ్మసూత్రాలు. సామాన్యమైన మానవుడు ఉపనిషత్తులన్నింటిని శ్రవణం చేయడం అధ్యయనం చెయ్యడం సమన్వయపరచుకొని నిశ్చయించుకోవడం అసాధ్యం. అనేకమైన ఉపనిషత్తులు అత్యంత గాఢమైన భావాలనువ్యక్తం చేసినందువలన, ఆ మంత్రాల భావాలను అర్ధం చేసుకోలేరు. ద్వాపర యుగంలో మనిషి ఆయుర్దాయం 200 సం. ఉంటే అది కలియుగంలో 100 సం. క్షీణించి, బాల్యం ఆటపాటలు, విద్య వివాహం, లౌకిక వ్యవహారాలతో సగం వయస్సు తరిగిపోతే, మిగిలిన 50 సం. ఎప్పుడు మృత్యువు వస్తుందో తెలియని అయోమయ స్థితిలో ఉపనిషత్తులు అధ్యయనం చేసి మోక్షప్రాప్తికై తపిస్తూ సాధన చెయ్యడానికి వయస్సు సరిపోదు. అయినప్పటికీ సాధన ప్రారంభిస్తే అది మరుజన్మలలోనైన మోక్షప్రాప్తి సిద్ధిస్తుంది. బాదరాయణుడు, వ్యాసులవారు ఒక్కరేనా? అనే విషయం పై భిన్నాభిప్రాయలు వాదోపవాదనలు ఉన్నాయి. వేదవ్యాసులవారు, బాదరాయణుడు ఒక్కరేనని కొందరు, బాదరాయణుడు ఆవహించి వ్యాసులవారిచే బ్రహ్మసూత్రాలు వ్రాయించారని కొందరు, వ్యాసులవారికే మరో పేరు బాదరాయణుడని కొందరు వారి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. బ్రహ్మసూత్రాలు వంటి మహత్తర గ్రంధం రచించడం సామాన్య విషయం కాదనీ, త్రికాల జ్ఞానం కలిగినవారు, అత్యంత జ్ఞాననిది కలిగినవారు, విష్ణుస్వరూపుడైన వాడు, లక్షశ్లోకాలతో మహాగ్రంధాలు, ఇతిహాసాలు వ్రాసినవారు, అఖండ చరిత్ర కలిగినవారు, విశాలబుద్ధి కలవారు, ధర్మనిధి, వేదాలను రచించిన వారు, పరమ జ్ఞాన స్వరూపుడైన వేదవ్యాసునికితప్ప మరొకరికి బ్రహ్మసూత్రాలు రచించడం సాధ్యమౌతుందా? ప్రస్థానత్రయం తెలుసుకుంటే మూడుమార్గాల్లో మానవుడు చేరుకోవలసిన గమ్యస్థానం మోక్షం అని అవగాహన కలుగుతుంది.1.ఉపనిషత్తులు, 2.బ్రహ్మ సూత్రాలు 3.భగవద్గీత. వాస్తవంగా మూడు కూడా జ్ఞానం గురించే బోధించాయి. ఈ మూడు.. మూడు మాజలీలు అనుకుందాం.
మొదటి మజిలీ:-ఉపనిషత్తులు శృతి ప్రస్థానం అంటారు. దీనిలో వేదాధ్యయనం నిత్యం నిర్వహించాలి.
రెండవ మజిలీ:-బ్రహ్మసూత్రాలు:-తర్క ప్రస్థానం:-దీనిలో ఉపనిషత్తులు తర్కించి, మననం చేసి విచారణ చెయ్యాలి.
మూడవ మజిలీ:-భగవద్గీత:-స్మృతి ప్రస్థానం:-ధర్మ శాస్త్రం ఇతిహాసాలు, పురాణాలు, శాస్త్రాలు, వేదంగాలు వాటిలో ఉన్న విషయాలు గుర్తు చేసుకొని చెప్పినదే భగవద్గీత.
1.మరల మరల స్మృతిని నిరంతరం వ్యాఖ్యానం చేస్తూ ఆత్మ చైతన్యంతో బుద్ధి నిలిపి నిధి ధ్యాసలు చెయ్యాలి. ఉపనిషత్తులు గురుముఖతః శ్రవణం చెయ్యాలి.2.విన్న దానినిచింతన చేస్తూ ఉండాలి. 3.భగవద్గీత తో అన్యమైన ఆలోచనలు రాకుండా నిధి ధ్యాసలు చెయ్యాలి. ఈ మూడు ప్రస్థాన త్రయం తెలుసుకుంటే శ్రవణ మనన నిధి ధ్యాసలు చేస్తే మోక్షం లభిస్తుంది. ఉపనిషత్తులన్నింటిని నెత్తిన పెట్టుకొని మన శిరస్సులలోనికి బాగా ఎక్కించడం కోసం వేదవ్యాసులు బ్రహ్మ సూత్రాల ద్వారా అద్భుత ప్రయోగం చేశారు. ఈ ప్రస్థాన త్రయం అధ్యయనం అవగాహన చేసి అనుభూతి పొందగలిగితే కోటానుకోట్ల జన్మల నుండి వచ్చిన కర్మలన్నీ నశించి, మానవ జన్మ సార్ధకమౌతుంది. ఉపనిషత్తులు పరిపక్వమైన సాధకులకోసమనీ, బ్రహ్మ సూత్రాలు జిజ్ఞాస పరులైన వారికోసమని, భగవద్గీత సామాన్యమైన గృహస్తుల కోసమని చెబుతుంటారు. బ్రహ్మ సూత్రాలు చాలా క్లిష్టమైనవి, కష్టమైనవి, సూత్రాల రూపంలో ఉండటం వలన వాటిని విడమరిచి చెప్పడం చాలా కష్టం కనుక ఇవి జన సామాన్యంలో లేవు. బ్రహ్మ సూత్రాలు పూర్తిగా తెలుసుకునే అవకాశం ఉంటే ప్రస్థాన త్రయం పూర్తి చేసినట్లవుతుంది. సూత్రానికి ఉండే లక్షణాలు:-4 ,1.అల్పాక్షరం ..తక్కువ అక్షరాలు ఉండాలి.ఎంత చిన్న చందస్సయిన 32 అక్షరాలు ఉండాలి. మంత్రాలు పాదాలు 4 ఉండాలి. 2.సందేహాలకు తావు లేకుండా ఉండాలి. 3.సారవత్.అన్ని శాస్త్రాల సారం ఉండాలి. 4. విశ్వతోముఖం జ్ఞానానికి సంబంధించిన అన్ని విషయాలు చెప్పాలి. 5.సూత్రాల్లో పొల్లు మాటలు, అనవసర మాటలు ఉండకూడదు. 6..ఏ రకమైన దోషాలు లేనటువంటిది. ఎవరు తప్పు పట్టకుండా అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అది తప్పు అనకుండా దేనికి సంబంధించిన పదమో తెలుసుకోవాలి .ఈ 6 లక్షణాలు ఉంటే సూత్రం అంటారు. దీనిలో ఛందస్సు ఉండదు. ఇలాంటి సూత్రాలలో బ్రహ్మాన్ని తెలియజేస్తుంది కనుక బ్రహ్మసూత్రాలు అని పిలువబడింది. ఇంకా ఏమైన పేర్లు ఉన్నాయా? 1.బ్రహ్మ సూత్రాలు వేదాంత విషయాలు తెలియజేస్తుంది కనుక వేదాంత సూత్రాలు అని 2.ఆత్మకు ఉపాధి శరీరం కనుక ఆత్మజ్ఞానం తెలిజేస్తుంది కనుక శారీరక భాష్యం అని 3.ఆరు దర్శనాలలో చివరది ఉత్తర మీమాంస కనుక ఉత్తర మీమాంస సూత్రాలన్నారు. 4.బ్రహ్మ సూత్రాలు చింతన, సన్యాశ్రమానికి చెందినది కనుక భిక్షు సూత్రాలు అని పిలువబడ్డాయి. ఎవరు ఎలా భావించినా పరమాత్మ స్వరూప స్వభావాలు వివరించినటువంటి సూత్రాలు కావడం వలన బ్రహ్మ సూత్రాలకు భిన్నాభిప్రాయాలు లేవు. త్రిమతాచార్యులైన అద్వైతం.. శంకరాచార్యులు, విశిష్టాద్వైతం.. రామానుజా చార్యులు, ద్వైతం. మధ్వాచార్యుల వారు బ్రహ్మసూత్తములకు భాష్యం వ్రాశారు. శంకరుల భాష్యం ఒక్కటే ప్రచారంలో ఉండగా మిగిలినవి రెండు కనుమరుగైనవి. అభేదవాదం, భేదాభేదవాదం, భేదవాదం, శైవాద్వైతం, వీరశైవాద్వైతం, రకరకాల వాదనలున్నాయి. శ్రీశంకరచార్యులకు ముందు 10 మంది బ్రహ్మసూత్రాలకు భాష్యం వ్రాసినా శంకరుల భాష్యం రాగానే అవన్నీ అదృశ్యమైపోయాయి. శ్రీ శంకరుల తరువాత కూడా కొన్ని భాష్యాలు కొంతమంది వ్రాయడం జరిగింది. విశిష్టాద్వైత పరంగా శ్రీ రామనుజాచార్యులు శ్రీ భాష్యం, ద్వైత మతాచార్యులు శ్రీ మధ్వాచార్యులు పూర్ణ ప్రజ్ఞ భాష్యం, శైవ వైష్ణవ పరంగా శ్రీ కంఠుల వారి శైవ భాష్యం, వేద విశిష్టాద్వైత శ్రీపతి వారి శ్రీకార భాష్యం, అవిభాగాద్వైతం విద్యాభిక్షు వారి విజ్ఞానామృతం, భేదాభేదం భాస్కరాచార్యుల వారి భాస్కర భాష్యం, శుద్ధద్వైతం వల్లభాచార్యుల వారి అనుభాష్యం, మధ్వాచార్యులు వారి గోవింద భాష్యం.. వ్రాసినప్పటికి అన్నింటినీ పరిశీలించిన పండితులు శంకరుల భాష్యమే సూత్రాలకు అనుగుణంగా ఉందని అదే పరమ తాత్పర్యమని నిగ్గు తేల్చారు. శంకరుల భాష్యం అంత తేలిగ్గా అర్ధం చేసుకోవడం కష్టం. అంతా పూర్తిగా అర్ధం అయినట్లే ఉంటుంది. చాలా కష్టపడితేనే అర్ధం అవుతుంది. అది కొంత మందికి మాత్రమే అర్ధం అవుతున్నందున, ఆయన శిష్యులు అవి అన్నీ అర్ధం అయ్యేలా భాష్యం వ్రాయడం జరిగింది. వారిని అనుకరిస్తూ మరి కొంతమంది భాష్యాలు వ్రాయడం జరిగింది. అందువలన బ్రహ్మసూత్రాలు ఈ మాత్రమైన లోకంలో ప్రచారం కావడానికి కారణమయ్యాయి. శంకరుల ప్రధమ శిష్యుడు సదానందుడు పంచపాదిక అనే పేరు మీద శంకరులను అనుకరిస్తూ గ్రంధం వ్రాశాడు. శంకరులు సదానందుడు చాలా ప్రియమైన శిష్యుడు. వారికి నలువురు శిష్యులుండేవారు. మిగిలిన ముగ్గురూ సదానందుడిపై అసూయ చెందారు. అతనికి అంత విజ్ఞానం లేకపోయినప్పటికీ శంకరులు ఎందుకు ప్రియశిష్యుడిగా చూస్తున్నారో అర్ధం కాలేదు. అది గమనించిన శంకరులు ఒకరోజు కట్టెల కోసం గంగానదికి ఆవలి ఒడ్డుకు వెళ్లిన సదానందుడుని వెనక్కి వచ్చెయ్యమని సైగ చేశారు. గంగానదిలో వరద ఉధృతి ఎక్కువగా ఉంది. సదానందుడు అదేమి గమనించకుండా గురువు ఆజ్ఞ ప్రకారం గంగానదిలో అడుగులు వేస్తూంటే, అతని పాదాల క్రింద పద్మాలు వచ్చి మునిగిపోకుండా ఒడ్డుకు చేర్చాయి. అది అతని గురుభక్తికి తార్కాణం. అందుకే అతనికి పద్మ పాదాచార్యులు అనే పేరు వచ్చింది. మిగిలిన శిష్యులు వారి తప్పు తెలుసుకొని అతని గురుభక్తి ఎంత గొప్పదో గ్రహించారు. సదానందుడు తన భాష్యంలో నాలుగు సూత్రాలు మాత్రమే వ్రాశాడు. 555 శ్లోకాలలో 4 శ్లోకాలకే భాష్యం వ్రాశారని విమర్శించిన వారున్నారు. కొందరు పండితులు ఈ 4 సూత్రాలు చదివితే మొత్తం 555 శ్లోకాల భావం చదివినట్లేనని తెలియజేసారు. మండనమిశ్రుడు మహమేధావి అతని పేరు సురేశ్వరచార్యులు. అతను వ్రాసిన భాష్యం ప్రచారంలోకి రాదని, వచ్చే జన్మలో అతను వ్రాసినది ఆమోదయోగ్యం అవుతుందని శంకరులు అన్నారట. సురేశ్వరచార్యులు తరువాతి జన్మలో భామతీవ్యాఖ్య అనే పేరుతో భాష్యం వ్రాశారు. ౧౩వశతాబ్దంలో అమరానందుడు కల్పతరువు అనేభాష్యం, 16వశతాబ్దంలో అప్పయ్యదీక్షితులు పరిమళ అనే భాష్యం వ్రాశారు. సురేశ్వరచార్యులు భామతిని అమరానందుడు కల్పతరువు చేస్తే, అప్పయ్యదీక్షితులు పరిమళాన్ని అద్దాడు అని మధురంగా వ్యాఖ్యానించారు. కంచి కామకోటి పీఠాధిపతి అప్పయ్యదీక్షితులను 2వ శంకరులుగా అభివర్ణించారు. సంస్కృతంలో ఉన్న వ్యాఖ్యానాలు అర్ధం చూసుకోలేరు కనుక కొందరు వేద వేత్తలు తెలుగులో వ్యాఖ్యలు అందించడం వలన సంస్కృతం లాంటి గంగా ప్రవాహంలో కంఠం లోతు ప్రయాణించవలసిన మనలని నడుం లోతు వరకు తెచ్చారు. వీటిపై ప్రవచనాలు ఇస్తున్న కొంత మంది మహాత్ములు మనలని మోకాలి లోతు వరకు తెచ్చారు. ఆధ్యాత్మిక జ్ఞాన పిపాసులైన వారు అంతా వారి కర్తవ్యం ఏమిటో తెలుసుకొని మోకాలి లోతు నీటిలో ప్రయాణించవలసిన అవసరం ఉంది. బ్రహ్మ సూత్రాలు మనం అర్ధం చేసుకోవడానికి కొంత వరకు కష్టపడవలసినదే. బ్రహ్మసూత్రాలు బహు నిఘాడమైనవి, జ్ఞాన సంబంధమైనవి, అర్ధం కానివి, అయినప్పటికీ వాటిని విశ్లేషణ చేసి అవగాహన చేసుకొని ఆచరణలో పెడితే మోక్షప్రాప్తి తధ్యం. సూత్రం రూపంలో ఉన్నవి కేవలం బ్రహ్మ సూత్రాలే కాదు, పతంజలి యోగ దర్శనం, గౌతమ మహర్షి న్యాయ సూత్రాలు, కపిల మహర్షి సాంఖ్య దర్శనం, కణాది మహర్షి వైశేషిక దర్శనం, పాండ్య మహర్షి వ్యాకరణసూత్రాలు, మహర్షి ధర్మ సూత్రాలు, నారదుడు భక్తి సూత్రాలు, అన్ని సూత్రాల రూపంలోనే వ్రాయబడినవి. అనేకమైన ఉపనిషత్తులలో కనిపించే వైవిధ్యాన్ని సమన్వయం చేసి ఒకే భావాన్ని అర్ధమయ్యేటట్లు చేసి ఏకాభిప్రాయం తెచ్చేందుకు ఈ బ్రహ్మసూత్రం రచనని వేదవ్యాసులవారు మనకు అందించారు. బ్రహ్మజ్ఞానం రావాలన్నా, కలగలన్నా, స్థిరపడలన్నా, బ్రహ్మ సూత్రాలు తప్పనిసరిగా అర్ధం చేసుకోవాలి. ఆత్మనుసంధానం చేసుకునే పద్ధతి తెలుస్తుంది. బ్రహ్మ సూత్రాలు పరిమాణంలో తక్కువ విజ్ఞానంలో చాలా విశాలమైనవి. అణువంత సూత్రానికి సాగరమంత భావం. 13 సం. వయస్సులో బాల శంకరులు కాశీ క్షేత్రం వెళ్లి బ్రహ్మ సూత్రాలకు భాష్యం వ్రాశారు. వృద్ధులైన పండితులు ఎందరో ఉన్నా ఎవరు ఈప్రయత్నం చేయలేదు. వ్రాసిన తృప్తికలగలేదు. బ్రహ్మ సూత్రాలలో 4 అధ్యాయాలు ఉంటాయి. 1.సమన్వయధ్యాయం 2.అవిరోదాధ్యయం 3.సాధనాధ్యాయం 4.పరాధ్యయం.1.సమన్వయాధ్యాయం.. ఉపనిషత్ వాక్య సమన్వయాన్ని తెలియజేసి ఉపనిషత్ వాక్యాల వైరుధ్యాన్ని తొలగించి వాటిని సమన్వయం జేస్తుంది. 2.అవరోధాధ్యయం:- ఇతర మతాల, ఇతర అభిప్రాయాలు అద్వైతానికి విరుద్ధంగా ఉన్నవి నిరోధించడం ఖండించడం. 3.సాధనాధ్యాయం:- దీనిలో మోక్షార్థులకు సాధనాలు పరమాత్మను అందుకోవాలనే సాధనలో. 4.పరాధ్యాయమ:- సాధన చేస్తే ఫలితం వచ్చి మోక్షాన్ని తెలియజేసే అధ్యాయం. ఒక్కొక్క అధ్యాయంలో 4 పాదాలున్నాయి. ఒక్కొక్క పాదంలో కొన్ని అధికారణలు ఉన్నాయి. ఎన్నైనాఉండవచ్చును. ఒక్కొక్క అధికారణంలో కొన్ని సూత్రాలు ఉన్నాయి. 4 అధ్యాయాలకు 16 పాదాలు, 141 అధికారణలు, 555 శ్లోకాలు ఉన్నాయి. ఉపనిషత్తులు 3 భాగాలు ఉంటాయి.1.కర్మ కాండ 2.ఉపాసనా కాండ 3.జ్ఞాన కాండ. బ్రహ్మజ్ఞానమే విద్యఅన్నారు. హేతు పూర్వకంగాపొందలేము. హేతు పూర్వకంగా అంటే చర్చల ద్వారా, వాదోపవాదాల ద్వారా గుర్తు పెట్టుకొని అనుభవ పూర్వకంగా రావాలి బ్రహ్మ విద్య. ఇది అసాధ్యమైనదనే భావం లోకంలో ఉంది.
అధ్యాయం...పాదాలు...అధికారణలు...సూత్రాలు
1 4 39 134
2. 4 47 157
3. 4 67 186
4. 4 35 78
----------------------------------------------------------
4 16 141 555
----------------------------------------------------------
శంకరులు బ్రహ్మసూత్రాల్లో కొన్ని ఉపనిషత్తులు కఠ, ప్రశ్న, ముండక , ఐతరేయ, కేన, ఛాందోగ్య, శ్వేతాస్వతర, కౌసీతకి మొదలైన వాటిలోని అనేక మంత్రాలను చెప్పడం జరిగింది. ఎంతో విస్తృతమైన, విశ్లేషణ, ఋజువులతో సహా చేసిన వారి ప్రయత్నం మానవమేధకు అందేది కాద అద్వైతం అంటే ఏమిటి? ఏకమేవా అద్వైతం బ్రహ్మ.. పరమాత్మ ఒక్కటే రెండవది లేదు. ఉన్నదంతా పరమాత్మే. కంటికి కనబడేవన్ని పరమాత్మే. శృతవాక్యం వలన సృష్టికి ముందు చూసేది, చూడబడేది ఏది లేదు. అప్పుడు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. ఏ రూపం లేనివాడు నిరాకరుడు, సూక్ష్మతి సూక్ష్మ మైన రూపం గలవాడు. ఆకాశం కంటికి ఎలా కనబడదో పరమాత్మ కూడా కనబడడు. పరమాత్మ తాను ఒక్కడే ఉన్నప్పుడు అనేక రూపాలలో తాను కనిపించాలని సంకల్పించి, తన స్వశక్తి అనే మాయతో ఈ ప్రపంచంలో జీవుల్లాగా కనిస్తున్నాడు. కనిపించే జీవులందరు పరమాత్మ స్వరూపలే. అనేక రూపాలుగా కనబడటం, ఉన్నది ఉన్నట్టుగా మరొక రూపంలో కనబడటం, పరమాత్మను చూడగలిగితే ఈ ప్రపంచం కనబడదు. అజ్ఞానం కారణంగా మనకు ప్రపంచమే కనిపించి బ్రహ్మం ఒక్కటే అనే సత్యాన్ని గ్రహించలేకపోతున్నాము. జీవ బ్రహ్మైక్యం:- ఈ అద్వైతసిద్ధాంతాన్ని ఎవరు అనుసరిస్తున్నారో వారికి ఒక సందేహం వస్తుంది. ఉన్నదంతా బ్రహ్మమే, నేను కూడా బ్రహ్మాన్ని అయినప్పుడు బ్రహ్మాన్ని చేరుకోవలసిన అవసరం ఏముంది? బ్రహ్మ ఎవరు? బ్రహ్మాన్ని అందుకునేవారు ఎవరు? పొందేవారు, పొందబడేవారు రెండు ఒక్కరే. తను బ్రహ్మాన్ని అని తెలుసుకో లేనివాడు బ్రహ్మాన్ని గురించి తెలుసుకుని, తానే ఆత్మచైతన్యరూపంలా. బ్రహ్మంగా నిలిచిపోతాడు. పొందే జీవుడు, పొందబడే పరమాత్మ ఒక్కటే. అద్వైతంలో జీవుడు, కర్మలు, కర్మఫలాలు, స్వర్గం నరకం జననం, మరణం ఇతర లోకాలకు పోవడం రావడం అన్ని ఆత్మనుభూతి పొందేవరకే, వీటిని విశ్లేషించి వైరాగ్యం పొంది ఆత్మగా, బ్రహ్మంగా, మోక్షాన్ని అందుకోవడమే బ్రహ్మ సూత్రాల యొక్క లక్ష్యం.
విశిష్టాద్వైత సిద్ధాంతం:- దీనిలో కొద్దిపాటి తేడాలున్నాయి. ఏకమేవా బ్రహ్మ వీరు కూడా ఒప్పుకుంటారు. జీవులందరు పరమాత్మలో అంశీభూతాలు. పరమాత్మ దేహంలో భాగాలు, జీవుల అంగాలతో కూడిన పరమాత్మ ఒక్కరే. అంతా ఒక్కటే అయినప్పుడు ఎలా విడిపోయారు? జీవాత్మలన్ని స్వతంత్రించి బయటకు వచ్చి సుఖదుఃఖాలు అనుభవిస్తారు. పరమాత్మను భక్తితో శరణాగతి చేత బుద్ధిశుద్ధి చేసుకొని, భగవత్దర్శనం చేసుకొని, స్వస్వరూప ఆవిర్భావం పొంది, వైకుంఠం చేరి విష్ణువు యొక్క బ్రహ్మానందం పొందుతారు. అంగాలన్ని బయటపడి స్వతంత్రంగా జన్మించి అనేక కష్టనష్టాలు అనుభవించి పరమాత్మను శరణాగతి కోరి విష్ణువును చేరితే సరిపోతుంది.
ద్వైత సిద్ధాంతం:- భక్తితో మోక్షం పొందే జీవుడు వేరు అనేది ఈ సిద్ధాంతం. జీవులు కర్మలను అనుసరించి తిరిగి జన్మిస్తుంటారు. సంసారబంధంలో చిక్కుకున్న జీవులు కర్మబంధాలు తొలగించుకొని, ముక్తిని పొంది, బ్రహ్మనిష్టుడైన గురువును చేరి, యదార్ధజ్ఞానాన్ని పొంది, తన హృదయ కమలమునందు పరమాత్మను బింబరుపంలో దర్శించి, వదిలించుకో వలసిన సంచిత కర్మలన్నింటిని వదిలించుకుని, చివరి దేహం నుండి బయటపడి, బ్రహ్మలోకం నుండి బ్రహ్మాండం లయమయినప్పుడు ఆయనతో బాటు విరాజానదిలో స్నానం చేసి, సూక్ష్మ శరీరం నుండి విముక్తులై, శ్వేత ద్వీప వాసులైన వాసుదేవుని సందర్శించి, భగవంతుని సాన్నిధ్యంలో ఉపాసన చేస్తూనే ఉంటారు. ముక్తుల్లో ఉత్తమ, మధ్యమ, అధమ రకాలు ఉన్నాయి. బ్రహ్మానందంలో భేదాలు అంగీకరిస్తారు. మృతి చెందిన జీవుడు లోపల బయట తన స్వరూపంతో లీలాగుహ్య సచ్చాత్మ దేహంలో గాని సంకల్ప మాత్రం చేత సిద్ధించిన దివ్య భోగాలు యోగ్యతానుసారంగా అనుభవిస్తారు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత అర్ధం చేసుకునే స్థాయి ఉంటేనే బ్రహ్మ సూత్రాలు జిజ్ఞాసతో అర్ధం చేసుకోగలరు. బ్రహ్మ సూత్రాల ప్రయోజనం ఏమిటి? ఉపనిషత్తుల విద్యను మననం చేస్తూ ఉండటమే దీని ప్రయోజనం. సూత్రం అంటే తాడు. పువ్వులను, పూసలను దండగా గుచ్చడానికి తాడు ఎలా అవసరం అదే విధంగా వేదాంత వాక్యాలనే రంగురంగుల పుష్పాలను గుచ్చి మాలగా తయారుచేసిన బ్రహ్మ సూత్రాలు అనే తాడు మోక్షార్థులు ధరించడం ఎంతో అవసరం.
బ్రహ్మసూత్రములు
1వ అధ్యాయం, 1వ పాదం, 1వ అధికారణం,
సూత్రం :- 1.
''అథాతో బ్రహ్మ జిజ్ఞాసా'
అథ:- ఆ తరువాత, అతః:-అందువలన, బ్రహ్మ జిజ్ఞాసా:-బ్రహ్మాన్ని గురించి తెలుసుకోవాలనే కోరిక.
భావం :- సంపూర్ణంగా ఉండడానికి కర్తవ్యః కలపాలి. అంటే బ్రహ్మ విద్య చెయ్యాలి. ఈ సూత్రం తెలుసుకోకుండా ఏమి తెలుసుకున్నా ప్రయోజనం ఉండదంటారు పెద్దలు. "ఆ తరువాత".. అంటే సాధనా చతుష్టయ సంపద సాధించిన తరువాత, "ఎందువలన" అంటే ...కర్మఫలం అనిత్యమని జ్ఞానం శాశ్వతమని తెలుసుకొని, మోక్షాన్ని కోరుకోవాలి. సాధనాచతుష్టయ సంపద సాధించిన తరువాత కర్మఫలాలు అనిత్యమని తెలుసుకొని, జ్ఞాన ఫలం నిత్యమైనది కనుక మోక్షార్థులు బ్రహ్మ జిజ్ఞాస చెయ్యాలి. "అథ" మంగళ వాచకం. ఏ శాస్త్ర గ్రంధం ప్రారంభించాలన్నా మంగళకర శబ్దాలతోనే ప్రారంభించాలి. మనం చేసే పనులు ఆటంకం కలగకుండా అవి నిర్విఘ్నంగా కొనసాగాలని "ఓం" అని "శ్రీ "అని మొదలుపెడతారు. వ్యాసులవారు అథ తోనే ఉత్తర మీమాంస పూర్వ మీమాంస ప్రారంభించారు.
వివరణ.. సాధనాచతుష్టయ సంపద:- పూర్వకాలంలో శిష్యులు వారికి కావలసిన జ్ఞానం అందించవలసిన మహానుభావులు, శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు, కరుణాసముద్రుడు ఎక్కడ దొరుకుతాడా అని విచారణ చేసి వారిని చేరేవారు. గురువు వారికి అర్హత ఉన్నదో లేదో తెలుసుకోవడానికి ఎన్నో పరీక్షలు పెట్టేవారు. గురువుచెప్పే మాటలు వింటూ ఆచరిస్తూ, సేవాభావంతో గురువుకు సేవ చేసేవారు. శిష్యుడిచేత హీనమైన పనులు కూడా చేయిస్తూ వారిలో అహంకారం ఉందా లేదా అని పరీక్షించే వారు. సాధనాచతుష్టయ సంపద చదివిన తరువాత వైరాగ్య ధోరణి వచ్చిందని నమ్మిన తరువాత అప్పుడు బోధ మొదలు పెట్టేవారు. గురువు ఏది బోధించిన సులభంగా గ్రహించేవారు. సాధనాచతుష్టయంలో 4 సాధనాలు చెప్పబడ్డాయి. 1.నిత్యానిత్య వస్తువివేకం:- నిత్యవస్తువులు, అనిత్య వస్తువులు ఏవి? లోకంలో మనం చూస్తున్నవన్నీ అనిత్యమైన వస్తువులే. నిత్యమైనది పరమాత్మ ఒక్కడేనని గ్రహించాలి. 2.వైరాగ్యం..ఈ లోకంలో, పరలోకంలో అనుభవించే సుఖాలు, భోగాలు అనిత్యమని తెలుసుకొని వాటిమీద వైరాగ్యం పెంచుకోవాలి. పరలోకంలో భోగాలు అనుభవిస్తున్న పుణ్య ఫలాలు ఖర్చు అయిన తరువాత మరల భూమి మీద జన్మ ఎత్తక తప్పదని తెలుసుకొని వైరాగ్య ధోరణి పెంచుకోవాలి. వివేకంతో కూడిన వైరాగ్యం ఉంటేనే పరమాత్మను చేరుకునే మార్గం సుగమం అవుతుంది. 3.శమాది షట్కము:- దీనిలో శమము, దమము, మనస్సు, బుద్ధి చిత్తం అహంకారం నిర్వచింపబడ్డాయి.1.శమము:-అంటే మనోనిగ్రహం, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే అంతరేంద్రియాలను వాటి వృత్తులను పోనీయక బ్రహ్మము నందే నిరంతరం నిలపటాన్ని శమము అంటారు. సామాన్యులైనవారు ఎదురుగా భోగ వస్తువులు ఆనందాన్ని ఇచ్చేవి ఉన్నప్పుడు వాటి మీద కోరిక కలగకుండా మనస్సును స్వాధీనంలో ఉంచుకోవాలి. 2.దమము:-అంటే ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియములను బాహ్య విషయములవైపు పోనీయక మరలించి ఆత్మ యందే లగ్నం చెయ్యడం. దీనిలో కర్మేంద్రియాలను నిగ్రహించడం ముఖ్యమైనది. లేడి సంగీతానికి లొంగిపోయి వేటగాడు భార్య సంగీతం వినిపిస్తుండగా లేడి అక్కడకు రాగానే వేటగాడు దానిని బంధించి చంపేస్తాడు. ఏనుగు స్పర్శ జ్ఞానం తో కామ సంపర్కం చాలా ఎక్కువగా ఉండటం వలన వేటగాడు ఆడ ఏనుగును చెట్టుకి కట్టి, దాని ముందు పెద్ద గొయ్యి తవ్వి పైన ఆకులు గడ్డితో కప్పివేస్తాడు. ఏనుగు అది గమనించక ఆడ ఏనుగు దగ్గరకు వస్తూనే గోతిలో పడిపోతుంది. తరువాత దానిని లొంగదీసుకొని దాని దంతాలు అమ్ముకుంటాడు. దీపం పురుగు దీపకాంతికి దీపం దగ్గర వచ్చి దాని చుట్టూ తిరువుతూ ప్రాణం పోగొట్టుకుంటుంది. చేపకు జిహ్వ చపల్యం ఎక్కువ కనుక రసేంద్రీయానికి లొంగి వేటగాడి గాలానికి వేసిన ఎర వలన గాలానికి చిక్కి చనిపోతుంది. తుమ్మెద మకరందం కోసం పద్మం పై వాలి మకరందాన్ని గ్రోలుతుంది. చీకటి పడటంతో పువ్వు ముడుచుకుపోయి తుమ్మెద దానిలో చిక్కుకుంటుంది. జీవుడైతే పంచేంద్రియాలకు లొంగిపోతాడు కనుకనే ఇంద్రియాలను కట్టడి చెయ్యాలి. 3..ఉపరవం;- విషయములు యందు దోష దృష్టిని విచారణ చేసి వాటిని తిరస్కరించడం. మరల ఇంద్రియాలు వాటి స్వభావం ప్రకారం బయట విషయాల జోలికి పోనీయకుండా నిలపడాన్ని ఉపరతి అంటారు. 4..తితిక్ష;- అంటే ఓర్పు. శీతోష్ణాదులు, సుఖదుఃఖాలు, మానావమానాలు, లాభనష్టాలు మొదలైనవి వస్తుంటాయి పోతుంటాయి. అవి స్థిరంగా ఉండవు. అందుచేత వీటిని సహనంతో ఓర్చుకోవడం అలవాటు చేసుకోవాలి. శ్రీ కృష్ణుడు పాండవుల దగ్గర కొన్నాళ్ళు ఉండి తిరిగి వెళ్లిపోతున్నప్పుడు ధర్మరాజు, కృష్ణా! నీ దగ్గర నుంచి మంచి ఉపదేశం తీసుకోవాలని ఉంది. నాకు శ్రేయస్సు కలిగించే మాట చెప్పమని అడిగాడు. శ్రీకృష్ణుడు ఒక కాగితం మీద వ్రాసి నీకు ఎప్పుడైనా కష్టం కలిగినప్పుడు ఇది తెరిచి చదువు. అంత వరకు తెరవొద్దు అన్నాడట. పాండవులు అరణ్యవాసంలో భీముడు, ద్రౌపది అన్న మాటలకు బాధ పడి కష్టం కలిగి, కృష్ణుడు ఇచ్చిన కాగితం విప్పి చదివాడు. ఇది ఇలానే ఉండదు అని అర్ధం వాచ్చే మాట వ్రాశాడు. అది చదివి మళ్ళీ మనకి మంచిరోజులు వస్తాయి. ఈకష్టాలు ఇలాగే ఉండవు అని అనుకున్నాడు. 5..శ్రద్ధ:- శాస్త్రముల యందు గురువాక్యాలయందు విశ్వాసం కలిగి ఉండటాన్ని శ్రద్ధ అంటారు. భగవంతుని మీద, గురువు మీద విశ్వాసం లేకపోతే గురుబోధ స్వీకరించలేరు. భగవంతుని యదార్ధ స్వరూపం తెలియదు. నీవెవరో తెలియకపోతే మోక్షం రాదు. 6..సమాధానం:- తన బుద్ధిని అన్ని విధాలా బ్రహ్మయందే ఎప్పుడు స్థిరపరుచుకొని ఉండటాన్ని సమాధానం అంటారు. మరికొందరు శాస్త్రమందు చెప్పబడిన విషయాలు, గురువుచే ఉపదేశింపబడిన వాక్యాలు రెండూ ఒక్కటే అని శృతిలో చెప్పబడింది. అనుభవములచేత ఆత్మనిశ్చయం పొంది సంశయాలను నివృత్తి గావించు కోవడమే సమాధానం. 4..ముముక్షుత్వం;-సంసారబంధ నివృత్తి ఎప్పుడు ఏ విధంగా కలుగుతుందో అని ఆలోచిస్తూ మోక్షమందు ఆపేక్ష కలిగి ఉండటాన్ని ముముక్షుత్వం అంటారు. మోక్షం సాధించాలనే కోరిక లేకపోతే పై సాధనాలు వ్యర్ధమే. ఎవరైతే శాశ్వత ఆనందం పొందడమే ఏకైక కోరికతో మోక్షం కోసం తపన చెందుచూ మోక్ష మార్గం అన్వేషిస్తారో వారికి మాత్రమే మోక్షం వస్తుంది. ఈవిధంగా మనోనిగ్రహం ఉన్నవాడు ఇంద్రియాలను మనస్సులో లీనం చేసుకోవాలి. మనస్సును బుద్ధిలోను, బుద్ధిని మహత్తత్వంలోను విలీనం చేసి దాన్ని ప్రశాంతమైన ఆత్మలో విలీనం చేసుకోవాలనేదే సాధన అని కఠోపనిషత్తు చెబుతుంది. ఇలా సాధన చతుష్టయం పొందినవారు ఆత్మను తన ఆత్మలోనే చూస్తాడు. మోక్షం మీద తీవ్రమైన కోరిక ఉంటేనే బ్రహ్మజ్ఞానం కోసం ప్రయత్నించి సద్గురువును సేవించి సఫలమౌతాడు. ఈసూత్రంలో అతః అనే పదం చదివాము.
బ్రహ్మజిజ్ఞాసా:-బ్రహ్మాన్నిగురించి తెలుసుకోవాలి. బ్రహ్మవిద్య తెలుసుకోవడానికి 3 కారణాలున్నాయి. 1.తాపత్రయాల విముక్తి, 2,దుఃఖ నివృత్తి. 3 మోక్ష సాధన.
1.తాపత్రయ విముక్తి:-1.ఆది దైవిక తాపాలు 2. ఆది భౌతిక తాపాలు 3. ఆధ్యాత్మిక తాపాలు. 1.ఆది దైవిక తాపాలు అంటే దైవం చేత కల్పించబడిన కష్టాలు.ఆద్యాత్మిక ప్రవచనాలు వినడానికి బయలుదేరే ముందు తుఫానులు, సునామీలు లేదా హఠాత్తుగా వర్షం పడటం వలన రకరకాల ఆటంకాలు అనుకోని ప్రళయాలు వస్తుంటాయి. గురువు సముఖంలో కూర్చుని జ్ఞానం పొందడానికి మొట్టమొదట దైవం చేత కల్పించబడిన ఆటంకాలు తొలగిపోవాలి. 2.ఆధిభౌతిక తాపాలు:- మన చుట్టూ ఉన్న భూతాలు పశుపక్ష్యాదులు క్రిమికీటకాలు, జంతువులు, మనుషుల వలన ఆటంకాలు ఏర్పడుతుంటాయి. అనుకోకుండా బంధువులో స్నేహితులో వస్తే, వెళ్లలేని పరిస్థితి. హఠాత్తుగా తేనెటీగ కుడుతుంది. చాలా అసహనంగా ఉండి వెళ్లలేకపోతారు. చుట్టూ ఉన్న భూతాల వలన కలిగే ఆటంకాలు తొలగిపోవాలి. 3.ఆధ్యాత్మిక తాపం:- మన లోపల నుండి వచ్చే తాపం. ఈ రోజు మనసు ఏమి బాగాలేదు. రేపు విందాం అనిపిస్తుంది. ఈ రోజు నిద్ర బాగా వస్తోంది అని అంతరంగంలో నుండి వచ్చిన ఆటంకాలు ఏదైనా కార్యక్రమం ముగిసిన తరువాత ఓం శాంతి శాంతి శాంతిః. 1.ఆదిదైవిక శాంతి కోసం 2.ఆది భౌతిక, 3.ఆధ్యాత్మిక శాంతి కోసం చెపుతాం. 1.దుఃఖ నివృత్తి కోసం బ్రహ్మవిచారణ చెయ్యాలి. జీవితంలో దుఃఖాలు వస్తుంటాయి. ఏదైనా కోరిక వస్తే అది తీరకపోతే దుఃఖం వస్తుంది. మనచేతిలోని విలువైన వస్తువు పోతే దుఃఖం, నష్టం వచ్చినా ఇబ్బందే. ఆశించింది జరగకపొయినా చెడు జరిగినా దుఃఖం వస్తుంది. బ్రహ్మవిచారణ సక్రమంగా సాగాలంటే దుఃఖ నివృత్తి జరగాలి.
3.మోక్ష సాధన:-బ్రహ్మ జిజ్ఞాస సాధించాలంటే దుఃఖాలు పోవాలంటే వేరే మార్గాలు ఉన్నాయి కదా. బ్రహ్మవిద్యే అవసరమా? అవి తాత్కాలికమైన సుఖాలే. రోగం వస్తే డాక్టర్ దగ్గరకు పోతుంటే దుఃఖం పోతుంది .రోగం మళ్ళీ రాదన్న గ్యారంటీలేదు. పేదరికం పోవాలంటే ధన సంపాదన ముఖ్యం. సంపాదించినప్పుడు ఆనందం, ఆ ఉద్యోగం పోతే దుఃఖం. ఇల్లు కట్టుకుంటే అప్పులు తీర్చలేక దుఃఖం. ఆనందం వెనుక ఎప్పుడు దుఃఖం నీడలా ఉంటుంది. ఈ దుఃఖాలన్ని శాశ్వతంగా పోవాలంటే జన్మరాహిత్యం జరిగి మోక్షం రావాలి.
బ్రహ్మైక్య జ్ఞానం:- నేను బ్రహ్మం ఒక్కటే అహం బ్రహ్మాస్మి అనే భావన రావాలి. ఉపనిషత్తుల విచారణ చేస్తే బ్రహ్మ జిజ్ఞాస వలననే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. శాశ్వతానందమైన మోక్షం కలగడమే బ్రహ్మప్రాప్తి. అద్వైతంలో బ్రహ్మం ఎవరు? అందుకునేది ఎవరు? అనే ప్రశ్నకు సమాధానంగా ఆ ఇద్దరు ఒక్కరేనని చెబుతుంది. బ్రహ్మం తనకి తాను మరచిపోయి విడిపోయి లౌకిక వ్యవహారాలలో మునిగిపోయి, తన స్థితి తాను తెలుసుకొని, బ్రహ్మంగా మరిపోతాడు. బ్రహ్మం బ్రహ్మన్ని తెలుసుకునేవాడు ఒక్కరే. జ్ఞానసాధనతో జనన మరణ చక్రం నుండి తప్పించుకొనేందుకు బ్రహ్మవిచారణ చేసి బ్రహ్మ జిజ్ఞానసతో మోక్షాన్ని అందుకొని బ్రహ్మమే తాను అని గ్రహించాలి. బ్రహ్మం ప్రసిద్ధమా? అంటే తెలిసిందా? లేదా అప్రసిద్దమా? అంటే తెలియనిదా? బ్రహ్మ నీకు తెలిసినదా?తెలియనిదా అని ప్రశ్నిస్తే బ్రహ్మం ప్రసిద్ధమే అనుకోండి. తెలిస్తే విచారణ ఎందుకు? అని అడుగుతారు. తెలియదు అన్నామనుకోండి?తెలియక పోతే విచారణ చేసి ప్రయోజనం ఏముంది? అంటారు. బుద్ధితో విచారణ చెయ్యాలి. బ్రహ్మం అనేది బుద్ధి క్షేత్రానికి అందేది కాదు. సాధన చేద్దామన్నా ప్రయోజనం ఏముంది? దానికి సమాధానం బ్రహ్మ ప్రసిద్ధమే. బ్రహ్మకి సంబంధించిన సామాన్యజ్ఞానం ప్రసిద్ధం. శాస్త్రాలలో పరమాత్మ లక్షణాలు తెలియజేస్తారు కనుక వాటిని తెలుసుకోవడమే శాస్త్ర జ్ఞానం అంటారు.
2. బ్రహ్మాన్ని తెలుసుకోవాలనే కోరిక సమంజసమే అయినా దానికి అనుభవ జ్ఞానం ఉండాలి అనడంలో వివాదాలు, అభిప్రాయ బేధాలు ఉన్నాయి. చైతన్యంతో ఉన్న దేహమే బ్రహ్మం అని పామరులు, చార్వాకులు, నాస్తికులు అంటారు. మరికొందరు ఇంద్రియాలు బ్రహ్మం అనీ, ఇంద్రియాలను ప్రేరేపించి వాటి చేత పనులు చేయిస్తున్న మనస్సు ఆత్మ అనీ, కొంతమంది మనస్సును నిగ్రహించే బుద్ధినే ఆత్మ అనీ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. బౌద్ధులలో హీనయానం శూన్య వాదులు శూన్యం తప్ప ఏమీ లేద అదే బ్రహ్మం అన్నారు. కొందరు దేహేంద్రియాలకు వేరుగా ఉన్న కర్త, భోక్త అయినటు వంటివాడే ఆత్మ అన్నారు. మరికొందరు దేహేంద్రియాలకు వేరుగా ఉండే అహంకారము బ్రహ్మం అని విశ్లేషించారు. సాంఖ్యులు దేహాదుల కన్నా వేరైనటువంటి ఆత్మ కేవలం భోక్తే కానీ కర్త కాదు అన్నారు. మరికొందరు భోక్త కన్నా వేరుగా ఉన్న సర్వజ్ఞుడు సర్వశక్తి మంతుడు అయినటువంటి ఈశ్వరుడు ఉన్నాడు. ఆయనే బ్రహ్మ అని యోగులు తెలియజేసారు. కొంతమంది అవిద్య ఉపాధులతో కూడి ఉన్నటువటువంటి జీవాత్మని జీవుణ్ణి ఈశ్వరుడితో సమం అన్నారు. జీవేశ్వరులకు భేదం లేదు. ఎంతకాలం జీవేశ్వరుల భేదబుద్ధి మనలో ఉంటుందో అంత కాలం ఈ సంసారతాపత్రయం వదలదు.ఈ వేదంతాన్ని ఆశ్రయించిన సిద్ధాంతాలు జీవుడు ఈశ్వరుడు ఒక్కరే అన్నారు. ఒక సామాన్యుడు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం మొదలు పుట్టినవాడు ఒక మార్గాన్ని నిశ్చయించుకొని, మార్గాన్ని చూపించే గురువు లేనటువంటివాడు, ఏవో శాస్త్రాలు తిరగేసినవాడు, ఇన్నిరకాల భావాలు కలిగి ఉంటే ఏమి చెయ్యాలి? ఇది తప్పు ఇది ఒప్పు ఇది ఎందుకు తప్పు అని విశ్లేషణ చేసే శక్తి ఉండదు. ఎవరికి నచ్చిన సిద్ధాంతం వారు పాటిస్తారు అనే నిర్ణయానికి వస్తారు. ఒక దాన్ని అనుసరించిన కొంతకాలానికి మరొక సిద్ధాంతాన్ని అనుసరిస్తారు. ఎప్పటికి సరిఅయిన మార్గం దొరకదు. ఇన్ని రకాల అభిప్రాయ భేదాలు ఉన్నాయి కనుక ఆది శంకరులు అద్వైతసిద్ధాంతంలో ప్రతిపాదించి బ్రహ్మజిజ్ఞాస చేసి విచారణ చేసినట్లయితే ఆబ్రహ్మజిజ్ఞాసే మనలను సరి అయిన స్థానంలో నిలుపుతుందని ఒక మార్గాన్ని సూచించారు. సంసార సాగరంలో ఉండే దుఃఖలన్నింటిని దుఃఖ నివృత్తి చేసి శాశ్వత ఆనందప్రాప్తి లభించడం కోసం, పరమాత్మను గురించి తెలుసుకోవడం కోసం, బ్రహ్మజిజ్ఞాస చెయ్యమని బ్రహ్మ సూత్రాలు మనకు అందించారు. బ్రహ్మసాక్షాత్కారం కలగగానే హృదయగ్రంథులు విడివడతాయి. సంశయాలు నశిస్తాయి. కర్మలు క్షయమౌతాయి. కనుక బ్రహ్మజ్ఞానానికి మోక్షం ప్రయోజనం. దానికి బ్రహ్మ జిజ్ఞాస కావాలి.
సూత్రం .2
" జన్మాదస్య యతః "
జన్మ - ఉత్పత్తి , ఆది - స్థితి ప్రళయాలు, అస్య - ప్రత్యక్షాది ప్రమాణాలతో తెలిసే ఈ జగత్తు. యతః - ఎవరి వల్ల కలుగుతున్నాయో ఆ తత్త్వమే బ్రహ్మ - పరబ్రహ్మము.
భావం :- ఎవరి వలన ఈ భూతజాలం ఉత్పన్నం అవుతున్నాయో, ఎవరి వల్ల అవి జీవిస్తున్నాయో, చివరకి ఎందులో ప్రవేసిస్తున్నాయో అదే బ్రహ్మమని తెలుసుకో.
వివరణ :- ప్రత్యక్షంగా కనిపిస్తున్న ఈ జగత్తు సృష్టికి ఎవరు కారణమౌతున్నారో ఎవరి వలన సృష్టిలోని జీవరాసులన్ని జీవిస్తున్నాయో చివరకు ఇందులో లయమవుతున్నాయో అదే బ్రహ్మము. ప్రపంచంలో అనేక అనుభవాలు పొందుతూ అవి సత్యమేనని భావిస్తున్నాము. మన యొక్క యదార్ధ స్థితి ఆత్మ స్థితికి, బ్రహ్మ స్థితికి రాలేకపోతున్నాము. జగత్తును స్వప్నంతో పోల్చి స్వప్నం చూస్తున్నంత సేపు సత్యం, మెలకువ రాగానే అసత్యం అని గ్రహించి, ఆత్మదర్శనం చేసుకోవాలంటే జగత్తు పుట్టుక, అస్తిత్వం, అంతం ఎలా జరుగుతోందో విశ్లేషణ చెయ్యాలి. జగత్తుని చూస్తూ పరమాత్మ అని భావిస్తే కుండను చూసి మట్టి అని భావించాలి. మట్టికి నామరూపాలు తగిలిస్తే అది కుండ అని పిలవబడుతుంది. కుండ లన్నింటి నామరూపాలు తీసేసి పగలుగొడితే అంతా మట్టే గోచరిస్తుంది. కార్యరూపమైన కుండ ఉన్నదంటే, దానికి కారణ రూపమైన మట్టి ఉన్నట్లే. కార్యరూపమైన నగ ఉన్నదంటే దానికి కారణరూపమైన బంగారం ఉంటుంది. కార్యరూపమైన జగత్తుకు దానిని సృస్థించిన పరమాత్మే కారణరూపమౌతున్నాడు. తైత్తరీయోపనిషత్తులో వరుణుడు తన పుత్రుడైన భృగువుకి జగత్తుయొక్క పుట్టుక, నివశించుట, నశించి పోవుట అంటే సృష్టి, స్థితి, లయ గురించి చెబుతూ, అన్ని పరమాత్మ చేతనే నిర్వహింపబడుతున్నాయి. దేనియందు ఈసమస్త భూతాలు పుడుతున్నాయో దేనియందు ఇవన్నీ జీవిస్తున్నాయో చివరగా దేనియందు లయమౌతున్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నించు. అదియే బ్రహ్మము అని చెప్పాడు. ఏదైనా సృష్టి జరగాలంటే మూడు కారణాలు చెప్పబడ్డాయి. నిమిత్తకారణం, ఉపాదానకారణం, ఉభయకారణం. బ్రహ్మ చేతనాపదార్ధం కనుక నిమిత్తకారణం అవుతాడు. జగత్తు దేనితో తయారు చేయబడింది? అది ఉపాదానకారణం. అలా తయారు చేయడానికి పరమాత్మ కన్నా వేరే ఏదైనా ఉంటే పరమాత్మ పరిమితమైపోతాడు. నశించిపోతాడు. అందుకని వేరే పదార్ధం ఉండకూడదు. మరి ముడి సరుకు ఇది? పరమాత్మ నిమిత్త కారణం అనడంలో సందేహం లేదు. ఏమి లేకపోతే శూన్యం అని అర్ధం. శూన్యం నుంచి ఏమి రాదుగా? ఒకవేళ పుట్టించినట్లుగా చూపిస్తే హస్తలాఘవంతో మాయ చేసి వస్తువులు చేస్తారు. మహాత్ములు యోగులు, విభూతి గొప్పవాళ్లకు గొలుసులు ఇస్తుంటారు. విభూతి పడాలంటే ఒక మాత్ర వేళ్ళ మద్యలో పెట్టుకొని దానిని నలిపి విభూతిలా చేస్తారు. వస్తువులు చేతి మడతలోనో ఎక్కడో పెట్టుకొని అటు ఇటు త్రిప్పి వారి చేతిలో వేస్తారు. మేజిక్ శూన్యం నుంచి రాదు. కనికట్టు ద్వారా రప్పించి మనకు ఉన్నట్లుగానే గోచరింపజేస్తారు. జగత్తుని కనికట్టు చేశారు. సృష్టికి ముందు బ్రహ్మమే ఉన్నాడు అన్యమైనవి లేవు. ఇక్కడ బ్రహ్మమే ఉపాదాన కారణం నిమిత్తకారణం కూడా. రెండూ ఆయనే. బంగారం ఇస్తే మనం కోరిన విధంగా వస్తువులు చేస్తాడు. ఇవ్వకుండా చెయ్యడు కదా! ఉపనిషత్తులలో చెప్పబడిన విధంగా సాలెపురుగు తన గూటిని దాని నోటిలోని జిగురు పదార్ధంతోనే దారంలా గుండ్రంగా గూడు అల్లుతుంది. సాలెపురుగు నిమిత్త కారణం. స్వప్నం ఉపాదాన కారణం మనస్సు నిమిత్త కారణం. మనస్సే స్వప్నాన్ని సృష్టిస్తుంది. స్వప్నానికి మనస్సు ఎలాంటిదో జగత్తుకు పరమాత్మ ఉభయకారణమై జగత్తుకు సృష్టి స్థితి లయ అన్నియు పరమాత్మే నిర్వహిస్తున్నాడు. ఆయన మనస్సులో పుట్టినది మనస్సులో జీవించినది, మనస్సులోనే లయమైయినది జగత్తు. నీటి బుడగలు కూడా ఉపమానంగా చెప్పుకోవచ్చును. సముద్రం దగ్గర చిన్న పెద్ద నీటిబుడగలు అనేకం ఏర్పడు తుంటాయి. నీటిబుడగలు నీటిలోనే పుడతాయి. దానిలోని చితికిపోయి కలసిపోతాయి. నీరు నీటిబుడగని తయారు చేయడం ఉభయకారణం. పరమాత్మ దృష్టిలో జగత్తులో అన్ని నీటిబుడగలే. క్షణభంగురాలే. సృష్టి స్థితి లయ ఏవిధమైన మార్పు లేకుండా ఆధారమైనది ఒకటుంది. అదే సర్వ వ్యాపకమైన పరమాత్మ. బ్రహ్మము సర్వాధారం, సర్వనియామకం, జగజ్జన్మాదులకు నిమిత్త కారణం సర్వ శక్తిమంతం.
సూత్రం..3
" శాస్త్ర యోనిత్వాత్ "
శాస్త్ర యోనిత్వాత్ అంటే వేదానికి కారణం.
భావం:- బ్రహ్మ వేదానికి కారణం. సర్వజ్ఞమ్ సర్వ శక్తిమంతం. శాస్త్రం అంటే వేదం. అది ఈ లోకంలోని మానవాళి హితాన్ని చేకూర్చడానికి అహితాన్ని వర్జించడానికి కావలసిన సాధనాలని శాసిస్తుంది. సర్వ ఉపాయాలకు అన్ని విద్యలకు వేదమే నిలయం.
వివరణ :- హిందుధర్మంలో అత్యంత మౌలికమైన ప్రమాణంగా వేదాలను గుర్తిస్తారు. వేదములను శృతులు అనీ అమ్నాయములు అనీ అంటారు. విద్ అనే ధాతువుకు తెలియుట అన్న అర్ధాన్ని బట్టి వేదములు భగవంతుని ద్వారా తెలుపబడినవి అనీ, అవి ఏమానవుని చేత రచించబడలేదనీ విశ్వాసం. కనుకనే వేదములను అపౌరుషేయములు అని కూడా అంటారు. వేదములను తెలుసుకున్న ఋషులను ద్రష్టలు అంటారు. ద్రష్ట అంటే దర్శించినవాడు అని అర్ధం. హిందు శాస్త్రం ప్రకారం వేదాలను ఋషులు భగవంతుని నుండి విని గానం చేశారు. అందుకే వాటిని శృతులు అన్నారు. కావలసిన వాటిని తీర్చి, అక్కరలేని వాటిని రాకుండా చేసే ఆధ్యాత్మిక ఉపాయమే వేదం. వేదానికి మత భేదాలు పక్షపాతం ఉండవు. వేదం మహత్తరమైన శాస్త్రం అయితే సృష్టికర్త బ్రహ్మ అంతకు మించిన జ్ఞానం కలవాడు. శాస్త్రాలను నిర్మించే మహనీయులకు అందులో ఉండే విషయపరిజ్ఞానం కన్నా ఎక్కువ జ్ఞానం ఉంటుంది. అల్పజ్ఞానం ఉన్నవాడు అధిక విజ్ఞాన గ్రంధాలు వ్రాయలేడు. అందుకే బ్రహ్మ సర్వశక్తిమంతుడు. వేదాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి? వేదాలు అత్యంత మౌలికమైన ప్రామాణిక గ్రంధాలు. దాదాపు అన్ని తత్త్వములవారు శాక్తేయము, వైష్ణవము, శైవము, అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం వారు తమదే వేదాలను అనుగుణంగా ఉన్న మార్గమని సమర్ధించుకునేవారు. వేదాల యొక్క ప్రభావం మతాలకు మాత్రమే పరిమితం కాలేదు. పాలనా పద్ధతులు, ఆయుర్వేదం, ఖగోళం, దైనందిన ఆచారములు ఇలా ఎన్నో నిత్య జీవన కార్యాలు వేదాలతో ముడిపడి ఉన్నాయి . బౌద్ధమతం మాత్రం వేదాలను త్రోసిపుచ్చింది. ఈ వేదములను అర్ధం చేసుకోవాలంటే మన ఋషులు వాటికి ఎన్నో వివరణ గ్రంధాలు ఇచ్చారు. వాటినే వేదాంగములు అన్నారు. అవి 1.శిక్ష, 2.వ్యాకరణము, 3.ఛందస్సు, 4.నిరుక్తము, 5.జ్యోతిషము, 6.కల్పం. వేదంలోని ఋక్కులు, యజస్సులు, సామలు, అన్నీ కలసి ఒకేఒక వేద రాశిగా ఉండేది. ఎవరైనా వేదం నేర్చుకునేవారు చెయ్యాలంటే మొత్తం వేదరాశిని అధ్యయనం చెయ్యవలసి వచ్చేది. కృతయుగం నుండి ద్వాపరయుగం వరకు వేదవిద్యార్ధులు వేదం అధ్యయనం చెయ్యడం బహుకష్టమని ఎక్కువమంది ఉత్సాహం చూపేవారు కాదు. మొదట కలగలుపుగా ఉన్న వేదరాశిని వ్యాసమహర్షి ఒక క్రమపద్ధతిలో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదంగా విభజించారు. దేవతా స్తోత్రాలు,చరిత్రలు శ్లోకములుగా ఉన్నభాగాన్ని విడదీసి ఋగ్వేదంగా పేరు పెట్టారు. యజ్ఞాలు, యాగములు, అవి చేసే విధానాలు, వాటి వివరాలు, క్రతువులకు సంబంధించిన వివరాలు యజుర్వేదం లో పేర్కొన్నారు. వేదంలో సౌమ్యంగా పాడుకోతగ్గవిగా ఉన్న భాగములను సామవేదమని అన్నారు. ఇవి కాకుండా మిగిలిన భాగములు అధర్వణవేదంలో చేర్చారు. అందుకే వ్యాసభగవానుడు వేదవ్యాసుడు అయ్యాడు. వేదాలను ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదంగా విభజించి తన శిష్యులైన శైలుడు, వైసంపాయనుడు , జైమిని, సుమంతుడు అనే వారికి ఉపదేశించాడు. వారు తమ శిష్యులకు ఉపదేశించారు. అలా గురుశిష్యపరంపరగా ఈ నాలుగు వేదాలు వేల సం.గా సంక్రమిస్తూ వచ్చాయి. వేదాలను ఉచ్చరించడంలో స్వరానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. అన్ని వేదాలు కలిపి 1180 అధ్యాయలు, లక్ష పైగా శ్లోకాలు ఉండాలని అంటారు. కానీ మనకు లభించినవి 20,023 మాత్రమే. ఈ సంఖ్య 20,379 అని కూడా అంటారు.
సూత్రం ..4
తత్తు సమన్వయాత్ ( 1 ,1 ,4 )
తత్ :-ఆ శాస్త్ర కారణత్వం , తు:- కూడా సమన్వయాత్:-నిష్పన్నం అవుతుంది.
భావం:-శాస్త్ర కారణత్వం కూడా బ్రహ్మమే ,అది బ్రహ్మ విషయంలో నిష్పన్నం అవుతుంది. బ్రహ్మమే నిమిత్తం అని సూత్రానికి అర్ధం. సమన్వయం వల్ల తెలియదగినది అని కూడా అర్థం.
వివరణ:- శాస్త్ర ప్రామాణకత్వం సమన్వయం వల్ల మాత్రమే తెలుసుకోవలసినది. సమన్వయం అంటే వేదాంత వాక్యాలను పరస్పర విరోధంలేకుండా ఏకాభిప్రాయం సాధించడం. వేదాంతవాక్యాలు అన్ని ఒకచోట లేకుండా విడివిడిగా అనేక ప్రకరణములలో ఉన్నాయి. అవి కర్తను గురించి చెప్పినవి కాదు. కేవలం బ్రహ్మం గురించి చెప్పబడినవి. అన్ని వేదాంత వాక్యాలు ఒకే అర్థంలో బ్రహ్మకు సంబంధించిన జ్ఞానాన్ని కలిగజేస్తాయి. కనుక మహవాక్యాలు కర్మాంగాలు కాదు. వాటి ముఖ్య ఉద్దేశ్యం బ్రహ్మమే."సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ" ఈ వాక్యంలో సత్యం, జ్ఞానం, అనంతం అనే పదాలు బ్రహ్మ గురించి చెప్పినవి. అంతే కాకుండా ఉపక్రమ ఉప సంహారాది షడ్ విధ లింగాలు అంటే ఏదైనా ఒక విషయం యొక్క తాత్పర్యాన్ని నిర్ణయించే సాధనాలు:-6. 1.ఉపక్రమము, ఉపసంహారం :-ప్రారంభం 2.అభ్యాసం :-మళ్ళీ మళ్ళీ చెప్పడం 3.అపూర్వత :- లోగడ చెప్పినది కాకుండా కొత్త విషయం చెప్పడం 4.ఫలము :- ప్రయోజనము 5.అర్ధవాదము :- అర్ధాన్ని విచారించడం 6.ఉపపత్తి :- యుక్తి.
మహా వాక్యాల అర్ధం పరబ్రహ్మ. ప్రతిచోటా ఉపనిషత్తుల ప్రారంభంలోను, అంతంలోను కూడా బ్రహ్మను గురించి చెప్పబడింది. ఛందోగ్యోపనిషత్తులో ఉద్ధాలకుడు తన కుమారుడైన శ్వేతకేతువునకు బ్రహ్మోపదేశం చేస్తూ ఈ సృష్టి పూర్వం జగత్తు అంతా సత్తుగానే ఉండేది అని ప్రారంభించి ఇదంతా ఆత్మస్వరూపమే అని పూర్తి చేశాడు. తత్త్వమసి :- ఆ పరమాత్మయే నీవు అనే పదాన్ని అనేక మార్లు చెప్పాడు. అదే "అభ్యాసం". .ఉప్పు నీటిలో కలిసిన అది నీకు కనిపించదు. అలాగే బ్రహ్మ కూడా సర్వత్రా వ్యాపించినా నీకు కనిపించడు అంటాడు. అది "అపూర్వత". "బ్రహ్మ విద్ బ్రహ్మైవ భవతి":- అనే వాక్యం వలన బ్రహ్మను తెలుసుకున్నవాడు బ్రహ్మమే అని చెప్పబడినది. ఇది "ఫలము". ఎవడైతే బ్రహ్మలో అనేక రూపాలు చూస్తాడో అంటే బ్రహ్మ ఒకరు కాదు అనేకులున్నారు అని అనుకుంటాడో అతను గానుగకు కట్టిన ఎద్దులాగా సంసారమనే బండి చక్రంలో పడి తిరుగుతుంటాడు అని కఠోపనిషత్తు చెప్పింది. ఇది "అర్ధవాదము." కుమ్మరి మట్టితో అనేక రకాలపాత్రలు తయారుచేస్తారు.వాటి రూపాలు వేరైనా వాటిని తయారు చేయడానికి ఉపయోగించిన మట్టి ఒక్కటే. ఇది ఉపనిషత్తులలో ప్రతిపాదించింది. ఇది "ఉపపత్తి." 'పూర్వం చతుర్వేదాధ్యయనం చేసిన సంపన్నులైన గురువు లందరికి బ్రహ్మ గురువు, వేదశాస్త్ర నిర్మాత, కాలవిభజనకు లొంగని వాడు అని అన్నాడు పతంజలి. బ్రహ్మ కాలస్వరూపుడు. పుట్టిన ప్రతి జీవి కాలం తీరగానే కాలధర్మం ప్రకారం మృత్యువు బారిన పడక తప్పదు. సృష్టి, లయం రెండు కాల స్వరూపాలే. ఆ రెండు కలిపితే కాలం అనవచ్చును. భూతకాలంలో అంటే జరిగిపోయిన కాలంలో పుట్టిన వాళ్ళు రాబోయే కాలంలో మరణిస్తారు. ఆ పుట్టిన సమయం మరణించే సమయం మధ్యనున్న కాలమే వర్తమానం. బ్రహ్మ అశరీరుడు కనుక ఆయనకు కాలవిభజన వర్తించదు. హితాహితాలను గుర్తించి యోగ్యమైన జ్ఞానాన్ని ప్రసాదించే శబ్దజాలాల సృష్టి కర్త బ్రహ్మ. మానవులకు జ్ఞానోదయం కలిగించడానికి వేదరాశిని సృష్టించి, వేదములలోను, శాస్త్రములలోను విధిగా పాటించవలసిన నియమము లను, వాటిని పాటించక పోతే వచ్చే కష్టనష్టాలను నిష్కర్షగా తెలియజేసిన బ్రహ్మకన్నా అధికుడు లేడు. వేదములలోను శాస్త్రములలోను చెప్పబడిన విషయములను కాదని ఎవరైతే తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారో వారికి సుఖం లభించదు. ఉత్తమగతులు కలగవు. వేదములు శాస్త్రములు మనకు కొన్ని విధి నిషేధాలు ఏర్పరచాయి. చేయకూడని విధులు చెప్పాయి. చేయవలసిన విధులు చెయ్యకుండా చేయకూడని విధులు చేస్తే మోక్షం ఎప్పటికి రాదు. అశాస్త్రీయంగా యాగాలు, పూజలు చేస్తే ఫలితం కలగకపోగా పాపం చుట్టుకుంటుంది. బంగారు ఆభరణాలు వ్యావహారిక సత్యం అయితే ఆభరణాలలో ఉన్న బంగారం పారమర్ధిక సత్యం. అలాగే పరమాత్మ పారమర్ధిక సత్యం, సృష్టి స్థితి లయ నిర్వహించడం వ్యావహారిక సత్యం. అందరూ పరమాత్మ స్వరూపాలే అని తెలుసుకోవడమే జ్ఞానం. ఇలా అర్ధం చేసుకుంటే పరమాత్మ కాలస్వరూపుడు అని అర్ధం అవుతుంది.
ఈక్షత్యధికరణం
సూత్రం..6
" ఈక్షతేర్నా శబ్దమ్"
-జగత్తుకు కారణం చేతనమా? అచేతనమా? ఈక్షతేః ..సంకల్పం వలన బ్రహ్మం జగజ్జన్మాదులకు కారణం అయినదనీ,
అశబ్దం:-వేదం, శాస్త్రాలు చెప్పలేదు కదా అని అనడం, న:- సరియైనది కాదు.
భావం :- శబ్దం అంటే ఋగ్వేదాది శాస్త్రాలు, ఈక్షణం అంటే సంకల్పం, బ్రహ్మసంకల్పం వలన సృష్టి జరిగిందని ఎక్కడా చెప్పలేదు కదా! అని అనడం సరియైనది కాదు. బ్రహ్మ ఈక్షణ పూర్వకంగా తేజోమయమైన అగ్నిని, జగత్తును సృష్టించాడు. ఆయన జగజన్మాదులకు నిమిత్తం. ఈక్షణపూర్వకమైన సృష్టికి కర్త అయిన బ్రహ్మం అని ఛందోగ్యం వర్ణించింది. ఇది శబ్ద ప్రతిపాదితమే అవుతుంది.
వివరణ :- జగత్తుకు కారణం చేతనమా! అచేతనమా? జగత్తుకు కారణం బ్రహ్మసంకల్పమేననే విషయం వేదాలలో, శాస్త్రాలలో చెప్పలేదు కదా! అని అనడం సమంజసం కాదు. సాంఖ్యులు చెప్పేటటువంటి జడమైన ప్రకృతి ఈక్షణమనే పనికి కర్తగా చెప్పలేదు.అంటే బ్రహ్మ సంకల్పం లేదని వారి అభిప్రాయం.
ఛందోగ్యోపనిషత్తు:- ఉద్దాలక అరణి తన కుమారుడు శ్వేతకేతువుకి ఆత్మజ్ఞానం వివరిస్తూ ఈ జగత్తు అంతా సృష్టికి పూర్వం నామారుపాలతో కూడి లేదు. అద్వితీయంగా ఉండేది. కేవలం సత్తు మాత్రమే ఉండేది. ఆ రకంగా ఉన్న పరమాత్మ తాను అనేకం కావాలి అని సంకల్పించి, లోకాలను సృష్టించి, అనేక రూపాలు పొందాలనుకున్నాడు అని చెప్పాడు.
ఇతరేయోపనిషత్తు:- జీవాత్మ. పరమాత్మ రెండు ఒక్కటే . మరణానంతరం జీవాత్మ పరమాత్మతో లీనం అయిపోతుంది. ఆలోచనాపూర్వకంగా ఈ లోకాలను సృష్టించింది. సృష్టి జరగడానికి ముందు జగత్తు అంతా బ్రహ్మమయంగా ఉండేది. దానికి భిన్నమైన పదార్ధం లేదు. దానినే ఆత్మ అంటారు. ఆ ఆత్మయే లోకాలను సృష్టించింది.
ప్రశ్నపనిషత్తు:-దీనిలో 1 వ ప్రశ్నలో ప్రజాపతి సృష్టి చెయ్యాలనే కోరికతో రయి, ప్రాణం అనే జంటను సృష్టించాడు అని చెప్పి 3 వ ప్రశ్నలో ఆత్మ నుంచే ప్రాణం పుట్టింది. శరీరాన్ని ఆశ్రయించి నీడ ఉన్నట్లుగా ఆత్మ పైన ప్రాణం విస్తరించి ఉంది. నీడకు స్వతంత్రమైన అస్తిత్వం లేనట్లే, ప్రాణానికి కూడా స్వతంత్రంగా అస్తిత్వం లేదు అని చెప్పబడినది.
ముండకోపనిషత్తులో అంగీరసుడు తన శిష్యుడైన శౌనకునికి బ్రహ్మతత్త్వాన్ని వివరిస్తూ, ప్రజ్వరిల్లిన అగ్ని నుండి అదే విధమైన ఆకారం, గుణము వేలకొలది నిప్పు రవ్వలు బయటకు వచ్చినట్లే, పరబ్రహ్మ నుండి అనేకమైన శరీరాలు రూపాలు వెలువడి మళ్ళీ అందులోనే లీనమైపోతున్నాయి. బ్రహ్మ స్వయంప్రకాశం కలవాడు. నిరాకారుడు, బాహ్యంతరాలలో ఉండేవాడు. పుట్టుక ,ప్రాణము, మనస్సు లేని వాడు, పరిశుద్ధుడు, మాయకు అతీతుడు, అతని నుండే ప్రాణము, మనస్సు, సమస్త ఇంద్రియములు, పంచభూతాలు, పుడుతున్నాయి. వీటన్నింటిలో ఈక్షణ అనే దానికి కర్త ఆత్మ అనే చెప్పారు. అంతే కాని ప్రకృతి కాదు. కాబట్టి చేతన ధర్మము గల బ్రహ్మమే ఈ జగత్తుకు కారణం.
సూత్రం..6:
గౌణశ్చేన్నాత్మ శబ్దాత్;
ఆత్మ శబ్దాత్ :-ఆత్మ శబ్దంతో సూచించడం వలన గౌణః చేత్ :-"ఈక్షణం" అనే పదంప్రయోగం ప్రకృతివాచకం అనిభావించడం న :-సరియైనది కాదు. గౌణము..అప్రధానం కాదు.
భావం..ఈ వేదాంత దర్శనంలో గుణం అంటే ప్రకృతి ప్రధానం అంటే బ్రహ్మం. ఈక్షితి అంటే చూపు అనే శబ్దం అప్రధానం కాదు. అనగా ప్రాముఖ్యత లేదు అని చెప్పడానికి వీలులేదు.అంటే ఇక్కడ ఆత్మ అనేది జగత్తుకు కారణము.
వివరణ...ఆత్మ చేతనమైనది. జడమైన ప్రకృతికి ఆత్మ పదం చెప్పలేదు.ఆత్మ శబ్దానికి ప్రకృతి అనే అర్థం లేదు.ఆత్మ శబ్దం బ్రహ్మానికి వర్తిస్తుంది. వేద వాజ్మయం లో చెప్పబడిన అంశాలు:-1.బ్రహ్మాన్ని ఎరిగినవాడు మృత్యువుకి భయపడడు. పుట్టిన ప్రతీ జీవికి మరణం తప్పదు.మరణించిన వానికి జన్మ తప్పదు. అనివార్యమైన ఈ విషయం గురించి ఆలోచించడం అవివేకం. ఆత్మ నాశనం లేనిది అని తెలుసుకొని జీవుడిని ఈ సంసార సాగరం నుండి పరమాత్మను చేర్చేది బ్రహ్మవిద్య అనే నావ మాత్రమే. 2. ప్రవచనాలతో బ్రహ్మం లభించదు. ప్రవచన కర్తలు మోక్ష సాధనకు తగు సూచనలు ఇవ్వగలరే కానీ బ్రహ్మవిద్య బోధించలేరు. బ్రహ్మాన్ని చేరుకునే మార్గం తెలియజేసి, మోక్షసాధన చేయడానికి ఆత్మవిద్యను బోధించే సద్గువురువుల అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. 3.బ్రహ్మానికి అగ్ని తల, సూర్యచంద్రులు నేత్రాలు, దిక్కులు చెవులు, వేదాలు వాక్కులు, వాయువు ప్రాణం, విశ్వం హృదయం, పృధివి పాదాలు. అలాంటి ఈ బ్రహ్మం అన్ని భూతాలకు అంతరాత్మ.
శ్వేతాశ్వనోపనిషత్తు:- ఒకే దేవుడు అన్ని భూతాల్లో గుప్తంగా ఉన్నాడు. ఆయన సర్వ వ్యాపి. అన్ని భూతాలకు అంతరాత్మ అన్న వాక్యాలలో బ్రహ్మాన్ని ఆత్మ శబ్దంతో వ్యవహరించారు. అంతే కాని అచేతనమైన ప్రకృతికి కాదు.
ఐతరేయోపనిషత్తు:- ప్రధమాధ్యయంలో సృష్టి ఏ విధంగా జరిగిందో వివరించబడింది. ఆత్మయే ఆలోచనాపూర్వకంగా ఈ లోకాలను సృష్టించి లోకపాలకులను, విరాట్స్వరూపుని, ఇంద్రియాలను, ఇంద్రియాధిదేవతలను, ఇంద్రియాలకు అన్నం సృష్టించింది. ఇప్పుడు పరమేశ్వరుడు ఇంద్రియాలతో కూడిన మానవశరీరంలో ప్రవేశించాలి అనుకొని శిరస్సు నుండి బ్రహ్మరంధ్రం ద్వారా మానవశరీరంలోకి ప్రవేశించాడు.
ఛాన్దోగ్యోపనిషత్తు:- ఉద్ధాలకుడు తన కుమారుడైన శ్వేత కేతువునకు ఆత్మజ్ఞానం వివరిస్తూ, మొదట ఉన్నది ఏకైక పరబ్రహ్మ, అది అనేకం కావలనుకుంది, రకరకాల రూపాలతో వస్తువులుగా, జీవులుగా, రూపుదాల్చింది. ద్రవ, ఘన, వాయు పదార్ధాలుగా మార్పుచెంది, అనేకరూపాలతో సృష్టి ఆకారం పొందింది. ఈరకంగా పరమాత్మ నుంచే అన్ని వచ్చాయి. తాను అనేకం కావాలనుకున్నప్పుడు సత్తు మొదటగా అగ్నిని సృష్టించింది. అగ్ని నుండి జలము, జలము నుండి భూమి ఏర్పడ్డాయి. అప్పుడు సత్తు అగ్ని, జలము, అన్నములలో ప్రవేశించి ఆయా రూపాలుగా వ్యక్తమైంది. జీవుడు ఈ శరీరానికి చేతనుడైన యజమాని. బ్రహ్మానికి జీవుడు స్వరూపం. మానవుడు నిదురించేటప్పుడు తాత్కాలికంగా ఆత్మలో లీనమౌతాడు. మరణకాలంలో వాక్కు మనస్సులో లీనమౌతుంది. మనస్సు ప్రాణంలో లీనమౌతుంది. ప్రాణం తేజస్సుతో కలిసిపోతుంది. చివరకు అది పరమశక్తిలో కలిసిపోతుంది. ఆ శక్తి చాలా సూక్ష్మమైనది. కానీ విశ్వమంతా వ్యాపించి ఉన్నది. అదే సత్యము, అదే నిత్యము, అదే ఆత్మ, అదే నీవు శ్వేతకేతు ఆఆత్మ నీవే అని ఉద్ధాలకుడు చెప్పాడు. ఈ రకంగా నువ్వే ఆత్మ అని ఉపదేశం చేశారు.అంటే ఆత్మ జీవుడు ఒక్కటే అని చెప్పబడినది.
సూత్రం :- 7
"తన్నిష్టస్య మోక్షోపదేశాత్ "
తత్ నిష్ఠస్య:- బ్రహ్మంలో నిష్ఠ ఉన్నవాడికి మోక్షోపదేశాత్ :-మోక్షం లభిస్తుందని శాసించడం వలన.
భావం:-బ్రహ్మనిష్ఠ లో ఉన్నవాడికి మోక్షం లభిస్తుంది.ఇక్కడ ఆత్మ ప్రకృతికి సంబంధించినది కాదు.ఆత్మకు మాత్రమే సంబంధించినది.
వివరణ:- బ్రహ్మనిస్ట ఉన్నవారు శరీరపాతం కాగానే ముక్తుడై బ్రహ్మాన్ని పొందుతాడు అని ఉన్నది. ఈస్థితిలో ఆత్మ శబ్దం ప్రకృతి వాచకం ఎలా అవుతుంది? ప్రకృతి నిష్ఠ మోక్ష హేతువు కాదు కదా! ప్రకృతి బ్రహ్మనుండి ఆవిర్భవించినప్పటికి ఆత్మ శబ్దం ప్రకృతికి వర్తించదు. ఎందుకంటే ప్రకృతి జడమైనది, అశాశ్వతమైనది. బ్రహ్మ చైతన్యమైనది, శాశ్వతమైన ఆనంద స్వరూపం. కనుక ఆత్మశబ్దం బ్రహ్మం కి వర్తిస్తుంది. మానవుడికి ప్రకృతి స్థూల, సూక్ష్మ రూపాలు తెలియవలసినదే. ప్రకృతిలో ఉండే ఆనందానికి అశాశ్వతమైన సుఖాలకు భ్రమసి దానితో రమించకుండా మోక్షాన్ని కోరుకొని బ్రహ్మసాక్షాత్కారం కోసం నిరంతరం ప్రయత్నించాలి. రాగ ద్వేషాలు మోక్షానికి ప్రతిబంధకాలు. అవి హేయమైనవి. కాబట్టి స ఆత్మా, తత్త్వమసి లోని ఆత్మ శబ్దం బ్రహ్మ వాచకం. పోనీ ఈక్షణం కూడా ప్రకృతి వాచకం కాదా? అంటే కాదు అనే చెబుతున్నారు. ఆత్మనిష్టుడైన వాడికి మాత్రమే మోక్షోపదేశం చెయ్యడం వలన ప్రకృతిని ఆత్మ శబ్దంతో చెప్పడానికి వీలు లేదు. శరీరము జడం, అది ఆత్మ కాదు. శ్వేత కేతువు ఆత్మజ్ఞానాన్ని పొందే ఉపాయమేదో వివరించండి అన్నాడు. శ్వేతకేతూ! ఒక మనిషి చేతులు కట్టివేసి, కళ్ళకు గంతలు కట్టి, భయంకరమైన అరణ్యంలో వదలివేశావనుకో! అప్పుడు అతనికి తను ఎక్కడ ఉన్నాడో తెలియదు. దారితెన్ను తెలియదు. పగలు, రాత్రి కూడా తెలియవు. పిచ్చివాడిలా అరుస్తూ ఏడుస్తూ తిరుగుతాడు. ఎవరైనా వచ్చి కళ్ళకు గంతలు విప్పేస్తే అతనికి త్రోవ కనిపిస్తుంది. కనిపించని దారిలో వెడుతూ, తనకు కనిపించినవారిని తన ఊరికి దారి చెప్పమని అడుగుతాడు. అటువంటి ఆత్మనిష్ఠ గలవారికి శరీరం వదలడమే ఆలస్యం మోక్షం వస్తుంది. అతను బ్రహ్మ అవుతాడు. బ్రహ్మనిష్టాపరుడైన వానికి సరియైన మార్గం చూపించే సద్గురువు ఉపదేశిస్తేనే మోక్షం అందుకోగలడు అని చెప్పాడు గురువు.
ముండకోపనిషత్తు :- జీవాత్మ. పరమాత్మ రెండు ఒక్కటేనని వివరిస్తూ, ఒకే పేరు, రూపం గల రెండు పక్షులు ఒక చెట్టు మీద కూర్చునిఉన్నాయి. అందులో ఒకటి జీవి, కర్మఫలాలు అనుభవిస్తోంది. రెండవది పరమాత్మ. కర్మఫలాలు ఏమి లేకుండా కూర్చుంది. శరీరమే ఆ వృక్షం అయినప్పుడు ఆ పక్షులు దానిలో భాగలే, ఆ రెండు ఒక్కటే అవుతాయి. జీవాత్మ పరమాత్మ ఒక్కటేనని భావం. పరమాత్మ దివ్యుడు, సూక్ష్మాతి సూక్ష్మమైనవాడు అజ్ఞానులకు దూరంగా, జ్ఞానులకుదగ్గరగా ఉంటాడు. అతనికి రూపం లేదు. కంటికి కనిపించదు. ఆత్మ మనలోనే సూక్ష్మ రూపంలో ఉంది. ఆత్మ సాక్షాత్కారం జరగాలంటే చిత్తశుద్ధి అవసరం.శుద్ధమైన అంతఃకరణ గల జ్ఞాని కోరుకున్నది పొందగలడు. అతనికి పునర్జన్మ ఉండదు. అతనే సాక్షాత్తు పరబ్రహ్మ అని చెప్పదమైనది. పరబ్రహ్మ అంటే ఎవరు? సాధకుని శరీరమా? కాదుకదా! మరణానంతరం శరీరం మట్టిలో కలిసిపోతుంది. మరి బ్రహ్మ అంటే శరీరాన్ని నడిపించే చైతన్యమేదైతే ఉందో అదే జీవాత్మ, పరమాత్మ రెండు ఒక్కటే. అంటే జడమైన సాధకుని శరీరం బ్రహ్మకాదు. చేతనమైన ఆత్మయే బ్రహ్మం. సాధకుడికి శరీరమే ఆత్మ అనుకుంటే అంధ, వృషభ న్యాయంలా ఉంటుంది. పూర్వకాలంలో ఒక గ్రుడ్డివాడు తన బంధువుల ఇంటికి అడవిలోనుండి పోవాలి. ఆ అడవిలో పెద్దరాయి తగిలి పడిపోతాడు. ఒక తుంటరి అతని సమాచారం తెలుసుకొని గడ్డి మేస్తున్న ఒక పొగరుబోతు ఆబోతును తీసుకువచ్చి, దాని తోక పట్టుకుంటే మీ బంధువుల ఇంటికి చేరుస్తుంది అని చెబుతాడు. దాని తోక పట్టుకోగానే పరుగు పెట్టడం మొదలుపెట్టింది. గ్రుడ్డివాడు క్రింద పడిపోయి దెబ్బలు తగిలి ప్రాణాపాయం తెచ్చుకున్నాడు. శరీరమే ఆత్మ అనుకున్నవారి గతి ఇలాగే ఉంటుంది. కనుక జడమైన సాధకుని శరీరం ఆత్మకాదు. అతనికి ఉన్న జీవాత్మయే పరబ్రహ్మ. ప్రజాపతి చేసిన ఉపదేశాన్ని తప్పుగా అర్ధం చేసుకున్న రాక్షసులు ఈ శరీరమే ఆత్మ అనుకోని భ్రష్టులయ్యారు.
సూత్రం 8.
'హేయత్వావచనాచ్చ
'చ :- పైగా హేయత్వావచనచ్చ :-ప్రకృతి నిష్ఠ హేయం అగ్రాహ్యం.
భావం :- పైగా ప్రకృతి నిష్ఠ హేయమైనది. ఆత్మ శబ్దం ప్రకృతికి వాచకం కానేరదు.
వివరణ :- ప్రకృతి అనేది అనాత్మ, జడము. ప్రకృతే ఆత్మ అయిఉంటే తేలికగా అర్ధం చేసుకోవడం కోసం స్థూల అరుంధతి న్యాయంగా తత్త్వమసి అని చెప్పినప్పటికీ, ఆ తరువాత యదార్ధమైన దానిని గ్రహించేటట్లు చెయ్యడం కోసం ముందు చెప్పిన దాన్ని నిరాకరించాలి. అలా చెయ్యలేదు కాబట్టి జడమైన ప్రకృతి యదార్ధం కాదు అని వాదన.
స్థూల అరుంధతీ న్యాయం:- అరుంధతి వశిష్ఠ మహర్షి భార్య. మహా పతివ్రత. నిత్య సౌభాగ్యవతి. వశిష్ఠుడు సప్త ఋషులలో ఒకరు. నక్షత్ర మండలంలో ఉత్తర దిక్కున సప్తఋషులు ఉంటారు. సప్త ఋషి మండలం పైన ధ్రువ మండలం ఉంది. సప్త ఋషి మండలంలో క్రింద వరుసలో నున్న 3 నక్షత్రాలలో మధ్యన ఉండేది వశిష్ఠ నక్షత్రం. వశిష్ఠ నక్షత్రానికి దిగువగా అతి సమీపంగా ఉండే అతిచిన్న నక్షత్రము అరుంధతి. చాలా జాగ్రత్తగా చూస్తే గాని కనిపించదు. స్థూల అరుంధతి న్యాయం అంటే చాలా చిన్నదైనా అరుంధతి నక్షత్రాన్ని చూడడానికి దానికి దగ్గరలో ఉన్న పెద్ద నక్షత్రం అయిన వశిష్ఠ నక్షత్రాన్ని ఆనవాలుగా చూపించి, ఆ తరువాత అది కాదని దాని ప్రక్కన ఉన్న అరుందతి నక్షత్రాన్ని చూపుతారు. అలాగే ఏదైనా ఒక సూక్ష్మమైన విషయాన్ని తెలియజేసేటప్పుడు అది సులభంగా అర్ధం కావడానికి ఇంకొక స్థూల విషయాన్ని ముందుగా చెప్పి, ఆతరువాత అది సులభంగా అర్ధం కావడానికి, అది కాదు అని అసలు విషయం చెబుతారు. ప్రకృతి నిష్ఠ హేయమైనది కనుక మానవుడికి ప్రకృతి తత్త్వం తెలియాల్సి ఉంది. సకల కార్యములను కలగజేయడానికి ప్రకృతే మూలకారణం. ఆకార్యముల వలన కలిగే సుఖదుఃఖములను అనుభవించడానికి పురుషుడే కారణం. ఈ పురుషుడు ప్రకృతిలో లీనమై ఏవేవో కారణములతో ఎన్నో కార్యములు చేస్తుంటాడు. ఇది సహజం. దానికి మూల ప్రకృతే కారణం. ప్రకృతిలో ఉన్న వస్తువులు సాధించడం కోసం అనేక కార్యములు నిర్వహించడం వలన సుఖదుఃఖాలు కలుగుతుంటాయి. పురుషుడు అనే జీవాత్మ ఆ సుఖదుఃఖములను అనుభవిస్తున్నట్లు భ్రమ చెందుతుంటాడు. నిజానికి సుఖాలు దుఃఖాలు అనే లేవు. అది కేవలం మానసికస్పందన మాత్రమే. ప్రకృతి వలన కలిగే సుఖదుఃఖములకు మూలం పురుషుడు. నిజానికి పురుషునికి ఎటువంటి సుఖదుఃఖములు వికారములు లేవు. కానీ ప్రకృతిలో ఉండి కార్యములు చేయుట వలన ఆ కార్యములు వలన కలిగే సుఖదుఃఖములకు జడమైన ప్రకృతి అనుభవించలేదు. పురుషుడు అనుభవిస్తున్నట్లుగా కనిపిస్తున్నాడు కానీ పురుషునికి ఏ వికారములు లేవు. ప్రకృతి మాయ అని తెలుసుకొని రాగద్వేషాలను వదలి శాశ్వతమైన ఆనందం కోసం మోక్షాన్ని కోరుకొని, బ్రహ్మ సాక్షాత్కారం కోసం నిరంతరం ప్రయత్నం చెయ్యాలి. ప్రకృతి హేయమైనది కనుకనే ఆత్మ శబ్దం ప్రకృతికి వర్తించదు.
సూత్రం :-9
”స్వాప్యయాత్”
'స్వ - సత్ , అప్యయం -లయం , స్వాప్యయాత్ :- సుషుప్తిలో జీవుడు బ్రహ్మంలో లయమౌతాడు.
భావం :- జీవుడు సుషుప్తిలో నిద్రిస్తున్నప్పుడు బ్రహ్మం లో లీనమౌతాడు.అందువల్ల నిద్రిస్తున్నాడని అంటారు.
వివరణ:-నిద్రపోతున్నప్పుడు మానవుడు ఎక్కడికిపోతున్నాడు? అన్న శ్వేతకేతువుకు తండ్రి ఉద్ధాలకుడు చెబుతున్నాడు. నాయనా! నిద్రపోతున్నప్పుడు మనిషి తాత్కాలికంగా ఆత్మలో తాదాత్మ్యం చెందుతాడు. తేనెటీగలు తోట అంతా తిరిగి మకరందాన్ని స్వీకరించి తేనెగా తయారుచేస్తాయి. ఆ తేనె పువ్వులనుంచి స్వీకరించినదే. కానీ ఏ చుక్క ఏ పూవునుండి తీసిందో చెప్పలేము. అలాగే జీవరాశులు విడివిడిగా ఉన్నప్పటికీ ఆత్మలోనే లీనమై ఉంటాయి. అది నిద్రాసమయం. లేదా మరణసమయ .ఏదైనా కావచ్చును. గాఢ నిద్రలో గతం తెలియదు.
బృహదారణ్యకోపనిషత్తు..జీవి నిద్రిస్తుండగా ఇంద్రియముల యొక్క విషయాలన్నీ అంటే వాక్కు మొదలైన ప్రాణాల విజానాన్ని పూర్తిగా గ్రహించి హృదయాకాశంలో నిద్రిస్తున్నాడు .ఈ రకంగా సుషుప్తిలో ఇంద్రయాలన్నీ ఆత్మలో లీనం చెందుతాయని చెప్పబడింది.
జాగ్రదావస్థ:- ఈ స్థితిలో ఒక వ్యక్తి తన శరీరభాగాలు మఱియు వాటియొక్క స్వేచ్ఛసంకల్పంతో పనిచేస్తాయి. జ్ఞాన వస్తువులు అందుబాటులో ఉంటాయి. తన కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియలకు సంబంధించిన స్థూల శరీరం అవగాహన ఉంటుంది. స్థూల, సూక్ష్మ, కారణ శరీరరాలు అందుబాటులో ఉండి ప్రతిదాన్ని అనుభవించిన వారిని విశ్వ అని పిలుస్తారు. ఈ స్థితి స్వప్నానికి సుషుప్తికి సాధ్యం కాదు. ఈ స్థితిలో జీవా అనిపిలుస్తారు. వికల్పాలు ఉన్నాయి.దీనికి కారణం దీనికి కారణం అతను స్థూల సూక్ష్మ శరీరాలను కలిగిఉన్నాడు.
స్వప్నావస్థ:- ఒక వ్యక్తి జాగ్రదావస్థలో సేకరించిన అనుభవాలు కలలో సంభవిస్తాయి. కలలు నిర్దిష్ట క్రమంలో లేవు. యాదృచ్చికం. కోరికల గురించి ఆలోచిస్తూ అణచివేసిన రాగద్వేషాలను మేలుకొన్న స్థితిలో ఉన్న అనుభవాలు కలలో వస్తాయి. ఇది సగం నిద్రలో ఉన్న స్థితి. ఒక నిర్దిష్ట విషయం గురించి ఆలోచిస్తూ ఆ సమస్యలకు పరిష్కారం కలలో కూడా జరుగుతుంది. అసంపూర్తిగా ఉన్న కోరికలు లేదా వాసనలు తరచుగా కలలో వస్తాయి. కల సమయంలో వేరే పరధ్యానం ఉండదు. కనుక ఆలోచనలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. కలలో తనతో తను మాత్రమే లావాదేవీలు జరుపుతారు. అతన్ని తేజసా అంటారు.
సుషుప్తి:- ఆ స్థితిలో ఏమి తెలియదు. మూడు శరీరాలు కరిగిపోతాయి. ప్రతి ఒక్కరికి నిద్ర తప్పనిసరి. ఈ అవస్థలో శరీరము స్థూల సూక్ష్మ కారణ శరీరముల యొక్క అభిమానం లేదు. వ్యక్తిత్వం పోయింది. జాగ్రదావస్థలో ఉన్న స్థూల శరీరమునకు చెందిన అభిమానం గాని స్వప్నమునకున్న, సూక్ష్మ శరీరమునకు చెందిన అనుభూతిగాని ఏమియు ఎరుగడు. గాఢ నిద్రావస్థ నిత్యానుభవ రూపమైన స్వస్వరూపానుభూతిని అనుభవించును. అనగా తాను సాక్షిచైతన్యమగు జీవుడు స్వస్వరూపము నందు లయించును. నేనేమి ఎరుగను? అంటాడు, అనగా స్వప్నమునందు గాంచిన విషయములుగాని జాగ్రదావస్థలో ఐహిక సుఖములు గాని ఏమి కానరావు. దీనినే సుషుప్తి అని పేరు.సుఖానుభవం కష్టం నష్టం దుఃఖం ఎరుగడు. జాగ్రదావస్థలో జీవుడు జడమైన చేతనాత్మకమైన బాహ్య విషయములలో తగులుకొని ఉంటాడు.సుషుప్తిలో విషయాల నుంచి విరక్తుడై సత్ లో లీనమైనట్లుగా ఉంటాడు.
సాంఖ్య దర్శనం:-సమాధిలోను సుషుప్తిలోను మోక్షంలోను జీవుడు బ్రహ్మ సారూప్యం చెందుతాడు. బ్రహ్మంలో అవిభక్తముగా ఉంటాడు. సత్ లో లయం కావడం స్వపతి. సత్ శబ్దం ప్రకృతి వాచకం కాదు. జీవుడు ప్రకృతిలో లయం కాడు. జీవుడిలాగా ప్రకృతి సైతం బ్రహ్మాన్ని ఆశ్రయించి ఉంటుంది.జీవుడుకి ప్రకృతి భోగస్థానం. లయస్థానం కాదు. భోగమున్నంత వరకు ఆనుభవించి జీవుడు ప్రకృతిని వడాలివేస్తాడు. జీవుడు నాశరహితమైన పరమాత్మను చేరతాడు. సత్ శబ్దం బ్రహ్మాన్ని బోధిస్తుంది. ఆ బ్రహ్మమే ఈక్షణ కర్త. అది బ్రహ్మ ధర్మమే అవుతుంది.కానీ ప్రకృతి ధర్మం కాదు.
సూత్రం :- 10
"గతిసామాన్యాత్"
గతి :- జ్ఞానత్వం ఈక్షణం:-సంకల్పం
భావం:- జ్ఞానత్వం వలన కూడా ఈక్షణం ప్రకృతి ధర్మం కానేరదు. పర్యాలోచన పూర్వక జ్ఞానం. జ్ఞానం చేతన ధర్మమే కానీ జడధర్మం కాదు.ప్రకృతి జడం. కనుక ఈక్షణం బ్రహ్మధర్మమే.
వివరణ :- వేదాంతములన్ని చేతనమైన బ్రహ్మయే జగత్కారణం అని చెబుతున్నాయి. కాబట్టి జగత్కారణం ప్రకృతి కాదు. బ్రహ్మమే. ఉపనిషత్తులలో ఒకసారి జగత్తుకు కారణం బ్రహ్మ అని ఇంకోసారి కాదు అని చెప్పలేదు. ప్రతి చోట ఉపనిషత్తులు ఈ జగత్తుకు కారణం బ్రహ్మమే అని చెప్పాయి.
ముండకోపనిషత్తు :- శౌనకుడికి అంగీరసుడు ఈ విషయాన్ని చెబుతూ ' ప్రజ్వరిల్లిన అగ్ని నుండి అదే విధమైన ఆకారం, గుణము కల వేలకొలది నిప్పురవ్వలు వెలువడినట్లు పరబ్రహ్మము నుండి అనేకమైన జీవరాసులు ఉద్భవించి మళ్ళీ అందులోనే లీనమౌతాయి.' అని చెప్పాడు. సాలెపురుగు ఏసహాయం లేకుండానే తన శరీరం నుండి దారాలను తయారుచేసి వాటిని మళ్ళీ తానే మ్రింగేస్తుంది. భూమినుండి ఓషధులు పుడుతున్నట్లుగా, మానవశరీరం మీద రోమాలు పుడుతున్నట్లుగా, అక్షర పరబ్రహ్మము నుండి ఈ జగత్తు పుడుతున్నది.
తైత్థరీయోపనిషత్తు :- సృష్టికి మూలం ఆత్మ. దాని నుంచి ఆకాశం పుట్టింది. పంచభూతాలు పుట్టాయి. పంచభూతాల వలనే శరీరం ఉద్భవించింది.' అని చెప్పబడినది. ఈరకంగా ప్రతి ఉపనిషత్తుకూడా ఈ జగత్తుకు కారణం బ్రహ్మయే అని చెబుతున్నాయి. ఈ శరీరం ఎలా ఏర్పడింది? గతజన్మల కర్మలననుసరించి పంచభూతల యొక్క పంచీకరణ వలన శరీరం తయారైనది. సుఖదుఃఖాలు అనుభవించడానికి క్షేత్రం లాంటిది. నేను అనుకుంటున్న స్థూల దేహం స్వతంత్రంగా ఏ పని చేయలేదు. జీవుడు కష్టసుఖాలు అనుభవించడానికి అది ఒక ఇల్లు లాంటిది. బ్రహ్మ సృష్టి ఆవిర్భావంలో పంచభూతాలు ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి సృష్టించబడ్డాయి.ఇవన్నీ పంచీకరణ చెందటం వలన కంటికి కనిపిస్తున్నాయి. పంచభూతాలు ఒక్కొక్కటి మిగిలిన నాలుగు పంచభూతాల్లో కలిసిపోయి పంచీకరణ చెందుతాయి. అంటే భూమిలో జలం అగ్ని వాయువు ఆకాశం ఒక్కొక్కభాగం వచ్చి కలిసిపోతాయి. అలాగే జలంలో భూమి అగ్ని వాయువు ఆకాశం కలిసి పోతాయి. అలా అగ్ని, వాయువు, ఆకాశం కూడా కలసి పంచీకరణ చెంది, ఈ పంచభూతలతోనే శరీరం ఏర్పడింది. ఎముకలు భూమికి, రక్తం చీము జలానికి, ఉష్ణోగ్రత అగ్నికి, పీల్చే గాలి వాయువుకి, శరీరం లోపల ఖాళీప్రదేశం ఆకాశానికి సంబంధించినవి. జీవుడు ఈ స్థూలదేహం వదిలి పెట్టి వెళ్లిన తరువాత సూక్ష్మ దేహం ఏ పుణ్యం చేసిందో ఏ పాపం చేసిందో ఆ వాసనలు కోరికలు వాటిని తీర్చుకోవడానికి మళ్ళీ జన్మ వస్తుంది.పూర్వ జన్మల పాపాపుణ్యాల వలన పంచీకరణ ద్వారా ఏర్పడిన పంచభూతల వలన శరీరం ఏర్పడుతుంది. జన్మ ఎలా వస్తుంది? సూక్ష్మ రూపంలో ఉన్న జీవుడు వానబిందువు రూపంలో వ్యవసాయ క్షేత్రంలో పడి, విత్తనం మొలక వస్తుంది. దానికి పండిన ధాన్యం ఎవరు అన్నంగా స్వీకరిస్తారో ఆ తండ్రి లో వీర్యంగా మారి, తల్లి గర్భంలో ప్రవేశించి గర్భస్థ శిశువుగా పెరుగుతాడు. ఏ ధాన్యంగింజ ఎవరు తినాలో, వారి పాప పుణ్యాల ఆధారంగా ఎవరికి పుట్టాలో, వారే ఆ గింజలు తినాలని సంకల్పించేది పరమాత్మే. మానవుని యొక్క వాదనలకు అనుగుణంగా స్థూల శరీరం పనిచేస్తుంది. స్థూల సూక్ష్మ శరీరాలు చైతన్యవంతం అవుతాయి. ఆశలు, ఆశయాలు, బాధ్యతలు, సూక్ష్మ శరీరం చేసేది. స్థూల శరీరం నిలబడటం, మాట్లాడటం, నిద్ర, పనులన్నీ సూక్ష్మ శరీరం చెబుతునట్లే చేస్తుంది. ఆత్మ చైతన్యమే నేను అనే సూక్ష్మశరీరంలో ప్రకాశింపజేసి, స్థూలశరీరం పనిచేసేటట్లు ప్రేరేపించబడుతుంది. స్థూలశరీరంలో కల్పితమైన ఆలోచనలతో కల్పితమైన ప్రపంచంలో విహరిస్తుంటుంది. శరీరాన్ని నిర్మించుకొని ఈ రెండు వ్యవస్థలు ఆత్మ చేత ప్రకాశింపబడుతున్న మనోబుద్ధులు చేత పనిచేస్తుంటాయి. స్థూల సూక్ష్మ శరీరాలతో బాటు కారణ శరీరం కూడా ఉంటుంది అది అవిద్య, అమాయకత్వం వలన ఆత్మ తెలియకుండా చేసి వాసనలు అనే ముసుగులో ఆత్మను తెలుసుకోలేకుండా చేస్తుంది. ఈ మూడు వ్యవస్థలను ఆత్మ సాక్షిగా చూస్తూ ఉంటుంది.
సూత్రం..11
శ్రుతత్వాచ్చ
చ:- పైగా. శృతత్వాత్ :- శాస్త్రాలు కూడా అలాగే అంటున్నాయి.
భావం :-సృష్టికి పూర్వం బ్రహ్మం ఒక్కడే ఉన్నాడు.ఆయన ఈక్షించాడు అంటే సంకల్పించాడు అని స్పష్టంగా ఉంది. ఈక్షతధర్మం ప్రకృతిది కాదని తెలుతోంది. ఇలా జగజ్జన్మాదులకు సర్వజ్ఞమైన బ్రహ్మమే నిమిత్తకారణం.
వివరణ :- సర్వజ్ఞుడైన బ్రహ్మమే ఈ జగత్తుకు కారణం అని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. కనుక ఈ జగత్తుకు కారణం చేతనమైన బ్రహ్మమే కానీ అచేతనమైన ప్రకృతి కాదు అని 5వ అధికారణం పూర్తిచేశారు రత్నాకరుడు. గురువుగారు! ఈశ్వరుడు ఒక్కడే అయినప్పటికీ సాకారం నిరాకారం అని రెండు రకాలుగా చెప్పబడుతున్నాయి. నామము, రూపము, వికారం, ఉపాధి వీటితో కూడినవాడు ఉపాస్యుడు. ఈయనే సాకారుడు. నామరూపవికారములు లేనివాడు నిరాకారుడు అనబడతాడు.ఈ ఇద్దరిలో ఎవరు బ్రహ్మ? కాస్త వివరించండి?అని అడిగాడు నారాయణ భట్టు. నాయనా! వీరిద్దరిలో ఎవరి వల్లనైతే నీకు శాశ్వత ఆనందం కలుగుతుందో అతడే బ్రహ్మ. ఈ విషయం 6వ అధికారణం లో వివరించబడింది అని చెప్పాడు. ఆత్మలు రకాలు:- ఆత్మలు 2 రకాలు .జీవాత్మ పరమాత్మ. విశ్వవ్యాప్తంగా ఉండే శక్తి పరమాత్మ. జీవులలో ఉండే తన అంశను జీవాత్మ అంటారు. ఈ జీవాత్మలో పరమాత్మ సాకారరూపంలో ఉంటాడు. నామము, రూపము. వికారం, ఉపాధి వీటితో కూడిన వాడే జీవాత్మ. ఈయనే సాకారుడు. నామరూపవికారములు లేనివాడు పరమాత్మ. వీరిద్దరిలో ఎవరు బ్రహ్మ? అని సందేహం వస్తే ఎవరి వలన జ్ఞానసిద్ధి కలిగి ఆత్మానందం వస్తుందో వారే బ్రహ్మ అని నిర్ణయించారు. గంగ, బ్రహ్మపుత్ర, సింధు, యమునా, సరస్వతి, గోదావరి, కృష్ణ, కావేరి మొదలైన నదులన్ని వ్యవసాయక్షేత్రాలను సస్యశ్యామలం చేస్తూ, చివరికి సాగరంలో కలసిపోతాయి. ఆ తరువాత వాటి నామరూపాలు అస్తిత్వం కోల్పోయి సాగరంగానే మిగిలిపోతాయి. నదులన్ని కలసినప్పటికి దానిని సాగరం అనే అంటారు కానీ నదులు అనరు. అదే విధంగా జీవాత్మలన్ని పరమాత్మతో కలసిపోయినప్పుడు వారి నామరూపాలు అస్తిత్వం కోల్పోతారు.అందుకే విశ్వవ్యాప్తమైనది బ్రహ్మమేనని చెప్పబడింది క్షరం, అక్షరం ద్వైతమే కానీ నిజానికి అద్విైతం కారణం. ఒకే సమయంలో ఇద్దరు ఉనికి సాధ్యం కావడం లేదు. అంటే ఉంది అనుకున్నప్పుడు లేనిదానికి ఉనికి లేదు. లేదు అనుకున్నప్పుడు ఉండటం జరుగదు. అద్వైతంలో రెండు ఒక్కటే. జీవాత్మ ఉంటే పరమాత్మ కనబడడు.పరమాత్మ కనిపిస్తే జీవాత్మ కనబడడు. పరమాత్మ వాస్తవం.జీవం వెంట పరుగులు తీస్తున్న ఆత్మ పరుగిడుతున్నంతకాలం క్షరమే. పరుగెత్తడం ఇహం. అంటే ఈ లౌకిక ప్రపంచంలో జీవాత్మ ఎప్పుడు పరుగుపెడుతుంటాడు కనుక దానిని క్షరం అన్నారు. పరమాత్మతో కలిసిన తరువాత ఇక పరుగు పెట్టలేని స్థితి .అది అక్షరం. అదే పరం. ఏ వికారం అజ్ఞానం భ్రమలకు ఎరుగనిది అక్షరం. ఆవికారాలకు అజ్ఞానం భ్రమలకు అవకాశమిచ్చినది దేహరూపంలో వ్యక్తమైన ఆత్మ. నశించేది ఆత్మ కాదు. ఆత్మ తొడుకున్నరూపమే. అంటే మానవదేహమే. పరమాత్మ అపరిమితం. జీవాత్మ పరిమితం. భౌతికం అనే కంచె లేకపోతే ఇహము పరము రెండు ఒక్కటే. ఇహంలోని ఆత్మ పరంలోని పరమాత్మ అక్షరాలే. రెండు ఒక్కటే కాబట్టి అక్షరమే. అంటే ఆత్మను ఆవరించిన భౌతికత నశిస్తోందే తప్ప ఆవరణలకు అతీతమైన ఆత్మ నశించడం లేదు. సృష్టింపబడు తున్నది నశిస్తోందే కానీ సృష్టికి మూలమైనది నశించడం లేదు. ఆత్మకు పరివర్తనకు అవకాశం ఇవ్వదు .అంటే క్షయం, నాశనము, వికారం. భ్రమ అనేవి జీవాత్మకు సంబంధించినవి. ఆత్మ ఒక్కో పర్యాయం ఒక్కో శరీరాన్ని ఒక్కో భౌతిక పదార్ధాన్ని జగతిని చేరుతుంటుంది. అలా ఆత్మ భౌతిక రూపంలో ఉన్న పదార్ధాన్ని చేరినప్పుడు దానిని క్షరతత్త్వం అని, ఆత్మ వాటినుండి విడివడినప్పుడు అక్షరతత్త్వం అని అంటారు. అందుకే ఇహంలో ఆత్మ క్షరం గాను పరంలో ఆత్మను అక్షరంగా చెప్పుకుంటాము. క్షరం అంటే నశించేది అక్షరం అంటే నాశరహితమైనదని అదే పరబ్రహ్మమని శ్రీ కృష్ణ పరమాత్మ అక్షరపరబ్రహ్మ యోగంలో చెప్పాడు. ఆత్మ నిత్యమైనది, సత్యమైన జ్ఞానం కలిగినది, రూపం లేనిది నిత్యానందస్వరూపమైనది, ఆది అంతములు లేనిది కనుకనే సృష్టికి మూలం ఆత్మే అంటే పరమాత్మేనని ఈక్షణధర్మం అంటే సంకల్పం చెయ్యాలనే ధర్మం బ్రహ్మనిదే కానీ ప్రకృతికి వర్తించదు.
ఆనందమయాధికారణం:- ( 1,1,12 )
సూత్రం..12
ఆనందమయోభ్యసాత్
అభ్యాసాత్ :-అనేక విధాలుగా శాస్త్రాలు ఘోషించడం వలన ఆనందమయం :-బ్రహ్మమే ఆనందం
భావం :-ఆనందమయుడు అనే శబ్దాన్ని పరబ్రహ్మను సూచించడానికి ఉపనిషత్తులలో శాస్త్రాలలో ఘోషించడం వలన విజ్ఞానమయం కన్నా భిన్నమైన అంతరాత్మ ఆనందమయమని అంటే బ్రహ్మమే ఆనందమని తెలియజేశారు.
వివరణ;- తైత్తరీయోపనిషత్తు:-మానవ శరీరంలో పంచకోశాలైన అన్నమయకోశం, ప్రాణమయకోశం, మనోమయకోశం, విజ్ఞానమాయకోశం, దాటిన తరువాత ఆనందమయం కోశం ఉన్నది. అదే పరమాత్మ స్థానం. చరాచర జగత్తు అంతా బ్రహ్మమయమే. సృష్టికి పూర్వం అంతా శూన్యంగానే ఉండేది. ఆ శూన్యంలో పరబ్రహ్మ ఒక్కడే ఉండేవాడు. అతనే నామరూపములతో జగత్తును సృష్టించాడు. అతడే ఆనందమాయమైన బ్రహ్మ. బ్రహ్మను తెలుసుకున్నవారు మోక్షానికి అర్హులు. అంటే తానే పరబ్రహ్మ అవుతాడు. పరబ్రహ్మను తెలుసుకున్నవాడికి జ్ఞానము ఇష్టకామ్యార్ధ సిద్ధి కలుగుతుంది. సాయుజ్యం లభిస్తుంది. ఆనందమయుడు బ్రహ్మ. అంటే ఆనందం కలగజేసేవాడు బ్రహ్మ. ఆనందం అంటే క్షణికమా? శాశ్వతమా ? కోరికలను అనుభవించడం వలన పొందే ఆనందం క్షణికానందం. అనుభవించగానే ఆ ఆనందం తరిగిపోయింది. రెండవది శాశ్వతమైన ఆనందం.అదే బ్రహ్మానందం. ఆనందమయం కోశం అంటే పూర్తిగా ఆధ్యాత్మిక పరమైన దేహం. ఆత్మ పరమాత్మతో ఐక్యమయ్యే స్థితి. దీనిని మనం ముక్తి అంటున్నాము. దీనిలో ధ్యాన స్థితి నుండి ధారణా స్థితికి చేరి సమాధి స్థితి ని పొందడాన్నే ముక్తి అంటారు. ఆనందమయం కోశం ఆత్మకు దగ్గరగా ఉంటుంది. .సంపూర్ణ ఆనందంతో ఆత్మ యొక్క ప్రతిబింబంగా కనిపిస్తుంది. కలలు లేని సుషుప్తిలో ఇది పూర్తిగా వ్యక్తమౌతుంది. ఇది 5 కోశాలలో సూక్ష్మమైనది. గాఢమైన నిద్రలో మనస్సు ఇంద్రియాలు పనితీరు ఆగిపోయినప్పుడు అది పరిమిత ప్రపంచానికి మరియు ఆత్మకు మధ్య నిలుస్తుంది. సుషుప్తిలో ఆనందమయకోశం సాధారణంగా పూర్తి స్థాయిలో అపరిమితమైన ఆనందంతో ఉంటుంది. స్వప్నావస్థ లో ఇది పాక్షిక అభివృద్ధి మాత్రమే ఉంటుంది. ఆనందమయకోశం ఆత్మ యొక్క ప్రతిబింబం. అక్కడ ఆనందం పరిపూర్ణమైనది. ఆనందమయకోశంలో ఉండే ఆనంద పురుషుడికి: 1. ప్రియము (తనవారిని చూసినప్పుడుకలిగే ఆనందం)-శిరస్సు 2.మోదము (కోరుకున్నది లభించినప్పుడు కలిగే ఆనందం (దక్షిణ పక్షం) 3..ప్రమోదము (మోదము ఎక్కువైనప్పుడు కలిగేది) ఉత్తర పక్షం 4.ఆనందం (అన్నింటిని మించింది) ఆత్మ.అని చెప్పబడినది. ఇక్కడ చివరలో ఆనందాన్ని మించింది లేదు. అదే పరమాత్మ. అఖండ బ్రహ్మానందం ఎలా ఉంటుందో సూచనాప్రాయంగా నైనా తెలుసుకోవాలంటే తైత్తరీయో పనిషత్తులో చెప్పినట్లుగా భూలోకంలో ఒక చక్రవర్తి పొందే ఆనందం ఒక సామాన్య మానవుడు పొందే ఆనందం కన్నా గొప్పది. చక్రవర్తి కన్నా 100 రేట్లు ఆనందం మానవగంధర్వులది. వారి కన్నా 100 రెట్లు దేవ గంధర్వులు, వారికన్నా 100 రేట్లు పితృదేవతలు, వారికన్నా 100 రెట్లు అగ్రదేవతలు, వారి కన్నా 100 రెట్లు ధర్మ దేవతలు, వారి కన్నా 100 రెట్లు యముడు అగ్ని మొదలైనవారిది, వారికన్నా 100 రెట్లు దేవతల అధిపతి అయిన దేవేంద్రుడిది, వారి కన్నా 100 రెట్లు దేవేంద్ర సభలో ఉన్న బృహస్పతిది, వారి కన్నా 100 రేట్లు విరాట్ పురుషుడు ఈశ్వరుడు బ్రహ్మాది. ఈ ప్రకారం ఎవరెవరు ఎంతెంత ఆనందాన్ని పొందినా అది బ్రహ్మానందంలో వెయ్యొవంతు మాత్రమే. అంతకన్నా 1000 రేట్లు ఆనందం మోక్షం పొందిన మానవులు పొందుతారు. వీరందరూ అశరీరులు, కనుక బ్రహ్మానందాన్ని పొందే యోగ్యత వీరికి లేదు. ఆ బ్రహ్మానందాన్ని పొందే అర్హత, అదృష్టం పరమేశ్వరుడు మానవులకు మాత్రమే కల్పించాడు.
సూత్రం:- 13
'"వికార శబ్దాన్నేతి చేన్న ప్రాచుర్యాత్"
;వికార శబ్దాత్ :- ఆనందం ఒక వికారం కనుక న:-బ్రహ్మ నిలయం కాదు. ఇతి:-అని చేత:-అంటారా? న:-సరియైనది కాదు. ప్రాచుర్యాత్:-అది ఆనంద ఆధిక్యాన్ని తెలుపుతుంది.
భావం:-ఆనందం ఒక వికారం కనుక బ్రహ్మం ఒక ఆనందనిలయం కాదు, అని అనడం సరియైనది కాదు. అది ఆధిక్యాన్ని సూచిస్తుంది కానీ వికారాన్ని కాదు.
వివరణ:-బ్రహ్మానికి కాయం, వ్రణాలు ఉండవు. అందువల్ల ఆయనకు ప్రియఅప్రియాలతో సంబంధం ఉండదు. సుఖఃదుఃఖాలు లేవు. బ్రహ్మ నిత్యం. ఆయనకు ఏరూపములేదు. అవయవరహితమైన పరబ్రహ్మ ఆనందస్వరూపుడు. ఆనందమే బ్రహ్మమని తెలుసుకోవాలి.అమృతమై ఆనందరూపంలో ప్రకాశించే బ్రహ్మాన్ని ధీరుడు విజ్ఞానంతో తెలుసు కుంటాడు. బ్రహ్మ విజ్ఞానమయం ఆనందమయం. శరీరం, ప్రాణం, మనస్సు విజ్ఞానం ఈనాలుగు జీవాత్మకు సంబంధించినవి. పంచభౌతిక మైనది జీవాత్మకు శరీరం అయినట్లు విశ్వమంతా బ్రహ్మకు శరీరంగా వర్ణించారు. మనస్సు తొలగిపోయి ఆత్మ సాక్షాత్కారం సిద్దిస్తే ఎలా ఉంటుంది? మనిషి అప్పుడు ఆత్మస్థితిలో ఉంటాడు. కేవలం ఆనందం మాత్రమే ఉంటుంది. ఆ ఆనందం పొందడానికి అందరూ అర్హులే. మరి ఆ ఆనందం అందరికి ఎందుకు లభ్యంకావడం లేదు? మానవుడు కదిలించే దానిని వదిలేసి, కదిలేదాన్ని చూసుకుంటూ ఇదే నేను అనుకుంటున్నాడు. మన ఆలోచనల వలన శరీరం కదులుతోంది అంటే కదిలించే చైతన్యం నిరాకారం. ఆకారం లేని చైతన్యానికి మరణం లేదు. ఒకగ్రామంలో ఇళ్లన్ని తగలపడి బుగ్గిపాలైతే, అక్కడ ఆకాశంకూడా బూడిద అవుతుందా అని ఒకరు సందేహం వెలిబుచ్చారు. శూన్యంలో ఏమి ఉండదు. కనుక కాలడానికి అవకాశం లేదు. శరీరం కదిలించే ఆత్మకు కూడా నాశనం లేదు. ఒక శరీరం మరణిస్తే ఆత్మ ఇంకో శరీరాన్ని దరిస్తుంది. మానవుడు దృష్టి జ్ఞానమయం కనుక శరీరభ్రాంతిని వదిలిపెట్టి, కేవలం ఆత్మ ఒక్కటే సత్యమని, అదే తన యొక్క రూపమని, తాను నశించే ఈ శరీరం కాదని గ్రహించగలడు. అలా గ్రహించడమే జన్మ, కర్మలనుంచి శరీరాలనే భ్రమ నుంచి మానవునికి విముక్తి. అదే మానవశరీరం ధరించడం యొక్క పరమప్రయోజనం కూడా. మానవుడు జీవితాంతం లోక విషయాలు భావించకపోతే సుఖదుఃఖాలు అతని అనుభవంలోకి రావు. ఆ స్థితినే పరమ శాంత స్థితి, మోక్షం, బ్రహ్మానందం అంటారు. అట్టి పరమశాంత స్థితి రావాలంటే మానవుడు చేయవలసినది మనస్సులో ఏది భావించకపోవడమే. అసలు అలాంటి బ్రహ్మానందస్థితి లభిస్తుంటే అది వదిలిపెట్టి, మాకు ఎదో లభిస్తే ఆనందం, మరేదో పొందితే ఆనందం అని చేతిలోని ద్రాక్షపళ్లు నేలమీద జారవిడిచి , ఆహా! వేపచెట్టుకు వ్రేలాడుతున్న వేపపళ్ళు ఎంత తియ్యగా ఉంటాయో కదా! అవి కోసుకుంటాను అని వేపచెట్టు ఎక్కేవాడిని ఏమనాలి? భగవంతుని మనస్సులో భావన చేసిన వాడే భగవంతుడు అవుతాడు. అజ్ఞానం తొలగించు కున్న ప్రతి మానవునికి ఇది అర్ధం అవుతుంది. ఎవరైతే నిరంతరం శ్రీరామచంద్రుని గుణగణాలను గుర్తుచేసుకుంటు భావన చేస్తారో, అతను కొన్నాళ్ళకు శ్రీరామ చంద్రుడే అయిపోతారు. ఇదే సత్యం. ఉన్నచోటనే భగవంతుణ్ణి నిత్యం ధ్యానం చెయ్యాలి. అలా చేస్తూ ఉంటే మనసులోకి వారి దైవీ శక్తి కలిగిన చైతన్య శక్తి ప్రవేశించి, మన అజ్ఞానాన్ని దగ్ధం చేస్తుంది. సత్యాన్ని తెలుసుకోనంతవరకు శాంతి ఉండదు. మనిషి యొక్క స్థితి ఆనందమయం. అప్పుడు ఈ శరీరం ఉన్నా పోయినా దుఃఖం కలగదు. కాలంతో కూడా సంబంధం తెగిపోయి అనంతంగా ఆ ఆనందంలో అతను మునిగితెలుతూ ఉంటాడు. ఇక్కడ సృష్టి అనేది ఉండదు. మీరు ధరించిన శరీరం దాని ప్రభావం ప్రకారం అవి నశించేంతవరకు ఈ లోకంలో నిలచి ఉంటుంది. కానీ మీ దృష్టి దానిమీద, శరీరం మీద ఉండదు. మీ కళ్ళు చూస్తున్నట్లు, పలకరిస్తున్నట్లు ఉంటాయి కానీ మీ దృష్టి మీ కళ్ళల్లో ఉండదు. అది మోక్షానందంలో తెలియాడుతూ ఉంటుంది.అందుకే ఆనందమయ శబ్దం బ్రహ్మకు ఉండే ఆనందాధిక్యాన్ని బోధిస్తుందే కానీ వికారశబ్దం అనడం సరి అయినది కాదు.
సూత్రం :- 14
"తద్ధేతు వ్యపదేశాచ్ఛచ"
అంతే కాక, తత్ హేతు వ్యపదేశాత్ :- ఆనందానికి హేతువుగా బ్రహ్మాన్ని శాస్త్రాలు వర్ణిస్తున్నాయి.
భావం:- తైత్తరీయం లో బ్రహ్మానందాన్ని ఆనందమయం అంటున్నారు. బ్రహ్మమే జీవుల్ని ఆనందింపజేస్తోంది. బ్రహ్మం కన్నా జీవుల్ని ఆనందింపజేసే తత్త్వం మరొకటి లేదు. పైగా జీవులన్నీ ఈ బ్రహ్మానందాన్ని పొందే ఆనందిస్తున్నాయి అని అన్నారు. కనుక బ్రహ్మమే ఆనందం. జీవాత్మ కాదు.
వివరణ:- ఆనందానికి హేతువు బ్రహ్మ కాబట్టి ఆనందమయుడంటే పరమాత్మ కాని వేరు కాదు. బ్రహ్మాన్ని చేరుకోవాలంటే మోక్షం పొందాలి. మోక్షం రావాలంటే నిష్కామకర్మ ఆచరిస్తూ కర్మఫలాలు త్యజించడం వలన జ్ఞాని అయినవాడు మోక్షాన్ని పొందుతాడు. ఈ సాధన ధ్యానయోగానికి దారితీస్తుంది. ఫలాశక్తిని విడిచి బ్రహ్మార్పణ బుద్ధితో కర్మ చేసే సన్యాసికి సర్వం బ్రహ్మమయంగా కనిపిస్తుంది. ఇదే బ్రహ్మజ్ఞానానికి అత్యవసరం. ఎల్లప్పుడూ చేయదగిన కర్మను సంగరహితంగా చేసిన మానవుడు పరమపదాన్ని పొందుతాడు. బ్రహ్మాన్ని చేరుకోవాలంటే విద్యలలో ఉత్తమమైనది అతి నిగూఢమైనది బ్రహ్మవిద్య. ఈ బ్రహ్మవిద్య మోక్షరహాస్యాన్ని తెలియజేస్తుంది. పరమాత్మ ఆధ్వర్యంలోనే సకల చరాచార సృష్టి జనిస్తోంది. కల్పాంతంలో ఆయనలో లయమైపోయి మళ్ళీ కల్పాదిలో సృష్టింపబడుతోంది. మర్రి చెట్టు ఎంత పెద్దదిగా ఉన్నా, దాని విత్తనం చాలా చిన్నదిగా ఉంటుంది. అంత చిన్నవిత్తనంలో పెద్ద మర్రి చెట్టు నిక్షిప్తమై ఉన్నట్లే, పరమాత్మలో లయమైన తరువాత సృష్టి అంతా ఆయనలో నిక్షిప్తమై ఉంటుంది. ఈ జగత్తుకు తండ్రి, తల్లి, అన్న, కర్మఫలప్రధాత, ప్రణవనాదం, వేదాలు, వేదం విద్య వేదాల ద్వారా తెలియదగినవాడు, సర్వాన్ని భరించేవాడు, సాక్షి, సృష్టి స్థితి లయ కారకుడు, సత్ పురుషుడు, అమృతుడు, ఆ బ్రహ్మయే. అంటే పరమేశ్వరుడే. మూఢులు ఆయన తత్త్వం తెలియక వ్యర్ధమైన ఆశలతో నిష్ప్రయోజనమైన కర్మలతో నశిస్తున్నారు. సజ్జనులు సదా జ్ఞానయోగం ద్వారా ఆరాధిస్తున్నారు. అనన్యచింతనతో ఉపాసించేవారి యోగక్షేమాలు ఆయనే వహిస్తాడు. బ్రహ్మాన్ని చేరుకోవాలంటే బంధాలతో చిక్కుకోకూడదు కర్మలు 3 రకాలు. కర్మ, అకర్మ, వికర్మ. ఫలాపేక్ష రహితుడు కర్తను అనే అహంకారాన్ని జ్ఞానాగ్నిచే దగ్ధంచేసేవాడు. బుద్ధిమంతుడు, కోరికలు లేనివాడు, జయాపజయాలపట్ల సమబుద్ధిగలవాడు, సందేహారహితుడు, ఈర్ష్యారహితుడు బంధాలతో చిక్కుకోడు. ఈశ్వరప్రీతిగా మాత్రమే కర్మలు చేయు వానికి ప్రారబ్ధం కూడా నశిస్తుంది. కానీ బాధించవు. ఇవ్వబడునది, ఇచ్చేవాడు, ఇచ్చుటకు ఉపయోగించే పదార్ధములు కూడా బ్రహ్మమే. జ్ఞానాన్ని తెలుసుకుంటే సమస్తాన్ని నీయందే చూడవచ్చు, మోహానికి గురి కావు. కర్రలు అగ్నిచేత, కర్మలు జ్ఞానం చేత దహింపబడతాయి. కర్మయోగ స్థితి పొందినవారు జ్ఞానాన్ని తనలోనే చూసుకుంటాడు. శ్రద్ధ జ్ఞానం లేనివారు సందేహాలు కలిగిన వారు నమ్మకం లేనివారు చెడిపోతారు. ఇహపరాలకు దూరం అవుతారు. సన్యాసమంటే ఏమిటి? కోరికలతో కూడిన కర్మలను చేయక పోవడమే సన్యాసం. త్యాగమంటే ఏమిటి? చేసిన కర్మఫలాలను భగవంతునికి సమర్పించడం త్యాగమని పండితులు చెబుతున్నారు. ఆత్మగా ఉండాలంటే ఏమి చెయ్యాలి? ఇంద్రియాల వెంట పరుగు పెడుతున్న మనస్సును ఆత్మవైపు అంతర్ముఖం చెయ్యాలి. ఇంద్రియాలు వాటి పని అవి చేస్తున్నప్పటికీ నిశ్చలంగా ఉండగలగడం ఆత్మగా ఉండడానికి ప్రయత్నం చెయ్యడం, ఆత్మ సాక్షిగా చూస్తోందని గ్రహించడం. తాను ఎల్లప్పుడూ సచ్చిదానందస్వరూపమని నిరంతరం ధ్యానం చేస్తూ ఉండాలి. బ్రహ్మమును ఏ మహనీయుడు తన బుద్ధి యందు హృదయ కుహరమునందు ఉన్నాడని తెలుసుకొనుచున్నాడో అతడు జ్ఞానస్వరూపుడగు బ్రహ్మం లోఉండి, బ్రహ్మం తో బాటు సకల కార్యములను చేయుచు, బ్రహ్మ స్వరూపమే తన సహజ స్వరూప స్థితి అని గ్రహించి బ్రహ్మానందాన్ని పొందగలడు.
సూత్రం :- 15
"'మాంత్ర వర్ణిక మేవ చ గీయతే "
చ- అంతేకాక , మాంత్ర వర్ణికమ్ ఏవ :- ఉపనిషత్ మంత్రాలు బ్రహ్మం ఆనందమయమని, గీయతే;- కీర్తిస్తున్నాయి.
భావం :- ఉపనిషత్ మంత్రాలు బ్రహ్మం ఆనందమయమని కీర్తిస్తున్నాయి. మంత్రాల్లో చెప్పబడినట్టి బ్రహ్మమే బ్రాహ్మణంలో గానం చేయబడుతున్నది. సత్యం. జ్ఞానం, అనంతం, బ్రహ్మ ఆకాశాది పంచభూతాలను ఆ బ్రహ్మమే సృష్టించింది.
వివరణ:- తైత్థరీయోపనిషత్తు :- హృదయంలో జీవాత్మ అంతర్యామిగా వ్యాపించి ఉన్న బ్రహ్మాన్ని తెలుసుకొని ప్రకృతి బంధాలనుండి విడిపోయి, శుద్ధ బ్రహ్మంతో కూడి బ్రహ్మానందాన్ని పొంది నిర్భయుడవుతాడు. కాబట్టి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే వాక్యంలోని బ్రహ్మమే ఆనందం, బ్రాహ్మణంలో ఉన్న బ్రహ్మమే ఆనందమయుడు అని కీర్తింపబడుచున్నాడు. ఇది తైత్తరీయోపనిషత్తులో బ్రహ్మ ఆనందవల్లి అధ్యాయంలో బ్రహ్మలక్షణ వాక్యం. ఆకాశం, వాయువు, అగ్ని, జలము, పృధ్వి లను సృష్టించింది బ్రహ్మమే. తరువాత ఆభూతాలలో ప్రవేశించి బుద్ది రూపమైన గుహలోనే పరబ్రహ్మ ఉన్నాడు. వారుణి విద్యలో వరుణ మహర్షి కుమారుడు భృగు మహర్షి విద్యాభ్యాసం పూర్తిచేసి బ్రహ్మోపదేశం చెయ్యమని తండ్రిని అడుగుతాడు. బ్రహ్మవిద్య ఉపదేశిస్తే తెలిసేది కాదు.తపస్సు చేసి తెలుసుకోమన్నాడు. అలా తపస్సు చేసి భ్రుగువుకు వరుసగా అన్నం, ప్రాణం, మనస్సు, విజ్ఞానం, ఆనందానికి కారణం కావనీ, చివరకు ఆనందమే బ్రహ్మమని తెలిసింది. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ :- ఇది తైత్తరీయోపనిషత్ లో బ్రహ్మ ఆనందవల్లి అధ్యాయంలో బ్రహ్మలక్షణాల వాక్యం.
1.సత్యం :-ఇది పారమర్ధిక సత్యం, త్రికాల సత్యం అని తెలుసుకోవాలి. భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఇది సత్యం. సత్యమనేది ఎప్పుడు ఒక్కటే. రెండవది ఉండదు. శృతి ప్రమాణం. మన అనుభవాలు జాగ్రత, స్వప్న, సుషుప్తి వ్యవస్థలలో ఆత్మ ఉన్నది. ఒక కాలంలో ఉండి ఇంకో కాలంలో ఉండకపోవడం ఉండదు. త్రికాలములలో ఆత్మ సత్యమైనది. సత్యం రెండు రకాలు. పారమర్ధిక సత్యం, వ్యావహారిక సత్యం. సూర్యుడు ఎల్లప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు. అది పారమార్ధిక సత్యం. సూర్యుడు పగలు కనిపిస్తాడు, రాత్రి కనబడదు.అది వ్యావహారిక సత్యం. తల్లి గర్భంలో పిండం ఆత్మరూపమే. శిశువు లోపల బయట, ఆత్మను తెలుసుకున్నవారిలో, తెలుసుకోలేనివారిలో త్రికాలములలో ఉండేది ఆత్మే. అనిత్యమై మార్పుల చెందే దృశ్యప్రపంచానికి ఆధారమైనది, నిత్యమైనది, ఆత్మ. సృష్టి స్థితి లయ ఆత్మ వలననే జరుగుతున్నాయి. 2. జ్ఞానం :- జ్ఞాన స్వరూపం దేహేంద్రియ మనోబుద్ధుల్ని ఎల్లప్పుడూ తెలుసుకుంటూ, వృత్తులను తెలుసుకుంటూ ఉండే ఆత్మచైతన్యం జాగ్రదావస్థలోనే కాదు సుషుప్తిలో కూడా ఏ అనుభవాలు లేని వ్యవస్థలో కూడా ఆత్మ తెలుసుకుంటూనే ఉంటుంది. ఏమి ఉన్నా లేకపోయినా మనస్సు, బుద్ధి ఉన్నా ఆత్మ అక్కడే ఉంటుంది అని తెలుసుకోవడమే జ్ఞాన స్వరూపం.
3.అనంతం:- అంతం లేనిది అఖండమైనది, అపరిమితమైనది అటువంటి ఆనందమయమైన ఆత్మను నేను, సత్యం జ్ఞానం అనంతం లక్షణాలున్న ఆనందం నేను, ఆత్మ పరబ్రహ్మమైతే నేను కూడా పరబ్రహ్మమే, అహం బ్రహ్మాస్మి అని విచారణ చేసి, విశ్లేషణ చేసి, నేను ఆత్మను అనే జ్ఞానాన్ని స్థిరపరచుకోవాలి. అదే మోక్షం. అలా భావన చేస్తుంటే అజ్ఞానం అంతా తొలగిపోయి ఆత్మనే అవుతారు.
సూత్రం :- 16
"నేతరో నుపత్తేః"
ఇతరః:- బ్రహ్మం కన్నా ఇతరుడైన జీవాత్మ న :- ఆనందమయం కాదు. అనుప పత్తేః:- జీవాత్మ ఆనందమయుడనటం యుక్తి కాదు.
భావం :- జీవాత్మ సత్యాన్ని సృష్టించలేదు. బ్రహ్మ కన్నా ఇతరుడైన జీవాత్మ ఆనందమయుడనటం యుక్తి కాదు. బ్రహ్మమే ఆనందమయం.
వివరణ :- బ్రహ్మం సంకల్పించి ఈ బ్రహ్మాండంలో ఉన్నదంతా సృష్టించాడు. ఇది పరమాత్మకు చెల్లుతుంది. ఆనందమయుడు అనే శబ్దానికి అర్ధం పరబ్రహ్మము కన్నా ఇతరులు ఎవరూ లేరు. సృష్టి ప్రారంభానికి ముందు పరమాత్మ సృష్టి చెయ్యాలి అని కోరుకున్నాడు. ఈరకంగా కోరడం అనే ధర్మం జీవుడుకి వర్తించదు. అది బ్రహ్మానికి వర్తిస్తుంది. గురువు గారు! పరమాత్మ నిరాకరుడు, నిర్గుణుడు దేని యందు ఆసక్తి లేనివాడు కదా! మరి సృష్టి , స్థితి , లయ ఎందుకు చేస్తున్నాడు? వీటితో అతనికి సంబంధం ఏమిటి? అసలు సృష్టి చెయ్యడం అతని లక్షణమా? లేక తన వినోదం కోసం చేస్తున్నాడా? అని ప్రశ్నించాడు కృష్ణ శర్మ. రత్నాకరుడు ఇలా చెబుతున్నాడు, భగవంతుడు ఆకారం లేనివాడు. ఇచ్చారహితుడు గుణ రహితుడు నిజమే, అయినా ఈ సృష్టి ఎందుకు చేస్తున్నాడు? అన్నదే సందేహం. ఈ పరబ్రహ్మ సృష్టి చెయ్యాలి అనుకొని తనలోని కొంత శక్తిని బయటకు పంపాడు. అయితే అసలు సృష్టి ఎందుకు చెయ్యాలని అనుకున్నాడు? గతంలో ప్రళయం సంభవించినప్పుడు కర్మ పరిపక్వం కాకుండా తనలో లీనమైపోయిన జీవరాశుల యొక్క కర్మ క్షయం చేసి, వారికి మోక్షం కలిగించాలని ఆలోచనలో సృష్టి చేయాలని సంకల్పించాడు. జగత్తు అంతా లయం అయిపోగానే జీవరాశి అంతా నశించిపోయింది. వస్తుజాలం రూపుమాసిపోయింది. ఈ పరిస్థితిలో కర్మ క్షయం చెందిన జీవరాశులు పరమాత్మలో లీనమైపోయాయి. అంటే సాయుధ్యం పొందాయి. మరి క్షయం కానీ జీవుల గతి ఏమిటి? కర్మఫలాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మ ఎత్తాలి కదా! మరి అవి ఏ విదంగా పరబ్రహ్మంలో కలసిపోతాయి? అన్నదే ప్రశ్న. ప్రళయకాలంలో కర్మక్షయం అయిన జీవరాశితో బాటు మూట కట్టుకొని పరమేశ్వరుడిలో లీనమౌతాయి.ఇంకా కర్మలు అనుభవించవలసిన జీవరాశులు వారి కర్మలను క్షయం చేసి మోక్షం ప్రసాదించాలనే కోరికతో సృష్టి కార్యక్రమం చేస్తున్నాడు. సృష్టించడం అనేది జీవులకు మోక్షాన్ని ఇవ్వడానికే కానీ తన లీలావినోదం కోసం కాదు.
ఐతరేయోపనిషత్తు:- ఆత్మయే ఆలోచనాపూర్వకంగా ఈ లోకాలను సృష్టించింది. సృష్టి జరగడానికి ముందు జగత్తు అంతా బ్రహ్మమయంగా ఉండేది. దానికి భిన్నంగా పదార్ధం లేదు. దానినే ఆత్మ అంటారు. తోలుబొమ్మలాటలో తెరమీద తోలుబొమ్మలు కథలోని అంశాలకు అనుగుణంగా కదులుతూ, మాట్లాడుతూ, చలిస్తుంటాయి. మనకు బొమ్మలు సహజంగా నటిస్తున్నట్లు కనిపిస్తాయి. కానీ వాటిని కదిలించే సూత్రధారి పైన కూర్చుని వాటిని ఆడిస్తుంటాడు. బ్రహ్మ కూడా జీవులందరిని తోలు బొమ్మల్లా ఆడించే సూత్రధారి. జీవులు కేవలం జడమైన పాత్రధారులు మాత్రమే. ఉన్నది ఒక్కటే పరబ్రహ్మమైనప్పుడు రెండవది లేనప్పుడు ఆనందమయం పరబ్రహ్మమే అవుతాడు. జీవాత్మ ఆనందమయుడు అనడం యుక్తి కాదు.
సూత్రం:- 17
'భేద వ్యపదేశాచ్చ"
'చ:- ఇంకా భేద వ్యపదేశాచ్చ:- జీవాత్మని వేరుగా చెప్పడం వలన అతడు ఆనందమయుడు కాదు.
భావం :-జీవాత్మకు పరమాత్మకు భేదం చెప్పడం వలన జీవుడు ఆనందమయుడు కాదు అని తెలుస్తోంది. ఇద్దరు ఒక్కటే అజ్ఞానం వలన రెంటికి తేడా ఉందని అనుకుంటున్నారు.
వివరణ:- వాస్తవంగా చూస్తే జీవాత్మకు పరమాత్మకు భేదం లేదు. కానీ యదార్ధం తెలియక అజ్ఞానం వలన ఈ రెండింటికి మధ్య తేడా ఉందని అనుకుంటారు.
ముండకోపనిషత్తు:- ఈ విషయమే ఈ ఉపనిషత్తులో వివరించడం జరివింది. ఒకే చేటు మీద రెండు పక్షులు కూర్చుని ఉన్నాయి.1.పరమాత్మ.2.జీవాత్మ ఆ రెండు ఒక్కటే అయినప్పటికీ అజ్ఞానం వలన రెండింటికి తేడా ఉందని అనుకుంటారు. పరమేశ్వరుడు లోకాలకు ప్రాణులను సృష్టించిన తరువాత బ్రహ్మరంద్రం గుండా ప్రాణులలో ప్రవేశించి నవరంద్రాలతో కూడిన ఈ దేహంలో ఉంటూ గుండె, ప్రాణులలో ప్రవేశించి ఇంద్రియాలతో అన్ని సుఖాలు అనుభవిస్తూ, బయటకు పోయే మార్గం తెలియక పంజరంలో బంధించిన పక్షిలాగా కొట్టుమిట్టాడుతుంటాడు. అతడు శరీరంలో ఉన్నంత వరకు ఈశరీరాన్ని, ఉన్న బంధాలను తనవే అనుకుంటాడు. అతడే జీవాత్మ. జీవాత్మ కనుక వచ్చిన త్రోవనే బ్రహ్మరంద్రం ద్వారా బయటకు వెళ్లగలిగి నట్లైతే అది పరమాత్మతో లీనం అవుతుంది. అంతవరకు అజ్ఞానంతో ఉన్న పరబ్రహ్మ వేరని తెలుస్తోంది. అంతే కాని నిజానికి ఒక్కటే. ఆనందమయమే రసం. ఆ రసాన్ని పొంది జీవాత్మ ఆనందిస్తాడు. అలా ఆనందించలేకపోవడానికి కారణం మాయ. ఈ ప్రకృతే మాయగా సృష్టించబడింది. అసలు మాయ అంటే ఏమిటి? మాయలో పడటమే ఈ జీవితంలో అన్నింటి కన్నా ఆశ్చర్యకరమైన విషయం. ఈ జీవితమనే అడవిలో మన మనస్సు అజ్ఞానంతో, దారితెన్ను తెలియక, తికమక పెడుతూ ఉంటుంది. ఈ ప్రకృతి మన ఇహలోక జీవితం శాశ్వతం సంపూర్ణం ఎన్నటికీ మారనిది సుఖమైనది అంటుంది. దీనికి మన మనస్సు అంటుకుపోయినంత కాలం మనజీవితం తాత్కాలికంగా అసంపూర్ణమే. నిరంతరం మార్పులు చెందుతూ కొరతలతో కూడినదై విచారకరమైనది దుఃఖభూయిష్టమైనది. గత జన్మల కర్మల స్వభావమును బట్టి మనం ఇహలోకంలో ఆశలు పెంచుకొని, రాగద్వేషాలతో, ఆశలు కోరికలు కలుగుతుంటాయి. నాది అనే మమకారం నేను అనే అహంకారం అనే మాయలో పడి అనేక వస్తువులు కోరుకుంటాం. వ్యాధులు మరణాలు వద్దనుకుంటాం.మహా మేధావులు మనిషికి కోరికలు ఉండాలి లేకపోతే చచ్చినట్లేనని అంటారు. తల్లిదండ్రులను, జన్మను, బంధువులను, మరణాన్ని, ఎప్పుడు ఏది జరగాలో కోరుకున్నట్లే జరగాలని భ్రమపడతాం. ఈ మూర్ఖత్వమే అజ్ఞానం అని గ్రహించాలి.
కేనోపనిషత్తు :- బ్రహ్మం వలన మనస్సును ప్రేరేపించి పంచేంద్రియాలను, బుద్ధి, అహంకారం, పంచకర్మేంద్రియాలకు శక్తి సామర్ధ్యాలు ఇచ్చి వాటియొక్క కార్యకలాపాలకు మూలమైనది. సర్వకార్యకలాపాలకు బ్రహ్మమే మూలమని సర్వం బ్రహ్మమయమని జ్ఞానం పొందిన మహనీయులు తెలియగలదు. అట్టి మానవోత్తములకే సర్వసృష్టి బ్రహ్మమయంగా గోచరించును. సచ్చిదానందస్వరూపమగు బ్రహ్మం మినహా ఇతరమేవియు బ్రహ్మిభూతులకు గోచరించదు. దేహేంద్రియ మనోబుద్ధులకు శక్తిని కలిగించేది బ్రహ్మం. అందువలన వాటి గ్రహణశక్తి ద్వారా బ్రహ్మం గోచరించుట అసంభవం. ఆధ్యాత్మిక పరిభాషలో ఇంద్రియప్రేరితములైన కార్యకలాపములు, విషయ వృత్తులు, నిగ్రహం లేని మనో వికారం, దేహభ్రాంతి నుండి సాధకుడు విముక్తి పొందాలి. అట్టి విముక్తి శమదమాదుల వలన, వివేకవైరాగ్యముల వలన కలుగును. తరువాత శ్రవణమనననిధిధ్యాసల వలన కలుగును. ఈసాధనాలు చిత్తశుద్ధితో తీవ్రతరం చేస్తూ అంత శీఘ్రంగా జ్ఞానాగ్ని రగుల్కొని నిజస్వరూపమగు ఆత్మయందు బ్రహ్మానందభరితుడగును. పూర్వజన్మ సుకృతం వలన సత్యాన్వేషణ చేయుటకు మోక్షాసక్తులై ప్రయత్నించుచున్న ముముక్షువులలో ఒకానొకడు మాత్రమే పరమాత్మను తెలుసుకొని నిజస్వరూపమగు జ్ఞానం కలవాడగును. జీవాత్మ పరమాత్మకు భేదం లేనప్పటికీ ఆనందమయుడు నిమిత్తకారకుడైన బ్రహ్మమే అవుతాడు కానీ జీవాత్మ కాదు.
సూత్రం :-18
"కామాచ్చ నానుమానాపేక్ష"
కామాత్:- కోరిక ఉన్నందువల్ల, అనుమానాపేక్ష :-ప్రకృతి కూడా, న:- ఆనందమయం కాదు. కోరిక :-సంకల్పం, చేతన:- ధర్మం వలన
భావం:-ప్రకృతి జడమైనది. కామం చేతన ధర్మం ప్రకృతిలో చేతన ధర్మమైన సంకల్పం ఉండదు. సంకల్పించేది బ్రహ్మ ధర్మం కాబట్టి ఆనందమయశబ్దం ప్రకృతికి వర్తించదు.
వివరణ :- తైత్తరీయోపనిషత్తు:- కామము అంటే కోరిక. అతను కామించాడు అంటే సంకల్పించాడు అని అర్ధం. కోరిక ప్రకృతి ధర్మం కాదు. ప్రకృతి అచేతనం, జడం, కామం చేతన ధర్మం. ప్రకృతి ఆనందమయం అయితే అందులో చేతనధర్మమైన సంకల్పం కూడా ఉండాలి కదా! అలా లేదు కదా! కామం సంకల్పం అనేవి బ్రహ్మధర్మం, అందుకే ఆనందమయశబ్దం బ్రహ్మ వాచకమే.
చతుర్విధ పురుషార్ధములు:- మానవ జీవితం యొక్క నాలుగు లక్ష్యాలు...1. ధర్మ:- ధర్మానికి నైతిక విలువలు. 2.అర్ధ :-శ్రేయస్సు, ఆర్ధిక విలువలు. 3.కామ:ఆనందం, ప్రేమ, మానసిక విలువలు 4.మోక్షం :-విముక్తి, ఆధ్యాత్మిక విలువలు. మూడవపురుషార్ధమైన కామం కళలు, భావోద్వేగాలు, ప్రేమ శృంగారం సంబంధాలు, ఇతర శాస్త్రాల ఆనందం కోసం అన్వేషిస్తారు. ధర్మం విసర్జిస్తే అర్ధం, కామం, లాభం మరియు ఆనందం సామాజిక గందరగోళానికి దారితీస్తుంది. ఈ మాయా ప్రపంచంలో మనిషి మనస్సే కోరికల పుట్ట. కోరికలే బంధాలకు మూలం. కోరికలు సాగరతరంగాల వలే ఒకదాని వెంట మరొకటి పుట్టుకొస్తూనే ఉంటాయి. ఒక కోరిక తీర్చుకోగానే దాని వలన ఆనందం వచ్చినా, అది తాత్కాలికమైనదే. మరల ఇంకో కోరిక దానిని సాధించుకోవడానికి అనేక ప్రయత్నాలు చెయ్యడం, అనుకున్నది జరిగితే ఆనందం, లేకపోతే దుఃఖం కలుగుతుంది. సుఖదుఃఖాలకు హేతువు సంకల్పాలే. అర్ధము, కామము, ధర్మాలయొక్క ప్రాధాన్యత సహజంగా వయస్సును బట్టి మారుతూ ఉంటాయి. చిన్నపిల్లలకు ఆటలమీద, విద్యపట్ల మక్కువ ఎక్కువగా ఉంటుంది. యుక్తవయస్సు వచ్చినవారికి ఒకరి పట్ల ఒకరికి మనస్సులో అనురాగం ఉండాలని వారి సాంగత్యం కోరుకుంటారు. కుటుంబాన్ని పోషించుకోవడానికి సంపాదన మీద కోరిక కలుగుతుంది. ఆఆశ ఉండటం తప్పు కాదు, ధర్మబద్ధమైన సంపాదనే ఉండాలి. కానీ సంపాదనే జీవితం కాకూడదు. అదే తృష్ట అవుతుంది. సర్వకాల సర్వావస్థలలో డబ్బు గురించే ఆలోచిస్తూ తన స్థితి తాను మరచిపోయి, తన దృష్టికి వేరే ఏమి కనబడని స్థితికి చేరకూడదు. ఇక వృద్ధాప్యంలో మనస్సు భగవంతుని వైపు మరల్చాలని కోరిక ఉంటుంది. లేదా పిల్లల ప్రేమ పొందాలని వారి ఆశ్రయంలో సుఖంగా ఉండాలని కోరిక ప్రగాఢంగా ఉంటుంది. ఆనందం, కోరిక, మానవ ప్రవర్తనను నడిపిస్తుంది. ఇది ఇంద్రియాలకు సంబంధించినది. కానీ కళ, సంగీతం, అందం, ప్రేమ, సాన్నిహిత్యం, ఆప్యాయత, దయ ఇవి జీవితానికి ఆనందాన్నిస్తాయి. సరిఅయిన సంకల్పం ధర్మం వైపు నడిపిస్తుంది. దానిని ఎంతో దృఢనిశ్చయంతో నెరవేర్చడానికి సహాయ పడుతుంది. మితిమీరిన కోరికలు అనర్ధ దాయకం. అతిగా తినడం, వ్యసనం, బద్ధకం, దురాశ, కామానికి దారి తీస్తుంది. కోరికను అనుసరించే సంకల్పం ఉంటుంది. దురదృష్టవషత్తు కామము అనగానే సెక్స్ మాన్యువల్ గా తప్పుగా అన్వయించబడింది. ఇది వాస్తవానికి ధర్మం, దయగల జీవనానికి మార్గదర్శి. ఇది ప్రేమ యొక్క స్వభావం గురించి కుటుంబజీవనం మరియు మానవజీవితం లోని ఆనందం గురించి చర్చిస్తుంది. కోరిక వస్తువును కనుగొనడం, వస్తువు గురించి నేర్చుకోవడం, బావోద్వేగ సంబంధాన్ని ఏర్పరచడం, ఇంద్రియ అనుభవం గురించి తెలియజేస్తుంది. ఎవని కర్మాచరణములు కామ సంకల్పములు కావో, ఎవని కర్మలు జ్ఞానమనే అగ్నిచే కాల్చబడినవో అట్టివారిని పండితులని విద్వాంసులని భగవద్గీతలో చెప్పబడింది. మనస్సు యొక్క కోరికలకు సూచనలు ఇచ్చే జడమైన బుద్ధికి చైతన్యశక్తిని ఇచ్చేది బ్రహ్మమే కనుక బ్రహ్మమే ఆనందమయమని మనస్సులో కలిగే కోరికలు, ప్రకృతి ధర్మంకానేరదు అని గ్రహించాలి.
సూత్రం :- 19
'"అస్మిన్నశ్యచ తద్యోగం శాస్తి '
అస్మిన్:- ఆనందమయమైన బ్రహ్మంలోనే అస్య:-ముముక్షువైన ఈజీవుడికి తత్యోగం:-మోక్షప్రాప్తిని శాస్ట్రిచ :-శాస్త్రాలు శాసిస్తున్నాయి.
భావం:- ఆనందమయమైన బ్రహ్మంలోనే ఈ జీవుడికి మోక్షప్రాప్తి కలువుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. సత్వరజస్తమో గుణాలతో కూడిన ప్రకృతి ఆనందమయం కాదు అని సూత్రానికి అర్ధం.
వివరణ:- తైత్తరీయోపనిషత్తు :- ఆనందమయమైన బ్రహ్మంలోనే ముముక్షువునకు అభయ ప్రాప్తి, మోక్షం కలుగుతాయి. ప్రకృతి పట్ల ప్రాపంచిక వ్యవహారాలలో మునిగిపోయి సంసారసాగరంలో బంధీ అయినవానికి మోక్షప్రాప్తి కలుగదు. భయమే కలుగుతుంది. ప్రకృతి సదా పరిణామం చెందుతూ ఉంటుంది.దానికి సాత్విక , రాజస, తామస, అవస్థలు కారణమౌతాయి. అందువలన జీవుడికి అభయం లభించదు. అజ్ఞాని అయిన వాడికి జ్ఞానసముపార్జన జరిగిన తరువాత అతని ఆత్మ పరమాత్మతో లీనం అయిపోతుంది. పరమాత్మ యందు తాదాత్మ్యం గలవాడికి సంసారబంధాలు ఉండవు. ద్వైదిభావం ఉన్నవాడికి సంసారం భయం ఉంటుంది.
1.సత్వగుణం:- సత్వగుణం రజోగుణం తమోగుణములలో సత్వగుణం స్వఛ్చమైనది. నిర్మలమైనది. ప్రకాశవంతమైనది. ఎటువంటి ఒడిదుడుకులు ఉపద్రవాలు లేనిది. ప్రకృతిలో 3 గుణాలు ఒకదానితో ఒకటి కలసి ఉన్నాయి. ఒకే గుణం ఉన్న జీవి ఉండదు. ఎందుకంటే ఏ పని చేయడానికైనా రజోగుణం కావాలి. పనిచేసి అలసిపోతే విశ్రాంతి తీసుకోవడానికి నిద్ర పోవడానికి తమోగుణం కావాలి. పరమసాత్విక గుణం కలవారికైనా రజోగుణం, తమోగుణం లేకపోతే జీవితం సాగదు. కాకపోతే సత్వగుణం ఎక్కువగా రజస్తమోగుణాలు కొద్దిపాళ్ళల్లో ఉన్నవారికి శుద్ధసత్వగుణ సంపన్నుడు అంటారు. వీరు ప్రకాశవంతంగా, నిర్మలంగా, ఉంటారు. తెలివితేటలతో వెలిగిపోతుంటారు. సోమరితనం ఉండదు. విషయగ్రహణ శక్తి, ధారణా శక్తి అంటే జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుంది. మనస్సు నిర్మలంగా చెడు ఆలోచనలు లేకుండా ఒత్తిళ్లకు లోనుకాకుండా ప్రశాంతంగా సమత్వబుద్ధి కలిగివుంటారు. ఈ సత్వగుణంతో బాటు మానవసహజమైన అహంకారం చేరుతుంది. దీనినే సాత్వికాహంకారం అంటారు. నేను పండితుడను, పరమ భక్తుడను, జ్ఞానిని, నాకంతా తెలుసు, నేను పరమయోగిని, దేవుడు నాకు కనబడతాడు ,అని కొందరు స్వామిజీలు అనడం మనం వింటుంటాము. మోక్షాన్ని పొందాలంటే ఈ సాత్వికాహంకారం ఉండకూడదు.
2..రజోగుణం:- రజోగుణం ప్రాపంచిక విషయాల మీద రాగం అంటే ఆసక్తిని కోరికలను కలువజేస్తుంది. రజోగుణం నుండి తృష్ణ, కోరికలు పుడతాయి. ఆ కోరికలు తీరడం కోసం అనేక కర్మలు చేస్తారు. అవి జీవాత్మకు బంధిస్తాయి. ప్రాపంచిక విషయాల పట్ల తృష్ణ, ఆసక్తి, ప్రేమ, ప్రీతి కలగడమే కాకుండా అవి స్వంతం చేసుకోవాలి అనే కోరిక కలుగుతుంది. అదే తృష్ణ అంటారు. అది కోరికకు పరాకాష్ట. కోరినది దొరికితే అభిమానం, చేజారిపోతుందేమోనని భయం కలిగి, ఇవే బంధములకు కారణమౌతోంది. కోరికలు ఉండటం తప్పుకాదు. శృతి మించిన కోరికలు, అవి లేకపోతే బ్రతకలేము అనే తృష్ణను పెంచుతాయి. దీనివలన దుఃఖమే కానీ సుఖం ఉండదు.
3..తమోగుణం:-ఇది సకల జీవరాశులకు మోహాన్నీ కలుగజేస్తుంది. ఈ తమోగుణం పరాకుగా ఉండటం, నిర్లక్యం, సోమరితనం, నిద్ర, మొదలైన లక్షణాలతో ఉంటారు. మానవులలో అజ్ఞానం సహజం. లేనిదానిని ఉన్నట్లుగా భ్రమచెందటమే అజ్ఞానం. తాడుని చూసి పాము అనుకొని భయపడటమే అజ్ఞానం. ఎంతమంది మరణిస్తున్నా, తను మాత్రం శాశ్వతంగా ఉంటాననుకోవడం, సుఖం వచ్చినప్పుడు గంతులేయడం, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోవడం, అజ్ఞానం. ప్రపంచంలో ఏ వస్తువు శాశ్వతం కాదు, మార్పుచెందేవి, నశించేవి అని తెలిసినా వాటికోసం వెంపర్లాడటం అజ్ఞానం. తమోగుణం ఈ అజ్ఞానం లోనుంచి పుట్టినదే. ప్రాపంచిక వస్తువులమీద మోహం కలిగిస్తుంది. ఆలోచనాశక్తి, విచక్షణా జ్ఞానాన్ని నశింజేస్తుంది. మొండితనాన్ని మూర్ఖత్వాన్ని పెంచుతుంది. ఈ తమోగుణం ఉన్నవారు ఎప్పుడు పరధ్యానంగాఉండటం, ఏ పని మీద శ్రద్ధ లేకపోవడం, సోమరితనం, ఎప్పుడు నిద్రపోవడానికి సుముఖత చూపడం ఇవన్నీ తమోగుణం లక్షణాలు. ఈ అజ్ఞానం ఉన్నవారు సంసారబంధాలలో సులభంగా చిక్కుకుంటారు. అందుకే ఈ తమోగుణాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నించాలి. జీవుడు సంసారబంధనాలలో చిక్కుకొని దుఃఖసాగరంలో మునిగిపోతున్నాడు.అజ్ఞానం తొలగిపోగానే సంసారబంధం త్రెంచుకొని ఆనందమయమైన పరమాత్మతో లీనమైపోతాడు.ఈ రకంగా ఆనందమయుడు చైతన్యమైన బ్రహ్మమే కానీ జడమైన ప్రకృతి కాదు.
తైత్తరీయోపనిషత్తు.బ్రహ్మనిష్ఠలో అంతరాయం కలిగి ,ప్రకృతి నిష్ఠ వున్న ముముక్షువునకు భయమే కలుగుతుంది. అభయప్రాప్తి , మోక్షం కలుగదు.ఆనందమయం బ్రహ్మమే కాని ప్రకృతి కాజాలదు.
అంతరధికరణం ( 1,1,20 )
సూత్రం ..20
"' అంతస్త ద్ధర్మోపదేశాత్'"
తత్ ధర్మ ఉపదేశాత్ :-పాపరహితంలాంటి బ్రహ్మధర్మం ఉపదేశించడం వలన అంతః :-బ్రహ్మమే అని గ్రహించాలి.
భావం :-పాపరహితమైన బ్రహ్మధర్మాలు ఉపదేశించడం వలన అంతః శబ్దానికి అర్ధం బ్రహ్మమే అని గ్రహించాలి.
వివరణ:-ఛాందోగ్యోపనిషత్తు:-ఆదిత్యుడిలోను అక్షిలోను ఉండే అంతఃపురుషుడు ఉపాస్యుడు అయితే ఈపురుషుడు జీవాత్మా? పరమాత్మా? బ్రహ్మం సర్వవ్యాపి కదా! ఇలాంటి బ్రహానికి సూర్యుడు కానీ, నేత్రం కానీ, ఎలా ఆధారం అవుతుంది? ఛాందోగ్యంలో ఆయనకు బంగారురంగు కేశాలున్నాయని వర్ణించారు. ఇలాంటి రూపం జీవాత్మకు ఉంటుంది కదా !బ్రహ్మానికి రూపం లేదు కదా! అని ఉపనిషత్తు అంటోంది. బ్రహ్మకు శరీరం లేదు. శబ్దస్పర్శరూపాలు లేవు. సర్వపాపరహితుడు, నిర్మలుడు, ధర్మాలు బ్రహ్మకు చెందుతాయి. యోగదర్శనంలో ఈశ్వరుడికి కేశములతో సంబంధం లేనివాడని వర్ణించారు. కాబట్టి అక్షిలో ఉండే అంతఃపురుషుడు బ్రహ్మమే. యోగదర్శనంలో బ్రహ్మలక్షణాలు:-సృష్టి స్థితి లయ కారకుడు పరమేశ్వరుడు తనలో అంతర్గతంగా ఉన్న సృష్టిని బహిర్గతం చెయ్యడం, ఉన్న సృష్టిని తనలోకి లయం చేసుకోవడం, సకల చరాచర సృష్టిని స్థితి చేస్తున్నాడు. పరబ్రహ్మ అంటే ఎవరు? జీవులు దేనివలన జన్మిస్తున్నాయో చివరకు దేనియందు లయమౌతున్నాయో అదే పరబ్రహ్మము. వరుణ మహర్షి కుమారుడు భృగు మహర్షి విద్యాభ్యాసం పూర్తి చేసి, బ్రహ్మ విద్యను బోధించమని, పరబ్రహ్మస్వరూపం ఎక్కడ ఎలా ఉంటుందో, చెప్పమని తండ్రిని కోరతాడు. చరాచర జగత్తు ఎవరి వలన అవిర్భవిస్తోందో, ఎవరి వలన పోషింపబడుతుందో, లయమౌతోందో అదే పరబ్రహ్మ. అన్నం, ప్రాణం, చక్షువు, శ్రోతం, మనస్సు పరబ్రహ్మస్వరూపాలే. ఒకరు చెబితే తెలిసేది కాదు .ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి కానీ పరబ్రహ్మస్వరూపం ఇదేనని చెబితే తెలిసేదికాదు. స్వయంగా ఆత్మానుభవం పొందాలి. తపస్సు చేసి తెలుసుకోమని సలహా ఇచ్చాడు తండ్రి. భృగువు కొన్నాళ్ళు తపస్సు చేసి తిరిగి వచ్చి అన్నమే పరబ్రహ్మస్వరూపం, అన్నం వలననే ఈ జగత్తు జీవిస్తోంది,ఆహారం తీసుకోకపోతే శరీరం ప్రాణాలతో ఉండదు. కనుక అన్నమే పరబ్రహ్మము అని తెలిసింది అన్నాడు. అన్నం జీవులకు ఆహారమే కానీ, అన్నమే పరబ్రహ్మము కాదు మళ్ళీ తపస్సు చెయ్యి అన్నాడు తండ్రి. మళ్ళీ కొన్నాళ్ళు తపస్సు చేసి తిరిగి వచ్చి ఇప్పుడు ప్రాణమే పరబ్రహ్మము అని తెలుసుకున్నాను. ప్రాణం ఉంటేనే శరీరం లేకపోతే చనిపోతారు, కళేబరం అంటారు, కనుక ప్రాణమే పరబ్రహ్మము అన్నాడు. ప్రాణం పరబ్రహ్మము కావచ్చును. కానీ ప్రాణమే పరబ్రహ్మము కాదు. మళ్ళీ తపస్సు చెయ్యమన్నారు తండ్రి. భృగువు మళ్ళీ కొన్నాళ్ళు తపస్సు చేసి తిరిగి వచ్చితండ్రి! మనస్సే పరబ్రహ్మము అని తెలుసుకున్నాను. మనస్సు వలననే స్త్రీపురుషులు ఆకర్షించబడి సృష్టి జరుగుతోంది. అన్నింటికన్నా ముఖ్యమైనది మనస్సే, అందుకే మనస్సే పరబ్రహ్మము అన్నాడు. కాదన్నారు తండ్రి. మళ్ళీ తపస్సు చేసి తిరిగివచ్చి విజ్ఞానమే పరబ్రహ్మము అన్నాడు. విజ్ఞానం అంటే లౌకికవిషయాల గురించి పరిజ్ఞానం, సాధనా సంపత్తిని తెలుసుకోవడం పరబ్రహ్మము కాదు అన్నాడు. మళ్ళీ తపస్సు చేసి తండ్రి! ఈ సారి తెలుసుకున్నది ఆనందమే పరబ్రహ్మము. ఆనందం వలననే జీవులు బ్రతుకుతున్నాయి అని చెప్పగానే వరుణమహర్షి మహదానందం చెంది కుమారుడికి బ్రహ్మవిద్య బోధించాడు. సత్యం, జ్ఞానం, ఆనంతం, బ్రహ్మ. సత్యం ,నిత్యం, శాశ్వతమైనవాడు, అనంతమైన జ్ఞానం కలవాడు, మార్పు లేనివాడు, జగత్తుకు ఆధారమైనవాడు, నిరాకరుడు, నిర్గుణస్వరూపుడు, దేనియందు ఆసక్తి లేనివాడు, సత్వరజస్తమోగుణములు లేనివాడు, ఈ గుణాలు ఆయననుంచి వస్తాయి. అభిమానం, ప్రేమ, రాగద్వేషాలను అతీతుడు, రూపము, గుణము లేనివాడు,. ఏదిలేనివాడు సృష్టి ఎందుకు చేస్తున్నాడు? అది ఆయన లక్షణమా? లేక వినోదామా? గతంలో ప్రళయం సంభవించినప్పుడు కర్మ పరిపక్వం కాకుండా తనలోనే లీనమైపోయిన జీవరాశుల యొక్క కర్మలను లయం చేసి వారికి మోక్షాన్ని కలిగించాలనే ఉద్దేశ్యంతో ఈ సృష్టి చేయాలని సంకల్పించాడు. ఇక్కడ ఒక సందేహం వస్తుంది. కర్మపరిపక్వం కాకుండా పరబ్రహ్మంలో ఎలా లీనమౌతున్నాయి? జీవరాశులు తమతో బాటే కర్మలన్నీ మూటకట్టుకొని పరమేశ్వరిదిలో లీనమయ్యాయి. పరమేశ్వరుడికి సృష్టి, స్థితి, లయ చెయ్యడం లక్ష్యమే కానీ, లీలావినోదం కాదు. సృష్టి జరగకముందు జగత్తు బ్రహ్మమయంగా ఉండేది. ఆ ఆత్మ పరబ్రహ్మం లోకాలన్నింటిని సృష్టించింది.భూలోకమును మత్స్య లోకం అంటారు. ఇక్కడ పుట్టిన ప్రతివాడు మరణించక తప్పదు. సాక్షాత్తు అవతారపురుషుడు కూడా అవతార పరిసమాప్తి చెయ్యవలసినదే. ఇంద్రియాలకు అధిష్టానదేవతలను, అన్నాన్ని, ప్రాణికోటిని సృష్టించి అందరిలో తను ఉండాలని బ్రహ్మరంద్రం గుండా శరీరాలతో ప్రవేశించడం సృష్టి చెయ్యడం ఆయన లక్షణం. సృష్టిలో కనిపించే ప్రతి వస్తువు అశాశ్వతమైనది. బ్రహ్మం అప్రసిద్ధమైనది. నామరూపాత్మకమైన జగత్తంతా పరబ్రహ్మము వలన సృష్టించబడుతోంది. జగత్తుకు ఉపాదాన కారణం, నిమిత్తకారణం పరబ్రహ్మమే. నామరుపాత్మకమైన జగత్తును ముందుగానే ఊహించుకొని తరువాత సృష్టించాడు. గురువు శిష్యునికి బోధించేటప్పుడు రూపవర్ణన చేస్తూ, బ్రహ్మాన్ని పురుషరూపంలో వర్ణించారు. ఆయనకు ఏ విధమైన కేశములు, క్లేశములు ఉండవని గ్రహించాలి.
సూత్రం :- 21
"భేద వ్యపదేశాచ్చానః"
భేద వ్యాపదేశచ్చః:- ఆధార ఆధేయరూపాల్లో వేర్వేరు అని చెప్పడం వలన అంతః పురుషుడు అన్యః:- అక్షి ఆదిత్యులకన్నా భిన్నుడే.
భావం :- అక్షి, పురుషుడికి, ఆధారం అని పురుషుడు ఆధేయమని వర్ణించారు. కనుక అక్షి ఆదిత్యుల కన్నా పురుషుడు వేరే కనుక అంతః పురుషుడు అక్షి ఆదిత్యులకన్నా భిన్నమైన బ్రహ్మమే.
వివరణ:- సూర్యుడు వేరు, పరమాత్మ వేరు, పరమాత్మ సూర్యునిలోనే ఉన్నాడు. కానీ అతను సూర్యుడు కాదు.
బృహదారణ్యకం:- సూర్యుడు అన్ని భూతాలకు మధువు. అన్ని భూతాలు ఆదిత్యునికి మధువు లాంటివి. ఆదిత్యునిలో ఉన్న ప్రకాశవంతమైన పురుషుడే శరీరంలోని కనులలో ఉండే తేజోమయమైన పురుషుడు ఇద్దరు ఒక్కటే. అదే ఆత్మ. పరమాత్మ ఆదిత్యలోకంలో ఉంటాడు. ఆదిత్యలోకం అతన్ని ఎరుగదు. ఆదిత్యలోకమే అతని శరీరం. ఆదిత్యలోకంలో ఉంటూ ఆదిత్యలోకాన్ని నియంత్రిస్తాడు. అతడే అంతర్యామి అయిన ఆత్మ. కాబట్టి ఆదిత్యునికి భిన్నమైన వాడు ఆ పరమాత్మ అంటూ వివరించాడు రత్నాకరుడు. ముందు సూత్రంలో, దీనిలో బ్రహ్మ లక్షణాలను వర్ణించారు.
పరిణామక్రమం:- భూలోకంలో పుట్టిన జీవులకు పరిణామ క్రమం ఉంటుంది. వాటినే షడ్వికారాలు అంటారు. జాయతే, అస్థి, పరిణయతే, వర్ధతే, క్షీయతే, నశ్యతే. జాయతే.. పుడుతుంది, అస్థి పోషిపబడుతుంది, పరిణయతే. పరిణామం పొందు చున్నది, వర్ధతే పెరుగుతుంది.. క్షీయతే నశిస్తుంది. ఈ ఆరు పరిణామాలు సృష్టి పొందుచున్నది. ఇవన్నీ కలిసిపోయి 3 దశలు అయ్యాయి. పుట్టడం పెరగడం--సృష్టి , పరిణామం వృద్ధిచెందడం ..స్థితి, క్షీణించడం ..నశి చడం కలసి లయ అన్నారు. ఈ రకంగా సృష్టి, స్థితి, లయకు పరబ్రహ్మ కారణం.
శాస్త్రాలు :- శాసించేది శాస్త్రం, ఏ రకంగా చెయ్యాలి, ఏరకంగా చెయ్యకూడదు అని నిర్దేశించేదే శాస్త్రం. అదే వేదం. మహత్తర విషయాలు కూడా సర్వజ్ఞుడైన బ్రహ్మచేత చెప్పబడినవి. అన్ని విషయాలలో పరిజ్ఞానం కలిగి వివరించడమనేది పరమేశ్వరునికే సాధ్యం.
శాస్త్రాలు 2 రకాలు;-1.పౌరుషేయములు 2.అపౌరుషేయములు.
1.పౌరుషేయములు:- పురుషులచేత చెప్పబడినవి.ఇవి 10.
1.పురాణములు, 2.న్యాయశాస్త్రం, 3.మీమాంస, 4.శిక్ష, 5.ధర్మశాస్త్రం, 6.కల్పం, 7.వ్యాకరణం, 8.నిరుక్తము, 9.ఛందస్సు, 10.జ్యోతిషం.
1.పురాణములు:- దీనికి 5 లక్షణములు ఉన్నాయి. సర్గము, ప్రతి సర్గము, వంశము, మన్వంతరము, వంశాల చరిత్ర, అనే పంచ లక్షణాలు కలిగినది పురాణము.
1సర్గము :- సకల ప్రపంచ సృష్టిని విస్తరించేది.
2ప్రతి సర్గము ;-సకల ప్రపంచము లయమయ్యే లక్షణం తెలిపేది. 3.వంశం:- పృధు ప్రియ వ్రతాదుల వంశోత్పత్తిని వివరించటం. 4.మన్వంతరము:-ఏ కల్పంలో ఏ మనువు కాలంలో ఏమి జరిగిందో చెప్పడం 5.వంశాలచరిత్ర:-ఏ వంశములవారు పరిపాలించారో వారి చరిత్రలు .
పురాణాలు 18 వ్యాసులవారు వ్రాశారు. ఉపపురాణాలు 18 వ్యాసులవారి శిష్యులు వ్రాశారు. 1.న్యాయశాస్త్రం: దీనికి మరోపేరు తర్కశాస్త్రం. దీనిలోని షోడశపదార్ధములను (౧౬) తెలుసుకుంటే మోక్షప్రాప్తి లభిస్తుంది. ప్రమాణం, ప్రమేయం, సంశయం, ప్రయోజనం, దృష్టాంతం, సిద్ధాంతం, అవయవం, తర్కం, నిర్ణయం, వాదం, జల్పం, వితండం, హేత్వాభాసం, ఛలం, జాతి, నిగ్రహస్తానం.
మీమాంస:- వేదాలలో పురాణాలలో కూడా వాటి అర్ధం వివాదం వస్తే వాటిని తీర్చుకోవడం మీమాంస చెల్పబడింది.
శిక్ష :-వేదం, శ్లోకాలు, మంత్రములలోని అక్షరములను స్వరములను ఉచ్చారణ సరైన రీతిలో బోధించేది.
ధర్మ శాస్త్రం ;-హిందు మతానికి సంబంధించిన ఆధారాలు నియమాలు, సిద్ధాంతాలు, తత్త్వాలను వివరించేవి హిందు ధర్మ శాస్త్రాలు.
కల్పం: 1.వేదాంగములలో ఒకటి. 1.కాలమానము :-హిందు కాలమానం ప్రకారం బ్రహ్మకు ఒక పగలు ( 14 మన్వంతరాలు సంధ్య )
2.వ్యాకరణము :-వేదార్ధముల కోసం వ్యాకరణం ఉపయోగిస్తారు.నన్నయ సంస్కృతంలో ఆంద్రశబ్దచింతామని వ్రాశాడు.
3.నిరుక్తము:-ఒక వేదంలోని సంస్కృత పదాలను అర్ధం తెలియజేస్తుంది .దీని కర్త యస్కుడు. వేదం శబ్ద వివరణ నిఘంటువు శాఖ పూర్ణ, నిరుక్తము అనేవికూడా ఉన్నాయి.
4.ఛందస్సు:- పద్యాలు, శ్లోకాలు, వేదం, మంత్రాలు కూడా ఛందోబద్ధంగా వ్రాయబడినవి .పద్యాలను వ్రాయడానికి ఉపయోగించే విధానాన్ని ఛందస్సు అంటారు. చందస్సును సంస్కృతంలో రచించిన వేదాలలో కూడా ఉపయోగించారు.
5జ్యోతిషం:- భవిష్యత్తును తెలుసుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది విశ్వసించే విధానం.ఇది నిర్ధుష్టమైన హిందు ధర్మ శాస్త్రం. జీవి జీవితంలో జరిగినది జరుగుతున్నది జరగబోయేది జననకాల గ్రహస్తితి ప్రకారం జీవితంలో వివిధ అంశాల గురించి చెప్పబడతాయి.
పౌరుషేయములు. బ్రహ్మ సృష్టించిబడిన వేదములు 4. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం.
ఒక్కొక్క వేదంలో 4 ఉపవిభాగాలున్నాయి. మంత్రసంహిత,బ్రాహ్మణము,అరణ్యకము,ఉపనిషత్తులు.
నాలుగు వేదాలలో కలిపి 1180 అధ్యాయాలు ఉన్నాయి. లక్ష పైగా శ్లోకాలు ఉన్నాయి.మనకు లభించినవి 20023 మాత్రమే.
సూత్రం :- 22
"'ఆకాశ స్తల్లింగాత్'"
తత్ లింగాత్ :- బ్రహ్మాన్ని బోధించటానికి అనువుగా సామగ్రి ఉండటం వలన, ఆకాశః:- ఆకాశం, బ్రహ్మ బోధకమే.
భావం :- ఆకాశ శబ్దం బ్రహ్మసూచకం. పంచభూతాల్లోని ఆకాశం కాకుండా ఇది మాదాకాశం పరబ్రహ్మ స్వరూపం, సకల చరాచర సృష్టికి కారణమైనది.
వివరణ:- ఛాందోగ్యోపనిషత్తు:-ఈ లోకానికి గతి ఏది? ఆకాశం. ఈ భూతాలన్ని ఆకాశం వలననే ఉత్పన్నం అవుతున్నాయి. ఆకాశంలోనే అస్తమిస్తున్నాయి. వీటికన్నా ఆకాశం ఎంతో గొప్పది. ఆకాశమే పరమగతి. ఈ ఆకాశపదం పృథివ్యాప్తి పంచ భూతాల్లోని ఆకాశాన్ని సూచించడం లేదు. ఆకాశం అన్ని భూతల ఉత్పత్తికి కారణంగా చెప్పారు. ఇది బ్రహ్మానికి లింగమే. (గుర్తు). భూతాకాశం సర్వభూతోత్పత్తికి కారణం కాజాలదు బ్రహ్మమే సర్వభూత ఉత్పత్తి స్థితి లయలకు కారణం. ఆనందమయ ఆకాశం బ్రహ్మ వాచకంగా వాడారు. పృధివి అంతరిక్షం ద్యులోకం సర్వలోకాలకన్నా బ్రహ్మశ్రేష్టం కనక ఆకాశం బ్రహ్మవాచకం.
తైత్తరీయోపనోషత్తు :- దేని వల్ల ఈ భూతాలు ఉత్పత్తి అయి జీవిస్తూ, ఎందులో లీనమౌతున్నాయయో అది బ్రహ్మమని తెలుసుకో!
బృహదారణ్యకోపనిషత్తు:- విజ్ఞానమయం ఆనందమయంమైన బ్రహ్మమే అన్నిటికీ పరాయణం కనుక ఆకాశమే బ్రహ్మమని అర్ధం.
ఛాందోగ్యోపనిషత్తు:- శిలకుడు, దార్బల్యుడు, ప్రవాహనుడు, ఉద్గీత మీద వాదోపవాదాలు చేస్తుంటారు. శిలకుడు అడుగుతు న్నాడు:- ఈ లోకానికి ఆధారం ఏది? ప్రహనుడుచెబుతున్నాడు, స్వరాభిన్నమైన ఆకాశమే ఈ లోకానికి ఆశ్రయం, ఆకాశం అంతటా అవరించిఉన్నది. ఆకాశం అంటే పరబ్రహ్మ. సమస్త లోకాలు జీవకోటి అంతా కూడా ఆకాశరూపమైన పరబ్రహ్మ నుంచే ఉద్ధరించి అందులోనే లీనమౌతున్నాయి.కాబట్టి ఈ లోకానికి పరబ్రహ్మ ఆధారం. వాయువు మొదలైన భూతాలన్ని ఆకాశం నుంచే పుడుతున్నాయి. ఎంతమాత్రం చేత ఆకాశం అంటే భూతాకాశం కాదు. అది పరమాత్మ కాబట్టి ఆకాశం అనగానే భూతాకాశం స్ఫురించినా దాని అర్ధం మాత్రం పరమాత్మయే అన్నారు రత్నాకరుడు. నామరుపాల చేత విడిగా కనిపించే అనేక మంది కర్తలతోను, కర్మఫలాలతోను అనుభవించే భోక్తలతోను ఉహించడానికి కూడా శక్యంకానీ విధంగా సృష్టి రచనా విధానం తెలియబడుతోంది. సృష్టి ఇదివరలో లేనిది, ఇప్పుడు కల్పించబడి కనిపించేదని స్థూలంగా అనుకోవచ్చును. సృష్టిని పూర్వం బ్రహ్మమొక్కటే ఉండేది. మాయల చేత బహురూపమైన బ్రహ్మ ప్రత్యక్షమైనది. దీనికి మించి ద్వితీయ వస్తువు ఏది లేదు. ఈ ఆత్మయే బ్రహ్మ. సర్వమును అనుభవించేది, తెలుసుకొనేది, జీవుడు కాదు బ్రహ్మమేనని గ్రహించాలి.
ప్రాణాధికరణం:- ( 1, 1, 23 )
సూత్రం :- 23
"అత ఏవ ప్రాణహః "
ప్రాణం :- ప్రాణ శబ్దం కూడా , అతఏవ:- ఈ కారణం వల్ల బ్రహ్మవాచకమే.
భావం:- ప్రస్తావం అనే భక్తి విశేషం ఉన్నవాళ్లు ప్రళయ వేళలో ప్రాణం అనే దేవతలా ప్రవేశించి సృష్టి సమయంలో బయటకు వస్తాయి. దీనిలో ప్రాణ శబ్దం బ్రహ్మ వాచకమే.
వివరణ :- ప్రాణమనేది బ్రహ్మ వాచకం కానీ సాధారణ ప్రాణ వాచకం కాదు. ఇప్పటిదాకా బ్రహ్మాన్ని వ్యాపకం అని నిర్ణయించారు.మహర్షి ఇప్పుడు బ్రహ్మం స్వయం జ్యోతి అని సూత్రీకరిస్తున్నారు.
ఛాందోగ్యోపనిషత్తు:- ఉషస్తి, చాక్రాయణుడు యాగం చేస్తన్న ఋత్వికులను పిలిచి మీరు ఇప్పుడు చేసే కార్యకలాపాలకు అధిష్టాన దైవం ప్రాణం. అన్ని జీవ రాశులు ప్రాణంలో ప్రవేసిస్తాయి. ప్రాణంతోనే జీవిస్తాయి. ఇక్కడ ప్రాణం అంటే పరబ్రహ్మ. ఉద్ధాలకుడు తన కుమారుడైన శ్వేతకేతువుకు సుషుప్తి అవస్థను గురించి వివరిస్తాడు. సుషుప్తావస్థలో మనస్సు, ఇంద్రియాలు పనిచేయడం మానివేస్తాయి. ఇంద్రియాలన్ని అలసట చెంది, ఒక్కొక్కటి మనస్సులో లీనమౌతాయి. మనస్సు ప్రాణంలో లీనమౌతుంది. సుషుప్తిలో ఒక్క ప్రాణం మాత్రమే మేల్కొని ఉంటుంది. ఆ ప్రాణమే ఇంద్రియాల యొక్క మనస్సు యొక్క అలసటను తీరుస్తుంది.ఇక్కడ ప్రాణం అంటే ప్రాణనాడులలోని ప్రాణమే అని ముందు అనిపించినా ఇంద్రియాలు మనస్సు అన్ని ప్రాణంలో లీనమౌతాయి.అని చెప్పడం వలన ప్రాణం అంటే పరమాత్మ కానీ వేరు కాదు. సుషుప్తిలో జీవుడు ఎలా ఉంటాడు? సుషుప్తి అంటే గాఢమైన నిద్ర.ఈ స్థితిలో అవయవాలు, ఇంద్రియాలు హాయిగా నిద్రపోతాయి. మనసు కూడా పనిచేయదు. ప్రాణం మాత్రం తిరువుతుంది. గాఢనిద్ర నుండి మేలుకొన్నాక నాకేమి తెలియదు, చాలా హాయిగా ఉంది అంతాడు. ఇక్కడ తమోగుణం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. చిత్తాన్ని, అహంకారాన్ని వదలి మనోబుద్ధులతో జీవుడు హృదయ స్థానంలో ఉంటాడు. స్వప్నావస్టాలో కంఠంలోను, జాగ్రదావస్థలో కంటిలోను, జీవుడు ఉంటాడు. ఇంద్రియాలు అవిద్య, అజ్ఞానంలో మునిగిపోయి ఉంటాయి. సుషుప్తిలో ప్రాజ్ఞుడు అని, జాగృదావస్థలో విస్సుడు అని, స్వప్నావస్థలో తేజస్సుడు అని పిలువబడతాడు. ఇంద్రియవ్యాపారం అంతా నశించిపోయిన స్థితి. దీనిని మాయ అనే అజ్ఞానం అంటారు. పగలంతా కష్టపడి పనిచేసి అలసిపోయి, ఇంటికి వచ్చి భోజనం చేసి, సుఖంగా పాన్పు మీద నిద్రిస్తే, ఏ కలలు రాకుండా హాయిగా నిద్రపోతారు. మూడు అవిద్యావస్తువులు ప్రకటించడం జరుగుతుంది. 1.అజ్ఞానం, 2.అహంభావం, 3.సుఖము ప్రకటిత మౌతాయి. మనస్సు, బుద్ధి, హృదయంలో కలసిపోతాయి. ఇవన్నీ ముఖ్యప్రాణంలో కలసిపోతాయి. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలలో కలసిపోతాయి. జ్ఞానేంద్రియాలు మనస్సులో, మనస్సు ప్రాణంలో కలసిపోతాయి. ఈరకంగా బుద్ధి, మనస్సు, ప్రాణం కలసి మెలకువ రాగానే హాయిగా బ్రహ్మాండంగా ఉంది అంటాడు. అంటే జ్ఞానం ఒక్కటే ఉంది. ఈ పురుషుడు ప్రాజ్ఞుడు కోరికలు ఉండవు. కలలు రావు. ఈ స్థితిలో ప్రాజ్ఞుడు శరీరం అంతా సంచారం చేస్తూ ఉంటాడు. అతన్ని చూస్తే చేతనుడా? అచేతనుడా? అనిపిస్తుంది. మతి ఉందా ? లేదా? అనుకుంటాము. ఈ సుషుప్తిలోనే ప్రాజ్ఞుడికి బ్రహ్మభావన కలుగుతుంది. గాఢనిద్రలో పరమతత్వం పొందుతాడు. తన ఆత్మ స్థితిని పొందుతాడు. అప్పుడు అక్కడ ప్రాజ్ఞుడే, కానీ జీవుడు అజ్ఞానంతో కలసి ఉంటాడు కనుక పరమాత్మ కాదు.
జ్యోతిశ్చరణాధికరణం:- (1, 1, 24 )
సూత్రం :- 24
" జ్యోతిశ్చరణాభిధానాత్ "
చరణ అభి ధానాత్ ;- ఛాందోగ్య చరణంలో ఉన్న, జ్యోతిః :- జ్యోతి పదం సైతం బ్రహ్మవాచకమే. చరణం అంటే పాదం.
భావం :- ద్యులోకానికి పరంగా ప్రకాశించే జ్యోతి అన్నింటికన్నా ఉత్తమ అనుత్తమ లోకాల్లోనూ వెలుగుతుంది. అదే ఈ మనుష్య శరీరంలో ఉన్నది. సూర్యుడు, అగ్నిలోని తేజస్సులు బ్రహ్మ వాచకం కాదు.
వివరణ :- జీవుడు ఈ శరీరాన్ని విడిచి పరమజ్యోతిని చేరి స్వస్వరూపంతో ఉంటాడు అనే వాక్యంలో జ్యోతి శబ్దం బ్రహ్మాన్ని తెలియజేస్తుంది. నిర్వధికం అయిన బ్రహ్మంలో ప్రకాశించే ఆదిత్యాగ్నులు ఒక భాగం మాత్రమే. కనుక ఉపనిషత్ వాక్యం కాని శబ్దం స్వయం జ్యోతి అయిన బ్రహ్మమే కానీ సూర్యాది తేజోవాచకం కాదని స్పష్టమౌతోంది. ఇక్కడ జ్యోతికి చరణములు అంటే పాదములు చెప్పడం వలన జ్యోతి అంటే పంచభూతాల్లోని అగ్ని కాదు. సాక్షాత్తు పరమాత్మయే.
ఛాందోగ్యోపనిషత్తు:- గాయత్రి అనబడే బ్రహ్మ యొక్క మహిమ గొప్పది. పృధ్వి రూపమైన గాయత్రి శరీరంలో ఉండే పంచభూతాలు, ఇంద్రియాలు అన్ని ఒకటి పురుషుని శరీర రూపమైన గాయత్రియే. పురుషుని హృదయ కమలంలో ఉండే పురుషుడు ఇద్దరు ఒకటే. అంటే పురుషుని లోని గాయత్రిలోనే ప్రాణాలు ప్రతిష్ఠితమై ఉన్నాయి. ఈ జగత్తంతా బ్రహ్మ యొక్క విభూతే. శుద్ధబ్రహ్మ, కార్యబ్రహ్మ కన్నా గొప్పది. పాంచభౌతికమైన జగత్తంతా శుద్ధ బ్రహ్మ యొక్క పాదమే. మిగిలిన 3 పాదాలు అమృత స్వరూపమైన బ్రహ్మము ఇదే. లోకాలపైన ఉత్తమోత్తమ లోకాలలో ఏ తేజస్సు ప్రకాశిస్తుందో అదే ప్రాణుల హృదయంలో ఉన్న తేజస్సు. ఇప్పుడు ప్రతిపాదించిన తేజస్సును ఆదిత్యుని యొక్క తేజస్సు గానే గ్రహించాలి. బ్రహ్మము నకు గుర్తు లేదు. రూపరహితమైన బ్రహ్మం దీప్యతే అని చెప్పడం సరికాదు. అంతే కాక ద్యులోకం పైన అని ఒక హద్దు పరిమితి చెప్పబడింది. సర్వాత్వకమైన బ్రహ్మ సర్వత్రా ప్రకాశిస్తూ ఉండాలి కదా! ఈ జ్యోతిని పంచభూతాలలో అగ్నిగా భావించాలి. అగ్నిగా గ్రహించాలన్నా ఆరూపంలో అగ్ని ద్యులోకానికి పైనే ఉంటుంది కానీ మరెక్కడా ఉండదు. కుక్షిలో ఉన్న జఠరాగ్ని రూపంలో కూడా గ్రహించడం సమంజసం కాదు. కారణం ఆ ఉష్ణత చేతితో తాకితే తెలుస్తుంది. దాని ఘోష చెవికి వినబడుతుంది అని చెప్పబడినది. కానీ అది జడపదార్ధం కనుక బ్రహ్మవాచకం కాదు. నిర్గుణ బ్రహ్మము అద్వితీయము అని ఎక్కడ చెప్పబడిందో దానికి మోక్షఫలసిద్ధి కలుగుతుంది. ఎక్కడ సగుణబ్రహ్మంగా చెప్పబడిందో అక్కడ జీవుడికి ఇహపర సుఖములు లభిస్తాయి.
సూత్రం :- 25
" ఛందో భిదానా న్నేతి చేత్ న , తథా చేత్తోర్పణ నిగదాత్ , తథా హి దర్శనమ్..'"
ఛందః అభిధానాథ్ :- ఛాందోగ్య వాక్యంలో గాయత్రి ఛందస్సు గురించి చెప్పారు కనుక, న:- తరువాత వచ్చిన వాక్యంలో జ్యోతిః అనే పదం బ్రహ్మాన్ని సూచించదు. ఇతి చేత్ :- అని భావించడం న :-సరియైనది కాదు. తధా :- ఓం ఎలాగో గాయత్రి కూడా అలాగే కనుక చేతః అర్పణ నిగదాత్ :- అది ప్రతిపాదించే బ్రహ్మంలో మనస్సుని ప్రవేశించడాన్ని బోధించినందువల్ల జ్యోతిః పదం తో బ్రహ్మాన్ని గ్రహించాలి. తధాహి :-ఆ విధం గానే దర్శనమ్ :- ఇలాంటి వర్ణన వేరొక చోట కూడా ఉన్నట్లు గ్రహించాలి.
భావం:- గాయత్రి ఛందస్సుకు చెప్పడం వలన బ్రహ్మపరంగా చెప్పలేదు అన్నది సరియైనది కాదు. చందస్సుకు సంబంధించిన బ్రహ్మము యందు మనస్సును నిలుపుకోవాలని చెప్పడం వలన ఛందోరూపంలో బ్రహ్మం నిర్దేశింపబడినదని సూత్రార్థం. ప్రస్తుత సందర్భంలో గాయత్రి ఒక ఛందస్సు రూపమనే కాని, బ్రహ్మ యొక్క గుర్తుగా అంగీకరించబడలేదు.
వివరణ:- ఛాందోగ్యోపనిషత్తు:- ఈ భూత ప్రపంచమంతా గాయత్రే. ఆ గాయత్రి.. వాక్కు, భూతం, పృధివి, శరీరం, ప్రాణం, హృదయం, అనే ఆరు విధములుగా ఉన్నది. గాయత్రి కన్నా ఎక్కువ మహిమ కలది బ్రహ్మం. అన్ని భూతాలు ఆయనకు ఒక పాదం. తక్కిన పాదత్రయం అమృతం అని వివరించారు. జ్యోతిః అనే పదం గాయత్రి చందస్సును బోధించదు. ఛందస్సు వర్ణనాతీతం. అది సర్వ భూతాత్మకం కానేరదు. బ్రహ్మమే సర్వభూతాత్మకం. గాయత్రి అనే పదాన్ని బ్రహ్మం అనే పదంతో ప్రయోగించినప్పుడు మాత్రం బ్రహ్మం సర్వాధిస్టానకారణం. కనుక ఆ పదం సర్వభూతాత్మకం అవుతుంది. అప్పుడు గానం చేస్తే రక్షించే బ్రహ్మమే గాయత్రి. బ్రహ్మకు రక్షణకర్తృత్వం ద్యోతకమవుతుంది. రక్షణ కర్తృత్వం చేతనపదార్ధం, ఛందస్సు జడమైనది, కనుక జ్యోతిః పదం బ్రహ్మవాచకమే. గాయత్రి మంత్రం చందస్సును చెబుతోంది కనుక అది బ్రహ్మం కాదు అని వాదన. అయితే శృతులలో గాయత్రి ఛందస్సు ద్వారా గాయత్రి యందు బ్రహ్మము నందు చిత్తాన్ని ఏకాగ్రం చెయ్యాలి అని చెబుతున్నారు. కాబట్టి బ్రహ్మమే నాలుగు పాదములు కలది అని చెప్పారు. కానీ అది బ్రహ్మ అని చెప్పలేదు అని కొంతమంది అంటారు కదా అని ప్రశ్నించాడు నారాయణ భట్టు. గాయత్రి ఛందస్సు ద్వారా గాయత్రిలో ఉన్న బ్రహ్మమునందు మనస్సు నిలిపి అదే సత్యము అని ఉపాసించాలి. ఈ సమస్తము గాయత్రే అంతేకాని అక్షరముల కూర్పు కాదు.
సూత్రం :- 26
'భూతాది పాద వ్యపదేశోపపత్తే శ్చేవమ్
చ :-ఆ బ్రహ్మంలోనే భూతాది పాదవ్యాపదేశ ఉప్పతేహ్:- భూతం, పృధివి, శరీరం హృదయం అనే 4 పాదాల కథనం సిద్ధించడం వల్ల ఏకం :- గాయత్రి పదం కూడా బ్రహ్మాన్ని ఉపదేశిస్తుంది.
భావం:- ఇది నాలుగు పాదాలున్న గాయత్రి అని వర్ణించినందున గాయత్రి బ్రహ్మ వాచకం అవుతుంది.
వివరణ: ఛాందోగ్యోపనిషత్తు: బ్రహ్మంలోనే ఈభూతజాతమంతా గాయత్రి అంటూ ప్రారంభించి, భూతం, పృధివి, శరీరం, హృదయం, అనే వాటిని వివరించి, తరువాత ఇది ఆరు విధాలైన నాలుగు పాదాలున్న గాయత్రి అని ముగించారు. ఒకవేళ ఇది గాయత్రి చందస్సయితే దానికి భూతం, పృధివి, శరీరం, హృదయాన్ని పాదాలుగా వర్ణించరు కదా! ఛందస్సు వర్ణనాత్మకం. కనుక గాయత్రి బ్రహ్మ వాచకం. బ్రహ్మం పూర్ణం, ఏ మార్పులు లేవని తెలుసుకున్నవారికి అవ్యయమైన సంపదలు కలుగుతాయి. బ్రహ్మమే శ్రీకరం పూర్ణం. పూర్ణ మదః, పూర్ణ మిదం, పూర్ణాత్ పూర్ణముదచ్యతే, పూర్ణస్య పూర్ణ మాదాయ, పూర్ణమేవావశిష్యతే (శుక్ల యజుర్వేదం) పరబ్రహ్మము అన్ని విధాలా సదా పరిపూర్ణం. జగన్నిర్మాణ కర్త అయిన పరమాత్మ నిమిత్తంగా ఉన్న ఈ జగత్తు పూర్ణం. పూర్ణ బ్రహ్మం నుంచి పూర్ణం గ్రహించినా పూర్ణమే అవుతుంది.ఈ విధంగా గాయత్రి పదం, జ్యోతి పదం రెండు బ్రహ్మ వాచకాలే. వేద ఛందస్సు:- వేదాలలో ముఖ్యంగా అనుష్టుప్ (8.అక్షరాలు), బృహతి ( 9 అక్షరాలు), పంక్తి ( 10 ), త్రిష్టుప్ ( 11 అక్షరాలు ), జగతి ( 12 అక్షరాలు ), అనబడు ఛందములను ఉపయోగించారు. మిక్కిలి ప్రసిద్ధి చెందిన ఛందస్సు త్రిపద గాయత్రి ఛందస్సు. అది ' తత్స వితుర్వరేణియం భర్గో దేవస్య ధీమహి థియో యోనః ప్రచోదయాత్' కొందరు మొదటి పాదంలో వరేణ్యం అంటారు.అప్పుడే గాయత్రి ఛందస్సు 23 అక్షరాలే. ఇది గాయత్రిలో ఒక ప్రత్యేకత. గాయత్రీమాతకు మూడు పేర్లు.. గాయత్రి, సావిత్రి, సరస్వతి. ఇంద్రియాలకు నాయకత్వం వహించునది గాయత్రి, సర్వమును పోషించునది సావిత్రి, వాక్దేవతా స్వరూపిణి సరస్వతి. అనగా హృదయం, వాక్కు మరియు క్రియ. త్రికరణ శుద్ధి గావించునదే గాయత్రి మంత్రం. సకల వేదముల సారం ఈ గాయత్రి మంత్రం. ఈమెకు తొమ్మిది వర్ణనలు ఉన్నాయి.1 ఓం ,2. భూః, 3 భువః, 4 సువః, 5 తత్, 6 సవితుర్, 7 వరేణ్యం, 8 భర్గో, 9 దేవస్య .
ప్రతి పదార్ధం:- ఓం, ప్రణవ నాదం, భూః :- భూలోకం, పదార్ధములు చేరిక, దేహము, హృదయం, మెటీరియలైజేషన్. భువః :- భువర్లోకం, ప్రాణ శక్తి, వైబ్రేషన్ సువః :- స్వర్గలోకం ,ప్రజ్ఞానం, రేడియేషన్ ఈ మూడు మన శరీరంలోని ఉన్నాయి. తత్ :-ఆ సవితుర్ :-సమస్త జగత్తును వరేణ్యం:- వరింపదగిన భర్గో :- అజ్ఞానాంధకారమును తొలగించునట్టి దేవస్య :- స్వయంప్రకాశ స్వరూపమైన బ్రహ్మను ధీమహి :- ధ్యానించుచున్నాను. కనుక వర్ణన, ధ్యానం, ప్రార్ధన ఈ మూడు ఒక్క గాయత్రీ మంత్రం లోనే లీనమై ఉన్నాయి. గాయత్రీ మంత్రం బ్రాహ్మణునికి చిహ్నం. గాయత్రీ మంత్రం జపిస్తే బ్రహ్మ తేజస్సులా వ్యక్తిత్వం తేజోమయంగా ఉంటుంది. మానసికబలం ఉంటే ప్రకాశంగా ఉంటుంది. గాయత్రీమంత్రం ద్వారా గాంభీర్యం, మానసిక ఆనందం, సూర్యభగవానుని కిరణములు భూమి మీద పడగానే చీకటి మాయమైనట్లు, మనిషిలోని అజ్ఞాన తిమిరం తొలగిపోయి, బుద్ధివికాశం, వ్యక్తిత్వం శక్తి, విజ్ఞానం వికశించి మనస్సు బ్రహ్మానికి చేరువవుతుంది.
సూత్రం:- 27
" ఉపదేశ భేదాన్నేతి చేన్నో భయస్మిన్నా ప్యవిరోధాత్"
ఉపదేశం భేదాత్ :- ఉపనిషత్తు చేసిన ఉపదేశాల్లో భేదం ఉండటం వలన న :- సరి అయినది కాదు.ఇతి చేత :- జ్యోతి అనే పదం బ్రహ్మవాచకం అనడం ఉభయస్మిన్ అపి:- రెండు వాక్యాలలో అవిరోధాత్:- అర్ధ విరోధం వైరుధ్యం లేదు.
భావం:- ఉపనిషత్ చేసిన ఉపదేశాల్లో భేదం ఉండటం వల్ల జ్యోతి అనే పదం బ్రహ్మ వాచకం అనడం సరియైనది కాదు.రెండు ఉపదేశాల్లో అర్ధం ఒక్కటే.
వివరణ:- ఈ రెండు ఉపదేశాలు:- 1. గాయత్రివా ఇదంసర్వం:- ఇదంతా గాయత్రీ అని ప్రారంభించి, దానికి ఉదాహరణగా త్రిపాదస్యామృతం దివి, ద్యులోకంలో ఈబ్రహ్మం అమృతపాదత్రయం అంటూ ద్యులోకానికి బ్రహ్మానికి ఆధారంగా ఉపదేశించారు. 2 ."యదతః పరో దివః", ఈ ద్యులోకానికి ఒకచోట ఆధారంగా మరొకచోట అవధిగా వర్ణించడం వైరుధ్యం కాదా! ఈరెండు ఉపదేశాల్లో అర్ధవిరోధం ఉంది కదా! అంటే ఏ మాత్రం అర్ధ విరోధం లేదంటున్నారు వ్యాసమహర్షి. బ్రహ్మం సర్వ వ్యాపకం. ఆయన భూమినుంచి ద్యులోకం వరకు అంతటా లోపల బయట అనే భేదం లేక వ్యాపించి ఉన్నాడు. యజుర్వేదం :- "తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః" :- ఈ బ్రహ్మం సర్వంలో అంతర్ బహిర్భాగాల్లో ఉన్నాడు. కనుక వ్యాపకమైన బ్రహ్మం ద్యులోకం లోను దానికి పరంగానూ ఉన్నాడని చెప్పడంలో వైరుధ్యమేమున్నది? రెండు ఉపదేశాల్లో అర్ధభేదం లేదు. కాబట్టి జ్యోతి పదం బ్రహ్మవాచకమే. ఉపదేశ వాక్యాలు వేరుగాఉండటం వల్ల వాక్యంలో చెప్పిన వస్తువు భిన్నం కాదు. గాయత్రి మంత్రాన్ని ఎన్ని రకాలుగా ఉపదేశించినా అందులో చెప్పబడ్డ బ్రహ్మ ఒక్కటే. లోకంలో చెట్టు చివర కూర్చున్న డేగను గూర్చి ఆ డేగ చెట్టు చివర ఉంది అని, ఆ డేగ చెట్టు కొన అవతల ఉంది అని చెప్పడం కనబడుతుంది. అట్లే ద్యులోకంలో ఉన్న బ్రహ్మను గురించి, ద్యులోకానికి అవతల ఉన్న బ్రహ్మ గురించి అని చెప్పబడుతోంది. మరొకడు ఇలా వ్యాఖ్యానించాడు. లోకంలో డేగను వృక్షంతో సంబంధం లేకపోయినా వృక్షాగ్రం మీద డేగ ఉంది. వృక్షాగ్రం పైన డేగ ఉంది అని చెప్పినా రెండిటి అర్ధం ఒక్కటే. అదే విధంగా ద్యులోకం కంటే దూరంగా ఉన్నా, ద్యులోకంలో ఉంది అని చెప్పినా ఈ వాక్యంలో ప్రత్యభి జ్ఞానం ( అదే ఇది అనే జ్ఞానం)ఉంది.అందుచేత జ్యోతిః శబ్ద వాక్యం బ్రహ్మ వాచకమే అవుతుంది.
ప్రతర్దనాధికరణం :- ( 1, 1, 28 )
సూత్రం :- 28
" ప్రాణ స్తథానుగమనాత్."
తథా:- జ్యోతిపదం బ్రహ్మవాచక మైనట్లే అనుగమనాత్ :- బ్రహ్మధర్మలు ఉండటం వలన ప్రాణః :-కౌశీతకీ బ్రహ్మణంలో ఉన్న ప్రాణ శబ్దం కూడా బ్రహ్మవాచకమే.
భావం :- జ్యోతి పదం బ్రహ్మ వాచకమైనట్లే బ్రహ్మ ధర్మాలు ఉండటం వలన కౌశీతకీ బ్రహ్మణంలో ఉన్న ప్రాణ శబ్దం కూడా బ్రహ్మవాచకమే.
వివరణ:- కౌశీతకీ బ్రాహ్మణము:- ఈ బ్రాహ్మణంలో ఇంద్ర ప్రతర్ధనులకు సంబంధించిన కథ ఉన్నది. గురువర్యా! గతంలో ప్రాణాధికారణం చెబుతూ ప్రాణమే బ్రహ్మ అని చెప్పారు. కానీ ప్రాణాలు వాయు రూపమా? దేవతా? పరబ్రహ్మ స్వరూపమా? అనే అనుమానం ఇంకా పట్టి పీడిస్తోంది. కాబట్టి దీన్ని గురించి పూర్తిగా వివరించండి? అన్నాడు కృష్ణ శర్మ. ఆ మాటలు విన్న రత్నాకరుడు ప్రాణాన్ని వివరించడం మొదలుపెట్టాడు. పూర్వకాలంలో కాశీ నగరాన్ని దినోదాసు అనే రాజు పరిపాలిస్తుండే వాడు. అతను చాలా పండితుడు. విద్వాంసుడు. పరాక్రమశాలి. ధర్మపరాయణుడు అతని పాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో హాయిగా ఉన్నారు. దినోదాసు కుమారుడు ప్రతార్ధనుడు తండ్రికి తగ్గ తనయుడు. ఒకసారి దేవ దానవులకు భీకరమైన పోరు జరుగుతున్నది. దానవుల ధాటికి తట్టుకోలేక దేవతలు వెనుకంజ వేశారు. ఆ సమయంలో ఇంద్రుడు తమకి ఎవరు సహాయం చేస్తారా అని ఆలోచిస్తుంటే దినోదాసు గుర్తుకు వచ్చాడు. వెంటనే తమకు సహాయంగా రావలెనని దినోదాసుకు కబురు పంపాడు. విషయం తెలుసుకున్న దినోదాసు తన కుమారుడైన ప్రతార్ధనుడిని దేవతలకు సహాయంగా పంపాడు. ఆ యుద్ధంలో చివరకు దేవతలే విజయం సాధించారు. విజయోత్సవ సభ ఏర్పాటు చేసి దానికి ప్రతార్ధనుడిని ఆహ్వానించారు. ఇంద్రుడు ప్రతర్ధనుడి శౌర్య పరాక్రమాలను ప్రశంసించి రాజా! దేవతలకు చాలా సహాయం చేసి విజయానికి కారకుడివయ్యావు. నీకు ఏమి వారం కావాలో కోరుకో అన్నాడు. దానికి నేను మానవుడను. నాకు హితమైనది పరమ పురుషార్ధమైనది ఏదో దాన్ని ప్రసాదించవలసినది అన్నాడు ప్రతార్ధనుడు. బ్రహ్మజ్ఞానం తప్ప మానవులకు హితమైనది ఏది లేదు. పురుషార్ధాలలో కూడా నలుగవది మోక్షమే. పరమాత్మను గురించి తెలుసుకున్న పురుషుడు జననమరణాల నుండి విముక్తుడౌతాడు. మోక్షం పొందాలంటే బ్రహ్మజ్ఞానం తప్ప వేరే సాధనం లేదు. పరబ్రహ్మకు సంబంధించి జ్ఞానం కలిగినంతనే మానవుడి కర్మక్షయం అయిపోతుంది. కర్మక్షయం కావడమే పురుషార్థం. సహోవాచ. ప్రాణోస్మి ప్రజాత్మా తం మా మాయు రమృతం ఇతి ఉపాస్య, ఆ మాటలు విన్న ఇంద్రుడు నేను ప్రాణాన్ని ప్రజ్ఞాత్మను, అటువంటి నన్ను ఆయువుగా అమృతత్త్వం గాను తలచి, ఉపాసన చెయ్యి అన్నాడు. అంటే ఇక్కడ ప్రాణం అంటే ముఖ్యప్రాణమా, బ్రహ్మమా ఈ రెండు శబ్దాల ప్రయోగం రెండింటికీ ఉన్నది. అన్నిచోట్ల ముఖ్య అర్ధం ప్రాణమే. ఎవరి వశంలో ఈసర్వం ఉన్నదో అలాంటి ప్రాణానికి నమస్కారం. అన్నిచోట్ల ప్రాణశబ్దం బ్రహ్మవాచకమే. లోకంలో అందరూ ప్రాణం అంటే తమ శరీరంలో ఉన్న ప్రాణమని భావిస్తారు. కానీ శాస్త్రల్లో ప్రాణశబ్దం బ్రహ్మాన్నే సూచిస్తుంది. ఇక్కడ ఉపాస్యమైన ప్రాణమంటే దైవమే. బ్మహ్మం కన్నా హితమైనది మరియొకటి లేదు. ముఖ్యప్రాణాన్ని ఉపాసించినవాడు దుఃఖరహితుడు కాలేడు అని చెప్పాడు ఇంద్రుడు. ఈ విషయం కౌశీతకీ ఉపనిషత్తులో చెప్పబడింది.
ప్రతర్దనాధికరణం :- ( 1, 1, 29 )
సూత్రం :- 29
'న వక్తు రాత్మొపదేశాదితి చేదధ్యాత్మ సంబంధ భూమా హ్యాస్మిన్ వక్తుః’
కౌశీతకీ బ్రహ్మణంలో వక్త అయిన ఇంద్రుడు ఆత్మ ఉపదేశాత్ :- తనను గురించి ఉపదేశించాడు కనుక న :- ప్రాణ శబ్దం బ్రహ్మ వాచకం కానేరదు. ఇతి చేత్ :- అనడం సరియైనది కాదు. హి :-ఎందుకంటే, అస్మిన్:- ఈ కౌశీతకీ బ్రహ్మణ ప్రకరణంలో అధ్యాత్మ సంబంధ :-పరమాత్మకు సంబంధించిన దర్మాల వివరణ భూధూ :- విరివిగా ఉన్నాయి. కనుక ప్రాణం అంటే బ్రహ్మమే.
భావం:- ఇంద్రుడు తనగురించి ఉపదేశించమన్నాడు కనుక ప్రాణశబ్దం బ్రహ్మ వాచకం కాదు అని చెప్పడం సరియైనది కాదు. కౌశీతకీ బ్రాహ్మణంలో పరమాత్మ ధర్మాలు వివరించబడ్డాయి. కనుక ప్రాణం అంటే బ్రహ్మమే.
వివరణ;- కౌశీతకీ బ్రహ్మణంలో బ్రహ్మ యొక్క ధర్మాలను వివరించారు. ఆధ్యాత్మిక ధర్మంలో ప్రాణం అంటే బ్రహ్మమే అని గ్రహించాలి. వాక్కును కాదు, వక్తను తెలుసుకోవాలి అని ప్రారంభించి బండి చక్రంలోని ఆకుల్లో ఎలాగైతే పట్టు ఉంటుందో, చక్ర మధ్యభాగంలో ఎలాగైతే ఆకులు ఉంటాయో, అలాగే భూతమాత్రలు ప్రజ్ఞామాత్రలలోను, ఆప్రజ్ఞామాత్రలు ప్రాణంలోను ఉంటాయి ఆ ప్రాణమే ప్రజ్ఞాత్మ, ఆనందం, అజరం, అమృతం కూడా. ఇక్కడ భూమాత్రలు అంటే పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశ., శబ్దాది తన్మాత్రలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలైన సూక్ష్మ భూతాలు, ప్రజ్ఞా మాత్రలు అంటే ఇంద్రియాలు నుండి జనించిన పంచజ్ఞానాలు. ప్రజ్ఞలు పంచేంద్రియమాత్రలు కన్ను, ముక్కు,చెవి ,నాలుక, చర్మము. ఇక అర్పితాలంటే విషయరూపంలో అర్పించినవి. కనుక పంచ సూక్ష్మ భూతాలు చక్రపు పై భాగం లాగా, పంచేంద్రియాలు వాటి వల్ల కలిగే నేత్రాది పంచజ్ఞానాలు చక్రపు ఆకుల్లాగా, ప్రాణం బ్రహ్మం నాభి చక్ర మధ్యభాగం లాగా ఇక్కడ వర్ణించారు. అంటే ఏమిటి? సూక్ష్మ, స్థూల భూతాలు వాటిని గ్రహించే సాధనాలైన ఇంద్రియాలు, ఇంద్రియాలను సాధనంగా ఉపయోగించే సమస్త జీవులు ప్రాణంతోనే ఇమిడి ఉన్నాయని భావం. ఇలాగ సర్వాధారమైన ప్రాణం బ్రహ్మమే అవుతుంది. కానీ ఇంద్రుడుకాదు. ఆ బ్రహ్మకు పృధ్వి ద్యులోకాన్ని ధరించి ఉంది. ఆబ్రహ్మమే భూమి, స్వర్గం అనే రెండింటిని ధరించి ఉంది. ఆబ్రహ్మమే అన్ని భూతాలకు ఆధారం. కర్మలకు అధ్యక్షుడు. ఇలాంటి సర్వాధారత్వం బ్రహ్మధర్మమే అవుతుంది. ఇంద్ర ధర్మం కాదు. అలాగే ముఖ్యప్రాణత్వం కూడా బ్రహ్మధర్మమే. ప్రాణమంటే జీవనం. జీవక్రియకు జీవుడు ఆధారమైనా అది జీవుడి ఆధీనంలో ఉండదు. జీవుడు బ్రహ్మాధీనమే. జీవనం బ్రహ్మాధీనం. జీవనం జీవాత్మ ఆధీనం అయితే ఈ లోకంలో మరణాలు ఉండవు.
కఠోపనిషత్తు:-ప్రాణాల మూలంగా కానీ, అపానం వల్ల గాని మానవుడు జీవించడు. ప్రాణాపానాలు ఆశ్రయించేది బ్రహ్మాన్ని. ఆయన మూలంగానే జీవిస్తారు. పైగా ఆయుష్షు కూడా బ్రహ్మమే.
బృహదారణ్యకోపనిషత్తు:- అందువల్ల విద్వాంసులు, జ్యోతులకు జ్యోతి అమృతమైన ఆయువును ఉపాసిస్తారు. అలాగే వాక్ వ్యాపారానికి కూడా బ్రహ్మమే హేతువు.
కేనోపనిషత్తు:- దేన్ని వాక్కుతో చెప్పడానికి వీలు కాదో, ఎవరి వల్ల వాక్కు ప్రవర్తిస్తుందో, ఆయనే బ్రహ్మము అని తెలుసుకో. ఇదేవిధంగా వక్తృత్వము, ఆయుష్షు, ముఖ్యప్రాణం, సర్వాధారాత్వం.. ఇవ్వన్నీ ధర్మాలు బ్రహ్మానికి సంబంధించినవే. కనుక ప్రాణ శబ్దం అన్ని రకాలుగా పరబ్రహ్మాన్ని బోధిస్తోంది కానీ జీవ ప్రాణాన్ని సూచించదు. ఇవి ఇంద్ర ధర్మాలు కానేరావు. ఇంద్రుడు తనని గురించి చెప్పాడు కదా! నేనే ప్రాణాన్ని ప్రజ్ఞానాత్మను అన్నాడు. ఇంద్రుడు దేవత కాబట్టి ఇది దేవాత్మను గురించి చెప్పినది అని భావించరాదు. ఇది పూర్తిగా బ్రహ్మ పదమే అన్నాడు రత్నాకరుడు. (ఇక్కడ నేను అని నిజంగా దేన్ని అనుకోవాలో, దాన్ని ఉపాసించమని ఇంద్రుడు ప్రబోధించాడు.}
ప్రతార్ధనాధికరణం ( 1, 1 31 )
సూత్రం :- 31
'జీవ ముఖ్య ప్రాణ లింగ న్నేతి చేత్ నోపాసా త్రై విధ్యాత్ ఆశ్రి తత్త్వాన్ ఇహతద్యోగాత్ '"
జీవ ముఖ్య ప్రాణ లింగాత్;- జీవుడికి ముఖ్య ప్రాణ ధర్మాలు ఉండటం వలన న:- ప్రాణ శబ్దం బ్రహ్మ వాచకం కాదు. ఉపాసనా త్రైవిద్యాత్:- మూడు రకాల ఉపాసనలు ఒప్పుకోవలసి వస్తుంది. ఆశ్రి తత్త్వాన్:- ప్రాణ శబ్దం బ్రహ్మనికే వర్తిస్తుంది. ఇంతే కాక ఇహ:- శాస్త్రంలో, తద్యోగాత్:- బ్రహ్మ ధర్మ సంబంధాలే వివరించారు.
భావం:- జీవుడికి ముఖ్య ప్రాణధర్మలు ఉండటం వలన ప్రాణ శబ్దం బ్రహ్మవచకం కాదు అని అనడం సరియైనది కాదు. జీవాత్మ, ముఖ్య ప్రాణం, పరమాత్మ అనే మూడు రకాల ఉపాసనాలు ఒప్పుకోవలసి వస్తుంది. ప్రాణ శబ్దం బ్రహ్మనికే వర్తిస్తుంది. ఇంతేకాక శాస్త్రాలలో బ్రహ్మ ధర్మ సంబంధాలు వివరించారు.
వివరణ:- ప్రాణం అంటే జీవాత్మ, ముఖ్యప్రాణం అని అర్ధాలు ఉన్నాయి. మరి ముఖ్యప్రాణం బ్రహ్మం అని ఎలా చెబుతున్నారు? అనే ప్రశ్నకు ఈ సూత్రం సమాధానం చెబుతోంది. వ్యాస మహర్షి కూడా బ్రహ్మాన్ని దృఢ పరుస్తున్నాడు.
కౌషీతకీ బ్రాహ్మణము:- వాక్కును కాదు. వక్తను తెలుసుకో అనే వాక్యంలో జీవాత్మ అని స్పష్టంగా తెలుస్తోంది. వాక్కు ఇంద్రియ వ్యాపారం జీవాత్మకు చెందినదే. అప్పుడు ప్రాణశబ్దం జీవాత్మకు సంబంధించినది కదా! శరీరధారణ అనే ధర్మం ఉన్నప్పుడు ముఖ్య ప్రాణం జీవాత్మకు వర్తిస్తుంది అనే సందేహం సరిఅయినది కాదు.
కేనోపనిషత్తు:- జీవి యొక్క ముఖ్యప్రాణం పరబ్రహ్మమే. ఆత్మ నుండి ప్రాణం పుడుతుందని, శరీరాన్ని ఆశ్రయించి నీడ ఉన్నట్లుగా ఆత్మపైన ప్రాణం వ్యాపించి ఉన్నది. నీడకు స్వతంత్రమైన అస్తిత్వం లేనట్లే ప్రాణానికి కూడా స్వతంత్రమైన అస్తిత్వం లేదు. మనస్సులో పుట్టిన సంకల్ప వికల్పాల వల్లనే ఇది శరీరంలోకి వస్తుంది. కాబట్టి ప్రాణం పరబ్రహ్మ నుండి పుడుతుంది. ఆ పరబ్రహ్మను ఆశ్రయించి ఉన్న ప్రాణం కూడా పరబ్రహ్మ స్వరూపమే. ఈ ప్రాణమే ప్రజ్ఞాత్మ, ఆనందం, అమృతమయం. ప్రాణం ,జీవాత్మ, ముఖ్యప్రాణం ఉంటే 3 ఉపాసనలు చెయ్యాలి. కానీ చెయ్యవలసినది బ్రహ్మోపసన ఒక్కటే. ప్రాణికోటిలో ఏ జీవి కూడా ప్రాణంతోనే జీవించదు. ఈ రెండింటి కన్నా అతీతమైన దాని వల్ల, ఈ రెండిటి కన్నా ఆశ్రితమైన దాని వల్ల జీవిస్తున్నాము. అదే పరబ్రహ్మ. వామదేవుడు ఈ ప్రజ్ఞాతమే ఆనందం, అజరం, అమృతం అన్నారు. ముఖ్యప్రాణం జీర్ణమైపోయింది. అజరం, అమృతం రెండు బ్రహ్మనికే వర్తిస్తాయి. జీవోపాసన, ప్రాణోపాసన చెయ్యడం హితంకాదు. బ్రహ్మోపాసనే చెయ్యాలని చెప్పాడు. అందువలన ప్రాణమే పరబ్రహ్మమని మొదటి పాదం పూర్తి చేశాడు రత్నాకరుడు. మొదటి అధ్యాయంలో మొదటి పాదం సమాప్తం. 16 పాదాలలో ఒక పాదం పూర్తి అయినది.
అధ్యాయం :-1 , 2వ పాదం
మొదటి పాదంలో అనేక విషయాలు చెప్పి అవన్నీ బ్రహ్మం గురించినవని నిరూపించడం జరిగింది. కానీ ఇంకా బ్రహ్మను సూచించినట్టు వాక్యాలు ఉన్నాయి. వాటిని 2, 3 పాదాలలో వివరిస్తున్నారు. కంటికి కనిపించిన చరాచర జగత్తు అంతా పరబ్రహ్మ స్వరూపమే. జీవకోటి వస్తుసముదాయమంతా కూడా పరబ్రహ్మ నుంచి పుట్టి, మళ్ళీ అందులోనే లయమై పోతున్నది. పురుషుడు క్రతుమయుడు. అంటే నిశ్చయ జ్ఞానం కలిగినటువంటివాడు. మానవుడు ఏ విధమైన సంకల్పాలు కలిగి ఉంటాడో చనిపోయిన తరువాత కూడా ఆ ఫలితాన్ని పొందుతాడు. మరణకాలంలో ఏ భావాలతో శరీరం విడిచిపెడతాడో ఆ భావాలకు తగిన ఫలితాన్ని పొందుతాడు. దీనికి భాగవతంలో చెప్పిన జడభరతుడు కధ ఉదాహరణగా చెప్పవచ్చును. పూర్వకాలంలో అజనాభము అనే దేశాన్ని ఋషభుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతని భార్య జయంతి. వీరికి 9 మంది కుమారులు. పెద్దవాడు భరతుడు. ఇతడు వేదవేదంగాలు చదివినవాడు. పరాక్రమశాలి. ధర్మపరుడు. తండ్రి తరువాత భరతుడే రాజయ్యాడు. ఇతని భార్య పంచజనని. చాలా సం.లు ప్రజారంజకంగా పరిపాలించి రాజ్యాన్ని కుమారులను వదలి వానప్రస్థానికివెళ్లాడు. నదీతీరంలో కుటీరం నిర్మించుకొని నివసిస్తున్నాడు.అతనికి తల అంతా జడలు కట్టిపోయింది. అందుకే అతనిని జడభరతుడు అనేవారు. ఒకరోజు జడభరతుడు నదిలో స్నానం చేస్తుండగా గర్భిణీ అయిన లేడి ఆనదీతీరానికి వచ్చింది. ఆసమయంలో ఆకాశం మేఘావృతమైనది. ఉన్నట్టుండి పెద్ద ఉరుము ఉరిమైంది. దానికి ఆ లేడి భయపడి బిడ్డను ప్రసవించి మరణించింది. తల్లిలేని లేడిపిల్లను పెంచసాగాడు జడభరతుడు. దానిమీద అపారమైన ప్రేమను పెంచుకొని దైనందిన కార్యక్రమాలు కూడా వదలి, దాని గురించే ఆలోచిస్తూ ఉండేవాడు. చివరకు మరణకాలంలో ఆ లేడి పిల్లను గురించి ఆలోచిస్తూ ప్రాణం వదిలాడు. ఆ ఫలితంగా అతను మరుజన్మలో లేడిగా పుట్టాడు. కాబట్టి మానవుడు ఏ విషయం స్మరిస్తూ ప్రాణాలు వదులుతారో ఆవిషయం పొందుతాడు. అందుకే నేను బ్రహ్మాన్ని పొందుతాను అని నిశ్చయించుకొని బ్రహ్మం గురించి ఆలోచించాలి అన్నాడు రత్నాకరుడు. ఆమాటలు విన్న నారాయణ భట్టు స్వామి! శరీరానికి, ఇంద్రియాలకు అధిపతి అయిన జీవాత్మకు మనస్సు, ఇంద్రియాలు మొదలైన వాటితో సంబంధం ఉంది. పరమాత్మ ప్రాణరహితుడు. శరీరం లేనివాడు. ఇటువంటప్పుడు మనోమయుడు,ప్రాణము, శరీరము గలవాడు అని చెప్పబడ్డ జీవాత్మ ఉపాస్యుడు ఏ విధంగా అవుతాడు అని అడిగాడు. ఆ మాటలు విన్న రత్నాకరుడు ఛాందోగ్యంలో సర్వం ఖల్విధం బ్రహ్మ తజ్జలానితి శాంత ఉపాసీత అనే వాక్యం బ్రహ్మోపాసనావిధిని గురించి చెప్పడం లేదు. శమాన్ని గురించిచెబుతోంది. అంటే శాంతుడవై పైన చెప్పిన గుణాలు గల బ్రహ్మాన్ని ఉపాసించు. శాంతం అంటే రాగద్వేషాలు లేకుండా అని ఈ వాక్యంలో బ్రహ్మోపాసన ప్రధానం కాదు. ఇక్కడ ఉపాసించవలసినది జీవాత్మనే. ఈ విషయానికి సమాధానంగానే తరువాత సూత్రంలో తెలియజేస్తున్నారు.
"'సర్వత్ర ప్రసిద్ధ్యధికరణం' ( 1. 2 .1 )
సూత్రం :- 32
'సర్వత్ర ప్రసిద్ధోపదేశాత్'
సర్వత్ర :- ఉపాసనా ప్రకరణంలో అంతా ప్రసిద్ధ ఉపదేశాత్ :-ప్రషిద్ధమైన బ్రహ్మాన్ని ఉపాస్య దైవంగా ఉపదేశించినందువల్ల
భావం:- ఛాందోగ్యంలో శాండిల్యవిద్యలో వర్ణించిన బ్రహ్మమే పరబ్రహ్మము అనీ పరమేశ్వరుడని గ్రహించాలి.
వివరణ:- ఛాందోగ్యోపనిషత్తు:- సర్వం ఖాల్విధం బ్రహ్మ ,తజ్జలానితి శాంత ఉపాసీతా' ఇదంతా బ్రహ్మమయం. వేదాంత వాక్యాలలో ఈజగత్తు అంతా బ్రహ్మమయమేనని శృతులు చెబుతున్నాయి. అంతా బ్రహ్మ మనోమాయాది ధర్మాలు కలవాడుగా చెప్పడం వలన మూలవస్తువును విడిచిపెట్టడం ఉండదు. ఇతర వస్తువులను గురించి చెప్పడం ఉండదు. అలా చేస్తే అది దోషమే అవుతుంది. కానీ ఇక్కడలా జరగలేదు. ఇక్కడ ఉపాసించేవాడు, ఉపాసించబడేవాడు కూడా బ్రహ్మమే. కేవలం ఉపాసించడం కోసమే అతనికి మనోమాయాది ధర్మాలు చెప్పబడ్డాయి. ఇదంతా బ్రహ్మమయం, శాంతుడైన వాడు ఇదంతా బ్రహ్మవల్ల జనించినదని, బ్రహ్మాలయమని, బ్రహ్మస్థితమని ఉపాసించాలి. ఆపురుషుడు క్రతుమయుడు. ఈ లోకంలో క్రతువైన పురుషుడు గతించిన తరువాత క్రతువే అవుతాడు. క్రతువును ఉపాదించాలి. ఇక్కడ బ్రహ్మశబ్దం పరబ్రహ్మ బోధకమా? జీవాత్మ సూచకమా? అంటే బ్రహ్మశబ్ద ప్రయోగం రెండు అర్ధాలలోను ఉంది.
బృహదారణ్యకోపనిషత్తు:- స వా అయమాత్మా బ్రహ్మ విజ్ఞానమయం:- ఈవాక్యంలోని బ్రహ్మ అనే పదం జీవాత్మ పదం. కనుక శాండిల్య విద్యలో బ్రహ్మపదం మనోమయం, ప్రాణమయం అనే విశేషణాలు జీవాత్మకే వర్తిస్తాయి కదా! శరీరంలో ఉన్నవాడు జీవాత్మకదా! అంటే ఉపాసనా విధానాలలో ప్రషిద్ధమైన బ్రహ్మాన్ని ఉపదేశించారు. శాండిల్యవిద్య ఉపాసనా ప్రకరణమే. ఇందులో బ్రహ్మ అంటే పరబ్రహ్మమే. జీవాత్మ కాదు. వేదవాజ్ఞ్మయంలో కనిపించే అగ్ని, ఇంద్రుడు, వరుణుడు, సుపర్ణుడు, బృహస్పతి, ప్రజాపతి, వాయువు, సవిత్రుడు, చంద్రుడు, ప్రాణం లాంటి శబ్దాలు బ్రహ్మాన్ని బోధిస్తాయి. ఉదాహరణకు అన్ని పదార్ధాలలో అగ్రణి కనుక బ్రహ్మాన్ని అగ్ని అంటారు. అగ్ని భౌతిక పదార్ధాలన్నింటిలో అగ్రణి. ఆధి దైవిక తత్త్వాలలో సూర్యుడు అగ్రణి. ఆధ్యాత్మిక పదార్ధాలలో బ్రహ్మమే అన్నింటికన్నా అగ్రణి. అగ్రణి అంటే ప్రధానం. అలాగే నిరతిశయమైన ఐశ్వర్యం ఉన్నవాడు ఇంద్రుడు. వేదశాస్త్రాలలో అనేక పదాలతో బ్రహ్మం గుణగణాలు తెలుపుతాయి. అందువల్ల అగ్ని మొదలైన పదాలు తటస్తించినప్పుడు నానార్ధాలను గ్రహించక, స్తుతి ఉపాసన ప్రకరణాలలో బ్రహ్మాన్ని గ్రహించాలి.
ఋగ్వేదం:- సత్ రూపమైన ఒకే తత్త్వమైన పరమాత్మకు విద్వాంసులు ఎన్నో రకాలుగా ఇంద్రుడు, మిత్రుడు, వరుణుడు, అగ్ని దివ్యుడు సుపర్ణుడు గరుత్మంతుడు యముడు అని వ్యవహరిస్తారు. అదే అగ్ని, ఆదిత్యుడు వాయువు, చంద్రుడు, శుక్రుడు, జలం, ప్రజాపతి అని యజుర్వేదం బ్రహ్మమని వ్యవహరిస్తున్నారు. ఆయనే దాత, విధాత, వాయువు, ఆకాశం, ఆర్యముడు, వరుణుడు, రుద్రుడు, మహాదేవుడు, అగ్ని, సూర్యుడు మహాయముడు. కాబట్టి ఉపాసనా ప్రకరణములలో వాడే పైశబ్దాలు ఉపాస్యుడైన పరబ్రహ్మాన్ని సూచిస్తాయి. మనోమయం అంటే బ్రహ్మను మనస్సుతో ఉపాసించతగ్గది అని భావం. ప్రాణమయం అంటే ప్రాణమే శరీరంగా ఉండే బ్రహ్మం. ఋషులు బ్రహ్మాన్ని మనోమయం అని వ్యవహరిస్తారు. ఈ శబ్దాలను బట్టి జీవాత్మ అని భావించరాదు. ఆ బ్రహ్మం ప్రాణానికి ప్రాణం. ఇక్కడ బ్రహ్మానికి ప్రాణాన్ని శరీరంగా వర్ణించారు. సర్వాంతర్యామి అయిన బ్రహ్మం ప్రాణాంతర్గతుడని భావం. అందువలన శాండిల్య విద్యలో వర్ణించిన బ్రహ్మం పరబ్రహ్మమే కానీ జీవాత్మ కాదు. సర్వం ఖల్విధం బ్రహ్మ, ఈ వికారములన్ని బ్రహ్మం నుండి పుడుతున్నవి. దాని లోనే లీనమౌతున్నవి. దాని నుండి మెదులుతున్నవి. కనుక సర్వం బ్రహ్మమయం. అంతా ఒకే ఆత్మ అయినప్పుడు రాగాదులకు అవకాశం లేదు. అందువలన శాంతుడై ఉపాసన చెయ్యాలి.
సూత్రం :- 47
' శ్రుతోపనిషత్కగత్యభిధానాచ్చ '
శ్రుతూపనిషత్ కః:- బ్రహ్మవిద్యను అనుష్టానం చేసినవాడికి గతి అభిధానాథ్ చ :- ఏ గతి లభిస్తుందో, అక్ష్యంతర పురుషుడిని ఉపాసించిన వాడికి కూడా అదే కలుగుతుంది.
భావం :- బ్రహ్మ విద్యను అనుష్ఠానం చేసిన వాడికి ఏ గతి పడుతుందో అక్ష్యంతర పురుషుణ్ణి ఉపాసించిన వాడికి కూడా అదే కలుగుతుంది. బ్రహ్మ విద్యానుష్ఠానపరుడికి దేవయాని గతి లభిస్తుంది. నేత్రాంతర పురుషుడే బ్రహ్మ.
వివరణ:- శృతులు, స్మృతులు ఉపనిషత్ రహస్యాలు విన్న వారికి దేవయానమార్గం చెప్పటం వలన ఇతను పరమాత్మ స్వరూపుడే అని తెలుస్తుంది. ఉపాసకుడు బ్రహ్మచర్యము, తపస్సు మొదలైనవి ఆచరిస్తూ నియమ నిష్ఠలతో సాధన చేసినట్లయితే అతను ఆత్మ సాక్షాత్కారం పొందుతాడు. అటువంటివాడు ఉత్తరాయణ మార్గం ద్వారా ఆదిత్యలోకం చేరతాడు. అతనికి జన్మ ఉండదు. ఇదే విధంగా అర్చిరాది మార్గం గురించి భగవద్గీతలో చెప్పబడింది. కాబట్టి అక్షి పురుషుడు పరబ్రహ్మమే. తపస్సు చేత, బ్రహ్మచర్యం చేత, శ్రద్ధతో విద్య చేత ,ఆత్మను అన్వేషించి శరీరపాతానంతరం ఆదిత్యుని ద్వారా సగుణబ్రహ్మస్థానానికి వెడతారు. ఈబ్రహ్మ వ్యష్టి, సమిష్టిరూపాలైన ప్రాణులకు స్థానం. వాస్తవంలో ఇది నిత్యం. భయ రహితమైన నిర్గుణ రూపమే. ఇది ఉత్తమమైన గమ్యస్థానం. దీని నుండి వెనుకకు రారు. ఈ ఉపాసకుడు మరణించినప్పుడు పుత్రులు సంస్కారం చేసినా, చేయకపోయినా వాళ్ళు అర్చి దేవత వైపే వెడతారు. ఇది దేవమార్గం. బ్రహ్మ మార్గం, ఈ మార్గం ద్వారా వెళ్లిన వాళ్ళు ఈ మానవలోకానికి జననమరణరూప సంసారంలోకి తిరివి రారు. అందువల్ల ఇక్కడ చెప్పిన బ్రహ్మవేత్తకు సంబంధించిన ప్రసిద్ధమైన గతి చేత అక్షి స్తానంలో ఉన్న పురుషుడు బ్రహ్మమేనని నిశ్చయింపబడింది. అర్చిరాది మార్గం:- 1వ భాగం: కౌషీతకీ బ్రహ్మణంలో అర్చిరాది మార్గం అంటే ఏమిటో చెప్పబడింది. మానవుడు మరణించిన తరువాత అతని ఆత్మ అర్చిరాది మార్గం ద్వారా పరమపదాన్ని చేరుకుంటుంది. ముందుగా మానవుడు మరణించే సమయంలో వివేకాన్ని కోల్పోతాడు. అంటే సృహ తప్పడం అంటారు. ఆ సమయంలో వాక్కు మొదలైన ప్రాణాలన్ని ఆత్మ ఎదురుగా నిలబడతాయి. ఇంద్రియాలన్ని తమ యొక్క తేజస్సును ఉపసంహరించుకుని పని చేయడం మనేస్తాయి. తేజస్సుపోతే ఇంద్రియాలు పనిచేయవు. ఉదాహరణకు కన్నుకి ఆదిత్యుడు అధిష్టానదేవత. అతను కళ్ళను అనుగ్రహించడం మానేసి ఆదిత్యరూపం పొందుతాడు. కళ్ళు కనబడవు. చెవి అధిదేవత చెవిని వదలిపోగానే చెవులు వినబడవు. రసాధిదేవత శరీరం నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. అప్పుడు రుచి తెలియదు. క్రమేణా స్పర్శ తగ్గుతుంది. అంటే జ్ఞానేంద్రియాలు వాటి పనులు అవి మానేస్తాయి. అతనికి మనస్సు ఆత్మతో ఏకమైనప్పుడు ఆలోచనా శక్తి ఉంటుంది. ఆత్మ వేరవగానే ఆ శక్తి నశిస్తుంది. ముందుగా కర్మేంద్రియాలు కాళ్ళు, చేతులు పనిచేయవు. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలలో లీనమైపోతాయి. జ్ఞానేంద్రియాలు మనస్సులో, మనస్సు ప్రాణంలో లీనమౌతుంది. అదే ముఖ్య ప్రాణం జీవాత్మ. జీవాత్మ ప్రాణం శరీరం నుండి బయలుదేరడానికి సిద్ధంగా ఉంటుంది. ప్రాణం హృదయగ్రంధి దగ్గరకు వస్తుంది. అంటే శరీరంలోని శక్తి అంతా ప్రాణంతో కలసి ఆ ప్రాణం హృదయ గ్రంధిని చేరుతుంది. అక్కడనుంచి బయటకు రావడానికి రెండు మార్గాలు ఉన్నాయి. 1.మొదట వచ్చిన మార్గం, బ్రహ్మ రంద్రం గుండా లోపలికి వస్తాడు. అదే మార్గం గుండా ప్రాణం బయటకు పోతుంది. 2.శరీరానికి ఉన్న నవరంధ్రాలు. నవరంధ్రాలలో ఏదో ఒక రంధ్రం గుండా ప్రాణం బయటకు పోతుంది. కొంత వరకు పుణ్యం చేసిన వారికి పై భాగంలో ఉన్న కన్ను, ముక్కు, చెవి ద్వారా ప్రాణం బయటకు పోతుంది. దుర్మార్గాలు చేసిన వారికి అదోముఖంలో ఉన్న రంధ్రాల ద్వారా ప్రాణాలు బయటకు పోతాయి.
సూత్రం :- 48
'అనవస్థితే రసంభవాచ్చ నేతరః"
అనవస్థతే :- స్థిరంగా ఉండకపోవడం వలన, చ:- ఇంకా, అసంభవాత్:- అమృతత్త్వాది గుణాలు లేకపోవడం వలన, ఇతరః:-జీవాత్మ న:-అక్షిపురుషుడు కాదు.
భావం:- అక్షిలో ఉండకపోవడం వలన అమృతత్త్వాది గుణాలు లేకపోవడం వలన జీవాత్మ నేత్రపురుషుడు కాదు. అమృతతత్వం, గుణసంపన్నుడు అయిన పరమాత్మే కంటిలో ఉన్న పురుషుడు.
వివరణ:- నిలకడలేకపోవడం వలన అమృతత్త్వం అభయత్వం మొదలైన గుణాలు అసంభవమైనందున అక్షయ పురుషుడు జీవాత్మ, ఛాయాత్మ కాదు. అతడు పరమాత్మ. ఛాయాత్మ అంటే ప్రతిబింబం కలవాడు. మన ఎదురుగా నిలుచుని ఉన్నవాడి ప్రతిబింబం మన కంట్లో పడుతుంది. అతడు ఛాయాత్మ. ఇది ఎప్పుడు నిలకడగా ఉండదు. ఎందుకంటే ఉపాసన చేసే టప్పుడు ఎదురుగా ఏ ఆకారాన్ని ఉంచుకోము. పోనీ జీవాత్మ అందామా అంటే అది ఒక్క కాంతిలోనే ఉండదు. శరీరమంతా వ్యాపించి ఉంటుంది. ఉపాసన కోసం పరమాత్మకు కన్ను స్థానంగా చెప్పారు. అంతే కాని జీవాత్మకు కాదు. అమృతత్త్వం అభయత్వం ఇత్యాది గుణాలు జీవాత్మకు, ఛాయాత్మకు లేవు. ఒక్క పరమాత్మకు ఉన్నాయి. ఉపాసన చేసేటప్పుడు ఉపాసకుడు తనకు దగ్గరగా నేత్రమునందు చూడబడుతున్న పురుషుణ్ణి ఉపాసించాలి. తన కంటిలో ఛాయపురుషుడు కనబడదు కదా! ఉపాసనాకాలంలో తన కంటిలో ప్రతిబింబం కలిగించే పురుషుణ్ణి ఒకనిని ఎదురుగా ఉంచుకొని ఉపాసన చెయ్యాలి అనుకోవడం సరి అయినది కాదు. ఈ శరీరం తొలగిపోగానే ఛాయాత్మ కూడా తొలగిపోతుంది. దీనికి అమృతత్త్వాది గుణాలు ఉండవు. విజ్ఞానాత్మ సమస్త శరీరేంద్రియాలలోను సమంగానే సంబంధించి ఉన్నప్పుడు నేత్రంలోనే ఉన్నాడు అని చెప్పడం శక్యం కాదు. విజ్ఞానాత్మ పరమాత్మ కంటే అభిన్నుడే అయిన కూడా అవిద్య, కామం, కర్మ వీటిచేత ఏర్పడిన మరణత్వం భయము కూడా ఆరోపించబడ్డాయి. విజ్ఞానాత్మ ఐశ్వర్యవంతుడు గాన వానిలో ఉపపన్నములు కుదరవు. దేవతాత్మ నేత్రాధిష్టాన దేవత ఆదిత్యుడు సూర్యరశ్ముముల వలన ఉన్నాడని చెప్పుకొనుట వలన అతను బయట నున్నవాడు, కనుక ఆత్మ అని చెప్పలేము. ఆ దేవాత్మకు కూడా ఉత్పత్తి, నాశనము ఉన్నట్లు శృతిలో చెప్పబడింది. దేవతలకు అమృతత్వం చిరకాలం ఉంది అని చెప్పబడినది, కానీ ఏ నాటికి నాశనం లేదు అని చెప్పలేదు. తైత్థరీయోపనిషత్తు:- పరబ్రహ్మను గురించిన భయంతోనే గాలి వీస్తుంది. సూర్యుడు ఉదయిస్తాడు. అగ్ని, చంద్రుడు తమతమ విధులను నిర్వహిస్తారు. ఐదవాడైన యముడు చంపదగిన వాళ్లదగ్గరకు పరుగెత్తి వెడుతున్నారు. పరమాత్మ ఒక్కడే అమరుడు. అతడే అక్షిలో పురుషుడు అని గ్రహించాలి. కంటిలో పురుషుడు ప్రత్యక్షంగా కనబడుతున్నట్లు సర్వవిదితం అన్నట్లు కనబడుతోంది. పరమేశ్వరుడు ఆ విధంగా కనబడటం లేదు కదా! అలాంటప్పుడు దృశ్యతే అని ఎలా చెప్పబడింది? అనే సంశయం. శాస్త్రంలో ఉండే ప్రసిద్ధిని బట్టి పండితులలో ఉండే ప్రసిద్ధిని బట్టి పరమేశ్వరుడు కంటిలో కనబడుతున్నాడని భావించి ఉపాసకులకు అభిరుచి కలిగించడం కోసం దృశ్యతే అని చెప్పబడినది. అర్చిరాది మార్గం ( 2 వ భాగం ) చివరి క్షణాల్లో ప్రాణాలు ఎలా పోతాయో జాగ్రత్తగా చూడాలి. ఒకసారి అడవిలో 4 సింహాలు ఒక గొర్రె మీద పడ్డాయి. అది తప్పించుకొని పారిపోతు నీళ్ల మడుగులో దూకింది. సింహాలు నీళ్ళల్లోకి దిగవు కనుక ఒడ్డునే కొంత సేపు వేచి చూసి వెళ్లిపోయాయి. జింక దురదృష్టం, ఆ నీళ్ళమడుగులో ఊబి ఉంది. దానిలో కూరుకుపోతుంటే బయటకు రాలేక దిక్కులు చూస్తోంది. కొంతసేపటికి హైనాల గుంపు వచ్చి గొర్రె మీదపడి చంపి చీల్చుకొని తినేసాయి. మరణ సమయంలో ఏ రకమైన గతి పడుతుందో ఆలోచించాలి. పాపం చేసిన వాళ్ళు ఎటువంటి జన్మ ఎత్తుతారు?ఎటువంటి మరణం సంభవిస్తుందో తెలుస్తుంది. ఉదయం పూట మేకలను గొర్రెలను కబేళాలకు తీసుకువెళ్లి వాటిని చంపుతుంటే మిగతా జంతువులు చూస్తూనే ఉంటాయి. కానీ అవి ఏమి చెయ్యలేని స్థితిలో ఉంటాయి. చాలా పాపకార్యలు చేసిన వాళ్ళు పశుపక్ష్యాదులుగా జన్మిస్తుంటారు. వాళ్ళు చూస్తూచూస్తూ, ఏడుస్తూ, కర్మ ఫలితాన్ని అనుభవిస్తారు. ఒక్కొక్కసారి భగవంతుడు ఒక అవకాశం ఇస్తూ ఉంటాడు. ఒక పెద్దాయన విమానంలో ప్రయాణం చేస్తుంటే అత్యవసరంగా విమానం ల్యాండ్ అవుతోంది. పరిస్థితి చెయ్యి దాటిపోయింది. ఒకోసారి పేలిపోవచ్చును అని ప్రకటన చేశారు. అందరూ అరుపులు, కేకలు, భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నారు. ఆ పెద్దాయనకు కొన్ని వందల కోట్ల ఆస్తి ఉంది. ఆ క్షణంలో అతనికి తను చేసిన దుర్మార్గాలు, పాపాలు కనబడ్డాయి. భగవంతుడా! నాకు ఒక్క అవకాశం ఇవ్వు. మంచి పని చేస్తాను అని కోరుకున్నాడు. అదృష్టం కొద్దీ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఆ సమయంలో చావుకు బ్రతుక్కి మధ్య తేడా తెలిసింది. వెంటనే ట్రస్ట్ ఏర్పాటుచేసి చిన్న పిల్లలకు, అనాధలకు ఉచితంగా వైద్యసేవలు చెయ్యడం మొదలు పెట్టాడు. ఇప్పుడు అతను హాయిగా ఉంది వైద్యం చేయిస్తున్నాను అన్నాడట. భగవంతుడు అవకాశం ఇవ్వడం ఒక ఎత్తు. దానిని సద్వినియోగం చేసుకోవడం ఒక ఎత్తు. అలా చెయ్యకపోతే చాలా నీచమైన జన్మలు వస్తాయి. అవసాన సమయం అతను చేసిన కర్మల మీద ఆధారపడి ఉంటుంది. సూక్ష్మశరీరం బయటకు వెళ్లిన తరువాత ఉష్ణోగ్రత తగ్గి శరీరం చల్లబడిపోతుంది. అప్పుడే మరణించినట్లు చెబుతారు. మరణించిన తరువాత జీవుడితోబాటు అతను చేసిన కర్మేంద్రియాలు పంచభూతాలు మనస్సు అతనితోబాటే వెళ్లిపోతాయి. ఇంకొక దేహం పొంది, కర్మ ఫలం అనుభవించడానికి వెడతాయి. మానవుడికి శరీరాన్ని ఇచ్చేవి పంచభూతాలు ఇంద్రియాలే. జ్ఞానులకు పునర్జన్మ ఉండదు. వారి ప్రాణం బ్రహ్మరంద్రం గుండా బయటకు వెడుతుంది. వారి కర్మలు క్షయమై పరబ్రహ్మలో కలసిపోతారు.
సూత్రం 49:
''అంతర్యా మ్యధి దైవాదిషు తద్ధర్మ వ్యపదేశాత్'"
తత్ ధర్మ వ్యపదేశాత్:- బ్రహ్మ ధర్మాలు చెప్పడం వలన అధి దైవాదిషు:- పృథివ్యాదుల్లో, అంతర్యామి :-బ్రహ్మాన్ని అంతర్యామిగా వర్ణించారు.
భావం :- అధి దైవికాది సమస్త పదార్ధాలలో అంతర్యామిగా ఉన్నవాడు బ్రహ్మమే అని ఆయన ధర్మాలు వెల్లడిస్తున్నాయి.
వివరణ:- పరమేశ్వరుడు సర్వ వ్యాపి. అన్ని భూతముల యందు అంతర్యామిగా ఉన్నవాడే అంతర్యామి అంటున్నారు కదా! ఇక్కడ అంతర్యామిగా చెప్పబడినవాడు పంచభూతాల యొక్క అధిదేవతా? లేక పరమేశ్వరుడా? కాస్త వివరించండి? అన్నాడు నారాయణ భట్టు. రత్నాకరుడు చెబుతున్నాడు. అధిదైవములైన పంచభూతాలు సూర్యుడు, చంద్రుడు, అధి యజ్ఞము మొదలైన వాటి యందు అంతర్యామిగా చెప్పబడినవాడు, అమృతత్త్వం మొదలైన ధర్మాలు కలవాడు పరమాత్మ యే. పరమేశ్వరుడు అంతర్యామిగా ఉంటూ వాటిని నియంత్రిస్తున్నాడు. అందుకనే పరమేశ్వరుని యందు భయంతోనే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. చంద్రుడు చల్లదనాన్ని ఇస్తున్నాడు. ఆపరమాత్మే అన్నింటికన్నా, అందరికన్నా శక్తిమంతుడు. బృహదారణ్యకోపనిషత్తు:- పరమేశ్వరుడు అన్ని భూతములయందు ఉన్నాడు. ఆభూతాలు ఆయన్ని ఎరుగవు. ఆభూతాలే అతని శరీరం. సర్వభూతాల్లో ఉంటూ వాటిని నియంత్రిస్తున్నాడు. అతడే అంతర్యామి అయిన నీఆత్మ అని చెప్పబడినది. అయితే పరమాత్మ నామరూపాలు లేనివాడు అశరీరి. మరి శరీరం లేనివాడు ఇతరులను ఎలా నియంత్రిస్తున్నాడు? అనే సందేహం రావచ్చును. అతడు ఎవరిని, దేనిని, నియమిస్తాడో వారి వారి శరీరాలతో ఇంద్రియాలతో వారిని నియమిస్తున్నాడు. వారి శరీరం ఇంద్రియాలతోనే తను శరీరం ఇంద్రియాలు కలవాడు అవుతున్నాడు. అందుకనే అంతర్యామి అయిన వాడు ఆత్మ. విజ్ఞానం ఉన్నా విజ్ఞానం కన్నా భిన్నం. విజ్ఞానం పరమాత్మను ఎరుగదు. విజ్ఞానం ఆయన శరీరం. బ్రహ్మం విజ్ఞానాత్మ అయిన జీవాత్మను కూడా నియంత్రిస్తుంది. ఈధర్మం ప్రకృతిలో లేదు. జీవాత్మది అణుస్వరూపం. అన్నిటా ఒకే క్షణంలో ఉండలేదు. జీవాత్మ యోగాభ్యాసాల వలన ఐశ్వర్యాన్ని సంపాదించినా, జగత్తుని నియంత్రిచలేదు. యోగశక్తులు జగద్వ్యాపారాన్ని నిర్వహించలేవు. అలాంటి ఐశ్వర్యం పరమాత్మకు ఉంది. ఆయనే సర్వభూతాంతరాత్మ. కాబట్టి పరమాత్మని అంతర్యామి శబ్దంతో గ్రహించాలి.
అర్చిరాది మార్గం ( 3 వ భాగం ): సగుణ బ్రహ్మను ఆరాధించినవాడు మరణించిన తరువాత అతని ప్రాణం సుషమ్ననాడి ద్వారా బ్రహ్మరంద్రం నుండి బయటకు పోతుంది. సుషమ్ననాడి బ్రహ్మరంద్రానికి కలపబడి ఉంటుంది. ఉత్తరాయణ మార్గం ద్వారా అర్చిరాది మార్గం నుండి సూర్యలోకానికి వెడతాడు. శరీరం నుండి బయటకు రాగానే కళ్ళు కనిపించవు. విపరీతమైన కాంతితో సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు. అతడికి ద్వారం ఎక్కడుందో తెలియదు. అందుకే నీకాంతిని కొంచెం ఉపసంహరించు కోవయ్య అని సూర్యుణ్ణి ప్రార్ధిస్తాడు. సూర్యుడు తన కాంతిని ఉపసంహరించుకోగానే ఆజీవుడు సూర్యమండలంలోకి అడుగుపెట్టి అర్చిరాదిమార్గం గుండా అనేక లోకాలగుండా ప్రయాణం చేస్తున్నప్పుడు దేవతలు, దేవదూతలు, అప్సరాంగనలు, సాయం చేయగా బ్రహ్మలోకం చేరతాడు. సగుణారాధకుడు ఉత్క్రమించిన తరువాత సూర్య రశ్మిని అనుసరిస్తాడు అంటారు. మరి రాత్రిపూట చనిపోతే సూర్య రస్మి ఉండదు కదా ! అప్పుడు సూర్యరశ్మి ఎలా ఉంటుంది అని సందేహం రావచ్చును.శరీరంలోని నాడులలో ఉన్న పిత్తరసం ఏదైతే ఉందో అదే సూర్యుడి తేజస్సు. కాబట్టి ఉత్క్రమించిన జీవుడు ఎప్పుడు మరణించినా సూర్యరశ్మిని అనుసరించి వెడతాడు. ఉపాసన చేసినవాడు దక్షిణాయణంలో పోయినా బ్రహ్మలోకానికి వెడతాడు. పుణ్య కార్యాలు, యజ్ఞయాగాది క్రతువులు, దానధర్మాలు చేసినవాడు దక్షిణాయన మార్గం గుండా చంద్రలోకం వెళ్లి అక్కడ నుండి స్వర్గలోకం వెళ్ళి అక్కడ స్వర్గసుఖాలు అనుభవించి తిరిగి భూలోకంలో మిగిలిన కర్మఫలాలు అనుభవించడానికి జన్మిస్తాడు. ఉత్తరాయణంలో మరణిస్తే స్వర్గానికి, దక్షిణాయణంలో మరణిస్తే నరకానికి పోతారని అంటుంటారు. కాలమానం తెలపడానికి 2 అయనాలుగా విభజించారు కానీ ఎప్పుడు పోయినా యోగీశ్వరుడు, జ్ఞాని బ్రహ్మలోకం చేరి పరబ్రహ్మలో లీనమౌతాడు. మహాజ్ఞాని అమావాస్యనాడు మరణించిన బ్రహ్మలోకం చేరతాడు.
సూత్రం :- 50
"'న చ స్మార్త మత ద్ధర్మా భిలాపాత్ '"
అతత్ ధర్మ అభిలాపాత్:- అంతర్యామి ప్రకరణంలో ప్రకృతి ధర్మాలు చెప్పనందువలన , స్మార్తం:- స్మృతిలో వర్ణించిన జడ ప్రకృతి, చ- కూడా, నా:- అంతర్యామి కాదు.
భావం:- అంతర్యామి ప్రకరణంలో ప్రకృతి ధర్మాల ప్రసక్తి లేదు. దీనిలో బ్రహ్మధర్మాల వర్ణన ఉండటం వలన అంతర్యామి శబ్దం ప్రకృతి బోధకం కాదు. ప్రకృతి అంతర్యామి కాదు.ఇది బ్రహ్మ బోధకమే.
వివరణ:- అంతర్యామి పరబ్రహ్మ. అంతేకాని సాంఖ్యులు చెప్పే ప్రకృతి కాదు. అంతర్యామికి ఉన్న ధర్మాలు ప్రకృతికి వర్తించవు అన్నాడు రత్నాకరుడు. అంతర్యామిగా ప్రకృతిని అంగీకరించకపోతే జీవిని అంగీకరించవచ్చు కదా!అన్నాడు కృష్ణ శర్మ. సాంఖ్య స్మృతి:- సాంఖ్య స్మృతి ప్రతిపాదించిన ప్రధానం అంటే ప్రకృతి కూడా అంతర్యామి శబ్దవాచ్యం కాదు. సృష్టికి కారణం అయిన శాశ్వతమైన అంశం సాత్విక, తామస, రజోగుణాలకు మూలం. మనం కళ్ళతో చూడగలిగే మనస్సుతో భావించే, శరీరంతో స్పర్శించే వాస్తవప్రపంచం. సాంఖ్య దర్శనం ప్రకారం పురుషుడు అనగా జ్ఞానం ఆధిభౌతిక సృహ. హిందు ధర్మ శాస్త్రాలలో జీవుడు ప్రకృతి, తత్త్వం, మోక్షము, వంటి విషయాలను విశ్లేషించే తత్వశోధనా రచనలను దర్శనాలు అంటారు. సాంఖ్యము, యోగం, వైశేషికము, న్యాయము, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస అనే 6 ఆస్తికదర్శనాలలో అత్యధిక ప్రాధాన్యత కలిగినది సాంఖ్యదర్శనం. దీనిలో ప్రకృతి పురుషుడు రెండు విభిన్న అంశాలు. పురుషుడు:- అంతటా వ్యాపించి ఉన్న నిరాకారం, ఆత్మతత్త్వం. ఇంద్రియములకు తెలియరానిది. మాటలతో చెప్పజాలనిది. ఏమాలిన్యములు అంటవు. అతడు శాశ్వతము. ఎవరూ సృజించ లేరు. పురుషుడు దేనిని సృజించడు. ప్రకృతి:- ప్రకృతిని ఎవరు సృజించలేరు. కానీ ప్రకృతికి సృజించే లక్షణం ఉంది. అన్ని జీవులు పురుషుని యదార్ధ బాహ్యస్వరూపములు. ప్రకృతి వలన ఉద్భవించిన భౌతికదేహాలు పురుషుని బాధిస్తాయి. జీవుడు తన గురించి సరి అయిన జ్ఞానం లేనందున తాను శరీరం మాత్రమేనని భ్రమించడం వలన సంసారదుఃఖం ఏర్పడుతుంది. ఆత్మజ్ఞానం కలిగినప్పుడు ఆబంధం నుంచి విముక్తి కలువుతుంది. ప్రకృతి ఊహింప శక్యం కానిది. తెలియ శక్యం కానిది. అంతటా నిద్ర పోతున్నట్లుగా ఉంటుంది. సమస్త వికారాలు కారణం అవడం చేత అదికూడా అంతర్యామి అనడం కుదరదు. దానివి కాని ధర్మాలు చెప్పడం వలన అదృష్టత్వం మొదలైన నిర్దేశం దాని విషయంలో కుదరదు. ప్రకృతి అచేతనమని వాళ్ళు అంగీకరించారు. చూడబడనిది చూస్తుంది. ఉహించబడనిది, ఊహిస్తుంది. తెలియబడనిది తెలుసుకుంటుంది అని చెప్పబడినది. ప్రకృతికి కూడా ఆత్మతత్వం కుదరకపోవడం వలన అంతర్యామి కాదని గ్రహించాలి.
సూత్రం :- 51
"'శారీరశ్చో భయే పి హి భేదేనైన మదీయతే"
శారీరః చ :-శరీరంలో ఉండే భోక్త అయిన జీవాత్మ కూడా, న:- అధిదైవతంగా చెప్పే పరమాత్మ కాదు. హి:- ఎందుకంటే, ఉభయ్ అపి :- కాణ్వం, మాద్యందినం అనే రెండు శాఖలోను, భేదేన:- జీవాత్మ కంటే వేరే అని, ఏనం :- అంతర్యామిని, అధీయతే:- పఠిస్తున్నారు, భావిస్తున్నారు. జీవాత్మ శరీర ధారి కదా !
భావం:- శరీరంలో ఉండి భోగాలు అనుభవించే జీవాత్మ అధిదైవతంగా చెప్పే పరమాత్మ కాదు. ఎందుకంటే కాణ్వం, మాద్యందినం అనే రెండు శాఖల్లోనూ జీవాత్మ కంటే పరమాత్మ వేరే అని భావిస్తున్నారు. జీవాత్మ శరీరం లోని దేహేంద్రియ మనోబుద్ధులతో కూడి ఉన్నాడు కదా!
వివరణ:- బృహదారణ్యకోపనిషత్తు:- ఎవడు పృధివిలో ఉండి, పృధ్వి కన్నా భిన్నుడో అని కాణ్వులు, మాద్యందినులు భావిస్తారు. విజ్ఞానాత్మయైన జీవాత్మలో ఉండి కూడా ఎవడు జీవాత్ కన్నా భిన్నుడో అని కాణ్వులు, ఆత్మలో ఉండి కూడా ఎవడు ఆత్మకన్నా భిన్నుడో అని మాధ్యందినులు చదువుతారు. దీనివలన అంతర్యామి జీవాత్మకన్నా భిన్నుడే అని తెలుస్తోంది. ఇక్కడ విజ్ఞానపదం విజ్ఞానాత్మకమైన జీవాత్మ, కనుక ఈ ప్రకరణంలో అంతర్యామి అంటే బ్రహ్మం. జీవాత్మ, ప్రకృతి కావు.అంతర్యామి అంటే జీవి కాదు.ఈ జీవి అంతర్యామి కన్నా భిన్నమైనవాడు. శరీరం ఉన్నందుకు జీవికి కొన్ని లక్షణాలు ఉంటాయి. కంటితో చూడటం, నోటితో మాట్లాడటం, నాలుకతో రుచి చూడటం, చెవులతో వినడం, మొదలైన లక్షణాలు ఉంటాయి. కానీ పంచభూతాలను నియంత్రించే శక్తి జీవుడికి లేదు. అందుకే అంతర్యామి అంటే పరమాత్మే. అతడు అన్ని భూతాలలోను ఉంటాడు. అందరి దేవతలలో ఉంటాడు. అందరిని నియమిస్తాడు.అతని వలననే ఈ జగత్తు అంతా సవ్యంగా నడుస్తోంది. ఈరకంగా అధిదేవతలయందున్నవాడు పరమాత్మే కానీ వేరు కాదు. ఘటాకాశం వలె ఉపాధుల చేత ఉపాధి అయిన, పరిచ్చిన్నుడవడం చేత పూర్తిగా పృథివ్యాధుల లోపల ఉండటానికి, వాటిని నియమించదానికి సమర్థుడు కాదు. అంతర్యామి అయిన ఈశ్వరుడనేవాడు ఎవడున్నాడో అతను, అతని కంటే భిన్నమైన ఏశరీరుడు ఉన్నాడో అతడు, ఈ విధంగా ఒకే దేహంలో ఇద్దరు దృష్టలు ఉండటం ఎలా కుదురుతుంది. వీని కన్నా వేరుగా మరొక ద్రష్ట ఎవరు లేరు. మరొక నియంత ఎవరు ఉండే ప్రసక్తి లేదు. నియంతయా? నియంత కానీ వాడా అనే విశేషం ఏమి లేకుండా మరొక ద్రష్ట అనేవాడు ఎవడు లేడు అని చెప్పబడినది కూడా. దీనికి సమాధానం చెప్పబడుతోంది. శరీరుణ్ణి అంతర్యామిగా ఈవిధంగా వేరువేరుగా చెప్పడం అవిద్యచేత ఏర్పడిన శరీర ఇంద్రియాదిరూపమైన ఉపాధులను నిమిత్తంగా చేసుకొని ఏర్పడినదే కానీ పారమర్ధికం కాదు. ప్రత్యగాత్మలు ఉండవు కదా! ఉపాధిని బట్టి ఘటాకాశం, మహాకాశం అన్నట్లు ఒకే ఆత్మకు భేదవ్యవహారం ఉంటుంది. ఉపాధులను బట్టి ఈభేదం తెలుసుకునేవాడు, తెలియబడేవాడు ఇత్యాది భేదాలు చెప్పే శృతులు, ప్రత్యక్షాది ప్రమాణాలు, సంసారానుభవం, విధి, ఇదంతా ఉపపన్నం అవుతుంది. ఎక్కడ భేదభావం ఉన్నట్లు కనబడుతుందో అక్కడ ఒకడు మరొకణ్ణి చూడటం అనేది ఉంటుంది. అజ్ఞానం ఉన్నప్పుడే అలా చూడబడుతుచున్నది. సర్వమూ ఆత్మయే అయినప్పుడు దేనిని దేనితో చూస్తాడు. అంతా పరమాత్మ ఆత్మచైతన్యమే అయినప్పుడు రెండవది లేనప్పుడు జీవాత్మ అంతర్యామి కాదు అని గ్రహించాలి.
సూత్రం:-51
"'అదృశ్యత్వాది గుణకో ధర్మోక్తః"
అదృశ్యత్వాదిగుణనం:-అదృశ్యత్వం, సర్వజ్ఞత లాంటి గుణాలు బ్రహ్మనికే ఉన్నాయని, ధర్మోక్తః:- శాస్త్రాలలో ధర్మాలు చెప్పారు.
భావం :-అదృశ్యత్వం. సర్వజ్ఞత లాంటి గుణాలు బ్రహ్మనికే ఉన్నాయని శాస్త్రాలలో బ్రహ్మధర్మాల గురించి వివరించారు.
వివరణ :- ముండకోపనిషత్తు:- (1, 1. 5 ) దేని ద్వారా ఈ అక్షర పరబ్రహ్మము తెలుస్తుందో అదే పరావిద్య. ఆ పరబ్రహ్మము జ్ఞానేంద్రియాలకు గోచరం కాదు. కర్మేంద్రియాలకు పట్టుబడదు. కారణం లేనిది, ఏ వర్ణాలు లేనిది ,చేతులు, కాళ్ళు లేనిది, శాశ్వతం ,వ్యాపకం ,అంతటా ఉండే తత్త్వం. ఎంతో సూక్ష్మం, వృద్దిక్షయలు లేనిది,జగత్కారణం. బ్రహ్మ అంటే అక్షరం. క్షరం కానిది. నాశనం లేనిది. అన్నింటికన్నా గొప్పది అంతకంటే పెద్దది. ఈ ప్రపంచంలో అన్నింటికీ ఒక పేరు ఒక రూపం ఉంది. ఏదో రోజు అవి నశించిపోతాయి. లేక మార్పులు చెందుతాయి. నాశనం లేకుండా ఏ మార్పు లేనటువంటిది పరబ్రహ్మమే. దీనినే పరా ప్రకృతి అంటారు. అదృశ్యగుణం ప్రకృతికి ఉంది. అది కూడా అక్షర పదార్ధమే. పృథివ్యాది భూతాలకు కారణం అయిన ప్రకృతి భూతయోని కూడా. భూతయోనిలో యోని శబ్దం నిమిత్తకారణాన్ని సూచిస్తుంది. ఉపాదానకారణాన్ని కాదు. దృష్టాంతంలో సాలీడు శరీరం జడ పదార్ధం. సాలీడులోని చేతన పదార్ధానికి అధిష్టానం ఆత్మ. అది తంతువుల్ని సృష్టించి గూడు అల్లి, మళ్ళీ తనలో ఇముడ్చుకుంటుంది. స్వయంగా ఏ వికారాన్ని పొందదు. సాలీడు సృష్టించి సంహరిస్తుంది. అలాగే పరమాత్మ కూడా ప్రకృతిని అధిష్టించి జగత్తుని నిర్మించి లయం చేస్తాడు.కానీ ఆయన స్వరూపంతో ఏ వికారమూ ఉండదు. ఇక్కడ సాలీడు నిమిత్త కారణం. దాని శరీరం ఉపాదాన కారణం.ఈ విధంగానే ప్రకృతి జగత్తుకు ఉపాదాన కారణం. పరమాత్మ నిమిత్త కారణం. భూతయోని అయిన బ్రహ్మం వలన జగత్తు సృష్టించబడుతోంది. ఓషధులు మొలకెత్తదనికి పృధివి ఆధారం. పరమాత్మ ఆధారంగా ప్రకృతి నుంచి జగత్తు పుడుతుంది. విభిన్నమైన పంటలకు వాటి విత్తనాలు కారణం. అలాగే పృథివ్యాది భూతాలు వాటి ఉపాదాన కారణం అయిన ప్రకృతి నుంచి జనిస్తాయి. ఇకపోతే జీవాత్మ శరీరంలో ఉన్నంతవరకు శరీరంనుండి వెంట్రుకలు, గోళ్లు పుట్టి పెరుగుతాయి. వాటి కోసం పురుషుడు ఎలాంటి ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. అదే విధంగా పరమాత్మ ప్రకృతి నుంచి భూత సృష్టి జరుగుతుంది. తగిన సమయంలో ప్రకృతిలో లీనమౌతుంది. ఇదే సాలీడు దృష్టాంతం సారాంశం. దీని వలన అక్షర శబ్దం పరమాత్మ బోధకమే కానీ అన్యబోధకం కాదు అని తేలుతుంది. యః సర్వజ్ఞః సర్వవిత్ " (1, 1, 9 ) సర్వజ్ఞుడు, సర్వ విదుడు అనే గుణాలు ప్రకృతికి వర్తించవు అని అంటారా? జీవాత్మ కూడా అక్షరమే కదా! దానికి నాశం లేదు కదా! సర్వజ్ఞత్వం చేతన ధర్మం. జీవాత్మ చేతకుడే కదా ప్రకృతి చేతనమా కాదు. జీవాత్మ అల్పజ్ఞుడు.సర్వజ్ఞుడు కాదు. బ్రహ్మ అది దైవతము అన్ని దేహములలో ఆత్మ స్వరూపంగా నిలచి ఉంది. ఆయనే అది యజ్ఞము. అంటే సమస్త జీవరాసులలో ఆత్మ స్వరూపుడుగా వెలుగుచున్న యజ్ఞస్వరూపమును అధి యజ్ఞము అంటారు. ఒక్కొక్క శరీరంలో ప్రాణ శక్తిగా ప్రకటితమౌతున్నాడు. లేకపోతే శరీరం పడిపోతుంది. ఒక్కొక్క ప్రాణిలో పరిమితంగా ఉన్న ప్రాణశక్తి విశ్వ చైతన్యమును ఆదియజ్ఞం అంటారు. దీనినే విరాట్ స్వరూపం పురుషుడు అంటారు. పురుషుడు అంటే సమస్త జీవరాసులలో ఉండే ఆత్మచైతన్యమే.
సూత్రం :- 53
"విశేషణ భేద వ్యాపదేషాభ్యాం చ నౌతరౌ '"
విశేషణం :-పరమేశ్వర సూచకాలైన విశేషణాలని భేద:- తేడాలని, వ్యపదేశభ్యాం :- చెప్పడం వలన, చ :-కూడా , ఇతరౌ :-ప్రకృతి, జీవాత్మలు రెండింటికి న:- అదృశత్వాది గుణాలు లేవు.
భావం: పరమేశ్వరుని సూచకాలైన విశేషణాలనూ, తేడాలును చెప్పడం వలన ప్రకృతి, జీవాత్మలకు అదృశ్యత్వాధి గుణాలు లేవు.
వివరణ:-ముండకోపనిషత్తు:-(2, 1, 1) ప్రజ్వలించే అగ్నినుంచి అనేకవేల అగ్నికణాలు ఎలా ఉద్భవిస్తాయో, అలాగే అక్షరమైన ప్రకృతి నుంచి పృధివ్యాదులు, అనేక కార్య వస్తువులు పుడుతున్నాయి. ప్రకృతి నుంచే సృష్టి జరిగిందని చెప్పారు. దాని కంటే వేరైనా పరమాత్మను, సమస్త భూతాలు పరమాత్మ నుండే ఉద్భవించినందున ఇలా అక్షరంగా, భూతయోనిగా వర్ణించారు. (2, 1 ,2 ):- పరమాత్మ దివ్యుడు, రూపం లేనివాడు, సృష్టికి లోపల బయట ఉండేవాడు, జన్మరహితుడు, ప్రాణ రహితుడు, మనోరహితుడు, ఏకర్మలు అంటని వాడు, స్వచ్ఛమైన వాడు, అక్షరం కన్నా సూక్ష్ముడు. అక్షరం అంటే ఇక్కడ ప్రకృతి. దాని కన్నా సూక్ష్మం జీవాత్మ. జీవాత్మ కన్నా సూక్ష్మం పరమాత్మ. పై మంత్రంలో ఉన్న విశేషణాలు పరమాత్మవే. అంతేకాక సూక్ష్మమైన జీవాత్మకన్నా సూక్ష్మమైనదని స్పష్టంగా వర్ణించారు. అదృశ్యాది గుణాలు భూతయోనిత్వం, దివ్యత్వం, అక్షరత్వం, ఈ విశేషణాలు జీవాత్మను ఉద్దేశించి ప్రయోగించినవి కావు. అక్షరాత్ పరతః పరః అనే శబ్దజాలం సర్వాంతర్యామి సూక్ష్మతమమయిన పరమాత్మను సూచిస్తాయి. కానీ జీవుడుకి ప్రకృతికి కాదు. జీవుడు అవిద్య చేత ఏర్పడిన నామ రూపాత్మకమైన జగత్తు మీద అభిమానం కలిగి వాటి ధర్మాలను తన మీద కల్పించుకోవడం చేత ఈ దివ్యత్వాది లక్షణాలు కుదరవు కదా! అక్షరం అంటే నామరూపాలకు బీజమైనది. ఈశ్వరశక్తి రూపమైనది. భూతముల యొక్క సంస్కారాలతో కూడినది. ఈశ్వరుడు ఆశయంగా కలది. ఆఈశ్వరుడి ఉపాధి అయిన అన్యాకృతం (సృష్టికి పూర్వం జగత్తు ఈశ్వరుని యందు విలీనమై ఉన్న పూర్వ వ్యవస్థ.). అది సమస్త వికారములతో కూడినది. ఈ విధంగా వికార పరమైన ఆ అక్షరం కంటే పరమైనవాడు పరమేశ్వరుడు అని, భేదం చేత భిన్నమైనవాడు అని చెప్పడం వలన పరమేశ్వరుడే భూతయోనిగా ప్రతిపాదింపబడుచున్నాడు.
సూత్రం :- 54
"రూపోప న్యాసా చ్చ "
రూప ఉపన్యాపాత్:- పరమాత్మ రూపకధనం ఉపనిషత్తులలో చెప్పినందువల్ల చ:- కూడా, జీవ ప్రకృతులు భూత యోనులు కానేరావు.
భావం:- పరమాత్మ యొక్క రూపాన్ని ఉపనిషత్తులలో చెప్పినందు వరన కూడా జీవాత్మ, ప్రకృతులు భూతయోనులు కానేరావు.
వివరణ:- పరమాత్మ రూపాన్ని చెప్పడం వలన భూత యోని అంటే పరమాత్మే కానీ వేరు కాదు.
ముండకోపనిషత్తు:- ( 2, 1, 3 ):- ఈ ప్రకృతి నుంచి ప్రాణం, మనస్సు, ఇంద్రియాలు, ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి, ఉత్పన్నమౌతున్నాయి. అది ప్రకృతి వర్ణన. (౨ 1 4 ):- ఆయనకు ఆగ్ని తల, చంద్రసూర్యులు నేత్రాలు, దిక్కులు చెవులు, వేదాలు వాక్కు, వాయువు ప్రాణం, విశ్వం హృదయం, పృధివి పాదాలు, ఆయన సర్వభూతాంతరాత్మ, ఈ వర్ణన జీవప్రకృతులకు చెల్లదు. ప్రకృతి, పంచభూతాలు అంతరాత్మ కానేరదు. ప్రకృతి జీవులకన్నా సూక్ష్మం కాదు. కనుక జీవులకు అంతరాత్మకాజాలదు. జీవుడుకూడా సర్వాంతర్యామికాలేడు. ప్రకృతికి, జీవుడికి ఈశ్వరుడే అంతరాత్మ. వేదాలలో పరమాత్మ యొక్క సర్వాంతర్యామత్వాన్ని వర్ణించారు. ఋగ్వేదం:- విశ్వతః చక్షురుత విశ్వతోముఖః విశ్వతో భాహురుత విశ్వతస్పాత్ 'సహస్రశీర్షా పురుషా సహస్రక్ష: సహస్రపాత్(8,417,1) పరమాత్మ నేత్రాలు, ముఖం, చేతులు, విశ్వమంతా ఉన్నాయి. ఆయన అంతా వ్యాపించిఉన్నాడు. దీనివల్ల భూతయోని అక్షరం ఈశ్వరుడే. ఆపరమేశ్వరుని నుంచే చతుర్వేదాలు, మంత్రాలు పుట్టినవి. మౌంజీ బంధనాది దీక్షలు, అగ్నిహోత్రాది యజ్ఞాలు, దక్షిణలు, యజ్ఞాలకు కాల ప్రమాణం, సూర్య చంద్ర లోకాలు, ఉత్తరాయణ, దక్షిణాయన మార్గాలు పుట్టాయి. అష్టవశువులు, ఏకాదశరుద్రులు, ద్వాదశాదిత్యులు, పుట్టారు. కర్మాధికారంగల మానవులు పుట్టారు. పశువులు, పక్షులు, ఉశ్వాసనిశ్వాసలు, ధ్యానాలు, పురుషార్ధాలు సాధించడానికి వీలైన తప్పస్సు, శ్రద్ధ. మితభాషణ, హితభాషణ, అష్టవిధ మైధునాలు త్యజించడం ద్వారా ఆచరించే బ్రహ్మచర్యం, పుట్టాయి. పరబ్రహ్మం నుంచే సప్తప్రాణాలు (కళ్ళు 2 ముక్కులు 2 చెవులు 2 నోరు 1)పుట్టాయి. 7 ఆహుతులు, 7 ప్రాణాలు సంచరించే స్థానాలు, సప్త సముద్రాలు, పర్వతాలు, నదులు, వివిధరకాల ధాన్యాలు, షడ్రుచులు, అన్ని పరమాత్మ నుంచే పుట్టాయి అని చెప్పబడినది. అంటే ఆరూపాలన్ని పరమాత్మవే. ఈరూపం జీవుడిది కాదు. సర్వ భూతాలకు ఆత్మగా ఉండటం ప్రకృతి లక్షణం కాదు. ఈ లక్షణాలన్నీ పరబ్రహ్మవే. అదృశ్యాది రూపం గలది, భూతాయోని పరబ్రహ్మ తప్ప వేరేమి కాదు.
వైశ్వానరాధికరణం:- ( 1, 2 ,24 )
సూత్రం :- 55
'వైశ్వానరః సాధారణ శబ్ద విశేషాత్"
సాధారణ శబ్ద విశేషాత్.. వర్ణనలో ఉన్న ఆత్మ వైశ్వానరుడు లాంటి పదాలకు విశేషార్ధాలు తెలియజేయడం వలన వైశ్వానరః:-ఛాందోగ్యంలో పఠించిన వైశ్వానరుడు పరబ్రహ్మకు
భావం:- ఆత్మను వైశ్వానరుడు అని వర్ణించుట వలన ఛాందోగ్యంలో పఠించిన వైశ్వానరుడు పరబ్రహ్మమే.
వివరణ:- గురువుగారు! ఆత్మ అంటే జీవాత్మ, పరమాత్మ అలాగే వైశ్వానరుడు అంటే జఠరాగ్ని, భూతాగ్ని, అగ్ని దేవుడు. వీరిలో ఎవరు వైశ్వానరుడు అని అడిగాడు కృష్ణశర్మ. శిష్యుని సందేహం విని కృష్ణ శర్మ ఇలా చెబుతున్నాడు. సాధారణ శబ్ద విశేషాల చేత వైశ్వానరుడు పరమాత్మే.
ఛాందోగ్యోపనిషత్తు:- ఐదుగురు మహా శ్రోత్రియులు ఒక చోట చేరి మీమాంస చెయ్యడం మొదలు పెట్టారు. ఉపమన్యుని కుమారుడు ప్రాచీన శీలుడు, పులుషుని కుమారుడు సత్య యజ్ఞుడు, భల్లుని కుమారుడు ఇంద్రద్యుమ్నుడు, శర్కరాక్షుని కుమారుడు జనుడు, అశ్వతరాస్యుని కుమారుడు బుడిలుడు, వీరందరూ ఆత్మ అంటే ఏమిటి ? బ్రహ్మం అంటే ఏమిటి? అని తర్కించుకుంటూ ఒక నిర్ణయానికి రాలేక. ఈ వైశ్వానరాత్మ అంటే బాగా తెలిసినవాడు ఉద్ధాలకమహర్షి అని నిశ్చయించుకొని ఆయన దగ్గరకు వెళ్లారు. ఆయన వీరిని తీసుకొని కేకయ దేశాధిపతి అయిన అశ్వపతి దగ్గరకు వెళ్లారు. వైశ్వానరాత్మను గురించి బోధించమని ప్రార్ధించారు. రాజు వీరందరినీ విడివిడిగా వైశ్వానరాత్మను ఎలాఉపాసన చేస్తున్నారని అడిగాడు. వారు ద్యులోక, వైశ్వానర, ఆదిత్య, వాయు, ఆకాశ, అప్, పృధ్వి లను ఉపాసిస్తున్నామని చెప్పారు. అందుకు రాజు మీరు చేస్తున్న ఉపాసన తప్పు. మీరు నన్ను అడగకుండా సుతేజస్వ, విశ్వ రూపత్వం, పృథగ్వర్మాత్మవ్వ, బహలవ్యరయిత్వా, ప్రతిష్టాత్మ మొదలైన గుణాలున్ట్లు వైశ్వానరుని అంగాలైన ద్యుసూర్యాదులనే వైశ్వానరుడుగా భావించి, ఉపాసించినట్లైతే, అప్పుడు వరుసగా మీకు శిరస్సు పడిపోవడం, అంధత్వం, ప్రాణాలు పోవడం, దేహం శిథిలం అయిపోవడం, పాదాలు పగిలిపోవడం, జరిగిఉండేది. అవి అంగాలను ప్రత్యేకంగా ఉపాసించ డాన్ని నిందించి, సుతేజస్త్వం అనే గుణం కల ద్యులోకం ఆత్మ అయిన ఈ వైశ్వానరుని శిరస్సు, విశ్వరూపత్వం అనే గుణం గల సూర్యుడు నేత్రం ఇత్యాది రీతిలో ద్యుసూర్యాదులు మూర్ధనులని చెప్పి, సమస్త వైశ్వానర ధ్యాన విధానాన్ని బోధించాడు. ద్యు సూర్య, వాయు, ఆకాశ, పృధ్విలలో సుతేజస్త్వాది గుణాలున్న వాటిని వేరువేరుగా ఉపాసించకూడదు. ఈ వైశ్వానరునకు పగలు తల, సూర్యుడు కన్ను, వాయువు ప్రాణం, దేహ మద్యం ఆకాశం, మూత్రం జలం, పాదాలు పృధివి, ఉరస్సు వేది, రోమాలు దర్భాలూ,హృదయం గర్హపత్యాగ్ని, మనస్సు అన్వాహార్యం, నోరు ఆహవనీయం, ఈ వాక్యాలలో వైశ్వానరం ఏది? జఠరాగ్నా? భూత్వగ్నా సూర్యుడా జీవాత్మయా పరమాత్మయా అనే సందేహం కలుగుతోంది. ఈ ఉపనిషత్ వాక్యంలో వైశ్వానరపదాన్ని అన్ని అర్ధాల్లోనూ వాడారు కదా !అంటే బృహదారణ్య కోపనిషత్తు 5 9 1 ) అయమగ్నిః వైశ్వానరో యో యామంతః, పురుషేయేనేద మన్నం పచ్యతే యదిద మధ్యతే. పురుషుడు తినే అన్నాన్ని పచనం చేసే అగ్ని వైశ్వానరం. వైశ్వానరం అంటే జఠరాగ్ని. శతపద బ్రాహ్మణము:-వైశ్వానరం అంటే భూతాగ్ని. ఋగ్వేదం:-దేవతలు అన్ని ఈభువనాలకు వైశ్వానరాగ్నిని పగళ్లకు కేతువుగా చేశారు. ఇక్కడ సూర్య దేవతార్ధంలో వైశ్వానర శబ్దాన్ని ప్రయోగించారు.
కఠోపనిషత్తు:-(౧ 7):-వైశ్వానరః ప్రవిశత్య తిధిః బ్రాహ్మణో గృహాన. వైశ్వానరుడు బ్రాహ్మణ అతిధి ఇంటికి వచ్చాడు. ఇక్కడ వైశ్వానర శబ్దం జీవాత్మ పట్ల ప్రయోగించారు.కాగా ఛాందోగ్యంలో పఠించిన వైశ్వానరుడు పరబ్రహ్మమే. ఇక్కడ ఆత్మానాం వైశ్వానరః ముపాస్తే. అని ఆత్మ శబ్దం లో విశిష్టమై ఉన్నది. మనకు అక్కడక్కడ కనిపించే ప్రయోగాలు పరమాత్మ వాచకంగా ఉన్నాయి.
తైత్థరీయోపనిషత్తు:-(౨ 1)తస్మాద్వా ఏతస్మాదాత్మక ఆకాశః సంభూతః. ఆఆత్మ వలన ఆకాశం జనించింది. ఇలాంటి వాక్యాలలో ఆత్మ అంటే పరమాత్మ. కనుక ఆత్మ శబ్దంతో బాటు వచ్చిన వైశ్వానర శబ్దం కూడా పరమాత్మ బోధకమే. వైశ్వానరాత్మకు ద్యులోకం శిరస్సు అన్నారు.ద్యులోకం జీవాత్మకు మూర్ధ కాజాలదు అని తెలియజేశారు. అందువలన వైశ్వానర పదం పరమాత్మ బోధకమే.
వైశ్వానరాధికరణం:- ( 1, 2, 25 )
సూత్రం :- 56
"'స్మర్య మాణ మను మానం స్వాదితి'"
స్మర్యమాణం :- స్మృతులలో వర్ణించిన పరమేశ్వరుడి రూపమే, అనుమానం:- దీనికి ప్రమాణం ఇతి స్వాత్:- అందువల్ల వైశ్వానర శబ్దం పరమాత్మ వాచకమే.
భావం:- స్మృతులలో వర్ణించిన పరమేశ్వరుడి రూపం ప్రమాణంగా వైశ్వానర శబ్దం పరమాత్మ వాచకమే.
వివరణ:- అధర్వణ వేదం :- పరమాత్మకు భూమి-పాద పీఠం, అంతరిక్షం-ఉదరం, ద్యులోకం-శిరస్సు, సూర్యచంద్రులు- నేత్రాలు, అగ్ని-ముఖము, ఆకాశం-నాభి, దిక్కులు-శ్రోత్రములు, అయినాయో అలాంటి బ్రహ్మానికి నమస్కారం. ఇక్కడ చెప్పిన వైశ్వానరుడు పురాణాల్లోని పరమేశ్వరుడు ఒక్కరే. అగ్నిర్ముర్దా అనే ముండకవాక్యంలో వర్ణించిన రూపం పరమాత్మ వాచకమే. ఛాందోగ్యమంత్రం తస్యహవా ఏతస్య అని వైశ్వానరరూపవర్ణన చేశారు. ఈ వర్ణన వేదమంత్రాలలోని పరబ్రహ్మ రూపాన్ని స్ఫురింపజేస్తుంది. అందువల్ల ప్రకరణంలో ఉండే వైశ్వానరపదం పరమాత్మ బోధకమే. ఈ వైశ్వానరశబ్దం పరమేశ్వరుణ్ణి బోధిస్తుంది అనడానికి అనుకూలంగా అనగా లింగంగా, ఉహింపజేసేదిగా అవుతుందని అర్ధం. ఉహించడానికి శక్యం కాని రూపం గల అతడే సకల భూతాల కారణం అని గ్రహించాలి. కొన్ని చోట్ల స్మృతిలో చెప్పిన విషయానికి సమర్ధమైన శృతి లభించక పోవచ్చును. దానికి విరుద్ధమైన శృతివాక్యం ఉండి ఉంటుంది. కానీ మనకిప్పుడు లభ్యం అవడం లేదని అనుకోవాలి. ఈ విధంగా స్మృతి వాక్యం శృతి వాక్యానికి అనురూపకం. ఉహింపజేసేది. ఇది మీమాంసులు చెప్పే వేదాంతులు కూడా అంగీకరించిన పద్ధతి.
భగవద్గీత:- "అహం వైశ్వానరో భూత్వా ప్రాణినామ్ దేహమాశ్రితః|ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్" శ్రీకృష్ణ పరమాత్మ వైశ్వానరుడు అనే అగ్ని రూపంలో ప్రాణుల శరీరంలో ఉంటూ, వారి శరీరాలకు కావలసిన వేడిని ఇస్తూ, వారు తిన్న4 విధములైన ఆహారమును పచనం చేస్తున్నానని చెప్పాడు. బయటేకాదు. జీవరాసులలో లోపల కూడా అగ్ని రూపంలో ఉండేది వైశ్వానరుడే. అదే జాఠరాగ్ని. ప్రాణులు తిన్న 4 విధములైన ఆహారపదార్ధాలను భక్ష్యాలు, భోజ్యములు, లేహ్యములు, చోష్యములను జీర్ణం అయ్యేలా చేసున్నాడు. లోపల ఉన్న జఠరాగ్ని బాగా ప్రజ్వరిల్లాలంటే గాలి కావాలి. అదే మనం పీల్చే గాలి. ఈ ప్రాణ వాయువు లోపల ఉన్న అగ్నికి శక్తినిస్తుంది. ఆ జఠరాగ్ని మనం తినే ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. అందుకే గాయత్రి మంత్రం చెబుతూ భోజనం ప్రారంభిస్తారు. ఆ ఆహారం పరబ్రహ్మ స్వరూపం, అది జీర్ణం చేసే వైశ్వానరుడు పరబ్రహ్మమే.
సూత్రం :- 57
శబ్దాది భ్యోన్తః ప్రతిష్టానాచ్ఛ నేతి చేత్ న, తథా దృష్ట్యుపదేశ సంభవాత్ పురుషమపి చైవ మధియతే :-
శబ్దాదిభ్యః;- వైశ్వానరశబ్దం తల, శ్రోతం లాంటి అవయవాలతో జోడించి చెప్పడంవలన, అంతఃప్రతిష్టానాత్:- శరీరంలో ఉన్నందు వలన, న;- వైశ్వానరః పదం పరమాత్మను బోధించదు, ఇతి చేత ;- అని భావించడం, న:- సరి అయినది కాదు. తదా దృష్టి ఉపదేశాత్:- వైశ్వానర శబ్దం పరమాత్మ అర్ధంలోనే ప్రసిద్ధమైనది. అసంభావాత్:-ఇతర జీవాత్మ లాంటి అర్ధాలలో శిరస్సు, మొదలైన అవయవ దృష్టి అసంభవం. పురుషం అపిచ:- శరీరంలో ఉండే అంతర్గత చైతన్యంగా, ఏవమ్ :- వైశ్వానరుణ్ణి, అధీయతే:- పఠిస్తున్నాను.
భావం:- వైశ్వానర శబ్దం తల, శ్రోతం మొదలైన అవయవాలతో జోడించడం వలన, శరీరంలో ఉన్నందువలన, వైశ్వానర పదం పరమాత్మను బోధించదు అని భావించడం సరియైనది కాదు. వైశ్వానర పదం పరమాత్మ అర్ధంలోనే ప్రసిద్ధమైనది. ఇది జీవాత్మకు అసంభవం. శరీరంలో ఉండే అంతర్గత చైతన్యంగా వైశ్వానరుణ్ణి పఠిస్తున్నాను.
వివరణ:- వైశ్వానర శబ్దం అగ్నికి పరమాత్మకు కూడా సంబంధించినది. అంతే కాని జఠరాగ్నికి కాదు. ఈ ప్రకరణంలో జఠరాగ్ని రూపంలో పరమేశ్వరోపాసన చెప్పబడింది. అంతే కాని వైశ్వానరుడు పరమాత్మే.
ఛాందోగ్యోపనిషత్తు:- వైశ్వానర పదం ఆత్మ శబ్దంతో సమ్మిళితమై ఉంది. అందువల్ల అది జఠరాగ్ని లాంటి ఇతర శబ్దాలకు వర్తించదు. శిరస్సు లాంటి అవయవాలతో వర్ణించినవి కావు. పృధివి నుండి ద్యులోకం వరకు ఉన్న ప్రదేశాలలో ఒక్కొక్క దాన్ని వైశ్వానరాత్మగా భావించి, ఉపాసించి, మూర్ధ పతనం లాంటి అర్ధాలు గ్రహించకుండా ఉండేందుకు పరమాత్మను విరాట స్వరూపునిగా తెలిపేందుకు అశ్వపతి అలా పోలికలతో వర్ణించాడు. నిరాకారుడైన పరమాత్మకు వాస్తవంగా అవయవాలు ఉండవు. వైశ్వానరుడు సర్వాంతర్యామి,సర్వాధారుడు, శరీర కాదు. పరమాత్మ సర్వ ప్రపంచాంతర్వర్తి అని వేదం, సర్వ భూతాంతరాత్మ అని కఠోపనిషత్తు తెలియజేస్తోంది. శరీరంలో ఉండే జీవులకు లాగా బ్రహ్మాండమంతా నిండి ఉన్న పరమాత్మకు ద్యులోకం లాంటివి అవయవాలని చెప్పడంలో విడ్డురం ఏమి లేదు.
ఋగ్వేదం:-(1, 4, 25, 1 ): వయా ఇదగ్నే, అగ్నయస్తే అన్యే త్వే విశ్వే అమృతా మాదయంతే, వైశ్వానర, నాభిరసి క్షితీనాం స్తూణేవ జనాన్ ఉపమిద్ యయందః. ఓ ప్రకాశ స్వరూపా! ఇతర అగ్నులు నీకు అవయవాలు. విశ్వాత్ముడవు అయిన నీలో అందరూ ముక్తులై ఆనందం అనుభవిస్తున్నారు. ఓ వైశ్వానరా! నీవు అన్ని పదార్ధాలలో అంతరాత్మగా ఉన్నావు. అన్ని ప్రాణుల్ని ఇంటిలో ఉండే స్తంభం లాగా ఆధారంగా దరిస్తున్నావు. ఇలా వేదంలోను అవయవ కల్పన ఉన్నది. ఇది పరమేశ్వరుణ్ణి వర్ణించే శైలి అనుకోవాలి. అంత మాత్రాన ఆయనకు అవయవాలు ఉంటాయని కాదు. వాజసనేయులు వైశ్వానరుణ్ణి పురుషాంతర్వర్తి అని అంటారు. అందువల్ల వైశ్వానర శబ్దం పరబ్రహ్మ వాచకమే కానీ జఠరాగ్ని లాంటి వాటిని బోధించదు.
సూత్రం :- 58
"'అత ఏవ న దేవతా భూతం చ "'
అత ఏవ :- పై కారణాల వలన దేవత:- సూర్యాదిదేవతలు, భూతం:- ఆకాశాది భూతాలు, చ:-కూడా న:- వైశ్వానరుడు కారు.
భావం:- సూర్యుడు అగ్నిమయుడు. ద్యులోకంలో (సూర్యలోకంలో) ప్రకాశిస్తుంటాడు. ద్యోతకం అంటే ప్రకాశం. అతడు వెలుగుని, వేడిని ఇచ్చి ప్రకాశిస్తుంటాడు. కనుక సూర్యుణ్ణి దేవత అంటారు. సూర్యాది దేవతలు, ఆకాశాది పంచ భూతాలు వైశ్వానరుడు కారు.
వివరణ:- నిరుక్తము:-( 7 ,5 ):-దేవో దానాద్ దా దీపనాద్వా ద్యోతనాద్వా ద్యుస్థానో భవతీతివా' దానం, దీపం, ద్యోతనం, ద్యుస్థానంలో ఉండటం అనే గుణాల వలన దేవత అని అంటారు. అగ్ని కానీ సూర్యుడు కానీ పంచ భూతాలు కానీ వైశ్వానరః పదవాచ్యాలు కానేరవు. వీటికి ద్యులోకం మొదలైనవాటికి పరమాత్మకు శిరస్సులాంటి అవయవాలుగా కనిపించవు. ఇవి సర్వాంతర్యామి, సర్వాధారం కాలేవు. లేదా పురుషునితో (పరమాత్మ) పురుష పదవాచ్యాలు కూడా కావు. కనుక వైశ్వానరః పదం పరమాత్మ వాచకమే కానీ సూర్యాదులకు వర్తించదు. సూర్యుడు స్వయంప్రకాశకుడు. తనకు తానుగా ప్రకాశిస్తూ, లోకానికి వెలుగుని , వేడిని, కాంతిని ఇస్తూ జీవకోటి మనుగడకు ఆధారమౌతున్నాడు. సూర్యుని యొక్క వెలుగు చంద్రుని మీద పడటం వలన చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. సూర్యుడు ఆనంతకోటి విశ్వంలో ఒక నక్షత్రం మాత్రమే. ఆ నక్షత్రం కూడా కొంత కాలానికి వేడిని, వెలుగును కోల్పోతుంది. సూర్యుడికి ప్రకాశించే శక్తినిచ్చిన పరమాత్మ కాలాతీతుడు. సూర్యుని వలన, చంద్రుని వలన ప్రకాశింపబడడు. అలాగే భూమిమీద వెలుగునిచ్చేది అగ్ని. రాత్రి పూట దీపం రూపంలో కాంతులు వెదజల్లితే ఆవెలుగులో అన్ని వస్తువులు చూడగలరు. ఇవేమీ లేకపోయినా కళ్ళు మూసుకుంటే అన్ని వస్తువులు కనిపిస్తాయి. అక్కడ పరమాత్మ జ్ఞాననేత్రం ఉంటుంది. పరమాత్మను చూడాలంటే జ్ఞానజ్యోతి సాయంతో పరమపదం చేరుకోగలరు. మంత్రవర్గంలో భూతాగ్ని కూడా ద్యులోకాదులలో సంబంధం ఉన్నట్లు కనబడటం వలన అగ్నిని పరమేశ్వరుని ముఖంగాను సూర్యలోకాన్ని పరమేశ్వరుని శిరస్సుగాను పోల్చి చెప్పినందున, అలాంటి భూతాగ్నికి ఐశ్వర్యం ఉండటం వలన సూర్యాది దేవతలు పంచభూతాలు వైశ్వానరుడని చెప్పడం తగదు. ఉష్ణత్వం, ప్రకాశం స్వరూపంగా గల భూతాగ్నికి ఐశ్వర్యంతో సంబంధం ఉన్నా కూడా ద్యుమూర్ధత్వాది కల్పన కుదరదు. ఎందువలననగా అది సూర్యలోకానికి కారణం కాదు. దాని ఐశ్వర్యం కూడా పరమాత్మ మీదనే ఆధారపడి ఉన్నది. నిరాకరుడు, సర్వాంతర్యామి అయిన పరబ్రహ్మకు మాత్రమే వైశ్వానరుడు శబ్దం వర్తిస్తుంది.
సూత్రం :- 59
"సాక్షాద ప్యవిరోధం జైమినిః"
సాక్షాత్:- వైశ్వానర శబ్దం సాక్షాత్తు పరబ్రహ్మాన్ని తెలుపుతుందని, అవిరోధం అపి :- ఏ మాత్రం విరోధం లేదని జైమినిః :- జైమిని మహర్షి అంటున్నాడు. విశ్వేషామ్:- సమస్త చేతనాలకు, నేత:-కర్మ ఫలాన్ని ఇచ్చే స్వామి, విశ్వానరుడు.
భావం:- వైశ్వానర శబ్దం సాక్షాత్తు పరబ్రహ్మాన్ని తెలుపుతుందని, ఇందులో ఏ మాత్రం విరోధం లేదని, సమస్త చేతనాలకు కర్మ ఫలాన్ని ఇచ్చే స్వామి వైశ్వానరుడేనని జైమిని మహర్షి అంటున్నాడు. విశ్వానరుడే వైశ్వానరుడు.
వివరణ:-వైశ్వానర పదానికి అగ్నికి సంబంధం ఉంది. వైశ్వానర పదం పరమాత్మకు సంబంధించినది.అంతే కాని జఠరాగ్నికి కాదు. ఈప్రకరణంలో జఠరాగ్ని రూపంలో పరమేశ్వరోపాసన చెప్పబడింది. అంతే కాని వైశ్వానరుడు పరమాత్మే. ఎందువలన ఆయన్ని వైశ్వానరుడు అన్నారు? సమస్తజీవులకు కర్మఫలాన్ని ఇస్తాడు. లేదా వాళ్ళు తమతమ కర్మఫలాన్ని అర్ధించ డానికి ఆయన దగ్గరకు వస్తారు. ఇలా విశ్వానికి అధికారి పరమాత్మే కానీ వేరెవరు కాదు. పరమాత్మ జడమైన చేతనాత్మక కార్యాలన్నింటికి రాజు. ఆయనే భూత భవిష్యత్ వర్తమానాలతో కూడిన ఈ ప్రపంచానికి అధిష్టానం అని ఋగ్వేదం పేర్కొంది.
అధర్వణ వేదం :- ఈశ్వరుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని అతిక్రమించి విరాజిల్లుతున్నాడు. సర్వం అతడిలో ప్రతిష్ఠితం. ఆయనే సర్వానికి ఈశ్వరుడు. సర్వం అతని వశంలో ఉన్నది. అలాంటి ప్రాణ రూపుడైన పరమాత్మకు నమస్కారం. ఇలా వేదాలు ఈశ్వరుడి సర్వాధిపత్యాన్ని గురించి తెలియజేస్తున్నాయి. సర్వలోకాంతర్యామిత్వం, సర్వకర్మఫలం, దాతృత్వం, సర్వనాయకత్వం, పరమాత్మలోనే ఉన్నాయి. కనుక వైశ్వానర శబ్దం పరబ్రహ్మ వాచకమే. జఠరాగ్నిని ఉపాధిగా గల పరమేశ్వరుడు ఉపాసించదగినవాడు అని ఇంతకుముందు చెప్పబడింది. ఏఉపాధి లేకుండానే పరమేశ్వరుని ఉపాసించ వచ్చని జైమినిమహర్షి చెబుతున్నాడు. జఠరాగ్నిని గ్రహించని పక్షంలో, పరమేశ్వరుడు అంతరంలో జఠరాగ్ని రూపంలో లోపల ప్రతిష్టింపబడ్డాడని చెప్పడం విడ్డురం కదా! అది విడ్డురం కాదని చెబుతున్నారు. జఠరాగ్నిని ఉద్దేశయించి ఏ శబ్దం చెప్పబడలేదు. దానిని బోధించే పదం లేదు. తల మొదలు గడ్డం వరకు ఉన్న పురుషావయవాలు వృక్షం మీద శాఖలు ప్రతిష్ఠితమై ఉన్నట్లుగా భావించాలి. అంతస్టం అంటే ఉదరంలో ఉందని కాదు. నఖ నుండి శిఖ వరకు శిరస్సు నుండి చుబుకం వరకు ఉన్న అవయవాలు చెట్టుమీద కొమ్మలు ఉన్నట్లుగా భావించాలి. వాటిలో వైశ్వానరుణ్ణి శాఖమీద కూర్చున్న పక్షి వలే వృక్షం లోపల ఉన్నది అని చెప్పినట్లుగా పురుషాంతర ప్రతిష్ఠితుడు అని చెప్పవచ్చును. అంతస్టః అంటే సాక్షి అని మరొక అర్ధం ఉంది. జీవుని యొక్క శుద్ధ చైతన్యరూపం పురుషునితో సాక్షిగా ఉన్నది. వైశ్వానర పదం పరమాత్మ విషయంలో వర్తించగలదు. తన ఆత్మగా గాని, తన అధీనులుగా కలవాడు అని వైశ్వానర శబ్దానికి పరమాత్మ అని అర్ధం చెప్ప వచ్చును.
సూత్రం :- 60:
"అభి వ్యక్తే రీత్యా శ్శరధ్యః
అభివ్యక్తేః:-పరమేశ్వరుడు ప్రాదేశమాత్రుడు (జానెడుప్రమాణం కలవాడు అనిఅర్ధం) అభివ్యక్తిని బట్టి అనగా పరమేశ్వరుడు ఆ విధంగా సాక్షాత్కరిస్తాడు అని అశ్మరధుడు అనే ఆచార్యుడు అన్నాడు. ఇతి :- అని. అశ్మరధ్యః- అశ్మరధుడు అనే ఆచార్యుడు అభిప్రాయం.
భావం:- ఉపాసకుల హృదయంలో వ్యక్తం కావడం వలన పరమాత్మ ప్రాదేశమాత్రుడుగా జానెడు ప్రమాణంలో సాక్షాత్కరిస్తాడని అశ్మరధుడు అనే ఆచార్యుడి అభిప్రాయం.
వివరణ :- ఉపాసకులకు అనుగ్రహించడం కోసం హృదయం మొదలైన స్థానాలలో ఉంటున్నాడు. అతడు ఉండే స్థానాన్ని బట్టి స్వల్ప పరిమాణం గలవాడని అశ్వరధుడు అనే ఋషి చెప్పాడు. మోక్షాన్ని కోరుకునే వాళ్ళు అనన్య భక్తితో ఈశ్వరుణ్ణి వేద విధానాలతో ఉపాసిస్తారు. ప్రకృతిని దాని వలన కలిగే కార్యాన్ని విడిచిపెట్టి వాళ్ళు క్రమంగా ఆత్మస్థితులౌతారు. భగవంతుని అనుగ్రహం ఆయనకు మనం ఏమి ఇచ్చామో అనే దాని మీద ఆధారపడి ఉండదు. ఇచ్చినవాడి మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. అతడి మనస్సులో నిర్మలమైనభక్తి. ఏకాగ్రమైనభక్తి, అనన్యభక్తి ఉంటే చాలు. మనస్సును పరమాత్మకు అర్పించి శరణు కోరితే నిశ్చయంగా భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. భగవంతుని మీద భక్తి నిలిపి మనసును లగ్నంచేసి, అహంకారాన్ని వదలి వేసి, పరమాత్మే పరమగతిగా భావించాలి. ఇక్కడ హృదయపుండరీకం భౌతికం కావడం వలన దాన్ని శాస్త్రజ్ఞులు ప్రాదేశమాత్రం అంటారు. హృదయంలో ప్రకట మవడం చేత పరమాత్మ ప్రాదేశమాత్రుడు అంటారు. ప్రాదేశమాత్రుడికి అంగుష్ఠమాత్రుడికి తేడా ఏమీ లేదు. ఈ రెండు ఈశ్వర వచకాలే.
కఠోపనిషత్తు:-(6 ,17):- అంగుష్ఠమాత్రః పురుషోన్తరాత్మ, సదా జనానాంహృదయే సన్నివిష్ఠః. అంగుష్ఠమాత్రుడు అంతరాత్మ అయిన పురుషుడు జీవుల హృదయంలో సదా సన్నివిష్ఠుడై ఉంటాడు. కనుక వైశ్వానరుడైన ఈశ్వరుణ్ణి ప్రాదేశమాత్రుడుగా వ్యవహరిస్తారు. మహాప్రమాణం కలవాడైన పరమేశ్వరుడు ప్రాదేశమాత్రుడని చెప్పడం అభివ్యక్తిని బట్టి కావచ్చును. పరమేశ్వరుడు ఉపాసకులకు జానెడు ప్రమాణంలో సాక్షాత్కరిస్తాడు. ప్రాదేశమాత్రానికి మరొక అర్ధంచేబుతారు. పరమేశ్వరుని స్థానాలైన హృదయాది ప్రదేశాలలో విశేషించి అభివ్యక్తు డౌతాడు. అందువల్ల అభివ్యక్తిని బట్టి. పరమేశ్వని యందు కూడా ప్రాదేశమాత్ర శృతి కుదురుతుంది.
సూత్రం :- 61
అనుస్మృతేః బాదరిః
అనుస్మృతే:- ప్రాదేశమాత్రమైన హృదయంలో ఉన్న మనస్సు చేత స్పరించడం వలన, బాదరి: :- బాదరి ముని అభిప్రాయం.
భావం:- ముందు శ్రద్ధగా విని, పిదప స్మరించడం, చింతన చెయ్యడం, ద్వారా పరమాత్మ ప్రాదేశ మాత్రుడని బాదరి ముని అభిప్రాయం.
వివరణ:- బాదరి అనే ఆచార్యుడు ధ్యానం వల్ల ప్రాదేశ మాత్రుడుగా చెప్పబడుచున్నాడని చెప్పాడు. పరమేశ్వరుడు సర్వ వ్యాపకుడు. అయినప్పటికీ కుంచంతో కొలిచిన బియ్యం కుంచంబియ్యమే ఉన్నట్లుగా, పరిభిన్నమైన మనస్సుతో ధ్యానం చేస్తున్నాం కాబట్టి పరిభిన్నుడుగా చెప్పబడుచున్నాడు. పరమాత్మ గురించి శాస్త్రాల వల్ల తెలుసుకొని, తరువాత ఆయన సాక్షాత్కారం కోసం ముముక్షువులు తమ హృదయాలలో సదా ఆయన్ని స్మరిస్తుంటారు. దీనినే ఉపాసన అంటారు. యోగులు హృదయపుండరీకాన్ని ప్రాదేశమాత్రం అని వ్యవహరిస్తారు. అందువల్ల అందులో ఉపాసించే ఈశ్వరుణ్ణి ప్రాదేశమాత్రుడు అంటారని బాధరముని అభిప్రాయం. ఈ పరమాత్మ గుప్పెడంత హృదయంలో ఉన్న మనస్సు చేత స్మరించబడతాడు. అందుచేత ప్రాదేశమాత్రుడని చెప్పబడుచున్నాడు. కుంచంతో కొలిచిన బియ్యం కుంచమే ఉన్నట్లుగా హృదయంలో ఉన్న పరమాత్మ హృదయమంతే ఉంటాడు. నిజానికి పరమాత్మకు ఒక రూపం, ఆకారం ఏమి ఉండవు. ఆయన విశ్వమంతా నిండి ఉండగలడు. అణురూపంలోను ఉండగలడు. పరమాత్మ ప్రాదేశమాత్రుడు కాకపోయిన ప్రాదేశమాత్ర తత్త్వాన్ని చెబుతున్న శృతివాక్యాన్ని సార్ధకం చెయ్యడానికి ప్రాదేశప్రమాణం గలవానిగా స్మరించాలి. ఇది సూత్రానికి రెండవ అర్ధం. ఈ విధంగా పరమేశ్వరుని విషయంలో ప్రాదేశ సూత్ర శృతి అనుస్మృతిని బట్టి ఏర్పడినది బాదరి ఆచార్యుడు భావిస్తున్నాడు.
భగవద్గీత:-(9-22) అనన్యాశ్చింతయంతో మామ్ యేజనాః పర్యుపాసతే తేషామ్ నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం'. ఏ మానవుడు సర్వకాల సర్వావస్తల యందు నన్నే ధ్యానించుచున్నాడో అట్టివాని యోగక్షేమములు నేనే వహించుచున్నాను అని శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పాడు. సత్గ్రంధ పఠనం, సత్సాంగత్యం రెండూ భగవంతుని మీద భక్తిని పెంచుతాయి. సత్గ్రంధాలలోని భగవంతుని కథలను సత్సాంగత్యంలో నిత్యం శ్రవణం, మననం, నిధి, ధ్యాసలతో అనన్య భక్తిని పెంచుకోవాలి. ఇతరములైన ఆలోచనలు, చింతలు, భావాలు, మనస్సులో పెట్టుకోకుండా ఏకాగ్రచిత్తంతో నిరంతరం ధ్యానం చేస్తూ భగవంతుని యందు చిత్తమును లగ్నం చేసినవారి యోగక్షేమాలు ఆయనే భరిస్తానని హామీ ఇచ్చారు. అనన్యభక్తి అంటే సాటిలేని భక్తి, పోల్చలేని భక్తి. తమని తాము అర్పించుకుంటూ, ఏ పని చేస్తున్న పరమాత్మకు అర్పించుకోవడం, వారి ప్రయత్నం వారు చేస్తూ, ఇక వారి వల్ల కానప్పుడు నీవే తప్ప నితః పరంబెరుగ అనే స్థితికి వస్తే పరమాత్మే ప్రక్కన ఉండి వారి యోగ క్షేమలు చూస్తాడు. ఇలా స్మరణ చేసి ఉపాసించే వారి హృదయంలో ఉన్న ఈశ్వరుణ్ణి ప్రాదేశమాత్రుడని అంటారు.
సూత్రం :- 62
'సంపత్తే రీతి జైమినిః తథా హి దర్శయతి "
సంపత్తే :- సంపత్తి కారణంగా, ఇతి:-అని, జైమినిః:- జైమిని మహర్షి అంటున్నాడు. తధాహి :-అలాగే, దర్శయతి:- వాజసనేయ బ్రహ్మణాన్ని ఉదాహరిస్తున్నాడు.
భావం :-సంపత్తి కారణంగా పరమేశ్వరుడు ప్రాదేశమాత్రుడని జైమిని మహర్షి అంటున్నాడు. ఈ విషయంలో వాజసనేయ బ్రాహ్మణాన్ని ఉదాహరిస్తున్నాడు.
వివరణ :- వాజసనేయ బ్రహ్మణంలో ద్యులోకం మొదలు భూమి వరకు వైశ్వానరునికి శిరస్సు మొదలు గడ్డం వరకు అవయవాలుగా చెప్పబడినవి. ద్యులోకాది ప్రదేశాలు వైశ్వానరుడి అంగాలుగా వర్ణించడం చూశాము. ఇక ప్రాదేశమాత్రంలో తల నుంచి చుబుకం వరకు వుండే ముఖప్రదేశంలో తల, కళ్ళు, నాసిక, గడ్డం లాంటి అవయవాలతో వైశ్వానరుని వాజసనేయ బ్రహ్మణంలో ఇలా వర్ణించడం వలన ఆయన్ని ప్రాదేశమాత్రుడంటారని జైమినిముని ద్యులోకం నుంచి భూమి వరకు ఉన్న ప్రదేశాలు వైశ్వానరుడికి శిరస్సు లాంటి అవయవాలని శతపధ బ్రహ్మణంలో వర్ణించారు.
శతపధ బ్రాహ్మణము:-ఇప్పటి దాకా దేవతలను ప్రాదేశమాత్రంగా వివరించారు. ఇప్పుడు ఆయా దేవతలను అవయవాలుగా పోల్చి చెబుతాడు. వైశ్వానరవిద్యకు సమానప్రకరణమైన వాజసనేయ బ్రహ్మణంలో ద్యులోకం (సూర్యలోకం)మొదలు పృధివి వరకు ఉన్న అవయవాలను అధ్యాత్మము (శరీరము నందు)శిరస్సు మొదలు చుబుకం వరకు ఉన్న దేహావయవాలతో ఆరోపిస్తూ పరమేశ్వరునికి ప్రాదేశ మాత్ర సంపత్తిని చూపుచున్నది కదా! ప్రాదేశ మాత్రుడుగా కల్పించబడిన పరమేశ్వరుణ్ణి బాగుగా ఎరిగిన దేవతలు పూర్వం ఆ పరమేశ్వరుణ్ణి ప్రత్యగాత్మగా పొందారు. అదే విధంగా ద్యులోకం వైశ్వానరుడి మూర్ధ, అదే సూర్యుడు వైశ్వానరుని నేత్రమని, నాసికారంద్రాలలో ఉన్న ప్రాణాన్ని చూపుతూ వాయువుఅని, ముఖంలో ఉన్న ఆకాశాన్ని వైశ్వానరుడి దేహమధ్యమని, ముఖంలో జలం ఉదకమని అదే వైశ్వానరుడి మూత్రమనీ, భూలోకం చూపుతూ ఇదే పాదరూపమైన పృధివి అని అన్నాడు. చుబుకం అనగా ముఖం క్రింది భాగం గడ్డం వాజసనేయంలో ద్యులోకానికి అతిష్టాత్వగుణం అని ఆదిత్యునికి సుతేజస్త్వగుణమని చెప్పబడింది. ఇక్కడ అవయవాలను పోల్చడం సంపత్తి. ప్రాదేశం అంటే పరిమాణం. ఇదే జైమిని మహర్షి అభిప్రాయం.
సూత్రం :- 63
'ఆమనంతి చైన మస్మిన్ '
చ:-అంతేకాక, ఏనం:-వైశ్వానరుని, అస్మిన్:- శిరస్సుకు చుబుకానికి మధ్యనున్నట్లు, ఆమనంతి:- జాబాలులు పఠిస్తున్నారు.
భావం:- వైశ్వానరుని దివి నుండి పృధివి దాకా ఉండే ప్రదేశాలలో అవయవాలుగా చూడవచ్చునని ఛాందోగులు చెబుతారు. అందువలన వైశ్వానరుని ప్రాదేశమాత్రుడంటారని వ్యాసుని అభిప్రాయం.
వివరణ:- జాబాలిశాఖవారు పరమేశ్వరుని శిరస్సును గడ్డానికి మధ్యప్రదేశంలో ఉపాసించాలని అంటున్నారు. అభివృద్ధి కారణంగా ప్రాదేశమాత్రుడని ఆశ్మరధ్యుడు అన్నాడు. అనుస్మృతి వలన ప్రదేశమాత్రుడని బాదరి అన్నాడు. సంపత్తి కారణంగా ప్రాదేశమాత్రుడని జైమిని అన్నాడు. ద్యులోకాది ప్రాదేశనిమిత్తంగా ప్రాదేశమాత్రుడని వ్యాసుడు అన్నాడు. జగత్తును వివరించడానికి దాన్ని ద్యులోకం, ఆకాశం, వాయువు, జలం, పృధివి అని శాస్త్రంలో విభాగాలు చేశారు. ఆ ద్యులోకాన్ని పరమాత్మకు శిరస్సులాంటి అవయవాలుగా కల్పించారు. అప్పుడే ఆయన సర్వాంతర్యామిత్వం, సర్వ వ్యాపకత్వం, సర్వాధిష్టాతృత్వం బాగా బోధపడతాయని అలా పోల్చారు. అందువలన వైశ్వానరుని ప్రాదేశమాత్రు డంటారని వ్యాస మహర్షి మతం.
జాబాలోపనిషత్తు:- జీవుడు దేనియందు ప్రతిష్ఠితమై ఉన్నాడు? వరుణకు నాసికి మధ్య భాగంలో. వరుణ అంటే దేమిటి? ఇంద్రియాలు చేసిన అన్ని పాపాలను హరించేది. నాసి అంటే ఏమిటి? సర్వ పాపాలు నశింపజేసేది. అందుకే భ్రూనాసికల మధ్యభాగమే వారణాసి అని ద్యులోకానికి పరలోకానికి సంధి అని చెప్పబడినది. కాబట్టి వైశ్వానరుడు అంటే పరమాత్మ.
మాండుక్యోపనిషత్తు:-కనిపించే జగత్తంతా పరబ్రహ్మ స్వరూపమే. పైకి కనిపించే విశ్వం మాత్రమే బ్రహ్మకాదు. కనిపించ కుండా లోపల ఉండే ఆత్మ కూడా బ్రహ్మమే. అంటే కనిపించేది, కనిపించనిది కూడా బ్రహ్మమే. బ్రహ్మకు 4 పాదాలుంటాయి. అందులో మొదటి పాదం వైశ్వానరుడు. అంటే విశ్వంలోని నరులందరిలో సమానంగా ఉండేవాడు. వారందరికీ ప్రతినిధి విశ్వం యొక్క వ్యష్టి రూపం వైశ్వానరుడైతే, సమిష్టి రూపం విరాటస్వరూపం అని చెప్పబడినది. కాబట్టి వైశ్వానరుడంటే బ్రహ్మ తప్ప ఇంకవరూ కాదు అంటూ రెండవ పాదాన్ని ముగించాడు రత్నాకరుడు.
ద్యుభ్వాధ్యాధికరణం :- ( 1, 3 ,1 )
సూత్రం :-64
'"ద్యుభ్వాధ్యాయతనం స్వ శబ్దాత్'"
ద్యు:- ద్యులోకం, భూ :- భూలోకం, ఆది :- మొదలైన, ఆయతనం:- లోకాలకు ఆధారం బ్రహ్మమేనని తెలుసుకోవాలి. స్వ శబ్దాత్;- పరమాత్మను ముండకంలో ఆత్మ శబ్దంతో వ్యవహరించడమే కారణం.
భావం:- ద్యులోకం, భూలోకం మొదలైన లోకాలకు ఆధారం బ్రహ్మమేనని తెలుసుకోవాలి. ముండకోపనిషత్తులో పరమాత్మను ఆత్మశబ్దంతో వ్యవహరించడమే దీనికి కారణం.
వివరణ:-గురువుగారు! ముండకోపనిషత్తులో అక్షరపురుషుడు చెప్పబడే ఆపరబ్రహ్మలో ద్యులోకం (సూర్యలోకం), భూమి , అంతరిక్షం, ఇంద్రియములు, మనస్సు అన్ని వస్త్రంలో దారపు పోగుల వలె బాగా కలసిఉన్నాయి. అది అద్వితీయ బ్రహ్మ. అదే మోక్షానికి సేతువు అని చెప్పబడినది. ఇక్కడ సేతువు అంటే ఒక ఒడ్డు నుంచి ఇంకొక ఒడ్డుకు చేర్చేది అని అర్ధం కదా! సేతువు పరిమితమైనది. మరి అపరిమితమైన పరమాత్మ, పరిమితమైన సేతువు ఎలా అవుతాడు? లేకపోతే ఈ సేతువు ప్రకృతికానీ వాయువుకానీ అవుతుందా? కాస్త వివరించండి అని అడిగాడు నారాయణభట్టు. ఆ మాటలు విన్న రత్నాకరుడు శిష్యుని సందేహం తీర్చాడు. ద్యులోకం, భూలోకం, ప్రాణం, మనస్సు, అంతరిక్షం గల ఈ జగత్తుకు ఆధారమైనది పరబ్రహ్మ. పైన చెప్పిన స్వ అనేది పరబ్రహ్మ వాచకం. శృతులలోనేక చోట్ల ఈ శబ్దంతోనే ఆత్మను సూచించారు.
ముండకోపనిషత్తు:- పరమాత్మలోనే ద్యులోకం, పృధివి, అంతరిక్షం మనస్సుతో కూడిన జీవులు ఆశ్రయించి ఉన్నాయి. ఆయనే ఆత్మ అని తెలుసుకోవాలి. సమస్త ప్రపంచం, అగ్నిహోత్రాది కర్మలు, తపస్సు, అన్ని ఆయన రూపమే. అన్నింటి యందు పరమాత్మ ఉన్నాడు. సమస్త ప్రాణుల హృదయాలలో ఉన్నాడు. సూర్యాది గ్రహాలను ప్రకాశింపజేసేది బ్రహ్మమే. అదే ప్రాణం. అదే వాక్కు. అదే మనస్సు. అదే సత్యం అమృతమయం అని చెప్పబడినది. ఇక్కడ ముల్లోకాలకు ఆధారం ఆత్మ, జగత్తుకు ఉపాదాన కారణం ప్రకృతా? జీవాత్మా? పరమాత్మా? కారణాన్ని ఆశ్రయించి కారణం ఉంటుంది కదా! వస్త్రంలో దారపు పోగుల్లా, కుండలాలల్లోని బంగారంలా, ద్యులోకంతో కూడిన విశ్వమంతా ప్రకృతిని ఆశ్రయించి ఉంటుంది. కార్యం ఉపాదానకరణాన్ని విడచి మరొక చోట ఉండదు. అందువల్ల ద్యులోకం, భూలోకం లాంటి ప్రకృతి ఎందుకు కారణం కాకూడదు? ఈ ఆయతనం జీవాత్మ కూడా కావచ్చు కదా! జీవాత్మ భోక్త. లోకాలు భోగ్యాలు. పై ఉపనిషత్ వాక్యంలో వర్ణించిన ప్రాణంతో కూడిన మనస్సంబంధమైనది కూడా జీవాత్మ ఉన్నది. కనుక ఆత్మ శబ్దం ఇక్కడ జీవాత్మకు వర్తించదు. అంటే ప్రకృతిని ఆత్మశబ్దంతో ఎవరూ వ్యవహరించరు. ఈజగత్తులో లోకాలు కాక మనఃసహిత చేతనజీవాత్మలు ఎన్నో ఉన్నాయి. వీటన్నింటికి ప్రకృతి ఆయతనం కానేరదు. జడచేతనాత్మకమైన జగత్తుకు ఈశ్వరుడే ఆయతనం, ఆశ్రయం. జీవాత్మ ద్యులోకానికి భూలోకానికి ఆధారం కాదు. ఈలోకాలు ఆధేయాలు. ఆత్మ అధిష్టానం. అలాంటి ఆయతన ఆత్మ పరమాత్మే. జీవాత్మకు కేవలం భోకృత్వ సంబంధం ఉంది. పరమాత్మ తప్ప ఎవరూ ఈ జగత్తుకు అధిష్టానం కాదు. కనుక ఈ ఉపనిషత్ వాక్యంలోకి ఆత్మపదం పరమాత్మని సూచిస్తుంది. ఆయనే పృధివి ద్యులోకాన్ని ధరించి ఉన్నాడు. ఆయన ఉజ్జ్వలమైన ద్యులోకం దృఢమైన పృధివి, స్వర్గం, నాకం ధరించాడు.
అధర్వణ వేదం :- పృధివి, ద్యులోకం, అంతరిక్షం, దిక్కులు వీటన్నింటిని పరమాత్మ ధరించాడు. ఆయనలోనే సమస్త భవనాలు ఇమిడి ఉన్నాయి అని వేదాలు వర్ణిస్తున్నాయి. కాబట్టి పరమాత్మే విశ్వాయతనం, విశ్వాదిష్ఠానం అని రుజువు అవుతుంది. కనుక ఆత్మపదం ఇక్కడ పరమాత్మ వాచకమే. అమృతస్య ఏషా సేతుః ఆయనే సేతువు అన్న చోట ఈ సేతు పదం కూడా పరమాత్మకు వర్తిస్తుంది. కానీ ప్రకృతికి కాదు. ముముక్షువులు సంసారసాగరాన్ని తరించి అమృతత్వాన్ని పొందుతారు. అది పరమాత్మ మోక్షప్రాప్తికి సాధనం అని భావం.
సూత్రం :- 65
'ముక్తో పసృప్య వ్యపదేశాచ్ఛ"
ముక్త ఉపశృప్య వ్యాపదేశాత్ చ :- జీవన్ముక్తులైన బ్రహ్మవిదులకు ప్యాప్యం అని చెప్పినందువలన కూడా ద్యు, భూ లాంటి ఆయతనం బ్రహ్మమే అని అంగీకరించాలి సూత్రార్థం.
భావం:- జీవన్ముక్తులైన బ్రహ్మవిదులకు బ్రహ్మాన్ని గురించి ఉపదేశించుట వలన ద్యులోకం, భూలోకం వంటి వాటికి ఆయతనం బ్రహ్మమే అని అంగీకరించాలి.
వివరణ:- ముక్తులచే పొందదగినది అని చెప్పడం వలన ద్యులోకం, భూలోకం మొదలైన వాటికి అధిష్టానం బ్రహ్మమే. నేను, నాది అనే అహంకార మమకారాలు అజ్ఞానం. ఈఅజ్ఞానం వలననే శరీరం మొదలైన వాటికి గౌరవసత్కారాలవలన రాగం ఉద్భవిస్తుంది. దేహాన్ని అగౌరవపరిస్తే ద్వేషం కలుగుతుంది. శరీరం నాశనం అవుతుందేమోనని భయం, దాని మీద మోహం, ఈ రకంగా అవిద్య అనేక రకాలుగా ఉంటుంది. దీనికి విరుద్ధం ముక్తి. రాగద్వేషాలు లేనప్పుడు పొందే స్థానమే ముక్తి. అదే భూమి, స్వర్గం మొదలైనవాటికి అధిష్టానం బ్రహ్మ.
ముండకోపనిషత్తు:- ఆత్మ వేదాధ్యయనం వలన గాని, శాస్త్రజ్ఞానం వలన కానీ తెలియబడుతోంది. ఆత్మసాక్షాత్కారం నందు అకుంఠిత దీక్ష గల వారికే ఇది బోధపడుతుంది. ఐహిక బంధాలతో కూరుకుపోయిన వాడికి, కర్మ పరిత్యాగం చెయ్యని వాడికి, ఆత్మసాక్షాత్కారం జరగదు. బ్రహ్మనిష్ఠాగరిష్ఠలైన సన్యాసులకే ఇది గోచరిస్తుంది. జ్ఞానులైన మహర్షులు తమ హృదయంలో దర్శించిన ఆత్మనే పరమాత్మగా తెలుసుకుంటారు. ఉపనిషత్సారమైన బ్రహ్మజ్ఞానం తమ ధ్యేయంగా నిశ్చయించి సన్యసించిన యతీశ్వరులకు మాత్రమే బ్రహ్మలోకం ప్రవేశించి ముక్తి పొందుతారు. ముక్తి పరమపురుషులకు మాత్రమే కలుగుతుంది. ఆత్మ సాక్షాత్కారం కాగానే రాగద్వేషపూరితమైన హృదయగ్రంధి విడిపోతుంది. అన్ని సందేహాలు, కర్మలు, నశిస్తాయి. జ్యోతిస్సులకు జ్యోతిస్సు, శుద్ధం నిష్కళం, అయిన బ్రహ్మాన్ని ఆత్మవిదులు తెలుసుకుంటారు. పిదప ఉపనిషత్తులు, బ్రహ్మవిదులు, జీవన్ముక్తులు పొందవలసిన బ్రహ్మాన్ని గురించి ఉపదేశించాయి. విశ్వకర్మ, విశ్వనియంత, భూతయోని, ప్రకాశుడైన పరమపురుషుణ్ణి చూసి విద్వాంసుడు పుణ్యపాపాలనుంచి విముక్తుడై, నిరంజనుడై అత్యంత సమీపంగా ఉంటాడు. పరమాత్మతో అవిభాగమై జీవాత్మ ఉంటాడు. ప్రవహించే నదులు తమతమ రూపాలను విడిచి సముద్రాన్ని చేరి, అందులో అవిభక్తమై ఉంటాయి. అలాగే జీవాత్మ నామరూపాలనుంచి ముక్తుడై పరబ్రహ్మాన్ని చేరతాడు. యుక్తపురుషులు పరబ్రహ్మాన్ని పొందుతారు. కానీ ప్రకృతిని పొందరు. అందువలన ద్యుభ్వాధ్యాయతనంగా చెప్పిన ఆత్మ పరమాత్మని సూత్రానికి అర్ధం.
సూత్రం:- 66
" నానుమా మత చ్ఛబ్ధాత్ "
అనుమానం :- ప్రకృతి, న;- ద్యు, పృధివి లోకాలకు ఆధారం లేదు. అతః శబ్దాత్ :- ఈ ప్రకరణంలో ప్రకృతిని ప్రతిపాదించే శబ్దప్రయోగంలేదు.
భావం:- ప్రకృతి ద్యు, పృధివి లోకాలకు ఆధారం లేదు. ఈ ప్రకరణంలో ప్రకృతిని ప్రతిపాదించే శబ్ద ప్రయోగం లేదు. కనుక ప్రకృతి ద్యులోకాధిష్ఠానం కానీ, ఆత్మ కానీ కానేరదు.
వివరణ:- ఇక్కడ ప్రకృతి అని చెప్పే శబ్దం లేనందువలన అనుమాన ప్రమాణంలో ప్రకృతి ద్యుభ్వాదులకు అధిష్టానం అని చెప్పరాదు. బ్రహ్మాన్ని ప్రతిపాదించడానికి అనేకమైన విశేషాలు గతంలో చెప్పారు. కానీ ఇంకొక దానికి అలాంటివి చెప్పలేదు. కాబట్టి స్వర్గము, పృధివి మొదలైన వాటికి అధిష్టానం బ్రహ్మమే. అతః శబ్దాత్:- ప్రధానాన్ని చెప్పే శబ్దం ఏదీ లేకపోవడం వలన, ప్రధానం కంటే భిన్నమైన ఆత్మకు చెప్పే శబ్దం ఉండటం వలన, ప్రకృతి ప్రధానంగా బ్రహ్మాన్ని గురించి చెప్పబడే ప్రధానమైన హేతువు ఉన్నట్లుగా మరొక అర్ధాన్ని బోధించే విశిష్ట హేతువు ఏమి లేదు అని చెబుతున్నరు. అనుమానం:- ( ప్రకృతి ):-సాంఖ్యులు స్మృతులలో ప్రకృతిని ప్రధానంగా చెప్పినందున ఇక్కడ ద్యుభ్వాధ్యాయతనంగా గ్రహింపజాలదు. ఎందువలననగా అతచ్చబ్దం వలన అచేతనమైన ప్రధాన్నాన్ని ప్రతిపాదించిన శబ్దం తచ్ఛబ్దం. తచ్ఛబ్దం కానిది అతచ్చబ్దం. అక్కడ అచేతనమైన ప్రధాన ప్రతిపాదకమైన శబ్దం ఇది లేదు. 'యః సర్వజ్ఞ సర్వవిత్ ; ఇత్యాది శబ్దం ఇక్కడ ఉంది. అందుచేతనే అచేతనమైన వాయువు కూడా ఇక్కడ ద్యుభ్వాధ్యాయతనంగా గ్రహింపబడదు.
సూత్రం :- 67
" ప్రాణ భృత్ చ్చ "
ప్రాణ భృచ్చ :- ప్రాణధారి అయిన జీవాత్మ కూడా న :- ద్యుభ్వాధ్యాయతనం కాదు.
భావం:- ప్రాణధారి అయిన జీవాత్మ కూడా ద్యులోకం, పృధివిలాంటి వాటికి ఆధారం కాదు. ఆత్మ శబ్దం పరమాత్మకే వర్తిస్తుంది.
వివరణ:- ప్రాణాలను భరించేవాడు ప్రాణభృత్తు అంటే జీవుడు. అయితే విజ్ఞానాత్మా అయిన జీవుడు కూడా ద్యుభ్వాదులకు అధిష్టానం కాదు. జీవుడు సర్వజ్ఞుడు కాదు. అతనిలో ఆత్మత్వం, చేతనత్వమున్నాయి. కానీ జీవుడు ఉపాధి పరిచ్చిన్నుడు అంటే శరీరం ఉపాధిగా ధరించినవాడు. అందుకని జీవుడు సర్వజ్ఞుడు కాదు. మరి సర్వజ్ఞుడు బ్రహ్మమే. ప్రాణభృత్తుకు అనగా విజ్ఞానాత్మకు అంటే జీవునకు ఆత్మత్వ చేతనత్వాలు ఉన్నాయి. అయినప్పటికీ పరిచ్చిన్నమైన అత్యల్పంగా కుదించబడిన జ్ఞానంకల విజ్ఞానాత్మకు సర్వజ్ఞత్వాలు కుదరవు. అందుచేత అతచ్చబ్దాత్ అంటే ప్రకృతిని ప్రతిపాదించే శబ్ద ప్రయోగం వలననే జీవుడుకూడా ద్యుభ్వాధ్యాయతనంగా గ్రహింపదగినవాడు కాదు. పరమాత్మ చిత్ప్రకాశం, ఎల్లప్పుడూ నిత్యమై, జ్ఞానస్వరూపమై తాను స్వయంగా ప్రకాశిస్తూ ప్రపంచంలోని పదార్ధములన్నింటిని ప్రకాశింపజేస్తాడు. స్వయంజ్యోతి స్వరూపుడై తనకు విలక్షణమైన సకల జడ సముదాయములగు శరీరము, మనస్సు, ఇంద్రియములు, బుద్ధి మొదలగు వాని యందు ఎల్లవేళలా ప్రకాశించును. సచ్చిదానంద స్వరూపమైన జీవుడి నిజస్వరూపమునకు అతడి ఉపాధులే అవరోధాలు. ఉపాధులన్నీ అనాత్మ పదార్ధములు. ఇవి అజ్ఞానం వలన గోచరించెడి జడ సముదాయాయములను జ్ఞానంతో విడవవలెను.
ముండకోపనిషత్తు:-పరమాత్మ సర్వజ్ఞుడు. సర్వవిదుడు. సర్వజ్ఞత్వం, సర్వనేతృత్వం జీవాత్మకు వర్తించవు. జీవాత్మ అల్పజ్ఞుడు. కాబట్టి ప్రాణాధారి అయిన జీవాత్మ ద్యుభ్వావాధ్యాయతనం కాదు.
ప్రశ్నోపనిషత్తు;- (4 ,11 ):- "తదక్షరం వేదయతే యస్తు సోమ్య! స సర్వజ్ఞః సర్వమే వావివేశ ." ఓ సోమ్యా! అక్షరాన్ని ఎరిగినవాడు సర్వమూ పొందుతాడు. అన్నవాక్యంలో బ్రహ్మవిదులు, సర్వజ్ఞులు అవుతారని అన్నారు కదా! అప్పుడు సర్వజ్ఞత్వ విశేషణం జీవాత్మకు చెల్లుతుంది కదా! కనుక జీవాత్మ ద్యుభ్వాధ్యాయతనం ఎందుకు కాదు? తరువాత సూత్రంలో దీనికి సమాధానం చెబుతున్నారు. అతచ్చబ్దాత్ అనే హేతువు ప్రకృతికి, జీవుడికి రెండింటికి సమానమే. కనుక నామమాన ప్రాణ భృతాపచ్చష్ఠాత్ అని ఒకే సూత్రంలో చెప్పవచ్చును కదా! అనే సంశయం కలగవచ్చును. ప్రాణభృచ్చ అనేది రాబోయే సూత్రాలలో కూడా అన్వయించడం కోసం వేరే సూత్రంగా రచించబడింది.
సూత్రం :- 68
'భేద వ్యపదేశాచ్చ"
భేద:-ఆత్మను పరమాత్మకన్నా వేరేఅని వ్యపదేశాచ్చ:-చెప్పడం వలన, ప్రాణాధారి అయిన జీవాత్మ ద్యుభ్వాద్యాయతనం కాదు.
భావం:- జీవాత్మకు పరమాత్మను మధ్య భేదం చెప్పడం ప్రాణాధారి అయిన జీవాత్మ ద్యుభ్వాధ్యాయతనం కాదు.
వివరణ:- జీవాత్మకు పరమాత్మకు మధ్య భేదం చెప్పడంవలన జీవుడు అధిష్టానం కాదు. ముండకోపనిషత్తులో చెప్పినట్లుగా సంసారమనే వృక్షం మీద రెండు పక్షులు కూర్చుని ఉన్నాయి. ఒకటి కర్మ ఫలాలు అనుభవిస్తోంది. రెండవది చూస్తూ కూర్చుంది. అజ్ఞానంతో ఉన్నంతకాలం అవి రెండూ పక్షులుగానే కనిపిస్తాయి. జ్ఞానం కలిగిన తరువాత అవి రెండూ ఒక్కటే అని తెలుస్తుంది. అదే మోక్షం. కాబట్టి అధిష్టానం బ్రహ్మమే అని చెప్పారు. మరి ఏ కారణం చేత ద్యుభ్వాధ్యాయతంగా గ్రహింపకూడదు? 'తమేవైకం జానధమాత్మానాం" ఆత్మ శబ్దవాచ్యాన్ని తెలుసుకో? అనే వాక్యంలో పరమాత్మ జ్ఞేయం. జీవాత్మ జ్ఞాత అని వర్ణించారు. జ్ఞాత అయిన జీవుణ్ణి ఇలా వేరుగా ఉపదేశించడం వలన జీవాత్మ ద్యుభ్వాధ్యాయతం కాదు. అది పరమాత్మే. పరమాత్మయందు జ్ఞాత తెలుసుకునేవాడు, జ్ఞానం తెలుసుకోవడం, జ్ఞేయం తెలుసుకోబడేది. ఉదాహరణకు స్తంభం జ్ఞేయం, దానిని తెలుసుకొనే నేను జ్ఞాత, స్తంభం గురించిన వివరాలు తెలుసుకోవడం జ్ఞానం. దీనిని త్రిపుటి అంటారు. చిదానంద స్వరూపమైన ఆత్మ తనంత తానుగా ప్రకాశిస్తోంది. ఆత్మను తెలుసుకోవడానికి ఆత్మసాక్షాత్కారం, ఆత్మానుభూతికి కష్టం చేసి సాధన చేస్తే అది కనబడుతుందా? కనబడితే అది త్రిపుటి అవుతుంది. నువ్వు ఫలానా అని తెలుసుకుంటే త్రిపుతిలో ఉన్నట్లే. పరమాత్మ సాక్షాత్కారం లభిస్తే నువ్వు పరమాత్మే అవుతావు. తెలుసుకోవలసిన అవసరం లేదు. నువ్వు పరమాత్మవి అయినప్పుడు తెలుసుకోవు. తెలుసుకోవడం లేదు. తెలుసుకునేవాడు ఎవడో వాడే తెలియబడతాడు. పరమాత్మను మనం అందుకోవడం కాదు. పరమాత్మే తనంతతనుగా తెలియబడతాడు. పరమాత్మ స్వయంప్రకాశం. తెలియబడేస్థితి కోసమే ఈసాధన. జ్ఞాత అయిన జీవాత్మకు జ్ఞేయం అయిన పరమాత్మకు భేదం చెప్పబడటం వలన జీవుణ్ణి ద్యుభ్వాధ్యాయతనంగా గ్రహింపకూడదు. తమేవైకం జానధమాత్మానాం అని ఇక్కడ జ్ఞేయం జ్ఞాత భావాన్ని పురస్కరించుకొని భేదవ్యపదేశం కూడా ఉంది. జీవుడైతే ముముక్షువు అందుచేత జ్ఞాత. తెలుసుకునేవాడు. పరిశేషన్యాయం చేత ఆత్మశబ్దం చేత చెప్పబడే బ్రహ్మ జ్ఞేయం. తెలియదగినది. అదే ద్యుభ్వాధ్యాయతనంగా తెలియ బడుచున్నది. కానీ జీవుడు కాదు. ఇద్దరిలో ఒకరిని చూసి ఇతడు చాలా తెలివైనవాడు అని అంటే రెండవ వాడు తెలివైన వాడు కాదు అని చెప్పకపోయినా తెలుస్తుంది.అదే పరిశేష న్యాయం.
సూత్రం :- 69
"ప్రకరణాత్"
ప్రకరణాత్ చ :- ఇది పరమాత్మ ప్రకరణం అవడం కూడా జీవుణ్ణి ద్యుభ్వాధ్యాయతనంగా గ్రహించకూడదు అని అర్ధం.
భావం:- ఇది పరమాత్మ ప్రకరణం అవడం వల్ల ప్రాణాలను ధరించే జీవుడు అధిష్టానం కాలేదు. ఏదైనా అర్ధం చెప్పేటప్పుడు సందర్భాన్ని బట్టి చెప్పాలి. అందుచేత అన్నిటికీ అధిష్టానం బ్రహ్మమే.
వివరణ:-బృహదారణ్యకం:-ఆత్మావారే దృష్ట్రవ్యః శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్యః' ఆత్మే చూడతగినది. మననం చెయ్య వలసినది. ధ్యానం చెయ్యవలసినది అని యాజ్ఞవల్కుడు మైత్రేయితో అంటాడు. ఇక్కడ బ్రహ్మ పదార్ధమే జ్ఞేయం. తెలుసు కునే వాడు జ్ఞాత.
ముండకోపనిషత్తు:-( 1 ,1, 3 ):-భగవాన్! ఏది తెలుసుకుంటే ఇదంతా తెలుస్తుంది? అనే ఈ ప్రశ్న జీవాత్మకు ఒప్పదు. జీవాత్మ జ్ఞానం సర్వవిజ్ఞానానికి కారణం కాదు. ఇలా ప్రకరణంలో పరమేశ్వరవిషయిక చర్చ ఉన్నందున ఆయనే ద్యుభ్వాధ్యాయతనం. ప్రాణధారి జీవాత్మ కాదు. సర్వాత్మకమైన పరమాత్మను తెలుసుకుంటే ఇదంతా తెలుస్తుంది. కానీ కేవలం జీవుణ్ణి తెలుసుకుంటే ఏమి తెలియదు కదా! ఆత్మ స్వరూపుడైన ఆపురుషుడు నిజముగా మహా ప్రభువు. సర్వ నియామకుడు, జ్యోతిఃస్వరూపుడు, అత్యంత నిర్మలమైన వాడు, ఇతని వల్ల అన్ని జీవులు చలించుచూ అభివ్యక్తమగు చున్నవి. సర్వేంద్రియ కార్యకలాపములతో ప్రకాశించుచు సర్వమునకు నియామకుడైన ప్రభువై అలరారు ఆత్మస్వరూపుడు ఆరాధ్యుడు. దేవతలకు ప్రభువు ఎవరో సర్వలోకములు ఎవని యందు సాగుచున్నావో ద్విపాదులగు మానవులను చతుష్పాదులగు జంతువులను ఎవరు పాలించుచున్నారో సత్ చిదానంద స్వరూపుడగు ఆ భగవంతుడే ఎల్లప్పుడూ ఆరాధ్యుడు. అవసరమైనప్పుడు లోక కళ్యాణార్ధమై ధర్మ సంస్థాపన కొరకు ఈ జగద్రక్షకుడు ఉన్నాడు. సర్వ లోకములకు ప్రభువై అన్ని జీవుల యందు దాగి ఉన్నాడు. బ్రహ్మఋషులు, దేవతలు ఆయన్ని సాక్షాత్కరించుకొని జననమరణ పాపముల నుండి విముక్తులౌతున్నారు. ఈ సర్వలోకములు శాశ్వతముగా పరిపాలించే వాడు పరమాత్మే. ఆవినాశి, సర్వజ్ఞుడు, సర్వ వ్యాపి అయిన ఆ జగద్రక్షకుడే తప్ప మరెవరూ సర్వ లోకములకు అధిష్టానం కాదు.
సూత్రం :- 70
స్థి త్యద నాభ్యంచ
స్థితి :- సాక్షిరూపంగా ఉండటం వలన, అదనాభ్యాం:- కర్మ ఫలం అనుభవించడం వలన, చ:- కూడా
భావం ;- పరమేశ్వరుడు సాక్షి రూపంగా ఉదాసీనంగా ఉండటం వలన, జీవుడు కర్మఫలం అనుభవించడం వలన లోకాలకు అధిష్టానం బ్రహ్మమే.
వివరణ:- పరమేశ్వరుడు ఉదాశీనంగా ఉండటం, జీవుడు కర్మ ఫలం అనుభవించడం అనే గుణాల వలన ప్రాణాలు ధరించే జీవుడు అధిష్టానం కాదు. సాక్షిగా ఉండటం పరమేశ్వరుడి ధర్మం. జీవాత్మ జ్ఞాత. పరమాత్మ జ్ఞేయం. పరబ్రహ్మాన్ని గురించి తెలుకునేవాడు జ్ఞాత. ఏదైతే సకల చరాచర సృష్ఠికి మూలమైనదో ఆపరబ్రహ్మ తత్త్వం జ్ఞేయం అవుతుంది.
ముండకోపనిషత్తు:- (3 1 2 ):- పరమాత్మ, జీవాత్మ అనే రెండు పక్షులు ఒకే చెట్టు మీద ఉన్నాయి. వాటిలో మొదటి పక్షి జీవాత్మ కర్మ ఫలాలను అనుభవిస్తోంది. రెండవ పక్షి పరమాత్మ జీవాత్మ చేసే కార్యకలాపాలన్నింటిని ఉదాసీనంగా కూర్చుని చూస్తోంది. కాబట్టి కర్మలను అనుభవించే జీవుడు శరీరధారి. కాబట్టి అతడు లోకాలకు అధిష్టానం కాదు. ద్యులోకానికి భూలోకానికి అధిష్టానం బ్రహ్మమే. ద్వా సూపర్ణా సయుజా సఖియా అనే వాక్యంలో స్థితి అంటే సాక్షిగా ఉండటం, అదనం అంటే కర్మఫలం నిర్దేశించబడుతున్నాయి. ఇక్కడ చెప్పిన ఆ స్థితి అదనములను బట్టి ఈశ్వరుడు క్షేత్రజ్ఞుడుగా ద్యుభ్వాధ్యాయతనం కుదురుతుంది. చూడబడేది అంతా క్షేత్రమే. ఈ భూమి, గ్రహాలు, గేలాక్షీ, అన్ని క్షేత్రములే. ఈ శరీరం మనచేత చూడబడుతోంది. కనుక ఇది కూడా క్షేత్రమే. క్షీణించే గుణం కలది క్షేత్రం. క్షేణించడం అంటే మార్పు చెందడం. కలుసుకున్నవి విడిపోవడం. పంచభూతలతో నిండిన ఈ శరీరం మరణించగానే పంచ భూతలలో వేటికవి కలసిపోతాయి. అన్నింటిలో ఉండే ఆత్మచైతన్యం క్షేత్రజ్ఞుడు. సర్వజ్ఞుడు. క్షీణించేదే క్షేత్రం అయితే క్షీణించకుండా ఉండేది క్షేత్రజ్ఞుడు. జీవుడు శరీరంలోని అవయవాలను చూచేవాడు గుర్తించేవాడు ఎవరో ఒకరు ఉండాలి కదా! ఆయనే, ఆ తత్త్వమే క్షేత్రజ్ఞుడు. ఇది క్షేత్రము అని తెలుసుకున్నవాడే క్షేత్రజ్ఞుడు. కానీ అజ్ఞానంతో జీవుడు తానే చూస్తున్నట్లు అన్ని కార్యములు తానే నిర్వహిస్తున్నట్లుగా భ్రాంతికి లోనవుతున్నాడు. జీవుడు కేవలం కర్మఫలం అనుభవించడానికి మాత్రమే జన్మలు ఎత్తు చున్నాడు. జీవుడు చేస్తున్న కర్మలకు పరమాత్మ సాక్షిగా చూస్తూ ఉదాసీనంగా ఉంటాడు.అందుకే లోకాలకు అధిష్టానం పరబ్రహ్మమే అని గ్రహించాలి.
సూత్రం :- 71
" భూ మా సంప్రసాదా దధ్యుపదేశాత్ "
సంప్రసాదాత్:- జీవాత్మకన్నా, అధిఉపదేశాత్:- ఈశ్వరుడు అధికుడు అని ఉపదేశించడం వలన, భూమా:- చాందోగ్యంలో వర్ణించిన భూమా అంటే పరమాత్మ. భూమా:-అన్నింటికన్నా గొప్పది.
భావం:-జీవాత్మ కన్నా ఈశ్వరుడు అధికుడని ఉపదేశించడం వలన అన్నింటికన్నా గొప్పది అయిన భూమా అంటే పరమాత్మే.
వివరణ :- ఛాందోగ్యోపనిషత్తు:-( 8, 12, 3 ):-జీవాత్మ ఈ శరీరాన్ని విడిచి పరమాత్మను పొంది స్వస్వరూపాన్ని తెలుసుకొని ఉత్తమపురుషుడౌతాడు. భూమ అంటే ఏమిటో తెలుసుకోవాలి. భూమ మాత్రమే సుఖం, అల్పంలో సుఖం లేదు. భూమనే తెలుసుకోవాలి. భగవాన్! నేనుదాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. దేనిలో ఇంకొకటి చూడమో, వినమో, తెలుసుకోమో, అదే భూమ. ఎందులో ఇతరం చూస్తామో, వింటామో, తెలుసుకుంటామో అది అల్పం. భూమ అమృతం. అంటే పరమాత్మే. నారదుడు ఆత్మజ్ఞానం పొందాలని తపిస్తూ సనత్కుమారుడి దగ్గరకు వెడతాడు. ఆత్మజ్ఞానం లేక శోకసముద్రములో మునిగిన నన్ను దరిచేర్చండి అని అడుగుతాడు. అందుకు సనత్కుమారుడు నీవు తెలుసుకున్న విద్యలన్నీ నామ సమూహములే. అంతకన్నా మిన్నకావు. నామమనేది, వర్ణమనేది బ్రహ్మం నుంచి జనించింది. బ్రహ్మప్రాప్తికి అది సాధనం. కనుక నామమే బ్రహ్మమని ఉపాసించు అన్నాడు. నామం కన్నా గొప్పది ఏమిటి? అని అడిగాడు. దాన్ని ఉత్పత్తి చేసే వాక్కు నామం కన్నా అధికం అన్నాడు. వాక్కు కన్నాగొప్పది ఏదీ అని అడిగాడు? వాక్కు కన్నా మనస్సు, దాని కన్నా సంకల్పం, అంత కన్నా చిత్తం, చిత్తం కన్నా ధ్యానం వీటి కన్నా క్రమంగా విజ్ఞానం, బలం, అన్నం, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, స్మరణం, ఆశ, ప్రాణం ఇవన్నీ ఒకదాని కంటే మరొకటి అధికం అని సనత్కుమారుడు సమాధానం చెప్పాడు. ఈక్రమంలో చేస్తాను అని నిశ్చయమే మనస్సు. ఆ నిశ్చయం వాక్కును ప్రేరేపిస్తుంది. ఆ నిశ్చయనికి కారణం సంకల్పం. ఈసంకల్పానికి కారణం చిత్తం. శాస్త్రీయ విషయాల పట్ల ఏకాగ్రత ధ్యానం. దానికి కారణం విజ్ఞానం. ఈ విజ్ఞానానికి శాస్త్రాలలో ప్రతిపాదించిన విషయం, దాని వలన మనస్సులో ఏర్పడిన సామర్ధ్యం బలం, దానికి అన్నం, అన్నానికి జలం, దానికి అగ్ని, ఆ అగ్నికి వాయువు, దానికి ఆకాశం కారణాలు. ఆకాశాన్ని భోగ్యంగా పరిగణిస్తారు. దాని కోసం ఆశ జనిస్తుంది. ఆశ ఉన్న ప్రాణి తనకు ఇష్టమైనదాన్ని స్మరిస్తాడు. ఆ ఆశకు హేతువు ప్రాణం. జీవాత్మ భోక్త. కనుక జీవాత్మ భూమ కాదా? అంటే పైన చెప్పిన విధంగా ఒక దానికన్నా మరొకటి అధికమైనట్లే ప్రాణం కన్నా భూమ అధికం. ఈ ప్రకరణంలో ప్రాణం అంటే జీవాత్మ అని సత్యం అంటే పరమాత్మఅని గుర్తించాలి. సత్యమే తెలుసుకోతగ్గది అని సనత్కుమారుడి చెప్పాడు. సత్యమే బ్రహ్మం అయితే జీవాత్మ అల్పం భూమ అధికమే అవుతుంది. జీవాత్మ శరీరానికి బద్ధుడై ఉంటాడు. ప్రాణం కంటే ఆశ గొప్పది. నువ్వు అతివాదివా అని ఎవరైనా ప్రశ్నిస్తే అతివాదినేనని సమాధానం చెప్పాలి. ప్రాణాన్ని గురించి తెలిసినవాడు అతివాది అవుతాడు. ఎవడు సత్యం చేత అతివాదం చేస్తాడో అతడు అతివాదం చేసేవాడు. కనుక ప్రాణం కన్నా గొప్పది భూమ ఉపదేశింపబడుతోంది.
సూత్రం :- 72
" ధర్మోపపత్తేశ్చ"
చ:- అంతే కాక , ధర్మ ఉపపత్తేః :- భూమకు చెప్పిన ధర్మాలు పరబ్రహ్మనికే వర్తిస్తాయి.
భావం:- భూమకు చెప్పిన ధర్మాలు పరబ్రహ్మనికే వర్తిస్తాయి. కనుక భూమ పరమాత్మ వాచకమే.
వివరణ: -ఛాందోగ్యోపనిషత్తు:-భగవాన్! ఈభూమ ఎందులో ప్రతిష్ఠితమైఉన్నది? అనిప్రశ్న. తనమహిమలోనే అని సమాధానం. ఈ ధర్మం క్రింద, పైన, వెనుక, ముందు, అన్ని దిక్కులలోను ఆ భూమే. ఆత్మ, ప్రాణం, దిక్కులు, ఆకాశం అన్నింటిటిని ధరించింది. సర్వగతత్వం, స్వమహిమ ప్రతిష్ఠితత్త్వం, సర్వాధారత్వం అనే ధర్మాలు పరమాత్మవే, కానీ జీవాత్మకు చెందవు. ఈశ్వరుడు ఒక్కడే. అది సత్యం. అద్వైతుడుగా ఉన్న ఈశ్వరుడు రెండుగా అయ్యాడు. దానినే పరా ప్రకృతి, అపరాప్రకృతి అంటారు. పరాప్రకృతి అంటే ఈశ్వరుడు. ఆయన నుండి వచ్చినపంచ భూతాత్మక మైన అనంత విశ్వం. దీనినే అర్ధనారీశ్వర తత్వం అంటారు. పరమేశ్వరుడు పరమాత్మ అయితే, అంబ ప్రకృతి. ఇద్దరు వేరు కాదు. పరమాత్మ గుణ రహితము, నిర్గుణము, నిర్వికారము, స్వతంత్రము, నిత్యము, సత్యం. అపరాప్రకృతి 8 విధములుగా విభజించబడింది. భూమి, ఆకాశం, అగ్ని, వాయువు, నీరు, ఇవి ఒకదాని నుండి మరొకటి వచ్చాయి. ఆకాశతత్వం, వాయుతత్వం, జలతత్వం, అగ్నితత్వం, భూమితత్వంతో బాటు మనస్సు, బుద్ధి, అహంకారం, ఈ 8 మరొక దాని మీద ఆధారపడతాయి. వీటికి స్వతంత్రతలేదు. అన్నిపరమాత్మ లోనే ప్రతిష్ఠితమై ఉన్నాయి. ఈధర్మాలు జీవాత్మకులేవు, కనుక భూమా శబ్దం పరమాత్మ వాచకమే. భూమలో దర్శనాది వ్యవహరలేవి ఉండవని చెబుతున్నది. "యత్ర ..పశ్యేతి " ఇత్యాది శృతులలో పరమాత్మ యందు ఇలాంటి వ్యవహారలేవి ఉండవని చెప్పబడింది. సుషుప్తావస్థలో మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు ఏమి పనిచేయవు. ఏ వస్తుప్రపంచం, జీవరాశులు ఏమి కనిపించవు. జీవుడు సుషుప్తిలో మనోకల్పితమైన వృత్తులు లేనందున అపరిమితమైన ఆనందాన్ని అనుభవిస్తాడు. ఆ సమయంలో ప్రాణం ఒకటే చైతన్యవంతంగా ఉంటుంది. జాగ్రదావస్థలోని అనుభవాలన్నీ స్వప్నావస్థలో స్వప్నపురుషుడు దర్శిస్తాడు. సుషుప్తిలో ప్రాణం చైతన్యవంతంగా ఉంటుంది కనుక ప్రాణమే పరమాత్మ ఎందుకు కాకూడదు అని సందేహం రావచ్చును. తెల్లవారగానే సుషుప్తిలో నుంచి మేలుకోగానే జీవుడు లౌకిక వ్యవహారాలతో తాదాత్మ్యం చెందుట వలన ప్రాణం పరబ్రహ్మ కాదు. ప్రాణం కన్నా శ్రేష్ఠమైనది ఆత్మ, సర్వానికి అధిష్టానం భూమనే అంటే పరమాత్మ అని చెప్పబడినది. ఇక్కడ భూమయే సుఖం. అల్పంలో సుఖం లేదు. దుఃఖమిశ్రితమైన సుఖాన్ని నిరాకరించడం చేత భూమ సుఖాత్మకమైన బ్రహ్మాన్ని చూపుతుంది. "యో వై భూమా తదమృతం " అని ఇక్కడ వినబడుచున్న అమృతత్వం కూడా బ్రహ్మాన్ని తెలుపుచున్నది. సత్యత్వం, తన మహిమ నందే తను నిలచి ఉండటం, సర్వగతత్వం, సర్వాత్మకం, అనే ధర్మాలను బట్టి భూమ పరమాత్మయే నని నిశ్చయమైనది.
అక్షరాధికరణం :- ( 1, 3 ,10 )
సూత్రం :- 73
"'అక్షర మంబ రాంత ధృతే '"
అంబర అంత ధృతే :- ఆకాశ పర్యంతం సమస్త ప్రపంచాన్ని తత్ కారణమైన ప్రకృతిని ధరించడం వలన, అక్షరం :- అక్షర పదం పరమాత్మ వాచకమే.
భావం:- ఆకాశం నుండి సమస్త ప్రకృతి జనించుట వలన, అక్షర పదం పరమాత్మ వాచకమే.
వివరణ:- బృహదారణ్యకోపనిషత్తు:- గార్గి, యాజ్ఞ వల్కుడు మధ్య ఓ సంవాదం జరిగింది. "ఎందుకు ఆకాశం ఓతప్రోతమై ఉంది "? అని అడిగింది గార్గి. అందుకు యజ్ఞవల్కుడు, గార్గి! అది అక్షరం, అది స్థూలం కాదు, అణువు కాదు. హ్రస్వము కాదు. అని బ్రాహ్మణులు అంటారు. ఇక్కడ ఆకాశానికి ఆశ్రయంగా వర్ణించింది, జీవాత్మనా పరమాత్మనా? అక్షరం అంటే నాశనం లేనిది.జీవాత్మకు కూడా నాశనం లేదు కదా! ప్రకృతికి కూడా నాశనము లేదు కదా? అంటే జీవులకు భోగం కలిగించడానికి ప్రకృతి ఆకాశాది రూపంలో పరిణమిస్తోంది. కానీ ప్రకృతికి జీవుడు ఆశ్రయం కాదు.నిజానికి ఆశ్రయం ఎవరు? అన్నదే గార్గి ప్రశ్న. అక్షరం ఆశ్రయం అని జవాబు. ఈ అక్షరమే పరబ్రహ్మ.
అధర్వణ వేదం:- "మస్మిన్ భూమిరంతరిక్షం ధ్యౌర్యస్మిన్ అధ్యహితా":-పృధివి , అంతరిక్షం, ద్యులోకం అంతా పరమాత్మలోనే ఉన్నాయి. వికారజాతంతో కూడిన ప్రకృతికి ఆశ్రయం పరమాత్మే. జీవాత్మ కాదు. పంచభూతాత్మక మైన ప్రకృతే ప్రపంచంగా పరిణమిస్తోంది. ఈ అక్షరపదం జీవాత్మకు వర్తించదు. అక్షరం అంటే అకారం నుంచి క్షకారం వరకు గల సమామ్నాయం. అక్షరమే బ్రహ్మ అని అన్నప్పుడు ఈ అక్షర సమామ్నాయమే పరమాత్మ అవుతుంది. అంటే ప్రకృతినే పరబ్రహ్మ అనాలి కదా! అని అనుమానం వ్యక్తం చేశాడు కృష్ణ శర్మ. దానికి సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. అక్షరం అంబరతదృతే భూమి దగ్గర నుండి ఆకాశం వరకు అన్ని రకాలైన స్వరూపాలు అక్షరానివే. అక్షరం అంటే నాశనం లేనిది. అదే పరబ్రహ్మ. సర్వమూ ఆకాశం నుండి ఉద్భవించింది. ఆకాశం పరబ్రహ్మము నుండి ఉద్భవించింది కాబట్టి ఆకాశంతో సహా సమస్తము పరబ్రహ్మ లోనే లీనమై ఉన్నాయి. అందుచేత అక్షరం అంటే పరమాత్మే కానీ ప్రకృతి కాదు. అన్నింటి కన్నా ఉత్తమమైనది, నాశనము, మార్పు లేనిది, అయిన దానిని బ్రహ్మం అంటారు. ఆ బ్రహ్మ యొక్క స్వభావమే అధ్యాత్మము అని చెప్పబడుతోంది. బ్రహ్మ అంటే అక్షరం. అంటే క్షరం కానిది. నాశనము లేనిది అన్నింటికన్నా గొప్పది. అంతకంటే పెద్దది. ఉత్తమమైనది మరొకటి లేదు. "ఓంకార ఏ వేదం సర్వమ్.". ఇదంతా ఓంకారమే. ఈ ఇతర శృతులలో వర్ణం కూడా ఉపాస్యంగా సర్వాత్మకమని తెలుపు చున్నది. అన్ని కారణముల చేత చెప్పబడేది వర్ణమే. అక్షర శబ్దం చేత చెప్పబడేది పరమాత్మయే. ఎందువలననగా పృధివి మొదలు ఆకాశం వరకు ఉన్న కార్యజాతాన్ని అంతటిని ధరించడం వలన త్రికాలములలో సమస్త వికారములు చెందే కార్యజాతమంతా ఆకాశంలో ప్రతిష్టింపబడింది. ఓంకారం బ్రహ్మ సాక్షాత్కారానికి సాధనం. గాన ఓంకారాన్ని స్తుతించడం వలన నిత్యత్వం ,వ్యాపిత్వం అయిన పరమాత్మ గురించి తెలుస్తుంది. ఆయన ఆజ్ఞ నుంచే సూర్యచంద్రులు తమ కర్తవ్యం నిర్వహిస్తున్నారు. శాసించడం పరమేశ్వరుడికి మాత్రమే సంబందించిన కర్మ. ఘటాదులకు కారణమైన అచేతనమైన మట్టి మొదలైన వాటికి ఘటాదులను శాసించే శక్తి లేదు కదా. అందుచేత అక్షరం అంటే పరమాత్మే కాని ప్రకృతి కాదు.
సూత్రం :- 74
" సా చ ప్రశాసనాత్ "
సా చ :- అంబరాంత ధృతి , ప్రశాసనాత్;- ఈశ్వరుడి శాసనం
భావం:- ఆకాశపర్యంతం సమస్తప్రపంచాన్ని, దానికి కారణమైన ప్రకృతిని ధరించడం ఈశ్వరుడి శాసనం వల్లనే సంభవిస్తుంది.
వివరణ :- ధరించడం అనేది ప్రశాసనం వల్లే జరుగుతుంది. ప్రశాసనం అంటే ఆజ్ఞ. ఈ విధంగా ప్రశాసనం చెయ్యడం పరమాత్మ వలననే జరుగుతుంది. కనుక అక్షర పదం పరబ్రహ్మనికే వర్తిస్తుంది. కాలాలను అనుసరించి ప్రకృతి తన కార్యక్రమాలను పరమేశ్వరుడి శాసనాన్ని అనుసరించే నిర్వహిస్తుంది. సూర్యాది లోకాలకు ఉన్న దివ్యధారణా సామర్ధ్యం జీవుడుకి లేదు. ఈ ధారణ జీవాత్మ శక్తికి మించింది. ఏతస్య తిష్ఠతి ;- ఓ గార్గి! ఈ అక్షరం యొక్క ఆజ్ఞ యిదే సూర్యచంద్రులు వారి ధర్మం నెరవేరుస్తున్నారు. ఇత్యాది వాక్యాలలో శాసించడం వినబడుచున్నది. ప్రశాసనం పరమేశ్వరుడికి మాత్రమే సంబంధించిన కర్మ. అచేతనమైన ప్రధానానికి శాసించే అధికారం లేదు. ఘటాలకు కారణమైన మట్టికి ఘటాలను శాసించే శక్తి లేదు.
బృహదారణ్యకోపనిషత్తు:-( 3, 8, 9 );-ఓ గార్గి! ఈ అక్షర శాసనం వలననే సూర్యచంద్రాదులు పృధివి, ద్యులోకాలు ధారణ జరుగుతోంది. అని శాసనపూర్వక ధారణ గురించి పేర్కొన్నారు. కాబట్టి ఇక్కడ అక్షరపదం పరమాత్మ వాచకం. పరమాత్మ సర్వసాహసకుడు. సర్వాధిపతి. సర్వ నియామకుడు. మనుస్మృతి:- అన్నింటిని శాసించేవాడు, సూక్ష్మం కన్నా సూక్ష్ముడు, స్వప్నధీగమ్యుడైన వాణ్ణి పరమపురుషుడిగా తెలుసుకోవాలి. అందువల్ల ఆకాశమంత సమస్త ప్రపంచాన్ని ప్రశాసన పూర్వకంగా ధరించే అక్షరం పరమాత్మ. ఈశ్వరుడు సకల చరాచర భూతముల యొక్క హృదయములలో తిష్ట వేసుకొని ఉన్నాడు. అంతే కాదు. సకల ప్రాణికోటిని తన మాయచేత, యంత్రం తిప్పేవాడు యంత్రమును తిప్పినట్లు, జీవులను నియంత్రిస్తున్నాడు. ఈశ్వరుడు సర్వభూతములలో అంటే సకలజీవరాశుల హృదయాలలో ఆత్మస్వరూపుడుగా నిలచి యున్నాడు. కానీ ఆయనను ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. అదే మాయ. సకల జీవరాశులను తన చేతనాశక్తితో నియంత్రిస్తున్నాడు. తన ఇష్టం వచ్చినట్లు ఆడిస్తున్నాడు. పరమాత్మ జీవులకు స్వేచ్ఛను ఇచ్చాడు. ఆ స్వేచ్ఛను ఎలా ఉపయోగించుకుంటున్నారో హృదయంలో ఉన్న పరమాత్మ సాక్షిభూతంగా చూస్తూ ఉంటాడు. పరమేశ్వరుడి శాసనాన్ని నియమాన్ని అనుసరించే ఆకాశ పర్యంతం ప్రపంచ ధారణ జరుగుతోంది.
సూత్రం :- 75
"అన్యభావ వ్యావృత్తేశ్చ"
అన్యభావ:- పరమాత్మ కన్నా భిన్నమైన ప్రకృతి, జీవాత్మలను, వ్యావృత్తేః చ :- నిరాకరించడం వలన కూడా అక్షరపదం పరమాత్మ వాచకమే.
భావం:- పరమాత్మ కన్నా భిన్నమైన ప్రకృతి, జీవాత్మలను నిరాకరించడం వలన అక్షర పదం పరమాత్మ వాచకమే.
వివరణ:- అన్య భావం అంటే ఈశ్వరునికన్నా భిన్నమైనది అని అర్ధం. పరమాత్మ కన్నా భిన్నమైనవాడు అక్షరునిలో లేదు. కాబట్టి అక్షరం అంటే పరమాత్మే కానీ ప్రకృతి కాదు.
బృహరారణ్యకోపనిషత్తు:- జనకుని కొలువులో ఆధ్యాత్మిక సామ్రాజ్యచక్రవర్తి ఎవరో తెలుసుకోవాలని జనక మహారాజు పరీక్ష పెట్టాడు. ఆ సందర్భంలో యాజ్ఞవల్కునికి, గార్గికి మధ్య వాదన జరుగుతుంది. యాజ్ఞవల్కా! ద్యులోకానికి పైన,భూలోకానికి క్రింద, బ్రహ్మాండం యొక్క మధ్యలో ఉన్నట్టి భూత,వర్తమాన, భవిష్యత్తులుగా పేర్కొనబడినటువంటి ఈ ప్రపంచమంతా దేనిలో వ్యాపించి ఉంది? నక్షత్రాలకు పైన, భూమి క్రింద, ఈ రెంటికి మధ్య భూతభవిష్యద్వర్తమానాలలో ఏముంటుందో వివరించండి? అడిగింది గార్గి. సర్వవ్యాపకమైనది, భూతభవిష్యద్వర్తమానాలలో కూడా ఉండేది ఆకాశం మాత్రమే. అని సమాధానం చెప్పాడు యాజ్ఞ వల్కుడు. మహానుభావా! ఆకాశం కన్నా సూక్ష్మమైనది, సర్వాంతర్యామి అయినది బ్రహ్మమే. ఆది మధ్యాంత రహితమైనది పరమ సత్యం అన్నాడు యాజ్ఞవలకుడు. గార్గి! బ్రాహ్మణులు అక్షరాన్ని ఇలా వర్ణిస్తారు. అక్షరం స్థూలం, సూక్ష్మం ,హ్రస్వ, దీర్ఘం కాదు. లోహితం(అగ్ని), స్నేహం (జలం ),వాయువు, ఆకాశం కాదు. దానికి కళ్ళు ,చెవులు, వాక్కు, మనస్సు లేవు. అంటే ప్రకృతి కాదు. ఇలా అక్షరవర్ణనలో ప్రకృతి, జీవాత్మ స్థూలభూతాలు ఏవి అక్షరం కాదని స్పష్టంగా అన్నారు. అందువల్ల అక్షరపదం పరమాత్మవాచకమే. ఆ అక్షరం స్వయంగా ద్రష్ట. కానీ ఇతరులు దాన్ని చూడలేరు. అక్షరం శ్రోత ఎవరు. దానిని వినలేరు. తను ఆలోచించేది. కాని అది మనస్సుకు విషయం కాదు. అది జ్ఞాత. కానీ జ్ఞానానికి లోబడదు. కళ్ళు, చెవులు, మనస్సు, బుద్ధి అనే సాధనాలు లేకుండానే అక్షరం అన్ని కార్యాలు చేయగలదని భావం.ఈ వర్ణన జీవాత్మ కెన్నడు వర్తించదు. అందువల్ల అక్షర పదం పరమాత్మ వాచకమే. అక్షరం అంటె క్షరము కానిది, నాశనం లేనిది.శాశ్వతమైనది. ఈ లక్షణాలు గలది పరబ్రహ్మమే కానీ ప్రకృతి కాదు. ఈ అక్షరం జీవుడు కాదు అని సూత్రం కూడా అన్వయిస్తున్నారు. దీని కంటే భిన్నమైన చూచేది లేదు, వినేది లేదు, ఆలోచించేది లేదు, తెలుసుకొనేది లేదు. ఉపాధులతో కూడిన జీవుడు అక్షర పదవాచ్యుడు కాదు. అక్షరానికి ఉపాధులేవి లేవు. నేత్రాలు లేనిది, చెవులు లేనిది, వాక్కు లేనిది, మనస్సు లేనిది ,అని శృతి చెబుతోంది. అందువలన అక్షరం అంటే శాసించగలిగే పరమాత్మే కానీ ప్రకృతి కాదు అని గ్రహించాలి.
ఈక్షిత కర్మ వ్యపదేశాధికరణం :- ( 1, 3 13 )
సూత్రం :- 76
"ఈక్షిత కర్మ వ్యపదేశాత్ సః"
ఈక్షిత కర్మ :-ఈక్షణం అంటే సంకల్పం అనే కర్మను, వ్యపదేశాత్:- వర్ణించడం వలన, సః :- ప్రశ్నోపనిషత్తులో ఉటంకించిన పురుషుడు పరబ్రహ్మమే.
భావం:- ఈ ప్రకరణంలో ఈక్షణం అంటే సంకల్పం అనే కర్మను వర్ణించడం వలన ప్రశ్నోపనిషత్తులో చెప్పబడిన పురుషుడు పరబ్రహ్మమే.
వివరణ :- స ఈక్షాం చక్రే ..ఆయన ఈక్షించాడు. ప్రాణం, శ్రద్ధ, ఆకాశం, వాయువు లాంటి పదహారు కళలను ఉత్పన్నం చెయ్యడానికి అనుకూలించే సంకల్ప పూర్వక పర్యాలోచనమే ఈక్షణం. దీన్ని కొన్ని చోట్ల తపస్సని కూడా అంటారు. స తపో తష్యత :- ఆయన తప్పస్సు చేశాడు. ఈక్షణం ధర్మం పరమాత్మకే వర్తిస్తుంది. ఆయన ఈక్షణ మాత్రంలో ప్రాణాధి కళలను సృష్టించగలడు. జీవాత్మకు అలాంటి సామర్ధ్యం లేదు. (6, 1) ఓ భరద్వాజా ! నీకు షోడశ కళలున్న పురుషుడు తెలుసా? అని ప్రశ్న. (6, 2 )ఓ సౌమ్యా! ఈ శరీరంలోనే ఒక పురుషుడు ఉన్నాడు. ఆయనలోనే షోడశ కళలు ప్రభవిస్తున్నాయి అని సమాధానం. ఈ రెండు వాక్యాలలో పురుషుడు అంటే జీవుడా? బ్రహ్మమా? శాస్త్రాలలో పురుష పదాన్ని ఇద్దరి పట్ల వాడతారు కదా! శరీరంలో ఉండే పురుషుడు జీవుడు కదా! అంటే యజుర్వేదం పురుషుడు అంటే పరమాత్మే అని చెప్పింది. దర్శన , స్పర్శనాది గుణాలున్న విజ్ఞానాత్మ పురుషుడు. ఇందులో పురుషుడు జీవుడు. కానీ హృదయపుండరీకంలో ఉన్న ఈశ్వరుణ్ణి శరీరంలో ఉన్నట్లుగానే వర్ణించారు. ఈక్షణం జీవాత్మ ధర్మం కాదు. ఇక్కడ పురుష పదం ప్రాకృతిక శరీరధారి అయిన జీవాత్మకు వర్తించదు. అందువల్ల అది పరమాత్మ బోధకమే. గురువుగారూ! ప్రశ్నోపనిషత్తులో ఓంకారోపసన చేసిన వారు సూర్యలోకానికి వెడతారు అని చెప్పారు కదా! అంటే ఆ పరబ్రహ్మాన్ని ఉపాస్యంగా చెబుతున్నారు. కాబట్టి ఉపాస్యుడు పరబ్రహ్మ సూర్యుడా? దర్శనీయుడు ఎవరు? అని సందేహం వెలిబుచ్చాడు నారాయణభట్టు. ఆ మాటలు విన్న రత్నాకరుడు శిష్యుని సందేహం తీర్చడానికి ఉపక్రమించాడు. దర్శనీయుడు, ధ్యానం చెయ్యదగినవాడు పరమాత్మే కానీ వేరుకాదు. ఇక్కడ పరబ్రహ్మాన్ని ధ్యానంచేయాలి అని చెబుతున్నారు. ఈక్షితిఅంటే చూచుట. దర్శనీయం. ప్రశ్నోపనిషత్తులో సత్యకాముడు పిప్పలాదునికి నమస్కరించి ,మానవులు మరణించే వరకు ఓంకారోపాసన చేస్తే ఏ లోకాలకు పోతాడు? అని అడిగాడు. దానికి పిప్పలాదుడు సమాధానం చెబుతూ ఓంకారమనేది అకార, ఉకార, మకారముల యొక్క సమ్మేళనం. దీనిలో ఒక అక్షరం మాత్రమే ధ్యానిస్తే సాధకుడు సుక్ష్మ శరీరంతో చంద్రలోకానికి వెళ్లి, అక్కడ సుఖాలను అనుభవించి, తిరిగి భూమి మీద జన్మిస్తాడు. మూడు అక్షరాల రూపమైన ఓం కారాన్ని ధ్యానిస్తే సాధకుడు తేజోమయమైన సూర్య లోకానికి పోతాడు. ఆ తరువాత బ్రహ్మలోకం చేరి కల్పాంతం వరకు అక్కడ ఉంది కల్పాంతరమున పరబ్రహ్మంలో లీనమోతాడు అని చెప్పబడినది. కాబట్టి దర్శనీయుడు సూర్యుడు కాదు. సాధకుడు చంద్రలోకం వెళ్లినట్లే సూర్యలోకం చేరతాడు. అంటే ఇక్కడ ఉపాసన చెయ్యవలసినది సూర్యుణ్ణి కాదు. అలాగే దర్శనీయుడు కూడా సుర్యుడు కాదు. పరమాత్మయే అంటూ 4వ అధికరణం పూర్తి చేశాడు రత్నాకరుడు.
దహరాధికరణం :- ( 1, 3 ,14 )
సూత్రం :- 77
"దహర ఉత్తరేభ్యః
ఉత్తరేభ్యః :- మున్ముందు ఉన్న ఛాందోగ్యవాక్యాలను బట్టి దహారః :- ప్రకరణంలో వర్ణించిన దహారాకాశం పరమాత్మ వాచకం.
భావం:- ఛాందోగ్యోపనిషత్తులో చెప్పినట్లుగా ఈ ప్రకరణంలో వర్ణించిన దహారాకాశం పరమాత్మ వాచకం.
వివరణ :- ఆకాశం అంటే భూతాకాశం, లేదా మానవదేహంలో ఉండే దాన్ని దహారాకాశ మంటారు. అంతే కాని పరమాత్మ ఎందుకౌతుంది? అని అనుమానం వ్యక్తం చేశాడు కృష్ణశర్మ. శిష్యుని సందేహం తీర్చడానికి ఉద్యుక్తుదౌతున్నాడు రత్నాకరుడు. శరీరంలో ఉండే ఆకాశాన్ని దహారాకాశం అంటారు. దహారాకాశం అంటే బ్రహ్మమే.
చాందోగ్యోపనిషత్తు:- గాయత్రి ఉపాసన గురించి చెబుతూ శుద్ధబ్రహ్మ, కార్యబ్రహ్మ కన్నా గొప్పది. పాంచభౌతికమైన ఈ జగత్తంతా శుద్ధబ్రహ్మ యొక్క మొదటి పాదమే. మిగిలిన మూడు పాదాలు ఆ పరబ్రహ్మలోనే ఉన్నాయి. గాయత్రి ద్వారా ప్రతిపాదించబడిన 3పాదములు గల అమృతస్వరూపుడైన బ్రహ్మ ఇదే. ఆ పురుషుడికి లోపల,బయట కూడా ఉన్న ఆకాశం ఒక్కటే. అలాగే హృదయం లోపల, బయటఉన్న ఆకాశం ఒక్కటే. అదే ఆత్మ. ఈ రకంగా బ్రహ్మను గురించి తెలుసు కున్నవారు జీవించి ఉండగానే బ్రహ్మస్వరూపం పొందుతారు అని చెప్పబడినది. బాహ్యాకాశం ఎంత ఉన్నదో సూక్ష్మాకాశం, దహారాకాశం కూడా అంతే ఉంటుంది. ఇందులో స్వర్గం, పృధివి రెండు ఉంటాయి. ఆత్మ పాపరహితుడు. జన్మ మృత్యువు, జరామరణములు లేనివాడు. ఆకలి దప్పికలు లేనివాడు. సత్యకాముడు, సత్యసంకల్పుడు. దహారాకాశం భూతాకాశం రెండు ఒకటి కాదు. స్వర్గం, పృధివి రెండు దహరాకాశంలో ఉన్నాయి. కాబట్టి భూమికి, ఆకాశానికి స్వర్గానికి కూడా దహారాకాశమే ఆధారం. ( 8 ,1, 1) ఈ బ్రహ్మపురం అనే మనిషి శరీరంలో ఉన్న చిన్న హృదయకమలం అనే ఇంటిలో సూక్ష్మమైన ఆకాశం ఉన్నది. దాన్ని అన్వేషించి తెలుసుకోవాలి. ఈవాక్యంలో ఉన్న దహరాకాశం జీవాత్మా? పరమాత్మా ? హృదయం జీవులకు కదా ఉంటుంది. దహారం అంటే సూక్ష్మం. జీవాత్మ అణు స్వరూపుడు కనుక దహారాకాశం అంటే జీవాత్మ ఎందుకు కాకూడదు? అంటే ఈ ప్రకరణం లో ఉన్న తరువాత వాక్యాలను బట్టి దహరాకాశం అంటే పరమాత్మ బోధకమే కానీ జీవవాచకం కాదు. (8, 1, 3):-ఈ బయట ఆకాశం ఎంతో, హృదయంలో దహరాకాశం అంతే. ఈ అంతరాకాశంలో పృధివి, ద్యులోకం అగ్ని, వాయువు, సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు, నక్షత్రాలు, ఇహంలో ఉండేవి, లేనివి, అన్నీ ఇమిడి ఉన్నాయి. దీన్ని చూస్తే హృదయకమలంలో ఉండే దహరాకాశం పరమాత్మ వాచకమే. కానీ జీవబోధకం కాదని తెలుతోంది. భూమ్యాకాశాదులు ఈశ్వరునిలో ఇమిడిఉన్నాయి. ఈ దహారాకాశాన్ని తెలిసిన యోగులు అన్ని లోకాలలో స్వేచ్ఛగా చరించగలుగుతున్నారు. భూమవిద్య తరువాత బ్రహ్మపరమైన ఈశరీరంలో అల్పమైన ఏపద్మం ఉన్నదో, దాని లోపల ఏ చిన్న ఆకాశం ఉన్నదో, దాని లోపల ఏది ఉన్నదో, అదే అన్వేషించదగినది. తెలుసుకొనదగినది. ఇక్కడ దహరకాశమన్నా, భూతాకాశమన్నా, విజ్ఞానాత్మ అన్నా పరమాత్మే. ఆకాశ, బ్రహ్మపుర శబ్దాలుండటం వలన ఆకాశ శబ్దం లోను భూతాకాశ శబ్దంలోను, పరమాత్మ అనే అర్ధంలోనే ప్రయోగించబడింది.
సూత్రం :- 78
'గతిశబ్దాభ్యాం తథా హి దృష్టం లింగం చ"
గతి శబ్దభ్యం:- గతి ( గమనం ప్రాప్తి ), శబ్దం :- బ్రహ్మలోకం అనే పదం., చ ;- అంతే కాక ,తధాహి ;- దహరాకాశం విషయంలో లాగా బ్రహ్మ విషయం లోను, దృష్టం :- ఈ గతి, లింగం :- ఈ వాక్యంలో లక్షణాలు కూడా గమనించవచ్చు.
భావం :- గతిని బోధించే వాక్యశేషంలో ఉన్న రెండు శబ్దాల ప్రయోగం వలన దహారాకాశం బ్రహ్మ వాచకం అని తెలుసుకోవాలి. ఈ గతి, శబ్దం అనే పదాలు మరో వాక్యంలో కూడా చూడవచ్చును.
వివరణ :- గతి అంటే గమనం, శబ్దం అంటే బ్రహ్మలోకం. అందుచేత దహరాకాశం అంటే పరమాత్మే. కానీ వేరు కాదు.
ఛాందోగ్యోపనిషత్తు:- ఉద్ధాలకుడు తన కుమారుడైన శ్వేతకేతువుకి సుషుప్తిని గురించి వివరిస్తున్నాడు. మానవుడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు అతడు సుషుప్తిలో ఉన్నాడు అంటారు. ఆ సమయంలో జీవుడు పరమ సత్ ను పొందుతాడు. అంటే తన నిజస్వరూపాన్ని పొందుతాడు. తన ఆత్మను తను పొందుతాడు. కాబట్టి అతన్ని గురించి చెప్పేటప్పుడు అతను నిద్రిస్తున్నాడు అంటారు. సుషుప్తిలో మనస్సు, ఇంద్రియాలు పనిచేయటం మానేస్తాయి. అప్పుడు మిగిలేది ఆత్మ మాత్రమే. ఆ ఆత్మ నిజరూపంలో మిగులుతుంది. ప్రతిబింబం లాంటి జీవభావం పోయి మిగిలేది ఆత్మభావం ఒక్కటే . ఇంద్రియాలన్నీ అలసట చెంది ఒక్కొక్కటి మనస్సులో లీనమైపోతాయి. మనస్సు ప్రాణంలో లీనమైపోతుంది. అంటే సుషుప్తావస్థలో ఒక్క ప్రాణం మాత్రమే మేల్కొని ఉంటుంది. అదే ఇంద్రియాలు అలసటను తీరుస్తుంది. సుషుప్తిలో జీవుడు పరమాత్మను పొందుతున్నాడు కాబట్టి దహరాకాశం అంటే బ్రహ్మమే.
ఛాందోగ్యోపనిషత్తు:-( 8, 3 ,2 ):- దాచిపెట్టిన ధనం ఎక్కడుందో తెలియని వాళ్ళు అక్కడే తిరుగుతూ, దాన్ని పొందలేనట్లు జీవులు నిత్యం బ్రహ్మలోకాన్ని పొంది కూడా దాన్ని తెలుసుకోలేకుండా ఉన్నారు. బ్రహ్మలోకం అంటే దహరాకాశం . ఇలా జీవులు బ్రహ్మలోకాన్ని నిత్యం గమనిస్తూనే ఉన్నారు. ఇలాగే మరో ఉపనిషత్తువాక్యంలో జీవులు నిత్యం బ్రహ్మాన్ని పొందుతునట్లు ఉన్నది. ( 6, 8, 1 ):- పురుషుడు నిద్రిస్తున్నప్పుడు సద్రూపబ్రహ్మాన్ని పొందుతాడు. ( 8 ,15, 1 ):- బ్రహ్మలోకాన్ని పొందుతాడు అని బ్రహ్మలోకం శబ్ద ప్రయోగం కాబట్టి గతి శబ్దం ఈ రెండు దహరాకాశం అయిన బ్రహ్మాన్ని బోధిస్తాయి. ఇదే పరమాత్మ వాచకం. జీవుడు ప్రతిరోజు సుషుప్తావస్థలో బ్రహ్మను చేరతాడు. జీవుడు అక్కడ సత్ తో కలుస్తాడు. అదే మరొక శృతి వాక్యంలో చెప్పబడింది. లోకంలో ప్రకృతమైన దహరాకాశ విషయంలో ప్రయోగింపబడుతున్న బ్రహ్మలోక శబ్దం కూడా. దహరమనగా జీవుడు లేదా భూతాకాశం అనే శంకను తొలగించి అది బ్రహ్మమేనని స్పష్టం చేసింది.
సూత్రం :- 79
"దృతేశ్చ మహిమ్నో స్యాస్మి నుపలబ్దేః"
ధృతేహ్ :- సమాస్త లోకాలను ధరించడం వలన, చ - కూడా, అస్మిన్:- బ్రహ్మానికి, అస్య మహిమ్నః :- జగద్ధారణ మహిమ ఉన్నదని, ఉప లబ్దేః :- మరో ఉపనిషత్తు వాక్యం వల్ల తెలుస్తుంది.
భావం:- సమస్త లోకాలను ధరించడం వలన దహర శబ్దం పరబ్రహ్మ వాచకమని నిశ్చయించాలి. ఎందుకంటే బ్రహ్మానికి జగద్ధారణ మహిమ ఉన్నదని మరో ఉపనిషత్ వాక్యం వలన తెలుస్తుంది.
వివరణ:- ఛాందోగ్యప్రకరణంలో హృదయకమలంలో దహరాకాశం ఉన్నట్లు, అందులోనే పృధివి మొదలైన లోకాలు ఇమిడి ఉన్నట్లు చెప్పారు. తరువాత ఈదహరాకాశాన్ని ఆత్మశబ్దంగా ప్రయోగించారు. అందులో పాపరాహిత్యాది ధర్మాలు వర్ణించారు.
ఛాందోగ్యోపనిషత్తు ( 8, 4, 1 ):- ఆత్మ అనేది అనేక లోకాలు మర్యాదను అతిక్రమించకుండా చేసి ధరించే బంధనం. ఇలా సర్వ లోకాలను ధరించే ఆత్మ పరమాత్మే. వేదంలో కూడా పరబ్రహ్మమే జగద్దారకుడని వర్ణించారు. ఋగ్వేదం దహరాకాశమంటే బ్రహ్మ వాచకమని చెప్పింది. సమస్త జగత్తును లోకాలను ధరించడం అనే మహిమ పరమాత్మ యందు ఉండటం వలన దహర శబ్దం బ్రహ్మనికే వర్తిస్తుంది. బ్రహ్మపురమనే ఈ శరీరంలో దహరాకాశమున్నది. దానిలోని సమస్తం ఉన్నాయి. దానికి సంబంధించినది ఆత్మ. అది ఏ పాపములు అంటనిది. లోకాలను ధరిస్తూ ఉంటుంది. ఈ విధంగా ధృతి అంటే ధరించడం అనే హేతువు వలన ఈ మహిమ ఇతర శృతుల యందు ఆత్మ విషయంలో కూడా కనబడటం వలన దహరం అంటే పరబ్రహ్మమే. దహరాన్ని ఆకాశంతో పోలుస్తూ, దాని యందు అన్ని నిలచి ఉన్నాయని అదే ఆత్మ అని చెప్పబడినది. లోకంలో సేతువు పొలాలలో ఉండే సొత్తు కలిసిపోకుండా ఉండేటట్లు, భారీ నీటి ప్రవాహాన్ని ఏ విధంగా నిలుపుతుందో, అట్లే ఈ ఆత్మ అధ్యాత్మము, అధిదైవం, అధిభౌతికం మొదలైన బేధాల చేత భిన్నంగా ఉన్న లోకాలను, వర్ణాశ్రమాదులను కలిసిపోకుండా ఉండేటట్లు నిలిపే సేతువు. ఈ విధంగా లోకాలను ధరించడం అనేది బ్రహ్మ వలననే జరుగుతుంది. ఆయన ఆజ్ఞ ప్రకారము సూర్యచంద్రులు తిరుగుతున్నారు. అతడే అందరికి ప్రభువు. సర్వభూత పాలకుడు. కాబట్టి లోకాలను ధరించడం అనే కారణం వలన దహరాకాశం బ్రహ్మమే కానీ వేరేది కాదు.
సూత్రం :- 80
'ప్రసిద్దేచ్చ'
ప్రసిద్ధ :- ఆకాశ శబ్దం పరబ్రహ్మము పట్ల ప్రసిద్దంగా వినబడుతోంది. చ :- పైగా
భావం:-ఆకాశ శబ్దం పరబ్రహ్మం పట్ల ప్రసిద్దంగా వినబడుట వలన దహరాకాశ పదం పరబ్రహ్మ వాచకమే.
వివరణ:-ఈకారణం వలన కూడా పరమేశ్వరుడే ఆకాశమని చెప్పబడుచున్నాడు. ఎందువలననగా ఆకాశశబ్దం పరమేశ్వరు డనే అర్థంలో ప్రసిద్ధము. ఆకాశ నిర్వహితా, సర్వాణి సముత్పద్యన్తే.. ప్రయోగాలు కనిపిస్తున్నాయి. ఆకాశశబ్దం జీవుని విషయంలో ప్రయోగించబడినట్లు ఎక్కడ కనబడదు. భూతాకాశం విషయంలో ఆకాశశబ్దానికి ప్రసిద్ధి ఉన్నా కూడా ఉపమాన ఉపమేయ భావాలు కుదరవు. కనుక దానిని గ్రహించకూడదని చెప్పబడింది.
ఛాందోగ్యోపనిషత్తు:- వ్యోమశబ్దం, ఆకాశశబ్దం పరమాత్మని సూచిస్తున్నాయి. ఇలా ఆకాశశబ్దం పరమాత్మ వాచకంగా ఎన్నో చోట్ల ప్రసిద్ధి చెందింది. ఈ ఆకాశపదం పృథివ్యాది పంచభూతాల్లోని ఆకాశాన్ని సూచించడం లేదు. ఆకాశం అంటే అన్ని భూతాలకు ఉత్పత్తికారణంగా చెప్పారు. ఈభూతాలన్ని ఆకాశం వలననే ఉత్పన్నం అవుతున్నాయి. ఆకాశంలోనే అస్త మిస్తాయి. ఇది బ్రహ్మానికి గుర్తుగా సూచించ బడింది. వీటన్నింటి కన్నా ఆకాశం ఎంతో గొప్పది. దేని వలన ఈ భూతాలన్నీ ఉత్పత్తిఅయి జీవిస్తూ ఎందులో లీనమౌతున్నాయో అదే బ్రహ్మం. పృధివి, అంతరిక్షం, ధ్యులోకం, సర్వ లోకాలకన్నా బ్రహ్మశ్రేష్టం. కనుక ఆకాశం బ్రహ్మ వాచకం. అది పరమాత్మ కాబట్టి ఆకాశం అనగానే భూతాకాశం అని స్ఫురించినా దాని అర్ధం మాత్రం పరమాత్మే. కాబట్టి దహారాకాశం అంటే బ్రహ్మమే కానీ జీవుడు కాదు, భూతాకాశం కాదు.
దహరాధికరణం :- ( 1, 3 ,18 )
సూత్రం :- 81
'ఇతర పరామర్శాత్ స ఇతి చేత్ న అసంభావాత్'
ఇతర పరామర్శనాథ్ :- పరమాత్మ కన్నా వేరే అయిన జీవాత్మకు ఈ వాక్యంలో సంబంధం కనిపించడం వల్ల, న ఇతి చేత్ :- దహరాకాశం అంటే జీవాత్మ అని అర్ధం చెప్పడం, న :- తగదు. ఎందుకంటే అసంభావాత్:- పాపరహితత్వం లాంటి ధర్మాలు జీవుడి విషయంలో సంభవంకావు.
భావం:- దహరాకాశం అంటే జీవాత్మ అని చెప్పడం తగదు. ఎందుకంటే పాపరాహిత్యం లాంటి ధర్మాలు జీవుడు విషయంలో సంభవం కాదు. కనుక దహరాకాశం జీవాత్మ కానేరదు.
వివరణ :- సంప్రదాయార్ధంలో జీవుడు అంటే దహరాకాశం అని అర్ధం చెబుతారు. కానీ అది సరియైనది కాదు. అలా అనడానికి వీలు లేదు. బుద్ధి మొదలైన వాటి చేత ఆవరింపబడిన జీవుడుకి ఆకాశంలో సమానత్వం చెప్పడం కుదరదు. శరీరధారి అయిన జీవుడికి పాపాల నుండి విముక్తుడవడం కూడా జరగదు. ఆకాశం బ్రహ్మ నుండి పుట్టినది. సృష్టి ప్రారంభంలో నిరాకరుడు, నిర్గుణస్వరూపుడు అయిన పరమాత్మ నుంచి ముందుగా అవ్యక్తం వచ్చింది. దాని నుంచి మహత్తత్వం దాని నుంచి అహంకారం వచ్చింది. అహంకారం నుంచి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు ఆవిర్భవించాయి. ఇవి పంచతన్మాత్రలు. వీటి నుండి పంచభూతాలు వచ్చాయి. ముందుగా ఆకాశం, వాయువు, అగ్ని ,జలం, భూమి, ఆవిర్భవించాయి. ఆకాశం అంటే భూతకాశమా? మహదాకాశమా? అని సందేహం వస్తుంది? ఇక్కడ ఆకాశం అంటే మహదాకాశమే. అదే పరబ్రహ్మ. మానవ శరీరంలో ఉన్న దహరాకాశం కూడా పరబ్రహ్మ స్వరూపమే.
ఛాందోగ్యోపనిషత్తు:-జీవాత్మ శరీరాన్ని విడిచి పరంజ్యోతిని పొంది తన రూపంలో ఉంటుంది. దీన్ని ఆత్మ అంటారు. ఇక్కడ జీవాత్మ ప్రసక్తి ఉన్నది. అంతమాత్రాన అది దహరాకాశంకాదు. ఎందుకంటే పాపరాహిత్యం, సత్యసంకల్పం లాంటి గుణాలు జీవాత్మ పట్ల సంభవాలు కావు. బుద్ధి మొదలైన ఉపాధులచే పరిమితత్త్వాన్ని అభిమానించే జీవుడికి పాపరాహిత్యమైన ధర్మాలు సంభవింపవుకదా! జీవుడు ఈశరీరం నుండి లేచి అంటే ఈశరీరాదుల కంటే నేను వేరు అని తెలుసుకొని పరబ్రహ్మరూపమైన జ్యోతిస్సును సాక్షాత్కరించుకొని బ్రహ్మరూపాన్ని పొందుతారో అదే ఆత్మ అని చెబుతారు. ముక్తి వచ్చిన తరువాత పరమేశ్వరుడు చేయగలిగే పనులన్నీ చేయాగలుగుతాడా అనే సందేహం రావచ్చును. జగత్కారణం, జగత్ వ్యాపారం సృష్టిలో చేయగలిగే శక్తి పరమేశ్వరుడికే ఉంటుంది. ముక్తాత్మ పరబ్రహ్మానికి లోబడి ఉంటాడు.
సూత్రం :- 82
'ఉత్తరాచ్చేదావిర్భూత స్వరూపస్తు"
ఉత్తరాత్:-ప్రజాపతి పలికిన తరువాత వాక్యాన్ని బట్టి, చేత్:-పాపాలు లేకపోవడం లాంటి గుణాలు జీవాత్మకు వర్తిస్తాయనడం, తు :-సరియైనది కాదు. ఇక్కడ ఆవిర్భూత స్వరూపః :- జీవాత్మ స్వస్వరూపములో ఉండే ముక్తాత్మ.
భావం:- జీవుడికి పాపరాహిత్యం, సత్యసంకల్పం లాంటి గుణాలు స్వాభావికంగా ఉండవు. జీవుడు ఎప్పుడైనా స్వస్వరూపంతో పరమాత్మతో సంబంధం ఉన్నప్పటికీ దహరాకాశం పరబ్రహ్మ వాచకమే.
వివరణ:- ఛాందోగ్యోపనిషత్తు:- ఇంద్రుడు ఆత్మస్వరూపం తెలుసుకోవాలని విరోచనుడితో పాటు ప్రజాపతిని సమీపించాడు. ప్రజాపతి ఇంద్రుడికి ఆత్మోపదేశం చేసాడు. జాగ్రదావస్థకు సంబంధించిన ఆత్మ గురించి ముందు చెప్పి తరువాత క్రమంగా స్వప్న, సుషుప్తి, తురీయావస్థలకు సంబంధించిన ఆత్మ గురించి ఉపదేశం చేసాడు. చివరకు ముక్తావస్థ లో పరమాత్మను పొంది జీవుడు స్వస్వరూపంతో ఉంటాడని చెప్పాడు. అలా ముక్తి పొందిన జీవుడికి కొన్ని గుణాలు శక్తులు లభించ వచ్చును. అంతమాత్రం చేత దహరశబ్దం జీవాత్మ వాచకం కాదు. పూర్వకాలంలో ప్రజాపతి ఆత్మతత్వాన్ని గురించి ఒక ప్రకటన చేసాడు. ఆత్మకు పాపం అంటదు. దానికి ఆకలిదప్పికలు ఉండవు. మానవుడు సత్యకాముడు, సత్యసంకల్పుడు అయి ఆత్మజిజ్ఞాసను అలవారుచుకోవాలి. ఆత్మకోసం అన్వేషించిన వాడు ఆత్మను అనుభవించిన వాడు ఆత్మ స్వరూపాన్ని పొందుతాడు. ఆమాటలు విన్న దేవతలు రాక్షసులు కూడా సత్యాన్వేషణకు బ్రహ్మ దగ్గరకు వెళ్లారు. 32 సం. దీక్ష ఆచరించిన తరువాత కనులలో మెదులుతూ కనిపించే పురుషుడు ఆత్మ అన్నాడు బ్రహ్మ. ఆ మాటలు విన్న రాక్షస రాజు శరీరమే బ్రహ్మ అని ప్రచారం చేశాడు. కానీ ఇంద్రుడు దాన్ని నమ్మలేదు. ప్రజాపతి ఇంద్రుని చాలా సార్లు పరీక్ష చేసి పరబ్రహ్మతత్త్వాన్ని ఉపదేశించాడు. పరబ్రహ్మ మానవుడి హృదయపద్మంలోనే ఉన్నాడు. కనుక దహరాకాశమే బ్రహ్మ. దహర ప్రకరణంలో వర్ణించింది పరమాత్మ స్వాభావిక గుణాలు కనుక దహర శబ్దం పరబ్రహ్మవచకమే.
సూత్రం :- 83
"'అన్యార్ధశ్చ పరామర్శః"
పరామర్శః :- ఈప్రకరణంలో సంప్రసాద శబ్దం జీవాత్మకు సూచించే సంకేతం, చ :- కూడా, అన్య అర్ధః :- భిన్న ప్రయోజనాన్ని ఆశించే ప్రయోగించారు.
భావం :- ఈ ప్రకరణంలో సంప్రసాద అంటే ప్రకృతి అనే పదం జీవాత్మను సూచిస్తుంది. ఇది పరమాత్మ బోధకమే.
వివరణ :- సంప్రసాద అంటే ప్రకృతి అనే శబ్దాన్ని జీవాత్మకు సంబంధించినది. భిన్న ప్రయోజనాన్ని ఆశించే ఈపదం ప్రయోగించారు. సుషుప్తిలోను, ముక్తిలోను జీవాత్మ పరమాత్మను పొంది స్వస్వరూపంతో ఉంటుంది. ఆ పరంజ్యోతి జీవాత్మ కన్నా భిన్నం. ఆ పరబ్రహ్మాన్ని దహర శబ్దంతో సూచించారు. ఇది సూచించడానికి దహర ప్రకరణంలో జీవాత్మ ప్రసక్తి వచ్చింది. 'చ 'పదం జీవాత్మకు దహరాశబ్దంతో వ్యవహరించకూడదని తెలియజేస్తోంది. ఈ జీవపరామర్శ మరొక ప్రయోజనం కొరకు చేయబడింది. సంప్రసాదశబ్దం చేత చెప్పబడిన జీవుడు జాగ్రదావస్థలో దేహేంద్రియములు అనే పంజరంలో బంధించబడి, జీవుడు ప్రకృతిలోని ప్రాపంచిక వ్యవహారాలలో మమేకమై, కంటికి నచ్చిన వస్తుసముదాయంతో, తాత్కాలికమైన సుఖాల కోసం పరితపిస్తూ, వాటి వలన వచ్చే సుఖదుఃఖాలు అనుభవిస్తూ ఉంటాడు. జాగ్రదావస్థలో రకరకాల వాసనలను అనుభవిస్తూ అలసిసొలసి నిద్రలోకి జారుకొని స్వప్నావస్థలోకి వెళ్ళిపోతాడు. ఉదయం తాను అనుభవించిన విషయవాసనలే మనసు మీద ముద్రపడి స్వప్నలోకంలో విహరిస్తాడు. ఈస్థితిలో స్థూలశరీరం పని చెయ్యదు. సూక్ష్మశరీరం మాత్రమే పనిచేస్తుంది. సుషుప్తావస్థలో సూక్ష్మశరీరం, స్థూల శరీరం ఏమి పనిచేయవు. ప్రాణం ఒక్కటే పనిచేస్తుంటుంది. అన్నింటిని వదిలేసిన ఆస్థితిలో అతడు బ్రహ్మయొక్క స్వస్వరూపానందాన్ని పొందుతాడు. అట్టి పాపచింతన లేని సత్యసంకల్పస్థితిలో ఉన్న ఆత్మను ఉపాసించాలి అనిచెప్పడం వరకే ఈ జీవపరామర్శ కానీ, దహర శబ్దానికి జీవుడు తగడు. అది బ్రహ్మవచకం మాత్రమే. నిరక్షరాస్యుడైన ఒక అమాయక చక్రవర్తి తన కుమారుని నుండి ఉత్తరం వస్తే దానిని పంతులు గారి దగ్గరకు తీసుకొని వెళ్లి చదవమంటాడు. చదవాలంటే కళ్ళజోడు కోసం ఇల్లంతా వెదకినా కనబడలేదు. ఆఅమాయకుడు కళ్ళజోళ్ళ షాపుకి వెడితే కంటికి అద్దాలు పెట్టి చదవమన్నాడు. తను చదవలేనని ఉత్తరాలుచదివే కళ్ళజోడు ఇమ్మని అడుగుతాడు. కళ్ళజోడు అంటే కేవలం పరికరం మాత్రమే. అది ఉత్తరాలు చదివదు. నీకు చదువు వస్తేనే చదవగలవు అంటాడు షాపువాడు. అట్లే దేహం, మనస్సు, బుద్ది, ఇంద్రియాలు అన్ని పరికరాలు మాత్రమే. వాటంతట అవి పనిచేయవు. అవి ఆత్మచైతన్యం వలననే పనిచేస్తాయి. అలా ఆత్మగా ఉండటానికి జీవుడు ఉపాధులన్నింటికి భిన్నంగా తనలో ఉన్న ఆత్మయొక్క స్వస్వరూపాన్ని చూడగలగడమే ముక్తి. సుషుప్తిలో, జీవన్ముక్త స్థితిలో పొందేది ఆత్మానందమే అయినప్పటికీ దహర శబ్దం మాత్రం పరబ్రహ్మ వాచకమే.
సూత్రం :- 84
"అల్ప శ్రుతేరితి చేత్త దుక్తం"
శ్రుతీః :- ఉపనిషత్ వాక్యంలో, అల్పాః :-దహరం, అతి సూక్ష్మం అని వర్ణించారు. తత్ ఉక్తం:-ఇదివరకే ఇచ్చాము.
భావం:- ఉపనిషత్ వాక్యంలో దహరం అంటే అతి సూక్ష్మం అని వర్ణించారు. దహరశబ్దం అణు స్వరూపుడైన జీవాత్మకు వర్తిస్తుంది అని అనడానికి సమాధానం ఇది వరకే చెప్పడం జరిగింది.
వివరణ:-దహరం అంటే సూక్ష్మం అల్పం అని అర్ధం. దహరాకాశం అంటే సూక్ష్మమైన ఆకాశమయితే, సూక్ష్మం అని చెప్పినంత మాత్రాన పరమాత్మ కాకపోదు. పరమాత్మ పరమాణువులలో అతి సూక్ష్మరూపంలో కూడా ఉన్నాడని కఠోపనిషత్తులో చెప్పబడింది. కాబట్టి సూక్ష్మరూపంలో ఉన్నప్పటికీ దహరాకాశమంటే పరమాత్మే.
చాందోగ్యోపనిషత్తు:- (8 ,1, 1) "దహరో స్మిన్నంతరాకాశ" హృదయంలో ఉండే ఆకాశం అల్పం, సూక్ష్మం ఇది ఎలా బ్రహ్మవాచకం అవుతుందని సందేహమా? బ్రహ్మసూత్రాలలో (1,2,7) నందు చెప్పబడింది. ఈసూత్రంలోనే ఇందుకు సమాధానం ఉన్నది. పరబ్రహ్మ సర్వవ్యాపకం, అనంతం అయినా హృదయకమలం ఉపాధిగా దహరం సూక్ష్మం అని వర్ణించారు. ఉపాసకుడైన జీవాత్మకూ, ఉపాస్యుడైన పరమాత్మను తెలిసేనిమిత్తం ఈవర్ణన చెప్పబడింది. కనుక దహరాకాశం బ్రహ్మవాచకమే కానీ జీవబోధకం కాదు. "ఏష ఆత్మాన్తంతర హృదయే'" ఈ నాహృదయంలో ఉన్న ఆత్మ అనే వాక్యంలో, బ్రహ్మహృదయంలో ఉంటాడని అంటున్నారు. హృదయం అల్పం కదా! అందులో ఉండే ఆత్మ ఇంకా అల్పం కదా! వడ్లగింజ కన్నా దానిలో ఉండే బియ్యంగింజ ఇంకా అల్పం కదా! హృదయమే అల్పం. అక్కడ ఉండే తత్త్వం పరిమితంగా ఉంటుంది. ఆ అల్పత్వం జీవాత్మపట్ల సబబే కానీ బ్రహ్మానికి ఎలా వర్తిస్తుంది? అనేదే సందేహం. బ్రహ్మం సర్వ భూతాంతరాత్మ. సర్వస్థానగతం. అలాంటప్పుడు హృదయంలో మాత్రం ఉండడా? అలాగే జీవాత్మలోను ఉంటాడు. అల్పమైన హృదయంలోను, అంతకన్నా సూక్ష్మమైన జీవాత్మలోను ఉంటాడు. హృదయపుండరీకంలో ఉన్నంత మాత్రాన అల్పం కాదు .ఆత్మ హృదయస్థానంలో అతి చిన్నదిగా ఉంటుంది. అదే మనం తెలుసుకోవాలి. అందుకనే ఆత్మయే ఉపాస్య అన్నారు. జీవుడు ఉపాసకుడు అన్నారు. బుద్ధికి, విఙ్నానానికి స్థానం హృదయమే. భగవంతుణ్ణి తెలుసుకోవడానికి తగినది హృదయమే. అందుకే పరమాత్మ హృదయంలో ఉన్నాడని చెప్పారు. పరమాత్మ సర్వాంతర్యామి. అయినప్పటికీ ఉపాసన కోసం లింగం అంటే గుర్తు చూపించి ఇది శివుడు ఉపాసించు అని ఎలా చెబుతారో అలాగే ఇక్కడ కూడా పరమాత్మ సూక్ష్మరూపంలో హృదయమందు ఉన్నాడని చెప్పబడింది. పరమేశ్వరుడు హృదయపుండరీకంలో ఉన్నాడని ధ్యానం చెయ్యగా, చెయ్యగా తత్సాక్షాత్కారం లభిస్తుంది. ఎంతోమంది జీవుల హృదయాలలో ఉన్నప్పటికీ వారి దోషాలు ఏమి పరమేశ్వరునికి అంటవు.
అనుకృత్యధికరణం :- ( 1, 3, 22 )
సూత్రం :- 85
" అనుకృతే స్తస్య చ "
చ :- అంతే కాక , తస్య :- పర బ్రహ్మ , అనుకృతే :- హృదయ ఉపాధిని అనుకరించడం వలన,
భావం :- పరమాత్మ హృదయ ఉపాధిని అనుకరించడం వలన ఆయన అల్ప పరిమాణం సిద్ధిస్తుంది. ఘటాదుల్లో ఉండే ఆకాశం ఘటాది ఆకాశాన్ని అనుకరిస్తుంది. అలాగే పరమాత్మ కూడా హృదయపుండరీకాన్ని సంతరించుకున్నట్లు అనుకరిస్తున్నట్లు వ్యవహరిస్తారు. అంత మాత్రాన బ్రహ్మ స్వరూపం అల్పం అని పొరబడరాదు.
వివరణ :- గురువుగారు! సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అక్కడ ప్రకాశించవు. అంతా పరమేశ్వరుని యొక్క కాంతులే అని ముండకోపనిషత్తు లో చెప్పారు. మరి ఆ కాంతి కూడా ఏదో తేజస్సే అయి ఉండాలి కదా! అని అనుమానం వ్యక్తం చేశాడు కృష్ణ శర్మ. ఆ మాటలు విన్న రత్నాకరుడు తన శిష్యుని అనుమానం తీర్చడానికి సిద్ధమయ్యాడు. అనుకరించడం వలననే ఆత్మ యొక్క తేజస్సులోనే సమస్తము ప్రకాశిస్తుంది. అక్కడ సూర్యుడు, చంద్రుడు,నక్షత్రాలు ప్రకాశించవు. ఆ మెరుపులు ప్రకాశించవు. ఈ అగ్ని మాట చెప్పేదేమిటి? ప్రకాశిస్తున్న దానినే అనుసరించి సర్వమూ ప్రకాసిస్తోంది. దాని కాంతి చేతనే ఇదంతా ప్రకాశిస్తోంది అని పఠిస్తున్నాను. అక్కడ ప్రకాశిస్తున్న దేనిని అనుసరించి ఇదంతా ప్రకాశిస్తోందో, దేని కాంతిచేత ఇదంతా ప్రకాశిస్తోందో అది ఏదైనా తేజోధాతువా? లేదా బ్రహ్మయా? అనే సందేహం కలుగుతోంది. తేజో ధాతువు అని ప్రార్ధించింది ఎందువల్ల? తేజోధాతువైన సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు తేజస్వభావులైన చంద్రతారకాదులు భాషించవు అని ప్రసిద్ధము కదా! అట్లే సూర్యునితో సహా ఈ చంద్రతారకాదికం దేని యందు భాసించిందో అది కూడా తేజ స్వభావంకల ఒకానొకటి అని తెలుస్తోంది. నడుస్తున్నవారిని అనుసరించి నడుస్తున్నాడు అన్నట్లు అనుకరణ అనేది సమాన స్వభావం కలవాటిలోనే కనబడుచున్నది కదా! అందుచేత ఒకానొక తేజోధాతువే. తమేవభా0త మనుభాతి సర్వం అని చెప్పిన అనుభవం... అంటే అనుసరించి ప్రకాశించడం ప్రాజ్ఞాత్మ గ్రహిస్తేనే కుదురుతుంది. ప్రాజెనాత్మను గూర్చి సత్య సంకల్పం,శాంతి స్వరూపం,సత్య సంకల్పుడు అని చెప్పుచున్నారు.అంతే కాని సూర్యచంద్రాదులు ఏదో ఒక ధాతువును అనుసరించి ప్రకాశిస్తున్నాయి అని ప్రసిద్ధము. ఒక దీపం మరొక దీపాన్ని అనుసరించి అంటే దాని మీద ఆధారపడి ప్రకాశించదు కదా! అనుకరించడం సమాన స్వభావం కల వాటి మధ్యనే ఉంటుందని చెప్పడం కూడా యుక్తం కాదు. వేరు వేరు స్వభావం కలవాటిలో కూడా కనబడుతున్నది కదా! ఎట్లనగా బాగా కాల్చబడిన ఇనుప గుండు అగ్నిని అనుసరిస్తూ, కాలుస్తున్నా ఆ అగ్నిని అనుసరించి కాలుస్తున్నది. సూర్యాదులు దాని మూలాన్నీబాసిస్తున్నాయి అని చెప్పడం ప్రాజెనాత్మను అంటే జ్ఞానరుపమైన ఆత్మను సూచిస్తుంది. ప్రాజెనాత్మను గూర్చి దేవతలు జ్యోతిస్సులకు కూడా జ్యోతిస్సు, అమృతము అయిన ఆ బ్రహ్మను ఉపాసిస్తున్నారు ఈ లోకంలో ఏది తెలియబడినా బ్రహ్మ అనే తేజస్సు చేతనే తెలియబడుతోంది. బ్రహ్మ స్వయం జ్యోతిః స్వరూపుడు అవడం చేత మరొక దానిచేత దేనిచేతా తెలియబడడు. అలాంటప్పుడు సూర్యచంద్రాదులు బ్రహ్మ విషయంలో ప్రకాశించే ప్రసక్తే లేదు. బ్రహ్మ ఇతరమైన వాటిని తెలిసేటట్లు చేస్తుంది.కానీ బ్రహ్మ మరొక దాని చేత తెలియబడడు.ఇతర జ్యోతిస్సులు ఏమి లేనప్పుడు పురుషుడు అంటే ఆత్మనే జ్యోతిస్సు ఉంటాడు. ఆత్మ దేని చేత తెలియబడదు అని శృతులు చెబుతున్నాయి.
సూత్రం :-86
“అపి చ స్మర్యతే "
అపి :- ఉపనిషత్ వాక్యాల్లోనే కాక, స్మర్యతే:- స్మృతులలో చ :- కూడా
భావం:- ఉపనిషత్ వాక్యాల్లోనే కాకుండా స్మృతులలో కూడా పరమేశ్వరుడు సూక్ష్ముడు అని వర్ణించారు.
వివరణ :- మనుస్మృతి :- ( 12- 122):- ఈశ్వరుడు అల్పం కన్నా అల్పం, సూక్ష్మం , సర్వ ప్రకాశకుడు, అణువు కన్నా సూక్ష్ముడని స్మృతులలో, ఉపనిషత్తులలో వర్ణించారు కనుక దహరాకాశ పదం బ్రహ్మ వాచకమే.
బృహదారణ్యకోపనిషత్తు:- ఒక రోజున యాజ్ఞవల్కుడు జనక మహారాజు ఆస్థానానికి వచ్చాడు. అతనికి నమస్కరించి, జనక మహారాజు తన సందేహాలు తీర్చాలని అడిగాడు. సరేనన్నాడు యాజ్ఞవుల్కుడు.
జనకమహారాజు:- 1.మానవుడు ఏ వెలుగు వల్ల నిత్యకృత్యాలు సాగిస్తున్నాడు?
జ) యజ్ఞవుల్కుడు;- సూర్యుని వెలుగు వల్ల.
2. సూర్యుడు లేకపోతే అంటే రాత్రులు యందు ఏ వెలుగుచేత నిత్యకృత్యాలు సాగిస్తారు? జ).చంద్రుని కాంతిలో
3 .సూర్యుడు, చంద్రుడు ఇద్దరూ లేనప్పుడు అంటే సంధ్యా సమయంలో? జ).అగ్ని కాంతులలో
4 . సూర్యుడు, చంద్రుడు, అగ్ని లేనప్పుడు? జ).వాక్కు సాయంతో
5 .మరి వాక్కు కూడా లేనప్పుడు?
జ).జనక మహారాజా! ఈ వెలుగులన్నింటికి ఆవల ఆత్మజ్యోతి ఉన్నది. ఆ జ్యోతి ప్రకాశకులకు ప్రకాశం, కాంతులకు కాంతి అటువంటి ఆత్మ వల్లనే మానవుడు మనుగడ సాగిస్తున్నాడు. ప్రాణుల్లోనూ బుద్ధి, వృత్తుల యందు ఉండే విజ్ఞానాత్మయే ( జీవాత్మ ) ఆత్మ. ఇంద్రియాల మధ్య స్వయంప్రకాశమై హృదయంలో ఉండే పురుషుడే ఆత్మ. అతడే జ్యోతి స్వరూపుడు.
ముండకోపనిషత్తు:- నతత్ర సూర్యోభాతి నతత్ర చంద్రతారకం --అక్కడ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఏవి ప్రకాశించవు. కేవలం ఆత్మజ్యోతి ప్రకాశం మాత్రమే ఉంటుంది. పరమేశ్వర స్వరూపం జ్ఞానజ్యోతి. ఆజ్యోతి నుంచి అనేక వేల లక్షల కోట్ల కోటానుకోట్ల కిరణాలు ప్రకాశిస్తున్నాయి. అందులో 360 కిరణాలు మాత్రమే మనం తీసుకోగలిగాం. అందులో అగ్ని 108 కిరణములు , రవి 116 కి., చంద్రుడు 136 కి.,తీసుకోగలిగారు. ఈ మొత్తం 360 కిరణాలు సూర్యుడు, చంద్రుడు అన్ని అందరూ ఆ పరమేశ్వరుని కిరణాల వల్లనే ప్రకాశిస్తున్నాయి. ఈ రకంగా బ్రహ్మ వల్లనే ఈ జగత్తు అంతా ప్రకాశిస్తోంది. పరబ్రహ్మ స్వయంప్రకాశం గలవాడు. అణువు కన్నా సూక్ష్మమైన రూపం ప్రాజ్ఞునికే(బ్రహ్మకు) ఉన్నట్లు భగవద్గీతలో చెప్పబడింది. దానిని సూర్యుడూ కానీ చంద్రుడు కానీ అగ్ని కానీ ప్రకాశింపచేయజాలరు. ఏ స్థానాన్ని పొంది తిరిగి వెనుకకు రాదో, అది నా పరమమైన స్థానం. నా స్వరూపం. జగత్తంతా ప్రకాశింపజేసే సూర్యుని కాంతి, చంద్రునిలో కాంతి, అగ్నిలోని కాంతి ఇదంతా నా తేజస్సే అని తెలుసుకో అని చెప్పబడినది.
ప్రమితాధికారణం :- ( 1, 3 , 24 )
సూత్రం :- 87
"శబ్దాదేవ ప్రమితః "
శబ్దాత్ ఏవ :- ఉపనిషత్ వాక్యాల వలన కూడా , ప్రమితః :- అంగుష్ఠ మాత్రుడని పరిమితంగా వర్ణించిన పురుషుడు పరబ్రహ్మమే.
భావం :- ఉపనిషత్ వాక్యాల వలన కూడా అంగుష్ఠ మాత్రుడని పరిమితంగా వర్ణించిన పురుషుడు పరబ్రహ్మమే.
వివరణ :- గురువుగారు! అంగుష్ఠపురుషుడు శరీరం మధ్యలో ఉన్నాడు. అతడే భూత, భవిష్యత్, వర్తమానాలకు ప్రభువు అని కఠోపనిషత్తులో చెప్పారు. ఈ అంగుష్టమాత్రుడు జీవుడా? పరమాత్మా? భారతంలో యముడు సత్యవంతుని శరీరం నుండి అంగుష్ఠమాత్రుడైన పురుషుణ్ణి బయటకు లాగాడు కదా! ఇక్కడ అంగుష్ఠమాత్రుడు జీవుడే కదా! అని అడిగాడు నారాయణ భట్టు. అంగుష్ఠమాత్రుడైన పురుషుడు అంటే జీవుడు కాదు. పరమాత్మే అన్నాడు గురువు.
కఠోపనిషత్తు:-(4-12):-భూత, భవిష్యత్, వర్తమానాలకు ఈశుడైన పురుషుడు అంగుష్ఠమాత్రుడు. శరీరమధ్యలోఉన్నాడు. ఈవర్ణన బట్టి శరీరమధ్యలో అంగుష్ఠమాత్రుడైన పురుషుణ్ణి జీవుడని భ్రమించకూడదు. జీవుడు భూతభవిష్య ద్వర్తమానాలకు ఈశుడు కానేరడు. ఆ నియామకశక్తి పరమాత్మకే ఉంది. కనుక అంగుష్ఠమాత్ర పదం బ్రహ్మనికే అన్వయిస్తుంది. శరీరమధ్యంలో అంగుష్ఠమాత్రుడైన అంటే బొటనవ్రేలు ప్రమాణం కల పురుషుడు ఉన్నాడు. అతడు ధూమం లేని జ్యోతిస్సు వంటివాడు. భూతకాలానికి,భవిష్యత్ కాలానికి కూడా ఈశ్వరుడు. ఇప్పుడు ఉన్నవాడు అతడే. రేపు కూడా అతడే నియామకుడు. ఈ అంగుష్ఠమాత్ర పురుషుడు విజ్ఞానాత్మా? పరమాత్మా? అని సంశయం. అంగుష్ఠ పరిమాణం చెప్పడం వలన విజ్ఞానాత్మయే అనిపిస్తుంది. అనంతమైన పొడవు గల పరమాత్మకు వ్రేలు పరిమాణం ఉపపన్నం కాదుకదా! యముడు సత్యవంతుని శరీరం నుండి పాశాలతో కట్టబడి అంగుష్ఠమాత్రుడైన పురుషుణ్ణి బలంగా లాగాడు అని స్మృతి చెబుతోంది. యముడు బలంగా పరమేశ్వరున్నీ లాగడం కుదరదు కదా! అందుచేత ఇక్కడ అంగుష్ఠమాత్రుడు జీవుడు అని నిశ్చయింపబడింది. అంగుష్ఠమాత్రుడైన పరిమితమైన పురుషుడు పరమాత్మే కావాలి. ఎందువల్ల? ఈశానో భూత భవ్యస్య..భూత భవిష్యత్తులకు ప్రభువు అనే వాక్యం వల్ల ఆయా కాలాలలో ఎలాంటి అడ్డంకులు లేకుండా పాలింపదగినవాడు. వాటి మీద పూర్వ అధికారం కలవాడు ఈశ్వరుడు తప్ప మరెవరూ లేదు కదా! ధర్మానికి , ఆదర్శానికి, భూత భవిష్యత్తులకు అతీతమైనది అయిన దేనిని చూస్తున్నావో అతడే బ్రహ్మ. శబ్దాదేవ ఈశానః అని పేరు వినబడటం వలననే ఇతడు పరమేశ్వరుడు అని తెలుస్తున్నది.
సూత్రం :- 88
"హృద్య పేక్షయాతు మనుష్యాధికారత్వాత్"
హృది ;- హృదయము నందు, అపేక్షయా :- పరమేశ్వరుడు ఉండడాన్ని బట్టి , మనుష్య అధికారత్వాత్ :- మనుషులను గూర్చి చెప్పి నడవడం వలన , శాస్త్రాలను మనుషుల్ని ఉద్దేశించి రచించారు. తు ;- కనుక
భావం :- శాస్త్రాలను మనుషుల్ని ఉద్దేశించి రచించారు. కనుక బ్రహ్మం హృదయంలో ఉండటం వలన ఆ శాస్త్రాలలో అంగుష్ఠ మాత్రుడని వర్ణించారు.
వివరణ :-ఈశ్వరుడు సర్వవ్యాపి అయినప్పటికీ అతడు అంగుష్ఠ మాత్రుడై హృదయస్థానంలో ఉన్నాడు. పరమేశ్వరుడు సర్వాంతర్యామి, సర్వశక్తి సంపన్నుడు, అతని కున్న ఈశత్వం, భూత భవిష్యత్తుల మీద అధికారం జీవికి ఉండవు. పరమేశ్వరుడు ఎందులో ఉంటే ఆరూపంలో ఉంటాడు. అంటే వెదురుబొంగులో ఉండే ఆకాశం సన్నగా పొడవుగా ఉంటుంది. అలాగే చీమ, దోమల యందు పరమాత్మ సూక్ష్మరూపంలో ఉంటాడు. ఈ అంగుష్ఠమాత్రుడు అనే శబ్దం మానవులలో ఉండే పరమాత్మని వర్ణిస్తాయి. కాబట్టి అంగుష్ఠమాత్ర పురుషుడు పరబ్రహ్మ అని అన్నాడు రత్నాకరుడు. పరమేశ్వరుడు సర్వగతమే అయినా కూడా హృదయంలో ఉండడాన్ని బట్టి ఈ అంగుష్ఠమాత్రత్వం వెదురు కణుపును బట్టి ఆకాశం జానెడు అన్నట్లు చెప్పబడుచున్నది. అత్యధిక ప్రమాణంగల పరమాత్మకు అంగుష్ఠ మాత్రత్వం సరిఅయిన రీతిలో కుదరదు కదా! ఈశానః శబ్దాలుండటం వలన పరమాత్మను తప్ప మరెవరిని గ్రహించడం కుదరదు. ప్రాణి భేదాన్ని బట్టి హృదయప్రమాణం ఒకే విధంగా ఉండదు కనుక హృదయాన్ని బట్టి అంగుష్ఠ మాత్రత్వం చెప్పబడింది. శాస్త్రం చెప్పినట్లుగా ఇది మనుషులకే వర్తిస్తుంది. మనుషుల శరీరం ఒక నియతమైన పరిమాణంలో ఉంటుంది. వారి హృదయం వారి అంగుష్ట ప్రమాణంలో నియతంగా ఉంటుంది. అందువలన పరమాత్మ అంగుష్ఠప్రమాణం అని చెప్పబడినది. ఈ అంగుష్ఠమాత్ర పురుషుడు సంసారి అనే గ్రహించాలి. సంసారియైన అంగష్ఠమాత్ర పురుషునికి బ్రహ్మత్వం ఉపదేశించబడుతుంది. వేదాంతాలు రెండు విషయాలు ప్రతిపాదిస్తాయి. 1.కొన్నిచోట్ల పరమాత్మ స్వరూపాన్ని ప్రతిపాదిస్తాయి. 2. కొన్ని చోట్ల విజ్ఞానాత్మకు పరమాత్మ లో ఐక్యాన్ని బోధిస్తాయి. ప్రతి హృదయంలో అంతరాత్మగా చేరి ఉన్న పురుషుణ్ణి బుద్ధి బలంతో అతనే బ్రహ్మ అని తెలుసుకోవాలి.
దేవతాధికరణం :- ( 1, 3 , 26 )
సూత్రం :- 89
"తదుపర్యపి బాధరాయణః సంభావాత్"
సంభవాత్:- బ్రహ్మం వ్యాపకం , తత్ ఉపరిఅపి:- హృదయానికి బయట కూడా ఉంటుంది అని, బాదరాయణః :- బాదరాయణుడు అంటారు.
భావం:- బ్రహ్మం హృదయంలో తన్మాత్రరూపంలో ఉండటం సంభవమే కనుక హృదయం బయట కూడా ఉంటుందని బాదరాయణుడు చెప్పారు.
వివరణ :- బ్రహ్మవిద్యను ఎవరు అభ్యసించాలి? మానవులకు బ్రహ్మోపదేశం పొందే హక్కు ఉన్నది. మరి దేవతలకు బ్రహ్మవిద్యను పొందే హక్కు ఉన్నదా? అన్నాడు కృష్ణ శర్మ. శిష్యుడి అనుమానం తీర్చడానికి సంసిద్ధుదౌతున్నాడు రత్నాకరుడు. మానవుల కన్నా ఉన్నతులు దేవతలు. దేవతలు భోగలాలసులు అనే మాట నిజమే. కానీ వారి భోగం శాశ్వతం కాదు అనే విషయం వారికి తెలుసు. అందుకే వారుకూడా శాశ్వతమైన ఆనందం కావాలి అనుకుంటారు. కాబట్టి వారికి కూడా వైరాగ్యం కలుగుతుంది. అప్పుడే బ్రహ్మవిద్యకు అధికారులౌతారు. బాదరాయణుడు మనుష్యుల కంటే పై వాళ్ళయిన దేవతలకు కూడా బ్రహ్మవిద్యాధికారాన్ని అంగీకరిస్తున్నాడు. వాళ్లకు కూడా బ్రహ్మ విద్యకు ఉండవలసిన లక్షణాలు ఉండటానికి అవకాశం ఉంది. మనుష్యులకు అధికారం ఉంది కాని దేవతలకు అధికారం ఉందా అని సందేహం కలుగుతుంది. దీని గురించే చర్చింపబడుతోంది. దేవతలకు అధికారం లేదు అని పూర్వ పక్షానికి ఫలం దేవత్వం పొందడం ద్వారా క్రమముక్తికి సాధనమైన దహరోపాసనాదులతో మనుష్యుడు ప్రవర్తించకపోవడం, దేవత్వ ప్రాప్తికి ప్రయత్నించడం ఈ సిద్ధాంతంలో చెప్పబడింది. శాస్త్రం మనుష్యులను ఉద్దేశించి చెప్పబడింది కాబట్టి మనుష్యహృదయ ప్రమాణాన్ని అనుసరించి అంగుష్ఠమాత్ర శృతి వచ్చింది. బ్రహ్మజ్ఞానానికి సంబంధించినంత వరకు మనుష్యులకు మాత్రమే ఉద్దేశించబడింది. ఆ పైన దేవతాదుల విషయంలో కూడా ఈ శాస్త్రం ప్రవర్తిస్తుందని బాధరాయణాచార్యులు తలుస్తున్నారు. వాళ్ళకి కూడా అధికారికారణం అంటే అధికారాన్ని కల్పించే హేతువు సంభవిస్తుంది కదా! దేవతలు కూడా భోగవస్తువులు ఐశ్వర్యం అనిత్యమైనవని తలంచి మోక్షాన్ని కోరుకుంటున్నారు. పురాణాలు, ఇతిహాసలలో దేవతలకు కూడా దేహాలు ఉన్నాయని తెలుస్తోంది. అందుకే వాళ్లకు కూడా సామర్ధ్యం సంభవిస్తుంది.బ్రహ్మవిద్యపై వారికి ఎటువంటి నిషేధం లేదు. ఉపనయనం వేదాధ్యయనం కోసమే కదా! దేవతలు స్వయంగా వేదాలు స్ఫురించినవాళ్ళు. దేవేంద్రుడు 101 సం. ప్రజాపతి వద్ద బ్రహ్మచర్యవ్రతం అవలంభించాడు. వరుణుడి కుమారుడు భృగువు తండ్రిని బ్రహ్మోపదేశం చెయ్యమన్నాడు. దేవతలు యజ్ఞాలు చేసి సంతోషపెట్టవలసిన ఇతర దేవతలు లేరు. ఋషులకు ఇతర ఋషులు ఎవరూ లేరు. కనుక వాళ్ళకి కర్మాధికారం లేదు. అందువల్ల దేవతలకు ఉన్న విద్యాధికారాన్ని ఎవరూ కాదనలేరు. దేవతలకు అధికారం ఉన్నా కూడా అంగుష్ఠమాత్ర శృతి వాళ్ళ అంగుష్టాన్ని బట్టి ఉంటుంది.
సూత్రం :- 90
"కర్మణి విరోధ ఇతి చేన్నానేక ప్రతి పత్తేరదర్శనాథ్"
కర్మణి :- జగత్ రచనాత్మక కర్మ యందు, విరోధ ఇతి చేత్ :- విరోధం కలుగుతుంది కదా! అని అన్నట్లయితే న ;- అట్లు కాదు, అనేక ప్రతిపత్తేః :- అనేక రూపాలుగా బ్రహ్మానికి శక్తులున్నాయని, దర్శనాత్:- కనబడడం వల్ల
భావం:-పరబ్రహ్మము సర్వ వ్యాపకమైనప్పుడు జగత్తును సృష్టించే కర్మలో సర్వ వ్యాపకత్వం అడ్డంకి అవుతుంది కదా! అని అనడం తగదు.ఎందుకంటే బ్రహ్మకి అనేక శక్తులున్నాయని శాస్త్రాలంటున్నాయి.
వివరణ:-పరమాత్మ సర్వత్రా వ్యాపించినప్పుడు సృష్టి ఎలా చేయగలడు అనే సందేహం తగదు. బ్రహ్మానికి అనేక శక్తులున్నందున వాటి మూలంగా సృష్టి, స్థితి, లయలు సంభవిస్తాయి. ఋగ్వేదం పరమాత్మ శక్తియుక్తుడని తెలియజేశాయి.
బృహదారణ్యకోపనిషత్తు:- ఈ లోకాన్ని, పరలోకాన్ని సమస్త భూత రాశిని సైతం అంతర్యామిగా ఉండి నియమిస్తున్నాడు. అందుచేత వ్యాపకమైన బ్రహ్మ హృదయంలో అంగుష్ఠమాత్రుడని వర్ణించడం సరిఅయినది. దేవతలకు దేహమున్నది మానవులు చేసే యజ్ఞయాగాదులలో హవిస్సును తీసుకోవడానికి దేవతలు వస్తారు. ఒకేసారి అనేక చోట్ల ప్రత్యక్షమై హవిర్భాగం తీసుకుంటారు. శాకల్యుడు యజ్ఞవల్కుని అడుగుచున్నాడు?దేవతలు ఎంతమంది? 3306 మంది అని సమాధానం చెప్పాడు . మళ్ళీ మళ్లీ ప్రశ్నించగా 33 మంది దేవతల మహిమాలే.6,3,2,1 దేవతలని యాజ్ఞవల్కుడు సమాధానం చెబుతారు. ఒకే దేవత ఒకేసారి అనేక రూపాలు పొందుతుంది. శ్రీ కృష్ణుడు అనేక మంది గోపికలతో ఒకేసారి క్రీడించాడని చెప్పబడింది. 33 మంది దేవతల మహిమ వల్ల ఏర్పడిన రూపాలే 3306 మంది దేవతలు. ఆ 33 మంది :- 8 మంది వసువులు, 11 మంది రుద్రులు,12 మంది ఆదిత్యులు, అశని ( పిడుగు) పశువులు (ఇంద్రుడు). ఈ33 మంది అగ్ని పృధివి, వాయువు, అంతరిక్షం, ఆదిత్యుడు, చంద్ర-నక్షత్రాలలోఅంతర్గతం అవుతారని ..మరల ఈ 6 మూడు లోకాలలో అంతర్గతం అవుతారని, ఈ 3 వేల మంది అన్నప్రాణాలలో అంతర్గతమౌతారు. ఈ అన్నప్రాణాలు వాయువులో, వాయువు ప్రాణంలో అంతర్గతం అవుతాయి. ఈ విధంగా 33 మంది దేవతలు 3306 గా అయ్యారని చెప్పడం చేత దేవతలు వారి ఇచ్చానుసారం అనేక రూపాలు ధరించే సామర్ధ్యం ఉంటుంది. దేవతలకు శరీరాలు ఉంటాయని అంగీకరించి వాళ్లకు కూడా విద్యలయందు అధికారం ఉందని చెబితే, దేహాదులు ఉండటం చేత ఇంద్రాదులకు ఆహూతులు సమర్పించి నప్పుడు వాళ్ళు స్వయంగా ఋత్విక్కులవలె స్వరూపంతో వచ్చి ఆహూతులు స్వీకరించడం ద్వారా యజ్ఞయాగాది కర్మలలో భాగం కావలసివస్తుంది. అనేక యాగాలు జరుగుతున్నప్పుడు ఇంద్రుడు ఒకే సమయంలో స్వయంగా ప్రదేశాలన్నింటికి వెళ్ళలేదు కదా! అని సందేహం కలగవచ్చును. అనేక ప్రతిపత్తి కల దేవత కూడా ఒకే సమయంలో అనేక రూపాలు గ్రహించడం కుదురుతుందని శృతిలో చెప్పబడింది. 33 మంది దేవతలు ఆరు మొదలైన సంఖ్య గల దేవతలలో అంతర్గతమౌతున్నారు అని చెప్పి చివరగాఉన్న ఆఒక్క దేవత ప్రాణం అని, ఆ ఒక్క ప్రాణమే ఓకే సమయంలో అనేక రూపాలలో ఉన్నది అని చెబుతారు.
సూత్రం :- 91
"శబ్ద ఇతి చేన్నాతః ప్రభావాత్ "
ప్రత్యక్ష :- వేదం, అనుమానాభ్యమ్ :- శృతులు, స్మృతులు , అతః ప్రభావాత్:- వ్యాపకుడు, అశరీరుడు, శబ్దే:- వేదాల విషయంలో, ఇతి చేత్ :- ఇది సాధ్యం కాదు అనడం. న :- సరియైనది కాదు.
భావం :- శృతులు,స్మృతులు , ఆశరీరుడైన ఈశ్వరుని నుంచే వేదాలు ఉత్పన్నం అయ్యాయని అంటున్నాయి. ఇది సాధ్యం కాదు అనడం సరియైనది కాదు. ఈశ్వరుడు వ్యాపకుడు,శబ్దరాశి అయిన వేదం ఆయన నుండే ఉద్భవించింది.
వివరణ:-వేదం నిత్యమైనది. దేవతలు అనిత్యులు. దేవతలంతా పూర్వజన్మలో చేసిన కర్మలననుసరించి దైవత్వం పొందిన వారే. అందుకే వారు అనిత్యులు. నిత్యమైన వేదంనుంచి అనిత్యమై దేవతలు ఉద్భవించారు. ప్రజాపతి దేవతలందరిని సృష్టించాడు అని ఇతరేయోపనిషత్తులో చెప్పబడింది. ఈశ్వరునికి శరీరంలేదు. ముఖం లాంటి అవయవాలు లేవు. కనుక శబ్దరాశి అయిన వేదం వ్యాపకబ్రహ్మ నుంచి ఎలా ఉద్భవించింది? అని సంశయం. ఈశ్వరుడు మానవాళిని కర్మలలో ప్రవర్తింపజేయడానికి, నిషిద్ధకర్మలనుంచి నివృత్తి కలిగించడానికి, ఆది మహర్షుల హృదయంలో వేదమంత్రాలను స్ఫురింప జేశాడు. సార్ధకాలు, సస్వరాలు అయిన ఆ మంత్రాలను మహర్షులు ఉచ్చరించి పఠిస్తారు. ఆ కారణం వలన మహర్షులని మంత్రదృష్టలు అంటారు. వాళ్లు మంత్రకర్తలు కారు. రచయిత పరమేశ్వరుడే. దీనికి ప్రమాణం వేదాలు స్మృతులు కనుక వేదాలు ఈశ్వరీయాలు. దేవతలకు దేహం కలదిగా అంగీకరించబడుతున్నా, దేవత ఐశ్వర్యం అంటే సామర్ధ్యం ఉండటం వలన ఒకేసమయంలో అనేకకర్మలకు సంబంధించిన హవిస్సులను తింటే తినవచ్చును. అయినా దానికి శరీరం ఉండటం వలన మనకువలె జననమరణాలు ఉంటాయి కావున నిత్యమైన శబ్దానికి, నిత్యమైన అర్ధంతో, నిత్యమైన సంబంధం అని తెలియబడుచున్నది. అతః ప్రభావాత్ :- ఈ వైదిక శబ్దం నుండే దేవాదికమైన జగత్తు పుట్టింది. వేదం అనాది అయినది. నిత్యమైనది. ఈ విషయాన్ని కొన్ని యుక్తులు చెప్పబడ్డాయి. వారి సిద్ధాంతం ప్రకారం శబ్దము, అర్ధం కూడా నిత్యమైనవి. శబ్దార్ధాల సంబంధం నిత్యమే. అందుచేత వేదం నిత్యం. ఇప్పుడు దేవతలకు శరీరం ఉన్నదని అంగీకరించే పక్షంలో ఆ దేవతలకు కూడా జననమరణాలు ఉంటాయని అంగీకరించాలి. ఒకపిల్లవాడు పుట్టినప్పుడు ఆదేవతకు పేరు పెట్టినప్పుడు అంతకు ముందు ఆపేరు లేదు. అప్పుడు ఈశబ్దం కొత్తగా పుట్టినదే. కనుక నిత్యమైన శబ్దానికి నిత్యమైన అర్ధంతో నిత్యమైన సంబంధం అని అంగీకరించాలి. వేదానికి ఈ నిత్యత్వ, అన్య ప్రమాణ, నిరపేక్ష ప్రమాణాలు కుదరవు కదా! జగత్తుకు కారణం బ్రహ్మ. జగత్తు శబ్దం నుండి పుట్టినదని ఎట్లు చెప్పగలరు? ఈ జగత్తు వైదిక శబ్దాలనుండి పుట్టినదని అంగీకరించినా కూడా శబ్దం విషయంలో తేడా ఎలా పరిహరించబడింది? గోవులు, వస్తువులు మొదలైనవాటికి పుట్టుక ఉన్నా కూడా వాటి ఆకృతులకు(జాతులకు) ఉత్పత్తి లేదు కదా! అట్లే దేవతలు జన్మిస్తుంటారు కానీ వారి జాతి నిత్యమే.
సూత్రం :- 92
"అత ఏవ చ నిత్యత్వం"
అత ఏవ చ :- అందువల్లే, నిత్యత్వం :-వేదాలు నిత్యాలు
భావం :- పరమేశ్వరుడు నిత్యుడు కనుక ఆయన రచించిన వేదాలు నిత్యాలు.
వివరణ :- జీవుడు భోక్త. ప్రకృతి జీవుడికి భోగ్యము. జీవరాశి ప్రకృతి నిత్యాలే. భోక్తలైన జీవులకు హితాహితాలు ఉపదేశించే శాసనమూ నిత్యమే. శాసనమే వేదం. ప్రకృతి అంటే సాత్విక, తామసిక, రజోగుణాల సమన్వయమేనని సాంఖ్యదర్శనంలో చర్చించబడింది. మనం కళ్ళతో చూడగలిగే, మనస్సుతో భావించే, శరీరంతో స్పృశించే వాస్తవ ప్రపంచమే ఈ ప్రకృతి. అందుకే ప్రకృతి జీవుడికి భోగకారణమైనది. భోక్తలైన జీవులకు హితాహితాలు ఉపదేశించే శాసనమే వేదం. వేదంలో పాలనాపద్ధతులు, ఆయుర్వేదం, ఖగోళం, దైనందిన ఆచారాలు, జీవుడు చెయ్యవలసిన కర్మలు, నిషిద్ధకర్మలు అన్ని వేదంలోనే చెప్పబడ్డాయి. ప్రకృతి, పురుషుడు కలిస్తేనే సృష్టి జరుగుతుంది. పురుషుడు అంటే జ్ఞానం, అంతటా వ్యాపించిన నిరాకార ఆత్మతత్వం ఇంద్రియాలకు తెలియనిది, మాటలతో చెప్పజాలనిది. అదే వేదాంతంలో బ్రహ్మ అని వర్ణించబడినది. అన్ని పరిణామాలు, అశాశ్వతమైన పదార్ధాలు ప్రకృతి వల్లనే సంభవిస్తాయి. అన్ని జీవులు పురుషుని బాహ్యస్వరూపాలే. జీవుడికి సరిఅయిన జ్ఞానం లేనందున తాను శరీరం మాత్రమేనని భ్రమించి సంసారదుఃఖంలో మునిగి పోతున్నాడు. ఆత్మజ్ఞానం కలిగినప్పుడు బంధంనుండి విముక్తుడై తనలో ఉన్న పరమాత్మని దర్శించగలడు. సత్వగుణం కలవారు పైలోకాలకు వెడతారు. రజోగుణం ఉన్నవారు మానవలోకంలో, తమోగుణం వాళ్లు అధోలోకాలకు వెడతారు. భోక్తలైన జీవులకు జీవితగమనాన్ని శాసించి, హితవు ఉపదేశించేది వేదమే. నిరాకరుడైన పరబ్రహ్మ ఒక రూపం దాల్చినట్లయితే అదే అక్షరం. దాని నామమే ఓంకారం. అది నిత్యమైనది. ఓంకారం నుండే వేదాలు ఉద్భవించాయి. దేవతలు వేదాల నుంచే ఉద్భవించారు. జగత్తంతా వేదం నుంచే ఆవిర్భవించింది. ప్రతి ప్రళయకాలంలో వేదాలు నశిస్తాయి కదా! అనే సందేహం కలుగుతోంది. ప్రళయకాలంలో ఈ వేదాలు మూడు అకార, ఉకార, మకారములతో కలిసిపోతాయి. అకార, ఉకార, మకారములు ఓంకారంలో చేరిపోతాయి. వేదాలు నిత్యాలు అంటే వ్యావహారికనిత్యాలు అని గుర్తుంచు కోవాలి. పారమర్ధికనిత్యాలు కావు. దేవాది జగత్తు వేదశబ్దం నుండి పుట్టడం వలన వేదం నిత్యమని అంగీకరించాలి. దేవతలు యజ్ఞములచేత, పూర్వజన్మకృతం వలన వేదహక్కును పొందారు. మహర్షులు కూడా యుగాంతంలో అంతర్ధానం చెందినా ఇతిహాసాలతో కూడిన వేదాలను తిరిగి పొందడానికి బ్రహ్మదేవుని చేత అనుమతిపబడ్డారు.
సూత్రం :- 93
"సమాన నామరూప త్వాచ్ఛా వృత్తావస్య విరోధో దర్శనాత్ స్మృతేచ్ఛ"
ఆవృత్తాఅపి:- వేదాలు ప్రతీసర్గ ఆరంభంలో మళ్ళీ ఉత్పన్నం అయినప్పటికీ , అవిరోధః:నిత్యాలు అనడంలో ఏవిరోధం లేదు. సమాననామరూపత్వాత్ :- వాటి నామరూపాల్లో ఎలాంటి తేడా ఉండదు. దర్శనాత్ :-మంత్ర వర్గాల వలన స్మృతేః: - మహర్షులు అనుగ్రహించిన ధర్మశాస్త్రాల వలన కూడా వేదాలు పూర్వోత్తర సర్గలో సమానాలే.
భావం:-వేదాలు ప్రతీ సర్గ ఆరంభంలో మళ్ళీ ఉత్పన్నం అయినప్పటికీ వాటిని నిత్యాలు అనడంలో ఏవిరోధం లేదు. వాటి నామరూపాల్లో ఎలాంటి తేడా ఉండదు. మంత్రవర్గాల వల్ల మహర్షులు అనుగ్రహించిన ధర్మశాస్త్రాల వల్ల కూడా వేదాలు పూర్వోత్తర సర్గలో వలె సమానంగానే ఉన్నాయి కానీ భిన్నంగాలేవని ప్రమాణాలున్నాయి.
వివరణ :- ఒక అక్షరానికి లేదా పదానికి దాని ఆకారమే అర్ధం. ప్రళయకాలంలో సమస్తము నశించిపోతాయి. మళ్ళీ అదే ఆకారాలతో పుడతారనే నమ్మకం లేదు కదా! ప్రళయం సంభవించినప్పుడు సమస్తము పరమాత్మలో లీనమైపోతాయి. సృష్టి జరిగినప్పుడు మళ్ళీపుడతాయి. వేసవికాలంలో చెరువులు ఎండిపోతాయి. వాటిలోని చేపలు, కప్పలు అన్ని చచ్చిపోతాయి. వర్షాలు పడి చెరువులు నిండగానే మళ్ళీ అన్నీ పుట్టినట్లే ఈ సృష్టి, ప్రళయాలు సంభవిస్తాయి. సృష్టి జరిగినప్పుడు మళ్ళీ జీవరాశులు పరమాత్మ నుంచి ఉద్భవిస్తాయి అని ఐతరేయోపనిషత్తు, ముండకోపనిషత్తులో చెప్పబడింది. ప్రళయకాలంలో దేవతలు కూడా పరమాత్మలో లీనం అయిపోయి మళ్ళీ ఆవిర్భవిస్తారు. అందుచేతనే దేవతలు శాశ్వతానందం కోసం ప్రయత్నం చేస్తారు. వారికి బ్రహ్మవిద్యాధికారం ఉన్నది. ఈశ్వరుడు సృష్టి ఆది యందు మహర్షుల ద్వారా ఏయే నామరుపాలున్న వేదాలను ఏ క్రమంలో ప్రకటితం చేశాడో, ఆ వేదాలని అదే క్రమంలో రాబోయే సృష్టిలో సైతం ప్రకటితం చేస్తాడు .వాటిలో ఎలాంటి బేధం ఉండదు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం ఈ పేర్లలోగాని, మంత్రాలలోని వర్ణక్రమం కానీ ఎలాంటి బేధం ఉండదు. భగవంతుడు సర్వజ్ఞుడు. సర్వ శక్తిమంతుడు. కనుక ఆయన సృష్టిలోను, శాసనంలోను ఏ మార్పు ఉండదు.ఆయన ప్రసాదించిన జ్ఞానం త్రికాలములలో ఒకే రకంగా ఉంటుంది. అంతే కాదు. ప్రతి సృష్టిలో కూడా పదార్ధ రచన పూర్వ సృష్టి లాగే ఉంటుంది.
ఋగ్వేదం :- సూర్యచంద్రులు, దివం, పృధివి, అంతరిక్షం, వీటన్నింటికి పూర్వంలాగే విధాత రచించాడు. ఈ జగద్విజ్ఞానమే వేదం. ప్రతి సర్గలోను నామరూపాలుండవు. కనుక అవి నిత్యాలు. సృష్టి, ఉత్పత్తి, వినాశనం ఉన్నా ప్రవాహం ఎలా నిత్యమో, వేదాలు కూడా ప్రవాహ నిత్యాలే.
మనుస్మృతి:- (1,23):- ఋగ్యజుః సామ్య లక్షణాలు ఉన్న నిత్యమైన వేదాన్ని యజ్ఞ సిద్ధి కోసం ఈశ్వరుడు ప్రకటించాడు.
ఇలా వేదాలు ప్రతి సర్గలో ఉద్భవించిన అవి నిత్యాలే.
సూత్రం :- 96
"భావంతు బాదరాయణోస్తి హి"
తు:- జైమినివాదం సరియైనది కాదు, భావః:- శూద్రులకు కూడా వేదాధ్యయన అధికారం ఉన్నదని, బాదరాయణః:- బాదరాయణుడి సిద్ధాంతం. అస్తి :- మధుచ్చంద్రాదుల్లో శూద్రుడు కూడా ఉన్నాడు.
భావం ;- జైమిని చెప్పినట్లుగా శూద్రులకు వేదాధ్యయన అధికారం లేదన్న వాదన సరియైనది కాదు. వారికి కూడా వేదాధ్యయనం చేసే అధికారం ఉన్నదని బాదరాయణుడి అభిప్రాయం.
వివరణ:-వ్యాసుడు(బాదరాయణుడు) శూద్రులకు కూడా వేదాధ్యయనం చేసే అధికారం ఉన్నదని అంటున్నారు. వేద ప్రచారకులైన ఋషుల్లో కవషుడు అనే శూద్రుడు ఉన్నాడని ఋగ్వేదం పదోమండలం 30వ సూక్తంలో ఉన్నది. ఈ సూక్తానికి కవషుడు ద్రష్ట అని ఐతరేయబ్రహ్మణంలో పేర్కొన్నారు. మానవులంతా శాస్త్రానికి అర్హులే. శూద్రపదం జాతివాచకం కాదు. అది గుణవాచకమని వ్యాసుని ప్రతిపాదన. బాదరాయణుడు దేవాదులకు కూడా అధికారం ఉన్నదని తెలియజేస్తున్నాడు. అధికారానికి కావలసిన ఆర్థిత్వం(కోరిక), తెలుసుకునే సామర్ధ్యం ఉన్నప్పుడు వారిని నిరాకరించ కూడదు. మనుషులలో కూడా బ్రాహ్మణాదులకు అందరికి రాజసూయయాగం చెయ్యడానికి అధికారం లేదు. అక్కడ ఏ న్యాయమే ఇక్కడ కూడా అదే వర్తిస్తుంది. శ్రుతలలో దేవాదులకు అధికారాన్ని సూచిస్తూ దేవతలలో ఎవరెవరు ఆత్మ స్వరూపాన్ని తెలుసుకున్నారో అతను ఆబ్రహ్మగానే అయ్యాడు. దేవతలలో ఇంద్రుడు, అసురులలో విరోచనుడు బ్రహ్మవిద్య కొరకు ప్రజాపతి దగ్గరకు వెళ్ళారు. దేవతలు ఐశ్వర్యవంతులు అవడంచేత తమ ఇష్టప్రకారం ఆయా శరీరాలను ధరించడానికి సామర్ధ్యం ఉంది. ఇంద్రుడు గొర్రెరూపం ధరించి కాణ్వాయణుడైన మేధాతిరిని అపహరించాడు. ఆదిత్యుడు పురుషరూపం దాల్చి కుంతిని సమీపించాడు. వీరందరిలో భూతధాతువు మాత్రం అచేతనమే. వాటిని అధిష్టించిన దేవతలు చేతనులు. విధివాక్యాలను బట్టి ఇంద్రాదులకు విగ్రహాదులు ఉండవలసిన అవసరం ఉందని తెలుస్తోంది. రూపం లేని ఇంద్రాదులను మనస్సులో ధ్యానించడం శక్యంకాదు కదా! మనస్సును ఆయా దేవతలను మనస్సుచేత ధ్యానించాలి అని శ్రుతి చెబుతోంది. మనకు ప్రత్యక్షం కానివి ప్రాచీనులకు ప్రత్యేక్షం కావచ్చును. వ్యాపారులు దేవాదులతో ప్రత్యక్షంగా వ్యవహరించేవారని తెలుస్తోంది. ప్రాచీనులు అత్యధికమైన ధర్మంయొక్క బలం వల్ల దేవతలతో ప్రత్యక్షంగా వ్యవహరించేవారు. కొన్ని ఉపాసనలు చేసినవారు ఆయా దేవలోకములకు వెళ్లి, అక్కడ కాలం ఉండి, తరువాత ముక్తిని పొందుతారు. అదే క్రమముక్తి. దేవతలకు శరీరమే లేకపోతే వాళ్ళ లోకాలకు వెళ్లడం, అక్కడ ఉన్న దేవతలతో కలసి కొంతకాలం ఉండటం కుదరదు. ఈ క్రమముక్తి శాస్త్రాలలో కనబడటం వలన దేవతలకు విగ్రహాలున్నాయని అంగీకరించాలి.
కంపనాధికరణం :- (1, 3, 39)
సూత్రం :- ( 102 )
"కంపనాత్"
కంపనాత్ :- అంటే ప్రాణక్రియకు కారణం కావడం వలన, బ్రహ్మాన్ని ప్రాణః:- ప్రాణ శబ్దంతో వ్యవహరిస్తారు.
భావం :- కంపనం అంటే వ్యాపకబ్రహ్మాన్ని ప్రతిపాదిస్తుంది. ప్రాణక్రియకు కారణమైన ప్రాణ శబ్దం బ్రహ్మాన్ని సూచిస్తుంది. వివరణ:-సమస్తజగత్తు ప్రాణం నుండి పుట్టి చరిస్తోంది. బృహదారణ్యకోపనిషత్తు:- దోషభూయిష్టమైన ఇతర అవయవాలకు ఆత్మతత్వం సిద్దించలేదు. ముఖ్యప్రాణం పాపరహితిమైనది. అందుకే దానికి ఆత్మతత్వం సిద్దించింది. కాబట్టి మిగిలిన ఇంద్రియాలు ప్రాణాల్ని ఆత్మరూపంలో ఆశ్రయించినాయి. పవిత్రమైనప్రాణానికి మృత్యువు ఎప్పుడూ దూరంగానే ఉంటుంది. మృత్యువు ప్రాణం తీసింది అనుకుంటాము. అది తప్పు. ప్రాణాలు పోయిన తరువాత మృత్యువు ఆసన్న మౌతుంది అని చెప్పబడినది. అంటే ఆప్రాణానికి ఆత్మత్వం ఉన్నది. అందుకే సమస్తాన్ని ప్రవర్తింపజేసే ప్రాణం బ్రహ్మమే. ప్రాణం నుండి పుట్టిన ఈ జగత్తంతా ఆ ప్రాణం అంటే, బ్రహ్మ ఇలా ఉండగా కదులుతున్నది అనగా ఈ జగత్తంతా ఆ బ్రహ్మ యందే కదులుతుంది. ఈ బ్రహ్మ పైకి ఎత్తబడిన వజ్రం వలె చాలా భయాంకరమైనది. దీనిని తెలుసుకున్నవారు మరణ రహితులౌతున్నారు. దానిని తెలుసుకోవడం వలన అమృతత్వం లభిస్తుంది. ఈ ప్రాణం అంటే ఏమిటో? భయంకరమైన వజ్రం ఏదో స్పష్టంగా తెలియకపోవడంచేత విచారణచెయ్యగా శరీరంలో 5విధాలుగా ఉండే వాయువే ప్రాణం అని తెలుస్తోంది. ఈ ప్రపంచం అంతా పంచవృత్తి అయిన ప్రాణం అనే పేరు గల వాయువు నందే ప్రతిష్ఠితమై స్పందిస్తున్నది. వాయువే పర్జన్యుడిగా మారితే మెరుపులు, మేఘాలు, వర్షం, పిడుగులు ఏర్పడతాయని అంటారు. అలాంటి వాయువును తెలుసుకోవడం వలన అమృతత్వం లభిస్తుంది. విశేషరూపాలన్ని వాయువే. సామాన్యరూపాలన్ని వాయువే. ఈ విషయం తెలుసుకున్నవారు అపమృత్యు భయాన్ని జయిస్తాడు. మరొక శృతిలో ప్రాణ విజ్ఞానం వలన అమృతత్వం లభిస్తుందని చెప్పబడింది. ఈవాక్యం ప్రాణోపాసనను బోధిస్తుంది. ప్రాణశబ్దం కూడా పరమాత్మ అనే అర్థంలో ప్రయోగించ బడింది. కానీ కేవలం వాయువు కుదరదు. పరమాత్మ భయం చేతనే అగ్ని కాలుస్తుంది. సూర్యుడు ప్రకాశిస్తుంటాడు. ఇంద్రుడు, వాయువు కూడా భయం వల్లనే వారి పనులు చేస్తుంటారు. 5వ దైన మృత్యుదేవత కూడా భయం వల్లనే పరుగుడుతున్నది. రాజుయొక్క శాసనం ప్రకారం ప్రజలు ఎట్లు ప్రవర్తిస్తారో, అట్లే ఈఅగ్ని, వాయువు, సూర్యుడు మొదలైన జగత్తు బ్రహ్మకు భయపడుతూ నియమం ప్రకారం తమ పనిలో నిమగ్నమౌతున్నాయి. అందుకే భయంకరమైన బ్రహ్మ వజ్రంతో పోల్చబడింది. సమస్తభువనాలు ఆయనవలనే చరిస్తున్నాయి. పృధివి, సూర్య లోకాలు పరమాత్మకు వినమ్ర లౌతాయి. ఆయన బలానికి పర్వతాలు భయపడతాయి. అందుకే ఆయన శాసనం వజ్రం కంటే కఠినమైనది. వజ్రం అంటే పిడుగు అనే అర్ధం కూడాఉంది. ఇది వాయువు యొక్క మహాత్మ్యం గా చెప్పబడుతోంది. వాయువే ప్రాణమని, సమస్తాన్ని ప్రవర్తిపజేసే ప్రాణమే బ్రహ్మమని, దానిని తెలుసుకోవడంతో బ్రహ్మజ్ఞానం కలిగి అమృతత్వం సిద్ధిస్తుంది.
జ్యోతిరధికరణం :- ( 1, 3 ,40 )
సూత్రం :- 103
"జ్యోతిద్దర్శనాత్"
దర్శనాత్ :- అనేక శాస్త్రాలలో పరబ్రహ్మము అనే అర్థంలో జ్యోతిః అనే శబ్దాన్ని ప్రయోగించడం వలన, జ్యోతిః :- జ్యోతి శబ్దం పరమాత్మ వాచకమే.
భావం:- అనేక శాస్త్రాలలో జ్యోత్ శబ్దం పరబ్రహ్మము అనే అర్థంలో ప్రయోగించడం వలన జ్యోతిశబ్దం పరమాత్మ వాచకమే.
వివరణ :- ముండకోపనిషత్తు:- పరమేశ్వరుడు సూర్యాది ప్రకాశకతత్వాన్ని సైతం ప్రకాశింపజేసేవాడు. కనుక బ్రహ్మం జ్యోతిస్సులకు జ్యోతిస్సు , వెలుగులకే వెలుగు. ఆయన వల్లనే సర్వం ప్రకాశిస్తున్నాయి.
అధర్వణ వేదం :- శుక్రమ్, భ్రాజం, ప్రకాశం, జ్యోతి అని బ్రహ్మాన్ని వర్ణించారు. కనుక జ్యోతిశబ్దం పరబ్రహ్మమే. ఇక్కడ జ్యోతి శబ్దం చేత చెప్పబడినది చక్షురింద్రియానికి కనబడేది, చీకటిని తొలగించేది, అయిన తేజస్సా? లేక బ్రహ్మయా? అని సందేహం. ప్రసిద్ధమైన తేజస్సే జ్యోతిః శబ్దరాజ్యం" అని ఎందువల్ల ఈఅర్థంలో జ్యోతిశబ్దం స్వార్ధాన్ని విడిచిపెట్టడానికి కారణం ఏది కనబడటం లేదు. మరణించిన తరువాత ఈశరీరం నుండి పైకి లేచిపోతాడో అప్పుడు ఈసూర్యరశ్ముల సహయంతో ఊర్ధ్వలోకాలను చేరతాడు. ముముక్షువు ఆదిత్యుడిని పొందుతాడు అని చెప్పబడినది. అందువలన ప్రసిద్ధమైన తేజస్సే జ్యోతిశబ్ద రాజ్యం. సర్వజగత్తుయొక్క చేష్టలకు కారణం ప్రాణమని చెప్పడం వలన ప్రాణశబ్దానికి అర్ధం బ్రహ్మ అని వెనుకటి అధికరణంలో చెప్పబడింది. అలాగే జ్యోతిః శబ్ద వాచ్యమైనది పరబ్రహ్మయే. బ్రహ్మభావం పొందితే కానీ అశరీరత్వం కుదరదు. పరంజ్యోతిః, ఉత్తమపురుషః అని విశేషణాలు ప్రయోగింపబడ్డాయి. అనగా పరంజ్యోతిగా చెప్పబడిన దానినే ఉత్తమపురుషుడిగా చెప్పడం జరిగింది. ముముక్షువులకు ఆదిత్యప్రాప్తి చెప్పబడినా, అది అత్యంతిక మోక్షం కాదు. వాళ్ళు కొంతకాలం తరువాత మరల జన్మవస్తుంది. గత్యుత్కాలగతులుండకుండా అంటే తిరిగి జన్మరాకుండా పరబ్రహ్మంలో లీనమవ్వడమే మోక్షం అని చెప్పబడినది.
సుషుప్త్య త్కాం త్యధికరణం :- ( 1, 3, 42 )
సూత్రం :- 105
"సుషుప్తి ఉత్కంత్యోః భేదేన"
సుషుప్తిః :- సుషుప్తియందు బయటకువెడలుట యందు , ఉత్క్రాంతిత్యోః :- జీవుడు తన శరీరాన్ని వదలి వెళ్లడం, భేదేన :- జీవాత్మను పరమాత్మ కంటే వేరే అని ఉపదేశించడం వల్ల,
భావం :- సుషుప్తి అంటే గాఢ నిద్రలో జీవుడు తన శరీరాన్ని వదలి వెళ్లడం జీవాత్మను పరమాత్మ కంటే వేరే అని ఉపదేశించడం వల్ల బ్రహ్మ జీవాత్మ కన్నా భిన్నం అని సూత్రానికి అర్ధం.
వివరణ:-బృహదారణ్యకోపనిషత్తు:-(4,3,21):-ఇక్కడ పురుషః అంటే జీవాత్మ. ప్రాజ్ఞః:-అంటే పరమాత్మ, తన ప్రియురాలైన స్త్రీని బాగా కౌగిలించుకొన్న పురుషుడు బయటా, లోపలా అనే తేడా మరచిపోయి తన్మయత్వం చెందినట్లుగా జీవుడు ప్రాజ్ఞుడైన ఈశ్వరుణ్ణి పొంది బాహ్యంగా ఉన్న అభ్యంతరాలను విస్మరించి బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు.
ఉత్క్రాంతి వర్ణన :- బండి బరువుగా ఉన్నప్పుడు శబ్దం చేస్తూ ఈ లోకంలో వెళ్లినట్లుగా జీవాత్మ పరమాత్మను అధిష్టించి ఉన్నప్పుడు ధ్వనిచేస్తూ వెడతాడు. జీవుడు జీవనయాత్ర ముగించుకొని చివరకు శరీరాన్ని విడిచిపెట్టి వేదనతో ఆర్త నాదం చేస్తూ పరమాత్మ అధిష్ఠితుడై వెళ్లి పోతాడు. పై వర్ణనలో సుషుప్తికి, ఉత్క్రాంతికి సంబంధించిన స్థలాలలో జీవాత్మ పరమాత్మ వేర్వేరు అని వివరణ ఉన్నది.వీళ్ళిద్దరూ ఒక్కటే అయితే ఇలాంటి వర్ణన ఉండదు. ఈవాక్యాలలో జీవాత్మని శరీరాత్మ అని, పరమాత్మను ప్రజ్ఞాత్మ అని వర్ణించారు. జీవాత్మకు పరమాత్మలకు ఉండే తేడా సుషుప్తిలో ఉత్క్రమణలో, ప్రళయంలో, ముక్తిలో కూడా ఉంటుంది. ఈ భిన్నం తాత్వికమే కానీ కల్పితం కాదు.
బృహదారణ్యకోపనిషత్తు:- ఆత్మఎవరు? విజ్ఞానమయుడు, బుద్ధిమయుడు, ప్రాణాలలోను హృదయంలోను వాటి కంటే వేరుగా ఉంటాడు. జ్యోతిస్వరూపుడైన ఏ పురుషుడున్నాడో అతడే ఆత్మ . సంసారి యొక్క స్వరూపాన్ని చెప్పడం కోసమే ఉర్దిష్టమైనదా? లేక అసంసారి స్వరూపం ప్రతిపాదించడానికి ఆర్దిష్టమైనడా? అనేదే సందేహం. సంసారి యొక్క స్వరూప మాత్ర ప్రతిపాదనకరమని తేలింది. ప్రాణాలలో ఏ విజ్ఞానమయి ఆత్మ ఉన్నదో అదే గొప్ప ప్రతిపాదన కరమని తేలింది. ప్రాణాలలో ఏ విజ్ఞానమయి ఆత్మ ఉన్నదో అదే గొప్ప జన్మరహితమైన ఆత్మ అని దానిని విడువలేదు. మధ్యలో జాగ్రదావస్ట మొదలైన అవస్థలను చెప్పడం చేత ఆ జీవుణ్ణి గురించే సవిస్తరంగా చెప్పడం జరిగింది. నామారూపాలకన్నా భిన్నంగా చెప్పడం వలన ఆకాశం బ్రహ్మ అని వెనుకటి అధికారణంలో చెప్పబడింది. జీవాత్మ పరమాత్మలు భేదం లేకపోయినా భేదం ఉన్నట్లు కనబడుతోంది. సుషుప్తిలో ఉత్క్రాంతిలో దేహం విడిచి వెళ్ళేటప్పుడు ఈ పురుషుడు ప్రాజ్ఞత్మతో కలిసిపోయి బాహ్యమైన దానిని గాని, లోపల ఉన్నదానిని గాని తెలుసుకోలేడు. ఇక్కడ పురుషుడు అంటే శారీరుడు. ఎందువలనంటే అతడే తెలుసుకునేవాడు. బాహ్యమైన విషయాలు తెలుసుకోవలసి ఉండగా తెలుసుకోవడం లేదు. తెలుసుకునే అవకాశం ఉన్నా దానిని గురించి తెలుసుకోవడం లేదు. సర్వజ్ఞత్వ రూపమైన ప్రజ్ఞ నుండి ఎన్నడూ దూరం కాకపోవడం చేత ప్రాజ్ఞుడు అనగా పరమేశ్వరుడు ఉత్క్రాంతి సమయంలో కూడా ఈ జీవుడు పరమాత్మ చేత అధిష్ఠితుడై వెళ్లనున్నాడు అని జీవుని కంటే వేరుగా పరమేశ్వరుణ్ణి చెప్పడం జరుగుతోంది. ఈ విధంగా బ్రహ్మం జీవాత్మ కన్నా భిన్నంగా ఉన్నట్లు చెప్పబడుతోంది. సుషుప్తిలో పుణ్యం చేత స్పృశించబడక, పాపం చేత స్పృశించబడక హృదయం యొక్క సమస్త లోకాలను దాటినవాడవుతున్నాడు. భౌతికంగా అతను సంసారి అయినప్పటికీ సుషుప్తిలో అతను అసంసారిక స్వరూపాన్ని కలిగి ఆత్మ స్వరూపాన్ని దర్శిస్తున్నాడు.
సూత్రం :- 106
"పత్యాది శబ్దేభ్యశ్చ"
చ - ఇంతే కాక, పతి ఆది శబ్దేభ్యహ్ :- శాస్త్రాలలో ఈశ్వరుణ్ణి పతి లాంటి శబ్దాల్లో సూచించారు.
భావం:- శాస్త్రాల్లో పరమేశ్వరుని పతి లాంటి శబ్దాల్లో సూచించడం వలన బ్రహ్మం, జీవాత్మ వేరు అని తెలుస్తోంది. ఒకవేళ ఇద్దరిలో భేదం లేని పక్షంలో సర్వాధిపతి, ప్రాణశృతి, జగత్పతి, అనే శబ్దాలు ఇద్దరికి వర్తించేవి. కానీ పతి శబ్దం మాత్రం బ్రహ్మవాచకమే.
వివరణ :- భూతాధిపతి, సర్వేశ్వరుడు, భూతరాజు, ఈశానుడు, సర్వాధిపతి లాంటి శబ్దాలు బ్రహ్మాన్ని బోధిస్తాయి. వీటిని జీవుడి విషయంలో ఎక్కడా ఉపయోగించలేదు. దీనిలో పతి మొదలైన శబ్దాలు అసంసారియైన వాడి స్వరూపాన్ని ప్రతిపాదిస్తాయి. ఈ అధికారణంలో సుషుప్తిలో ఉండే పురుషుడు ఆత్మా? కాదా?అని విషయం వివరించబడింది.
బృహదారణ్యకోపనిషత్తు:- జనకుడు యాజ్ఞవల్కుని ఆత్మను గురించి వివరించమని అడిగాడు. అందుకు యాజ్ఞవల్కుడు ప్రాణాల్లో, బుద్ధి వృత్తులలో ఉండే విజ్ఞానజ్యోతి స్వరూపమే ఆత్మ. ఇంద్రియముల మధ్య స్వయంప్రకాశమై హృదయంలో ఉండే పురుషుడే ఆత్మ. అదే ఆలోకంలోనూ, పరలోకంలోనూ సంచరిస్తుంది. కదులుతున్నట్లు కనిపిస్తుంది. స్వప్నంలాగా ఉంటూ దేహేంద్రియములను, మృత్యువును దాటిపోతుంది అని చెప్పాడు. ఆత్మ పురుషుడుకి ఈ లోకం, పరలోకం, అని రెండు స్థానాలున్నాయి. ఈరెండింటి మధ్య స్వప్నజగత్తు మూడవస్థానం. స్వప్నావస్టలో ఉంటూ మిగిలిన రెండు స్థానాలను చూస్తాడు ఆత్మపురుషుడు. నిద్రించేటప్పుడు ఆత్మపురుషుడు సమస్త లోకాలలోని అనుభవాలను తీసుకొని స్థూలశరీరాన్ని వదలి స్వప్నశరీరంలో ప్రవేశించి ఆత్మజ్యోతి రూపమైన ప్రకాశంలో స్వప్నం చూస్తాడు. ఈస్థితిలో అతడు స్వప్నద్రష్ట. ఈ పురుషుణ్ణి తైజసుడు అంటారు. సుషుప్తిలో అతను అన్ని దుఃఖాలను అధిగమిస్తాడు. అదే గాఢనిద్ర. ఈ స్థితిలో అతనికి తల్లి, తండ్రి, అన్నదమ్ములు అనే సంబంధాలు ఉండవు. అయినవారు కూడా కానీ వారే అవుతారు. ఈ స్థితిలో పురుషుడికి పాపపుణ్యాలతో సంబంధం ఉండదు. ఏ భేదభావం ఉండదు. హృదయంలో ఉండే సమస్త శోకలకు అతీతుడు. ఈస్థితిలో వాసనాశక్తి నశించిందని కాదు. అతడు వాసనచూస్తూనే వాసన చూడనట్లుగా ఉంటుంది. సుషుప్తిలో ఆత్మపురుషుడు ఎవరితోనూ మాట్లాడలేడు. వినలేడు. మననం చెయ్యలేడు. అద్వితీయ ఆనందస్థితిలో ఉంటాడు. అలాంటి సుషుప్తిలోని పురుషుడే బ్రహ్మం అని చెప్పారు. ఛాందోగ్యంలో ఉద్ధాలకుడు తన కుమారుడైన శ్వేతకేతువుకు సుషుప్తి గురించి వివరిస్తూ మానవుడు గాఢనిద్రలో ఉన్నప్పుడు అనడు. సుషుప్తిలో ఉన్నాదంటారు. ఆ సమయంలో జీవుడు పరమ సత్తాను అంటే ఆనందాన్ని పొందుతాడు. అంటే తన నిజ స్వరూపాన్ని పొందుతాడు. తన ఆత్మను తాను దర్శిస్తాడు. కాబట్టి సుషుప్తి యందలి పురుషుడు బ్రహ్మమే అని వివరించారు.
అర్ధాంత రత్య వ్యపదేశాధికరణం :- ( 1, 3, 41)
సూత్రం :- 104
"ఆకాశోర్ధాంతదత్వాది వ్యపదేశాత్ "
అర్ధ అంతరత్వాది వ్యపదేశాత్ :- పదార్ధాల అంతర్భాగంలో ఉంటుంది అని చెప్పడం వలన, ఆకాశః:- ఆకాశపదం బ్రహ్మ వాచకం
భావం :- పదార్ధాల అంతర్భాగంలో ఉన్న ఖాళీ ప్రదేశమే ఆకాశం అని చెప్పడం వల్ల ఆకాశపదం బ్రహ్మ వాచకం.
వివరణ :- ఇక్కడ ఆకాశం అంటే బ్రహ్మ. పంచభూతలలో ముందు పుట్టినది ఆకాశం. ఆకాశం బ్రహ్మనుండి పుట్టినది. కాబట్టి ఆకాశం కూడా బ్రహ్మమే. అందుచేత దహరాకాశం కూడా బ్రహ్మమేనని గతంలో చెప్పబడింది. ఇందులో ఆది అని ప్రయోగించడం వలన అసంగత్వం, సూక్ష్మత్వం లాంటి విశేషగుణాలు తెలుపుతోంది. ఈగుణాలు బ్రహ్మకు వర్తిస్తాయి. పంచ భూతాలలో ఒకటైన ఆకాశం ఇతర స్థూలపదార్ధాలలో అంతర్భాగమై వ్యాపించిఉన్నట్లుగా, బ్రహ్మ ప్రాకృతిక పదార్ధాలలోనే కాక జీవుల్లోనూ ఉండి అలిప్తంగా, సూక్ష్మంగా ఉన్నందువల్ల ఆకాశపదంతో వ్యవహరిస్తారు. బ్రహ్మం విభువు, సర్వాత్మకం, సర్వగతం, అసంగం. ఎందులోనూ కలవనివాడు. ఇక్కడ ఆకాశశబ్దం పరబ్రహ్మయా ? భూతాకాశమా? అని విచారించగా ఆకాశశబ్దం భూతాకాశం అనే అర్ధంలోనే రూఢం అవడం చేత భూతకాశమే అని చెప్పడం యుక్తంగా ఉంటుంది. నామ రూపాలను నిర్వహించడానికి అవకాశం ఇవ్వడం ద్వారా భూతకాశంలో కూడా అన్వయించడానికి కుదురుతుంది. జ్యోతిః అంటే పరబ్రహ్మ, నామరూపాలకన్నా భిన్నమైనది ఆకాశమనీ, భూతాకాశాన్నే ఉపాసించాలని చెప్పబడింది. నామ రూపాలకన్నా భిన్నమైన పదార్ధం బ్రహ్మతప్ప మరొకటి లేదు. ఎందువలనంటే సమస్త వికార సముదాయము కూడా నామారుపాలతో కూడి ఉంది. అనేక జీవులకు కూడా నామరూపాలున్నట్లుగా తెలుస్తోంది కదా! పరమాత్మ యొక్క ఆత్మయైన ఈజీవుని రూపంలో ఈజగత్తులో ప్రవేశించి నామరూప విభాగానికి కర్త బ్రహ్మమేనని తెలుస్తోంది. బ్రహ్మ ప్రాకృతికపదార్ధాలలోనే కాక జీవుల్లోకూడ సూక్ష్మంగా ఉన్నందువల్ల ఆకాశాధికారణ న్యాయాన్ని ప్రవర్తింపజేయడం ద్వారా ఆకాశపదం బ్రహ్మ వాచకమని నిర్ణయించబడింది.
అనుమానికాధికరణం :- ( 1, 4 , 1)
సూత్రం :- 107
ఆనుమానిక మప్యేకే షామితి చేన్న శరీరరూపక విన్యస్తగృహీతేర్ధర్మయతి చ
ఏకే షాం :- కొందరు, ఆనుమాని కం అపి:- ప్రకృతి కూడా జగత్తు, జన్మాదులకు కారణం , ఇతి చేత్ :-అని అంటారు. న ;- అది సరి అయినది కాదు. శరీర రూపక విన్యస్త గృహేతేః :- ప్రకృతిని శరీర రూపం అని పోల్చారు. చ:- అంతే కాక , ఈ విషయంలో దర్శయితి :- ఉపనిషద్వాక్యాలు అలాగే ప్రతిపాదిస్తాయి.
భావం :- ప్రకృతి కూడా జగత్తు, జన్మాదులకు కారణం అనడం సరియైనది కాదు. ప్రకృతిని శరీర రూపంతో పోల్చారు. అందువల్ల ప్రకృతి జగత్తుకు కారణం కాదు అని ఉపనిషత్తులు చెబుతున్నాయి.
వివరణ :- వేదాంత వాక్యాలన్నీ జగత్ కారణం బ్రహ్మ అనే చెబుతున్నాయి. ప్రకృతి జగత్కారణం కాదని చెప్పారు. కానీ ఇంకా చాలా చోట్ల ప్రకృతే జగత్కారణమని చెప్పే వాక్యాలు ఉన్నాయి. కపిలుడు మొదలైన వారు ప్రకృతే జగత్కారణం అంటున్నారు. ఇది నిజం కాదు అని నిరూపిస్తే పరమాత్మే జగత్కారణం అనే మాటలకు బలం చేకూరుతుంది.అందుకే ఈ పాదాన్ని చెబుతున్నారు.
అధర్వవేదీయ ముండకోపనిషత్తు:-(1,1,7) సాలీడు తంతువుల్ని సృజించి మళ్ళీ తనలో ఇముడ్చుకుంటుంది. భూమి నుండి ఓషధులు జనిస్తాయి. శరీరంలో ఆత్మ ఉన్నప్పుడు రోమాలు ఉద్భవిస్తాయి. అలాగే అక్షరం నుంచి విశ్వం ఉదయిస్తుంది. ఇక్కడ అక్షరప్రకృతిని శరీరంతో పోల్చారు. ఆత్మ అధిష్టించిన శరీరం నుంచి ఎలాగ కేశాలు, నఖాలు, జనిస్తాయో అలాగే బ్రహ్మం అధిష్టించిన ప్రకృతి నుంచి సమస్త పదార్ధాలు ఉద్భవిస్తాయి. కనుక ప్రకృతి స్వతంత్ర కారణం కానేరదు. అది జడం కనుక ముఖ్యకారణం బ్రహ్మమే. ప్రకృతి జగత్తుకు ఉపాదాన కారణం. అందువల్ల జగత్ జన్మాదులకు కారణం బ్రహ్మమే.
కఠోపనిషత్తు:- ఈశరీరం రథం లాంటిది. కర్మఫలాన్ని అనుభవించే జీవాత్మ దాని యజమాని. బుద్ధి సారధి, మనస్సే కళ్లెం, ఇంద్రియాలు గుర్రాలు, విషయమే మార్గం. కాబట్టి ఇంద్రియాలను నడిపే సారధి నేర్పరి కాకపోతే గుర్రాలు అదుపులో ఉండవు. అందుకనే ఇంద్రియాలు-మనస్సు అధీనంలోను, మనస్సు-బుద్ధి అధీనంలోను, బుద్ధి-యజమాని ఆధీనంలో ఉండాలి. విజ్ఞానహీనుడు మనస్సును అదుపులో ఉంచుకోలేక తాను చేరవలసిన గమ్యం చేరలేడు. మోక్షాన్ని పొందలేదు. వివేకవంతుడు బుద్ధి కలవాడు కనుక మనస్సును అదుపులోఉంచుకొని పరమపదాన్ని చేరగలుగుతాడు. ఇంద్రియముల కన్నా-వాటి విషయాలు శ్రేష్ఠమైనవి. విషయములకన్నా-మనస్సు శ్రేష్ఠమైనది. మనస్సుకన్నా-బుద్ధి శ్రేష్ఠమైనది. బుద్ధి కన్నా-మహత్తత్త్వం శ్రేష్ఠమైనది. మహత్తత్త్వంకన్నా-అవ్యాకృతప్రకృతి శ్రేష్ఠమైనది. ప్రకృతికన్నా-సూక్ష్మరూపి అయిన పురుషుడు గొప్పవాడు. పురుషుడు అంటే పరమాత్మ. ఇంతకు మించినది ఏదీ లేదు. ఇదే పరాకాష్ట. అతన్ని చేరేవారు తిరిగిరారు. ఇక్కడ అవ్యాకృత ప్రకృతి అంటే శరీరం అని అర్ధం. ఇంద్రియాలు గ్రహాలు. అనగా గ్రహించేవి అని అర్ధం. గ్రహాల కన్నా విషయాలు గొప్పవి. విషయాలు లేకపోతే ఇంద్రియాలకు పనే లేదు కదా! అని శృతిలో చెప్పబడింది. విషయ ఇంద్రియాల వ్యవహరమంతా మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. అందుచేత మనస్సు విషయాల కంటే పరం. భోగ వస్తువుల సముదాయం బుద్ధిని అధిరోహించి భోక్తను చేరుతుంది. కావున బుద్ధి మనస్సు కంటే పరమైనది. బుద్ధి కంటే పరమైనది ఆత్మ. ఇక్కడ యోగసాధన చెప్పబడింది. వాక్కును మనస్సు చేత నిగ్రహించాలి. బాహ్యమైన వ్యవహారాలు విడిచి మనోనేత్రంతో ఉండాలి. విషయములను గురించి వచ్చే ఆలోచనలకు అభిముఖంగా ఉండే మనస్సును కూడా వస్తువుల యొక్క వికల్పాలలో ఉండే దోషాలను చూడటం ద్వారా అవన్నీ అశాశ్వతమైనవనే విషయం బుద్ధిలో నిలపాలి. ఆ బుద్ధిని సూక్ష్మం చేసి గొప్పదైన ఆత్మయందు నిలపాలి. ఆ ఆత్మే పరమపురుషుడైన పరమాత్మ.
సూత్రం :- 108
"సూక్ష్మంతు తు తదర్హత్వాత్"
అర్హత్వాన్:- కార్యనిమిత్తమే కారణం , తత్ తు;- ప్రకృతి మాత్రం , సూక్ష్మం :- సూక్ష్మమే కానీ స్థూలం కాదు.
భావం :- ప్రకృతిని శరీరస్థానంలో ఉదాహరణగా ఇచ్చారు. శరీరం స్థూలం కదా! ప్రకృతి స్థూలం అయితే కార్యం కావాలి కదా! కారణం ఎలా అవుతుంది? అంటే కార్యనిమిత్తమే కారణమని ప్రకృతి మాత్రం సూక్ష్మమే కానీ స్థూలం కాదు అని వివరించారు.
వివరణ :- శరీరం తో పోల్చిన మాత్రాన ప్రకృతి శరీరంలాగా స్థూలం కావాలనే నియమం ఏమి లేదు. ఉదాహరణలో ఉండే రెండు వస్తువులు అన్ని విషయాలలో సమానం అని అనుకోకూడదు. ప్రకృతి ప్రపంచంలో ఉండే సమస్త పదార్ధాలను మూలకారణం. ప్రకృతిలో కనిపించే వృక్షాలు, పర్వతాలు,నదులు, సముద్రాలు ఇలా ఎన్నో ఉద్భవించడానికి కారణ మౌతోంది. ఆకార్యాన్ని చేపట్టేది ప్రకృతే. కనుక అది ఎంతో సూక్ష్మం. ఉపనిషత్తులలో ప్రకృతి సూక్ష్మమనే వివరించాయి. అది ఒక కారణం. వెనుకటి సూత్రంలో అవ్యక్తము అంటే శరీరము అన్నారు కదా! మరి శరీరం స్థూలమైనది. అటువంటప్పుడు ఈశరీరం అవ్యక్తం ఎలా అవుతుంది? వ్యక్తం కానీ దానిని అంటే స్పష్టంగా కనిపించని దానిని అవ్యక్తము అంటారు. స్థూలశరీరానికి కారణభూతమైన కారణశరీరం అవ్యక్తమవుతుంది. స్థూలం అంటే మిక్కిలి స్పష్టంగా కనబడే శరీరం. అస్పష్టంగా ఉన్నది కారణరూపంలో సూక్ష్మంగా ఉన్న శరీరమే. పంచభూతాలతో పంచీకరణ చెందినది స్థూల శరీరం. పంచీకరణ చెందని సూక్ష్మ శరీరంలో పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం అవ్యక్తంగా ఉండి పనిచేస్తుంటాయి. మనస్సు చెప్పినట్లుగా కర్మేంద్రియాలు పనిచేయాలి. జ్ఞానేంద్రియాలు ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ తెలుసుకొని మనస్సుకు తెలియజేస్తాయి. మనస్సు.. బుద్ధి సూచనలతో, ప్రేరణతో కర్మేంద్రియాలచేత పనిచేయిస్తుంది. మనస్సు, బుద్ధి , సూక్ష్మ శరీరం జీవుడికి ఈ ప్రపంచంలో భోగ సాధనాలుగా ఉపయోగపడతాయి. మానవుల యొక్క వాసనలకు అనుగుణంగా స్థూల శరీరం పనిచేస్తుంది. ఆశలు, ఆశయాలు, బాధ్యతలు ,అన్ని సూక్ష్మ శరీరానివి. చేసేది, నిలబడటం, మాట్లాడటం, పనిచేయడం, స్థూలశరీరం సూక్ష్మశరీరం చెప్పినట్లుగా చేస్తూ కల్పితమైన ఆలోచనలతో ప్రపంచంలో విహరిస్తుంటుంది. పనిముట్లు లేకుండా వడ్రంగి ఏవిధంగా పనిచెయ్యలేడో, మనోబుద్ధులు లేకుండా సూక్ష్మశరీరం పనిచెయ్యదు. అందుకే శరీరం అవ్యక్తశబ్దానికి తగిఉన్నది అని చెప్పబడినది. నామరూపాలతో ఉన్న ఈ జగత్తు సృష్టకి పూర్వం నామరూపాలేవీ లేకుండా బీజశక్త్యవస్థలో ఉండి అవ్యక్తంగానే ఉంటుంది.
అనుమానికాధికారణం :- (1, 4, 3 )
సూత్రం :-109
"తద ధీనత్వా దర్ధవత్ "
తత్ అధీనత్వాత్:- ప్రకృతి బ్రహ్మాధీనం కావడం వల్ల, అర్దవత్:- అవ్యక్తావస్థ ప్రయోజనం కలది.
భావం:- ఈజగత్తు ప్రాణులకు భోగసాధనం. ప్రపంచంలో నివసించే ప్రాణులు వాళ్ళ కర్మఫలాలను అనుభవించడానికి జగత్తును సృష్టించాడు. అందుకే ప్రకృతి బ్రహ్మాధీనం అవుతోంది.
వివరణ:- అవ్యక్తం అంటే కారణ శరీరం అయినప్పుడు ప్రకృతి అంటే శరీరమే. ఈజగత్తంతా చేతనుడైనటువంటి ఈశ్వరుని వల్లనే సృష్టించబడినందువల్ల అది సార్ధకమైనది. అయితే అవ్యక్తమనేది ఈశ్వరాధీనమైనందువల్ల అది స్వతంత్రం కాదు. ఈశ్వరునిచేత అధిష్టితమైన మాయ కారణం. ఈ మాయయే అవిద్య. అవ్యక్థము, అక్షరము ఆకాశము అంటారు. జగత్తుకి కారణం ఈశ్వరుడు అంటూ మధ్యలో మాయ, అవిద్య అంటారేమిటి, అని ఆడిగాడు కృష్ణశర్మ. సృష్ఠికి పూర్వం అంతా పరమేశ్వరుని ఆధీనంలో ఉండేది. శక్తిరహితుడైన పరమాత్మకు ఏప్రవృత్తి ఉండదు. ముక్తిపొందిన పురుషులు మళ్ళీ జన్మించరు. అవిద్య, అజ్ఞానం అనేవి పరమేశ్వరుని ఆధీనంలో ఉంటుంది. ఆత్మసాక్షాత్కారం పొందని మానవులు ఈ అవిద్యను ఆశ్రయిస్తారు. ఇదే మాయాశక్తి. అవ్యక్తము. దీనినే ఆకాశము అని కూడా అంటారు. పరమాత్మ ఈ మాయాప్రకృతి కన్నా వేరైనవాడు. మాయే ప్రకృతి. మాయకు అధిపతి పరమాత్మ. అవ్యక్తంనుంచి మహాత్తత్త్వము పుట్టినది. మహత్తు అంటే హిరణ్యగర్భరూపమైన బుద్ధి. కాబట్టి మహత్తత్వం కన్నా అవ్యక్తం గొప్పది. అవ్యక్తమే అవిద్య అనే మాయ. శరీరం అవ్యక్తకారణం. శరీరం లాగానే ఇంద్రియాలు కూడా అవ్యక్తంగా వికారరూపాలు. ఈజగత్తు యొక్క ప్రాజ్ఞవస్థ(అనగా సృష్ఠికి పూర్వం ఉన్నఅవస్థారూపం) ప్రధానంగా పరమేశ్వరుడి చెప్పుచేతలలో ఉంటుంది. పరమేశ్వరుడి మాయ వలన మహానిద్ర సంసారులైన జీవులందరు స్వరూపజ్ఞానశూన్యులై నిద్రపోతూ ఉంటారు. శరీరం స్థూలం, సూక్ష్మం అని 2రకాలు. కంటికి కనబడుతున్నది స్థూలం. కంటికి కనబడనిది సూక్ష్మం. దీనిమీదనే ఆధారపడి ఉంది కనుక జీవుని కంటే సూక్ష్మశరీరం పరమైనది. ఇంద్రియవ్యాపారం విషయాలమీద ఆధారపడిఉన్నది. ఇంద్రియాలు అర్ధాల కన్నా పరమైనవి. స్థూలశరీరం ఉల్లిపాయలు మొదలైనవాటి వలే దుర్గంధ లోపభూయిష్టమై ఉంటుంది. దానిని శోధించడం, నిరూపించడం సులభం. కానీ సూక్ష్మశరీరం అలా కాదు. దానిని శోధించడం, గ్రహించడం కష్టం. ప్రకృతి అనే మాయలో పడిపోయిన సూక్ష్మశరీరాన్ని అవిద్యను తొలగించి మోక్షం వైపు మరల్చడం అంత సులభసాధ్యం కాదు. ఇక్కడ ప్రకృతి అంటే శరీరమని , సృష్ఠికి ముందు ప్రకృతి అవ్యక్తమని, స్థూల శరీరంలో ఉండే కారణ శరీరం అంటే అజ్ఞానం అవ్యక్తమైనది గ్రహించాలి. జగత్తును సృష్టించే శక్తి ప్రకృతికి లేదు. మట్టి జడమైనా కుమ్మరి అధీనంలో ఉండి కుండలాంటి వస్తువులకు కారణమౌతోంది. అలాగే ప్రకృతి సైతం బ్రహ్మాధీనమై పదార్ధోత్పత్తికి ఉపాదానకారణమౌతోంది. కనుక ప్రకృతి పరాధీనమే. స్వతంత్రంకాదు.
సూత్రం :- 110
"జ్ఞేయ త్వావచనా చ్చ"
జ్ఞేయత్వ :- ప్రకృతిని జ్ఞేయ పదార్ధంగా, అవచనాత్ :- చెప్పలేదు. చ :- పైగా
భావం :- ప్రకృతిని జ్ఞేయ పదార్ధంగా చెప్పలేదు. అందువల్ల అది బ్రహ్మాధీనమైన జగత్కారణం అవుతోంది.
వివరణ:- ప్రకృతిని జ్ఞేయపదార్ధంగా అంటే తెలుసుకోతగ్గదిగా చెప్పలేదు. ప్రకృతి బ్రహ్మాధీనమై జగత్తు ఆవిర్భవించడానికి కారణం అవుతోంది. ఒకవేళ ప్రకృతి జగజ్జన్మాదులకు స్వతంత్ర కారణమైతే ,దాన్ని జ్ఞేయ అంటే ప్రకృతి పదార్ధంగా వర్ణించే వాళ్ళు. స్వతంత్ర కారణమైన బ్రహ్మాన్ని తెలుసుకోవడమే పరమపురుషార్ధమైనది. అందుకే బ్రహ్మజ్ఞేయం, కానీ ప్రకృతి కాదు.
తైత్తరీయోపనిషత్తు(3,1):-దీనిలో బ్రహ్మమే తెలియవలసిఉందని అన్నారు. అందుచేత ప్రకృతి బ్రహ్మాధీనమై జగజన్మాదు లకు కారణం అవుతోంది. అంతే కాని స్వతంత్రం కాదని ఈసూత్రానికి అర్ధం. అవ్యక్తము అని, జ్ఞేయము అని చెప్పలేదు. కాబట్టి అవ్యక్తము అంటే ప్రదానం ( ప్రకృతి) కాదు.
సాంఖ్యదర్శనం:- సాంఖ్యులు పురుషత్వం లాగానే ప్రధానత్వం కూడా తెలుసుకోవాలని అంటారు. సాంఖ్యంలో పురుషుడు, ప్రకృతి రెండు విభిన్న అంశాలు అనేది ముఖ్య మౌలిక సూత్రం. సృష్టిలో అన్ని ఈ రెండింటిమీద ఆధార పడ్డాయి. పురుషుడు:-(ఆత్మ):-అంతటా వ్యాపించిఉన్న నిరాకారఆత్మతత్వం, ఇంద్రియాలకు తెలియనిది, మాటలతో చెప్పజాలనిది. శాశ్వతము, ఏవిధమైన మాలిన్యాలు అంటనిది. ప్రకృతి:- సాంఖ్యుల దృష్టిలో సృష్ఠికి కారణం శాశ్వతమైన ప్రకృతే. ప్రకృతిని ఎవరు సృజించలేరు. ప్రకృతికి సృజించే లక్షణం ఉంది. సృష్ఠికి ప్రకృతి, పురుషుడు(జీవుడు) ప్రధానకారణాలు. ఆత్మ చైతన్యవంతమైనది. ప్రకృతి పదార్ధానికి, పరిణామానికి మూలమైనది. ప్రకృతి సత్వము, రజస్సు, తమము అనే 3 గుణాలతో కూడి ఉంటుంది. ప్రకృతి, పురుషుల సంయోగం వలన బుద్ధి జనిస్తుంది. ఆ బుద్ధి చేసే చేష్టలు మనిషిని సంసారంలో బంధిస్తాయి. ఈగుణములను బట్టి జీవులు, పదార్ధాల లక్షణాలు మారతాయి.పరిణామం జరుగుతుంది. అణిమాది విభూతులు పొందడానికి ప్రధానాన్ని( ప్రకృతిని) ఉపాసించాలి అంటారు సాంఖ్యులు. జ్ఞానం వలన ఈ సంసారం బంధాల నుండి విముక్తి కలుగుతుంది.
సూత్రం :- 111
"వదతీతి చేన్న ప్రాజ్ఞో హి ప్రకరణాత్ "
వదతిఇతిచేత్:-ప్రకృతిని జ్ఞేయం అని ప్రమాణాలున్నాయనడం, న ;- సరి అయినది కాదు. హి:- ఎందుకంటే , ప్రకరణాత్ :- కఠోపనిషత్తులోని అవ్యక్తప్రకరణం వలన, ప్రాజ్ఞః:- పరమేశ్వరుడే జ్ఞేయం భావం :- ప్రకృతి జ్ఞేయము(అంటే తెలుకోతగ్గది) అని ప్రమాణాలు ఉన్నాయనడం సరియైనది కాదు. ఎందుకంటే కఠోపనిషత్తులో అవ్యక్తప్రకరణం వలన పరమేశ్వరుడే జ్ఞేయము అని గ్రహించాలి. ప్రకృతి జ్ఞాన సాధనం, ముక్తి సాధనం కాదు.
వివరణ :- ప్రధానాన్ని అంటే ప్రకృతి ని జ్ఞేయముగా చెప్పలేదు. ఇక్కడ పరబ్రహ్మను గూర్చియే చెప్పుచున్నారు. జీవుడి కర్మేంద్రియాలకు ఉండే శబ్ద, స్పర్శ రూప, రస, గంధాలు లేనిది, అనాది, అవ్యయము, ఆనంతము, అయిన మహత్తు కన్నా పరమైనది, నిశ్చలమైనది, అయిన బ్రహ్మాన్ని తెలుసుకున్నవారు మృత్యువాత పడరు అని ఉపనిషత్తులలో చెప్పబడింది. ఇక్కడ తెలుసుకోవలసినది ప్రధానాన్ని గురించికాదు. పురుషుని(ఆత్మ)కన్నా పరమైనవాడు లేడు. కనుక అతన్ని గురించి తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానం వలన మాత్రమే మృత్యువు నుండి తప్పించుకొని బ్రహ్మాన్ని చేరే అవకాశం ఉంది. కాబట్టి తెలుసుకోతగ్గవాడు బ్రహ్మమే.
కఠోపనిషత్తు:-(3,15):- మహత్తుకన్నా పరమైన ప్రకృతిని తెలుసుకుంటే మృత్యు ముఖం నుంచి విడివడతారని అన్నారు కదా! అప్పుడు ప్రకృతి జ్ఞేయం కదా! అది స్వతంత్ర కారణం ఎందుకు కారాదు? అనే సందేహం రావచ్చును. కఠోపనిషత్తు మంత్రంలో మహత్తుకన్నా సూక్ష్మమై శబ్ద స్పర్శ రూప రసాది గుణ రహితముగా వర్ణించింది బ్రహ్మాన్ని కానీ, ప్రకృతిని కాదు. ఇందులో తెలుసుకొని ముక్తుడౌతాడన్నది బ్రహ్మం గురించే. ప్రకృతిని తెలుసుకున్నంత మాత్రాన ముక్తి కలుగదు. బ్రహ్మజ్ఞానమే మోక్షదాయకం. మహత్తుకన్నా పరం, సూక్ష్మం, ధృవం అయినది బ్రహ్మమే. ప్రకృతిలో జగత్కారణం బ్రహ్మమే. సాంఖ్యుల అభిప్రాయం ప్రకారం ప్రధానం జ్ఞేయం అని, ఏది శబ్ద రహితమో, స్పర్శ లేనిదో,రూపం లేనిదో, మార్పు లేనిదో, రసం లేనిదో, ఆధ్యంతలు లేనిదో, మహత్తు కంటే పరమో అయిన ఏప్రధానం శృతిలో చెప్పబడినదో దానినే అన్వేషించాలి. కేవలం ప్రధానాన్ని అన్వేషిస్తూ, చేతనాత్మను తెలుసుకోవడం వల్ల మృత్యుముఖం నుండి విముక్తుడవడం, వీరు అంగీకరించారు.ఆశబ్దాది ధర్మాలు ప్రాజ్ఞాత్మకే ఉన్నట్లు ఉపనిషత్తులలో చెప్పబడింది. అందువలన ఇక్కడ ప్రధాన జ్ఞేయం అనిగాని, అవ్యక్తం అనిగాని నిర్దేశంచబడలేదు.
సూత్రం :- 112
"త్రయాణా మేవ చైవ ముపన్యాసః ప్రశ్నచ్చ"
ఏవం :- ఇలా జ్ఞేయరూపకంగా, త్రయాణాం ఏవం :- అగ్ని, జీవుడు, బ్రహ్మం అన్న మూడింటినే, ఉపన్యాస: :- కఠోపనిషత్తులో ప్రశ్నోత్తర రూపంలో వర్ణించారు. చ :- పైగా , ప్రశ్నః :- ప్రశ్న కూడా మూడింటి గురించే ఉంటుంది.
భావం :- కఠోపనిషత్తులో అగ్ని, జీవుడు, బ్రహ్మం గురించి ప్రశ్నోత్తర రూపంలో వివరించబడింది.
వివరణ:-కఠోపనిషత్తు:- నచికేతుడి కథ. వాజశ్రవుడు(ఉద్ధాలకుడు) అనే బ్రహ్మణుడు విశ్వజిత్ యాగం చేస్తాడు. యాగం చివర అతనికి ఉన్న సంపదనంతా దానం చేయాలి. కానీ మంచివాటిని తన దగ్గర ఉంచుకొని, ఎందుకు ఉపయోగానికి పనికిరాని ముసలి గోవులను, గొడ్డులను, దానం చేస్తాడు. వాజశ్రవుని కుమారుడు నచికేతుడు దానిని గమనించి, తన తండ్రిని పాపం నుంచి విముక్తుణ్ణి చెయ్యాలని, అతనిని ఆనందలోకాలకు పంపాలని భావిస్తాడు. నేను నీకు సంపాదనే కదా! నన్ను ఎవరికి దానంఇస్తావు అని అడుగుతాడు. తండ్రి సమాధానంచెప్పడు. అలా మూడుసార్లు ఆడిగేసరికి తండ్రికి కోపంవచ్చి నిన్ను యముడికి దానం చేస్తాను అంటాడు. యాగం పూర్తి అయిన తరువాత తను అన్న మాటకి చాలా బాధ పడతాడు. నచికేతుడు ఆడినమాట తప్పకూడదు. అసత్యదోషం అంటకూడదు కదా! నన్ను యముడు దగ్గరకు పంపండి అంటాడు. నచికేతుడు యమలోకం వెడతాడు. అక్కడ యముడు కనిపించకపోవడంతో మూడురాత్రులు ఉపవాసంతో ఉంటాడు. యముడు తిరిగి వచ్చి అతిధిని ఉపవాసం వుంచినందుకు, పరిహారంగా, ప్రాయిశ్చిత్తం చేసుకోవడానికి మూడు వరాలను కోరుకోమంటాడు. ఓ యమధర్మరాజా! మొదటివరంగా నేను ఇక్కడనుంచి ఇంటికి వెళ్ళినప్పుడు మాతండ్రి నన్ను సంతోషంగా ఆహ్వానించాలి. అతని పాపాలన్నీ తొలగిపోవాలి. యముడు తధాస్తు అంటాడు. రెండవవరం:- స్వర్గంలో మృత్యుభయం, ఆకలిదప్పులు, వృద్ధాప్యం, భయం, దుఃఖం ఏమి ఉండవు. అలాంటి మార్గం చేరుకోవడం యజ్ఞం ద్వారానే సాధ్యమౌతుంది. అగ్నిని ఆరాధించే అగ్నిచయనం గురించి వివరించమని అడిగాడు. స్వర్గప్రాప్తికి సంబంధించిన యజ్ఞాన్ని దానికి సంబంధించిన క్రతువును యముడు నచికేతుడికి బోధించి అప్పటినుండి ఆ యజ్ఞానికి నాచికేతయజ్ఞం అని పేరు వస్తుందని వరమిచ్చాడు. 3వవరం:-మరణం మీద నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. మరణించిన తరువాత ఇంద్రియాలు, అవయవాలు, మనస్సు మొదలైన వాటితో జీవాత్మకు సంబంధం ఉందని కొందరు, లేదని కొందరుఅంటారు. చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు? బ్రహ్మజ్ఞానం గురించి చెప్పమన్నాడు. తనంతటతాను ప్రత్యక్షమైతే కావలసినవి కోరుకొమ్మంటే నాతండ్రి నన్ను అభిమానించాలి, భయాన్ని జయించే స్వర్గం కావాలి, మరణరహస్యం తెలియజెయ్యాలి, అని ఈపిల్లవాడు పారమార్ధిక కోరికలను కోరడం యముడికి సైతం ఆశ్చర్యం కలిగించింది. నువ్వు చిన్నవాడివి. ఈ వయస్సులో నీకు బ్రహ్మజ్ఞానం చెప్పినా అర్ధం కాదు. మరొక వరం కోరుకోమన్నాడు. నీకు కావలసినంత ధనకనక వస్తువాహనాలను కాంతలను ఇస్తాను తీసుకువెళ్ళమన్నాడు యముడు. కానీ నచికేతుడు వాటన్నింటిని తిరస్కరించి, నాకు బ్రహ్మజ్ఞానం తప్ప మరేదీ అవసరం లేదు అన్నాడు. యముడు అతని పట్టుదలకు,దీక్షకు సంతసించి చెప్పడం ప్రారంభిస్తారు. మనిషికి 2మార్గాలుంటాయి. 1.శ్రేయోమార్గం, 2.ప్రేయోమార్గం. మొదటిది నివృత్తిమార్గం, రెండవది ప్రవృత్తిమార్గం. మనిషికి నిగ్రహం లేకపోతే జననమరణ చక్రంలో బంధీలౌతారు. ఆత్మను అన్వేషిస్తూ అంతర్ముఖుడయ్యే వాడు ఎక్కడో అరుదుగాఉంటాడు. మొదటఆత్మ బాహ్యవస్తువులతో విషయాలతో కల్పించుకుంటుంది. మేలుకొన్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు ఆత్మ సాక్షిభూతంగా ఉంటుంది. తననితాను తెలుసుకుంటే, ఆత్మ అన్నింటికీ ఆధారమని గ్రహించి, అన్ని దుఃఖాల నుండి విముక్తుడై అనంతమైన నిత్యమైన ఆనందాన్ని పొందుతాడు. జీవుడు నిద్రపోయినప్పుడు కూడా తాను మేల్కొని అన్ని విషయాలు తెలియజేస్తూ నిత్యమై శుద్ధమై ఉండేదే ఆత్మ. అన్ని లోకాలు అందులోనే ఉంటాయి. ఆత్మ పరమాత్మగా భిన్న రూపాలలో కనిపిస్తుంది. ఉన్నదంతా ఒక్కటే ఆత్మ. ఆపరమాత్మ తనలోనే ఉన్నాడన్న జ్ఞానం కలిగితే శాశ్వతఆనందం పొందుతాడు. దీనిని అజ్ఞానులు పొందలేరు. అనిశ్చితమైన వాటిలో చేతనారూపంలో ఉండే ఆత్మను దర్శించగలిగేవాడు ధీరుడు మాత్రమే. హృదయంలో 101 గదులుంటాయి. వాటిలో ఒకటి తనలో ప్రయాణిస్తుంది. దాని ద్వారా మనిషి అమృతత్వాన్ని పొందుతాడు. మిగిలినవి అన్ని వైపులా ప్రయాణించి అంతరిస్తాయి. ధీరుడైన వాడు తనలోని ఆత్మను, అంతరాత్మని పరమాత్మని తెలుసుకోవడమే జ్ఞానంఅని యముడు నచికేతుడికి బ్రహ్మోపదేశం చేస్తాడు. నచికేతుడు మృత్యువును జయించి పరబ్రహ్మతత్త్వాన్ని పొందుతాడు. ఆతరువాత నచికేతుడు ఇంటికి వెళ్ళినప్పుడు తండ్రి ఎంతో ఆనందంతో స్వాగతం పలుకుతాడు. కఠోపనిషత్తులో అగ్ని, జీవాత్మ, పరమాత్మల గురించి స్పష్టంగా వివరించింది. కాని ప్రధానాన్ని అంటే ప్రకృతిని గురించి ఎక్కడా చెప్పలేదు.
సూత్రం :- 113
" మహద్వచ్చ "
మహత్ వత్ :- వికారమైన మనస్సులాగా, చ :- ఇతర జ్ఞానేంద్రియ ,కర్మేంద్రియాల వలే మూల ప్రకృతి బ్రహ్మాధీనం.
భావం :- శరీరం, మనస్సు ఇంద్రియాలన్ని జీవుడికి లోబడి ఉండి, తమతమ కార్యాలు నిర్వర్తిస్తాయి. స్వతంత్రంగా పనిచేయవు. అలాగే మూల ప్రకృతికూడా పరమాత్మకు లోబడి జగజ్జన్మాదులకు కారణమౌతుందే కానీ స్వతంత్రంగా కాదు.
వివరణ :- మహత్తు(బుద్ధి) అనే పదం సాంఖ్యులు చెప్పే పదం కాదు. అలాగే అవ్యక్తం కూడా సాంఖ్యులు చెప్పే ప్రధానం కాదు. అవ్యక్తం అనే పదానికి అర్థం శరీరం అంతే కాని ఆత్మ కాదు. సాంఖ్య దర్శనం :- హిందు ధర్మ శాస్త్రాలలో జీవుడు, ప్రకృతితత్త్వం, మోక్షం వంటి విషయాలు విశ్లేషించే తత్త్వ శోధనా రచనలను దర్శనాలు అంటారు. ఇవి 6 ఆస్తిక దర్శనాలు 1.సాంఖ్యము, 2.యోగము,3 వైశేషికము, 4.న్యాయం, 5.పూర్వ మీమాంస, 6.ఉత్తర మీమాంస. వీటిలో మూల ప్రకృతికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేది సాంఖ్య దర్శనం. కపిల మహర్షి దీనిని ప్రవర్తింపజేశాడు. విశ్వసృష్ఠికి మూలప్రకృతి ప్రధాన కారణమని ఈదర్శనసారాంశం. ప్రకృతి సత్వము, రజస్సు, తమము అనే 3గుణాలతో కూడి ఉంటుంది. ప్రకృతి పురుషుడు (జీవుడు) సంయోగం వలన బుద్ధి జన్మించి, ఆ బుద్ధిచేష్టల వలన సంసారబంధం ఏర్పడుతుంది. సాంఖ్యవాదం ప్రకారం జ్ఞానానికి 3 ప్రమాణాలు:- 1.ప్రత్యక్ష ప్రమాణాలు:- మన ఇంద్రియాలద్వారా తెలిసేవి. (స్వయంగా చూసేవి, విన్నవి, స్పృశించేవి.) దీనిలో మరల 2 విధానాలు. ఎ. నిర్వికల్పప్రమాణం :- ఇంద్రియాలు ద్వారా గ్రహించేది. కానీ అర్ధం కానిది. ఒక చిన్నపిల్లవాడు ఒక జంతువును చూస్తాడు. కానీ వాడికి దాని గురించి ఏమి తెలియక పోవచ్చును. b) సవికల్ప ప్రమాణాలు :- ఇంద్రియాల ద్వారా గ్రహించడమే కాక అర్ధం చేసుకున్నది. ఆ విషయానికి, మరో విషయానికి ఉన్న భేదం తెలుస్తుంది. ఇది సరిఅయిన జ్ఞానానికి ఆధారం. 2). అనుమాన ప్రమాణాలు :- ఇలా కావచ్చును అని ఊహించింది. ప్రత్యక్షప్రమాణాల వల్ల గ్రహించిన విషయాన్ని ఉపయోగించి, తెలియని విషయాన్ని అంచనా వేయడం, ఉదాహరణకు పొగ కనిపించింది కనుక నిప్పు ఉన్నదని చెప్పడం. 3). శబ్ద ప్రమాణం :- వేరే వారు చెప్పగా విన్న విషయాలు. బ్రహ్మసూత్రములు 1-4-1నుండి 1-4-7 వరకు అనుమానికాధికరణంలో అనుమాన ప్రమాణాలు ఆధారంగా చెప్పబడినవి. సృష్టిలో అన్ని ప్రకృతి పురుషుల మీదనే ఆధారపడ్డాయి. పురుషుడు అంటే నిర్వికార స్వతంత్ర ఆత్మరూపం. ఇది శాశ్వతం, ఎవరూ సృజించలేరు. పురుషుడు దేనిని సృజించడు. ప్రకృతి అనాదిగా ఉన్నదే. దానిని ఎవరూ సృజించలేరు. కానీ ప్రకృతికి సృజించే లక్షణం ఉంది. అన్ని పరిణామాలు, అశాశ్వతమైన పదార్ధాలు కూడా ప్రకృతి వల్లనే సంభవిస్తాయి. అన్ని జీవులు పురుషుని బాహ్యస్వరూపాలే. ప్రకృతి వలన ఉద్భవించిన భౌతిక రూపాలు తిరిగి ప్రకృతిలోనే లీనమై పోతాయి. అందుకే సాంఖ్యులు ప్రకృతినే ప్రధాన అంశంగా వర్ణించారు.
సృష్టి సిద్ధాంతం:- సాంఖ్యము సత్కార్యవాదాన్ని సమర్ధిస్తుంది. దీని ప్రకారం ఏదైనా పనిలో కారణం, ఫలితం కలసి ఉంటాయి. ఉన్నదేది నశించదు. లేనిదేది ఉత్పన్నం కాదు. అంతా పరిణామమే. వీరి ప్రకృతిపరిణామవాదం ప్రకారం మూలప్రకృతే అన్నిటికీ కారణం. అదే వివిధ రూపాలుగా పరిణామం చెంది తిరిగి మూలప్రకృతిలో లీనమౌతుంది. ఇలా చక్రగతిలో విభజన, విలీనం సంభవిస్తుంటాయి. కపిలముని ప్రతిపాదించిన సాంఖ్యంలో ఈశ్వరుడికి స్థానం లేదు. అందుకు కారణం ఈశ్వరుడి ఉనికిని రుజువు చెయ్యడం సాధ్యం కాదు. పరిణామంలేని ఈశ్వరుడు పరిణామాత్మకమైన సృష్ఠికి కారణం అని చెప్పడం అసంబద్దమంటారు. తరువాత కాలంలో సాంఖ్యులు ఈశ్వరతత్వాన్ని సాంఖ్యవాదంలో ప్రవేశపెట్టారు. వీరు ఆత్మజ్ఞానం వలన భౌతికబంధాలనుండి విముక్తి పొంది మోక్షాన్ని పొందవచ్చునని అంగీకరించారు. సాంఖ్యులు చెప్పిన మూలప్రకృతి కూడా పరమాత్మకు లోబడి జగజ్జన్మాదులకు కారణమౌతుంది కానీ స్వతంత్ర కారణం కాదని ఈ సూత్రానికి అర్థం.
సంఖోప సంగ్రహాధికరణం :- ( 1, 4 , 11 )
సూత్రం :- 117
" న సంఖ్యోప సంగ్రహాదపి నానాభావా దతిరే కా చ్ఛ"
సంఖ్య ఉపసంగ్రహాత్ అపి :- ఏకత్వసంఖ్య ఉన్నప్పటికీ, నానాభావాత్ :- అనేక కారణములను ప్రతిపాదించినందువల్ల, చ :- అంతే కాక, అతి రేకాత్ :- ఇంకా అధికంగా ఎంతో చెప్పినందువల్ల, న :- ప్రకృతి జగత్తుకు స్వతంత్ర కారణం కాదు.
భావం :- ఏకత్వసంఖ్య ఉన్నపటికీ ప్రకృతికి అనేక కారణాలు ప్రతిపాదించి నందువల్ల ప్రకృతి జగత్తుకు స్వతంత్ర కారణం కాదు.
వివరణ:- జగత్తుకు అనేక కారణాలు ఉన్నాయి. మోహాన్ని కలుగజేస్తుంది కనుక ప్రకృతిని మాయ అన్నారు. ప్రకృతి జగత్తు రూపంలో పరిణామం చెంది, పురుషులకు మోహాన్ని కలిగిస్తుంది. ఈ మాయకు స్వామి ఈశ్వరుడు మాయి. ఆయన ఈ జగత్తుకు నిమిత్త కారణం. మహత్తు, అహంకారాది సర్వ జగత్తుకు ప్రకృతి మూలకంగా నిర్మాణమౌతుంది అని నిర్వచింపబడినది. దీనితో ప్రకృతి ఉపాదానకారణం అని తెలుతోంది. స్వామిత్వం ఈశ్వరుడికి ఉండటం వలన మాయ స్వతంత్ర కారణం కాదు. కార్య జగత్తులో కూడిన ప్రకృతి కి పరమాత్మ అధిష్టానం కనుక ఆయన ప్రకృతి కన్నా అధికుడు అని వాజసనేయులు బృహదారణ్యకంలో చెప్పారు. దీని వలన ప్రకృతి జగత్తుకు స్వతంత్ర కారణం కాదని స్పష్టమౌతోంది. లోకంలో జీవులుచేసుకున్న పాపపుణ్యాలు అనుభవించడానికి పరమేశ్వరుడు ప్రకృతిఅనే మాయను సృష్టించాడు. దానిలో సర్వజగత్తు నదులు, సముద్రాలు, పర్వతాలు,వృక్షాలు, పక్షులు, జంతువులు, అనేక జీవరాశులను సృష్టించి నందువల్ల ప్రకృతి, జగత్తుకు కారణం పరమాత్మే కానీ ప్రకృతి కాదు.
బృహదారణ్యకోపనిషత్తు:-(4-4-17):- పరబ్రహ్మంలోనే ప్రాణాదులు, ఆకాశం, ప్రతిష్ఠితమై ఉన్నాయి. ఆఆత్మను బ్రహ్మంగా తెలుసుకొని, మృత్యువును జయించి తరిస్తారు. ఇక్కడ ఆకాశం అంటే ప్రకృతి. పంచప్రాణాలు, పంచజనులు బ్రహ్మానికి అధిష్టానమై ప్రకృతికి ఆధారమైనది. నిమిత్త కారణమును ఆధార కారణమని, అధిష్టానకారణమనీ అంటారు. ప్రకృతికి ఆధారమైన బ్రహ్మం దానికన్నా అధికం. ప్రకృతి జగత్తుకు పరతంత్రకారణం. అందువలన "జన్మాదస్యయతః" అనే సూత్రంలో వర్ణించిన నిమిత్తకారణమైన బ్రహ్మలక్షణం నిర్దుష్టమైనది. గురువుగారు! పంచ పంచ జనులు అంటే 25 తత్త్వాలేనా? అని అడిగాడు కృష్ణ శర్మ. పంచ పంచ అంటే ఐదు ఐదులు 25 తత్త్వాలని సాంఖ్యులు చెబుతున్నారు. ఆ తత్త్వాలు పంచభూతాలు- 5, తన్మాత్రలు - 5, జ్ఞానేంద్రియాలు -5, కర్మేంద్రియాలు - 5, మనస్సు, మహత్తత్వం, అహంకారం, ప్రకృతి, పురుషుడు కలిపి 25 . సాంఖ్యులు చెప్పిన తత్త్వాలన్ని పరస్పర విలక్షణాలు కలిగి ఉంటాయి. పంచ అంటే ఐదు అని అర్ధం. ఇవి 5 సమూహాలుగా ఉండాలి. ఒక సమూహంలోని ఐదింటికి ఒకే లక్షణాలు ఉండాలి. కానీ అవి అలా లేవు. వాటి ధర్మాలు వేరు వేరుగా ఉన్నాయి. కాబట్టి పంచ పంచ జనులు అంటే 25 తత్త్వాలు కాదు. ఐదు ప్రాణాలను పంచ జనులు అంటారు.ఈ పంచప్రాణాలే ప్రకృతికి ఆధారం. ఇవన్నీ పరబ్రహ్మంలోనే ఉంటాయని గ్రహించాలి.
చమసాధికరణం :- ( 1, 4 , 10 )
సూత్రం :- 116
కల్పనోపదేశా చ్చ మధ్వాదివదవిరోధః"
మధుఆదివత్:- మధువులాంటి వాటిలాగా, కల్పన ఉపదేశాత్ చ :- పోలిక ద్వారా ఉపదేశించడం వలన కూడా, అవిరోధః :- మూల ప్రకృతిని వ్యక్త రూపంలో ఉండే అజతో పోల్చి చెప్పడం లో ఏవైరుధ్యం లేదు.
భావం :- ఆదిత్యాదులందు మధువును చెప్పినట్లుగానే అజా శబ్దంతేజో లక్షణం. అంటే తేజస్సు, జలం, అన్నం వీటి లక్షణాలు మూల ప్రకృతిలో కూడా అజా శబ్దం చెప్పబడినది.
వివరణ:-మూలప్రకృతి అవ్యక్తం కదా! వ్యక్తమైన అజను ఎరుపు, తెలుపు, నలుపు రంగులు ఉంటాయి కదా! ఎలా పోలుస్తారు? అనే సందేహం రావచ్చును.
చాందోగ్యోపనిషత్తు:-( 3 ,1, 1):- "అసౌవా ఆదిత్యో దేవమధు,
బృహదారణ్యకోపనిషత్తు.."వాచం ధేమం ఉపాసీత" (5,8,1) ఈ ఆదిత్యుడు దేవమధువు. వాన్ అనే ధేనువును ఉపాసించు అనే వాక్యాలలో సూర్యుడు మధువు కాకపోయినా మధువు లాగా ఆనందం కలిగిస్తాడు. కనుక అలా పోల్చారు. అలాగే వాక్కు ధేనువు కాకపోయినా వాక్కు ఆవులాగా ఎంతో ఉపకరిస్తుంది. కనుక అలా ఉదహరించారు. ఈ విధంగానే ఈ జగత్తుకు ఉపాదానకారణమైన మూలప్రకృతి, కారణరూపంలో అవ్యక్తమైన తెలుపు, నలుపు రూపాలున్న మేకతో పోల్చి వర్ణించారు. అంత మాత్రాన ప్రకృతి అవ్యక్తం కాకపోదు. వాడు నిప్పులాంటివాడు. ఆ పిల్లవాడు సింహం అని పోల్చి చెప్పినంత మాత్రాన మనుష్యత్వం లేకపోలేదుకదా! ప్రకృతిలో ఉండే అవ్యక్తం తాత్వికం, కల్పితం కాదు. కనుక పోల్చడంలో వైరుధ్యం లేదు. అజాంఏకంలో ఈ ఒకసంఖ్య ప్రకృతి ఒక్కటే జగత్కారణం అని సూచించడం లేదా? అప్పుడది స్వతంత్ర కారణం అవుతోంది కదా! దీనికి సమాధానం తరువాత సూత్రంలో చెప్పబడినది. ఆకాశంలో కనిపించే సూర్యుడు దేవతలను తృప్తిపరుస్తాడు. అతడు దేవతలకు మధువు లాంటి వాడు. ఈవిధం గానే అజాశబ్దం చెప్పబడినది. అజము అంటే మేక. ఇది మూడు రంగుల్లో ఉంటుంది. ఎరుపు, తెలుపు, నలుపు తప్ప ఇతర రంగులు ఉండవు. ఈ మేక తనవంటి మేకలను ఉత్పత్తిచేస్తోంది. అలాంటి మేకను మేకపోతు సేవిస్తుంది. అంటే ప్రకృతిని అజ్ఞాని అహింస జీవుడు సేవిస్తాడు. వేరొక మేకపోతు తాను అనుభవించిన మేకను వదిలేస్తుంది. అంటే జ్ఞాని అయిన వాడు తాను అనుభవించిన ప్రకృతిని వదలివేస్తున్నాడు. త్యాగభోగాలలో ప్రకృతి యందు సమత్వమే ఉంటుంది అని చెబుతున్నాయి. సూర్యోపాసన కోసం మధువును కల్పించి చెప్పారు. అంతేకాక నిజంగా సూర్యుడు మధువు కాదు. అలాగే ప్రకృతి యందు మేకను కల్పించి చెప్పారు. అజము అంటే ప్రకృతి కాదు. లోకంలో ఒక ఆడమేక దైవ వశంచేత రోహిత, శుక్ల, కృష్ణ వర్ణాలు కలదై, తనతో సమానమైన రూపంకల పిల్లలు కలదిగాను ఉండవచ్చును. ఒక అజం మరొక దానితో ఉండవచ్చును. మరొక మేక అనుభవించి విడిచి పెట్టవచ్చును. అజ్ఞాని అయిన జీవుడు దానిని అనుసరించి ఉంటాడు. జ్ఞాని దానిని విడిచి వేస్తాడు. ఇది క్షేత్రజ్ఞుల భేదాన్ని ప్రతిపాదించాలనే ఉద్దేశ్యం కాదు. బంధ మోక్షాల వ్యవస్థను ప్రతిపాదిస్తున్నారు. మధువు కాని ఆదిత్యునికి ఏవిధంగా మధుత్వం కల్పించబడిందో, ధేనువు కాని వాక్కును ధేనుత్వం ఏవిధంగా కల్పించబడిందో, అగ్నులుకాని ద్యులోకాదులకు ఏవిధంగా అగ్నిత్వం కల్పించబడిందో అలాగే అజ కానిదానికి అజత్వం కల్పించబడుతోంది. అందువల్ల తేజోబన్నలకు అజా శబ్ద ప్రయోగం చేయడంలో విరోధం లేదు.
సూత్రం :- 115
"జ్యోతి రుపక్రమాతు తథా హ్యధీయత ఏకే"
జ్యోతిః ఉపక్రమాతు :- అజా శబ్దం సూచించే సత్వగుణాలు ఉన్న ప్రకృతిని శాసించే బ్రహ్మం శక్తే ఈ జగత్తుకు కారణం. హి:- ఎందుకంటే, ఏ కే :- ఒక శాఖ వాళ్ళు , తధా :- ఆ విధంగానే, అధీయతే :- వర్ణిస్తారు.
భావం :- అజశబ్దం సూచించే సత్వగుణాలు ఉన్న ప్రకృతిని బ్రహ్మంయొక్క శక్తే శాసించగలదు. ఆశక్తే ఈ జగత్తుకు కారణం అవుతుంది. ఒకశాఖ వాళ్ళు ఆవిధంగానే వర్ణిస్తారు.
వివరణ :- తేజస్సు దీనిలో ఉంటుందో దానిని అజ అని గ్రహించాలి. ఛాందోగ్యంలో తేజస్సు, ఉదకము, అన్నము, అనేవి సమస్త జగత్తుకు కారణం అని కార్యమైన వస్తువు కారణం కన్నా భిన్నం కాదు. తేజస్సు, అన్నము లందు అజ యొక్క ఆకృతి లేదు. అందుచేత జన్మ రహితమైన అజ శబ్దం వాటి యందు అన్వయించదు.
శ్వేతాశ్వతర ఉపనిషత్తు:- అజా మేకం(4,5), ద్వా సువర్ణా(4,6), సమాన వృక్షే( 4,7) అనే రెండు మంత్రాలున్నాయి. ఇందులో జీవుడు ప్రకృతి మోహంలో పడి దుఃఖిస్తున్నాడని, తరువాత మోహాన్ని వీడి మహిమాన్వితమైన ఈశ్వరుణ్ణి తెలుసుకొని, దుఃఖరహితుడై ముక్తిని పొందుతున్నాడని ఉన్నది. వీటిని బాగా పరిశీలిస్తే ప్రకృతి పరతంత్రం అనీ, దాన్ని మరోతత్త్వం నియమిస్తున్నదనీ, జీవుడు ప్రకృతికి నియంత అయిన ఈశ్వరుణ్ణి చూసి మోక్షం పొందుతాడనీ తెలుస్తోంది. మూలప్రకృతి మాయఅని ఈఉపనిషత్తు వర్ణిస్తోంది. తేజోవంతమైన ప్రకృతి అజాగా గ్రహింపదగినది. ఈ అజ పరమేశ్వరుణ్ణించి పుట్టినది. జ్యోతిస్సు ప్రారంభంలో కలది, తేజస్సు, ఉదకము, అన్నం, లక్షణంగా గలది. 4 విధాలైన జరాయుజ, అండజ, స్వేదజ, ఉద్భిజములైన ప్రాణిసముదాయానికి ప్రకృతిగా తెలియదగినది. తు శబ్దం నిశ్చయదార్ధకం. అనగా ఈ అజ భూతత్రయరూపమైనది కానీ గుణత్రయరూపమైనది కాదు. కొన్ని శాఖలవారు తేజోబన్నాలకు పరమేశ్వరుడి నుండి ఉత్పత్తి చెప్పి, ఎర్రగా ఉన్నది అగ్ని యొక్క రూపం, తెల్లగా ఉన్నది బలం యొక్క రూపం, నల్లగా ఉన్నది భూమి యొక్క రూపం అనీ ఎరుపు మొదలైన రూపాలున్నట్లు చెబుతున్నాయి. ఇక్కడ రోహితాది శబ్దాలు పోలికను బట్టి ఈ తేజోబన్నాలే గ్రహింపబడుచున్నాయి. రోహితాది శబ్దాలకు ఎరుపు మొదలైన అర్ధాలు ముఖ్యర్ధాలు. రజఃసత్వాది గుణాలకి అర్ధాలు గౌణాలు. అంటే తరువాత చెప్పకోవలసిన అర్థాలు. ఏ పదాల అర్ధం విషయంలో సందేహం లేదో, వాటి సహాయం చేత సందేహంగా ఉన్న పదాలకు అర్ధాలు నిర్ణయించడం యుక్తం అని అంటారు. బ్రహ్మకు సృష్టి ప్రారంభంలో ఏది సహాయంగా ఉండేది? వాళ్ళు ధ్యానయోగం చేత పరమాత్మలో ప్రవేశించి తన సత్వాది గుణాలతో కూడినది నిగూఢంగా ఉన్నది అయిన పరమేశ్వరుడి స్వీయ శక్తిని చూచారు. సమస్త జగత్తును సృష్టించిన పరమేశ్వర శక్తి వాక్య ప్రారంభంలో తెలుస్తున్నది. అజ శబ్దం సత్వగుణాన్ని సూచిస్తుందని, అది ప్రకృతి లక్షణమనీ, దానిని శాసించే శక్తి పరబ్రహ్మకే ఉన్నదని తెలియజేయబడుతోంది.
సూత్రం :- 114
'చమసవత్ అవిశేషాత్"
చమసవత్ :- సోమ పాత్ర లాగా , అవిశేషాత్ :- విశేషంగా చెప్పనందువల్ల ,
భావం:- ఇది పూర్వపక్ష సూత్రం. సోమపాత్ర వలె ఈఅర్ధమే చెప్పాలనే విశేషం లేకపోవడం చేత అజా శబ్దం ప్రధాన వాచకం కాదు.
వివరణ :- చమసము అంటే నాలుగు పలకలుగా చతురస్రంగా ఉండే యజ్ఞ పాత్ర. ఈ పాత్ర లాగానే అజా శబ్దానికి కూడా ప్రత్యేకమైన నిర్ణయం ఏమి లేదు. ఎందుకంటే యజ్ఞంలో ఉపయోగించే పాత్రలన్నీ మనం వాడుకునే గరిటలు లాగా ఎత్తుపల్లాలు వుంటాయి. అలాగే అజా అనే శబ్దం ప్రత్యేకంగా ప్రధానాన్ని చూపుతుందని చెప్పడానికి కారణం ఏమి లేదు.
బృహదారణ్యకోపనిషత్తు:- ఇక్కడ విశేషంగా ఫలానా పాత్ర అని చెప్పినందు వల్ల చమస శబ్దం సోమపాత్రను సూచిస్తుంది. ఒక గిన్నెకు దాని మూతి క్రిందివైపుకు తెరచిఉంది. పైభాగం ఉబ్బెత్తుగా ఉంటుంది. దాని ప్రక్కనే 7గురు ఋషులున్నారు. వేదాల ద్వారా వాదం చేసే హక్కు ఉంది. ఆ గిన్నె శిరస్సు. క్రింది భాగంలో తెరచి ఉండేది నోరు. పై భాగం ఉండేది పుర్రె. సోమపాత్రలో సోమరసం ఉన్నట్లుగా శిరస్సులో అనేకరకాల విజ్ఞానమున్నది అని చెప్పబడినది. ఇక్కడ చమసము అంటే శిరస్సు అని అర్ధం. అజామే అస్య అనే మంత్ర వర్గం వలన రక్త శుక్ల కృష్ణ వర్ణాలు కలది, తనతో సమానమైన గుణాలు కల సంతానాన్ని సృష్టిస్తోంది. అజము అంటే జీవుడు కనుక ఒక జీవుడు మరొక జీవితో శయనించి అనుభవించ బడిన భోగం వలన మరొక జీవికి జన్మను ఇస్తున్నాడు. ఈ మంత్రంలో లోహిత శుక్ల కృష్ణ శబ్దాల చేత రజః, సత్వ, తమో గుణాలు చెప్పబడుతున్నాయి. రంజింపజేసే స్వభావం కలది కనుక రజస్సు ఎరుపు, ప్రకాశ స్వరూపం గాన సత్వం తెలుపు, ఆవరించేది కనుక తమోగుణం నలుపు, ఈ మూడు గుణాలు సామ్యావస్థ అవయవ ధర్మాలు చేత లోహిత, శుక్ల కృష్ణ అని చెప్పబడుచున్నాయి. మూలప్రకృతి దేని నుండి పుట్టదు అని అంగీకరించబడింది కదా! ఆ ప్రకృతిని ఒక అజుడు అనగా పురుషుడు సంతోషిస్తూ లేదా సేవిస్తూ అవిద్య చేత, అదే తన ఆత్మ అనుకొని పొంది అవివేకవంతుడు అవడం చేత, సుఖవంతుడను, దుఃఖవంతుడను, మూడుడను అనుకుంటూ సంసారంలో పడి ఉంటాడు. మరొక అజుడైతే అనగా పురుషుడైతే వివేకజ్ఞానం కలిగి విరక్తుడై ప్రకృతి తనకు కల్పించిన సుఖదుఃఖాలను బంధాలను విడిచిపెట్టి ముక్తుడౌతాడు.
సూత్రం :- 118
"ప్రాణదయో వాక్యశేశాత్"
ప్రాణదయఇతి - వాక్యశేషాత్:- బృహదరణ్యకంలోని వాక్యంలో ఉండే శబ్ద సాన్నిధ్యం వల్ల , ప్రాణ దయః :- పంచ జనులంటే పంచ ప్రాణాలు అని గ్రహించాలి.
భావం :-పంచజనులు అంటే పంచప్రాణాలు అని గ్రహించాలి. పంచజన శబ్దం, మనుష్య వాక్యమైనా శబ్ద సాన్నిధ్యంలో ప్రాణ వాచకం అని అర్ధం చేసుకోవాలి.
వివరణ :- బృహదారణ్యకోపనిషత్తు:-(4,4,18):- ప్రాణానికి ప్రాణం, నేత్రానికి నేత్రం, చెవికి చెవి, అన్నంకి అన్నం, మనసుకి మనస్సు అయిన పురాతన బ్రహ్మాన్ని తెలుసుకుంటారు. ఇక్కడ ప్రాణానికి పంచజన అంటారు. ప్రాణాది పదాలు ఈశ్వర వాచకాలు అని గ్రహించాలి. పంచజన ప్రాణం ఈశ్వరుడే అవుతాడు. అయితే మాద్యందిన పాఠంలో అన్నస్య అన్నం లేదు కదా! దీని గురించి తరువాత సూత్రంలో చెప్పబడినది. పంచజన శబ్దానికి ప్రాణాదులు అని గ్రహించాలి. ప్రాణ, అపాన,వ్యాన, ఉదాన, సమానములే. పంచజనములుఅంటే 25తత్త్వాలు కాదు. పంచప్రాణాలు:- 1.ప్రాణము, 2.అపానము, 3.సమానము, 4.ఉదానము, 5.వ్యాసము 1.ప్రాణము ;- ఇది ముక్కు రంద్రాల నుండి హృదయం వరకు వ్యాపించి ఉన్న శ్వాస కోశాన్ని జ్ఞానేంద్రియములను నియంత్రిస్తుందని చెప్పబడింది. మన వాక్కును, మ్రింగటాన్ని, శరీర ఉష్టోగ్రతలను అదుపులో ఉంచుతూ శరీరంలో ఉర్ధ్వచలనం కలిగి ఉంటుంది. 2. అపానము :- నాభినుండి అరికాళ్ళవరకు వ్యాప్తి చెంది అధో చలనం అనగా కదలికలు కదలిక పై నుంచి క్రిందికి ఉండి, విసర్జన కార్యకలాపాలు నిర్వహిస్తుంది. మలమూత్ర విసర్జన, వీర్యము, బహిష్టు, మరియు శిశు జననం మొదలైనవి నిర్వహిస్తుంది. 3.సమానము:- ఇది నాభి నుండి హృదయం వరకు వ్యాప్తి చెంది ఉంటుంది. మనం తినే ఆహారాన్ని జీర్ణం అయ్యేటట్లు చేసి అది ఒంట బట్టడానికి సహకరిస్తుంది. దాని ద్వారా అవయవాలకు శక్తి కలిగుతుంది. 4.ఉదానము:- ఇది గొంతు భాగం నుంచి శిరస్సు వరకు వ్యాపించి ఉంటుంది. శరీరాన్ని ఊర్ధ్వ ముఖంగా పయనింపజేయడానికి ఇది సహాయపడుతుంది. మనలో నుండి శబ్దం కలగడానికి, వాంతులు చేసుకునేటప్పుడు బహిర్గత మవడానికి మన దైనందిన కార్యాల్లో తూలిపడిపోకుండా ఉండటానికి దోహదపడుతుంది. 5. వ్యానము :- ఇది ప్రాణ అపానాలను కలిపి ఉంచుతుంది. శరీరంలో ప్రసరణ కార్యక్రమాన్ని జరిపిస్తుంది. నాడీ మండలం మొత్తం పనులను నడిపిస్తుంది. మన ప్రాణమయకోశంలో సుమారు 72000 సూక్ష్మ నాడులున్నట్లు చెబుతారు. ఇవి కాక వాటిని నియంత్రించే నాడీ కేంద్రాలు ఉన్నట్లు పెద్దలు చెబుతారు. ఈ ప్రాణ అపాన సమాన ఉదాన వ్యానములనే పంచ ప్రాణాలు అంటారు. ఇవి ఆయా స్థానాలలో ఉన్నా అవసరమైనప్పుడు ఇతర స్థానాలలో సంచరిస్తాయి. ఇవే అగ్నులుగా పరిణమించి మనం తిన్నది రక్తంగా మారడానికి వివిధ దశలలో పనిచేస్తాయి.మనం పీల్చే గాలి లోపల ఇన్ని పరిణామాలు చెందుతుంది. వాయువు నుండి అగ్ని పుడుతుంది.ఇవే పంచజనములు.సాంఖ్యులు చెప్పిన 25 తత్త్వాలు కాదు. ఈ ప్రాణాదుల విషయంలో జన శబ్ద ప్రయోగం ఎలా కుదురుతుంది? తత్త్వాలు విషయంలో మాత్రం జన శబ్ద ప్రయోగం ఎలా కుదురుతుంది?అనే సందేహం రావచ్చును. ప్రాణాదులకు జనులతో సంబంధం ఉండటం వలన వాటి విషయంలో జన శబ్దం కుదురుతుంది. అందుచేత ప్రాణాదులు విషయంలో జనప్రయోగం ప్రసిద్ధమే.
సూత్రం :- 118
జ్యోతి షై కే షామ సత్యన్నే"
ఏకేషాం :- కాణ్వుల పాఠంలో (వాక్య శేషం :- 4-4-18 లో అన్నస్య అన్నమే అనే శబ్దాన్ని పఠించరు. కానీ 4-4-17 కన్నా ముందు మరోవాక్యం ఉంది). అన్నే అసతి:- . అన్నం శబ్దం లేనప్పుడు , జ్యోతిషా:-జ్యోతి పదంతో పూరించుకోవాలి.
భావం :- కాణ్వులకు అన్నం లేకపోయినా జ్యోతిస్సు చేత పంచ సంఖ్య పూరించబడింది.
వివరణ:-బృహదారణ్యకోపనిషత్తు:-(4-4-16):-"తద్దెవా జ్యోతిషాం జ్యోతిరాయః హా పాసతే అమృతమే" ఇందులో జ్యోతిషాం అంటే ఇంద్రియాలకు అని అర్ధం. జ్యోతి పదం ఇంద్రియ వాచకం కాబట్టి అన్నస్య అన్నం లో అన్న శబ్దం మాధ్యందినుల పాఠంలో ఇంద్రియ వాచకం కనుక ఆ ఇంద్రియాన్నే ఇక్కడ జ్యోతి అన్నారని గ్రహించాలి. పంచజన - పంచ ప్రాణ - పంచేంద్రియ- జ్యోతి శబ్దాలు సమానార్ధకాలు. ఏమి తేడా లేదు. ప్రాణ శబ్దం పరమేశ్వర వాచకమే. అధర్వణ వేదంలో పరబ్రహ్మ వాచక శబ్దాలను అర్ధం చేసుకోవడానికి వేదవ్యాసుడు మన హితం కోరి అనేక సూత్రాల రచన చేస్తున్నాడు. జనక మహారాజు బ్రహ్మజ్ఞానాన్ని వివరిస్తూ పరబ్రహ్మ ప్రాణానికి ప్రాణం, చక్షువుకి చక్షువు, శ్రోతానికి శ్రోతమ్, అన్నానికి అన్నం , మనసుకి మనస్సు అంటాడు. వీటిలో అన్నము అనే మాటకు బదులు జ్యోతిని తీసుకోవాలి. ఇప్పుడు పంచ జనులు అంటే ప్రాణము , చక్షువు,శ్రోతము,జ్యోతిష్షు, మనస్సు అంతేకాని 25 తత్త్వాలు కాదు. మాధ్యందిన శాఖకు సంబంధించిన వారి పాఠంలో వాళ్ళు ప్రాణాదులలో అన్నం కూడా పఠిస్తున్నారు. కనుక ప్రాణాదులు పంచ జనులైతే కావచ్చును. ప్రాణాదులలో అన్నం చేర్చని కాణ్వా శాఖీయుల పాఠంలో ప్రాణాదులు పంచ జనులు ఎలా అవుతారు.అందుకు సమాధానం చెబుతున్నారు. కాణ్వులకు అన్నం లేకపోయినా జ్యోతిస్సు చేత పంచ సంఖ్య పూరించబడింది. వాళ్ళు కూడా బ్రహ్మ స్వరూపం నిరూపించడానికి పంచ సంఖ్యను పఠిస్తున్నారు. ఈ జ్యోతిస్సు రెండు శాఖల వారికి కూడా సమానంగా పఠించబడినా కూడా దీనిని సమాన మంత్రంలో ఉన్న పంచ సంఖ్య చేత కొందరు గ్రహిస్తారు. కొందరు గ్రహించరు. రెండూ సమాన మంత్రంలో ఉన్నప్పటికీ, అపేక్ష కారణంగా మాద్యందిన శాఖవారు అన్నాన్ని, కాణ్వులు అది లేకపోవడంతో జ్యోతిస్సుని గ్రహించి దానినే పఠిస్తారు.
కారణత్వాధికరణం :- ( 1, 4 , 14 )
సూత్రం :-120
"కారణ త్వేన చా కాశాదిషు యథా వ్యపదిష్టో క్తేః"
ఆకాశేషు :- ఆకాశం మొదలైన మహత్ తత్త్వ నామరూపాత్మకమైన సమస్త కార్య పదార్ధాలలో, కారణత్వేన :- ఉపాదాన కారణం రూపంలో ఉంటుందని, యధా వ్యపదిష్టో క్తేః :- ప్రకృతి గురించి ఇది వరకు చెప్పం. చ:- కూడా,
భావం :- ఆకాశం మొదలైన మహత్ తత్త్వ నామ రూపాత్మకమైన సమస్త కార్య పదార్ధాలలో ఉపాదాన కారణం రూపంలో ఉంటుందని ప్రకృతి గురించి చదివాము. కనుక ప్రకృతి జగత్తుకు స్వతంత్రకారణం కాజాలదు.
వివరణ:- సకల చరాచరజగత్తుకు కారణం బ్రహ్మ. ఇందులో సందేహం లేదు. ఆకాశాది పంచభూతాలను కూడా పరబ్రహ్మ కారణం అని ఉపనిషత్తులలో చెప్పబడింది. ఒకవేళ ఎక్కడైనా క్రమంలో తేడా ఉండవచ్చును. అంటే పంచభూతలలో ముందుగా ఆకాశం, వాయువు, అగ్ని, జలము, పృధివి ఉద్భవించాయి. అయితే కొన్ని చోట్ల ముందుగా తేజస్సు ఉద్భవించిందని చెప్పారు. ఏమైనా ఈ పంచభూతాలకు కారణం బ్రహ్మమే. అలాగే పరమాత్మ సర్వజ్ఞుడు, సర్వేస్వరుడు, సర్వాత్మ, అద్వితీయుడు అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. కాబట్టి జగత్తుకు కారణం బ్రహ్మ తప్ప వేరొకటి లేదు. కొన్ని చోట్ల ఆకాశంలో సృష్టి మొదలైనదని చెప్పబడింది. కొన్ని చోట్ల తేజస్సుతో మొదలైనదని వినబడుతోంది. కొన్ని చోట్ల ఆత్మ లోకాలను సృజించిందని, స్వర్గం అంతరిక్షంలోను, మర్థ్యలోకం, పాతాళ లోకం సృష్టించిందని చెప్పబడుతోంది. కొన్ని చోట్ల ప్రారంభంలో ఇది కూడా అసత్ గానే ఉండేది. దాని నుండి సత్(ఎప్పుడు ఉండేది, పరబ్రహ్మ) పుట్టినది. ప్రారంభంలో ఇది కూడా అసత్ గానే ఉండేది. అది శుద్ధసద్రూపబ్రహ్మగా అయినది. అది జగత్తుగా మారినది. పూర్వం ఏమి లేని సృష్టి పఠించబడినది. కొన్ని చోట్ల కొందరు ప్రారంభంలో ఇదంతా అసత్తుగానే శూన్యంగానే ఉండేది అని అంటారు. సత్ నుండి అసత్ ఎలా పుట్టింది? ప్రారంభంలో అది సత్ గానే ఉండేది అని అసత్ వాదాన్ని నిరాకరించి సత్పూర్వకమైన జగత్ సృష్టి చెప్పబడుతోంది. ఈజగత్తంతా పూర్వం అవ్యాకృతంగా ఉండేది. అది నామరసాల చేత వ్యాకృతం (వేరు వేరుగా ఉన్నదని) అయినది. అది జగత్తు తనంతట తానే వ్యాకృతమైనదని, నామ రూపాలతో వివక్తమైనదని చెప్పబడుతోంది. ఈ విధంగా అనేక రకాలైన విప్రతిపత్తి కనబడుచున్నది. కర్మ విషయంలో వికల్పం ఉన్నా, వస్తువుల విషయంలో వికల్పం కుదరదు. కనుక వేదాంతవాక్యాలు జగత్కారణాన్ని నిర్ధారణ చేస్తాయని చెప్పడం న్యాయం కాదు. సత్తా, అసత్తా వికల్పాలు కుదరవు. కొన్నిచోట్ల ఆకాశం ముందు పుట్టిందని, కొన్నిచోట్ల తేజస్సు పుట్టినదని చెప్పడంలో, కార్యం విషయంలో వేరుగానే కనబడుతోంది. ఒక కార్యాన్ని బట్టి దాని కారణాన్ని , దానినిబట్టి దాని కారణం వెతుకుతూ పోతే చివరకు మూలకరణమైన బ్రహ్మను గుర్తించవచ్చును.
సూత్రం :- 121
"సమా కర్షాత్" సమాకర్షాత్ అంటే గ్రహించడం
భావం :- సత్ అంటే బ్రహ్మమే. ఈ సత్ రూపకమైన జగత్తు బ్రహ్మమూలకమే. బ్రహ్మకారణంగా ఉన్నది. గ్రహించడం, అన్వయం చేసుకోవడం, పూర్వవాక్యాలలో ఉన్న బ్రహ్మశబ్దాన్ని అన్వయం చేసుకోవాలని భావం.
వివరణ :- ఈ సృష్టి అంతా సత్ నుంచి జరిగిందని ఒక చోట, అసత్ నుంచి జరిగిందని మరొక చోట, చెప్పబడింది. ఇది సమాకర్షణ, దీని వలన ఇబ్బంది ఏమి లేదు. సృష్ఠికి పూర్వం ఈజగత్తంతా అసత్తుగానే ఉండేది. అంటే శూన్యంగానే ఉండేది. అసత్తుతో నిండి ఉండేది. అంతే కాని సృష్ఠికి కారణం అసత్ కాదు. బ్రహ్మను అసత్ అనుకున్నవాడు తాను కూడా అసత్తే అవుతాడు. ఎవడు బ్రహ్మను సద్వస్తువు అనుకుంటాడో తను కూడా సద్వస్తువు అవుతాడు. అది సత్యం, నిత్యం అన్నారు. ఈప్రకృతి సత్యము కాదు. నిత్యము కాదు. సత్యం, నిత్యము అయినది బ్రహ్మ ఒక్కటే. దానికి జరా మరణములు, ఆధ్యంతములు లేవు. అదే శాశ్వతమైనది. కాబట్టి ఈజగత్తు సృష్ఠికి బ్రహ్మతప్ప వేరేది కారణం కాదు. ఛందోగ్యోపనిషత్తు:-(3,19,1):- ఇది ముందు అసత్ అయి ఉండేది. తరువాత సత్ అయింది. వీటిని బట్టి బ్రహ్మమే సృష్ఠికి కారణమని ఎలా చెప్పగలం? అంటే తైత్తరీయంలో, ఛందోగ్యంలో ఉన్న అసత్ శబ్దం అంతకు ముందు నిర్దిష్టమైన బ్రహ్మ ఆకర్షణ (సమాకర్షాత్) వల్ల సృష్టి జరిగిందని గ్రహించాలి. తైత్తరీయోపనిషత్తు:-(2,7):- సృష్ఠికి పూర్వం ఇది అసత్ గానే ఉంది. తరువాత సత్ గా పరిణమించింది. బ్రహ్మవేత్త పరాన్ని పొందుతాడు. ఆనందమయమైన బ్రహ్మం జీవుడుకి అంతరాత్మ. సమాకర్షణ వలన జగత్తుకు మూలకారణం బ్రహ్మయని అన్వయం చేసుకోవాలి.
జగ ద్వాచిత్వాధికరణం :- ( 1, 4 , 16 )
సూత్రం :- 122
"జగ ద్వాచిత్వాత్"
జగత్ :- సృష్టి రచన రూపకమైన కర్తనే , జగత్ అని , వాచిత్వాత్ :- కౌషీతకీ బ్రాహ్మణంలో అన్నారు.
భావం :- సృష్టిరచనా రూపకమైన కర్తనే జగత్తు అనీ కౌశీతకీ బ్రహ్మణంలో అన్నారు. అంతే కాని జడప్రకృతి జగత్కర్త కాదు. చైతన్య రూపమైన ఈశ్వరుడే కర్త.
వివరణ :- గురువుగారు! బృహదారణ్యకోపనిషత్తులో బాలాకి ఉదంతం ఉంది. గార్గ్య గోత్రంలో పుట్టిన బాలాకి అనే ముని ఒకరోజు గర్వంతో, ఆకాలంలో కాశీకి రాజుగాఉన్న అజాతశత్రువు వద్దకు వెళ్లి నీకు బ్రహ్మాన్నిగురించి చెబుతాను అంటాడు. దానికి రాజు సంతోషపడి నీవు బ్రహ్మగురించి చెబితే నీకు వెయ్యి రూపాయలు ఇస్తాను అంటాడు. అప్పుడు బాలాకి సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు, ఆకాశం, వాయువు, జలము, దిక్కులు మొదలైన వాటిలో ఉండే పురుషుడే బ్రహ్మం అన్నాడు. అవి ఏవి బ్రహ్మ కాదు అంటాడు అజాతశత్రువు. ఆదిత్యుడిలో ఉన్న పురుషుడు పరిచ్చిన్నం అవుతాడు. కనుక బ్రహ్మ కానేరడు అని నిరసించి, నీవు నాకు బ్రహ్మం గురించి బోధిస్తానని అబద్ధాలాడావు. నీవు బ్రహ్మవాదివి కావు అన్నాడు రాజు. ఆ మాటలు విన్న బాలాకి రాజునే మంత్రోపదేశం చెయ్యమని కోరతాడు. మానవుడు నిద్రిస్తున్నప్పుడు ఇంద్రియాలన్నీ అతని ప్రాణంలో కలిసిపోతాయి. ఆత్మ స్వప్నావస్థలో ఉన్నప్పుడు దాని కర్మఫలాలు ప్రారంభం అవుతాయి. స్వప్నస్థితిలో ఆత్మ మహారాజులా ఉంటుంది. గొప్ప బ్రాహ్మణుడిలా ఉంటుంది. దేవతలవలే ఉచ్చస్థితి, ఆసురుల వలె నీచస్థితి పొందుతుంది. రాజు గారు దేశంలో సంచరించినట్లే ఆత్మ శరీరంలో స్వేచ్ఛగా విహరిస్తుంటుంది అని చెప్పబడినది. ఓ బాలాకి ! ఎవరు ఈపురుషులకు కర్త? ఈకర్మ ఎవరిదో? ఆయన్నే తెలుసుకోవాలి. ఈవాక్యంలో కర్త ఎవరు? జీవుడా? బ్రహ్మమా? ప్రాణమా? కర్మ అంటే వ్యాపారం. దానికి ప్రాణం కావాలి. ప్రాణం ఉన్నంత వరకే శరీరం ద్వారా కర్మ జరుగుతుంది. కనుక ప్రాణమే తెలుకోదగినది కదా! లేదా కర్మచేసేవాడు జీవుడు. కర్మ అంటే పుణ్యపాపాలు. అవి చేసే జీవుణ్ణి తెలుసుకోవాలి కదా! అంటే పైవాక్యాలను సందరదోచితంగా పరిశీలిస్తే తెలియవలసినవాడు బ్రహ్మమని, ఆయన చేసే కర్మ జగత్ సృష్టి అని తెలుస్తోంది. ఎవరు ఆదిత్యాది పురుషులకు కర్తో, ఎవరి కర్మ జగత్తో, ఆయనే తెలుసుకోదగినవాడు. ఈ సంవాదంలో భగవత్కర్మ జగత్తని తెలుస్తోంది. అంతే తప్ప ప్రాణం, జీవాత్మ జగన్నిర్మాణకర్తలు కారు. కనుక కౌషీతకంలో ఉన్న పురుషుడు బ్రహ్మమే కానీ జీవుడు, ప్రాణాలు కావు.అని చెప్పాడు కాశీరాజు.
సూత్రం :- 123
"జీవ ముఖ్య ప్రాణలింగా న్నేతి తత్ వ్యాఖ్యాతమ్"
జీవముక్త ప్రాణలింగాత్ :- బాలాకి, అజాత శత్రువుల సంవాదంలో జీవుణ్ణి, ముఖ్య ప్రాణాలను సూచించే లక్షణాలు ఉన్నాయి. న :- బ్రహ్మ జ్ఞేయం అంటే తెలుకోతగ్గది కాదు. ఇతి చేత్ ;- అని అంటారా ? తత్ వ్యాఖ్యానం :- ఈ విషయాన్ని నిరాకరిస్తూ ముందే వ్యాఖ్యానించాం కదా!
భావం :- బాలాకి అజాత శతృవుకి జరిగిన సంవాదంలో జీవుణ్ణి ముఖ్య ప్రాణాన్ని సూచించే చర్చ జరిగింది. కనుక ప్రాణం ఉన్న జీవుడి గురించే తెలుసుకోవాలి కానీ బ్రహ్మాన్ని కాదు అని అనుకుంటే ఈ విషయం ముందు సూత్రాలలో చెప్పడం జరిగింది కదా!
వివరణ :- కౌషీతకీ బ్రాహ్మణము:-(4,20):- యజమాని తన భృత్యుల ద్వారా విషయాన్ని అనుభవిస్తాడు. యజమాని ఇచ్చిన అన్నవస్త్రాల ద్వారా భృత్యులు యజమానిని అనుభవిస్తారు. అలాగే జీవుడు ఆదిత్యాది పురుషులు ఇచ్చే ప్రకాశాదుల ద్వారా విషయాన్ని అనుభవిస్తాడు. ఆదిత్యాదులు కూడా జీవులు అర్పించే హావిస్సు మొదలైనవి స్వీకరించి జీవుణ్ణి అనుభవిస్తారు. ఈవాక్యంలో జీవాత్మ ప్రసక్తి ఉంది. అలాగే(4,19) సుషుప్తిలో ప్రాణంతోనే ఏకీభవిస్తుంది అనే వాక్యంలో ప్రాణప్రసక్తి ఉన్నది. కనుక తెలియవలసిన తత్త్వం జీవాత్మ కానీ ముఖ్యప్రాణం కానీ కావాలి కదా! అంటే జీవముఖ్య (1,1,31) అనే సూత్రంలో జీవ, ముఖ్య ప్రాణాల గురించి వివరణ ఉన్నది. జీవుడికి ముఖ్య ధర్మాలు ఉన్నాయి. ప్రాణ శబ్దం బ్రహ్మ వాచకం కాదు. ఎందుకంటే జీవోపాసన, ప్రాణోపాసన, బ్రహ్మోపాసన అని 3 ఉపాసనాలు చెయ్యాలి. అవి హితంకాదు. బ్రహ్మోపాసన ఒక్కటే చెయ్యాలి. వాక్కును కాదు, వక్తను తెలుసుకో, అనే వాక్యంలో జీవాత్మ స్పష్టంగా తెలుస్తోంది. వాక్ ఇంద్రియ వ్యాపారం జీవాత్మకు చెందినదే. అప్పుడు ప్రాణశబ్దం జీవాత్మకు సంబంధించినది కదా! ప్రజ్ఞాత్మ అయిన ప్రాణమే శరీరాన్ని ధరించి మేలుకొలుపుతున్నది. ఈ వాక్యంలో శరీరాధారణ అనే ధర్మం ఉంది. అప్పుడు ముఖ్యప్రాణం జీవాత్మకు వర్తిస్తుంది. ముఖ్యప్రాణ ధర్మం ఉన్నదని ప్రాణశబ్దం బ్రహ్మవాచకం కాదు. కేనోపనిషత్తు:- జీవి యొక్క ముఖ్య ప్రాణం పరబ్రహ్మమే. ఆత్మ నుండి ప్రాణం పుడుతుంది.శరీరాన్ని ఆశ్రయించి నీడలా ఆత్మపైన ప్రాణం వ్యాపించి ఉన్నది. నీడకు స్వతంత్రమైన అస్తిత్వం లేనట్లే ప్రాణానికి కూడా స్వతంత్రమైన అస్తిత్వం లేదు. మనస్సులో పుట్టిన సంకల్పవికల్పాల వలనే ఇది శరీరంలోకి వస్తుంది. కాబట్టి ప్రాణం పరబ్రహ్మ నుండి పుడుతుంది. ఆ పరబ్రహ్మను ఆశ్రయించి ఉన్న ప్రాణం కూడా పరబ్రహ్మ స్వరూపమే. ప్రాణమే ప్రజ్ఞాత్మ .ఆనందం, అమృతమయం. ప్రాణికోటిలో ఏ జీవికూడా ప్రాణంతోనే జీవించదు. అపానంతో అంతకన్నా జీవించదు. ఈ రెండింటికి ఆశ్రితమైన దానివలన జీవిస్తున్నాయి. అదే బ్రహ్మ. వామదేవుడు ఈ ప్రజ్ఞాత్మయే ఆనందం, అజరం, అమృతం అన్నారు. ముఖ్యప్రాణం జీర్ణమైపోయింది. అజరం, అమరం రెండూ బ్రహ్మానికే వర్తిస్తాయి. ఉపదేశం అంటే బ్రహ్మోపాసనే అని తెలియజేశారు.
సూత్రం :- 124
"అన్యార్ధం తు జైమినిః ప్రశ్న వ్యాఖ్యా నాభ్యా మపి చైవ మేకే"
తు:- కాగా, జైమినిః:- జైమిని, అన్యఅర్ధం :- కౌషీతకీబ్రాహ్మణ ప్రకరణంలో జీవాత్మ, ముఖ్య ప్రాణాల వర్ణన వేరే ప్రయోజన నిమిత్తంచేశాడు. అపిచ :- అంతేకాక, ఏకే :- కొందరు వాజసనేయులు, ప్రశ్నవ్యాఖ్యానాభ్యాం :- ప్రశ్నోత్తరాల మూలంగా, ఏవం :- ఈ విధంగానే, ప్రతిపాదిస్తున్నారు.
భావం:- కౌషీతకీ బ్రాహ్మణ ప్రకరణంలో జీవాత్మ, ముఖ్య ప్రాణాల వర్ణన బ్రహ్మ ప్రతిపత్తి కోసం చెయ్యడం జరిగిందని జైమిని మహర్షి చెప్పాడు. కొందరు వాజసనేయులు ప్రశ్నోత్తరాల మూలంగా ఈ విధంగానే ప్రతిపాదిస్తున్నారు.
వివరణ:- కౌషీతకీ బ్రాహ్మణంలో ఉండే ప్రశ్నోత్తరాలను చూసినప్పుడు మధ్యలో జీవాత్మను కీర్తించడానికి కారణం బ్రహ్మ జ్ఞానాన్నీ ప్రతిపాదించడానికి అని తెలుసుకోవాలి.
కౌషీతకీబ్రాహ్మణము:-(4,19):- బాలాకిని నిద్రపోతున్న బ్రాహ్మణుడి దగ్గరకు తీసుకొని వెళ్లి అతనిని లేపమన్నాడు రాజు. అతన్ని ప్రాణం పేర్లతో సంభోదించి మేల్కొలపడానికి ప్రయత్నించాడు. కానీ అతను లేవలేదు. అతన్ని కర్రలతో పొడిచి లేపితే లేచి కూర్చున్నాడు. ఓ బాలాకీ! ఈ పురుషుడు విశేషజ్ఞానం ఏది లేకుండా దేని మీద శయనించాడు? ఈ పురుషుడు ఈ విధంగా కలసిపోయినట్లుగా ఎక్కడ ఉన్నాడు? అనగా ఎవరితో ఐక్యం పొందాడు? ఈ విధంగా ఎక్కడనుండి తిరిగి వచ్చాడు? అని అడిగాడు. జీవుడు నిద్రిస్తుండగా ఇంద్రియాల యొక్క విషయాన్ని గ్రహించి సుషుప్తిలో ప్రాణాన్ని చేరతాడు. అప్పుడు చక్షు, శ్రోతమ్, మొదలైన ఇంద్రియాలు తమతమ విషయాలతోపాటు అతడితో ఏకీభవిస్తాయి. పురుషుడు మళ్ళీ మేలుకొన్నప్పుడు మళ్ళీ ఆఇంద్రియాలు ప్రజ్వలించే అగ్నినుండి వెలువడే నిప్పుకణికల వలె తమ పనులు ప్రారంభిస్తాయి. ఈ వాక్యాన్ని బట్టి జీవుడు సుషుప్తిలో అవిభక్త రూపంలో ఎక్కడ ఉంటాడో, జాగ్రదావస్థలో ఎవరి నుంచి వేరవుతాడో,అతనే కర్త అని, ఆయనే తెలుసుకోవలసిన వాడని స్పస్టమౌతోంది. సుషుప్తిలో జీవుడు పరమాత్మతో, అవిభక్త రూపంలో ఉంటాడని ఉపనిషత్తులంటున్నాయి. నిద్రిస్తుండగా ఇంద్రియాల యొక్క విషయాన్ని గ్రహించి, జీవి హృదయాకాశంలో నిద్రిస్తాడు. అదే పరమాత్మ ఉండే చోటు. నిద్రావస్థలో ఉన్నప్పుడు పురుషుడు అంటే ఆత్మ శరీరం ఇంద్రియాలను తనలో లీనం చేసుకుంటాడు. ప్రాణాలన్నింటిని తనలో ఆకర్షించుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఆకర్షించే పురుషుడే బ్రహ్మ. వాజసనేయులు సైతం బాలాకి అజాత శత్రువు సంవాదాల ద్వారా ఈఅంశాన్ని స్పష్టం చేశారు. ఈ విజ్ఞానపురుషుడు ఎక్కడ ఉన్నాడు? ఈ విధంగా ఎక్కడినుంచి వచ్చాడు? అనే ప్రశ్నలలోను, హృదయం లోపల ఏ ఆకారం ఉన్నదో దానిలో శయనిస్తున్నాడు. అని ప్రతి వచనంలోను పరమాత్మని చెబుతున్నాడు. వాజసనేయులు సైతం బాలాకి అజాత శత్రువు సంవాదాల ద్వారా ఈ అంశాన్ని స్పష్టం చేశారు. ఈ విజ్ఞానపురుషుడు ఎక్కడ ఉన్నాడు? ఈ విధంగా ఎక్కడినుంచి వచ్చాడు? అనే ప్రశ్నలలోను, హృదయం లోపల ఏ ఆకారం ఉన్నదో దానిలో శయనిస్తున్నాడు. అని ప్రతి వచనంలోను పరమాత్మని చెబుతున్నాడు. ఆకాశ శబ్దం పరమాత్మలోనే అనే అర్థం లో ప్రయోగించబడింది.అన్ని ఆత్మలు కూడా పైకి వస్తున్నాయి. ఆత్మలన్ని మరొక చోటు నుండి లేస్తున్నాయి, పరమాత్మయే దానికి కారణం.సుషుప్తి పురుషుణ్ణి లేపడం ద్వారా జీవుడు ప్రాణాదులు కంటే భిన్నుడు అని తెలియజేశారు.
వాక్యాన్వయాధికరణం :- ( 1, 4, 19 )
సూత్రం :- 125
"వాక్య సమన్వయాత్"
వాక్య:- ఐతరేయోపనిషత్తులో జగత్ స్రష్టగా వర్ణించిన ఆత్మకూడా బ్రహ్మమే అని, సమన్వయాత్ :- పూర్వాపర వాక్య సమన్వయం వలన తెలుస్తోంది.
భావం :- ఐతరేయ బ్రాహ్మణంలో జగత్ స్రష్టగా వర్ణించిన ఆత్మ కూడా బ్రహ్మమే నని పూర్వాపర వాక్యసమన్వయం వలన తెలుస్తోంది.
వివరణ :- గురువుగారు! శృతులలో చెప్పిన ఆత్మ శబ్దం జీవిని సూచిస్తుందా? పరమాత్మను సూచిస్తుందా? వివరించండి? అని అడిగాడు కృష్ణశర్మ. రత్నాకరుడు చెప్పడం ప్రారంభించాడు. వాక్యాలకు అన్నింటికీ పరబ్రహ్మయందే అన్వయం కుదురుతుంది. శ్రవణ, మనన,నిధి ధ్యాసలకు యోగ్యమైనది బ్రహ్మమే.
బృహదారణ్యకోపనిషత్తు:- యాజ్ఞవల్కుడు, మైత్రేయి కథ:- యాజ్ఞ వల్కుడు సన్యాసం స్వీకరించాలనే కోరికతో తన ఇద్దరు భార్యలకు తన ఆస్తిపాస్తులను పంచుతానంటాడు. రెండవభార్య అయిన మైత్రేయి ఈ సిరిసంపదలు నాకు వద్దు. నేను దేనివల్ల అమృతురాలను కానో అలాంటి ధనాన్ని నేను ఏమి చేసుకుంటాను? పూజ్యుడవైన నువ్వు నీకు తెలిసిన బ్రహ్మ విద్యను ఉపదేశించు అని అమృతత్త్వాన్ని కోరుకుంది మైత్రేయి. అప్పుడు యాజ్ఞవల్కుడు ఆమెకు ఆత్మవిజ్ఞానం బోదిస్తాడు. మైత్రేయి ! ఆత్మ ప్రయోజనం కోసమే ఒకరికొకరు ప్రియమౌతారు. భార్య భర్తను ప్రేమిస్తుంది. అంటే ఈ ప్రేమ ఆమె భర్త కోసం కాదు. భార్య ప్రయోజనం కోసమే. ద్రష్టవ్యుడిగా, శ్రోత్రవ్యుడిగా చెప్పబడుచున్నది విజ్ఞానాత్మయా? లేక పరమాత్మయా? అనే సందేహం ఎందుకు కలిగింది? ఆత్మవిజ్ఞానం చేతనే సర్వమూ తెలుస్తుంది. ఆత్మ ఒక్కటే చూడదగినది, వినదగినది, మననం చేయదగినది, ధ్యానం చేయదగినది. దర్శన, శ్రవణ, మనన విజ్ఞానంతో అంతా తెలుస్తుంది. విజ్ఞానమయుడైన ఆత్మయే సమస్త భూతాలకు అధిపతి. సమస్త భూతాలకు రాజు. సమస్త దేవతలు, లోకాలు, ప్రాణాలు, అన్ని పరమాత్మలోనే ఇమిడి ఉన్నాయి. ఆ ఆత్మయే పరబ్రహ్మ అని తెలుసుకోవాలి. ఆత్మ అంటే జీవుడి గురించి కాదు. జీవ విజ్ఞానం వలన అమృతత్త్వం లభించదు. ఆత్మ జ్ఞానం చేతనే సమస్తం తెలుస్తుంది కనుక దృష్టవ్యుడు పరమాత్మే. కానీ వేరెవరు కాదు. ఎవడు బ్రహ్మ ఆత్మ కంటే భిన్నమైనదని భావిస్తాడో, వానికి బ్రహ్మ జన్మరాహిత్యం కలుగజేయడు. క్షణికాధికమైన ఈ జగత్తు ఆత్మ కంటే భిన్నంగా స్వతంత్రంగా ఉన్నది అని అనుకుంటారో, వారిని శ్రేయోమార్గం నుండి దూరం చేస్తుంది. ఇక్కడ సమస్త వస్తు సముదాయం కూడా ఆత్మ కంటే భిన్నంగా లేదు అని విషయాన్ని అవతరింపజేస్తాడు. దుందుభి దృష్టాంతం:- దుందుభి, శంఖం, వీణ మొదలైన వాద్యాలన్నీ ఒక్కసారి మ్రోగించినప్పుడు ఒక సామాన్యమైన ధ్వని మాత్రమే వినిపిస్తుంది. దుందుభ్యాదుల విశేషధ్వనులు ఆ సామాన్యధ్వనిలో లీనమైపోతాయి. అందుచేత వాటి యొక్క ధ్వనులు వినబడుతూనే ఉంటాయి. ఈ సామాన్యధ్వని మీద విశేషధ్వనులు ఆరోపించబడతాయి. అదే విధంగా ఆత్మ యొక్క భావం చేత భాసింపబడే సర్వమూ కూడా ఆత్మ మాత్రమే. ఆత్మ కంటే భిన్నం కాదు అని దుందుభి దృష్ఠంతం చెప్పబడింది. అన్ని జలాలకు సముద్రమే ఏ విధంగా ఏకైక స్థానమో అట్లే సకల ప్రపంచ ప్రళయం పొందే ఏకైక స్థానం బ్రహ్మయే.
ఐతరేయోపనిషత్తు:- సృష్ఠికి ముందు ఆత్మ, జగత్తు ఒక్కటిగా ఉండేది. లోకాలను సృష్టించాలని ఆత్మ సంకల్పించి, సృష్టించింది. అదే ఆత్మ బ్రహ్మరంధ్రం ద్వారా శరీరంలోకి ప్రవేశించింది. లోకాలను సృజించే శక్తి సామర్ధ్యం జీవాత్మకు లేవు. అందుకే ఆత్మశబ్దం బ్రహ్మవాచకం. లోకరచన, దర్శన, శ్రవణాది శక్తులను సంపన్నం చెయ్యడం జీవాత్మకు తెలియదు. లోక స్రష్ట అయిన పరమాత్మే చేయగలడు. జీవాత్మ కర్మబద్ధుడై కర్మ ఫలం అనుభవించడానికి పరమాత్మ నియమించిన శరీరంలో పరతంత్రుడై ప్రవేశిస్తాడు. పరమాత్మ సర్వ వ్యాపకుడు, కనుక శరీరంలో కూడా ఉంటాడు.
సూత్రం :- 126
"ప్రతిజ్ఞా సిద్ధేర్లింగ మాశ్మరధ్యః"
ప్రతిజ్ఞాసిద్ధే:-ఐతరేయంలో చేసిన ప్రకటన సిద్ధించడానికి, లింగం:- తనతో అవిభక్తముగా ఉండే జీవాత్మతో పాటు ఈశ్వరుడు శరీర ప్రవేశం చేయడమే తార్కాణం అని, ఆశ్మరద్యః :- ఆశ్మరధ్యాచార్యుని సిద్ధాంతo.ఈ విషయంలోవ్యాసుడు ముగ్గురు ఆచార్యుల అభిప్రాయాలను వరుసగా చెబుతున్నాడు.
భావం :- ఐయితరేయంలో చేసిన ప్రకటన సిద్ధించడానికి తనతో అవిభక్తముగా ఉండే జీవాత్మతోబాటు ఈశ్వరుడు జీవుడి శరీరంలోకి ప్రవేశించాడు అనేదే ఆశ్మరధ్యాచార్యుని సిద్ధాంతం.
వివరణ :- ఆత్మావా ఇదమగ్ర ఆశీత్ :- ఐతరేయోపనిషత్తులో సృష్ఠికి ముందు ఆత్మ, జగత్తు ఒక్కటిగా ఉండేవని చెప్పబడింది. లోకాలను సృష్టించాలని ఆత్మ సంకల్పించడం, సృష్టించడం జరిగింది. లోకాలను సృష్టించే సామర్ధ్యం బ్రహ్మకు తప్పమరెవరికి లేదు. తరువాత పరమాత్మ, జీవాత్మతో పాటు శరీర ప్రవేశం చేసినట్లు ఉంది. జీవాత్మ, పరమాత్మలు వేరు వేరుగా శరీరంలో ప్రవేశించలేదు. ఒక్కటిగానే వెళ్లాయి. అందువలన జగత్ స్రష్ట అయిన ఆత్మ బ్రహ్మమేనని అశ్మరధుడు అంటున్నాడు. ఇక విజ్ఞానం వలన సర్వమూ తెలుస్తుంది. ఇలాంటివి జీవునితో ప్రారంభించడం అనేది సంప్రదాయమని అశ్మరధ్యాచార్యులు చెబుతున్నాడు. ఆత్మ విజ్ఞానం తెలిస్తే ఈదృశ్య జాతమంతా తెలుస్తుంది. ఆత్మయే సమస్తమని ఉపనిషత్తులలో చెప్పబడింది. ఇక్కడ ఆత్మ అంటే జీవాత్మ కాదు. పరమాత్మ అని అర్ధం. జీవాత్మ ద్రష్టవ్యం, శ్రోతవ్యం ఇత్యాది విధంగా చెప్పడం ఆ ప్రతిజ్ఞ యొక్క సిద్ధిని సూచిస్తుంది. విజ్ఞానాత్మ(జీవుడు) పరమాత్మకంటే అన్యుడైతే పరమాత్మను తెలుసుకున్నా కూడా విజ్ఞానాత్మను తెలుసుకొనడం ఉండదు. అందువల్ల ఆప్రతిజ్ఞ సిద్ధించడం కోసం విజ్ఞానాత్మ పరమాత్మలలో ఉన్న అభేదాంశాన్ని పురస్కరించుకొని ఈఘట్టం ప్రారంభించబడిందని అశ్మరాధ్యచార్యుడి అభిప్రాయం. జీవుడు, బ్రహ్మ మధ్య భేదం, అభేదం కూడా ఉంది. అభేదంశాన్ని దృష్టిలో పెట్టుకొని జీవుడితో ప్రారంభించి ఏకవిజ్ఞానేన సర్వవిజ్ఞానాను సమర్ధించబడిందని ఆచార్యుని అభిప్రాయం.
వాక్యాన్వయాధికరణం :- ( 1, 4, 21)
సూత్రం :- 127
"ఉత్క్ర మిష్యతి ఏవం భావాత్ ఔడు లోమిః"
ఉష్క్ర మిష్యతః :- శరీరాన్ని విడిచి మోక్షపథంలో జీవుడు, ఏవం భావాత్:- పరమాత్మతో ఐక్యం కుదురుతుంది. ఔడు లోమిః:- ఔడు లోమి చెబుతున్నాడు.
భావం:- శరీరాన్ని విడిచి మోక్షపథంలో జీవుడు పరబ్రహ్మలో ఐక్యం అవుతాడు. కనుక జీవుడితో పాటు బ్రహ్మం శరీర ప్రవేశం చేసినట్లు ఔడు లోమీ ఆచార్యుడికి అభిప్రాయం.
వివరణ :- ఆత్మ సాక్షాత్కారం జరిగిన తరువాత ఈ దేహాన్ని విడిచిన జీవాత్మ పరమాత్మతో లీనమౌతుంది. కాబట్టి ఔడు లోమి ఆచార్యుడు భవిషత్తులో జరగబోయేదానిని ముందుగానే ఊహించి జీవునితో వాక్యం ప్రారంభించడం తప్పు కాదు అంటాడు ఔడులోమి ఆచార్యుడు. దేహేంద్రియ మనోబుద్ధుల సంఘాతం అనే ఉపాధితో సంపర్కం వలన కలుషితమై పోయిన జీవుడే జ్ఞానంపొంది, ధ్యానం మొదలైన సాధనాలతో అనుష్టించి, నిర్మలుడై దేహాది సముదాయం నుండి పైకి వెళ్ళిపోయినప్పుడు పరమాత్మతో ఐక్యం చెందుతాడు. ఈవిధంగా జీవ పరమాత్మలు అభేదంతో ఉపక్రమం చేయబడిందని ఔడులోమీ అభిప్రాయపడ్డాడు.
ముండకోపనిషత్తు:- ప్రవహిస్తున్న నదులు తమ నామరూపాలను విడిచి ఏ విధంగా సముద్రంలో లీనమైపోతాయో, అట్లే జ్ఞానవంతుడు తన నామరూపాలను విడిచి, దివ్యడైన పరాత్పరుణ్ణి చేరతాడు. ఇత్యాది శృతులు నదులను ఉదాహరణగా చూసి జీవునికి నామరూపాలు ఉన్నాయి అని చెబుతారు. ఏవిధంగా నదులు తమకున్న నామరూపాలును విడిచి సముద్రంలో లీనమై పోతాయో, అట్లే జీవుదు కూడా తనకున్న నామరూపాలను విడిచి పురుషుణ్ణి చేరతాడు అని అర్ధం. జీవుడికి సంసారదశ సత్యమే, ఆదశలో భేదం కూడా సత్యమే. మోక్షంలో జీవుడు పరమాత్మలో అవిభక్తుడై ఉంటాడని, వాక్యాన్ని బట్టి ఐతరేయంలో బ్రహ్మ శరీర ప్రవేశం చేసినట్లుగా వర్ణించారని ఔడులోమీ అభిప్రాయపడ్డాడు.
సూత్రం :- 128
"అవస్థితే రితి కాశ కృత్స్నః "
అవస్థితే :- బ్రహ్మ శరీరంలో స్థితుడై ఉండటం వల్ల, శరీరంలో జీవాత్మతో బాటు ప్రవేశించినట్లు వర్ణించారు. ఇతి :- అని, కాశ కృత్స్న:-కాశకృత్స్నఆచార్యుడి అభిప్రాయం. చిదచిదాత్మకమైన ఈ జగత్తు సమస్తం పరబ్రహ్మానికి శరీరం లాంటిది.
భావం ..బ్రహ్మ శరీరంలో ఉండటం వలన జీవుడితో బాటు శరీరంలో ప్రవేశించినట్లు వర్ణించారు.
వివరణ,,అధర్వ వేదం :- ఆయనకు భూమి పాదం, అంతరిక్షం -ఉదరం, దివం :-శిరస్సు.
బృహదారణ్యకోపనిషత్తు:-ఇలా శాస్ట్రాల్లో జీవప్రకృతులు రెండు బ్రహ్మానికి శరీరాల్లాగావర్ణన ఉంది.వాస్తవానికి శరీరం, జీవుడు రెండూ వేరు అయినా అగ్ని లోహ పిండాలాగా అవిభాజ్యంగా ఉంటాయి. శరీరం లో ఉండే జీవుడు ఇంటిలో ప్రవేశించేటప్పుడు శరీరంతో బాటే వెడతాడు. అలాగే జీవరూపశరీరసహితమైన బ్రహ్మం పాంచభౌతికశరీరంలో ప్రవేశించేటప్పుడు జీవుడితోబాటు ప్రవేశిస్తున్నట్లు ఉపదేశించారని కాశకృత్స్నుడి మతం. అవిద్య ,అజ్ఞానములలో వచ్చిన భేదభావం వల్ల ఆపరబ్రహ్మ జీవరూపంలో ఉన్నాడు. అందుచేతనే జీవాత్మతో వాక్యం ప్రారంభమైనది. కాబట్టి తెలుకోదగినవాడు పరమాత్మ తప్ప వేరెవరు కాదు. వ్యాసులవారు ముగ్గురు ఆచార్యుల అభిప్రాయాలను వరుసగా వ్యక్తపరుస్తున్నారు.
ఆశ్మరధ్యాచార్యుని మతం:-"ఆత్మావా ఇదమగ్ర ఆశీత్" ఆత్మ ఒక్కటే ఉండేది. తరువాత పరమాత్మ జీవాత్మతో పాటు శరీరంలో ప్రవేశించినట్లు ఒక్కటిగానే ప్రవేశించాయి. అందువల్ల జగత్ స్రష్ట అయిన ఆత్మ బ్రహ్మమేనని ఆచార్యుని అభిప్రాయం. జీవబ్రహ్మల మధ్య భేదాలు, ఉన్నప్పటికీ అభేదాంశాన్ని దృష్టిలో పెట్టుకొని జీవునితో ప్రారంభించి ఏక విజ్ఞానేన సర్వవిజ్ఞానాం" అనేది సమర్ధించబడింది.
ఔడులోమి ఆచార్యుని మతం:-జీవ పరమాత్మల మధ్య అవస్థా భేదాన్ని బట్టి సంసార వ్యవస్థలో జీవుడు పంచభౌతికమైన దేహంలో లౌకికవ్యవహారాలలో తాదాత్మ్యం చెంది, సుఖదుఃఖాలకు లోనైనవాడు భగవత్ చింతనతో పరమాత్మలో లీనం అవడం అభేదం స్థితి. తత్త్వమసి నేనే నువ్వు అయి ఉన్నావు అని శరీరాన్ని విడిచి మోక్షపథంలో జీవుడు పరబ్రహ్మ తో అవిభక్తంగా ఉంటాడు. కనుక జీవుడితో పాటు బ్రహ్మ శరీర ప్రవేశం చేసినట్లు ఔడులోమి అభిప్రాయం. నదులన్ని వాటి నామరూపాలు కోల్పోయి సముద్రంలో లీనమైనట్లుగా, మోక్షంలో జీవులందరు పరమాత్మతో లీనమౌతారు.
కాశకృత్స్న ఆచార్యుడి మతం :- ఈ జగత్తంతా పరమాత్మకు శరీరం లాంటిది. ఆయనకు భూమి పాదం, అంతరిక్షం ఉదరం, దివం శిరస్సు గా వర్ణించారు. జీవుడు, ప్రకృతి బ్రహ్మానికి శరీరంగా వర్ణించారు. వాస్తవానికి రెండూ వేర్వేరు. అగ్ని, లోహపిండాల్లా ఉంటాయి. శరీరంతో ఉండే జీవుడు ఇంటిలో ప్రవేశించేటప్పుడు శరీరంతో పాటే వెడతాడు. అలాగే జీవరూప శరీరసహితమైన బ్రహ్మం పాంచభౌతికశరీరంలో జీవుడితో బాటు ప్రవేశిస్తున్నట్లు ఉపదేశించారని కాశకృత్స్నుడి అభిప్రాయం. పరమాత్మ జీవుడిగా ఉన్నాడని బుద్ధి మొదలైన వాటియందు ప్రవేశించి మాట్లాడుతూ వ్యవహరిస్తారని అంటారు. తేజస్సు మొదలైన వాటిని సృష్టించినట్లుగా ఎట్టి వికారాలు లేని పరమాత్మ జీవుడు కాదు అని వారి ఆచార్యుడి మతం.
సూత్రం :- 129
"ప్రకృతిశ్చ ప్రతిజ్ఞా దృష్టాంతాను పరోధాత్"
ప్రకృతిః:- ప్రకృతి, చ:- కూడా, ప్రతిజ్ఞాదృష్టాంత అనుపరోధాత్:- ఈ విషయాన్ని ప్రతిజ్ఞా వాక్యం, దృష్టాంత వాక్యం ధృవపరుస్తున్నాయి.
భావం :-ప్రకృతి జగజ్జన్మాదులకు ఉపాదాన కారణమని దృష్టాంత వాక్యం ధృవపరుస్తోంది.
వివరణ :- గురువు గారూ! ఈ జగత్తుకు బ్రహ్మ ఉపాదాన కారణమా? నిమిత్త కారణమా? కుండలు చెయ్యడానికి కుమ్మరి నిమిత్తకారణం, మట్టి ఉపాదాన కారణం. అలాగే ఆభరణాలకు బంగారం ఉపాదాన కారణం, కంసాలి నిమిత్తకారణం. కుమ్మరి కుండను ఏరకంగా తయారు చేస్తాడో ముందుగా ఊహించి తయారుచేస్తారు. అలాగే స్వర్ణకారుడు బంగారంతో ఏ ఆభరణాలు తయారు చేయాలో ఆలోచిస్తాడు. చాందోగ్యంలో ఈ సృష్టిని గురించి పరబ్రహ్మ ఆలోచించాడు. ఒక్కటిగా ఉన్న పరబ్రహ్మ అనేకరూపాలు కావాలనుకున్నాడు. ప్రశ్నోపనిషత్తులో ఆపరబ్రహ్మ ఆలోచించి ముందుగా ప్రాణాన్ని సృష్టించాడు. ఐతరేయోపనిషత్తులో పరమాత్మ విరాటస్వరూపాన్ని దృష్టిలో ఉంచుకొని తీవ్రమైన ఆలోచన చేసినట్లు చెప్పబడింది. కాబట్టి ఈజగత్తుకు ఉపాదాన కారణం, నిమిత్త కారణం తెలియజేయండి అన్నాడు నారాయణభట్టు. రత్నాకరుడు సమాధానం చెబుతున్నాడు. పరబ్రహ్మ ఈ జగత్తుకు ఉపాదాన కారణం, నిమిత్తకారణం కూడా.
ఛాందోగ్యోపనిషత్తు:- ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ ఉద్ధాలకుడు తన కుమారుడైన శ్వేతా కేతువుతో, నాయనా! శ్వేతకేతూ! శ్రవణ గోచరం కానీ తత్త్వం, ఇంద్రియగోచరమయ్యే విధానం గురించి మీ గురువుగారిని అడిగావా? ఏమిటా విషయం ? అని అడిగాడు. మట్టిని గురించి తెలిస్తే మట్టితో చేసిన రకరకాల వస్తువులకు పేర్లలో తేడా ఉన్నా వాటిని గురించి తెలుస్తుంది. అదే విధంగా బంగారం గురించి తెలిస్తే దానితో తయారుచేసే నగలకు ఏ పేరు పెట్టినా, అందులో ఉన్నది బంగారమే అని తెలుస్తుంది. అలాగే ఏ విషయం తెలుసుకున్నందువలన మనకు అన్ని విషయాలు బోధపడతాయో దాన్ని గురించి తెలుసుకోవాలి. ఇక్కడ ఉపాదానకారణమైన మట్టి సత్యం.అలాగే బ్రహ్మ సత్యం, ఈ జగత్తు ఉపాదానకారణం,నిమిత్త కారణం.కూడా.
కఠోపనిషత్తు:- (5,8):- ఆయన చేతనాచేనాత్మకమైన పదార్ధాలు నిద్రించి ఉన్నప్పుడు మేలుకొని ఉంటాడు. తన సంకల్పంతో జగత్తును నిర్మిస్తాడు. అన్ని నిర్మిత పదార్ధాలకు ఆశ్రయం. ఆయనే శుక్రం, బ్రహ్మం, అమృతం గా వర్ణించారు. ఆయన సంకల్పమే ఈ జగత్తు నిర్మాణానికి ఉపాదాన కారణం. అలాకాక, బ్రహ్మం, ప్రకృతి ఒక్కటే అనుకుంటే జగద్రచన చెయ్యడానికి ఆటంకం ఏర్పడుతుంది.కనుక బ్రహ్మం భోగ్యాలైన జీవులకు అధిష్టానం శుక్రం, అమృతం.అని ఈ ఉపనిషత్తు సారాంశం. (5,9):-అగ్ని భువనంలో ప్రవేశించి ఆయా పదార్ధాల ఆకారాన్ని పొందుతుంది. అలాగే బ్రహ్మం ఒక్కటే అన్ని అనుభూతులకు అంతరాత్మగా వాటి రూపాన్ని పొందడమే కాక వాటి బయట కూడా ఉంటుంది. ఇక్కడ అగ్ని దృష్టతం. బ్రహ్మ జగజ్జన్మాదులకు కారణం కావడం చేత అంతర్యామి రూపంలో ప్రతి పదార్ధంలో ప్రవేశించి, వాటి ఆకారం పొందడమే కాక, పదార్ధల బయట కూడా ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మం తప్ప వేరే ప్రకృతి లేదనుకుంటే ఈ కాటక వాక్యం అసంగతం అవుతుంది. ఈ దృష్టాంతంలో బ్రహ్మం ప్రపంచానికి బయట కూడా ఉండటం వలన బ్రహ్మ నిమిత్తకరణమే కానీ ఉపాదాన కారణం కాజాలదు. ఉపాదాన కారణం కార్యానికి బయట ఉండదు. కాబట్టి ఈ దృశ్య రూప జగత్తుకు ఉపాదాన కారణం ప్రకృతి అనీ, బ్రహ్మం కన్నా భిన్నం అని సూత్రాభిప్రాయం. కేవలం నిమిత్తకరణమే ఉంటుంది ప్రకృతి లేదనుకుంటే జగత్తుకు ఉనికి ఉండదు. బ్రహ్మమే జగత్తుకు ఉపాదాన కారణం అనుకుంటే బ్రహ్మం పరిణామం కావలసి వస్తుంది. బ్రహ్మ నిత్యం,పరిణామి కాదు. బ్రహ్మ నిర్మలం, చేతనం,అయితే జగత్తు మలినం,జడం. కనుక జగత్తుకు ప్రకృతి ఉపాదానకరణ అని అంగీకరిస్తే ప్రతిజ్ఞా,దృష్ష్టాంతలు రెండు సార్ధకం అవుతాయి. బ్రహ్మ నిత్యమే కానీ పరిణామ నిత్యం కాదు. లోకంలో ఏదైనా ఒక పని సఫలం కావాలంటే అనేక కారణాలు అంటే కర్త, కర్మ, కరణం, అధికరణం మొదలైనవి ముందుగా ఉండాలి.ఆ న్యాయాన్ని ఆదికర్త అయిన పరమేశ్వరుడి విషయంలో ప్రవర్తింపజేయడం యుక్తంగా ఉంది. పరమేశ్వరుడు కూడా అనేక సాధనాల సహాయంతో జగత్ సృష్టి చేశాడు. బ్రహ్మ ఉపాదాన కారణం , నిమిత్త కారణంగా కూడా అంగీకరించబడుతోంది. ఎందువలనంటే ఒక దానిని తెలుసుకోవడం చేత తెలుసుకొనబడని ఇతరమైన సమస్తము కూడా తెలియబడుతోంది. ఈ విధమైన సర్వ విజ్ఞానం కార్యం ఉపాదాన కారణం కంటే వేరే ఏది లేదు. కార్యం నిమిత్త కారణం కంటే అభిన్నం కాదు. జగత్ సృష్టికి నిమిత్త కారణం బ్రహ్మమే, సృష్టి చెయ్యాలనే ఆలోచనే ఉపాదానకారణం.
ప్రకృత్యధికరణం :- ( 1, 4, 24 )
సూత్రం :- 130
" అభిధ్యోపదేశాత్ "
చ :- అంతే కాని, అభిద్య:- సంకల్పం, ఉపదేశాత్ :- ఉపదేశం,
భావం :- పరబ్రహ్మ సృష్టి సంకల్పం వలన ప్రకృతి జగత్తుకు ఉపాదానకారణం అని అంగీకరించాలి.
వివరణ:- పరబ్రహ్మ తాను అనేక రూపాలుగా కావాలని కోరుకున్నాడు. ఈ కోరిక వలన బ్రహ్మకు కర్తృత్వం, ఉపాదానత్వం రెండు వస్తాయి. సంకల్పం చేసేవాడు కర్త, సంకల్పానికి కర్మ కావాలి. కర్తృత్వం, కర్మత్వం ఒకరిలో ఉండవు. కనుక సంకల్పం చేసే కర్త బ్రహ్మం, ఆయన సంకల్ప ఫలితం జగత్తు. ప్రకృతి ఉన్నప్పుడే జగద్రచన సాధ్యమౌతుంది. కనుక ఇది ఉపాదానకారణం. సృష్టి సంకల్పం వలన కూడా బ్రహ్మకు కర్తృత్వ, ప్రకృతి తత్త్వాలు తెలుస్తున్నాయి. ఆత్మకు సంకల్పం కలిగిందని చెప్పడం కూడా ఆత్మకు ప్రకృతితత్త్వం, కర్తృత్వం రెండు ఉన్నాయని తెలుస్తోంది. సంకల్పపూర్వకంగా, స్వతంత్రంగా ప్రవర్తించడం చేత కర్త అని తెలుస్తోంది.
తైత్తరీయోపనిషత్తు:-కార్యాకారణమే ఈజగత్తు. ఇంద్రియాలలో తెలియబడే ప్రాణాలు, పదార్ధాలన్నీ దేని వలన పుడుతున్నాయో, పుట్టినవి ఎవని వలన జీవిస్తున్నాయో, ప్రళయ కాలమున దేని యందు లయమౌతున్నాయో, అదే బ్రహ్మమని తెలుసుకోవాలి. ఈజగత్తు జన్మించడానికి బ్రహ్మమే కారణం. బ్రహ్మం అనాది, సనాతనం, జీవుడు, ప్రకృతి కూడా సనాతనమే. సృష్ఠికి పూర్వం జీవులు సూక్ష్మరూపంలో ప్రకృతి బ్రహ్మమును ఆశ్రయించి ఆయన అధీనంలోనే ఉన్నాయి. ప్రకృతికన్నా జీవుడు సూక్ష్మం. జీవుని కంటే సూక్ష్మం బ్రహ్మ. సర్వవ్యాపకం, సూక్ష్మమైన ప్రకృతి ఉపాదాన కారణం కాగా బ్రహ్మ నిమిత్తకారణమై సృష్టి జరిగింది. నిమిత్త కారణమైన పరమాత్మ వలన జగత్తు ఉత్పన్నమైనది. ప్రకృతి ఉపాదానకారణమైనది. కుండకు మట్టి ఉపాదానకారణం. కుండను చేసే కుమ్మరి నిమిత్తకారణం. సమస్త సృష్టిని ఉపాదాన కారణం నుండి నిర్మించి, దానిని ధరించి, అన్ని జీవులకూ ఆహారాన్ని సమకూర్చి, వాటి ప్రయోజనములకు సంబంధించిన వ్యవస్థ ఏర్పాటు చేయడం, మరల ప్రళయకాలంలో తనలో లయం చేసుకునేది బ్రహ్మమే. అదే నిమిత్తకారణం. కారణం లోని గుణాలు కార్యమందుంటాయి. అంటే కుండలో మట్టి లక్షణాలు ఉంటాయి. కారణానికి కారణం లేదు. ప్రకృతి అనాది అయినప్పటికీ పరిణామం చెందుతుంది. ప్రళయకాలంలో సూక్ష్మ రూపం ధరించి పరమాణువుల రూపంలో పరమాత్ముని ఆధీనంలో ఉంటుంది. మళ్ళీ అదే ప్రకృతి తిరిగి సృష్టి జరిగే సమయంలో జగత్తునకు ఉపాదానకారణమౌతుంది. కారణం లేకుండా కార్యం జరగదు. జగమంతా కార్యాకారణ సంబంధమే.
సూత్రం :- 131
"సాక్షాచ్చో భయామ్నానాత్"
చ:-అంతేకాక, ఉభయ :- బ్రహ్మం, ప్రకృతి రెండు, సాక్షాత్ :- ప్రత్యక్షంగా, ఆమ్నాయాత్:- ఉపనిషత్ వాక్యాలలో వర్జితాలు.
భావం :- బ్రహ్మం, ప్రకృతి రెండూ ఉపనిషత్ వాక్యాలలో చెప్పబడిన వర్జితాలు. అంటే జగత్తుకు కారణములు , నిమిత్త కారణం ఉపాదాన కారణం.
వివరణ :- బ్రహ్మకు సృష్టి, లయలు రెండు చెప్పడం వలన అతడు జగత్తుకు ఉపాదానకారణం అవుతున్నాడు. ఈ సమస్తభూతాలు ఆకాశంనుండి పుడుతున్నాయి. ఆకాశంలోనే లీనమౌతున్నాయి అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఆకాశం అంటే పరబ్రహ్మ. అంతే కానీ భూతకాశం కాదు. ఈ జగత్తంతా బ్రహ్మ నుండే పుట్టి, బ్రహ్మలోనే లీనమౌతుంది. ఒక వస్తువు యొక్క సృష్ఠికి, లయానికి ఏది కారణం అవుతుందో అది దానికి ఉపాదానకారణం. మట్టి నుండి పుట్టిన కుండ మట్టిలోనే కలిసిపోతుంది. అందుకే కుండకు మట్టి, జగత్తుకు బ్రహ్మ ఉపాదాన కారణం.
శ్వేతాశ్వరోపనిషత్తు:-(4,10 ):-మాయఅంటే ప్రకృతి. దానికి స్వామి మాయిఅయిన ఈశ్వరుడు అని వేర్వేరుగా వర్ణించారు. ప్రకృతి ఉపాదానం, బ్రహ్మం నిమిత్తకారణం. జీవ పరమాత్మల ఏకత్వభావనే అద్వైతసిద్ధాంతానికి ప్రాతిపదిక. ఉన్నది ఒక్కటే పరబ్రహ్మము. రెండవది లేదు. లేనిది ఉన్నట్లుగా కనబడటమే మాయ. ఈ జగత్తంతా నామరూపాలచే విడిగా కనిపించే అనేకమంది కర్తలతోను, కర్మఫలాలను అనుభవించే భోక్తలతోను, ఉహించడానికి కూడా శక్యంకాని విధంగా కనబడుతున్న సృష్టి అంతా పరమేశ్వరుడు సంకల్పించి సృష్టించిన మాయజగత్తు. అందుకే ఆయనని మాయి అన్నారు. జగత్తు యొక్క జన్మ, స్థితి, ప్రళయం దేని వలన కలుగుతాయో అది బ్రహ్మం అని చెప్పబడినది. సృష్టి అంటే ఇది వరకు లేనిది ఇప్పుడు కల్పించబడి, కనిపించేదేనని స్థూలంగా అనుకోవచ్చును. మాయ అంటే అవిద్య, అజ్ఞానం. ఈఅజ్ఞానం వలన అవివేకం, అవివేకం వలన అభిమానం, అభిమానాదుల వలన రాగాదులు, రాగాదులు వలన కర్మలు, కర్మల వలన పునర్జన్మలు, వాటి వలన దుఃఖం కలుగుతుంది. ఈ మిధ్యాభూతం బ్రహ్మతత్త్వజ్ఞానం వలన మాత్రమే నివృత్తి చేయబడి, సచ్చిదానంద స్వరూపమైన బ్రహ్మాన్ని చేరుకోగలరు.
సూత్రం :- 132
" ఆత్మే కృతేః పరిణామాత్ "
ఆత్మ కృతే :- బ్రహ్మ చేసిన సంకల్ప క్రియ వలన ఈ జగత్తు కలిగింది. పరిణామాత్ :- పరిణామం ద్వారా.
భావం :- బ్రహ్మ చేసిన సంకల్ప క్రియ వలన ఈ జగత్తు ఏర్పడింది.
వివరణ :- ఆత్మ సంబంధమైన కృతి వలన ఆత్మను స్వయంగా సృజించాడు అని చెప్పడం వలన ఈ జగత్తుకు ఉపాదాన కారణం అవుతున్నాడు. అతడే స్వయంగా జగత్తును సృష్టించాడు అని చెప్పడం వలన అతనికి కర్తృత్వం వస్తోంది. అంటే నిమిత్తకారకుడౌతున్నాడు.
తైత్తరీయోపనిషత్తు :- ఆయన సంకల్పించి తపించి ఈసర్వమును సృజించాడు. జ్ఞానపూర్వక సృష్ఠికి కర్త పరబ్రహ్మము నిమిత్తకారణం.
ఋగ్వేదం:-పూర్వం లాగానే బ్రహ్మం సూర్యచంద్రులను రచించాడు. కనుక జగద్రచనకు నిమిత్తకారణం బ్రహ్మమేనని తెలుస్తోంది. ప్రకృతి నుండి జగత్తు పరిణమించింది. కనుక జగత్తుకు ఉపాదానకారణం. బ్రహ్మ తనకు తానే కార్యరూపంలో చేసుకొనుట వలన కూడా బ్రహ్మ ప్రకృతికి ఉపాదానకారణం, కార్యరూపంలో పరిణమించుట వలన కూడా ఉపాదాన కారణం. బ్రహ్మ ప్రక్రియలో ఆత్మను కర్తృత్వాన్ని, కర్మత్వాన్ని కూడా చూపుచున్నది.
భగవద్గీత:-బ్రహ్మసంకల్పం వలన ఈజగత్తు ఏర్పడింది. ఈ ఆనంతవిశ్వం అంతటికీ కారణం బ్రహ్మ. ప్రతి వస్తువుకు రెండు కారణాలు ఉంటాయి. ఉపాదానకారణం, నిమిత్తకారణం. ఈ అనంతవిశ్వం పంచభూతాలైన ఆకాశం, వాయువు, అగ్ని, జలము, పృధివిలతో తయారైనది. వీటిని ఉపాదానకారణం అంటారు. వీటిని తయారుచేయడానికి ఒక శక్తి నేర్పు ఉండాలి. అంటే నిమిత్తకారణం ఉండాలి. అదే పరమాత్మ. ఈ పంచభూతాలు పరమాత్మ నుండే వచ్చాయి. మహాప్రళయ కాలంలో అవన్నీ పరమాత్మతో లీనమైపోయి పరమాత్మ ఒక్కడే ఉంటాడు. నిజానికి పరమాత్మ, ప్రకృతి రెండు ఒకటే. పరమాత్మ నుండి వచ్చిన ప్రకృతి తిరిగి పరమాత్మలోనే లీనం అవుతుంది. పరమాత్మ అధ్వైతుడుగా ఉన్నవాడు రెండు అయ్యాడు. దానినే పరాప్రకృతి, అపరాప్రకృతి అంటారు. పరాప్రకృతి అంటే ఈశ్వరుడు. అపరాప్రకృతి అంటే పంచభూతాత్మకమైన ప్రకృతి. దీనినే అర్ధనరీశ్వర తత్త్వం అంటారు.
సూత్రం :- 133
"యోనిశ్చ హి గీయతే "
చ :- పైగా బ్రహ్మాన్ని, యోనిః:-మూలకారణం యోని అని, హి :-కదా!, గీయతే :- కీర్తించారు.
భావం.ఈ సమస్త సృష్ఠికి మూల కారకుడైన బ్రహ్మను యోనిగా వర్ణించారు.
వివరణ :- యోని అనే పదానికి ఆత్మ అని, ప్రకృతి అని, స్థానము అని వేరు వేరు అర్ధాలలో వర్ణించారు.
ముండకోపనిషత్తు:-(3,1,3):- బ్రహ్మాన్ని యోనిగా వర్ణించడం జరిగింది. ప్రళయకాలంలో జీవులు, ప్రకృతి అన్ని బ్రహ్మం లోనే ఇమిడివుండి, సృష్టివేళలో మళ్ళీ జన్మిస్తాయి. కనుక జడమైన జగత్తుకు బ్రహ్మ అధిష్టానం అవుతోంది కనుక బ్రహ్మాన్ని యోనిగా వర్ణించారు. వివేకవంతులు సమస్త భూతాలకు కారణమైన వానిని అంతటా చూస్తారు అని చెప్పడం వలన యోని అంటే ఆత్మ అనే అర్థంలో గ్రహించాలి. కాబట్టి జగత్తుకు బ్రహ్మ ఉపాదానకారణం, నిమిత్తకారణం కూడా. కనబడుతున్న జగత్తంతా ప్రకృతి నుండి ఉద్భవించింది కనుక యోని అంటే ప్రకృతి అనే అర్థం కూడా ఉంది. స్త్రీ యోని కూడా గర్భానికి ఉపాదానమైనట్లే, ప్రకృతికూడా ఈజగత్తుకు ఉపాదాన కారణమైనది. పురుషుడు అంటే జీవుడు ప్రకృతిలో లీనమై ఎన్నో కార్యములు చేస్తుంటాడు. ఆకార్యములు చేయడానికి ఎన్నో కారణములు ఉంటాయి. ఇది సహజం. ఈ కార్యములకు వాటి కారణములకు మూలంప్రకృతే. పురుషుడు ఆపనులు చెయ్యడం వలన సుఖదుఃఖములను అనుభవిస్తున్నట్లు భ్రమ చెందుతాడు. నిజంగా సుఖదుఃఖాలు అనేవి లేవు. అవి కేవలం మానసిక స్పందన మాత్రమే. పురుషునికి ఎటువంటి సుఖదుఃఖములు, వికారములు ఏమి లేవి. కానీ ప్రకృతిలో ఉండి, ఆకార్యములను చెయ్యడం వలన జడమైన ప్రకృతి అనుభవించలేదు. కాబట్టి పురుషుడే వాటిని అనుభవిస్తున్నట్లుగా కనిపిస్తున్నాడు. కానీ పురుషునికి ఏ వికారములు లేవు.
సర్వ వ్యాఖ్యానాధికరణం :- (1, 4 , 28)
సూత్రం :- 134
" ఏ తేన సర్వే వ్యాఖ్యా తా వ్యాఖ్యా తాః "
ఏ తేన :- ఈ వివేచనతో , సర్వే :- అన్ని సందేహాలకు, వ్యాఖ్యాతాః:- సమాధానం చెప్పడం జరిగింది.
భావం :- మొదటి అధ్యాయంలో అన్ని సందేహాలకు వివేచనతో సమాధానాలు చెప్పడం జరిగింది.
వివరణ:-ఈ నాలుగవపాదంలో చేసిన వ్యాఖ్యానంద్వారా అనేక సందేహాలు నివృత్తి చెయ్యడమేకాకుండా, జగజ్జన్మాదులకు బ్రహ్మం నిమిత్తకారణమని స్పష్టం చేశారు. రెండుసార్లు వ్యాఖ్యాతః అని చెప్పడం అధ్యయసమాప్తిని సూచిస్తుంది. ఇంతవరకు సాంఖ్యుల యొక్క వాదాన్ని తిరస్కరించి జగత్ కారణం ప్రకృతి కాదు బ్రహ్మమేనని నిరూపించారు. అన్ని వాదనలలో సాంఖ్యవాదం బలమైనది. అందుకే సాంఖ్యులను తిరస్కరిస్తే, మిగిలిన వాదనలు కూడా తిరస్కరించినట్లే అని చెబుతూ మొదటిఅధ్యాయం పూర్తిచేశారు. బ్రహ్మసూత్రాలు నాలుగుఅధ్యాయాలలో మొదటిఅధ్యాయం “సమన్వయా ధ్యాయం." ఉపనిషత్వాక్య సమన్వయాన్ని తెలియజేస్తుంది. వాటిలో ఉన్న వైరుధ్యాన్ని తొలగించి సమన్వయం చేస్తుంది. కొన్ని ద్వైతపరంగా, కొన్ని అద్వైతపరంగా, కొన్ని విశిష్టాద్వైతపరంగా, కొన్ని శివసంబంధమైన, ఇలా రకరకాల సంబంధాలతో ఉన్నటువంటి ఉపనిషత్తులు జాగ్రత్తగా సమన్వయం చేయగలిగితే అంతా ఒక్కటే. ఎవరికి అనుకూలమైన రీతిలో వారు ఉపనిషత్తుల అర్ధాన్ని భావాన్ని వ్యాఖ్యానించడం వలన గందరగోళ పరిస్థితి నెలకొంది. అలా గజిబిజిగా ఉన్న వ్యాఖ్యానాలు చదివి ఏది సమంజసమైనదో ఎవరికి అర్ధం కాలేదు. సామాన్యులు ఉపనిషత్తులు చదవడానికి, అర్ధం చేసుకోవడానికి సాధ్యం కాదు. సమన్వయం చెయ్యడం అసలే సాధ్యం కాదు. వీటి మీద ఒక అవగాహన కావాలంటే జీవిత కాలం చాలదు. ఇలాంటి పరిస్థితిలో ద్వాపరయుగం చివరిలో వ్యాసమహర్షి (బాదరాయణుడు) ఈవ్యాఖ్యానాలన్నీ సమన్వయం చేస్తూ, ఒకే అర్ధాన్ని తీసుకు వచ్చి, సరి అయిన పద్ధతిలో దాని యొక్క అర్ధాన్ని గ్రహించేటట్లు చెయ్యడానికి , మోక్షాన్ని ఇవ్వడానికి, అద్భుతమైన జ్ఞానాన్ని, వేదాలని, ఉపనిషత్తులను పరిశోధించి, ఉపనిషత్ మంత్రాలను సమన్వయం చేస్తూ సూత్రరూపంగా బ్రహ్మసూత్రములు రచన చెయ్యడం జరిగింది. అప్పటికి వైరుధ్యం అంతా తొలగిపోయి ఏకాభిప్రాయం కలుగుతుందని ఉపనిషత్తులు చదవలేక పోయినా, అర్ధం చేసుకోలేకపోయినా, బ్రహ్మ సూత్రములు చదివితే ఉపనిషత్తుల సారాంశం తెలుస్తుందని వ్యాసభగవానుడు బ్రహ్మసూత్రములు రచించారు. ఆ సూత్రాలకు భాష్యం వస్తే తప్ప అర్ధం కావని, మహాత్ములే అర్ధం చేసుకోగలరని, సామాన్యులకు అర్ధం కావడం కోసం శ్రీఆదిశంకరులు బ్రహ్మసూత్రములకు భాష్యం వ్రాయడం జరిగింది. ఎంతోమంది భాష్యం వ్రాసినప్పటికి, శంకరుల భాష్యం ఒక్కటే అనుకూలంగా ఉందని, ఆయన వ్రాసిన తాత్పర్యమే పరమతాత్పర్యమని కీర్తించబడింది. ఉపనిషత్ విద్యను మననం చేస్తుండటమే బ్రహ్మసూత్రముల ముఖ్య ఉద్దేశ్యం. బ్రహ్మసూత్రములు 134 సూత్రములతో మొదటి అధ్యాయం సమన్వయాధ్యాయం సమాప్తం.
అధ్యాయం .2, అవిరోధాధ్యాయం
అద్వైతానికి విరుద్ధంగాఉన్న ఇతరమతాలవారి అభిప్రాయాలను నిరోధించడం, ఖండించడం ఈఅధ్యాయంలో వివరించబడింది.
స్మృత్యధికరణం :- ( 2 , 1, 1)
సూత్రం :- 135
"స్మృతి అనవకాశ దోష ప్రసంగ ఇతి చేత్ న అన్య స్మృతి అనవకాశ దోష ప్రసంగాత్"
స్మృతి అనవకాశ దోష ప్రసంగః :- బ్రహ్మం జగజ్జన్మాదులకు కారణమైతే ప్రకృతే కారణం అని చెప్పే స్మృతులకు అవకాశం ఉండదు. ఇది దోషం కాదా! ఇతి చిత్;- అని అనడం, న ;- తగదు. అన్య స్మృతి అనవకాశ దోష ప్రసంగత్ :- బ్రహ్మం జగత్ కారణమని స్మృతులంటున్నాయి.
భావం :- బ్రహ్మం జగజ్జన్మాదులకు కారణమైతే ప్రకృతి కారణం అని చెప్పే స్మృతులకు అవకాశం ఉండదు. స్మృతులన్ని బ్రహ్మమే జగత్కారణమని అంటున్నాయి.
వివరణ :- గురువు గారు! కపిలమహర్షి సర్వజ్ఞుడు అంటారు. సృష్టి ఆరంభంలో పుట్టినటువంటి కపిలుడు పుట్టుకతోనే మహాజ్ఞానియై తన జన్మకు కారణం ఎవరో కనుక్కోవాలని అనుకున్నాడని ఉపనిషత్తులు చెబుతున్నాయి. మరి అటువంటి కపిలుడు చెప్పిన విషయాలు కాదనడానికి వీలులేదు. కపిలమహర్షి బ్రహ్మమే జగత్కారణం అనే విషయంలో సందేహం వెలిబుచ్చాడు కదా! అన్నాడు కృష్ణ శర్మ. నిజమేనయ్యా! కపిలుడు చాలా గొప్పవాడు. సాంఖ్యస్మృతి వ్రాసింది ఆయనే. లోకంలో చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో మనువు మొదలైన వాళ్ళు కూడా కపిలుని వలెనే స్మృతులను వ్రాశారు. అందుకని విషయం నిర్ణయం చేసేటప్పుడు కేవలం సాంఖ్యస్మృతిని మాత్రమే దృష్టిలో ఉంచుకొని నిర్ణయించడం తప్పు. అలాంటప్పుడు అనేకమంది చెప్పినది అంగీకరించడమే మంచిది. ఈసృష్టికి కారణం బ్రహ్మ అనే మాటకు స్మృతులు అంగీకరించాయి. వేదాలు స్వతఃప్రమాణాలు.వాటిని శృతులు అంటారు. వాటిలో ఉన్న అర్ధాన్ని గ్రహించి తేలికభాషలో వ్రాసినవే స్మృతులు . కాబట్టి స్మృతులలో వ్రాసిన విషయాలకు శృతులకు తేడా ఉండవచ్చును. అందుచేత వేదంలో చెప్పిన దానికి విరుద్ధంగా అర్ధం వచ్చేటప్పుడు ఆస్మృతులును అంగీకరించరాడు. జగత్తుకు కారణం బ్రహ్మ అనే విషయం అనేక చోట్ల చెప్పబడింది. వేదానికే ప్రాముఖ్యత ఉన్నది కానీ దానికి విరుద్ధమైన సాంఖ్యస్మృతికి లేదు అని సమాధానం చెప్పాడు గురువు. సాంఖ్యశాస్త్రం:- సాంఖ్యశాస్త్రకర్త కపిలుడు. ఇందులో 6 అధ్యాయాలు ఉన్నాయి. దీనిలో మోక్షసాధనం, పదార్ధతత్త్వజ్ఞానం గురించి వివరించారు. జగత్తు ఆవిర్భావానికి ప్రకృతే కారణం అన్నారు. సత్వరజస్తమోగుణాల సామ్యావస్థే ప్రకృతి అన్నారు. దాని నుంచి మహాత్తత్త్త్వం, దాని నుంచి అహంకారం, అందునుంచి పంచతన్మాత్రలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పుట్టాయి. తన్మాత్రలు నుంచి 5 స్థూలభావాలు, పృథివ్యాధులు పుట్టాయి. అవన్నీ పురుషుడితో కలసి 25 అయినవి. దీని బట్టి జగత్ కారణం ప్రకృతి అని చెప్పినట్లుగా అర్ధం అవుతోంది. సాంఖ్యస్మృతి ప్రమాణం కాదు అనలేము. కపిలమహర్షి ఆప్తుడు. ఆప్తవాక్యం అప్రమాణం కాదు. మొదటి అధ్యాయంలో బ్రహ్మం జగజ్జన్మాదులకు కారణం అన్న సిద్ధాంతం సాంఖ్యస్మృతికి విరుద్ధం అనడం సరికాదు.
మనుస్మృతి:-(1-5 నుండి 1-8) ఈజగత్తుకు మూలప్రకృతి దృష్టిగోచరం కాదు. ప్రత్యక్షప్రమాణం లేదు. అనుమాన ప్రమాణంవలన ఉహించలేము. తర్కానికి వీలులేదు. అలాగే ఈశ్వరుడు వ్యక్తం కానివాడు. నిరతిశయ జ్ఞానత్రయ శక్తులున్నవాడు. ప్రకృతి ప్రేరకుడు. మహదహంకార పూర్వకాలైన సూక్ష్మభూతపూర్వకమైన ప్రకృతిని సృష్టించాలని సంకల్పించారు. ప్రళయకాలంలో ఈప్రకృతికి ప్రత్యక్షప్రమాణం ఉండదు. అనుమాన ప్రమాణాలకు లోబడదు. తర్కానికి విషయం కాదు. ఆ సమయంలో ప్రకృతి బ్రహ్మలో లీనమవడం వలన బ్రహ్మకన్నా వేరుగా ఉందని చెప్పడానికి వీలు లేదు. ఈశ్వరుడు జగత్తును ఉత్పన్నం చెయ్యడానికి ప్రకృతిలో ప్రేరణ కలిగిస్తాడు. ఆయన ప్రకృతి నుంచి ముందుగా మహదహంకారాది పూర్వకమైన సూక్ష్మభూతాలను సృష్టిస్తాడు. దీనిని అనుసరించి పరబ్రహ్మమే జగత్తు ఉత్పత్తికి కారణం అని స్పష్టంగా తెలుస్తోంది. మనువుకానీ, సాంఖ్యకర్త అయిన కపిలుడు కానీ వేదవిదులు, కనుక వాళ్ళ వాక్యాలు ప్రమాణమే. ఇద్దరూ లోకకళ్యాణాన్ని కోరి స్మృతులను రచించారు. వాళ్ళ సిద్ధాంతాలలో వైరుధ్యం ఉండదు. స్థూలదృష్టికి కనిపించే విరోధాలను తొలగించాలని వ్యాసుడు ఈసూత్రం వ్రాశాడు. ప్రకృతి బ్రహ్మప్రేరితం, బ్రహ్మాధీనం. సాంఖ్యంలో ఎక్కడా ప్రకృతి జగత్ జన్మాదులకు స్వతంత్రకారణమని చెప్పలేదు. ఈశ్వరుడికి లోబడి ప్రకృతి మహదాదీ ఉత్పత్తికి కారణం అని చెప్పే సూత్రాలు సాంఖ్యంలో ఉన్నాయి. పురుషుడు ప్రకృతిసంభవుఁడు కాదు. ప్రకృతి పరతంత్రమై ప్రపంచాన్ని ప్రారంభిస్తుంది. ఆపరుడు ఎవరు? అంటే సర్వజ్ఞుడైన పరమేశ్వరుడే. ఈజగత్తును ఎరిగి దానిని నిర్మించేవాడు పరమేశ్వరుడు అని మహదాది ప్రపంచానికి కారణం అని సాంఖ్యశాస్త్రంలో చెప్పబడింది. అందువల్ల సాంఖ్యము వేదాంత వ్యాఖ్యలకు విరుద్ధం కాదు.
సూత్రం :- 136
"ఇతరేషాంచ అనుపలబ్ధేః "
ఇతరేషాంచ:- గౌతముడు, కణాదుడు మొదలైన వాళ్ళు కూడా, అనుపలబ్ధేః:- లోకంలో కానీ, వేదంలో కానీ వారి శాస్త్రాలు కనబడకపోవడం వలన కూడా దోషం కాదు అని అర్ధం.
భావం :- గౌతముడు, కణాదుడు మొదలైన వాళ్ళు కూడా ప్రకృతి జగజ్జన్మాదులకు స్వతంత్ర కారణమన్నట్లు ఋజువు లేనందువలన, వాళ్ళు వ్రాసిన శాస్త్రాలు వేదాంత వాక్యాలకు విరుద్ధం కావు.
వివరణ:-గౌతముడు న్యాయదర్శనంలోను, కణాదుడు రచించిన వైశేషికంలోను ఈశ్వరుడే జగత్కర్త అని చెప్పారు. ఈ రెండూ వైదిక స్మృతులే. వీటిలో ప్రకృతిని పరమాణురూపంలో వర్ణించారు. ఈ పరమాణువులను ఉపాదానకారణంగా తీసుకొని, ఈశ్వరుడు జగత్తుని సృష్టించడం జరిగిందని చెబుతారు. అందుచేత ఈస్మృతులను వేదాంతవాక్యాలకు వైరుధ్యం లేదు. సాంఖ్యస్మృతిలో ప్రధానమైనది ప్రకృతి. మహత్తు మొదలైన తత్త్వాలులేవు. అయితే ప్రకృతి యొక్క పరిణామాలుగా చెప్పబడు చున్న మహాత్తత్త్వం , అహంకారం, తన్మాత్రలు, మొదలైనవి సాంఖ్యులు కల్పించినవి. భూతాలు, ఇంద్రియాలు, వేదంలో చెప్పబడ్డాయి. కానీ ఆరవ ఇంద్రియం అని చెప్పి మహత్తును అంటే బుద్ధిని కల్పించారు సాంఖ్యులు. అందుచేతనే సాంఖ్యము అప్రమాణమైనది. స్థూలసూక్ష్మభూతాలు అయితే వేదంలోను, లోకంలోనూ కూడా ప్రసిద్ధి అవడం చేత వాటిని స్మరించడం అంటే స్మృతిలో చెప్పడం శక్యమే గాని, మహత్తు మొదలైనవి అనగా మహత్తు, అహంకారం , అహంకారం నుండి పుట్టినవిగా చెప్పబడే తన్మాత్రలు వేదంలో గాని లోకంలో గాని ప్రసిద్ధమైనవి కావు. ఐదుఇంద్రియాలచేత అనుభవించిన వాటిని స్మరించవచ్చును. కానీ ఆరవఇంద్రియం లేదు. అలాంటి విషయాన్ని స్మరించడానికీ కూడా శక్యం కాదు. శృతిలో మహదాదులను గురించి చెప్పమన్నట్లు పైకి కనబడేది కూడా ఆమహదాదులకు సంబంధించినది కాదు. సాంఖ్యులు చెప్పిన మహదాదులు అప్రమాణం వలన ప్రధానం యొక్క శృతి కూడా అప్రమాణమే.
యోగ ప్రత్యుక్త్వధికరణం ( 2, 1,3 )
సూత్రం :- 137
"ఏతేన యోగః ప్రత్యుక్తః "
ఏ తేన :- సాంఖ్యాది స్మృతి అవిరోధ వర్ణన వల్ల , యోగః :- యోగశాస్త్ర విరోధాన్ని సైతం, ప్రత్యుక్తః :- నిరాకరించాలి.
భావం :- సాంఖ్యులు వారి స్మృతులలో అవిరోధవర్ణనల వలన యోగ శాస్త్రాన్ని సైతం నిరాకరించాలి.
వివరణ :- సాంఖ్యస్మృతిని ఆధారంగా చేసుకొని వచ్చినది యోగ శాస్త్రం. యోగశాస్త్రంలో కూడా వేదాలను విరుద్ధంగా ప్రకృతే జగత్తుకు కారణంగా వర్ణించారు. అయితే సాంఖ్యస్మృతి నివారించడం వలన, యోగ శాస్త్రాన్ని కూడా నిరాకరించినట్లే అవుతుంది. సాంఖ్యమతాన్ని అనుసరించి యోగశాస్త్రమున్నప్పటికి యోగశాస్త్రంలో ఈశ్వరుడున్నాడు. సాంఖ్యశాస్త్రంలో ప్రకృతే ప్రధానమైనది. ఈరెండింటికి తేడా ఇదొక్కటే. మిగిలినవన్నీ సమానమే. గురువు గారు! ఉపనిషత్తులలో యోగాన్ని వివరించడం జరిగింది. యోగి ఏరకంగా ఉండాలో కూడా చెప్పారు. కఠోపనిషత్తులో సంపూర్ణమైన యోగవిధిని పొందిన నచికేతుడు బ్రహ్మత్వం పొందాడు అని చెబుతారు. కాబట్టి యోగాన్ని, యోగశాస్త్రాన్ని కాదనలేము కదా ! అన్నాడు కృష్ణ శర్మ. దానికి సమాధానం రత్నాకరుడు చెబుతున్నాడు. యోగశాస్త్రం, సాంఖ్య శాస్త్రాన్ని ఆధారం చేసుకుని చెప్పబడింది. సాంఖ్యులు ప్రకృతే జగత్ కారణం అన్నారు. అదే యోగానికి కూడా ఆధారం. మరి సాంఖ్య శాస్త్రానికి ప్రమాణం లేనప్పుడు యోగశాస్త్రానికి ప్రమాణం ఎలా ఉంటుంది? ఈ రెండింటికి వేదప్రమాణం లేదు. వేదప్రమాణాన్ని అంగీకరించినంతవరకే వీటికి ప్రమాణత్వం ఉంటుంది. ఎప్పుడైతే వేదప్రమాణాన్ని ఇవి అంగీకరించలేదో అప్పుడే వీటికి ప్రమాణం లేదు. శృతి విరుద్ధమైన విషయాలలో మాత్రం ఇవి అప్రమాణాలే.
యోగదర్శనం :- దీనిని పతంజలిమహర్షి యోగవిద్యారహస్యాలు క్రోడీకరించి యోగసూత్రాలు రచించాడు. యోగం అంటే చిత్తవృత్తులను నిరోధించడం. జడమైనప్రకృతి పురుషుని అంటే జీవాత్మ సాన్నిధ్యంవలన ప్రభావితమై పరిణామం చెందుతుంది. మొదట ప్రకృతి నుంచి జడం ఉద్భవిస్తుంది. మహాత్ అంటే బుద్ధి. చిత్తానికి వృత్తులుంటాయి. వృత్తులంటే వికారాలు, వ్యాపారాలు, అనుక్షణం చిత్తంలో మార్పులు సంభవిస్తుంటాయి. ఆమార్పులను, వికారాలను నిరోధిస్తే సమాధి స్థితి లభిస్తుంది. ఇదే కైవల్యం. ఈ స్థితికి తోడ్పడేదే యోగం. యోగం అంటే మనోవికారాలను నిరోధించడమే. కామాలకు కారణం, సాంఖ్య, యోగాల చేత అనగా వివేక, ధ్యానాల చేత ఆదేవుణ్ణి తెలుసుకొని, సర్వపాపాలనుండి విముక్తుడు అవుతాడు. ఇది శృతివాక్యం. వేదాపేక్షలేని సాంఖ్యమార్గం చేత, యోగమార్గం చేత, మోక్షంరాదు. శృతి వైదికమైన ఆత్మతత్త్వవిజ్ఞానం తప్ప ఏది కూడా మోక్షసాధనం కాదు అని చెబుతున్నది శృతి. సాంఖ్యులు, యోగులు ద్వైతులే. ఆత్మైకత్వాన్నీ వారు అంగీకరించరు. ఏది శృతిలో కనబడచున్నదో, అక్కడ సాంఖ్యయోగ పదాలచేత దగ్గరగా ఉండటం చేత, వేదోక్తమైన జ్ఞానధ్యానాలే సాంఖ్యయోగంలో చెప్పబడుతున్నాయని గ్రహించాలి. వేదవేత్త కానివాడు బ్రహ్మాన్ని తెలుసుకోలేడని శృతిలో చెప్పబడింది.
స విలక్షణత్వాధికరణం :- ( 2, 1, 4 )
సూత్రం :- 138
"స విలక్షణత్వాత్ అస్య తధాత్వం చ శబ్దాత్'"
అస్య :- ఈ దృశ్య మాన ప్రపంచానికి, విలక్షణాత్ :- విరుద్ధ లక్షణాలున్నందున, న :- ప్రకృతి జగత్తుకు ఉపాదాన కారణం కాదు. శబ్దాత్ ;- శబ్ద ప్రమాణం వలన, తధాత్వం చ:- పంచ భూతాత్మక జగత్తు ప్రకృతి లక్షణ మని తెలుస్తోంది.
భావం :- ఈ జగత్తులో కంటికి కనిపిస్తున్న దృశ్య మాన ప్రపంచానికి విరుద్ధమైన లక్షణాలు ఉండటం వలన ప్రకృతి జగత్తుకు ఉపాదాన కారణం కాదు. శబ్ద ప్రమాణం వలన పంచభూతాత్మకమైన జగత్తు ప్రకృతి లక్షణమని తెలుస్తోంది.
వివరణ:-మొదటి అధ్యాయంలో ఈజగత్తుకు ఉపాదానకారణం ప్రకృతిఅని, నిమిత్తకారణం ఈశ్వరుడని చెప్పారు. ముందు సూత్రంలో జగత్తుకు ఉపాదానకారణం కానేరదని తర్కిస్తున్నారు. ఈ లోకంలో కార్యమునకు, కారణమునకు సమాన లక్షణాలు ఉండటం చూస్తున్నాము. కుండకు మట్టి లక్షణాలు, నగలకు బంగారం లక్షణాలు ఉన్నాయి. అలాగే జగత్తుకు ప్రకృతి లక్షణాలు ఉండాలి. కానీ ఛాందోగ్యంలో చెప్పినట్లుగా మట్టి పలికింది, జలం మాట్లాడింది, అగ్ని చూసింది, ఆ నీరు చూసింది అనే శబ్ద ప్రమాణాన్ని అనుసరించి, పాంచభౌతికమైన జగత్తుకు చేతనాధర్మాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రకృతి అచేతనం జడము అన్నారుకదా! ఇక్కడ కార్యమునకు, కారణమునకు తేడా కనిపిస్తోంది కదా! ఇప్పుడు బ్రహ్మాన్ని ఆశ్రయించిన ప్రకృతి జగత్తుకు ఉపాదానకారణం అవుతోంది. చేతనమైన బ్రహ్మమే జగత్తుకి కారణం అని అనడానికి వీలు లేదు. అది బ్రహ్మకన్నా విలక్షణమైనది. ఏలక్షణాలు గల పదార్ధం నుంచి ఆలక్షణాలు గల పదార్ధాలు పుడతాయి. జడ పదార్ధం నుంచి జడ పదార్ధము పుడుతుంది. కానీ చైతన్యం పుట్టదు. దారం నుండి వస్త్రం తయారవుతుంది. అంతే కాని కుండ తయారుకాదు. జడమైన మట్టి నుంచి జడమైన కుండ పుడుతుంది. బ్రహ్మం చేతనం, ప్రకాశరూపం, ఆనందాత్మకం. మరి జగత్తు అప్రకాశం, దుఃఖరూపం, ఈరెండింటి లక్షణాలు వేరు. కాబట్టి జగత్తుకు కారణం బ్రహ్మకాదు అని తార్కికులు వాదిస్తున్నారు. బ్రహ్మకు, జగత్తుకు విరోధ భావాలు, లక్షణాలు లేవు. బ్రహ్మం చైతన్యమే, అలాగే జగత్తు కూడా చైతన్యమే. ఉపనిషత్తులలో అనేక చోట్ల మృత్తిక చెప్పింది, ఉదకము ఆలోచించింది, వాయువు చెప్పింది, అంటూ పంచభూతాలకు చేతనత్వాలు చెప్పబడ్డాయి. చాందోగ్యంలో ఉపకోశలుడికి అగ్నులు ఉపదేశం చేశాయి. అంతేకాదు, ఇంద్రియాలు కూడా చేతనమే. బృహదారణ్యకంలో ఛాందోగ్యోపనిషత్తులలో ఇంద్రియాలు తమలో ఎవరు గొప్ప అని పొట్లాడుకున్నాయి. తీర్పు కోసం బ్రహ్మ దగ్గరకు వెళ్ళాయి. అప్పుడు బ్రహ్మ మీలో ఒక్కొక్కరే దేహాన్ని విడిచి వెళ్ళండి అంటాడు. ఇతర ప్రాణాలన్నీ ఒక్కొక్కరు బయటకు పోయినా శరీరానికి అంధత్వాది దోషాలు కలిగాయి. కానీ శరీరం పడిపోలేదు. అవన్నీ మళ్ళీ తిరిగి వచ్చాయి. చివరకి ప్రాణ శక్తి శరీరాన్ని విడిచి బయటకు వెళ్ళడానికి ప్రయత్నించగానే మిగిలిన ప్రాణాలన్ని చలించిపోయాయి. దీనిని బట్టి ఆ ప్రాణమే అన్నింటికన్నా శ్రేష్టమని నిర్ధారణ చేయడమైనది. ఈ సంఘటనతో ఇంద్రియాలకు చేతనత్వం ఉందని, జడత్వం లేదని తెలుస్తోంది. కాబట్టి బ్రహ్మ, జగత్తు రెండూ చేతనమేనని, చేతనం నుంచి చేతనమే పుడుతుందని కొందరి తార్కికులు వాదన. " తదాత్వంచ శబ్దాత్" అంటే సమస్త వస్తువులలో చేతనత్వం కనబడకపోయినా, ప్రకృతి చేతనత్వమని కేవలం శబ్దాన్ని (శృతి వాక్యం) వినడం చేత పంచభూతాత్మకమైన జగత్తు ప్రకృతి లక్షణమని తెలుస్తోంది.
సూత్రం :- 139
"అభిమాని వ్యాపదేశస్తు విశేషానుగతిభ్యాం"
తు:-ఈవాదన సరిఅయినది కాదు. విశేష అనుగతిభ్యాం:-(శరీర) విశేషం లోపల ప్రవేశించడం, వీటి వలన, అభిమాని వ్యపదేశహః :- మట్టి పలికింది లాంటి వాక్యాలలో మట్టి ,అగ్ని, జలం మొదలైనవి పలికింది, చూసింది అనే చోట్ల ఈశ్వరుడే ఆ క్రియలకు కర్త అని గ్రహించాలి.
భావం :- మట్టి, అగ్ని, జలం,మొదలైన వాటిలో ఈశ్వరుడు కర్తగా ఉండటం వలన అవి చూసింది, పలికింది అనే క్రియలు జరిగాయి.
వివరణ :- ఈ వాక్యాలలో పృధివి మొదలైనవి కర్తలు కారు. వాటిలో చేతనమైన పరబ్రహ్మ ఉండటమే కారణం. రాముడు పరుగెత్తాడు, ఆటలాడాడు, అనే చోట్ల పరుగెట్టడం, ఆటలాడటం క్రియలు, శరీరంలో ఉండే చేతనత్వమే ఆపనులు చేయించింది. అలాగే "మృత్ అబ్రవీత్ " అనే చోట్ల అచేతనమైన మృత్తికాదులలో ఉండే పరమాత్మ పలికాడు అని గ్రహించాలి. ఇలా పృథివ్యాదులను ఈశ్వరుడికి శరీరంలా వర్ణించడం ఉపనిషత్తులలో కనిపిస్తుంది.
బృహదారణ్యకోపనిషత్తు:-(3,7,3):-పృధివిలో ఉండేవాడు, పృధివికి అంతరుడు, ఆయనకు పృధివి శరీరం అని వర్ణించారు. పృధివిరూపశరీరంలో పరమేశ్వరుడు ప్రవేశించడం వలన శరీరానికి, అందులో ఉండే వ్యక్తికి తాదాత్మ్యం కల్పించారు. మృత్తికాదులు పలికాయి, అన్నప్పుడు మృత్తికాదులు చేతనాలు కావు. ప్రపంచము, ప్రకృతి జడమే. కనుక పృథివ్యాది జగత్తుకు ప్రకృతి ఉపాదానకారణం అనడంలో దోషం లేదు. ఉపనిషత్తులలో ఇంద్రియాలు మాట్లాడాయి అని చెప్పబడినది కదా! అక్కడ ఇంద్రియాలు అంటే వాటి అధిష్టాన దేవతలు అని అర్ధం. ఐతరేయోపనిషత్తులో నోటికి అగ్ని, ముక్కుకు వాయువు, కళ్ళకు సూర్యుడు, చెవికి ఆకాశం, నాలుకకు వరుణుడు, అధిష్టాన దేవతలుగా చెప్పబడ్డాయి. ఇంద్రియాలు, భూతాలు చేతనాలు కావు. అచేతనమని చెప్పబడే పంచభూతాలు, ఇంద్రియాలు కూడా కొన్ని చోట్ల చేతనాలు అన్నట్లు వినబడుతోంది. మట్టి పలికింది.ఆ తేజస్సు చూసింది, అని చెప్పినప్పుడు, ఆ భూతాలలో ఉండే చేతనత్వమైన పరమేశ్వరుడే దానికి కారణం.
సూత్రం :- 140
" దృశ్యతే తు"
తు- ఈసందేహం యుక్తం కాదు. దృశ్యతే:- సూక్ష్మకారణం వలన స్థూలకార్యాలు ఏర్పడటం లోకంలో కనిపిస్తుంది కదా !
భావము:- పృధివ్యాదులు జడం కావచ్చు. వీటిని ప్రకృతి వికారాలు అని ఎలా అంటారు? ప్రకృతి సూక్ష్మం. పృధివ్యాదులు స్థూలం. అందువలన బ్రహ్మాశ్రితమైన ప్రకృతి జగత్ కారణం అనడం సరియైనది కాదు కదా ! అనే సందేహం ఉంది. దానికి సమాధానం ఈ సూత్రంలో చెప్పబడింది. సూక్ష్మకారణములు వలన స్థూలకార్యాలు ఏర్పడటం లోకంలో కనిపిస్తోంది కదా! ఈ దృశ్యమాన ప్రపంచానికి బ్రహ్మాశ్రితమైన ప్రకృతి కారణం .
వివరణ :- చేతనం నుంచి అనేక అచేతన పదార్ధాలు పుట్టాయి. అలాగే అచేతనం నుంచి చేతనాలు పుట్టాయి. కాబట్టి అచేతనమైన జగత్తు చేతనం వలన వచ్చిదనడంలో సందేహం లేదు. బ్రహ్మ చేతనం, జగత్తు అచేతనం, కనుక జగత్తు బ్రహ్మచే సృష్టించబడలేదు అని చెప్పడానికి వీలులేదు. చేతనుడైన పురుషుడి నుండి అచేతనమైన గోళ్లు వెంట్రుకలు పుడుతున్నాయి. అలాగే అచేతనమైన పేడ, పెంటప్రోగుల నుంచి తేళ్లు, జెర్రులు పుడుతున్నాయి. ప్రకృతి, వికృతి అని రెండు ఉంటాయి. ప్రకృతి యొక్క ధర్మాలన్నీ వికృతిలో ఉండవు. పురుషుడు ప్రకృతి అయితే వాని నుంచి వచ్చిన గోళ్లు, వెంట్రుకలు వికృతి. పురుషుడి ధర్మాలు గోళ్లకు వెంట్రుకలకు ఉండవు. పేడ, పెంట యొక్క ధర్మాలు తేళ్లకు జెర్రులకు ఉండవు. అలాగే చేతనుడైన పరమాత్మ యొక్క ధర్మాలు జగత్తులో ఉండవలసిన అవసరం లేదు.కాబట్టి ప్రకృతిలోని సమస్త వికారాలకు ప్రకృతి బ్రహ్మమే. బ్రహ్మ ప్రకృతి అయితే ప్రకృతిలో వచ్చే మార్పులన్నీ వికృతి అనబడతాయి. బ్రహ్మ విషయంలో శృతి(వేదం) ప్రమాణం తప్ప తర్కం పనికి రాదు. అయితే అవసరమైనంతవరకే వేదప్రమాణం ఉన్నంత వరకు మాత్రమే తర్కించాలి.
శ్వేతాశ్వతరోపనిషత్తు:-(౬-౧౨):- ఆయన బీజకారణరూపంలో ఉన్న ప్రకృతిని అనేక రకాలుగా నిర్మిస్తాడు. ఈ లోకంలో సూక్ష్మమైన బీజం నుంచి పెద్ద వటవృక్షం ఏర్పడుతుంది. స్థూలమైన పృథివ్యాది రూపంలో ఉండే జగత్తుకు ఒక సూక్ష్మ కారణాన్ని అంగీకరించక తప్పదు. ఈజగత్తులో స్థూలపదార్ధములన్ని కార్యములు. ఇది తర్కవిరుద్ధం కాదు. తర్కం ఎన్నటికీ లోకవిరుద్ధం కాజాలదు. ప్రకృతి దాని వికారమైన జగత్తు సమానలక్షణాలు ఉండాలంటే అవి ఎలా ఉండాలి ? కార్యకారణములలో సాధారణ అసాధారణ ధర్మాలన్నీ సమానంగా ఉండాలా? అప్పుడు కార్యకారణములలో తేడా ఉండదు కదా! మట్టి నుండి కుండ ఏర్పడినప్పుడు మట్టి చూర్ణంలా, పొడిలా ఉన్నట్లు కుండ కూడా ఉంటుందా ? అందువలన కార్యము కారణమూ సమానంగా ఉండవు. కానీ వాటిలో అసాధారణధర్మాలు సమానంగా ఉంటాయి. ప్రకృతిలోని దాని వికారమైన పృధివ్యాదులలో జడత్వం ఉంది. కార్యం కారణరూపం పొందుతూ క్రమంగా ఎంతో సూక్ష్మరూపాన్ని ధరిస్తుంది. ప్రకృతిని మించి మరో సూక్ష్మకారణం లేదు. పంచభూతాలకు కారణం వాటికన్నా సూక్ష్మమైన తన్మాత్రలు. వాటికీ కారణం వాటికన్నా సూక్ష్మమైన అహంకారం. దానికి కారణం అంత కన్నా సూక్ష్మమైన మహత్తు( బుద్ధి ) దీనినే సాంఖ్యులు లింగం అంటే గుర్తు అన్నారు. దానికి కారణం అంతకన్నా సూక్ష్మమైన ప్రకృతి. దీని కన్నా సూక్ష్మమైనది మరొకటిలేదు. ఈ ప్రకృతే బ్రహ్మాశ్రితమై స్థూలజగత్తుకు కారణమౌతుంది. ప్రకృతికి పంచభూతాలకు జడత్వాది సమాన లక్షణాలు ఉన్నాయి. అందుచేత పృథివ్యాది స్థూలజగత్తుకు ప్రకృతి ఉపాదానకారణం కావడంలో ఏ దోషము లేదు .
సూత్రం :- 141: ప్రకృతి ఎందుకు స్థూల కారణం కాదు ? అనేది సందేహం .
'అసదితి చేన్న ప్రతిషేధ మాత్రత్వాత్
అసత్..ఈ జగత్తుకు కారణం అసత్తని , ఇతి చేత్:- చెప్పడం, న - సరి అయినది కాదు. ప్రతిషేధ మాత్రత్వాత్ :- అది అభావం కదా !
భావం :- ప్రకృతి స్థూల కారణం ఎందుకు కాదు? అనే సందేహానికి సమాధానం ఈ సూత్రంలో చెబుతున్నది. ఈ జగత్తుకి కారణం అసత్ అని చెప్పడం సరి అయింది కాదు.
వివరణ :-అసత్, అభావం అంటే ఉనికి లేకపోవడం అని అర్ధం. నామరూపాలు లేని బ్రహ్మం నామరూపాలు ఉన్న జగత్ కి కారణం. సృష్టికి ముందు అంతా బ్రహ్మమయమే. అసత్ కూడా ప్రకృతి లాగా సూక్ష్మమే కదా అని అనడం సరి అయింది కాదు. అసత్ అంటే అభావం. అది భావాత్మకమైన స్థూలజగత్తుకు ఎలా కారణం అవుతుంది ? సత్ అంటే భావం, అసత్ అంటే అభావం. పంచభూతాత్మకమైన జగత్తు మనకు కనిపిస్తోంది. భావప్రపంచానికి అభావమైన ప్రకృతి కారణం కాజాలదు. భావ, అభావాలు పరస్పర విరుద్ధాలు. విరోధం వలన కార్యకారణ సంబంధం కుదరదు. మట్టి కారణం కుండ కార్యం, మట్టి కుండలో ఉండటం చూస్తున్నము. అభావం భావకార్యరూపంలో అన్వయించదు. అన్వయించే కారణమే ఉపాదానకారణం. స్థూలకార్యం, సూక్ష్మకారణం వలన జనిస్తుంది. కానీ అసత్ కారణం వలన కార్యోత్పత్తి జరగదు. అసత్ ప్రకృతిలాగా సూక్ష్మం అనడం తగదు. ధర్మం ఎప్పుడు భావపదార్ధాన్ని ఆశ్రయించి ఉంటుంది. అందుకే అసత్ ప్రకృతి, సత్ జగత్తుకు కారణం కాదు. సత్ ప్రకృతే బ్రహ్మాశ్రితమై స్థూల జగత్తుకు కారణం అవుతుంది.
బ్రహ్మకారణవాదం:-జగత్తు ఉత్పత్తికి ముందు అసత్ ఉండేది. చేతనమైన బ్రహ్మ, అచేతమైన జగత్కార్యమునకు కారణంగా అంగీకరిస్తే అప్పుడు ఉత్పత్తికి పూర్వం అసత్ అనే మాట వస్తుంది. ఇది కేవలం అభావం ( ప్రతిషేధం ) మాత్రమే. మట్టి, బంగారం అనే కారణముల నుండి కుండ, కుండలాలు మొదలైన కార్యములు పుడుతున్నాయి. అవి పుట్టకముందు వాటి కారణములలో ఉన్నాయి కదా! కుండ పుట్టక ముందు అది సూక్ష్మ రూపంలో మట్టికణాలుగా ఉన్నాయి. ఈ కార్యములు పుట్టకముందు తమకారణంతో ఉన్నాయి. అసలు లేనిది, ఈకారణం నుంచి పుడుతున్నాయా అనేది ప్రశ్న. నైయాదికాదులు అయితే అసలు లేని కార్యమే కొత్తగా పుడుతోంది అంటారు. ఈ వాదానికి ఆరంభవాదం అని పేరు. పుట్టడానికి ముందు కూడా ఈ కార్యం తన కారణంతో ఉంటుంది. ఉంగరం తయారుకాక ముందు అది సూక్ష్మరూపంలో బంగారంలోనే ఉంది.
సత్కార్యవాదం:-సూక్ష్మరూపంలో ఉన్న జగత్తు ప్రయత్నం చేత పైకి కనబడుతుంది అని కొందరంటారు. దీనినే సత్కార్య వాదం అంటారు. సాంఖ్యులు, వేదాంతులు దీనిని అంగీకరిస్తారు. మట్టిలక్షణాలు కుండలోను, బంగారం లక్షణాలు ఉంగరంలోను ఉంటాయి. కాబట్టి కుండ మొదలైన కార్యాలు తాము స్థూలంగా కనబడుతున్నప్పటికీ పూర్వం కూడా సూక్ష్మరూపంలో తమతో సమానమైన లక్షణాలు గల మట్టిలో ఉంటాయి. అట్లే బ్రహ్మ నుండి పుట్టిన జగత్తు తన కారణమైన బ్రహ్మ లోనే ఉంటుంది. ఈ విధంగా సత్కార్యవాడానికి భంగం లేదు.
సూత్రం :- 142
'అపీతౌ తద్వత్ ప్రసంగాదసమంజసం '
అపీతౌ - ప్రళయ కాలంలో, తద్వత్ ప్రసంగాత్ :- కారణమైన ప్రకృతి కార్య జగత్తులాగా , అసమంజసం :- ఈ వాదన యుక్తం కాదు.
భావం :- ప్రళయకాలంలో ప్రతి కార్యవస్తువు కారణమైన జగత్తులో లీనమైపోతుంది అని అంటున్నారు కదా! ఏ జగత్తు స్థూలమైనది, అశుద్ధి అయినది, దుఃఖాత్మకమైనది. అది విలయమై ప్రకృతిరూపం పొందినప్పుడు జగత్తుకి ఉన్న స్థూలత్వాది ధర్మాలు, ప్రకృతికి ఆపాదిస్తుంది. ప్రకృతికి ఈధర్మాలు లేవు. అందుచేత జగత్తు ప్రళయంలో ప్రకృతి రూపాన్ని పొందుతుంది అనడం సమంజసం కాదు.
వివరణ :- ప్రళయకాలంలో కర్మపరిపక్వము చెందని ప్రాణులన్నీ, తమ కర్మలను తమతోబాటే మూట కట్టుకొని, బ్రహ్మలో లీనమౌతాయి.ఇదే విధంగా జగత్తంతా బ్రహ్మలో లీనమౌతుంది. మరి అటువంటప్పుడు జగత్తుకి ఉన్న అవలక్షణాలన్నీ బ్రహ్మకు సంక్రమిస్తాయి. కాబట్టి ఉపనిషత్తులలో చెప్పిన పరిశుద్ధము, చేతనము, అయిన బ్రహ్మ జగత్తుకు కారణం అని చెప్పడానికి వీలు లేదని వాదన, ప్రళయకాలంలో బ్రహ్మకుకూడా జగత్తుయొక్క అశుద్ధ్యాదుల ప్రభావం ఉంటుంది కనుక సర్వజ్ఞమైన బ్రహ్మ జగత్కారణం అని చెప్పడం సమంజసంకాదు. మరొక అర్ధం:- సమస్తమైన జగత్తు బ్రహ్మలో కలసి పోవడం వలన మళ్ళీ పుట్టేటప్పుడు, వేరువేరుగా పుట్టడానికి తగిన కారణం లేకపోవడం వలన ఇది భోక్త, ఇది భోగ్యం అనే విభాగం ఉండదు. అందువలన బ్రహ్మకారణ వాదం అసమంజసం. మరొక అర్ధం :- పరబ్రహ్మలో కలిసిపోయిన జీవులకు మళ్ళీ కర్మాదినిమిత్తం చేత మళ్ళీ జన్మ వస్తుందని అంగీకరిస్తే ముక్తులు కూడా మళ్ళీ పుట్టవలసి వస్తుంది. కనుక బ్రహ్మ కారణంవాదం అసమంజసం. మరొక అర్ధం :- ఈ జగత్తు ప్రళయకాలంలో కూడా బ్రహ్మలో పూర్తిగా కలసిపోకుండా వేరుగా ఉంటుంది అని భావిస్తే, అప్పుడు ప్రళయమే రాదు కదా! అప్పుడు కార్యం, కారణం కంటే భిన్నంగా ఉంటుంది. ప్రకృతి, జగత్తుకి భిన్నంగా ఉంటుంది. ఈ విధంగా కూడా ఈవాదం అసమంజసమే.
సూత్రం ( 143 )
'న తు దృష్ఠాంత భావాత్'
తు :- ఈ సందేహం సరియైనది కాదు. దృష్ఠాంత భావాత్ :- అనేక దృష్ఠాంతములు ఉన్నందు వలన, న అసమంజసం :- ఈ వాదం అసమంజసం కానేరదు.
భావం :- జగత్తుకు ఉన్న అవలక్షణాలన్నీ బ్రహ్మకు సంక్రమిస్తాయనడం సమంజసం కాదు. దీనికి అనేక దృష్ఠాంతములు ఉన్నాయి.
వివరణ:-ఈవాదన సరియైనది కాదు. ఎందుకంటే మట్టిలో కలసిపోయిన కుండ తనకు కారణమైన మట్టిని కలుషితం చేయదు. అలాగే బంగారు ఆభరణాలు బంగారంలో కలసిపోయినప్పుడు, ఆ బంగారాన్ని దూషితం చెయ్యవు. ముండకోపనిషత్తు :- ఈ సమస్తము బ్రహ్మకు సృష్టి ఆరంభంలో అంతా బ్రహ్మమయంగానే ఉండేది. పరబ్రహ్మ స్వయం ప్రకాశం కలవాడు, నిరాకారుడు, పుట్టుక, ప్రాణము, మనస్సు లేనివాడు పరిశుద్దమైనవాడు. అతని నుండే ప్రాణము, మనస్సు, ఇంద్రియాలు పంచభూతాలు పుడుతున్నాయి. గారడీవాడు తాను చేసే మాయద్వారా దూషితుడు కానట్లే, పరమాత్మ కూడా తనలో లీనమైన జగత్తు వలన దూషితుడు కాడు. ప్రళయంలో కార్యం కారణంతో లీనమౌతుంది. కాగా కార్యధర్మాలన్నీ కారణానికి సంక్రమించవు. మట్టి నుంచి తయారైన కుండ పగిలిపోయి, మళ్ళీ మట్టిలో లీనమైపోతుంది. అంచు, గుండ్రని రూపం, నీళ్లు నిల్వ చేసే లక్షణం లాంటి ధర్మాలు మట్టికి సంక్రమించవు. అలాగే కుండలాలు, ఆభరణాలు మొదలైనవి కరిగించినప్పుడు, మళ్ళీ స్వర్ణరూపాన్ని పొందుతాయి. కానీ ఆభరాల యొక్క ఆకారం వాటి ధర్మాలు బంగారానికి అంటవు. పంచభూతాది వికృతజగత్తు ప్రళయంలో వికృతిరూపం దాల్చినా, వాటి ధర్మాలు దానికి సంక్రమించవు అని తెలుస్తోంది. ప్రళయంలో జగత్తంతా స్వధా అంటే ప్రకృతి రూపంలో పరమాత్మను ఆశ్రయించి ఉంటుందని వేద ప్రమాణమని గ్రహించాలి.
ఋగ్వేదం :- ప్రళయంలో మృత్యువు, జీవనం, రాత్రి, పగలు ,ఇవేమి ఉండవు. ప్రకృతితో కూడిన పరమాత్మ తప్ప వేరేది ఉండదు. తనలో కార్యాన్ని ధరించడం వలన ప్రకృతిని స్వధా అంటారు. అందువలన వైదిక మతం అసమంజసం కాదు . స్వప్న సమయంలో జరుగుతున్న వ్యవహారం, అది జరుగుతున్నంతసేపూ అది యదార్ధమే అనిపిస్తుంది. దానికి కారణం ఆ సమయంలో యదార్ధ జ్ఞానం లేకపోవడమే. అదే ప్రకారంగా సుషుప్తి కాలంలో ప్రాణులన్నీ బ్రహ్మలో ఐక్యం పొందుతున్నా కూడా, తిరిగి పూర్వం ఏ ప్రాణులు ఏ విధంగా ఉన్నాయో, అవే ప్రాణులుగా మేల్కొంటున్నాయి. అందుకు కారణం మిధ్యా జ్ఞానమే. ఈ ప్రాణులన్నీ బ్రహ్మ యందు ఏకత్వాన్ని పొంది, బ్రహ్మలో కలసిపోతున్నామని ఎరుగవు. అవి సుషుప్తికి పూర్వం ఏవ్యాఘ్రంగానో, సింహంగానో, వరాహంగానో, మిడత, ఈగ ఇలా ఏ జాతివిభాగంలో ఉండేవో, అవి అలాగే మేల్కొన్న తరువాత అలాగే ఉంటాయి అని శృతి చెబుతోంది. సుషుప్తిలో పరమాత్మయందు అవిభాగం ఏర్పడినప్పటికీ, మిధ్యాజ్ఞానం వలన అది స్వప్నంవలె కనబడుతోంది. అట్లే ప్రళయకాలంలో కూడా జగత్తు బ్రహ్మలో లీనమై, తిరిగి జన్మ రావడానికి కారణమౌతుంది. ముముక్షువులు సమ్యక్ జ్ఞానం చేత మిధ్యాజ్ఞానం పూర్తిగా నశించి, పరబ్రహ్మంలో లీనమై జన్మ రాహిత్యాన్ని పొందుతారు.
సూత్రం :- 144
'స్వపక్ష దోషాచ్చ.
న - అసమంజసం అనేవి అనువృత్తులు (అసమంజసం కాదు). చ - అంతే కాక స్వపక్ష దోషాత్ :- సందేహంలో కార్య ధర్మాలు కారణానికి సంక్రమిస్తాయి అనే దోషం ఉంది.
భావం:- ప్రళయకాలంలో జగత్తు(కార్యం)పర బ్రహ్మంలో(కారణంతో) లీనమైనప్పుడు జగత్తు యొక్క ధర్మాలన్నీ బ్రహ్మానికి సంక్రమిస్తాయి అనే దోషం ఉన్నది. కనుక వైదిక మతం సమంజసమే.
వివరణ..జగత్తుకు అసత్ ప్రకృతి కారణం అంటారు. పృధివ్యాది జగత్తు ప్రళయంలో అసత్ రూపాన్ని పొందుతుంది కదా! అప్పుడు పృధివ్యాదులకున్న స్థూలత్వధర్మాలు అసత్ కు కూడా సంక్రమిస్తాయి. అంటే కార్యధర్మాలు అభావమైన అసత్తులో ఎలా ఉంటాయి? అభావం ధర్మాశ్రయం కదా! కనుక వైదిక మతం అసంజసమే అని చెబుతోంది. సాంఖ్యులు చెప్పే దోషాలు వారి మతంలోనూ ఉన్నాయి. కాబట్టి దోషాలు దోష పరిహారాలు రెండు మతాల్లోనూ సమానమే.
1. బ్రహ్మ కన్నా జగత్తు విలక్షణమైనది ఆ రెండింటికి ప్రకృతి, వికృతుల భావం కుదరదు.
2. సృష్టికి పూర్వం అంతా అసత్తుగానే అంటే ఉనికి లేకపోవడం ఉండేది.
3. ప్రళయకాలంలో జగత్తు అంత బ్రహ్మలో లీనమైపోయినప్పుడు బ్రహ్మ అపరిశుద్ధ మౌతాడు.
ఈ దోషాలు సాంఖ్యమతంలో ఉన్నాయి.
1.శబ్దహీన మైన ప్రకృతి నుండి శబ్దాదులు గల జగత్తు పుడుతోంది. ఈ రెండింటికి కూడా ప్రకృతి, వికృతి భావం కుదరదు.
2. ప్రళయ కాలంలో గుణాలే లేని ప్రకృతిలో గుణాలు గల జగత్తు లీనమైనప్పుడు ప్రకృతి దోష భూయిష్టం అవుతుంది.
3. దోషాలన్నీ సాంఖ్యమతానికి వర్తిస్తాయి. కానీ ఉపనిషత్తులకు వర్తించవు.
స్వపక్షం లోనే దోషాలుండటం వలన ఈఆక్షేపణ సమంజసం కాదు. సాంఖ్యులు ప్రధానమైనది ప్రకృతే కానీ బ్రహ్మ కాదు. సాంఖ్యులు శబ్దాదిహీనమైన ప్రధానం నుండి శబ్దాదులు గల జగత్తు ఉత్పత్తికి కారణమని ప్రళయ కాలంలో కార్యమైనా జగత్తు కారణమైన ప్రకృతిలో లీనమౌతుందని చెప్పారు. ప్రకృతిలో లీనం అయినప్పుడు ప్రళయానికి ముందు ఏ భేదాలు ఉన్నాయో అదే విధంగా మళ్ళీ ఉత్పత్తిలో భేదాలు ఉంటాయని చెప్పడానికి తగినంత కారణం ఏది లేదు. ముక్తులకు మళ్ళీ జన్మ వచ్చే అవకాశం ఉంది. అట్లు కాక కొన్ని భేదాలు అర్హులకు సంబంధించినవి ప్రధానంలో అవిభాగం పొందుతాయి. ముక్తులకు సంబంధించినవి అవిభాగం చెందవు. ఈ విధంగా దోషాలన్నీ సమానమే. సాధారణమైనవే.వీటిని దోషాలుగా పరిగణించి ఎట్టి చూపవలసిన పని లేదు.
సూత్రం :- 145
తర్కా ప్రతిష్టా నాదప్యన్య థాను మేయం ఇతి చేదేవ మప్య విమోక్ష ప్రసంగః'
అసమంజసంన :- అనేవి అనువృత్తులు, తర్కఅప్రతిష్టా వాత్ :- తర్కానికి ప్రతిష్ట నిలకడ లేనందువల్ల, అపి :- తర్కబలం వలన, న అసమంజసం- వైదిక మతాన్ని అసమంజసం అనకూడదు, అన్యధా :-మరొక రకంగా , అనుమేయం ఇతిచేత్ :- తర్కానికి ప్రతిష్ట ఉన్నదని ఊహిస్తారా!, ఏవం అపి :- అలా ఊహించినా, అవి మోక్ష ప్రసంగః :-తర్కానికి అప్రతిష్ట దోషం నుంచి విముక్తి లేదు.
భావం :- తర్కానికి ప్రతిష్ట నిలకడ లేనందున, తర్కబలం వలన వైదికమతాన్ని అసమంజసం అనకూడదు. తర్కానికి అప్రతిష్ట దోషం నుంచి విముక్తి లేదు. నిలకడ లేని తర్కం వైదికమతాన్ని ఎలా కాదంటుంది?
వివరణ :- తర్కం ఒప్పుకోకపోయినప్పటికీ బ్రహ్మయందు వేదాంత వాక్యాలు సమన్వయించడంలో ఆక్షేపణ ఉండదు. ఒక తార్కికుడు చెప్పే అర్ధం, మరొక తార్కికుడు ఒప్పుకోడు. కాబట్టి తర్కం నిలకడ లేనిది. వేదాంతసిద్ధాంతం ప్రకారం జగత్కారణం బ్రహ్మమే. ఇందులో సందేహం లేదు. ఏ విధమైన సందేహాలకు తావు లేకుండా ఉండే జ్ఞానమే తత్త్వజ్ఞానం. ఇందులో విరుద్ధభావాలు లేవు. వేదాలను అనుసరించకుండా చెప్పే జ్ఞానం సమ్యక్ జ్ఞానం కాదు. అటువంటి జ్ఞానం వలన మోక్షం రాదు. కాబట్టి వేదప్రమాణం లేని తర్కం పనికి రాదు. ఈ జగత్తుకు బ్రహ్మమే ఉపాదాన కారణం. అందులో ఏ మాత్రం సందేహం లేదు.
వైశేషిక దర్శనం :-వేదం స్వతః ప్రమాణం. దోష యుక్తమైన తర్కబలంతో వైదికమతాన్ని కాదనకూడదు. అసత్ వాద మతాన్ని వదిలేసి, వైదికమతాన్ని అంగీకరించడం యుక్తమని సూత్రానికి అర్ధం. లోకంలో తర్కాలు రెండు రకాలు. 1.శాస్త్రాన్ని ఆశ్రయించి ఉండే తర్కం శృతి, స్మృతులు అంగీకరిస్తాయి. ఇవి స్వతంత్ర తర్కం. 2.లోకంలో పురుషులు చేసేది, ఇది వేదసమ్మతం కాదు. వేదం సర్వజ్జుడైన ఈశ్వరుణ్ణించి ప్రభవించిందని కణాదమహర్షి అంటాడు. వేదాలు అపౌరుషేయాలు. పురుషులు చేసే తర్కంకూడా ఒకరు చేసినది మరొకరు అంగీకరించరు. వీటిలో ఒక తర్కాన్ని ఉత్క్రుష్టం అని అనలేము. అసద్వాదితర్కం దోషయుక్తం. ఆగమాల సహాయం లేకుండా పురుషులు ఊహామాత్రం చేత చేసిన తర్కాలు అప్రతిష్టాలుగా నిలకడ లేనివిగా ఉంటాయి. కొందరు బుద్ధిమంతులు ప్రయత్నపూర్వకంగా ఊహించిన తర్కాలను వాళ్ళ కంటే ఎక్కువ బుద్ధి ఉన్న వాళ్ళు అర్ధరహితాలుగా చెయ్యడం కనబడుతుంది. వాళ్ళు ఊహించిన తర్కాలను వాళ్ళ కంటే ఎక్కువ బుద్ధిబలం ఉన్నవాళ్లను అభాసం చేస్తున్నారు. అందువలన పురుషుల బుద్ధులు అనేక విధాలుగా ఉండటం వలన తర్కాలు ప్రతిష్ఠితంగా అంటే నిశ్చితంగా ఉంటాయని చెప్పడం శక్యం కాదు.
శిష్టా పరిగ్రహాధికరణం :- ( 2 , 1 , 12 )
సూత్రం :- 146
'ఏతేన శిష్టా పరిగ్రహా అపి వ్యాఖ్యాతః '
ఏతేన:- తర్కానికి ప్రతిష్ట లేదని నిర్ణయించినందువల్ల. శిష్ట అపరిగ్రహ అపి :- శిష్టులు అంగీకరించని అవైదిక శూన్యవాదం లాంటి సిద్దాంతాన్ని సైతం, వ్యాఖ్యాతః :- అసత్ వాదం లాగా వైదికులు అంగీకరించరని వ్యాఖ్యానిస్తున్నాయి.
భావం:- తర్కానికి ప్రతిష్ట లేదని, అవైదిక శూన్యవాదం లాంటి సిద్ధాంతాలను సైతం వైదికులు అంగీకరించరని వ్యాఖ్యానిస్తున్నాయి.
వివరణ :- ఏ సిద్ధాంతాన్నైనా సరే శిష్టులు ఖండిచినట్లైతే ఆసిద్ధాంతాన్ని అందరూ తిరస్కరించినట్లే. కపిలమహర్షి సాంఖ్య దర్శనంలో విశ్వసృష్టికి మూలప్రకృతి ప్రధానకారణమని చెప్పాడు. సాంఖ్యం సత్కార్యవాదాన్ని సమర్థిస్తుంది. దీని ప్రకారం ఏదైనా పనిలో కారణమూ, ఫలితము కలసి ఉంటాయి. ఉన్నది నశించదు. లేనిది ఉత్పన్నం కాదు. ప్రకృతి పరిణామ వాదం ప్రకారం మూల ప్రకృతే అన్నింటికీ కారణం.
వైశేషిక దర్శనం :- దీని కర్త కణాదమహర్షి. అసలు పేరు కశ్యపుడు. దీనిలో ఈశ్వరుడి ప్రసక్తి ఎక్కడా ఉండదు. కార్యం అనేది కొత్తగా పుట్టుకొస్తుంది. కార్యంలో కనబడే లక్షణాలు కారణంతో కనబడవు. మట్టి లోనుండి కుండ తయారైనా, మట్టి లక్షణాలు వేరు, కుండ లక్షణాలు వేరు. కుండ ఆకారంలో మట్టిఉండదు. అణువుల సంయోగం వలన ప్రపంచం ఏర్పడింది. ఆయాఅణువుల గుణాలు, ధర్మాలు సంయోగాన్ని అనుసరించి పదార్ధంయొక్క భౌతికరూపం స్వభావాలు మారు తుంటాయి. ఒకే రకమైన కణజాలాన్ని కలసి వస్తురూపం పొందుతాయి. ఉదా:-అగ్నితత్త్వం గల అగ్నికణాలు సంయోగం చెంది, సూర్యగోళం ఏర్పడింది అని చెబుతారు. వీరిది అసత్కార్య వాదం. అంటే కారణం వేరు, కార్యం వేరు. సాంఖ్యులు అనువాదుల సిద్ధాంతాల నన్నింటిని మనువు వ్యాసుడు వంటి మహానుభావులు ఖండించారు. కొంతవరకు ఈ వాదనలు వేదాలను అనుసరించి ఉన్నప్పటికీ అవి మొత్తం మీద వేద విరుద్ధములే. వీటిలో ముఖ్యమైన సాంఖ్య సిద్ధాంతాన్ని తిరస్కరించడం వలన, వేదాలలో లేనటువంటి కణాది, బౌద్ధ, అక్షపాదమత సిద్ధాంతాలనన్నింటిని కూడా ఖండించినట్లే అవుతుంది. వైదికులు అసత్ వాదాన్ని, శూన్యవాదాన్ని, సాంఖ్యవాదాన్ని ఖండించి, జగత్తుకు బ్రహ్మమే ఉపాదాన కారణమని సమర్ధించారు.
భోక్త్రా పత్త్యధికారణం ( 2,1,13)
సూత్రం :- 147
భోక్త్రా పత్తేరవిభాగశ్చేత్స్యాల్లోకవత్
భోక్త్ర పత్తేః :- భోగ్యానికి మూల కారణమైన ప్రకృతికి భోక్త్ర రూపం అయిన ప్రసక్తి కలుగుతుంది. అవిభాగః చేత్ :- ప్రళయ కాలంలో జీవులు ప్రకృతిలో అవిభక్తులై ఎలా ఉంటారని తెలుసుకోవడం కొరకు, స్యాత్ లోకవాత్ :- లోకానుభవం అవసరమౌతుంది.
భావం :- ప్రళయకాలంలో జీవులు ప్రకృతిలో కలిసిపోయి అవిభక్తులుగా ఎలా ఉంటారో తెలుసుకోవడానికి లోకానుభవం అవసరమౌతుంది.
వివరణ :- గురువుగారు! భోక్త అంటే చేతనుడైన జీవుడు. భోగ్యం అంటే శబ్దాది విషయసమూహం. బ్రహ్మమే జగత్తుకు ఉపాదానకారణం. కాబట్టి భోగ్యవస్తువులకే భోకృత్త్వం లభిస్తుంది. అందుచేత భోక్త, భోగ్య విభాగం కుదరదు కదా! అన్నాడు కృష్ణ శర్మ. ఆ మాటలు విన్న రత్నాకరుడు చెప్పడం ప్రారంభించాడు. బ్రహ్మం ఈ జగత్తుకు ఉపాదాన కారణం. భోక్త రూపంలో కానీ, భోగ్యరూపంలో కానీ కనిపించే జగత్తంతా బ్రహ్మకన్నా భిన్నమైనది కాదు అన్నాడు రత్నాకరుడు . అందువల్ల భోక్త, భోగ్యము అనే విభాగం ఉండదు. కుండ, మూకుడు వీటిలో ఉన్నది మట్టే కాబట్టి వస్తువులలో తేడా ఉన్నప్పటికీ, వాటికీ కారణమైన మట్టిలో తేడా లేదు. అలాగే జగత్తుకు బ్రహ్మ ఉపాదాన కారణం, ఈ జగత్తు, బ్రహ్మ రెండు వేరు కాదు. భోగ్యానికి మూల కారణమైన ప్రకృతి కి భోక్తృ రూపం అయిన ప్రసక్తి కలుగుతుంది. జీవులు రెండు రకాలు. 1.ముక్తులు 2. బద్ధులు. ముక్త జీవులు ఈశ్వరుడిలో అవిభక్తులై ఉండి, ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. బద్ధజీవులు ప్రళయకాలంలో స్థూలశరీరాలు లేకపోవడంచేత, కర్మఫలాలైన సుఖదుఃఖములను అనుభవించే వీలులేక ప్రకృతిలో లీనమై అవిభక్తవ్యవస్థలో ఉంటారు. ప్రకృతి సూక్ష్మం. అంతకన్నా సూక్ష్మం జీవులు. అందుచేతనే ప్రకృతిలో అవిభక్తస్థితిలో ఉండే జీవులను వేరుచేసి, తెలుసుకోవడం శక్యం కాదు. కేవలం శాస్త్రదృష్టితోనే తెలుసుకోగలం. ఈదశలో అసత్ వాడికి ఒక సందేహం కలుగుతుంది. 1.ప్రకృతి భోగ్యం కదా! ప్రళయకాలంలో జీవులు ప్రకృతిలో అవిభక్తస్థితి పొందుతారని ఒప్పుకుంటే, భోగ్యమైన ప్రకృతి భోక్త కావలసివస్తుంది. ప్రకృతిని భోక్త అనడం తప్పుకదా! సమాధానం :- వర్షాకాలం తరువాత వేసవిలో ఓషధులు భూమిలో లీనమై, అవిభక్తస్థితిలో ఉంటాయి. మళ్ళీ వర్షాలు పడటంవలన భూమితడిసి, ఓషధులు మళ్ళీ మొలకెత్తుతాయి. ఇక్కడ భూమి భోగ్యం, ఓషధులు భోక్తలు. అవి భూమిలో ఉన్నంత మాత్రాన భూమి భోక్త కాదు కదా ! భోగ్యమైన ప్రకృతి భోక్తలైన జీవాత్మలు అవిభక్తస్థితిలో తనలో ఉన్నంతమాత్రాన, భోక్త ఎన్నడూ కాదు. రెండు జడ పదార్ధాలు ఒక దానిలో మరొకటి అవిభక్తస్థితిలో ఉన్నప్పుడు ఒకటి తన ధర్మంతో మరొక దానిని ప్రభావితం చేయవచ్చును. కానీ జడపదార్ధం, చేతనపదార్ధాల విషయంలో ఇలా జరగదు. ప్రకృతి భోక్త కాదు. ప్రకృతి జడం. జీవుడు చైతన్యం. ఈ స్వభావం ఏ స్థితిలో ఉన్న మారదు.
సందేహం :- ప్రకృతి కారణం, జగత్తు కార్యం. కార్యం, కారణం కన్నా అన్యమా? అనన్యమా? అనన్యం అయితే ప్రకృతిని ఒప్పుకోవాల్సిన పనిలేదు. ప్రకృతికన్నా భిన్నం అయితే కనుక ప్రకృతి లేకున్నా జగత్తు ఉత్పన్నం అవుతుంది. అనన్యం అయితే ప్రకృతే కార్యం అవుతుంది. కనుక దానికి మరొక కారణం ఉండాలి. ఆ కారణం కూడా అనన్యమైతే దానికి ఇంకో కారణం ఉండాలి కదా! కారణవ్యాపారం వలన కొత్తగా ఏర్పడేది ఏమిలేదు. ఈ సందేహాలకు వ్యాసుడు సమాధానం చెబుతున్నాడు.
సూత్రం :- 148
తదన్యత్వమారంభణశబ్దాదిభ్యః
తత్ అనన్యత్వం:-కార్యరూపజగత్తు ప్రకృతికంటే అన్యం-వేరే కాదు. దీనికి ఆరంభణ శబ్దాదిభ్యః-ఉపనిషద్ వాక్య ప్రయోగం.
భావం :- కార్యరూపజగత్తు, ప్రకృతి కంటే వేరే కాదు అని ఉపనిషత్తు వాక్య ప్రమాణంగా ఉంది.
వివరణ:- ఉత్పత్తికి పూర్వం కార్యం, కారణంకన్నా సదా భిన్నంఅని కానీ, ఎల్లప్పుడూ భిన్నంకాదని కానీ, అంగీకరించకూడదు.
బృహదారణ్యకోపనిషత్తు:-(6,4,7} మృత్తిక మాత్రమే సత్యం అనే ఈవాక్యానికి కారణాన్ని మించి కార్యం అనేది ఏది వేరుగా లేదని చెప్పడం లేదు. అలా అనాలనుకుంటే నామరూపాలు కారణవికారాలు అనే పదాలు ఉండేవి కాదు. మట్టిలో కనిపించే వివిధ రకాల పాత్రలకు నామం, రూపం అనే అంశాలు రెండు కారణ వ్యాపారం వలన జనిస్తాయి. అందుకే కార్యం అంటారు. కావున కార్యం అనిత్యం. కనుక అది సత్తు కాదు. దానికి కారణమైన దానినే సత్థు అంటారు. ఘటం, మూకుడు అనేవి వస్తువుల పేర్లు. వాటి ఆకారమే రూపం. ఇవి రెండు ఉత్పత్తికి పూర్వం మట్టిలో కారణ రూపంలో ఉన్నా, అవి మన కంటికి గోచరించవు. వాటి ఉత్పత్తి జరిగిన తరువాత మాత్రమే కనిపిస్తాయి. దానినే కార్యోత్పత్తి అంటారు. ఈ రూపం లేకపోయినా దాని ఉనికి మట్టిలోఉండి అవ్యక్తంగా ఉంటుంది. కారణరూపమైన మట్టి నుంచి జనించేది కార్యమైన ఘటము, ఉత్పత్తికి పూర్వం ఘటంలా ఉండదు. ఆలా ఉత్పత్తి జరగకపోతే కారణ వ్యాపారం జరగదు కొత్తగా కలిగించే సామర్ధ్యం కారణానికి లేదు. ఇసుకలో తైలం ఏరూపంలోనూ ఉండదు. కనుక ఎన్ని వ్యాపారాలు చేసినా నూనె రాదు. ఉత్పత్తికి ముందు తరువాత కూడా అలాగే ఉంటుంది. దానినే అసత్ అంటారు. గురువుగారు జగత్తుకు బ్రహ్మకు భేదం లేదు అన్నారు. దీని వలన జగత్తుకు భొకృత్వం వస్తుందనే దోషాన్ని కూడా పరిహరించారు. కానీ లోకంలో కనిపించే మట్టికుండ ఉదాహరణగా చెప్పడం వలన కార్యకారణములకు భేదం కనిపిస్తోంది కాబట్టి జగత్తుకు బ్రహ్మకు భేదం ఎందుకు చెప్ప కూడదు? అన్నాడు నారాయణభట్టు. రత్నాకరుడు చెప్పడం ప్రారంభించాడు. కార్యం జగత్తు. కారణం బ్రహ్మ. ఈరెండింటికి భేదంలేదని వేదాలలో చెప్పబడింది. మట్టి తెలుసుకుంటే ఆమట్టితో చేసే వివిధరకాల వస్తువులు పేర్లలోనూ ఉపయోగాలలో తేడా ఉన్నా వాటిని గురించి తెలుస్తుంది. ఎందుకంటే అవన్నీ పేరుకు మాత్రమే వికారాలు. మట్టి అనేది సత్యం. మట్టితో తయారైన పాత్రల రూపంలో తేడా ఉన్నప్పటికీ అవి మట్టి కన్నా భిన్నమైనవి కావు. అలాగే బంగారం ఆభరణములు తేజము జలము అన్నము అనే వాటిని బ్రహ్మకు కార్యంగా చెప్పినప్పుడూ కార్యరూపంలో ఉన్న ఇవి తమకు కారణరూపం కన్నా భిన్నమైనవి కావు. వికారాలన్నీ ఎప్పుడు నామమాత్రమే. ఛాందోగ్యంలో ఉద్దాలకుడి సృష్టి అంతా ఆత్మస్వరూపం. అది సత్యం. అదే ఆత్మ. అదే నీవు ఈ సమస్తము ఆత్మపదార్ధమే. ఇక్కడ భిన్నమైనది ఏది లేదు. కాబట్టి కారణం సత్యం. కార్యం వికారం అందుకే కారణమైన బ్రహ్మ సత్యం. కార్యమైన జగత్తు మిధ్య. కార్యకారణములకు భేదం లేదు.
సూత్రం :- 149
భావో చోప లబ్దేః
చ- అలాగే, భావ -కారణంలో, ఉపాలబ్ధేః - కార్యం లభించడం వలన, అది కారణం కన్నా అన్యం కాదు.
భావం :- కారణం ఉన్నప్పుడే, కార్యం లభించడం జరుగుతుంది.
వివరణ:-ఘటరూపంలో ఉండే కార్యం, మట్టిరూపంలో ఉండే కారణం ఉన్నప్పుడే సంభవిస్తుంది. అలాగే వస్త్రం తంతువులు ఉన్నప్పుడే జనిస్తుంది. లేకుంటే వస్త్రం ఏర్పడదు. మట్టి ఉంటేనే కుండ తయారవుతుంది. బంగారం ఉంటే కుండ ఎలా తయారవుతుంది. కాబట్టి కార్యకారణములకు భేదం లేదు. నియమితమైన కారణములు ఉన్నప్పుడే ఆయా కార్యాలు జనిస్తాయి. కార్యం జనించడానికి నియమం ఉండేది కాదు. వస్త్రం కన్నా మట్టి వేరు. కుండా కన్నా దారాలు అన్యము. దారములున్నప్పుడే వస్త్రం, మట్టి ఉన్నప్పుడే కుండ తయారు చేయడం సంభవం. అందువల్ల వస్రం తంతువులకు అనన్యం. ఒకటి ఉన్నప్పుడు రెండవది ఉండటాన్ని అన్వయం అంటారు. ఒకటి లేనప్పుడు రెండవది కూడా లేకపోవడాన్ని వ్యతిరేకమంటారు. వైశేషిక దర్శనంలో కారణం ఉంటేనే కార్యం ఉంటుంది. కారణం లేనప్పుడు కార్యం లేదు. కనుక కార్యం ఉత్పత్తికి కార్యం కన్నా అన్యం కాదు. జగత్తు ఉత్పత్తికి పూర్వం ప్రకృతి కన్నా అన్యం కాదు అని కణాద మహర్షి అంటాడు. కారణం ఉన్నప్పుడే కార్యం కనబడుతుంది. కార్యం లేనప్పుడు కనబడదు. బంగారం లేకపోతే ఆభరణాలు కనబడవు. మట్టి ఉంటేనే ఘటం కనబడుతుంది. దారాలు ఉన్నప్పుడే వస్త్రం కనబడుతుంది. ఒకటి ఉన్నప్పుడు దానికంటే భిన్నమైనది మరొకటి కనబడదు కదా! (ప్రశ్న) ఒకటి ఉన్నప్పుడు దానికన్నా భిన్నమైనది మరొకటి తప్పనిసరిగా కనబడుతోందికదా! ఉదా:-అగ్ని ఉన్నప్పుడే ధూమం కనబడుతోంది. (సమాధానం) అగ్ని ఆర్పివేసిన కూడా చిన్నపాత్రలో ధూమం కనబడుతుంది. ఇలాంటి ధూమం అగ్ని లేకుండా ఉండదు అని చెప్పిన దోషము లేదు. వాటి మధ్య అభేదం లేదు. కార్యకారణములు అనన్యములనే విషయం కేవలం వినడమే కాకుండా ప్రత్యక్షంగా కనబడుతుంది. అందువలన అనన్యత్వం అంగీకరించాలి.అందుకు బుద్ధి పూర్వకమైన ప్రత్యేక్ష జ్ఞానం ఉండాలి. ఉదా :- తంతువులు ఒక విధమైన కూర్పుమాత్రమే అయినా, పటంలో తంతువుల కంటే భిన్నంగా పటం అనే కార్యం కనబడదు. పడుగు, పేక ప్రత్యక్షంగా కనబడతాయి. దాని వెనుక ఉన్న వస్త్రం బుద్ధికి మాత్రమే గోచరిస్తుంది. అదే విధంగా బ్రహ్మకు జగత్తుకు మధ్య భేదాభేదాలున్నాయని భ్రాంతి కలుగుతుంది. దానిని తొలగిందానికి ఈ అధికారణంలో ఏభేదం లేదని చెప్పబడింది. లోహిత, శుక్ల , కృష్ణ రూపమైన అగ్నికి కారణం వాయువు, దానికి కారణం ఆకాశం, వెనుక అద్వితీయమైన బ్రహ్మమే కనబడుతుంది. సర్వప్రమాణాలు అక్కడే ఆగిపోతాయి. అగ్నిలో ఉన్న ఎర్రటి తేజస్సు, తెల్లని రూపమున్న ఉదకము, నల్లని రూపమున్న పృధ్వి, మూడు రూపాలు విడదీస్తే అగ్ని అంటూ ఏమి మిగలదు. అన్నింటి కలయికే అగ్ని. ఈ విధంగా కారణం కంటే వేరుగా కార్యం లేదని గ్రహించాలి. పంచభూతాలలో పృధ్వి నీరు అగ్ని మాత్రమే కనిపిస్తాయి. వాయువు, ఆకాశం కనబడవు.అందుకే కార్యకారణముల అనన్యత్వం విషయంలో ప్రత్యక్ష జ్ఞానం ఉండాలి.
ఆరంభణాధికరణం :- ( 2,1,16 )
సూత్రం :- 150
'సత్త్వాచ్చావరస్య '
చ :- అంతే కాకుండా , అవరస్య :- కార్యం, సత్వాత్ :- ఉత్పత్తికి పూర్వం కారణరూపంలో ఉందని చెప్పడం వలన ,
భావం :- ఉత్పత్తికి ముందు ఈ జగత్తంతా కారణరూపంలో ఉన్నట్లు ఉపనిషత్తు చెబుతోంది.
వివరణ :- కార్యము అంటే వస్తువు రావడానికి ముందు కూడా ఆవస్తువుకు సంబంధించిన కారణం ఉంటుంది. కాబట్టి కార్యకారణములకు భేదం లేదు. కుండ తయారు కాక ముందు, తరువాత కూడా మట్టి ఉంది. అది అంతా ఒక్కటే పదార్ధం కాని వేరే ఏదికాదు. సృష్టికి ముందు అంతా ఆత్మమయంగానే ఉండేది. మట్టి నుండి కుండ పుట్టినట్లే బ్రహ్మ నుండి జగత్తు ఉద్భవించింది.
ఛాందోగ్యోపనిషత్తు:-(6,2,1):-ఓసౌమ్యా! ఈజగత్తు ఉత్పత్తికి పూర్వం సత్తే అయిఉండేది. ఈజగత్తు కారణం కన్నా అనన్య మైనది. అందుకే దానిని కారణరూపంలో సత్ అని చెప్పబడింది. అనన్యం కాకపోతే ఉత్పత్తికి పూర్వ అసత్ అయివుండేది. కార్యం కారణం కంటే అనన్యం. ఏది దేనియందు ఉండదో అది దానియందు పుట్టదు. తైలం ఇసుక నుండి పుట్టదు. అందువలన కార్యం ఉత్పత్తికి పూర్వం కారణం కంటే అనన్యం గాన పుట్టిన తరువాత కూడా అనన్యమేనని తెలుస్తుంది. సత్త్వమనేది కారణమైన బ్రహ్మలోను, కార్యమైన జగత్తులోను ఒక్కటే అని గ్రహించాలి.
సూత్రం :- 151
'అసద్వ్య పదేశా న్నేతి చేన్న ధర్మాంతరేన వాక్య శేషాత్ '
అసత్ వ్యపదేశాత్ :- కార్యాన్ని ఉత్పత్తికి పూర్వం అసత్ అని ఒకచోట అన్నారు కదా ! అందుచేత, న :- కార్యం, కారణం ఒకటే కాదు వేరే, ఇతి చేత :- అని అంటారా ? న :- సరి అయినది కాదు. ఎందుకంటే, వాక్య శేషాత్ :-తరువాత వాక్యాలు గమనిస్తే , ధర్మాంతరేణ :- వ్యక్తత్వధర్మం కన్నా వేరే అయిన అవ్యక్తరూపధర్మాన్ని పునస్కరించు కొని అసత్ అని వ్యవహరించినట్లు తెలుస్తోంది.
భావం :- కార్యాన్ని ఉత్పత్తికి పూర్వం అసత్ అని ఒకచోట అన్నారు కదా ! కార్యం, కారణం వేరే అని అనడం సరి అయినది కాదు. తరువాత వాక్యాలు గమనిస్తే అవ్యక్తధర్మాన్ని పునస్కరించుకొని అసత్ అని వ్యవహరించినట్లు తెలుస్తోంది.
వివరణ:-ఛాందోగ్యోపనిషత్తు:-ఉత్పత్తికి పూర్వం జగత్తు కారణరూపంలో అవ్యక్తంగా ఉంది. ఇక్కడ సత్ అనే పదం వ్యక్త రూపానికి పర్యాయ పదం. అసత్ అంటే అవ్యక్తమని అనుకోవాలి. ఉత్పత్తికి పూర్వం జగత్తు అవ్యక్తంగా ఉన్నందువల్ల అసత్ శబ్దంతో వ్యవహరించారు. అంతే కానీ స్వరూపంలో అది లేదని కాదు. సృష్టికి ముందు అసత్తు అని చెప్పడం వలన కార్యం కారణరూపంలో లేదు అనడం సరి కాదు. ఎందుకంటే అది అసత్తు కాదు. నామరూపాలు లేకపోవడం వలన అసత్ అన్నారు. కానీ అది సత్తే. బంగారం అంతా కరిగించిన తరువాత దానిని కారణరూపం అంటారు. దానిని ఆభరణాలుగా తయారుచెయ్యడం కార్యరూపం అంటారు. కరిగించిన బంగారంలో నామరూపాలైన ఆభరణాలు కనిపించనందున దానిని అసత్ అని వ్యవహరిస్తారు. కానీ నిజానికి అది సత్తే.
ఆరంభణాధికరణం :- ( 2 , 1 , 18 )
సూత్రం :- 152
యుక్తేః శబ్దాంతరాచ్చ
చ :- అంతే కాక, యుక్తేః :- నియతకారణ, ఉపాదానాది యుక్తి వలన, శబ్దాంతరాత్ :- స్మృతుల వలన కార్యం, కారణం ఒకటే అని తెలుస్తోంది .
భావం :- నియత కారణం, ఉపాదానాది కారణముల వలన స్మృతుల వలన కార్యం, కారణం ఒకటేనని తెలుస్తోంది.
వివరణ :- యుక్తి విషయంగా ఆలోచిస్తే పెరుగుకు పాలు, కుండకు మట్టి, కుండలాలకు బంగారం, ఉపాదాన కారణాలు. ప్రతి కార్యానికి ఒక నియతకారణం కావాలి. పెరుగు కావాలనుకున్నవాడు మట్టిని ఉపాదానకారణంగా కోరడు. సృష్టికి ముందు పెరుగు పాలరూపంలో ఉంటుంది. అలాగే కుండ కావాలనుకున్నవాడు మట్టిని, ఆభరణాలు కావాలనుకున్నవాడు బంగారాన్ని కోరతాడు. అంతే కానీ అసత్తును కోరడు. కార్యం ఉత్పత్తికి పూర్వం కారణం అని తెలిసి ఉండటమే. ఉత్పత్తికి పూర్వం కార్యం అసత్తు అనేవాడు. దధి కోసం పాలను ఉపాదానంగా స్వీకరించడు. కారణంతో కార్యం బొత్తిగా లేని పక్షంలో అది ఎలా ఉత్పన్నం అవుతుంది. ఈ కారణాలు అసత్తు కానేరవు. ఏకారణం ఏకార్యం వలన ఉత్పన్నం అవుతుందో ఆ కారణం ఆ కార్యంలో అన్వితమై ఉండాలి. అసత్తు నుంచి సత్తు జనించేటప్పుడు సత్తులో అసత్తు అన్వితమై ఉండాలి. లోకంలో కార్యజాతమంతా సత్తులో అన్వితమై ఉత్పన్నం కావడం గమనిస్తున్నాము. అభావం నుంచి భావోత్పత్తి కలుగదు. ఉత్పన్నవస్తువేదీ అసత్ కాదు. కార్యమనేది ఉత్పత్తికి పూర్వం కారణరూపంలోనే ఉంటుంది. అందుచేత కార్యకారణములకు భేదం లేదు. మనిషికి కొమ్ములాగా అసత్తుకి ఉత్పత్తి లేదు. కపిలుడు సాంఖ్య శాస్త్రంలో అసత్ వాదాన్ని నిరసించి, సత్ వాదాన్ని ప్రతిపాదిస్తాడు. ఇలా యుక్తివలన, స్మృతివలన, కార్యం తన ఉత్పత్తికి పూర్వం కారణరూపంలో అనన్యమై ఉంటుందని తెలుస్తోంది.
సూత్రం :- 153
" పటవచ్చ "
చ :-అంతేకాక, పటవత్ :-వస్త్రం ఏర్పడడానికి పూర్వం దారాల కన్నా భిన్నం కాదు.
భావం :- వస్త్రం ఏర్పడటానికి పూర్వం దారాల కన్నా భిన్నం కాదు. అలాగే కార్యజాతం ఉత్పత్తికి పూర్వం కారణం కంటే వేరే కాదు.
వివరణ :- మడత పెట్టిన వస్త్రం ఇది వస్త్రమా? లేక మరొక వస్తువా?అని స్పష్టంగా తెలియదు. బట్ట చుట్టబడివున్నా పరచబడి ఉన్నా అది బట్టే. అంటే ఒక్క ఆకారమే మారుతోంది. మూలంలో మార్పు ఉండదు. విడదీసినప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. మడత పెట్టినప్పుడు ఇది వస్త్రం అని తెలిసినా కూడా దాని పొడవు వెడల్పు మొదలైన విశేషాలు తెలియవు. దానిని పరచినప్పుడు మాత్రమే దాని విశేషాలు తెలుస్తాయి. అట్లే తంతువులు మొదలైన కారణాల స్వరూపంలో ఉన్న పటాది కార్యం అస్పష్టంగా ఉండి నేసే సాధనం మగ్గం. సాలెవాడు మొదలైన కారకాల వ్యాపారం చేత అభివ్యక్తమై స్పష్టంగా కనబడుతుంది.అందుచేత మడతపెట్టినా, మడతవిప్పినా వస్త్రంయొక్క న్యాయం చేతనే కార్యం కారణం కంటే అనన్యమైనదని అర్ధం. అలాగే మట్టిగా ఉన్నప్పుడు తెలియని విషయాలు కుండ తయారైన తరువాత తెలుస్తాయి. అంతే కానీ కార్యకారణములైన కుండ మట్టిలలో భేదం ఉండదు. ఈ పృథివ్యాది కార్య జాతమంతా ఉత్పత్తికి పూర్వం ప్రకృతిని మించి వేరే ఏమి కాదు. జగత్తు ప్రకృతి యొక్క విశేషమే. అవస్థకు ఆ అవస్థ ఉన్నదానికి తేడా లేదు కదా! కనుక ఉత్పత్తికి పూర్వం కార్యం కారణం కన్నా అనన్యమే.
సూత్రం ;- 154
యథీ చ ప్రాణాది
యథా :- ఎలాగ, ప్రాణాది :- పంచ ప్రాణాలు
భావం :- ఎలాగ పంచ ప్రాణాలు ముఖ్య ప్రాణం కన్నా వేరే కావో అలాగే పృథివ్యాది జగత్తు కూడా ఉత్పత్తికి పూర్వం ప్రకృతి కన్నా భిన్నంగా కాదు .
వివరణ ;- ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం, అనే 5 ప్రాణాలు ఉత్పత్తికి పూర్వం ముఖ్య ప్రాణం కన్నా వేరు కావు. ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఊపిరి బిగపడతాడు. అంటే వాయువును కుంభిస్తాడు. అప్పుడు అపాన, వ్యాన, ఉదానములనే తేడాలు వాయువుకు వుండవు. అప్పుడు ప్రాణం మాత్రమే ఉంటుంది. ఎందుకంటే వాయు ప్రసరణ జరగడం లేదు. కాబట్టి ప్రాణాయామం ఆపి వేసి నప్పుడు, అవన్నీ యధాతధంగా పని చేస్తాయి. అవయవాలు వంచడం, చాపడం మొదలైన పనులు చేస్తుంటాయి. అంత మాత్రం చేత వీటి మధ్య తేడా ఉన్నదని కాదు. కార్యకారణముల మధ్య ఏమాత్రం భేధం లేదు. అందువలన సమస్త జగత్తు కూడా బ్రహ్మ యొక్క కార్యం అవడం వలన, ఇది బ్రహ్మ కంటే అనన్యం అవడం వలెనే అని తెలుస్తోంది.
ప్రస్నోపనిషత్తు :- ముఖ్యప్రాణం ఇలా అన్నది. మోహాన్ని పొందకండి . నేనే 5 రకాలుగా నన్ను విభజించుకుని, ఈ శరీరాన్ని ధరిస్తున్నాను. ఎలాగ ముఖ్య ప్రాణం తనని తాను పంచ ప్రాణాలుగా విభజించుకుని శరీర ధారణకు ఉపయోగ పడుతున్నాడో, అలాగే ప్రకృతి పృథివ్యాది రూపంలో పరిణమించి జీవుల భోగంగా ఉపయోగపడుచున్నది. ఉత్పత్తి పూర్వం ఈ జగద్రూప కార్యం ప్రకృతి కన్నా వేరే కాదు అనడంలో సందేహం ఏమాత్రం లేదు. కనుక కార్యం కారణం రెండూ ఒక్కటే.
ఇతర వ్యపదేశాధికరణం :- ( 2,1,21 )
సూత్రం :- 155
ఇతర వ్యపదేశాత్ హితాకరణాది దోష ప్రసక్తిః
ఇతర వ్యపదేశాత్ :- బ్రహ్మం జీవాత్మగా వ్యవహరిస్తున్నందువలన, హితా కరణాది దోష ప్రసక్తిః :- హితం, అహితం అనే దోషాలు చేసిన నింద బ్రహ్మకు వస్తుంది కదా !
భావం :- బ్రహ్మం జీవాత్మగా వ్యవహరిస్తున్నందువలన జీవుడు చేసే దోషాల వలన కలిగే ఫలితాలు బ్రహ్మకు వర్తిస్తాయా ? అనేది సందేహం .
వివరణ :- గురువుగారు! కార్యాకారణ సంబంధం లేదన్నారు. అయితే జీవాత్మ, పరమాత్మ రెండు ఒకటే అంటున్నారు కదా ! జీవి కర్మలు చేస్తుంటాడు. ఆ కర్మల ఫలితాలను అనుభవిస్తూన్న అతనికి జనన మరణాలు సంభవిస్తుంటాయి. ఈ కర్మలలో కొన్ని దోషాలు కూడా ఉంటాయి. జీవాత్మ పరమాత్మా ఇద్దరు ఒక్కటే అయినందున, జీవి చేసిన దోషాలు పరమేశ్వరుడి కూడా సంక్రమిస్తాయి కదా! అప్పుడు పరబ్రహ్మ కూడా దోషభూయిష్టుడు అవుతాడు కదా? అని అడిగాడు కృష్ణశర్మ. దానికి సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. జీవుడికి బ్రహ్మత్వం చెప్పడం వలన, బ్రహ్మకు హితాకరణాది దోషం వస్తుంది అంటారు. తత్త్వమసి అనటం వలన జీవుడి యందలి దోషాలు బ్రహ్మకు అంటుతాయని జీవాత్మ, పరమాత్మా రెండు ఒక్కటే అనడం వలన జీవి కుండే లక్షణాలన్నీ బ్రహ్మకు ఆపాదించబడుతున్నాయి. అప్పుడు బ్రహ్మ దోషభూయిష్ఠుడగుచున్నాడు. కాబట్టి అతడు జగత్కారణం అనటం వీలుపడదు అని వాదం అన్నాడు రత్నాకరుడు. జగజ్జన్మాదులకు బ్రహ్మ స్వతంత్ర కారణం అంటున్నారు.ఈ జగత్తు ..బ్రహ్మ నిమిత్తం. బ్రహ్మం స్వతంత్రం. అలాంటి బ్రహ్మ తాను నిర్మించిన ఈ జగత్తు తనకు అహితం చేసేలాగా ఎందుకు నిర్మిస్తాడు. ఎలాగంటే బ్రహ్మానికి జీవుడికి ఎలాంటి భేదం లేదు. బ్రహ్మమే జీవాత్మ రూపంలో ఈ జగత్తులో వ్యవహరిస్తున్నారు. జీవుడు లోకంలో జన్మ జరా మృత్యు రూపమైన కష్టాలను అనుభవిస్తున్నాడు.
చాందోగ్యోపనిషత్తు:- ఈ జీవరూపంలో ప్రవేశించి నామరూపాలు నిర్మిస్తాడు. ఉద్దాలకుడు శ్వేతకేతూ! తత్త్వమసి నీవే ఆత్మవి అంటుంది. ఐతరేయంలో మనుషులను సృష్టించి వారి దేహంలో ప్రవేశించాలనుకున్నాడని చెప్పారు. దీని వలన జీవాత్మ పరమాత్మ ఒక్కటే అని తెలుస్తోంది.ఈ కారణం చేత బ్రహ్మ కున్న సృష్టి కర్తృత్వం జీవికి కూడా వస్తోంది. అప్పుడు ఈ కారణం చేత జీవుడికి ఉన్న జన్మజరాదులు బ్రహ్మకు వస్తాయి కాబట్టి బ్రహ్మ జగత్ కారణం అనడానికి వీలు లేదు అని వారి వాదన.
తైత్తరీయోపనిషత్తు :- ఈ జగత్తు సృష్టించి అందులోనే ప్రవేశించాడు.
శ్వేతాశ్వరోపనిషత్తు :- నీవు స్త్రీవి, పురుషుడివి, కుమారుడివి, కుమార్తెవు, దుష్టులను దండించి, దోషులను దూరం చేస్తావు. సర్వత్రావ్యాపివి ప్రసిద్ధుడివి. ఈఉపనిషత్ వాక్యాలు ఈబ్రహ్మమే జీవరూపంలో జగత్తులో వర్తిస్తాడని స్పష్టంగా అంటున్నాయి కనుక జగత్తుకు బ్రహ్మం స్వతంత్ర కర్త అని అంగీకరిస్తే బ్రహ్మము తనకోసం జగత్తును దుఃఖమయంగా నిర్మించుకున్ననాడే దోషానికి గురి కాక తప్పదు. జగత్తు దుఃఖ కారణమే.
సాంఖ్యం :- జననమరణాదులతో మారిన జగత్తు దుఃఖం బహుళం. సుఖానుభవం ఉన్నా అది దుఃఖమిశ్రితమే కాబట్టి అది కూడా దుఃఖమే. అందువలన సర్వశక్తిమంతం అయిన బ్రహ్మ తన కొరకు ఇలాంటి దుఃఖభాజనమైన జగత్తును ఎందుకు సృష్టించుకుంటాడు? జగత్తు బ్రహ్మకర్తృత్వం అనడంతో దోషభూయిష్టమైన కర్మలు బ్రహ్మకు అంటుతాయి కదా! అనేదే సందేహం.
సూత్రం :- 156
'అధికంతు భేద నిర్దేశాత్ '
తు :- ఆలా అనడం సరి అయినది కాదు,
భేద నిర్దేశాత్ :- భిన్నత్వం నిర్దేశించడం వలన, అధికం :- బ్రహ్మ జీవుని కన్నా అధికం.
భావం :-జీవుడు చేసిన దోషభూయిష్టమైన కర్మలు బ్రహ్మకు ఆపాదించబడటం వలన అతను జగత్కారణం అని అనడానికి వీలులేదు. ఈ వాదన సరి అయినది కాదు. భిన్నత్వం నిర్దేశించడం వలన బ్రహ్మ జీవుడి కన్నా అధికం అని సూత్రానికి అర్ధం.
వివరణ :- సర్వజ్ఞుడు, సర్వ శక్తిమంతుడు అయిన బ్రహ్మ జగత్ కర్త. జగత్తు అనిష్టహేతువు అనేది జీవాత్మపట్ల సత్యమే. కానీ జగజ్జన్మాదులకు కారణమైన బ్రహ్మానికి సహితం కాదు. బ్రహ్మ జీవాత్మకన్నా అధికం. జీవాత్మ పరమాత్మ మధ్య భేదాలు: జీవాత్మ అల్పజ్ఞాని. సర్వజ్ఞత్వం కాదు. అన్నింటిని అన్ని విధాలుగా ఎరుగలేడు. జీవాత్మకు కాలజ్ఞానం లేదు. జీవాత్మకు భూతకాలజ్ఞానం కానీ భవిష్యత్ జ్ఞానం కానీ లేవు. వర్తమానం కూడా కించిత్తే తెలుస్తుంది. కానీ సర్వం తెలుసుకోలేదు. జీవాత్మ అల్పశక్తి మంతం. కనుక తాను చేయదలచినంత చేసే సమర్ధుడు కాదు. కానీ బ్రహ్మ అలా కాదు. సర్వజ్ఞత్వం, సర్వశక్తిమంతం, సర్వకర్త ,బ్రహ్మానికి తెలియని తత్త్వం త్రిలోకంలోనే లేదు. బ్రహ్మకు సమానం కానీ అధికం గానీ మరొకరు లేరు. జీవాత్మకు క్రియాశక్తి, విజ్ఞానం పూర్ణంగాలేవు. అందువలన అతను సాధించే కర్మకూడా సంపూర్ణం కానేరదు. బ్రహ్మకు క్రియాశక్తి, విజ్ఞానం సంపూర్ణంగా ఉన్నాయి. అందువలన అతను సాధించే కర్మ కూడా సంపూర్ణం కాదు. బ్రహ్మకు ఉన్న జ్ఞానక్రియాశక్తులు రెండూ సంపూర్ణమే. జీవాత్మ అణుస్వరూపుడు. అవిద్యతో కోరికలతో విషయవాసనలకు బందీ అవుతాడు. కర్మఫలాలను, సుఖదుఃఖరూపంలో అనుభవించడం వలన హితాహితాలు జీవునికి వర్తిస్తాయి. బ్రహ్మ జగత్కర్త. ఆయనకు క్లేశాలు ఉండవు. రాగద్వేషాలు, బంధనాలు, సంసారపాశాలు ఉండవు. ఏకం, అద్వితీయం జీవులకు కర్మఫల ప్రదాత. జడ చేతనాత్మక సమస్త జగత్తుకు శాసకుడు, గుణ కర్మ స్వరూపాలలో బ్రహ్మం జీవుడి కన్నా ఎంతో అధికం, భిన్నం కూడా. బ్రహ్మ జీవరూపం ఎన్నటికీ కాదు. కనుక జీవుడు అల్పుడని బ్రహ్మం అధికమని తెలుసుకోవాలి. ఋగ్వేదం:- జీవుడు సుఖదుఃఖాలు అనుభవిస్తాడు. పరమాత్మకు అంటవు.ఆయన ప్రకాశశీలి.
ముండకోపనిషత్తు:- జీవుడు అనీశుడు, పరమాత్మ ఈశుడు. బృహదారణ్యకోపనిషత్తు :-పరమాత్మ జీవుడిలో ఉన్నా అతని కన్నా భిన్నమైన వాడు. వీటి వల్ల జగత్తును నిర్మించి తనకు అహితం చేసుకునే దోషం బ్రహ్మకు శాస్త్ర సమ్మతం కాదు.బ్రహ్మ సర్వాంతర్యామి కనుక సర్వాధారం అన్నారు. జీవాత్మ రూపమని చెప్పలేదు. మరణకాలంలో జీవాత్మ పరమాత్మ చేత అధిష్టితమై, శబ్దం చేస్తూ పోతుంది. ఈ రకంగా కర్త, కర్మ భేదం వలన జీవుడికి బ్రహ్మకు భేదం చెప్పారు. బ్రహ్మకు హితము, అహితము అనేవి లేవు. ప్రేమ, అభిమానం, దయ ఏమి లేనివాడు. కాబట్టి ఆయనకు ఏ దోషాలు అంటావు.
సూత్రం :- 157
అశ్మాది వచ్చ తదనుపపత్తిః
చ :- అలాగే, అశ్మాదివత్ :- రాళ్లు మొదలైన వాటిలాగా, తత్ అనుపపత్తిః :- జీవాత్మ కూడా బ్రహ్మరూపం పొందలేదు.
భావం :-జీవుడు చేసిన హితాహిత కర్మఫలాలు బ్రహ్మానికి అంటవు. అలాగే రాళ్లు మొదలైన వాటిలాగా జీవాత్మ కూడా బ్రహ్మ రూపం పొందలేదు.
వివరణ:- ఒకేరూపం గల బ్రహ్మ ఈజగత్తును నిర్మించినప్పుడు కార్యాల్లో వైచిత్య్రం ఉండకూడదు అనేది వాదన. రాళ్లు మొదలైన వాటిలో కార్యవైచిత్య్రం కుదురుతుంది. కనుక పరులు చేసిన ఆక్షేపణకు యుక్తి లేదు. భూమిలో నుంచి అనేక రాళ్ళు పుడుతున్నాయి. వాటిలో కొన్ని బండరాళ్ళు, కొన్ని కంకరరాళ్ళు, కొన్ని వజ్రాలు. ఈరకంగా వాటి విలువలో తేడా లున్నాయి. అన్ని రాళ్లలోనూ పృధ్వీతత్త్వం అనే జాతి సమంగా ఉన్నా, కూడా వజ్ర వైడుర్యాదిమణులు, కొన్ని చాలా విలువైనవి ఉంటాయి. సూర్యకాంతం మొదలైనవి కొన్ని మధ్యమ విలువ కలవిగా ఉన్నాయి. ఈవిధంగా ఆ రాళ్లలోనే అనేక విధాలైన వైచిత్య్రం కనబడుచున్నది. ఒకే నేలమీద మొలిచే విత్తనాలతో చందనం, సుగంధ ద్రవ్యాలయందు అనేక విధాలైన ఆకులు, పువ్వులు, పండ్లు వాసన, రుచి మొదలైన వాటిలో భేదం కనబడుతున్నది. ఒక చెట్టు కాయలు తీయగా ఉంటే, వేరొక చెట్టు కాయలు పుల్లగా ఉంటాయి. మనం తీసుకునే ఆహరం జీరమై, రక్తం, మాంసం, ఎముకలు, మజ్జ, గోళ్లు, వెంట్రుకలుగా మారుతుంది. వీటన్నింటికి రూపంలోనూ, ఉపయోగంలోను, భేదం ఉన్నది. అదే విధముగా ఒకే పరమాత్మ నుంచి పుట్టిన జగత్తు లోను వైవిధ్యం ఉంటుంది. ఇందులో తప్పు లేదు. ఇదేమి దోషం లేదు. పాషాణాది జడ పదార్ధాలకు బ్రహ్మంలో ఉనికి ఉన్నది. అంత మాత్రాన అవి బ్రహ్మం కానేరదు. ఒక సామాన్య ధర్మం ఉన్నంత మాత్రాన ఒక వస్తువు మరొక వస్తువు కానేరదు . మనుష్యత్వం అనే పోలిక ఉన్నంత మాత్రాన నిర్ధనుడు ధనికుడు కాలేదు. అలాగే మూర్ఖుడు జ్ఞానీ కాలేదు. జీవునిలో చేతనత్వం ఉన్నా సర్వజ్ఞత్వాది ధర్మాలు లేనందున బ్రహ్మం కానేరదు.
ఉపసంహార ధర్మాణాధికరణం ( 2,1,24 )
సూత్రం :- 158
ఉపసంహార దర్శనాన్నేతి చేన్నక్షీరవద్ధి
ఉపసంహారదర్శనాత్ :- ఈలోకంలో కుమ్మరి కుండను తయారుచేయడానికి చక్రం, దండం లాంటి పరికరాలు అవసరమైనట్లు, న :- బ్రహ్మానికి ప్రకృతి కన్నా వేరే ఎలాంటి సాధనాలు లేనందువలన, ఇతి చేతన్ :- అని శంకించడం సరి అయినది కాదు. హి ;- ఎందుకంటే క్షీరవాత్ :- పాలు స్రవించేలాగా జగత్తు నిర్మాణం జరుగుతుంది.
భావం:- ఈలోకంలో కుమ్మరి కుండలు చెయ్యడానికి చక్రం, దండం, తాడు మొదలైన పరికరాలు అవసరం అయినట్లు, బ్రహ్మానికి ప్రకృతికన్నా వేరే ఎలాంటి సాధనాలు లేనందువలన బ్రహ్మ జగత్ కారణం కాదు అని శంకించడం సరియైనది కాదు.
వివరణ :- గురువుగారూ ! కుమ్మరివాడు కుండలు చెయ్యాలి అంటే కేవలం మట్టి మాత్రమే కాకుండా కర్ర, చక్రం, దారం మొదలైన ఇతర సాధనాలు కావాలి. మరి జగత్తును సృష్టి చేసే బ్రహ్మకు మాత్రం ఏ రకమైన ఇతర సాధనాలు అవసరం ఉండదా? అని అడిగాడు కృష్ణశర్మ. సమాధాం చెబుతున్నాడు రత్నాకరుడు. పనిచేసేవాడు సాధనాలను సమకూర్చు కుంటాడు. మరి బ్రహ్మకు ఇతర సాధనాలు ఉండవా? అంటే కుమ్మరివాడు ఇతర సాధనాలు ఉపయోగిస్తాడు. మరి బ్రహ్మకు ఇతర సాధనాలు ఏమి లేవు. కాబట్టి జగత్తుకు కారణం బ్రహ్మకాదు అని అనకూడదు. ఉపకరణాలు లేకపోయినా లోకంలో పని జరుగుతుంది. పాలు పెరుగులా మారాలంటే ఏసాధనము అవసరంలేదు. పాలను వేడి చేస్తున్నాం కదా అని అనకూడదు. పాలు త్వరగా తోడుకోవడానికి మాత్రమే వేడి చేస్తున్నాము. వేడి చెయ్యకపోయినా పెరుగు అవుతుంది. పెరుగు అయ్యే గుణం లేకపోతే వీటిని వేడి చేసినా లేదా ఇగరబెట్టినా పెరుగు అవదు. నీటిని వేడి చేసినా పెరుగు అవదు. అలాగే పరమాత్మ సర్వశక్తి సంపన్నుడు. కాబట్టి అతనికి ఇతర సాధనాలు ఏవి అవసరం లేదు. బ్రహ్మకు కార్యము, కారణమూ లేదు. అతనితో సమానమైనవారు కానీ, అతని కన్నా అధికులు గానీ లేరు. కాబట్టి ఏసాధనాలు అవసరం లేకుండానే జగత్తును నిర్మించగలడు. ఆవు ఇతర సాధనాలు ఏవి లేకుండానే సంకల్పమాత్రం చేత దూడకు పాలు స్రవించేటట్లు చేస్తుంది. ఇవన్నీ లోకంలో ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అలాగే బ్రహ్మం భోగం కొరకు సంకల్పమాత్రంతో ప్రకృతిని మహత్తు మొదలైన జగత్తు రూపంలో పరిణమించేటట్లు చేస్తాడు. ఇందులో లోక విరుద్ధం ఏమి లేదు. ఇక్కడ కుమ్మరి లాంటి స్వల్పవ్యక్తులతో ఈశ్వరుణ్ణి పోల్చకూడదు. వాళ్లకు పదార్ధాలను తయారుచేయడానికి సాధనాలు కావలి. లేకపోతే కార్యసాధన జరగదు. ఋగ్వేదం :- ఈశ్వరుని శక్తి అమితమైనది. కనుక బ్రహ్మం జగత్కారణత్వంలో ఏ విరోధం లేదు.
సూత్రం :- 159
" దేవాది వదపి లోకే "
లోకే :- ఈ లోకంలో, దేవాది వత్ అపి :- దేవతలు మొదలైన వాళ్ళు కార్యాలు సాధిస్తున్నారు కదా !
భావం :- ఈ లోకంలో దేవతలు మొదలైన వాళ్ళుకార్యాలు సాధిస్తున్నారు కదా ! ఈ లోకంలో విద్వాంసులు, యోగులు, ఋషులు, మొదలైన వాళ్ళు సంకల్పం మాత్రం తో అనేక కార్యాలు సాధిస్తున్నట్లుగా, బ్రహ్మం కూడా సంకల్పం తోనే బృహద్ కార్యాన్ని నిర్వహిస్తున్నాడు.
వివరణ:- మంత్రశాస్త్రంలో, ఇతిహాసాలలో కూడా దేవతలు అసహాయులై కార్యం చేస్తున్నారని చెప్పబడింది. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలలో దేవతలు, పితృ దేవతలు, ఏసాధన సంపత్తి లేకుండానే, సంకల్పం బలం చేత మహత్తర కార్యాలు చేశారని చెప్పబడింది .సాలెపురుగు ఏసహాయం లేకుండానే గూడు నిర్మిస్తుంది. చిన్నచిన్న కీటకాలను భక్షించడం వలన దాని లాలాజలం గట్టిబడి దారం అవుతుంది. ఆ దారంతోనే అది గూడు నిర్మిస్తుంది. కొంగ మేఘ గర్జనం విని, శుక్ర వీర్యాలు లేకుండానే గర్భం దాలుస్తుంది. పద్మలత కూడా చేతనం చేత ప్రేరేపించబడి అచేతనమైన శరీరంతోనే ఒక సరస్సు నుండి ఇంకొక సరస్సుకు వేళ్ళుచున్నది. కులవృత్తులు నిర్వహించేవారికి తమ కార్యాలను ప్రారంభించడానికి బాహ్యసాధనాలను ఏవిధంగా ఉపయోగిస్తారో, అదే విధంగా దేవాదులకు ఉపయోగించవలసిన అవసరం లేకుండా కార్యాలను నిర్వహిస్తారు. వీరితో బాటు బ్రహ్మకు కూడా బాహ్యసాధనాన్ని ఆపేక్షించడు. ఒక సామర్ధ్యం అందరికీ ఒకేలా ఉండవలసిన అవసరం లేదు.
కృత్స్నప్రసక్ర్త్రధికరణం :- ( 2,1,26)
సూత్రం :- 160
'కృత్స్న ప్రసక్తి ర్నిరవయవత్వ శబ్ద కోపోవా.
బ్రహ్మ సంకల్పం వలన పరిణమించే మూల కారణమయిన ప్రకృతి కి అవయవాలు లేనప్పుడు, కృత్స్న ప్రసక్తహః ;- సంపూర్ణ మైన పరిణామ ప్రసక్తి కలుగుతుంది. నా ;- లేక అవయవాలు ఉంటే, నిరవయవత్వ శబ్ద కూపః:- ప్రకృతి నిరవయవం అని చెప్పే మాటలు నిజం కావు.
భావం:- బ్రహ్మ సంకల్పంచేత పరిణమించే మూలప్రకృతికి అవయవాలు లేనప్పుడు సంపూర్ణమైన పరిణామం కలుగుతుంది. అవయవాలు ఉంటే ప్రకృతి నిరవయవం అని చెప్పే మాటలు నిజం కావు.
వివరణ:- అవయవాలులేని బ్రహ్మ కనుక పరిణామం చెందినట్లైతే బ్రహ్మ పూర్తిగా కార్యరూపంలో పరిణమం చేసినట్లవుతుంది. కొంత భాగమే అయితే బ్రహ్మకు అవయవాలు వచ్చి బ్రహ్మ నిరవయవుడు అన్న శృతికి విరోధం వస్తుంది. ఏది ఎలా చూసినా బ్రహ్మ అనిత్యమౌతుంది. అందుచేత బ్రహ్మ జగత్తుకు ఉపాదానకారణం కాలేదు అని వారి వాదన. బ్రహ్మ పూర్తిగా పరిణామం చెందితే, అంటే జగత్తు బ్రహ్మ రెండు ఒక్కటే .కొంత భాగమే పరిణాయం చెందాడు అంటే జగత్తు లేక బ్రహ్మ ఇంకా కొంచెం భాగం ఉన్నాడు అని అంటే బ్రహ్మ సాకారుడు అని అర్థం. ఏదైనప్పటికీ వేదాలలో చెప్పిన విషయాలకు విరుద్ధమౌతుంది. కాబట్టి జగత్తుకు బ్రహ్మ ఉపాదాన కారణం కాదు అని శంకిస్తారు. నిరవయవమైన బ్రహ్మ క్షీరాదుల వలే పరిణామం చెందుతుంది అని అంగీకరిస్తే బ్రహ్మ నిరవయవం అని చెప్పే శబ్దాలకు విఘాతం కలుగుతూంది. ఏకము, అద్వితీయము అయినా బ్రహ్మ క్షీరాదుల వలె బాహ్య సాధనాపేక్ష ఏమి లేకుండా స్వయంగా పరిణామం చెందుచు జగత్తుకు కారణం అవుతున్నది. కృత్స్న ప్రసక్తి అంటే సంపూర్ణమైన పరిణామ ప్రసక్తి కలుగుతుంది. బ్రహ్మ నిరవయవం గాన సమస్తమైన బ్రహ్మ కూడా కార్య రూపంలో పరిణమిస్తుంది. బ్రహ్మ పృధివ్యాదుల వలె సావయవం అయితే దాని ఒకభాగం పరిణామం చెంది ఉండేది. ఒక భాగం పరిణామం చెందకుండా ఉండేది. శృతులలో చెప్పినట్లుగా ఒక భాగం మాత్రమే పరిణామం చెందడం అనేది కుదరదు. కనుక మొత్తం పరిణామం చెందాలి. కార్యం ఏప్రయత్నం లేకుండానే కనబడుతుంది. కనుక కార్యం కంటే భిన్నమైన బ్రహ్మ లేదు. ఇక్కడ ఆత్మను చూడాలి అనే ఉపదేశం వ్యర్థం అవుతుంది. అంతేకాక బ్రహ్మను పరిణామస్వరూపంలో జన్మనాశనాలు అంగీకరిస్తే, బ్రహ్మను నిరవయత్వాన్ని అంగీకరిస్తే, అనిత్యత్వం అనే దోషం కలుగుతుంది. ఎలా చూసిన ఈ పక్షాన్ని కూర్చడం శక్యం కాదు. లోకంలో అవయవాలు ఉన్నవే ఉపాదానకారణంగా కనబడుతున్నాయి. అందుచేత అవయవాలు లేనిది ఉపాదానం అనడానికి వీలు లేదు.ఇక్కడ వేదాంత సమన్వయం కుదురుతుందా లేదా అనేది సందేహం. బ్రహ్మకు విచిత్రమైన శక్తులున్నాయి. సత్యసంకల్పం ఉన్నందున ఉపాదానత్వం, కర్తృత్వం కూడా బ్రహ్మకు కుదురుతుంది.
సూత్రం :- 161
'శృతేస్తు శబ్ద మూలత్వాత్ '
తు :- జగత్తుకు బ్రహ్మ ఉపాదాన కారణం కాదు అనే శంక సరియైనది కాదు. శబ్ద మూలత్వాత్ :- వైదిక సిద్ధాంతాలు శబ్దాశ్రితాలు కనక, శ్రుతేః :- వేదాలు చెబుతున్నట్లు ,
భావం:- వైదిక సిద్ధాంతాలు శబ్దాశ్రితాలు కనుక, వేదాలు చెబుతున్నట్లు, బ్రహ్మ సంకల్పం మూలంగానే ప్రకృతి జగద్రూపంలో పరిణమిస్తుందని నిశ్చయించాలి. బ్రహ్మసంకల్పం మూలంగానే ప్రకృతి జగద్రూపములో పరిణమిస్తుందని ఉపనిషత్తులు స్పష్టంగా వర్ణిస్తున్నాయి.
వివరణ :- శబ్దమూలక సిద్ధాంతం కేవలం తర్కగమ్యం కాకపోవచ్చును. కేవలం తర్కం అంగీకారం కాదు. సర్వము శృతి మూలకమే. బ్రహ్మం వేద ప్రమాణమైనది. కాబట్టి ఆ దోషం అంటదు.
ముండకోపనిషత్తు (1,1,8, ) బ్రహ్మ సంకల్పం వలన ప్రకృతి పరిణమించి మహదాది రూపాన్ని పొందుతుంది. ఇందులో తపః అంటే సంకల్పగర్జితమైన పర్యాలోచనాత్మక జ్ఞానం, ఇలాంటి శబ్దమూలక సిద్ధాంతం కేవలం తర్కానికి అందదు. పురుష బుద్ధి అల్పం. తర్కం అలాంటి బుద్ధే. ఒక్కోసారి సూక్ష్మవిషయాలు తర్కగమ్యం కాకపోవడం వింతేమీ కాదు. వేదం తర్క నిర్ణయానికి కట్టుబడదు. శబ్ద బ్రహ్మ సంకల్ప పూర్వకంగా జగద్రూపం పరిణమించేటట్లు చేసి, తాను ఇంకా మిగిలి ఉంటాడని చెబుతోంది. కృత్స్నం అంటే సంపూర్ణం. ఇందులో ఒక భాగమే.. ఏక దేశం.. అంశం.
కఠోపనిషత్తు :- మహదాది జగద్రూపంలో ప్రకృతి పరిణమిస్తుంది. ఆ ప్రకృతిలోని ప్రళయంలో జగత్తు లయమౌతుంది. ప్రకృతే లేని పక్షంలో లయమౌతుంది అని చెప్పారు కదా ! అందువల్ల సంకల్ప మాత్రంతో బ్రహ్మ జగత్తును నిర్మిస్తాడనటం నిర్దుష్టమే.
ఛాందోగ్యోపనిషత్తు :- శుద్ధ బ్రహ్మ, కార్య బ్రహ్మ కన్నా గొప్పది. పాంచభౌతిక మైన జగత్తంతా శుద్ధ బ్రహ్మ యొక్క ఒకపాదమే. మిగిలిన మూడుపాదాలు గల అమృతస్వరూపమైన బ్రహ్మఇదే. ఆపురుషునికి బయటా లోపలా కూడా ఉన్న ఆకాశం ఒకటే అని చెప్పబడింది. బ్రహ్మానికి వేద ప్రమాణమున్నది.అందుచేత వారు చెప్పే దోషం బ్రహ్మకు అంటదు. శృతి వలన బ్రహ్మం నుండి జగత్తు పుట్టింది అనీ, కార్యం కంటే వేరుగా బ్రహ్మ ఉన్నదని వినబడుచున్నది. ప్రకృతి వికారాలు వేరు వేరుగా చెప్ప బడుచున్నాయి. శ్రుతులు కూడా ఈ విషయమే చెబుతున్నాయి. అట్లే బ్రహ్మ హృదయంలో ఉంటాడని సుషుప్తిలో జీవుడు సత్తులో అంటే బ్రహ్మలో సంపన్నుడౌతాడని చెప్పబడింది. మొత్తం బ్రహ్మఅంతా కార్యరూపం వినియోగించబడిపోతే అప్పుడు సుషుప్తికి సంబంధించి అనుపపన్నం అవుతుంది. ఎందుకంటే కార్యరూపంలో ఉన్న బ్రహ్మ నిత్యమూ ఉపపన్నమయే ఉండాలి. అవికృతమైన బ్రహ్మ మిగిలి లేదు. అట్లే బ్రహ్మ ఇంద్రియగోచరం కాదు అని చెప్పబడింది. వికారం ఇంద్రియ గోచరం కుదురుతుంది కదా! మొత్తం బ్రహ్మ కార్యరూపంలో పరిణామం చెందిన పక్షంలో కార్యరూపమైన ఆ బ్రహ్మ ఇంద్రియాలకు గోచరం అవుతూనే ఉంటుంది. అలాంటప్పుడు బ్రహ్మ ఇంద్రియగోచరం కాదు అని చెప్పడం అర్ధరహితం కదా ! దీనిని బట్టి కార్యరూపం లోనే కాక ఇంకా బ్రహ్మ ఉన్నది అని తెలుస్తోంది. శృతిలో బ్రహ్మ నిరవయవం అని వినబడుచున్నది.బ్రహ్మ శబ్దమయం. శబ్దమే ప్రమాణంగా కలది. శబ్దం ఎలా చెబితే అలా చెయ్యాలి. అదే అంగీకరించాలి.
సూత్రం :- 162
''ఆత్మని చైవం విచిత్రాశ్చహి'
చ :- సంకల్ప ప్రభావ వైచిత్య్రంలో అసంభవం ఏమి లేదు,. హి :-దీనికి కారణం, ఆత్మని :- పరమాత్మలో,
ఏవం :- ఇలాంటి, విచిత్రాః :- విచిత్ర ప్రభావాలు, నానావిధ శక్తులు ఉండటమే.
భావం :- బ్రహ్మ సంకల్ప ప్రభావం వలెనే ఇలా జరుగుతుంది. దీనికి కారణం బ్రహ్మలో విచిత్ర ప్రభావాలు, నానావిధ శక్తులు ఉండటమే.
వివరణ:-బ్రహ్మలో ఇన్ని రకాల వస్తువులు సృష్టించడం వల్లే స్వప్నాన్ని చూసే ఆత్మలో కూడా అనేక రకాలైన సృష్టులు చెప్పబడ్డాయి. పరమాత్మ సంకల్ప ప్రభావం వల్లే ప్రకృతి మహదాది జగద్రూపం లో ప్రవర్తిస్తోంది. ఆ ప్రభావం ఎంతని ఎలా వర్ణించగలం? ఈ జగత్తంతా బ్రహ్మ యొక్క పరిణామమే. కాబట్టి స్వప్నప్రపంచం లాగా మాయతో కూడినది. ఈ జగత్తు బ్రహ్మ యొక్క ఉపాదాన కారణమే అయినప్పటికీ స్వప్నావస్తలో సాక్షి వంటివాడు. కాబట్టి అతనికి దోషాలు అంటావు. గారడీ వాడి రూపం నాశనం కాకుండానే అతడు సృష్టించిన అనేక వస్తువులు కనిపించినట్లుగానే బ్రహ్మలో కూడా ఈ విచిత్రసృష్టులు కనిపిస్తున్నాయి. ఒక బ్రహ్మలో స్వరూపానికి ఉపమర్ధం (స్వరూపానికి ఏ విధమైన పరిణామాది వికారం లేకుండా) అనేక విధాలైన సృష్టి జరుగుతోంది అని ఈవిషయంలో వివాదం చెయ్యవలసిన పనిలేదు. స్వప్నం చూస్తున్న ఒక ఆత్మలో దాని స్వరూపానికి ఉపమర్ధం ఏది లేకుండా అనేకానేక వస్తువుల సృష్టి జరుగుతోంది. లోకంలో దేవతలు, మాయావులు మొదలైన వాళ్ళ స్వరూపానికి ఉపమర్ధం లేకుండానే విచిత్రమైన సృష్టులు కనబడుతున్నాయి. అట్లే బ్రహ్మ ఒక్కటే అయినా కూడా దాని వ్యాపారానికి ఉపమర్ధం ఏది లేకుండానే అనేకానేకమైన సృష్టి జరుగుతోంది. ఆసమయంలో ఆయన స్వరూపానికి ఏ విధమైన మార్పులు, వికారములు లేకుండానే అనేక విధాలైన సృష్టి జరుగుతోంది.
సూత్రం :- 163
స్వపక్ష దోషాచ్చ
చ :- అంతే కాక, స్వపక్ష దోషాత్ :- పూర్వ పక్ష వాదనలో దోషం ఉంది.
భావం :- ప్రకృతి నిరవయవి అయినప్పటికీ అతని స్వరూపానికి ఏవిధమైన పరిణామాది వికారము లేకుండా అనేక విధాలైన సృష్టి జరుగుతోంది. ఈ విషయంలో వచ్చిన వాదనలో దోషం ఉన్నది. ప్రకృతి అవయవి, నిరవయవి అనే వాదం లేపి శంక వెలిబుచ్చడంలోనే దోషాలున్నాయంటున్నాడు మహర్షి.
వివరణ:-ఈదోషం సాంఖ్యులు చెప్పే మతంలోకూడా ఉన్నది. సాంఖ్యులు ప్రధానాన్ని అంటే ప్రకృతిని జగత్కారణంగా చెబుతారు. ఆ ప్రధానం కూడా నిరవయం అపరిఛిన్నము. అది సావయవము, పరిచ్చిన్నము అయినా జగత్తుకు కారణం అవుతోంది. ఒకే దోషం అన్ని మతాలలోను ఉంది. కాబట్టి దానిని లెక్కించనవసరం లేదు. ఈజగత్తుకు బ్రహ్మ ఉపాదాన కారణమే. జగత్తువలన బ్రహ్మ పరిపూర్ణతకు బాధ్యత లేదు. సాంఖ్యులు. వైశేషుకులు మొదలైన ప్రతివాదుల పక్షాలలో కూడా దోషాలున్నాయి. కనుక బ్రహ్మవాదిని ఆక్షేపించవలసిన పనిలేదు. సాంఖ్యులు ప్రధానం నిరవయవం అనే సిద్ధాంతాన్ని అంగీకరించడం లేదు కదా! ప్రధానంలో సత్వ రజస్తమో గుణాలు అనే 3 గుణాలున్నాయి. వాటి సామ్యావస్థయే ప్రధానం. ఆ అవయవాలచేత ప్రధానం సావయవమే కదా ! అనేది ప్రశ్న. ఈ విధమైన సావయత్వం చేత ప్రాకృతమైన దోషం నివారించడం శక్యంకాదు. ఎందువలనా అనగా సత్వ రజస్తమో గుణాలలో ఒక్కొక్కటి నిరవయవం అనే విషయం సమానమే కదా! మిగిలిన రెండు గుణాలచేత అనుగ్రహింపబడిన ఒక్కొక్క గుణం తనకు సజాతీయమైన ప్రపంచానికి ఉపాదానం అని వాళ్ళు అంగీకరిస్తారు.ఈ విధంగా నిరవయత్వాన్ని సాధించే తర్కం నిలవదు.కనుక గుణాలు సావయవాలే అని అంగీకరిస్తే అప్పుడు గుణాలు ప్రధానము కూడా నిత్యం అని చెప్పవలసి వస్తుంది. అట్లు గాక కార్యవైచిత్ర్యన్ని బట్టి వివిధ శక్తులున్నాయి అని ఊహిస్తాము. ఆ ఒక్కటే అవయవాలు అని చెప్పబడుతున్నాయి. కానీ నిజానికి అవయవాలు అంటూ ఏమి లేవు. ఉన్నట్లయితే అలాంటి శక్తులు బ్రహ్మలో కూడా అనేకం ఉన్నాయి. దానిచేత వివిధ కార్యోత్పత్తి జరుగుతోంది. వాస్తవంలో బ్రహ్మ నిరవయవమే అని బ్రహ్మ వాది అంగీకరిస్తాడు.
సర్వోపేతాధికరణం ..( 2, 1, 30 )
సూత్రం 164 ..
సర్వపేతాచ తద్దర్శనాత్
చ..అంతేకాక, తద్దర్శనాత్.. అనేక శక్తిమంతం అని వర్ణించే మంత్రాల వల్ల, సర్వపేతా ..బ్రహ్మానికి అనేక శక్తులున్నాయని తెలుస్తోంది.
భావం.. అనేకమంత్రాల వలన బ్రహ్మానికి అనేక శక్తులున్నాయని తెలుస్తోంది.
వివరణ .. గురువుగారూ! బ్రహ్మ విచిత్రమైన కార్యశక్తి గలది అని చెప్పారు కదా, ఆ విషయం ఎలా తెలుస్తుంది అని అడిగాడు కృష్ణశర్మ. దానికి సమాధానం చెబుతున్నాడు. వేదాలలో పరదేవతా శక్తి సంపన్నమైనది అని చెప్పబడింది. ఛాందోగ్యోపనిషత్తు..పరమాత్మ స్థూల, సూక్ష్మ రూపాలు లేనివాడు. చైతన్య స్వరూపుడు. సత్య సంకల్పుడు. సర్వవ్యాపి, సమస్త కర్మలు స్వరూపంగా కలవాడు. సర్వకాముడు, సమస్త గంధములు, రసములుగలవాడు. జగత్తును వ్యాపించి ఉండేవాడు అని చెప్పబడింది.
బృహదారణ్యకం ..యాజ్వవల్కుడు గార్గికి సమాధానం చెబుతూ బ్రహ్మ యొక్క శాసనం వలెనే సూర్యచంద్రులు తమ యొక్క స్థానాలలో ఉన్నారు అని చెప్పాడు.
ముండకోపనిషత్తు:- పరబ్రహ్మ స్వయం ప్రకాశి, నిరాకారుడు, బాహ్యాంతరాలలో ఉండేవాడు. పుట్టుక, ప్రాణము లేనివాడు అని చెప్పబడింది.కాబట్టి బ్రహ్మకు విచిత్రమైన కార్య శక్తి ఉన్నది. పరదేవత సమస్త శక్తులతో ఉన్నట్లు శృతిలో చెప్పబయినది. మాయాశక్తిగల బ్రహ్మ నుండి జగత్తు పుట్టినది అని చెప్పే సమన్వయానికి శరీరం లేనివానికి మాయ సంబంధం ఉండదు అనే న్యాయంతో విరోధం ఉందా లేదా అనే సందేహం .పూర్వ పక్షంలో విరోధం ఉందని చెప్పారు. బ్రహ్మ ఒక్కటే అయినా దానిలో విచిత్రమైన శక్తులు ఉండటం వలన విచిత్రమైన కార్యప్రపంచాన్ని సృష్టించడం ఉపపన్నమే అని చెప్పబడింది. అయితే బ్రహ్మ విచిత్రమైన శక్తి గలది అని ఎలా తెలుస్తుంది. ఆ పరదేవత సర్వ శక్తి యుక్తమైనది. వాగీన్ద్రియము లేనిది, కోరికలు లేనిది, ఈ విధమైన శృతి బ్రహ్మకు సర్వ విధ శక్తులతో సంబంధాన్ని చూపుతున్నది.
సూత్రం :- 165
'వికరణత్వాన్నేతి చేత్త దుక్తం '
వికారణత్వాత్ :- ఇంద్రియాదులు లేకపోయినా బ్రహ్మం గొప్ప శక్తిమంత మైనవాడు, నీతిచెత్ :- బ్రహ్మం జగత్కారణం కాదనే వాళ్లకు, తుదుక్తం :-ఇది వరకే సమాధానం చెప్పారు.(2, 1,7 )
భావం :- ఇంద్రియాలు లేకపోయినా బ్రహ్మం గొప్ప శక్తి మంతుడైనవాడు. బ్రహ్మ జగత్కారణం కాదనే వాళ్లకు ఇది వరకే సమాధానం చెప్పబడింది.
వివరణ:- బ్రహ్మకు ఇంద్రియాలు లేవు. నిరాకారుడు నిరవయవుడు అని చెప్పబడింది. అలంటి బ్రహ్మ జగత్తును ఏ విధంగా ఉత్పత్తి చేస్తాడు అనేదే వారి ప్రశ్న. బ్రహ్మ నిరాకారుడే అన్న మాట నిజమే. అవయవాలు లేనివాడు. అయినప్పటికీ సర్వజ్ఞుడు. సర్వ శక్తిమంతుడు.
ముండకోపనిషత్తు :- పరబ్రహ్మ స్వయంప్రకాశి. నిరాకారుడు బాహ్యఅంతరాల్లో ఉండేవాడు. పుట్టుక, ప్రాణము లేనివాడు. బ్రహ్మకు ఇంద్రియాలు లేవు. నిరాకారుడు, నిరవయవుడు అని చెప్పబడింది. అలాంటి బ్రహ్మ జగత్తును ఏవిధముగా ఉత్పత్తి చేస్తాడు. అని వారి ప్రశ్న. బ్రహ్మ నిరాకారుడనే మాట వాస్తవమే. అవయవాలు లేని వాడు. అయినా సర్వజ్ఞుడు సర్వ శక్తిమంతుడు. చేతనులైన దేవాదులు సర్వశక్తులు ఉన్నవారైనా కూడా దేహేంద్రియాలతో కూడి ఉండి మాత్రమే ఆయా కార్యాలు సాధించడానికి సమర్ధులై ఉన్నారని తెలుస్తోంది. అతి గంభీరమైన ఈ బ్రహ్మ శ్రుతి సహాయంతో తెలియదగినదే కానీ, తర్కం చేత తెలియదగినది కాదు. ఒకని సామర్ధ్యం ఎలా ఉందో, ఇతరుల సామర్ధ్యం కూడా అలాగే ఉండాలని నియమం ఏమి లేదు. దేహేంద్రియాలు లేకపోయినా బ్రహ్మకు సర్వ సామర్ధ్యాలు ఉన్నాయి అని చెప్పబడింది. కాబట్టి బ్రహ్మకు విచిత్రమైన కార్యశక్తి ఉన్నది. బృహదారణ్యకంలో యాజ్ఞవల్కుడు గార్గికి సమాధాం చెబుతూ బ్రహ్మ యొక్క శాసనం వలెనే సూర్యచంద్రులు తమ స్థానాలలో ఉన్నారు అని చెప్పాడు.
ప్రయోజనవత్త్వా ధికరణం :- ( 2,1,32 )
సూత్రం :- 166 :
"న ప్రయోజనవత్వాత్ "
ప్రయోజన వత్వాత్ :- చేతన ప్రవృత్తికి ప్రయోజనం ఉంటుంది. కనుక, న :- బ్రహ్మ జగత్కారణం కాదు.
భావం :- చేతనమైన ప్రవృత్తికి ప్రయోజనం ఉంటుంది. బ్రహ్మకు సృష్టి చెయ్యడంలో ప్రయోజనం ఏముంటుంది? అందుకే బ్రహ్మ జగత్కారణం కాదు అని వారి వాదన.
వివరణ :- ప్రవృత్తి అనేది ప్రయోజనాన్ని ఆశించి ఉంటుంది. పరబ్రహ్మ నిత్యతృప్తుడు. అందుచేత ప్రయోజనం ఉండదు. అంటే ఈజగమంతా బ్రహ్మచేతనే సృష్టింపబడుతోంది. ఎవరు ఏపని చేసినా కొంత ప్రయోజనం ఉంటుంది. బృహదారణ్యకంలో యాజ్ఞవల్కుడు మైత్రేయికి ఈవిషయమే చెబుతాడు. ప్రయోజనం లేనిదే ఎవరు ఏ పని చెయ్యరు. మరి బ్రహ్మ ఏ ప్రయోజనం ఆహించి ఈసృష్టి చేశాడు? అన్నదే ప్రశ్న లోకంలో ప్రాణుల ప్రవృత్తికి ఒక ప్రయోజనం ఉంటుంది. మందబుద్ధి ఉన్నవాడు కూడా ప్రయోజనం లేనిపని చెయ్యడు. ఆలోచించి కార్యం చేసే వాడి ప్రవృత్తి ఎన్నడూ నిష్ప్రయోజనం కాదు. ప్రాణి ప్రవృత్తి వలన కలిగే ప్రయోజనం తనకైనా పరులకైనా సంబంధించి ఉంటుంది. పరమాత్మకు స్వప్రయోజనం ఉందనడానికి వీలు లేదు. పరబ్రహ్మ నిత్యతృప్తం, ఆనందస్వరూపం పరిపూర్ణం. ఆయనకు కావలసిన ప్రయోజనం ఏమిటి? బ్రహ్మంలో జగద్రచన ప్రవృత్తి పరప్రయోజనం కొరకు అని అనడం కూడా పొసగడం లేదా? పరుల కోసం అన్నప్పుడు, సృష్టికి పూర్వం పరులు ఎవరుంటారు? పరులను అనుగ్రహించడం కోసమే అయితే ఈ సృష్టి ఇంత దుఃఖమయంగా ఎందుకు ఉన్నది, అందుకే జగద్రచన అనుగ్రహ కారణం కాదు. అందువల్ల జగజ్జన్మాదులకు కారణం బ్రహ్మం అనడం సమంజసం కాదు అనేదే పూర్వ పక్ష వాదన .
సూత్రం :- 167
"లోకవత్తు లీలా కైవల్యం"
తు :- అది సరి కాదు. లోకవత్ :- ఈ లోకంలో మనం చూస్తున్నట్లుగా, లీల కైవల్యం :- ఇది కేవలం ఆయన లీల మాత్రమే.
భావం :- జగత్తు చేతనమైన బ్రహ్మచే సృష్టించబడలేదు. ఆయన జగద్రష్ట కాదు అనే సంశయం సరియైనది కాదు. ఈ సృష్టి అంతా ఆయన లీల మాత్రమే.
వివరణ :- ఈ లోకంలో రాజులు, ధనికులు ఏ ప్రయోజనం లేకపోయినా విలాసార్థం నృత్యం, గానం లాంటి కళలను ఏర్పాటు చేస్తారు. అలాగే నిత్యతృప్తం ఆనందమయమైన బ్రహ్మం స్వప్రయోజనం లేకపోయినా విలాసార్ధంగా జగజ్జన్మాదులకు నిమిత్తం అవుతున్నాడు. ఇక్కడ ఒక సందేహం కలుగుతుంది. జగత్ సృష్టి విలాసార్థం ఎలా అవుతుంది? ఈలోకంలో కొందరు సుఖాన్ని, కొందరు ఎంతో దుఃఖాన్ని, మరికొందరు సుఖదుఃఖాలు రెండింటిని అనుభవిస్తుంటారు. ఇలా సుఖదుఃఖా లను అనుభవించేటట్లు జగత్తును రచించిన బ్రహ్మప్రవృత్తి విలాసార్థం ఎలాఅవుతుంది ? లోకంలో ఒకరి ప్రవృత్తి వల్ల వేరే వాళ్లకు సుఖదుఃఖాలు కలిగితే అలాంటి వాడి ప్రవృత్తి రాగద్వేషాలతో కూడుకొని ఉంటుంది. అలాగే బ్రహ్మం ప్రవృత్తి వలన ప్రాణులకూ విషయరూపంలో సుఖదుఃఖాలు కలుగుతున్నాయి. కనుక ఆప్రవృత్తి వైషమ్యానికి, నిర్దయకు చెందినదై దోషయుక్త మవుతుంది. బ్రహ్మంలో రాగద్వేషాలు ఉన్నాయనడం ఉచితంగా లేదు. అందుచేత జగత్ కారణమైన బ్రహ్మం విలాసార్ధం అనడం సమంజసం కాదు. లోకంలో అన్ని కోరికలు తీరిన రాజుగానీ, అమాత్యుడుగానీ, ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా క్రీడావిహారాలలో కేవలం లీలారూపంగా ప్రవర్తిస్తారో, బాహ్యమైన ప్రయోజనాన్ని దేనిని ఆపేక్షించకుండా ఉచ్చ్వాసనిశ్వాసలు స్వభావం చేత ఏవిధంగా జరుగుతాయో, అదే విధంగా ఈశ్వరుడు కూడా ప్రయోజనాన్ని ఆపేక్షించ కుండా స్వభావం చేతనే కేవలం లీలారూపము నందు ప్రయోజనం ఏది కల్పించడం కుదరదు కదా! ఈ జగ్దబింబ నిర్మాణం మనకు చాల గొప్ప సంరంభం నిర్వహించవలసినట్లు కనబడినా, అపరిమిత శక్తికల పరమేశ్వరునికి ఇది లీల మాత్రమే. లోకంలో రాజులకు ప్రయోజనం ఉంటుందేమో గానీ, పరమాత్మ విషయంలో కొంచెం కూడా ప్రయోజనం ఉండదు. పరమేశ్వరుడు సత్య కాముడు, సర్వజ్ఞుడు ఏ అపేక్ష లేకుండానే ఈ సృష్టి చేస్తున్నాడు.ఈ జగత్తంతా ఈశ్వరుని లీల.
వైషమ్య నైర్ఘృణ్యాధికరణం ( 2,1,34 )
సూత్రం :- 168
'వైషమ్య నైర్ ఘృణ్యేన సాపేక్షత్వాత్ తథా హి దర్శయతి"
వైషమ్య :-అసమత్వం, నైర్ ఘృణ్యే :- నిర్దయత, ఈ రెండు సాపేక్షత్వాత్.. సాపేక్షికలు కావడం వలన, ఇవి న :- జగత్ కర్త అయినా బ్రహ్మానికి అంటవు. తథాహి దర్శయతి :- అని శబ్దం ప్రతిపాదిస్తున్నది.
భావం :- అసమత్వం, నిర్దయత సాపేక్షికాలు కావడం వలన ఇవి బ్రహ్మానికి అంటవు.
వివరణ :- గురువుగారు ! పరమాత్మ ప్రాణులను వారివారి కర్మలను బట్టి సృష్టిస్తున్నాడా లేదా? కర్మలను బట్టి సృష్టిస్తే సృష్టి కర్మాధీనమౌతుంది. అలాకాకుండా అంటే కర్మలను పరిగణించకుండా సృష్టిస్తున్నాడు అంటే బ్రహ్మకు పక్షపాతం అంటుకుంటుంది. ఎందుకంటే పశువులు, పక్షులుగా పుట్టిన ప్రాణులు హింసింపబడుతున్నాయి. దేవతలు విలాసవంతులు, ఈవిషయాన్నీ వివరించండి అన్నాడు నారాయణభట్టు. సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. పరమేశ్వరునికి పక్షపాతం, నిర్దయత్వం అనే లక్షణాలు దోషాలు లేవు. జీవులను కర్మానుసారమే సృష్టిస్తాడు. ఇలా చెయ్యడం వలన సృష్టి కర్మాధీనమౌతుంది. అనీశ్వరత్వం కలుగుతుంది. అనే మాట తప్పు. పరబ్రహ్మ జీవుల ధర్మాధర్మాలను అనుసరించి సాపేక్షమై ఈ విషమసృష్టి నిర్మాణం చేస్తున్నాడు. పరమేశ్వరుడు మేఘం వంటివాడు. అన్ని పంటలకు వర్షాన్నిస్తాడు. ధాన్యంలో ఉండే తేడా ఆ విత్తనలోనే ఉంది. భగవద్గీతలో చెప్పినట్లుగా పరమేశ్వరుని ఎవరు ఏ విధంగా సేవిస్తారో వారికీ ఆ విధమైన ఫలమే వస్తుంది. బృహదారణ్యకోపనిషత్తు :- ( 3,2,13) జీవులు తాము చేసే కర్మలకు తగ్గట్టుగా సుఖదుఃఖాలను అనుభవించడానికి శరీరాన్ని పొందుతారు. ఈశ్వరుడు చేసిన జగన్నిర్మాణంలో జీవులు కర్మలు చెయ్యాలని ఆక్షేపిస్తే ఆయన ఐశ్వర్యానికి ఏ లోటు కలుగదు. జీవులు చేసే పుణ్యపాపాలకు తగిన ఫలాన్ని, తగిన కాలంలో అనుభవించేటట్లు చేయడం వలన ఆయన స్వామిత్వానికి ఏభంగము వాటిల్లదు. రాజు రాజ్యపాలన చేస్తూ దోషుల్ని దండిస్తూ మంచివాళ్లను అనుగ్రహిస్తాడు. అలాగే బ్రహ్మం కర్మానుగుణంగా జగన్నిర్మాణం చేస్తాడు. విషమం, విచిత్రం అయిన ఈ జగత్తును బ్రహ్మం విలాసంగా నిర్మించడు. జగన్నిర్మాణం సాపేక్షమే కానీ నిరపేక్షణం కాదు. ఈశ్వరుడు జగత్తును ప్రాణుల కర్మ ఫలాలను అనుగుణంగా నిర్మిస్తాడు. ప్రాణులుచేసే కర్మలు, పుణ్యాలు, పాపాలు వీటికి ఫలితాలు, సుఖదుఃఖాలు. వీటిని అనుభవించడానికి ఈజగన్నిర్మాణం. అందువలన వైషమ్య నైర్ ఘృణ్యాలు ఆయనకు అంటవు. జీవులు అనుభవించే సుఖదుఃఖాలకు కారణం వాళ్ళు చేసిన కర్మలే. బ్రహ్మం కాదు. బ్రహ్మానికి ఏ దోషాలతో సంబంధం లేదు.
సూత్రం :- 169
'న కర్మ విభాగాదితి చేన్నా నాదిత్వాత్'
అవిభాగాత్ :- బ్రహ్మంలో జీవులు అవిభాగరూపంలో ఉన్నందువలన, న ఇతి చేతి:- సృష్టికి పూర్వం ప్రాణి కర్మలు ఉండవు అనడం, న :- సరి అయినది కాదు. ఎందుకంటే అనాదిత్వాత్ :- జగత్తు లాగా ప్రాణి కర్మలకు ఆది అనేది లేదు.
భావం :- బ్రహ్మంలో జీవులు అవిభాగ రూపంలో ఉన్నందు వలన సృష్టికి పూర్వం ప్రాణికి కర్మలు ఉండవు అనడం సరి అయినది కాదు.
వివరణ :- సృష్టికి పూర్వం ఏ విధమైన భేదము లేదు. కాబట్టి కర్మ అనేది లేదు. అలాంటప్పుడు ఈ విషమ సృష్టి ఎలా జరిగింది అనేదే ప్రశ్న. దీనికి సమాధానం సంసారమనేది అనాది అయినది. బీజాంకురముల లాగా సృష్టి కర్మలకు కార్యాకారణ భావం ఉంది. అందుచేత కర్మను అనుసరించే సృష్టి జరిగింది. ప్రళయం జరిగినప్పుడు కర్మ పరిపక్వం కాని జీవులు తమ కర్మను తమతో మూటకట్టుకొని, పరమేశ్వరునిలో లీనమైనవి. మళ్ళీ సృష్టి జరిగినప్పుడు తమ కర్మానుసారం జన్మిస్తాయి.
ఐతరేయోపనిషత్తు :- (1,1) ప్రళయ కాలంలో బ్రహ్మం తప్ప వేరే ఏమి ఉండదు. భోక్తృ, భోగ్య రూపమైన జగత్తంతా బ్రహ్మంలో అవిభక్తమై ఉంటుంది. అందువల్ల ప్రాణులు, ప్రాణుల కర్మలు ఇవి వేరుగా ఉండవు. కనుక ఈ జగత్తంత ప్రాణి కర్మలు అనాదులే. ప్రళయం కాలంలో ప్రాణులు చేష్టలు లేకుండా ఉంటాయి. వాళ్ళని ఆశ్రయించిన కర్మలు అలాగే ఉంటాయి. సూక్ష్మ రూపంలో ఉన్న కర్మలకు అనుగుణంగానే బ్రహ్మ ఈ జగత్తును సృష్టిస్తాడు. అందుచేత కర్మాపేక్షమైన జగన్నిర్మాణంలో దోషం లేదు. కాగా కర్మ అనేది జన్యం కాదా! అది అనాది ఎలా అవుతుంది? కర్మ అనేది అనాది అని ఎక్కడ ఉంది అన్నారు. కర్మ చేస్తేనే శరీరాది విభాగం ఏర్పడుతుంది. విభాగం కంటే పూర్వం నిమిత్తమైన కర్మ లేదు కనుక మొట్ట మొదట సృష్టి ఈ వైషమ్యాలు లేకుండా ఒకే విధంగా ఉండాలి అన్నట్లయితే ఏ దోషం లేదు. ఎందువలననగా ఈ సంసారం అనాది, సంసారానికి ఆది అనేది ఉండి ఉంటే ఈ దోషం ఉండేది. కానీ అనాది అయిన సంసారం లో కర్మ, సృష్టి వైషమ్యం కూడా బీజాంకురాల వలె మరో జన్మకు కారణమౌతాయి. విత్తు ముందా చెట్టు ముందా అనే సమస్య వలెనే కర్మ ముందా సంసారం ముందా అంటే చెప్పలేం. హేతువైన కర్మ, హేతువు వలన ఏర్పడిన సంసారం కూడా అనాదిగా వస్తున్నాయి అని అర్ధం.
సూత్రం :- 170 '
" ఉప పద్యతే చాప్యుపలభ్యతే చ"
చ :- కాగా, ఉపపద్యతే :- కర్మ అనాది అనడం హేతుభద్ధమే, అపి ఉపలభ్యతే చ :- కర్మ అనాది అని శాస్త్రల్లో చెప్పారు కదా!
భావం :- కర్మ అనాది అనీ, హేతుబద్ధమనీ శాస్త్రల్లో చెప్పారు కదా!
వివరణ :- సృష్టి అనేది చాలా కాలం నుంచి జరుగుతున్నది. చెట్టు లేనిదే విత్తు లేదు. విత్తు లేనిదే చెట్టు లేదు. అలాగే కర్మ లేనిదే జన్మ లేదు. జన్మ లేనిదే కర్మ లేదు. ఈ రెండు ఒకదాని కొకటి ఆశ్రయించుకొని ఉంటాయి.
ప్రశ్నపనిషత్తు :- ప్రజాపతి సంతానాన్ని పొందాలనే కోరిక గలవాడై తప్పస్సు చేశాడు. ఇక్కడ తపస్సు అంటే పూర్వ కాలంలో తాను చేసిన సృష్టిని ధ్యానించడం. కాబట్టి సృష్టి వెనుకటి కల్పంలో లాగానే జరిగింది. ఈ సృష్టిలో బ్రహ్మకు ఏ విధమైన పక్షపాతము లేదు. జీవులన్నీ తమ కర్మానుసారమే ఉద్భవిస్తాయి. కర్మ అనేది అనాది కాని పక్షంలో ప్రపంచం నిర్వేతుకం, ఆకస్మికం అవుతుంది. జగత్తులోని వైచిత్య్రానికి బ్రహ్మ కారణం అనుకుంటే, బ్రహ్మానికి వైషమ్య, నైర్ఘృణ్యదోషాలు కలుగుతాయి. ఇవి ఒకవేళ నిర్వేతుకం అనుకుంటే నేరం చెయ్యకుండానే దండన లభించినట్లు అవుతుంది. అందువలన జగత్తు సృష్టికి కర్మ హేతువు. దానితో కర్మ అనాది అని సిద్ధమవుతున్నది. ప్రకృతి ,జీవుడు, ఈశ్వరుడు ఈ మూడు తత్త్వా లు స్వరూపంలో అనాదులు. కర్మ , జగత్తు ఈ రెండూ ప్రవాహరూపంలో ఆనాదులు.
సాంఖ్యశాస్త్రము:-(6, 41) కర్మ వైచిత్య్రం వల్లే సృష్టి వైచిత్య్రం అని సాంఖ్య స్మృతి. జీవునితో బాటు కర్మలు, జగత్తు అనాదులే. ఈ విచిత్రజగద్రచనకు ఒక్క కర్మనే బ్రహ్మం ఆపేక్షిస్తుందా? మరి ధర్మాధర్మలు వాటి వాసనల మాట ఏమిటి? ఇవి జీవ ధర్మాలు కావా? అవి కూడా అనాదేనా? అని సందేహం. దీనికి సమాధానం తరువాత సూత్రంలో చెప్పబడింది. ఈ సంసారం అనాది అని ఎలా తెలుస్తుంది. సంసారానికి ప్రారంభం ఉంటే అది ఎప్పుడో ఒకనాడు అకస్మాత్తుగా పుట్టిందని చెప్పాలి. అలాగైతే ముక్తులు కూడా మళ్ళీ సంసారంలో పుట్టడం జరుగుతుంది. సుఖదుఃఖాల వైషమ్యానికి నిమిత్తం ఏది లేకపోవడం చేత ఏమి చేయకుండానే ఫలం కలగడం అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా జ్ఞానకాండ, కర్మకాండ వ్యర్థమౌతాయని భావం. సుఖ దుఃఖాది వైషమ్యానికి ఈశ్వరుదే హేతువు అనడం యుక్తం కాదు. అవిద్యా కారణం కాదు. ఎందుకంటే అవిద్య అందరి విషయంలో ఒకేలా ఉంటుంది. రాగద్వేషాలు, మోహం, వాసనల చేత చేయబడిన కర్మలకు అవిద్య వైషమ్యాన్ని కలిగించ వచ్చును. కర్మ లేకుండా శరీరం ఉండదు. శరీరం లేకుండా కర్మ సంభవించదు. శరీరం ఉంటే సంసారబంధం తప్పదు. సంసారం అనాది అని స్మృతులలో చెప్పబడింది. సృష్టి ప్రారంభంలో శరీరంతో సంబంధించిన ఆత్మకు ప్రాణధారణ కోసం పరబ్రహ్మ జీవుడిలో ప్రవేశిస్తాడు. ప్రాణాలు, ప్రాణధారణం చేసే జీవాత్మ కూడా అనాదులే.
సర్వ ధర్మోప పత్త్యధికరణం ( 2,1,37)
సూత్రం :- 171
' సర్వ ధర్మోపపత్తేః చ '
చ :- అలాగే, సర్వ ధర్మ :- జీవాత్మకు సంబంధించిన ధర్మాలన్నింటిలో, ఉపపత్తేః :- అనాదిత్వం సిద్ధిస్తుంది.
భావం :- కర్మ అనాది అని శాస్త్రల్లో చెప్పినట్లుగానే జీవాత్మకు సంబంధించిన ధర్మాలన్నింటిలో అనాదిత్వం సిద్ధిస్తుంది.
వివరణ:- ప్రవాహరూపంలో కర్మ ఎలాగ అనాదో జగద్రచనకు వాసనలు సైతం జీవుడి ధర్మాలే. ఇవన్నీ జగద్రచనకు సహకార కారణాలు. కార్యం అయిన జగత్తు ప్రవాహం రూపంలో అనాది అయినప్పుడు, కార్యరచనకు కావలసిన కారణములు అనాదే. కార్యకారణములు ఒకే కాలంలో ఉండాలి. సర్వశక్తిమంతుడైన పరబ్రహ్మం జగత్తును సృష్టించడానికి కావలసిన కర్మాది సాధనాలు కర్మ, జీవ ధర్మాలు, వాసనలు కారణమౌతాయి. ఈపాదంలో బ్రహ్మ జగత్ కారణమని అని అనడంలో ఏర్పడే స్మృతివిరోధాన్ని, తర్కవిరోధాన్ని వ్యాసుడు పరిహారించాడు. జగత్తును సృష్టించడానికి కావలసిన సర్వజ్ఞత్వము, జగత్ కారణత్వము, సర్వశక్తిత్వం అనే సమస్త ధర్మాలు పరబ్రహ్మకున్నాయి. కాబట్టి ఈ జగత్తును సృష్టించడానికి కారణం ఆ బ్రహ్మ తప్ప వేరేవారు కాదు. బ్రహ్మ నిర్గుణమే అయినా దానికి ఉపాదానకారణానికి ఉండవలసిన ధర్మాలన్నీ ఉన్నాయి. చేతనమైన బ్రహ్మ జగత్తుకు కారణం. అదే ప్రకృతి కూడా జగత్తుకు కారణమని చెప్పబడిన వేదార్ధం విషయంలో ఇతరులు చూపిన దోషాలను ఆచార్యుడు పరిహరించాడు.
రచనాను పత్త్యధికరణం :- ( 2, 2, 1)
సూత్రం :- 172
"రచనానుప పత్తేశ్చ నానుమానమ్ "
రచన అనుపపాత్తేః :- జగత్ రచన సాధ్యం కానందున వలన, చ :-అలాగే, అనుమానం :- అనుమాన ప్రమాణం వలన తెలిసే ప్రధానం అంటే ప్రకృతి, న :- స్వతంత్రంగా జగద్రచనకు కారణం కానేరదు.
భావం :- ప్రధానమే ( ప్రకృతే ) జగద్రచనకు సాధ్యం కానందు వలన స్వతంత్రంగా సృష్టి రచన చెయ్యలేదు.
వివరణ :- జగజ్జన్మాదులకు ప్రకృతే స్వతంత్ర కారణం అని కొందరి వాదన. బ్రహ్మనికే జగత్తును సృష్టించే స్వభావం ఉందని ప్రకృతికి లేదని చెప్పడానికి ఏదైనా విశేష కారణం ఉందా? లేని పక్షంలో ప్రకృతి జగన్నిర్మాణానికి స్వతంత్ర కారణం కాదని ఎందుకు అనాలి? అని వీళ్ళ అభిప్రాయం. ప్రకృతికి ప్రధానం అని పేరు కూడా ఉంది. సృష్టి సమయంలో జగత్తును సృష్టించడం, ప్రళయకాలంలో జగత్తును ప్రకృతి తనలో లీనం చేసుకుంటుంది. కనుక ప్రకృతిని ప్రధానం అన్నారు. అందువలన ప్రకృతే తన స్వభావాన్ని అనుసరించి జగత్తును నిర్మిస్తుందని బ్రహ్మం జగత్కారణం కాదని వారి వాదన. ఇది సరిఅయినది కాదు. ప్రకృతి చేతనం కాదు. రచన అంటే ఒక్కానొక ప్రయోజనాన్ని ఉద్దేశించి చేసే విన్యాసం నిర్మాణం. ఈఉద్దేశ్యం జడపదార్ధం ధర్మం కాదు. అది చేతనధర్మం. జడమైన ప్రకృతి ప్రయోజన పూర్వకంగా పదార్ధాలను తీర్చిదిద్దలేదు. అది చేతనత్వం ఉంటేనే సాధ్యమౌతుంది. అందువలన ప్రధానం చేతనాధిష్టితమై జగద్రచనకు ఉపాదాన కారణం అవుతోంది. బ్రహ్మకు చేతనత్వం నిరతిశయమైన జ్ఞాన, క్రియాశక్తి ఉన్నందునే జగద్రచనకు స్వతంత్ర కారణమవుతోంది. పురుషుడు తామరాకు మీద నీటి బొట్టులా ఉంటాడు. జగత్తుకు కారణం ప్రధానం. పురుషునికి భోగ వస్తువులను సమకుర్చడానికే ప్రధానం అనేక రూపాలలో సృష్టించబడింది. ఈజగత్తు సుఖము, దుఃఖం, మోహములతో కూడి ఉంది. సుఖం సత్వగుణం, దుఃఖం రజోగుణం, మోహం తమోగుణం, వీటినే త్రిగుణములు అంటారు. ఈజగత్తు త్రిగుణాత్మకమైనదని సాంఖ్యుల అభిప్రాయం. ఈ అనుమానప్రమాణం తోనే జగత్తుకు ప్రధానం ఉపాదాన కారణమని సాంఖ్యుల వాదన. ఇక్కడ ఈవాదన ఖండించబడుతోంది. ఈలోకంలో చేతనుడైన కుమ్మరి తన అధీనంలో ఉండే మట్టిని నానా విధములైన పాత్రలను తయారుచెయ్యడానికి ఉపయోగిస్తాడు. మట్టి లాగానే ప్రధానం కూడా స్వతంత్ర కారణం కానేరదు. రచనాశక్తి స్వాభావికంగా కానీ, నిమిత్తం వల్ల కానీ ప్రధానంగా ఉందనడానికి ప్రమాణాలేవి లేవు. ప్రధానం అచేతనము, జడము దానికి సృష్టించే శక్తి లేదు. అందువలన జగత్తు సృష్టికి కారణం పరబ్రహ్మమే కానీ ప్రధానం కాదు .
సూత్రం :- 173
" ప్రవృత్తే శ్చ "
చ :- అంతే కాక, ప్రవృత్తేః :- ప్రధానానికి ఏ ప్రవృత్తి లేదు.
భావం :- ప్రధానానికి ఏ ప్రవృత్తి లేదు. కనుక అది స్వతంత్ర కారణం కాదు.
వివరణ :- ఏదైనా కార్యాన్ని నిర్వహించడం కోసం చేసే క్రియను ప్రవృత్తి అంటారు. అలాంటి ప్రవృత్తి లేని ప్రధానం జగత్తును ఎలా రచిస్తుంది? జడపదార్ధానికి సంబంధం వల్లే ప్రవృత్తి కలుగుతుంది. స్వతంత్రంగా కలుగదు. చేతనపదార్ధనికే క్రియా ప్రవృత్తి ఉంటుంది. అచేతనానికి తెలివి, వేదన ఉండవు. అందువలన దానికి కార్యాకారణ విచారణ, ప్రవర్తన లేవు. శరీరంలో ఉండే చేతనానికి రధాన్ని ఎక్కాలనే ప్రవృత్తి ఉంటుంది. చేతనరహితమైన శవంలో అలాంటి ప్రవృత్తి ఉండదు. ప్రవృత్తి ఆచరణ వలన కూడా ప్రధానమనేది ఈ జగత్తుకు కారణం కాదు. ఎందుకంటే ఈ ప్రవృత్తి అనేది లోకంలో చేతనమైన వాటికే ఉంటుంది. అచేతనాలకు ప్రవృత్తి ఉండదు. ఒకవేళ ఈ జగత్తు కనుక అచేతనమైన ప్రధానం వలన సృష్టింపబడి ఉంటే మట్టిలో తయారైన కుండాలాగా, వస్త్రంలాగా ఏరకమైన చైతన్యం లేకుండా అలాగే పడి ఉండాలి. ప్రధానంలో సత్వరజస్తమో గుణాలుంటాయి. అవి సమంగా ఉన్నప్పుడే దానికి ప్రధానం అని పేరు. అప్పుడు సృష్టి ఉండదు. ఆగుణాల సామ్యావస్థ తొలగి వాటిలో ఒక గుణం అంగీ గాను, మిగిలినవి అంగాలు గాను ఏర్పడినప్పుడు విశిష్టమైన కార్యాన్ని పుట్టించడానికి అభిముఖమైన ప్రవృత్తి ప్రధానంలో కలుగుతుంది. కానీ ప్రధానం అచేతనం కనుక ఇలాంటి ప్రవృత్తి కలుగదు. అది కలిగితేనే జగద్రచన సాధ్యం. ఏ అచేతనంలో ప్రవృత్తి కనబడుచున్నదో, ఆ ప్రవృత్తి దానిదే కావచ్చును. అయితే అది చేతనం వలెనే జరుగుతుందని వారి భావన. కాల్చడం, ప్రకాశించడం మొదలైన వికారాలు కర్రలో ఉన్నాయి. కేవలం అగ్నిలో కనబడటం లేదు. అయినా కూడా అది అగ్ని వల్లనే కలుగుతున్నది. అది లేనప్పుడు కలగదు. వారి మతం ప్రకారం దేహదులతో కలసిన ఆత్మ కూడా కేవలం విజ్ఞానస్వరూపంగా మాత్రమే ఉంటుంది. అంత కంటే వేరు ప్రవృత్తి ఏమి ఉండదు. ప్రవృత్తి శూన్యమైన ఆత్మ కూడా అయస్కాంతం వలె ఇతరమైనవాటిని ప్రవర్తింపజేస్తుంది. అయస్కాంత మణి ఏ విధంగా తాను ఏ ప్రవృత్తి లేనిదైనా, ఇనుమును ప్రవర్తింపజేస్తుందో, అట్లే సర్వగతుడు, సర్వాత్మ, సర్వజనుడు సర్వశక్తి అయినా ఈశ్వరుడు కూడా తాను ఏ ప్రవృత్తి లేనివాడై నా సమస్తాన్ని ప్రవర్తింపాజేస్తాడు.
సూత్రం :- 174
" పయోంబు వచ్చేత్ తత్రాపి"
" పయః అంబువత్ :- పాలు నీళ్లలాగా, చేత్ :- ప్రధానానికి ప్రవృత్తి కలుగుతుందంటారా? తత్రాపి :- అక్కడ కూడా చేతన సంబంధం వల్లే ప్రవృత్తి కలుగుతుంది కదా!
భావం :- పాలు, నీరు వలె అచేతనమైన ప్రధానానికి ప్రవృత్తి కలుగుతుందంటారా? అన్నట్లయితే అక్కడ కూడా చేతన ప్రేరణ ఉన్నది.
వివరణ :- గురువు గారు! అచేతనాల్లో కూడా ప్రవృత్తి కనిపిస్తుంది కదా! పాలు అచేతనం, అవి దూడను పోషిస్తున్నాయి. అలాగే నీరు అందరికి ఉపయోగిస్తుంది. అలాగే జడమైన ప్రధానం పురుషునికి భోగవస్తువు కదా! అని అడిగాడు కృష్ణ శర్మ. ఆ మాటలు విన్న రత్నకరుడు సమాధానం చెబుతున్నాడు. దూడ కోసం పాలు, లోకం కోసం నీరు లాగానే పురుషుని కోసం ప్రకృతి రూపుదాలుస్తా యన్నది నిజం కాదు. జడ ప్రకృతి కూడా జగద్రచనకు ప్రవక్తమౌతుందని భావించడం సరి అయినది కాదు. దీనికి కారణం ఆవుకు దూడ మీద ఉన్న ప్రేమ. దానితో స్వయంగా పాలను తన స్థనాలనుంచి స్రవించేటట్లు చేస్తుంది. ఇక్కడ ఉన్నది చేతనసంబంధం. ఈ కారణం వలన పాలలో స్రవణ క్రియ జరుగుతోంది. అంతే కానీ పాలు స్వయంగా ప్రవహించి దూడకు చేరవు. అలా అయితే ఏదైనా పాత్రలో ఉన్న పాలు స్వయంగా ప్రవహించి, దూడ నోటికి చేరాలి. ఇక్కడ ఆవు ప్రవృత్తే దీనికి కారణం.
బృహదారణ్యకోపనిషత్తు :-(3,8,9):- అక్షరమైన ఈ బ్రహ్మశాసనం వలెనే నదులు ప్రవహిస్తున్నాయి. పాత్రలో ఉన్న నీరు స్వయంగా దాహర్తి నోటిలో పడవు. దీనికి చేతనాపూర్వకమైన కర్మ అవసరం. అందువలన ఈ ఉదాహరణల మూలంగా జడమైన ప్రకృతికి ప్రవృత్తి ఉందనడం హేతుబద్ధం కాదు. బృహదారణ్యకంలో యాజ్ఞవల్కుడు చెబుతాడు, అతడు వాయువులో ఉంటాడు. వాయువు అతన్నెరుగదు. వాయువే అతని శరీరం. వాయువులో ఉంటూనే వాయువును నియంత్రిస్తాడు. అతడే అంతర్యామి అయిన ఆత్మ జలంలో ఉంటాడు. దూడకు పాలు ఇచ్చే ఆవు చేతనమే. పాలు త్రాగే దూడ చేతనమే. అలాగే పల్లానికి ప్రవహించడమనేది నీటి ప్రవృత్తి. ఇదంతా బ్రహ్మచైతన్యం వలననే జరుగుతోంది. ప్రతి అచేతన వస్తువు యొక్క ప్రవృత్తి కూడా చేతనాధిష్టితం అని సాధించవలసి ఉంది. ఇందుకు తగిన యుక్తులు కూడా చూపబడ్డాయి. అందుచేత వాటిని దృష్టాంతంగా చూపి అచేతనం చేతనాధిష్టితం కాకుండానే ప్రవర్తిస్తుంది అని చెప్పడం యుక్తం కాదు.
సూత్రం :- 175
"వ్యతిరేకానవస్థితే శ్చాన పేక్షత్వాత్ "
చ :- అంతే కాక, అనపేక్షత్వాత్ :- చేతన ప్రమేయం లేకుండా ప్రధానం ప్రళయానికి స్వతంత్ర కారణం అని ఒప్పుకుంటే, వ్యతిరేక అనవస్థితేః :- ప్రళయ వ్యవస్థ కలుగదు.
భావం :- చేతన ప్రమేయం లేకుండా ప్రధానం ప్రళయానికి స్వతంత్ర కారణం అని ఒప్పుకుంటే, ప్రళయ వ్యవస్థ కలుగదు.
వివరణ :- ప్రధానానికి వ్యతిరేకమైన అప్రధానం ఏది లేదు. కాబట్టి అచేతనమైన ప్రధానం జగత్ కారణం కాదు. సాంఖ్యమతం ప్రకారం త్రిగుణముల సమూహమే ప్రధానం. దీనికి మించినది మరొకటి లేదు. దాని కంటే వేరుగా ప్రధానాన్ని ప్రవర్తింపజేసేది, కానీ నివర్తింపజేసేది కానీ, ఆపేక్షిచదగినది కానీ ఏది లేదు. పురుషుడు ప్రవర్తకుడు కాదు. నివర్తకుడు కాదు. కేవలం ఉదాసీనుడు. ఏమి పట్టనివాడు. అందుచేత ప్రధానం అనపేక్షం. సాంఖ్య మతం కన్నా ఇతర మతాలలో ఈశ్వరుడు చేతనుడు, సర్వజ్ణుడు, సర్వ శక్తిమంతుడు. తన ఇష్ట ప్రకారం ప్రవృత్తి, నివృత్తిలలో పాల్గొంటాడు. ప్రధానం జగద్రచనకు గాని, ప్రళయానికి గాని, స్వతంత్ర కారణం కాదు. సరూప పరిణామం అంటే సృష్టి. విరూప పరిణామం అంటే ప్రళయం. వ్యవస్థ అంటే మర్యాద, అవధి, నిర్ణయం. విరూప పరిణామంలో ఇంత కాలం ఉండాలి తరువాత సరూప పరిణామంలో ఇంత కాలం ఉండాలి అనే నియమమే మర్యాద వ్యవస్థ కూడా. ఈ సృష్టి, ప్రళయం కూడా ఒక దాని తరువాత మరొకటి మళ్ళీ మళ్ళీ వస్తాయి. ఈ వ్యవస్థ చేతన ధర్మం వలన ఏర్పడుతుంది. అచేతన గుణం వలన కాదు. ఈ స్వభావం ప్రధానానికి లేదు. సృష్టి, ప్రళయం విరుద్ద ధర్మాలు ఒకే వస్తువుకి ఉండవు. అలా ఉంటే దాన్ని స్వభావం అనరు. ప్రకృతికి సరూప పరిణామం స్వభావం ఉంటే నిరంతరంగా సృష్టి జరుగుతూనే ఉంటుంది. ఇక ప్రళయం ఏర్పడదు. విరూప పరిణామ స్వభావం ఉంటే సృష్టి ఏర్పడదు. సరూప విరూప పరిణామాలు కర్మ వల్ల అనడం కూడా సాధ్యపడదు. ప్రధానం లాగా కర్మ కూడా జడానికి వ్యవస్థను ఏర్పరచే గుణం లేదు. అందువలన బ్రహ్మమే జగజ్జన్మాదులకు స్వాతంత్ర కారణం అవుతుంది.
సూత్రం :- 176
"అన్యత్రాభా వాచ్చ న తృణాదివత్ "
చ - అంతే కాక, తృణాదివత్ - తృణాదులు, అన్యత్ర - ఎద్దులో, అభావాత్ - పాలరూపంలో పరిణమించక పోవడం వలన, న :- ప్రధానం సృష్టి, ప్రళయ రూపాలలో స్వతంత్రంగా పరిణమించదు.
భావం :- తృణాదులుతిన్న ఎద్దులో పాలరూపంలో పరిణమించక పోయినట్లే, ప్రధానం సృష్టి, ప్రళయ రూపాలలో స్వతంత్రంగా పరిణమించదు.
వివరణ :- ఆవులు మేస్తున్న గడ్డి స్వయంగా పాలరూపంలో పరిణమిస్తోంది. అలాగే ప్రళయకాలంలో ప్రధానం కొంతకాలం తరువాత పరిణమించక పోవచ్చుకదా! ఈవాదన సరి అయినది కాదు. అలా అయితే ఆవు తింటున్న గడ్డి ఏ నియమం లేకుండానే క్షీరంగా మారే స్వభావం కలిగిఉన్నట్లయితే, ఎద్దులో కూడా గడ్డి ఆవులోవలె పాలుగా మారవచ్చు కదా! అలా అవడం లేదు. కాబట్టి వేరే కారణాల ప్రసక్తి లేకుండా ప్రధాన నియత సమయంలో ప్రళయరూపంలో పరిణమిస్తుంది అనడం యుక్తం కాదు. ఈ పరిణామనికి బ్రహ్మమే కారణం. గడ్డి క్రమంగా పరిణామం చెంది, పశువులకు ఆహరమై, చివరకు పాలుగా మారుతుంది. ఈ విధంగా ప్రధానానికి స్వాభావిక పరిణామం ఉండదు. గడ్డికి పాలుగా మారటం స్వభావిక లక్షణం కాదు. ఆవులు, గేదెలు తిన్న గడ్డి మాత్రమే పాలుగా మారుతుంది. ఎద్దులు, దున్నలు తిన్న గడ్డి పాలుగా మారదు. అంటే గడ్డి పాలుగా మారడానికి ప్రత్యేకమైన వేరే కారణం ఉంటుంది. అయినా గడ్డి పాలుగా మారటమనేది గడ్డి యొక్క స్వభావం కాదు. ఎందుకంటే ఒకవేళ అలా మారితే ఆవు గేదెలతో పని లేదు. కాబట్టి ప్రధానం యొక్క పరిణామం గడ్డి మొదలైన వాటిలాగా స్వాభావికం అనడానికి వీలు లేదు. గడ్డి, చిగుళ్ళు, నీరు మొదలైన మరొక నిమిత్తం యొక్క ఆపేక్ష ఏమి లేకుండా స్వభావం చేతనే ఏ విధంగా క్షీరాది రూపంలో పరిణామం చెందుతున్నాయో, అట్లే ప్రధానం కూడా మహదాది రూపంలో పరిణామం చెందుతుంది. తృణాదులకు మరొక నిమిత్తం ఏది కనబడటం లేదు కదా! మరొక నిమిత్తం ఏదైనా ఉన్నట్లు మనకు కనబడితే, కావలసినప్పుడల్లా తృణాదులను సoగ్రహించి, క్షీరం సంపాదించవచ్చును. అలా సంపాదించడం లేదు. అందువలన తృణాదుల పరిణామం స్వాభావికమైనది. కొన్నింటిని దైవమే సంపాదించగలుగుతుంది. చాలా క్షీరం కావాలనుకున్నవాళ్లు దేనువుకు అధికంగా పచ్చగడ్డి పెట్టి అధికంగా పాలను పొందగలుగుతారు. అందువల్ల ప్రధానం యొక్క పరిణామం తృణాదుల పరిణామం వలె స్వాభావికం కాదు.
సూత్రం :- 177
" అభ్యుపగమే ప్యర్దా భావాత్ "
అభి ఉపగమే అపి :- పోనీ, కొంతసేపు ఇలా అవుతుందని ఒప్పుకున్నా, అర్ధ అభావాత్ :- ప్రయోజనం లేనందువలన,
భావం :- ప్రధానానికి స్వాభావికమైన ప్రవృత్తి ఉన్నదని అంగీకరించినా కూడా ప్రవృత్తికి ప్రయోజనం లేదు కదా! ప్రధానం సృష్టి, ప్రళయ రూపంలో స్వయంగా పరిణమిస్తుందని అనడం యుక్తం కావడం లేదు.
వివరణ :- ప్రధానానికి స్వాభావికమైన ప్రవృత్తి ఉన్నది అనుకుందాం. ఆ ప్రవృత్తికి తగిన ప్రయోజనం లేదు. అందువలన దోషం కలుగుతుంది. అంటే ప్రధానానికి ఇతర ప్రయోజనం ఏది లేదు అన్నట్లయితే ఈప్రధానమనేది పురుషునికి భోగాన్నిస్తుందని అందుకే ప్రవృత మౌతున్నదని చెప్పడం సాంఖ్యులకు కష్టమే అవుతుంది. సాంఖ్య మతంలో పురుషుడు నిర్మలుడు, ఉదాసీనుడు, అన్ని విశేషాలు ఉన్నవాడు. అటువంటి పురుషునికి ప్రధానం భోగాన్ని ఇవ్వలేదు. అందుచేత ప్రధానం పురుష ప్రయోజనం కోసం కాదు. ప్రధాన ప్రవృత్తికి ప్రయోజనం ఏమిటి? భోగమా? మోక్షమా? రెండునా? అని వివరించి చెప్పవలసిన ఉంటుంది. భోగం ఉన్నట్లయితే ఎట్టి అతిశయాన్ని సమాకుర్చడానికి శక్యం కానీ పురుషునికి ఇలాంటి భోగం సంభవమౌతుంది. నిజంగా వానికి ఎల్లప్పుడూ భోగం ఉంటుంది. అందువలన మోక్షం కుదరదు. ప్రయోజనం భోగం కోసం కాదు. అపవర్గమే ప్రయోజనం అన్నట్లయితే ప్రధానం ప్రవర్తించడానికి పూర్వం కూడా ముక్త పురుషునికి సహజంగానే ఉంది. దాని కోసం ప్రధానం ప్రవర్తించవలసిన అవరం లేదు. లోకంలో జనులు ఔత్సుకం తీర్చుకోవడం కోసం కొన్ని పనులలో ఏ విధంగా ప్రవర్తిస్తారో, అదే విధంగా ప్రధానం తన ఔత్సుకాన్ని తీర్చుకోవడం కోసం పురుషునికి మోక్షం ఇవ్వడానికి ప్రవర్తిస్తుంది అని సాంఖ్యులు అంటారు. ఔత్సుకం అనగా ఏదో ఒక పని చెయ్యాలనే తహ తహ, ఒక విధమైన కోరిక, దానిని ఖండిస్తున్నారు. ఔత్సుకాన్ని నివర్తింపజేయడం కోసం ప్రధానం ప్రవర్తిస్తుంది. అని చెప్పడం యుక్తం కాదు. అచేతనమైన ప్రధానానికి ఔత్సుకం కుదరదు కదా! నిర్మలుడు, నిష్కలుడు అయిన పురుషునికి కూడా ఔత్సుకం కుదరదు. అందుచేత ప్రధానం యొక్క ఔత్సుకం నివర్తించుకోవడం కోసం కాదు, పురుషుని ఔత్సుకం నివర్తింపజేయడం కోసం అని కూడా చెప్పడానికి వీలు కాదని అర్ధం. పురుషునిలో తెలుసుకునే శక్తి ఉంది. ప్రధానంలో సృష్టించే శక్తి ఉంది. ఈ రెండు శక్తులు వ్యర్థం కాకుండా ఉండాలంటే సృష్టి జరగాలి. సృష్టి లేకపోతే పురుషుడు దేనిని చూస్తాడు. చూసే వాడు లేకపోతే సృష్టి చేసి ఏమి లాభం. అందుచేత ప్రధానం సృజస్తోంది అనే సాంఖ్య వాదానికి సమాధానం చెబుతున్నాడు. దృశ్యక్తి (తెలుసుకునే శక్తి) సర్గశక్తి (సృష్టించే శక్తి) వ్యర్ధమైపోతాయనే భయంచేత ప్రవృత్తిని అంగీకరించే పక్షంలో పురుషుని దృశక్తి ఏ విధంగా నిత్యమో అదే విధంగా ప్రధానం యొక్క సర్గశక్తి కూడా నిత్యమే. కనుక సంసారం అనంతంగా కొనసాగుతూనే ఉంటుంది. అప్పుడు మోక్షమే లేకుండా పోతుంది. అందుచేత ప్రధానం యొక్క ప్రవృత్తి పురుషుని కోసం జరుగుతుందనటం యుక్తం కాదు. లోకంలో అందరూ తమ ప్రయోజనం కోసం కాని, పరుల కోసం కాని, ఒక వస్తువును తయారుచేయడం కాని, ధ్వంసం చేయడం కాని చేస్తారు. ఇలా ప్రయోజనాన్ని మనస్సులో ఉంచుకొని చేయడం చేతన లక్షణం. జడమైన ప్రధానానికి ప్రయోజనం అంటే ఏమిటో తెలియనప్పుడు ప్రయోజనం ఉన్నా సృష్టి, ప్రళయాలకు ప్రధానం స్వతంత్ర కారణం ఎలా అవుతుంది.
సూత్రం :- 178
"పురుషా శ్మ వదితి చేత్ తధాపి "
పురుష అశ్మవత్ :- ప్రయోజనం సాధించడానికి అయస్కాంతం స్వయంగానే లోహ వస్తువులను ఆకర్షిస్తుంది కదా! అలాగే ప్రధానం సృష్టి, ప్రళయాలను చేయగలదు. ఇతి చేత్ :- అని అంటారా? తధా అపి :- ఆ రకంగా కూడా ప్రధానం సృష్టి, ప్రళయాలను చేయలేదు.
భావం:-ప్రయోజనం సాధించడానికి అయస్కాంతం స్వయంగా లోహవస్తువులను ఆకర్శించినట్లు ప్రధానం సృష్టి, ప్రళయలను చేయలేదు.
వివరణ :- కాలిలో ముల్లు గుచ్చుకుంటే దానిని తీయడానికి సూదిని ఉపయోగిస్తారు. అది దూరంగా ఉంటే అయస్కాంతాన్ని ప్రయోగిస్తాము. ఇక్కడ కాలిలో ముల్లు దిగిన ప్రయోజనం కోసం అయస్కాంతం వేరే సాధనాన్ని కోరకుండా దూరంగా ఉన్న సూదిని ఆకర్షిస్తుంది. అలాగే ప్రధానం కూడా ఇతర కారణాలను ఆపేక్షించకుండా జీవుల భోగ, అపవర్గ ప్రయోజనాల కోసం సృష్టి, ప్రళయ రూపాల్లో పరిణమించవచ్చు కదా! అలా అనడం సరిఅయినది కాదు. అయస్కాంతంలో ఆకర్షణ శక్తి ఎప్పుడు ఒక్కలాగానే ఉంటుంది. ఒకసారి ఉండటం, ఒకసారి పోవడం ఉండదు. ప్రధానం వలన కూడా సృష్టి పరిణామంలో మార్పు ఉండకూడదు. ప్రళయం రాకూడదు. లేదా సృష్టి అయినా జరగకూడదు. రెండు శక్తులు ఒకే సమయంలో ఉండకూడదు. అందువలన ప్రధానం (ప్రకృతి) స్వతంత్రంగా పురుష ప్రయోజనం నిమిత్తం జగజ్జన్మాదులకు కారణం అని చెప్పడం పొసగదు. గురువుగారు! ప్రధానం పురుష ప్రయోజనం కోసం కాదు అన్నారు కదా! పురుషుడే ప్రధానాన్ని ప్రవృతం చేయవచ్చు కదా! గ్రుడ్డివాడు దేనిని చూడలేడు. ఒంటరిగా ఎక్కడికి పోలేడు. అలాగే కుంటివాడు చక చకా నడచి పోలేడు. ఇప్పుడు కళ్లున్న కుంటివాడు, కాళ్ళు ఉన్న గుడ్డి వాడి భుజాలపై కూర్చుని వెడుతున్నాడు కదా! అయస్కాంతం తాను కదలకుండా ఇనుప ముక్కలను ఆకర్షస్తోంది కదా! అదే విధంగా పురుషుడు ప్రధానాన్ని ప్రవృతం చేయవచ్చు కదా! అని అడిగాడు కృష్ణ శర్మ. ఆ మాటలు విన్న రత్నాకరుడు, నువ్వు చెప్పినది నిజమే, కుంటివాడి సాయంతో నడిపించబడే గుడ్డివాడు ఆస్వతంత్రుడు. అలాగే ఇనుప ముక్క కి కూడా స్వతంత్రం లేదు. ఇక్కడ మూడు దోషాలున్నాయి.
1. పురుషుని ప్రేరణ వలన ప్రవృత మయ్యే ప్రధానం అస్వతంత్రమౌతోంది.
2. అంతే కాకుండా ఉదాసీనుడు, వివేకరహితుడు అయిన పురుషుడు ప్రేరకుడు కావడం 2వ దోషం. కుంటివాడు, గుడ్డివాడు, ఇనుపముక్క అయస్కాంతాల సాన్నిద్యం నిత్యం కాదు.
3. కానీ ప్రధానం పురుషుల సాన్నిద్యం నిత్యం.
ఎప్పుడు ఆ ప్రవృత్తి ఉంటూనే ఉంటుంది. కనుక ప్రధానం ప్రవృతమవుతోందనడం దోషం. అవిద్య అయిన ప్రధానాన్ని చేతన మైన పురుషుని కలిపే తత్వం ఇంకొకటి లేదు.
సూత్రం :- 179
"అంగిత్వానుపపత్తేశ్చ "
చ - ఇంతే కాక, అంగిత్వ అనుపపత్తేశ్చ :- స్వామిత్వం సిద్ధించక పోవడం వలన.
భావం :- స్వామిత్వం సిద్ధించక పోవడం వలన ప్రధానం స్వయంగా సృష్టి, ప్రళయాలలో పరిణమిస్తుందనడం సరిఅయినది కాదు.
వివరణ :- ప్రధానం పరిణామశక్తికి స్వామి కాదు. స్వామిత్వం జ్ఞానిలోనే ఉంటుంది. అజ్ఞాని స్వామి కాలేడు. ప్రధానంలో జ్ఞానం, స్వామిత్వం లేవు. కాలవిజ్ఞానం లేని ప్రకృతి సృష్టి, ప్రళయల వ్యవస్థ ఎలా చేస్తుంది. నియతసమయంలో సృష్టి, ప్రళయాలు జరగడానికి సమయజ్నుడైన వ్యవస్థాపకుడు కావాలి. అందువల్ల ప్రధానం నిరపేక్షంగా సృష్టి ప్రళయాలలో పరిణమిస్తుందనడం హేతుబద్ధం కాదు. అంతే కాకుండా గుణాలకు సంబంధించిన అంగాంగి భావం కూడా కుదరదు. సత్వ రజస్థమోగుణాలు మూడు సామ్యావస్థను పొందిన స్థితినే ప్రధానం అంటారు. కాబట్టి మూడింటిలో ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ కాదు. సామ్యావస్థలో ప్రధానానికి ప్రవృత్తి ఉండదు. ప్రవృత్తి కలగాలంటే సామ్యావస్థలో వికారం, కదలిక కలగాలి. ఆ రకమైన కదలిక కలిగించే పదార్ధామేది లేదు. కాబట్టి ప్రధానానికి జగదుత్పాదక శక్తి లేదు. ప్రళయకాలంలో మూడు గుణాలు ఒకదాని ఆపేక్ష మరొక దానికి లేకుండా తమ తమ రూపాలలో ఉంటాయి. అదే ప్రధానావస్థ. ప్రళయానంతరం సృష్టి ప్రారంభం కావాలంటే ఈ గుణాలలో వైషమ్యం రావాలి. అలా వస్తే అంతవరకు ఉన్న వాటి స్వరూపమే మారిపోతుంది. అందుచేత అవి అలాంటి అంగాంగీ భావాన్ని పొందవు. అప్పుడు సృష్టి ఉండదు. అందుకే ప్రధానికి జగదుత్పాదక శక్తి ఉండదు.
సూత్రం :- 180
"అన్యధా సుమితౌ చ జ్ఞ శక్తి వియోగాత్ "
చ :- అలాగే, అన్యధా అనుమితౌ :- కాలాన్ని వ్యవస్థాపకుడిగా ఉహించినా, జ్ఞ శక్తి వినియోగాత్ :- దానికి జ్ఞాతృత్వ శక్తి లేదు.
భావం :- కాలాన్ని వ్యవస్థాపకుడిగా ఉహించినా దానికి జ్ఞాన శక్తి లేదు. అందువల్ల నిరపేక్షంగా ప్రధానం సృష్టి ప్రళయ రూపంలో పరిణమిస్తుందనడం అసమంజసం.
వివరణ:- ఈలోకంలో వివిధ ఋతువులలో నియమంగా చెట్లు అన్ని చిగురించి పూలు, పళ్ళు ఇస్తున్నాయి. మరల నియత కాలంలో నశించడం కూడా జరుగుతుంది. అదే విధంగా ప్రధానం సమయానికి తగ్గట్టు సృష్టి, ప్రళయాలను పరిణమించవచ్చు కదా! దీనికి తగిన వ్యవస్థ కాలంవల్లే జరుగుతుంది. బ్రహ్మాన్నే ఎందుకు వ్యవస్థాపకుడిగా ఎందుకు ఎన్నుకోవాలి? అని వాదిస్తారు. ఈ వాదన తప్పు. కాలం జడమైనది. జ్ఞానశూన్యం. జ్ఞానం లేకుండా వ్యవస్థ లేదు. పరమేశ్వరాధీనమై ఆయా ఋతువులలో చెట్లు, లతలు పత్ర పుష్పములతో, పండ్లతో విరాజిల్లుతున్నాయి. దీనికి కాలం స్వతంత్ర కారణం కాదు.
శ్వేతాశ్వరోపనిషత్తు:-(6-16) ఈశ్వరుడు కాలానికి కాలం. సర్వవేత్త. కనుక స్వతంత్రంగా ప్రధానం జగజ్జన్మాదులకు కారణం అనడం యుక్తంకాదు. ప్రధానంలో జ్ఞానశక్తి లేనందువలన జగన్నిర్మాణం జరగదు. జ్ఞానశక్తి లేని ప్రధానం జగత్తును నిర్మించలేదు. ఒకవేళ సాంఖ్యులు కనుక ప్రధానానికి జ్ఞానశక్తి ఉన్నదని ఒప్పుకుంటే చేతనమైన పదార్ధమే జగదుత్పత్తికి ఉపాదానకారణమౌతుంది. అంటే బ్రహ్మమే జగన్నిర్మాణానికి కారణమని ఒప్పుకున్నట్లు అవుతుంది. అంతే కాకుండా సామ్యావస్థలో కూడా నిమిత్తం లేకుండానే త్రిగుణములు మార్పు చెండుతాయి. అవి ఎప్పుడు మార్పు చెందుతూ ఉంటే జగత్తు నిత్యమౌతుంది. మోక్షమనేది ఉండదు. గుణాల స్వభావం చంచలమైనదని అంగీకారం కూడా ఉంది. అందువల్ల సామ్యావస్థలో గుణాలు వైషమ్యం పొందడానికి యోగ్యంగా ఉంటాయి అని చెప్పిన కూడా ప్రధానానికి జ్ఞానశక్తి లేదు కనుక రచనానుపపత్తి మొదలైన దోషాలు అలాగే ఉంటాయి.
సూత్రం :- 181
“ విప్రతి షేధా చ్చాసమంజసం "
చ :- అంతే కాక, విప్రతి షేదాత్ :- శ్రుతుల్లో నిషేధించినందు వలన, అసమంజసం :- ప్రధానం స్వతంత్ర కారణమవడం అసమంజసం. శ్రుతి, స్మృతులలో నాస్తిక్యాన్ని నిషేదించారు.
భావం :- ప్రధానం స్వతంత్ర కారణమవడం అసమంజసం. దీనినే శ్రుతి, స్మృతులలో నిషేదించారు. జగన్నిర్మాత పరబ్రహ్మం కాదన్నారు. అందువలన ప్రకృతి స్వతంత్రంగా జగజ్జన్మాదులకు కారణమవడం అసమంజసం.
వివరణ:- సాంఖ్యమతంలో పరస్పర విభేదాలున్నాయి. ఈశ్వరుడు జగత్కారణమే అన్న మాట సాంఖ్యమతం ఒప్పుకోదు. వీరు మహాత్తు నుంచి తన్మాత్రలు వచ్చాయని ఒకసారి, అహంకారంనుంచి తన్మాత్రలు వచ్చాయని ఒకసారి చెప్పారు. అలాగే కర్మేంద్రియాలు 7 (చర్మం, మనస్సు కలిపి) అంటారు. ఇంకొక చోట ఐదే అంటారు. ఒకసారి ఇంద్రియలు మొత్తం 11అంటారు. అంతఃకరణ అంటే మనస్సు బుద్ధి, అహంకారం అంటారు. ఇంకో చోట బుద్ధి ఒక్కటే అంటారు. ఈ రకంగా వారి వాదనలో పొంతన అనేది లేదు. కాబట్టి సాంఖ్యులు చెప్పే ప్రధానం జగత్కారణం కాదు. ఇక్కడ సాంఖ్యులు ఇలా అంటున్నారు. తప్యుడు (పీడింపబడే జీవుడు), తాపకం (పీడించే సంసారం), రెండు వేరువేరు జాతికి చెందినవని అంగీకరించరు. తప్య, తాపకాలు ఒక్కటే యైన ఆత్మ విశేషాలైతే, ఆ ఆత్మ వాటి నుండి విడుదల పొందజాలదు. అ తాపం శాంతించడం కోసం శాస్త్రం చెప్పిన ఉపదేశం వ్యర్థమౌతుంది. దీపానికి ఉష్ణత్వం, ప్రకాశం అనే ధర్మాలు ఉన్నాయి. దీపం ఆ రెండిoటి నుంచి విముక్తం కాదు కదా! సముద్రానికి సంబంధించిన జలం, దాని తరంగాలు, అలలు, నురుగు, బుడగలు మొదలైన విశేషాలు కనబడుతున్నప్పుడు, అవి నిత్యాలే కనుక సముద్రానికి వాటి నుండి విడుదల ఉండదు. అక్కడ ఆ రెండు ఒక్కటే. అదే విధంగా తప్యానికి, తాపానికి జాత్యంతర భావం ఉండదని సాంఖ్యుల అభిప్రాయం. అదేట్లనగా, ఆర్ధి (ఒక వస్తువు కావాలని కోరుకునే వాడు), అర్ధం(కోరబడే వస్తువు) పరస్పర భిన్నములుగా కనబడుతున్నాయి. స్వతహాగ అర్ధం(వస్తువు) ఆర్ధి (కోరుకునే మనిషి)కంటే భిన్నం కాకపోతే, ఏవస్తువును కోరుకుంటే అది వానికి నిత్యమే అవుతుంది. అవి రెండు ఒక్కటే అయితే ఆర్ధి దానిని గురించి కోరడం ఉండదు. రెండిటికి భేదం ఉంటేనే కొరతాడు. కోరేవాడు, కోరబడేది అని భేదం ఉంటేనే కోరేవాడు ఆర్ధిఅనీ కోరబడేది అర్ధంఅనీ చెప్పడానికి వీలవుతుంది. ఈరెండు ఒక్కటే అయితే అర్ధం తనని తాను కోరుకుంటోంది అని చెప్పవలసిన వస్తోంది. అది లోక విరుద్దాం కదా! అర్ధం, ఆర్ధి రెండు సంబంధం ఉన్న శబ్దాలు. రెండు వేరైనవే. ఒకే పురుషుడు రెండిoటిలో పర్యాయం చేత సంబంధం కలిగి ఉంటాడు. అతడినే తవ్యుడు అంటారు. వీటిలో అర్ధం చాలా అల్పంగా ఉంటుంది. దాని వలన వచ్చే అనర్ధాలు అధికంగా ఉంటాయి. అందుచేత రెండు కూడా అనర్ధంగానే పరిగణిం పబడతాయి. కాబట్టి అది తాపకం అని చెప్పబడుతుంది. ఈ తప్యతాపకాలు రెండు ఒక్కటే అయితే మోక్షం రాదు. అవి భిన్నమైనవైతేనే దుఃఖానికి కారణమైన హేతువును తొలగిస్తే మోక్షానికి అవకాశం వస్తుంది. ఆఅవివేకాన్ని తొలగిస్తే పురుషుడు నిత్యముక్తుడౌతాడు. మోక్షం వస్తుంది. నిజానికి బంధ మోక్షాలు పురుషుని కంటే అత్యంత భిన్నమైన బుద్ధికి సంబంధించినవే. వాటిని తనమీద ఆరోపించుకుంటాడు. తప్యమైన బుద్ధితో సంయోగానికి హేతువైన అవివేకం తొలగిపోతే ఆ పురుషుడు మోక్షం పొందవచ్చునెమో కానీ తప్యతాపకాలకు అభేదాన్ని అంగీకరిస్తే సాంఖ్య మతంలో మోక్షం కుదరదు.
మహద్దీర్ఘాధికరణం :- ( 2, 2, 11 )
సూత్రం :- 182
"మహద్దీర్ఘ వత్ వా హ్రస్వ పరిమండలాభ్యామ్"
హ్రస్వ పరి మండలాభ్యం :-ధ్వ్యణుకు వల్ల పరమాణువుల వల్ల, మహత్ దీర్ఘవత్ వా :- స్వతంత్రంగా త్య్రణుకం ద్వ్యణుకం ఎలా ఉత్పన్నం కావో, అలాగే స్వతంత్రంగా ప్రధానం వల్ల జగత్తు ఉత్పన్నం కానేరదు.
భావం:-ద్వ్యణుకం పరమాణువుల వల్ల స్వతంత్రంగా త్య్రణుకం ద్వ్యణుకం ఎలా ఉత్పన్నం కావో, అలాగే స్వతంత్రముగా ప్రధానం వల్ల జగత్తు ఉత్పన్నం కానేరదు.
వివరణ:-ప్రకృతి స్వతంత్రంగా జగజ్జన్మాదులకు కారణం అని కొందరు ఎలా చెబుతారో, అలాగే పరమాణువులు సైతం స్వతంత్రంగా జగత్కారణం అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈరెండు పక్షాల సిద్ధాంతలలో తేడా ఏమి లేదు. వాళ్ళు చెప్పే జగత్ నిర్మాణంలో కొంత భేదం ఉంది. ఇప్పటివరకు సాంఖ్యమతాన్ని చెప్పి ఇప్పుడు వైశేషికమతాన్ని ఖండిస్తున్నారు. వైశేషిక మతాన్ననుసరించి కారణం పదార్ధాలకుండే గుణాలలోనే కార్యలు పుడతాయి. అంతే కానీ వేరే గుణాలు కలవి పుట్టవు. ఎర్ర రంగు నూలుతో తయారైనా వస్త్రం ఎర్రగానే ఉంటుంది. కానీ తెల్లగా ఉండదు. ఈ సిద్ధాంతం ప్రకారం చేతనమైన బ్రహ్మం నుంచి పుట్టిన జగత్తు అచేతనం కావడానికి వీలు లేదు. అది కూడా చేతనమే కావాలి. కానీ అలా కాలేదు. దానికి జగదుత్పత్తికి కారణం బ్రహ్మ కాదు అని వైశేషికుల వాదన. దీనిని ఖండిస్తున్నారు. వీరు స్వతంత్ర పరమాణువులు జగత్కారణం అంటారు. ఇది కేవలం పరమాణువాదం. పరమాణువులు నిరవయవాలు. రెండు పరమాణువులు కలిస్తే ద్వ్యణుకం అవుతాయి. ద్వ్యణుకం సంయోగం చెందితే త్య్రణుకములౌతాయి. అలాగే చతురణుకం, పంచాణుకం, క్రమంగా స్తూల జగత్తు. ఈ రకంగా అణువుల నుండి కొండలు, నదులు, పర్వతాలు మొదలైన సృష్టి ఏర్పడింది. ప్రళయసమయంలో పరమాణువులు విడివిడిగా నభోమండలంలో ఉంటాయి. సృష్టి సమయంలో సంయుక్తంగా చేరి ద్వ్యణుకాది క్రమంలో స్థూలజగత్తును సృష్టిస్తాయి. జీవులు వ్యాపకులు. శరీరంలో మాత్రం జీవులు మనసుతో కూడి పదార్ధాలకు చైతన్యం కలిగిస్తారు. మిధ్యా జ్ఞానం వలన జీవులకు మనసుతో సంబంధం ఏర్పడుతుంది. ఈ మిధ్యా జ్ఞానం ఉన్నంతవరకు తాము చేసే కర్మలకు అనుగుణంగా సుఖదుఃఖములనుభవిస్తుంటారు. తత్వజ్ఞానం కలిగిన తరువాత, మిధ్యాజ్ఞానం తొలగిపోయి జీవులు ముక్తి పొందుతారు. తత్వజ్ఞానాన్ని ప్రయత్నంతో సాధించవచ్చును. దీనికి ఇతర సహకారం అవసరం లేదు. ఇక్కడ ఈశ్వరప్రసక్తి లేదు. పరమాణువులే జగత్తుకు స్వతంత్రకారణం. ఈప్రక్రియ శ్రుతి సమ్మతం కాదు. ఎందుకంటే పరమణువులు జడాలు. స్వయంగా సంయుక్తం కాలేవు. వీటిని కలపడానికి విడదీయడానికి ఒక చేతన శక్తి కావాలి. అది పరబ్రహ్మం నుంచే వస్తుంది.
పరమాణు జగదకారణత్వాధికరణం ( 2, 2, 12)
సూత్రం :- 183
"ఉభయ దాపి కర్మాతస్తదభావః"
ఉభయధా అపి:- రెండు విధాల, కర్మ:- పరస్పరం పరమాణువులను సంయుక్తం చేసే కర్మ, న :- సిద్ధించడం లేదా? అతః :- అందువల్ల, తత్ అభావః :- స్వతంత్రంగా ధ్వ్యణుకాదుల ఉత్పత్తి కలగజాలదు.
భావం :- రెండు విధాలుగా పరస్పరం పరమాణువులను సంయుక్తం చేసే కర్మ సిద్ధించనందున జగదుత్పత్తి కలగదు.
వివరణ :- పరమాణువులు ఒకదానితో మరొకటి కలిసి ద్వ్యణుకం మొదలైనవి ఏర్పడతాయంటారు. సంయోగం అంటే కార్యం. ఉత్పన్నం అయ్యేది. దాన్ని ఉత్పన్నం చేసేది కర్మ. ఆసంయోగం కలుగజేసే కర్మకు ప్రయత్నం కావాలి. ఈ ప్రయత్నమే చేతనధర్మం. పరమాణువులకు అధిష్టానంగా ఒక చేతనధర్మం ఉంటుందని స్వతంత్ర పరమాణువాదులు ఒప్పుకోరు. అణువుల కలయిక వల్లే ఈసృష్టి జరుగుతోందని, ఇక్కడ కర్మ ఏది లేదని వారి వాదన. దారపుపోగులు వాటంతట అవి వస్త్రంగా తయారు కావు. వాటిని కలిపి వస్త్రంగా చెయ్యడానికి ఒకరు దానికి కర్మ అంటే పని చెయ్యాలి. అప్పుడే వస్త్రం తయారవుతుంది. కానీ వైషషికులు ఈకర్మ అవసరం లేదని వాదిస్తారు. వైశేషికులమతంలో మొత్తం తొమ్మిది ద్రవ్యాలుంటాయి.వీటిలో పృథవి, జలము, అగ్ని, వాయువు, అనే నాలుగు నిత్యములు, ఆకాశం, కాలం, దిక్కు, ఆత్మ, మనస్సు అనే 5 అనిత్యాలు. పరమాణువులు ఒకదానితో ఒకటి కలియడం వలన ఘటపటాది(వస్త్రాలు) రూపాల్లో సృష్టి జరుగుతుంది. ఇక ప్రళయం ఏవిధంగా జరుగుతుందంటే, కొన్ని అణువులు కలసి ఒక వస్తువు ఏర్పడింది. మళ్ళీ ఆ అణువులు విడిపోయి ఆ వస్తువు ఉండదు. ఈ విధంగా అణువులు విడిపోవడమే ప్రళయం. చేతనాలు జీవులని అంగీకరిస్తే జీవులకు ప్రళయంలో శరీరసంబంధం, మనోసంబంధం ఉండదు. అప్పుడు జీవుల్లో ఉండే ప్రయత్నం పరమాణువుల్లో కర్మను జనింపలేదు. ప్రళయంలో సృష్టి ఉత్పత్తికి పూర్వం పరమాణువుల్ని సంయుక్తం చెయ్యడానికి కావలసిన కర్మ పరామణువుల్లో స్వంతంగా ఏర్పడదు. అలాంటి కర్మసంబంధం కానప్పుడు ద్వ్యణుకాది క్రమంలో జగత్తు ఉత్పత్తి కాదు. ఎందుకంటే పరమాణువులకు చేతన ధర్మం లేదు. ఈధర్మం కేవలం ఈశ్వరునికే ఉంది. కనుక స్వతంత్ర పరమణువాదం హేతుబద్ధం కాదు అని తెలుస్తోంది. అయితే వారు చెప్పే క్రమాన్ని పరిశీలిస్తే అణువులు పర్వతంగానో, కొండగానో, తయారవ డానికి ఏ అవసరం లేదు. కానీ మట్టి కుండగా తయారవడానికి కర్మ అవసరం అవుతుంది. కానీ వారి వాదనలో కర్మ అనేది లేదు. అందుచేత వైశేషికుల వాదం సరి అయినది కాదు.
సూత్రం :- 184
"సమవాయాభ్యుపగమాచ్చ సామ్యాత్ అనవస్థితే "
సమవాయ అభి ఉపగమాత్:- అదృష్టానికి, జీవులకు సమవాయ సంబంధం ఉన్నది. చ :- అంతే కాక, సామ్యాత్ :- అదృష్టంతో సంబంధం ఉన్న జీవులతో సంబంధం పరామాణువులకు సృష్టి, ప్రళయాల్లో సమానంగా ఉంటుంది. అనవస్థి తే :- అనవస్థ కలుగుతుంది.
భావం :- అదృష్టానికి, జీవులకు సమవాయ సంబంధం ఉంది. అదృష్టంతో ఉన్న జీవులతో సంబంధం పరమాణువులకు సృష్టి ప్రళయాల్లో సమానంగా ఉంటుంది.
వివరణ :- జీవులు అదృష్టాన్ని ఒప్పుకుంటారు. ఇక్కడ అదృష్టం అంటే fate కాదు. యాద్రుచ్చికం (accidental). అదృష్టమే లేకపోతే సృష్టి వైచిత్య్రం ఉండదు. అదృష్టం జీవాత్మకు సంబంధించినది కనుక జీవులే పరమాణువులలో కర్మను ఉత్పన్నం చెయ్యాలి. పరమాణువులు కర్మను స్వతంత్రంగా చెయ్యలేవు. కనుక అదృష్టం కర్మజనకం కాదు. కార్యమునకు కారణము నకు సంబంధం ఉంది. తంతువులు అంటే నూలు దారాలు కారణం, వాటిని వస్త్రంగా నేయడం కార్యము. కారణం నుంచి కార్యం పుడుతుంది. సృష్టి అంటే సంయోగం మాత్రమే కాదు వియోగం కూడా, ఎప్పుడు సృష్టి జరగదు కదా! ప్రళయం కూడా వస్తుంది. అది పరమాణుసంయోగం వల్ల రాదు. దీని వలన స్వతంత్రపరమాణువాదం అసమజసం. పరమాణువులకు కొన్ని దోషాలున్నాయి. అవి రెండు కలిసినప్పుడు పరమాణువుల లక్షణాలు వదలి వేరే లక్షణాలు సంతరించు కుంటున్నాయి. దీని వలన అనవస్థదోషం కలుగుతుంది. అందువలన వీరి వాదన సరిఅయినది కాదు. సమవాయాన్ని అంగీకరించడం వలన కూడా అణుకారణవాదం కుదరదు అని అర్ధం. సమవాయం:-వస్తువు గుణాల మధ్య ఉండే అవినాభావ సంబంధమే సమవాయం. ఒక వస్తువు, దాని గుణాలు వేరు కావు. వస్తువు లేకుండా గుణాలు ఉండవు. గుణాలు లేకుండా వస్తువు ఉండదు. అలాగే అవయవి-అవయవాలు, చలనం-చలించే వస్తువు, కారణం-కార్యం, ఒకదానితో ఒకటి విడదీయ రానిదిగా ఉండటమే సమవాయం. ఒక వస్తువును అంతకంతకు చిన్న భాగాలుగా చేస్తూ పోతే చివరకు విభజన సాధ్యం కాని స్థితి వస్తుంది. ఆ స్థితిలో మిగిలే సూక్ష్మతి సూక్ష్మ వస్తువే అణువు. అది నిరవయవి. అంటే దానిలో భాగాలూ ఉండవు. కిటికీ సందులో నుండి గదిలోకి వచ్చే సూర్యరశ్మిలో సూక్ష్మమైన నలకలు తేలుతూ చలిస్తూ ఉంటాయి. వాటిని త్రసరేణువు అంటారు. ప్రతి త్రసరేణువు త్ర్యణుకం. అంటే అది మూడు ద్వ్యణుకాలతో ఏర్పడుతుంది. అణువు కంటే సూక్ష్మ వస్తువు లేదు. అణువుల సంయోగం వలన ప్రపంచం ఏర్పడింది. అవి శాశ్వతమైనవి. సంయోగం :- ఒక వస్తువు మరొక వస్తువుతో కలిసి ఉంటుంది. అంటే దానికి, దీనికి ఏదో సంబంధం ఉందని అర్ధం. కారణమైన పటం కార్యమైన తంతువులలో ఉంటుంది. వాటి సంబంధం విడదీయరానిది. ఈ తంతువులకు, వస్త్రానికి మధ్య సమవాయ సంబంధం ఉంది. సంయోగం గుణం కాబట్టి మరొక సంబంధాన్ని ఆపేక్షిస్తుంది. సమవాయం గుణం కాదు. దానికి మరొక సంబంధం యొక్క ఆపేక్ష లేదు. అని చెప్పడం యుక్తం కాదు. సృష్టి అంటే సంయోగం మాత్రమే కాదు. వియోగం కూడా. ఎప్పడూ సృష్టి జరుగుతూనే ఉండదు కదా , ప్రళయం కూడా వస్తుంది. అది పరమాణు సంయోగం వలన కాదు. దీని వలన స్వతంత్ర పరమాణువాదం అసమంజసం.
సూత్రం :- 185
" నిత్యమేవ చ భావాత్ "
చ:- అంతేకాని, నిత్యం ఏవ భావాత్ :- పరమాణువుల్లో కర్మ స్వాభావికం అనుకుంటే, ఎప్పుడు కర్మ ఉత్పన్నం అవుతూనే ఉంటుంది.
భావం :-పరమాణువుల్లో కర్మ స్వాభావికం అనుకుంటే, ఎప్పుడూ కర్మ ఉత్పన్నం అవుతూనే ఉంటుంది. కర్మ జన్య సంయోగం వల్ల ద్వ్యణుకాది సృష్టి సదా ఏర్పడుతూనే ఉంటుంది. ప్రళయవ్యవస్థ సంభవం కాదు.
వివరణ :- ఒకవేళ పరమాణువులకు కర్మ స్వభావం ఉంటే? దాని వల్ల పరమాణువులలో సంయోగం కలుగుతుంది కదా! ద్వ్యణుకాది సృష్టి ఉత్పన్నం సంభవం అని అనుకుంటే అది కూడా సిద్ధించడని అంటున్నారు. కర్మ నిత్యమా? పరమాణువు నిత్యమా? అనేది సందేహం. కర్మ 5 విధాలుగా ఉంటుంది. కర్మ అంటే ఇక్కడ చలనము అని అర్ధం. అవి 1.ఉత్ క్షేపణం (పైకి పోవడం) 2. అవ క్షేపణం(కిందికి పోవడం) 3. ఆకుంచనం(ముడుచుకొనడం) 4. ప్రసారణం(వ్యాకోచించడం) 5. గమనం ( వెళ్లడం). పరామణువులు నిత్యం, వాటికీ కర్మ సహజం అనుకుంటే కర్మ కూడా నిత్యం అవుతుంది. స్వభావం ఎన్నటికీ నిత్యం కాదు. పరమాణువాదంలో స్వభావం రెండు రకాలు.1. ప్రవృత్తి స్వభావం :- అంటే ఈ స్వభావంలో మార్పు ఉండదు. కాబట్టి సృష్టి ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. 2. నివృత్తి స్వభావం :- అంటే అణువులు నాశనమైపోతోంటాయి. అందుకే సృష్టి జరగదు. ఈ విధంగా చూస్తే సృష్టి గాని, ప్రళయం గాని ఈ రెండిటిలో ఏదో ఒకటి మాత్రమే జరుగుతుంది. కర్మ నిత్యమైతే సృష్టి, ప్రళయ వ్యవస్థలు కలగవు. సృష్టికి, ప్రళయానికి రెండింటికి కర్మ కారణం కావడం వలన ఒక కర్మతో ద్వ్యణుకం ఏర్పడిన వెంటనే వాటి వియోగం కలుగుతుంది. ఇలా సంయోగ ,వియోగాలు కర్మ జన్యాలై వెంట వెంటనే కలుగుతుంటే సృష్టి కాని, ప్రళయం కాని ఏర్పడదు. కర్మ నిత్యమైతే అప్పుడు పరామణువులు సంయుక్తం అవుతూనే ఉంటాయి. ప్రళయం కలగదు. పైగా సృష్టి ప్రళయలకు తగిన కర్మని నియమించే వారు ఎవరు? కనుక ఈ వాదం సరి అయినది కాదు.ఉభయ స్వభావత్వం సమంజసం కాదు. పరమాణువులు నిత్యమైతే కర్మ కూడా నిత్యమే అవుతుంది. పరమాణువులు జడం కనుక వాటికి చేతన ధర్మం కలిగించేది ఈశ్వరుడేనని వైశేషికులు ఒప్పుకోరు. వారి వాదం సమంజసం కాదు.
సూత్రం :- 186
"రూపాది మత్త్వాచ్చ విపర్యయో దర్శనాత్ "
చ :- అంతే కాక, దర్శనాత్ :- లోక దర్శనాన్ని బట్టి, రూపాది మత్త్వాత్ :- పరమాణువులకు రూపరసాది గుణాలుండటం వలన, విపర్యయం :- అనిత్యాలు కావలసి వస్తుంది.
భావం :- లోక దర్శనాన్ని బట్టి పరామణువులకు రూపరసాది గుణాలుండటం వలన అనిత్యాలు కావలసి వస్తోంది.
వివరణ:-వైశేషికులు పరమాణువులకు రూపం మొదలైనవి ఉన్నాయంటారు. కాని నిజస్థితిలో వీరి వాదనలో తేడా కనిపిస్తుంది. పృథవి, జలం, అగ్ని, వాయువు వీటికి సంబంధించిన అణువులు నిత్యములు, నిరవయవములు, కుండ వస్త్రములలో కూడా ఈ లక్షణాలు ఉన్నాయంటారు. కాని లోకంలో నూలుపోగులతో తయారైనా వస్త్రం, ఆ పోగుల కన్నా స్థూలంగా ఉంటుంది. అలాగే మట్టితో తయారైన కుండ కూడా. ఇవి నిత్యము, నిరవయవము, అని చెప్పేది స్థూలము. కాబట్టి వీరి వాదన సరిఅయినది కాదు. 1.వాయువులో-స్పర్శ, 2. అగ్నిలో స్పర్శ, రూపము, 3. జలములో స్పర్శ, రూపం, రసం, 4.భూమిలో స్పర్శ, రూపం, రసం, గంధం ఉన్నాయి. వాటి వల్లనే ఈ సృష్టి జరుగుతోంది. ఇవి ఒకదానికొకటి స్ధూలమైనవి. వీటి వల్ల జగన్నిర్మాణం జరగదు. లోకంలో వ్యక్త పదార్ధాలాన్నీ రూపరసాది గుణాలు ఉంటాయి. ఈ గుణాలు అనిత్యాలు. ఈ వ్యక్తపదార్ధములకు కారణములైన పరమాణువులకు కూడా రూపరసాదులుంటే అవి కూడా అనిత్యాలు కావాలి. కాగా పరామణువులు నిత్యం కదా! అందుచేత స్వతంత్రం పరమాణు కారణవాదం సమంజసం కాదు. అవయవాలు ఉన్న ద్రవ్యాలకు ఏ అవయవానికి ఆ అవయవం విడగొట్టగా, చివరకి విడగొట్టడానికి వీలు కాకుండా ఏది మిగులుతుందో అలాంటి రూపాలున్న పరామణువులు, రూపాదులున్న పంచభూతాలను, పంచభూతాల వల్ల పుట్టే వాటికీ, ఆరంభకాలు వాటిని పుట్టించేవి కూడా నిత్యములని వైశేషికుల అభిప్రాయం. ఇది ఆధారరహితమైనది. ఎందువల్లననగా అణువులకు రూపములు ఉండటం వలన నిత్యత్వానికి విరుద్దం ఏర్పడుతుంది. తంతువుల వలన వస్త్రం ఏ విధంగా స్టూలమో, అనిత్యమో, తంతువులు కూడా స్థూలములుగా, అనిత్యములుగా ఉంటాయో, అట్లే ఏ పరమాణువులు రూపాదులు కలవి కనుక, అవి కూడా స్థూలమైనవి, అనిత్యమైనవి అని చెప్పవలసిన ఉంటుంది. పరమాణువులకు రూపాలుండటం వలన వైశేషికులు అనుకున్న దానికి విరుద్దమైనది ఏర్పడుతుంది. అందువలన పరమాణువాదం ఉపపన్నము. తంతువులు వస్త్రానికి, మట్టి ఘటానికి సమవాయ కారణం వలన కొత్త వస్తువులు పుడతాయి. తంతువులు వేరు, పటం వేరు. మట్టి వేరు, కుండ, మూకుళ్ళు వేరు. కార్యం, కారణం కంటే భిన్నంగా ఉంటుంది. కార్యం కొత్త వస్తువులను పుట్టిస్తుంది. ఈ కార్యం నశించాలంటే దాని అవయవాలు( తంతువులు )విడిపోవడం గాని, అవి నశించడం గాని కారణం. ఈ రెండు తప్ప మూడవ కారణం లేదు. ఇది వైశేషికుల అభిప్రాయం. వాస్తవంలో కార్యం కంటే కారణం భిన్నంకాదు. కార్యం నశించడం అంటే కారణరూపంలోకి మారడమే. పరమాణువులు నశించాలంటే కారణవిభాగమైన ఉండాలి. కారణాలు నాశనమైన జరగాలి. అవి నిత్యములు అని చెప్పడం యుక్తం కాదు. కుండా మట్టిలోనూ, కుండలాలు బంగారం లోను లీనం అయినట్లే, పరమాణువులు పరమ కారణమైన బ్రహ్మలో లీనమై పోతాయి. అందుచేత అవి నిత్యములని అంగీకరించడం యుక్తం కాదు.
సూత్రం :- 187
" ఉభయధా చ దోషాత్ "
చ :- అంతే కాక, ఉభయధా దోషాత్ :- లోక దృష్టిని అంగీకరించినా, ఒప్పుకోక పోయినా స్వతంత్ర పరమాణు వాదం దోషయుక్తం.
భావం :- పంచభూతలైన ప్రధివి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం ఒకదాని కన్నా ఒకటి స్థూల సూక్ష్మాలని తారతమ్యం చెప్పినా, తారతమ్యం లేదని చెప్పినా రెండు విధాలుగా దోషమే ఉన్నది. కాబట్టి పరమాణు వాదం సరి కాదు.
వివరణ :- పృధివ్యాదులు ఒకదాని కన్నా మరొకటి సూక్ష్మం, సూక్ష్మ తరం, సూక్ష్మ తమం, గుణాల్లో హెచ్చుతగ్గుల వలన ఇలాంటి స్థూల ,సూక్ష్మ భేదాలు కలుగుతాయి. పరమా ణువులు సూక్ష్మాలు. అవి తనంతట తాము స్ఠూలాలు కాలేవు. స్వతంత్ర పరిణామం హేతుబద్ధం కాదు. పృధివికి గంధ, రస, రూప, స్పర్శ, గుణాలు ఉన్నందున స్థూల మైనది. జలమునకు రూప, రస, స్పర్శ, గుణముల వలన స్థూలమైనది. భూమి కన్నా సూక్ష్మమైనది. రూప, స్పర్శ గుణాలు ఉన్న తేజస్సు అంటే అగ్ని సూక్ష్మతరమైనది. స్పర్శ గుణం గల వాయువు సూక్ష్మ తమమైనది. ఈ విధంగా హేచ్చుతగ్గులలో ఉన్న గుణాలు గల ఈ నాలుగు భూతాలు తారతమ్యం లో స్థూల, సూక్ష్మ, సూక్ష్మతర ,సూక్ష్మ తమములుగా లోకంలో కనబడుతున్నాయి. వీటిలో తేడాలు ఉండటం వలన వీటికి కారణమైన పరమాణువులలో కూడా తేడాలు ఉండి ఉంటాయి. పరమాణువులు కూడా ఎక్కువ గుణాలున్నవి గాను, తక్కువ గుణాలున్నవి గాను కల్పించబడతాయా? కల్పించబడవా? రెండు విధాలుగా కూడా దోషమున్నది. ఒకవేళ భూమిలో గంధం, జలంలో రసం, అగ్నిలో రూపం, వాయువులో స్పర్శ మాత్రమే ఉన్నాయి. వీటి మధ్య తారతమ్యాలు లేవు అని అంటే అదీ దోషమే. పరమాణువులలో సమత్వాన్ని తీసుకొని రావడం కోసం అన్ని పరమణువులలో ఒక్కొక్క గుణమే ఉంటుందని కల్పించే పక్షంలో తేజస్సులో స్పర్శ యొక్క జ్ఞానం కలగదు. ఉదకంలో రూప, స్పర్శ, లబ్ది ఉండదు. పృదివిలో రస, రూప, స్పర్శ ల జ్ఞానం ఉండదు. ఎందువలననగా కార్యంలోని గుణాలు, కారణంలోని గుణాలను బట్టి ఉంటాయి. అని కల్పిస్తే అప్పుడు నీళ్ళల్లో గంధం, తేజస్సులో గంధ,రసాలు, వాయువులో గంధ, రూప, రసాలు కనబడాలి. కాని అలా కనబడటం లేదు. ఆ కారణం వల్ల కూడా పరమాణు కారణాలు వాదం సమంజసం కాదు.
సూత్రం :- 188
" అపరిగ్రహా చ్చాత్యంత మనపేక్షా "
చ :- ఇంకా చూస్తే, అపరిగ్రహాత్ :- శిష్టులు ఏ స్వతంత్ర పరిణామ వాదాన్ని స్వీకరించక పోవడం వలన, అత్యంత అనపేక్ష :- ఈ వాదాన్ని ఆపేక్షించడం తగదు.
భావం:- ఈ స్వతంత్రప్రకృతి పరిణామవాదాన్ని శిష్టులు అంగీకరించరు. ఇది శ్రుతి, స్మృతికి విరుద్ధం. ఇప్పుడు బాదరాయణుడు విజ్ఞానవాదాన్ని నిరసిస్తున్నాడు.
వివరణ:-పరమాణువాదాన్ని మనువు, మొదలైన శిస్టులు ఎవరూ అంగీకరించలేదు. ఇది యుక్తిసమ్మతం కాదు. అందుచేత దీనిని అంగీకరించవలసిన అవసరం లేదు. వైశేషికులు పదార్ధాలు 6 రకములని చెప్పారు. వీటికి అభావం కలిపితే 7 అవుతాయి. అవి 1. ద్రవ్య, 2. గుణ, 3. కర్మ, 4. సామాన్య,5. విశేష, 6. సమవాయ, 7. అభావం.
1. ద్రవ్యం :- ఇది 9 విధాలు. పృథ్వి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, కాలం, దిక్కు, ఆత్మ, మనస్సు.
2.గుణాలు :-ఇవి 24. రూపం, రసం, గంధం, స్పర్శ, సంఖ్య, పరిమాణం, పృథక్యం ( వేరుగా ఉండటం ), సంయోగం, విభాగం, పరత్వం, అపరత్వం, గురుత్వం, ద్రవత్వం, స్నేహం, శబ్దం, బుద్ధి, సుఖం, దుహఖం, ఇచ్ఛ, ద్వేషం, ప్రయత్నం, ధర్మం, అధర్మం, సంస్కారం.ఇవి స్వతంత్రంగా ఉండలేవు. ద్రవ్యాన్ని అంటి పెట్టుకొని ఉంటుంది. వీటికి లఘుత్వం చేరిస్తే మొత్తం 25 గుణాలు.
3.కర్మ:- ఇది 5 విధాలు. కర్మ అంటే చలనం అని అర్ధం. అవి 1.ఉత్ క్షేపణం(పైకి పోవడం) 2. అవక్షేపణం:-(క్రిందికి పోవడం) 3.ఆకుంచనం(ముడుచుకోవడం ), 4. ప్రసారణం(వ్యాకోచించడం), 5. గమనం( వెళ్లడం). ద్రవ్యం లేనిదే కర్మ లేదు.
4. సామాన్యం :- అనేక వస్తువులలో ఒక సామాన్యలక్షణం ఉండటమే సామాన్యం. ఇది ద్రవ్య, గుణ, కర్మలతో శాశ్వతంగా ఉంటుంది. ఒక చోట అనేక గోవులను చూస్తాము. గోత్వం వాటి సామాన్య లక్షణం. గోవు అంటే గోజాతి అంతా స్ఫరిస్తుంది. అలాగే వృక్షత్వం, ఘటత్వం, ఇత్యాది సామాన్యం అనేది ఊహాకల్పితం కాదు. అది యదార్ధంగా వస్తువులలో ఉంటుంది.
5. విశేషాలు :- సామాన్యానికి వ్యతిరేకమైనది విశేషం. దీని ద్వారా వస్తువుల మధ్య భేదాన్ని గుర్తిస్తాము. ఇది కూడా యదార్ధ పదార్ధమే. ఉహాత్మాకమైనది కాదు.
6. సమవాయ :- వస్తువుల గుణాల మధ్య ఉండే అవినాభావ సంబంధమే సమవాయం. ఒక వస్తువు దాని గుణాలు వేరు కావు. వస్తువు లేకుండా గుణాలు లేవు. గుణాలు లేకుండా వస్తువు ఉండదు. అవయవి - అవయవాలు, చలనం - చలించే వస్తువు, గుణం - గుణి, మొదలైన వాటి మధ్య సమవాయ సంబంధం ఉంటుంది. ఇది విడదీయరాని సంబంధం.
7. అభావం :- ప్రాగభావం, ప్రధ్వoసౌ భావం, అత్యంతా భావం, అన్యోన్య భావం, అని 4 విధాలున్నాయి.
ఈ విధంగా 7 పదార్ధాలకూ వైశేషికులు వేరు వేరు లక్షణాలు ప్రతిపాదించారు. దీని బట్టి ఇవన్నీ ఒకదానితో మరొకటి సంబంధం లేని వస్తువుల వలె స్వతంత్రంగా కనబడుతున్నవి. కాని చివరకు 5 కూడా ద్రవ్యం మీద ఆధారపడి ఉంటాయని వాళ్ళు అంగీకరించరు. గుణాదులు ద్రవ్యంతోనే ఉంటాయి. కాని ద్రవ్యాన్ని విడిచి స్వతంత్రంగా ఉండజాలవు. అని అర్థం. చలనాది కర్మాదులలో కూడా చలనత్వాది జాతులున్న ఆ చలనాదులు ద్రవ్యంలోనే ఉంటాయి. ద్రవ్యాన్ని విడిచి స్వతంత్రంగా ఉండవు. ద్రవ్యగుణాలు ఆయుతసిద్ధాలు కనుక గుణాలు ద్రవ్యాధీనాలు అని వైశేషికులు అంటున్నారు. ఆయుత సిద్ధత్వం అంటే ఒకటి తాను నశించినంత వరకు మరొక దానిని ఆశ్రయించి ఉంటుందో ఆ రెండు ఆయుత సిద్ధాలు. చెట్టు తానున్నంతవరకు అవయవాలను(కొమ్మలు) ఆశ్రయించే ఉంటుంది. అవయవాలు లేకపోతే తాను పోతుంది. గుణం తాను ఉన్నంతవరకు పటాన్ని(వస్త్రాన్ని) ఆశ్రయించుకునే ఉంటుంది. వస్త్రం నశించినా, లేదా మరొక రంగు వేసినా తాను నశిస్తుంది. ద్రవ్యాలు మరొక ద్రవ్యాన్ని ఆరంభిస్తాయి. గుణాలు మరొక గుణాన్ని ఆరంభిస్తాయని వైశేషుకులు అభిప్రాయం. కారణ ద్రవ్యాలైన తంతువులు కార్యద్రవ్యమైన పటాన్ని ప్రారంభిస్తాయి. తంతువులలో ఉన్న శుక్లగుణాలు కార్యద్రవ్యమైన పటంలో మరొక శుక్లగుణాన్ని ప్రారంభిస్తాయి అని వాళ్ళు అంగీకరించరు.
1.వాయువులో ఉన్న స్పర్శ అనే గుణం ఉన్నట్లు చర్మాన్ని స్పర్శించినప్పుడు తెలుస్తుంది.
2.అగ్నిలో ఉన్న స్పర్శ, రూపము అనే గుణాలు ఆ అగ్ని స్పర్శ తగిలినప్పుడు కాలడం అగ్ని లక్షణమని, మండే అగ్నికి ఒకరూపం ఉంటుందని కళ్ళకి తెలుస్తుంది.
3. జలంలో స్పర్శ, రూపం, రసం గుణాలున్నాయి. జలాన్ని చేతితో స్పర్శించవచ్చును. ఏ పాత్రలో పోస్తే ఆ ఆకారాలతో వివిధ రూపాలు ఉంటాయని తెలుస్తుంది. ఆజలానికి రుచివుంటుంది. అదే రసం. ప్రకృతిలో ద్రవ పదార్ధాలాన్ని దీనికి సంబంధించిన రసములే.
4.పృధివికి స్పర్శ, రూపం, రసం, గంధం అనే గుణాలున్నాయి. నేలను స్పర్శించినప్పుడు మట్టి తగులుతుంది. భూమి కొండలు, లోయలు, పర్వతాలు, అనేక రూపాలలో దర్శనమిస్తుంది. రుచివుంటుంది మట్టికి వాసన ఉంటుందని వేసవి కాలంలో హఠాత్తుగా వర్షం పడినప్పుడు తెలుస్తుంది.
ఈ పంచభూతాల వలెనే సృష్టి జరిగిందనే వైషషికుల అభిప్రాయం సమంజసం కాదు. అణువులలో చైతన్యం కలగడానికి పరబ్రహ్మమే కారణమని గ్రహించాలి.
సముదాయాధికరణం ( 2, 2, 18 )
సూత్రం :-189
"సముదాయ ఉభయహేతుకేపి తదప్రాప్తిః "
ఉభయ హేతుకే అపి సముదాయం :- పరమాణు హేతుకం, స్కంద హేతుకం అనే రెండు విధాలైన సముదాయం, తత్ అప్రాప్తిహి :- సిద్ధించడం లేదు.
భావం :- పరమాణు హేతుకమైన బాహ్య సముదాయాలు, స్కంద హేతుకమైన అధ్యాత్మ సముదాయంలో కూడా తమంతట తాముగా సిద్ధించడం లేదు.
వివరణ:- ఇంకో వాదంఉంది. అది పరమాణువుల వలన ధ్వ్యణుకాది కార్యపదార్ధాలు ఉత్పన్నం కావని, పరమాణువుల సముదాయాలే ఈజగత్తులోఉండే పదార్ధాలని అనడం, వీళ్ళదృష్టిలో పరామణువులు పృధివ్యాదిపరమాణు సముదాయాలు, వాటిని అనుభవించే జీవులు క్షణికాలే. జీవుడంటే విజ్ఞానం, బుద్ధి, చిత్తం ఇవన్నీ ఒక్కటేనని వీరి వాదం. ఇప్పటి వరకు అణుసిద్ధాంతాన్ని నిరాకరించిన వ్యాసభగవానుడు ఇప్పుడు బౌద్ధమతాన్ని ఖండిస్తున్నాడు. బుద్ధుని ఉపదేశాలను ఆధారం చేసుకొన్న శిష్యులు నాలుగు శాఖలుగా చీలిపోయారు. వారు 1.వైభాషికులు, 2.సౌత్రాంత్రికులు, 3. విజ్ఞానవాదులు, 4.సర్వ శూన్యవాదులు. వీటిలో ముందుగా మొదటిఇద్దరి వాదాన్ని ఖండిస్తున్నారు. లోకంలోని పదార్ధమంతా బాహ్యము, అభ్యంతరము అని 2 విధాలు. బాహ్యపదార్ధం మరల 2 రకాలు. భూతము, భౌతికము. 1. భూతము :- భూమి, జలము, అగ్ని, వాయువు. 2. భౌతికము:- స్పర్శ, రూప, రస, గంధం వీటిలో ఆకాశం దాని లక్షణమైన శబ్దము స్పర్శ లేవు. భౌతిక పదార్ధాలన్ని ఈనాలుగు భూతాలకు సంబంధించినవే. భూమికి సంబంధించిన పరమాణువులు కఠినస్వభావం కలవి. జలానికి సంబంధినవి స్నేహభావం కలవి. అగ్నికి సంబంధించినవి ఉష్ణస్వభావం కలవి. వాయువుకు సంబంధించిన అణువులు చలనస్వభావం కలవి. 1.పరమాణుహేతుకవాదం:- సముదాయవాదులు ఈ జగత్తును భోకృ, భోగ్య రూపాలుగా విభజిస్తారు. భూత భౌతికాత్మక బాహ్య జగత్తు భోగ్యం. చిత్త చేతనాత్మకం భోకరు సముదాయం. బాహ్య సముదాయానికి గంధ, రస, రూప, స్పర్శ పరమాణువులు కారణం. ఇవి స్వయంగా సముదాయాలై పృధి వ్యాపస్తేజోవాయువులవుతాయి. ఇవి ఓషదులు మొదలైన రూపాల్లో భోగ్యాలు అవుతాయి. పరమాణువులు క్షణికాలే కనుక వీటి వలన ఏర్పడిన పృద్ధివ్యాదులు కూడా క్షణికాలే. 2. స్కంద హేతువాదం :- రూప స్కందం, విజ్ఞాన స్కందం, వేదనా స్కందం, సంజ్ఞా స్కందం, సంస్కార స్కందం, అనే 5 స్కందాలు అధ్యాత్మ సముదాయానికి హేతువులు. శరీరంతో బాటే ఉండేది రూప స్కందం. ఇదే భోగసాధనం. ఆయా విషయాలను గ్రహించే నేను అనే అభిమాన విజ్ఞానం విజ్ఞాన స్కందం. దీనినే భోక్త అంటారు. ప్రియం, అప్రియం వీటితో కలిగే సుఖ దుఃఖాలు ఊపేక్ష వంటి విషయాలతో కూడిన చిత్తావస్థ వేదనా స్కందం. వీడు, వాడు తెలుపు, ఎరుపు, అనే సంజ్ఞ ల సంబంధం వలన తెలిపే ప్రవృత్తి విజ్ఞానం. సంజ్ఞ స్కందం ఇదే భోగం. రాగాది క్లేశాలు, మద మోహాలు, ధర్మాధర్మాలు, సంస్కార స్కందం. ఇది భోగానికి నిమిత్తం. విజ్ఞాన స్కందాన్ని చిత్తం అంటారు. మిగతా నాలుగింటిని చైత్తాలు అంటారు. లోక వ్యవహారమంతా ఈ స్కందాన్ని ఆశ్రయించి ఉంటుంది. ఇదే సముదాయ వాదం. ఈవాదం సరిఅయినది కాదు. సముదాయలుగా ఏర్పడే పరామణువులు క్షణికాలు. కనుక సముదాయలు ఏర్పడలేవు. అలాగే స్కందాలు క్షణికాలే. కనుక సముదాయలు అవి ఏర్పడక ముందే నశిస్తాయి. అందువలన క్షణిక పరామణువులు క్షణిక సముదాయాన్ని ఏర్పారుస్తాయనడం హాస్యాస్పదంగా ఉంటుంది. సముదాయవాదులు ప్రళయీన్ని అంగీకరిస్తారు. క్షణికాలకు ప్రళయం ఏముంటుంది? ఈ వాదం అయుక్తం. పరామణు హేతువు, స్కంద హేతువు అచేతనాలే. ఈ రెండు అచేతనాలను ఒకచోట చేర్చే సంధాన కర్త ఒకరుండాలి. అటువంటి వాడు ఉన్నాడని బౌద్ధులు అంగీకరించరు.
సూత్రం :- 190
"ఇతరేతర ప్రత్యయ త్వాదితి చేన్న ఉత్పత్తి మాత్ర నిమిత్త్వాత్
ఇతరేతర ప్రత్యయత్వాత్ :- తరువాత సిద్ధించే పదార్ధాలను పూర్వ పదార్ధాలు కారణములు కనుక, పూర్వ పదార్ధములు క్షణికములైనా, సముదాయములు ఏర్పడతాయి. ఇతి చేత్ :- అని అంటారా? ఉత్పత్తి మాత్ర నిమిత్తత్వాత్ :- క్షణికాలు క్షణికాలనే ఉత్పత్తి చేస్తాయి. కనుక న :- సముదాయ సిద్ధి కలగనేరదు.
భావం :- ప్రతి పదార్ధం పుట్టడానికి దాని పూర్వ పదార్ధమే కారణమని, పూర్వ పదార్ధములు క్షణికములైన మరొక క్షణికమైన పదార్ధములను ఉత్పత్తి చేస్తాయి. కాని సముదాయ సిద్ధి కలగదు.
వివరణ :- అవిద్యాదులు ఒకదానికొకటి కారణమైనంత మాత్రాన చేతనుడు లేకపోయినప్పటికి ఉత్పత్తి జరుగుతుందని వారు అంటారు. అది నిజం కాదు. మట్టి, దండం, చక్రం లాంటి అచేతన సాధనలు ఉన్నప్పటికీ, చేతనుడైన కుమ్మరి లేకపోతే కుండ తయారు కాదు. పూర్వ క్షణికాలు, ఉత్తర క్షణికాలను చెయ్యడానికి కారకాలే గాని సముదాయ ఉత్పత్తికి హేతువులు కావు. క్షణికాలు తమకంటే తరువాత క్షణికాలను ఉత్పత్తిచేస్తే అవి ధ్వంసం అవుతాయి. అప్పుడు సముదాయం ఎలా కలుగుతుంది? దానికి ఆ జ్ఞానం ఎలా కలుగుతుంది? అందువల్ల దేనికైనా చేతన నిమిత్తం కారణం అవసరం. అవిద్యాదులు కేవలం ఉత్పత్తికి మాత్రమే హేతువులు కాని సముదాయ భావం, లోకయాత్ర కుదరదు. భోక్త అంటే నేను అనే అహం ఉన్న జీవుడు అవిద్య, సంస్కారం, విజ్ఞానం, నామరూపం, స్పర్శ, వేదన, తృష్ణ, ఉపాదానం, భవం, జాతి, జర, మరణం, శోకం, పరివేదన, దుహఖం, మొదలైనవి అనుభవిస్తూ లోకయాత్ర సాగిస్తాడు. వీటిని సౌగతుల సిద్ధాంతంలో కొన్ని చోట్ల విస్తృతంగా, కొన్నిచోట్ల సంక్షిప్తంగా వివరించారు. వీటిని అందరూ దార్శనికులు అంగీకరించాలి. వీటిని వ్యాక్యానించవలసిన అవసరం లేదు. ఈ అవిద్యాదులన్నీ ఒకదానికొకటి కారణం అవుతూ ఘటి యంత్రం వలె మోటు బావిలో నీరు తోడటానికి పెద్ద చక్రానికి చుట్టూ ఘటాలు కట్టి ఏర్పారచిన యంత్రం వలె నిరంతరం తిరుగుతున్నప్పుడు ఉత్పత్తి మాత్రానికే నిమిత్తాలు. కాని సంఘాతం పుట్టడానికి కారణం కావు. అనిత్యాలు, అశుభాలు, క్షణికాలు అయిన శరీరకంగా పరిణమించిన అనాత్మ భూతాల విషయంలో ఇవినిత్యాలు. ఆత్మఅనే బుద్ధి, అవిద్య వలన శరీరము నందు రాగం, అనుకూలంగా లేకపోతే ద్వేషం, ఇహికము ఆముష్మికము అయిన పనులు చెయ్యడం, జన్మంతరానికి సంబంధించిన అవిద్యా సంస్కారాల చేత తల్లి గర్భంలో పిండరూపంలో వేదన అనుభవించి, దుఃఖం విడనాడాలనే తృష్ణతో దానికి తగిన ఉపాదానకారణమైన గర్భం నుండి బయటకు రావడం, శోకం, కోరికలు, పరివేదన అనుభవించి, చివరకు మరణం సంభవించడం, లోకాన్తరప్రాప్తి, మళ్ళీ పునర్జన్మ ఇవన్నీ అవిద్యతో ఉన్న జీవుడికి నిత్యాలే. ప్రతీత్యసముతపాదాన్ని గురించి బుద్ధ సూత్రాలు :- ఈ సూత్రాలకు కల్పతరువులో అర్ధం చెప్పబడింది. మరొక హేతువు గురించి వెళ్ళేది గాన ప్రత్యయం అని పేరు. అనగా ఇతర సహకారము లతో కలసి మరొక హేతువు దగ్గరకు వెళ్ళేది ప్రత్యయం. ఈ కార్యం కారణముయొక్క సముదాయ ఫలమే గాని చేరడం యొక్క ఫలం కాదు. 1.హేతుప నిబంధన :-బీజం నుండి అంకురం పుడుతుంది. అంకురం నుండి ఆకు, ఆకు నుండి కాండం, కాండం నుంచి నాలం, నాళం నుండి గర్భం, గర్భం నుండి శూకం(వెన్ను) శూకం నుండి పుష్పం, పుష్పం నుండి ఫలం ఉద్భవిస్తాయి. అంకురాన్ని పుట్టించాననే జ్ఞానం బీజానికి ఉండదు. నన్ను బీజం పుట్టించిందనే జ్ఞానం అంకురానికి ఉండదు. ఈ విధంగా చివరి వరకు వెళ్లగా నేను ఫలాన్ని పుట్టిస్తున్నాను అనే జ్ఞానం పుష్పనికి ఉండదు. ఈ విధంగా చైతన్యం లేకపోయినా బీజాలకు మరొక అధిష్టానం దేవత లేకపోయినా కార్యకారణ భావ నియమం కనబడుతున్నది. 2.ప్రత్యయోప నిబంధన:-ప్రత్యయం అనగా అనేక హేతువుల సముదాయం. బీజం కారణంగా గల అంకురం ఆరు ధాతువుల సముదాయం. పృద్వి ధాతువు బీజాన్ని సంగ్రహిస్తుంది. దాని వలన అంకురం కఠినం ఔతుంది. జలధాతువు బీజంలో తేమ పుట్టిస్తుంది. తేజోధాతువు బీజాన్ని పక్వం చేస్తుంది. వాయుధాతువు బీజాన్ని కొడుతుంది. అంకురం బయటకు వస్తుంది. ఆకాశ ధాతువు బీజానికి అనావరణం కల్పిస్తుంది. ఋతువు బీజంలో పరిణామం తెస్తుంది. పృద్విధాతువు బీజాన్ని సంగ్రహించాను అనుకోదు. ఇలా చివరివరకు నేను బీజంలో పరిణామం చేస్తున్నాని ఋతువు అనుకోదు. ఈ విధంగా చైతన్యం లేకపోయినా అధిష్టాన దేవత ప్రేరణ లేకపోయినా కార్యకారణ సంబంధం ఉంటుందని వారి అభిప్రాయం. ఇది సమంజసం కాదు. ప్రతి చర్య వెనుక పరబ్రహ్మం యొక్క ప్రేరణ ఉంటుంది.
సూత్రం :- 191
"ఉత్పరోత్పాదే చ పూర్వ నిరోధాత్ "
చ :- అంతే కాదు, ఉత్పర ఉత్పాదే :- ఉత్తర క్షణఉత్పత్తి సమయంలో, పూర్వ విరోధాత్ :- పూర్వ క్షణం నశించడం వలన, పూర్వ క్షణం ఉత్తర క్షణం ఉత్పత్తి కారణం అనడం కూడా తగదు.
భావం :- ఉత్తర క్షణం ఉత్పత్తి సమయంలో పూర్వ క్షణం నశించడం వలన, పూర్వ క్షణం, ఉత్తర క్షణ ఉత్పత్తి కారణం అనడం తగదు.
వివరణ :- వీరి మతంలో ఉత్తర కార్యోత్పత్తి జరిగే సమయానికి, పూర్వ జ్ఞానం నశిస్తోంది. కాబట్టి హేతువుకు అధీనమైన కార్యోత్పత్తి కూడా జరగదు. వీరి మతానుసారం అవిద్య, సంస్కారం, విజ్ఞానం, నామము, రూపము, మొదలైన వాటిలో అవిద్య వలన సంస్కారం పుడుతుంది. సంస్కారం పుట్టగానే అవిద్య నశిస్తుంది. సంస్కారం నుంచి జ్ఞానం పుడుతుంది. విజ్ఞానం పుట్టగానే సంస్కారం నశిస్తుంది. విజ్ఞానం నుంచి నామం పుడుతుంది. నామం పుట్టగానే విజ్ఞానం నశిస్తుంది. ఈ రకంగా ఉత్తరకార్యాలు పుట్టినప్పుడు పూర్వకార్యాలు నశిస్తాయి. నశించిన వస్తువు ఇక ఉండదు. లేనిది కారణం కాదు కదా! కాబట్టి కారణాన్ని అనుసరించి కార్యోత్పత్తి జరగదు. ఇది ఒక దోషమే. అవిద్య ఉండటం వలన జీవుడు ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకునే సంస్కారం అలవడుతుంది. అవిద్య అనే కారణం వలన సంస్కారం అనే ఉత్తర కార్యం పుడుతోంది. దానివలన పూర్వజ్ఞానం నశిస్తోంది. అంటే అవిద్య నాశనమౌతుంది. అవిద్య అనే హేతువుకు తగినట్లుగా కార్యం జరగలేదు. అవిద్యకు భిన్నమైన సంస్కారం పుట్టింది. కాబట్టి హేతువుకు అధీనమైన కార్యోత్పత్తి కూడా జరగదు. పూర్వ క్షణికం, ఉత్తర క్షణికం పరమాణువులు రెండు ఒకే క్షణంలో జరిగితే పూర్వోత్తర భావం ఉండదు. కార్యకారణములలో కారణం పూర్వం. కార్యం ఉత్తరం. కార్యానికి పూర్వం నియామంగా ఉండేది కారణం. వీళ్ళ మతం ప్రకారం ఘటం, పటం మొదలైన స్థిరమైన పదార్ధాలు ఏమి లేవు. ఈ క్షణంలో ఉన్న ఘటం నుండి మరొక ఘటం పుడుతుంది. మళ్ళీ ఆఘటం మరొక ఘటాన్ని పుట్టిస్తుంది. ఈ విధంగా జగత్తులో ప్రతి వస్తువు కూడా క్షణికమే. కనబడేది ఘటం కాదు. ఘట ప్రవాహం. అది నశించేది. అవిద్యాదులు కూడా క్షణికలే. క్షణికాలైన అవిద్య నుండి సంస్కారాదులు పుట్టడం కూడా కుదరదని చెప్పడం కోసం ఈ విచారణ చేయబడుతోంది. పూర్వ క్షణం నిమిత్తం. ఉత్తర క్షణం ఫలం, అనే హేతువుల భావన శక్యం కాదు. పూర్వ క్షణం అభావం చేత లేనిదైపోవడం వలన అది ఉత్తర క్షణానికి హేతువు కాదు. విత్తనం నుంచి అంకురం వచ్చినప్పుడు విత్తనం యొక్క హేతువు అంకురం లో కనబడుదు. కనుక పూర్వ క్షణం ఉత్తర క్షణానికి హేతువు అని చెప్పడం కుదరదు. హేతువు యొక్క రూపం, లేదా స్వభావం కొంతవరకు ఫలంలో సంక్రమిస్తేనే అది హేతువు అవుతుంది. అలా సంక్రమించక పోతే అది హేతువు కాదు. ఇది ఫలం కాదు అని బౌద్ధులు పూర్వ క్షణం, ఉత్తర క్షణం ఉత్పత్తికి కారణం కాదని వారి అభిప్రాయం.
సూత్రం :- 192
"అసతి ప్రతిజ్ఞో పరోధో యోగ పద్యం అన్యధా వా "
అసతి :- పూర్వ క్షణిక పరమాణువు లేకపోయినా, ఉత్తర క్షణ కార్యం అవుతుందని ఒప్పుకుంటే, ప్రతిజ్ఞా ఉపరోధః :- పూర్వ క్షణికం వల్ల ఉత్తర క్షణికం ఉత్పన్నమౌతుంది. వా :- అలాకాక, అన్యధా :-పూర్వ పక్షం నశిస్తుందని ఒప్పుకోకుంటే, యోగ పద్యం :- పూర్వ, ఉత్తర క్షణికాలు రెండు ఒకే క్షణంలో ఉన్నట్లు అంగీకరించాలి.
భావం :- పూర్వ క్షణిక పరామణువు లేకపోయినా, ఉత్తర క్షణ కార్యం అవుతుందని ఒప్పుకుంటే, పూర్వ క్షణికం వలన ఉత్తర క్షణికం ఉత్పన్నమౌతుందని మీరు అన్న మాటకు భంగం వాటిల్లుతుంది. పూర్వ, ఉత్తర క్షణికాలు రెండు ఒకే క్షణంలో ఉన్నట్లు అంగీకరిస్తే క్షణికత్వానికి హాని కలుగుతుంది.
వివరణ :- పూర్వ క్షణం అంటే కారణం. ఉత్తర క్షణం అంటే కార్యం. కారణం లేకుండా కార్యం జరుగుతుందని బౌద్ధులు చెప్పిన దానికి భంగం కలుగుతుంది. మట్టి లేకుండా కుండ ఎలా తయారవుతుంది. అలా కాకుండా కార్యం కలిగేంత వరకు కారణం ఉంటుంది అన్నా వారు చెప్పిన దానికి భంగం కలుగుతుంది. బౌద్ధమతంలో ఇది ఎరుపు, ఇది నలుపు అనే జ్ఞానరూపకమైన కార్యం పుట్టాలి అంటే పూర్వజ్ఞానం, చక్షసు, ఆలోకం(చూచుట) విషయము అనే నాలుగు హేతువులు ఉండాలి. కాబట్టి కారణం లేకుండా కార్యం పుడుతుందని అంగీకరిస్తే వారి వాదనకు భంగం కలుగుతుంది. అలాగే కారణం ఉన్నప్పుడు కార్యం ఉంటుంది. అని అంగీకరించినా వారి వాదనకు భంగం కలుగుతుంది. ఎందుకంటే కార్యాకారణములు ఒకే కాలంలో ఉంటాయి. కాబట్టి సర్వం క్షణికం అనే మాటకు భంగం వాటిల్లుతుంది. ఈరకంగా బౌద్ధుల వాదన తప్పు అవుతోంది. చిత్త చైత్యాలు నాలుగు విధాలైన హేతువులను చేరి పుడతాయి అనే వారి ప్రతిజ్ఞ భంగం అవుతుంది. చిత్తం అంటే జ్ఞానం, చైత్తము అంటే సుఖాదులు. చిత్త చైత్తలు 4 హేతువులతో పుడతాయని బౌద్ధులు అంటారు. సహకారి, సమంతర ప్రత్యయం, ఆలంబనం లను పొంది చిత్త చై త్తలు పుడతాయి. ఈ నాలుగు హేతువులలో ఆలంభనం ఒకటి. ఘట జ్ఞానానికి ఘటం ఆలంభనం. ఇది ఘటమని, గ్రహించినప్పుడు ఆ ఘటం వర్తమానకాలంలో సంబంధించినట్లు గ్రహీంపబడుచున్నది. అందుచేత అది వర్తమాన కాలంలో ఉండాలి. ఈజ్ఞానానికి హేతువు అయినా ఆలంబనంగా పూర్వపక్షంలో కూడా ఉండేది. ఈ విధంగా ఆ ఘటం కనీసం రెండుక్షణాలు ఉన్నట్లు చెప్పాలి. అది క్షణభంగవాదానికి విరుద్దం. అలాకాక పూర్వపక్షం ఉత్తరపక్షం పుట్టేవరకు ఉంటుంది అని అంగీకరిస్తే అప్పుడు హేతువు ఫలము రెండు కూడా ఒకే సమయంలో ఉన్నాయని చెప్పవలసిన వస్తుంది. అప్పుడు క్షణభంగవాదానికి భంగం కలుగుతుంది. అలా చెప్పినప్పుడు సంస్కారాలన్ని క్షణికాలు అనే ప్రతిజ్ఞకు అవరోధం కలుగు తుంది. బౌద్ధమతం ప్రకారం సంస్కారం అంటే వాసన అని అర్ధం. సంస్కరింపబడుతున్నది కనుక సంస్కారం. కార్యం కూడా సంస్కారమే. కార్యకారణాత్మకమైన సమస్త భావ పదార్ధాలు కూడా క్షణికాలే అని అర్ధం.
సూత్రం :- 193
"ప్రతి సంఖ్యా ప్రతి సంఖ్యా నిరోధా ప్రాప్తి ర విచ్చేదాత్
"అవిచ్చేదాత్ :- భావ పదార్ధం ఉనికి నశించడం వలన, ప్రతి సంఖ్యా, అప్రతి సంఖ్యా నిరోదాత్ :- ప్రతి సంఖ్యా నిరోధం, అప్రతి సంఖ్యా నిరోధం సిద్ధించవు. భావం :- భావ పదార్ధం లేకుండా నశించడం వలన, అంటే భావ విచ్ఛేదనం కానందు వలన, ప్రతి సంఖ్యా నిరోధం, అప్రతి సంఖ్యా నిరోధం సిద్ధించవు.
వివరణ:-ఈసూత్రంలో 2 పదాలున్నాయి. 1. ప్రతి సంఖ్యా నిరోధం, 2 . అప్రతి సంఖ్యా నిరోధం ప్రతి సంఖ్యా నిరోధం అంటే బుద్ధి పూర్వకమైన నాశనం, ఇదే స్థూలనాశనం. అప్రతిసంఖ్యానిరోధనం అంటే బుద్ధి పూర్వకము కాని వినాశనం. ఇది సహజంగా జరిగే వినాశనం. ఈ రెండు వినాశనాలు బౌద్ధులు కల్పించుకున్నవే. వీరి భాషలో భావాలు అంటే కుండ, వస్త్రం మొదలైనవి. ఇవి ప్రతి క్షణం నశించిపోతూనే ఉంటాయి. అంటే వాటంతట అవే నశిస్తాయి. అలాంటప్పుడు బుద్ధిపూర్వకమైన నాశనానికి అవకాశం లేదు. వీరి మతం ప్రకారం ప్రతి క్షణం నశించడం అంటే కుండ వాటి మూల పదార్ధమైన మట్టి నాశనం అయ్యేవరకు నశిస్తుంది అనాలి. నశించిన కుండ మళ్ళీ పుట్టింది అనాలి. అలాకాకుండా ఇంకొక కుండ వచ్చింది అంటే వెనుకటి కుండ, ఇప్పటి కుండ ఒక్కటే అని అనిపించదు. జాగ్రత్తగా పరిశీలిస్తే కుండ, వస్త్రం మొదలైన వస్తువులలో మట్టి, దారాలయొక్క అనుబంధం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి బుద్ధిపూర్వకము కాని నాశనం జరగడం లేదు. అందువలన వారి వాదన తప్పు. బౌద్ధుల సిద్ధాంతం ప్రకారం భావ పదార్ధాలన్ని క్షణికాలే. ఒక వృక్షం ఆ క్షణంలో ఉంటుంది. మరొక చెట్టు పుట్టించి అది మరు క్షణంలో నశిస్తుంది. ఈ విధంగా క్షణక్షణానికి క్రొత్త క్రొత్త వృక్షాన్ని పుట్టిస్తూ, వెనుకటి క్షణంలో ఉన్న వృక్షం నశిస్తుంది. ఈ విధంగా చెట్టుయొక్క అవిచ్చిన్నమైన ధార మాత్రమే కనిపిస్తుంది. అదే సంతానం. వృక్షసంతానంలో ఉన్న వృక్షాలు సంతానులు. ఈ ప్రతిసంఖ్యా, అప్రతిసంఖ్యా నిరోధాలు సంతానానికి సంబంధించినవా? కాదా? అనేది ప్రశ్న. సంతానానికి సంబంధించిన ప్రతిసంఖ్య, అప్రతి సంఖ్యా నిరోధాలు సంభవించవు. ఎందువలనంటే అన్ని సంతానాలలోనూ అవిచ్చిన్నమైన హేతువుల భావం ఉంటుంది. గాన సంతాన విచ్చేదం సంభవం కాదు. నిరన్వయం అనగా ఏ వస్తువు కూడా అనున్యూతంగా ఉందని అర్ధం. ఘటం నాశనమైతే అది పెంకులు, చూర్ణం మొదలైన అవస్థలు మారినా కూడా అన్ని అవస్థలలోనూ మట్టి అనున్యూతంగా వస్తున్నట్లు కనిపిస్తుంది. ఆమట్టియే ఇది అని ప్రత్యభిజ్ఞానం ద్వారా తెలుస్తుంది. ఒక వస్తువు పూర్తిగా నశించడం అనేది ఉండదు అని చెప్పడానికి ప్రత్యేభిజ్ఞానం వలన తెలుస్తుంది. అయితే బాగా కాలిన రాయి మీద పడిన నీటి చుక్క పూర్తిగా నశిస్తుంది కదా! అది నిరన్వయమా? నిరుపాఖ్యమా? అని సందేహం రావచ్చును. నిరుపాఖ్యం అంటే నామరుపాలు లేకుండా పూర్తిస్వరూపమే నశించడం. అక్కడ కూడా ఆ నీటిని తేజస్సు మేఘంగా మార్చడం కోసం మార్తాండ మండలం లోకి తీసుకొని పోవుచున్నదని ఊహించాలి. ఉదకబిందువులోని ఉదకత్వానికి, సముద్రంలో ఉన్న ఉదకత్వానికి భేదంలేదు. అక్కడ బిందువు కనబడకపోయినా, దానికి సముద్రజలాన్వయం ఉంది అని ప్రత్యక్షప్రమాణం చేత చెప్ప వచ్చును. సత్ రూపం, అసత్ రూపం అవుతుందని ప్రతి సంఖ్య, అసత్ సత్ అవుతుందని అప్రతి సంఖ్య.. రెండు తప్పే. భావ పదార్ధాలకు అన్వయవిచ్చేదం ఉంటుంది. కాని నిరన్వయ విచ్చేదం ఉండదు. అందువలన భావం, అభావం ఎన్నటికీ కాదు. బౌద్ధుల దృష్టిలో భావం అంటే కుండ, వస్త్రం మొదలైనవి.
సూత్రం :- 194
" ఉభయధా చ దోషాత్ "
చ :- అంతే కాక, ఉభయధా చ :- సముదాయ వాదం సహేతుకం, నిర్వేతూకం రెండు కానందువల్ల, దోషాత్ :- దోష భూయిష్టమైనందువల్ల సిద్ధించడం లేదు.
భావం :- సముదాయ వాదం సహేతుకం, నిర్వేతుకం రెండూ కానందు వలన దోషభూయిష్టమైనందు వలన సిద్ధించడం లేదు.
వివరణ:-పూర్వక్షణ పరమాణువు, ఉత్తరక్షణ పరమాణువుకు కారణం అనడం సమంజసం కాదు. సర్వం ఆత్మ రహితం అనడం నిర్వేతుకం. ఈ రెండు రకలైన దోష ప్రసక్తి వస్తున్నది కనుక సముదాయవాదుల ఉభయవిధ నిరోధాలు సిద్ధించడం లేదు. అవిద్య అనేది జ్ఞానంవలన నశిస్తుందా? లేక తనంతటా తానే నశిస్తుందా? క్షణికములైన వాటిని శాశ్వతమని భావించడమే అవిద్య. యమనియమాలతో కూడిన మార్గం అవిద్యను నిరోదిస్తుంది అని బౌద్ధులవాదన. జ్ఞానం వలెనే అవిద్య నిరోదింపబడుతున్నది. అంటే అన్ని వస్తువులకు నాశనం ఏర్పడుతుందనే వాదన తప్పుతుంది. అలా కాకుండా దానంతట అదే అవిద్య నశించిపోతుంటే, సర్వం క్షణికం అన్న బుద్ధుని బోధనలు తప్పుతాయి. ఏరకంగా చూసినా వీరి వాదనకు బలం లేదు. ప్రతిసంఖ్యా నిరోధంలో అంతర్గతమై కల్పించబడిన అవిరోధానిరోధనం అనే సాధనంతో కూడిన సమ్యక్ జ్ఞానం వలన కలుగుతుందా? లేదా తనంతటా తానే కలుగుతుందా? మొదటిపక్షంలో వినాశనం నిర్వేతుకంగా జరుగుతుంది అనే అంగీకారానికి విరోధం, రెండవ పక్షంలో మార్గోపదేశం వలన దోషం కలుగుతుంది. మార్గోపదేశం అంటే సర్వం దుఃఖం, సర్వం క్షణికం, అనే భావన చేయడం వలన అవిద్య నశిస్తుంది. అని ఉపదేశించిన మోక్షమార్గం వ్యర్థం అవుతుంది. వాటి వినాశనం స్వయంగానే జరిగినప్పుడు ఈ మార్గం ఎందుకు? ఈ విధంగా రెండు విధాల కూడా దోషం ప్రసక్తం అవుతున్నది. కనుక ఈ దర్శనం అసమంజసమైనది. బ్రహ్మవిద్యాభరణంలో ఈభాష్యానికి భావం ఈవిధంగా వివరించబడింది. నేను ఘటాన్ని తెలుసుకొనుచున్నాను అనే సవికల్ప జ్ఞానమే అవిద్య. అలాంటి సవికల్ప జ్ఞానం నశించ, నిర్వికల్ప ఆలయ విజ్ఞానం మిగలడమే మోక్షం. ఆలయ విజ్ఞానం సహజంగా నిర్వికల్పమే. వాసనలు మొదలైన ఉపాధుల వలన సవికల్పత్వం కలుగుతోంది. దానిని తొలగించుకోవడానికి ఆలయ విజ్ఞానం ఉత్పన్నం కావడమే సమ్యక్ జ్ఞానం అని వారి సిద్ధాంతం. అవిద్యానిరోధం అంటే ప్రతిసంఖ్యానిరోధం అంటే బుద్ధి పూర్వకమైన నాశనం అని బౌద్ధులు అంగీకరించారు. ముముక్షువుడైన సాధకుడు కూడా క్షణికుడే. అందుచేత మోక్షావస్థలో ఆసాధకుడండడు. కనుక సాధన విషయంలో దానికి ప్రవృత్తి ఉండదు. అందుచేత వారు అవిద్య యొక్క ప్రతి సంఖ్యా నిరోధం కూడా హేతువు లేని నిరోధమేనని వారు అంగీకరించాలి.
సూత్రం :- 195
" ఆకాశే చావిశేషాత్ "
ఆకాశేచ :- ఆకాశంలో కూడా, అవిశేషాత్ :- సమానంగా వస్తు ప్రతిపత్తి ఉన్నందున, అది అభావం అనడం సరికాదు.
భావం :- ఆకాశం కూడా పృధి వ్యాదుల వలె వస్తు ప్రతిపత్తి ఉన్నందున అది అభావం అనడం సరి అయినది కాదు.
వివరణ :- ఆకాశం అనేది ఒక వస్తువు కాదంటారు బౌద్ధులు. బౌద్ధ మతంలో ఆకాశం అంటే ఆవరణం లేకపోవడం అని అర్ధం చెప్పారు. పృథివ్యాదుల వలె ఆకాశం కూడా ఒక వస్తువేనని వారు భావించడం లేదు. పృధివికి గంధం మొదలైన గుణాలు ఉన్నట్లే, ఆకాశం కూడా శబ్దగుణానికి ఆశ్రయం. ఆకాశం అంటే అవకాశం కల్పించేది. నేల మీద కుండను ఉంచినప్పుడు ఆ కుండకు భూమి ఆధారంగా ఉన్నదనే భావన కలుగుతోంది. ఆకాశంలో పక్షులు గానీ, విమానాలు గాని ఎగురుతున్నప్పుడు వాటికీ ఆధారంగా నిలిచేది ఆకాశమే. ఈ విధంగా ఆకాశం కూడా ఒక వస్తువే. తైత్తరీయెపనిషత్తులో పరబ్రహ్మం నుండి ఆకాశం పుట్టిందని, అందువలన ఆకాశంకూడా ఒకవస్తువేనని చెప్పబడింది. శ్రుతి ప్రమాణాన్ని అంగీకరించని వాళ్ళు ఆకాశాన్ని ఒక వస్తువుగా గ్రహించరు. అనుమానప్రమాణం చేత గ్రహించాలి. ఎందువలననగా పృథవి మొదలైన వస్తువులకు గంధం అనే గుణం ఉన్నట్లే, శబ్దంఅనే గుణం ఆకాశాన్నిఆశ్రయించి ఉందని, అందువలన ఆకాశం కూడా ఒక వస్తువేనని అనుమాన ప్రమాణం వలన తెలుస్తోంది. మరొక విషయం ఏమిటంటే ఆకాశం అనగా ఆవరణ లేకపోవడం మాత్రమే కాదు అని అంగీకరిస్తే, ఆకాశంలోకి ఒకపక్షి ఎగిరినచో అక్కడ ఆవరణం ఏర్పడటం చేత పైకి ఎగురుదాం అనుకునే మరొక పక్షికి అవకాశం ఉండదు. ఎక్కడైతే ఆవరణం లేదో అక్కడ ఆ రెండవపక్షి ఎగురుతుంది అన్నట్లయితే "యత్రావరణాభవ" అని దేనిచేతనైతే నువ్వు ఆవరణాభావాన్నీ విశ్వాసిస్తున్నావో, అది వస్తువే అయిన ఆకాశం అవుతుంది. కాని ఆవరణాభావం మాత్రం కాదు. ఈ భూతలం మీద ఘటం లేదు అన్నప్పుడు ఘటం లేదని ఏ భూతలాన్ని చూపుతున్నావో, ఆ భూతలం ఒక వస్తువే అయినట్లు, పక్షుల భావానికి స్థానమైన ఆకాశం కూడా ఒక వస్తువే కావాలి, అసత్ పదార్ధం కాకూడదు. భూమి పృథ వ్యాదులు చివర ఆశ్రయించుకున్నట్లే, వాయువు ఆకాశాన్ని ఆశ్రయించుకొని ఉన్నది. ఆకాశం వస్తువు కాకపోతే అసత్ అయితే ఈసమాధానం సమంజసం కాదని చెప్పవలసిన వస్తోంది. ప్రతిసంఖ్యానిరోధం, అప్రతిసంఖ్యానిరోధం, ఆకాశం ఈ మూడు కూడా నిరుపాఖ్యాలు. అవస్తువులు(వస్తువులు కానివి) అయితే నిత్యమైనవి అని చెప్పడం పరస్పర విరుద్ధమైన మాట.
సూత్రం :- 196
" అను స్పృతే శ్చ "
చ :- అంతే కాక, అను స్పృతే పి :- ఉనికికి గుర్తింపు ఉన్నందుకు వలన, భావాలను క్షణికం అనడం యుక్తం కాదు.
భావం :- భావాల ఉనికికి గుర్తింపు ఉన్నందు వలన భావాలను క్షణికం అనడం యుక్తం కాదు.
వివరణ:- బౌద్ధుల వాదన ప్రకారం సర్వము క్షణికమే. అంటే ఆత్మ కూడా క్షణికమే అంటున్నారు. కాని అది నిజంకాదు. ఆత్మ శాశ్వతమైనది. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఉండేది ఆత్మయే. ఆత్మ నిత్యం, సత్యమైనది. ఈ విషయం ఉపనిషత్తులలో స్పష్టంగా అనేక సార్లు చెప్పబడింది. కాబట్టి ఆత్మ క్షణికమైనది అని చెప్పే బౌద్ధుల వాదన తప్పు. సముదాయవాదుల దృష్టిలో భావపదార్ధాలన్ని క్షణికాలు. భావాలు అంటే సత్వపదార్ధాలు. సత్వం క్షణికమనీ, అది అర్ధక్రియలను చేస్తుందని క్షణిక వాదులంటారు. అది సరి అయినది కాదు. భావాలన్నీ క్షణికాలు అంటున్నారు. అప్పుడు ఒకక్షణం ఉండి, మరొక క్షణం లేని పదార్ధాలను గుర్తించడం శక్యం కాదు. కాని ఇందుకు విరుద్ధంగా లోకాల్ని ఫలాన పదార్ధాలు అని మనం గుర్తిస్తున్నాము. భావపదార్ధాలన్ని ప్రత్యభిజ్ఞకు విషయాలు. కనుక అవి క్షణికాలుకావని ఋజువు అవుతోంది. నేను ఇదివరకు చూసినదాన్నే ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను. ఇదివరకు స్పృశించినదాని స్పర్శ ఇప్పుడు కలుగుతోంది అనేది ప్రత్యభిజ్ఞ. ఘటం కొంతకాలం ఉంది నశిస్తే అది ఉదాహరణంగా ఎలా పనికివస్తుంది? వస్త్రం క్షణం కాలమే ఉండి నశిస్తే, దానిని ఎలా ధరిస్తాము? కనుక భావాలు క్షణికాలు కావు. అనుభవాన్ని అనుసరించి స్మృతి కలగడం వలన ఆత్మ అస్థిరం కాదు. వస్తువులన్నీ క్షణికాలే. వైనాశికుడు జ్ఞాత అయిన ఆత్మ కూడా క్షణికత్వాన్ని అంగీకరిస్తున్నాడు. కాని అది కుదరదు. అనుస్మృతి ఉండటం వలన జ్ఞానాన్ని అనుసరించి పుట్టే స్మరణమే అనుస్మృతి. జ్ఞానానికి ఎవడు కర్తో, అనుభవానికి కూడా అతడే కర్త అయితేనే అనుస్మృతి కుదురుతుంది. ఒక పురుషుడు ఒక వస్తువుపై జ్ఞానం కలిగి ఉండి, వేరొక పురుషుడు దానిని స్మరించడం, చూడటం జరిగితే ఆవస్తువు పట్ల జ్ఞానం ఎలా కలుగుతుంది. ఇంత క్రితం ఆ వస్తువును చూసిన నేను, ఇప్పుడు అదే వస్తువును చూస్తున్నాను. అనే ప్రత్యభిజ్ఞ ఉండటం వలన ఆత్మ స్థిరమైనది అని అంగీకరించాలి. ఇప్పుడు దేనిని స్పృశిస్తున్నానో, దానినే చూచి ఉన్నాను. ఇప్పుడు చూస్తున్నాను అని దర్శన, స్మరణాలు రెండింటికి కర్త అయిన ఒకే పురుషుని విషయంలో ప్రత్యభిజ్ఞ రూపమైన జ్ఞానం సకల జనులకు ప్రసిద్దమే. నేను స్మరిస్తున్నాను. మరొకడు చూచాడు అని ఎవరు అనుకోరు. క్షణికజ్ఞానంతోనే సాదృశ్యజ్ఞానం కలగవచ్చును. గాన స్థిరమైన ఆత్మ అవసరం లేదు అని వారి అభిప్రాయం. సాదృశ్యం అంటే పోలిక. ఇది రెండు విధాలు.1.అనుయోగి, 2. ప్రతియోగి. అనుయోగి అంటే ఒకదానిని మరొక దానితో పోలిక చెప్పినప్పుడు దేనికి సాదృశ్యం చెప్పబడుతుందో అది అనుయోగి. దేనితో చెప్పబడుతుందో అది ప్రతియోగి. ఉదా:-ముఖాన్ని చంద్రబింబంతో పోల్చినప్పుడు ముఖం అనుయోగి, చంద్రబింబం ప్రతియోగి. అనుయోగికి జ్ఞానం ఉంటుంది. తరువాత జ్ఞానంలో సాదృశ్యం ఉంటుంది. అనుయోగి జ్ఞానం తరువాత క్షణికజ్ఞానం వలన పుట్టిన క్షణికజ్ఞానంతో ప్రతియోగి సాదృశ్యం ఉంటుంది. అనుభవాన్ని అనుసరించి స్మృతి కలగడం వలన ఆత్మ అధికం కాదు. వస్తువులన్నీ క్షణికాలే. బౌద్దులు జ్ఞాత అయిన ఆత్మ కూడా క్షణికమే అని అంగీకారిస్తున్నారు. కాని అది కుదరదు.
సూత్రం :- 197
" నా సతో దృష్ట త్వాత్ "
అదృష్టత్వాత్ :- కనిపించని, అసతః..అభావం నుంచి, న :- భావోత్పత్తి కాదు.
భావం :- కనిపించని అభావం నుంచి భావోత్పత్తి కలగదు.
వివరణ:-అసత్తు అభావం నుండి పుట్టదు. బౌద్ధమతంలో స్థిరమైనది ఏది లేదు. సర్వమూ క్షణికమే. విత్తనం నుండి మొలక పుడుతుంది. అంటే విత్తనం తన రూపాన్ని కోల్పోయి అభావం పొందుతుంది. తరువాత అంకురం వస్తుంది. కాబట్టి బీజం యొక్క అభావభావం నుండి అంటే లేకపోయిన దానినుండి వస్తువు పుడుతోంది అని వారి వాదం. అభావం నుండి భావం ఎప్పుడు పుట్టదు. లేని వస్తువు నుండి ఉన్న వస్తువు ఎలా పుడుతుంది? అభావానికి కారణమయ్యే శక్తి ఉండదు. కుందేటి కొమ్ము నుండి ఏమి పుట్టదు. బీజం నశించినప్పుడు కూడా అందులోని బీజవాయువులే అంకురానికి కారణమౌతాయి. అంతేకాని పప్పుబద్దల్లగా ఉండే బీజదళాల నాశనాన్ని చూసి అంతా నశించిపోయిందని అనుకోవడం తప్పు. భావ పదార్ధాలన్ని భావాల నుంచి జనిస్తాయి. ఇది మన నిత్యానుభవం. అభావం నుంచి భావం ఏర్పడుతుందనే సిద్ధాంతం అంగీకారం కాదు. శూన్యం నుంచి ఏ పదార్ధం ఉత్పత్తి కాదు. బౌద్ధులు అభావం నుండి భావం పుడుతుందని స్పష్టం చేశారు. మట్టిని నశింపజేసి నప్పుడే ఘటం పుడుతుంది. నశించిన బీజం నుండి అంకురం వస్తుంది. నశించిన క్షీరం నుండి పెరుగు వస్తుంది.కనుక భావం అభావం నుండి పుడుతుందని సౌగతులు భావిస్తున్నారు.ఏ కూటస్థ వస్తువు (నశించకుండ ఉండి నిత్యమైన) స్వరూప వినాశనం లేకుండా కారణం కాజాలదు. కాబట్టి అభావం నుండి భావం పుడుతుంది అని ఏది చెప్పబడిందో, అది అసమంజసం. ఎందువలననగా స్థిరమైన స్వభావం గల సువర్ణాదుల నుండి సత్పదార్ధాలు పుట్టడం కనబడుచున్నది. అసత్యపదార్ధాల నుంచి సత్పదార్ధాలు పుట్టడం కనబడటం లేదు. గాన అభావం నుంచి భావం పుట్టడం జరగదు. మరొక విషయమేమంటే, నాలుగు భూతాల చేత చిత్త, చైత్తాలు పుడతాయని పరమాణువుల నుండి భూత భౌతిక రూపమైన సముదాయం పుడుతుందని అంగీకరించి, మళ్ళీ అభావం నుంచి భావం పుడుతుందని కల్పించి తాము అంగీకరించిన విషయాన్నే కప్పిపుచ్చుచున్న వైనాశికుల వాాదన సమంజసం కాదు.
సూత్రం :- 198
" ఉదాసీనానా మపి ఛైవం సిద్ధః "
ఏవంచ :- అభావం నుండి భావం వస్తుందని, ఒప్పుకుంటే, ఉదాసీనానామ్ అపి :- ఏ ప్రయతం చెయ్యకుండా ఊపేక్ష వహించేవాడికి కూడా, సిద్దః :- కార్యసిద్ధి కలగాలి కదా!
భావం :- అభావం నుంచి భావం వస్తుందని ఒప్పుకుంటే, ఏ ప్రయత్నం చెయ్యకుండా ఊపేక్ష వహించేవాడికి కూడా కార్యసిద్ధి కలగాలి కదా!
వివరణ :- అభావం నుంచి భావం పుడుతుందనేది అబద్ధం. ఈ మాటే కనుక నిజమైతే వ్యవసాయం చెయ్యవలసిన అవసరం లేదు. పొలం దున్నడం, విత్తనాలు నాటడం, మొదలైన పనులు చెయ్యకుండానే పంటలు పండాలి, ఫలితాలు లభించాలి. ఇంట్లో కూర్చుని కోరుకుంటే చాలు కోరికలు నెరవేరాలి. ఈరకంగా కష్టపడకుండా కోరికలు తీరితే కర్మ చెయ్యవలసిన పనే ఉండదు. స్వర్గనరకాలు ఉండవు. అందువలన అభావం నుంచి భావోత్పత్తి కలుగుతుందనడం యుక్తం కాదు. కారణ నాశనం అంటే అభావం వల్ల భావోత్పత్తి అని అర్ధం కాదు. కారణ అభావం కాదు. అభావం వలన కార్యం ఉత్పత్తి కాదు. కారణం అభావం అయితే కార్యం జనించదు. విత్తు నుంచి మొలకెత్తడం అనే క్రియ అంటే అభావం వలన భావోత్పత్తి అని అర్ధం కాదు. అలా అయితే వేపవిత్తనం నశించి వేప మొలక, మామిడి విత్తనం నశించి మామిడి మొక్క ఉద్భవించవు. విత్తనాలలో తేడా ఉన్నది కాని వాటి నాశనంలో తేడా లేదు కదా! నాశనం అభావం అయితే ఆ భావంలో భేదం ఉండదు. భావాలకు విశేషణాలు ఉంటాయి. నీలంరాయి, ఎరుపురాయి.. ఇలాగ అభావానికి విశేషణాలు ఉండవు. విత్తనాలు నశించి మొలకత్తడం అంటే రూపాంతరం చెందడం అని గ్రహించాలి. కనుక అభావం నుంచి భావం జన్మిస్తుండనేది సమాంజసం కాదు.
అభావాధికరణం ( 2, 2, 28 )
సూత్రం :- 199
" నాభావ ఉపలబ్ధే "
ఉప లబ్ధే :- ప్రమాణమలున్నందు వలన, అభావహ :- ఉనికి లేదు అనడం, న :- చెల్లదు,
భావం :- ప్రత్యక్షది ప్రమాణాల వలన పదార్ధములు గొచరిస్తున్నాయి. అందుచేత స్వయంగా సిద్ధించే పదార్ధాలు అభావం అనడం తగదు.
వివరణ:-ఈఅధికరణంలోయోగాచారుల(బౌద్ధుడు) మతాన్ని ఖండిస్తున్నారు. యోగాచారులమతం ప్రకారం బాహ్య పదార్ధాలేవి లేవు. విజ్ఞాన మనేది ఒక్కటే ఉన్నది. క్షణిక విజ్ఞానమే పరమార్ధం అని అంటారు. ఆ విజ్ఞానమే అనాది వాసనల వలన బాహ్య ఆకారములలోభాసిస్తుంది. తప్ప బయట పదార్ధాలు లేవు అని అంటారు. మనకు కనిపించే ఎరుపు, తెలుపు, నీలము రంగున్ని విజ్ఞానం యొక్క ఆకార వికారాలే. ఈ విధంగా సర్వత్రా విజ్ఞానమే బాహ్య ఆకారాన్ని పొందుతున్నదని వీరి వాదన. ప్రత్యక్షాది ప్రమాణముల వలన బాహ్య వస్తువులు లభిస్తుండగా విజ్ఞానాన్ని మించి మరొకటి లేదనడం, యుక్తం కాదు. బాహ్యర్ధాలు లేని పక్షంలో ప్రమాణాల వలన అది లభించకూడదు. ప్రమాణాలు కూడా విజ్ఞానమే అంటారా? అప్పుడు విజ్ఞానానికి లభించే బాహ్యపదార్ధాలను ఎలా కాదంటారు? ఫలానా వస్తువుల లబ్ది నాకు కలుగుతోంది అంటారు. కాని విజ్ఞానం కలుగుతోందని ఎవరు అనరు. కనుక బాహ్యర్ధాలు లేవు. కేవలం విజ్ఞానమే పరమార్ధం అనడం యుక్తం కాదని తెలుస్తోంది. విజ్ఞానం కన్నా ఇతర పదార్ధాలేవి లేవనేది నిజం కాదు. బాహ్య పదార్ధాలు గోడ, కుండ, వస్త్రం లాంటివి కంటికి కనిపిస్తాయి. అలాంటప్పుడు విజ్ఞానం తప్ప ఇతర వస్తువులు లేవనడం సరికాదు. ఏ విజ్ఞానవాదంలో ప్రమాణం, ప్రమేయం, ఫలం అనే సమస్త వ్యవహారము కూడా బుద్ధిని అధిష్టించిన రూపంలో లోపలనే ఉన్నట్లుగా కుదురుతుంది. బాహ్యఅర్ధం ఉంది అని అంగీకరించినా కూడా అది బుద్ధిలో ప్రవేశిస్తే తప్ప ప్రమాణాది వ్యవహారం జరగదు కదా! ఘటం మొదలైన వస్తువుల జ్ఞానం కలిగినప్పుడు నాలుగు అంశాలు ఉంటాయి. ప్రమాత, ప్రమేయం, జ్ఞానం, ఫలం. ప్రమాత:- గ్రహించేవాడు, ప్రమాణం:-చక్షురాదికం, జ్ఞానం: చక్షురాదులకు పదార్ధంతో కలిగినప్పుడు కలిగేది. ఆ వస్తువు తెలియడం, నైయాదికాదులు సాధారణంగా ఏదైనా విషయాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఉదాహరణగా ఘటం, పటం మొదలైనవి చూపుతారు. బౌద్ధులు నీలం, పీఠం ఇత్యాదులు చూపుతారు. నీలం అనగా నల్లని వస్తువు. పీతం అనగా పచ్చని వస్తువు. విజ్ఞానవాదుల ప్రకారం నీలం పీతం మొదలైన రంగులతో కూడినదే ప్రమేయం అంటే కళ్ళతో చూడబడినది అవుతుంది. అది జ్ఞానానికి ఫలం. విజ్ఞానంలోని శక్తికి గ్రహించేవాడు ప్రమాత. ఇవన్నీ విజ్ఞానంలో కల్పించిన బేధాలు. వాస్తవంలో విజ్ఞానం తప్ప పదార్ధంగాని, ప్రమాణం గాని దానిని తెలుసుకొనడం గాని, తెలుసుకునేవాడు గాని, ఇవేమి లేవు. భేదకల్పన చేత వ్యవహారం అంతా జరుగుతుంది. అనుభవం జ్ఞానం, అనుభవం అంటే ఒక విషయాన్నీ తెలుసుకోవడం, ఆయా వస్తవులు వేరయినా వాటి జ్ఞానం మాత్రం సాధారణమైనదే. ఆజ్ఞానం శుద్ధజ్ఞానరూపంలో కలుగదు. దానిలో ఏదో విషయం భాసిస్తూనే ఉంటుంది. స్తంభ జ్ఞానం, ఘటజ్ఞానం, మొదలైన వాటిలో జ్ఞానమే విషయం రూపంలో కప్పి ఉన్నట్లుగ కనిపిస్తుంది. అంటే విషయం జ్ఞానంలో ఉందని అర్ధంఔతుంది. అలాంటప్పుడు విషయం వెలుపల ఉందని కల్పించడం అనవసరం. జ్ఞానమే విషయాకారంలో కనిపిస్తుందని అర్ధం. జ్ఞానము, జ్ఞయము రెండు కలిసే ఉంటాయి. వీటిలో ఒకటి తెలియబడనప్పుడు మరొకటి తెలియబడదు. జ్ఞయము అంటే తెలుసుకోద గినది. ఈ రెండు వేరు వేరు వస్తువులైతే ఈ విధమైన అవినాభావం యుక్తం కాదు. ఎందువలనంటే క్షణికమైన జ్ఞానానికి విషయంలో సంబంధం కలగడానికి హేతువేది లేదు. అందువల్ల కూడా బాహ్య పదార్ధం లేదు. ఇది స్వప్నదుల వంటిదని చుచుకోవాలి. స్వప్నము, మాయ, ఎండమావులలో నీరు, గంధర్వ నగరం (ఆకాశం మీద ఏదో పెద్ద నగరం ఉన్నట్లు ఇంద్రజాలాల చేత చూడబడే నగరం. ఈ జ్ఞానాలు బాహ్యమైన వస్తువు ఏది లేకపోయినా కూడా గ్రాహ్యం గాను (తెలియబడేది) గాను, గ్రహనం (తెలుసుకునేది) గాను ఏ విధంగా ఉంటున్నాయో (స్వప్నధులలో జ్ఞానం తప్ప బాహ్యపదార్ధాలేవి ఏ విధంగా ఉండవో), జాగ్రదావస్థకు చెందిన స్తంబాది జ్ఞానాలు కూడా ఈ విధంగానే ఉంటాయని తెలుస్తుంది. అదిజ్ఞానమే, ఇదీజ్ఞానమే. బాహ్యఅర్ధం లేకపోతే జ్ఞానాలలో వైచిత్య్రం (వైవిద్యం ) ఎలా కలుగుతుంది. ఈ విధంగా బాహ్యార్ధం లేదని నిర్ణయించడం శక్యం కాదు.
సూత్రం :-200
" వైదర్మ్యా శ్చ న స్వప్నదివత్ "
భావం :- వై ధర్మ్యత్ :- విరుద్ద ధర్మాలుండటం చేత, స్వప్నాదివత్ చ :- స్వప్నంలో ఉండే, పదార్ధాల లాగా, బాహ్య పదార్ధాలు కూడా అభావం అనడం, న :-సరిఅయినది కాదు.
భావం :- స్వప్నంలో అర్ధాలు లేకపోయినా ఆయా వాసనా జ్ఞానమే ఆరు పదార్ధాల ఆకారాలు పొంది మనకు లభిస్తున్నట్లు గాని, జాగ్రదావస్థలో కూడా ఘట, పటాది వస్తువులు బయట లేకపోయినా ఆయా పదార్ధాల వాసనా జ్ఞానమే ఆయా వస్తు రూపంలో భాసిస్తోంది. కనుక విజ్ఞానాన్ని మించి బాహ్య పదార్ధాలు ఏవి లేవని తెలుతోంది కదా! అంటే విరుద్ద ధర్మాలుండటం చేత స్వప్నంలో ఉండే పదార్ధాలా లాగా బాహ్య పదార్ధాలు కూడా అభావం అనడం సరిఅయినది కాదు.
వివరణ :- స్వప్నావస్థకు, జాగ్రదావస్థ కు భేదం లేదు. స్వప్నంలో కనిపించిన వస్తువుల్లాగా జాగ్రదావస్థలో కూడా విజ్ఞానం తప్ప ఇతర పదార్ధాలేవి లేవు అనే వాదన తప్పు. యోగాచార్యులు జాగ్రదావస్టలో ఉన్నవేవి కూడా విజ్ఞానం కన్నా భిన్నమైనవి తెలుసుకోదగినవి కావు. జాగ్రదావస్థ... స్వప్నావస్థలోని విజ్ఞానం లాంటిదే అన్నారు. స్వప్నానికి జాగ్రదావస్థకు పోలిక లేదు. కలలో కనిపించే వస్తువు మెలకువ రాగానే కరిగిపోతుంది. కాని జాగ్రదావస్థలో అలాకాదు. ఈ వస్తువులు అలాగే ఉంటాయి. అందరికి ఉన్నట్లుగానే కనిపిస్తాయి. స్వప్నంలో మన ఒక్కరికే కనిపిస్తాయి. కలలో కనిపించినదానికి, అనుభవానికి కారణం ఆసంఘటనలు గుర్తు ఉండటం. కాని జాగ్రదావస్థలో ప్రత్యక్షంగా అనుభవం ఉంటుంది. వస్తువులను చూస్తున్నాం, తాకుతున్నాం, అందరికి చూపిస్తున్నాం. మరొకరికి ఇస్తున్నాం. ఈ రకంగా జాగ్రదావస్థ, స్వప్నావస్థలలో తేడా ఉంది. స్వప్నావస్థ లాంటిదే జాగ్రదావస్థ అనడం తప్పు. మాయాదులలో కూడా ఈవిధంగానే తగు బాధ కలగడం కనబడుతుంది. అయితే జాగ్రదావస్థలో కలిగే దర్శనం అనుభవం. వస్తువు దూరంగా ఉండటం, దగ్గరగా ఉండటం, అనే స్మృతికి ప్రత్యక్షజ్ఞానానికి ఉన్న భేదం స్వయంగానే తెలుస్తుంది. ఇప్పుడైనా పుత్రున్ని స్మరిస్తున్నాను. వానిని చూడటం లేదు. అతను కనబటం లేదు. కాని చూడాలని కోరుకుంటున్నాను అని స్మరించేవాడు అనుకుంటాడు. అలాంటప్పుడు ఈ రెండింటికి ఉన్న భేదాన్ని గుర్తించిన వాడు, జాగ్రదావస్థలో జరిగేది సత్యం. స్వప్నంలో జరిగేది అసత్యం అని గ్రహించాలి. జాగ్రదావస్థలో విషయములైన బాహ్య పదార్ధాలేవి లేకుండానే కలుగుతాయి అని చెబితే అనుభవానికి విరుద్ధంగా ఉంటుందని శంకించి, అలా చెప్పడానికే స్వప్నప్రత్యయాలతో సామ్యం చూపించి అలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. వీటిలో వైరుధ్యం చూపినంత మాత్రాన వేడిగా ప్రత్యక్షంగా కనబడుతున్న అగ్ని చల్లగా ఉండదు కదా..అందువలన విరుద్ధ ధర్మాలుండటం చేత స్వప్నంలో ఉండే పదార్ధాల వలె బాహ్యపదార్ధాలు అభావం అనడం సరియైనది కాదు.
అభావాధికరణం ( 2, 2, 30 )
సూత్రం :- 201
" నా భావో నుప లబ్దిహ్ "
అనుపలబ్ధేః :- సిద్ధం కాకపోవడం చేత, భావః :- భావం, న :- అస్తిత్వం లేనిది అని అనడం తగదు.
భావం :- పదార్ధాలు ఉన్నప్పుడు వాటి వలన జ్ఞానం కలుగుతుంది. ఆజ్ఞానం వలన వాసనలు, సంస్కారాలు ఏర్పడతాయి. అది లేకపోవడం వలన స్వప్నగత పదార్ధాలు వెంటనే నశిస్తాయి. ఇది భావ పదార్ధాలకు వర్తించదు. ఈ కారణముల వలన భావ పదార్ధాలకు అస్తిత్వం లేదనడం వాస్తవ విరుద్దం.
వివరణ :- యోగాచారుల ప్రకారం బాహ్య పదార్ధాలు లేవు. కాబట్టి వాటి వచ్చే వాసనలు కూడా ఉండవు అంటారు. వీరి మతానుసారం బాహ్య పదార్ధాలు లేవు. కాబట్టి వాసనలు, సంస్కారాలు, కూడా జనించవు. వాటి అనుభవం కూడా ఉండదు. అనుభవం ఉంటేనే గాని వాసనలు, సంస్కారాలు, జనించవు. కాబట్టి వాసనా వైచిత్య్రం వలన జ్ఞాన వైచిత్య్రం కలుగుతుంది అనడం సరిఅయినది కాదు. వాసన లేనప్పుడు దాని వలన జ్ఞానం కలగడం అసంభవం. అర్ధాల ( వస్తువుల ) జ్ఞానాన్ని నిమిత్తంగా చేసుకొని ప్రతి వస్తువు విషయంలోనూ అనేక విధాలైన వాసనలు కలుగుతుంటాయి. ఆ వస్తువులే తెలియకపోతే విచిత్రమైన వాసనలు దేనిని నిమిత్తంగా చేసుకొని బయలుదేరాతాయి? అనాదిత్వం ఉన్న కూడా అంధ పరంపర న్యాయం చేత ప్రతిష్ట లేని, వ్యవహారానికి లోపం కలిగించే వ్యవస్థ ఏర్పడుతుంది. కాని వారు అనుకున్నది సిద్ధించదు. అంధ పరంపర న్యాయం అంటే ఒక గ్రుడ్డివాడు మరొక గ్రుడ్డివాడి మీద ఆధారపడడు. దాని వలన వారి వాదానికి బలం చేకూరదు. వాసనలు లేకపోయినా లోకంలో ఆయా అర్ధాల (వస్తువుల) జ్ఞానం కలుగుతుంది. అర్ధం యొక్క జ్ఞానం లేకుండా వాసనలు పుడతాయాని అంగీకరించడం కుదరదు. వాసనలు అనగా ఒక విధమైన సంస్కారాలు. ఆశ్రయం లేకుండా సంస్కారాలు ఉండవు. వారి వాదన ప్రకారం వాసనలకు ఆశ్రయమైన వాడు లేడు. బాహ్య పదార్ధాలు లేవు. అందుకే వాసనలకు ఉనికి లేదు.
సూత్రం :-202
" క్షణికత్వాచ్చ "
చ :- అంతే కాక, క్షణి కత్వాత్ :- క్షణిక విజ్ఞాన వాదం సిద్ధించడం లేదు.
భావం :- ఇది ఘటం, ఇది పటం అనే జ్ఞానం ప్రవృత్తి విజ్ఞానం, నేను, నేను అనే జ్ఞానం ఆలయ విజ్ఞానం. మొదటిది వాసనకు కారణం అని, రెండవది వాసనకు ఆశ్రయమని క్షణికవాదులంటారు. వస్తువే లేనప్పుడు వాసనకు ఆశ్రయం కాజాలదు. క్షణికం అయినప్పుడు కారణం కాలేదు. ఆయా వాసనలు ఉండే విజ్ఞానమే పదార్ధాల ఆకారంలో కనిపిస్తోందని, వేరుగా పదార్ధాలు ఏమి లేవని చెప్పడం యుక్తం కాదు.
వివరణ :- ఆలయ విజ్ఞానం కూడా క్షణికం అన్నారు కాబట్టి అది కూడా వాసనలకు ఆశ్రయం కాలేదు. ఆలయ విజ్ఞానం అంటే ఈ మతంలో నేను నేను అంటే అహం, ఇహం అందరికి ఎప్పుడూ అన్వయించే జ్ఞాన పరంపర. ఇటువంటి ఆలయ విజ్ఞానమే వాసనాలకు ఆశ్రయం అని శూన్యవాదులంటారు. వీరు నేను అనే జ్ఞానం కూడా క్షణికమే అంటారు. అహం ఇహం ఆలయ విజ్ఞానం, నీల పీతాది విజ్ఞానం ప్రవృత్తి విజ్ఞానం. మూడు కాలాలకు సంబంధించి కార్యాలాన్నింటిలోకి అన్వయించే ఒక వస్తువు లేకపోతే, లేదా సకల పదార్ధాలను చూడగలిగే ఒక కూటష్టమైన వస్తువు లేకపోతే దేశాన్ని కాలాన్ని, ఇతర నిమిత్తలను ఆపేక్షించే వాసనలు పుట్టించడం, స్మృతి, ప్రత్యభిజ్ఞ మొదలైన వ్యవహారం సంభవించదు. శూన్యవాదంలో ఉండే దోషాలు :- బ్రహ్మ విద్యా భరణకారులు ఈ విధంగా సూచిస్తున్నారు. శూన్య తత్వం అన్నప్పుడు శూన్యం అనేదానికి సకల ప్రపంచాతీతమైన ఒక భావ రూప పదార్ధం అని అర్ధమా? లేక అభావ రూపమనియా? మొదటిది కుదరదు. భావరూపమని అంగీకరిస్తే వేరు మాటలతో బ్రహ్మవాదాన్ని అంగీకరించినట్లు అవుతుంది. రెండవ పక్షం అభావరూపం ప్రమాణ విరుద్ధం కనుక యుక్తం కాదు. సకల ప్రమాణాల చేత ప్రపంచం ఉన్నట్లుగా తెలుస్తుంటే దానిని అభావమని ఎలా చెబుతారు. ప్రపంచ జ్ఞానం భ్రాంతి అనడం కుదరదు. ప్రపoచజ్ఞానం భ్రాంతి అన్నప్పుడు దానికి అధిష్టానమైన దానిని సత్యమని చూపించాలి. అదేది లేదంటున్నారు. అలాంటప్పుడు భ్రాంతి అనడం ఎలా కుదురుతుంది? అభావమే అధిష్టానం అనడం కుదరదు. అభావానికి ప్రతియోగి, అనుయోగిల ఆపేక్ష ఉంటుంది. ఘటం అభావం అన్నప్పుడు ఆ అభావానికి భూతలం అనుయోగి, ఘటం ప్రతి యోగి. అనుయోగి అంటే ఒక దానిని మరొక దానితో పోలిక చెప్పినప్పుడు దేనికి పోలిక చెప్పబడుతుందో అది అనుయోగి, దేనితో చెప్పబడుతుందో అది అనుయోగి. ఉదా:-ముఖాన్ని చంద్రబింబంతో పోల్చినప్పుడు, ముఖం అనుయోగి, చంద్రబింబం ప్రతియోగి. ఆ విధంగా ఈఅనుభవానికి అనుయోగి ఏది? అందుచేత వేదాంతులు బ్రహ్మను సర్వనిషేధములకు అధిష్టానంగా గ్రహించినట్లు శూన్యవాది కూడా ఏదైనా ఒక నిత్యమైన, సత్యమైన తత్వాన్ని చూపగలిగితే అది యుక్తంగా ఉంటుంది. అలా చూపలేదు. కనుక ఇది ప్రమాణ విరుద్ధం. బౌద్ధమతంలో నాలుగు వాదాలున్నాయి. వైభాషికులు, సౌత్రాంతికులు, యోగాచారులు, మాధ్యమికులు(శూన్యవాదులు) అనే నలుగురు నాలుగు వాదాలు అంగీకరించారు. వారిలో వైభాషికులు బాహ్యవస్తువులు ఉన్నాయి. అవి క్షణికలు. వాటిని ప్రత్యక్షప్రమాణాల చేత తెలుసుకోవచ్చును అని అంగీకరిస్తారు. సౌత్రంతికులు కూడా క్షణికాలైన బాహ్యపదార్ధాలను అంగీకారిస్తారు. కాని అవి ప్రత్యక్షములు కావు. అనుమానం చేత తెలియబడతాయంటారు. ఇంద్రియలకు విషయాలకు సంబంధం ఏర్పడినప్పుడు విషయం పుట్టే జ్ఞానంతో బాహ్యవస్తువులు ఉన్నాయని అనుమానం చేత తెలియబడుతుంది. అంతే కాని చక్షురాదులు బాహ్యార్ధాలను గ్రహించవు. వీరిద్దరూ బాహ్య వస్తువులు ఉన్నాయని అంగీకరించడంలో మత భేదం లేదు. యోగాచారుల ప్రకారం బాహ్యపదార్ధాలులేవు. వాటి వలన వచ్చే వాసనలు, సంస్కారాలు,అనుభవాలు ఏమి ఉండవు. బాహ్యపదార్ధాలు లేకపోయినా వాసనావైచిత్ర్యం వలన జ్జాన వైచిత్ర్యం కలుగుతుందని అంటారు. వీరందరి వాదనలు సమంజసం కావని , బ్రహ్మ చైతన్యంతోనే సృష్టి జరుగుతుందని వ్యాసమహర్షి వారి వాదనలను తీవ్రంగా నిరసించారు.
సూత్రం :-203
" సర్వథా నుపపత్తేశ్చ "
సర్వథా:-అన్నిరకాలుగా, అనునుపత్తేః చ:- హేతుబద్ధం కానందు వలన కూడా క్షణికవిజ్ఞానవాదం అంగీకరించదగినది కాదు.
భావం:- ప్రత్యక్షంగా బాహ్యపదార్ధాలు కనిపిస్తున్నాయి కదా! వాటిని ఎలా లేవంటారు? అందుకే అన్ని రకాలుగా హేతుబద్ధం కానందువలన కూడా క్షణికవిజ్ఞానవాదం అంగీకరించదగినది కాదు.
వివరణ:-ఏవిధంగా చూసినా బౌద్ధదర్శనం ఆమోదం యోగ్యం కాదు. వీళ్లు చెప్పిన బాహ్యర్ధవాదం, విజ్ఞానవాదం, శూన్య వాదం ఇవి యుక్తం కావు. అవి పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. కనుక ఈమతం అంగీకారం కాదు. జ్ఞానానికి విషయాలు అర్ధాలే అంటే వస్తువులే. వస్తువులు లేకపోతే విజ్ఞానమేలా కలుగుతుంది? కనబడుతున్న ప్రతి జ్ఞానంలోనూ స్థంభం, గోడ, కుండ, వస్త్రం అన్ని బాహ్యంగా కళ్ళకు కనిపిస్తుంటే, బాహ్యర్ధం లేదని నిర్ణయించడం శక్యం కాదు. కనబడుచున్న దానితో అభావం ఉండదు కదా! దానిని లేదనడం యుక్తం కాదు. భోజనం చేస్తున్న ఒకడు, భోజనం వలన కలిగిన తృప్తిని స్వయంగా అనుభవిస్తూనే నేను తినడం లేదు, తృష్ణ పొందడం లేదు, అని అంటే ఎలా ఉంటుందో, ఇంద్రియ సంబంధం చేత బాహ్యర్ధాన్ని స్వయంగా తెలుసుకుంటూనే నాకు బాహ్యర్ధం ఏది తెలియడం లేదు. అది అసలు లేనే లేదు అని అనడం కూడా అలాగే ఉంటుంది. అన్ని విధాలా కుదరక పోవడం వలన కూడా ఆదరణీయం కాదు. వైనాశిక విషయంలో ఏమైనా కారణం ఉన్నాదా అని అన్ని విధాలా పరీక్షించిన కొలది అన్ని విధాలా ఇసుక నెలమీద నుయ్యి ఒక ప్రక్క నుండి త్రవ్వితే, మరొక ప్రక్క నుండి కూలిపోయినట్లు కూలిపోతూనే ఉంటుంది. దీనిలో ఏ మాత్రం ఉపపత్తి అంటే కారణం కనబడటం లేదు. అందువల్ల కూడా వైనాశిక వ్యవహారం అసంగత మైనది.
నైకస్మిన్నసంభవాధికరణం ( 2, 2, 33 )
సూత్రం :- 204
"నైక స్మిన్న సంభవాత్ "
క్షణికవాదమైన బౌద్ధమతాన్ని నిరాకరించిన మహర్షి ఇప్పుడు జైనమతం "అనేకాంతవాదాన్ని" తిరస్కరిస్తున్నారు. అసంభవాత్:-అసంభవం కనుక, ఏకస్మిన్:- ఒకే పదార్ధంలో, న:-పరస్పర విరుద్ధమైన అస్తిత్వం, నాస్తిత్వలక్షణాలు ఉండనేరవు.
భావం :- ఒకే పదార్ధంలో పరస్పర విరుద్ధమైన అస్తిత్వం, నాస్తిత్వం లక్షణాలు ఉండవు.
వివరణ :- ఒకే వస్తువులో ఒకే సమయంలో విరుద్ధమైన రూపాలు, ధర్మాలు ఉండవు. ఉన్న పదార్థాన్ని లేదనడానికి, లేని పదార్ధాన్ని ఉందనడానికి ఎలా వీలవుతుంది. విషయాన్ని చెప్పేటప్పుడు ఫలానా అని నిర్ధారణ చెయ్యకపోతే అది ప్రమాణం కాదు. జైనమతం ఏవిషయాన్ని ఖచ్చితంగా చెప్పదు. ఘటంలో ఘటత్వం, ఉంటే అఘటత్వం ఉండదు. ప్రవృత్తి, నివృత్తి ఒకే కాలంలో ఉండవు. కనుక అనేకాంతవాదం అసంగతం. ఈశ్వరుడి ప్రసక్తిలేకుండా పరమాణువులు మూలంగా పృధివ్యాదులు ఏర్పడతాయని సముదాయవాదులు అంటున్నారు. అలాగే క్రియాశక్తివంతాలైన పరమాణువుల వలన జగదుత్పత్తి కలుగుతుందని అనేకాంతవాదులు అంగీకరిస్తారు.ఇద్దరి మతంలోనూ సంఘాతమే ఉత్పత్తి. అనేకాంతవాదులు జగత్తులో ఉన్న పదార్ధాలను రెండు రకాలుగా విభజించారు.
1. జీవులు:- వీరు శుభ, అశుభ కర్మలను ఆచరించి, వాటి ఫలితాలను సుఖ, దుఖ రూపంలో అనుభవిస్తారు. శరీరాన్ని అనుసరించి పరిణామంచెందే స్వభావం ఉన్నవాడు కనుక శరీరపరిమాణం ఉన్నవాడు జీవుడు. జ్ఞానాది కర్మలను ఆచరించే భిన్నుడు, అభిన్నుడు కూడా జీవుడే.
2. అజీవులు :- అలాంటి జీవుల భోగానికి తగిన పదార్ధాలాన్ని అజీవులే.
ఇలా రెండు విధాలైన ఈ పదార్ధాలను కొందరు 5 రకాలుగా విభజిస్తారు. అవి 1. జీవాస్తి కాయం, 2. పుద్గలాస్తి కాయం,
3. ధర్మాస్తి కాయం, 4.అధర్మాస్తి కాయం, 5. ఆకాశాస్తి కాయం.
1. జీవాస్తి కాయం :- ఇది 3 విధాలు,
1. బద్ధుడు :- ఒక జన్మ నుంచి మరొక జన్మ పొందుతూ ఉండేవాడు సంసార బద్ధుడు,
2. ముక్తుడు :- తపస్సు చేసి ముక్తిని పొందేవాడు ముక్తుడు.
3.నిత్య సిద్ధుడు :- నిత్య యోగి సిద్ధుడే, అతడే ఈశ్వరుడు.
2. పుద్గలాస్తి కాయం :- రూప, రస, గంధ, స్పర్శ గుణాలున్న సంఘాతం, సముదాయం గల స్వరూపమున్నదే పుద్గలాస్తి కాయం. ఇవి పృద్వి, జలం, అగ్ని, వాయువు, స్థావరం (చెట్ల వంటివి), జంగమం (చేతన శరీరలు)అని ఆరు రకాలు. ఈ పుద్గలాస్తి కాయాన్నే ద్రవ్యవిభాగ సమయంలో స్కంధమం అంటారు. ద్రవ్యపదార్ధాలు స్కంధాలు, పరమాణువులు అని రెండు రకాలు, ఇవి జీవుల భోగాలకు యోగ్యాలు.
3. ధర్మాస్తికాయం:- ఇది చక్కటి శాస్త్రియ బాహ్య ప్రవృత్తితో ఊహించ గలిగేది. ఉత్తమ బాహ్య ప్రవృత్తి గుండా లోపల ఉండే ధర్మాన్ని ఉహిస్తాం కదా! ఊర్ధ్వగమనాశీలుడే జీవుడు.
4. అధర్మాస్తికాయం:- ఈశరీరంలో ఉండటాన్ని బట్టి, ధర్మాధర్మాలు జీవుడి గతిని అడ్డగిస్తాయి. వీటి వలన జీవుడు శరీరంలో ఉంటాడు. లేని పక్షంలో అతనికి ఊర్ధ్వగతి కలుగుతుంది.
5. ఆకాశాస్తి కాయం:- ఇది 2 రకాలు. 1.లోకాకాశం: పైపైన ఉండే లోకాల్లో ఉండేది.
2. ఆలోకాకాశం: ఆ లోకాలన్నింటి కన్నాపైన ఉండేది ఆలోకాకాశం. అందులో లోకాలు ఉండవు.
ఈ పదార్ధాలన్నీ మోక్షానికి ఉపయోగపడతాయని కొందరు వీటిని 7 విధాలుగా వ్యవహారిస్తారు. అవి జీవం, అజీవం, ఆస్రవం, సంవరం, నిర్జరం, బంధం, మోక్షం, కొందరు ధర్మం, అధర్మం కలిపి 9 తత్త్వాలని అంటారు.
షడ్దర్శన సమచ్చయం 47) :- హరిభద్ర సూరి దీనిని వివరించాడు. వీటిలో జీవ, అజీవ ( పుణ్య, పాప ) ధర్మ, అధర్మాలు. విషయాల పట్ల కరిగే ఇంద్రియ ప్రవృత్తే ఆస్రవం. ఇది పురుషున్ని స్రవించేటట్లు చేస్తుంది. ఇంద్రియాల గుండా విషయాన్ని స్పృశించి రూపాదిజ్ఞానరూపంలో పరిణమిస్తుంది.దీనినే మిధ్యాప్రవృత్తి అంటారు. ఈమిధ్యా ప్రవృత్తిని నిరోధించే యమ నియమాది సమ్యక్ ప్రవృత్తే సంవరం. ఇది పురుషజ్యోతి స్రవించే మార్గన్ని మూసి ఉంచుతుంది. అనాదికాలం నుండి సంక్రమించే కల్మషాన్ని, పుణ్యపాపాలను నాశనం చేసే తపస్సు, జపం, ధ్యానం లాంటి వాటిని నిర్జరం అంటారు. ఇది పాపకర్మలను నాశనం చేస్తుంది.
బంధం:- జ్ఞానావరణం, దర్శనావరణం, మోహనీయం, ఆంతర్యం అనేవి నాలుగు ఘాత కర్మలు, వేదనీయం, నాయికం, గోత్రికం, ఆయుష్కం అనేవి నాలుగు అఘాత కర్మలు. ఇవి పురుషున్నీ బంధిస్తాయి. కనుక వీటిని బంధం అంటారు.
జ్ఞానావరణం అంటే సమ్యక్ దర్శనం మోక్ష హేతువు కాదు. దాని వల్ల వస్తువు సిద్ధించదు అనే విపరీత జ్ఞానమే జ్ఞానావరణం.
దర్శనావరణం:- నిత్య సిద్ధులు వ్రాసిన శాస్త్రాలను అభ్యసించడం వలన మోక్షం కలుగదు అనే జ్ఞానం దర్శనావరణం.
మోహనీయం:- పెద్దలు ఉపదేశించిన మోక్ష మార్గాల్లో విశ్వాసం లేకపోవడం.
ఆంతర్యం :- మోక్షమార్గంలో ప్రవర్తించే వాళ్లకు ఆటంకాలు కలిగించే జ్ఞానం.
ఇవన్నీ శ్రేయో మార్గానికి విఘాతం కలిగిస్తాయి. కనుక ఇవి ఘాత కర్మలు.
వేదనీయం :- నాకిది తెలియవలసినదే అనే అభిమానం.
నామికం :- నా పేరు ఇది అనే అభిమానం.
గోత్రకం :- నేను ఇతని శిష్య పరంపరలో చేరాను అనేది గోత్రకం.
ఆయుష్కం :- శరీర యాత్ర కోసం చేసే కర్మ.
ఈ 4 సమ్యక్ దర్శనాలకి విఘాతం కలిగించవు.వీటిని అఘాతి కర్మలు అంటారు.
జీవుడిలో అన్ని క్లేశాలు, వాటి వాసనలు నశించి నప్పుడు సమ్యక్ దర్శనం చేత ఆత్మ ఆలోకకాశం చేరడమే మోక్షం అని కొందరు అంటారు. సదా ఊర్వగమన శీలం ఉన్న ధర్మ, అధర్మాస్తి కాయంతో బద్ధుడైన జీవాత్మను సమ్యక్ దర్శనం ద్వారా విడుదల ఏర్పడి, ఆలోకకాశంలో కలిగే నిరంతర ఊర్ధ్వ గమనమే మోక్షం అని మరికొందరు అంటారు. ఇతర లోకాలకు వెళ్లిన వాళ్ళు తిరిగి వస్తారు కాని ఆలోకకాశం చేరిన వారు తిరిగి రారు. ఈఅనేకాంత వాదులు అన్ని పదార్ధాల విషయంలో సప్తభంగీనయం అనే న్యాయన్ని ప్రవర్తింపజేస్తారు.
1. స్వాధస్తి :- ఘటం ఉనికి సంభవం కావచ్చును,
2. స్యాన్నాస్తి :- లేకపోవడం కూడా సంభవమే,
3.స్యాదస్తి చ నాస్తి చ :- ఉనికి ఉండటం, లేకపోవడం కూడా సంభవమే, కాని
4. స్యాద వక్త వ్యః :- అవ్యక్తం కావచ్చును,
5. స్యాద స్తి చ వక్త వ్యశ్చ :- ఘటం ఉండవచ్చు, లేదా అవ్యక్తం కావచ్చును.
6. స్యాన్నాస్తి చ వక్త వ్యశ్చ :- అది లేకపోవచ్చు లేదా అవ్యక్తం కావచ్చును.
7. స్యాదస్తి చ నాస్తి చ వక్త వ్యశ్చ :- ఉండవచ్చు, లేకపోవచ్చు, అవ్యక్తం కావచ్చు.
ఉనికి ఉంది అనుకుంటే అస్తిత్వం, లేదనుకుంటే నాస్తిత్వం. చెప్పలేము అనుకుంటే అవ్యక్తం, ఇలా 7 విభజనలు చేశారు. పదార్ధం అస్తిత్వం అయితే అన్నిచోట్ల ఉంటుంది. ఒకచోట ఉండటం, ఉండకపోవడం జరగదు. పదార్ధం కేవలం ఉన్నదని కాని, కేవలం లేదని చెప్పలేము. ఇలా ప్రవృత్తులను, నివృత్తులను లోకంలో చూస్తున్నాం అనేది అనేకాంతవాదం. ఒకే పదార్ధంలో అస్తిత్వ, నాస్తిత్వ ధర్మాలు రెండు ఉండవు. ఉన్న పదార్ధాన్ని లేదని, లేని పదార్ధాన్ని ఉందని ఎలా అంటాం? ఒక పదార్ధానికి ఒకే సమయంలో 2 రూపాలండలేవు. ఘటంలో అఘటత్వం కాని, ఘటత్వం కాని ఉండవు. ఒక వస్తువు కావాలనుకుంటే అది ప్రవృత్తి. వద్దనుకుంటే నివృత్తి. రెండు ఒకేసారి ఎలా ఉంటాయి? లేని వస్తువు పట్ల ప్రవృత్తి నివృత్తులు ఉంటాయా, లేదా? ఒకడికి ఒక వస్తువు దొరికినప్పుడు అది లేదని అర్ధమా? వేరే వాళ్లకు అది లభిస్తుందా? కుందేటి కొమ్ము ను ఎవరైనా చూశారా? చెప్పడానికి వీలులేదు అనడం అసంగతం. బొత్తిగా లేని వస్తువులకే అవ్యక్తం అంటాం. అందువలన అనేకాంతవాదం యుక్తి యుక్తం కాదు.
సూత్రం :- 205
" ఏ వం చాత్మా కార్ త్యం "
చ :- అంతేకాక, ఏవం :- అదే విధంగా, ఆత్మ కార్త్త్స్న్మ్.. జీవాత్మకు శరీర పరిమాణం ఉంటే కనుక, దానికి పూర్ణత్వం ఉండదు.
భావం :- జీవాత్మకు శరీరపరిమాణం ఉంటే కనుక దానికి పూర్ణత్వం ఉండదు. ప్రాణుల శరీరాల్లో ఉండే జీవులకు శరీర పరిమాణం ఉంటుందని అనేకాంతవాదులు అంటారు.
వివరణ:- జైనమతంలో ఆత్మకు పరిచ్ఛిన్నం అనే దోషం కలుగుతోంది. కాబట్టి ఆత్మకూడా మిగిలిన వస్తువుల వలెనే అనిత్యమౌతుంది. జైనమతం ప్రకారం శరీరపరిమాణం ఎంతఉంటుందో, ఆత్మపరిమాణం కూడా అంతే ఉంటుంది. ఇలా అనడం వలన ఆత్మకు శాశ్వతత్వం పోయి శరీరం లాగానే చెప్పబడుతుంది. అంటే ఆత్మఅనిత్యమౌతుంది. ఇది ఈ మతంలోని దోషం. ఆత్మ శరీరమంత పరిమాణం కలిగి ఉంటుంది అనడం తప్పు. ఎందుకంటే ఒకజీవి శరీరం పెద్దది ఇంకొక జీవి శరీరం చిన్నది ఉంటుంది. అలా అయినప్పుడు పెద్దడైనా ఏనుగు శరీరంలో అంత పెద్దఆత్మ చిన్నదైన చీమ శరీరం లో చిన్నఆత్మ ఉండాలి. ఒకవేళ ఆత్మ ఒకే పరిమాణం ఉంటే పెద్ద చిన్న శరీరాలలో అది ఇమడటానికి ఇబ్బంది పడాలి. జీవులకు కూడా వేరువేరు పరిమాణాలుంటాయా? మరు జన్మలో ఏనుగుగా పుడితే, లేదా చీమగా పుడితే, జీవుడికి ఆయా పరిమాణాలు ఉంటాయా? ఏనుగు శరీరంలో ఉన్న జీవుడు కర్మ వశాన చీమ శరీరం పొందితే అతనా శరీరంలో ఎలా ఇముడుతాడు? అల్పశరీరంలో పెద్ద పరిమాణంలో ఉన్న జీవుడు ఎలా సంపూర్ణంగా ప్రవేశిస్తాడు? కనుక జీవులకు శరీర పరిమాణం ఉంటుందని భావించడం తర్కబద్ధం కాదు. శరీరపరిమాణం ఎంత ఉంటుందో, జీవుడి పరిమాణం అంతే ఉంటుందని జైనులంటారు. ఆత్మ శరీరపరిమాణం అయితే ఆత్మ సర్వగతుడు కాదు పరిచ్చిన్నుడని అందువలన ఘటపటాదుల వలె అనిత్యుడని గ్రహించాలి. మనుష్యజీవుడు తన శరీర పరిమాణంతో ఉండి తిరిగి ఏ ఏనుగుజన్మో వస్తే, ఏనుగు శరీరమంతా వ్యాపింపజాలక పోతాడు. చిన్న ఈగ లోనఇమడలేకపోతాడు. ఒక్క జన్మ లోనే కౌమార, యవ్వన, వార్ధక్యాదులందు శరీర పరిమాణం మారిపోతూ ఉంటుంది. అనంతమైన ఈ జీవావయవాలు ఒకే ప్రదేశంలో ఉండటానికి అడ్డం ఏర్పడుతుందా? ఏర్పడదా? అవయవాలు పరిమితమైతే దేహంలో ఇమడవు. ఇమడక పోతే పైకి పోతాయని అర్ధం. వాటికీ అడ్డు తగలదు అని అంటే అన్ని అవయవాలు ఒక్క చోటే ఇమిడిపోవచ్చును. కనుక పరిమాణం పెరగడం కుదరదు. కనుక జీవుడు అనుప్రమాణం కలవడానికి చెప్పవలసిన వస్తుంది. శరీరమెంతో పరిమాణం అంతే అనడం ఊహించడానికి కూడా శక్యం కాదు.
సూత్రం :- 206
" న చ పర్యాయాదప్య విరోధో వికారాది భ్యః "
వికారాదిభ్యః:- కార్యత్వం , అనిత్యత్వం లాంటి దోషాలు కలుగుతాయి. కనుక, పర్యాయాత్ :- సంకోచ, వికాస శక్తులు జీవుడికి ఉంటాయనడంలో, అవిరోధః :- దోషం ఉండదని చెప్పడం, అపినచ :- సరియైనది కాదు.
భావం :- కార్యత్వం, అనిత్యత్వం, లాంటి దోషాలు, సంకోచ, వికారాది దోషాలు ఉంటాయని చెప్పడం సరియైనది కాదు.
వివరణ:- జీవుల శరీరం పరిమాణం ఉన్నవాళ్ళే. ఎందుకంటే వాటికి ఆయా శరీరాలలో ప్రవేశించడానికి తగినట్లుగా సంకోచ, వికాసాలు కలుగుతాయి. దీపకాంతి పెద్దదిగాను, చిన్నదిగాను, వ్యాపిస్తుంది కదా! అలాగే ఏనుగు పరిమాణం ఉన్న జీవుడు కర్మాధీనుడై, చీమ శరీరంలో ప్రవేశించినప్పుడు ఆశరీరానికి తగినట్లు తన పరిమాణాన్ని సంకోచించేటట్లు చేసుకుంటాడు. అని వాదించడం హేతుబద్ధం కాదు. జీవికి క్రమంగా అవయవాలు వస్తాయి. ఆత్మకూడా శరీరమంతా ఉంటుంది. కనుక దీనికి కూడా ఈ దోషాలు(అవయవాలు)వస్తాయి. ఆత్మ అనిత్యం అంటున్నారు. కాబట్టి మోక్షం లేదు. వికారం చెందటం జీవుడికి ఉన్నది కనుక అనిత్యమౌతుంది. గత జన్మలో పశువు, ఈ జన్మలో మనిషి. మరి పశువుగా ఉన్నప్పటికీ అవయవాలు కృశించి, ఇప్పుడు మనిషి అవయవాలు వస్తాయా? ఆత్మకు నాశనం ఉందా? ఆత్మ నాశనమైతే మోక్షం మాట ఏమిటి? అనే ప్రశ్నలకు జైనమతంలో సమాధానాలు లేవు. జైనమతంలో మోక్షం పొందే సమయానికి ఉండే జీవుని శరీరపరిమాణమే నిత్యం అంటారు. అనిత్యుడైన జీవుడు 8 విధాలైన కర్మల చేత చుట్టబడి, తాళ్ళతో నీళ్లలోకి ఏదో ఒక రాయికి కట్టబడిన ఆనపకాయబుర్ర వలె, సంసారసముద్రంలో మునిగి ఉన్న జీవుడు బంధనం తొలగిపోవడం వలన, పైపైకి వెళ్లిపోతుఉంటాడు అని వారు చెప్పిన బంధం నుండి మోక్షం బాధింపబడుతుంది. మరొక విషయం ఏమిటంటే అవయవాలు వచ్చి చేరుతూ, తొలగిపోతు రావడం, పోవడం అనే ధర్మాలు ఉండటం వలన శరీరాదుల వలె ఆత్మ భిన్నములు అని చెప్పవలసిన వస్తుంది. అప్పుడు నిలకడగా ఉన్న అవయవం ఆత్మ అని చెప్పవలసిన వస్తుంది. అయితే ఆఅవయవం ఏదో చెప్పడానికి శక్యం కాదు. మరొక విషయం: వచ్చే జీవావయవాలు ఎక్కడ పుడుతున్నాయో, పోయేవి ఎక్కడ లీనం అవుతున్నాయో, చెప్పవలసిన ఉంటుంది. భూతలనుండి పుట్టి భూతాలలో లీనం అవుతున్నాయో చెప్పవలసిన ఉంటుంది. అలా అనడానికి వీలు లేదు. జీవుడు భూతాలనుండి పుట్టిన వాడు కాదుకదా! జీవుల అవయవాలు సాధారణము, అసాధారణము అయిన మరొక ఆధారం ఏది చూపడం కుదరదు. అలాంటి ప్రమాణం లేదు. మరొక విషయం:- వస్తూ పోతూ ఉండే అవయవాల పరిమాణం తెలియకపోవడం చేత ఆత్మస్వరూపం ఇలా ఉంటుందని నిర్ణయించడానికి వీలుఉండదు. పర్యాయం చేత కూడా ఆత్మకు అవయవాలు వచ్చి చేరడం, తొలగిపోవడం అనే దానిని ఆశ్రయించడం శక్యం కాదు.
సూత్రం :- 207
" అన్త్యావ స్థితే శ్యో భయ నిత్య త్వాద విశేషః "
అన్త్యఅవస్థితేః చ :- మోక్షంలో ఉండే పరిమాణం నిత్యం అని అంగీకరిస్తే, ఉభయ నిత్యత్వాత్ :- రెండింటిలోనూ నిత్యం కావలసి వస్తుంది. కనుక అవిశేషః :- మోక్షంలో విశేషం లేదు.
భావం:-చివరిదైన ఆత్మ పరిమాణం నిత్యంగా ఉండటం వలన మొదటిది, మధ్యలో వచ్చినది అయిన రెండు, ఆత్మ పరిమాణం కూడా నిత్యం అవడం వలన ఆమూడింటి ప్రమాణంలోనూ భేదం ఉండదు.
వివరణ:- మోక్షావస్థలో పరిమాణం నిత్యం అయితే, ముందు ఉన్నది కూడా నిత్యమే కావాలి. ఆది, మద్యం, అంతం అన్ని సమానంగానే ఉండాలి. కాని ఒకటి నిత్యము, ఇంకొకటి అనిత్యము కావు. అందుకే ఈమతం అప్రమాణం. ఆమోదయోగ్యం కాదు. సంసార అవస్థలో జీవుడు కర్మఫలాలను అనుభవించదానికి వేర్వేరు శరీరాలు దరిస్తాడు. కనుక ఆ అవస్థలో జీవుడికి శరీర పరిమాణం ఉంటుంది. అంతం అంటే మోక్షం. అంత్యావస్థ అంటే మోక్షావస్థ. ఈ అవస్థ తరువాత జీవుడికి మరో శరీరంలో ప్రవేశించవలసిన అవసరం ఉండదు. కనుక మోక్షావస్థలో ఏపరిమాణం జీవుడికి ఉంటుందో అది నిత్యం అని అనేకాంతవాదన. మోక్షావస్థలో ఉండే చివరి జీవపరిమాణం నిత్యమని జైనులు అంగీకరిస్తారు. దాని వలనే పూర్వం ఉన్న మొదటిది, మధ్యమము, అయిన జీవపరిమాణాలు కూడా నిత్యములే అని చెప్పవలసిఉంటుంది. అందుచేత ఒక్క శరీరానికి ఎంత పరిమాణం ఉంటుందో అంతే జీవునకు కూడా ఉంటుందని చెప్పాలి. శరీరపరిమాణం మధ్యమాలు అనిత్యాలు. నిరవయవం అయిన సూక్ష్మపరిమాణమే నిత్యం. ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండేదే నిత్యం. మోక్ష పూర్వవస్థలలో శరీరపరిమాణం పెరగడం, తరగడం వలన నిత్యత్వానికి భంగం వస్తుంది. అందుచేత ఎల్లప్పుడూ పెరిగి, తరిగే శరీరాలలోకి ఆ ఆత్మ వెళ్లడం కుదరదు. అనగా మోక్షావస్థలో నిత్యమైన ఏ పరిమాణం ఉంటుందో ఆపరిమాణం గల శరీరంలో మాత్రమే ఆ ఆత్మ మోక్షానికి ముందు ఉంటుంది. దాని కంటే పెరగడంగాని తరగడంకాని ఉంటే శరీరం లోకి వెళ్ళదు అని చెప్పవలసిన వస్తుంది. చివరిదైన జీవపరిమాణం నిత్యం కనుక పూర్వవస్థలోకూడా జీవుని పరిమాణం అంతే ఉంటుందని అంగీకరించాలి. నిత్యమైనది అణువైనా కావాలి, మహాత్ప్రమాణమైన కావాలి. అందుచేత జీవుడు అనుప్రమాణుడని గాని, మహాత్ప్రమానుడని అంగీకరించాలి. కాని శరీరంతో సమానమైన పరిమాణం కలవాడు అని చెప్పడం కుదరదు. అందుచేత వీరి మతం అసంగతమే కాక ఉపేక్షించదగినది.
ప్రత్యధికరణం ( 2, 2, 37 )
సూత్రం :- 208
" పత్యుః అసామంజస్వాత్ "
పత్యుః :- ప్రకృతి, జీవులకు ఈశ్వరుడైన వాడికి శరీరం ఉందని అంగీకరించడం, అసామంజస్యాత్ :- సమంజసం కాదు.
భావం :- ప్రకృతి, జీవులకు ఈశ్వరునికి శరీరం ఉందని అంగీకరించడం సమంజసం కాదు. ఈ అధికరణంలో సాంఖ్య, పతంజలి, తార్కిక మతాలను ఖండిస్తున్నారు.
వివరణ:- లోకంలో అనేక వస్తువుల్ని నిర్మించే వ్యక్తులను శరీరాలు ఉండటం చూస్తున్నాం. అలాగే జగత్తుకి రచయిత అయిన ఈశ్వరుడికే శరీరం ఉంటుందని కొందరు అంటారు. శరీరాలున్న ప్రాణుల్లో ముఖ్యంగా మానవులకు ప్రపంచంలో ఉండే పదార్ధాల సహాయంతో అనేక చిత్ర విచిత్ర వస్తువులు తయారు చేసే సామర్ధ్యం ఉన్నది. కాగా శరీరధారుల శక్తులు పరిమితం. అనల్పపదార్ధాల రచన వారి తరం కాదు. సృష్టిరచయిత అయిన ఈశ్వరుడికి సైతం ఒక శరీరం ఉందని అంగీకరిస్తే ఆయన శక్తి కూడా పరిమితం అవుతుంది. అప్పుడు ఆయనకు అపరిమిత ప్రపంచరచన వీలుకాదు. అందువలన ఈశ్వరుడు శరీరధారి కాడు. గురువు గారు! పరమాత్మ ప్రధానతత్వానికి, పురుషతత్వానికి ప్రేరకుడు. ఈపరమాత్మ ప్రపంచానికి నిమిత్తకారకుడే తప్ప ఉపాదానకారకుడు కాదు అని మహేశ్వరులు అంటున్నారు. మరి వారి మాట ఏమిటి? అని అడిగాడు కృష్ణశర్మ. ఆ మాటలు విన్న రత్నకరుడు చెప్పడం ప్రారంభించాడు. మహేశ్వరులు అంటే శివుణ్ణి ఆరాధించే వాళ్ళు. వీరు శైవులు, పాశుపతులు, కాపాలికులు, కారుణికసిద్ధాంతులు అని నాలుగు రకాలుగా ఉన్నారు. పరమేశ్వరుడు ప్రకృతి మొదలైన వాటన్నింటికీ ప్రేరకుడు కాబట్టి కేవలం నిమిత్తకారకుడు అంటారు. అది తప్పు. అలా అంటే అతని యందు రాగద్వేషాలు అపాదించబడతాయి. పశుపతులు అనుమానప్రమాణంతో పరమేశ్వరుడు ఉన్నాడని అతడు ప్రకృతిని, పురుషున్నీ అంటే ఆత్మని ప్రేరేపిస్తున్నాడని ఆ కారణంగానే సృష్టి జరుగుతోంది అని, పరమేశ్వరుడే నిమిత్తంకారణం అంటారు. అది సరియైనది కాదు. ఇలా జరిగితే కొంతమందిని దుఃఖితులుగా, చెడ్డవారుగా సృష్టిస్తాడు అనాలి. అలా అయితే అతనికి రాగద్వేషాలు ఉన్నట్లు అవుతుంది. అది వేదవిరుద్దం. కాబట్టి ఈవాదన సరియైనది కాదు. ఇప్పుడు కేవలం అధిష్టానమైన ఈశ్వరుడు జగత్తుకు కారణం అనే వాదం నిరకరింపబడుచున్నది. ఈశ్వరుడు ప్రకృతి కాదు. కేవలం అధిష్టాతయే. నిమిత్తకారణం మాత్రమే అని చెబితే బ్రహ్మత్వానికి విరుద్ధమౌతుంది. కనుక అది నిరాకరించ బడింది. సాంఖ్యయోగ మంత్రాలు ఆశ్రయించిన కొందరు ప్రధాన పురుషుల అధిస్థాత అయిన ఈశ్వరుడు కేవలం నిమిత్తమాత్రమే ప్రధాన, పురుష, ఈశ్వరుడు పరస్పరం వేరు అని అంటారు. మహేశ్వరులైతే కార్యం(మహాదాధికం ), కారణం(ప్రధానం, ఈశ్వరుడు), యోగం(సమాధి), విధి(త్రిషవణ స్నానాదికం), దుఃఖాంతం(మోక్షం) అనే 5 పదార్ధాలు పశుపతి అయిన ఈశ్వరునిచేత పశువుల(జీవుల), పాశాల (బంధాలు) మోక్షం కొరకు ఉపదేశించబడ్డాయి. పశుపతి అయిన ఈశ్వరుడు నిమిత్తంకారణం అని వర్ణిస్తారు. వైశేషికులు కొంతమంది ఈశ్వరుడు నిమిత్తంకారణం అని వర్ణించారు. అద్వితీయమైన బ్రహ్మ జగత్తును ప్రకృతి, నిమిత్తకారణము కూడా అని చెప్పే వేదాంత సమన్వయానికి ఈశ్వరుడు కర్తయేకాని ప్రకృతి కాదు అని చెప్పే మతాలలో విరోధం ఉందా? లేదా? అనేది సందేహం. అవి ప్రమాణికములే గాన విరోధం ఉందని పూర్వపక్షం, అప్రమాణములు కనుక విరోధం లేదని ఉత్తరపక్షం.
సూత్రం :- 209
" సంబంధానుపపత్తేశ్చ "
చ:-అంతేకాక, సంబంధ అనుపపత్తేః:-ఆశ్రయ, ఆశ్రయీ భావసంబంధం సిద్ధించనందు వలన, ఈశ్వరునికి శరీరం ఉంటుందని చెప్పడం సరియైనది కాదు.
భావం :- ప్రకృతి, జీవుడు, ఈశ్వరుడు మధ్య ఆశ్రయ, ఆశ్రయీ సంబంధం ఉంటుందనడం సరియైనది కాదు.
వివరణ:- ప్రకృతి, జీవులు ఈశ్వరునిలో ఉన్నందున వాటికీ తనలో ఆశ్రయం ఇచ్చాడు. ఆశ్రయం ఇచ్చిన ఈశ్వరుడు ఆశ్రయీ అవుతాడు. జీవప్రకృతులకు ఈశ్వరుడే ఆధారం. ఈబ్రహ్మాండానికి ఆశ్రయీ అయిన ఈశ్వరుడికి శరీరం ఎలా ఉంటుంది? శరీరం ఉంటే ఈశ్వరుడు పరిచ్చినుడు అవుతాడు. అప్పుడు జీవుడి లాగానే ఆయనకు కూడా అల్పమైన శక్తులు ఉంటాయి. ఆశ్రయించే వస్తువు కన్నా ఆశ్రయం ఇచ్చే వస్తువు ఎప్పుడు అధికమే. బ్రహ్మాండానికి ఆశ్రయమైన ఈశ్వరుడు శరీరధారి అయితే ఈ ఆశ్రయ, ఆశ్రయీ భావ సంబంధం పొసగదు. ప్రేరేపించే ప్రకృతికి, ప్రేరకుడైన ఈశ్వరునికి సంబంధం లేదు. కాబట్టి ఈమతం సరియైనది కాదు. పరమేశ్వరుడు ప్రకృతికి, పురుషునికి ప్రేరకుడు అన్నారు. మరి ప్రేరకునికి, ప్రేరేపించేవాడికి సంబంధం ఏమిటి? సంబంధం లేకపోతే అతను ప్రేరకుడు కాదు. వారి మతం ప్రకారం ప్రకృతి, పురుషుడు, పరమేశ్వరుడు నిరవయవాలు, సర్వ వ్యాపకాలు. వీటికి సంయోగం ఉన్నదంటారు. ఇది సంభవం కాదు. అవయవాలు ఉంటేనే సంయోగం ఉంటుంది. లేకపోతే సంబంధం లేదు. కనుక ఈ వాదన సరి కాదు. ప్రధానము, పురుషుడు, ఈశ్వరుడు కూడా సర్వగతాలు (అంతటా వ్యాపించి ఉన్నవి) అవయవాలు లేనివి, అందుచేత సంయోగ రూపమైన సంబంధం కుదరదు. ఈశ్వరునుకి, ప్రధానపురుషునకు మధ్య ఆశ్రయ ఆశ్రయీ భావం కనబడటం లేదు. ఘటం ఆశ్రయం, దానిలో సమవాయ సంబంధంలో ఉన్న గుణాధికం ఆశ్రయీ అవుతుంది. వస్తువుల గుణాల మధ్య ఉండే అవినాభావ సంబంధమే సమవాయం. ఒక వస్తువు, దాని గుణాలు వేరు కావు. గుణాలు లేకుండా వస్తువు ఉండదు. వస్తువు లేకుండా గుణం ఉండదు. కుండ లేకుండా మట్టి ఉండదు. మట్టి లేకుండా కుండ ఉండదు. కుండలోనూ, మట్టి లోను ఒకే గుణాలు ఉంటాయి. అదే సమవాయ సంబంధం. ఈశ్వరునుకి, ప్రధాన పురుషునకు సమవాయ సంబంధం కుదరదు. కార్యాన్ని బట్టి మరొక సంబంధం కల్పించడానికి వీలు లేదు. ఇప్పటికీ వాటి మధ్య కార్యాకరణ సంబంధమే లేదు. ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది. కార్యం కొత్తగా పుట్టుకు వస్తుంది. కార్యంలో కనబడే లక్షణాలు కారణంలో కనబడవు. విత్తనం పగలుకొట్టి చూస్తే సూక్ష్మ రూపంలో చెట్టు కనిపిస్తుందా? అలాగే ఈశ్వరుని లక్షణాలు ప్రధానపురుషునిలో కనిపించవు. ఈశ్వరునికి శరీరం ఉంటుందని చెప్పడం సరియైనది కాదు. వారి మధ్య ఆశ్రయ, ఆశ్రయీ భావం సిద్ధించదు.
సూత్రం :- 210
" అధిష్టానానుపపత్తేశ్చ "
చ :- అంతేకాక, అధిష్ఠాన అనుపపత్తే :- శరీర ధారణ సిద్ధించడం లేదు.
భావం :- అధిష్ఠానం అంటే శరీరం. సృష్టికి పూర్వం శరీరం ఏర్పడదు. సృష్టి సమయంలోనూ ఏర్పడటానికి వీలు లేదు. అందుకే శరీర ధారణ సిద్ధించడం లేదు.
వివరణ :- తార్కికులు కల్పించిన ఈశ్వరుడు కుంభకారుడు, మట్టి మొదలైన వాటితో తన సంపూర్ణజ్ఞానాన్ని ఉపయోగించి వివిధరకాల పాత్రలను వివిధరీతులలో చేసినట్లుగా, ప్రధానాదులను అధిష్టించి ప్రవర్తింపజేస్తాడంటున్నారు. కాని అలా చెయ్యడం కుదరదు. ప్రధానం, మృత్తిక కన్నా విలక్షణమైనది. ప్రత్యక్షంకానిది, రూపాదులు లేనిది అయిన ప్రధానాన్ని ఈశ్వరుడు అధిష్టించడం సంభవించదు. రూపంలేని ప్రకృతికి ప్రేరకుడు కానందువలన ఈశ్వరుడు నిమిత్తకారకుడు కాదు. ప్రకృతి రూపం లేనటువంటిది. రూపరహితమైన ప్రకృతిని ప్రేరేపించి ఈశ్వరుడు సృష్టి చేస్తున్నాడని చెప్పడం సమంజసం కాదు. శరీరం నిరవయవం కాదు. సావయవం అనుకుంటే సృష్టికి పూర్వం అవయవాలు ఎక్కడ ఉన్నాయి? ఏ విధంగా చూసినా ఈశ్వరుడుకి దేహం ఉండటం హేతుబద్ధం కాదు.
సూత్రం :- 211
"కరణ వచ్చేన్న భోగాదిభ్యః "
కరుణవత్ చేత్:- ఈశ్వరుడికి కరచరణాదుల్తో కూడిన శరీరం ఉందని అంగీకరిస్తే, భోగాదిభ్యః :- సుఖ దుఃఖాలను భవించ వలసివస్తుంది. న :- శరీరం ఉందని ఒప్పుకోవడానికి వీలు లేదు.
భావం:- ఈశ్వరుడికి కరచరణాదులతో కూడిన శరీరం ఉందని అంగీకరిస్తే, సుఖ దుఃఖములు అనుభవించవలసి వస్తుంది. వాటికి కారణములైన వాసనలుంటాయి. కనుక శరీరం ఉందని ఒప్పుకోవడానికి వీలు లేదు.
వివరణ:-ఇంద్రియాలు జీవునిచేత ప్రేరేపించబడి పనిచేస్తున్నాయి. అలాగే ప్రకృతిని ఈశ్వరుడు ప్రేరేపిస్తున్నాడు అని చెప్పరాదు. కరణములు అంటే ఇంద్రియములు. ఈ ఇంద్రియములకు ఆశ్రయం శరీరం. వాటి వలన భోగాలు, వాసనలు ఉంటాయి. అప్పుడు ఈశ్వరుడు జీవుడి వలేనే భోగి అవుతాడు. భోగం అంటే సుఖదుఃఖములనుభవించడం కదా! జీవుడు శుభ, అశుభ కర్మలను చేస్తే సుఖదుఃఖములు కలుగుతాయి. అవి అవిద్యాది క్లేశాల వలన కలుగుతాయి. కాబట్టి ఈశ్వరుడు శరీరధారి అయితే ఆయన సుఖదుఃఖ అనుభూతులు పొందినవాడవుతాడు. అప్పుడు ఆయనకు అవిద్యాదిక్లేశాలు ఉన్నట్లు ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటే ఆయన ఈశ్వరుడు కానేరడు. భోగాదులు కనబడటం వలన జీవుడు ఇంద్రియ సముదాయాన్ని అధిష్టించినట్లు తెలుస్తుంది.ఇంద్రియ సముదాయంతో పోలికను అంగీకరిస్తే ఈశ్వరుడికి భోగాదులు ప్రసక్తం అవుతాయి. తార్కికులచేత కల్పించబడినఈశ్వరుడు సాధిష్టానుడై, శరీరంతో కూడిన రాజులా కనిపిస్తున్నాడు. కాని శరీరం లేనివాడు ఈశ్వరునిగా కనబడటం లేదు. అధిష్టాన శబ్దానికి శరీరం అని అర్ధం. అందువలన ఆ దృస్థాంతం చేత ఈశ్వరునికి కూడా ఇంద్రియలకు స్థానమైన ఒకానొక శరీరం ఉంటుందని చెప్పవలసి ఉంటుంది. అలా చెప్పడం కుదరదు. శరీరం సృష్టి తరువాత ఏర్పడుతుంది. కాని సృష్టికి పూర్వం అది కుదరదు. ఈశ్వరుడు సశరీరుడైతే సంసారి వలె భోగాలు అనుభవించాలి. అప్పుడు అతను ఈశ్వరుడు కాదని గ్రహించాలి.
సూత్రం :- 212
" అంత వత్వమ సర్వజ్ఞతా "
వా :- ఇంతే కాక, ఈశ్వరుడు శరీర దారి అయితే, అంత వత్యం :- నాశనం కావడం, అసర్వజ్ఞత్వం :- సర్వజ్ఞత్వం లేకపోవడం అనే దోషాలు ఆయనకు కలుగుతాయి.
భావం :- ఈశ్వరునికి శరీరం ఉంటే నాశనం అవడం, సర్వజ్ఞత్వం లేకపోవడం వంటి దోషాలు కలుగుతాయి.
వివరణ:-ఈశ్వరుడికి జీవుడిలా శరీరంఉంటే ఆయనకు వినాశనం కలుగుతుంది. ఈశ్వరత్వానికి భంగంకలుగుతుంది. అలాగే శరీరధారులు అల్పజ్ఞులు అవుతారు. ఆయనకు శరీరంఉంటే సర్వజ్జుడు కాలేదు. ఈశ్వరుడు ప్రకృతిది, తనది, పురుషుడిది అయిన సంఖ్యాపరిమాణాన్ని నిశ్చయిస్తాడా? నిశ్చయించడా? ఇక్కడ నిశ్చయిస్తే పరిచ్చినదోషం, నిశ్చయించకపోతే అసర్వజ్ఞత్వదోషం. ఈశ్వరుడు సర్వజ్జుడు, అనంత స్వరూపుడు, అతడు ప్రధాన పురుషుల తన యొక్క పరిమితిని గుర్తిస్తాడా? లేదా? గుర్తిస్తున్నాడు అంటే అతనికి అంతముంటుంది. గుర్తించకపోతే సర్వజ్జుడు కాదు. అందుచేత వీరి వాదం అసమంజసం. తార్కికులు ఈశ్వరుడు సర్వజ్జుడని, అనంతుడని, అంగీకారిస్తారు. అనంత మైన ప్రధానం, అనంతమైన పురుషులుకూడా పరస్పరం వేరైన వాళ్ళుగా అంగీకరింపబడుతున్నారు. సర్వజ్జుడైనా ఈశ్వరుడు ప్రధానంయొక్క, పురుషుల యొక్క, తన యొక్క ఇయత్త (ఇంత సంఖ్య, ఇంత పరిమాణం అనే కొలతలు) ను పరిచ్చేదం చేస్తాడా? చెయ్యడా? రెండువిధాలా దోషం ఏర్పడుతుంది. మొదటివికల్పంలో ప్రధానపురుషేశ్వరులు ఇయ్యత్త(ఇంత పని) చేత పరిచ్చిన్నమవడం చేత అంటే కొలబడటం చేత తప్పక వాటికి నాశనం కలుగుతుంది. కొలత, పరిమాణం ఉన్న ఘటము, వస్త్రం కొంతకాలం తరువాత నాశనమౌతాయి. ప్రధానం, పురుషులలోఉన్నస్వరూపపరిమాణం ఈశ్వరుని చేత (పరిచ్చిన్నం) కొలవ బడుతుంది. ఏసంసారులు సంసారంనుండి ముక్తులౌతారో వాళ్ళ సంసారం అంతమై పోతుంది. వాళ్ళ సంసారిత్వం కూడా అంతమౌతుంది. అదే విధంగా ఇతరులుకూడా ముక్తులైతే, ఆసంసారులు, సంసారిత్వం అంతమౌతాయి. ఈశ్వరుచేత అధిష్టించబడిన వికారాలతో కూడిన ప్రధానమే సంసారం అని చెప్పబడింది. ఆపురుషులు లేకపోతే ఈశ్వరుడు దేనిని అధిష్టిస్తాడు? ఈశ్వర సర్వజ్ఞత్వం, తత్వాలు దేనికి సంబంధించి ఉంటాయి. అందుచేత మూడింటికి అంతం ఉండాలి. ఇక రెండవ వికల్పం ఈశ్వరుడు ప్రధానం యొక్క, పురుషుని యొక్క తన యొక్క ఇయత్త (ఇంత పని)ను పరిచ్చేదించకపోతే, ఈశ్వరుని యొక్క సర్వజ్ఞత్వానికి హాని కలుగుతుంది. కనుక తార్కికులు అంగీకరించిన ఈశ్వరకారణ వాదం అసంగతమే.
ఉత్పత్త్యధికరణం ( 2, 2, 42 )
సూత్రం :- 213
" ఉత్పత్త్య సంభవాత్ "
ఉత్పత్తి :- ఈశ్వరుడు జీవులను ఉత్పత్తి చెయ్యడం, అసంభవాత్ :- సంభవం కాదు,
భావం :- జీవోత్పత్తిని అంగీకరించే కొందరు ఈశ్వరుడి నుంచే జీవులు ఉత్పన్నం అవుతారని అంటారు. పరమేశ్వరుడి వల్ల జీవులు ఉత్పన్నం అవుతారని, కాని వారు నశించరు అని చెబుతారు. ఈ మతం అంగీకారం కాదు.
వివరణ:- ఈ అధికరణంలో పాంచ రాత్రులమతాన్ని ఖండిస్తున్నారు. ఈ మతాన్నే భాగవతమతం అని కూడా అంటారు. ఈ మతంలో భగవంతుడు వాసుదేవుడు నిర్వికారుడు, జ్ఞానస్వరూపుడు, ఇతడే ఈజగత్తుకు ఉపాదాన, నిమిత్తకారణం. ఈశ్వరుడి నుంచి జీవులు ఉత్పన్నం అవడం అంటే ఏమిటి? మట్టినుంచి కుండ పరిణామం చెందినట్లుగా జరిగితే, ఈశ్వరుడు పరిణామి అవుతాడు. సావయవి, అనిత్యుడు అవుతాడు. కుమ్మరికి మట్టి ఉపాదానమైనట్లుగా ఈశ్వరుడుకి ఉపాదాన వస్తువు ఏది? అతను మట్టిని ఉపాదానంగా చేసుకొని అనేక రకాల మట్టి పాత్రలు తయారు చేస్తాడు. ఈశ్వరుడు సర్వ శక్తి మంతుడు. కనుక సంకల్ప మాత్రం చేత జీవుల్ని ఉత్పత్తి చేస్తాడు అనడం కూడా సరియైనది కాదు. సంకల్పానికి ఆశ్రయం ఉన్నట్లుగా విషయంకూడా ఉండాలి. విషయంలేని సంకల్పం ఉండదు. జీవుడు విషయమైతే సంకల్పనికి పూర్వమే ఉండాలి. ఉత్పత్తికి పూర్వం ఉన్న వస్తువు నిత్యమే అవుతుంది. కనుక ఈశ్వరుడి వలన జీవుడు ఉత్పన్నం కాదని తేలుతోంది. భాగవతులు ఇలా అనుకుంటారు: నిర్మలజ్ఞానస్వరూపుడైన భగవంతుడు ఒక్క వాసుదేవుడే పరమార్ధతత్వం. ఆ వాసుదేవుడి నుండి సంకర్షణుడు (జీవుడు), అతని నుండి ప్రద్యుమ్నడు(మనస్సు), అతనినుండి అనిరుద్ధుడు (అహంకారం), పుడుతున్నారు. భక్తులు భగవంతుణ్ణి పరిపరి విధాల ఆరాధించి చివరకు పరమపదం చేరుతారు. వీరికి, వైదికమతానికి పెద్దగా తేడా ఏమి లేదు. ఒక్కటే తేడా, వాసుదేవుడి నుంచి జీవుడు ఉద్భవించడం సమంజసం కాదు. వాసుదేవుడనగా పరమాత్మ. సంకర్షుణుడు అనగా జీవుడు, ప్రద్యుమ్నడు అనగా మనస్సు, అనిరుద్ధుడు అనగా అహంకారం, ఆవ్యూహలలో వాసుదేవుడు పర ప్రకృతి, మిగిలిన సంకర్షణాది వ్యూహాలు కార్యం. ఇలాంటి భగవంతుడైన పరమేశ్వరుణ్ణి అభిగమన, ఉపాదాన, ఇజ్యా, స్వాధ్యాయ, యోగాల చేత నూరు సంవత్సరాలు పూజించి, క్లాలాన్ని క్షేనించగా భక్తుడు భగవంతుని చేరతాడు. అభిగమనం అంటే మనోవాక్కయాలను సావధానంగా ఉంచుకొని, దేవతానుగ్రహానికి వెళ్లడం, ఉపాదానం అంటే పూజాద్రావ్యాలు సంపాదించుకోవడం, ఇజ్యా అంటే పూజ, స్వాధ్యాయం అంటే అష్టాక్షరీ మంత్ర జపం, యోగం అంటే ధ్యానం. వాసుదేవుడనే పరమాత్మ నుండి సంకర్షుణుడనే జీవుని ఉత్పత్తి సంభవం కాదు. అలా అంగీకరిస్తే జీవునికి అనిత్యత్వం మొదలైన దోషాలు కనిపిస్తాయి. అప్పుడు జీవుడు భగవంతుని పొందటం మోక్షం కాజాలదు. కార్యం కారణాన్ని పొందినప్పుడు మట్టిలో చేరిన కుండ వలె భగవంతునిలో లీనం అయిపోతున్నాడు కదా! ఆచార్యుడు జీవునకు ఉత్పత్తి నిషేదిస్తున్నాడు. అందువలన ఈశ్వరుడు జీవుల్ని ఉత్పత్తి చెయ్యడం సంభవం కాదు.
సూత్రం :- 214
" న చ కర్తుః కరణమ్
" కర్తుః :- శుభ, అశుభ కర్మలు చేసే జీవునికి, కరణం :- అంతఃకరణం లేదనడం, న చ :- యుక్తం కాదు,
భావం :- శుభ, అశుభ కర్మలు చేసే జీవునికి అంతఃకరణం లేదనడం యుక్తం కాదు. జీవునకు మనస్సు ఉంటుందనేది హేతుబద్ధం. చక్షురాది బాహేంద్రియలతో బాటు అంతః కరణం కూడా జీవునకు ఉన్నది.
వివరణ :- కర్త నుండి సాధనం పుట్టదు. ఇక్కడ కర్త సంకర్షుణుడు అనే జీవుడు. అతని నుండి మనస్సు, అతని నుండి అహంకారం పుట్టవు. ఈ ప్రక్రియకు వేద ప్రమాణం లేదు. కర్త నుంచి కరణం పుట్టదు అని సూత్రానికి అర్ధం. ఈ కరణం వలన ఈ కల్పన అసంగతమైనది. ఎందువననగా లోకంలో ఎక్కడా కర్త అయిన దేవదత్తుని నుండి కరణమైన పరశువు గండ్రగొడ్డలి మొదలైనవి పుడుతున్నట్లుచూడబడడం లేదు. జీవుని నుండి ప్రద్యుమ్నడు అనే మనస్సు పుడుతుందని, కర్త నుండి పుట్టిన ఆమనస్సు నుండి అనిరుద్ధుడనే అహంకారం పుడుతుందని భాగవతులు వర్ణిస్తారు. దీనిని ఏదైనా దృష్టాంతం చూపితే గాని అర్ధం చేసుకోలేము. ఇలాంటి శ్రుతి కూడా ఏదీ కనబడటం లేదు. సర్వాత్మ స్వరూపుడైన పరమాత్మ ఒకడుగా ఉంటాడు. ముగ్గురిగా అవుతాడు. లేదా అనేక రూపాలతో ఉంటాడని శ్రుతుల వలన తెలుస్తోంది. ఏకగ్రచిత్తంతో అభిగమ నాదుల చేత భగవంతుని ఆరాధించడం, ఈశ్వర ధ్యానం, సేవాధికం శ్రుతి, స్మృతులలో ప్రసిద్ధమే. కాని వాసుదేవుని నుండి జీవుడు, అతని నుండి మనస్సు పుట్టడం జరగదు.
సూత్రం :- 215
" విజ్ఞా నాది భావేవా తద ప్రతి షేధహా "
వా:- కాగా, విజ్ఞానాది భావే :- జ్ఞానం కలుగుతుండగా, తత్ అప్రతి షేధః :- మనస్సుని అంగీకరించక పోవడం సిద్ధించడం లేదు.
భావం :- బాహ్యజ్ఞానానికి చక్షురాదుల వలె, సుఖదుఃఖ విషయం జ్ఞానం కలగడానికి మనస్సు, అంతఃకరణం కావాలి. కనుక మనస్సనేది లేదనడం పొరబాటు.
వివరణ:- బాహ్యవిషయజ్ఞానం, అంతరంగికవిషయజ్ఞానం ఉన్నాయి. కళ్ళలాంటి బాహ్యఇంద్రియాలు లేకపోతే, బాహ్య విషయాలైన ఘటపటాదుల జ్ఞానం కలుగదు. సుఖదుఃఖాలు ఆంతరాంగిక విషయాలు. ఆ సుఖదుఃఖములను గ్రహించ డానికి మనస్సు కావాలి. సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధులు వాసుదేవుని లాగానే ఐశ్వర్యం, బలము, గలవారే అని చెప్పినట్లయితే ఒకే ఈశ్వరునితో సృష్టి కార్యం జరిగేటప్పుడు నలుగురు ఈశ్వరులు అనవసరం. వీరందరిని సమానంగా ఒప్పుకుంటే వాసుదేవుడొక్కడే పరతత్వం అనేమాట అబద్దమౌతుంది. వాసుదేవాదులైన ఈ నలుగురు పరస్పర భిన్నులైన తుల్యధర్మాలు గల ఈశ్వరులే. వీళ్లకు ఏకస్వరూపత్వం లేదు అని వారి అభిప్రాయమైతే, అప్పుడు ఒక ఈశ్వరునితో పని జరుగుతున్నప్పుడు అనేక ఈశ్వరులను కల్పించడం వ్యర్థం. భగవంతుడైన వాసుదేవుదొక్కడే పరమార్ధతత్వం అని వారు అంగీకరించడం వలన వారి సిద్ధాంతానికి భంగం కలుగుతుంది. అలాకాక ఏనాలుగు వ్యూహలు కూడా ఒకే భగవంతుని నాలుగు సమాన ధర్మాలు గల వ్యూహలు అని అభిప్రాయమైతే అప్పుడు ఉత్పత్త్యసంభవ దోషం (ఈశ్వరుడు జీవుణ్ణి ఉత్పత్తి చెయ్యడం) అలాగే ఉంది. వాసుదేవుడి నుంచి సంకర్షునుని ఉత్పత్తి, సంకర్షునుని నుండి ప్రద్యుమ్నని ఉత్పత్తి, ప్రద్యుమ్నని నుండి అనిరుద్ధుని ఉత్పత్తి కుదరదుకదా! మృద్ఘటాలలో కొంచెం అతిశయం, ( విశేషం) ఉన్నట్లు కార్యకారణముల మధ్య ఏదో ఒక విశేషం ఉండాలి కదా! అలాంటి విశేషం లేకపోతే ఒకటి కారణమని, మరొకటి కార్యమనీ చెప్పడం కుదరదు కదా! వాసుదేవాదులలో ఒక్కొక్కరిలో గాని, అందరిలోగాని జ్ఞానఐశ్వర్యాదుల తారతమ్యం ఉందని పాంచరాత్ర సిద్ధాంతుల చేత అంగీకరించబడటం లేదు కదా! ఈ వ్యూహలన్నీ వాసుదేవులేనని అంగీకరించబడుతున్నాయి. మరొక విషయం ఈ నాలుగు వ్యూహలతో ఆగిపోవు. ఎందువలనంటే బ్రహ్మదేవుడు మొదలు చిన్న గడ్డిపురుగు వరకు సమస్త జగత్తు కూడా భగవంతుని వ్యూహమే. మూర్తియే శరీరం అని తెలుస్తోంది కదా!
సూత్రం :- 216
"విప్రతి షే ధాత్ చ "
చ - అంతే కాక, విప్రతిషే ధాత్ :- వివేక పూర్వకంగా చూస్తే జీవ ఉత్పత్తి వాదం అసంగతం అని తెలుస్తోంది.
భావం :- చెప్పిన విషయంలో పరస్పరవిరోధము, వేదవిరోధము ఉండటం వలన, వివేక పూర్వకంగా చూస్తే జీవ ఉత్పత్తి వాదం అసంగతం.
వివరణ :- కఠోపనిషత్తులో జీవుడికి పుట్టుక, నాశము లేవు. జీవుడు ఉత్పన్నం కాదు.
బృహదారణ్యకోపనిషత్తు:-మనసేక్కడో ఉంటుంది. దానిని చూడలేము. మనస్సు మరొకmచోట ఉంది. కనుక వినలేక పోయాము. దీన్ని బట్టి జీవుడి కన్నా వేరేగా సర్వజ్ఞానసాధనం అయిన మనస్సున్నదని తెలుస్తోంది. జీవోత్పత్తి నిషేధం. మనస్సు ఉండటాన్ని శాస్త్రం ప్రత్తిపాదించింది. కనుక జీవుడికి పుట్టుక ఉందనడం, అంతకరణం లేదనడం సమంజసం కాదు. ఒకే వస్తువు గుణమని, గుణి అని చెప్పడం పరస్పర విరోధం అని శాస్త్రంలో కనబడుతోంది. ఎందువలననగా జ్ఞాన, ఐశ్వర్య, శక్తి, బల, వీర్య, తేజస్సులు గుణాలు, ఇవన్నీ భగవంతుడైన వాసుదేవుడైన ఆత్మలే. జ్ఞానాదులు గుణాలని చెప్పి అవే వాసుదేవులు అనగా ఆగుణాలన్ని గుణులు అని చెప్పడం పరస్పర విరుద్దము. ఇది పాంచరాత్రగమంలో కనబడుచున్నది. అందువలన ఈ శాస్త్రంలో చెప్పిన కల్పన అసంగతమైనది.
వియదధికరణం ( 2, 3, 1)
సూత్రం :- 217
" న వియదశ్రుతేః "
అశ్రుతే :- ఉపనిషత్తులు చెప్పగా వినకపోవడం వలన, వియత్ :- ఆకాశాన్ని, న :- బ్రహ్మం ఉత్పత్తి చేసినట్లు చెప్పలేము.
భావం :- ఆకాశం పుట్టడం, దాని పుట్టుక శ్రుతిలో వినబడకపోవడం వలన ఆకాశాన్ని బ్రహ్మ ఉత్పత్తి చేసినట్లు చెప్పలేము.
వివరణ :- గురువుగారు! పంచభూతాలలో ఆకాశం మొదటిది. మరి ఆ ఆకాశానికి అసలు ఉత్పత్తి ఉన్నదా? శ్రుతులలో కూడా దీనిమీద భిన్న వాదనలున్నాయి. దయచేసి దానిని గురించి వివరించండి. అన్నాడు కృష్ణశర్మ. రత్నాకరుడు చెప్పడం ప్రారంభించాడు. ఆకాశం దాని పుట్టుక గురించి శ్రుతులలో చెప్పలేదు. కనుక ఆకాశానికి ఉత్పత్తి లేదు అని కొందరి వాదన. ఎందుకంటే, ఛాందోగ్యోపనిషత్తులో ఉద్దాలకుడు తనకుమారుడైన శ్వేతకేతువునకు ఆత్మజ్ఞానం బోధిస్తూ, శ్వేతాకేతూ! సృష్టికి పూర్వం ఈప్రపంచం నామరుపాలతో కూడిలేదు. అప్పుడు కేవలం అద్వితీయమైన సత్త్ మాత్రమే ఉండేది. నామరుపాలు, పదార్ధాలు ఏమిలేవు. సత్ అంటే ఉనికి, సత్యం అని అర్ధం. అన్నింటికన్నా పూర్వమైనది. రెండు కానిది. మొదటిగా ఉన్నది ఏకైక పరబ్రహ్మ. ఆతత్వం అనేక మంది కావాలనుకుంది. రకరకాల రూపాలలో వస్తువులుగా జీవించాలనుకుంది. జీవులుగా రూపుదాల్చింది. ఘన ద్రవ వాయు పదార్ధాలుగా మార్పు చెంది, అనేక రూపాలతో సృష్టి ఆకారం పొందింది. తాను అనేకం కావాలనుకున్న సత్ ముందుగా అగ్నిని సృష్టించింది. అగ్ని నుండి జలము, జలము నుండి పృథవి వచ్చాయి. వీటి వల్లనే అన్నం పుట్టింది. ఈరకంగా పంచభూతాలలో అగ్ని, జలము, భూమి మూడింటినే చెప్పారు. ఆకాశాన్ని గురించి చెప్పలేదు. కాబట్టి ఆకాశం లేదు అని వాదన. ఆకాశం, వాయువు, జీవునీ విషయంలో కొన్ని శ్రుతులు ఉత్పత్తి ఉన్నాయనీ, కొన్ని లేవని చెపుతున్నాయి. ఆకాశం పుట్టదు. ఎందువలన? ఉత్పత్తి ప్రకరణంలో ఆకాశం పుట్టినట్లు వినబడడంలేదు. చాందోగ్యంలో బ్రహ్మను ప్రస్థావించి అది చూసింది. అది తేజస్సును సృష్టించింది అని పంచ భూతాలలో మధ్యదైన తేజస్సుతో ప్రారంభించి తేజోబన్నాలు మూడింటి యొక్క ఉత్పత్తి చెప్పబడుతోంది. ఇంద్రియాలకు అందని విషయాలను తెలుసుకోవడానికి మనకు ప్రమాణం శ్రుతియే. ఇక్కడ ఆకాశం పుట్టింది అనే శ్రుతి లేదు. అందుచేత దీనికి ఉత్పత్తి లేదు. ఆకాశానికి వాయువును ఉత్పత్తి జరిగినట్లు తైత్తరీయెపనిషత్తు లో చెప్పబడింది. చాందోగ్యంలో చెప్పలేదు. జీవుడు, ప్రాణాలు ఆత్మ నుండి ఆవిర్భవించినట్లు బృహదారణ్యకంలో చెప్పబడింది. కొన్ని చోట్ల సృష్టి ఆకాశంలో ప్రారంభించినట్లు చెప్పబడింది. కొన్నిచోట్ల అగ్నితో ప్రారంభించినట్లు చెప్పబడింది. కొన్ని చోట్ల ప్రాణాలు ఏడనీ, కొన్ని చోట్ల ఎనిమిదని చెప్పబడింది.
సూత్రం :- 218
" అస్తితు "
తు :-అలా అనడం సరి కాదు. అస్తి :- ఆకాశం కూడా బ్రహ్మం వలన ఉత్పన్నం అయినట్లు వేదాంత వాక్యం ఉన్నది.
భావం :- ఆకాశానికి కూడా బ్రహ్మవలన ఉత్పత్తి ఉన్నది.
వివరణ :- వేదాలలో ఆకాశానికి ఉత్పత్తి ఉన్నది అని చెప్పబడింది.
తైత్తరీయోపనిషత్తు(2,1):-బ్రహ్మం, సత్యం, జ్ఞానం, అనంతం అని ప్రారంభించి ఆ బ్రహ్మం నుంచి ఆకాశం, వాయువు, జనించాయి అని వర్ణించారు. బ్రహ్మను గురించి తెలుసుకున్నవాడు మోక్షాన్ని పొందుతాడు. అంటే తానే పరబ్రహ్మ అవుతాడు. "సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ" దహరాకాశంలో ఉన్న పరబ్రహ్మను తెలుసుకున్నవాడికి బ్రహ్మజ్ఞానంతో బాటు ఇష్టకామ్యార్ధసిద్ధి కలుగుతుంది. సృష్టికి మూలం బ్రహ్మ, దానినుంచే ఆకాశం పుట్టింది. అంటే ఆకాశం కూడా బ్రహ్మమే. బ్రహ్మం నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి భూమి ఈరకంగా పంచ భూతాలు ఉద్భవించాయి. కొన్ని చోట్ల సృష్టి తేజస్సుతో ప్రారంభమైనట్లు చెప్పబడింది. కొన్ని చోట్ల ఆకాశంతో ప్రారంభమైనట్లు చెప్పబడింది. కనుక ఈరెండు శ్రుతులకు విరోధం. ఈరెండు శ్రుతులకు ఏకవాక్యత్వం అంటే పరస్పర సమన్వయం చేసి విరోధం లేకుండా అర్ధం చెప్పడం ద్వారా ఒకేవాక్యంగా చెయ్యడం యుక్తం కదా! నిజమే, అది తెలుసు కోవడానికి ఏకవాక్యత్వం కల్పించడం శక్యం కాదు. ఎందువల్ల? ఒకేసారి వినబడుతున్న సృష్టికర్తకు సృజింపదగిన రెండు కర్మలలో తేజ ఆకాశాలలో అది తేజస్సును సృష్టించింది. అది ఆకాశాన్ని సృష్టించింది. అని చెప్పడం కుదరదు కదా! పప్పు వండి అన్నం వండుతున్నాను. ఇక్కడ ఒకేకర్త రెండు కర్మలలో అన్వయం కనబడుతోంది. తైత్తరీయంలో ఆకాశం ముందుగా పుట్టినట్లు చెప్పబడింది. రెండూ ముందుగా పుట్టడం కుదరదు. ఒక కర్త రెండు కర్మలలో అన్వయించదు. ఆకాశం పుట్టింది. దానినుండి తేజస్సు పుట్టింది. అని చాందోగ్యంలో చెప్పబడింది. తైత్తరీయంలో వాయువు నుండి అగ్ని పుట్టిందని వేరుగా చెప్పబడింది.
సూత్రం :- 219
"గౌణ్య సంభవాత్ "
అసంభవాత్ :- ముఖ్యమైన అర్ధం సంభవం కానందు వలన, గౌణ :- అముఖ్యమని ఎందుకు అనుకోకూడదు? ఆకాశం వ్యాపకం అని వర్ణించాడు కదా!
భావం :- ఆకాశానికి ఉత్పత్తి లేదనే వాడు, ఆకాశానికి పుట్టుక అసంభవం గాన క్షణికమైనది అని అర్ధం.
వివరణ :- ఆకాశం నిత్యమనే వారి వాదన ఈవిధంగా ఉంటుంది. ఆకాశం సర్వవ్యాపకమైనది. అది నిత్యమైనది. కాబట్టి ఆకాశం ఉత్పత్తి లేదు. వైశేషికులు, కణాదులు ఆకాశం విభువు, వ్యాపకం అని వర్ణించారు కదా! వ్యాపకమైన వస్తువు నిరవయవి. సావయవం, వ్యాపకం కానేరదు. సావయవం ఉత్పత్తి అవుతుంది. నిరవయవానికి ఉత్పత్తి లేదు. అది నిత్యం. కనుక ఆకాశం ఉత్పత్తి అయిందని అంగీకరించడం వీలు కాదు. కారణ సామాగ్రి లేనందున ఆకాశం ఉత్పత్తి జరగదు అంటారు. భూమి అగ్ని మొదలైన వాటి విషయాల్లో వీటి ముందు స్థితికి, తరువాత స్థితికి తేడా ఉంది. కాని ఆకాశం విషయంలో ఆ తేడా కనిపించదు. మట్టి కుండగా మారితే చాలా తేడా కనిపిస్తుంది. కాని ఆకాశం చిన్నది కావడం, పెద్దది కావడం, ఛిద్రం అవడం లాంటివి ఏవి కనిపించవు. కాబట్టి ఆకాశం గగనం శూన్యం. ఆకాశం అంటే శూన్యం తప్ప ఏమి లేదు.ఆకాశానికి ఉత్పత్తి చేసే మరొక శ్రుతి ఏది ఉదాహరించబడిందో అది గౌణిలా క్షణికం అనడమే యుక్తం. ఎందువలన? అసంభవం వలన, శ్రీమత్ కణాదుని మతాన్ని అనుసరించే వాళ్ళు జీవించి ఉండగా ఆకాశానికి ఉత్పత్తి ఊహించడానికి కూడా శక్యం కాదు కదా! ఆకాశానికి కారణసామాగ్రి లేదు కనుక దాని ఉత్పత్తిని వాళ్ళు నివారిస్తున్నారు. పుట్టే ప్రతి వస్తువు కూడా సమవాయి, అసమవాయి, నిమిత్తకారణముల వలననే పుడుతుంది. ద్రవ్యానికి ఒకే జాతికి చెందినది, అనేకము అయిన ద్రవ్యం పటానికి తంతుల వలె సమవాయికారణం అవుతుంది. ఆకాశాన్ని పుట్టించడానికి ఏకజాతీయము అయిన ద్రవ్యము ఏదీ లేదు. అలాంటి సమవాయికారణం ఏదైనా ఉంటే తంతువులు కలిసినట్లు అనేక ద్రవ్యాలు కలసి అసమవాయి కారణంగా అయితే ఆకాశం పుట్టడానికి వీలుఉండేది. ఆ రెండు లేనప్పుడు వాటి అనుగ్రహం చేతనే అంటే అవి ఉన్నప్పుడు మాత్రమే ప్రవర్తించే నిమిత్తకారణం ఆకాశానికి అసలే కుదరదు. పృథవ్యాదుల వలె కాక ఆకాశం అంతటా వ్యాపించి ఉండే లక్షణం పుట్టుక లేకపోవడం సిద్ధిస్తుంది. ఘటాకాశం, కరకాకాశం, గృహాకాశం, ఈ మొదలైన భేదాన్ని తెలిపే గౌణ ప్రయోగాలు ఆకాశం ఒక్కటే అయినా కూడా ఎలా వేరువేరుగా కనబడుతున్నాయో, వేదంలో కూడా ఆకాశేషు అని బహువచన శబ్దం కనబడుతున్నది. ఉత్పత్తి శృతి కూడా గౌణి అని గ్రహించాలి.
సూత్రం :- 220
"శబ్దాచ్చ"
చ - అంతే కాక, శబ్దాత్ :- వేదాంతవాక్యాల వలన ఆకాశోత్పత్తి గౌణం అనడం యుక్తం.
భావం :- వేదాంత వాక్యాల వలన ఆకాశోత్పత్తి గౌణం అంటే ముఖ్యం కానిది అనడం యుక్తం.
వివరణ:- శ్రుతివలన కూడా ఆకాశం ఉత్పత్తి చేయబడలేదు. బృహధారణ్యకంలో పంచభూతాలలో పృథవి, జలము, అగ్ని ఈ మూడు మూర్తములు, స్థూలమైనవి, స్థావరమైనవి, నాశనమైపోయేవి. ఇవి చక్షురాది ఇంద్రియాలకు గోచరిస్తాయి. వీటిని నిర్వచించడానికి వీలవుతుంది. పంచభూతాలలో మిగిలిన రెండు వాయువు, ఆకాశం అమూర్తములు, నాశనం లేనివి, నిర్వహించదానికి వీలుకానివి. అమృతములు. చావు పుట్టుక లేనివి. అలాగే తైత్తరీయంలో బ్రహ్మ నుంచి ఆకాశం ఉద్భవించింది. అంటే ఆకాశం కూడా బ్రహ్మమే అని చెప్పబడింది.
తైత్తరీయోపనిషత్తు:-మొదట ఆకాశం, తర్వాత వాయువు ఉత్పత్తి అయ్యాయి. ఆకాశఉత్పత్తి గౌణం అయితే వాయువు కూడా గౌణమే అని చెప్పవలసిన వస్తుంది. కనుక రెండింటికి ఉత్పత్తి ముఖ్యమే. వాయువు, అంతరిక్షం ఈ రెండు అమృతములు అని, ఆకాశానికి పుట్టుక లేదని చెబుతున్నది. అమృతమైన దానికి ఉత్పత్తి ఉండదు కదా! సర్వగతత్వం, నిత్యత్వం అనే ధర్మాల చేత బ్రహ్మను ఆకాశంతో పోలుస్తూ శబ్దం ఆకాశానికి కూడా ఆధర్మాలు ఉన్నాయని సూచిస్తోంది. ఆకాశం ఏ విధంగా అనంతమో అదే విధంగా ఈ ఆత్మ కూడా అనంతమని గ్రహించదగినది. ఆకాశం శరీరం బ్రహ్మ, ఆకాశం బ్రహ్మ యొక్క రూపం అని శ్రుతులలో చెప్పబడింది.
సూత్రం :- 221
" స్వా చ్చై కస్య బ్రహ్మశబ్దవత్ "
ఏ కస్య చ :- ఒక శబ్దానికి, బ్రహ్మశబ్దవత్ :- బ్రహ్మ శబ్దానికి ఉన్నట్లు, స్యాత్ :- రెండర్ధాలుఉండవచ్చుకదా!
భావం:- బ్రహ్మశబ్దానికి వలె ఒకే సంభూత శబ్దానికి ముఖ్యత్వము, గౌణత్వము కూడా ఉండవచ్చును.
వివరణ:-ఒకే ప్రకరణంలో విషయభేదం వలన అన్నం బ్రహ్మ అన్నప్పుడు బ్రహ్మశబ్దం ప్రధానం. ఆనందోబ్రహ్మ, అన్నప్పుడు బ్రహ్మశబ్దం ముఖ్యం అవుతుంది. అలాగే పరబ్రహ్మ నుంచి ఆకాశం పుట్టింది. అన్నప్పుడు ఆకాశం అప్రధానం. ఆకాశం నుండి వాయువు పుట్టింది. అన్నప్పుడు ఆకాశం ప్రధానార్ధంలో చెప్పబడింది.
తైత్తరీయోపనిషత్తు:-"తపసా బ్రహ్మ విజ్ఞాసస్య తపోబ్రహ్మేతి" తపస్సులో బ్రహ్మాన్ని తెలుసుకో. బ్రహ్మమే తపస్సు. బ్రహ్మ అంటే పరబ్రహ్మం అని ముఖ్యార్ధం. తపస్సని గౌణార్ధం కదా! అలాగే సంభూతం అనే పదానికి రెండు అర్ధాలు ఉండవచ్చును. ఆపరమాత్మ తపస్సుచేసి సర్వాన్ని సృజంచాడు. ఇందులో సర్వం సృష్టించాడని ఉన్నది. సర్వంలో ఆకాశం కూడా ఉన్నది. అప్పుడు ఆకాశత్పత్తి ముఖ్యార్ధమే. కనుక సంభూతకు గౌణార్ధం యుక్తం కాదు. ఆకాశం సంభూతః అన్నప్పుడు గౌణార్ధం చెప్పి అది నిజంగా పుట్టకపోయినా పుట్టినట్లున్నది అని చెప్పడం యుక్తం కాదు కదా! ఒకే శబ్దం ఒకచోట ముఖ్యార్ధాన్ని మరొక దానిలో సంబంధించి గౌణార్ధాన్ని ఎలా బోధిస్తుంది అని అర్ధం. ఆకాశానికి ఉత్పత్తి లేకపోతే బ్రహ్మతప్ప మరేది లేదు అనే ప్రతిజ్ఞ ఎలా సమర్థించబడుతుంది. ఎందువలననగా రెండవది అయిన ఆకాశం ఉండటం చేత బ్రహ్మ సద్వితీయం. దీనితోబాటు రెండవ వస్తువు కూడా ఉన్నచో అట్టిదే అవుతుంది. బ్రహ్మ తెలియబడితే సర్వము తెలియబడుతుంది అని చెప్పినది ఎలా కుదురుతుంది. ఒకడు వెనుకటి రోజున కుమ్మరి ఇంట్లో మట్టి, కర్ర, చక్రం మొదలైన వాటిని చూసి, మరునాడు అక్కడ తయారైన వివిధ పాత్రలను చూసి, నిన్న కేవలం మట్టి మాత్రమే ఉంది అని అంటాడో, వెనుకటి రోజున ఆ పాత్రలు లేవని మాత్రమే అభిప్రాయం ఉన్నవాడవుతాడు. కాని దండచక్రాదులు కూడా లేవని అనడు. అట్లే, ఏకము, అద్వితీయం అయిన బ్రహ్మ అన్నప్పుడు పూర్వావస్థలో ఒక్కటిగానే ఉంది అనగా తన కార్యాలేవి లేక బ్రహ్మ ఒక్కటే ఉంది అని అర్ధం. కాని తాను తప్ప మారేది లేదనే అర్ధం కాదు. అందుచేత బ్రహ్మంతోబాటు ఆకాశం ఉన్నదని ఏకత్వానికి భంగం లేదని భావం. పాత్రలకు ప్రకృతి అయిన మట్టికి కుంభకారుడు అధిష్ఠాత్తగా ఉన్నట్లు జగద్ప్రకృతి యైన బ్రహ్మకు అధిష్ఠాత ఎవరు లేరు అని శృతిలో చెప్పబడింది.ఆకాశానికి రెండవదిగా ఉండటం చేత బ్రహ్మకు సద్వితీయతత్వం కూడా ప్రాప్తించదు. భేదం అనేది లక్షణముల భేదాన్ని బట్టి ఏర్పడుతుంది. ఉత్పత్తికి పూర్వం వ్యాప్తత్వం, అమూర్తిత్వము అంటే రూపాదులు లేకపోవడం మొదలైనా ధర్మాల సామ్యం చేత పాలు నీళ్లు వలె కలిసిపోయిన బ్రహ్మాకాశాలను వేరువేరు లక్షణాలు లేవు కదా! సృష్టి సమయంలో బ్రహ్మ జగత్తును పుట్టించడానికి ప్రయత్నిస్తుంటే రెండవది ఊరికే కదలకుండ ఉంటుంది. అది బ్రహ్మ కన్నా వేరైనది అని నిశ్చయింపబడుతుంది. అందుచేతనే ఆకాశశరీరం బ్రహ్మ. ఇత్యాది శ్రుతులలో బ్రహ్మకు ఆకాశానికి అభేదం కల్పించబడింది. పుట్టిన ప్రతి వస్తువు ఆకాశం ఏదేశంలో ఏకాలంలో ఉంటుందో, ఆ దేశకాలాలలోనే పుడుతుంది. బ్రహ్మ యొక్క దేశకాలాల కంటే భిన్నం కాని దేశకాలములలోనే ఆకాశం ఉంటుంది. బ్రహ్మకు సంబంధించిన దేశకాలాల కంటే వేరుగా ఆకాశానికి దేశాకాలాలు లేవు. అందుచేత బ్రహ్మ దాని కార్యం తెలిస్తే ఆకాశం కూడా తెలియబడుతుంది.
సూత్రం :- 222
ప్రతిజ్ఞాహాని రవ్యతిరేకాచ్చభ్దేభ్యః
శబ్దేభ్యః :- శబ్ద ప్రమాణం వలన, అవ్యతిరేకాత్ :- వ్యతిరేకంగా కాకపోవడం చేత, ప్రతిజ్ఞ అహానిః :- ఆకాశం నిత్యమై, ఉత్పత్తి లేనిదైనా గౌణమని చెప్పిన ప్రతిజ్జకు ఏ హాని లేదు.
భావం :- శ్రుతి వాక్యాల వలన కార్యకారణములకు భేదం లేకపోవడం వల్లనే హాని, అహాని లభిస్తుందని సూత్రార్ధం.
వివరణ :- ఆకాశం వ్యాపకం, దానికి ఉత్పత్తి ఉన్నా మిగతా పదార్ధాలలో అన్వయం ఉన్నది. వ్యాపకం కానీ పదార్ధాలలాగా కొన్నింటిలో అన్వయం, మరికొన్నింటిలో అన్వయం లేకపోవడం ఉండదు.
బృహదారణ్యకోపనిషత్తు:- పృథివ్యాది సమస్త పదార్ధాలు ఆకాశంలో ఓత ప్రోతమై ఉన్నందున ఆకాశం వాటికి వ్యతిరేకం కాదు. కనుక అది నిత్యమై ఉత్పన్నం కానంతమాత్రాన సర్వం ఉత్పన్నం అవుతుందని చెప్పిన వాక్యానికి ఏ హాని లేదు. కనుక ఆకాశోత్పత్తికి సుంభూత అనే పదం గౌణంగా చెప్పినదే. ఉపనిషత్తులు ప్రతిపాదించిన బ్రహ్మము కన్నా ఏది భిన్నము కాదు. అందుచేత ఏ విషయాన్ని గురించి తెలుసుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుస్తాయో, దానిగురించి తెలుసుకోవాలి అనే మాట నిజమౌతుంది. బ్రహ్మం నుండి ఆకాశం పుట్టింది అని తైత్తరీయెపనిషత్తు లో చెప్పబడింది.
చాందోగ్యోపనిషత్తు:-ఉద్దాలకుడు శ్వేతకేతువునకు ఏవిషయాన్నిగురించి తెలుసుకుంటే అన్నివిషయాలు తెలుస్తాయో దాన్ని గురించి తెలుసుకోవాలి అని చెబుతాడు. అంటే సర్వానికి ఆధారమైనటువంటి పరబ్రహ్మ ఆత్మవిద్యకు మించినది ఏది లేదు.
ప్రశ్నోపనిషత్తు:-పిప్పలాదమహర్షి మహాజ్ఞాని. బ్రహ్మవేత్త. ఆయన దగ్గరకు సత్యకాముడు, గార్గ్యుడు మొదలైన ఆరుగురు శిష్యులు వచ్చారు. ఆత్మవిద్యకు మించినది ఏది లేదు. అదే మోక్ష విద్య. అది నేర్చుకోవడానికి పిప్పలాదమహర్షి దగ్గరకు వచ్చారు. ఆకాశం కూడా బ్రహ్మమే. బ్రహ్మ నుండి ఆకాశం పుట్టింది. కాబట్టి బ్రహ్మను గురించి తెలుసుకుంటే ఆకాశం గురించి తెలుస్తుంది. చాందోగ్యంలో ఆకాశంగురించి చెప్పలేదు. కాని ఖండించనులేదు. కాబట్టి ఆకాశాన్ని అంగీకరించినట్లే. పంచ భూతాలు ఏరకంగా ఉత్పత్తి అయినాయంటే తైత్తరీయంలో చెప్పినట్లుగా ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి భూమి ఉత్పత్తి అయినవి.
సూత్రం :- 223
“ యావద్వికారం తు విభాగో లోకవత్ "
తు:-ఈవాదం సరియైనది కాదు. లోకవత్:- ఈలోకంలో కనిపించే ఘటపటాదుల్లాగ, యావద్వీకారం :- కార్య పదార్ధాలన్నిటికి, విభాగః :- అవయవ విభాగాలున్నాయి.
భావం :- ఈ లోకంలో కనిపించే ఘట పటాదుల్లాగా కార్య పదార్ధాలాన్నిటికీ అవయవ విభాగాలు ఉన్నాయి.
వివరణ:- ఆకాశానికి ఉత్పత్తి ఉన్నదనే విషయం అనుమానంతో(logical inference)సాధిస్తున్నారు. బ్రహ్మ యందు విభాగం లేదు. అన్ని అందులోనుంచే ఉద్భవించాయి. పంచభుతాలు బ్రహ్మనుంచే వచ్చాయి. కాబట్టి ఆకాశానికి ఉత్పత్తి ఉన్నది. ఛాందోగ్యంలో చెప్పకపోయినా ఆకాశం ఉత్పత్తిని అందులో కాదనలేదు. మిగిలిన ఉపనిషత్తులలో బ్రహ్మనుండి ఆకాశం ఉత్పత్తి అయినదని చెప్పబడింది. కాబట్టి ఆకాశ ఉత్పత్తిఉన్నది. అవయవ విభాగాలున్న వస్తువును వికారం అంటారు. వికారాన్ని విభజించవచ్చును. వికారం సావయవం. కనుక ఘటపటాదులన్నీ సావయవాలు, వికారాలు. అలాగే ఆకాశమూ సావయవమే. వికారమే. పృధివ్యాది ద్రవ్యాల్లో ఒకటైన సూక్ష్మద్రవ్యం పైకి కనిపించదు. బుద్ధికి మాత్రమే గోచరిస్తుంది. పంచభూతాలలో ఒకటైన ఆకాశం వాయ్వాది స్థూలపదార్ధములతో మాత్రమే అన్వయిస్తుంది. కానీ జీవేశ్వరులతో అన్వయించదు. కనుక ఆకాశం వికారం, సావయవం, ఉత్పన్నం అయ్యేది కూడా! ఆకాశాన్ని అమృతం అన్నప్పుడు అది ఇతర పదార్ధాల కన్నా చిరస్థాయి అని సూచించడానికే. అంతే కాని నిత్యం అని చెప్పడానికి కాదు. కాబట్టి ఆకాశం బ్రహ్మం వల్ల ఉత్పనమైనది, ముఖ్యమైనది, కాని గౌణమనడం లేదు. సూత్రంలో తు అనే శబ్దం ఆకాశానికి ఉత్పత్తి అసంభవం అనే శంకను తొలగించడానికే. ఆకాశంపుట్టడం విషయంలో అది అసంభవం. మన కంటికి కనబడే వస్తువులు అన్ని కార్య సముదాయములే. ఉదా:- ఘటం, కటకం, సూది, ఖడ్గం. వికారం చెందనిదే వేరువేరు పదార్ధాలుగా కనబడదు. ఆకాశానికి పృథవ్యాదుల కంటే వేరుగా కనబడుతుంది. అవి వేరువేరుగా కనబడుతున్నాయి కనుక అవి కార్యములే. ఆత్మ స్వయం ప్రకాశం అవడం చేత పుట్టుక(కార్యం)కలది కాదు. కాని ఘటపటాదులే కార్యాలు. ఆత్మ స్వయంసిద్ధం. సత్ విషయంలో స్ఫూర్తివిషయంలో(ప్రకాశించడంలో)గాని పరాధీనం కాదు. అది స్వయంగానే ప్రకాశిసిస్తుంది. ఆకాశానికి సమానమైన కారణ ద్రవ్యం లేదు. సమాన జాతీయమైన కారణమే కార్యాన్ని పుట్టిస్తుంది. సంయోగం సహాయంతో ఒక ద్రవ్యం మరొక ద్రవ్యాన్ని పుట్టిస్తుంది. మృత్తుబీజం అంకురాది రూపంలో పరిణామం చెందినట్లు అనేక ద్రవ్యాలు పరిణామం చెందుతాయి. క్షీరాధికం పెరుగు మొదలైన రూపాలలో పరిణామం చెందినట్లు ఒకే వస్తువు పరిణామం చెందుతుంది. శ్రుతి వలన ఒకే బ్రహ్మం నుంచి ఆకాశాది మహా భూతాలు ఉత్పత్తి క్రమంలో జగత్తు పుట్టిందని నిశ్చయింపబడింది.
మాతరిశ్వాధికరణం ( 2, 3, 8 )
సూత్రం : 224
"ఏతేన మాత రిశ్వా వ్యాఖ్యాతః "
ఏతేన:- బ్రహ్మంవలన ఆకాశం ఉత్పన్నం అయిందని వ్యాఖ్యానించిన వేదాంతవాక్యాల వలన, మాతరిశ్వా:- వాయువు కూడా, వ్యాఖ్యాతః :- బ్రహ్మవలన ఉత్పన్నమైనదని తెలుస్తోంది.
భావం:- బ్రహ్మ వలన ఆకాశం ఉత్పన్నం అయిందని వ్యాఖ్యానించిన వేదాంత వాక్యాల వలన వాయువు కూడా బ్రహ్మ వలన ఉత్పన్నమైనదని తెలుస్తోంది.
వివరణ:-ఈఅధికరణంలో వాయువు ఆకాశం నుండి ఉత్పత్తి అయినదని తెలియజేస్తోంది. ఇదొక సందేహ సూత్రం. చాందోగ్యం లో ఆకాశం, వాయువులను చెప్పలేదు. తేజస్సును మాత్రమే చెప్పడం జరిగింది. అందుచేత వాయువుకు ఉత్పత్తి లేదు అంటారు. ఆకాశానికి ఉత్పత్తి ఉన్నదని చెప్పడం వలన వాయువుకు కూడా ఉత్పత్తి చెప్పినట్లే గ్రహించాలి. తైత్తరీయంలో బ్రహ్మనుండి ఆకాశం, ఆకాశంనుండి వాయువు ఉద్భవిస్తుందని అన్నారు కదా! అలాగే బ్రహ్మకు కూడా వేరొక బ్రహ్మతో ఉత్పత్తి చెప్పకూడదా? అని అడిగాడు కృష్ణశర్మ. సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు.ఈ ఆకాశవ్యాఖ్యానం చేత ఆకాశం ఆశ్రయంగా గల వాయువు కూడా వ్యాఖ్యనింపబడుతుంది. చాందోగ్యంలో ఉత్పత్త్యధికరణంలో చెప్పకపోవడం వలన వాయువుకు ఉత్పత్తి లేదని ఒక పక్షం, తైత్తరీయుల ఉత్పత్తి ప్రకరణంలో ఆకాశాద్వాయుః అంటే వాయువుకు ఉత్పత్తి ఉన్న దని మరొకపక్షం, పిమ్మట రెండుశ్రుతులకు విరోధం ఏర్పడినప్పుడు వాయువుకు ఉత్పత్తి చేసే శ్రుతి గౌణి అంటే ప్రాముఖ్యం లేదని మరొక అభిప్రాయం. మిగిలిన పదార్ధాల దృష్ట్యా వాయువు వినాశనం లేకుండా చాలాకాలం ఉంటుంది. వాయువుకు అస్తమయం లేదు. వాయువు ఉపాశించదగిన వాడని, సంవర్గ విద్యాదులలో వాయువుకు మహాభాగత్వం వినబడటం వల్ల, వాయువుకు అస్తమయం మొదలైనవి లేవని చెప్పడం వలన ఎవ్వనికైనా వాయువు నిత్యము అనే అశంక కలగవచ్చును. బృహదారణ్యకంలో వాయువే సర్వాత్మ అని చెప్పబడింది.అట్లే సంవర్గవిద్యలో వాయువే అగ్న్యాదులను తనలో లీనం చేసు కుంటుందనీ చెప్పబడింది. బ్రహ్మవలనే ఆకాశం ఉత్పన్నం అయినట్లుగానే వాయువుకూడా ఉత్పన్నమైనదని తెలుస్తోంది.
అసంభవాధికరణం ( 2, 3, 9 )
సూత్రం :-225
“ అసంభవస్తు సతోనుపపత్తేః "
తు:- కాగా, అనుపపత్తేః:- వికారి అని సిద్ధం కానందు వలన, సతః :- సత్ పదవాచ్యుడైన బ్రహ్మానికి ఉత్పత్తి అనేది, అసంభవః :- సంభవం కాదు.
భావం :- ఉపపత్తి లేకపోవడం వలన సత్ అయిన బ్రహ్మకైతే ఉత్పత్తి లేదు.
వివరణ:- ఆకాశానికి ఉత్పత్తి అసంభవం అన్నారు. మరి ఆ అసంభవమైన ఆకాశం నుండి వాయువు ఉద్భవిస్తుంది అన్నారు కదా! అలాగే బ్రహ్మకు వేరొక బ్రహ్మతో ఉత్పత్తి చెప్పకూడదా? అనేది సందేహం.
ఛాందోగ్యోపనిషత్తు:-సృష్టి పూర్వం సత్తే ఉండేది. దీని ప్రకారం బ్రహ్మం సత్ పదార్ధం. ఆకాశాది సృష్టికి మూలం. వికారి అయిన వస్తువులకే ఉత్పత్తి ఉంటుంది. ఆకాశం సావయవి. దానికి ఉత్పత్తి ఉన్నది. సత్పద వాచ్యమైన బ్రహ్మం వికారి కాదు. సావయవి కాదు.
శ్వేతాశ్వరోపనిషత్తు:- నిష్కళం, అవయవరహితం, నిరవయం ఉత్పన్నం కాదు. బ్రహ్మ మూలకారణం, అది అన్నిటికన్నా అధికం. దానికి కారణం లేదు. కనుక ఉత్పత్తిలేదు అని ప్రమాణం. కాబట్టి నిత్యమని చెప్పినంత మాత్రాన బ్రహ్మం ఆకాశం లాగ ఉత్పన్నం అయినదని చెప్పడం యుక్తం కాదు. సృష్టికి మూలం సత్ ఉండేది. సత్ అంటే బ్రహ్మ. అదే నిత్యమైనది, శాశ్వతమైనది, జరామరణములు లేనటువంటిది. ఆధ్యంతములు లేనటువంటిది. జన్మమృత్యువులు లేనటువంటిది. శాశ్వతమైన బ్రహ్మకు ఉత్పత్తి ఎక్కడుంటుంది? అన్నిటికి అనాదిఅయిన బ్రహ్మ ఇంకొక బ్రహ్మనుంచి పుట్టదు. ఊహించ డానికి శక్యం కాని ఉత్పత్తి గల ఆకాశం, వాయువులకు ఉత్పత్తి ఉన్నట్లే, బ్రహ్మకు కూడా ఏదో ఒక కారణం నుండి ఉత్పత్తి ఉండవచ్చునని ఎవరినికైనా అభిప్రాయం కలగవచ్చును. సద్రూపమైన బ్రహ్మకు కూడా మరొకదాని నుండి దేనినుండో ఉత్పత్తి జరిగినదని ఆశించకూడదు. ఎందువలనంటే అనుపపత్తి వలన. బ్రహ్మ కేవలం సద్రూపం. ఉనికియే స్వభావం కలది. దానికి సన్మాత్రం నుండియే ఉత్పత్తి సంభవం కాదు. సన్మాత్రమైన బ్రహ్మ మరొక సన్మాత్రం నుండి పుట్టదు. సామాన్యమైన మృత్తు నుండి ఘటాదులైన విశేషాలు పుడుతున్నాయి. కాని విశేషం నుండి సామాన్యం పుట్టడం లేదు. అసత్తు నుండి బ్రహ్మ పుట్టదు. అసత్తు స్వరూప రహితమైనది. అసత్తు నుండి సత్తు ఎలా పుడుతుంది. బ్రహ్మను పుట్టించిన కారణం ఏదీ లేదని చెబుతున్నది. ఆకాశపవనాలకు ఉత్పత్తిఉన్నట్లు చూపబడినది. బ్రహ్మవిషయంలో అలాంటిది ఏదీ లేదు. అందుచేత ఈరెండింటికి వైషమ్యం ఉంది. కార్యాలైన వాటినుండి మాత్రమే కార్యాలు పుడుతున్నాయి. బ్రహ్మకార్యమే అయి ఉండడం తగదు. ఏది మూల కారణం లేని మూల ప్రకృతి అని అంగీకారిస్తారో అదే బ్రహ్మ అని గ్రహించాలి.
తేజోధికరణం ( 2, 3, 10 )
సూత్రం :- 226
" తేజో తస్త ధా హ్యావా "
అతః :- ఆవాయువు నుంచి, తేజః :- అగ్ని ఉత్పన్నమవుతుంది. హి :- అని, తధా అహ :- వేదాంత వాక్యం వర్ణించింది.
భావం :- వాయువు అగ్ని నుంచి ఉత్పన్నమౌతుందని వేదాంత వాక్యం వర్ణించింది.
వివరణ:-తేజస్సు అంటే అగ్ని. అది వాయువు నుండి పుట్టింది. అంతే కాని బ్రహ్మనుంచి పుట్టలేదు. ఛాందోగ్యంలో చెప్పినట్లు బ్రహ్మనుండి ఆకాశం పుట్టింది. అంటే ఆకాశం బ్రహ్మమే. ఆకాశం నుంచి వాయువు పుట్టింది. వాయుబ్రహ్మం నుంచి అగ్ని పుట్టింది. అంటే అగ్నికూడా బ్రహ్మమే. ఈరకంగా పంచభూతాలు పరబ్రహ్మ స్వరూపాలే. ఇక్కడ బ్రహ్మనుంచి అగ్ని పుట్టింది. అంటే వాయు బ్రహ్మ నుంచి అగ్ని పుట్టింది అని అర్ధం.
చాందోగ్యోపనిషత్తు :- బ్రహ్మం సృష్టికి పూర్వమే ఉన్నది అని ప్రారంభించి, ఆ బ్రహ్మ తేజస్సును సృష్టించింది. అయితే వాయువు నుంచి అగ్ని ఉత్పత్తి అయినదని అన్నారు కదా!
తైత్తరీయోపనిషత్తు:-బ్రహ్మం వలన ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్నిని బ్రహ్మం సృష్టించాడని తెలుసుకోవాలి. సర్వము బ్రహ్మ నుండి పుట్టిన్నదని అంగీకరిస్తే సర్వవిజ్ఞాన ప్రతిజ్ఞ కుదురుతుంది. పుట్టుకకు అపాదానమైన ఆత్మ పంచమీవిభక్తిలో నిర్దేశించబడినది. దేని నుండి మరొకటి పుట్టినదని చెప్పబడిందో ఆది అపాదానం. బ్రహ్మనుండి ఆకాశం పుట్టినదని అన్నప్పుడు బ్రహ్మ అపాదానం. దానికి పంచమీవిభక్తి చేర్చబడుతుంది. ఆకాశాన్ని, వాయువుని సృష్టించి వాయుస్వరూపాన్ని పొందిఉన్న బ్రహ్మతేజస్సును సృష్టించాడు అని చెప్పినా కూడా తేజస్సు బ్రహ్మనుండి పుట్టినదాని చెప్పడంలో విరోధం లేదు కదా! ఆవు యొక్క కాచిన పాలు, ఆవు యొక్క పెరుగు, ఆవు యొక్క అమిక్ష అని అంటారు. అమిక్ష అంటే పాలు, పెరుగు కలిపి తోడు పెట్టినప్పుడు, ఆపాలు విరిగి, కొంతభాగం గట్టిగాను, కొంత భాగం నీళ్లలాగా ఏర్పడుతుంది. గట్టిగ ఏర్పడిన భాగం అమిక్ష అవుతుంది. ప్రత్యక్షంగా లభించినవి పాలు మాత్రమే. పాలనుండి పెరుగు, పెరుగునుండి అమిక్ష తయారయ్యాయి. అయినా ఆపెరుగు అమిక్ష నుండి కాకుండా ఆవునుండి పుట్టినట్లు పారంపర్యేనా ఎలా చెప్పబడుతుందో, అదే విధంగా తేజస్సుకు వాయువు కారణమని భావించినా, తేజస్సుకు బ్రహ్మయే కారణమని పారంపర్యంగా చెప్పుకున్న విరోధం లేదు. బ్రహ్మ తన వేరువేరు రూపాలలో తన కార్యాలను నిర్వహిస్తున్నట్లుగా చూపుతున్నది. భగవద్గీతలో భూతాలకు నానుండీయే వేర్వేరు భావాలు కలుగుతున్నాయి అని చెప్పబడింది. బుద్ధి మొదలైనవి తమతమ కారణములనుండి పుడుతున్నట్లు ప్రత్యక్షంగా కనబడుతున్నాకూడా సమస్తవస్తువులు కూడా సాక్షాత్తుగా కాని, పరంపరగా కాని ఈశ్వరుని వంశానికి చెందినవే. అందుచేత అన్ని తన నుంచే పుట్టుచున్నాయని శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీత లో చెప్పాడు.
అబధి కరణం ( 2, 3, 11 )
సూత్రం :- 227
" అపః "
ఆ అగ్ని నుండి జలం పుట్టింది. అగ్నేః ఆపః :- అగ్ని నుండి జలం జన్మించాలి.
భావం :- ఈ అధికరణంలో అగ్ని నుండి జలం పుట్టినట్లుగా చెప్పబడింది.
వివరణ:- గురువు గారు! ఛాందోగ్యంలో బ్రహ్మ నుంచి జలం పుట్టినట్లుగా చెప్పబడింది. బ్రహ్మం సృష్టికి ముందే ఉన్నదని, ఆ బ్రహ్మ తేజస్సును, వాయువును, జలమును సృష్టించిందని స్పష్టంగాఉన్నది. బ్రహ్మ తేజస్సు నుంచి జలమును సృజించా డని తెలుస్తోంది. తైత్తరీయోపనిషత్తులో అగ్ని నుండి జలం పుట్టిందన్నారు కదా! మరి జలానికి ఉపాదాన కారణం ఏది? అని అడిగాడు కృష్ణశర్మ. ఇంతకు ముందు వాయువు నుంచి ఆకాశం పుట్టినట్లుగానే అగ్నినుంచి జలం పుట్టింది. వాయుబ్రహ్మ నుంచి అగ్ని పుట్టింది. పంచభూతాలు పరబ్రహ్మస్వరూపమైనందున తేజోబ్రహ్మ నుంచి జలం పుట్టినట్లుగా అర్ధం చేసుకోవాలి. ఇక్కడ శ్రుతివాక్యం ఉన్నందుకు వలన సంశయానికి తావు లేదు. తేజస్సును సృష్టించిన తరువాత పృద్వియొక్క సృష్టిని ప్రతిపాదిస్తూ, మధ్యలో ఉదకం గురించి చెప్పాలనే ఉద్దేశ్యంతో ఆచార్యులు "అపః" అని సూత్రం చెప్పారు. బ్రహ్మ ఉదకాన్ని సృష్టించాడని చెప్పే శ్రుతికి, అగ్ని నుండి ఉదకం ఉద్భవించిందని చెప్పే విరోధం ఉందని పూర్వపక్షం అభిప్రాయం. ఉదకం అగ్ని చేత దహిస్తుంది కనుక జలం నుండి అగ్ని పుట్టడం అసంభవం అని అధికమైన శంక. బ్రహ్మ జలాన్ని సృష్టించాడన్నా, అగ్ని నుంచి జలం పుట్టిందన్నా విరోధం లేదని భావం.
పృధి వ్యధికారాధికరణం ( 2, 3, 12 )
సూత్రం :- 228
"పృధి వ్యధికా రూప శబ్దాంతరేభ్యః
పృధివి:- జలం నుంచి పృథివి ఉత్పన్నమైనది. అధికార రూప శబ్దాంత రేభ్యః :- చాందోగ్యప్రకరణం వలన, రూపం వలన, వర్ణనల వలన, శబ్ద ప్రమాణం వలన, ఛాందోగ్యం లో వర్ణించిన అన్నం అంటే పృధివి అనే గ్రహించాలి.
భావం :- జలం నుంచి పృధివి ఉత్పన్నమైనది. రూపం వలన, వర్ణనల వలన, శబ్ద ప్రమాణం వలన చాందోగ్యంలో వర్ణించిన అన్నం అంటే పృధివి అని గ్రహించాలి.
వివరణ :- జలం నుంచి భూమి ఉద్భవించింది. జలం బ్రహ్మమే కనుక జల బ్రహ్మ నుంచి పృధ్వి బ్రహ్మ ఉద్భవించింది.
ఛాందోగ్యోపనిషత్తు:-(6,2,4):-ఆజలం అన్నాన్ని సృష్టించింది. అన్నవాక్యంలో అన్నంఅనే పదానికి అర్ధం పృథివి అని తెలుసు కోవాలి. ఎలాగంటే, అగ్ని జలం అనే భూత సృష్టి చేశాడు. ఇదే ప్రకరణంలో ఆజలం అన్నాన్ని సృష్టించింది అని చెప్పబడింది. పంచభూతాల వర్ణనలో అన్నం అంటే భూమి వరుస అని అర్ధం చేసుకోవాలి. అన్నానికి నలుపు రంగు ఉన్నది. భూమి వర్ణం నలుపు కదా! కనుక రూపం చూసినా అన్నమంటే పృధివి అని తేలుతుంది.
తైత్తరీయోపనిషత్తు:-నీటి వలన పృధివి ఉద్భవించింది. ఈ కారణముల చేత చాందోగ్యంలో ఉన్న అన్న శబ్దం పృధివి వాచకం. కనుక జలం నుంచి పృధివి ఉత్పన్నమైనదని సిద్ధాంతం. అనేక రూపాలుగా మారి అనేక రసాదులను సృష్టించాలని ఆ జలం అనుకున్నది. అలాతలచి అవి అన్నం సృజించాయని శృతిలో వినబడుతుంది. అక్కడ ఈ అన్నశబ్దం చేత వరిధాన్యం, యవలు, మొదలైనవి చెప్పబడుతున్నాయా? తినదగిన వరిఅన్నం మొదలైనవి చెప్పబడుచున్నాయా? లేక పృధివి చెప్ప బడుతోందా? అనే సందేహం కలుగుతుంది. ఏప్రాంతంలో వర్షాలు బాగా పడితే అక్కడ పంటలు బాగా పండతాయి. వర్షం వలన పంటలు అధికమౌతాయి, కాని భూమివలన కాదు. ఉదకం నుండి పుట్టేది పృథవియే. అధికారంవలన, రూపంవలన, శబ్దంవలన భూమిని అన్నశబ్దంతో చెప్పబడుతోంది కాని పంచభూతాలలో ఒకటైన పృధివిని కాదని వ్రీహ్యాదులను గ్రహించడం న్యాయంకాదు. పృధివికి కృష్ణరూపం ఉన్నట్లుగానే అదేరూపం అన్నానికి కనబడుతుంది. భూమి నల్లగా ఉంటుందనే నియమం లేదు కదా! శ్వేతరోహిత వర్షాలు అధికంగా ఉండవు కదా.. రాత్రి పూట భూమి యొక్క ఛాయ నల్లగానే ఉంటుంది. అందుచేత పృథవి రూపం నల్లనిది అని చెప్పడం యుక్తంగా ఉంటుంది. బృహదారణ్యాకోపనిషత్తులో చెప్పినట్లుగా నీళ్ళల్లో మట్టి వంటి పదార్ధం భూమి అయింది.
తదభిధ్యానాధికరణం ( 2, 3, 13 )
సూత్రం :- 229
" తదభి ధ్యానా దేవ తు తల్లింగాత్ సః "
తు :- ఎలా అంటే, తత్ అభిధ్యానాత్ :- సంకల్పంతో కూడిన ఈ క్షణం వలన, తత్ లింగాత్ :- కర్త్వత్వ లక్షణం వలన, స ఏవ:- బ్రహ్మకు పృధివ్యాది భూత సృష్టికి కారణం,
భావం :- బ్రహ్మం వల్ల ఆకాశం జనించిందని అంటున్నారు. మరి ఆకాశం నుంచి ఈ వాయువు మొదలైనవి ఉద్భవించాయి కదా! వాటి ఉత్పత్తికి బ్రహ్మంఎలా కారణం అవుతుంది? ఎలాఅంటే, సంకల్పంతో కూడిన ఈక్షణం వలన కర్త్వత్వ లక్షణం వలన బ్రహ్మ పృధివ్యాది భూత సృష్టికి కారణం అవుతున్నాడు.
వివరణ:- గురువుగారు! ఆకాశం మొదలైన పంచభూతాలు సృష్టించబడ్డాయి. అయితే జగత్తులోని నదులు, సముద్రాలు, కొండలు, పర్వతాలు, అడవులు, వీటన్నింటిని పంచభూతాల సృష్టిస్తున్నాయా? లేక పరబ్రహ్మ వాటిని సృష్టిస్తున్నాడా? అని అనుమానం వ్యక్తం చేశాడు కృష్ణశర్మ. ఆమాటలు విన్న రత్నకారుడు చెప్పడం ప్రారంభించాడు. సర్వకార్యాలకు కర్త పరమేశ్వరుడే తప్ప పంచభూతాలు కావు. అసలు ఈభూతలకు ఆశక్తి కూడా లేదు. ఈవస్తువులను సృష్టించాలనే పరమేశ్వరుని కోరిక వల్లనే ఈ సృష్టి జరుగుతోంది.
బృహదారణ్యకోపనిషత్తు:- యాజ్ఞవల్కుడు చెబుతాడు, అగ్నిలో ఉంటాడు. అగ్ని అతన్ని ఎరుగదు. అగ్ని అతని శరీరం. అగ్నిలో ఉంటూ అగ్నిని నియంత్రయిస్తాడు. అతడే సర్వాంతర్యామి అయిన ఆత్మ. ఈ విధంగా అతడు పంచభూతాలలోనూ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఒకటేమిటి అన్నిచోట్ల ఉంటూ అన్నింటిని నియంత్రిస్తాడు. కాబట్టి సృష్టి అంతా పరమేశ్వర కృతమే. బ్రహ్మ నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, జలం నుంచి పృద్వి.. ఇది పరంపర. కాని బ్రహ్మ పరంపరాకారణం కాదు. కుమ్మరి కుండలని నిర్మిస్తూ, వాటికీ ఎలా సాక్షాత్కారణం, కర్త అవుతున్నాడో అలాగే బ్రహ్మ కూడా సకలానికి కర్త, పృధివ్యాదులకు స్రష్ట అవుతున్నాడు. స్వయంగా ఆయనే ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి ఇత్యాదుల రచయిత. కుమ్మరి ముందు మట్టితో గుండ్రటి ఆకారాన్ని తయారుచేసి, వాటి మూలంగా ఘటాన్ని తయారుచేస్తాడు. అలాగే బ్రహ్మ ముందు ఆకాశాన్ని రచించి, దాన్నుండి వాయువును, దాని మూలంగా అగ్ని మొదలైనవాటిని స్వయంగా రచించాడు. కాబట్టి పరంపరాకారణం అనడం తగదు. ఈక్షణం అంటే ఛాందోగ్యంలో బ్రహ్మ సృష్టిరచనను సంకల్పించాడని తెలుస్తోంది. బ్రహ్మయే సర్వాత్మ. ఉదకం, తేజస్సు, ఈక్షణం చేసినట్లు ఏది వినబడుచున్నదో, అది పరమేశ్వరుని వశంచేతనే అని భావించాలి. శ్రుతిలో సత్ అంటే బ్రహ్మయే, ఈక్షిత ప్రకృతమైనది కదా! అందుచేత అవి తేజస్సులు ఈక్షించినవి అని చెప్పినప్పుడు కూడా ఆ ఈక్షిత అప్ తేజోరూపంలో ఉన్న బ్రహ్మయే అని అర్ధం.
విపర్యయాధికరణం ( 2, 3, 14 )
సూత్రం :-230
"విపర్యయేణ తు క్రమోత ఉపపద్యతే చ "
అతః:- భూత ఉత్పత్తిక్రమానికి, విపర్యయేణ:-విపరీతంగా, క్రమః :- ప్రళయ క్రమం ఉంటుందని, ఉప పద్యతే చ :- తెలుసుకోవడం యుక్తం కూడా.
భావం:- పరబ్రహ్మ సమస్త జగత్తును రచిస్తాడు. ఈ భూతఉత్పత్తికి ప్రళయ కాలం ఉంటుందని, ఈ జగత్తు అంతా ఆయనలోనే లీనమైపోతుందని తెలుసుకోవాలి.
వివరణ:- కారణంలోనే కార్యం లయం అవుతుంది. కాబట్టి సృష్టిజరిగిన విధానానికి లయం జరుగుతుంది. లయం అంటే లయం జరిగేటప్పుడు మొదటగా భూమి జలంలో, జలం అగ్నిలో, అగ్ని వాయువులో, వాయువు ఆకాశంలో, ఆకాశం పరబ్రహ్మలో లీనమైపోతుంది. ఇదే వ్యతిరేక దశ. ఈదశగానే లయం జరుగుతుంది.
తైత్తరీయోపనిషత్తు:-(3,1):-బ్రహ్మం ఆకాశాన్ని ముందుసృష్టించి తరువాత వాయువు, అగ్ని, జలం, పృథవి లాంటి భూతాలను సృజించాడని, పూర్వం అనుకున్నాము. ప్రళయక్రమం దీనికి విపరీతంగా ఉంటుంది. పృథవి జలంలో, జలం అగ్నిలో, అగ్ని వాయువులో, వాయువు ఆకాశంలోను క్రమంగా లీనమౌతాయి. ఆఆకాశం లీనమై ఈశ్వరునిలో నిలుస్తుంది. కార్యం కారణ రూపం పొందడమే ప్రళయం. ఘటం ప్రళయమై మట్టిలో లీనమౌతుంది. కుండలాది భూషణాలు నశించి బంగారంలో లీనమౌతాయి. కనుక ఉత్పత్తిక్రమానికి ప్రళయక్రమం విపరీతమని స్పష్టమౌతోంది. ఉత్పత్తిక్రమం చేతనే జరుగుతోందా? లేదా దానికి విపరీతమైన క్రమంచేత జరుగుతోందా? భూతాల ఉత్పత్తి, స్థితి, ప్రళయాలు మూడు కూడా బ్రహ్మ మీదనే ఆధారపడి ఉన్నాయి. విశేషం ఏదీ లేదు. ఈక్రమంలో నియమం ఏమి లేదు. ప్రళయక్రమం ఉత్పత్తిక్రమానికి విపరీతంగా జరగడం యుక్తం. ఎందువలనంటే ఏ క్రమంలో మెట్లు ఎక్కుతామో దానికి విపరీతమైన క్రమం చేతనే దిగుతాము. అంతే కాకుండా మట్టికుండ పుట్టిన ఘటాదులు వినాశకాలంలో మట్టిగా మారిపోతాయి. జలంనుంచి పుట్టిన మంచు, వడగళ్లు, మొదలైనవి నీరుగా మారిపోతాయి. అందువలన ఉదకంనుండి పుట్టిన భూమి లయకాలంలో ఉదకంలో లీనమవ్వడం, తేజస్సునుండి ఉదకం తేజస్సులో లీనమవ్వడం, ఈవిధంగా సూక్ష్మం సూక్ష్మతరం అయిన సమస్త కార్య సముదాయం కూడా క్రమంగా తన తరువాతది, దాని తరువాత అయిన కారణంలో ప్రవేశించి చివరకు పరమకారణము పరమసూక్ష్మం దగ్గర తన కారణానికి కారణమైన దానిలో లీనం అవడం న్యాయం కదా! ఏ కార్యమైన ముందుగా తన కారణంలో లీనం కావాలి. ఆకారణం తన కారణంలో లీనం కావాలి. ఉత్పత్తిక్రమంలో చెప్పబడిన ఉత్పత్తిక్రమం ప్రళయంలో ఉండడం కుదరదు. కార్యం నిలిచి ఉండగా కారణం నశించడం యుక్తం కాదు కదా! కారణంనశించిన తరువాత కార్యం ఉండజాలదు. కార్యం నశిస్తే మాత్రం కారణం ఉండటం యుక్తమే. మృదాదుల విషయంలో ఇలా కనబడుతున్నది కదా! ఘటం (కార్యం ) నశిస్తే మట్టి (కారణం )మాత్రమే ఉంటుంది.
అంతరా విజ్ఞానాధికరణం ( 2, 3, 15 )
సూత్రం :- 231
" అంతరావిజ్ఞానమనసీ క్రమేణ తల్లింగాదితి చేన్నావిశేషాత్
అంతరా:- బ్రహ్మానికి, ఆకాశానికిమధ్య, విజ్ఞానమనసీ :- విజ్ఞానం మనస్సులను, క్రమేణా :- క్రమంగా, అవిశేషాత్ :- ఏ మంత విశేషం లేనందు వల్ల, సవిస్తారంగా, తత్ లింగాత్ ఇతి చేత్ న :- ఆకాశాదుల్లాగా, వాటి ఉత్పత్తి క్రమాన్ని వేరేగా వర్ణించలేదు.
భావం:- బ్రహ్మానికి ఆకాశానికి మధ్య విజ్ఞానం మనస్సులను ఏమంత విశేషం లేనందువలన ఆకాశాదుల్లాగ వాటి ఉత్పత్తి క్రమాన్ని వర్ణించలేదు.
వివరణ:-ఈసూత్రంలో విజ్ఞానంఅంటే మహత్తు, అహంకారంఅంటే సూక్ష్మభూతాలు, మనస్సుఅంటే జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు. ఈప్రక్రియ ఇదివరలోనే చెప్పినందువల్ల మళ్ళీ విశేషంగా వర్ణించలేదని సూత్రానికి అర్ధం. ఆత్మకి, భూతాలకు మధ్య వరుసగా విజ్ఞానము, ఇంద్రియము, మనస్సు అనేవి ఉన్నాయి. ఇంద్రియాలకు, భూతాలకు పెద్దగా తేడా ఏమి లేదు. విజ్ఞానం అంటే బుద్ధి , ఇంద్రియాలే ప్రాణాలు. మనస్సు అంటే సంకల్ప వికల్పలకు నిలయమైనది.
కఠోపనిషత్తు:- ఇంద్రియాలు గుర్రాలు, మనస్సు సారధి, మంచి సారధి చేతిలోని ఉత్తమాశ్వాసాలుగా ఇంద్రియాలు మన అధీనంలో ఉండాలి. భూతాలయొక్క ఉత్పత్తి వల్లనే భౌతికమైన ఇంద్రియల ఉత్పత్తి కూడా తెలుస్తోంది. అందుచేత వేరుగా చెప్పలేదు. భూతాల స్వరూపాలే ఇంద్రియాలు.
ఐతరేయోపనిషత్తు:-సృష్టిని గురించి చెబుతూ, పరమాత్మ విరాటస్వరూపాన్ని దృష్టిలో ఉంచుకొని తీవ్రమైన ఆలోచన చేశారు. అదే తపస్సు. దానిఫలితంగా ఆస్వరూపానికి నోరు వచ్చింది. వాక్కుకు అభిమానదేవత అగ్ని అంటూ ఇంద్రియలకు అభిమాన దేవతలను వివరించారు. నోరు-అగ్ని, ముక్కు-వాయువు, కన్ను-సూర్యుడు, చెవులు-దిక్కులు, మనస్సు - చంద్రుడు, జననేంద్రియములు - జలం,(వీర్యము), ఈరకంగా భూతాలు, ఇంద్రియాలు, ఒకటే కాబట్టి ఇంద్రియాల గురించి వేరుగా చెప్పలేదు . ఈమనోబుద్ధులు కూడా ఎక్కడో ఒకచోట మధ్యలో పుట్టాయని ప్రళయం పొందుతాయని అంగీకరించాలి. ఎందుకంటే సకలవస్తువులు బ్రహ్మం నుండి పుట్టాయని అంగీకరించాలి. అధర్వణంలో ఉత్పత్తిప్రకరణంలో భూతాలకు, ఆత్మకు మధ్య కరణాలు అంటే అవయవాలు గురించి చెప్పబడింది. ఆత్మనుండి భూతాలకంటే ముందుగా ప్రాణము, మనస్సు, ఇంద్రియాలు పుట్టినట్లు ఈ వాక్యంలో చెప్పబడటం చేత భూతల వెనుక చెప్పిన ప్రళయ క్రమానికి భంగం కలగదు. కరణాలు అంటే (అవయవాలు) భౌతికాలే. భూతాలనుండి జన్మించినవే. భూతల ఉత్పత్తిప్రళయ కాలం వీటికి కూడా వర్తిస్తుంది. కరణాలకు, భూతాలను కలిపి చెప్పడం జరిగింది. కాని వాటి ఉత్పత్తిక్రమం ఏదీ చెప్పబడలేదు. అందుచేతనే మరొక శ్రుతిలో భూతోత్పత్తి క్రమానికి భంగం లేదు అని చెప్పబడింది.
చరాచర వ్యపాశ్రయాధికరణం ( 2, 3, 16 )
సూత్రం :- 232
" చరాచర వ్యపాశ్రయస్తు తద్వ్యపదేశో భాక్తి స్తద్భావ భావి తత్వాత్ "
తు :- జీవాత్మకు జనన మరణాలు వర్తించవు. తత్ వ్యపదేశః :- ఉత్పత్తి, వినాశనాలు, చరాచర వ్యపాశ్రయః :- చరాచర శరీరాలకు సంబంధించినవి, తు :- కాగా, తత్ భావభావి తత్వాత్ :- శరీరాలు ఉన్నప్పుడు ఈ జనన మరణాలు సంభవించడం చేత, భాక్తేః :- జీవత్మా పట్ల గౌణంగా వ్యవహారిస్తున్నారు.
భావం :- జీవాత్మకు జననమరణాలు వర్తించవు. ఉత్పత్తి, వినాశనాలు చరాచర శరీరాలకు సంబంధించినది. శరీరాలు ఉన్నప్పుడు ఈ జనన మరణాలు సంభవించడం చేత జీవాత్మ పట్ల గౌణంగా వ్యవహారిస్తున్నారు.
వివరణ:-ఈ అధికరణంలో జీవుని ఉత్పత్తి, లయం నిజం కాదు అని తెలియజేస్తోంది. గురువుగారు! ఇంత వరకు భూతాలు, ఇంద్రియాలు వాటి పుట్టుక, లయం గురించి చెప్పారు. మరి జీవుని మాటేమిటి? జీవుడికి చావు పుట్టుకలు ఉన్నాయా? లోకంలో రాముడు పుట్టాడు. కృష్ణుడుమరణించాడు అని వ్యవహారంలోఉంది. అంటే జీవి పుట్టింది. మరణించింది అంటున్నాముకదా! అన్నాడు కృష్ణశర్మ. ఆమాటలు విన్న రత్నాకరుడు శిష్యుని సందేహం తీరుస్తున్నాడు. జీవునికి జనన మరణాలు లేవు. కాని అవి ఉన్నాయని చెప్పడం కేవలం అతని శరీరాన్ని బట్టి చెబుతారు. వీటితో జీవుడికి సంబంధం లేదు. జీవుడు శరీరంలో ప్రవేసిస్తే అతను పుట్టాడు అంటాము. ఆశరీరం వదలి పెడితే మరణించాడు అంటాము. ఇది ఇలా ఎందుకు జరుగుతోంది? కర్మఫలితం అనుభవించడానికి, కర్మఫలితం అనుభవించగానే మాసిన వస్త్రం వదలి ఏ విధంగా మనం క్రొత్త వస్త్రం ధరిస్తామో, అలాగే జీర్ణమైన ఈదేహాన్ని వదలి ఈజీవి ఇంకొక దేహంలో ప్రవేశిస్తుంది.. జీవుడు వేరు. బ్రహ్మ వేరు కాదు. ఇద్దరూ ఒక్కటే. అయినా అజ్ఞానంతో తాను, బ్రహ్మ వేరు అనుకుంటుంది.
ముండకోపనిషత్తు:-ఒకే వృక్షంమీద రెండుపక్షులు కూర్చుని ఉన్నాయి. అందులో ఒకటి తన కర్మలవలన వచ్చిన ఫలితాలను అనుభవిస్తున్నది. రెండవదినిర్వికారంగా చూస్తోంది. వీటిలో మొదటిది జీవాత్మ. రెండవది పరమాత్మ. వారిద్దరికీ భేదం లేదు. అజ్ఞానము తొలగిపోతే జీవాత్మ పరమాత్మలో లీనమైపోతుంది. కాబట్టి జీవుడికి చావుపుట్టుకలు లేవు.
ఐతరేయోపనిషత్తు:-ఈజీవరాశిని సృష్టించిన తరువాత పరమేశ్వరుడు తాను కూడా ఇందులో ప్రవేశించాలని అనుకున్నాడు. శరీరంలో ప్రవేశించాడు. కాబట్టి జీవుడికి చావుపుట్టుకలు లేవు అన్నాడు రత్నాకరుడు. జీవునకు ఉత్పత్తి, ప్రళయాలు లేవు. జీవుడు శరీరంతోబాటు నశిస్తే మరొకశరీరానికి సంబంధించిన ఇష్టాన్ని పొందడానికి అనిష్టాన్ని పరిహరించడానికి చెప్పబడిన విధి, ప్రతిషేధాలు వ్యర్థం అవుతాయి. ఈశరీరం జీవుణ్ణి మినహాయించి మరణిస్తుంది. జీవుడు మరణించాడు అంటారు. ఈ జన్మమరణశబ్దాలు స్థావరజంగమశరీరాలకు సంబంధించినవి. స్థావరజంగమాలైన భూతాలు పుడుతుంటాయి. నశిస్తుం టాయి. అందుచేత ఈ జన్మమరణ శబ్దాలు వాటి విషయంలో ముఖ్యమైనవి. ఆశరీరాలలో ఉన్న జీవునియందు ఆరోపించ బడుతున్నాయి. శరీరఉత్పత్తి, వినాశనం జరిగినప్పుడే ఈ జన్మమరణ శబ్దాలు ప్రయోగింపబడుతున్నాయి. కాని అవి లేనప్పుడు ప్రయోగించబడడం లేదుకదా! జన్మమరణ శబ్దాలకు నిమిత్తం శరీరసంయోగ వియోగాలే అని శ్రుతి చెబుతున్నదీ.
సూత్రం :- 233
" నాత్మా శృతేః నిత్యత్వాచ్చ తాభ్యః "
ఆత్మ:- జీవాత్మ కు, న :- చావు పుట్టుకలు లేవు. అశ్రుతేహ్ :- ఉపనిషత్తులు జనన మరణాలను ధ్రువీకరించవు. తాభ్యః :- శృతులు ఘోషించడం వలన, నిత్యత్వాత్ చ :- నిత్యమైనందు వలన,
భావం :- జీవాత్మకు చావు పుట్టుకలు లేవు. ఉపనిషత్తులు జనన మరణాలను ధ్రువీకరించవు. శ్రుతులు ఘోషించడం వలన జీవునికి జనన మరణాలు లేవు.
వివరణ :- జీవుడు పుట్టడం అనేది లేదు. అతను నిత్యుడు.
చాందోగ్యోపనిషత్తు:-(6.11.3):-జీవుడు నిష్క్రమించడం తోటే జీవుడి శరీరం మరణిస్తుంది అంటారు. జీవుడికి మాత్రం మరణం లేదు.
బృహదారణ్యకోపనిషత్తు:-(4.5.14):-యాజ్ఞవల్కుడు మైత్రియికి బ్రహ్మోపదేశం చేస్తూ, తడిసినకట్టెను నిప్పులో వేసినట్లయితే, రకరకాల పొగలు వస్తాయి. తరువాత రవ్వలు వస్తాయి. ఈరవ్వలు అగ్నికన్నా వేరైనవి కావు. అలాగే వేదాలు, ఉపనిషత్తు లు, పురాణాలు, మంత్రాలు, కళలు, సూత్రాలు ఇవన్నీ పరమాత్మయొక్క స్వరూపాలు. రవ్వలు జ్వాలలు రావడానికి ముందు అంతా అగ్నిమయమే. అలాగే నామ రూపాత్మక స్థితికి ముందు జగత్తంతా ప్రజ్ఞానఘనుని స్వరూపమే అంటారు. నిప్పుకట్టే నుండి రవ్వలు ఏ రకంగా పుడుతున్నాయో, అదే విధంగా పరమాత్మ నుంచి జీవాత్మలు వచ్చి మళ్ళీ అందులోనే కలిసిపోతాయి. ఆత్మకు నాశన ధర్మం లేదు. జనన మరణాలు ఆత్మ ధర్మాలు కావు.
కఠోపనిషత్తు :- ఆత్మకు చావు లేదు. ఆత్మ స్వయంభువు. నాశరహితమైనది. శరీరం మరణించినా ఆత్మ మరణించదు. ఆత్మ చంపేది, చంపబడేది కాదు. సూక్ష్మ మైన వాటికన్నా సూక్ష్మ మైనది. పెద్దవైనా వాటి కన్నా పెద్దది.
ఐతరేయోపనిషత్తు:- మానవశరీరాన్ని సృష్టించిన తరువాత అందులో బ్రహ్మం ప్రవేశించాలనుకున్నాడు. బ్రహ్మ రంద్రం ద్వారా మానవ శరీరంలో పరమాత్మ ప్రవేశించాడు అని చెప్పబడింది.
ముండకోపనిషత్తు:- శౌనకునకు అంగీరసుడు బ్రహ్మతత్వాన్ని వివరిస్తూ, శౌనకా! ప్రజ్వరిల్లిన అగ్నినుండి అదే విధమైన ఆకారం, గుణము గల వేలకొలది నిప్పు రవ్వలు విలువడుతున్నట్లే, పరబ్రహ్మనుండి అనేకమైన శరీరాలు రూపాలు మొదలై, మళ్ళీ అందులోనే లీనమౌతాయి. అంటే ఆత్మకు చావు పుట్టుకలు ఉన్నాయని కాదు. ఆత్మ శాశ్వతమైనది. ఇది పరమేశ్వర స్వరూపం. జీవాత్మ పరమాత్మ వేరు కాదు. ఒక్కటే. పరమేశ్వరుడు మానవుణ్ణి సృష్టించి బ్రహ్మరంద్రం ద్వారా మానవ దేహంలో ప్రవేశించాడు. కాబట్టి అందరిలో ఉన్నవాడు పరమేశ్వరుడే. జీవాత్మ పుట్టదు. ఎందువలన? చాలా ప్రదేశాలలో ఉత్పత్తిప్రకరణంలో ఇది వినబడటం లేదుకదా! కొన్ని చోట్ల శ్రుతిలో వినబడటం, కొన్ని చోట్ల వినబడిన దానిని నివారింప జాలదని చెప్పడం వలన జీవాత్మకు ఉత్పత్తి కుదరదని చెప్పారు. "సవా.... శ్రోత్రమయం " ఇత్యాది శాస్త్రం బ్రహ్మ ఏ వికారము చెందకుండానే అనేక బుద్ధ్యాదిమయంగా కనబడుచున్నది. విజ్ఞానమయం అనగా బుద్ధిమయం, మనోమయం, ప్రాణమయం, చక్షుమయం, శ్రోత్రమయం అయిన ఈఆత్మయే బ్రహ్మ అని ఈశ్రుతి వాక్యానికి అర్ధం. ఇక్కడ విజ్ఞానమయంగా ఉండటం అంటే ఆబుద్ధ్యాదుల కంటే భిన్నంగా తన స్వరూపం కనబడకుండా వాటితో కలసిపోయిన స్వరూపం కలిగి ఉండటం అని అర్ధం. కొన్ని చోట్ల వినబడుచున్న జీవుని ఉత్పత్తి కూడా ఈ ఉపాదులతో సంబంధం వల్ల ఏర్పడినది అని అర్ధం చెప్పుకోవాలి. ఇది ఉపాధి యొక్క ప్రళయమే కాని ఆత్మకు విలయం లేదు. ఈ ఆత్మకు విషయాలతో సంబంధం లేకపోవడం మాత్రమే జరుగుతుంది. సమస్త సంసార ధర్మాలను నివారించడం ద్వారా పరమాత్మ స్వరూపం ప్రతిపాదించబడుతుంది. అందువలన ఆత్మ పుట్టదు. ప్రళయం పొందదు.
ఆత్మాధికరణం ( 2, 3, 18 )
సూత్రం :- 234
" జ్యోత ఏవ "
అత ఏవ :- నిత్యం కావడం వలన, జీవాత్మకు జ్ఞః :- జ్ఞాన స్వరూపం ఉన్నది.
భావం :- జీవుడు నిత్యం కావడం వలన జీవాత్మకు జ్ఞాన స్వరూపం ఉన్నది.
వివరణ:-గురువుగారు! ఆత్మ నిత్యము, సత్యము అన్నారు కదా! నిద్రించే స్థితిలో ఆత్మచేతనంగా ఉండటం లేదు. అలాంటప్పుడు ఆత్మ చేతనమా? లేక అచేతనమా? వివరించండి అన్నాడు, నారాయణభట్టు. రత్నాకరుడు చెప్పడం ప్రారంభించాడు. జీవుడు నిత్యుడు కాబట్టే చైతన్యస్వరూపుడు. జీవికి పుట్టుక లేదు. పరమాత్మస్వరూపమే జీవుడు. నిత్య జ్ఞాన స్వరూపుడు. శరీరంతో సంబంధం ఏర్పడటం వలన అజ్ఞానిగా కనిపిస్తున్నాడు. అతను నిద్రించడు. సర్వత్రా వ్యాపించి ఉంటాడు. ఈదేహానికి అధ్యక్షుడైన జీవుడు నిత్యుడు అంటారు. ఇప్పుడు జీవుడు జ్ఞానాశ్రయుడా? జ్ఞాన స్వరూపుడా? కొన్ని ఉపనిషత్తులలో జీవుడు జ్ఞానస్వరూపుడని, కొన్ని ఉపనిషత్తులలో జ్ఞానాశ్రయుడని వర్ణించారు.
ఛాందోగ్యోపనిషత్తు:-జీవాత్మకు దర్శనం, స్పర్శ, శ్రవణం ఉన్నాయని అన్నారు. ఈసూత్రంలో జ్ఞ కూడా కర్త్రత్వాన్ని సూచిస్తుంది. కనుక జీవాత్మను జ్ఞానకర్త అని, జ్ఞానాశ్రయుడని భావించవచ్చు కదా! ఈ భావం సరి అయినది కాదు. జ్ఞానానికి ఆశ్రయుడైతే ఆజ్ఞానం నిత్యమా అనిత్యమా? అనే సందేహం వస్తుంది. అనిత్యం అయితే జ్ఞానం కొంతకాలం ఆత్మలో ఉండి తరువాత నశిస్తుందని అనుకోవాలి. జ్ఞానం లేకపోతే నేను ఉన్నానా? లేదా? అని కాని నేను లేను అనే విపరీత జ్ఞానం కలగాలి. జ్ఞానం ఆత్మను ఆశ్రయించి అనిత్యం అయితే, ఆత్మకూడా ఉత్పత్తివినాశాలకు లోనుకావలసి వచ్చి అది అనిత్య మౌతుంది. జ్ఞానం నిత్యం అంటే దాన్ని గుణం అనలేము. సదా ఆశ్రయించినా, కొంతకాలం వేరేగా ఉన్నా జ్ఞానం గుణం కానేరదు. గుణానికి స్వతంత్రమైన ఉనికి ఉంటుంది. గుణం గుణి ని వదలి ఉండలేదు. కాబట్టి ఎప్పుడూ జ్ఞానం జీవాత్మను అంటిపెట్టుకొని ఉంటుందని చెప్పాలి. అప్పుడే అది స్వరూపమో, స్వభావమో అవుతుంది. కనుకనే జ్ఞానం జీవుడికి స్వరూపం. మరి జీవాత్మ జ్ఞానాశ్రయమని ఉపనిషత్తులు అన్నాయి కదా? అని సందేహం. ఇక్కడ జ్ఞానం అంటే వృత్తిజ్ఞానం. స్పర్శ, దర్శనం లాంటి ఇంద్రియ జ్ఞానాలకు జీవాత్మ ఆశ్రయం.
సాంఖ్యశాస్త్రం:-జీవాత్మ చిద్రూపుడు, ప్రకాశరూపుడు. చిద్రూపుడు అంటే జ్ఞానస్వరూపుడు. కాబట్టి జీవాత్మ జ్ఞాన స్వరూప్పుడే గాని, జ్ఞానాశ్రయుడు కాదని చెప్పబడింది.
బృహదారణ్యకోపనిషత్తు:- యాజ్ఞవల్కుడు ఉద్దాలకునికి అంతర్యామి అయిన ఆత్మను గురించి వివరిస్తూ, అగ్నిలో ఉంటాడు. అగ్ని అతన్నెరుగదు. అగ్నే అతని శరీరం. అగ్నిలో ఉంటూ అగ్నిని నియంత్రిస్తాడు. అతడే అంతర్యామి అయిన నీ ఆత్మ అని చెప్పి ఆత్మయొక్క సర్వవ్యాపకత్వాన్ని వివరిస్తాడు. " విజ్ఞాన మానందం బ్రహ్మ ", సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ", అనస్తరో బ్రహ్మ, ఇత్యాది శ్రుతులు పరబ్రహ్మ చైతన్య రూపమైనదని చెప్పబడింది. ఆ బ్రహ్మయే జీవుడైనప్పుడు అగ్నికి ఉష్ణత్వం వలె, జీవునకు నిత్యచైతన్య స్వభావం ఉంటుందని తెలుస్తున్నది. విజ్ఞానమయప్రక్రియలో తాను నిద్రించకుండా నిద్రిస్తూనే ఇంద్రియాలను చూస్తున్నాడు. నిద్రలో ఆ పురుషుడు స్వయంప్రకాశకుడిగా ఉంటాడు. సమస్త ఇంద్రియాలనే ద్వారాల చేత దీనిని తెలుసుకుంటున్నాడు అని విజ్ఞానం చేత అనుసంధానం చేయడం వలన కూడా ఆత్మ జ్ఞాన స్వరూపం సిద్ధిస్తుంది.
ఉత్క్రాంతి గత్యధికరణం ( 2, 3, 19 )
సూత్రం :- 235
" ఉత్క్రాన్తి గత్యా గతీనామ్ "
ఉత్ క్రాంతి :- శరీరం నుండి బయట పడటం, గతి :- లోకాన్తర గమనం, అగతి :- అక్కడ నుంచి మళ్ళీ రావడం,
భావం:- జీవుడు శరీరంనుండి బయట పడటం, లోకాంతర గమనం, అక్కడ నుంచి మళ్ళీ రావడం ఇలా మూడు గతులు న్నాయని ఉపనిషత్తులు అంటున్నాయి.
వివరణ:-జీవాత్మ అణుస్వరూపుడు, సత్ చిత్ స్వరూపుడైన జీవుడు అణువా? విభువా? జగత్తులో ఉన్న భోగ్యపదార్ధాలన్నీ జీవులకున్న అదృష్టం వల్లనే ఉత్పన్నా లవుతున్నాయి. కనుకనే ప్రతి కార్యానికి ఉండే కారణాల్లో అదృష్టంకూడా ఒకటిగా లెక్కిస్తారు. భోగ్యవస్తువులు దూరంగా ఉంటాయి. వాటితో అదృష్టసంబంధం ఏర్పడాలంటే జీవాత్మ విభువే కావాలి. అణువు కాజాలదు కదా! ఈవాదం సరి అయినది కాదు. జీవాత్మకు ఉత్క్రాంతి లాంటివి ఉన్నాయని ఉపనిషత్తులు చెబుతున్నాయి. కాని విభువు అనడం తగదు. జీవాత్మ అణుస్వరూపుడే. మరణకాలంలో జీవియొక్క ప్రాణాలు శరీరంనుండి ఉత్క్రమిస్తాయి. కాబట్టి జీవుడు అణుపరిమాణుడు. మరణకాలం ఆసన్నమైనప్పుడు ముందుగా మానవుడి కర్మేంద్రియాలు పని చెయ్యటం మనివేస్తాయి. ఆతరువాత జ్ఞానేంద్రియాలు పనిచెయ్యవు. ఇవన్నీ మనస్సుని ఆశ్రయిస్తాయి. ఆమనస్సు జీవిని ఆశ్రయిస్తుంది. అప్పుడు మానవుడి శరీరంలో జీవుడు ప్రయాణనికి సిద్ధం అవుతాడు. శరీరంలో 72000 నాడీ మండలం అతని ప్రయాణానికి మార్గములే. ఈ నాడిమండలం అంతా శరీరంలోని నవరంద్రాలలోనూ, ఏదో ఒక రంద్రం గుండా బయటకు పోతాయి. దీనినే ఉత్క్రమణ అంటారు. అయితే సాధకుని ప్రాణాలు ఉత్క్రమించవు. అవి బ్రహ్మరంద్రం గుండా బయటకు పోయి పరమాత్మలో లీనం అవుతాయి.
బృహదారణ్యకోపనిషత్తు:-(4,4,2):- కళ్ళనుంచో, కాళ్ళనుంచో, ఇతర అంగాలనుంచో జీవాత్మ నిష్క్రమిస్తాడు. ఇలా ఉత్క్రాంతిని వర్ణించారు. ఆలోకాల నుండి కర్మనిమిత్తం ఈలోకానికి మళ్ళీవస్తాడు. ఇంద్రియలతో కూడి నట్టి, అవిద్యాజన్యమైనట్టి ఈ దేహం వృద్ధాప్యం కారణంగా కృశించిపోతుంది. అప్పుడు చెట్టునుంచి పండు రాలినట్లుగా శరీరంలోని పురుషుడు, ఈ అవయవాలను వదిలించుకొని, కర్మానుసారం మరొక యోనిలో జన్మించడంకోసం వెళ్ళిపోతాడు. ప్రాణము, అవయవాలు ఉంటేనే గాని కర్మఫలాన్ని అనుభవించలేరు. అందుకోసం ఇంకొకశరీరం చేరతాడు. వేరొకశరీరాన్ని పొందడానికి వచ్చే ఆత్మని చూసి సమస్తభూతాలు ఇదిగో' పరమాత్మ వస్తున్నాడు' అంటూ సభాస్తలి చేరే రాజు గారి కోసం ఎదురు చూసే సేవకుల్లాగా ఎదురుచూస్తుంటాయి. ఎగశ్వాస ప్రారంభం కాగానే చివరిదశలో ప్రాణాలు, ఇంద్రియాలు, ఆత్మకు ముందుగా నడుస్తుంటాయి. కాబట్టి జీవుడు అణుపరిమాణుడు. జీవుడు అణుపరిమాణం కలవాడా? మధ్యమపరిమాణం కలవాడా? మహాపరిమాణం కలవాడా? ఏ పరిమాణం కలవాడని విచారణ చేయబడుతుంది. ఆత్మకు ఉత్పత్తిలేదు. నిత్యచైతన్యస్వరూపుడు అని చెప్పబడింది. దీనిని బట్టి పరమాత్మయే అనంతమని చెప్పబడింది. అలాంటప్పుడు జీవుని పరిమణాన్ని గురించి విచారించ డానికి అవసరం ఏముంది? ఉత్క్రాంతి గత్యాగత్య శృతులను బట్టి జీవునకు పరిచ్చేదం అంటే నియమితమైన అల్ప పరిమాణం ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల జీవుడు అణు పరిమాణుడని చెప్పబడుచున్నది. జీవుడు ఈ శరీరం నుండి ఎప్పుడు పైకి లేచిపోతాడో అప్పుడు ఇంద్రియాలన్నింటితో కలసి లేచిపోతాడు అని ఉత్క్రాంతి. ఈ లోకం నుండి వెళ్లిన వాళ్ళందరూ చంద్రలోకానికి వెడతారు. ఆ లోకం నుండి కర్మ చెయ్యడానికి మళ్ళీ ఈ లోకానికి వస్తారు. ఈ విధంగా ఉత్క్రాంతి గత్యాగతులు వినబడడం చేత జీవుడు పరిచ్చిన్న ప్రమాణం కలవాడు అని తెలుస్తున్నది.
సూత్రం :- 236
" స్వాత్మనా చోత్తరయోః "
ఉత్తరయోః :- గమన, ఆగమనాలను, స్వ ఆత్మనా చ :- ఆత్మతో సంబంధం ఉండటం వలన, జీవాత్మ ఆణువే.
భావం :- ఉత్క్రమణ జరిగిన తరువాత జరిగే గమనం, ఆగమనం అనేవి జీవాత్మ తో సంబంధం కలిగి ఉన్నందున జీవుడు అణు పరిమాణం కలవాడు.
వివరణ :- గమన, ఆగమనాలను ఆత్మతో సంబంధం ఉండటం వలన జీవాత్మ అణువే. ఇవి గమన కర్తలో ఉండే క్రియలు. చలనక్రియలో నిగూఢంగా ఉంటాయి. కనుక ఆత్మ అణుస్వరూపం. జీవాత్మ వ్యాపకమైతే అందులో చలనక్రియ కలుగ జాలదు. ఇప్పటి వరకు చెప్పిన ఉత్క్రమణ, గమనము, ఆగమనము అనేవి పరిమితమైన పరిమాణం గలవాడికి మాత్రమే ఉంటాయి. అందుకే జీవుడు అణుస్వరూపుడు.గత్యాగతులకు కర్తతో సంబంధం ఉండటం వలన కూడా జీవునకు అణు పరిమాణత్వం కలుగుతుంది. గతి అంటే లోకాంతర గమనము, అగతి అంటే అక్కడ నుంచి మళ్ళీ రావడం. కదలకుండా ఉన్నవాడికి కూడా ఉత్క్రాంతి సంభవించవచ్చును. ఉత్క్రాంతి అంటే శరీరం నుండి బయట పడటం. తరువాత చెప్పిన గత్యాగతులు కదలకుండా ఉన్నవాడికి సంభవించవు. గమనం అనేది కర్తలో ఉన్న క్రియ. కనుక కర్తతో సంబంధం ఉంటుంది. గత్యాగతులు అణు పరిమాణం ఉంటేనే కుదురుతాయి. గత్యాగతులు ఉంటాయన్న తరువాత ఉత్క్రాంతి కూడా దేహం విడిచి వెళ్లిపోవడమే అని తెలుస్తుంది. దేహం విడిచి వెళ్ళడానికి గత్యాగతులు కుదరవు కదా! నేత్రం నుండి కాని, శిరస్సు నుండి కాని ఇతర శరీర ప్రదేశాల నుండి జీవుడు బైటకు వెళ్ళిపోతాడు శరీరం ఒక చోటు నుండి మరొక చోటుకు గమనాగమనాలు జరుగుతాయి. అందువల్ల జీవునకు అణుత్వం సిద్ధిస్తుంది.
సూత్రం :- 237
"నాణు రతచ్ఛ్రుతేరితి చేన్నేతరాధికారాత్ "
అతః శ్రుతేః :- బృహదారణ్యకంలో ఆత్మను విభువు అన్నారు కదా! కనుక, అణుః న :- అణువు కానేరదు. ఇతి చేత్ :- అని అనడం, న :- సరి అయినది కాదు. ఇత అధికారాత్ :- ఉపనిషద్వాక్యం పరమాత్మను సూచిస్తోంది.
భావం :- బృహదారణ్యకంలో ఆత్మను విభువు అన్నారు కదా! ఆత్మ అణుపరిమాణం కాజాలదు. ఉపనిషత్తు వాక్యం పరమాత్మను సూచిస్తుంది.
వివరణ :- జీవుడు సర్వవ్యాపి కాబట్టి అణుపరిమాణుడు కాదు అని వారి వాదన. అది నిజం కాదు. ప్రాణాల్లో ఉన్న విజ్ఞాన మయుడే మహత్పరిమాణం గల అజుడై న ఆత్మ. కాబట్టి జీవుడు అణుపరిమాణుడే.
బృహదారణ్యకోపనిషత్తు:-(4,4,22):-ఆఆత్మ మహాన్, విభువు, పుట్టుక లేనిది అనే వాక్యంలో విభువు అన్నది పరమాత్మనే కాని జీవాత్మని కాదు. అందువలన జీవాత్మ అణువు, పరమాత్మ విభువు అని గ్రహించాలి. అణుత్వం కంటే భిన్నమైన మహాపరిమాణం వినబడటం వలన జీవుడు అణుపరిమాణం కలవాడు కాదు. ఎందువలనంటే అక్కడ పరమేశ్వరుని ప్రస్తావన ఉంది అని అర్ధం. "సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ", ఆకాశవత్సర్వగతశ్చ నిత్యం", శ్రుతుల వలన సత్యమైనది, జ్ఞానమైనది, అనంతమైనది, ఆకాశం కంటే మహాపరిమాణం కలది, దోషాలు లేనివాడు, అయిన పరమాత్మ యొక్క ప్రసంగమే వేదాలలో ప్రధానంగా చెప్పబడినది. శాస్త్రానుసారం జీవుడు, పరమాత్మ భిన్నుడనే దృష్టి చేత చెప్పబడినట్లు గ్రహించాలి. అందువలన మరొక పరిమాణం ప్రాజ్జనకు అంటే బ్రహ్మకు సంబంధించినది గాన జీవుని అణుత్వానికి విరోధం లేదు.
సూత్రం :- 238
" స్వ శబ్దోన్మానాభ్యాం చ "
చ :- అంతే కాక, స్వ శబ్ద ఉన్మానాభ్యాం :- అణు శబ్ద ప్రయోగం వలన, సూక్ష్మ పరిమాణం వలన ఆత్మ అణువే కాని విభువు కాదు.
భావం :- అణు శబ్ద ప్రయోగం వలన, సూక్ష్మ పరిమాణం వలన ఆత్మ అణువే కాని విభువు కాదు.
వివరణ :- జీవుడికి అణుత్వం చెప్పే వాక్యాల వలన పరిమాణ నిర్దేశం చేత కూడా జీవుడు అణు పరిమాణుడే.
ముండకోపనిషత్తు:- ఆత్మ సూక్ష్మరూపంలో మన శరీరంలో ఉన్నది. ఆత్మ సాక్షాత్కారానికి చిత్త శుద్ధి అవసరం. విశుద్ధమైన అంతఃకరణ గల ఆత్మజ్ఞాని కోరుకున్నవి పొందగలుగుతాడు. వారికీ జన్మ ఉండదు. (3,19):- ఏఆత్మ యందు ప్రాణం 5 విధాలుగా చేరి ఉన్నదో అట్టి ఈఅణుపరిమాణం గల ఆత్మ తేజస్సుచేత తెలియదగినవాడు అనుశ్రుతిలో వినబడుచున్నది. ప్రాణసంబంధాన్ని బట్టి ఇక్కడ చెప్పిన అణుప్రమాణం కలది జీవాత్మయే అని తెలుస్తున్నది." వాలాగ్ర..విజ్జేయః" తోక చివర నూరవబాగాన్ని మళ్ళీ నూరుబాగాలుగాచేస్తే ఎంతభాగం ఏర్పడుతుందో అదిజీవుడిగాఅంటే జీవుని పరిమాణంగా గ్రహించాలి జీవుడు కొరడాచివర వాటికి ఉన్న చిన్న ఇనుపముల్లంత ఉంటాడు. ఇంకా చిన్నగా కూడా ఉంటాడు అని మరొక కొలత.
శ్వేతాశ్వరోపనిషత్తు :- ( 5, 9 ):- ఒక లేత వెంట్రుక చివరి బాగాన్ని పదివేలుగా విభజిస్తే అందులో ఒక భాగమంత సూక్ష్మంగా జీవాత్మ ఉంటాడు. కనుక జీవాత్మ అణువే. ఉన్మానం అంటే ఉద్దృతమైన మానం. ఎంతో అల్పపరిమాణం గల జీవాత్మ అణువని ఉపనిషత్తు వాక్యం చెబుతోంది.
సూత్రం :- 239
"అవిరోధః చందనవత్ "
చందనవత్ :- చందనపు తిలకం పెట్టుకోవడం వలన శరీరమంతా చల్లదనం ఏర్పడినా, అవిరోధః :-జీవాత్మ అణువు అనడంలో ఏ విరోధము లేదు.
భావం :- చల్లని గంగా జలంలో స్నానం చేసినప్పుడు జీవుడు తన శరీరమంతటా చల్లదనం అనుభవిస్తాడు. కనుక జీవుడు అణువు అని ఎలా అంటారు? చందన తిలకం పెట్టుకోవడం వలన శరీర మంతా చల్లదనం ఏర్పడినా జీవాత్మ అణువు అని అనడంలో ఏ విరోధం లేదు.
వివరణ :- జీవుడు అణుపరిమాణంలో శరీరంలో ఎక్కడో ఉంటే చల్లదనం గాని, వేడి గాని, ఆ ప్రాంతానికే తగలాలి. అంతే కాని శరీరం అంతా ఏ విధంగా వ్యాపిస్తుంది? అని వీరి వాదన. అది సరి అయినది కాదు. ఎందుచేతనంటే మంచి గంధపు చుక్క శరీరానికి ఎక్కడ రాసుకున్నా శరీరం అంతా సుగంధం వ్యాపిస్తుంది. నొసట చందనం బొట్టు పెట్టుకుంటే దాని చల్లదనం శరీరం అంతా వ్యాపిస్తుంది కదా! కాగా జీవాత్మ అణుత్వానికి ఏ భంగము కలుగదు. అలాగే జీవుడు అణురూపంలో శరీరంలో ఎక్కడ ఉన్నప్పటికీ శరీరంఅంతా వ్యాపించే ఉంటాడు. జీవుడు ఒక చోటనే ఉన్నప్పటికీ శరీరంఅంతా వ్యాపించి సుఖదుఃఖాలు అనుభవిస్తుంటాడు. మంచి గంధపు చుక్క శరీరంలోని ఒక ప్రదేశం మీద ఉన్నా కూడా ఏ విధంగా సకల దేహాన్ని వ్యాపించే ఆహ్లాదాన్ని కలిగిస్తుందో అదే విధంగా దేహంలో ఒక ప్రదేశంలో ఉన్నా కూడా ఆత్మ దేహం అంతటా వ్యాపించే జ్ఞానాన్ని కలిగిస్తాడు. దీనికి త్వగింద్రియంతో సంబంధం ఉంటుంది. కనుక వేదన శరీరం అంతటా వ్యాపించడంలో విరోధం లేదు. త్వగింద్రియాత్మల సంబంధం సమస్తమైన త్వక్కు మీద ఉన్నది. ఆ త్వక్కు మొత్తం శరీరన్నంతటిని వ్యాపించి ఉంది. అందుచేత మొత్తం శరీరం మీద తాపాదికం కలగవచ్చును అని భావం.
సూత్రం :- 240
" అవస్థితి వైశేష్యాదితి చేన్నాభ్యుపగమాత్ హృది హి
అవస్థితి వైశేష్యాత్ :- స్థితి భేదం ఉండటం వలన, చందనపు చల్లదనం శరీరం అంతా వ్యాపించవచ్చును. ఇతి చేత్ :- అని అనడం, న :- సరి అయినది కాదు. హి :- ఎందుకంటే, జీవాత్మ, హృది :- హృదయంలో, అభి ఉపగమాత్ :- ఉండటం వలన ఏ విరోధం లేదు.
భావం:- స్థితి భేదం ఉండటం వలన చందనపు చల్లదనం శరీరం అంతా వ్యాపించవచ్చును. కాని, జీవాత్మ అలా కాదు. ఎందుకంటే జీవాత్మ హృదయంలో ఉండటం వలన ఏ విరోధం లేదు.
వివరణ:-గంధపుచుక్క శరీరానికి రాసుకున్నప్పుడు అది ఎక్కడో ఒకచోట కనిపిస్తుంది. అలా జీవుణ్ణి శరీరంలో ఎక్కడా చూడటం లేదు కదా! అని సందేహం వ్యక్తం చేశాడు కృష్ణశర్మ, రత్నాకరుడు సమాధానం చెబుతున్నాడు. జీవుడు శరీరంలో ఫలానా చోట ఉన్నాడని చెప్పడానికి వీలు లేదు. కాబట్టి జీవుడు అణురూపుడు కాదు అనడం సరి కాదు. ఈ ఆత్మ హృదయ స్థానంలో ఉన్నది.
బృహదారణ్యకోపనిషత్తు(4,3,7):- కతమఆత్మీతియోయం విజ్ఞానమయః, ప్రాణేషు హృదిఅంతరజ్యోతిః పురుషః" పై రెండు వాక్యాల్లో అణుస్వరూపుడైన జీవాత్మ హృదయంలో ఉంటుందన్నారు. కనుక జీవాత్మ అణువే, అయితే చందనం సావయవం. జీవాత్మ నిరవయవం. చందనం లాగా అది శరీరంలో ఇతర బాగాలలో ఎలా వ్యాపించింది. హృదయంలో ఉండే జీవాత్మకు ఇతర అవయవాల జ్ఞానం ఎలా కలుగుతుంది?(సమాధానం తరువాత సూత్రంలో ). చందనపు బిందువు యొక్క స్థితిలో విశేషం వలన అక్కడ కుదురుతుంది కాని ఆత్మ విషయంలో కుదరదు అని అనడం సరి కాదు. శ్రుతిలో అంగీకరించడం వలన ఆత్మహృదయంలో ఉన్నదికదా! ఆత్మ దేహంయొక్క ఒక ప్రదేశంలో ఉన్నదనే విషయం సిద్ధమైతే చందన దృష్టాంతం కుదురుతుంది. చందనం ఒకప్రదేశంలో ఉన్నా, సకలదేహానికి ఆహ్లాదం కలిగిస్తుందని స్పష్టంగా తెలుస్తుంది. ఆత్మ విషయంలో శీతస్పర్శతాపాదులు దేహంఅంతా కనబడటం ప్రత్యక్షమేకాని ఆత్మ ఏకదేశంలో ఉండటం మాత్రం ప్రత్యక్షం కాదు. ఎందువలనంటే ఆత్మ త్వగింద్రియం వలె సకల దేహాన్ని వ్యాపించి ఉండటం చేత శరీరమంతా వేదన తెలుస్తుంది. ఈ ఆత్మ హృదయంలో ఉన్నా సర్వవ్యాపి కనుక సర్వవ్యాపిజ్ఞానం కలుగుతుంది.
సూత్రం :- 241
"గుణాద్వా లోకవత్ "
వా :- ఇకపోతే, లోకవత్ :- లోకంలో మనం చూస్తున్నట్లు, గుణాత్ :- తనకు సహకారిగా ఉన్న బుద్ధిసత్వం వలన ఆత్మకు జ్ఞానం కలుగుతుంది.
భావం :- లోకము నందు మనం చూస్తున్నట్లు చైతన్యగుణం వల్ల జీవుడు శరీరమంతా వ్యాపించి ఉంటాడు.
వివరణ :- రాజు రాజవీధిలో ఉన్నప్పటికీ తనకు సహకారులైన మంత్రుల ద్వారా రాజ్యవ్యవహారాలన్నీ తెలుసుకుంటాడు. అలాగే హృదయంలో ఉండే అణువైన జీవుడు బుద్ధిద్వారా శరీరానికి కలిగే శీతోష్ణాదుల జ్ఞానం పొందుతాడు. జీవుడు అల్ప పరిమాణం కలవాడు. కాని చైతన్యం కలవాడు. కాబట్టి శరీరమంతా వ్యాపించి ఉంటాడు. దీపం గూట్లో ఉన్నప్పటికీ ఇల్లంతా కాంతి ప్రసరిస్తుంది. అలాగే ఆత్మ అణురూపంలో ఉన్నప్పటికీ శరీరమంతా వ్యాపించి ఉంటుంది. ఈ మాటలు విన్న నారాయణభట్టు గుణిని విడిచి గుణము వ్యాపించుట సంభవము కాదు కదా! అని అన్నాడు. రత్నాకరుడు చెబుతున్నాడు. జీవుడు అణువే అయినా కూడా చైతన్యం అనే గుణం వ్యాపించడం చేత సకల దేహాన్ని వ్యాపించే కార్యం జరగడంలో విరోధం లేదు. లోకంలో గదిలోని ఒకమూల ఉన్నాకూడా మణులు దీపం మొదలైన వాటి కాంతి గదిఅంతా వ్యాపిస్తూ ఆగదిలో కార్యం ఎలా చేస్తుందో ఇది కూడా అట్లే. చందనం సావయవం కనుక దాని సూక్ష్మమైన అవయవాలు వ్యాపించడం చేత సకల దేహానికి ఆనందం కలిగిస్తుంది. కాని అణువైన జీవునికి అవయవాలు లేవు కనుక వీటితో సకల దేహాన్ని వ్యాపింపజాలడు అని సందేహం కలగవచ్చును. అందుకే గుణాద్వా లోకవత్ అని చెప్పబడింది. జ్ఞానం పొందడానికి బుద్ధి సాధనం అయితే బుద్ధి ఆత్మకన్నా భిన్నమా? ఆత్మ శరీరంలో ఉండి ఏం చేస్తుంది? బుద్ధి ద్వారా విషయజ్ఞానం పొందడమే కదా! అప్పుడు బుద్ధి కూడా చైతన్యమా! లేదా, బుద్ధిసత్వం ఆత్మ ఒక్కటేనా? వేరే అయితే బుద్ధిసత్వం ఆత్మతో తాదాత్మ్యం మూలంగా ఆత్మ ఛాయతో, చేతనత్వంతో, జ్ఞానంతో కార్యాలు నిర్వర్తిస్తుందా? బుద్ధిసత్వానికి వస్తుజ్ఞానం కలిగే సామర్ధ్యం ఉన్నదా? బుద్ధి చైతన్యస్వరూపం ఎందుకు కాదు? ఈ ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నాడు వ్యాసుడు.
సూత్రం :- 242
" వ్యతిరేకో గంధవత్ "
గంధవత్ :- పృథవి కన్నా గంధం ఎలాగ వేరైనదో, అలాగే ఆత్మ కన్నా బుద్ధి సత్వం, వ్యతిరేకం :-భిన్నమే,
భావం :- పృథవి కన్నా గంధం ఎలాగ వేరైనదో అలాగే ఆత్మ కన్నా బుద్ధి సత్వం భిన్నమే.
వివరణ:- వస్త్రానికి ఉన్న ఎరుపు, తెలుపు రంగులు ఆవస్త్రాన్ని వదలి ఇంకొక చోట ఉండవు. అలాగే దేహంలో ఒక చోట ఉండే ఆత్మ శరీరమంతా వ్యాపించడం సంభవం కాదు అని కొందరి వాదన. కాని వాసన అనేది పువ్వు యొక్క గుణము. ఆ వాసన పువ్వు వరకే కాకుండా ఇతర పువ్వులకు కూడా ఏవిధంగా వ్యాపిస్తుందో, అలాగే ఆత్మ కూడా ఉన్న చోటనే కాకుండా దేహమంతా వ్యాపించి ఉంటుంది. గుణం గుణిని విడిచి మరొక చోట ఎలా ఉంటుంది? పటం యొక్క శుక్లగుణం పటాన్ని విడిచి మరొకచోట ఉంటున్నట్లు కనబడటం లేదు కదా! గంధానికి వలె ఆశ్రయం నుంచి వేరు పడటం కుదురుతుంది అని సూత్రానికి అర్ధం. సువాసనగల పుష్పాదుల దగ్గరకు వెళ్లకపోయినా ఆపుష్పాల గంధం తెలుస్తుంది. అందుచేత గుణమే అయినా గంధం గంధాశ్రయమైన ద్రవ్యానికి దూరంగా ఉండటం జరుగుతుంది. ఇదే విధంగా జీవుడు అణువే అయినా కూడా చైతన్యగుణం వానికి దూరంగా ఉంటుంది. గంధం, స్పర్శ లాంటి గుణాలు వాటికి ఆశ్రయాలైన పృధివి మొదలైన ద్రవ్యాల కన్నా వేరే అయినా తాదాత్మ్యం వలన అవి పృధివ్యాది వస్తువుల కన్నా భిన్నం అని సామాన్య దృష్టికి బోధపడదు. అలాగే బుద్ధి ఆత్మ ఒక్కటే అని సామాన్యులు భావిస్తారు. కాలిన ఇనుపముక్కను చూసిన విజ్ణుడికి అగ్ని, ఇనుము వేరే అని తెలుస్తుంది. ఆత్మ, బుద్ధిసత్వం అతిసూక్ష్మాలు కనుక వాటి భేదం సామాన్యులకు తెలియదు. బుద్ధి ఇంద్రియల ద్వారా ఆయా విషయ ఆకారాన్ని పొందినప్పుడు జ్ఞానం, ఇచ్ఛా ఏర్పడతాయి. ఇవి బుద్ధిసత్వ పరిణామాలు. ఆత్మకు పరిణామం లేదు. బుద్ధిసత్వం ఆత్మకు జ్ఞానసాధనం. బుద్ధిసత్వం జడమైనది, పరిణామం చెందేది. ఆత్మ చైతన్యమైనది, పరిణామం లేనిది.
సూత్రం :- 243
“ తధా చ దర్శయతి "
తధా చ :- అలాగే అని, దర్శయతి: శాస్త్రాలు అంటున్నాయి.
భావం:- అణుపరిమాణుడైనా జీవుడు తన చైతన్యగుణం వలన దేహమంతా వ్యాపించి ఉన్నాడని శాస్త్రాలు అంటున్నాయి. వివరణ:- ఆత్మ హృదయంలో ఉంటుంది. అది అణుపరిమాణం కలది. ఆ ఆత్మయే చైతన్యగుణం చేత సమస్త శరీరాన్ని వ్యాపించినట్లు శ్రుతులు చెబుతున్నాయి.
కౌషీతకీ బ్రాహ్మణం:-(3,6):- "ప్రజ్ఞయా శరీరం సమారుహ్య సుఖ దుఃఖే ఆప్నోతి " జీవుడు శరీరంలో ఉండి బుద్ధి మూలంగా సుఖదుఃఖాలను పొందుతున్నాడు. జీవుడు శ్రవణాది ఇంద్రియ మూలంగా బాహ్యపదార్ధాలను తెలుసుకుంటున్నట్లుగా.. బుద్ధిసత్వం ద్వారా సుఖదుఃఖాలను పొందుతున్నాడు. దీని వలన జీవాత్మకన్నా బుద్ధిసత్వం వేరే అనీ తెలుస్తోంది.
ముండకోపనిషత్తు:-ఆత్మ సూక్ష్మరూపంలో మన శరీరంలో ఉన్నది. ఆత్మసాక్షాత్కారానికి చిత్తశుద్ధి అవసరం. పరిశుద్ధమైన అంతఃకరణ గల ఆత్మజ్ఞాని కోరుకున్నది పొందగలుగుతాడు. వారికి జన్మ ఉండదు. స్పర్శ, శబ్ద, రూప, రస, గంధాలు అని మనిషికి ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలతో కలసి మనస్సు అధీనంలో పనిచేస్తుంటాయి. ఈఇంద్రియాలన్నీ బాహ్యప్రపంచంలో అనుబంధం కలిగి విషయాలను మనస్సుకు అందిస్తుంటాయి. వీటికి తమ స్వంత ఆలోచనలు, కోరికలు ఉండవు. కేవలం మనస్సు చెప్పినట్లుగా స్పందిస్తుంటాయి. చెవుల ద్వారా అతి సున్నితమైన శబ్దాలను వినడం, కనుల ద్వారా ప్రకృతి అందాలను చూడటం, ముక్కు ద్వారా సువాసనలను గ్రహించడం, నాలుక ద్వారా రుచులను గ్రహించడం, చర్మం ద్వారా స్పర్శజ్ఞానం గ్రహిస్తుంటుంది. ఇలా మనస్సు జ్ఞానేంద్రియాల ద్వారా పొందిన విషయాన్ని అతిగా వాడుకొని కష్టాలు కొని తెచ్చుకుంటుంది. మనస్సుయొక్క ఈ విచిత్రతత్త్వమే సూక్ష్మశరీరం నుండి స్థూలశరీరం వరకు విస్తరింప జేస్తుంది. ఈఇంద్రియీల జ్ఞానశక్తి బుద్ధిసత్వం ద్వారా ప్రేరేపించబడి, జీవుడు సుఖదుఃఖములు అనుభవిస్తున్నాడు. దీనివలన జీవాత్మ కన్నా బుద్ధిసత్వం వేరు అనీ తెలుస్తోంది.
సూత్రం :- 244
" పృథ గుపదేశాత్ "
పృథక్ :- బుద్ధి ఆత్మ కన్నా వేరు అనీ, ఉపదేశాత్ :- ఉపనిషత్తులు ఉపదేశిస్తున్నాయి.
భావం :- బుద్ధి ఆత్మ కన్నా వేరు అని ఉపనిషత్తులు ఉపదేశిస్తున్నాయి.
వివరణ :- జీవుడు వేరు, అతని చైతన్య గుణం వేరు అనీ శ్రతులు చెబుతున్నాయి. అందువలన జీవుడు అణు పరిమాణుడు అని అనడంలో తప్పు లేదు. కాని అణురూపుడైన జీవుడు సమస్త శరీరాన్ని వ్యాపించి ఉన్నాడు. కాబట్టి జీవునికి సర్వ వ్యాపకత్వం చెప్పనవసరం లేదు అంటారు.
కఠోపనిషత్తు:-(3,3):- "ఆత్మానం రధినం విద్ధి శరీరం రధ మేవతు, బుద్ధింతు సారధిం విద్ధి "శరీరం ఒక రధం. జీవుడు రధికుడు, రధసారధి బుద్ధి. అనీ తెలుసుకోవాలి. ధర్మాధర్మ వివేకము బుద్ధిదే. ఈశరీరమే రధం, సారధి బుద్ధి, ఇంద్రియాలే గుర్రాలు. సార అంటే సారవంతమైన, ధి అంటే బుద్ధి. వివేకమే సారధి. ఏదీ హితమో, ఏదీ అహితమో, ఉచితమో-అను చితమో, కృతమో-అకృతమో, ధర్మమో-అధర్మమో, వివేకంతో చెప్పగలిగేది బుద్ధి. మనస్సు లౌకికవ్యవహారాలలో వస్తువుల వెంట పరుగెడుతూంటుంది. ఇంద్రియాలు కళ్లెంలేని గుర్రాల్ల దౌడుతీస్తుంటే వాటిని నియంత్రించేది బుద్ధి. గురువు తన వాక్కుతో శిష్యులందరిని నియంత్రించి తనవైపు ఆకర్షించినట్లు, సమాహారం చేయగలిగే శక్తి బుద్ధికే ఉంది. లోకంలో పశు పక్ష్యాదులకులేని బుద్ధి మనిషికే ఇచ్చాడు భగవంతుడు. అందుకే బుద్ధిని బ్రతుకు పరమార్ధం కోసం, మోక్షమార్గాన్ని అన్వేషిస్తూ, ఆత్మజ్ఞానాన్ని పొందడమే జీవితపరమార్ధం అనీ గ్రహించాలి. జగద్గురువులు శ్రీఆదిశంకరులు, శ్రీకృష్ణ భగవానుడు, జీవుడు ఎన్ని జన్మలు ఎత్తినా, చిట్టచివరి జన్మ మోక్షమే అని, ధర్మం మోక్షాన్ని ఇవ్వదని, జ్ఞానం మాత్రమే మోక్షసాధనమని లోకానికి తెలియజేశారు. బుద్ధి రధసారధిగా ఉన్నవాడు మనస్సుని వశంలో ఉంచుకోవాలి. ఈవాక్యాల వలన బుద్ధి జీవుడికన్నా భిన్నమే అనీ సిద్ధిస్తోంది. "అంగుష్ట మాత్రో రవితుల్యరూపః" జీవాత్మ అంగుష్టమాత్రుడని శ్వేతాశ్వరోపనిషత్తు చెబుతున్నది. అయితే జీవాత్మ అణుస్వరూపమని ఎలా అంటారు? "ప్రజ్ఞయా శరీరం సమారుహ్య " ప్రజ్ఞ చేత, జ్ఞానం చేత శరీరాన్ని అధిష్టించి , ఆత్మను ప్రజ్ఞను కర్తృ కరణ భావన చేత అంటే ఆత్మ శరీరాన్ని అధిష్టించడంలో కర్త అని ఈక్రియలోనే ప్రజ్ఞ కరణం, సాధనం అని వేరువేరుగా చెప్పడం చేత ఆత్మ చైతన్యగుణం చేతనే శరీరాన్ని వ్యాపించినట్లు తెలుస్తుంది. ఈ ఇంద్రియ జ్ఞానశక్తి, చైతన్యశక్తి చేత గ్రహించి కర్త అయిన శరీరుని కంటే వేరుగా విజ్ఞానాన్ని చెప్పడం ఈ అభిప్రాయాన్నే బలపరుస్తుంది. అందువలన జీవుడు అణుప్రమాణుడు.
సూత్రం :- 245
" తద్గుణ సారత్వాత్తు తద్వ్యపదేశాత్ "
తత్ గుణ సారస్వాత్ తు :- బుద్ధి గుణమైన పరిమాణాన్ని ప్రధానంగా గ్రహించడం వలన, ప్రాజ్ఞవత్ :- పరబ్రహ్మ, హృదయ పరిమాణమైన అంగుష్ట మాత్రుడని చెప్పినట్లే, తత్ వ్యపదేశం :- జీవాత్మను కూడా అంగుష్ట మాత్రుడని అన్నారు.
భావం :- బుద్ధి గుణమైన పరిమాణాన్ని బట్టి పరబ్రహ్మ వలెనే జీవాత్మ కూడా అల్పపరిమాణం కలవాడని చెబుతారు.
వివరణ:-పరబ్రహ్మకు కర్త్తృత్వం, భోకృత్వం లేవు. కాని బుద్ధి గుణాల వలన కర్త్రత్వ, భోకృత్వాలు చెప్పబడుతున్నాయి. జీవాత్మకు పరమాత్మకు తేడా లేదు. రెండు ఒక్కటే. పరమాత్మ స్వరూపమెంత ఉంటుందో, ఆత్మ స్వరూపం అంతే ఉంటుంది.
శ్వేతాశ్వరోపనిషత్తు(5,8):- "సంకల్పాహంకార సమన్వితోయః, బుద్ధిర్గునే నాత్మ గుణేనఛైవ ఆరాగమాత్రో హ్యపరోపిదృష్టః" ముల్లుకర్ర, సన్నటి కొన లాగ జీవాత్మ సంకల్పం, అహంకారం లాంటి బుద్ధి గుణాలతో కూడి అంగుష్టమాత్రుడిగా ఉంటాడు. "వాలాగ్ర శత భాగస్య " కూడా జీవాత్మ సూక్ష్మపరిమాణాన్ని వర్ణించింది. అంగుష్టపరిమాణం ఉన్నవాడు అంటే అది జీవుడి స్వరూపాన్ని బోధించదు. బుద్ధి తాదాత్మ్యంవలన బుద్ధిపరిమాణంతో ఉన్నవాడని వర్ణించడం మాత్రమే. ఉపనిషత్ వాక్యంలో "అంగుష్టమాత్రో రవితుల్యం " అంగుష్టమాత్రం అన్నప్పుడు అంగుష్టపరిమాణం అనుకోకూడదు. పరిమాణం బుద్ధికి సంబంధించినది. జీవాత్మ, బుద్ధి ఈ రెండు హృదయంలో ఉంటాయి. ఇనుము బాగా కాలినప్పుడు అగ్ని, లోహం తదాత్మ్యం చెందుతాయి. అలాగే బుద్ధి తాదాత్మ్యంతో జీవుణ్ణి అంగుష్ట పరిమాణం ఉన్నవాటిని వర్ణించారు. కాని, వాస్తవానికి జీవుడు అణుపరిమాణం ఉన్నవాడే. బుద్ధికూడా హృదయంలో ఉంటుంది. మానవ హృదయానికి అంగుష్ట పరిమాణం ఉన్నది. కనుక సర్వవ్యాపకమైన బ్రహ్మనికి కూడా ఒక్కొక్కసారి హృదయ పరిమాణం ఉన్నదని వర్ణించారు. అందువలన జీవుడు కాని బుద్ధి కాని అంగుష్టపరిమాణులని చెప్పడం కేవలం ఔపచారికమే కాని స్వరూపవర్ణన కాదు. బుద్ధిసత్వం ప్రకృతి నుంచి ఉత్పనమైనది. అందువలన అది శరీరంలాగా అనిత్యమై, నశిస్తుంది. జీవుడికి పదార్ధజ్ఞానం కలిగించడానికి బుద్ధి ఒక సాధనంగా ఉపయోగ పడుతుంది. ఆబుద్ధి నశిస్తే జీవుడికి శరీరంతో అన్ని బంధాలు తొలగిపోయి సంసారం నుంచి నివృత్తి కలుగుతుంది. అప్పుడు మోక్షాన్ని బోధించే శాస్త్రాలన్నీ వ్యర్థమే కదా! దీనికి సమాధానం తరువాత సూత్రంలో చెప్పబడింది.
సూత్రం :- 246
" యావదాత్మ భావిత్వాచ్చ న దోషః తద్దర్షనాత్ "
చ :- పైగా, బుద్ధి సత్వం, యావత్ ఆత్మ భావిత్వాత్ :- సంసార బంధనంలో జీవాత్మ ఉన్నంత కాలం ఉండటంలో, న దోషః :- ఏ దోషము లేదు. తత్ దర్శనాత్ :- శాస్త్రాలలో వర్ణించారు.
భావం :- బుద్ధి సత్వం సంసార బంధనంలో జీవాత్మ ఉన్నంత కాలం ఉంటుందని చెప్పడంలో ఏ దోషము లేదని శాస్త్రాల్లో వర్ణించారు.
వివరణ :- బుద్ధి సంయోగమనేది ఆత్మజ్ఞానం వలన సంసారనివృత్తి జరిగే వరకు ఉంటుంది. శరీర వియోగం జరిగిన తరువాత కూడా బుద్ధిసంయోగం ఉంటుందని శ్రుతులు చెబుతున్నాయి.
ముండకోపనిషత్తు:- బ్రహ్మ సాక్షాత్కారం పొందిన జీవుడు ప్రకృతి. దాని కార్యాలైన బుద్ధి సత్వాలను విడిచి పెట్టి, పరాత్పరుణ్ణి పొందుతాడు. కనుక బ్రహ్మసాక్షాత్కారం బుద్ది వినాశనానికి హేతువు. అంత దాకా జీవాత్మతో బుద్ధిసత్వానికి సంబంధం ఉంటుంది. బుద్ధిసత్వం ప్రకృతి జన్యం కనుక అది నశిస్తుంది. ప్రకృతి వలన జనించిన పదార్ధాలు వాటి నాశనానికి తగిన కారణములు ఏర్పడినప్పుడు నశిస్తాయి. అంతకు ముందు నశించవు. అదే విధంగా బుద్ధిసత్వం జీవుడికి బ్రహ్మ సాక్షాత్కారం కలిగినప్పుడు నశిస్తుంది. దాని నాశనానికి హేతువు కాక ముందు నశించదు. అప్పటి వరకు లోక వ్యవహార సాధనంగా ఉంటుంది. బ్రహ్మసాక్షాత్కారం కలిగినప్పుడు జీవుడు బుద్ధి నుండి ముక్తుడై, శుద్ధుడై, మోక్షానందాన్ని అనుభవిస్తాడు. అంతవరకు అతనికి సంసారంతో సంబంధం ఉంటుంది. ఆసంసార బంధం నుండి ముక్తికి కావలసిన సాధనా సంపత్తి సమకూరే వరకు బుద్ధిసత్వం జీవుడికి సాధనంగా ఉంటుంది. జీవుని జీవత్మము, సంసారిత్వం కూడా ఈ బుద్ధ్యుపాది సంబంధం ఉన్నంత వరకే. వాస్తవంలో బుద్ధ్యుపాది సంబంధం చేత కల్పించబడిన స్వరూపం కంటే భిన్నంగా జీవుడనే లేడు. తత్త్వమసి, అహం బ్రహ్మాష్మి ఈ శ్రుతుల ననుసరించి నిత్యముక్తస్వరూపుడు, సర్వజ్జుడు, అయిన ఈశ్వరుని కంటే వేరుగా చేతనమైన మరొక ధాతువు ఏదీ వేదాంతంలో కనబడదు. బుద్ధి సంయోగం యావదాత్మ భావి అనీ ఎట్లు తెలుస్తుంది? దాని గురించి శ్రుతిలో చెప్పబడింది. అక్కడ విజ్ఞనమయః-శ్రోత్ర మయః అంటే విజ్ఞానమయుడు, మనో మయుడు, ప్రాణమయుడు, చక్షుమయుడు, శ్రోత్రమయుడు అని విజ్ఞానమయుణ్ణి మనోమయాదులతో కలసి పఠించడం . బుద్ధి మయుడు అనగా బుద్ధి యొక్క గుణాలు సారంగా కలిగినవాడు అనీ అర్ధం. ఆ ఆత్మ రెండు లోకాలలోనూ సంచరిస్తోంది. లోకాంతరానికి వెళ్ళినప్పుడు కూడా బుద్ధితో కలసి ఉన్నట్లు చూపుతున్నది. ఆత్మ స్వయంగా ధ్యానం చెయ్యదు. చలించదు. బుద్ధి ధ్యానిస్తుంటే ధ్యానిస్తున్నట్లు ఉంటుంది. బుద్ధి చలిస్తుంటే చలిస్తున్నట్లు కనబడుతుంది. ఆత్మకు బుద్ధ్యుపాదులతో ఏర్పడిన ఈ సంబంధానికి కారణం మిధ్యాజ్ఞానం. సమ్యక్ జ్ఞానం కలిగితే కాని మిధ్య జ్ఞానం తొలగిపోదు. అందువల్ల ఆత్మ జ్ఞానం కలిగే వరకు ఈ బుద్ధ్యుపాదులతో సంబంధం కలిగివుంటుంది.
సూత్రం :- 247
" పుంస్త్వాది వత్త్వ స్య సతోభివ్యక్త యోగాత్ "
అస్య:- ఈబుద్ధి సత్వం, సతః :- ప్రళయంలోను, సూక్ష్మరూపంలోనూ ఉండటం వలన, పుంస్త్వాది వత్ :- పుంస్త్వం, గ్రహణ సామర్ధ్యం, ఊహశక్తి, లాంటివి యౌవనంలో అంకురించి, వృద్ధి చెందేటట్లుగా, అభివ్యక్తియోగాత్:- ప్రళయాంతరంలో ప్రకటం కావటం వలన, బుద్ధి సత్వం జీవాత్మకు మోక్షం సిద్ధించే దాకా ఉంటుంది.
భావం :- బుద్ధి సత్వం ప్రళయం లోనూ, సూక్ష్మ రూపంలోనూ, ఉండటం వల్ల, పుంస్త్వం, గ్రహణం సామర్ధ్యం, ఊహశక్తి లాంటివి యౌవనంలో అంకురించి వృద్ధి చెందేటట్లుగా ప్రళయాంతంలో ప్రకటం కావటం వలన బుద్ధి సత్వం జీవాత్మకు మోక్షం సిద్ధించే వరకు ఉంటుంది.
వివరణ:-బాల్యంలో కూడా ఉండే పుంసాదులు, యౌవనంలో మాత్రమే బహిర్గతమవుతున్నట్లుగా, సూక్ష్మరూపంలో ఉండే ఈ బుద్ధిసంయోగం జాగ్రదావస్థలలో పైకి కనిపిస్తుంది. పూర్వం లేనిది కొత్తగా ఉద్భవించదు కదా! బాల్యంలో పుంస్త్వం (పుట్టించే శక్తి) లాంటి గుణాలు పురుషుడిలోఉన్నా ఆదశలో కార్యరూపంలో పైకి కనబడవు. లేనట్లే భావించబడుతుంది. కాని బీజరూపంలో ఉన్నవి అయినా పుంస్త్వం మొదలైనవి లోకంలో యౌవనంలో కనబడతాయి. అంతే కాని అసలే లేవని కాదు. అదే విధంగా ఈబుద్ధి సంబంధం కూడా సుషుప్తి వలయాలలో శక్తిరూపంలో ఉన్నదే, మేల్కొన్నప్పుడు మళ్ళీ సృష్టి జరిగి నప్పుడు ఆవిర్భవిస్తుంది. ఏదీ హఠాత్తుగా పుట్టదు. అలా జరిగితే అతిప్రసంగం ఏర్పడుతుంది. అనగా అన్ని వేళలా పుట్టవలసి వస్తుంది. సుషుప్తినుంచి లేవడం అవిద్యారూపమైన బీజం ఉండటం వలన జరుగుతుంది. బుద్ధ్యుపాదులతో సంబంధం ఆత్మఉన్నంత వరకు ఉంటుందని గ్రహించాలి. ప్రళయంలో బుద్ధిసత్వం కార్యసాధనకు తోడ్పడదు. సూక్ష్మ రూపంలో అలాగే ఉంటుంది. పూర్తిగా నశించదు. ప్రళయంలో ప్రాకృతిక పదార్ధాలన్ని తమ రూపాన్ని విడిచి సూక్ష్మ రూపంలో ఉంటాయి. తమ ఉనికిని పోగొట్టుకోవు. సృష్టిఆరంభంలో మళ్ళీ స్వస్వరూపాన్ని పొంది బుద్ధిసత్వం జీవాత్మకు జ్ఞాన సాధనంగా వర్తిస్తుంది.
సూత్రం :- 248
" నిత్యోపలబ్ధ్య నుపలబ్ధి ప్రసంగో న్యతర నియమో వాన్యధా "
అన్యధా:-జీవాత్మ కంటే వేరేగా బుద్ధి సత్వం ఉన్నదని ఒప్పుకోని పక్షంలో, నిత్యనుపలబ్ధి, అనుప లబ్ధి ప్రసంగః :- బాహ్య విషయాన్ని గ్రహించడమో, బొత్తిగా గ్రహించలేక పోవడమో జరుగుతుంది. వా:- లేదా, అన్యతరనియమః:- ఈరెండిటిలో ఒకటి నియమంగానైనా ఏర్పడుతుంది.
భావం:-జీవాత్మ కంటే బుద్ధి సత్వం వేరేగా ఉన్నదని ఒప్పుకోని పక్షంలో బాహ్య విషయాన్ని గ్రహించడమో, బొత్తిగా గ్రహించ లేకపోవడమో జరుగుతుంది.
వివరణ:- బుద్ధి లేక అంతఃకరణ మనేది ఆత్మకు ఉపాధి. దానికి అస్థిత్వం ఉన్నదని అంగీకరించాలి. లేకపోతే నిత్యోపలబ్ధి ప్రసంగం లేదా నిత్యానుపలబ్ధి ప్రసంగం ఏర్పడుతుంది. ఉపలబ్ధి అంటే సాక్షాత్కారం. ఆత్మ ఇంద్రియవిషయాలు అనే వీటి సాన్నిధ్యమే జ్ఞానసాక్షాత్కారానికి సాధనాలు. ఇవి ఉన్నప్పటికీ ఒక్కొక్కప్పుడు జ్ఞానోపలబ్ధి కలగవచ్చును. కలగక పోవచ్చును. జీవాత్మ కంటే బుద్ధి సత్వం వేరేగా ఉన్నదని ఒప్పుకోకపోతే జీవాత్మ అణుపరిమాణం అని నిరూపించలేము. జీవాత్మకు తన నేత్రాల వలన బాహ్యపదార్ధాల జ్ఞానం కలుగుతుంది. జీవాత్మ అణువు కాక విభువు అనుకుంటే అతనికి బాహ్యంద్రియలతో ఎల్లప్పుడూ సంబంధం ఉంటుంది. సర్వేంద్రియాలతో సర్వవస్తుజ్ఞానం కలగాలి. అలా జరగడం లేదు కదా! ఒకే సమయంలో జ్ఞానం కలగడం, కలగక పోవడం ఉండదు. ఒకే సమయంలో శబ్ద, స్పర్శ, రూప, రస గంధాల జ్ఞానం కలగడం, కలగకపోవడం ఎక్కడా చూడలేము. ఒకనిముషంలో ఒకఇంద్రియంతో ఒక వస్తువును గురించి తెలుసుకుంటాము. ఆక్షణంలో ఆవస్తువును గురించి తెలుసుకోకపోవడం జరగదు. తెలుసుకోవడం, తెలుసుకొకపోవడం పరస్పర విరుద్దములు. జ్ఞానం కలగడమే స్వభావం అనుకుంటే ఎప్పుడు ఏఇంద్రియంతో జ్ఞానం కలగకుండా ఉండాలి. కాని లోకంలో వస్తువుల జ్ఞానం కలగడం చూస్తున్నాము. కనుక ఆత్మకు, బాహ్యేంద్రియాలకు మధ్య అంతకరణం ఉంటుంది. ఆత్మకు ఉపాధి అయిన అంతఃకరణం మనస్సు, బుద్ధి, జ్ఞానం, చిత్తం అని అనేక విధాలుగా చెప్పబడుతోంది. వృత్తుల విభాగాన్ని బట్టి సంశయాది వృత్తులు కలది మనస్సనీ, నిశ్చయాది వృత్తులు కలది బుద్ధి అనీ, కొన్ని చోట్ల చెప్పబడింది. ఈ అంతఃకరణం ఉన్నదనీ, దానిలో మనస్సనేది ఉన్నదని అంగీకరించాలి. నిత్యజ్ఞానం, నిత్యఅజ్ఞానం అనే దోషాల ప్రసక్తి ఉండదు. జీవాత్మతో సంబంధం పెట్టుకున్న బుద్ధి సత్వమే ఇంద్రియాల మూలంగా ఏవిషయంలో ఆసక్తి చూపుతుందో, ఆ విషయ జ్ఞానమే ఆ క్షణంలో జీవుడుకి కలుగుతుంది. జీవుడికి మనస్సుతో సంబంధం ఉన్నట్లు ఉపనిషత్తులు చెబుతున్నాయి.
బృహదారణ్యకోపనిషత్తు(1,5,3):-నామనస్సు మరొక చోట ఉంది. అందువలన చూడలేదు. నేను వినలేదు కూడా. ఇలా ఆత్మకన్నా భిన్నంగా మనస్సు, బుద్ధి ఉన్నాయనడం నిశ్చితం అవుతుంది. కనుక జీవుడు విభువు కాదు. అణువే. మరి జీవాత్మ అణువైతే కర్త ఎలా అవుతాడు.
కర్తృధికరణం ( 2, 3, 33 )
సూత్రం :- 249
" కర్తా శాస్త్రార్ధవత్వాత్ "
శాస్త్రార్ధ వత్వాత్ :- వేదాది శాస్త్రాల ప్రాముఖ్యం వలన, కర్తా :- అణు పరిమాణం ఉన్న జీవాత్మ కర్త అని సిద్ధమౌతోంది.
భావం:-వేదాది శాస్త్రాల ప్రాముఖ్యం వలన అణుపరిమాణం ఉన్న జీవుడే కర్త తెలుస్తోంది. ఈఅధికరణంలో జీవుడే కర్త అని చెప్పబడింది.
వివరణ:- గురువు గారు! శ్రుతులలో ఆత్మకు కోరికలు ఉండవనీ, పక్షపాతం ఉండదనీ, కర్మలు చేయదని, కర్మఫలం కూడా ఉండదని చెప్పబడింది. కాని కర్మలు చెయ్యాలి. అంటే యాగాలు, హోమాలు, క్రతువులు చెయ్యాలి అనీ చెప్పబడింది. ఈ వైరుద్యం ఏమిటి? అన్నాడు నారాయణభట్టు. ఆమాటలు విన్న రత్నాకరుడు వివరిస్తున్నాడు. శాస్త్రం అర్ధవంతం కావాలంటే జీవుడు కర్త అనే చెప్పాలి. కర్త అనేవాడు లేకపోతే కర్మ చేసేవాడు ఉండడు. కర్త లేకపోతే కర్మను ఎవరికీ ఉపదేశించాలి? అందుచేత కర్త అనేవాడు ఉండి తీరాలి. మరి ఆ కర్తఎవరు? అంటే ఆత్మయేకర్త. బుద్ధి కర్తకాదు. అన్ని ఆత్మయే నిర్వహిస్తుంది. చూసేది, వినేది, ఆలోచించేది అన్నిఆత్మయే. అందుకే కనులకు చూసే శక్తిని, చెవులకు వినికిడి శక్తిని, మనస్సుకు ఆలోచనా శక్తిని ప్రసాదించేది ఆత్మ. యజర్వేదం(13-43):-గోవులను హింసించకూడదు. ఋగ్వేదం(7,8,5,16):- పాచికలతో జూదం ఆడకూడదు. తైత్తరీయెపనిషత్తు (1,11):-స్వాధ్యాయాన్ని మరచిపోకూడదు. ఇవి శాస్త్రనిషేధాలు. చేయకూడని పనులు. జీవులకు కర్త్తృత్వం, కర్మలు చేసే స్వాతంత్మ్యం లేకపోతే, పై విధి నిషేధాలు విధించారు. శాస్త్రాలు కర్తకే ఉపదేశిస్తాయి. కర్త లేని పక్షంలో అతడు చేసిన పనులకు కర్మఫలం ఎలా అనుభవిస్తాడు? కనుక జీవుడే కర్త. కొన్ని శ్రుతులు ఆత్మ అసంగం అని చెబుతున్నాయి. కొన్ని శ్రుతులు ఆయా కర్మలను విధిస్తున్నాయి. శ్రుతులలో విరోధం ఉండటం వలన ఆత్మకు కర్తృత్వం ఉన్నదా, లేదా అనే సందేహం కలుగుతుంది. కర్తృత్వం లేదని పూర్వపక్షం వాదన. కాని కర్తృత్వం ఉన్నదని ఈ అధికరణంలో చెప్పబడింది.
సూత్రం :- 250
" విహారోపదేశాత్ "
విహారః :- తన ఇచ్చానుసారం వర్తిస్తాడని, ఉపదేశాత్ :- శాస్త్రాలు ఉపదేశిస్తున్నాయి.
భావం :- జీవుడికి ఉద్దేశించిన చేయదగిన ధర్మాలు, చేయకూడని నిషిద్ద ధర్మాలు విధించినందున వాటిని తన ఇచ్చానుసారం చెయ్యడానికి సంకల్పిస్తాడని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి.
వివరణ :- జీవుడు కర్త అని చెప్పారు. అతనికి విహారం ఉన్నందున తన ఇష్టం వచ్చిన చోటుకి వెడతాడు. శరీరంతో స్వేచ్ఛగా విహరిస్తాడు.
బృహదారణ్యకోపనిషత్తు(2,1,18):-"స్వశరీరే యధా కామం పరివర్తతే" జీవుడు తన శరీరంతో ఇష్టం వచ్చినట్లు వర్తిస్తాడు. కర్త కాని వాడు స్వతంత్రుడు కానేరడు. కర్తకు క్రియలో స్వతంత్రం ఉంది. అష్టధ్యాయి(1,4,54):-స్వతంత్రః కర్తా:- కర్త స్వతంత్రుడని పాణిని అన్నాడు. జీవుడు విహరిస్తాడు అని చెప్పడం వలన అతనికి కర్తృత్వం ఉందని గ్రహించాలి. స్వప్నావస్థలో ఆ జీవుడు ఏ స్వప్నంలో స్వేచ్ఛగా విహారిస్తున్నాడో అని జీవునికి విహారం ఉపదేశీస్తుంది. అంటే జీవుడు తన శరీరంతో సంచరిస్తాడు. భగవద్గీతలో కర్మలు ఐదు రకములని చెప్పారు.
1. విహిత కర్మలు :- వేదములలో శాస్త్రములలో పూజ కర్మలు ఇష్టం ఉన్నా లేకపోయినా విధిగా పాటించాలి.
2. నిషిద్ద కర్మలు :- శాస్త్రములు నిషేధించిన కర్మలు మనకు ఇష్టం ఉన్నా చెయ్యకూడదు.
3. కామ్య కర్మలు :- ఏదో ఒక కోరికతో ఫలాన్ని ఆశించి కర్మ చెయ్యడం,
4. ప్రాయశ్చిత్త కర్మలు :- తెలియకుండా చేసే పాపాలకు దోషాలకు ప్రాయశ్చిత్తం చేసుకొనే కర్మలు,
5. నిత్యనైమిత్తికకర్మలు:- చేయవలసిన సంధ్య వందనం, అగ్ని హోత్రం, మొదలైనవి, ఉపనయనం, వివాహం, పర్వదినాలలో చేయవలసిన కర్మలు. నిత్య నైమిత్తిక కర్మలు తప్ప మిగిలిన కర్మలు చేయకుండా ఉండటం సన్యాసం అంటారు.
జీవుడు తన ఇచ్ఛానుసారం ఈ కర్మలన్నీ స్వతంత్రంగా నిర్వహించగలడు.
సూత్రం :- 251
" ఉపదానాత్ "
ఉపదానాత్:- తీసుకోవడం, స్వీకరించడం, పొందడం. వీటి వలన జీవాత్మకు కర్తృత్వం ఉన్నది. గ్రహణం వలన జీవుడు కర్త అవుతున్నాడు.
భావం :- దేనినైనా తీసుకోవడం, స్వీకరించడం, పొందడం వలన జీవాత్మకు కర్తృత్వం ఉన్నది.
వివరణ :- గ్రహించడం వలన కూడా జీవుడే కర్త అని చెప్పాలి. ఇంద్రియాల ద్వారా గ్రహించేవాడు జీవుడు.
బృహదారణ్యకోపనిషత్తు:-(2,1,17) జీవుడు బుద్ధిమూలంగా ఇంద్రియాల విషయగ్రహణం శక్తిని గ్రహించి హృదయకాశంలో శయనిస్తాడు. దీనిని బట్టి జీవుడు కర్తకాని పక్షంలో ఇంద్రియాలకుఉండే విషయాన్ని తాను గ్రహించలేడు కదా! కనుక జీవుడు కర్తే. ఆత్మపురుషుడు బుద్ధిద్వారా ఇంద్రియాది సాధనాల శక్తిని గ్రహిస్తాడు అని చెప్పబడింది. దీని వలన కూడా జీవునకి కర్తృత్వం ఉన్నది. ఎందువలననగా జీవక్రియలోనే "తదేషా.ఆదాయ". (ప్రాణాలతో జ్ఞానంచేత అనగా బుద్ధిచేత ఇంద్రియ సముదాయాన్ని గ్రహించి) అనీ "ప్రాణాన్ గృహిత్వా" అనీ జీవుడు కరణాలను (ఇంద్రియలను) గ్రహించినట్లు అవుతుంది. జీవుడు ఏదైనా కర్మ చేసేటప్పుడు మూడు విధాలైన ఫలితాలు వస్తాయి. 1.సుఖం, 2.దుఖం, 3.రెండింటి కలయిక, కొంచెం సుఖం, కొంచెం దుఖం. ఈఫలితములు బ్రతికిఉండగా కాని, మరణానంతరం గాని అనుభవించాలి. ప్రవృత్తి మార్గంలో ప్రాపంచిక విషయాలు, విషయవాంఛలు, ధనం, ఆస్తిమీద ఆసక్తి, సంసారంలో మునిగిపోవడం మొదలైన కర్మలను జీవుడు బుద్ధిమూలంగా ఇంద్రియలద్వారా తెలుసుకుంటాడు. నివృత్తిమార్గంలో బుద్ధి సాత్వికమై, ప్రాపంచిక విషయాలపై ఆసక్తిలేకుండా, సంసారంతో ఎక్కువ అనుబంధంలేకుండా పరమాత్మ గురించి ఆలోచించడం, చెయ్యకూడని పనుల జోలికి పోకపోవడం మొదలైన కర్మలలో బుద్ధి మనస్సుని నియంత్రిస్తుంది. ఈబుద్దే జీవుడికి ధర్మాధర్మవిచక్షణ తెలుసుకొని సకల ప్రాణులలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడనే జ్ఞానం కలిగిస్తుంది. జీవుడు తన ఇంద్రియ సాధనాల ద్వారా అన్ని వ్యవహారాలు చేస్తాడు కనుక జీవుడికి కర్తృత్వం ఉన్నదని తెలుస్తుంది.
సూత్రం :- 252
" వ్యప దేశాచ్చ క్రియాయాం న చేత్ నిర్దేశ విపర్యయః "
క్రియాయం :- లౌకిక, వైదిక కర్మల్లో, వ్యపదేశాత్ చ :- ఆత్మను కర్తగా చెప్పడం వలన, జీవాత్మ కర్త అవుతాడు. న చేత్ :- అలా కాని పక్షంలో, నిర్దేశ విపర్యయః :- శాస్త్ర నిర్దేశానికి వ్యతిరేకం అవుతుంది.
భావం:- లౌకిక, వైదిక కర్మల్లో ఆత్మను కర్తగా చెప్పడం వలన జీవాత్మ కర్త అవుతాడు. అలా కానీ పక్షంలో బుద్ధినే కర్తగా భావిస్తే శాస్త్రనిర్దేశానికి వ్యతిరేకం అవుతుంది.
వివరణ :- లౌకిక, వైదిక క్రియల యందు జీవుడు కర్తగా చెప్పబడ్డాడు. జీవునకు కర్తృత్వం ఉంది కనుక జీవుడే కర్త.
తైత్తరీయెపనిషత్తు:-(2,5):- జీవాత్మ వైదికకర్మను, లౌకికకర్మలను విధిని అనుసరించి చేస్తాడు. ఇక్కడ ఆత్మ ప్రధమా విభక్తిలో ఉన్నందున తాను చేసే కర్మలకు అతనే కర్త. విజ్ఞానంఅంటే జీవాత్మకాదు. బుద్ధి అనీ అనుకుంటే విజ్ఞానేన అనే తృతీయావిభక్తి ప్రయోగం ఉండేది.
బృహదారణ్యకోపనిషత్తు:-(2,1,17)"తదేషాం ప్రాణానం, విజ్ఞానేన విజ్ఞానంఆదాయ" ఇక్కడ విజ్ఞానంతో బుద్ధితో అనీ తృతీయా విభక్తితో బుద్ధివాచక విజ్ఞానాన్ని ప్రయోగించారు. కనుక ప్రధమావిభక్తితో ఉన్నా విజ్ఞానపదం జీవాత్మనే సూచిస్తుంది. కాని బుద్ధిని కాదు. అందువలన జీవాత్మ కర్త అని సూత్రాభిప్రాయం. ఇక్కడ విజ్ఞానం అంటే జీవాత్మ. జీవాత్మ కర్త అయినప్పుడు, అతని కర్తృత్వం నిత్యమా? అనిత్యమా? అనీ సందేహం వస్తుంది. ఆత్మకు జ్ఞానం ఎలా నిత్యమో, కర్తృత్వం కూడా నిత్యమే కావాలి కదా! లౌకికక్రియలయందు, వైదికక్రియల యందు కూడా జీవునకు కర్తృత్వం ఉన్నట్లు శాస్త్రం చెబుతున్నది. " విజ్ఞానాం... తమ తే పిచ" జీవుడే యజ్ఞం చేస్తున్నాడు. ఇతర కర్మలు కూడా చేస్తున్నాడు. అని ఈ వాక్యానికి అర్ధం. విజ్ఞాన శబ్దానికి బుద్ధిఅనీ అర్ధమని గ్రహించబడింది కదా! దీని చేత జీవునికి కర్తృత్వం ఉన్నట్లు ఎలా తెలుస్తుంది? దీనికి సమాధానం. ఇది జీవుని నిర్దేశమే కాని బుద్ధియొక్క నిర్దేశంకాదు. బుద్ధికంటే భిన్నుడైన ఆత్మకే కర్తృత్వం చెప్పబడుచున్నట్లు సూచింపబడుతోంది. కనుక దోషం లేదు.
సూత్రం :- 253
" ఉపలబ్ధివత్ అనియమః "
ఉపలబ్ధివత్ :- జ్ఞానం లాగా, అనియమః :- కర్తృత్వం నిత్యం కావాలి అనే నియమం లేదు.
భావం :- జ్ఞానం లాగా కర్తృత్వం నిత్యం కావాలి అనే నియమం లేదు. ఆత్మకు జ్ఞాన స్వరూపం ఉంది. కనుక జ్ఞానం నిత్యం.
వివరణ:- జీవుడు తన కర్తవ్యాన్ని బుద్ధిసత్వ సంబంధంతో చెయ్యగలుగుతాడు. కర్తృత్వం అంటే కృతికి ఆశ్రయం. కర్తృత్వం ఇచ్ఛ వలన కలుగుతుంది. జీవాత్మ కూటస్థనిత్యం. అలాంటి జీవాత్మ ప్రయత్నానికి ఆశ్రయం కాదు. బుద్ధిసత్వ సంబంధం తోనే తన కార్యాలను నెరవేరుస్తాడు. జ్ఞానం లాగా కర్తృత్వం మౌలికంగా జీవాత్మకు నిత్యం కానేరదు. బుద్ధి కంటే భిన్నుడైన జీవుడు కర్త అయినట్లయితే అతను స్వతంత్రుడై ఉండి, తనకు ఏదీ హితమో, ఏదీ ప్రియమో దానిని సంపాదించాలి. అంతే కాని విపరీతమైన దానిని సంపాదించకూడదు. అయితే విపరీతమైనదాన్ని కూడా సంపాదిస్తున్నట్లు కనబడుచున్నాడు. స్వతంత్రుడైన ఆత్మ నియమం లేకుండా ఈవిధంగా ప్రవర్తించడం యుక్తం కాదు. ఈఆత్మ ఉపలబ్ధి (అంటే ఏదైనా ఒక విషయాన్నితెలుసుకోవడం గురించి) స్వతంత్రడే అయినా, నియమం లేకుండా ఇష్టమైనదానిని, అయిష్టమైనదానిని కూడా ఏవిధంగా తెలుకుంటాడో, అలాగే వాటిని ఇష్టంతోనో , అయిష్టంతోనో సంపాదిస్తాడు. జీవునికి ఉపలబ్దియందు స్వతంత్రం లేదు. ఎందుకంటే ఏదైనా ఒకవిషయం తెలుసుకోవాలంటే కేవలం మనిషి ఉంటే సరిపోదు. తెలుసుకునే సాధనాలు కూడా సేకరించుకోవాలి. అందుచేత జీవునకు స్వతంత్రంలేదు అనడం యుక్తం కాదు. వస్తువును తెలుసుకోవడం, ఏర్పాటు చేసుకోవడం వరకే ఉపలబ్ది ప్రయోజనం ఉంటుంది. ఆత్మ చైతన్యం కలది. కనుక దానికి మరొక ఆపేక్ష లేదు. విషయజ్ఞానం విషయంలో జీవునకు స్వతంత్రం ఉన్నదని గ్రహించాలి. ఉపలబ్ది కోసం సాధనాలను సేకరిస్తేనే స్వాతంత్రం ఉన్నట్లయితే, అసలు ఏ పని చెయ్యడానికి స్వాతంత్రం ఉండదు. ఆత్మకు ఏ పని చెయ్యడంలో స్వతంత్రం లేదు. ఎందువలనంటే ఏ పని చెయ్యాలన్నా దేశం, కాలం, నిమిత్తం మొదలైన విశేషాల ఆపేక్ష ఉంటుంది. సహాయాన్ని ఆపేక్షించినంత మాత్రాన కర్త యొక్క కర్తృత్వం పోదు. వంటవాడు కట్టెలు, నీరు మొదలైనవి కోరుకున్నంత మాత్రాన అతని పాకక్రియ కర్తృత్వానికి భంగం కలగదు. సాధనావైచిత్య్రాన్ని బట్టి ఆత్మ ఆపేక్ష లేకపోయినా, నియమంలేకుండా ఇష్టమైన, అయిష్టమైన పనులను నిర్వహిస్తుంది.
సూత్రం :- 254
" శక్తి విపర్యయాత్ "
శక్తి విపర్యయాత్ :- క్రియా శక్తి వ్యతిక్రమం వలన, కర్తృత్వం ఉప లబ్ధి లాగా నిత్యం అని అనలేము.
భావం :- క్రియాశక్తి వ్యతిక్రమం వలన, కర్తృత్వం ఉపలబ్ది లాగా నిత్యం అనలేము.
వివరణ- శక్తి యందలి వ్యత్యాసంవలన కూడా జీవుడే కర్త అవుతాడు. ఇది కేవలం పేరుతో ఉన్నా నినాదమే తప్ప వస్తువులో ఉన్నది కాదు. క్రియాశక్తి అంటే పనిచేసే శక్తి. క్రియ అంటే చర్య. ఏదైనా పని పూర్తి కావాలంటే 3 శక్తుల సమన్వయంతో ఉండాలి. ఇది మూడు రకములు. 1.ఇచ్చాశక్తి: ఒక పూల తోటను పెంచాలంటే ముందుగా ఆకోరిక కలిగి ఉండాలి. అదే ఇచ్చాశక్తి. 2.జ్ఞానశక్తి:- ఆతోటను సృష్టించడానికి అవసరమైన జ్ఞానం కలిగిఉండడం జ్ఞానశక్తి. 3.క్రియాశక్తి:- తోటను పెంచడానికి శారీరిక సామర్ధ్యం, కొన్ని సాధనాలు అవసరమౌతాయి. అదే క్రియా శక్తి. జ్ఞాన శక్తితో కలిపి క్రియాశక్తి ఒక వ్యక్తికి పురోగతిని సృష్టించ గల శక్తిని ఇస్తుంది. క్రియ జరగకపోయినా ప్రయత్నం ఉంటుంది కదా! అంటే అప్పుడు క్రియాశక్తి నిత్యం కాదు. ముక్తిలో క్రియాశక్తి ఉండదు. ఆత్మఉంటుంది. క్రియాశక్తి ఉంటే కార్యంఉండాలి. కార్యమే వస్తువు శాంతిని తెలుపు తుంది. ముక్తదశలో జీవాత్మ ఏకార్యము చెయ్యడు. కనుక అక్కడ క్రియాశక్తి లేదు. ఆత్మస్వరూపమైన జ్ఞానం ముక్తిలో ఉంటుంది. జీవాత్మకు ఉండే స్వరూపజ్ఞానం లాగా కర్తృత్వం కూడా నిత్యం కాదు. విజ్ఞానం కంటే భిన్నుడైన జీవుడు కర్తగా అవడం యుక్తం. విజ్ఞానం అని చెప్పబడే బుద్దే కర్త అన్నట్లయితే, బుద్ధికి కరణ శక్తి తొలగిపోయి, కర్తృశక్తి(కర్తృత్వం) వస్తుంది. లోకంలో అన్నీ వ్యవహారాలు శక్తి మీద ఆధారపడి జరుగుతుంటాయి. ఆశక్తి అనేక రూపాలలో అంటే ఒకప్పుడు కర్తగా, ఒకప్పుడు కర్మగా, ఒకప్పుడు కరణంగా పనిచేస్తుంది. బుద్ధి కర్తృశక్తి ఉన్నట్లయితే, నేను వడుతున్నాను, నేను తింటున్నాను, నేను చూస్తున్నాను అని అహంకార పూర్వకంగా చెబుతున్నట్లు కనబడుతుంది. అంతే కాకుండా ఆ పనులు చెయ్యడానికి మరొక సాధనం కూడా అవసరమవుతుంది. కర్త ఎంత సమర్థుడైనా కరణాన్ని(సాధనాన్ని) స్వీకరించకుండా ఏ క్రియ చెయ్యలేడు. ఈవిధంగా కరణం కంటే భిన్నమైన దానిని కర్త అంటారు. ఇక్కడ పేరులోనే భేదం కాని వస్తువులో భేదం లేదు.ఆత్మ కర్త, బుద్ధి కరణం అని కొందరంటారు. బుద్దే కర్త అంటే దానికి ఒక కరణం చూపాలి. కర్త అని దేనిని భావిస్తామో అదే ఆత్మ అని భావించాలి.
సూత్రం :- 255
" సమాధ్యభావాచ్ఛ "
సమాధి అభావత్ చ :- సమాధిలో కర్తృత్వం ఉండనందు వలన అది జ్ఞానం లాగా నిత్యం కానేరదు.
భావం :- సమాధి అవస్థలో కర్తృత్వం ఉండదు కనుక అది జ్ఞానం లా నిత్యం కాదు.
వివరణ:- ఆత్మధ్యానం అంటే సమాధి అసంభవమౌతుంది. కాబట్టి జీవుడే కర్త. లోకంలో ఉన్నదంతా ఆత్మయే. ఈ ఆత్మ అందరిలో సమానంగా ఉంటుంది. సకల చరాచర సృష్టి ఆత్మ నుండే ఉద్భవించింది. చివరకు ఆత్మలోనే లయమౌతుంది అని బృహదారణ్యకం లో చెప్పబడింది. కాబట్టి జీవుడే కర్త కాని వేరేవరు కాదు. సమాధిపదంలో సమ అంటే సమానత్వం, ఆధి అంటే మొదలు. ప్రాపంచికవిషయాల్లోను, ఆధ్యాత్మికవిషయాలలోనూ సమానత్వాన్ని పొందడం, ఎవరైతే ఈయావత్ బ్రహ్మాండాన్ని సృజించారో, ఆ సృష్టి కర్తతో మమేకత్వ స్థితి పొందడమే సమాధిస్థితి. దీనిని పరమహంస యోగనంద "శ్వాస లేని స్థితిలో శబ్దంలేని స్థితి" అని వర్ణించారు. ముక్తి అంటే సంసార జీవితం లోని బాధలను అంతమోదించడానికి, జీవుడికి జన్మరాహిత్యం కలిగించడానికి ప్రధానమైనది. ముక్తిని శాస్త్రాల్లో వర్ణించారు. లౌకికంగా దానిని చూడలేము. ముక్తిలో కర్తృత్వం ఉంటుందో, ఉండదో తెలుసుకోవడం అసాధ్యం. సమాధిస్థితిలో పరమవైరాగ్యం వలన, దాని వలన కలిగే సంస్కారం వలన, చిత్తవృత్తులు, సంస్కారాలన్నీ తొలగిపోతాయి. వృత్తిలన్నూ నశించి పోవడం వలన స్వరూపాన్ని కోల్పోయి, చిత్తం ప్రకృతిలో లీనమౌతుంది. అప్పుడు జీవుడు ధ్యానస్థితిలో పరమాత్మతో ఏకత్వ అనుభూతి పొందుతాడు. ఈ స్థితినే యోగులు సమాధి అంటారు. ఈసమాధిలో జీవుడికి జ్ఞానం ఉంటుంది. కాని కర్తృత్వం ఉండదు. క్రియను కలిగించే క్రియా శక్తి ఉండదు. యోగులకు ఇది అనుభవం లోకి వస్తుంది. కనుక జ్ఞానం లాగా కర్తృత్వం నిత్యం కాదు.
తక్షాధికరణం ( 2, 3, 40 )
సూత్రం :- 256
" యధాచ తక్షోభయధా "
చ :- అలాగే, యధా :- ఎలాగ, తక్ష్ :- వడ్రంగి, ఉభయధా :- ఉలి, రంపం లాంటి సాధనాల సంబంధం తో,
భావం:- వడ్రంగి ఉలి, రంపం మొదలైన సాధనలతో చేధించడం అనే క్రియకు కర్త, వాటి సంబంధం లేనప్పుడు ఎలా అకర్త అవుతాడో, అలాగే జీవాత్మ కూడా బుద్ధి సంబంధం ఉన్నప్పుడు కర్త, బుద్ధి సంబంధం లేనప్పుడు అకర్త అవుతాడు.
వివరణ:- గురువుగారు! జీవుడే కర్త అనీ చెప్పారు కదా! మరి ఈకర్తృత్వం అనేది జీవునికి స్వాభావికమా? లేక ఉపాధిని బట్టి వచ్చిందా? అని అడిగాడు నారాయణభట్టు. సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. వడ్రంగి లాగా జీవుడు కర్త, అకర్త అవుతున్నాడు. వడ్రంగివాడు, తన సామాను తీసుకొని కర్తగా తన పని చేస్తున్నప్పుడు దుఃఖితుడౌతున్నాడు. ఆ పని మానివేసి సాధనాలన్ని వదలి వేసినప్పుడు అకర్త అవుతాడు. అలాగే ఆత్మకూడా అజ్ఞానంతో వచ్చిన మనస్సు ఇంద్రియాలతో కూడినప్పుడు కర్తగా సంసారికదుఖం అనుభవిస్తున్నాడు. అవిద్యాసాధనలన్నీ వదలి వేసినప్పుడు అకర్తయి సుఖిస్తున్నాడు. కాబట్టి ఆత్మయొక్క కర్తృత్వం ఉపాధికి సంబంధించినవే. జీవుడుకూడా బుద్ధిసత్వంతో సంబంధం ఉన్నప్పుడు లౌకిక, వైదికకర్మలు చేస్తూ కర్త అవుతాడు. సమాధి, సుషుప్తి మోక్షాల్లో బుద్ధి సంబంధం లేనందువలన జీవుడు అకర్త. వడ్రంగి, జీవాత్మ స్వరూపంలో కర్తలుకారు. సాధనసంపత్తితో ఉన్నప్పుడే కర్తలు. వాటితో సంబంధం లేనప్పుడు అకర్తలు. జీవాత్మకు జ్ఞానంలాగా కర్తృత్వం నిత్యం కాదు. అయితే జీవాత్మ కర్మలన్ని స్వయంగా చేస్తాడా? లేక పరమాత్మ ప్రేరణతో చేస్తాడా? ఈశ్వరప్రేరణతో కర్మలు చేస్తే కనక పరతంత్రుడు అవుతాడు కదా! స్వతంత్రుడు కాలేదు కదా! స్వతంత్రుడు కాకపోతే జీవుడు కర్త ఎలాఅవుతాడు? జీవుడి చేత కర్మలు చేయించడానికి రాగద్వేషాది లక్షణాలు ప్రేరేపిస్తాయి. రాగద్వేషాల ప్రేరణ వలన జీవుడు తనకి ఇష్టమైన, అయిష్టమైన కర్మలను ఆచరిస్తాడు.అప్పుడు ఈశ్వరుని ప్రేరణ ఎందుకు కల్పిస్తున్నారు? రైతుకు వ్యవసాయం చెయ్యడానికి ఎద్దులు, నాగలి అవసరం. అలా కర్మలు కావాలని ఏమిటి ఋజువు? ఋజువు లేకుండా కర్మలు చెయ్యకూడదు. ఆత్మకు కర్తృత్వం స్వాభావికం అయితే మోక్షం రావడానికి అవకాశం ఉండదు. కనుక అది స్వాభావికం కాదు. కర్తృత్వం అనేది దుఃఖరూపం గాన కర్తృత్వం నుండి విడుదల లేనివారికి పురుషార్ధసిద్ధి కలగదు. అగ్నికి దహన శక్తి ఉన్నా కూడా కర్రలు లేకపోవడం చేత దహన కార్యం ఏ విధంగా ఉండదో, అట్లే కర్తృత్వ శక్తి ఉన్నా సాధించవలసిన కార్యం లేకపోతే పురుషార్ధం సిద్ధించదు. అది యుక్తం కాదు. కర్తృత్వ శక్తి ఉంటుందని ఎప్పుడు చెప్పారో అప్పుడు కార్యం యొక్క నిమిత్తాలు కూడా శక్తి రూపంలో ఉంటాయి. కొన్ని కర్మలు చెయ్యడం వలన మానవుడు దేవత్వన్ని పొందుతాడని శాస్త్రం చెబుతుంది. మోక్షం సాధించడానికి కొన్ని సాధనలు ఆచరిస్తే మోక్షం కలుగుతుంది. ఆ శాస్త్రం చేతనే కర్తృత్వం తొలగి మోక్షం రావచ్చును కదా! అనీ కొందరి అభిప్రాయం. అది యుక్తంకాదు. ఎందువలనంటే సాధనలతో సంపాదించినది అనిత్యం అవుతుంది. నిత్యము, శుద్దము, జ్జాన స్వరూపం ముక్తం అయిన ఆత్మను ప్రతిపాదించడం వలన అనగా ఆత్మ ఇలాంటిది అని చెప్పడం వలన మోక్షసిద్ధి అంగీకరించబడింది. పరమాత్మకంటే అన్యుడైన కర్త, బుద్ధ్యాది సముదాయం కంటే భిన్నుడు, చైతన్యవంతుడు అయిన జీవుడు లేకపోతే అప్పుడు పరమాత్మయే సంసారి అనీ, కర్త అనీ, భోక్త అనీ చెప్పవలసిన వస్తుంది. కర్తృత్వ, భోకృత్వాలు విద్యావ్యవస్థలో నిషేదిస్తుంది. ఆత్మకు స్వప్న, జాగ్రదావస్థలలో ఉపాధిసంపర్కం చేత శ్రమ కలుగుతుంది అనిచెప్పి, సుషుప్తిలో పరమాత్మతో కలిసిన ఆఆత్మకు శ్రమలేనట్లు చెప్పబడు తుంది. అట్లే ముక్తవ్యవస్థలో కూడా విద్యాదీపంచేత అవిద్యాంధకారాన్ని తొలగించుకొని, కేవలం ఆత్మస్వరూపుడై, విశ్రాంతుడై సుఖంగా ఉంటాడు. తన వ్యాపారాలు చెయ్యవలసిన వచ్చినప్పుడు అవసరమైన సాధనలను తీసుకొని కర్త అవుతాడు. ఆసాధనలు లేనప్పుడు, ఏపని చెయ్యనప్పుడు అకర్త అవుతాడు. శాస్త్రం ఆత్మకు కర్తృత్వం ఉంది అని ప్రతిపాదించదు. జీవుడు బ్రహ్మస్వరూపుడు అని ఉపదేశించడం వలన వీనికి స్వాభావికంగా కర్తృత్వం లేదు అనీ చెప్పారు. అందుచేత అవిద్య చేత ప్రాప్తించిన కర్తృత్వాన్ని దృష్టిలో ఉంచుకొని విధి శాస్త్రం ప్రవర్తిస్తుంది. అవిద్య చేత ఏ విధమైన కర్తృత్వం ఆత్మకు ఉంటుందో దానిని మాత్రమే అనువర్తిస్తుంది.
సూత్రం :- 257
" పరాత్తు తచ్ఛృతేః "
తు :- అయితే, శ్రుతేః :- వేద వాక్యాల వలన, తత్ :- కర్తృత్వం, పరాత్ :- ఈశ్వరుడి ప్రేరణతో కలుగుతుందని తెలిస్తోంది. ఈ అధికరణం జీవుడి కర్తృత్వం పరమేశ్వరాధీనం అని తెలియజేస్తోంది.
భావం:- ఉపాధివలన జీవుడు కర్త అవుతున్నాడు. అయితే వేద వాక్యాల వలన కర్తృత్వం ఈశ్వరుడి ప్రేరణతో కలుగుతుందని తెలుస్తోంది.
వివరణ:- గురువు గారు! జీవుడికి ఈ కర్తృత్వం ఈశ్వరుని వలన లభిస్తోందా? లేక ఈశ్వరుని ప్రమేయం లేకుండా లభిస్తోందా? అని అడిగాడు కృష్ణశర్మ. సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. జీవుడికి కర్తృత్వం ఈశ్వరుడి వలెనే కలుగుతుంది. జీవుడు అవిద్యతో కూడి ఉన్నంత వరకు కర్తృత్వ, భోకృత్వ లక్షణాలు గల సంసారం లభిస్తోంది. అతడికి జ్ఞానం కలగగానే మోక్షం వస్తుంది. కాబట్టి జీవునికి కర్తృత్వం ఈశ్వరుని వలెనే లభిస్తుంది. ఋగ్వేదం(8,7,3,3) "య ఈశే అస్య ద్విపదః చతుష్పదః" చరాచరమైన ఈ జగత్తుకు పరమాత్మే ఈశుడు. ఆయన అదీనంలో ఈసమస్త జగత్తు ఉన్నది. ఈశ్వరుడి ప్రేరణ వలనే అచేతనాలైన సూర్యాదులు సైతం ప్రకాశిస్తున్నాయి. అలాంటప్పుడు జీవుడు నియంత అయిన పరమేశ్వరుని ప్రేరణ వలన ప్రేరితుడై, కర్మలను ఆచారిస్తాడనడం లో సందేహం లేదు. జీవుడు కర్మలను ఆచరించడంలో స్వతoత్రుడు కాకపోతే అతనికి కర్తృత్వం ఉండదా? అని సందేహం కలగవచ్చును. కర్త స్వతంత్రడే. స్వతంత్రం అంటే క్రియలను ఆచరించడంలో ప్రాధాన్యం ఉండటం. ఈప్రాధాన్యత లేకపోతే జీవుడు అకర్త, అస్వతంత్రుడు అవుతాడు. పరమేశ్వరుని ప్రేరణతతో కర్మలు ఆచరించినంత మాత్రాన జీవుడు అస్వతంత్రుడు కాడు. అతని కర్తృత్వానికి భంగం రాదు. రాగద్వేషాది విషయంలో రైతు - ఎద్దుల ఉదాహరణ పొసగదు. రైతుకు ఎద్దులు, నాగలి ఉన్నంత మాత్రాన పొలం దున్నలేడు. ఆ పని చెయ్యడానికి ఈశ్వరుని ప్రేరణ ఉండాలి. ఎద్దులు నాగలి సాధనలే కాని ప్రేరకాలు కావు. రాగద్వేషాది లక్షణాలు దోషాలు అవి ఈశ్వరునిలో లేవు. కనుక జీవుడు ఈశ్వరుడి ప్రేరణతో కర్మలు ఆచరిస్తాడు. అలాంటప్పుడు జీవుడికి విధి, నిషేధాలు విధించే శాస్త్రాలు ఎందుకు? జీవుడు కేవలం పుణ్య కర్మలే చెయ్యాలి కదా? పాప కర్మలు ఎందుకు చేస్తున్నాడు? ఈశ్వరుడు క్షేశ రూపమైన కర్తృత్వం ప్రాణులకు కలుగ జేసినట్లయితే వానికి నైర్ఘృణ్యం అంటే జాలి లేకపోవడం అనే దోషం కనిపిస్తుంది. జీవులకు విషమం ఫలాలు (మంచిచెడు ఫలితాలు ఇచ్చే) కర్తృత్వాన్ని కల్పించే ఈశ్వరునికి వైషమ్యం అనే పక్షపాత దోషం ఏర్పడుతుంది. "వైషమ్య నైర్ఘృణ్యే నసాపేక్షిత్వాన్ " ఈశ్వరనికి సాపేక్షిత్వం అనేది కుదరాలి కదా! ప్రాణులన్నింటికి ధర్మాధర్మలు ఉంటే సాపేక్షిత్వం కుదురుతుంది. జీవునికి కర్తృత్వం ఉంటే ధర్మాధర్మలు సిద్ధిస్తాయి. అప్పుడు ఈశ్వరుడు వాళ్ళ చేత కర్మలు చేయిస్తాడు. కర్మాపేక్ష లేకుండా ఈశ్వరుడు జీవుడిచేత కర్మలు చేయిస్తే, తాను చెయ్యని కర్మలకు, కర్మ ఫలాన్ని అనుభవించవలసి వస్తుంది. అందుచేత జీవుడికి కర్తృత్వం స్వయంగానే ఉంటుంది అని చెప్పాలి. అవిద్యా వ్యవస్థలో శరీరేంద్రియ సముదాయం అంటే తాను వేరైనవాడు అని తెలుసుకొనక, అవిద్య అనే తిమిరం చేత అంధుడై ఉన్న జీవునకు కర్మాధ్యక్షుడు, సకల భూతాలలో నివసించేవాడు, సాక్షి, చైతన్య స్వరూపుడు అయిన ఈశ్వరుని వలన అతని అనుజ్ఞ చేత కర్తృత్వం, భోకృత్వం లక్షణాలుగా గల సంసారం సిద్ధిస్తుంది. ఈశ్వరుని అనుగ్రహం చేతనే కలిగిన విజ్ఞానం చేత మోక్ష సిద్ధి కూడా కలుగుతుంది. అన్నీ వ్యవహారాలలో ఈశ్వరుడే ప్రేరణకర్త అని శ్రుతి వలన తెలుస్తోంది. ఎవరిని లోకంలో పైకి తీసుకొని వెళ్లాలనుకుంటాడో, వారి చేత మంచి కర్మలు చేయిస్తాడు.
సూత్రం :- 258
" కృత ప్రయత్నాపేక్షస్తు విహిత ప్రతిషిద్దా వైయర్ధాదిభ్యః "
తు :- పైగా, విహిత ప్రతిషిద్దా వైయర్ధాదిభ్యః :- వేద విహితమైన విధి, నిషేదాల ప్రామణ్యం వలన, జగత్ వైచిత్ర్యం లాంటి హేతువుల వలన, కృత ప్రయత్న అపక్ష :- విహిత కర్మలతోను, నిషిద్ద కర్మలతోను జీవుడు చేసిన ప్రయత్నాన్ని ఆపేక్షించి ఈశ్వరుడు ప్రేరణ చేస్తాడు.
భావం :- వేదవిహితమైన కర్మలు వ్యర్థం కాకుండా ఉండడానికి పరమేశ్వరుడు జీవుడి చేత కర్మలు చేయిస్తాడు.
వివరణ:- వేదాలలో చేయవలసిన విధులు, చేయకూడని పనులు, కూడా చెప్పబడ్డాయి. యాగాలు, హోమాలు, దానాలు చెయ్యాలి. సురపానం చెయ్యకూడదు. అబద్ధమాడకూడదు. ఇవి నిషేధాలు. ఈశ్వరుడు జీవుడి చేత తన ఇష్టం వచ్చినట్లు పాపపుణ్యాలు చేయించడం లేదు. శ్రుతులలో చెప్పిన కర్మలను మాత్రమే చేయిస్తున్నాడు. ఆ కర్మల ఫలితాన్ని జీవుడు మరు జన్మలో అనుభవిస్తున్నాడు. ఈ రకంగా జీవుని యొక్క కర్తృత్వం పరమేశ్వరాదీనమే అని గ్రహించాలి. రాగద్వేషాలతో జీవుడు లౌకిక, వైదిక కర్మలు చేయడానికి ప్రయత్నించినప్పుడు హృదయంలో ఉండే ఈశ్వరుడు దయతో నీవు చేసే పని చేయదగినది, చేయదగనిది అని ఎన్నో సార్లు బోధిస్తాడు. దీనినే భగవత్ ప్రేరణ అంటారు. ఇది చాలా మందికి అనుభవం లోకి వస్తుంటుంది. మంచి పని చెయ్యడానికి, చెడు పని చేయకుండా ఉండటానికి ఈశ్వరుడి బలవంతం ఏమి ఉండదు. అలా చేస్తే కర్మలు చేయడానికి జీవుడికి స్వాతంత్రం ఉండదు.భగవత్ ప్రేరణ కేవలం ఆయన ఇష్టాన్ని సూచిస్తుంది.
మనుస్మృతి:-(8,92):- యమో వైవస్వతో దేవో. గంగామ్ మాకురూన్ గమః " నీవు చేయవలసిన కార్యాన్ని నీ హృదయంలో ఉన్న కరుణామయుడైన దేవుడు అంగీకరిస్తే దాన్ని కర్తవ్యమని, అంగీకరించకపోతే అది నిషిద్దమని తెలుసుకో! ఒక రాజ్యం లో రాజు నిబంధనలను పాటిస్తూ ప్రజలు స్వతంత్రంగా కర్మలు చేస్తూ ఉంటారు. అదే విధంగా పరమాత్మ నియంత్రణలో ఉన్నా జీవుడు పరమాత్మ ప్రేరేపితుడైనా, స్వతంత్రుడైన లౌకిక వైదిక కర్మలు చేస్తూ, వాటి వలన వచ్చే కర్మ ఫలాలను సుఖదుఃఖరూపంలో అనుభవిస్తాడు. జీవుడు కర్మలు చెయ్యడంలో స్వతంత్రుడు. వాటి ఫలం అనుభవించడంలో పరతంత్రుడు. కనుకనే విధినిషేధ శాస్త్రాలు ఉన్నాయి. ఇదే జగత్ వైచిత్యం. భగవంతునికి పక్షపాతాది దోషాలు అంటవు. ఈ దోషలన్ని కర్మానుష్టానంలో జీవుడు పరతంత్రుడైనప్పుడు మాత్రమే సంభవిస్తాయి.
కౌశీతకి బ్రాహ్మణం:-(3,8):-పరమేశ్వర ప్రేరణానుకూలంగా కర్మలు చేసేవాడు ఊర్ధ్వలోకాలు పొందుతాడు. ప్రేరణకు విరుద్ధం గా అసాధుకర్మలు చేసేవాడు అధో లోకాలకుపోతాడు. దీని వలన జీవుడు కర్మలు చెయ్యడంలో స్వతంత్రుడు, వాటి ఫలాలు అనుభవించడంలో పరతంత్రుడు అయినప్పటికీ జీవుడి కర్మానుష్టాన స్వతంత్రానికి ఎలాంటి హాని కలుగదు.
ఋగ్వేదం:- (1,5,6,24):-"తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్యధీమహి, ధీయోయోనః ప్రచోదయాత్" భక్తుడు ఈ విధంగా గాయత్రీ మంత్రంతో భగవంతుని ప్రార్ధిస్తాడు. ఆ అనుగ్రహం వలన పాపాలు తొలగిపోతాయి. ఈశ్వరుడు కర్మానుష్టానంలో జీవుడికి ప్రేరణ కలిగిస్తాడు. ఈశ్వరుడు మేఘం వలె కేవలం నిమిత్త మాత్రంగా ఉండి జీవుడు చేసిన ధర్మాధర్మాల వైషమ్యాన్ని ఆధారంగా చేసుకొని ఆయా ఫలాలను విషమంగా విభజిస్తాడు. లోకంలో తమ తమ బీజాల నుండి పుట్టే నానావిధాలైన గుచ్చాలు, పొదలు, యవలు, మొదలైన వాటికీ కూడా మేఘం అన్నింటిని సమమైన దృష్టితో వర్షిస్తుందో, అదే విధంగా ఈశ్వరుడు జీవుడు చేసిన ప్రయత్నాన్ని ఆపేక్షించి వాళ్లకు శుభాశుభాలు సమకురుస్తాడు అని చెప్పడం సమంజసంగా ఉంటుంది. వాటికీ సంబంధించిన బీజాలు లేకపోయినా, మేఘం లేకపోయినా వాటి ఆకులు, పుష్పాలు, రసం లో వైషమ్యం ఉండదు కదా! జీవుని కర్తృత్వం ఈశ్వరుని మీద ఆధారపడి ఉంటే జీవుడు చేసిన ప్రయత్నాన్ని ఆపేక్షించడం అనేది కుదరదు కదా! అని సందేహం. కర్తృత్వం ఇతరుని మీద ఆధారపడి ఉన్నా కూడా, జీవుడు కర్మలు చేస్తూనే ఉన్నాడు కదా! చేస్తున్న ఆ జీవుని చేత ఈశ్వరుడు చేయిస్తున్నాడు.జీవుడు పూర్వం చేసిన ప్రయత్నాన్ని ఆపేక్షించి ఇప్పుడు చేయిస్తున్నాడు. అంతకు ముందు చేసిన ప్రయత్నాన్ని ఆపేక్షించి పూర్వంచేయించాడు .
అంశాధికరణం ( 2, 3, 43 )
సూత్రం :- 259
" అంశో నానావ్యపాదేశా ధన్యధా చాపి దాశకితవాదిత్వ మధీయత ఏకే "
నానా వ్యపదేశాత్ :- అనేక రకాలుగా ఉపదేశించడం వలన, అంశః :- జీవాత్మ బ్రహ్మనికి అంశం. అన్యధా అపిచ :- వేరే విధంగా కూడా చెప్పడం వలన, దాశ కితవాదిత్వం :- స్త్రీ పురుషాది భావం ఉన్నాదని, ఏ కే :- కొందరు, అదీయత్ :- తలపోస్తారు.
భావం :- అనేక రకాలుగా ఉపదేశించడం వలన, జీవాత్మ బ్రహ్మనికి అంశం. వేరే విధంగా చెప్పడం వలన స్త్రీ పురుషాది భావం ఉన్నదని కొందరు తలపోస్తారు.
వివరణ:-ఈఅధికరణంలో బ్రహ్మతో జీవికి గల సంబంధం గురించి చెప్పబడింది. తండ్రి కొడుకులకు అంశ, అంశీ భావం ఉన్నది. కుమారుడు అంశం అయితే, తండ్రి అంశీ అవుతాడు. అలాగే జీవబ్రహ్మల సంబంధం ఉన్నదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఋగ్వేదం:-(6,7,21,11):- "త్వంహి నః పితావసో యోనః పితా జనితాయో విధాతో " నీవే మా జనకుడివి, భర్తవు, వీటి వలన జీవులకు ఈశ్వరుడు పిత అనీ తెలుస్తోంది. ఆయన మనకు తండ్రి లాంటి వాడని భావం. జీవికి ఈశ్వరుడికి భేదం చెప్పినా, చెప్పకపోయినా కూడా జీవుడు ఈశ్వరుని అంశమే. వేదాలలో కొన్ని చోట్ల వీరి సంబంధం అగ్నికి, నిప్పు రవ్వలకు ఉండే సంబంధంగా చెప్పాయి. ఛాందోగ్యోపనిషత్తు:-ఉద్దాలకుడు ఆత్మజ్ఞానాన్ని తన కుమారుడైన శ్వేతకేతువునకు బోధిస్తూ, జీవులు వాటి రూపాలు, నామాలు పోగొట్టుకుంటాయి. అవిఅన్నీ ఏతత్వంతో కలసిపోతాయో అదే బ్రహ్మ, అది అద్వితీయ మైనది. సూక్షమైనది, సర్వవ్యాపకమైనది. కాబట్టి ఆత్మ, పరమేశ్వరుడు రెండు ఒక్కటే. ఐతరేయపనిషత్తు :- పరమేశ్వరుడు ఇంద్రియాలతో కూడిన మానవ శరీరంలో బ్రహ్మరంద్రం గుండా ప్రవేశ్నించాడు అని చెప్పబడింది. కనుక పరమాత్మయే జీవాత్మరూపంలో ఉన్నది. ఈరకంగా భేదం చెప్పడం వలన ఉపాధి వలన కలిగిన భేదం కలవాడై జీవాత్మ పరమాత్మ యొక్క అంశం లాగా ఉన్నాడు. అంశ -అంశీ భావంలో జీవుడు ఈశ్వరుడిలో ఒక భాగం అనుకోకూడదు. ఈశ్వరుడిలో బాగాలు లేవు. ఆయన అఖండం. ఇక్కడ అంశ అంటే సముదాయాలలో ఒకటి. కాగా, అనేక జీవసముదాయం ఈశ్వరుడు కాదు. అలా అన్నట్లయితే జీవుడికి దుఃఖాలన్నీ ఉంటాయని చెప్పవలసిన వస్తుంది. అవిభక్తంగా సజాతీయంగా ఉండటమే అంశ. చైతన్యమే ఇద్దరికీ సజాతి లక్షణం. జీవేశ్వరులిద్దరూ చేతనాలు. ప్రళయకాలంలో జీవుడు ఈశ్వరుడిలో అవిభక్తంగా ఉంటాడు. ఇదే అంశ-అంశీ భావం. లోకంలో తండ్రి కొడుకులది కూడా అంశాంశీ భావమే. కొడుకు మాతృగర్భం చేరక ముందు తండ్రితో అవిభక్తుడై ఉంటాడు. తరువాత తల్లి గర్భం చేరి వేరేవుతాడు. ఇదే భేద-అభేద వాదం. జీవేశ్వరుల మధ్య ఉపకార్యోపకారక భావం అంటే జీవుడు ఉపకార్యుడు. ఈశ్వరుడు ఉపకారం చేసేవాడు అని చెప్పబడింది. లోకంలో స్వామిభ్రత్యులు, అగ్ని విస్పులింగాల వలె కలసిఉన్నవాటికే ఉపకార్యోపకార భావం కనబడుచున్నది. జీవేశ్వరుల బంధం స్వామి భ్రత్యు సంబంధమా? లేక అగ్నివిస్పులింగాల సంబంధమా? అని సందేహం వస్తే ఏదైనా చెప్పవచ్చును. స్వామి భృత్యుల సంబంధంలో ఈశిత్రీశితవ్య భావం అంటే అధికారం చేసేవాడు, అధికారానికి లొంగి ఉండేవాడు అనే సంబంధం కనిపిస్తుంది. కనుక ఈసంబంధం అలాంటిదే కావాలి. అందువల్ల అంశః అని అంటున్నారు. విస్ఫలింగం అగ్ని యొక్క అంశమైనట్లు, జీవుడు ఈశ్వరుడి అంశంగా ఉండటమే తగిఉంటుంది. ఇక్కడ అంశం అనగా అంశం వంటిది అనీ అర్ధం. అవయవరహితమైన ఈశ్వరునికి అంశం అంటూ ఉండదు కదా! ఈశ్వరుడు అవయవరహితుడవడం చేత జీవుడే ఈశ్వరుడు ఎందుకు కాకూడదు? నానావ్యపదేశం అనగా భేదం చెప్పడం వలన. ఈ అంశాంశీ భావంలో కంటే స్వామిభ్రత్యు సాదృశ్యం లో బాగా కుదురుతుంది కదా! అనే సందేహం. దానికి సమాధానం చెబుతున్నారు. "అన్యధా చాపీతి " కేవలం నానా వ్యపదేశాన్ని మాత్రమే కారణంగా తీసుకొని అంశత్వం తెలిబడటం లేదు. మరొక విధంగా కూడా వ్యపదేశం ఉంది. బ్రహ్మదాసులు, కైవర్ణులు (చేపలు పటేవారు), జూదరులు, అందరు కూడా బ్రహ్మయే. బ్రహ్మయే సమస్త రూపాలను విస్తరించి, పేర్లను కల్పించి వ్యవహారిస్తోంది. ఆ బ్రహ్మను తెలుసుకున్నవాడు విద్వాoసుడు అనీ చెప్పబడింది. జీవేశ్వరుల మధ్య భేదం, అభేదం కూడా తెలియబడుచున్నాయి. కనుక జీవుడు ఈశ్వరుని అంశ అనీ తెలుస్తోంది.
సూత్రం :- 260
" మంత్రం వర్ణాచ్ఛ "
చ :- పైగా, మంత్రవర్ణాచ్ఛ :- వేదమంత్రాలు జీవుడు బ్రహ్మనికి అంశం అంటున్నాయి.
భావం :- వేద మంత్రాల వలన జీవుడికి బ్రహ్మ యొక్క అంశత్వం ఉన్నదని తెలుస్తోంది.
వివరణ:- జీవుడికి ఈశ్వరుడి అంశత్వం ఉన్నదని మంత్రంవలన తెలుస్తుంది. ఋగ్వేదం (8,14,17,3) :- చరాచరాత్మక మైన ఈజగత్తంతా ఈశ్వరుడికి ఒక పాదం. అంశం భాగం కాగా, బ్రహ్మ నిరంశం. ఈ అంశం వ్యవహారం గౌణమే. ప్రధానమైన అర్ధం కాదు. బ్రహ్మలో భాగాలు ఉండవు. కనుక జీవుడు అంశంలాంటి వాడే కాని భాగం కాదు. చాందోగ్యోపనిషత్తు:- గాయత్రీ ద్వారా బ్రహ్మోపాసన తెలియజేస్తూ, పృధివిరూపమైన గాయత్రీ, శరీరంలో ఉండే పంచభూతాలు, ఇంద్రియసమూహాలు అన్నీ ఒక్కటే. పురుషుని శరీరకమైన గాయత్రీ, పురుషుని హృదయకమలంలో ఉండే పురుషుడు ఒక్కటే. ఆపురుషునిలోనే అంటే గాయత్రీలోనే ప్రాణాలు ప్రతిష్టితమై ఉన్నాయి. శుద్ధ బ్రహ్మ, కార్యక్రమం బ్రహ్మ కన్నా గొప్పది, పాంచభౌతికమైన జగత్తంతా శుద్ధబ్రహ్మ యొక్క ఒకపాదమే. మిగిలిన మూడుపాదాలు ఆ పరబ్రహ్మలోనే ఉన్నాయి. గాయత్రీ ద్వారా ప్రతిపాదించబడి, మూడు పాదాలు గల అమృత స్వరూపమైన బ్రహ్మము ఇదే. ఈ మంత్రం జీవుని యొక్క అంశత్వాన్ని తెలియజేస్తుంది. "గయాన్ త్రాయతే ఇతి గాయత్రి" అని ఆదిశంకరులవారు తన భాష్యంలో వివరించారు. గయలు అనగా ప్రాణాలు, త్రాయతే అనగా రక్షించడం. గాయత్రీ మంత్ర జపం వలన జీవుడు చేసే పాపాలను నాశనం చేసి, దీర్ఘాయువును కలిగిస్తుంది. జన్మ మరణ బంధముల నుండి విముక్తి కలిగించి, ముక్తిని పొందడానికి, బ్రహ్మను సాక్షాత్కరింప జేసుకోవడానికి మూల కారణమౌతుంది. సద్భుద్ది నీచ్చే మంత్రం, కామరుచి నుంచి తప్పించి రామరుచి వైపు నడిపించే మంత్రం. పవిత్రమైన ఆత్మయే పరిశుద్ధమైన శరీరమును నిర్మించగలదు. భర్గః అంటే శుద్ధ స్వరూపుడు, పాప రహితుడు హృదయంలో ఉండే ఆత్మతో ఎక్కమయ్యేది బ్రహ్మమే. " తావా నస్య. దీవి " అనే మంత్రం కూడా ఈ విషయాన్నే చెప్పు చున్నది. ఇక్కడ భూత శబ్దం జీవుడు ప్రధానంగా గల స్థావర జంగమాలను నిర్దేశిస్తుంది. కాని పంచ భూతాలను కాదు.
అంశాధికరణం ( 2, 3, 45 )
సూత్రం :- 261
" అపిచ స్మర్యతే "
స్మర్యతే :- స్మృతులు, చ :- కూడా, అపి,:- అలాగే అంటున్నాయి.
భావం:- జీవేశ్వరుల మధ్య అంశాంశీ భావం ఉంటుందని స్మృతి అంటున్నాయి. అయితే జీవుడికి ఉండే క్లేశాలు ఈశ్వరుడికి కలుగుతాయా?
వివరణ:-భగవద్గీతలో "మమైన. సనాతనః" సనాతనమైన నాఅంశమే జీవలోకంలో జీవుడిగా అయినదని, జీవుడు ఈశ్వరాంశ 00000000అనే విషయం చెప్పబడింది. ఈశిత్రీశితవ్యభావం (అధికారం చేసేవాడు, అధికారికి లొంగిఉండేవాడు) స్వామి భృత్యాదులలోనే ప్రసిద్ధంగాఉంది అని చెప్పబడింది. లోకంలో ఈప్రసిద్ధిఉన్నా కూడా ఇక్కడ శాస్త్రాన్ని బట్టి అంశాంశిత్వం, ఈశిత్రీశిత స్వభావం కూడా ఉన్నట్లు నిశ్చయింబడింది. అంశాంశీ భావం (అంశ అంటే జీవాత్మ, అంశీ అంటే పరమేశ్వరుడు), ఈశిత్ర-ఈశితవ్య భావం (ఈశ్వరుడు అధికారం చేసేవాడు, జీవుడు ఈశ్వరుడికి లొంగి వుండేవాడు) రెండు కూడా ఉన్నట్లు శాస్త్రం లో చెప్పబడింది. అంశాంశీభావం ఉన్నా కూడా మాయచేత, అవిద్యచేత హీనమైన ఉపాధితో కూడిన జీవులను ఈశ్వరుడు శాసిస్తున్నాడని చెప్పడంలో విరోధం లేదు. జీవుడికి ఉండే క్లేశాలు ఈశ్వరునికి అంటవు.
సూత్రం :- 262
"ప్రకాశాది వన్నైవం పరః "
ప్రకాశాదివత్ :- ఇంద్రియాలకు హాని కలిగినా, సూర్యాదులకు ఎలాంటి ఇబ్బంది లేనట్టుగా, ఏవం :- జీవుడికి క్లేశం, కర్మలు ఉన్నా, పరః:- పరబ్రహ్మకు, న:- ఎలాంటి క్లేశాలు ఉండవు.
భావం:- ఇంద్రియాలకు హానికలిగినా, సూర్యాదులకు ఎలాంటి ఇబ్బంది లేనట్లుగానే, జీవుడికి క్లేశం, కర్మలు ఉన్నా పరబ్రహ్మకు ఎలాంటిక్లేశాలు ఉండవు.
వివరణ :- జీవాత్మ అనుభవించే సుఖదుఃఖాలు పరమేశ్వరుడికి కూడా కలుగుతాయా? అనే సందేహం వస్తుంది. అయితే జీవాత్మ దుఃఖం అనుభవించినట్లుగా పరమాత్మ అనుభవించడు. సూర్యుని వెలుతురుకు చెయ్యి అడ్డుపెడితే సూర్యకాంతి వంకరగా పడుతుంది. అంతే తప్ప వంగదు. అలాగే ఖాళీ కుండలో ఆకాశం ఉంది. ఆకుండని ఒక చోటు నుంచి మరొక చోటుకి తీసుకు వేడితే కుండతో బాటు ఆకాశాన్ని తీసుకుపోనవసరం లేదు. కంటికి అలా కనబడుతుంది. అంతే కాని నిజంగా ఆకాశం తీసుకుపోబడదు. అలాగే జీవుడు పరమేశ్వరుని అంశ అయినప్పటికీ జీవుని సుఖదుఃఖాలు పరమేశ్వరునికి అంటవు. ఎందుకంటే జీవుడికి దుఃఖం కూడా ఉపాధికి సంబంధించినదే. జీవుడు ఏవిధంగా సంసారదుఃఖాన్ని అనుభవిస్తాడో, ఆవిధంగా ఈశ్వరుడు అనుభవించడు. జీవుడు అజ్ఞానంతో దేహాదులే ఆత్మ అనే భావం పొందుతూ, వాటికి కలిగిన దుఃఖం తనకే కలిగిందనుకుంటూ, అవిధ్యాకృతమైన దుఃఖాన్ని తన మీద పెట్టుకుంటాడు. జీవుడికి నామరూపాలచేత ఏర్పడిన దేహేంద్రియ మనోబుద్ధులు వేరు అని తెలియక పోవడం చేత దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. అది బ్రహ్మ చేత ఏర్పడినదే కాని పారమార్ధికం కాదు. దేహానికి సంబంధించిన బాధలు కాలడం, చేధించడం మొదలైన వాటి వలన కలిగే దుఃఖం ఎలా అనుభవిస్తున్నాడో, పుత్ర మిత్రాదులకు కలిగిన దుఃఖానికి వాళ్ళ యందు అభిమానమనే భ్రాంతి చేతనే నేనే పుత్రుణ్ణి, నేనే స్నేహితుడను అని వారిపై అభిమానం పెంచుకొని, ఆదుఃఖాలనుకూడా తానే అనుభవిస్తున్నాడు. అందువలన దుఃఖభావం మిత్రాభిమాన భ్రమచేత ఏర్పడినందని స్పష్టంగా తెలుస్తోంది. వ్యతిరేకం కనబడటం అంటే అభిమానం లేనప్పుడు దుఃఖం కలగకపోవడం వలన కూడా, కొంతమంది పరివ్రాజకులకు దుఃఖం కలగదు. పుత్రమిత్రాదులతో సంబంధం, అభిమానం ఉన్నా కొంతమంది ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు, ఫలానా పుత్రుడు మరణించాడు, ఫలానా మిత్రుడు మరణించాడు అని ఎవరో వచ్చి చెప్పినప్పుడు వారితో సంబంధం ఉన్నవాళ్లకి దుఃఖం కలుగుతుంది. అలాంటి అభిమానం లేని పరివ్రాజకులకు ఎటువంటి దుఃఖం కలగదు. అందుచేత లౌకికుడైన పురుషునికి సమ్యక్ దర్శనం కనబడుతుంది. అలాంటప్పుడు ఏవిషయంలోనూ సంబంధం లేని స్వస్వరూపం కంటే భిన్నమైన మరొక వస్తువును చూడని నిత్య చైతన్య స్వరూపుడైనా పరమేశ్వరునికి ఈక్లేశాదులన్నీఅంటవు. అందుకే ప్రకాశాదివత్ అనీ నిదర్శనం చూపబడింది. సూర్యుడు అంశ-కన్ను అంశం, ఆకాశం అంశి- చెవి అంశం, వాయువు అంశి- చర్మం అంశం. కళ్ళు మొదలైన ఇంద్రియలకు సంభవించే దోషాలు సూర్యాదులకు అంటవు. అలాగే అంశం అయిన జీవుడికి ఉండే క్లేశాదులు అంశ అయినా ఈశ్వరునికి అంటవు. అందుకే ఈశ్వరుడు దుఃఖించడు. తత్వమసి మొదలైన వేదాంతాలు జీవునకు అవిద్యచేత ఏర్పడిన జీవత్వాన్ని తొలగించి బ్రహ్మత్వాన్ని ప్రతిపాదిస్తాయి. అందువలన జీవునకు సంబంధించిన దుఃఖం చేత ఈశ్వరునకు దుఃఖం కలిగే ప్రసక్తి లేదు.
సూత్రం :- 263
" స్మరంతి చ "
చ :- అనేక శాస్త్రలు, స్మరంతి :- కూడా అంటున్నాయి.
భావం :- జీవగుణ దోషాలు ఈశ్వరునికి వర్తించవు అనీ అనేక శాస్త్రాలు అంటున్నాయి.
వివరణ :- జీవుని దుఃఖం వలన పరమాత్మ దుఃఖితుడు కాదు. పరమాత్మ నిత్యుడు, నిర్గుణుడు. కర్మలను అనుభవించే జీవుడు తిరిగి తిరిగి జన్మలు ఎత్తుతూ ఉంటాడు.
యోగ దర్శనం :- "క్లేశ కర్మ విపాకాశై రపరామృష్టః పురుషః విశేషః ఈశ్వరః " క్లేశం, కర్మలు, కర్మ ఫలాలు వీటితో బంధితుడు కాని విశేష పురుషుడే ఈశ్వరుడు.
కఠోపనిషత్తు:-(5-11):-సర్వలోకానికి నేత్రమైన సూర్యుడు లోకుల నేత్రదోషాలతో సంబద్ధుడు కాడు. అలాగే సర్వ భూతాంత రాత్మ అయిన ఈశ్వరుడు ప్రాణుల దుఃఖాలతో లిప్తుడు కాక, స్వస్వరూపంతో ప్రకాశిస్తూ ఉంటాడు. కనుక జీవేశ్వరులకు అంశాంశీభావ సంబంధం ఉన్నా జీవుల సుఖ దుఃఖలతో ఈశ్వరుడికి ఎలాంటి సంబంధం ఉండదు. కాగా అంశాంశీ సారూప్యం ఉన్నప్పుడు విధినిషేధాలు జీవునికి ఎందుకున్నాయి? ఆ ఇద్దరిలో పరమాత్మ నిత్యుడు, నిర్గుణుడు, ఉదకం చేత తామరాకు వలె ఫలములచేత కూడా లిప్తుడుకాడు. రెండవవాడు జీవుడు మాత్రం కర్మప్రధానుడు, మోక్షంతోను, బంధాలతోను సంబంధించి ఉంటాడు. ఐదు జ్ఞానేoద్రియలు, ఐదు కర్మేంద్రియాలు ,ఐదు ప్రాణాలు, మనస్సు, బుద్ధి అనే 17 తో కూడి ఉంటాడు. ప్రకాశింపజేయుబడుచున్న పదార్ధాల దోషాల చేత సూర్యుడు ఏవిధంగా లిప్తుడు కాడో, అట్లే సర్వ భూతాంతరాత్మయైన పరమేశ్వరుడు సంగరహితుడై లోకం యొక్క దుఃఖం చేత లిప్తుడు కాడు.
సూత్రం :- 264
" అనుజ్ఞా పరిహారౌ దేహ సంబంధాత్ జ్యోతిరాదివత్"
"జ్యోతిరాదివత్:- అగ్ని, జలానికి ఉన్నట్లుగా, అనుజ్ఞాపరిహారౌ:- విధినిషేధాలు, దేహసంబంధాత్ :- జీవుడికి దేహ సంబంధం ఉన్నందు వలన, అతనికి వర్తిస్తాయి.
భావం:-అగ్ని, జలం మొదలైన వాటివలె జీవుడు దేహంతో తాదాత్మ్యం చెందటం వలన విధినిషేధాలు సంభవమౌతున్నాయి.
వివరణ:- వేదం చదవండి, అగ్నిహోత్రం చెయ్యండి లాంటి విధులు, గోవులను, గొర్రెలను హింసించకండి లాంటి నిషేధాలు, దేహసంబంధం ఉండటంవలన జీవుడికి శాస్త్రాలు విధించాయి. అగ్ని, జలం లాంటి విషయంలో ఇలాంటి నిషేధాలు ఉన్నాయి. మంచిగృహస్థు ఇంటి నుంచి నిప్పు తెచ్చుకోవాలి. శ్మశానం నుంచి తేరాదు. ప్రవహిస్తున్న నది నుంచి నీటిని తెచ్చుకోవాలి. నిలవనీటిని, కలుషితజలాన్ని వాడరాదు. జీవుడికి సత్తా, చైతన్యం లాంటి గుణాల వలన ఈశ్వరుడితో పోలిక ఉన్నా, అతనికి శరీర సంబంధం ఉన్నందువలన విధినిషేధాలు ఉన్నాయి. ఈశ్వరుడికి లేవు. ఈశ్వరుడు ఒక్కడే అయినా దేహసంబంధం వలన అనేక రూపాలు పొందుతున్నాడు. జ్యోతిస్సు వలె దేహధ్యాహ్నం వలన అనుజ్ఞా పరిహారాలు కుదురుతాయని సూత్రానికి అర్ధం. ఋతుకాలంలో భార్యను పొందవచ్చును అని అనుజ్ఞ. గురుభార్యను పొందకూడదు అని పరిహారం. అగ్ని, సోమయాగానికి సంబంధించిన, సోమదేవత కొరకు పశువును చంపవచ్చును అని అనుజ్ఞ. ఏ ప్రాణిని హింసించకూడదు అని పరిహారం. ఇట్లే లోకంలో మిత్రుని చేరవచ్చును అనీ అనుజ్ఞ. శత్రువుకు దూరంగా ఉండాలి అని పరిహారం. ఆత్మ ఏకమే అయినా కూడా ఈవిధమైన అనుజ్ఞా పరిహారాలు ఆత్మకు దేహసంబంధం ఉండటం వలన కుదురుతాయి. దేహసంబంధం అంటే ఏమిటి? ఈదేహమే నేను అనే ఆత్మ విషయంలో విపరీతజ్ఞానమే దేహసంబంధం. నేను వెడుతున్నాను, నేను వస్తున్నాను, నేను అంధుడను కాను, నేను మూఢుడను. ఈమాటలు ప్రాణులందరిలో వినబడతాయి. దీనిని నివారింపదగినది సమ్యక్ దర్శనం తప్ప మరేది కాదు. అవిద్యతో కూడిన దేహాద్యుపాధులతో సంబంధం చేత ఆత్మ, జీవుడు ఒక్కటేనని అంగీకరించినా కూడా అనుజ్ఞా పరిహారాలు కుదురుతాయి. సమ్యక్ దర్శనం ఉన్నవానికి తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించే ప్రసక్తి లేదు. అన్ని వృత్తులకు మూల కారణం దేహభిమానం. అది సమ్యక్ దర్శికి లేదు. అందువలన జ్యోతిరాదుల విషయంలో వలె జీవునకు దేహ సంబంధం వల్లనే అనుజ్ఞా పరిహారాలు ఏర్పడతాయి. జ్యోతిస్సు ఒక్కటే అయినా మాంసం తినే అగ్ని(శ్మశానాగ్ని) ఏవిధంగా పరిహారించబడుతుందో ఇతరమైన అగ్ని పరిహారించబడదో, ఒకే సూర్యుని ప్రకాశం అమేధ్యం పై ఏవిధంగా పరిహారించ బడుతుందో, పరిశుభ్రమైన ప్రదేశంలో ఉన్నది పరిహరించబడదో, భూమియొక్క ప్రదేశాలే అయినా వజ్రవైడూర్యాలు ఏవిధంగా గ్రహీంపబడతాయో, భూమికి సంబంధించినవే అయినా కూడా నరకళేబరాలు పరిహారించబడతాయో, గోమూత్రం, గోమయం ఏ విధంగా పవిత్రమని గ్రహింపబడతుందో, ఇతర జాతికి సంబంధించినవి పరిహారంపబడతాయి.
సూత్రం :- 265
"అసంతతే శ్చా వ్యతిరేకః "
అసంతతే :- జీవుడు అవికారి కావడం వలన, అవ్యతికరః :- అవికారి అయిన బ్రహ్మానికి అంశమే.
భావం :- దేహ సంబంధం జీవుడికి వికారం కలిగించదు. జీవుడు అవికారి అయినా బ్రహ్మానికి అంశమే.
వివరణ:- జీవాత్మకు అన్ని శరీరాలతో సంబంధం ఉండదు. కాబట్టి కర్మఫల సంకరం ఉండదు. ఒక శరీరంలోని జీవాత్మకు వేరొక శరీరంలోని జీవాత్మకు సంబంధం లేదు. అందుచేత చేసే కర్మలు, వాటి ఫలితములలో కూడా సంబంధం ఉండదు. ఒకరి ఫలాన్ని ఇంకొకరు అనుభవించడం కుదరదు. జీవుడు కూటస్థుడు, నిత్యుడు, అవికారి. శరీర సంబంధం జీవుడికి నైమిత్తికం, స్వాభావికం కాదు. మిధ్యా జ్ఞానం వలన జీవుడికి ప్రాకృతిక పదార్ధాలతో సంబంధం ఏర్పడుతోంది. ఈశ్వరుడికి అలాంటి సంబంధం లేదు. జీవుడికి సుఖదుఖాలు ఉంటాయి. నిర్వికారి కావడం వలన జీవేశ్వరులకు అంశాంశీ భావం ఉన్నది. వేరువేరు స్థూల దేహాలనే ఉపాధులను బట్టి జీవులు వేరవడం చేత అనుజ్ఞా పరిహారం కుదిరినా, ఆ స్థూల దేహాలు నశించిన తరువాత అనుభవించవలసిన పుణ్య పాపాల విషయంలో సాంకర్యం కలుగుతుంది కదా! ఒక జీవుని కర్మ ఫలం మరొకనికి లేదా మొత్తం అన్ని ఫలాలు ఒక్కటే అని చెప్పబడే ఆత్మకు చెందవలసి వస్తాయి కదా! అని పృచ్చకుని అభిప్రాయం. స్థూల దేహాలు నశించినా బుద్ధి రూపమైన ఉపాధి మోక్షం కలిగే వరకు వెన్నంటుతూనే ఉంటుంది. జీవ భేదం కొనసాగుతూనే ఉంటుంది. కనుక సాంకర్యం లేదని భావం.
సూత్రం :- 266
" ఆభాస ఏవచ "
ఆభాస :- జీవాత్మకు కలిగే సుఖ దుఃఖలు, ఏ వచ :- కేవలం ఆభాసే.
భావం :- జీవుడికి కలిగే సుఖ దుఃఖాలు కేవలం ఆభాసే.
వివరణ:- జీవుడికి కలిగే సుఖదుఃఖాలు కేవలం ఆభాసే. సుఖదుఃఖాలు బుద్ధికి సంబంధించినవి. బుద్ధితో భాసించి, తాదాత్మ్యం పొందటం వలన జీవుడుకి కలుగుతాయి. ఇవి జీవుడికి స్వాభావికం కాదు. కేవలం ఆభాస మాత్రమే.( వాస్తవంగా అది కనబకపోయినా అదిగా కనబడేది ఆభాసే ). జీవుడు పరమేశ్వరుని ప్రతిబింబం. ఆకాశంలో కనిపించే సూర్యుడు, భూమి మీద నీటిలో కనిపించే సూర్యుని ప్రతి బింబం ఒకటి కాదు. రెండు వేరు వేరు. పది కుండలలో నీరు ఉన్నప్పుడు, అన్నింటిలో సూర్యుని ప్రతిబింబం కనిపిస్తూనే ఉంటుంది. వీటిలో ఒక కుండను కదిపినట్లయితే అందులోని ప్రతిబింబం మాత్రమే కదులుతుంది. అన్ని కుండ లలోని ప్రతి బింబం కదలదు. అలాగే ఒక జీవి చేసిన కర్మకు అతడే అనుభవించాలి. అంతే కాని వేరొక శరీరంలో ఉన్న జీవి అనుభవించడు. జలంలో ప్రతిబింబించిన సూర్యుని వలె ఈ జీవుడు పరమాత్మ యొక్క ఆభాస మాత్రమేనని గ్రహించాలి. అంతే కాని సాక్షాత్తు పరమేశ్వరుడే కాదు. పరమేశ్వరుని కన్నా భిన్నమైన మరొక వస్తువు లేదు. ఒక కుండలోని సూర్య ప్రతిబింబం కదులుతు వేరొక దానిలో కదలనట్లుగా, జీవునకు కర్మ ఫలంతో సంబంధం ఉన్నా కూడా మరొక జీవుని కర్మఫలంతో సంబంధం ఉండదు. అభాస (జీవుడికి కలిగే సుఖదుఃఖాలు) అవిద్యాకల్పితమే గాన దానికి ఆశ్రయమైన సంసారం కూడా ఆవిధ్యాకృతమే. ఆ ఆభాసరూపాన్ని నిరాకరించి, పారామార్థికమైన బ్రహ్మభావాన్నీ ఉపదేశించడం కూడా ఉపపన్నం అవుతుంది. ఎవరి మతంలో ఆత్మలు అనేకములో, అంతటా వ్యాపించి ఉన్నాయో వాళ్ళ మతంలోనే ఈవ్యతిరేకం ప్రాప్తిస్తుంది. సాంఖ్యమతం:- ఆత్మలు అసంఖ్యకములు. విభువులు అంటే సర్వవ్యాప్తములు, చైతన్య స్వరూపములు, నిర్గుణములు, నిరతిశయములు, (ఏ విధమైన విశేషాలు లేనిది). ఆఆత్మలన్నింటికి సాధారణమైనది ప్రధానం. అణుప్రమాణం గల అచేతనాలైన మనస్సులు ఆఆత్మలకు సాధనలుగా ఉంటాయి. ఈ ఆత్మద్రవ్యాలు, మనో ద్రవ్యాలు కలవడం చేత ఇచ్చ మొదలైన తొమ్మిది గుణాలు ఆత్మలో పుడతాయి. ఆ గుణాలు వ్యతిరేకం లేకుండా ఏ ఆత్మకు సంబంధించినవి ఆఆత్మతో సమవాయసంబంధం కలిగి ఉంటాయి. అదే సంసారం. ఈ తొమ్మిది గుణాలు తొలగిపోతేనే మోక్షం అనీ కాణాదులు అంటారు. సాంఖ్యులమతంలో అన్నీ ఆత్మలు చైతన్యరూపాలే గాన ఒకే దేహంలో అన్నీ ఆత్మలు సంవిహితాలై ఉంటాయి. ఒక ఆత్మకు సుఖదుఃఖ సంబంధం కలిగినప్పుడు అన్నింటికీ సుఖదుఃఖ సంబంధం కలగవలసి ఉంటుంది. కాణాదులమతం ప్రకారం కూడా మనస్సు ఒక ఆత్మతో సంయుక్తం అయినప్పుడు మిగిలిన ఆత్మలు కూడా అక్కడనే ఉంటాయి. కనుక వీటిలో సంయోగం కలుగుతుంది. ఒక ఆత్మకు సుఖదుఃఖ సంబంధం కలిగితే అన్ని ఆత్మలకి కూడా సమంగానే సుఖదుఃఖాలు కలగవలసి వస్తుంది. కాని అది యుక్తం కాదు. ఒక జీవి చేసిన కర్మను అతడే అనుభవించాలి. అంతే కాని వేరొక శరీరంలో ఉన్నా జీవి అనుభవించడు.
సూత్రం :- 267
" అదృష్టా నియమాత్ "
అదృష్ట :- ఆకస్మికతతో, అనియమాత్ :- నియమం లేనందువలన, జీవుడు విభువు కాదు. అణువే.
భావం :- అదృష్టాన్ని బట్టి నియమం ఏర్పడుతుంది. అదృష్టానికి నియమం లేనందువలన జీవుడు విభువు కాదు, అణువే.
వివరణ :- అదృష్ట నియమం లేని సాంఖ్య, కణాదుకు మాత్రమే ఈ దోషం సంభవిస్తుంది. అంతే కాని వేదాంత మతానికి కాదు. సాంఖ్యమతం:- వీరి మతం ప్రకారం ఆత్మలు అనేకం ఉన్నాయి. అవి చైతన్యస్వరూపాలు, నిర్గుణాలు, అంతటా వ్యాపించి ఉన్నాయి. ప్రధానం వలెనే ఆత్మలన్నింటికి భోగాలు లభిస్తున్నాయి. అన్ని ఆత్మలకు సుఖదుఃఖ సంబంధం కలుగుతుంది. ఇది దోషం. కాణాదులమతం:- వీరు కూడా ఆత్మలు అనేకం ఉన్నాయని, అవి అచేతనాలని, వాటికీ అచేతనాలైన మనుషులు ఉపకారకాలు అనీ చెప్పారు. దేహేంద్రియ మనోబుద్ధుల ప్రభావం ఆత్మలందు చేరటం వలన సంసారం ఏర్పడు తుంది. ఇచ్చ మొదలైన గుణాలు పుట్టకుండా ఉంటే మోక్షం వస్తుంది. వీరి మతంలో ఒక ఆత్మకు, మనస్సుకు సంయోగం కలిగితే మిగిలిన వాటికి కూడా కలగాలి. ఏదైనా ఆత్మకు, మనస్సుకు సంయోగం పొందే అదృష్టం లేదు. కనుక వాటికి సాంకర్యదోషం వస్తుంది. ఆకాశం వలె సర్వత్రా వ్యాపించి ఉన్న అనేకమైన ఆత్మలు ప్రతి శరీరంలో లోపల బైట అనే విశేషం లేకుండా సoవితాలై ఉండగా మనోవాక్కాయములచే ధర్మాధర్మ లక్షణమైన అదృష్టం కలుగుతుంది. సాంఖ్యులకైతే అవి ఆత్మతో సమవాయ సంబంధం ఉండదు. ప్రధానంతో సంబంధం ఉంటుంది. ప్రధానం అన్నీ ఆత్మలకు సమానమే. అది ఒక్కొక్క ఆత్మకి సుఖదుఃఖలను కలిగించదు. జీవులు అనేకులు కనుక జీవులంతా వ్వాపకులైతే వాళ్ళకు కలిగే సుఖదుఃఖాలకు ఏ వ్యవస్థ ఉండదు. జీవులకు కలిగే సుఖదుఃఖాలు ఆకస్మికాలు కావు. జీవుడు విభువైతే అందరూ ఒకే సమయంలో దుఃఖితులు కావాలి. అప్పుడు సుఖదుఃఖాలకో వ్యవస్థ ఉండదు. కనుక జీవులు వ్యాపకులు, విభువులు కారు. అణువులే.
సూత్రం :- 268
" అభి సంధ్యాది ష్యపి ఛైవమ్ "
చ ఏవం :- అలాగే, అభిసంధి ఆదిషు :- రాగ ద్వేషాదు లతో కూడిన సంకల్పమే అభిసంధి.
భావం :- రాగ ద్వేషాదులతో కూడిన సంకల్పమే అభిసంధి. సంకల్పం, ప్రయత్నాలతో అదృష్టంతో నియమం ఉండే వీలుంది. కనుక సుఖ దుఃఖలతో వ్యవస్థ ఏర్పడదు.
వివరణ:- ఆత్మలన్నీ వ్యాపకాలైతే అదృష్టంతో అన్ని ఆత్మలకు సానిధ్యం ఉంటుంది. అదృష్టం అంటే ఆకస్మికంగా మనస్సులో కలిగే నిర్ణయాలు. అప్పుడు ఈఅదృష్టం ఈఆత్మది, ఆఆత్మది కాదు, అని నిశ్చయించే వీలుండదు. అలాగే అదృష్టానికి కారణాలైన సంకల్ప ప్రయత్నాలకు అన్ని ఆత్మలతో సంబంధం ఉండి, అదృష్టాన్ని కలిగించే సామర్ధ్యం ఉండదు. కనుక ఆత్మలు విభువులు అని అంగీకరిస్తే సుఖదుఃఖ వ్యవస్థ ఏర్పడదు. నేను ఈఫలం పొందుదునుగాక, నేను దీనిని పరహరించెదను, నేను ఈపని ఈవిధంగా ప్రయత్నం చేస్తాను. ఈవిధమైన అభిసంధి అంటే మానసికాభిప్రాయం ప్రతి ఆత్మలోనూ ఉంటుంది. అది అదృష్టానికి ఆత్మలకు మధ్య నున్న స్వస్వామిభావాన్ని నియమిస్తాయి. ఈ అదృష్టం ఈ ఆత్మది, అది ఆఆత్మది కాదు అనే భేదాన్ని చెప్పవచ్చు కదా! అని సందేహించారు. అది కాదంటున్నాడు.అలాగే అదృష్టానికి కారణములైన సంకల్ప ప్రయత్నాలకు అన్ని ఆత్మలతో సంబంధం ఉండి ,అదృష్టాన్పి కలిగించే సామర్థ్యం ఉండదు.కనుక ఆత్మలు విభువులు అని అంగీకరిస్తే సుఖదుఃఖవ్యవస్థ ఏర్పడదు. అభిసంధి మొదలైనవాటిలో కూడా అదే దోషం కనబడుతుంది. సర్వాత్మ సాధారణమైన ఆత్మ, మనస్సు సంయోగం చేత సమస్త ఆత్మల సంవిధిలో చేయబడుచున్న అభిసంధి ( మానసికభిప్రాయం ) మొదలైనవి కూడా నియమ హేతువులు అనడం కుదరదు. అన్ని మనస్సులు ఒకే చోట ఉండటం వలన ఏ ఆత్మకు ఏ మనస్సులో సంయోగం ఉంటుందో చెప్పలేము. ఈ ఆత్మకు సంబంధించిన నిశ్చయాలు ఇవి చెప్పడానికి వీలులేదు. కాబట్టి నిశ్చయాదులకు సాంకర్య దోషం తప్పదు.
సూత్రం :- 269
" ప్రదేశా దితి చే న్నాంతర్భావాత్ "
ప్రదేశాత్ ఇతి చేత్ :- శరీర దేశ సంబంధం వలన సుఖ దుఃఖాలు ఏర్పడితే కనుక, అంతర్భావాత్ :- జీవులందరికి వేర్వేరు దేహాలు ఉండటం వలన, న :- సుఖ దుఃఖ వ్యవస్థ ఏర్పడదు.
భావం :- శరీర ప్రదేశంలో ఆత్మ మనస్సు, సంయోగం కలగడం వలన దోషం లేదు అన్నట్లయితే, కాదు. అన్ని ఆత్మలు కూడా ఒక్క శరీరంలోనే ఉంటాయి కదా! అని సూత్రానికి అర్ధం.
వివరణ :- ఆత్మ విభువే అయినా కూడా శరీరంలో ఉన్నా, మనస్సుతో సంయోగం శరీరంలో ఇమిడి ఉన్న ఆత్మ యొక్క ప్రదేశంలోనే జరుగుతుంది. సంకల్పం, ప్రయత్నం మనస్సు సంయోగం వలనే కలుగుతాయి. ఆమనస్సు ఆత్మతో బాటే శరీరంలో ఉంటుంది. అన్ని జీవాత్మలకు వేర్వేరు శరీరాలు ఉంటాయి. సంకల్పాలు వాటి మూలంగా ఏర్పడే అదృష్టాలు వేర్వేరుగా ఉంటాయి. అప్పుడు సుఖదుఃఖాదులతో వ్యవస్థ ఏర్పడుతుంది. జీవులు వ్యాపకులైతే అన్ని శరీరాలలో ఉన్నా అన్ని మనసులలో వాటికీ సంబంధం ఉంటుంది. అప్పుడు సంకల్పాల్లో ఏ నియమం ఉండదు. దానితో సుఖదుఃఖ వ్యవస్థ ఏర్పడదు. అందువలన జీవులు అణువులే కాని విభువులు కారని తెలుస్తోంది. ఆత్మలు సర్వ వ్యాపకాలు, అన్ని శరీరాలలో ఉంటాయి. కాబట్టి ఒక శరీరంలో చేరిన ఆత్మ మనస్సుతో సంయోగం చెందుతుంది అని చెప్పడానికి కూడా వీలు లేదు. అందుచేత బింబ ప్రతిబింబ వాదం ప్రకారం సుఖ దుఃఖావస్థకు సాంకర్య దోషం లేదు. అంటే పది కుండలలో కనిపించిన ప్రతిబింబం ఒక కుండను కదిపితే అన్ని కుండలలోని ప్రతిబింబం కదలదు. అన్ని ఆత్మల సంవిధిలో పుడుతున్న శరీరం కూడా, ఇది ఈ ఆత్మకే సంబంధించినది ఇతర ఆత్మలకు సంబంధించినది కాదు. ప్రదేశ విశేషాన్ని అంగీకరించినా కూడా సమానమైన సుఖదుఃఖాలను అనుభవించవలసి ఉన్న రెండుఆత్మలు ఒకే శరీరంచేత సుఖదుఃఖాలను కూడా అనుభవించ వచ్చును. ఎందువలనంటే రెండు ఆత్మల అదృష్టం ఒకే ప్రదేశానికి సంబంధించి ఉండవచ్చును కదా! అదేట్లనగా దేవదత్తుడు ఏ ప్రదేశంలో సుఖదుఃఖాలను అనుభవించాడో ఆ ప్రదేశం నుండి వాని శరీరం తొలగిపోగానే, ఆ ప్రదేశానికి యజ్ఞదత్తుని శరీరం చేరినప్పుడు వానికి కూడా దేవదత్తునికి ఏవిధమైన సుఖదుఃఖాల అనుభవం కలిగిందో, అలాంటి అనుభవమే కలుగు తుంటుంది. దేవదత్త, యజ్ఞదత్తులకు ఒకే ప్రదేశంలో సుఖదుఃఖాలు కలిగించే అదృష్టం లేకపోతే అలాంటి సుఖ దుఃఖానుభావం కలిగిండేది కాదు. అనేకమైన ఆత్మలు సర్వగతాలు అని చెప్పడం యుక్తం కాదు. ఎందుకు తగిన దృష్టాంతం ఏదీ లేదు. ఒకే ప్రదేశంలో అనేక వస్తువులు ఏవి ఉన్నాయి? రూపాదుల దృష్టాంతం అయితే అది యుక్తం కాదు. ఎందుకంటే దర్శిని బట్టి వాటికీ బేధం లేదు. వాటి లక్షణాలు వేర్వేరుగా ఉంటాయి. అనేక పదార్ధాలు ఒకే చోట ఉండటానికి ద్రుష్టాంతం అన్నటలయితే అది యుక్తం కాదు. దర్శిని బట్టి వాటికీ భేదం లేదు. వాటి లక్షణాలు వేరు వేరుగా ఉంటాయి. అనేక పదార్ధాలు ఒకే చోట ఉండటానికి దృష్టాంతంగా రూపాదులను చూపవచ్చును. ఒకే ఘటంలో రూప రస గంధాలు న్నాయి కదా! అని వైశేషికులు చెప్పవచ్చును. అది యుక్తం కాదు. రూపం, తేజస్సు అనే దర్శి కి చెందినది. రసం జలానికి, గంధం పృథ్వికి సంబంధించినది. తేజో రస గంధాదుల కంటే భిన్నంగా ఘటం లేదు. అందుచేత రూపాదులకు దర్శి అయిన ఘటానికి భేదం లేదు. అదే విధంగా రూప లక్షణం వేరు. గంధం లక్షణం వేరు. అందుచేత ఇవన్నీ ఒక ఘటంలో కలసి ఉన్నట్లు కనబడడానికి అవకాశం ఉంది. ఆత్మలకు లక్షణ భేదం లేదు. అందుచేత వేర్వేరు ఆత్మలని చెప్పడం కుదరదు.
ద్వితీయాధ్యాయంలో తృతీయపాదం సమాప్తం.
ప్రాణోత్పత్యధికరణం ( 2, 4, 1 )
సూత్రం :- 270
"తథా ప్రాణః "
తధా :-ఆకాశాది మహా భూతాలు బ్రహ్మం వలన ఉత్పన్నం అయినట్లే, ప్రాణః :- ఇంద్రియాలు కూడా జనించాయి.
భావం :- ఆకాశాది మహా భూతాలు బ్రహ్మం వలన ఉత్పన్నం అయినట్లే ఇంద్రియాలు కూడా జనించాయి. అయితే ఇంద్రియాలకు పుట్టుక ఉన్నదా! లేక జీవాత్మ లాగా వాటికీ పుట్టుక లేదా?
వివరణ :- ఇంతవరకు జీవుడి గురించి విచారణ జరిగింది. అతనికి సాధనాలైన ఇంద్రియాల గురించి ఈ పాదంలో వివరణ ఉన్నది. గురువు గారు! ప్రాణాల ఉత్పత్తి గురించి అన్ని ఉపనిషత్తులలోనూ చెప్పలేదు. కొన్ని చోట్ల సృష్టికి పూర్వమే ప్రాణం ఉన్నట్లు చెప్పారు. కాబట్టి ప్రాణాలను గురించి వివరించండి. అన్నాడు నారాయణభట్టు. సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. ఆకాశం మొదలైన వాటిలాగా ప్రాణాలకు కూడా ఉత్పత్తి ఉన్నది. ప్రాణాలు అంటే ఇంద్రియాలు అని అర్ధం.
ముండకోపనిషత్తు(2,1,8):- ఆ పరమాత్మ వలన సప్త ఇంద్రియాలు జనించాయి. ఆయన వలననే ప్రాణం, మనస్సు, అన్నీ ఇంద్రియాలు జనించాయి. కళ్ళు 2, ముక్కు 2, చెవులు 2, నోరు 1 మొత్తం 7 పుట్టినవి.
తైత్తరీయోపనిషత్తు(2,1):- ఆకాశాదిభూతాలు పుట్టినట్లు వర్ణించారు. కాని ఇంద్రియాల ఉత్పన్నం అయినట్లు చెప్పలేదు కదా! అంటే వాటికీ ఉత్పత్తి ఉందనే వాక్యాలు సైతం వేరుగా ఉన్నాయి. పృదివి నుంచి ఓషధులు, వాటి నుంచి అన్నం, ఆ అన్నం నుంచి రేతస్సు, దాన్నుంచి శరీరం ఉత్పన్నం అవుతాయి. ఇంద్రియలులేని శరీరం ఎలా సిద్ధిస్తుంది? కనుక ఇంద్రియాలకు పుట్టుక ఉందనడంలో ఏ సందేహం లేదు. శరీరం ఇంద్రియాలకు ఆశ్రయం.
ప్రశ్నపనిషత్తు:-ఆపురుషుడు ఈశరీరం నుండి ఎవరు వెడితే నేను వెడతాను. ఎవరు ఉంటే నేను ఉంటాను. అని ఆలోచించిన వాడై, ముందుగా అవసరమైన ప్రాణాన్ని సృష్టించాడు. తరువాత దాని నుండి శ్రద్ధ, ఆకాశం, వాయువు, అగ్ని, జలము, భూమి, ఇంద్రియాలు, మనస్సు, అన్నం సృష్టించాడు అని చెప్పబడింది. వీటిని బట్టి చూస్తే ప్రాణాలు బ్రహ్మ యొక్క వికారాలు అని తెలుస్తోంది. ఉత్పత్తిప్రకరణంలో ప్రాణాల ఉత్పత్తి చెప్పబడలేదు. కొన్ని చోట్ల అవి ఉత్పన్నములు కానట్లే చెప్పబడింది. అవిద్యాఋషయః" అనే చోట్ల సృష్టికి పూర్వం ప్రాణాలు ఉన్నట్లు వినబడుచున్నది. సృష్టికి పూర్వం ఇదంతా అసత్తుగానే ఉండేది. ఆ అసత్తుగా ఉన్నది ఋషులే అన్నారు. ఆ ఋషులు ఎవరో కాదు, ప్రాణాలే అని అన్నారు. ఈ విధంగా శ్రుతుల మధ్య విరోధం ఉండటం వలన ఎలా నిర్ధారణ చెయ్యాలో తెలియక సందేహం కలుగుతుంది. లోకాదులు ఏ విధంగా పరమాత్మ నుండి పుడుతున్నాయో అట్లే ప్రాణాలు కూడా పుడుతున్నాయి. ఆకాశాదుల వలె ప్రాణాలకు కూడా ఉత్పత్తి ఉన్నదని తెలుసుకోవాలి. ప్రాణాలు కూడా పరబ్రహ్మ వికారాలేనని అన్వయించుకోవాలి.
సూత్రం :- 271
" గౌణ్య సంభవాత్ "
గౌణం కావడం , అసంభవాత్ :- సంభవం కాదు.
భావం :- ఇంద్రియాలకు నాశనం ఉన్నది. ఇది ప్రత్యక్షంగా చూస్తున్నాము. కనుక నాశనం ఉన్నా ఇంద్రియాలకు జన్మం ఉంటుంది. అందువలన ఇంద్రియాల ఉత్పత్తిని చెప్పిన ఉపనిషద్వాక్యం గౌణం ( అప్రధానం ) కాదు.
వివరణ :- ప్రాణోత్పత్తి విషయం గౌణం అనడం సంభవం కాదు.
ముండకోపనిషత్తు:- శౌనకుడు, గురువర్యా! అంగీరసమహర్షి, దేన్ని గురించి తెలుసుకుంటే సర్వము తెలుస్తాయో దానిని గురించి వివరించండి, అన్నాడు. ఆ ఒక్క విషయం తెలుసుకుంటే అన్నీ విషయాలు తెలుస్తాయి. పరబ్రహ్మ నుండి సమస్త ప్రాణాలు పుడుతున్నాయి. ఇక్కడ ప్రాణోత్పత్తి కూడా చెప్పబడింది. కనుక ఇది గౌణం కాదు. "ఏతస్మాత్..ప్రాణః" ప్రాణాధికమైన సమస్తజగత్తు బ్రహ్మవికారం అయితేనే ప్రకృతికంటే వేరుగా వికారం ఉండదు. ప్రాణాల ఉత్పత్తి శృతి గౌణి అయిన పక్షంలో ఈప్రతిష్టకు భంగం కలుగుతుంది. సృష్టికి పూర్వం ప్రాణాలున్నట్లు వినబడుచున్నది కదా! ఎట్లనగా ఇది మూలప్రకృతిని అంటే మూలకారణమైన బ్రహ్మను గురించి చెప్పినది కాదు."అప్రాణో నరః" అని, మూలప్రకృతిలో(బ్రహ్మలో) ప్రాణాదివిశేషాలేవి లేవని నిశ్చయింపబడింది కదా! అందుచేత సృష్టికి పూర్వం ప్రాణాలున్నట్లు చెప్పడం తన వికారాల దృష్ట్యా అవాంతర ప్రకృతినిగూర్చి చెప్పినదని గ్రహించాలి. వ్యాకృతమైన వాటికి సంబంధించిన అనేకఅవస్థలను కూడా శ్రుతులలోను, స్మృతులలోను ప్రకృతి వికారభావంతో చెప్పడం జరిగింది. మూలకారణం బ్రహ్మ, వానినుండి ఒకదాని తరువాత ఒకటిగా అనేక వస్తువులు సృజించబడ్డాయి. ఈ వస్తువులన్నీ రావడానికి ప్రకృతి కారణం అవుతుంది. మూడవడానికి రెండవది ప్రకృతి(కారణం), నాలుగవడానికి మూడవది ప్రకృతి అవుతుంది. ఈవిధంగా ఒక వస్తువును దాని కార్యాన్ని దృష్టిలోఉంచుకొని ప్రకృతిఅని చెప్పడం శ్రుతి, స్మృతులలో ఉన్నది. అందుచేత ఉత్పత్తికిపూర్వం ప్రాణాలున్నా యనగా ప్రాణాల కార్యం ఉత్పత్తికిముందు ప్రాణాలున్నాయని అర్ధమేగాని, ప్రాణాలు మూలకారణంగా ఉన్నాయని కాదు. అవ్యాకృతావస్థ(సూక్ష్మఅవస్థ)నుండి వ్యాకృతావస్థలోకి వచ్చిన పదార్ధాలలో కూడా ప్రకృతి వికృతి భావం చెప్పడం ఉంది.
సూత్రం :- 272
" తత్ ప్రాక్ శృతేశ్చ "
తత్ ప్రాక్ :- ఆకాశాదుల కన్నా ముందే, ఇంద్రియాలు జనిస్తాయని, శృతేః :- శృతులు, చ :- స్మృతులు అంటున్నాయి.
భావం :- ఆకాశాదుల కన్నా ముందే ఇంద్రియలు జన్మించాయని శృతులు, స్మృతులు చెబుతున్నాయి.
వివరణ :- ఉత్పత్తి సూచించే పదం జాయతే. ఇది ఆకాశం మొదలైన వాటి కన్నా ముందుగా పుడుతున్నాయి అని శృతులు చెబుతున్నాయి. కాబట్టి ప్రాణోత్పత్తి నిజం. అంటే ప్రాణం ఉత్పత్తి చెందింది.
ముండకోపనిషత్తు :- ( 2, 1, 3 ) :- ప్రాణం, మనస్సు, అన్ని ఇంద్రియాలు, ఆకాశం, గాలి, అగ్ని, జలం, పృదివి అనే ఇవన్నీ ఈశ్వరుడి వల్లే జనించాయి. ఈ క్రమంలో ఇంద్రియాలు ఆకాశం కన్నా పూర్వమే ఉన్నాయి.
సాంఖ్య దర్శనం:-(1,61):- సత్వ, రజస్, తమస్సుల సామ్యావస్థనే ప్రకృతి అంటారు. ప్రకృతినుంచి మహత్తు జనిస్తుంది. మహాత్తునుంచి అహంకారం పుడుతుంది. అహంకారంనుంచి పంచతన్మాత్రలు ఉద్భవించాయి. వాటి నుంచి పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచప్రాణాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, స్థూలభూతాలు, పురుషుడు-- ఈక్రమంలో ఇవి 25 అవుతాయి. ఈ సాంఖ్యసూత్రంలో ఆకాశాదులకన్నా ముందే అహంకారం నుంచి జ్ఞాన కర్మేంద్రియాలు ఉత్పన్నం అయినట్లుఉన్నది. కనుక ఇంద్రియాలు స్థూలభూతాల కంటే ముందుగానే ఉత్పన్నం అవుతాయి. శ్రుతి, స్మృతుల వలన సిద్దమౌతోంది. ఆకాశాదులవలె ప్రాణాదులకు కూడా జన్మశ్రవణం ముఖ్యమే. ఎందువలననగా "ఏ కస్మా జ్యాయతే ప్రాణః " అనే చోట జన్మను బోధించే జాయత్ అను పదం ప్రాణాలవిషయంలో ముందు వినబడనిదై తరువాత వచ్చిన ఆకాశాదులలోకి అనువర్తిస్తుంది.ఆకాశాదుల విషయంలో వలెనే ప్రాణాల విషయంలో కూడా జన్మ ముఖ్యమే అనడం యుక్తం. ఆకాశాదుల విషయంలో వలేనే ప్రాణ విషయంలో కూడా జన్మ ముఖ్యమే అనడం యుక్తం. ఒకే ప్రకరణంలో ఒకే వాక్యంలో ఒక్కసారి ప్రయోగించబడి, ఒకచోట ముఖ్యార్థం బోధిస్తుందని, మరొక చోట గౌణార్ధం బోధిస్తుందని నిర్ణయించడానికి శక్యంకాదు కదా! ఒకే శబ్దనికి రెండు విధాల అర్ధం చెబితే దాని స్వరూపాన్ని తారుమారు చేసినట్లువుతుంది.
సూత్రం :- 273
" తత్ పూర్వకత్వాత్ వాచః "
వాచః :- వాక్ ఇంద్రియాన్ని, తత్ పూర్వకత్వాత్ :- తేజస్సు కారణంగా తేజోమయం అని చెప్పవచ్చు.
భావం :- ఆకాశాదుల కన్నా ముందే ఇంద్రియాలు పుట్టి ఉంటే తేజోమయి వాక్ అని ఎందుకు అన్నారు. తేజోమయం అంటే అగ్ని నుండి ఉత్పన్నమైనదని అర్ధం కదా! అంటే వాక్ ఇంద్రియం తేజస్సు కారణంగా తేజోమయం అని అనవచ్చును.
వివరణ:-వాక్కు, మనస్సు, ప్రాణం అనేవి భూతాలన్నింటి కన్నా ముందుగా పుడుతున్నాయి అని శ్రుతులు చెబుతు న్నాయి. కాబట్టి ప్రాణోత్పత్తి నిజం. అంటే ప్రాణం ఉత్పత్తి చెందింది.
చాందోగ్యోపనిషత్తు:-(6,5,4)"తేజోమయివాక్" తేజస్సు శబ్దోచ్చారణ శక్తిని ప్రకటంచేస్తుంది. కనుక వాగింద్రియం తేజోమయం. ఈఅభిప్రాయం తోనే వాగింద్రియాన్ని తేజోమయమని అన్నారు. అలాగే అన్నమయం మనస్సని, ఆపో మయం ప్రాణమని ఉపనిషత్తులు వర్ణించాయి. తేజస్సు, జలం, పృధివి అనే మూడు భూతాల ఉత్పత్తి మాత్రమే వినబడటం వలన, ప్రాణాల ఉత్పత్తి పఠింపబడక పోయినా, వాక్ ప్రాణ మనస్సులు బ్రహ్మ నుండి పుట్టిన తేజోబన్నాలు పూర్వమే ఉన్నవని చెప్పడం వలన వాటి వలె సమస్తమైన ప్రాణాలు కూడా బ్రహ్మ నుండి పుట్టినట్లు సిద్ధిస్తుంది. " అన్నమయం హి సోమ్య మనః అపోమయః ప్రాణస్తేజోమయి వాక్ " అని వాక్ ప్రాణ మనస్సులు తేజోబన్న పూర్వకములని చెప్పబడుచున్నది. ఇవన్నీ అన్నాదుల నుండి పుట్టాయి అన్నట్లయితే, అవన్నీ బ్రహ్మనుండి తేజోబన్నాదుల రూపంలో పుట్టాయన్న మాట ఉంది. అన్నాదుల నుండి పుట్టడం అప్రధానం అని అంగీకరించినా, పృధివ్యాదుల నుండి పుట్టలేదు అన్నా, ఇవి జన్మించినట్లు ఇతర శ్రుతులు చెప్పినట్లుగా తేజోబన్నాలు అన్నమయాలని చెప్పడం, ఇవన్నీ బ్రహ్మ యొక్క కార్యములని వివరించడానికే అని తెలుస్తోంది. కనుక ప్రాణాలు బ్రహ్మ యొక్క కార్యములే అని చెప్పబడింది.
సప్తగత్యధికరణం ( 2, 4, 5 )
సూత్రం :- 274
" సప్త గతేః విశేషితత్వాచ్ఛ "
ఇంతకీ ఇంద్రియల సంఖ్య ఎంత? గతేః :- ఉత్క్రాంతి వలన, విశేషిత త్వాత్ చ :- విశేషణం వలన,
భావం :- ఉత్క్రాంతి వలన విశేషణం వలన ఇంద్రియాల సంఖ్య ఏడు.
వివరణ :- ఇంద్రియాలు ఏడని, పదకొండని శృతి వాక్యాల్లో సంఖ్యా భేదం కనిపిస్తోంది. అందుకే పూర్వ పక్షం వారికీ సందేహం కలిగింది.
ముండకోపనిషత్తు:-(2,1,8):- సప్తాప్రాణాః ప్రభవంతి తస్మాత్ " త్వక్, వాక్, చక్షువు, ఘ్రాణం, శ్రవణం, జిహ్వా, మనస్సు అనేవి సప్తేంద్రియాలు. సప్తప్రాణాలన్నారు కదా! కనుక సర్వేంద్రియాలు అంటే సప్త ఇంద్రియలు. అందరికి భోజనం పెట్టండి. అంటే వచ్చిన వాళ్లందరికీ అని అర్ధం. అలాగే శరీరాంతరగమనం వర్ణించిన చోట జీవుడి వెంట సప్తేంద్రి యాలు వాడారు. వాటినే సర్వ ప్రాణాలు అని అన్నారు. ఆపరబ్రహ్మ నుండి సప్తప్రాణాలు ఉద్భభావించాయి. అవి కళ్ళు-2, ముక్కులు-2, చెవులు-2, నోరు -1, మొత్తం ఏడు.
బృహదారణ్య కోపనిషత్తు:-(3,2,1):- "అష్టోగ్రహః అష్టావత్ గ్రహః" నాసిక, జిహ్వా, వాక్కు, నేత్రం, శ్రోత్రం, మనస్సు, హస్తం, త్వక్ అనీ ఎనిమిది ఇంద్రియలు వర్ణించారు. (3,9,7):- పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు మనస్సు అనీ 11 ఇంద్రియాలు అని ఉన్నది. జీవుడి ఉత్క్రాంతివర్ణించే సమయంలో జీవుడి వెంట సర్వేంద్రియాలు బయలుదేరతాయని ఉన్నది ఈ వాక్యంలో సర్వప్రాణాలు అంటే అన్నిఇంద్రియాలు అనీ అర్ధం.
బృహదారణ్యకోపనిషత్తు:-(4,4,1):- జీవుడు శరీరాన్ని విడిచి వెళ్ళేటప్పుడు చక్షురాది ఇంద్రియాలను ఉపసంహరంచు కుంటాడు. బుద్ధి ఇంద్రియంలో ఏకమవుతుంది. అందువలన మరణానికి పూర్వమే కళ్ళు చూడవు. చెవులు వినవు. వాసన తెలియదు. రుచిగ్రహించలేడుమాటలురావు. స్పర్శతెలియదు. ఆలోచించలేడు. ఇలా సప్తఇంద్రియాలు పనిచెయ్యకపోవడం వలన ఇంద్రియలు ఏడు అనీ తెలుస్తోంది. విజ్ఞానం కలిపితే 8 అవుతాయి. మనస్సు, బుద్ధి, విజ్ఞానం ఒక్కటే కనుక ఇంద్రియాలు ఏడు అనీ పూర్వపక్ష వాదన. ఋతుభాగుని కుమారుడు ఆర్తభాగుడు యజ్ఞవల్కుని అడుగుతున్నాడు- గ్రహాలు ఎన్ని? అతిగ్రహాలు ఎన్ని? దానికి యాజ్ఞవల్కుడు సమాధానం చెబుతున్నాడు. గ్రహము అంటే గ్రహించేది. ఇంద్రియాలు విషయాలను గ్రహిoచేవి కాబట్టి గ్రహాలు. అతిగ్రహం అంటే అంతకన్నా పెద్దది గొప్పది కాబట్టి విషయాలు అతి గ్రహాలు.
గ్రహాలు ఎనిమిది అతిగ్రహాలు 8
1. ప్రాణం గ్రహం వాసన అతి గ్రహం
2, వాగింద్రియం నామము
3. నాలుక రుచి
4. కన్ను రంగు, రూపము
5. చెవి శబ్దము
6. మనస్సు కోరిక
7. చేతులు కర్మ
8. చర్మము స్పర్శ
ఈ రకంగా ప్రాణాలు 7, 8, 10, 11, 12, అని అనేక చోట్ల చెప్పడం జరిగింది. అందువలన ప్రాణాల సంఖ్య ఎంత అనీ సందేహం వచ్చింది. శృతులలో కూడా అభిప్రాయం భేదాలు ఉన్నాయి. ఏదో ఒక సంఖ్యను తీసుకోవడం యుక్తం కనుక సప్త సంఖ్యనే గ్రహించాలి. ఇతర సంఖ్యలు ఆ ఏడు ప్రాణాల వృత్తి భేదాన్ని బట్టి చెప్పబడినవని వాళ్ళు అభిప్రాయం పడుతున్నారు.
సూత్రం :- 275
" హస్తా దయస్త స్థితే తోనైవం "
స్థితే :- శరీరం నుంచి జీవుడు నిష్క్రమించేటప్పుడు ప్రాణ సంఖ్య తెలుస్తున్నది. అతః :- అందువల్ల, హస్తా దయః :- హస్త పాదాది ఇంద్రియాలు, ఏవం న :- ఏడే కాజాలవు.
భావం :- శరీరం నుంచి జీవుడు నిష్క్రమించేటప్పుడు ప్రాణ సంఖ్య తెలుస్తుంది. హస్త పాదాది ఇంద్రియాలు ఏడే కాజాలవు.
వివరణ :- చేతులు మొదలైన ఇంద్రియాలు అధికంగా ఉండటం వలన, ప్రాణాలు ఏడు అని అనకూడదు. యుక్తిబలం చేత వచన ప్రాబల్యం చేత ఇంద్రియలు 11 అంటున్నారు. అవి దర్శన, శ్రవణ, ఆఘ్రాణ, ఆస్పాదన స్పర్శన, వదన (మాట్లాడుట) ఆదాన (స్వీకరించుట), గమన, ఆనంద, విసర్గ, ధ్యానం, అనేవి బృహదారణ్యకంలో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, ప్రాణి యొక్క కర్మ పని సమాప్తమైనప్పుడు వీరు శరీరంనుంచి నిష్క్రమిస్తారు. ఈరకంగా శరీరం వదలి బంధువులకు దుఃఖాన్ని కలిగిస్తారు.అవి రుద్రశబ్దం చేత పిలువబడటం చేత వాటిని ఏకాదశ రుద్రులు అని పిలువ బడతాయి. ఈ రకంగా ప్రాణములు ఏడు కావు అని తెలియజేశారు.
బృహదారణ్యకోపనిషత్తు(3,9,4):-ఈశరీరం నుంచి ఆత్మతోబాటు పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పదకొండవదైన మనస్సు వెళ్ళిపోతాయి. బంధువులను ఏడిపిస్తాయి. అనే వాక్యంలో 11 ఇంద్రియలు నిష్క్రమిస్తాయని చెప్పారు. అందరికి అన్నం పెట్టండి. అనే వాక్యం అర్ధం ప్రపంచంలో అందరికి కాదు. భోజనానికి ఆహ్వానించిన వాళ్లకు అని భావం. కనుక ఉత్క్రాంతి ప్రకరణంలో సర్వ శబ్దం అర్ధం 11 అనే. ఒక వాక్యంలో 11 అన్నప్పుడు మరొక వాక్యంలో 11 అనే అన్వయించుకోవాలి.అక్కడ సప్తేంద్రియాలు అని అర్ధం చేసుకోవడం పొరబాటు. హస్తం- గ్రహం. ఇది అతి గ్రహమైన కర్మతో అనగా గ్రహించడం అనే కర్మతో సంబంధించి ఉంటుంది. కర్మ హస్తాలతో చేస్తారు కదా! ఈ శ్రుతులలో ఇంద్రియాలు ఏడు కంటే అధికంగా చెప్పబడ్డాయి. ఏడు కన్నా అధికంగా ఉంటే సప్తత్వాన్ని అంతర్భావం చెయ్యడంవలన సరిపెట్టవచ్చును. తక్కువ సంఖ్యయా? ఎక్కువ సంఖ్యయా అని సందేహం వచ్చినప్పుడు అధికసంఖ్యనే గ్రహించాలి. ఎందుకంటే దీనిలో అల్పసంఖ్య ఇమిడి ఉంది. అల్ప సంఖ్యలో అధిక సంఖ్య ఇమిడి ఉండదు. అందుచేత చిన్న సంఖ్యను కల్పించడం ద్వారా ప్రాణాలు ఏడే అని చెప్పడం యుక్తం కాదు. "దశమే - ఏకాదశి " అనీ శ్రుతిలో ఉదాహరింపబడింది. ఇది ఇంద్రియాల గురించి చెప్పిన ప్రకరణం వలన ఇక్కడ ఆత్మ శబ్దం చేత అంతః కారణాన్ని గ్రహించాలి. పదకొండు, పన్నెండు, పదమూడు ఇంద్రియాలని ఉదాహరించారు కదా! పదకొండు పనుల కన్నా అధికంగా ఇతరమైన పనులు లేవు. అధికంగా ఉంటే కరణాలను కల్పించడానికి అవసరం ఉండేది. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు విషయాలుగాగల ఐదు బుద్ధి భేదాలున్నాయి. వాటి కోసం ఐదు బుద్దేంద్రియాలు ఉన్నాయి. వచన, ఆదాన, విహరణ, ఉత్పత్తి, ఆనందా అనే 5 రకాల కర్మలున్నాయి. వాటికోసం ఐదు కర్మేంద్రియాలు అన్నింటిని గ్రహించేది. మూడు కాలలలోనూ ఉండేది మనస్సు ఒక్కటే. వృత్తులభేదాన్ని బట్టి ఆ మనస్సే కొన్ని చోట్ల వేరుగా ఉన్నట్లుగా మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని నిర్దేశింప బడింది. శిరస్సులో ఉండే నాలుగు ప్రాణాలు ఏడుగా లెక్కింపబడ్డాయి. ఇతర ప్రాణాలు ఈనాలుగింటి వృత్తి భేదాలని అనడానికి వీలు లేదు. ఎందుకంటే హస్తాలు చేసే పనులు విలక్షణమైనవి. కొన్ని చోట్ల కొన్ని ప్రాణాలు ఉపాసన కోసం చెప్పబడ్డాయి. కొన్ని చోట్ల కొన్ని ప్రాణాలు ప్రదర్శన కోసం చెప్పబడుతుంటాయి. ఈ విధంగా ప్రాణాల సంఖ్యను గురించి విచిత్రంగా ఉన్నప్పుడు, ఎక్కడ దేనిని ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని చేయబడిందో పరిశీలించాలి. ప్రాణాలు ఏడుమాత్రమే ఎందువలనంటే జీవుడు ఉత్క్ర మిస్తుండగా వానిని అనుసరించి ప్రాణం ఉత్క్రమిస్తుంది. ఆ ప్రాణాన్ని అనుసరించి ఏడు ప్రాణాలు ఉత్క్రమిస్తాయని చెప్పబడింది.
ప్రాణాణుత్వాధికరణం ( 2, 4, 7 )
సూత్రం ..276
" అణ వశ్చ "
భావం :-బ్రహ్మవలన ఆకాశాది మహా భూతాల కన్నా పూర్వం ఎలా ఇంద్రియలు ఉత్పన్నం అవుతున్నాయో, అలాగే సూక్ష్మ భూతాలైన పంచతన్మాత్రాలు కూడా ముందే ఉత్పన్నం అవుతున్నాయి.
వివరణ:- గురువర్యా! ఇంద్రియాల పరిమాణం ఎంత? అని అడిగాడు కృష్ణశర్మ. సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. ఇంద్రియాలు అణుస్వరూపాలు. ఇవి సర్వగతాలు కావు. శరీరమంతటా పని చేస్తాయి. మరణం సమయంలో చప్పుడు చెయ్యకుండా శరీరాన్ని వదలి బయటకు వెళ్ళిపోతాయి. ప్రక్కన ఉన్న వారికి కూడా కనబడవు. కాబట్టి ఇవి విభజింపబడినాయనీ, అణురూపాలని అనుకోవాలి. అణువు అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనది అని అర్ధం. ఇవి సర్వ వ్యాపకాలు కావు. ఒకవేళ అంతటా వ్యాపించి ఉంటే లోకంలో జరిగే అన్నీ విషయాలు వీటికి తెలియాలి. అలా తెలియదు కనుక ఇంద్రియపరిమాణం సూక్ష్మతి సూక్ష్మం అని తెలుస్తోంది.
ప్రశ్నోపనిషత్తు(4,8):- కార్యంకన్నా కారణం ముందు ఉంటుంది. కనుక ఆకాశాది భూతలకన్నా వాటికి కారణాలైన శబ్ద, వాయు, రూప, రస, గంధ తన్మాత్రలు 5 ముందే వచ్చాయి. ప్రాణాలు అణువులుకూడా. ఇప్పుడు ప్రాణాలకు సంబంధించి మరొక స్వభావాన్ని చెబుతున్నాడు. ప్రకృతములైన ఈప్రాణాలు అణువులు అని గ్రహించాలి. ఇవి సూక్ష్మంగా ఉండటం వలన బాహ్యేంద్రియాలకు కనబడక పోవడం, పరిచ్చేదము సర్వవ్యాపులు కాక, అణు పరిమాణంలో ఉండటం మాత్రమే కాని పరమాణువుల వలె ఉండటం కాదు.ఈ ప్రాణాలు స్థూలములైతే మరణకాలంలో శరీరం నుండి బయటకు వెళ్ళేటప్పుడు ప్రక్కన ఉన్నవాళ్లు చూడగలిగి ఉండేవారు. ప్రాణాలు సర్వగతాలయితే ప్రాణాలు శరీరం నుండి పైకి లేచిపోతాయి, మరొక చోటికి వెడతాయి. తిరిగి వస్తాయి అని చెప్పే శృతులకు విరుద్ధం కలుగుతుంది. ప్రాణాలు సర్వగతాలు అని చెప్పినప్పుడు వాటి వృత్తి మాత్రం శరీర ప్రదేశంలో మాత్రమే కలుగుతుందని చెప్పవచ్చును కదా అని సందేహం. వృత్తి మాత్రమే కరణం అని చెప్పవచ్చు కదా! ప్రాణాదులు వృత్తి అన్నా, మరొకటి అన్నా ఏది ఉపలబ్దికి సాధనమో అదే కరణం. కేవలం పేరులో మాత్రమే వివాదం. అందుచేత ప్రాణాదులు సర్వవ్యాపకములు అని కల్పించడం వ్యర్థం. ప్రాణాలు సూక్ష్మతమములు, పరిచ్ఛిన్నములు అని నిశ్చయించారు.
ప్రాణ శ్రేష్ఠధికరణం ( 2, 4, 8 )
సూత్రం :- 277
" శ్రేష్ఠశ్చ "
శ్రేష్ఠ :- ముఖ్య ప్రాణం, చ :- కూడా పంచభూతాలకు ముందు వాటికి కారణాలైన తన్మాత్రాలు, ఇంద్రియాలు, ఉత్పన్నమైనట్లు, ముఖ్య ప్రాణం ( శ్రేష్ఠః )కూడా జనిస్తుంది.
భావం:- పంచభూతాలకు ముందు వాటికి కారణమైన తన్మాత్రలు, ఇంద్రియాలు ఉత్పన్నం అయినట్లు ముఖ్య ప్రాణం కూడా జనిస్తుంది.
వివరణ:- ముఖ్యప్రాణం కూడా బ్రహ్మమే. బ్రహ్మనుండే ప్రాణం పుడుతుంది.
చాందోగ్యోపనిషత్తు(5,5,1) ప్రాణోవావ జ్యేష్ఠశ్చ శ్రేష్ఠశ్చ" శ్రేష్టం అంటే ముఖ్య ప్రాణం. చాందోగ్యంలో ప్రాణం జ్యేష్టం, శ్రేష్టం అని చెప్పబడింది.
బృహదారణ్యకోపనిషత్తు:- ప్రాణమే శ్రేష్టం, జ్యేష్టం అని తెలుసుకున్నవాడు తన వారిలో జ్యేష్ఠుడు, శ్రేష్టుడు అవుతాడు. కాబట్టి ప్రాణం శ్రేష్ఠమైనది. ముఖ్య ప్రాణం బ్రహ్మమే.
ఋగ్వేదం:-ప్రళయకాలస్థితిని తెలిపే మంత్రం ఒకటి ఉంది. మృత్యువు, జీవనం, రాత్రింబవళ్ళు, ఇవి ఏవిలేని ప్రళయకాలంలో ప్రాణవ్యాపారం ఉండేది. అందువలన ప్రళయంలో ఉన్నా ప్రాణం మళ్ళీ ఉత్పన్నమైనది అనడం సరి అయినది కాదు. ఆన ప్రాణవే ప్రాణికి ధాతూ పాఠం. ప్రాణం అనే ప్రాణ వ్యాపారం (ఆసీత్)ఉన్నదని తెలుస్తోంది. ప్రళయకాలంలో ప్రాణమే లేకపోతే దాని వ్యాపారం ఎలా ఉంటుంది. ప్రాణం ఉన్నప్పుడు దాని సృష్టి జరిగింది అనడం యుక్తంకాదు. ప్రాణం బ్రహ్మం వలన ఇంద్రియాల్లాగా ఆకాశాదులు, ఇంద్రియాలు, మనస్సులాగా ముఖ్యప్రాణం సైతం ఉత్పన్నం అవుతుందని ఉపనిషత్తు చెబుతోంది.
ముండకోపనిషత్తు(2,1,3) "ఏతస్మాత్ జాయతే ప్రాణో మనః సర్వేంద్రియాణిచ" ఈశ్వరుడి వల్ల ప్రాణం, మనస్సు, ఇంద్రియాలు జనిస్తున్నాయి. కనుక ముఖ్యప్రాణం ఆకాశాదుల్లా బ్రహ్మం వలెనే ఉత్పన్నం అయినది. ఆసీత్ అనే పదం బ్రహ్మ సత్ ను బోధిస్తుంది. కాని ప్రాణవ్యాపారాన్ని కాదు. ప్రళయకాలంలో జగత్తు గర్భంలో ఉండే ప్రకృతిలో బ్రహ్మ మాత్రమే చైతన్యం లో ఉంది. మృత్యువు లాంటివి అప్పుడు లేవు. కనుక శ్రేష్టం ముఖ్య ప్రాణం ఆకాశాదుల వలె బ్రహ్మం వలన ఉత్పన్నం అవుతుందనడం యుక్తం. ఇంద్రియాలతో కూడిన మనస్సుకు కాకుండా ప్రాణానికి కూడా ఉత్పత్తి వినబడుచున్నది. కనుక సర్వప్రాణాలు బ్రహ్మవికారాలే అని చెప్పబడింది. ఈఅతిదేశం ఎందుకు అని ప్రశ్న. దానికి సమాధానం చెబుతున్నారు. ఏఅధికమైన శంకను తొలగించడంకోసం ప్రధానంగా బ్రహ్మను గురించి చెప్పే నాస దాసీయసూక్తం లో "న మృత్యుః ఆస " అని ఒక మంత్రం ఉంది. ఆ ప్రళయకాలంలో మృత్యువు గల కార్యం లేదు. అమృతం లేదు. రాత్రికి చిహ్నమైన చంద్రుడు, పగటికి చిహ్నమైన సూర్యుడు లేడు. వాయువు కూడా లేకుండా మాయతో కూడిన బ్రహ్మ మాత్రమే ఉంది. అది తప్ప మరేమి లేదు అనీ మంత్రానికి అర్ధం. ఉత్పత్తికి పూర్వం ప్రాణం ఉన్నట్లు సూచిస్తున్నది. అందువల్ల ప్రాణం అజం అంటే పుట్టుక లేనిది అని ఎవరికైనా అభిప్రాయం కలగవచ్చును. ఆశీత్ అనే శబ్దం కూడా ఉత్పత్తికి పూర్వం ప్రాణం ఉన్నట్లు సూచించడం లేదు. మూల ప్రకృతిలో బ్రహ్మలో ప్రాణాది విశేషాలేవి లేవని చూపబడింది. శృతిలో ప్రాణం శ్రేష్టమని, జ్యేష్టమని, నిర్దేశించబడినది. ఈ ప్రాణం లేకుండా ఇతర ప్రాణాలేవి జీవింప జాలవు కనుక శృతిని అనుసరించి ఎక్కువ గుణాలు ఉండటం వలన ప్రాణం శ్రేష్టం అనీ చెప్పబడింది. శుక్ర నిషేషకం జరిగిన సమయంలో ప్రాణ వృత్తి వలన ప్రాణం జ్యేష్టం అనీ చెప్పబడింది.
వాయు క్రియాధికరణం ( 2, 4, 9 )
సూత్రం :- 278
" న వాయు క్రియే పృథ గుపదేశాత్ "
పృథక్ ఉపదేశాత్ :- ప్రాణం, వాయువు వేర్వేరుగా చెప్పడం వలన, అది వాయు :- వాయువు కాని, క్రియే :- దాని వికారం కాని, న :- కాదు.
భావం :- ప్రాణం వాయువు వేరువేరుగా చెప్పడం వలన వాయువు కాని, క్రియ గాని ముఖ్య ప్రాణం కాదు.
వివరణ :- ఈ అధికరణంలో ముఖ్య ప్రాణం వాయువు కన్నా వేరైనదని చెప్పబడింది. ప్రాణం అంటే వాయువు కాదు. వాయువు యొక్క క్రియలను ప్రాణం కన్నా వేరుగా నిర్దేశించి చెప్పారు. సామాన్యంగా ముఖమున ఉండే వాయువునే ప్రాణం అంటారు. అది నిజం కాదు. ప్రాణమనేది మనోమయబ్రహ్మ యొక్క చతుర్ధ పాదం. వీటిని బట్టి ప్రాణమనేది వాయువు కన్నా వేరైనది. అయితే ప్రాణం స్వజీవునిలా స్వతంత్రమైనదా అని అనుమానం.
ముండకోపనిషత్తు :- ( 2,1,3 ) ఉపనిషద్ వాక్యం వాయువుని, ప్రాణాన్ని వేరుగా చెప్పారు. ఖం వాయు జ్యోతి రాపః " ఈశ్వరుడి వలన ప్రాణం, మనస్సు అన్ని ఇంద్రియాలు, ఆకాశం, వాయువు, అగ్ని, జలం జనిస్తున్నాయి. ఇక్కడ ప్రాణం వాయువు వేరువేరుగా చెప్పారు. కనుక ప్రాణం వాయువు కాదు. వాయువికారము కాదు. అయితే ప్రాణం ఆత్మలా స్వాతంత్రమా? ఆ ముఖ్య ప్రాణం ఏ విధమైన స్వరూపం గలది అనే విషయం ఇప్పుడు తెలియజేయబడుచున్నది. ప్రాణామనేది వాయువే. ఆవాయువు ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం సమానం అని 5 విధాలని శృతిలో వినబడుతున్నది. కనుక ప్రాణం వాయువు అని, సమస్త మైన ఇంద్రియ వృత్తియే ప్రాణం అని ప్రాప్తించింది.
సాంఖ్యమతం :- మనోబుద్ధ్యంహంకారములు సామాన్యమైన వృత్తి అయిన ప్రాణాది వాయువులు ఐదు అని చెపుతున్నారు. ప్రాణం వాయువు కాదు. కరణముల అంటే మనోబుద్ధ్య హంకారములు కాదు. ఎందుకంటే వాయువు కన్నా భిన్నంగా "ప్రాణ.. తపతి చ " అని ప్రాణం చెప్పబడుచున్నది. మనోరూప బ్రహ్మకు వాక్కు, ప్రాణం, చక్షువు, శ్రోత్రము అని నాలుగు పాదాలని వాటిలో ప్రాణం అధిదైవికమని వాయువు చేత ప్రకాశిస్తోందని శృతిలో చెప్పబడింది. అట్లే కారణముల సంఖ్య కంటే వేరుగా ప్రాణం చెప్పబడింది. వాయువు కంటే, కరణముల వేరుగా ప్రాణాన్ని చెప్పిన వాక్యాలు గ్రహించాలి. ఇది పంజర బాలన్యాయం చేత జరుగుతుంది. ఒక పంజరంలో ఉన్న 11 పక్షులు ప్రతి ఒక్కటి పనిచేస్తూ కలసి ఏ విధంగా పంజరాన్ని కదుపుతాయో అట్లే ఒక శరీరంలో ఉన్నా 11 ప్రాణాలు ప్రతి ఒక్కటి తన పని తాను చేస్తూ కలిపి ప్రాణం అనే వృత్తిని పొందుతాయి అని చెప్పడం సమంజసం కాదు. పంజారాన్ని కదపడానికి అనుకూలమైన, ఒక్కొక్క పక్షిలో ఉన్నా అవాంతర వ్యాపారాలతో కూడిన పక్షులు కలసి పంజారాన్ని కదుపుతున్నప్పుడు అవి ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. కనుక యుక్తమే. శరీరంలో ఉన్న ప్రాణాలన్నీ కలసి చేష్టలు చేస్తాయని చెప్పడానికి తగిన ప్రమాణం లేదు. కనుక అలా చెప్పడం యుక్తం కాదు. ప్రాణాదులు శ్రవణాదుల కంటే చాలా విలక్షణమైనది. వాయువే శరీరంలో ప్రవేశించి ఐదువ్యూహలుగా ఏర్పడి విశేష రూపంలో ఉంటూ ప్రాణం అని చెప్పబడుతోంది.
సూత్రం :- 279
" చక్షురాదివత్తు తత్సహశిష్ట్యాది భ్యః "
చక్షు రాదివత్ :- చక్షువు లాంటి ఇంద్రియలను ఆత్మకు ఉపకరణములని చెప్పినట్లు, శ్రేష్ఠ ప్రాణం కూడా జీవాత్మకు సాధనమే. అది స్వతంత్ర పదార్ధం కాదు.తు :- ఎందుకంటే, తత్ సహశిష్ట్యాదిభ్యః :- ఆ ప్రాణాలను చక్షురాది ఇంద్రియాలతో పాటే అని శిష్టులు ఉపదేశించారు.
భావం :- చక్షువు లాంటి ఇంద్రియాలను ఆత్మకు ఉపకారణమూలైనట్లే శ్రేష్ఠ ప్రాణం కూడా జీవాత్మకు సాధనమే.
వివరణ :- ప్రాణం కూడా చక్షురాది ఇంద్రియాల వంటిదే తప్ప వేరే కాదు. కాబట్టి ప్రాణం జీవునిలా స్వతంత్రమైనది కాదు. ఛాందోగ్యంలోనూ, బృహదారణ్యకం లోను కూడా ఇంద్రియాలన్నీ తమలో ఎవరు గొప్ప అనీ వాదించుకున్నాయి. అప్పుడు ఇంద్రియలతో బాటు ప్రాణం కూడా చెప్పబడింది. దేహానికి జీవుడు రాజు, ప్రాణం మంత్రి, ఇంద్రియాలు ప్రకృతి వర్గం. కాబట్టి ప్రాణం స్వతంత్రం కాదు. అది జీవుని అధీనంలో ఉంటూ ఉపకరణంలా సహకరిస్తుంది. అనేక ఉపనిషద్ వాక్యాల్లో ప్రాణాలను నేత్రాది ఇంద్రియలతో ఉపదేశించారు. జీవుడు చక్షురాదిఇంద్రియాలను సాధనలుగా ఉపయోగించుకొని కర్తృత్వన్ని సాధిస్తాడు. అలాగే ప్రాణంసైతం సర్వార్ధ సాధనమైన జీవుడికి ఉపకరిస్తుంది. కనుక ప్రాణం స్వతంత్ర పదార్ధం కాదు. రూపాదులను గ్రహించడానికి జీవుడికి నేత్రాలు సహకరిస్తాయి. నేత్రాలకు రూపాదులు విషయాలు. ప్రాణానికి అలాంటి విషయం ప్రత్యేకంగా ఏమి లేదు. అలాంటప్పుడు ప్రాణం జీవుడికి ఎలా ఉపకరణం అవుతుందో తరువాత సూత్రంలో చెప్పబడింది. ప్రాణం శ్రేష్టం కనుక, వాగింద్రియాలు అప్రధానత్వాన్ని పొందడం చేత ఇది కూడా జీవుని శరీరంలో స్వాతంత్ర్యాన్ని పొందుతుంది. వాగింద్రియాలు నిద్రపోతున్నప్పుడు ఒక్క ప్రాణమే మేల్కొని ఉంటుంది. మృత్యువు దరి జేరనిది ప్రాణం ఒక్కటే. తల్లి తన పిల్లలను రక్షించినట్లు, ప్రాణం ఇతర ప్రాణాలను రక్షిస్తుంది. ప్రాణానికి అనేక విభూతులు ఉన్నట్లుగా వినబడుచున్నది. అందువలన ప్రాణానికి కూడా జీవుని వలేనే స్వాతంత్రం ఉండే అవకాశం ఏర్పడుతుంది. దానిని పరిహరిస్తున్నాడు. తు శబ్దం ప్రాణానికి స్వతంత్రతను నిరకరిస్తుంది. అమాత్యులందరు రాజుకు సహాయపడతారే కాని స్వతంత్రులు కారు. అట్లే చక్షురాదులు జీవునికి కర్త్రత్వం, భోకృత్వం విషయంలో ఉపకరణములుగా ఉన్నప్పటికీ అవి స్వాతంత్రం గా ఉండవు.సమాన ధర్మం ఉన్నవాటినే కలిపి చెప్పడం యుక్తం. ముఖ్య ప్రాణం ఇతర ప్రాణాలతో సమాన ధర్మం కాబట్టి వాటితో కలసి చెప్పబడుచున్నదని అర్ధం.
సూత్రం :- 280
" అకరణత్వాచ్చ న దోషః తధా హి దర్శయతి
అకరణత్వాత్ :- విషయాన్ని గ్రహించే సాధనం కానందువల్ల, తధా హి న దోషః :- ప్రాణం ఇంద్రియం కాదని చెప్పడంలో ఏ దోషము లేదు అని దర్శయతి :- శాస్త్రలంటున్నాయి.
భావం :- ప్రాణం విషయాన్ని గ్రహించే సాధనం కానందువలన అది ఇంద్రియం కాదని శాస్త్రాలంటున్నాయి.
వివరణ :- ముఖ్య ప్రాణం చక్షురాది ఇంద్రియాల వలె ఇంద్రియం కానందువలన దోషం ఏమి లేదు. ఇంద్రియాలన్నీ జీవుడికి లోబడి ఉంటాయి. కాబట్టి అవి స్వతంత్రములు కావు. అలాగే ప్రాణం కూడా జీవుడికి లోబడి ఉంటుంది. అవి స్వతంత్రములు.
ప్రశ్నపనిషత్తు ( 2, 3 ):- అత్యంత ఉత్తమమైన ప్రాణం ఇంద్రియాలను ఉద్దేశించి ఇలా అన్నది. "మోహాన్ని పొందకండి. నేనే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన రూపాల్లో ఐదురకాల విభాగాలుగా పొంది, ఈ శరీరాన్ని నిలబెట్టి ధరిస్తున్నాను. కార్యకారిగా చేస్తున్నాను. దీనిని బట్టి ప్రాణం శరీర ఇంద్రియధారణకు సాధనంగా జీవాత్మకు తోడ్పడుతుందని తెలుస్తుంది. కనుక ఇంద్రియాల లాగా ఏదో ఒక విషయాన్ని గ్రహించే కరణంగా ప్రాణం జీవుడికి ఉపయోగించకున్నా ఏ దోషమూ లేదని సూత్రార్ధం. ప్రాణం ఇంద్రియం లాగా కరణం అయినట్లయితే, ఏదో ఒక విషయాన్ని గ్రహిస్తుందని చెప్పేవాళ్ళు. అయితే ప్రాణం కరణం కాదు. అందువలన ప్రాణం ఒక విషయాన్ని గ్రహిస్తుందని చెప్పవలసిన ఆగత్యం లేదు. చక్షురాదులకు రూపాదులు విషయాలు. ప్రాణానికి అలాంటి విషయం విషయం ఏమి లేదు. శరీరాన్ని ఇంద్రియలను ధరించడమే ముఖ్య ప్రాణ కార్యం. అది విషయాన్ని గ్రహించే సాధనం కాదు. ప్రాణానికి కూడా కార్యం ఉన్నదని శ్రుతులు చెబుతున్నాయి. ప్రాణ సంవాదం మొదలైన ఘట్టాలలో ఇతరప్రాణాలతో ఊహించడానికి శక్యంకాని ఒక విశిష్టకార్యం ముఖ్యప్రాణానికి ఉన్నట్లు చెప్పబడుతోంది. "యస్మిన్ శ్రేష్ఠః" ఏ ప్రాణం లేచిపోతే ఈశరీరం పూర్తిగా చెడిపోయినట్లు అవుతుందో అది శ్రేష్ఠమైనది. శ్రేష్ఠ ప్రాణం లేచిపోదామని అనుకుంటుండగానే వాగాదులు శిధిలమై పోయినట్లు శరీరం పడిపోవడానికి సిద్ధమైనట్లు, శరీరంలోని ఇంద్రియాలన్నీ ముఖ్యప్రాణం మీద ఆధారపడినట్లు శృతులలో వినబడుచున్నది. ప్రాణం చేతనే శరీరం రక్షింపబడు చున్నదని, ఏ అవయవం నుంచి ప్రాణం లేచిపోతే, ఆఅవయవం ఎండిపోతుందని, జీవుడు ఆప్రాణం చేతనే ఏది తింటున్నాడో, ఏది త్రాగుతున్నాడో, దానిచేత ఇతర ప్రాణాలను రక్షిస్తున్నాడు. "కస్మిన్ ప్రతిష్టస్యామి" అని నప్రాణ మసృజత" అని జీవుని ఉత్క్రాంతి (శరీరం విడిచి వెళ్లిపోవడం ) గాని ప్రతిష్ట గాని ప్రాణం వల్లనే జరుగుతాయని చెప్పబడింది.
సూత్రం :- 281
" పంచ వృత్తిః మనోవత్ వ్యపదిశ్యతే "
మనోవత్ :- మనస్సుని, అంతఃకరణని, బుద్ధి, జ్ఞానశక్తి అని వ్యవహరించినట్లుగానే, పంచ వృత్తిః :- ముఖ్య ప్రాణానికి ఐదు వృత్తులున్నాయని, వ్యపదిశ్యతే :- వ్యవహారిస్తారు.
భావం :- మనస్సుని, అంతః కరణని, బుద్ధిని జ్ఞానశక్తి అని వ్యవహరించినట్లుగానే, ముఖ్య ప్రాణానికి ఐదు వృత్తులున్నాయని వ్యవహారిస్తారు.
వివరణ:-ఈశ్వరుడి సంకల్పం వలన ప్రకృతి నుంచి మహాత్తత్త్వం ఉదయిస్తుంది. మహత్తుకు రెండు శక్తులుంటాయి. జ్ఞాన శక్తి, క్రియ శక్తి. జ్ఞానశక్తితో ఉన్న మహత్తును బుద్ధి, మనస్సు, చిత్తం అంటారు. అలాగే క్రియాశక్తి తో ఉన్న మహత్తును ముఖ్య ప్రాణం అంటారు. అంతఃకరణం జ్ఞానవ్యాపారాలతో కూడుకున్నది. దానికే మనస్సు, బుద్ధి అని పేరు. క్రియావ్యాపారంతో కూడిన ఆ అంతఃకరణమే ముఖ్య ప్రాణం. క్రియాశక్తి ముఖ్య ప్రాణంగా ఉన్న అంతఃకరణపు వ్యాపార విశేషమే ముఖ్య ప్రాణం.
ఛాందోగ్యోపనిషత్తు:-(5,1,15) వాక్కు, చక్షు, శ్రోత, మనస్సులని ముఖ్యప్రాణం అన్నారు. ఇది శరీరంలో ఉండే వాయువుతో క్రియను కలిగిస్తుంది. ఈ ముఖ్యప్రాణము వలననే జీవనం కొనసాగుతుంది.
సాంఖ్య దర్శనం:-(2,31) ప్రాణాది పంచవాయువులు అంతఃకరణ వ్యాపారం, అంతఃకరణకు జ్ఞానశక్తి ప్రధానం. దాని కార్య భేదం వలన మనో బుద్ధి చిత్త అహంకారాలని అంటారు. అలాగే క్రియాశక్తి ప్రధానం అయినప్పుడు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానాలని 5 భేదాలతో ఉంటుంది.
బృహదారణ్య కోపనిషత్తు(1,5,3) "ప్రాణోపాన వ్యాన ఉదాన సమానో స ఇత్యేతత్ సర్వం ప్రాణ ఏ వ "
ప్రాణం :- ఇది ఉచ్వాస నిశ్శ్వాస క్రియలకు హేతువు. నాసికాగ్రం నుంచి హృదయం వరకు ఉంటుంది.
అపానం:-ఇది నాభినుండి పాదంవరకు వ్యాపించి ఉంటుంది.మూత్రం, మలం, గర్భం, లాంటి వాటిని బయటకు పంపడానికి హేతువు.
వ్యానం :- ఇది శరీర మంతా వ్యాపించి ఉంటుంది. శరీరం బలుపుకు హేతువు.
ఉదానం :- ఇది ముక్కు చివర నుండి శిరస్సు వరకు ఉంటుంది. చూపుకి హేతువు.
సమానం:-ఇది హృదయంనుంచి నాభివరకు ఉంటుంది. తిన్న, తాగిన పదార్ధాలాన్ని రసంగా మార్చి శరీరం ఆయా స్థానాలకు చేర్చడంలో తోడ్పడుతుంది.
మనస్సుకు నేత్రాది ఇంద్రియాల వలన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు వచ్చినట్లే, ముఖ్య ప్రాణానికి కూడా ప్రాణ,అపాన, వ్యాన, ఉదాన, సమానములనే ఐదు వ్యాపారాలు కలుగుతున్నాయి.
శ్రేష్ఠాణుత్వాధికరణం ( 2, 4, 13 )
సూత్రం :- 282
" అణు శ్చ "
అణుః :- సూక్ష్మ దేహం, చ :- కూడా ఉత్పన్నం అవుతుంది.
భావం:- బ్రహ్మంవలన ఆకాశాది పంచభూతాలను, తన్మాత్రాది పంచ భూతాలు, చక్షురాది ఇంద్రియాలు ఉత్పన్నం అయినట్లే, సూక్ష్మదేహం కూడా ఉత్పన్నం అవుతుంది.
వివరణ:- ఈఅధికరణంలో ముఖ్యప్రాణం అణుపరిమాణం కలది అని చెప్పబడింది. మిగిలిన ఇంద్రియాల వలె అతి సూక్ష్మ మైనది. శరీరం నుంచి నిష్క్రమించేటప్పుడు మిగిలిన ఇంద్రియాల వలె ఇది కూడా కనిపించదు. సూక్ష్మదేహం అంటే పంచ సూక్ష్మభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనస్సు, అహంకారయుతమైన బుద్ధి అనే 17 తత్వాల సముదాయమే. ఈ ఇంద్రియాలకు అగ్ని మొదలైన దేవతల అధిష్టానం ఉన్నది కదా! అనుగ్రహించేది అధిష్టానం. అనుగ్రహం పొందేది అనుగ్రహకం. అధిష్టానదేవతల అనుగ్రహం వలన ఇంద్రియాలు తమతమ స్థానాలలో ఉండి వాటి పనులను చేస్తున్నాయి. వాటికి దేవతాధిష్టానం ఉన్నదని చెప్పడానికి ప్రమాణం ఏమిటి? కంటిలో సూర్యుడు అధిష్టానదేవత అని ప్రత్యక్షంగా కనిపిస్తోంది కదా! అలాగే మిగిలిన ఇంద్రియాలు కూడా పనిచేస్తున్నాయని ఊహించవచ్చును కదా! ఈ ఊహ సరిఅయినది కాదు అని శంక. మానవనేత్రం పగటి పూట సూర్యకాంతి వెలుగులో అన్ని చూడగలుగుతోంది. రాత్రి పూట దోమలు, జంతువులు, కీటకాలు సూర్యకాంతి సహాయం లేకుండానే చూడగలుగుతున్నాయి కదా! అందువలన ఇంద్రియాలకు అధిస్థానదేవతలు ఉన్నారని చెప్పడం సరైంది కాదు అని సందేహం. ఈముఖ్య ప్రాణం కూడా ఇతర ప్రాణాల వలెనే అణువుగా గ్రహింపబడినది. ఇక్కడ అణుత్వం అంటే సూక్ష్మత్వం, అల్పపరిమాణత్వం అని గ్రహించాలి. అది అణు పరిమాణంలో ఉండటం కాదు. ముఖ్యప్రాణం 5 వృత్తులలో శరీరన్నంతటిని వ్యాపించి ఉంటుంది కదా! శరీరం వదలి వెళ్ళేటప్పుడు దీనిని ప్రక్కవాళ్లు కూడా చూడటం లేదు. కనుక అది సూక్ష్మం. పైకి వెళ్లిపోవడం, ప్రయాణం చెయ్యడం, తిరిగి రావడం అనేవి శృతులను బట్టి అది అల్పపరిమాణం కలది అని తెలుస్తోంది. ( ప్రశ్న )"సమః.. సర్పేణ " ఇత్యాది శృతులలో ప్రాణం విభువు అని కూడా చెప్పబడుచున్నది కదా! ఒక చిన్న పురుగులోనో, ఏనుగులోనో, దోమలోనో, ఈ మూడు లోకాలలోనూ సమానమైనది అని ఈ వాక్యానికి అర్ధం. (సమాధానం ) సమిష్టిరూపమైన హిరణ్యగర్భనకు (విరాట్ కు) సంబంధించిన అధిదైవికమైన ప్రాణస్వరూపాన్ని దీనికి విభత్వం చెప్పబడుతోంది. అంతే కాని ఆధ్యాత్మికమైన (శరీరంలో ఉండే ) స్వరూపాన్ని బట్టి కాదు. చతుర్ధశ భువనాత్మకమైన సమిష్టి రూపానికి హిరణ్యగర్భడని పేరు. ఆహిరణ్య గర్భునకు సంబంధించినంత వరకు ప్రాణం విభువు. ప్రతి ప్రాణి లోను ఉన్న ప్రాణానికి పరిమితమైన పరిమాణం చూపబడుచున్నది.
జ్యోతిరాధ్యదికరణం ( 2, 4, 14 )
సూత్రం :- 283
"జ్యోతిరాధ్యధి స్థానం తు తదామనతాత్ "
జ్యోతిః ఆది అధిష్టానం తు:-వాగాది ఇంద్రియాల్లో అగ్ని మొదలైన దేవతల అధిష్టానం ఉన్నది. అని తదామన నాత్ :- ఉపనిషత్ వాక్యాల వలన తెలుస్తోంది.
భావం :- వాగాది ఇంద్రియాలలో అగ్ని మొదలైన దేవతల అధిష్టానం ఉన్నదని ఉపనిషత్ వాక్యాల వలన తెలుస్తోంది.
వివరణ:- అగ్ని మొదలైన అధి దేవతలచే ఇంద్రియాలు ప్రేరేపింపబడుతున్నాయి. పరమాత్మ విరాటస్వరూపాన్ని దృష్టిలో ఉంచుకొని తీవ్రమైన ఆలోచన చేశాడు. అదే తపస్సు. దాని ఫలితంగానే విరాటస్వరూపానికి నోరు వచ్చింది. ఆ నోటి నుండి మాట, దాని అభిమాన దేవత అయిన అగ్ని ఉత్పన్నమయ్యాయి. ఆ తరువాత ముక్కు, దాని నుండి ప్రాణశక్తి, దాని నుండి వాయువు పుట్టాయి. నేత్రాలు - అభిమాన దేవత సూర్యుడు, చెవులు - అభిమాన దేవత దిక్కులు, హృదయం - దాని నుండి మనస్సు, అభిమాన దేవతచంద్రుడు, నాభి :- దాని నుండి అపానం, దాని నుండి మృత్యువు. జననేంద్రియలు :- దాని నుండి వీర్యం, అభిమాన దేవత జలం. ఈరకంగా ఇంద్రియలు, వాటి అభిమాన దేవతలు ఉద్భవించాయి. ఇక్కడ దేవతలచే అధిష్టింపబడి ఇంద్రియాలు పనిచేస్తున్నాయి.
ఇతరేయపనిషత్తు:-(1,2,4):- అగ్ని వాగింద్రియానికి సహకారియై ముఖంలో ప్రవేశించింది. వాయువు ఘ్రాణమై, ఆదిత్యుడు నేత్రాన్ని, దిక్కులు చెవులను ప్రవేశ్నించాయి. అగ్ని మొదలైన భూతల సహకారంతో వాక్కు మొదలైన ఇంద్రియాలు తమ తమ పనులు చేస్తున్నాయి.
అధర్వణ వేదం :-(5,2,9,7) :- సూర్యో మే చక్షుః వాతః ప్రాణః. సూర్యుడు నా చక్షువు. వాయువు నాసిక అంటున్నది. మానవ నేత్రాలు సూర్యకాంతి లేనిదే వస్తువుల్ని చూడలేవు. మరి కీటకాలు, కొన్ని జంతువులు రాత్రిపూట చూస్తున్నాయి కదా! అంటే రాత్రిపూట ఉండే వెలుతురు వాటికీ సరిపోతుంది. మన నెత్రానికి ఎక్కువ సూర్య కాంతి కావాలి. కనుక ఇంద్రియాలకు అధిష్టానదేవతలు ఉన్నారని ఒప్పుకోవాలి. ప్రాణాదులకు స్వకార్యశక్తి ఉండటం వలన తామే తమ మహిమచేతనే ప్రవర్తిస్తాయి అని చెప్పడం యుక్తం కాదు. బళ్ళు మొదలైనవి శక్తివంతములైనా ఎద్దులు మొదలైనవి అధిష్టించినప్పుడే అంటే సహాయం చేసినప్పుడే పనిజరుగుతుంది కదా! అదే విధంగా ఇంద్రియాలు కూడా అధిష్టానదేవతల చేత అధిష్టింపబడినప్పుడే అవి పనిచేస్తాయని నిశ్చయింపబడింది.
సూత్రం :- 284
" ప్రాణవతా శబ్దాత్ "
ప్రాణవతా :- ఇంద్రియాలు వాటికి స్వామి అయిన జీవాత్మకు సంబంధించినవి. బ్రహ్మనికి కాదు అని, శబ్దాత్ :- శృతి వచనల వలన తెలుస్తోంది.
భావం :- ఇంద్రియాలు వాటికి స్వామి అయిన జీవాత్మకు సంబంధించినవి. కాని బ్రహ్మనికి సంబంధించినవి కావు.
వివరణ :- శ్రుతులలో చెప్పిన దాన్ని బట్టి ఇంద్రియాలకు జీవునితోనే సంబంధం ఉంది. ఇంద్రియాలకు అధిష్టాన దేవతలు ఉన్నప్పటికీ వాటి సంబంధం జీవునితోనే ప్రత్యక్షంగా ఉంటుంది. చాక్షుప పురుషుడు. అతను చూడటానికి ఈ చక్షువు. అతను వినడానికి చెవులు. అతను వాసన చూడటానికి ఈ ముక్కు. ఈ రకంగా ఇంద్రియాలన్నీ జీవుని కోసమే. జీవునితోనే ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నాయి. ఇంద్రియ అభిమాన దేవతలు వేరుగా ఉన్నప్పటికీ వారికి భోక్తవ్యం ఉండదు. కర్మ ఫల సంబంధం ఉండదు. ఇంద్రియాలు భోగాపురం సాధనాలు. భోక్త అయిన జీవత్మతోటే వాటికీ సంబంధం. బ్రహ్మం భోక్త కాదు. అందువలన బ్రహ్మనికి ఇంద్రియలు భోగాపురం సాధనలు కావు.
ఋగ్వేదం (2,3,17,20) తయో రన్యః పిప్పలం స్వాద్వ త్తి అనశ్నన్ అనోభిచాక శీతి " జీవేశ్వరులలో జీవుడే సుఖ దుఃఖాలు అనుభవిస్తాడు. ఈశ్వరుడు అలా కాక అంతటా ప్రకాశస్తాడు అని ప్రమాణం. దీని వల్ల జీవుడే భోక్త కాని పరమేశ్వరుడు కాదని తెలుస్తోంది. అందుచేత భోగాపురం సాధనాలైన ఇంద్రియాలతో బ్రహ్మనికి సంబంధం లేదు. ప్రాణాలకు అధిష్టాన దేవతలున్నా కూడా ప్రాణాలకు సంబంధం ప్రాణవంతుడితోనే. " అధి-ఘ్రాణం" ఇత్యాది శ్రుతులు ప్రాణాలకు శరీరం తోనే సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఎవని భోగంకోసం చక్షస్సు ఆకాశాన్ని (నేత్రగోళ్ళాన్ని) ప్రవేశించిందో ఆ పురుషుడు చాక్షుసుడు. అతడు చూడటం కొరకే చక్షస్సు ఉపయోగిస్తుంది. నేను దీనిని వాసనచూస్తున్నాను అని ఎవడు తెలుసుకుంటాడో అతడు ఆత్మ అంటే జీవుడు. ఒక్కొక్క కరణానికి ఒక్కొక్క అధిష్టాతయైన దేవత ఉండటం చేత ఆ దేవతలందరికి ఈ శరీరంతో భోకృత్వం కుదరదు. ఈ శరీరంతో భోక్త అయిన శారీరుడు ఒక్కడే అని తెలుస్తుంది.
సూత్రం - 285
" తస్య చ నిత్యత్వాత్ "
చ :- ఇంకా, తస్య :- ఆ జీవుడే నిత్యుడు కావడం వలన, నిత్య త్వాత్ :- ఈ శరీరంలో నిత్యుడు గా ఉండటం వలన, ప్రాణులకు వాటితోనే సంబంధం.
భావం :- జీవుడు ఈ శరీరంలో నిత్యుడు కావడం వలన అతనికి ఇంద్రియాలతో సంబంధం ఉంటుంది.
వివరణ:- కర్మ సంబంధం వలన జీవుడికి ఇంద్రియాలతో సంబంధం ఏర్పడుతుంది. బ్రహ్మ నిత్యం, చేతనం కనుక అలాంటి సంబంధం బ్రహ్మకులేదు. లౌకిక ప్రపంచంలో జీవుడికి అనేక కర్మలు నిర్వహిస్తుండటంతో పుణ్య పాప సంబంధం, సుఖ దుఃఖాల భోగమూ సంభవిస్తుంది. అందువలన ఈశరీరంలో జీవుడే భోక్తగా నిత్యుడు. అంతే కాని దేవతలకు ఈశరీరంతో నిత్యత్వం ఉండదు. ఉత్తమైన స్థానాలలో ఉన్నా, దేవతలు హీనమైన ఈ శరీరంలో నిత్యత్వం లేదు. బోక్తృత్వాన్ని పొందడానికి తగరు.
బృహదారణ్యకోపనిషత్తు:- శరీరంలో ఇంద్రియాది దేవతలకు భోక్తృత్వం లేదు. భోక్త రూపంలో జీవుడే నిత్యుడు. ఈ శరీరం జీవుని కర్మ వలన ఏర్పడింది. అందుచేత జీవుడే భోక్త. అతనికే పుణ్య పాప సంబంధం ఉంటుంది. సుఖము, దుఃఖం, భోగము జీవునికే ఉంటాయి. దేవతలు అంటే విశిష్ట కర్మఫలం దైవత్వం పొందినవారు. వీరికి పుణ్యఫలమే కాని పాపఫలం అంటదు. వారికీ మానవశరీరంలో భోగం కూడా ఉండదు. జీవాత్మ శరీరం నుండి బయటకు పోవడానికి మార్గం కనిపిస్తుంది. ఆస్థితిలో శిరస్సు ద్వారా గాని, మిగిలిన అవయవాల ద్వారా గాని బయటకు పోతుంది. దానితో బాటే ప్రాణం కూడా పోతుంది. కాబట్టి అధిష్టానదేవతలకు భోక్తృత్వం లేదు. జీవుడికే భోకృత్వం "పుణ్య.. గచ్చతి " దేవతలకు పుణ్యమే చేరుతుంది కాని పాపం అంటదు. ఉత్క్రాంతిలో కూడా ప్రాణాలు జీవుణ్ణే అనుసరించి ఉంటాయి కనుక ప్రాణాలకు జీవుడితోనే నిత్యమైన సంబంధం ఉంటుంది అని శ్రుతులు చెబుతున్నాయి. అందువలన ప్రాణాలను నియంత్రించే దేవతలు ఉన్నా కూడా శారీరునికి భోకృత్వం లేకుండా ఉండదు. దేవతలు కరణాలు పనిచేసేటట్లు చూస్తారు కాని వారికీ భోకృత్వం ఉండదు.
ఇంద్రియాధికరణం ( 2, 4, 17 )
సూత్రం :-286
" త ఇంద్రియాణి తద్వ్య ప దేశాత్ అన్యత్ర శ్రేష్టాత్ "
తే :- ఆ, శ్రేష్ఠాత్ అన్యత్ర :- శ్రేష్ఠ ప్రాణం తప్ప మిగిలిన ప్రాణాలకు, ఇంద్రియాణి :- ఇంద్రియాలు అంటారని, తత్ వ్యపదేశాత్ :- శ్రుతుల్లో వ్యవహారిస్తారు. ఇంద్రస్య :- ఆత్మకు భోగ సాధనం అయ్యేది ఇంద్రియం.
భావం :- ఆ శ్రేష్ఠ ప్రాణం తప్ప మిగిలిన ప్రాణాలను ఇంద్రియాలంటారని శ్రుతులలో వ్యవహారిస్తారు.
వివరణ:- ఉపనిషత్తులలో ఇంద్రియాలను ప్రాణశబ్దంతో వ్యవహరించారు. ఇంద్రియాలు రూప, రస, గంధాది విషయాన్ని గ్రహించేటట్లు చేస్తాయి. తద్వారా జీవాత్మకు సుఖదుఃఖాలు కలుగుతాయి. ఒక ముఖ్యప్రాణం ఇతరమైన 11 ప్రాణాలు చెప్పబడ్డాయి. ఇతర ప్రాణాలన్ని ముఖ్యప్రాణం యొక్క వృత్తి భేదాలా? లేక వేరు పదార్ధాలా? అనే వాటి విషయంలోనే ఇప్పుడు సందేహం. ఇతర ప్రాణాలన్నీ ముఖ్య ప్రాణ రూపాలే అని ప్రాప్తించింది. ఎందువలన? శృతి వలన. ముఖ్య ప్రాణాలను, ఇతర ప్రాణాలను ఒక చోట చేర్చి ఇతర ప్రాణాలన్ని ముఖ్యప్రాణ రూపాలని చెప్పుచున్నది. వీటన్నిoటికి ప్రాణ అనే పేరు ఉండటం వలన కూడా ఇవన్నీ ఒక్కటే అని నిర్ణయం.అలా కాకపోతే ఒకే ప్రాణానికి వేరు వేరు అర్ధాలు చెప్పవలసిన వస్తుంది. అది అన్యాయం. ఈపదం ఒకచోట ముఖ్యార్ధం భోదిస్తుందని మరొక చోట లాక్షణికమైన అర్ధం భోదిస్తుందని చెప్పవలసిన వస్తుంది. అందువల్ల ఒకే ప్రాణానికి ప్రాణం మొదలైన 5 వృత్తులు ఉన్నాయో, అలాగే వాక్కు మొదలైన 11 కూడా దీని వృత్తులే." మనః సర్వేంద్రియాణి చ "అని మనస్సుని, ఇంద్రియాలను వేరు వేరుగా చెప్పడం వలన మనస్సు కూడా ప్రాణం వలెనే ఇంద్రియం కాదని చెప్పవలసి వస్తోంది కదా! అని సందేహం. "ఇంద్రియాణి దశైకం చ పంచేంద్రియ గోచరా " అనే స్మృతి లో ఇంద్రియలు 11, అని చెప్పి మనస్సు కూడా శ్రోత్రాదుల వలె ఇంద్రియంగా గ్రహించబడుతుంది. ప్రాణం ఇంద్రియం అని శృతిలో గాని, స్మృతి లో గాని ప్రసిద్ధంగా కనబడటం లేదు. వేదమందు వేరుగా చెప్పబడటం వలన ముఖ్య ప్రాణం కన్నా వేరైనట్టి వాగాదులన్నీ ఇంద్రియాలు అనే శబ్దంతో చెప్పబడుచున్నాయి. ముండకోపనిషత్తులో పరమాత్మ నుంచి ప్రాణాలు, మనస్సు, సమస్త ఇంద్రియాలు పుడుతున్నాయి. ఇక్కడ ప్రాణాలు, ఇంద్రియాలు వేరు వేరు అని చెప్పారు. కాబట్టి ప్రాణాలు ఇంద్రియాలు కావు. మనస్సు ఆరవ ఇంద్రియం.
సూత్రం :-287
" భేద శ్రుతేః "
భేద :- వాగాది ఇంద్రియాల కన్నా శ్రేష్ఠ ప్రాణం వేరని, శృతేః :- శాస్త్రాలు అంటున్నాయి.
భావం :- వాగాది ఇంద్రియాల కన్నా శ్రేష్ఠ ప్రాణం వేరని శాస్త్రాలు అంటున్నాయి.
వివరణ :- వేదంలో ప్రాణాలను వేరుగా చూపడం వలన వాగాదులు ముఖ్య ప్రాణం కన్నా భిన్న తత్వాలే.
బృహదారణ్యకోపనిషత్తు:- దేవదానవుల యుద్ధంలో దేవతలు ఓడిపోయి ఉద్గీతోపాసనతో అసురుల మీద విజయాన్ని సాధించాలనుకున్నారు. ముందుగా వాగీంద్రియాన్ని ఆశ్రయించి తమ కోసం ఉద్గీతోపాసన చెయ్యమన్నారు అని చెబుతూ చివరకు ముఖ్య ప్రాణంతో అసురులను జయించారు అని చెప్పబడింది. అంటే ఇంద్రియాలు ప్రాణం వేరు వేరు అని తెలుస్తోంది.
ప్రశ్నపనిషత్తు ( 2, 4 ) :-"వాక్, మనః, చక్షుః, శ్రోతః, చ తే ప్రీతాః ప్రాణం స్తున్వంతి " వాక్కు, మనస్సు, నేత్రం, చెవి అనే ఈ ఇంద్రియాలు ప్రీతితో ముఖ్య ప్రాణాన్ని స్తుతిస్తాయి అనే వాక్యంలో వాగాది ఇంద్రియాలను ముఖ్యప్రాణం కన్నా వేరే అని నిర్ధేసించారు. శాస్త్రీయ మైన ఇంద్రియ మనోవృత్తులే దేవతలు. పాప వృత్తులు అసురులు. ఉద్గీరం చెయ్యడానికి ప్రారంభించిన వాక్కుతో దేవతలు, నువ్వు అసురులు నశించేటట్లు ఉద్గానం చెయ్యి అని కోరాయి. సరేనని ఉద్గానం చేస్తున్న వాక్కును అసురులు అనృతం అంటే అసత్యం పలకడం మొదలైన దోషంతో నశింపజేసాయి. అదే విధంగా వరుసగా అన్ని ఇంద్రియాలు పాపగ్రస్తాలయ్యాయి. దీనిని బట్టి ఇంద్రియలు వేరు, ముఖ్య ప్రాణం వేరు అని తెలుస్తోంది. ప్రజాపతి మనస్సును, వాక్కును, ప్రాణాన్ని, తన కొరకు నిర్మించుకున్నాడట. అందువల్ల కూడా ముఖ్య ప్రాణం కంటే ఇతర ప్రాణలు భిన్నమైన తత్వాలు.
సూత్రం :-:288
" వై లక్షణ్యాచ్చ "
చ :- పైగా, వై లక్షణ్యాత్ :-వాగాది ఇంద్రియాల కన్నా శ్రేష్ఠ ప్రాణానికి ధర్మంలో భేదం ఉంది.
భావం :- వాగాది ఇంద్రియాల కన్నా శ్రేష్ఠ ప్రాణానికి విలక్షణ ధర్మం ఉంది.
వివరణ:-గాఢనిద్రలో వాగాదిఇంద్రియాలు మనస్సుతో కలసి సుఖంగా నిద్రిస్తాయి. కాని ముఖ్య ప్రాణం మాత్రం జాగ్రదావస్థలో ఉంటుంది.
ప్రశ్నపనిషత్తు(4,3) :- సూర్యుడు అస్తమించేటప్పుడు కిరణాలు ఒక్కటై తేజోమండలంలో ఉండి పోయి, మళ్ళీ ఉదయం దిక్కుల్లో ప్రసారించేటట్లు, వాగాది ఇంద్రియాలు సుషుప్తిలో సూక్ష్మమనస్సులో ఏకమై ఉంటాయి. కాబట్టి జీవాత్మ అప్పుడు వినడు, చూడడు, వాసన పీల్చడు, రుచి చూడడు, తాకడు, మాట్లాడడు, పట్టుకోడు, విడువడు, సంతోషించడు. అప్పుడు తట్టి నిద్రిస్తున్నాడు అంటారు. ప్రాణంమాత్రం అప్పుడు జాగ్రదావస్థలో ఉంటుంది. ఇలా వాగాదిఇంద్రియాలకు ముఖ్య ప్రాణానికి ధర్మభేదం ఉంది. ముఖ్య ప్రాణం కన్నా ఇతర ఇంద్రియాలకు భేదం ఉండటం వలన ప్రాణం, ఇంద్రియాలు వేర్వేరు అని చెప్పవచ్చును.
బృహదారణ్యకోపనిషత్తు :- మరణ కాలంలో వాక్కు మనస్సులో లీనమౌతుంది. మనస్సు ప్రాణంలో లీనమౌతుంది. చివరకు అది పరమశక్తిలో కలసిపోతుంది. కాబట్టి ఇంద్రియాలు ప్రాణం వేరు వేరు అని చెప్పబడింది. ముఖ్య ప్రాణానికి ఇతర ప్రాణాలకి వేరు వేరు లక్షణాలు ఉన్నాయి. వాగాదులు నిద్రిస్తున్నప్పుడు ఒక్క ముఖ్యప్రాణమే మేల్కొని ఉంటుంది. అది మృత్యువు చేత ఆక్రమించబడదు. ఇతరమైనవి ఆక్రమించబడ్డాయి. ముఖ్యప్రాణమే స్థితిచేత పైకి లేచిపోవడం చేత దేహం యొక్క పతనానికి హేతువు. ఇంద్రియాలు హేతువు కావు. ఇంద్రియాలు విషయాలను గ్రహించడానికి హేతువులు. ప్రాణం కాదు. ఈ విధమైన అత్యధిక లక్షణ భేదం ప్రాణ, ఇంద్రియాల మధ్య ఉన్నది. వాగాదులు మృత్యువు చేత ఆక్రమించబడి, ప్రాణాన్ని వేరుగా పేర్కొన్నారు. "అయం శ్రేష్ఠః" ఇది మనలో శ్రేష్ఠమైనది. దానికి శ్రేష్ఠత్వాన్ని నిర్ధారణ చేస్తున్నారు. అందుచేత దీనికంతకీ విరుద్ధంగా ఉండాలంటే వాగాదులు ప్రాణంతో విరోధం లేకుండా ఆ ప్రాణం మీదనే ఆధారపడి స్పందనాన్ని పొందడమే కాని, ప్రాణంతో తాదాత్మ్యం చెందటం కాదు. అందుచేత ప్రాణ శబ్దం ఇంద్రియాలు అనే అర్ధంతో ప్రయోగించడం కుదురుతుంది. ఆ ప్రాణాలన్ని ముఖ్య ప్రాణం యొక్క రూపాలయ్యాయి. అందుచేతనే ఇవి ప్రాణాలని చెప్పబడుతున్నాయి. శృతిని అనుసరించి ప్రాణ శబ్దం ముఖ్యంగా ముఖ్య ప్రాణాన్ని బోధిస్తుందని, ఇంద్రియాలను లక్షణావృత్తి చేత బోధిస్తుందని చూపుచున్నది. అందువలన ఇంద్రియలు ప్రాణం కంటే భిన్నమైన తత్వాలు.
సంజ్ఞా మూర్తి క్ల ప్త్యధి కరణం ( 2, 4, 20 )
సూత్రం :- 289
" సంజ్ఞ మూర్తి క్లుప్తిస్తు త్రివృత్ కుర్వత ఉపదేశాత్ "
సంజ్ఞా మూర్తి క్లుప్తిః తు :- పేరు, ఆకారం అనే ఈ రెండింటిని ఏర్పరచడం, నిర్మించడం, త్రివృత్ కుర్వతః :- మూడు దేవతలను సృష్టించిన బ్రహ్మం వలననే జరుగుతాయని, ఉపదేశాత్ :- ఉపనిషత్తులు అంటున్నాయి.
భావం :- పేరు, రూపం, నిర్మించడం అగ్ని, నీరు, భూమి దేవతలను సృష్టించిన బ్రహ్మ వలననే సాధ్యమవుతుందని ఉపనిషత్తులు చెబుతున్నాయి.
వివరణ:- నామరూప నిర్మాణమైతే పరమేశ్వరుని యొక్క పని అని శృతిలో చెప్పబడింది. అగ్ని, నీరు, భూమి ఈ మూడు దేవతలను సృష్టించినట్లు ఛాందోగ్యంలో సృష్టి ప్రకరణంలో చెప్పబడింది.
ఛాందోగ్యోపనిషత్తు:-(6,3,2) నేనే మూడుదేవతల్లో ఈజీవాత్మతో బాటు ప్రవేశించి, నామరూపాలు రచిస్తాను. అన్ని పదార్ధాలలో అంతర్యామిగా ఉండేవాడు ఈశ్వరుడు... పరదేవత ఆయన ఇలా సంకల్పించాడు. " నేను ఇదివరకే పుట్టించిన అగ్ని, జల, పృధివి దేవతల్లో అశుభ, శుభ కర్మలు చేస్తూ, వాటి ఫలాలైన సుఖ దుఃఖాలు అనుభవించే జీవుడితో బాటు ప్రవేశించి, ఈ దేవతల ద్వారా ఏర్పడే వస్తువులకు, నామాన్ని, రూపాన్ని, ఆకృతిని ఏర్పరుస్తారు. ఇలా లోకంలో ఉండే పదార్ధాల నామ రూప నిర్మాణం ఎవరు చేస్తారు. ఈశ్వరుడే నామ రూప కర్త. జీవుడు కర్త కానేరడు. పరబ్రహ్మయే సూర్య, చంద్ర, నక్షత్ర, పర్వత, సముద్రాలకు పేరు రూపం ఇచ్చేవాడు. జీవుడు ఈ ప్రపంచంలో ఘటపటాదులను సృష్టించి వాటికీ పేర్లు పెడుతున్నాడు కదా! కనుక అతడే నిర్మాత అని ఎందుకు అనకూడదు? జీవుడు పంచభూతాత్మకమైన వస్తువులు లభించినప్పుడు తనకు అనుకూలంగా ఘట పటాదులను నిర్మించుకోగలడే కాని దేన్నీ సృష్టించలేడు. ఇక సూర్యుడు, జలం, పృథవి ఇలాంటి వాటిని ఏమి సృష్టిస్తాడు?
ఛాందోగ్యోపనిషత్తు(8,14,1) "ఆకాశావై నామరూప యోర్నిర్వహితా" ఆకాశాదిభూతాలను నిర్మించి నిర్వహించేవాడు పరమాత్మ. కనుక బ్రహ్మమే. జీవులకు కావలసిన శరీరాది పదార్ధాలను నిర్మించి వాటికీ నామాలను కూడా ఏర్పరచాడు. కనుక స్తూల శరీరాదుల నిర్మాణానికి ఆయనే కర్త. ఈ నామరూప వ్యాకరణం జీవుడు చేసినదా? పరమేశ్వరుడు చేసినదా? అని సంశయం. "అనేక జీవత్మనా"(ఈ జీవస్వరూపంలో ప్రవేశించి) అని విశేషించి చెప్పబడింది. రాజు తన గూఢచారుల ద్వారా శత్రుసైన్యంలో ప్రవేశించి పరిశీలిస్తాడు. ఇక్కడ రాజుకంటే వేరుగా గూఢచారి ఉన్నపటికీ, ప్రేరకుడు రాజు కాని గూఢచారి కాదు.' 'సంకలయాని 'అని అని ఉత్తమపురుషుడు ప్రయోగం చేసి తన మీద ఆరోపించుకుంటాడో అదే విధంగా ఉత్తమపురుషుడైన పరమేశ్వరుడు ప్రేరక కర్తగా తన మీద ఆరోపించుకుంటాడు. ఘటాలు, పటాలు మొదలైన రూపాల విషయంలో జీవుడే కర్త అని చూపుచున్నది. సంజ్ఞమూర్తి క్లప్తిస్తు అనగా నామరూపవ్యాకరణం అని అర్ధం. త్రివృత్యరణం (పరమేశ్వరుణ్ణి బోధిస్తుంది) విషయంలో పరమేశ్వరుడే కర్త అని నిశ్శంశయంగా చెప్పబడింది. ఆదిత్యుడు, చంద్రుడు, విద్యుత్తు అని ఏ సంజ్ఞ క్లప్తి ( నామ విధానం ) మూర్తి క్లప్తి ( రూప విధానం ) ఉన్నాయో, అట్లే కుశలు, రెల్లు గడ్డి, ఫలాసం, గిరి, నది, సముద్రాలు, ప్రతి జీవికి ప్రతి వ్యక్తికి సంబంధించిన అనేక విధాలైన ఏనామరూప విధానం ఉన్నదో అది తేజస్సును, జలాన్ని, పృథవిని సృష్టించిన పరమేశ్వరుడు చేసిన పనే అయిఉండాలి. ఎందువలన? ఉపదేశం వలన. ఉత్తమ పురుష ప్రయోగంచేత పరబ్రహ్మయే వ్యాకర్త అని చెప్పబడు చున్నది. పరమేశ్వరుడి కంటే భిన్నుడుగా జీవుడనే వాడు లేదు కదా! జీవత్వం కేవలం ఉపాధిని బట్టి మాత్రమే ఏర్పడింది. అందుచేత జీవుడు చేసిన నామరూప వ్యాకరణం కూడా పరమేశ్వర కృతమే అవుతుంది. నామ రూపాలను వికసింపజేయట మనేది ఈశ్వరుని పనే. పరమేశ్వరుడు ముందుగా తేజస్సును, ఆ తరువాత జలము, అన్నము, సృష్టించి నేను వీటిలో ప్రవేశించి, నామ రూపాలను విస్తరింపజేస్తాను అనుకున్నాడు. కాబట్టి నామరూప కర్త ఈశ్వరుడే కాని వేరేవారు కాదు.
సూత్రం :- 290
“ మాంసాది భౌమం యధా శబ్ద మిత రయోశ్చ "
మాంసాది భౌమం :- మాంసాది నిర్మాణం భూమి పని, ఇతరయో చ :- ఇతర పనులు , జలం, అగ్ని కార్యాలు అని యధా శబ్దం :- ఉపనిషత్తులంటున్నాయి.
భావం :- మన శరీరంలో మాంసం లాంటివి భూమి కార్యం, రక్తం లాంటివి జలం కార్యం, ఎముకల్లాంటివి అగ్ని కార్యం అని ఉపనిషత్తులు అంటున్నాయి.
వివరణ:- మాంసపురీషాలు అన్నాత్మక మైన భూమియొక్క కార్యాలు. అన్నాన్ని పురుషుడు భుజిస్తున్నాడు. అతను భుజించిన ఆహరం నుండి మాంసాది కార్యం తయారవుతుంది. తిన్న అన్నం మూడు విధాలవుతుంది. స్థూల భాగం, మధ్య భాగం, సూక్ష్మభాగం. స్థూల మైన ధాతువు పూరీషం, మధ్య రకం ధాతువు మాంసం, సూక్ష్మధాతువు మనస్సు అవుతుంది. జీవుడు ధాన్యాది రూపంలో పృధివినే భుజిస్తున్నాడు. అదే విధంగా మనం త్రాగిన నీరు మూత్రం, రక్తం, ప్రాణంగా మారుతోంది. అలాగే మనం భుజించే తేజస్సు యొక్క పదార్ధాలు నూనె, నెయ్యి మొదలైనవి ఎముకలు, మజ్జ, వాక్కుగా మారుతోంది. దీనినే త్రివృత్కరణం అంటారు.అనగా మూడు భాగాలూ కలిపి ఒక భూతంగా అవడం, శరీరంలో ఈ భూతాలు త్రివృత్కరణం ఒక్కొక్క భూతం మూడేసి కార్యాలు పుట్టిస్తుంది.
ఛాందోగ్యోపనిషత్తు:-(6,5,11)తిన్న అన్నం మూడు రకాలవుతుంది. దానిలో స్థూలం మలం, మధ్యమం మాంసం, సూక్ష్మ తరం మనస్సు అవుతాయి. భూమిని ధాన్యాదిరాశుల రూపంలో జంతుజాలం భక్షిస్తుంది. ఆహరం స్వీకరించడం వలన మనస్సుతో పట్టుత్వం వస్తుంది. ఉపవాసంనాడు బలహీనంగా ఉండటం తెలిసిందే కదా! అంటే కార్య జనక శక్తి ప్రకటమౌతుంది. నెయ్యి లాంటి తేజో ద్రవ్యాల వలన వాక్ పట్టుత్వం వస్తుంది. దీని వలన తేలినదేమిటి? శరీరాలు పృధివ్యాధి పాంచ భౌతిక కార్యాలు అని తెలుస్తోంది.
సూత్రం :- 291
" వైశేష్యాత్తు తద్వాదః తద్వాదః "
వైశేష్యాత్ తు :- పార్ధివ భాగం ఎక్కువగా ఉండటం వలన, తద్వాదః :- దాన్ని మట్టి శరీరం, పార్ధివ దేహం అని అంటారు.
భావం :- ఈ శరీరం పాంచభౌతికమైనా, అందులో భూమి పాలు ఎక్కువగా ఉన్నందున దాన్ని పార్ధివ దేహం అంటారు.
వివరణ:-త్రివృత్కరణం (మూడు భూతాల మూడు భాగాలూ కలసి ఒక భూతంగా అవడం, ఒక్కొక్క భూతం మూడు కార్యాలు నిర్వహించడం) జరిగినా ఏదో ఒక మూలభూతం యొక్క ఆధిక్యత కనిపిస్తుంది. అగ్నిలో తేజస్సు యొక్క ఆధిక్యం, జలం లో జలం యొక్క ఆధిక్యం, పృధివిలో అన్నం యొక్క ఆధిక్యంవలె, ఈ త్రివృకృత మనేది లోక వ్యవహారం కోసం చెప్పబడింది. ఈ రకంగా నామరూపవ్యక్తీకరణ ఈశ్వర్ కృతమే గాని, జీవకృతంకాదు. త్రివృత్కరణం జరిగి ఉండటం చేత పృథవి లో నీరు, అగ్ని కూడా ఉన్నాయి. అట్లే ఇతరమైన రెండింటిలోను కూడా అందుచేత పృథివి అనే దానికి అగ్ని అని, జలం అని కూడా అనవచ్చును కదా! అని అర్ధం. అగ్నిలో తేజస్సు పాలు ఎక్కువగా ఉండటం, పృథవిలో అన్నం(భూమి) పాలు ఎక్కువగా ఉండటం, ఈవిధంగా ఒకదానిలో ఒకధాతువు అధికంగా కనబడుతుంది. మూడుపేటలు పేనిన తాడు ఒక్కటే అని వ్యవహరించినట్లు లోకంలో వేరువేరుగా మూడు భూతాలకు సంబంధించిన వ్యవహారం ప్రసిద్ధం కాదు. అనగా ఒక్కొక్క భూతంలో మూడు భూతాలు ఉన్నా కూడా అవి కలిపి ఏకం ఐయిపోవడం చేత ఎక్కువగా ఉన్నదానిని బట్టి లోక వ్యవహారం జరుగుతుంది. తద్వాదః అని ఒక పదాన్ని రెండు సార్లు ఆవృత్తి చెయ్యడం అధ్యాయం పూర్తి అయినదని సూచిస్తుంది.
( రెండవ అధ్యాయం సమాప్తం )
తృతీయాధ్యాయం
ఈ అధ్యాయంలో జీవుడికి సంసారగతి ఏ విధంగా సంభవిస్తోంది? వాటి అవస్థలు ఏమిటి? మోక్షం ఎలా సిద్ధిస్తుంది? మొదటి పాదంలో వైరాగ్యసిద్ధి కోసం పంచాగ్ని విద్యను బోధించి, తద్వారా వైరాగ్యం కలిగించే మార్గం గురించి వివరించారు. లోకంలో మూడు రకాలైన మనుషున్నారు. 1.పాపాత్ములు, 2.కర్మాధికారులు, 3.బ్రహ్మవిద్యోపాసకులు. 1.పాపాత్ములు లౌకిక వ్యవహారలలో మునిగిపోయి, వారి ఆలోచనా ధోరణి పాపచింతనతో నిండి, అన్యాయాలు, అక్రమాలు, మోసాలు చేస్తూ, జీవితం గడుపుతారు. వీరు మరణించిన తరువాత నరకానికి చేరుతారు. 2 కర్మాచారపరాయణులు ప్రాతఃకాలం, సంధ్యాకాలం లో హోమం చెయ్యడం, యజ్ఞయాగాలు నిర్వహించడం ద్వారా శరీరం విడిచిన తరువాత, స్వర్గ లోకం చేరి, అక్కడ భోగాలు అనుభవించి, చేసిన పుణ్యం ఖర్చు అయిపోయిన తరువాత, కర్మఫలితంగా భూలోకంలో మళ్ళీ జన్మిస్తారు. 3. బ్రహ్మ విద్యో పాసకులు పురాణాలూ, శాస్త్రాలు, భగవద్గీత పఠిస్తూ, సగుణోపాసన చేస్తూ, ఆతరువాత నిర్గుణోపాసన చేసి, మోక్షాన్ని పొందడానికి, శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత అర్చిరాదిమార్గం అంటే వెలుగుమార్గం ద్వారా ఒక్కొక్క లోకం దాటి, బ్రహ్మలోకం చేరి, బ్రహ్మతోబాటు పరమాత్మలో లీనంఅవుతారు. ఈ 3వఅధ్యయం మొదటి పాదంలో కర్మాచార పరాయణులు యజ్ఞయాగాదులు చేసినవారు శరీరాన్ని విడిచిన తరువాత ఏ రకంగా ప్రయాణం చేస్తారు? ఏ భోగాలు అనుభవిస్తారు? మరల ఈ లోకంలో శరీర ధారణ ఎలా చేస్తారు అనే విషయాలను గురించి తెలియజేసారు.
తదంతర ప్రతి పత్యధికరణం ( 3, 1, 1 )
సూత్రం :- 292
" తదంతర ప్రతి పత్తో రంహతి సంపరి ష్వక్తః ప్రశ్న నిరూపణాభ్యం "
తదంతర ప్రతి పత్తౌః :- జీవాత్మ తన శరీరాన్ని వదలి, సంపరిష్వక్తః :- సూక్ష్మ దేహంతో, రాంహాతి :- వెడతాడు అని తెలుస్తోంది.
భావం :- జీవుడు తన శరీరాన్ని వదలి ఇంకొక శరీరాన్ని పొందడానికి భూత సూక్ష్మలతో కలసి వెడుతున్నాడు.
వివరణ :- జీవుడు సూక్ష్మభూతాలతో కలసి దేహాన్నివిడిచి, ప్రాణం, ఇంద్రియాలు, మనస్సు, అవిద్య, బుద్ధి తీసుకొని పరుగెడుతున్నాడు. సూక్ష్మ దేహం ఎంత వేగంగానైనా పరుగెడుతుంది. అంత వేగంగా స్థూల దేహం అలా వెళ్ళలేదు.
ఛాందోగ్యోపనిషత్తు :- పూర్వం పాంచాల దేశాన్ని ప్రవాహణుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతను మహాజ్ఞాని. గౌతమ మహర్షి తన కుమారుడైన శ్వేతకేతువుకు తన విద్యలన్నీ బోధించడంతో కుమారునిలో విద్యా గర్వం వచ్చింది. ప్రవాహనుడు తాను యజ్ఞాన్ని చేయాలని నిశ్చయించి, అనేకమంది రాజులను, సామంత రాజులను ఆహ్వానించాడు. ఒక్కొక్క రోజు పండిత సభ నిర్వహించి చర్చలు జరిపాడు. ప్రవాహణుడు శ్వేత కేతువును విద్యాభ్యాసం పూర్తి అయిందా? అని అడుగుతాడు. రాజా! మా తండ్రి అన్ని విద్యలు బోధించాడు, అని సమాధానం చెప్పాడు. ఓశ్వేతకేతూ! నేను నిన్ను ఐదు ప్రశ్నలు అడుగుతాను. వాటికీ సమాధానం చెప్పగలిగితే నువ్వు అన్నీ విద్యలలో ఆరితేరిన వాడివవుతావు అని 5 ప్రశ్నలు అడిగాడు.
1. కర్మాధికారులైన మానవులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెడుతున్నారు?
2. ఏ లోకం విడిచి వెళ్లిన వారు తిరిగి ఈ లోకానికి ఎలా వస్తున్నారు?
3.దేవయాన మార్గం, పితృయాన మార్గం అంటే ఏమిటి?
4. ఈ లోకంలో పుణ్య కర్మలు చేసి స్వర్గానికి వెడుతున్నారు కదా! ఆ లోకాలు ఏమిటి?
5.ప్రకృతి పరిమాణంలో పురుషాహంకారం ఎలా ఏర్పడుతుంది. అని అడిగాడు.
శ్వేతకేతువుకు దీనిలో ఒక్కటి కూడా తెలియలేదు. ఈముఖ్యాంశాల మీద నీకు జ్ఞానం లేదా అని అడిగేసరికి అతనికున్న విద్యాగర్వం తొలగిపోయి, తన తండ్రి దగ్గరకు వెళ్లి ఈప్రశ్నలకు సమాధానం అడుగుతాడు. తండ్రి తనకు కూడా వాటికి సమాధానాలు తెలియవని, ఇద్దరూ రాజు దగ్గరకు వచ్చారు. మీకు ఏమి కావాలి? గోవులా? భూమూలా? అని అడిగాడు రాజు. మాకేమి వద్దు, ఈప్రశ్నకు సమాధానం చెప్పగలిగే జ్ఞానం ప్రసాదించమని కోరారు. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా! ఇంతవరకు ఈ పంచాగ్నివిద్య క్షత్రియులకు, యమధర్మరాజుకు మాత్రమే తెలుసును. బ్రాహ్మణులకు తెలియదు. ఇప్పుడు నీవలన బ్రాహ్మణులకు కూడా తెలుస్తుంది. ఈపంచాగ్ని విద్యలో 5 అగ్నులు ఉన్నాయి. 1.ద్యులోకం(స్వర్గలోకం, చంద్రలోకం) 2.పర్జన్యం( మేఘాలు,) 3. పృధివి( భూమి ) 4. పురుషుడు ( మానవులు ) 5. శక్తి ( స్త్రీ ) వీటికి 5 ఆహుతులు ఇవ్వాలి 1. శ్రద్ధ, హోమం, వర్షం, అన్నం, రేతస్సు, శ్రద్ధ అనే ఆహతి ద్యులోకంలో, హోమం అనే అహుతిని పర్జన్యం లోను, వర్షం అనే ఆహుతిని పృథవిలోను, అన్నంఅనే అహుతిని పురుషుడిలోను, రేతస్సు అనే అగ్నిని స్త్రీలోనూ వెయ్యాలి. 1.శ్రద్ధ అనే అగ్నిని ద్యులోకం అనే అగ్నిలో అహుతి చేస్తే అది హోమ రూపమైన జలంగా మారుతుంది. 2. ఈ హోమరూపమైన జలాన్ని మేఘం రూపంలో వర్షాధి దేవత పర్జన్యుడు రెండవ అగ్నిగా వర్షం రూపంలో కురిపిస్తాడు. 3.వర్షం అనే ఆహతి 3వ అగ్ని అయిన పృథవిలో వేస్తాడు. మొక్కలు మొలకెత్తి పువ్వులు, పండ్లు వచ్చి, పంటలు పండుతాయి. 4.అక్కడ నుండి అన్నమైన అగ్ని రూపమైన జలాన్ని పురుషుడు అనే అగ్నిలో వేస్తాడు. అన్నం తిన్న పురుషుడు రేతస్సు వీర్య రూపంలో మారిపోతుంది. వీర్యజలం స్త్రీయోనిలో ప్రవేశపెట్టబడుతుంది. 5.శిశువుగా తయారై పురుషరూపం వస్తుంది. ప్రవాహణుడు, శ్వేతకేతువు యొక్క ప్రశ్నోత్తరాల వలన జలం భూత సూక్ష్మలతో కూడి జీవుడు ప్రయాణం చేస్తాడని మనకు తెలుస్తుంది. ఇదే పంచాగ్ని విద్య, వైరాగ్యం పొంది తద్వారా మోక్షం సాధించేందుకు శ్వేతకేతువు ద్వారా లోకానికి వెల్లడైనది. పూర్వపక్షం అంటే విమర్శించే వారి వాదన ప్రకారం భూత సూక్ష్మాలు అంతటా ఉంటాయి కదా? మరి వెంట తీసుకొని వెళ్లడం దేనికి, ఒక్కడే ఒంటరిగా పోతాడు కదా అని సందేహం. దీనిని నివృత్తి చెయ్యడానికి ఏడుసూత్రాలతో మొదటి అధికరణం చెప్పబడింది. దానికి సమాధానం చెప్పబడింది. సూక్ష్మ భూతాలు అంతటా ఉన్నాయి. జీవుడు తాను పొందబోయే క్రొత్త దేహానికి కావలసిన బీజాలు జీవుడికి సంబంధినవి అంతటా ఉండవు కదా! అందుకే ఈ బీజాలు తీసుకొని వెడుతున్నాడు. ఆ కర్మ ఫలాలు అనే బీజాలకు రక్షణ, పోషణ ఈ సూక్ష్మ భూతాల వలెనే సిద్ధిస్తుంది.మరొక సందేహం, గడ్డి పురుగు ఒక ఆకు నుండి కదలి వేరొక ఆకును పొందుతుంది కదా! కొత్త దేహాన్ని పట్టుకొని పాత దేహాన్ని వదులుతుంది కదా! దానికి సమాధానం, జీవుడు పాత దేహాన్ని వదలి కొత్త దేహాన్ని పట్టుకుంటాడు. పాత దేహంలో ఉన్నకర్మ ఫలాలు, వాసనలు అన్ని పుణ్యాలు తీసుకొని వెళ్లి అక్కడ భోగాలు అనుభవించి ఆ పుణ్యాలు ఖర్చు చేసి, కర్మశేషం తో వచ్చి ఈ భూమి మీద మరొక గర్భంలో ప్రవేశిస్తాడు. పాత దేహంలో ఉన్నా వాటిని సాగదీసి అంటే వాటిని పోషించుకుంటూ వచ్చి, కొత్త దేహాన్ని ఏ రకమైన దేహం వస్తుందో ఆ భావాన్ని పొంది, అప్పుడు పాత దేహాన్ని వదులుతాడు. భావాన్ని బట్టి భావాన్ని వదలడం కాని, దేహాన్ని బట్టి దేహాన్ని వదలడం కాదు. రాబోయే జన్మ జీవుడు చేసిన కర్మ ఫలాలను అనుసరించి ఉంటుంది. వాటిని పోషించుకుంటూ ఆ మార్గంలో ప్రయాణం చెయ్యాలి. నేను ఈ దేహాన్ని తయారు చేసుకుంటున్నాను అని పాత భావాలు పోయి క్రొత్త భావాలు వస్తాయి. పంచాగ్ని విద్యలో చెప్పిన దానిని బట్టి జీవుడు భూత సూక్ష్మాలతో కూడా కలసి వెడతాడు అని తెలుస్తోంది. ఛాందోగ్యం లో చెప్పినట్లు ద్యులోకం, పర్జన్యుడు, పృథవి, పురుషుడు, స్త్రీ ఈ 5ని అగ్నులు గా భావించి ఉపాసాన చెయ్యాలి. (శ్రీ దేవిశెట్టి చలపతిరావుగారు 3, 4 అధ్యాయాలకు వ్యాఖ్యానం చెప్పియన్నారు. ఆయన చెప్పిన దానిలో కొన్ని ముఖ్యాంశాలు సేకరించి వ్రాయడమైనది.)
సూత్రం :- 293
"త్ర్యా త్మ కత్వాత్ తు భూయ స్త్వాత్ "
త్రి ఆత్మ కత్వాత్ :- సూక్ష్మ భూతాలు, బాహ్య అభ్యంతర కరణాలు అనే మూడు తత్వాలతో సూక్ష్మ శరీరం ఏర్పడుతుంది. తు :- అలాగే, భూయస్త్వాత్ :- వాటిలో సూక్ష్మ భూతాలు ఆశ్రయించి ఉంటాయి.
భావం:-బాహ్యఅభ్యంతర కరణాలు అనే మూడుతత్వాలతో సూక్ష్మశరీరం ఏర్పడుతుంది. వాటిలో సూక్ష్మభూతాలు ఆశ్రయించి ఉంటాయి.
వివరణ :- స్థూలదేహంలో అస్థి, స్నాయువులు, మజ్జ, త్వక్కు, మాంసం, రక్తం అనే ఆరు పదార్ధాలు ఉంటాయి. అలాగే సూక్ష్మ శరీరం 17 తత్వాలతో కూడినదై, అంతఃకరణ మైన మనోబుద్ధులు ఒక వర్గంగా, జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు ఒక వర్గం గా, సూక్ష్మ భూతాలు ఒక వర్గంగా మొత్తం 3 వర్గాలుగా భావించి త్య్రాత్మకం అని వ్యవహారించారు. ప్రవాహణుడికి, శ్వేత కేతువుకి మధ్య సంభాషణ జరిగింది. శ్వేతకేతువు ఇలా అన్నాడు, ఈలోకంలో అగ్ని కార్యాలు, యాగాలు, హోమాలు, నిర్వహించి మరణించిన తరువాత జలంతో కూడుకొని స్వర్గ లోకానికి వెడతాడు అని చెప్పారు. జలంతో కలసి వెడతాడని చెప్పారు కదా! మరి సూక్ష్మ భూతాలతో కలసి వెడతాడని చెప్పారు, ఇది ఎలా సాధ్యం అని అడిగాడు. దానికి రాజు సమాధానం చెబుతున్నాడు. పృథవి, జలం, అగ్ని ఈ మూడింటి రూపం అన్నింటిలో ఉంది. ఈ మూడింటి లోను, ప్రతి దానిలో అన్నీ ఉన్నాయి. యజ్ఞం చేసేటప్పుడు పాలు, నెయ్యి, మధుర పదార్ధాలు సమిధలు ఆహుతులుగా అగ్నిలో శ్రద్దగా వెయ్యాలి. వీటిలో ద్రవరూపంలో ఉండే జలం అపూర్వ (అంటే ఒక శక్తి, మనం చేసే పుణ్య, పాప కర్మల రూపంలో ఉండే శక్తి )ద్వారా యజమానితో బాటు స్వర్గ లోకానికి చేరుకుంటుంది. యజ్ఞ యాగాదులు ఎవరైతే శ్రద్దగా చేస్తారో, జల రూపంలో ఉండే ఆహుతులు అపూర్వ ద్వారా దేహాన్ని విడిచి పెట్టిన జీవుడితో బాటు ద్యులోకానికి వెడుతుంది. జలంలో మూడు భూతాలు పృథవి, వాయువు, అగ్ని కలుస్తాయి. జీవుడు జలంతో పరివేస్థితుడై వెడుతున్నాడు అంటే భూత సూక్ష్మలతో వెడుతున్నట్లే. విశ్వంలో జలం ఎక్కువ. దేహంలో జలం ఎక్కువ. పూర్వ పక్షం (విమర్శకుల వాదన) జీవుడు దేహాన్ని విడిచి వెళ్ళేటప్పుడు జలపరివేష్టితుడై వెడుతున్నాడు, అంటే భూత సూక్ష్మాలతో వెడుతున్నాడని చెప్పలేదు కదా! జీవుడు ఉదకాలతో చుట్టబడిన వాడై, వెడుతున్నాడు. అంటే యాజ్ఞ ఫలమైన సోమరసం మేఘం దాక వెళ్లి వర్షంగా కురుస్తుంది. ఆవర్షం వల్ల పంటలు పండుతాయి. ఈ వర్షమే ఆ ఉదకం. అయితే జీవుడు ఉదకంతో కలసి వెడుతున్నాడు అంటే మిగిలిన సూక్ష్మ భూతాలతో కలసి వెళ్లడం లేదు కదా ఉదకం, తేజస్సు, పృథవి, వాయువు రూపమే పంచ తన్మాత్ర లలో 5 తన్మాత్రలు. పంచభూతాలు పంచీకరణ చెంది, జలం సగ భాగమును 4 గా విభజించి, ఆకాశంలో ఒక భాగం, వాయువులో ఒక భాగం, అగ్నిలో ఒక భాగం, పృధివిలో ఒక భాగం కలిసాయి. ఇలా ప్రతి పంచభూతం మిగిలిన నాలుగుతో కలుస్తాయి. జలంతో కూడి వెడుతున్నాడు అంటే భూత సూక్ష్మాలతో కలసి వెడుతున్నాడు అని అర్ధం. సూక్ష్మ శరీరం అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం మొత్తం 19. పంచ తన్మాత్రల నుంచి స్థూల శరీరం వదలి సూక్ష్మ శరీరం తో వెడుతుంటే భూత సూక్ష్మాలతో వెడుతునట్లే భావించాలి. యాజ్ఞ యాగాదులు, పుణ్య కార్యాలు చేసిన వారు స్వర్గానికి వెళ్లి, అక్కడ భోగాలు అనుభవించడానికి , సూక్ష్మ భూతాలతో కూడి ఇంద్రియాలు, బుద్ధి, జ్ఞానం, అజ్ఞానం, తీసుకొనే వెడతాడు అని గ్రహించాలి.
సూత్రం :- 294
" ప్రాణ గతేశ్చ "
చ :- అంతే కాక, ప్రాణ గతే :- జీవాత్మతో బాటుగా ప్రాణాల గమనం వర్ణించారు.
భావం :- ప్రాణోత్క్రమణం వలన జీవుడు లింగ దేహంతో కూడి మరొక దేహానికి వెడతాడని తెలుస్తోంది.
వివరణ :- ప్రాణం అంటే ఇంద్రియాలు. శ్రుతి ప్రకారం జీవుడు ఇంద్రియాలతో బాటు భూత సూక్ష్మాలతో వెడుతున్నాడు. ఇంద్రియం అంటే జ్ఞానేంద్రియం, అంతరేంద్రియం, కర్మేంద్రియం, పంచ ప్రాణాలు మొత్తం కలిపి ఇంద్రియాలు అంటారు. పంచ భూతాల యొక్కపంచ తన్మాత్రల యొక్క సాత్వికాంశాల నుండి 5 జ్ఞానేంద్రియాలు, పంచ భూతల యొక్క సమిష్టి సాత్వికాoశాల నుండి నాలుగు అంతః కరణాలు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం వచ్చాయి. పంచ భూతల యొక్క తన్మాత్రాల యొక్క రాజశాంశాల నుండి 5 కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు వచ్చాయి. వేదాలను అనుసరించి జీవునితో పాటుగా ఇంద్రియాలు కూడా వెడుతున్నాయి. కాబట్టి జీవుడు సూక్ష్మ భూతాలతో పరివేష్టితుడై ఉన్నాడని తెలుస్తోంది.
బృహదారణ్యకోపనిషత్తు(4,4,12):- జీవుడు ఈ దేహాన్ని విడిచి వెళ్ళేటప్పుడు వాగాది ఇంద్రియాలు (ప్రాణాలు) అన్నీ అతణ్ణి అనుసరించి వెడతాయి. ఈవాక్యంలో ప్రాణోత్క్రమణం గురించి చెప్పారు. జీవుడు సూక్ష్మదేహంతో వెళ్ళని పక్షంలో అలా చెప్పరు. కాబట్టి లింగదేహంతో ఉత్క్రమిస్తాడని తెలుస్తోంది. యాజ్ఞవల్కుడు జనక మహారాజుకు ఆత్మ గురించి వివరిస్తూ," అంత్యకాలంలో జీవాత్మ శరీరం నుంచి బయటకు పోవడానికి మార్గం కనిపిస్తుంది. ఆ స్థితిలో ఆత్మ శిరస్సు ద్వారా కాని, నవ రంధ్రాల ద్వారా కాని బయటకు పోతుంది. దానితో బాటే ప్రాణం కూడా బయటకు పోతుంది. ప్రాణం శరీరం నుండి బయటకు రాగానే ఇంద్రియాలన్నీ శక్తి హీనమౌతాయి. ఆ స్థితిలో జీవుడు మంచి విజ్ఞాన వంతుడిగా ఉంటాడు. విజ్ఞానంతో కూడిన ప్రదేశానికి వెడతాడు. అతనితో బాటు అతని జ్ఞానం, అతను చేసిన కర్మ, పూర్వ జన్మ సంస్కారం అతని వెంట వెడతాయి. దీనిని బట్టి ఆశ్రయం లేకుండా ఇంద్రియాలు ఉండలేవు. ఎక్కడికి పోలేవు. కాబట్టి వాటికి ఆధారంగా, ఆశ్రయంగా సూక్ష్మ భూతాలు ఉండాలి. ఈ విధంగా సూక్ష్మ భూతాలు కూడా వెడతాయి. ప్రాణాలకు గతి చెప్పడం వలన కూడా ప్రతి జీవుడు భూత సూక్ష్మాలతోనే పయనిస్తాడు అని తెలుస్తోంది. జీవుడు దేహాంతరం పొందే సందర్భంలో ప్రాణాలకు గతి ఉంటుందని ఆధారం లేకుండా ప్రాణాలు వెళ్లడం కుదరదు. ప్రాణ గతిని బట్టి వాటికీ ఆశ్రయమైన ఇతర భూతాలతో కూడిన ఉదకం కూడా వెడుతుందని తెలుస్తోంది. జీవించి ఉండగా అలాంటిది ఏది కనబడటం లేదు కదా! అంటే దేహంలో ఉన్నప్పుడు ఆ దేహంలో ప్రాణాలు ఉంటాయి కాని దూరంగా ఉండవు కదా!
సూత్రం :- 295
" అగ్న్యాది గతి శృతే రీతి చేన్న భాక్తత్వాత్ "
అగ్ని ఆది గతి శృతేః :- అగ్ని, వాయువు లాంటి వాటిలో ఇంద్రియాల గతి ( గమనం ) వింటున్నాం. ఇతి చేత్ :- అని భావించడం, న:- సరి అయినది కాదు. భాక్తత్వాత్ :- అగ్న్యాదుల్లో గతి గౌణమే.
భావం :- అగ్ని, వాయువు, లాంటి వాటిలో ఇంద్రియాల గతి వింటున్నాం. కనుక జీవుడితో బాటు ఇంద్రియాలు వెళ్లవు అని భావించడం సరిఅయినది కాదు. ఎందుకంటే అగ్ని మొదలైన ఇంద్రియాల గమనం గౌణమే (అప్రధానమే ).
వివరణ:-మానవుడు చనిపోయినతరువాత వాక్కుమొదలైన ఇంద్రియాలు వాటివాటి అభిమాన దేవతలలో లీనమౌతాయని వేదంలో చెప్పబడింది. కాబట్టి ప్రాణాలు జీవుని అనుసరించవు అనే వాదన నిజం కాదు.
బృహదారణ్యకోపనిషత్తు(3,2,13):-ఆర్త భాగుడు యాజ్ఞవల్కుడిని అడుగుతాడు, పురుషుడు మరణించిన తరువాత, అతని యొక్క 1. వాక్కు-అగ్నిలో లీనం అవుతుంది. 2.ప్రాణం-వాయువులో లీనం అవుతుంది 3.నేత్రాలు-ఆదిత్యునిలో లీనమౌతాయి. 4. శ్రోత్రాలు - దిక్కుల యందు లీనమౌతాయి. 5. మనస్సు - చంద్రునిలో లీనమౌతుంది. 6. శరీరం - భూమిలో లీనమౌతుంది. 7. హృదయాకాశం - భూతాకాశంలో లీనమౌతుంది. 8. కేశాలు :-వనస్పతులలో లీనమౌతాయి. 9. శుక్ర శ్రోణితాలు :-జలంలో కలసిపోతాయి. అంటే ఇంద్రియాలన్ని వాటి వాటి కారణాలలో లీనమైపోగా, మిగిలిన పురుషుడు ఏ మౌతాడు? దేని ఆధారంగా అతను మళ్ళీ శరీరం ధరిస్తాడు? రోమాలు ఓషధులను చేరతాయి. కేశాలు వృక్షాలను చేరతాయి అని చెప్పబడింది, రోమాలు, కేశాలు ఎగిరి వెళ్లి ఓషధులను, వృక్షాలను చేరతాయి అని చెప్పడం అసంభవం కదా! ప్రాణంలేకపోతే జీవునకు గమనమే కుదరదు. అందుచేత అధి ఔపచారికమే. అంటే గౌణమే. ముఖ్యం కానిది అని చెప్పాలి. జీవించి ఉన్నంత వరకు అగ్ని మొదలైన దేవతలు ఇంద్రియాలకు ఉపచారం చేసి, మరణంలో విరమిస్తాయి అనే అర్ధం అంతే కాని వాగాది ఇంద్రియాలు అగ్న్యాదులలో లయం కావు. జీవుడు ప్రాణంతో ఉన్నప్పుడు అధిష్టాన దేవతలు అవయవాలకు శక్తినిచ్చి, పనిచేయిస్తూ ఉంటాయి. దేహాన్ని వదలి పోయినప్పుడు సహకరించవు. శక్తి హీనులౌతాయి. ఏ పని చెయ్యవు. అందుకే ఇంద్రియాలు పని చెయ్యవు. వాటంతట అవి ప్రయాణం చెయ్యలేవు. అధిష్టాన దేవతలు సహకరించక పోవుటచే సూక్ష్మ భూతాలను అనుసరించి వెడతాయి.
సూత్రం :- 296
" ప్రథమే శ్రావణాదితి చేన్న తా ఏవ హ్యుప పత్తేః "
ప్రథమే:- చాందోగ్యప్రకరణంలో ద్యులోకం అనే అగ్నిలో, అ శ్రవణాత్ :- లింగ దేహాన్ని సూచించే, ఆపః :- జలం హోమ ద్రవ్యంగా చెప్పలేదు కదా! ఇతి చేత్ :- అని అనడం సరి అయినది కాదు. హి :- ఎందుకంటే, ఉపపత్తేః :- ప్రశ్నత్తరాలలో ఏకవాక్యత ఉన్నందు వలన, తా ఏ వ :- జలాన్ని అక్కడ హోమ, ద్రవ్య రూపంలో శ్రద్ధ అనే పదం తో చెప్పారు.
భావం :- ద్యులోకం అనే అగ్నిలో లింగదేహాన్ని సూచించే జలం హోమ ద్రవ్యంగా చెప్పలేదు కదా! ఎందుకంటే ప్రశ్నత్తరాలలో ఏక వాక్యత ఉన్నందువలన జలాన్ని అక్కడ హోమ ద్రవ్య రూపంగా ఉపయోగించినట్లు చెప్పినా, శ్రద్ధ పదం అంటే జలమే. ఈ వాక్య ప్రయోగంలో వైరుద్యం ఏమి లేదు.
వివరణ:-ద్యులోకం మొదలు ఆయా అగ్నులయందు ఉదకాలు ఆహుతిఅవటం నిరూపించగలిగితే, ఐదవ ఆహుతి పురుషుడు ఎలా అయ్యాడో నిరూపించవచ్చును. కాని మొదటి ఆహుతి శ్రద్ధ అన్నారు. ఉదకం చెప్పలేదు. ద్యులోకమే అగ్ని. ఈఅగ్నితోనే దేవతలు శ్రద్ధను ఆహుతిగా ఇస్తున్నారు అని బృహదారణ్యాకంలో చెప్పబడింది. మిగిలిన నాలుగు ఆహుతులు సోమము, సృష్టి, అన్నము, రేతస్సు వీటికి జల సంబంధం ఉన్నది. అయితే శ్రద్ధ అనేది కేవలం జ్ఞానమే తప్ప జలం ఎలా అవుతుంది.? మొదటి ఆహుతే అప్రాణమైనప్పుడు మిగిలినవి కూడా అంతే అవుతాయి కదా! అని వారి వాదన. మొదటి ఆహుతిలో జలం చెప్పబడలేదు. కాబట్టి జీవులు జలాన్ని తీసుకుపోరు అనేది నిజం కాదు. యజ్ఞయాగాదులు చేసేవారు స్వర్గలోకానికి వెడతారు. శ్రద్ధ అనేది మనోవృత్తి కాబట్టి శ్రద్ధను మనసు నుండి వేరు చేసి హోమం చెయ్యడం జరగదు. ఉదకాలను హోమం చెయ్యగలం. తైత్తరీయసంహితలో యజమాని చేసే పుణ్య కర్మ కోసం జలం శ్రద్ధను పుట్టిస్తుంది. కాబట్టి శ్రద్ధ అంటే ఉదకం అని అర్ధం.
తైత్తరీయోపనిషత్తు(3,2,4):-"శ్రద్దావా ఆపః " శ్రద్దేజలం అన్నారు కనుక శ్రద్ధ అంటే జలమే. అందువలన జీవుడు లింగభేదం తో దేహంతరగమనం చేస్తాడనండంలో ఏ మాత్రం సందేహం లేదు. "శ్రద్ధావా ఆపః " అని వైదిక ప్రయోగం ఉండటం చేత శ్రద్దా శబ్దం ఉదకం అనే అర్ధంతో ఉపపన్నంగా ఉంటుంది. దేహ బీజాలైన జలం సూక్ష్మత్వాన్ని పొందడం చేత శ్రద్ధతో సామ్యాన్ని (మనస్సులోని శ్రద్ధ ఏవిధంగా ఇతరులకు ఇంద్రియగ్రాహ్యం కాదో అట్లే ఇవికూడా ఇంద్రియ గ్రాహ్యములు కానంత సూక్ష్మంగా ఉంటాయి. మజ్ఞాకోశాంతి (మంచాలు ఏడుస్తున్నాయి ) ఇత్యాదులలో మజ్జ శబ్దం పురుషులతో సంబంధాన్ని బట్టి పురుషుల విషయంలో శ్రద్దాశబ్దం యుక్తమే. " ఆపో కర్మణి " ఉదకం యజమానికి పుణ్య కర్మ చెయ్యడానికి శ్రద్ధను పుట్టిస్తుంది అనే శృతిలో ఉదకం శ్రద్దా హేతువే. బ్రహ్మవిద్యను పొందడానికి కర్మ కూడా అవసరమా? కర్మాచరణ కావాలా? అని పూర్వ పక్షం వారి వాదన. కర్మ ఫలం అవసరమేనని చెబుతున్నారు. పుణ్య కర్మలు చేస్తేనే బ్రహ్మ విద్యోపాసన కు అర్హత సాధించగలరు.
సూత్రం :- 297
" అశ్రు తత్వ దితి చే న్న ష్టా ది కారిణాం ప్రతీతేః "
అశ్రు తత్త్వాత్ :- ఆపః శబ్ద ప్రయోగం మూలంగా లింగ దేహానికి గతి ఉందని చెప్పినా, ఇతి చేత్ :- అని అనడం, న :- తగ దు. ఇష్టాది కారిణాం :- ఇష్టం మొదలైన కర్మలను అనుసరించే వాళ్ళు, ప్రతీతేః :- ప్రసక్తి శాస్త్రంలో ఉంది.
భావం:-లింగదేహానికి గతి ఉందని చెప్పినా, దానితో బాటు జీవాత్మ వెడుతుందని సూచించే జీవాత్మ పదం వినలేదు కదా! కనుక జీవుడు లింగదేహంతో బాటు వెడతాడనేది యుక్తం కాదు అని అనడం తగదు. ఎందుకంటే ఇష్టాది కర్మలు అనుసరించే వాళ్ల ప్రసక్తి శాస్త్రంలో ఉంది.
వివరణ:-జలాన్ని వర్ణించినట్లుగా జీవులను వర్ణించలేదు. కాబట్టి జీవులు ఉదకంతో కూడి ప్రయాణించడం లేదు అని వారి వాదన. అది నిజం కాదు. ఎందుకంటే యజ్ఞయాగాదులు చేసిన వారు అలాగే వెడుతున్నారని నమ్మకం. యాగకర్మలు ఆచరించేవారు, జలపరివేస్థితులై స్వర్గ లోకానికి వెడతారు. అయితే ఇష్టాధికారులు కర్మ ఫలాన్ని అనుభవించడానికి చంద్రలోకం వెడుతున్నారనడం నిజం కాదు. ఎందుకంటే వారు చంద్రుణ్ణి చేరి అక్కడ అన్నం అవుతున్నారని, దేవతలు వారిని భక్షిస్తున్నారని, వారు కర్మ ఫలం అనుభవించడానికి వెళ్లడం లేదని వారి వాదన.
ఛాందోగ్యోపపనిషత్తు(5,10,3):-"పితృలోకాదాకాశం, ఆకాశాచ్చాంద్రమసం ఏషసోమోరాజా" గృహస్థాశ్రమం లో ఇష్టాపూర్తాలు, దానం లాంటి కర్మలు చేసిన వాళ్ళు ధూమమార్గం ద్వారా చంద్రుణ్ణి చేరి, అక్కడ దివ్యశరీరాలు ధరించి చంద్రుడిలా ప్రకాశి స్తారు. ఇలాంటి వాక్యాల్లో జీవోత్క్రమణం స్పష్టంగా ఉంది. కనుక ఈప్రకరణంలో గమనం కేవలం లింగదేహానికి లేదు. దానితో బాటు జీవుడికి కూడా చెప్పినట్లు తెలుస్తోంది. (5,10,4):-"ఏ ష సోమోరాజా తద్దేవానాం అన్నందేవా భక్షయంతి" చంద్రలోకం చేరి దివ్య దేహదారి అయిన జీవుణ్ణి సోముడు అంటారు. అతడు దేవతలకు అన్నం అవుతాడు. దేవతలు అతనిని భక్షిస్తారు. అని చెప్పారు. అది యుక్తంకాదు, మరి జీవుడు లింగశరీరంతో కర్మ ఫలాన్ని అనుభవించడానికి వెడతాడని అనడం యుక్తమే. యాగకర్మలు ఆచరించిన వారు, జలపరివేష్టితులై స్వర్గ లోకానికి వెడతారు. శృతిలో ఇష్టాధికారుల ప్రతీతి ఉన్నది. ఏగృహస్థులు ఇష్టం(యజ్ఞాధికం), పూర్ణం(వాపీకూపతటాకాది నిర్మాణం), దత్తం(దానం) అని చెప్తుంటారో, వాళ్లు ధూమాన్ని చేరుతారు. ధూమంగా అవుతారు. ధూమమార్గం ద్వారా పితృయాన మార్గంలో, ఆకాశం చేరి, అక్కడనుండి చంద్రుణ్ణి చేరతారు. ఈ చంద్రుడే సోమరాజు, సోమయాజులు అని వ్యవహారిస్తారు. సోమరాజా అనేది ఈ శృతి వాక్యంలో కూడా సమానంగా ఉండటం చేత సోమరాజుగా అయ్యేవాడు. ఇష్టాధికారులు యజ్ఞయాగాది క్రతువులలో పెరుగు, పాలు మొదలైన ద్రవ్యాలు ఉపయోగించడం ప్రత్యక్షంగా కనబడుతున్నాయి. హోమం చేయబడిన ఆజలమే సూక్ష్మమైన ఆహుతులుగా అపూర్వరూపంలో ఉండి, ఆఇష్టాదికారులను ఆశ్రయించడానికి ఉంటాయి. వాళ్ళు మరణించినప్పుడు వాళ్ళ శరీరాన్ని ప్రేత విధానాన్ని అనుసరించి ఋత్విక్కులు "అసౌ స్వర్గాయ లోకాయ స్వాహ " అని హోమం చేస్తారు. తరువాత శ్రద్దాపూర్వకంగా ఆచరించిన కర్మతో సంబంధించిన ఆహుతులైన అప్ లు అపూర్వ రూపంలో ఉండి, ఆజీవులకు ఫలం ఇవ్వడానికి, పరలోకానికి తీసుకొని వెడతాయి. అందుకే జీవులు ఆహుతి మయమైన అప్ లతో కలసి మంచి కర్మ ఫలాన్ని అనుభవించడానికి పయనిస్తారు అని చెప్పడమే సమంజసం.
సూత్రం :- 298
" భాక్తాం వా నాత్మా విత్వా త్త హి దర్శయతి "
అనాత్మ విత్వాత్:- ఆత్మవిదులు కాకపోవడం వలన, ఇష్టా పూర్తాది కామ్యకర్మలు చేయడం వలన, భాక్తాం :- వాళ్ళు దేవతలకు అన్నం అవుతారని గౌణం గా చెప్పారు. తధా హి దర్శయతి :- ఉపనిషత్ వాక్యాలు అంటున్నాయి. అగ్నిహోత్రాది కర్మలు చేయడాన్ని ఇష్టం అంటారు.
భావం:- ఆత్మ విదులు కాకపోవడం వలన, ఇష్టా పూర్తాది అంటే అగ్ని హోత్రాది కర్మలు చేయడం వలన వాళ్ళు దేవతలకు అన్నం అవుతారని గౌణంగా( అప్రధానంగా చెప్పారని ఉపనిషద్వాక్యాలు అంటున్నాయి.
వివరణ:- ఇష్టం అంటే అగ్నిహోత్రాది కర్మలు చెయ్యడం, బావులు, చెరువులు త్రవ్వించడం, విద్యా సంస్థలను నెలకొల్పడం, పేదలకు అన్న వస్త్రాలు (దత్తాలు) సమకూర్చడం, మొదలైన పనులు ఎంతో ఆసక్తితో, శ్రద్ధతో చేసే వాళ్ళు, వాటికీ తగిన ఫలాన్ని ఆయా లోకాలలో అనుభవిస్తారు. వీరు మోక్షానికి అర్హులు కారు. మోక్ష అర్హత ఆత్మవిదులకే. కామ్య కర్మలు చేసే వాళ్ళు, సోమాది లోకాలు చేరి, అక్కడ పుణ్య ఫలం అనుభవించి, మరల మానవ లోకంలో జన్మిస్తారు.
ఛాందోగ్యోపనిషత్తు:-(8,1,6):- అందువల్ల వాళ్ళు దేవతలకు అన్నం అవుతారనీ, దేవతలు వారిని భక్షిస్తారని గౌణం గా (అప్రధానంగా) చెప్పారు. అందుకే మరొక చోట దేవతలు తినరు, త్రాగరు అని స్పష్టంగా చెప్పారు. గౌణం గా చెప్పిన వాటిని ప్రధానంగా స్వీకరించకూడదు. కనుక జీవులు కర్మ ఫలాలను అనుభవించడానికి పర లోకాలకు వెడతారు. ఇష్టాదికారులు దేవతలకు అన్నం అవుతారని, భోగపదార్ధాలు అవుతారని అంటే భోగసాధనాలై వారికి సంతోషం కలిగిస్తారని చెప్పారు.ఇష్టాది కారులు దేవతలకు అన్నం అవుతారని చెప్పడం ప్రధానమైన విషయం కాదు. దేవతలకు అన్నం అవుతున్నారంటే ఉప భోగసాధనాలై సంతోషం కలిగిస్తారు. వీరంతా ఆత్మజ్ఞానం లేని వారు. అందుచేత వీరు దేవతలకు ఆనందాన్ని కలిగిస్తారు. ఎవరైతే నేను వేరు, దేవత వేరు అని భావిస్తాడో, వాడు పశుప్రాయుడు. మానవులకు పశువు భోగ సాధనం. అలాగే ఇతడు కూడా పశువై, దేవతలకు భోగసాధనం అవుతాడు. మానవులు ఫల భోగం కోసం చంద్రలోకానికి సూక్ష్మ భూత పరివేస్థితులై వెడతారు.
సూత్రం :- 299
" కృతాత్య యేనుశయవాన్ దృష్ట స్మృతి భ్యాం యదేతి మనేవం చ "
కృతత్యయే:-పరలోక ప్రాప్తికి సాధనాలైన ఇష్టాది కర్మలు అనుభవించడం వలన, నాశనం చెందిన తరువాత, అనుశయ వాన్ :- సంచితకర్మలతో మరల భూమి మీదకు వస్తాడు. యధా ఏ తం :- ఎలా వెళ్ళాడో, అలాగే, అనేవం చ :- అదే దారిలో మళ్ళీ వస్తాడని, దృష్ట స్మృతి భ్యాం :- శ్రుతి, స్మృతుల వలన తెలుస్తోంది.
భావం :- పరలోక ప్రాప్తికి సాధనాలైన ఇష్టాది కర్మలు అనుభవించిన తరువాత, సంచిత కర్మలతో మళ్ళీ భూమి మీదకు వస్తాడని శ్రుతి, స్మృతుల వలన తెలుస్తోంది.
వివరణ:-జగత్తులోని జీవరాశి అంతా కర్మలు చేస్తాయి. ఆకర్మఫలాన్ని అనుభవించి, స్వర్గం నుండి తిరిగి వచ్చేటప్పుడు, ఎన్నో కోట్ల జన్మల నుంచి వస్తున్న కర్మ శేషం వారిని అంటే ఉంటుంది. ఆ కర్మ శేషమే నూతన జన్మను నిర్ణయిస్తుంది.
ఛాందోగ్యోపనిషత్తు(5,10,5) :- చంద్రలోకాల్లో కర్మఫలం అనుభవించ వలసి నంతకాలం ఉండి, అది అనుభవించిన తరువాత, ముందు చెప్పిన మార్గంలోనే మళ్ళీ తిరిగి వస్తాడు. అలా తిరిగి వచ్చేటప్పుడు సంచిత కర్మ వాసనాలతో పాటు జీవులు తిరిగి వచ్చేస్తారు.(5,10,17):-చంద్రాదిలోకాల నుండి వచ్చే జీవులు పుణ్యకర్మవాసనలు ఉన్నా పక్షంలో ఇక్కడ శోభనమైన శరీరాన్ని ధరిస్తారు. అలాకాక పాప కర్మ వాసనలు ఉంటే పాప యోనుల్లో ప్రవేశిస్తాడు.
సాంఖ్య దర్శనం ( 6, 56 ) :- సంచింత కర్మల వాసన వలన చంద్రాది లోకాలనుంచి తిరిగి వస్తారు.
ఛాందోగ్యోపనిషత్తు:- ప్రవాహణుడు అనే రాజు ఉద్దాలకుడికి పంచాగ్ని విద్య బోధిస్తూ, మహర్షి! మానవుడు నాలుగు భూతాల మిశ్రమస్వరూపుడు. మరణానంతరం ఈనాలుగుభూతాలు, ఆభూతలలో కలసిపోతాయి. మానవుని యోగ్యత అనేది అతడు చేసిన కర్మలమీద ఆధారపడి ఉంటుంది. అతడికి ఆత్మానుభావం కలిగితే దేవయానమార్గంలో ప్రయాణం చేసి మోక్షాన్ని పొందుతాడు. వానికి మరల జన్మ ఉండదు. అలా కాకుండా ఐహిక మైన కోరికలు తీర్చుకోవడానికి జీవిస్తూ పుణ్య కర్మలు ఆచరిస్తూ, జీవితం సాగించే వారు పితృ యాన మార్గం ద్వారా స్వర్గం చేరుతారు. అక్కడ వారు పుణ్యఫలం అనుభవించి మళ్ళీ ఈలోకంలో జన్మిస్తారు. పాపాలు చేసినవాడు అమృతత్వాన్ని, స్వర్గాన్ని పోగొట్టుకొని, నీచమైన జన్మలు ఎత్తుతాడు. సంస్కారవంతులు, సదాచార సంపన్నులు ఉత్తమయోని పొందుతారు. పాపాత్ములు అనేక జన్మలు ఎత్తుతూ, పుడుతూ, శీఘ్రంగా నీచమైన జన్మఎత్తి, చస్తూ ఉంటారు. బ్రాహ్మణుల సొమ్ము దొంగతనం చేసేవారు, మధిరపానం చేసే బ్రాహ్మణుడు, గురుపత్నితో సంగమించేవాడు, బ్రహ్మ హత్య చేసేవాడు, ఈ నలుగురు పతితులు. ఇలాంటి వారితో సహవాసం చేసే వాడు కూడా పతితుడే. ఇంత కన్నా నీచమైన పనులు చేసే వారు క్రిమికీటకాలుగా పుడతారు. గురువర్యా! మానవుడు స్వర్గం పొందటానికి అవసరమైన దాని కన్నా ఎక్కువ కర్మచేస్తాడా? కర్మలో కొంత భాగమే అనుభవిస్తాడా? లేక కర్మ శేషం లేకుండానే తిరిగి వస్తాడా? వివరించండి, అన్నాడు కృష్ణశర్మ. దానికి సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. మానవుడు స్వర్గ సుఖాల కోసం కర్మలు చేస్తాడు. వాటి పుణ్యఫలం అనుభవించిన తరువాత, మిగిలిన కర్మలతో తిరిగి ఈ లోకానికి వస్తున్నాడు. ఈవిషయం శ్రుతులు, స్మృతులుకూడా చెబుతున్నాయి. స్వర్గ సుఖాలు అనుభవించి వచ్చిన సంస్కారవంతులు, సదాచార సంపన్నులు ఉత్తమ యోనులందు జన్మిస్తారు. అంటే బ్రహ్మ, క్షత్రియ, వైశ్య యోనులు పొందుతారు. సంస్కారం లేని వారు కుక్కలు, పందులు, ఛండాలురుగా నీచ యోనులందు జన్మిస్తారు అని ఛాందోగ్యం లో చెప్పబడింది. అంటే స్వర్గంలో కర్మఫలం పూర్తిగా అనుభవించిన తరువాత భూలోకానికి వస్తారు. మానవులు చేసిన కర్మలకు ఫలితం స్వర్గం, నరకంలో అనుభవించి, మళ్ళీ ఆకర్మలను అనుసరించి ఉత్తమ జన్మలు ఎత్తాలి. తిరిగి వచ్చేటప్పుడు ఏ మార్గం గుండా వస్తారు? వెళ్లిన మార్గం ద్వారానా? ఇంకొక మార్గం ద్వారానా? అని సందేహం వస్తుంది. తిరిగి వచ్చేటప్పుడు ఏ మార్గం ద్వారానైనా రావచ్చును. వెళ్లిన మార్గం ద్వారా రావాలనే నియమం ఏమి లేదు.
సూత్రం :- 300
" చరణాదితి చేన్నో పలక్షణార్ధేతి కార్ష్ణాజినిః "
చరణాత్ :- అనుభవించడం వలన, ఇతి చేత్ :- జీవుడు తిరిగి వస్తాడు అనడం, న:- సరి అయినది కాదు. అంటే ఉప లక్షార్ధా ఇతి :- చరణ అనే శబ్దం శేష కర్మలు తెలియజేస్తుంది. అని కార్ష్ణా జినః:- కార్ష్ణాజినీ అనే ఆచార్యుడు అంటున్నాడు.
భావం:- కర్మలు అనుభవించడంవలన జీవుడు తిరిగి వస్తాడు అనడం సరి అయినది కాదు. చరణం అనేది శేషకర్మలు తెలియజేస్తుంది అని కార్ష్ణాజినీ అనే ఆచార్యుడు తెలియజేస్తున్నాడు.
వివరణ:- శ్రుతిలో ఆచరణం, శీలంవలన జన్మ వస్తుందని అంటున్నారు. అలాంటప్పుడు ఇష్టాదికారులు కర్మతో ద్యులోకం నుండి దిగివస్తున్నారని అనడానికి అవకాశం లేదు. అంటున్నాడు. కాని అదినిజం కాదు. ఎందుకంటే ఆచరణమనేది కర్మలోని భాగమే. కార్ష్ణాజినీ అనే మహర్షి ఈసూత్రం చెప్పాడు. చరణం అంటే ఆచరణ అని అర్ధం. అది చంద్రాదిలోకాల్లో మిగిలిన సంచిత కర్మవాసనలను ఎలా బోధిస్తుంది? కనుక కర్మశయాలతో తిరిగి వస్తారనడం సరి అయినది కాదనే వాదనను కార్ష్ణాజినీ అనే ఆచార్యుడు నిరాకరిస్తున్నాడు. ఆ ఆచార్యుడి అభిప్రాయంలో చరణ శబ్దం కర్మాశయానికి ఉప లక్షణం. కనుక అది కర్మాశయమే. జీవాత్మ శేషకర్మ సంస్కారములతో పాటు తిరిగి వస్తాడనడంలో ఎలాంటి వైపరీత్యం లేదు.అనుశయం ఉన్నదని చెప్పే " తధ్య.. చరణా " అణు ఏ శ్రుతి ఉదహరించబడిందో అది చరణం వలనే జన్మ లభిస్తుందని చెప్పుచున్నది గాన అనుశయం వలన కాదు.. చరణం వేరు, అనుశయం వేరు. చరణం చారిత్రం, ఆచారం, శీలం, ఇవన్నీ సమానార్ధాలు, ఫలం అనుభవించిన కర్మ కంటే భిన్నమైన కర్మ అనుశయం అంగీకరించబడినది. ఎలాంటి కర్మ చేస్తాడో, ఏ ఆచారం చేస్తాడో, ఆ విధంగా అవుతాడు. అందువల్ల చరణం వలన జన్మ లభిస్తుంది అని వినబడటం చేత అనుశయం సిద్ధించదు. అన్నట్లయితే ఈదోషం లేదు. జన్మకు కారణం ఆచరణా? కర్మశేషమా? రెండు ఒక్కటే అని చెబుతున్నారు.ఆచరణం, శీలం జన్మలకు కారణం అవుతుంది. ఆచరణ, శీలం, కర్మ పర్యాయ పదాలు. యజ్ఞ యాగాదులు చేసేవారిని మహాత్ములని, కర్మాచరణ చేస్తున్నారని అంటారు. కర్మ, ఆచరణ అనే మాటలకూ భేదం లేదు. మంచి కార్యాలు చేస్తే మంచి కర్మాచరణ అంటారు. కర్మను బట్టి, ఆచరణను బట్టి జన్మ వస్తుంది. ఈకర్మ ఫలం అనుభవించాక ఏ కర్మలు తీసుకు వస్తారో, దానికి అనుగుణంగా జన్మ వస్తుంది. మంచి కర్మలు అయితే మంచి జన్మలు, పాప కర్మలు అయితే నీచ జన్మలు వస్తాయి.
కృత్యాత్యధికరణం ( 3, 1, 10 )
సూత్రం :- 301
" నర్ధక్య మితి చేన్న తదపేక్షత్వాత్ "
ఆనర్ధక్యం:- చరణశబ్దం సూచించే కర్మాశయం వలన జీవుడికి మంచి చెడు శరీరాలు లభించే పక్షంలో చరణ శబ్దానికి సార్ధకత లేదు. ఇతిచేత్ :- అని అనడం, న:- సరి అయినది కాదు. తత్ ఆపేక్షత్వాత్ :- కర్మాశయంలో ఆచరణ అనేది ఆవశ్యకం. అనుశయం :- పుణ్యాపుణ్య కర్మాశయం వల్లనే మంచి చెడు శరీరాలు లభించే పక్షంలో ఆచరణ ఎందుకు?
భావం:-చరణ శబ్దం సూచించే కర్మాశయం వలన జీవుడికి మంచి చెడు శరీరాలు లభించే పక్షంలో చరణశబ్దానికి సార్ధకత లేదు అని అనడం సరి అయినది కాదు. కర్మాశయంలో ఆచరణ ఆవశ్యకమైనది. పుణ్యాపుణ్య కర్మాశయం వలనే మంచి చెడు శరీరాలు లభించే పక్షంలో ఆచరణ ఎందుకు అంటారా? కర్మాశయానికి ఆచరణ లేకుంటే వ్యర్థమే.
వివరణ:-పుణ్యకర్మలే జన్మహేతువులైనప్పుడు ఆచారమనేది అర్ధం లేనిది అని, జన్మకు కారణం కర్మ శేషమని పూర్వపక్షం వారి వాదన. లోకానికి మేలు చేసే యజ్ఞాలు, యాగాలు మొదలైనవి ఆచారవంతులు చేసినప్పుడు మాత్రమే సత్ఫలితాలు ఇస్తాయి. ఆచారం లేకపోతే కర్మ ఫలప్రదం కాదు. ఆచారహీనుడైనవాడిని వేదాలుకాని, వేదోక్తకర్మలుగాని పవిత్రుణ్ణి చెయ్యలేవు. శిష్టాచార సాంప్రదాయలు పాటించేవారు, గురుస్మరణ చేస్తూ, గురువు చెప్పినట్లు చెయ్యడం, సాంప్రదాయ కర్మలు ఆచరించేటప్పుడు ఆచారం ఉండాలి. ఆచారాన్ని ఆపేక్షించాలి. కర్మ ఆచరణతో కూడిఉంటుంది. సదాచార సంపన్నులు ఆచరంతో కూడి పూజలు, వ్రతాలు, దానధర్మాలు, యజ్ఞాలు, యాగాలు ఏమి చేసినా, శ్రద్ధ చాలా అవసరం. స్నానాదులవలె ఆచారంకూడా పురుషార్ధం అనగా పురుషుని సంస్కారంకొరకే అనిఅంగీకరించాలి. ఇష్టాదికర్మ సముదాయ ఫలాన్ని ఆరంభిస్తున్నప్పుడు దానికి ఆధారమైనా ఆచారం కొంత అతిశయం పుట్టిస్తుంది. కర్మయే సర్వార్ధాలను సాధిస్తుంది. అని శ్రుతిలో చెప్పబడింది అని కారష్ణాజిని మతం. కర్మ ఉండగా శీలం వలన యోని కలగడం యుక్తం కాదు. పాదాలతో పరుగెత్తినవాడు, మోకాళ్ళతో పాకడం తగదుకదా! మనుస్మృతి(1-109) ఆచారయుక్తమైన కర్మాశయమే శోభనా శోభనమైన శరీరప్రాప్తికి హేతువు. సదాశయంతో, ఆచార సాంప్రదాయాలతో, కర్మలను ఆచరిస్తే మంచి జన్మకు హేతువు అవుతుంది. మానవుని ఉత్తమ జన్మకు కర్మలే కారణం కాని ఆచారం, శీలం కారణం కావు.
సూత్రం :- 302
" సుకృత దుష్కృతే ఏ వేతి తు బాదరిః "
సుకృతదుష్కృతఏవ:- చరణ శబ్దం ముఖ్యంగా పుణ్యపాపాల్ని సూచిస్తుంది. ఇత తు బాదరిః :- అని బాదరి ఆచార్యుడి మతం.
భావం :- చరణ శబ్దం ముఖ్యంగా పాప పుణ్యాలను సూచిస్తుందని బాదరి ఆచార్యుడి మతం.
వివరణ:- చరణం అనే పదానికి ఆచారం, అనుష్టానం, కర్మ అని అర్ధం. అయితే చరణ అనే పదానికి కొంత మంది ఆచారం అని అర్ధం చెప్పినప్పటికీ ఆచారమనేది కర్మలోనిభాగమే. చరణం అంటే కర్మఅనే అర్ధం చెప్పాలి. కాబట్టి చరణంఅంటే పాపపుణ్యాలే అని బాదరి మహర్షి అభిప్రాయం. అందుచేత స్వర్గ సుఖాలు అనుభవించిన వ్యక్తికి తిరిగి వచ్చేటప్పుడు కర్మశేషంతో వస్తాడు. చరణం అంటే ఆచారం అనే అర్ధం ఎలా ఉందో, అలాగే పుణ్యపాపకర్మలు అనే అర్ధం కూడా ఉంది. దీని వలన జీవుడు సంచిత కర్మాశయాలతో కూడా తిరిగి వస్తాడు అని చెప్పడంలో సందేహం లేదు. చరణం, ఆచారం, అనుష్టానం, కర్మ అన్నీ ఒకే అర్ధం వచ్చే పదాలే. ఆచారం కూడా ధర్మంలో ఒక విశేషమే. ఇష్టాది విహిత కర్మలు చేసేవారు, కర్మాచరణ చక్కని ఆచరంతో యజ్ఞ యాగాది క్రతువులు, దాన ధర్మాలవంటి సత్కార్యాలు చేస్తూ, ధర్మాన్ని ఆచరిస్తే, వారికీ స్వర్గ లోక ప్రాప్తి లభిస్తుంది. అక్కడ స్వర్గ సుఖాలు అనుభవించిన తరువాత కర్మ శేషంతో తిరిగి భూలోకంలో మరల జన్మిస్తారు. పుణ్య కర్మలు చెయ్యని వాళ్ళు చంద్రలోకం వెడతారా? అనేది తరువాత సూత్రంలో చెప్పబడింది.
అనిష్టాది కార్యాధికరణం ( 3, 1, 12 )
సూత్రం :- 303
" అనిష్టాది కారిణా మపి చ శ్రుతమ్ "
అనిష్టాదికారిణాం అపిచ:-ఇష్టా పూర్తాద విహితకర్మలు చెయ్యనివాళ్ళు కూడా, శ్రుతం:- చంద్రలోకానికి వెడతారని ఉపనిషద్వాక్యాల వలన వింటున్నాం.
భావం:- ఇష్టా పూర్తాది విహిత కర్మలు చెయ్యని వాళ్ళు కూడా చంద్రలోకానికి వెడ తారని ఉపనిషద్వాక్యం వలన తెలుస్తోంది.
వివరణ - గురువర్యా! ఇష్టా పూర్తది కర్మలు చేసిన వారు చంద్రలోకానికి వెడతారు. మరి ఇష్టాపూర్తములు అనబడే కర్మలు చెయ్యని వాళ్ళకి చంద్రలోకప్రాప్తి ఉన్నదా? అని అడిగాడు కృష్ణ శర్మ. డానికి సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. యజ్ఞయాగాది క్రతువులు చేసిన వారే కాదు, నిషిద్దకర్మలు చేసిన వారు కూడా చంద్రలోకానికి వెడతారు.
కౌషీతకి బ్రాహ్మణం(1,2):-ఈలోకంలో మరణించిన వాళ్ళు అందరూ చంద్రలోకానికి వెడతారు. "ఈవాక్యాన్ని బట్టి ఇష్టాది పుణ్యకర్మలు ఆచరించిన వాళ్ళే కాక, అవిహితకర్మలు చేసే వాళ్ళు కూడా చంద్రలోకానికి వెడతారు." అని చెప్పబడింది. మరల పుట్టవలసిన వాళ్లకి చంద్రుణ్ణి చేరితే తప్ప దేహారంభం కుదరదు. అందుచేత అందరు చంద్రమండలం వెడతారు ఇష్టాధికారులకు, ఇతరులకు కూడా ఒకే విధమైన గతి ఉండటం యుక్తం కదా! అన్నట్లయితే అది సరి కాదు. ఇతరులకు చంద్రలోకంలో భోగం ఉండదు. పుణ్య కర్మలు, పాప కర్మలు చేసిన వాళ్ళు అందరు చంద్రలోకం చేరతారని పూర్వ పక్ష వాదన. శ్రుతి లో "సర్వే" అనే పదం ఉంది కదా! అందరికీ అంటే పుణ్య కార్యాలు చేసిన అందరికీ అని అర్ధం. పాపాత్ములు కూడా అప్పుడప్పుడు పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు. పాప, పుణ్యాలలో ఏది తక్కువగా ఉంటే అది ముందుగా అనుభవిస్తారు. పుణ్యం తక్కువైతే ముందుగా స్వర్గలోకం, పాపం తక్కువగా ఉంటే ముందుగా నరకలోకం వెడతారు. చేసిన పుణ్య కర్మల వలన స్వర్గంలో భోగాలు అనుభవించి, పుణ్యం ఖర్చు అయిపోగానే భూలోకంలో మరల జన్మిస్తారు. అన్నీ పాప కర్మలు చేసిన వాళ్లకి స్వర్గలోక ప్రాప్తి ఉండదు. పాపాత్ములు కూడా కొన్ని సార్లు యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించడం, దాన ధర్మాలు చెయ్యడంలాంటి సత్కార్యాలు చేస్తూఉంటారు. అందుకే వారు చంద్రలోకం చేరి, అక్కడ సుఖాలు అనుభవిస్తుంటారు. పాప పుణ్యాలు తక్కువ, ఎక్కువ గురించి వ్యాస మహర్షి మహా భారతం లో స్వర్గారోహణ పర్వంలో వివరిస్తాడు. కురుక్షేత్ర యుద్ధం తరువాత ధర్మరాజు 37 సం. రాజ్యాన్ని పరిపాలించిన తరువాత పరీక్షిత్తుకి పట్టాభిషేకం చేశాడు. మహాప్రస్థానంలో భాగంగా, 25 సం. భూప్రదక్షిణ చేసి, హిమాలయాలకు వచ్చేసరికి ముందుగా ద్రౌపది నిర్యాణం చెందుతుంది. ఆతరువాత నకుల సహదేవులు, అర్జునుడు, భీముడు, పడిపోతారు. చివరగా ధర్మరాజు స్వర్గానికి చేరతాడు. అక్కడ దుర్యోధనుడు పెద్ద సింహాసనం మీద కూర్చుని సకల భోగాలు అనుభవిస్తూడటం చూసి, ఆశ్చర్యపోయాడు. అతను అన్నీ పాపాలే చేశాడు, ఆస్తిలో వాటా ఇవ్వకుండా అనేక రకాలుగా హింస పెట్టి చoపాలని ప్రయత్నించాడు. అలాంటి వాడు స్వర్గానికి ఎలా వచ్చాడు అనుకున్నాడట. దుర్యోధనుడు అన్నీ పాపలే చేసినా, జీవిత చరమాంకంలో యుద్ధంలో వీరమరణం పొందటం వలన, ఆ పుణ్యంవలన స్వర్గలోకప్రాప్తి వచ్చింది. ధర్మరాజు కురుక్షేత్రయుద్ధంలో 'అశ్వత్ధామహతః కుంజరః" అని అబద్ధం చెప్పినందుకు ఒకసారి నరకాన్ని చూసి, ఆతరువాత స్వర్గానికి వచ్చాడు. చేసిన కర్మ పుణ్యమైన, పాపమైన తప్పనిసరిగా అనుభవించి తీరాలి. పాపత్ములు కూడా కొన్ని పుణ్య కార్యాలు చేస్తేనే చంద్ర లోక ప్రాప్తి లభిస్తుంది.
సూత్రం :- 304
" సంయమనే త్వనుభూ యేతరేషా మారోహావరోహౌ తద్గతి దర్శనాత్ "
తు:- ది ఇలా ఉండగా, సంయమనే :- మార్గమధ్యంలో, ఇతరేషాం :- పుణ్య కర్మలు చెయ్యని వారు, అనుభూయ:- రకరకాల యాతనలు అనుభవిస్తూ, ఆరోహ అవరోహౌ :- ఎక్కుతూ, దిగుతూ అనుభవిస్తూ ఉంటారని, తద్గతి దర్శనాత్ :- శాస్త్రల్లో వాళ్ళ ప్రయాణం వర్ణించారు.
భావం:- పుణ్యకర్మలు చెయ్యని వాళ్ళు మార్గ మధ్యంలో రకరకాల యాతనలు అనుభవిస్తుంటారనీ, శాస్త్రాల్లో వాళ్ళ ప్రయాణం గురించి వర్ణించారు.
వివరణ:- ఇష్టాపూర్తకర్మలు చెయ్యనివాళ్ళు యమలోకానికి పోయి, కష్టాలు అనుభవించి తిరిగి ఈలోకంలో జన్మిస్తారు. వారికి చంద్రలోక ప్రాప్తి లేదు. పుణ్యకార్యాలు చేసిన వారు మాత్రమే చంద్రలోక ప్రాప్తికి అర్హులు. పాపులకు అక్కడ స్థానం లేదు.
కఠోపనిషత్తు:-యముడు నచకేతుడితో చెబుతాడు "వేదాలలో చెప్పిన పాపకర్మలు వదలి పెట్టని వాళ్ళు, ఇంద్రియ లోలుడు, ఏకాగ్రత లేని వాడు, మనశ్శాంతి లేనివాడు, బ్రహ్మ జ్ఞానాన్ని పొందలేడు. బాలుడికి, డబ్బు మీద వ్యామోహం కలవాడికి, మూఢునుకి, పరలోక సాధనాలు లేవు. వారంతా నావశం అవుతారు. అంటే పాపాలు చేసిన వారు యమలోకానికి పోతారు. చంద్రలోకం భోగం కోసమే కాని ఏ ప్రయోజనం లేకుండా కాదు. కేవలం దిగి రావడం కోసమే కాదు. ఒకడు పుష్ప, ఫలాదులు తీసుకోవడం కోసం వృక్షం ఎక్కుతాడు. కాని ఏ ప్రయోజనం లేకుండా ఎక్కడు. కేవలం అక్కడ నుంచి పడటానికి ఎక్కడు. అట్లే ఇక్కడ కూడా ఇష్టాదులు చెయ్యని వాళ్లకు చంద్రలోకంలో భోగం లేదని చెప్పబడింది. వాళ్లయితే సంయమనంలో అనగా యమలోకంలో ప్రవేశించి తమ పాపాలకు తగిన యమ యాతనలు అనుభవించి మరల ఈ లోకానికి వస్తారు. ధనమోహం చేత మూఢుడై పొరబాటు పడుతుంటే తెలివి తక్కువతనానికి పరలోకానికి సుఖంగా వెళ్లే ఉపాయం తోచదు.
కఠోపనిషత్తు:- ఐశ్వర్యబలంతోటి, అజ్ఞానంతో, అధికారం చేసేవారికి చంద్రలోకంలో అర్హత లేదు. పోయిన తరువాత మనం చూశామా? మమ్మల్ని ఎవరూ ఏమి చెయ్యలేరు, శాస్త్రాలు మాకు తెలుసును అని అహంకారంతో వితండ వాదన చేసేవాళ్ళు, దేవుడు ఉన్నాడా? నరకలోకం ఉందా? అని నాస్తిక వాదాన్ని సమర్ధించే వాళ్ళకు, పరోపకారం గురించి తెలియని వాళ్లకు, నరకలోక ప్రాప్తి తప్పక సిద్ధిస్తుంది. చేసిన పాపాలకు శిక్ష అనుభవించిన తరువాత, మరల భూమి మీద జంతువులుగా, క్రిమికీటకాలుగా, ఛండాలురుగా జన్మిస్తారు. నరకానికి, భూమికి మధ్యలో తిరుగుతూ, జన్మలు ఎత్తుతూనే ఉంటారు. నవ్వుతు చేసిన కార్యాలు ఏడుస్తూ అనుభవిస్తారు. ఎవరికీ తెలియకుండా, అంటే మూడవ కంటికి తెలియకుండా పాపాలు చేస్తున్నాం కదా! అని అనుకుంటే పొరబాటే. చేసిన ప్రతిపాపాన్ని చిత్రగుప్తుడు వ్రాస్తూ, లెక్క కడుతూనే ఉంటాడు. చేస్తున్న పాపపుణ్యలను విచక్షణా జ్ఞానంతో అలోచించి, సత్కర్మలు ఆచరిస్తేనే స్వర్గ లోకప్రాప్తి లభిస్తుంది. సత్కర్మలు చెయ్యని వాళ్ళు మార్గమధ్యంలోనే అనేక యాతనలు అనుభవించి, ఎగుడు దిగుడు మార్గాలలో ఊర్డలోకానికి వెడతారు. అక్కడ కర్మ ఫలం అనుభవించి, మళ్ళీ తిరిగి వస్తారు. ఈ వేదనలు యజ్ఞయాగాది క్రతువులు చేసిన వాళ్లకు ఉండవు.
సూత్రం :- 305
" స్మరంతి చ "
చ :- కాగా, స్మరంతి :- మాంసాహార, సురాపాన, పరస్త్రీ సంగమాలు చేసే వాళ్ళకు ఈ యాతనలు కలుగుతాయని శాస్త్రాలు అంటున్నాయి.
భావం:- మాంసాహారం, సురాపానం చేసే వాళ్లకు, పరస్త్రీలతో సంగమించే వాళ్లకు నరకయాతలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
వివరణ:-వ్యాసుడు,మనువు మొదలైన వారు పాప కర్మలు చేస్తే యమలోకానికి వెళ్లి శిక్షలు అనుభవిస్తారని చెబుతున్నారు.
కఠోపనిషత్తు(2,6):- ధనమోహంతో మూఢుడై, సూరాపానాది కర్మలు చేస్తూ, మధ్యమాంసాది స్త్రీ జనం తప్ప మరొక లోకం లేదనుకునే వాళ్లకు ఉత్తమ లోకాలు లభించవు. పైగా వీళ్ళు మార్గమధ్యంలో అనేక వేదనకు గురి అవుతారు. దుష్ట కర్మలు ఆచరించే వారు యమునికి వశమై పోతారని, ఆయన చేతులలో శిక్ష అనుభవిస్తారని, నచికేతోపాఖ్యానం లో చెప్పబడింది. పరాశరుడు, యాజ్ఞవల్కుడు, వ్యాసుడు వారి స్మృతులలో పాపాలు చేసిన వారు, నిషిద్ద కర్మలు ఆచరించే వారు, యమలోకంలో తగిన శిక్ష విధిస్తారని చెప్పబడింది. శ్రుతులు, స్మృతులు కూడా ఇదే విషయాన్ని వ్యాఖ్యనించాయి.
సూత్రం :- 306
" అపి చ సప్త "
అపి చ :- బాగా పరిశీలిస్తే ఈ వేదనలు, యాతనలు, అనుభవించే స్థలం, సప్త :- సప్త ఋషులుండే చోటు, యమలోకం, నరక లోకం.
భావం :- జీవుడు చేసిన పాప కర్మలకు శిక్ష అనుభవించే స్థలం యమలోకం. నరకలోకం.
వివరణ :-సప్తఋషులు ఉండే చోటు, సప్త ఋషులు అంటే సప్తప్రాణాలు అని అర్ధం. రౌరవాది నరకాలు ఏడు ఉన్నాయని అక్కడ పాపులకు శిక్షలు విధిస్తారని చెప్పబడింది. గురువుగారు! రౌరవాదినరకాల్లో చిత్రగుప్తుడు మొదలైనవారు ఉన్నారని, వారే పాపులకు శిక్ష వేస్తారని, ఉన్నది కదా! మరి యముడే పాపఫలాన్ని అనుభవింప జేస్తాడని ఎలా చెప్పగలరు? అని సందేహం వెలిబుచ్చాడు నారాయణభట్టు. సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. రౌరవం మొదలైన ఏడు నరకాలు పాపఫలాన్ని అనుభవించ వలసిన లోకాలుగా పౌరాణికుల చేత చెప్పబడ్డాయి. ఇష్ట కార్యాలు చెయ్యని వారు ఆ నరకాలకు వెడతారు.
శతపధబ్రాహ్మణం (6,1,1,1):- ప్రాణావా ఋషయః " ప్రాణాలే ఋషులు ". శరీరంలో ఉండే ప్రాణాలే ఋషులు.
యజర్వేదం ( 34, 55 ) :- చక్షురాది ఇంద్రియాలు శరీరంలో ఆయా స్థానాలలో ఉండి, సదా ఈ శరీరాన్ని రక్షిస్తాయి. జీవాత్మ నిద్రిస్తున్నప్పుడు ఇంద్రియాలు, అతనితో బాటు హృదయాకాశంలో ఉన్నప్పుడు ప్రాణ, అపానాలు రెండు పనిచేస్తుంటాయి. జీవాత్మ హృదయప్రవేశంలో ఈశ్వరుడు ఉండి, జీవుడికి హితాహిత జ్ఞానం కలిగిస్తూ ఉంటాడు. ఆయన ప్రేరణను గ్రహించలేని మూఢులు నిషిద్దకర్మలు ఆచరించి ఈలోకంలోనే యాతనాలకు గురి అవుతారు. మరణించేటప్పుడు కూడా వాళ్లకు సుఖం ఉండదు. అలా వేదనలను ఈశరీరంలోనే అనుభవించి పిదప పరలోకానికి వెడతారు. కనుక యమలోకం, నరకలోకం ఎక్కడో లేవు. ఈశరీరమే యాతనల నిలయం. నరక లోకాలు అంటే రౌరవాది నరకాలు ముఖ్యంగా ఏడు అని చెప్పబడ్డాయి. ఇక్కడ యమధర్మరాజు సర్వాధికారి. చిత్రగుప్తుడు జీవులు చేసిన పాపాలను లెక్కించి, వాటికీ తగిన శిక్షలు వేస్తాడు. వాటిని యముడు అమలుపరుస్తాడు. ప్రతి నరకలోకానికి ఒక అధికారి ఉంటాడు. అతడు పాపులను శిక్షిస్తాడు .
1.రౌరవ :- అన్నింటి కన్నా తక్కువ శిక్ష ఇక్కడ వేస్తారు. ఇతరుల పట్ల ఎక్కువగా అసూయ ,ద్వేషాలు చెందేవారిని క్రూరమైన పాముల వంటి రూపాలు వారిని హింసిస్తాయి.
2.మహారౌరవ:- ఇతరుల ఆస్తులను అన్యాయంగా స్వాదీనం చేసుకున్న పాపులను విషపూరితమైన పాములు హింసిస్తాయి.
3.వహ్నిజ్వాలా:- వేటగాళ్లు, గొర్రెల కాపరులు ఇక్కడ శిక్షింప బడతారు.
4.వైతరిణి - ఈ నది భూమికి, నరకానికి మధ్యలో ఉంటుంది. ఇది చీము, నెత్తురు, రక్తం, గోర్లు, ఎముకలతో నిండి ఉంటుంది. జీవుడి సూక్ష్మ శరీరం ఈ నది నుండి దాటేటప్పుడు ఆ నీటిలోని జీవులు అతని మాంసాన్ని తినేస్తూ ఉంటాయి.
5.కుంభీపాక:- జంతువులను, పక్షులను సజీవంగా ఉడికించే వ్యక్తిని ఇక్కడ, మరుగుతున్న నూనెలో వేసి ఉడికించి, శిక్షిస్తారు.
6.అసిపత్రవన:- అడవిలో చెట్లఆకులు కత్తులవలె ఉంటాయి. జీవుడి సూక్ష్మశరీరాన్ని ఆ ఆకుల మధ్యలో నుండి యమదూతలు లాగుతూ ఉంటారు.
7.అంధకూప:- ఇతరులకు, కీటకాలకు హాని కలిగించే వ్యక్తిని ఇక్కడ శిక్షిస్తారు.
యమధర్మరాజు నచికేతోపాఖ్యానంలో పాపాత్ములు మళ్ళీమళ్ళీ తన దగ్గరకు వస్తుంటారనీ, వారిని శిక్షిస్తాడని శ్రుతిలో చెప్పబడింది కదా! మరి అధికారులు శిక్షిస్తారని ఎలా చెప్పారు అని పూర్వపక్షం వారి సందేహం. యమధర్మరాజు అన్ని లోకాలకు సర్వధికారి. మిగిలిన అధికారులు చిత్రగుప్తుడు విధించిన శిక్షలు అమలుజేస్తూ, యమధర్మరాజుకు లోబడి పనిచేస్తుంటారు. జీవుడికి లౌకికంగా శరీరం ఉంటుంది కనుక బాధ తెలుస్తుంది. కాని యమలోకంలో శరీరం ఉండదు కనుక మనస్సు తోనే ఆ బాధలు అనుభవిస్తాడు. జీవుడికి కలలో బాధలు, కష్టాలు, ప్రమాదాలు, ఎన్నో వస్తుంటాయి. శరీరం మీద ఎటువంటి గాయాలు ఉండవు. అయినా ఆ బాధలన్నీ అనుభవిస్తాడు. అంటే మనస్సు బాధపడుతుంటుంది. అదే విధంగా యమలోకంలో ఒక్కొక్క శిక్ష కొన్ని లక్షల సం. అనుభవించిన తరువాత, మరల భూమి మీద జన్మించ వలసి వస్తుంది.
సూత్రం :- 307
" తత్రాపి చ తత్ వ్యాపారాత్ అవిరోధః "
తత్రా పి చ:- చంద్రాదిలోకాల్లోనూ, తత్ వ్యాపారత్ :- విశ్వనియంత అయిన ఈశ్వరుడి కార్య కలాపాలు కొనసాగుతాయి. అవిరోధః :- ఏ సందేహానికి తావు లేదు.
భావం :- చంద్రాది లోకాలలో ఈశ్వరుడి కార్యకలాపాలు కొనసాగుతాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు.
వివరణ:- భగవంతుడు హృదస్థుడంటారు. ఆయన ఈ శరీరంలో వుండి విశ్వాన్ని ఎలా నియమిస్తాడు. ఒక చోట ఉండే వ్యక్తి మరొకచోట నియమించే సమర్ధుడు కాలేడు కదా! ఈ సందేహం నివృత్తి చెయ్యడానికే వ్యాసుడు ఈసూత్రాన్ని చెప్పాడు. ఆయన జీవుడిలా పరిచ్చినుడు, అణుప్రమాణుడు ఉన్నవాడు కాదు. ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు. ఈ కారణం వలన అన్ని లోకాలలో ఉంటూ జీవులకు కర్మ ఫలాలు ప్రసాదిస్తాడు.
యజర్వేదం(40-5):- "తదంతరస్య సర్వస్య, తదుసర్వస్యాస్య బాహ్యతః " ఇలాంటి మంత్రాల్లో భగవంతుడు సర్వ వ్యాపకుడని, జగత్తు లోపలా వెలుపలా నిండి ఉన్నాడని వర్ణించారు. కాబట్టి ఈశ్వరుడి జగన్ నియంత్రత్వానికి ఎలాంటి అడ్డంకి లేదు.
కఠోపనిషత్తు:- ఈ నరకాలన్నింటికి యముడే అధిపతి. యముడు కర్మఫలం వల్ల లభించేది అనిత్యం, ఆత్మనిత్యం అని తెలిసి కూడా అగ్నిచయనం చేశాడని, ఫలితంగా మృత్యుదేవత అయ్యాడు. కాబట్టి యముడే మృత్యుదేవత నరకాలకు అధిపతి. చిత్రగుప్తాదులందరూ యమునిచే నియోగింపబడి, ఆయనకు వశులై ఉంటారు. చిత్రగుప్తుడు ఫలానా సమయంలో, ఫలానా పాపం చేశాడు అని ఖచ్చితంగా వ్రాసిన దానిలో ఎలాంటి పొరబాటు ఉండదు. రౌరవాది నరక లోకాలలో పాపాత్ములు శిక్షలు అనుభవించిన తరువాత, భూలోకంలో నీచ జన్మలైనా శునకం, సూకరం, క్రిమినల్ కీట కాదులు, ఛండాలురుగా జన్మిస్తారు. యముడికి గాని, చిత్ర గుప్తునికి, ఇతర అధికారులెవరికి శరీరాలు ఉండవు. అందరు సూక్ష్మ దేహాలతో ఉంటారు. జీవుడు కూడా సూక్ష్మ దేహంతోనే శిక్షలు అనుభవిస్తాడు.
సూత్రం :- 308
" విద్యా కర్మణోః ఇతి తు ప్రకృతత్వాత్ "
విద్యా :- ఉపాసన, కర్మ ణోః :- యజ్ఞ యాగాది కర్మల వలన, తు :- మాత్రమే, ఇత :- దేవయానం లో బ్రహ్మ గమనము, పితృ యానం లో చంద్రలోక గమనం, కలుగుతాయని, ప్రకృతత్వాత్ :- ఛాందోగ్యం లో వివరించారు.
భావం :- యజ్ఞయాగాది కర్మల వలన మాత్రమే దేవయానంలో బ్రహ్మలోక గమనం, పితృయానంలో చంద్రలోక గమనం కలుగుతాయాని చాందోగ్య ప్రకరణం లో తెలియజేశారు.
వివరణ:-వేదాలలో దేవయాన, పితృయాన మార్గాలు రెండు చెప్పబడ్డాయి. ఉపాసాన చేసేవారు దేవయాన మార్గం, సత్కర్మలు చేసే వారు పితృయాన మార్గం లో ప్రయాణం చేస్తారు. సంస్కారవంతులు, సదాచార సంపన్నులు, ఉత్తమ యోని పొందుతారు. సంస్కారహీనులు నీచ జన్మలు పొంది, మూడవ మార్గమైన జననమరణ మార్గంలో ప్రయాణిస్తారు. వీరికి చంద్రలోకానికి వెళ్లే అర్హత ఉండదు. ఉపాసనాదులను ఆచరించేవారు దేవయాన మార్గంలో బ్రహ్మలోకాన్ని, ఇష్టాపూర్తాది కర్మలు చేసేవారు పితృ యాన మార్గంలో చంద్రలోకం చేరతారనిచెప్పబడింది.
చాందోగ్యోపనిషత్తు :- ( 5, 10, 1):- విద్యావంతులైన ఉపాసకులు దేవయానంలో క్రమ క్రమంగా బ్రహ్మాన్ని పొందుతారు. ఇష్టా పూర్తాది కర్మల్ని ఆచరించే వారు పితృయానం లో చంద్రాది లోకాల్ని చేరి అక్కడ కర్మ ఫలాన్ని అనుభవిస్తారు. ఇకపోతే ఈ రెండు మార్గాలను విడిచి క్షుద్ర కర్మలు ఆచరించే వారు మాటి మాటికీ ఇక్కడే పుట్టి మరణిస్తారు. చంద్ర లోక ప్రాప్తి ఉండదు. (5,10,8):-అరణ్యంలో శ్రద్ధ, తపస్సులతో ఉపాసనచెయ్యకుండా గ్రామంలో యజ్ఞయాగాదులు చెయ్యకుండా సురాపానాదులు చేసే వాళ్ళు దేవయాన, పితృయాన మార్గాలలో కాక, మూడో మార్గన్ని అనుసరిస్తారు. జనన మరణాలే ఈ మూడో మార్గం.
కౌషీతకీ బ్రాహ్మణం ( 1, 2):- పుణ్య కర్మలు చేసే వాళ్ళు చంద్రలోక గమనం చేసి కర్మ ఫలం అనుభవించి తిరిగి వస్తారు. విద్యాకర్మలు అంటే ప్రకృతమైనవి. అందువలన దేవయాన, పితృ యాన మార్గాలను పొందడానికి విద్యాకర్మలు ప్రకృత మైనవి. విద్యఅనే సాధనంతో దేవయాన మార్గంలో వెళ్ళడానికి ఎవరికీ అధికారం లేదో, కర్మ అనే సాధనంతో పితృ యాన మార్గంలో వెళ్ళడానికి ఎవరికీ అధికారం లేదో మాటి మాటికీ తిరుగుతూ ఉండే క్షుద్ర జంతు రూపమైన మూడవ మార్గం లభిస్తుంది. మరణించిన వారంతా చంద్రలోకం చేరుకుంటే వీళ్ళతో ఆ లోకం నిండిపోయేది కదా! అనే ప్రశ్నకు విరుద్ధమైన సమాధానం ఇచ్చారు. వారు వెళ్లడం యుక్తం కాదు. వెళ్లి, తిరిగిరావడం అనేది శ్రుతిలో కూడా లేదు.
సూత్రం :- 309
" న తృతీయే తదో ప లబ్ది "
తృతీయే:- మూడోమార్గంలో ( దేవయాన, పితృయాన మార్గాలు కాక ) నడిచే వాళ్లకు, న :- దేహాంతరం మొదలు పెట్టడానికి ఆహుతుల సంఖ్య పట్ల ఏ నియమం లేదు. తధా ఉప లబ్ది :- తెలుస్తోంది.
భావం :- మూడో మార్గం లో ప్రయాణం చేసే వాళ్లకు దేహాంతరం మొదలు పెట్టడానికి ఆహుతుల సంఖ్య పట్ల నియమం లేదని తెలుస్తోంది.
వివరణ:- దేవయాన, పితృయాన మార్గాలు విడిచి జనన మరణ రూపమైన మూడో మార్గాన్ని అనుసరించే వాళ్లకు శరీర ఆరంభం కోసం పంచాహుతి నియమం లేదు. అంటే చంద్రలోక గమనం లేదు. నూతన దేహం పొందడానికి ఐదు ఆహుతులు పూర్తి కావాలని ఛాందోగ్యోపనిషత్తులో ప్రవహణుడు పంచాగ్ని విద్యలో చెప్పాడు. కాని మూడో మార్గంలో వెళ్లే వాళ్లకు ఆ నియమం లేదు. అది లేకుండా మరొక జన్మ కలుగుతుంది. విద్యా కర్మలు ఆచరించిన వారందరు చంద్రలోకానికి వెళ్లరు. ఆ లోకం ఎందుచేత జీవుల చేత నింపబడలేదో శ్రుతిలో పంచాగ్ని విద్యలో చెప్పబడింది. దేవయాన, పితృయానమార్గాలలో కాక మూడో మార్గంలో జననానికి, మరణానికి మధ్యలోనే ప్రయాణించే వారికీ పంచమాహుతులు ఆచరింప వలసిన అవసరం లేదు. మనుష్య శరీరానికి మాత్రమే ఆహుతుల సంఖ్య హేతువుగా చెప్పబడింది. పురుగులు, మిడతలు,క్రిమి కీటకాలు మొదలైన వాటికీ హేతువుగా చెప్పలేదు. ఎందుకంటే పురుష శబ్దం మనుష్య జాతిని చెబుతుంది. మరియు పంచమాహుతిలో ఉదకానికి పురుష వాచకమే చెప్పబడింది. భూమి మీద పుట్టిన వారంతా అలా చంద్ర లోకం నుంచీ వచ్చిన వారే కదా! వారు పాపాత్ములు కారని కదా! అని సందేహం ఉంది. పుణ్యం చేసిన వారంతా చంద్రలోకం వెడతారు. పాపాత్ములు కూడా సత్కార్యాలు యజ్ఞయాగాదులు చేస్తే స్వర్గ లోకం చేరి, అక్కడ భోగాలు అనుభవించి, కర్మ శేషంతో తిరిగి భూమి మీద జన్మిస్తారు. పూర్తిగా పాప కర్మలు చేసిన వారు మాత్రం మూడో మార్గంలో ప్రయాణిస్తారు కాని స్వర్గ లోకం ప్రవేశించరు.
సూత్రం :- 310
" స్మర్యతే పి చ లోకే "
చ:- ఇంతే కాక, లోకే :-దర్శన శాస్త్రలలో, అపి :-కూడా, స్మర్యతే:- ఆహుతి నియమం లేకుండానే శరీర ఉత్పత్తి జరుగుతుందని అన్నారు.
భావం :- ఆహుతి నియమం లేకుండా శరీర ఉత్పత్తి జరుగుతుందని దర్శన శాస్త్రలలో చెప్పి ఉన్నారు.
వివరణ:- లోకంలో చెప్పబడుచున్నది కూడా! అయోనిజులకు అంటే స్త్రీ పురుష సంయోగం లేకుండానే జన్మించే వారికీ ఈ నియమం లేదు. పురాణాలలో చెప్పిన సీత, ద్రౌపది, ద్రోణచార్యులు, దృష్టద్యుమనుడు, మొదలైన వారు ఈ కోవకు చెందిన వారే! అలాగే క్రిమి కీటకాలకు కూడా సంఖ్యా నియమం లేదు.
వైషేషికదర్శనం :- ( 4, 2, 11 ) :- అయోనిజ శరీరాలు ఉన్నాయి. అయోనిజ శరీరారంభం కొరకు కనీసం స్త్రీ పురుష రూపంలో రెండు ఆహుతులు అవసరం కూడా లేదు. అలాంటప్పుడు పంచమాహుతి నియమం ఉండదు కదా! వారిలో ద్రోణాదులకు స్త్రీ విషయమైన ఒక ఆహుతి లేదు. దృష్టద్యుమ్నునకు స్త్రీ పురుష నియామకలైన రెండు ఆహుతులు కూడా లేవు. వాళ్ళ విషయంలో ఏవిధంగా ఆహుతి సంఖ్యా నియమం లేదో ఇతరుల విషయంలో అలాగే కావచ్చును. కొంగ కూడా రేతః సేకరణ లేకుండా గర్భం ధరిస్తుందని లోక ప్రసిద్ధి. లోకాలలో ఆహుతి నియమం లేదని స్మృతి చెబుతోంది. స్త్రీ పురుష సంయోగం లేకుండా అలాంటి వారికీ జన్మ వస్తుందని ఇతిహాసలు, పురాణాలలో చెప్పబడింది. కృపాచార్యుడు, కృపి, దృష్ట ద్యుమ్నుడు, ద్రౌపది, సీత వీరు అయోనిజులుగా జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ద్రోణాచార్యుని తండ్రి భరద్వాజ మహర్షి ఒకరోజు గంగా నదిలో స్నానం చేస్తుండగా అప్సర అనే యువతీని చూసి మోహితుడై నియంత్రణ కోల్పోయాడు. హఠాత్తుగా వీర్యస్కలనం జరగడం, దానిని ఒక కుండలో భద్రపరచి ఆశ్రమానికి తీసుకు వచ్చారు. దాని నుండి పుట్టిన వాడే ద్రోణచార్యులు. కుండ నుండి పుట్టిన వాడు కనుక కుంభ సంభవుడు అని పేరు వచ్చింది. కృపాచార్యులు తండ్రి వీర్యం కలుపు మొక్కలపై పడటం, వాటి నుండి కృపుడు, కృపి జన్మించారు. వారిని శంతనుడు రాజ భవనానికి తీసుకు వెళ్లి పెంచుకున్నాడు. దృష్టద్యుమ్నుడు, ద్రౌపది హోమకుండం నుంచి పుట్టిన వారే. సీత అయోనిజగానే వ్యవసాయ క్షేత్రంలో దొరకడం, జనక మహారాజు ఆమెను పెంచి, శ్రీరామునికిచ్చి కళ్యాణం జరిపించాడు.
సూత్రం :- 311
" దర్శనాత్ చ "
చ :- అంతే కాక, స్త్రీ పురుష సంబంధం లేకుండానే, అనేక జీవులకు శరీరం ఏర్పడుతుందని, దర్శనాత్ :- శాస్త్రాల్లో వర్ణించారు.
భావం :- స్త్రీ, పురుష సంబంధం లేకుండానే అనేక జీవులకు శరీరాలు ఏర్పడుతున్నాయని శాస్త్రాల్లో వర్ణించారు.
వివరణ :- ఆహుతి సంఖ్యా నియమం లేకుండా, స్త్రీ, పురుష సంబంధం లేకుండా, కొన్ని జీవులకు శరీరం ఏర్పడటం లోకంలో చూడబడుతున్నాయి. అంతే కాక జరాయుజాలు, అండజాలు, స్వేదజాలు,ఉద్భిజాలు మొదలైన వాటికి పంచమాహుతి నియమం లేదు.
ఐతరేయ బ్రాహ్మణం ( 3, 3 ) :- జరాయుజాలు, అండజాలు, స్వేదజాలు, ఉద్భిజాలు లాంటివి ఎన్నో ఉత్పత్తి అవుతున్నాయి. అందువలన అందరి శరీరారంభం కోసం పంచమాహుతి నియమం లేదు. అందుకే అందరు చంద్రలోక గమనం చేయరు. నాలుగు విధాలైన ప్రాణి సముదాయాలు ఉన్నాయి.
1. అండజములు :- గ్రుడ్డు నుండి పుట్టినవి. పక్షి, చేప, పాము, తొండ .
2. జరాయుజాలు :- శరీరం నుండి పుట్టినవి.ఉదా :-ఏక కణ జీవి అమీబా.
3.ఉద్భిజములు:- విత్తనం నుంచి పుట్టినవి. విత్తనములు భూమిలో పడినప్పుడు అవి నీటితో తడిసి, భూమిని చీలుకొని మొక్క పైకి వస్తుంది.
4. స్వేదజములు :- చెమట నుండి, మురికి నుంచి పుట్టినవి. నల్లులు,దోమలు. దోమలు, సూక్ష్మ జీవులు మురికి నీటిలోనే పుడతాయి.
వీటి విషయంలో స్త్రీ పురుష సంగమం లేకుండానే పుట్టడం కనబడుతుంది. కనుక ఆహుతి సంఖ్యను పట్టించుకోవలసిన పని లేదు. కొన్ని ఇతర ప్రాణుల విషయంలో కూడా అలాగే ఉండవచ్చును.
అనిష్ఠాది కార్యధికరణం :- ( 3, 1, 21 )
సూత్రం :- 312
" త్రుతీయ శబ్దావరోధః సంశోక జస్య "
సంశోక జస్య :- చెమట వల్ల జనించే ప్రాణి వర్గాన్ని, తృతీయ శబ్ద అవరోధః :- మూడోదైన ఉద్భిజాలలో చేర్చారు.
భావం :- చెమట వలన జనించే ప్రాణి వర్గాన్ని మూడోదైనా ఉద్భిజాలలో చేర్చారని సూత్రానికి అర్ధం.
వివరణ :- జరాయుజాలు, అండజాలు, స్వేదజాలు అని లోకంలో నాలుగు రకాలైన ప్రాణాలున్నాయి.
ఛాందోగ్యోపనిషత్తు ( 6, 3,1) :- అండం నుంచి పుట్టేవి, జరాయువు నుంచి వెలువడేవి, భూమిని పెకలించుకొని బయట పడేవి అని మూడు విధాలే వర్ణించారు కదా! ఈ వైరుధ్యం ఎందుకు? ఈ స్వేదజాన్ని ఉద్భిజం లోనే గ్రహించాలి. ఉద్భిజం అంటే భూమిని ఛేదించుకొని పుట్టేది. స్వేదజం జలాన్ని ఛేదించుకొని పుట్టడమనేవి ఏ రెండింటికి సమానమే. కాబట్టి ఇష్టా పూర్త కర్మలు చెయ్యని వారికి చంద్రలోక ప్రాప్తి లేదు. పూర్వ పక్షి సందేహం -ఛాందోగ్యంలో అండజం, జీవజం , ఉద్భిజం మూడు మాత్రమే వివరించ బడ్డాయి కదా! మరి స్వేదజం గురించి ఎందుకు చెప్పారు? స్వేదజానికి మూడవ దైన ఉద్భిజ శబ్దం చేత గ్రహణం అని అర్ధం. ఉద్భిజం చేత స్వేదజాల ఉపసంగ్రహం చేయబడినట్లు గ్రహించాలి. స్వేదజం, ఉద్భిజం రెండింటిలోనూ ఉద్భిజం భూమిని చీల్చుకొని పైకి వస్తుంది. రెండవదైన స్వేదజం జలాన్ని చీల్చుకొని బయటకు వస్తుంది. స్వేదజం, ఉద్భిజం రెండు ఒక్కటే కనుక దానిని ఉద్భిజం గానీ గ్రహించాలి.ఈ విధంగా ఉద్భిజత్వం రెండింటికి సమానమే, రెండు వేరు వేరుగా చెప్పబడిన విరోధం లేదు.
సాభావ్యాపత్త్యధికరణం ( 3, 1, 22)
సూత్రం :- 313
" సాభా వ్యా పత్తి రుప పత్తేః "
సాభావ్య ఆ పత్తిః :- ఆకాశం లాంటి తత్త్వాల సాదృశ్యం తో తిరిగి వస్తారని, ఉప పత్తేః :- ఉపనిషత్తు వలన సిద్ధిస్తోంది.
భావం :- కర్మ ఫల భోగం కోసం చంద్రాది లోకాలకు వెళ్లిన జీవులు స్వర్గ సుఖాలు అనుభవించిన తరువాత ఆకాశం, వాయువు మొదలైన తత్వాలా సాదృశ్యం తో తిరిగి భూమి మీదకు వస్తారు.
వివరణ :- గురువు గారు! ఇష్టా పూర్తి కర్మలు ఆచరించే వారు చంద్రలోకాన్ని పొందుతారని,అక్కడ భోగాలు అనుభవించి తిరిగి భూలోకానికి తిరిగి వస్తారని చెప్పబడింది. వీరు చంద్రలోకం నుంచి వెళ్లిపోతున్నననే దుఃఖంతో వెళ్లిన మార్గం గుండానే తిరిగి వస్తారు. ఆకాశాన్ని, ఆకాశం నుండి వాయువును, వాయువు నుండి ధూమమై, ఆ ధూమం అభ్రకమై, అభ్రం మేఘమై వర్షిస్తుంది. ఇలా తిరిగి వచ్చేవాడు ఆకాశం, వాయువు, ధూమం, అభ్రం, మేఘం అవుతాడని చెప్పబడింది. నిజంగా ఆకాశం గా మారిపోతాడా? లేక ఆయా భావాలను పొందుతాడా? వివరించండి అన్నాడు కృష్ణ శర్మ. సమాధానం చెబుతున్నాడు రత్నాకారుడు. ఎవరికైనా సరే ఒకరి పోలికను పొందగలరే కాని ఆ రూపాన్ని పొందలేరు. చంద్రలోకంలో భోగాలు అనుభవించి, భూలోకంలో మరల జన్మించాలనే దుఃఖంతో ఆకాశంతో సాదృశ్యం ఏర్పడి, ఆకాశంతో సంబంధం పెట్టుకుంటాడు. అదే విధంగా వాయువుతో, ధూమంతో, అభ్రం తో ( నీళ్లు ఉన్న మేఘం ), వర్షించే మేఘంతో సంబంధం కలిగి, సాదృశ్యం ఏర్పడి, అటు ఇటు కదులుతూ, వర్షపు బిందువును ఆశ్రయించి భూమి మీదకు వస్తాడు. వర్షంగా భూమి మీదకు దిగి, వ్రీహియ (ధాన్యం, గోధుమలు, యవలు, పప్పు దినుసులు )వాది రూపుడుగా అవుతాడు. ఇక్కడ దిగుతున్న వాళ్ళు ఆకాశం, వాయువు, ధూమం, మొదలైన వాటి రూపం పొందు తారా? లేక వాటితో సమత్వం పొందు తారా?అనేది సందేహం. పాలు పెరుగుగా మారినట్లు గానే, జీవుడి సూక్ష్మ శరీరం వాటి స్వరూపాన్ని పొందుతాడు అని చెప్పడమే యుక్తం. కాని లక్షణాలను స్వీకరించి సాదృశ్యాన్ని పొందుతాడని చెప్పడం యుక్తం కాదు.
ఛాందోగ్యోపనిషత్తు ( 5, 10, 5 ) :- ఇష్టాది కర్మలు చేసిన వాళ్ళు చంద్రాది లోకాలకు వెళ్లిన మార్గాన్ని అనుసరించే తిరిగి వస్తారు. ఆకాశం నుండి వాయువు, మేఘం వర్షం లాంటి వాటి సాదృశ్యాన్ని పొందుతూ, భూమిని చేరి పంటలు, ధాన్యం మూలంగా మొదటి పురుష శరీరాన్ని చేరి తరువాత వీర్యం ద్వారా స్త్రీ గర్భన్ని చేరి మళ్ళీ పుడతాడు. ఒక వస్తువు ఇంకొక వస్తువుగా మారడం ఉపపన్నం కాదు. అది ఆకాశ స్వరూపంగా మారిపోతే తరువాత కర్మ ఫలం అనుభవించడానికి సూక్ష్మ శరీరం ఉండదు కదా! ఆ తరువాత వాయువు, ధూమం మొదలైన వాటితో క్రమంగా దిగడం కుదరదు. కనుక ఆకాశాది భావం పొందినట్లుగా భావించాలి.
నాతి చిరాధికరణం ( 3, 1, 23 )
సూత్రం :- 314
" నాతి చరేణ విశేషాత్ "
విశేషాత్ :- జీవులకు ఆకాశాదుల సాదృశ్యం, న అతి చరేణ :- ఎంతో కాలం ఉండదు.
భావం :- ఛాందోగ్యంలో చెప్పినట్లుగా అంతరిక్షం నుండి భూమి మీదకు చేరే జీవులకు ఆకాశదులతో సామ్యం కలగడానికి, వాటి నుంచి విడివడడానికి చాలా కాలం పట్టదు. కొద్దికాలం లోనే భూమికి చేరతారు.
వివరణ :- చంద్ర లోకం నుంచి వచ్చే జీవి యాతనా శరీరంతో దాన్య రూపం పొందడానికి పూర్వం సాదృశ్యంతో ఎంత కాలం ఉంటాడు అని అడిగాడు నారాయణ భట్టు. సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు.
ఛాందోగ్యోపనిషత్తు :- (5, 10, 6) :- వ్రీహ్యాది సమరూపాన్ని పొంది రేతస్సు ద్వారా స్త్రీ గర్భాన్ని చేరి, జనించడంలో కొంత కాలం పడుతుంది. ( 5, 10, 10 ):- జీవులు వ్రీహ్యాది రూపమైన వడ్లు, యవలు, ఓషధులు, వనస్పతులు, నువ్వులు, మినుగులుగా జనిస్తారు. వీళ్లకు వ్రీహ్యాది ధర్మాలుంటాయా? జీవుడు సూక్ష్మ శరీరంతో శీ ఘ్రంగా మేఘాది సాదృశ్యాన్ని పొందుతాడు. ఆకాశం, వాయువు, ధూమం, మేఘం లో సాదృశ్యం పొంది, వ్రీహ్యాది సామ్యాన్ని పొంది, అతి తక్కువ కాలంలోనే వర్షరూపంలో భూమికి వస్తాడు. అవరోహణ క్రమంలో ఆలస్యం ఉండదు. త్వరలోనే జరుగుతుంది. శాస్త్రం ఏది లేకపోవడం వలన సుదీర్ఘ కాలమని, అల్ప కాలమని, నియమం లేదు. జీవుడు కొంత కాలమే ఆకాశాది భావంతో ఉండి, వర్షధారలతో కూడా ఈ భూమి మీద పడతారు. అలా వ్రీహ్యాది భావం నుండి బయటకు రావడం చాలా కష్టం. కాలం అల్పం కనుక బయటకు రావడం దుఃఖమైనది. ఆ అవధిలోనే శరీరం నిష్పన్నం కాలేదు కనుక సుఖ భోగం కాని దుఃఖ భోగం గాని ఉండదు. అందువలన వ్రీహ్యాది భావం పొందడానికి ముందు అవరోహణ అల్ప కాలంలోనే జరుగుతుంది.
అన్యాధిష్ఠితాధికరణం ( 3, 1, 24 )
సూత్రం :- 315
" అన్యాధిష్ఠి తేషు పూర్వ వదభిలాపాత్ "
అన్య అధిష్ఠి తేషు :- అన్య జీవులకు, వ్రీహ్యాదులకు భోజ్య, భోక్తృ భావ సంబంధం ఉండటం వలన చంద్రలోకం నుంచి వచ్చే జీవులు, పూర్వవత్ అభిలాపాత్ :- ఆకాశాదుల్లగా వ్రీహ్యాది సాదృశ్యాన్ని పొందు తారు.
భావం :- భోజ్య, భోక్తృ భావ సంబంధాన్ని అధిష్టానం అంటారు. వ్రీహ్యాదులు, భోజ్యాలు తినే వాళ్ళు భోక్తలు. అన్య జీవులకు, వ్రీహ్యాదులకు భోజ్య, భోక్తృ భావ సంబంధం ఉండటం వలన చంద్రలోకం నుంచి వచ్చే జీవులు ఆకాశదుల్లగా, వ్రీహ్యాదుల్లగా జన్మిస్తారు.
వివరణ :- గురువు గారు! చంద్రలోకం నుంచి దిగి వచ్చే వారు వర్ష రూపంలో నేల మీదకు వచ్చిన తరువాత ధాన్యం, యవలు, ఓషధులు, నువ్వులు, మినుగులు మొదలైన రూపాల్లో జన్మిస్తారు అని చెబుతున్నారు కదా! మరి ఇష్టాపూర్త కర్మలు చేసి, చంద్రలోక సుఖాలు అనుభవించి, తిరిగి వచ్చేవారు కూడా పాపాత్ములులాగా ఇలాంటి రూపాలు పొంద వలసిందేనా? అని అడిగాడు కృష్ణ శర్మ. సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. యజ్ఞ యాగాలు మొదలైన సత్కర్మలు చేసిన పుణ్యాత్ములు మరణానంతరం చంద్రలోకంలో భోగాలు అనుభవించి, తిరిగి భూమి మీద ధాన్యాలుగా జన్మిస్తారు. పాపత్ములు వృక్షాలుగా, పశుపక్ష్యాదులుగా, క్రిమికీట కాలుగా జన్మిస్తారు. పుణ్యాత్ములు వర్షం రూపంలో భూమి మీద పడి, ధాన్యపు గింజలతో కలసినప్పుడు వారికీ కర్మ ఫల భోగమనేది ఉండదు. వీరు ఆకాశ వాయు రూపల్లో ఉన్నప్పుడు ఏ రకంగా కర్మ ఫల భోగం లేదో ఇప్పుడు అంతే. కాబట్టి ధాన్యం దంచడం, ఉడికించడం, చెట్లు నరకడం, వలన వచ్చే బాధలు వీరికి ఉండవు. త్రోవలో వీటితో కొంతసేపు కలసి ఉండి, తరువాత జన్మకై వెళ్ళిపోతారు. కాబట్టి కర్మ శేషం గలవారికి ధాన్యపు గింజలు భోగాపురం స్థానాలు కావు. పొలంలో చెట్టుని గొడ్డలితో నరికి నప్పుడు దానిపై ఉన్న పక్షులు ఎగిరిపోతాయి. వాటికి ఏ దెబ్బలు తగలవు. చెట్టుకే అన్నీ దెబ్బలు తగులుతాయి. అదే విధంగా పాపాత్ములు చెట్లుగా పుట్టి, బాధలన్నీ అనుభవిస్తారు. పుణ్యాత్ములు పక్షుల వలె చెట్లను ఆశ్రయించుకొని మాత్రమే ఉంటారు. వారికీ మూల బాధలు ఏవి ఉండవు.
సూత్రం :- 316
" అశుద్ధ మితి చేన్న శబ్దాత్ "
జీవులు వ్రీ హ్యాది సాధర్మ్యం పొందుతారని అంటున్నారు. వ్రీహ్యాదులు దంచి బియ్యంగా చేసినప్పుడు, వంట చేసినప్పుడు, వ్రీహ్యాదులతో బాటు జీవులు కూడా హింసకు లోనవుతారు కదా! కనుక అశుద్ధ :- అశుద్ధం అయి తినడానికి యోగ్యం కాదు కదా! ఇతి చేత్ :- అని అనడం, న :- సరి అయినది కాదు. ఎందుకంటే శబ్దాత్ :- వ్రీహ్యాలు భోజ్యమనే వేదాలు చెబుతున్నాయి.
భావం :- వ్రీహ్యదులు దంచి బియ్యంగా చేసినప్పుడు, వాటితోబాటు జీవులు కూడా హింసకు గురి అవుతారు. కనుక అవి తినడానికి యోగ్యం కాదు అని అనడం సరిఅయినది కాదు. వ్రీహ్యాలు భోజ్యమనే వేదాలు చెబుతున్నాయి.
వివరణ :- యజ్ఞ కర్మలు పరిశుద్ధమైనవి కావు అని అనకూడదు. వేదం విధిరూపంలో చేస్తున్న హింస ధర్మమనే చెబుతున్నది. ధర్మాదర్మాల నిర్ణయం శాస్త్రాల వలన జరుగుతోంది. ఏ ప్రాణి ని హింసించకూడదు. దేవతల ప్రీతీ కోసం పశువును సంహరించాలి. ఇది దేశ కాల మాన పరిస్థితులను బట్టి ఒకప్పటి ధర్మం. అందుచేత యజ్ఞ యాగాదులలో జరిగే హింస అశుద్ధమైనది కాదు.
అధర్వ వేదం ( 4, 2, 7, 3 ) :- " రస మోషధీనామ్ " వ్రీహ్యాదులు మానవులకు భోజ్యాలని తెలుస్తోంది. వేదహిత భోజనం హింసాయుతము, దుష్టము కానేరదు. వ్రీహ్యాదుల సమభావం జీవులకు స్త్రీ గర్భంలో చేరడానికి ఉపయుక్తం. దంచడం, వండటం వలన దుఃఖం కలుగదు. ఇంద్రియాల వలెనే జీవుల శరీరాలకు సుఖ దుఃఖాలు కలుగుతాయి. వ్రీహ్యాదులు అలాంటి శరీరాలు కావు. అవి స్త్రీ గర్భంలో చేరడానికి సాధనలు. వాటి వల్ల హింస కలుగదు. కనుక తండుల భోజనం దుష్టం, అశుద్ధం కాదు. కొందరు ఇక్కడ యజ్ఞలలో పశుహింస ప్రసక్తి వచ్చి, శాస్త్రీయ హింస దోషం కాదని సమర్ధించారు. వాస్తవానికి ఈ సూత్రంలో యజ్ఞ ప్రసక్తి లేదు. ధర్మా ధర్మా నిర్ణయం చెయ్యడానికి ప్రమాణం శాస్త్రమే కదా! ఎందుకంటే ఇవి ఇంద్రియలకు గోచరించనివి. అంతే కాదు. దేశ కాల నిమిత్తాలు కలవి. ఏ దేశంలో, ఏ కాలంలో, ఏ నిమిత్తాన్ని పునస్కరించుకొని ఏ ధర్మం అనుష్టింపబడిందో, మరొక దేశంలో మరొక కాలంలో మరొక నిమిత్తం అధర్మం అవుతుంది. అందుచేత శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి. శాస్త్రం లేకుండా ధర్మా ధర్మలను గురించిన విజ్ఞానం ఎవరికీ లేదు.
సూత్రం :- 317
" రేతః సిగ్యో గోధ "
అధ :- వ్రీహ్యాది సాభావ్యం ఏర్పడిన తరువాత, రేతః సిగ్ యోగః :- రేతస్సు విడుదల చేసే కర్తతో సంబంధం కలుగుతుంది.
భావం :- చంద్రలోకం నుంచి తిరిగి వచ్చిన కర్మాశయంతో కూడా జీవులు వ్రీహి, యవాదుల గుండా రేతస్సును విడుదల చేసే కర్తతో సంబంధం కలుగుతుంది.
వివరణ :- వ్రీహ్యాది భావం పొంది, రేతస్సును విడిచి పెట్టే పురుషుని యొక్క భావం కలుగుతుంది. అంటే కర్మశేషం తో చంద్రలోకం నుంచి వచ్చేవారు ధాన్యభావం తరువాత రేతస్సును విడుదల చేసే యువకుల భావం పొందుతారు. అందువలన జీవులు వ్రీహ్యాదులతో సంబంధం పొందడమే తప్ప ఆయా ధాన్యాలుగా పుట్టడం లేదు అని తెలుస్తోంది. ఎవడెవడు అన్నం తిన్నాడో, ఎవరైతే రేతః సేకం చేస్తాడో, అతడు రేతః సిక్కుగానే అవుతాడు అని చెప్పబడుతోంది. అయితే ఇక్కడ ముఖ్యమైన రేతః సిగ్భావం రేతః సేచకుడవడం కుదరదు. చాలా కాలం క్రితం పుట్టి యవ్వనం పొందిన వాడే రేతః సిక్ అవుతాడు కదా! శృతి వాక్యం ప్రకారం వ్రీహ్యావ్యన్నం తిని ఎవడైతే రేతః సేకం చేస్తాడో వాడు అనుశయ అవుతాడు. అనుశయ రేతః సేకం చేసేవాడు అవడం అసంభవం. అన్నాన్ని తిన్న ప్రతి వ్యక్తి రేతస్సును విడుదల చెయ్యలేడు. రేతః సేకం చెయ్యాలంటే వాడు జన్మించి యవ్వనం పొందాలి. అందుచేత ఇక్కడ రేతః సేకం చేసేవాడు వ్రీహ్యాదులతో సంబంధం పెట్టుకుంటాడు.
సూత్రం :- 318
" యోనేః శరీరం "
యోనేః :- స్త్రీ యోనిని చేరి, శరీరం :- క్రమంగా శరీరాన్ని పొందు తున్నాడు.
భావం :- ఇలా వ్రీహి, యవాదుల మూలంగా పురుషుని శరీరాన్ని చేరిన జీవుడు ఆ పురుషుడి ద్వారా ఋతుకాలంలో రేతస్సుతో బాటు స్త్రీ యోనిని చేరి, క్రమంగా శరీరాన్ని పొందుతున్నాడు.
వివరణ :- వ్రీహ్యాదులైన ధాన్యం, గోధుమలు, వనస్పతులు, మొదలైన వాటిని పురుషుడు తినడడం వలన అతనిలో వీర్యం తయారవుతుంది. చంద్రలోకం నుండి కర్మ ఫల శేషంతో తిరిగి వచ్చే జీవుడు పురుషునిలో వీర్యంగా మారడు. వీర్యంలో అనేక శుక్ర కణాలున్నప్పటికీ జీవుడు ఒక్క శుక్ర కణాన్ని మాత్రమే ఆశ్రయిస్తాడు. స్త్రీ పురుష సంయోగంతో పురుషునిలోని జీవుడు ఆశ్రయించిన శుక్ర కణం స్త్రీ యోనిలో ప్రవేశించి, అక్కడ అండాశయంలో సంయోగం చెంది, తొమ్మిది నెలలు గర్భంలో పెరిగి, శిశువుగా మారతాడు. అప్పుడే కర్మ ఫలం అనుభవించడానికి శరీరధారణ జరుగుతుంది. కొంత మంది దంపతులు సంతానం కలగలేదని బాధ పడటం, వారికి పిల్లలు లేరని కొంతమంది అవహేళన చెయ్యడం జరుగుతుంటుంది. ప్రారబ్ద కర్మ లేకపోతే పిల్లలు కలగరని గ్రహించాలి. ఏ జీవుడు ఏ యోనిలో ప్రవేశించాలో పరమాత్మయే నిర్ణయిస్తాడు. ఛాందోగ్యంలో సంస్కారవంతులు, సదాచార సంపన్నులు ఉత్తమయోని పొందు తారు. అంటే బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, యోనులు పొందు తారు. సంస్కారహీనులు కుక్కలు, పందులు ఛండాలురుగా జన్మిస్తారు. ఇంకా పాపాత్ములు క్రిమి కీటకాలుగా జన్మిస్తారు అని చెప్పబడింది. కాబట్టి కర్మ శేషంతో భూమిని చేరే జీవికి ధాన్యపు గింజలతో సంబంధం మాత్రమే ఉంటుంది.
సూత్రం :- 319
" సంధ్యే సృష్టి రాహ హి "
మొదటి పాదంలో జీవుడి పరలోక గమనం, ఆగమనం గురించి వివరించారు. ఈ పాదంలో విరక్తుడైన పురుషుడికి ఈశ్వరుడి విషయంలో కలిగే భక్తిని నిరూపిస్తున్నారు. భక్తి అనేది ఉపాసనకు అంగం. మంచి విషయాల మీదకు మనస్సు నిలవక, చిత్తంలోని అన్నయత్తం కావడాన్ని విక్షేపం అంటారు. విక్షేపం అంటే మాలిన్యం. దానిని నిర్మూలించి ఉపాసన చెయ్యడం ద్వారా బ్రహ్మ సాక్షాత్కారానికి సుగమం అవుతుంది. జీవాత్మ కన్నా విలక్షనుడు, అపూర్వం, మహిమాన్వితుడైనా భగవంతుని అంగీకరించని వాడు ఎంత విరక్తుడైనా భక్తి యుక్తుడు కాలేడు. జీవుడుకి ఉన్న అవస్థా భేదాన్ని వ్యాసుల వారు ఇక్కడ నిరూపిస్తున్నారు. ఈశ్వరుడికి అలాంటి అవస్థ భేదాలు లేవని కూడా నిరూపిస్తున్నారు. జాగ్రదావస్థ విడిచి,స్వప్నవస్థ గురించి వివరిస్తున్నారు. స్వప్నావస్థలో జీవుని స్థితిని వివరిస్తున్నారు.
సంధ్యే :- స్వప్నంలో, సృష్టిహి :- సృష్టి కలుగుతుంది. హి :- ఎందుకంటే, ఆహ :- ఉపనిషత్తు వాక్యాలు చెబుతున్నాయి.
భావం :- స్వప్నవస్థ లో సృష్టి కలుగుతుందని ఉపనిషత్ వాక్యాలు చెబుతున్నాయి.
వివరణ :- కర్మ ఫలమే జీవుడి సుఖ దుఃఖలకు, జనన మరణాలకు కారణం. వాటి యందు విరక్తి కలిగి, పరమాత్మ యందు భక్తి జ్ఞానం కలగాలని ఈ పాదంలో వివరిస్తున్నారు.
బృహదారణ్యకోపనిషత్తు :- ( 4, 3, 9 ) అతడు నిద్రించిన చోట అని మొదలుపెట్టి, స్వప్నంలో రధాలు గాని, గుర్రాలు గాని, మార్గాలు కాని ఉండవు. కాని వాటిని సృష్టిస్తాడు అని వర్ణించారు. అందువల్ల జీవుడు జాగ్రదావస్థలో రధాదులను సృష్టించ్చేటట్లు, స్వప్నంలో కూడా సృష్టిస్తాడా? లేక రధాదులకు సంబంధించిన విపరీత జ్ఞానం కలుగుతుందా. స్వప్నంలో జీవుడు రధాదులను సృష్టిస్తాడని బృహరణ్యకం లో చెప్పబడింది. సంధ్య అంటే స్వప్నం. జాగ్రత్, సుషుప్తిలకు మధ్య స్థానం. స్వప్నంలో ఉంటూ మిగిలిన రెండు చూస్తాడు. ఆత్మ పురుషుడు సమస్త లోకాలలోని అనుభవాలను తీసుకొని స్తూల శరీరాన్ని వదలి, స్వప్న శరీరంలో ప్రవేశించి, ఆత్మ జ్యోతి స్వరూపంతో స్వప్నం చూస్తాడు. ఈ స్థితిని స్వప్న దృష్ట అయిన పురుషుడు తైజసుడు అని పిలువబడతాడు.
బృహధారణ్యాకోపనిషత్తు :- స్వప్నావస్థలో రధాలు, వాటికీ కట్టే గుర్రాలు, అవి నడిచే మార్గాలు ఏవి ఉండవు. అన్నింటిని స్వప్న పురుషుడే రచించుచుకుంటాడు. అప్పుడు ఆనందం, ప్రమోదం, మోదం ఏమి ఉండవు. అయినా వాటిని తానే కల్పించుకుంటాడు. స్వప్నంలో ఈ స్థితి యదార్ధమా? లేక మిద్యా అనేది సందేహం.కర్మ ఫలమే జన్మకు కారణమని తెలుసుకొని, జనన మరణ చక్రం నుండి బయటపడి, వైరాగ్యం కలిగి, జన్మ రాహిత్యం కోసం పరమాత్మ గురించి తెలుసుకొని, ఆత్మ జ్ఞానం పొందడం ద్వారా మోక్షాన్ని సాధించవచ్చును. నేను జీవుణ్ణి అనుకోవడం అజ్ఞానమే, జీవాత్మ పరమాత్మ ఒక్కటే అని ఎవరు తెలుసుకోగలరో వారికే మోక్ష ప్రాప్తి కలుగుతుంది. జాగ్రదావస్థ, స్వప్నవస్థ, సుషుప్తి అవస్థల గురించి ఎందుకు తెలుసుకోవాలి? ఈ మూడు అవస్థలలో జీవుడు ఎలా ఉన్నాడో తెలుసుకోవాలి. జాగ్రదావస్థలో జీవుడు లౌకిక ప్రపంచంతో తాదాత్మ్యం చెంది, అదే శాశ్వతమని, విషయ వాసనతో సుఖ దుఃఖాలను అనుభవిస్తుంటాడు. స్వప్నావస్థలో ఎన్నో దృశ్యాలు చూస్తుంటాడు. తెల్లవారగానే అవన్నీ మిధ్యే నని తెలుసుకుంటాడు. ఆధ్యాత్మిక చింతన ఉన్నవాడికి జాగ్రదావస్థ కూడా మిధ్యే నని, చివరకు ఈ ప్రపంచమే అశాశ్వత మని మిధ్య అనీ, పరమాత్మయే సత్యమనే జ్ఞానం కలుగుతుంది . స్వప్నవస్థ కు సంధ్య అని పేరు. స్వప్నంలో పురుషుడే అన్నీ కల్పించుకొని ఆనందం పొందుతాడు. అవన్నీ మిధ్యే. జాగ్రదావస్థలో అజ్ఞానం వలన చూస్తున్నవన్నీ నిజమే అనుకుంటాడు. ఆత్మజ్ఞానం కలిగినవాడికి అంత మిధ్యే నని, అహం బ్రహ్మాస్మి అనుకుంటాడు.
సూత్రం :- 320
" నిర్మాతారమ్ చైకే పుత్రాదయశ్చ "
చ :- అంతే కాక, ఏ కే :- కఠ శాఖను అధ్యయనం చేసే కొందరు, నిర్మాతారం :- పురుషుణ్ణి స్వప్నంలో పదార్ధాలన్నీ నిర్మించే వాడుగా భావిస్తారు. పుత్రాదయః :- పైగా నిర్మించే పదార్ధాలను సంతానం అని తలపోస్తారు.
భావం :- కఠ శాఖను అధ్యయనం చేసే కొందరు పురుషుడే స్వప్నంలోని పదార్ధాలను నిర్మిస్తాడని, ఆ పదార్ధలే సంతానం అని తెలియజేశారు.
వివరణ :- కొంతమంది స్వప్న పదార్ధాలను నిర్మించేవాడు పరమేశ్వరుడే అంటారు. అతను నిర్మించే కామ విషయాలు పుత్రాదులు, ఇంద్రియాలన్ని నిద్రించిన తరువాత పురుషుడు తాను కోరిన పదార్ధాలను సృష్టిస్తూ మేల్కొంటాడు. అందుకే అతనిని కామ నిర్మాత్తగా చెబుతారు.
కఠోపనిషత్తు ( 5, 8 ) :- "య ఏష సుప్తేషు జాగ్రర్తి కామం కామం పురుషో నిర్మిమాణః " ఇంద్రియాలు నిద్రిస్తున్నప్పుడు పురుషుడు కామాలను నిర్మిస్తాడు. దీనిని బట్టి జీవుడు స్వప్నావస్థలో పదార్ధాలను నిర్మిస్తాడని తెలుస్తోంది. ఇక్కడ కామం అంటే కోరిక. పదార్ధ రచన. కామ్య పదార్ధ నిర్మాణం. ( 1, 14 ) :- కామానం త్వా కామభాజం కరోమి " కామించాల్సిన పుత్రాది పదార్ధాలు నిన్ను కోరుకునేలా చేస్తాయి. ఇక్కడ కామపదం పుత్రాది కామ్య పదార్ధాలకు వాచకంగా వాడారు. కాబట్టి జీవుడు స్వప్నంలో రధాది వస్తువులను సృష్టిస్తాడని చెప్పడమే యుక్తం అని పూర్వ పక్ష వాదన. "కామానం కరోమి " యముడు నచకేతునితో వంద సంవత్సరాల ఆయువు గల పుత్రులను, పౌత్రులను, కోరుకో, రాజ్యం కోరుకో, భోగభాగ్యలు కోరుకో. భూలోకంలో ఏమి దొరుకుతాయో అవన్నీ కోరుకో అని అంటాడు. ఇక్కడ కామ అంటే పుత్రుడు అనే అర్ధం కాబట్టి స్వప్నంలో పుత్రాదులను సృష్టించేది పరమాత్మ. జాగ్రదావస్థ లో వలె స్వప్నవస్థ లో కూడా అతడే సృష్టి కర్త. అందుచేతనే ఈ స్వప్న జగత్తు కూడా సత్యమైనదే అని వారి వాదన. పరమేశ్వరుడు సృష్టించిన జాగ్రదావస్థకు సంబంధించి సృష్టి సత్యమైనదిగా కనబడుతున్నది గాన స్వప్నాశ్రయమైన సృష్టి కూడా సత్యమవడానికి తగి యున్నది. జాగ్రదావస్థలో ఏమేమి చూస్తాడో నిదరించి కూడా వాటినే చూస్తాడు అని శ్రుతి స్వప్న జాగరిత స్థానాలు సమానరూపాలని చెప్పుచున్నది.
సూత్రం :- 321
"మాయా మాత్రం తు కార్త్స్న్యేనా నభి వ్యక్త స్వరూపత్వాత్ "
మాయ అంటే ప్రజ్ఞానం, మాయా మాత్రం :- విపర్యయ జ్ఞానం, మిధ్యా జ్ఞానం, కారేత్ స్న్యే నా అంటే పదార్ధ నిర్మాణానికి కావలసిన దేశకాల నిమిత్తలు అన్నీ, కార్త్స్యేన వానభివక్త స్వరూపాత్ :- దేశ కాలాది సమస్త కారణ పదార్ధాలు లేకుండా కార్యం ఉత్పత్తి కానందువలన.
భావం :- పదార్ధ నిర్మాణానికి కావలసిన దేశ కాల నిమిత్తాలు లేకుండా కార్యం ఉత్పత్తి కానందు వలన స్వప్నంలో కలిగేది పదార్ధాల విపర్యయ జ్ఞానమే గాని మరొకటి కాదు.
వివరణ :- స్వప్నసృష్టి అనేది కేవలం మాయా మాత్రమైనదే. పూర్తిగా అభివ్యక్తం కాని స్వరూపం కలది. అది దేశ కాలాది సమస్త ధర్మాలతో కనిపించదు. స్వప్నసృష్టికి రూపం లేదు. అది యదార్ధం కాదు. అది కలగనే వాడికి మాత్రమే కనిపిస్తుంది. ఇతరులకు కనిపించదు. అంతా మిధ్యే. స్వప్నంలో రధాలు, గుర్రాలు, మార్గాలు అన్నీ కనిపిస్తాయి. ఆ కల కరిగిపోగానే ఏమి కనిపించదు. ఇంత తక్కువ కాలంలో వీటిని సృష్టించేది ఎవరు? స్వప్నావస్థలో జీవుడు దేహంతో తన ఇష్టం వచ్చినట్లు విహరిస్తున్నాడు. ఈ మాయాస్వరూపాన్ని సృష్టించేది జీవుడే కాని ఈశ్వరుడుకాదు. సంధ్యలోని సృష్టి మాయయే కాని వానిలో పరమార్ధ గంధం కూడా లేదు. ఎందువల్ల? స్వప్నం పూర్తిగా అభివ్యక్తస్వరూపం కాబట్టి. దేశకాల నిమిత్తాలు, బాధ లేకపోవడం, నిషేదింప బడకపోవడం, ఇవి స్వప్నంలో సంభావ్యములు కావు. ఇరుకైన దేహంలో రధాదులను అవకాశం ఉండదు కదా! దూరంలో ఉన్నా వస్తువులను చూస్తున్నాడు అంటే దేహం నుండి బయటకు వచ్చి స్వప్నం చూస్తున్నాడు. జీవుడు బయట సంచరిస్తూ కామం (భోగ్యపదార్ధ జాతం) ఎక్కడ ఉన్నదో అక్కడికి వెడతాడని, దేహం బయటనే స్వప్నం చూస్తాడని శ్రుతి చెబుతున్నది. జీవుడు శరీరం నుండి బైటకు రాకపోతే నిలబడినట్లు, నడుస్తున్నట్లు ఎలా భావిస్తున్నాడు? దానికి సమాధానం చెప్పబడింది. అది యుక్తం కాదు. నిద్ర పోతున్న వాడు క్షణం కాలంలో నూరు యోజనాల దూరం ఉన్న ప్రదేశానికి వెళ్ళడానికి, తిరిగి రావడానికి సామర్ధ్యం ఉండదు కదా! నేను కురుదేశంలో నిదురించి, పాంచాలదేశంలో మేల్కొన్నాను అని స్వప్నం గురించి చెబుతాడు. అతను దేహం నుండి బయటకు వెళ్లినట్లయితే పాంచాల దేశంలో మేలుకోనాలి. అలా జరగదు కదా! తన ఇష్టానుసారం విహరిస్తూ అనేక దృశ్యాలు, అనుభవాలు పొందుతాడు. కొన్ని సార్లు ఇష్టం లేని దుస్వప్నాలు కూడా చూస్తుంటాడు. అందుకే స్వప్న పదార్ధాలు అన్నీ మాయే. నిజంగా లేకపోయినా ఉన్నట్లుగా కనిపిస్తాయి.
సూత్రం :- 322
" సూచకశ్య హి శ్రుతే రాచక్షతే చ తద్విదః "
స్వప్నం విపర్యయ జ్ఞానమే. హి :- ఎందుకంటే, సూచనః :- కలలు రాబోయే శుభ, అశుభాల్ని సూచిస్తాయని, తద్విదః :- కలల్ని విశ్లేషంచిన వాళ్ళు, శ్రుతేః :- ఉపనిషద్వాక్యాలు ఆధారంగా, ఆచక్షతే చ :- చెబుతున్నారు కూడా!
భావం :- కలలు రాబోయే శుభ, అశుభ ఫలితాలను సూచిస్తాయని కలలను విశ్లేశించిన వారు ఉపనిషద్వాక్యాల ఆధారంగా చెబుతున్నారు.
వివరణ :- స్వప్నశాస్త్రం తెలిసిన వారు స్వప్నం శుభాశుభాలను సూచిస్తుందని చెబుతున్నారు.
ఛాందోగ్యోపనిషత్తు(5,2,9):-కామ్యకర్మలు చేసేటప్పుడు స్వప్నంలో స్త్రీని దర్శిస్తే ఆ కర్మల యందు సమృద్ధి కలుగుతుంది. నల్లనిపళ్ళు ఉన్న నల్లనిమనిషిని చూస్తే అతడు చంపేస్తాడు అని కలగురించి చెప్పారు. అలాగే స్వప్నం గురించి పరిశోధనలు చేసిన వారు ఏనుగు ఎక్కినట్లుగా కల రావడం శుభ సూచకమని, ఉష్ట్రపక్షులు, గాడిద ఎక్కినట్లు కల వస్తే అశుభ సూచకమని అంటారు. ఇలా రాబోయే శుభ అశుభాలను స్వప్నాలు సూచిస్తాయనడంలో కలల్లో పదార్ధాల అభాసయే కాని, వాస్తవానికి పదార్ధాలు అక్కడ ఉండవని స్పష్ట మౌతోంది. స్వప్నంలో వీర్య స్కలనం కావడానికి కారణం స్త్రీ ఆభాసే కాని స్త్రీ ఉండదు కదా! అందుకే స్వప్నంలో కలిగే జ్ఞానం యదార్ధం కాదని వెల్లడి అవుతోంది. రామాయణంలో త్రిజట స్వప్న వృత్తాంతం ప్రసిద్ధి చెందింది. కాబట్టి స్వప్నం మాయ, మిధ్య అని ఎలా అనగలము అనే వారి వాదన సరి అయినది కాదు. స్వప్నం వలన కలిగే శుభాశుభాలు, లాభ నష్టాలు నిజం కావచ్చును. కానీ స్వప్నం మాత్రం మిధ్యే. మేలుకోగానే కల కరిగిపోతుంది. కాబట్టి అది అబద్ధం. ఈ స్వప్నాలను జీవుడే సృష్టిస్తున్నాడు. స్వప్నాధ్యాయం అంటే స్వప్న పరిశీలన చేసే గ్రంధంలో మంత్రం విశేష, దేవతా విశేష, ద్రవ్య విశేషాలను బట్టి కొన్ని స్వప్నాలు సత్యమేనని అభిప్రాయం పడుతున్నారు. అప్పుడు కూడా సూచింపబడే వస్తువు సత్యమైతే కావచ్చును. కాని దానిలో కలిగే జ్ఞానం యదార్ధం కాదు. కనుక స్వప్నం మాయమాత్రం అనడం యుక్తమే.
సూత్రం :- 323
" పరాభి ధ్యానాత్తు తిరోహితం తతో హ్యస్య బంధ విపర్యయో "
తు :- కాగా, పర అభిధ్యానాత్ :- రధాది ఇతర పదార్ధాలను గురించి ఆలోచించడం వలన, తిరోహితం :- బుద్ధి సత్వం అచ్చాధితం అవుతుంది. తతః :- అందువలన, హ :- నిశ్చయంగా, అస్య :- నిద్రలో ఉన్న జీవాత్మకు, బంధ విపర్యయో :- బంధమోక్షాలు భాసిస్తాయి.
భావం :- రధాది ఇతర పదార్ధాలను గురించి ఆలోచించడం వలన బుద్ధి సత్వం ఆచ్చాధితం అవుతుంది. అందువలన నిద్రలో ఉన్న జీవాత్మకు బంధ మోక్షాలు భాసిస్తాయి.
వివరణ:-గురువుగారు! ఈశ్వరుడు, జీవుడు ఇద్దరూఒక్కటే. ఈశ్వరుడు సంకల్పమాత్రం చేతనే స్వప్నజగత్తును సృష్టిస్తున్నాడు. అలాంటప్పుడు స్వప్నజగత్తు మిధ్య ఎలాఅవుతుంది? అని అడిగాడు కృష్ణశర్మ. సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. జీవుడు, ఈశ్వరుడు ఒక్కటే. జీవుడు అవిద్య, అజ్ఞానం చేత ఆవరించబడి ఉంటాడు. అందుచేత జీవుడుకి ఈశ్వరుడుకి ఉన్నంత శక్తి లేదు. జీవుడిలో ఉన్న అజ్ఞానపు పొరలు తొలగిపోగానే తాను, పరబ్రహ్మ ఇద్దరూ ఒకటే నని తెలుస్తుంది. మరుక్షణమే తాను పరబ్రహ్మలో లీనం అయిపోతాడు. జీవుడిలో ఎప్పుడైతే పరబ్రహ్మ కన్నా తానువేరు అనే భేద భావం నశించి పోతుందో అప్పుడు అద్వైత భావం పొందతాడు. కాబట్టి జీవుడు సృష్టించే స్వప్నం నిజం కాదు. ప్రత్యక్ష ప్రమాణాల వలన జాగ్రదావస్థలో పదార్ధాల జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానసంబంధమైన సంస్కారాలు బుద్ధి సత్వంతో ఏర్పడతాయి. ఎన్నో సార్లు పదార్ధాలని గురించి ఆలోచించడం వలన ఆ సంస్కారాలు దృఢపడి బుద్ధిసత్వాన్ని కప్పేస్తాయి. శాస్త్రాల్లో బోధించిన బంధ మోక్షాలకు కారణాలను తెలుసుకొని, జాగ్రదావస్థ లో వాటిని ఆచరిస్తే మోక్ష ప్రాప్తి కలుగుతుంది. అగ్నికి విస్ఫులింగం వలె, జీవుడు పరమాత్ముని ఒక అంశ. అందుచేత అగ్నిలోనూ, విస్ఫులింగం లోను దహన శక్తి, ప్రకాశ శక్తి ఏ విధంగా సమంగా ఉంటాయో, అదే విధంగా జీవే శ్వరులలో జ్ఞానైశ్వర్య శక్తులు సమంగా ఉంటాయి. అందుచేత స్వప్నంలో సంకల్పంచేత రదాధి సృష్టి జరుగుతుందని అశంక కలుగుతుంది. దానికి సమాధానం చెప్పబడు చున్నది. జీవేశ్వరులకు అంశాశిభావం ఉన్నా కూడా జీవునిలో, ఈశ్వరునిలో ఉన్న ధర్మాల కంటే విపరీత ధర్మాలు ఉన్నాయనేది ప్రత్యక్షమే. జీవేశ్వరులకు సమాన ధర్మత్వం లేదా అంటే, లేకపోవడం లేదు. కాని అది అవిద్య వలన కప్పబడి ఉన్నది. నిత్యం పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ, తదేకంగా ధ్యానిస్తూ, ప్రయత్నించగా తమస్సు తొలగి పోయి, ఆ ఒక్కనికే ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. ఈశ్వర స్వరూపం తెలియక పోవడం వలన బంధం కలుగుతోంది. అది తెలుసుకుంటే మోక్షం కలుగుతుంది. "బ్రహ్త్మెవాహమ్ "అని ధ్యానిస్తుండే వానికి అవిద్యాది సర్వ పాపాలు నశించిపోయి క్లేశాలు తొలగి పోగానే జన్మ మృత్యువులు నశిస్తాయి. జాగ్రదావస్థ లోనే వాటిని ఆచరించేటప్పుడు వాస్తవంగా బంధ మోక్షాలు లభిస్తాయి.
సూత్రం :- 324
" దేహ యోగాద్వా సోపి "
కలలు ఎందుకు వస్తాయి? సః అపి :- ఆ స్వప్నం కూడా, దేహ యోగాత్ వా :- ఒక్కో సారి దేహ సంబంధం వలన, మరొక సారి ధర్మం వలన, ఇంకో సారి అధర్మం వలన, వస్తుంది.
భావం :- స్వప్నాలు దేహ సంబంధం వలన, ధర్మం వలన, అధర్మం వలన వస్తాయి.
వివరణ :- జీవుడి కుండే ఐశ్వర్య తిరోభావం దేహాది సంబంధం వలన కలుగుతుంది. దేహము, ఇంద్రియాలు, బుద్ధి, మనస్సు, వీటి సంయోగం వలన జీవుడికి సహజంగా ఉండవలసిన జ్ఞానం, ఈశత్వం తిరోభావం చెందుతాయి. ఆయా పదార్ధాలకు సంబంధించిన సంస్కారాలు స్వప్నానికి సాధారణ కారణం. దేహాది సంబంధాలు విశేషకారణం. అప్పుడప్పుడు వాతాది ప్రకోపాలు కలగడం వలన శరీరంలో మార్పు వస్తుంది. అలాంటప్పుడు ఆకాశంలో విహరించడం లాంటి కలలు వస్తాయి. ధర్మాధర్మ సంస్కార సంబంధం వలన కలిగే కలలు శుభాశుభ సూచకాలు. స్వప్నం అనేది పూర్వనుభావం వలన ఏర్పడే సంస్కారాల వలన కలుగుతుంది. ఏదీ యదార్ధం కాదు. విపర్యయ జ్ఞానమే.
ఛాందోగ్యోపనిషత్తు:- ఉద్ధలకుడు శ్వేతకేతువుకు ఆత్మతత్వాన్ని వివరిస్తూ జగత్తులోని నామరూపాలన్నీ దేనిలో లీనమై పోతున్నాయో అదే బ్రహ్మ. అదే నీవు అంటాడు. అంటే జీవాత్మ, పరమాత్మ రెండుఒక్కటే. అయినప్పటికీ అవిద్యతో కూడినది జీవాత్మ. అటువంటప్పుడు జీవుడు చేసే సృష్టి శాశ్వత మైనది కాదు. అందుకే స్వప్నం అంతా మాయే. జీవుడు పరమాత్మ అంశం అయి ఉన్నా కూడా ఎందువల్ల అతని జ్ఞానైశ్వర్యాలు తిరస్కృతులవుతున్నాయి? జీవుని జ్ఞానైశ్వర్య తిరోభావం కూడా దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, విషయాలు, వేదన, మొదలైన వాటితో సంబంధం వలన కలుగుతుంది. అగ్నిలో దహన ప్రకాశనాలు ఉన్నా కూడా ఆరణిలోఉన్నా అగ్నియొక్క దహన ప్రకాశం ఏవిధంగా తిరోహితముగా ఉంటుందో, భస్మం చేత కప్పబడిన అగ్నియొక్క దహన ప్రకాశనాలు ఏవిధంగా తిరోహితములౌతాయో, అట్లే జీవుని జ్ఞానైశ్వర్యాలు తిరోభావం కూడా అవిద్య చేత ఏర్పడిన నామరుపాల చేత చేయబడిన దేహాద్యుపాదులతో సంబంధం వలన వాటి నుండి వివేకం లేకపోవడం వల్ల కలిగించబడింది. జీవేశ్వరులు వేరు వేరు అను అశంకను నివారించడనికే వా శబ్దం ప్రయోగింపబడింది. జీవుడే పరమాత్మని ఆత్మ అని చెప్పబడ్డాడు. అందుచేత జీవుడు ఈశ్వరుని కంటే అభిన్నుడై ఉండి, దేహసంబంధం వలన తిరోహితములైన జ్ఞానైశ్వర్యాలు కలవడావుతున్నాడు. అందుకే స్వప్నంలో రధాది సృష్టి జీవుడి సంకల్పకృతమే.
తదభావాధికరణం ( 3, 2, 7 )
సూత్రం :-325
"తద భావో నాడీషు తచ్రుతే రాత్మని చ "
తత్ అబావః:- సుషుప్తి ( గాఢ నిద్ర ), నాడీషు :- హిత నాడులోనూ, పూరీతత నాడి లోను, ఆత్మని చ :- పరమాత్మలోనూ, జీవుడు ఉన్నప్పుడు కలుగుతాయి. తత్ శ్రుతేః :- జీవుడు సుషుప్తిలో ఆ నాడుల్లో, ఆత్మలో ఉంటాడని ఉపనిషత్వాక్యాల వలన తెలుస్తోంది.
భావం :- సుషుప్తి హితనాడుల్లోను, పురీతత నాడి లోను పరమాత్మలోనూ జీవుడు ఉంటాదని ఉపనిషద్వాక్యాల వలన తెలుస్తోంది.
వివరణ:- గురువు గారు! ఇప్పటి వరకు స్వప్నవస్థ గురించి చెప్పారు. మరి సుషుప్తి అంటే ఏమిటి? సుషుప్తావస్థ అనేది నాడులా? పూరీతతా? దహరాకాశమైన పరమాత్మా? ఈమూడు కలసినది ఏదైనా ఉందా? ఎందుచేత నంటే సుషుప్తిని గురించి ఉపనిషత్తులలో రక రకాలుగా వివరించారు.అని అడిగాడు నారాయణ బట్టు.
ఛాందోగ్యోపనిషత్తు:-(6,6,3):-జీవుడు నిద్రిస్తున్నప్పుడు కలలుకనడు. సుషుప్తి సమయంలో ప్రసన్నుడై ఉంటాడు. అప్పుడు హృదయ నాడుల్లో నిద్రిస్తాడు. (6,8,10) :- జీవుడు స్వపితి నిద్రిస్తాడు. అప్పుడతడు బ్రహ్మతో కలసి ఉంటాడు.
బృహదారణ్యకోపనిషత్తు (4,3,21):- పరమాత్మను ఆలింగనం చేసుకొని బయటా లోపలా అనేది తెలియకుండా ఉంటాడు. ఈ ఉపనిషద్వాక్యాన్ని బట్టి జీవుడు సుషుప్తిలో ఉన్నప్పుడు హృదయంలో ఉండే పూరీతత నాడుల ద్వారా పరమాత్మను చేరి అభివ్యక్త రూపంలో ఉంటాడు. ఆ సమయంలో మనస్సు కూడా పనిచేయదు.
ఛాందోగ్యోపనిషత్తు(2,1,19) జీవుడికి నిద్రిస్తున్నప్పుడు ఏమితెలియదు. హృదయం నుండి 72000 నాడులు వెలువడు తున్నాయి. వాటిని హితనాడులు అంటారు. అవన్నీ పురీతత నాడికి అభిముఖంగా ఉంటాయి. జీవుడు ఆ నాడుల్లో జరిగి పురీతత నాడిలో నిద్రిస్తాడు.
బృహదారణ్యాకోపనిషత్తు(4,3,21):- పరమాత్మను ఆలింగనం చేసుకొని బయట లోపల అనేది తెలియకుండా ఉంటాడు. ఉపనిషద్వాక్యాన్ని బట్టి జీవుడు సుషుప్తిలో ఉన్నప్పుడు హృదయంలో ఉండే పురీతత నాడుల ద్వారా పరమాత్మను చేరి, సుఖిస్తాడని తెలుస్తోంది. అప్పుడు జీవాత్మ పరమాత్మలో చేరి అవిభక్త రూపంలో ఉంటాడు. ఆ సమయంలో మనసు కూడా పనిచేయదు. హృదయంలో పద్మంఆకారంలో ఉండే నాడీసమూహాన్ని పురీతత్ అంటారు. నాడులు, పురీతత్తు, బ్రహ్మ అనేవి జీవుడికి సుషుప్తి స్థానాలు. ఈ నాడుల గుండా పురీతత్తు లో ప్రవేశించి అక్కడ బ్రహ్మ నిద్రపోవాలి. స్వప్నావస్థలో మనస్సు మాత్రమే పనిచేస్తుంది. మనస్సు కూడా లీనమైనప్పుడు అది సుషుప్తి.
సూత్రం :- 326
" అతః ప్రబోధోస్మాత్ "
అతః :- సుషుప్తికి పరమాత్మయే స్థానం కావడం వలన, అస్మాత్ :- ఆ పరమాత్మ నుంచే, ప్రబోదః :- జీవుడుకి ప్రభోదం కలుగుతుంది.
భావం :-సుషుప్తికి పరమాత్మయే స్థానం కనుక ఆ పరమాత్మ నుంచే ప్రబోధం కలుగుతుంది.
వివరణ :- జీవుడు ఆత్మలో నిద్రించి ఉన్నాడు. కాబట్టి ఆత్మ నుంచే మేలుకొంటాడు. నాడుల ద్వారా పురీతత్తులో ప్రవేశించి హృదయాకాశంలో నిద్రిస్తాడు. అది పరమాత్మ స్థానం కనుక జీవుడు పరమాత్మతో ఐక్యం పొంది, గాఢనిద్రలో ఆనందాన్ని అనుభవించి, ఉదయం ఆ ఆత్మస్థానం నుండే మేల్కొంటాడు. ఆ స్థితిలో అతడిని ప్రాజ్ఞుడు అంటారు. ఆసుషుప్తిలో అన్ని అనుభవాలు ఏకమై పోతాయి. కేవలం గ్రహణ శక్తి మాత్రం నిలిచిపోతుంది. పరస్పర విరుద్ద భావాలు స్పురించవు. ఆ స్థితిలో ప్రాజ్ఞుడు ఆనందాన్ని అనుభవిస్తాడు. ఇది తమోగుణ ప్రధానమైన అవస్థ. ఇతడే అన్నింటికీ ప్రభువు. ఈశ్వరుడు. సర్వము తెలిసినవాడు. అంతర్యామి. అక్కడ నుండే జీవుడు నూతనఉదయం ఉత్సాహంతో మేలుకొంటాడు. సుషుప్తిలో పరమాత్మ తో ఐక్యం అయ్యామనే విషయం గ్రహించలేకపోవడం వలన బ్రహ్మానికి దూరం అవుతున్నాడు. తెల్లవారగానే అతనిలో ఉన్న "నేను" అనే అహం నిద్ర లేచి, సమస్త ఇంద్రియ వ్యాపారాలతో సంబంధం ఏర్పరచుకొని బ్రహ్మాన్ని గుర్తించ లేకపోతున్నాడు.
బృహదారణ్యాకోపనిషత్తు(2,1,16):- జీవులు మేల్కొన్నప్పుడు అతను ఎక్కడనుంచి వచ్చాడు. అని ప్రశ్న. (2,1,20):- అగ్ని గురించి నిప్పు కణాలు ఎలా విలువడుతాయో, అలాగే ఈశ్వరుడి నుంచి అన్ని ప్రాణాలు, లోకాలు, దేవతలు భూతాలన్నీ వెలువడుతాయి అని జవాబు. దీనిలో జీవుడు పరమాత్మతోనే నిద్రించి, అతని నుంచే మేల్కొంటాడని సిద్ధిస్తోంది. కాగా జీవుడు నిద్రిస్తున్నప్పుడు పరమాత్మతో ఏకం అవుతాడంటున్నారు కదా! అలా అయితే మేల్కొనే జీవుడు అతడేనా? లేక ఇంకొకడా? అని సందేహం. అది ఎక్కడ నుంచి వచ్చింది అనే ప్రశ్నకు సమాధానం చెప్పే సందర్భంలో " యధా ప్రాణాః ", " సత్.. ఆగచ్చా మహే " అని చెప్పబడింది. సుషుప్తి స్థానాల విషయంలో వికల్పం ఉండే పక్షంలో ఒకప్పుడు నాడుల నుంచి మేల్కొంటారు. ఒకప్పుడు పురీతత్తు నుంచి మేల్కొంటారు. ఒకప్పుడు ఆత్మ నుంచి మేల్కొంటారు అని చెప్పబడేది. ఆ కారణాల వలన కూడా సుషుప్తి స్థానం ఆత్మయే.
కర్మాను స్మృతి శబ్ద విద్యధికరణం ( 3, 2, 9 )
సూత్రం :- 327
" స ఏవ తు కర్మాను స్మృతి శబ్ద విధి భ్యః "
కర్మ :- మిగిలిన కర్మలను అనుష్టించడం వలన, అను స్మృతి :- స్మృతుల వలన, శబ్ద :- శృతి వాక్యాల వలన, విధిభ్యః :- విధుల వలన, స ఏవతు :- నిద్రించిన జీవుడే మేల్కొంటాడు.
భావం :- జీవుడు హృదయస్థానంలో ఉన్న బ్రహ్మలో నిద్ర పోతున్నాడు. మళ్ళీ అందులోనుండే మేల్కొంటాడు. నిద్రించిన జీవుడే మళ్ళీ మేల్కొంటాడు.
వివరణ:-సుషుప్తి పొందిన జీవుడే మళ్ళీ మేల్కొంటున్నాడు అని అనడానికి నిదర్శనం ఏముంది? నిద్రించేది ఒకడు. మేల్కొనేవాడు మరొకడు కావడానికి వీలు లేదు. నిద్రించడానికి పూర్వం ప్రారంభించిన పనిని, మేల్కొన్న తరువాత మళ్ళీ ప్రారంభిస్తాడు. నిన్న నేను దానిని చూసి ఉన్నాను అని పూర్వం అనుభవించిన దానిని తరువాత స్మరించడం, ఇతరుడు లేచినట్లయితే ఉపపన్నం కాదు. ఒకడు చూచిన దానిని మరొకడు స్మరింపజాలడు కదా! అదే విధంగా ఆ వ్యక్తియే నేను అని తనను గూర్చిన స్మరణంకూడా మరొక ఆత్మ లేచిన పక్షంలో కుదరదు. శ్రుతుల వలన కూడా అతడే లేస్తున్నట్లు తెలుస్తోంది. ఈజీవులందరూ ప్రతిరోజు ఈ బ్రహ్మలోకాన్ని పొందుతున్నా కూడా అజ్ఞానం వలన పూర్తిగా పొందలేక పోతున్నారు. ఆ జీవులు పెద్దపులి అయినా, సింహామైనా, తోడేలైనా, వరాహమైన, పురుగైనా, పూర్వం మేల్కొన్నప్పుడు ఏవిగా ఉండేవో అవి గానే మళ్ళీ మేల్కొన్నప్పుడు అవుతాయి. కర్మవిధుల వలన, విద్యావిధుల వలన ఇట్లే తెలుస్తుంది. అట్లు కాని పక్షంలో కర్మ, విద్యావిధులు వ్యర్థములౌతాయి. మరొకడు లేచే పక్షంలో నిద్రిస్తే చాలు, ప్రతి ఒక్కడు ముక్తుడై పోతాడని చెప్ప వలసి వస్తుంది. పెద్దదైన సముద్రంలో చిన్న నీటి బొట్టు వేస్తె అది అందులో కలసి పోతుంది. మళ్ళీ బయటకు తీసినప్పుడు ఆ బొట్టే రావాలని నియమం ఏముంది? అలాగే పరమాత్మలో అనేక జీవులు కలసి పోతాయి. అసంఖ్యాక మైన జీవులకు సుషుప్తి స్థానంగా ఉండి పరమాత్మ నుండి ఆ జీవులే మేల్కొంటాయాని ఎలా చెప్పగలం? ఇంకా ఇతరమైనవి కావచ్చును కదా! అన్నాడు నారాయణ భట్టు. దానికి సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు.
ముగ్ధేర్ధ సంపత్యధికరణం ( 3, 2, 10 )
సూత్రం :- 328
" ముగ్ధేర్ధ సంపత్తిః పరిశేషాత్ "
ముగ్ధేః :- మూర్చ కలిగినప్పుడు, పరిశేషాత్ :- ప్రత్యేకంగా, అర్ధ సంపత్తిః :- సగం సుషుప్తి ఉంటుంది.
భావం :- మూర్చ కలిగినప్పుడు ప్రత్యేకంగా సగం సుషుప్తి ఉంటుంది.
వివరణ :- స్వప్న, జాగ్రత్, సుషుప్తి, అవస్థలే కాక జీవుడికి మూర్చావస్థ ఒకటి ఉన్నది. మూడు అవస్థల కన్నా దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది. కలలో, జాగ్రత్ అవస్థలలో విషయజ్ఞానం ఉంటుంది. మూర్చలో అలాంటి జ్ఞానం ఉండదు. మూర్చ మరణం కాదు. మూర్చస్థితి సగంసుషుప్తి సగంమరణ ధర్మంతో కూడి ఉంటుంది అని పరిశేషన్యాయం. అంటే జాగ్రద్, స్వప్నా, సుషుప్తి, మరణావస్థలలో దేనిలోనూ చేరకుండా ఉండే స్థితి. వేదాలలో ఎక్కడ ఐయిదవ స్థితి ప్రస్థావన లేదు. కాబట్టి మూర్చ అనేది దేనికి చెందదు. దేనిలోనూ అంతర్భూతం కాదు. ప్రత్యేక అవస్థ కాదు. మేలుకొని ఉన్నవాడిలాగా మూర్చ పోయిన వాడికి బాహ్య జ్ఞానం ఉండదు. అంతర జ్ఞానం ఉండదు. అతని శరీరం అదుపులో ఉండదు. తూలిపోతు ఉంటుంది. స్వప్నాలు చూడలేడు. మనోవ్యాపారాలు ఉండవు. మరణం కాదు. శరీరంలో వేడి, శ్వాసక్రియలు ఉంటాయి. గాఢ నిద్ర ఉండదు. అందుకే ఇది ఏ అవస్థాకాదు. పరిశేష న్యాయం చేత జాగ్రదావస్థ, స్వప్నావస్థ, కూడాకాదు. కావున ముగ్దుని యందు సగం సత్సంపత్తి ఉంటుంది. లోకంలో ఇతనికి మూర్చితుడని పేరు. సగం సుషుప్తి ఉన్నట్లుగా చెబుతారు. సుషుప్తిలో ఉన్నవానికి విశేష జ్ఞానం ఏది లేనట్లుగానే ముగ్దునికి కూడా విశేష జ్ఞానం ఉండదు. సుషుప్తి నుంచి లేచిన వానికి ఆ నిద్రించిన వాడను నేనే అని ప్రత్యభిజ్ఞ ఉన్నట్లు దీనికి కూడా ఉంటుంది. ముగ్ధుడు జాగ్రదావస్థ లో ఉన్నవాడు కావడానికి వీలు లేదు. ఇతడు ఇంద్రియాలతో విషయాలను చూడటం లేదు కదా! ముగ్ధుడు ఇషుకార న్యాయం (బాణాలు తయారుచేసేవాని పోలికలో) ఉంటాడు అని పూర్వ పక్షి వాదన. ఇషుకారుడు మేల్కొని ఉన్నా, బాణాల మీద ఏకాగ్ర చిత్తం కలవాడై ఇతర విషయాలను మీదకు మనస్సు పోకుండా ఉంటాడో, అట్లే ముగ్ధుడు రోకలి తలమీద పడటం చేత దుఃఖాన్ని అనుభవిస్తూ, మేల్కొని వున్నా కూడా ఇతర విషయాలను చూడడు. అది యుక్తం కాదు. బాణం చేయడంలో తన్మయుడైన మనస్సు కల ఇషుకారుడు ఇంతసేపు నా మనస్సు బాణం మీదనే ఉంది అని అంటాడు. తిరిగి స్పృహ లోకి వచ్చిన ముగ్ధుడు అయితే ఇంతసేపు నేను అంధ మనస్సుతో ఉన్నాను. నాకేమి జరిగిందో తెలియదు అంటాడు. అతని దేహము నేల మీద పడిపోతుంది.ముఖంలో వికాశం ఉండదు. కాళ్ళుచేతులు కొట్టుకుంటాయి. అతను స్వప్నాలు చూడడు. మరణించనూ మరణించడు. అతని ముక్కు దగ్గర శ్వాస ఉందా లేదా? శరీరంలో వేడి ఉందా లేదా అని పరీక్షస్తారు. అలా లేకపోతే అతను మరణించాడని దహన సంస్కారాలు నిర్వహిస్తారు. శ్వాస ఉంటే స్పృహ రావడం కోసం చికిత్స చేయిస్తారు. అదే ఇషుకారుడు అయితే ఒకే విషయం మీద ఏకాగ్ర చిత్తమైనప్పటికి అతని శరీరం నిలబడుతుంది. బాహ్య స్పృహ ఉంటుంది. అందువలన ఇద్దరికీ పోలిక ఉండదు. ఈమూర్చ అవస్థాత్రయంలో ఉండదు.
ఉభయ లింగాధికరణం ( 3, 2, 11 )
సూత్రం :- 329
" న స్థానతో పి పర స్వో భయ లింగం సర్వత్ర హి "
పరస్వ:- జీవులు ప్రకృతి కన్నా సూక్ష్మ మైన పరమాత్మకు, స్థానతః అపి :- స్వతహాగా కాని, స్థాన నిమిత్తం వలన గాని, న :- స్వప్నాది అవస్థలు ఉండవు. హి :- ఎందుకంటే, సర్వత్ర :- అన్ని శాస్త్రాల్లోను ఉభయలింగం :- జీవ, ప్రకృతుల లక్షణాల కంటే, ప్రత్యేకంగా దివ్య గుణాలతో ఆయన్ని అభివర్ణించారు.
భావం :- జీవులు, ప్రకృతి కన్నా సూక్ష్మ మైన పరమాత్మకు స్వతహాగా కానీ, స్థాన నిమిత్తం వలన గాని, స్వప్నాది అవస్థలు ఉండవు.
వివరణ:- గురువుగారూ! బ్రహ్మను గురించి వేదాలు రకరకాలుగా చెబుతున్నాయి. కొన్ని సార్లు బ్రహ్మ సాకారుడు అన్నాయి. కొన్నిసార్లు నిరాకారుడు అన్నాయి. మరి బ్రహ్మ సాకారుడా? నిరకారుడా? లేక సాకార, నిరాకార రూపాలలో ఉంటాడా? వివరించండి? అన్నాడు కృష్ణశర్మ. సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. వేదాలు బ్రహ్మ నిర్గుణమే అని చెబుతున్నాయి. ఉపాధి వలన బ్రహ్మకు ఉభయత్వం లేదు. పరబ్రహ్మ స్వరూపం సాకారము, నిరకారము అని రెండుగా ఎప్పుడు చెప్పలేదు. ఉన్నది ఒక్కటే. అదే నిర్గుణ పరబ్రహ్మ. ఉపాధి వలన కూడా రెండుగా కనబడ రాదు. నీళ్లను నిప్పుల మీద వేస్తే అవి వేడెక్కుతాయి. నీళ్ల స్వభావం వేడి కాదు. ఇలా వేడెక్కడం వలన నిప్పు స్వభావం లోను మార్పు ఉండదు. ఆత్మ స్వయంభువు. నాశ రహితమైనది. శాశ్వతమైనది. జీవుడికి స్వప్నాది అవస్థలు ఉన్నట్లు గానే పరమాత్మకు కూడా ఉన్నాయా? అనే విషయం చర్చించబడింది. ఈశ్వరుడు జీవులకన్నా దాని కార్యాలైన మహత్ తత్త్వాది పదార్ధాల కన్నా సూక్ష్మ మైన వాడు. ఆయన జీవ ప్రకృతులలో లోపల, బయట అనే తేడా లేకుండా అంతటా ఉంటాడు. సర్వంతర్యామి గా ఉంటూ శుభాశుభ కర్మలు చేసేటప్పుడు జీవులకు ప్రేరణ కలిగిస్తాడు. జీవుడు జగజ్ఙన్మాదులకు కారణం. జీవుడు అణు పరిమాణం కలవాడు. పరిచ్చినుడు. కనుక శరీరంలో ఉంటాడు. శరీరం బయట ఉండడు. అతనికి శరీర ఉపాధుల వలన స్వప్నాది అవస్థలు కలుగుతాయి. బ్రహ్మానికి ఈధర్మాలు వర్తించవు. అద్దంలో ముఖం ప్రతిబింబం కనిపిస్తుంది. అద్ధం బయట కనబడదు. కాగా అద్దంలో ఉండే మాలిన్యాలు ప్రతిబింబానికి కూడా సంక్రమిస్తాయి. ఈ ఉపాధి సంబంధం బ్రహ్మానికి లేదు. శ్రుతులను బట్టి బ్రహ్మ ఉభయలింగమని గ్రహించాలా? లేదా ఏదో ఒక లింగం కలదని గ్రహించాలా? ఏదో ఒక లింగం గ్రహించాలి అన్నప్పుడు, విశేషలింగం గ్రహించాలా? నిర్విశేషలింగం గ్రహించాలా? అని విచారణ చేయబడుచున్నది. ఉభయలింగాలను ప్రతిపాదించే శ్రుతులను బట్టి బ్రహ్మ ఉభయలింగమని గ్రహించాలని పూర్వ పక్షి వాదన. పరబ్రహ్మకు ఉభయ లింగత్వం కుదరదు. ఉపాధి సంబంధం ఉన్నా కూడా ఒకే విధంగా ఉన్న వస్తువు యొక్క స్వభావం మరొక విధమైనదిగా అయిపోదు కదా! ఉపాధులు అవిద్య చేత సమకూర్చబడినవి. ఏదో ఒక లింగాన్ని గ్రహించినా కూడా బ్రహ్మ విశేష రహితమని, నిర్వికల్పమని, మాత్రమే గ్రహించాలి. ఎందుకు విపరీతంగా గ్రహించకూడదు.
సూత్రం :- 330
" న భేదాదితి చేన్న ప్రత్యేక మత ద్వ చనాత్ "
భేదాత్:- స్థానం వలన, ఈశ్వరుడు భిన్నుడు కావడం వలన, న :- స్వప్నాది అవస్థలు ఆయనకు ఏర్పడవు. అని చెప్పడం సరి అయినదికాదు. ఇతిచేత్:- అని అనడం, వ:- తగదు. ప్రత్యేకం:- ప్రతిస్థానంలోను, అతత్ వచనాత్ :- అభిన్నంగా చెప్పారు.
భావం :- స్థాన సంబంధం వలన, బ్రహ్మాన్ని ప్రతి అవస్థ లోను, ప్రతి స్థానంలోనూ అభిన్నంగా చెప్పారు. అలా చెప్పడం సరి అయినది కాదు.
వివరణ:-ఆకాశం వ్యాపకం. అంతటా ఉంటుంది. అయినా ఘటంలో ఉండేది ఘటాకాశామని, మఠంలో ఉండేది మఠాకాశమని, వ్యవహారిస్తారు. స్థానభేద సంబంధంవలన భిన్నభిన్న నామరుపాలు కలుగుతాయికదా! మరి స్వప్నాది అవస్థలు బ్రహ్మానికి ఎందుకు ఉండవు అంటే స్థాన భేదాన్ని బట్టి బ్రహ్మం భిన్నంకాదు. బ్రహ్మం సర్వవ్యాపకం. అన్ని వేదాంత వాక్యాలలోనూ నిర్గుణ పరబ్రహ్మమే చెప్పబడలేదు. బ్రహ్మకు నాలుగు పాదాలున్నాయని వారి వాదన. మొదటి పాదం :- వాక్కు. రెండవ పాదం :- ప్రాణం. మూడవ పాదం :- నేత్రం. నాలుగవ పాదం :- శ్రోత్రం. బ్రహ్మకు షోఢశ కళా ప్రపూర్ణుడు అని పేరు ఉన్నది.
ఛాందోగ్యోపనిషత్తు:- నాలుగు దిక్కులు పరమేశ్వరుని మొదటి పాదం, భూమి, ఆకాశం, సముద్రాలు రెండవ పాదం, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, విద్యుల్లతలు మూడవ పాదం, ప్రాణం, సృష్టి, శ్రోత్రం నాలుగవ పాదం. ఉపకోశలుడికి అగ్నులు బ్రహ్మోపదేశం చేస్తూ, ఆకాశంలో సూర్యునిలో ఏతత్వమున్నదో అదే నీలోనూ ఉన్నది. దిక్కులు, నక్షత్రాలు, నీరు, నింగి అన్నింటిలో ఉన్న తత్వంఒక్కటే. అదే పరబ్రహ్మ అని చెప్పబడింది.
మాండుక్యోపనిషత్తు:- ఆత్మకు నాలుగు పాదాలున్నాయి. అదే జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయం అని శాస్త్రం చెప్పబడింది. అందువలన బ్రహ్మకు ఆకారం ఉన్నదని వారి వాదన. అది సరియైనది కాదు. అలా అనడానికి వీలులేదు. పరమేశ్వరుడికి ఆకారం లేదు. అన్ని వస్తువులయందు ఉన్నాడు. జీవులన్నీ తమతమ నామరుపాలు కోల్పోయి ఏపురుషుడిలో కలసిపోతాయో, అతడే ఆత్మ అదే నీవు అని ఛాందోగ్యం లో చెప్పబడింది.
బృహదారణ్యకోపనిషత్తు:- యాజ్ఞవల్కుడు చెబుతున్నాడు లోకంలో ఉన్నదంతా ఆత్మ. ఆత్మ అందరిలో ఉన్నది. ఆత్మ నుండే అన్ని పుట్టాయి. అందులోనే లయమవుతున్నాయి. ఆ పరమేశ్వరుడు సర్వంతర్యామి. చైతన్య మూర్తి అని చెబుతూ, వాయువులో వుండి వాయువును నియంత్రిస్తున్నాడు. వాయువు అతని శరీరం. కాని వాయువు అతన్ని ఎరుగదు. అతడే నీలో ఉన్న ఆత్మ. బ్రహ్మ నిర్వికల్పం, దీనికి స్వంతంగా గాని, స్థానం వలన గాని ఉభయ లింగత్వం లేదు అని చెప్పినది ఉపపన్నం కాదు. ఎందువలనంటే ప్రతి విద్యలోనూ బ్రహ్మ యొక్క వేర్వేరు ఆకారాలు ఉపదేశించ బడ్డాయి. అన్ని వేదాంత వాక్యాలలో బ్రహ్మ నిర్గుణ స్వరూపమే చెప్పారు అనడం తప్పు. ఉపాధుల వలన కలిగిన రూపాలను గురించి చెబుతూ బ్రహ్మకు నాలుగు పాదాలున్నాయని,షోడశ కళలున్నాయని, చెప్పబడింది. బ్రహ్మ అసలు స్వరూపాన్ని చెప్పే శ్రుతులు లేవు. ఈ భూమండలం మీద సూక్ష్మతి సూక్ష్మమైన రూపం, తేజోమయుడు, అమృత మయుడు అయిన బ్రహ్మమే జీవుడి శరీరంలోను ఉన్నాడు. అతడే ఆత్మ. ఆ ఇద్దరూ ఒకే ఆత్మ అని, శ్రుతి వాక్యానికి అర్ధం.
సూత్రం :- 331
" అపి ఛైవ మేకే "
అపిచ :- హేతుబలం తో స్వప్నాది అవస్థలు ఈశ్వరునికి ఉండవనీ, చెప్పడమే కాక, ఏవం ఏక :- కొందరు అధర్వవేదులు అలంకారికంగా వర్ణించినా ఆయనకు ఈ అవస్థాసంబంధాన్ని నిరకరించారు.
భావం :- కొందరు అధర్వ వేదులు ఈశ్వరునికి స్వప్నాది అవస్థలు ఉన్నాయని అలంకారికంగా వర్ణించినా ఆయనకు ఈ అవస్థ సంబంధాన్ని నిరకరించారు.
వివరణ:- బ్రహ్మకు భేదం కేవలం ఉపాసనకోసమే చెప్పారు. పరబ్రహ్మస్వరూపాన్ని మనసులోనే పొందాలి. దానిని తెలుసు కున్న తరువాత ఇంక భేదం ఉండదు. బ్రహ్మలో భేదాన్ని చూసేవాడు జననమరణ వలయంలో చిక్కుకు పోతాడు. అంతే కాదు. అనుభవించే వాడు, అనుభవించ బడేది ప్రేరేపించేవాడు ఈ మూడు భాగాలూ ఉన్నదే బ్రహ్మ. ఒక శాఖకు చెందిన వారు అభేద దర్శనాన్ని పఠిస్తున్నారు. భోక్త, భోగ్యం ఈ రెండింటిని ప్రేరేపించే వాడు ఈశ్వరుడు.
మాండుక్యోపనిషత్తు :- ఈశ్వరుడికి జీవుడి లాగా స్వప్నాది అవస్థలని అలంకారికంగా సంబంధం ఉన్నట్లు వర్ణించి, తరువాత స్వప్నావస్థకు సంబంధం ఉండదు. జాగ్రదావస్థ, మూర్చావస్థ కు సంబంధం ఉండదని అవస్థల సంబంధాన్ని నిరాకరించారు. అలంకారిక వర్ణన స్వభావాన్ని బోధించదు. కనుక ఈశ్వరుడికి స్థానం భేదం వలన స్వప్నాది అవస్థల సంబంధం ఉంటుందనడం పొసగడం లేదు.
సూత్రం :- 332
" అరూపవదేవ హి తత్ ప్రధాన త్వాత్ "
హి :- కారణం ఏమిటంటే, తత్ :- ఆ బ్రహ్మం, ప్రధానత్వాత్ :- ప్రధాన తత్వం, అరూప దేవ :- రూపం ఉన్నది కాదు.
భావం :- స్థాన భేదం వలన బ్రహ్మానికి స్వప్నాది అవస్థలతో సంబంధం ఉందనడానికి కారణం ఏమిటంటే ఆ బ్రహ్మం ప్రధాన తత్వం రూపం ఉన్నది కాదు.
వివరణ:- గురువుగారు! కొన్ని చోట్ల వేదంలో బ్రహ్మ సాకారుడని, కొన్నిచోట్ల నిరాకారుడని, చెప్పారుకదా! మరి అలాంటప్పుడు బ్రహ్మ నిరాకారుడని ఎలా చెబుతారు? అని అడిగాడు కృష్ణ శర్మ. దానికి సమాధానం చెబుతున్నాడు రత్నా కరుడు. రూపం, గుణం, అలంకారం లేనట్టి బ్రహ్మన్నే గ్రహించాలి. వేదంలో అలాంటి బ్రహ్మాన్నే చెప్పారు.
బృహదారణ్యకోపనిషత్తు:- యాజ్ఞవల్కుడు చెబుతున్నాడు, నీఆత్మయే బ్రహ్మ, నోటితోను, ముక్కుతోను పీల్చే విజ్ఞాన మయుడైన ఆత్మయే సర్వంతర్యామి. అపానక్రియ, వ్యానక్రియ, ఉదానక్రియ ఆచరించేవాడే సర్వంతర్యామి అయిన నీ ఆత్మయే. అట్టి ఆత్మ బ్రహ్మము స్థూలముకాదు. సూక్ష్మముకాదు. పొడవు కాదు, పొట్టి కాదు. శబ్ద, స్పర్శ, రూప, రసాదులు లేనటువంటిది. నాశరహితమైనటువంటిది.
ముండకోపనిషత్తు :- ఆ బ్రహ్మ కారణం లేనివాడు. ఆకారం లేని వాడు అని చెప్పబడింది.
శ్వేతాశ్వరోపనిషత్తు(3,19):- దేహంలోనూ, శబ్ద స్పర్శ గుణాలతోను పాణి పాదాది ఇంద్రియాలతో సంబంధం లేని నిరాకారి అని భావం. కనుక ఆయనకు ఏఅవస్థలు లేవు. ఈ సూత్రంలో ప్రధానం అంటే బ్రహ్మం. ఈశ్వరుడు. ప్రకృతి పురుషులకు స్వామి. ఆయనకు రూపం, ఆకారం, శరీరం ఉన్న పక్షాన ఈశ్వరుడు కానేరడు. శరీరం ఉంటే శుభాశుభ కర్మ ఫలాన్ని అనుభవించాల్సి వస్తుంది. భోగాయతనం శరీరం భోగాలకు నిలయం అన్నారు. సుఖ దుఃఖాలే కర్మ ఫలాలు. అలాంటి కర్మలను ఆచరించే వాడు జీవుడే. ఈశ్వరుడికి శరీర సంబంధం ఉండదు. కనుక కర్మ ఫలాలు అనుభవించడు. ఈశావాశ్యంలో ఆత్మ దూరంగా ఉంది. దగ్గరగా ఉంది. లోపల ఉంది. బయట ఉంది. సృష్టికి అంతీతమైనది.
తైత్తరీయోపనిషత్తు:- ఆకాశం బ్రహ్మ, వాయువు బ్రహ్మ, అగ్ని బ్రహ్మ, ఈ రకంగా పంచభూతాలు, తన్మాత్రలు బ్రహ్మమని చెప్పబడింది. ఈరకంగా బ్రహ్మ ఆకారంలేనివాడు. సర్వత్రా వ్యాపించి వున్నాడని చెప్పబడింది. బ్రహ్మ ఆకాశంలాగ నామ రూపాలాన్నింటిలో సూక్ష్మ రూపంలో ఉంటాడు. ఆకాశానికి శబ్దం ఉంది. పరమాత్మకు శబ్దం లేదు. ఇంద్రియాల ద్వారా, మనస్సు, బుద్ధి ద్వారా బ్రహ్మాన్ని గ్రహించలేము. జ్ఞాన నేత్రం ద్వారానే సర్వ వ్యాపకమైన పరమాత్మను దర్శించగలము.
సూత్రం :- 333
" ప్రకాశవ చ్చా వైయర్ధ్వాత్ "
చ :- అయితే, అవైయర్ధ్వాత్ :- రూపవంతుడిగా వర్ణించిన వాక్యాలు వ్యర్థం ఏమి కావు. ప్రకాశ వత్ :- ప్రకాశవంతుడని అర్ధం చేసుకోవాలి.
భావం :- ఈశ్వరుడికి రూపం లేదంటున్నారు. ఆయన్ని రూపవంతుడిగా వర్ణించిన వాక్యాలు ఉన్నాయి కదా! అంటే రూపవంతుడిగా వర్ణించిన వాక్యాలు వ్యర్థం ఏమి కావు. వాటి వలన ఆయన ప్రకాశవంతుడు అని అర్ధం చేసుకోవాలి.
వివరణ:-ఆకాశవతైన బ్రహ్మకు చెప్పే శ్రుతులకు గతి ఏమిటి? ఇందుకు సమాధానం చెబుతున్నారు. సూర్య చంద్రాది ప్రకాశం వలె సాకార బ్రహ్మ శ్రుతులకు వ్యర్థం లేదు అని సూత్రానికి అర్ధం. సూర్యరశ్మి వంకరగా రాదు. సరాసరి వస్తుంది. అలాంటి సూర్యరశ్మికి చెయ్యి అడ్డుపెట్టినట్లయితే, అది వంకరగా వస్తున్నట్లు కనిపిస్తుంది. ఆకాశాన్ని వ్యాపించిఉన్న సూర్య ప్రకాశాన్ని గాని, చంద్రప్రకాశాన్నిగాని, వేళ్ళు మొదలైన ఉపాధుల సంబంధం వలన ఋజుత్వం, వక్రత్వం మొదలైన ఆకారాలు పొందినప్పుడు, ఋజుత్వ వక్రత్వాదులను పొందుతున్నట్లు ఎలాఉంటుందో, అలాగే ఉపాధిభేదం వలన పరమాత్మ సాకారంగా దర్శనం ఇస్తాడు. ఇది కేవలం ఉపాసన కోసమే చెప్పబడింది. దీనిని బట్టి ఉపాసన కోసం బ్రహ్మకు ఆకార విశేషం ఉన్నట్లు చేసిన ఉపదేశం విరుద్ధం కాదు. ఆకారం గల బ్రహ్మకు చెప్పే వాక్యాలకు కూడా ఈ విధంగా సార్ధకత్వం లభిస్తుంది. వేదవాక్యాలు అన్నీ ప్రమాణములే అయి ఉన్నప్పుడు కొన్నింటికి ప్రయోజం ఉన్నదని, కొన్నింటికి లేదని చెప్పడం యుక్తం కాదా! బ్రహ్మకున్న ఉపాధి సంబంధాన్ని బట్టి కూడా దానికి ఉభయ లింగత్వం లేదని వెనుక చెప్పిన దానికి, ఇక్కడ చెప్పిన దానికి విరోధం కదా? అని సందేహం. విరోధం లేదనే చెప్పాలి. ఉపాధిని బట్టి ఏర్పడినది వస్తువు యొక్క ధర్మం కాజాలదు. ఎందువలననగా ఉపాదులు అవిద్య చేత ఏర్పరచబడినవి. సహజమైన ఈ అవిద్య ఉన్నప్పుడే లౌకిక వ్యవహారాలు, వైదిక వ్యవహారాలు జరుగుతాయి అని అక్కడక్కడ చెప్పివున్నాయి.
శ్వేతాశ్వరోపనిషత్తు( 3, 16 ):- పరమాత్మకు అనేక అవయవాలు ఉన్నట్లు చెప్పారు. మరి ఇవి నిజం కావా? అంటే పరమాత్మ సూర్యచంద్రాదుల వెలుగు లాగా జగత్తులో ఉండే పదార్ధాలన్నింటిలో వ్యాపించి ఉన్నాడని వీటి తాత్పర్యం. కాగా ప్రకాశం ప్రతి పదార్ధం లోపల బయట ఉండదా? కాని ఈశ్వరుడు అలా కాక ప్రతి వస్తువు లోపల, బయటా ఓత ప్రోతంలా ఉంటాడని వేద వాజ్మమయం ఘోషస్తున్నది. కనుక బ్రహ్మ రూపవంతం సశరీరం కాదు. బ్రహ్మం వ్యాపకత్వాన్ని తెలపడంతో ఈవాక్యాలు సార్ధకమౌతున్నాయి.
సూత్రం :- 334
" ఆహచ తన్మాత్రయే "
చ :- పైగా, తన్మాత్రయే :- పరబ్రహ్మం ప్రకాశ మాత్రమని, ఆహ :- శ్రుతులు అంటున్నాయి.
భావం :- బ్రహ్మ ప్రకాశవంతమని శ్రుతులు అంటున్నాయి.
వివరణ :- బ్రహ్మ యొక్క యదార్ధ స్వరూపం ఏమిటో ఈ సూత్రంలో తెలియజేస్తున్నారు. శ్రుతి వాక్యాలు అన్నీ బ్రహ్మ గురించి చెప్పాయి.
ఋగ్వేదం( 4, 5, 11, 5 ):- "ధ్రువం జ్యోతిర్నిహితం " బ్రహ్మ తేజోమయం అని, బ్రహ్మాన్ని ప్రకాశతుల్యం గా చెప్పారు. ఈ సామ్యం ఆయన తత్త్వం బోధ పడడానికే.
బృహదారణ్యకోపనిషత్తు:- యాజ్ఞవల్కుడు ఓమైత్రేయి! నీళ్ళల్లో వేస్తె ఉప్పు కరుగుతుంది. ఆఉప్పు నీరంతా వ్యాపించి ఉంటుంది. అదే విధంగా అద్భుతమైన శక్తి గల పరమాత్మ ఆనంతుడు, అవ్యయుడు, విజ్ఞాన ఘనుడు. అతను ఉపాధులతో కలసి అది నాశన మైనప్పుడు, తాను కూడా నాశనం అయినట్లు కనిపిస్తాడు. అంటే పరమాత్మ లోపలా, బయటా అంతటా వ్యాపించి ఉన్న రస స్వరూపం. బ్రహ్మ కేవలం చైతన్య స్వరూపమని శ్రుతి చెబుతోంది. ఉప్పుకణం లోపల, బయట లవణమే తప్ప మరేది వ్యాపించి ఉండదు. అట్లే, ఈ ఆత్మ లోపల, బయట అంతటా కూడా చైతన్య స్వరూపమే అని, విలక్షణమైన ఇతర రూపాలు ఏవిఉండవనీ, ఎట్టివిశేషాలు లేనిదని చెప్పుచున్నది. నిరంతర చైతన్యమే దీని స్వరూపం. పరమాత్మను తెలుసు కోవడానికి జ్ఞానం ఉండాలి. అది బుద్ధి వలననే సాధ్యం అవుతుంది. బుద్ధి ఒక్కోసారి తెలివిగా పనిచేస్తుంది. ఒక్కోసారి పని చేయదు. అందుకే అది సంపూర్ణమైన తెలివి కాదు. ప్రజ్ఞానం బ్రహ్మ, జ్ఞానమే బ్రహ్మ, అదే చైతన్యరసస్వరూపం. నిర్విశేషం, నిరాకారం, నిర్గుణం అయిన బ్రహ్మను తెలుసుకోవడానికి సద్గురువును ఆశ్రయించి ఆత్మ జ్ఞానాన్ని శిష్యుడు పొందగలగాలి.
సూత్రం :- 335
" దర్శయతి చాదో అపి స్మర్యతే "
చ :- అంతే కాక, అధ :- బ్రహ్మం ప్రకాశ వంతం అని, స్మర్యతే :- స్మృతులు, శాస్త్రాలు, అపి :- కూడా, దర్శయతి :- అంటున్నాయి.
భావం :- బ్రహ్మం ప్రకాశవంతమని ఉపనిషత్తులు, స్మృతులు వర్ణిస్తున్నాయి.
వివరణ :- వేదం బ్రహ్మకు అనేక రూపాలు లేవని, రూపం లేని బ్రహ్మ గురించే వర్ణించాయి. పరమాత్మ గురించి తెలుసునా? అని అడిగితే తెలియదు అంటాము. తెలియదా? అని అడిగితే తెలుసును అంటాము. సాధారణంగా బ్రహ్మ అందరికీ తెలుసును. కాని బ్రహ్మను గురించి విశేషంగా ఎవరికీ తెలియదు.అందుకే ఎవరికైతే తెలియదో వారికీ తెలుసును అని కేనొపనిషత్తు తెలియజేస్తోంది. ఈ విధంగానే వేదాలలోనూ, స్మృతులలోనూ చెప్పబడింది. దేవిభాగవతం, (సప్తమ స్కందం, 31వ అధ్యాయం):- దేవతలందరూ తారకాసురుని బాధలు పడలేక హిమాలయాల్లో తపస్సు చేశారు. వివిధ రకాల అర్చనలు, ఆరాధనలు, పూజలు, యాగాలు చేశారు. చైత్రశుద్ధనవమి రోజున దేవి దర్శనం అయింది. అప్పుడు వారి ఎదుట వేదసమ్మతమైన పరంజ్యోతి ప్రత్యక్షమైనది. కోట్లకొలది సూర్య కాంతులతో ప్రకాశిస్తున్నది. ఆరూపం కొన్ని చోట్ల మెరుపు మెరిసినట్లు ఉన్నది. స్త్రీ, పురుష, నపుంసక భేదాలు లేవు. ఆకాంతిని చూడలేక దేవతలు కనులు మూసుకున్నారు. అప్పుడే ఆ దివ్య తేజస్సు ఒక స్త్రీ రూపం దాల్చింది. ఆమెయే పరమేశ్వరి. పరమేశ్వరుని అసలు రూపం నిరాకారమే. కాని ఉపాసన కోసం రూపం దాల్చబడింది. కొన్ని చోట్ల వివరించడానికి వీలు లేక, వ్యతిరేక నిషేధ భావాలతో చెప్పబడింది. ఇతర వస్తువులను నిషేధించి తద్వారా మాత్రమే ఆత్మ స్వరూపం ఉపదేశించబడుతోంది.
బృహదారణ్యకోపనిషత్తు:- నామరూపాలతో ఉన్న ఈ ప్రపంచంలో అన్నింటిని నిషేధించడం ద్వారా నిర్గుణమైన, నిరాకారమైన బ్రహ్మాన్ని తెలుసుకోవచ్చును. అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ అజ్ఞానంతో ఉన్నవారికి నామ రూపాలతో కనిపిస్తాడు. కనిపించే ప్రపంచాన్ని తొలగిస్తే కనబడేది బ్రహ్మమే. గుణములు ఉంటే వర్ణించవచ్చును. కాని నిర్గుణుడైన పరమాత్మను జ్ఞానసాధనతో అజ్ఞానమాయమైన ప్రపంచాన్ని తొలగిస్తే కాని బ్రహ్మన్ని చూడలేరు.
కేనోపనిషత్తు:- తెలియనిదాని కన్నా అధికమైనది, తెలిసినదానికన్నా వేరైనది బ్రహ్మ. తెలియడం, తెలియకపోవడం బుద్ధికి సంబంధించినది. ఈదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు చూస్తుంటారు. వాటి వలన కలిగే అనుభవాలు, వాటి గురించిన సమాచారం స్మృతిలో ఉంటుంది. మరొక ఖండంలో ఉన్న ప్రాంతం గురించి అడిగితే తెలియదు అంటారు. ఆ తెలియనిది ఏదో అదే బ్రహ్మ. బుద్ధిలోఉన్న సమాచారాన్ని బట్టి పరమాత్మను తెలుసుకోలేము. బుద్ధికి అతీతమైన వాడు పరమాత్మ. బుద్ధి ద్వారా ఉపనిషత్తులు, పురాణాలూ అన్నీ చదివి పరమాత్మ గురించి తెలుసుకుంటారు. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్నీ ప్రాపంచిక వ్యవహారాలతో తాదాత్మ్యం చెందడం వలన పరమాత్మను అపవిత్రం చేస్తున్నారు. ఇంద్రియాలు,మనస్సు, వాక్కు అన్నీ బ్రహ్మ దగ్గరగా వెళ్లి, తిరిగి వెనక్కు వచ్చేస్తాయి. బ్రహ్మాన్ని మనస్సు భావించడం లేదు. వాక్కు స్మరించడం లేదు. అందుకోలేనిది ఏదో అదే బ్రహ్మం. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అన్నీ వాటి వృత్తులు అంతమైనప్పుడు మాత్రమే బ్రహ్మలో ఐక్యత ఏర్పడుతుంది. ఏది తెలుసుకుంటే అమృతత్వం పొందుతారో, మోక్షం వస్తుందో అదే బ్రహ్మ. అదే అనాది, అగోచరం, అద్వితీయం, నిరాకారం, సూక్ష్మాతి సూక్ష్మ మైన, నిర్గుణమైన ఆనంద స్వరూపం. ఆ నిరాకార రూపం బుద్ధికి గోచరం కానందున అది సత్ అని చెప్పబడింది. గురువు జ్ఞానబోధ ద్వారా ఆత్మజ్ఞానం పొంది, పరమాత్మను తెలుసు కోవాలి. ఒకప్పుడు నారాయణుడు నారాదునితో, నారదా! సమస్త భూతములు గంధాది గుణాలతో కూడిన వానినిగా నన్ను చూస్తున్నారు కదా! ఇదంతా నా చేత సృజంపబడిన మాయ మాత్రమే. నన్ను నీవు ఈ విధంగా ద్వైత ప్రపంచం తో కూడిన వానినిగా తెలుసుకొనడానికి తగవు అని అన్నట్లుగా శృతిలో చెప్పబడింది. ఈమాయను ఆత్మజ్ఞానం వలన ఛేదించినప్పుడు మాత్రమే బ్రహ్మ తత్త్వాన్ని తెలుసుకోగలరు.
సూత్రం :- 336
" అత ఏవ చోపమా సూర్యకాదివత్ "
అత ఏవ చ :- అందువలనే ( బ్రహ్మం ప్రకాశ స్వరూపం కావటం వలెనే, సూర్య కాదివత్ :- సూర్యుడు, అగ్నితో, ఉపమా :- బ్రహ్మాన్ని వేద వాజ్మమయంతో పోల్చారు.
భావం :- బ్రహ్మ ప్రకాశ స్వరూపం కావటం సూర్యున్ని అగ్నితో, బ్రహ్మాన్ని వేద వాజ్మమయం తో పోల్చారు.
వివరణ:- ఆత్మ చైతన్యరూపమైనది. నిర్విశేషం, వాక్కు మనస్సులకు అతీతమైనది. ఇతర వస్తువులను నిషేధించడం ద్వారా చెప్పదగినది. ఇదికాదు, ఇదికాదు అని అంటూ చెప్పదగినదే కాని ఇది ఇలా ఉంటుంది అని చెప్పడానికి వీలుకాదు. అందుచేతనే దీనికిఉన్న విశేషాలన్నీ కేవలం ఉపాధిసంబంధంచేతనే ఏర్పడినవని, పారమార్థికములు కావని అంగీకరించారు.
కఠోపనిషత్తు(4,13) :- ఆదిత్యవర్ణుడు, జ్యోతి, అగ్ని లాగా పోల్చారు. ఇది ఆయన ప్రకాశ, జ్ఞాన స్వరూపుడని తెలుపుతుంది. ఈఉపమ వలన బ్రహ్మం ప్రకాశ స్వరూపుడని స్పష్టమౌతోంది. బ్రహ్మాన్ని సూర్యాదులతో పోల్చారు కదా! సూర్యుడు ఒకే చోట ఉండి లోకంలో ఉన్న వస్తువులకు వెలుగునిస్తాడు. బ్రహ్మం అంతేనా? ఈ సూత్రంలో బ్రహ్మాన్ని సూర్యుని ప్రతిబింబం ఉపమానంగా చెప్పారు. తేజోమాయుడైన సూర్యుడు ఒక్కడే అయిన కూడా వేరు వేరు కుండలలో ప్రకాశస్తుంటాడు. జన్మ రహితమైన పరమాత్మ ఉపాధి భేదాలను బట్టి అనేక విధాలుగా, సమస్త జీవులలో కనిపిస్తాడు. పరమాత్మ సర్వంతర్యామి అన్నారు కదా! మరి ఇన్ని దేహలుగా ఎలా కనిపిస్తున్నాడు అని సందేహం. పరమాత్మ అంతటా వ్యాపించి ఉండే సర్వంతర్యామి. కనుక అన్ని జీవరాసులలో, ప్రకృతిలో ఉండే ప్రతి అణువు లో కనిపిస్తాడు. స్వచ్ఛమైన నీటిలో సూర్యుడు ప్రతిబింబిస్తే స్వచ్ఛంగానే కనిపిస్తాడు. బురద నీటిలోనూ, కదులుతున్న నీటిలోనూ సూర్యబింబం స్వచ్చంగా కనిపించదు. సూర్యుడు ఒక్కడే. కుండలు, నీరు అనే ఉపాధులను బట్టి సూర్యబింబం కదులుతూ ఉంటుంది. ఈ సూర్యుడు తానోక్కడే అయినా వేరు వేరుగా ఉన్న ఉదకాలను అనుకరిస్తూ అనేకంగా చేయబడతాడో, అట్లే నిత్యుడైన ఈ ఆత్మ కూడా శరీరాలలో ఉపాధి అయిన మాయ చేత వేరువేరు రూపాలు కలవాడుగా కనబడతాడు. కాని ఏ ఆకారము లేని నిరాకారుడు, నిర్గుణ స్వరూపుడు అయిన పరమాత్మ ఉపాధులను బట్టి వేరు వేరు రూపాలలో కనిపిస్తున్నాడు. పరమాత్మ అందరిలో ఉంటే అందరు ఒకేలా ఉండాలి కదా! అని మరొక సందేహం. దీపాలలో ఉన్న నూనె వత్తులు ఒకేలా ఉన్నప్పటికీ, చిన్న ప్రమీదలో కాంతి తక్కువగా ఉంటుంది. పెద్ద దీపంలో కాంతి ఎక్కువగా ఉంటుంది. భగవంతుడు అందరిలో ఉన్నప్పటికీ ఉపాధుల వలన భేదాలు కనిపిస్తున్నాయి.
సూత్రం :- 337
" అంబువ దగ్రహణాత్తు న తధాత్వం "
అంబువత్ :- నీటిలో లాగా, అగ్రహానాత్ :- బ్రహ్మం ప్రతిబింబం కనిపించదు. కనుక న తధాత్వం :- సూర్యాదుల లాగా బ్రహ్మం పరిచ్చిన్నం, ఏక దేశం కాదు.
భావం :- సూర్యాదుల వలె బ్రహ్మం ఏక దేశం కాదు. నీటిలోసూర్యుని ప్రతి బింబం కనిపించినట్లు పరమాత్మ ప్రతిబింబం కనబడదు.
వివరణ:- బ్రహ్మ విషయంలో ఉదకం లాంటి పదార్ధం ఏది లేనందున, బ్రహ్మానికి సూర్యుని ఉపమానంగా చెప్పడం సరిపోదు. ఏసూత్రంలో ప్రతిపక్షి ఎదురు ప్రశ్న వేస్తున్నాడు. జలం వలె దూరంగా గ్రహించక పోవడం వలన జల సూర్యక సాదృశ్యం కుదరదు. ఆకారం గల సూర్యాదుల కంటే వేరుగా దూర ప్రదేశంలో ఉన్న జలం గ్రహింపబడుచున్నది. కనుక అక్కడ సూర్య బింబం కనబడటం యుక్తమే. ఆత్మ మూర్తము కాదు. దీని కన్నా వేరుగా దూరంగా ఏమి లేవు. అందువలన దృష్టాంతం యుక్తంగా లేదు. గురువర్యా! ప్రతిబింబం పడాలంటే ముందు బింబం ఉండాలి. దానికి ఒక రూపం ఉండాలి. అది ఉపాధికి దూరంగా ఉండాలి. సూర్యుని గురించి చెప్పినప్పుడు, దూరంగా నీరున్నది. అందుకనే బింబం ఫలిస్తోంది. కాని ఆత్మ అనేది రూపం గల పదార్ధం కాదు. అది అన్నింటి యందు వ్యాపించి ఉంది. దాని కన్నా వేరైనది లేదు, కాబట్టి మీరు చెప్పిన ఉదాహరణ సరిపోదు అన్నాడు నారాయణ భట్టు. దానికి సమాధానం తరువాత సూత్రంలో రత్నాకరుడు చెబుతున్నాడు.
సూత్రం :- 338
" వృద్ధి హాస భాక్త్వా మంతర్భావా దుభయ సామాంజస్య దేవమ్ "
అంతర్భావాత్ :- బ్రహ్మం అన్ని భూతాల్లో వర్తిస్తున్నందు వలన, వృద్ధి హాస్ర భాక్త్యాం :- వృద్ధి క్షయాలు అంటూ అనడం సరి అయినది కాదు. ఎందుకంటే ఉభయ సమంజస్యాత్ ఏవం :- పదార్ధాల గుణ దోషాలు ఆ పదార్ధం తో సంబంధం ఉన్న వాటికే ప్రాప్తిస్తాయి.
భావం :- బ్రహ్మం అన్ని భూతాల్లో వర్తించడం వలన వృద్ధి క్షయాలు ఉన్నాయనడం సరి కాదు. పదార్ధాల గుణ దోషాలు ఆ పదార్ధం తో సంబంధం ఉన్న వాటికే ప్రాప్తిస్తాయి.
వివరణ:- సర్వవ్యాపకమైన బ్రహ్మం వేటిలో అంతర్యామిగా ఉన్నాడో, ఆ వస్తువుల్లో వృద్ధి క్షయాలు కలుగుతుంటాయి కదా! వాటితో బాటు అంతర్యామి అయిన బ్రహ్మానికి కూడా వృద్ధి క్షయాలు కలగాలి కదా! వృద్ధి క్షయాలు వికారాలు, బ్రహ్మం నిర్వికారి అంటున్నారు. ఇదెలా సాధ్యం అని సందేహం. ఒక వస్తువులో మరొక వస్తువు ఉన్నంత మాత్రాన దాని గుణ దోషాలు ఇది పుణికి పుచ్చుకోదు. సంపర్కం ఉన్న పదార్ధానికే గుణదోషాలు అంటుకుంటాయి. సంపర్కం వలెనే గుణదోషాలు సంక్రమిస్తాయి. ఆకాశం అన్ని పదార్ధాలలో ఉన్నప్పటికీ, ఆయా పదార్ధాలకు కలిగే వృద్ధి క్షయాలు ఆకాశానికి కలగవు. ఆకాశానికి సంగం ఆసక్తి లేనందున పదార్ధాలు పెరిగినా తరిగినా ఆకాశంలో ఏమి మార్పు ఉండదు. అలాగే బ్రహ్మం సర్వ వ్యాపకం కావడం వలన అన్ని వస్తువుల లోపలా బయటా ఒకటిగానే ఉంటుంది. వస్తు వికారాలు బ్రహ్మానికి అంటవు. కనుక బ్రహ్మ అవిచ్చిన్నం, నిర్వకారం. సూర్యుడు జలంలో ప్రతిబింబిస్తున్నాడు. కాబట్టి వృద్ధి క్షయము పొందుతున్నాడు. అదే విధంగా పరబ్రహ్మ ఉపాధిని పొందడం వలెనే వృద్ధి క్షయాలు పొందుతాడు. కుండ, మూకుడు, బాన మొదలైన వాటిలో పోసిన నీటివలన సూర్యబింబం చిన్నదిగానో, పెద్దదిగానో కనిపిస్తుంది. ప్రతిబింబంలో మార్పు ఉంటుంది కాని సూర్య బింబంలో ఏమార్పు ఉండదు. అలాగే బ్రహ్మ కూడా ఉపాధిభేదంతో పెరగడం, తగ్గడం, చలించడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. జలసూర్యకాదిదృస్థాంతం యొక్క ప్రయోజనం మాత్రమే శాస్త్రంలో చెప్పబడింది. ఇక్కడ చెప్పదలచిన సాదృశ్యం జలం పెరిగితే సూర్యబింబం పెరుగుతుంది. జలం తగ్గితే బింబం తగ్గుతుంది. జలం కదిలితే కదులుతుంది. జలం వేరుగా ఉంటే బింబం వేరుగా ఉంటుంది. ఏ విధంగా జల ధర్మాన్ని అనుసరించి సూర్య బింబం ఉంటుంది కాని సూర్యునికి వాస్తవం లో అదేమీ లేదు. మనస్సు, అంతః కరణం లో పరమాత్మ వేరు వేరుగా కనబడటానికి ఉపాదులే కారణం. అర్ధం కాని విషయాన్ని అర్ధం చేసుకోవడానికి, ఏదో ఒక విషయాన్ని పోల్చి చెప్పడానికే ఉపమానం చెబుతారు. అది అన్ని విషయాలలో విశ్లేషణ చెయ్యకూడదు. దేని గురించి చెప్పారో దానినే స్వీకరించాలి. అమ్మాయి ముఖం చంద్రబింబం లా ఉంది అంటే ముఖం చాలా ప్రకాశవంతంగా, ప్రసన్నంగా ఉందని అర్ధం. చంద్రబింబంలో కళ్ళు, ముక్కు నోరు లేవు కదా!ఎలా పోల్చారు అని అనుకో కూడదు. వృద్ధి క్షయాలు పరమాత్మకు ఉండవు. జీవులలో ఉండే ఉపాధి భేదాల వలన పరమాత్మ లో ఉపాధి ధర్మాలైన వృద్ధి క్షయాలు ఉన్నట్లుగా కనిపిస్తుంది.
సూత్రం :- 339
" దర్శనాచ్ఛ "
చ :- పైగా, దర్శనాత్ :- ఉపనిషద్వాక్యాలు కూడా బ్రహ్మనికి ఏ వికారాలు, దోషాలు, దుఃఖాలు, వృద్ధి క్షయాలు ఉండవని చెబుతున్నాయి.
భావం :- బ్రహ్మానికి ఏ వికారాలు, దోషాలు, వృద్ధి క్షయాలు దుఃఖాలు ఉండవని చెబుతున్నాయి.
వివరణ:- సూర్యుడు జలంలో కనిపించినట్లుగా ఆత్మ ఈ దేహము మొదలైన వాటిలో కనిపించడం లేదు కదా! అని కృష్ణ శర్మ సందేహం. దానికి సమాధానం చెబుతున్నాడు రత్నా కరుడు. ప్రతిబింబ రూపంలో పరమాత్మ దేహంలో ప్రవేశిస్తాడని వేదంలో చెప్పబడింది. పరమేశ్వరుడు రకరకాల ఆకారాలతో 84 లక్షల జీవరాశులను సృష్టించాడు. ఇంద్రియాలు గల మానవులను సృష్టించి, బ్రహ్మ రంద్రం ద్వారా వారిలో ప్రవేశ్నించాడు అని ఐతరేయో పనిషత్తులో చెప్పబడింది. ఉపాసన కోసమే బ్రహ్మకు సాకారం చెప్పబడింది కాని, బ్రహ్మకు నిజంగా వృద్ధి క్షయాలు లేవు.
కఠోపనిషత్తు( 5, 11):- సూర్యుడు లోకాలకు నేత్రం అయినా నేత్ర దోషాలు ఆయనకు అంటవు. అలాగే బ్రహ్మం కూడా అన్ని భూతాలకు అంతరాత్మ అయినా, ప్రాణాల దుఃఖాలు ఆయనకు అంటవు. ఆయన దుఃఖాలకు బాహ్యుడు.
బృహదారణ్యకోపనిషత్తు( 4, 4, 22 ):- సర్వాన్ని వశంలో ఉంచుకొని, సర్వానికి ఈశుడై సర్వాధిపతి అయిన పరమేశ్వరునికి ప్రాణుల కర్మ దోషాలు అంటవు. ఈవాక్యాల వలన బ్రహ్మం ఎలాంటి వికారాలకు లోనుకాడని తెలుస్తోంది. పరబ్రహ్మయే దేహాద్యుపాధులలో ప్రవేశించినట్లు చూపుచున్నది. బ్రహ్మ ఒక నిర్వికల్ప లింగము కలదే గాని ఉభయలింగం లేదా విపరీత లింగం అనగా సవిశేష లింగం కాదు. కొందరు ఇక్కడ రెండు అధికరణాలు కల్పిస్తున్నారు. మొదటి దానిలో బ్రహ్మ సమస్త మైన ప్రపంచము అస్తమించగా, ఏకాకారంగా ఉన్నదా! లేక ప్రపంచంతో కూడినదై అనేక ఆకారములతో ఉన్నదా! అన్నది విచారణ చేయబడుతుంది. ఇంద్రియాలు రాక ముందే పరమాత్మ పక్షి వలె అంటే సూక్ష్మ శరీరం ధరించి అన్నీ దేహలలో ప్రవేశిస్తున్నాడు. కనుక వృద్ధిక్షయాలు ఉండవు. వృద్ధిక్షయాలు ఉన్నట్లుగా కనిపిస్తాడు కాని అవి ఉండవు. దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ప్రాణాలు ఏమి లేనివాడు, కోపం, దుఃఖం, శమము లేనివాడు పరమాత్మ. ఆకారం గల బ్రహ్మను, నిరాకారమైన బ్రహ్మను ప్రత్తిపాదిస్తే శ్రుతులు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. అనాకారమైన బ్రహ్మను అంగీకరించినప్పుడు ఇతర శృతులకు గతి చూపించడం కోసం "ప్రకాశవచ్చ " అనే సూత్రం చెబితే సార్ధకత లభిస్తుంది. అంటే ఈశ్వరుడు ప్రకాశవంతుడని అర్ధం చేసుకోవాలి. పరమాత్మ సూర్య చంద్రుల వెలుగు లాగా, జగత్తులో ఉండే పదార్ధాలన్నింటిలోనూ ప్రకాశవంతంగా వ్యాపించిఉన్నాడని తెలుసుకోవాలి.
ప్రకృతైతా పత్త్యాధికరణం ( 3, 2, 22 )
సూత్రం :- 340
" ప్రకృతై తావత్వం హి ప్రతిషేధతి తతో బ్రవీతి చ భూయాం "
ప్రకృతై తావత్త్యoహి :- ప్రాసంగికంగా చెప్పిన, ప్రతిషేధతి :- నిషేదిస్తుంది, తతః :- తరువాతి వాక్యం లో, భూయాః బ్రవీతి :- మళ్ళీ మూర్త అమూర్తముల కన్నా వేరేగా బ్రహ్మాన్ని ప్రతిపా దిస్తుంది.
భావం :- నేతి నేతి అనే ఉపనిషద్వాక్యం ప్రాసంగికంగా చెప్పిన, మూర్త, అమూర్త లక్షణాలలో ఉన్న రూపాన్నే అంటే బ్రహ్మం తాదాత్మ్యకతను మాత్రమే నిషేదిస్తుంది. కాని బ్రహ్మ ఉనికిని నిషేదించదు. మళ్ళీ మూర్త, అమూర్తలకన్నా వేరేగా బ్రహ్మాన్ని ప్రతిపాదించింది.
వివరణ:- గురువు గారు! బృహదారణ్యకోపనిషత్తులో మూర్త, అమూర్త బ్రాహ్మణం అనే ప్రకరణం ఉన్నది. దానిలో పృధివి, జలం, అగ్ని ఈ మూడు మూర్తములు స్థూలములనీ, ఆకాశం, వాయువు అమూర్తములు సూక్ష్మములని వివరిస్తూ, పండితులు బ్రహ్మదర్శనం కోసం నేతి నేతి ఇది కాదు, ఇది కాదు అంటూ శోధన చేసినట్లు చెప్పబడింది. ఇక్కడ నేతి శబ్దం రెండు సార్లు చెప్పబడింది. ఒకటి మూర్తమూర్తాన్ని, రెండవది బ్రహ్మను నిషేదించడానికి చెప్పారు. అందుచేత శ్రుతి వాక్యం బ్రహ్మను నిషేదిస్తుంది కదా! అని అడిగాడు కృష్ణ శర్మ. దానికి సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. ఒక నేతి మూర్తాన్ని , రెండవ నేతి అమూర్తాన్ని నిషేదిస్తుంది. కాని బ్రహ్మను నిషేదించదు. ఈరకంగా అన్నింటిని నిషేదించగా మిగిలేది బ్రహ్మం. అదే సత్యం, నిత్యం, శాశ్వతమైనది.
బృహదారణ్యకోపనిషత్తు ( 2, 3, 1 ):- బ్రహ్మానికి మూర్త, అమూర్తం అని రెండు రూపాలున్నాయి. "అధాత ఆ దేశో నేతి నేతి " ఈ వాక్యంలో లేదు అని ఎవరిని అంటున్నారు? బ్రహ్మమే లేదనా? బ్రహ్మనికి మూర్తమూర్త రూపములు లేవనా? ఈ రెండు రూపములు బ్రహ్మనికే వర్తిస్తాయి కాని బ్రహ్మం ఉనికికి కాదు. బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి ఉపాయంగా లింగ శరీరంతో అంతమయ్యే సూక్ష్మ ప్రకృతిని ఆధ్యాత్మికంగాను, మహాత్ తత్త్వంతో అంతమయ్యే పృద్ధివ్యాది సమస్తజగత్తును అధి దైవంగాను, మూర్త, అమూర్త భేదాల్లో రెండుగా విభజించి దాన్ని బ్రహ్మనికి రూపంగా వివరించారు. ఇంద్రియ గోచరం అయిన ఈ ప్రపంచం తన జన్మ స్థితి లయాలకు కారణంగా బ్రహ్మాన్ని తెలుపుతుంది. అందువలన ప్రపంచాన్ని బ్రహ్మ రూపంగా వర్ణించి చెప్పారు. ప్రపంచం బ్రహ్మ రూపం కనుక నేతి వాక్యం ప్రపంచాన్ని నిషేదిస్తుంది కాని బ్రహ్మం యొక్క ఉనికిని కాదు.
తైత్తరీయో పనిషత్తు ( 2, 6 ) :- బ్రహ్మం లేదనే వాడు తానే లేదనేవాడు అవుతాడు.
కఠోపనిషత్తు ( 6, 13 ) :- బ్రహ్మం ఉందని భావిస్తు బ్రహ్మాన్ని పొందాలి.
బృహదారణ్య కోపనిషత్తు ( 2, 3, 6 ) :- ఇంతకంటే మించినది మరొకటి లేదని అనుకోకూడదు. అది సత్యానికి సత్యం. దాని పేరే సత్యం. అంటే ఏమిటి? మూర్తమూర్త రూపములకు మించిన తత్త్వం మరొకటి ఉన్నది. అదే బ్రహ్మం. ఆయన సత్యం అని బ్రహ్మ ఉనికిని స్పష్టంగా చెబుతోంది. ఒక వస్తువు కనబడింది. దానిని నిషేదిస్తున్నాం. అప్పుడు ఆ వస్తువు లేదని అర్ధమైంది. అయితే అక్కడ ఏదో ఒక వస్తువు కనబడింది కదా! కనబడని దానిని లేదంటున్నాం. కనుక అక్కడ ఉన్నది ఒకటి, కనబడినది మరొకటి అని చెప్పి తీరాలి. ఉదా :- కనబడిన సర్పాన్ని నిషేధించినప్పుడు అది దేని మీద కనబడిందో ఆ తాడు ఉన్నట్లుగా అంగీకరించాలి. ఆ తాడును అంగీకరించకపోతే, ఏదైతే కనబడిందో ఆ సర్పమే నిజమైనట్లు చెప్పవలసిన వస్తుంది. దానిని నిషేధించడం కుదరదు. అదే విధంగా ప్రపంచాన్ని నిషేధించినప్పుడు దానికి ఆధారమైన బ్రహ్మమే అని చెప్పాలి. అది ప్రపంచంగా కనబడింది అని చెప్పకపోతే ప్రపంచాన్ని నిషేధించడం కుదరదు. బ్రహ్మను నిషేధించడం కుదరదు. బ్రహ్మను గురించి చెబుతూ, చివరకు బ్రహ్మే లేదు అని చెప్పడం అసంగతం కదా! ఆ విధంగా నిషేధించడం బ్రహ్మ లేదు అనేవాడు లేనివాడవుతాడు. తనని తాను నిరాకరించుకున్నవాడు అవుతాడు. బ్రహ్మ ఉన్నది అని మాత్రమే అంగీకరించాలి.
సూత్రం :- 341
" త ద వ్యక్తి మాహ హి "
తత్ :- ఆ బ్రహ్మం, అవ్యక్తం :- ఇంద్రియాలకు గోచరం కాదు. అని హి :- నిశ్చయిస్తూ, ఆహ :- ఉపనిషత్ చెబుతోంది.
భావం :- ఆ బ్రహ్మం ఇంద్రియాలకు గోచరం కాని అవ్యక్త రూపమని ఉపనిషత్తు చెబుతోంది.
వివరణ:- బ్రహ్మ అత్యంతసూక్ష్మం, వాక్కు, మనస్సు, ఇంద్రియాలకు వ్యక్తం కాడు. వ్యక్తము, అవ్యక్తము కానటువంటిది, కనులతో దానిని చూడలేనిది, చెవులతో వినలేనిది. మాటలలో చెప్పలేనిదే బ్రహ్మమని చెప్పారు.
కఠోపనిషత్తు(6, 12 ):- వాక్కు, నేత్రాలు మనస్సు లాంటి వాటికి బ్రహ్మాన్ని గ్రహించడం శక్యం కాదు.
ముండ కోపనిషత్తు( 3, 1, 8):- బ్రహ్మం కన్నా వాక్కు లాంటి ఇంద్రియాలకు, తపస్సుకు, కర్మకు అందడు. అయితే బ్రహ్మం అవ్యక్తం అంటున్నారు కదా!
యజర్వేదం(31, 18):-ఆయన్ని సాక్షాత్కారం చేసుకుంటేనే మృత్యువును తరిస్తాం అని ఉంది కదా! ఇంద్రియాలకు తెలియని బ్రహ్మాన్ని ఎలా సాక్షాత్కరించు కోవాలి? నేతినేతి అని అన్నింటిని నిషేధించినా, ఆఆత్మ గ్రహించడానికి వీలుకాదు. ఆత్మ తెలియరానిది. ఇంద్రియాలకు గోచరంకానిది అని గీతలో చెప్పబడింది. నిషేధించబడిన ప్రపంచసముదాయంకంటే భిన్నమైన ఏపరబ్రహ్మ ఉన్నదో, అది నిజంగాఉంటే ఎందుకు గ్రహింపబడలేదు? ఇంద్రియాలచేత గ్రహింపయోగ్యం కాదు. అది సమస్తమైన దృశ్య వస్తువులకు సాక్షి కదా! ఈ విధంగా అదృశ్యం, అగ్రాహ్యం అయిన బ్రహ్మ, నేత్రం చేత గ్రహింపబడదు. ఇతర దేవతల చేత గ్రహింపబడదు. వాక్కు చేత గ్రహింపబడదు.వాక్కు, మనస్సు, ఇంద్రియాలకు వ్యక్తం కానంత మాత్రాన, బ్రహ్మం లేడని అభిప్రాయం సరియైనది కాదు.
సూత్రం :- 342
" అపిచ సంరాధనే ప్రత్యక్షానుమానాభ్యామ్ "
అపిచ :- ఈ రకంగా అవ్యక్తంగా ఉండే బ్రహ్మం కూడా, సంరాధనే :- శ్రవణ, మననాది సాధన సంపత్తి మూలంగా, ఆరాధన ద్వారా ప్రత్యక్షం కాగలడు. ప్రత్యక్ష అనుమానాభ్యామ్ :- ఉపనిషత్తుల వలన స్మృతుల వలన తెలుస్తోంది.
భావం :- అవ్యక్తంగా ఉన్నా బ్రహ్మాన్ని శ్రవణ, మనన సాధనా సంపత్తి మూలంగా, ఆరాధనా ద్వారా పరమాత్మ ప్రత్యక్షం కాగలడని ఉపనిషత్తులు, స్మృతుల వలన తెలుస్తోంది.
వివరణ:-ముముక్షువులైన యోగులు శ్రవణ, మనన, భక్త్యారాధనాది సాధన సంపత్తిలో ఎంతోకాలం ప్రయత్నించి, నిర్వికల్ప సమాధిలో స్వయంగా బ్రహ్మసాక్షాత్కారం చేసుకుంటారు. భగవంతుని కృపకు పాత్రులైనవారికి లభించనిది ఏది ఉండదు.
కఠోపనిషత్తు(2, 23):-పరమాత్మని వరించేవాడే ఆయన్ని పొందుతాడు. అతనికే ఈశ్వరుడు తనస్వరూపాన్ని అవగతం చేస్తాడు.
మనుస్మృతి(6, 65):- యోగంద్వారా పరమాత్ముడి సూక్ష్మత తెలుస్తోంది. ముముక్షువులకు బ్రహ్మసాక్షాత్కారం కావాలంటే సంరాధన సరిపోతుందా? ఇంకాఏమైనా కావాలా? యోగులు మొదలైనవారు సమాధిస్థితిలో ఆత్మదర్శనం చేసుకుంటారని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి. ఆత్మఅనేది కనులతో చూడబడదు. చెవులకు వినబడదు. నోటితో మాట్లాడబడదు. నేతినేతి అని లౌకిక ప్రపంచంలో అన్నింటిని నిషేధించినప్పటికీ ఆఆత్మ గ్రహించడానికి వీలుకాదు. ఆత్మ తెలియరానిది. అవ్యక్తమైన ఆఆత్మను యోగులు సంరాధన కాలమునందు చూస్తారు. భక్తి జ్ఞానం మొదలైన వాటి అనుష్టానానికి సంరాధనం అని పేరు. సంరాధన కాలంలో ఎలా తెలుస్తుందంటే, ప్రత్యక్ష , అనుమాన ప్రమాణాల చేత, అంటే శ్రుతి, స్మృతుల చేత అని అర్ధం. మానవ జన్మ వచ్చిన ప్రతి వారు ఆత్మ సాక్షాత్కారం పొందే అవకాశం ఉన్నప్పటికీ, జీవులు కళ్ళకు కనిపించే దృశ్య ప్రపంచాన్నే చూస్తారు కాని వారి హృదయంలో ఉన్న అంతరాత్మని చూడలేరు. మోక్షాన్ని పొందాలనే బుద్ధిమంతుడైన యోగి అంతర్ముఖుడై, జ్ఞానం నిర్మలమై, అటు పిమ్మట ధ్యానం చేస్తూ, అఖండమైన పరమాత్మను చూడగలుగుతాడు. ప్రత్యక్షప్రమాణం అంటే దృష్టి రిధిలో ఉంటూ, కనులతో చూస్తూ, ఏదైనా ఇంద్రియఅవయవం ద్వారా గుర్తించగలగడం. దీనిని ఎవరూ కాదనలేరు. అనుమాన ప్రమాణం అంటే శబ్ద/ఆప్త వాక్యప్రమాణంద్వారా తాను నమ్మే ప్రమాణగ్రంధంలో ఉన్నందువలన గాని, తాను విశ్వసించే వారెవరైనా చెప్పినందువలన గాని, అంగీకరించడం. మంటను కళ్ళతో చూస్తుంటే అది ప్రత్యక్షప్రమాణం. దూరంగా వస్తున్న పొగను చూసి, అక్కడ నిప్పు ఉందని ఉహించి చెప్పడం అనుమానప్రమాణం. యోగులు అవ్యక్తమైన బ్రహ్మన్ని సమాధి, అభ్యాసాలలో ప్రత్యక్ష, అనుమాన ప్రమాణాల చేత బ్రహ్మాన్ని తెలుసుకుంటారు. అలసత్వం లేనివారు, శ్వాసను జయించినవారు, ఇంద్రియాలను నిగ్రహించువారు, సంతుష్టాంతరంగులు అయిన యుంజానులు (యోగాభ్యాసం చేస్తున్న యోగులు) మాత్రమే ఆ భగవంతుణ్ణి చూస్తారని స్మృతి చెబుతున్నది.
సూత్రం :- 343
" ప్రకాశాది వచ్చా వైశేష్యం ప్రకాశశ్చ కర్మణ్యభ్యాసాత్ "
ప్రకాశాదివత్ :- అగ్ని, జలం మొదలైన వాటిలాగా, అవై శేష్యం :- అవిభాగత ఉంటుంది. చ :- అంతే కాక, ప్రకాశః చ :- ఈ అవిభాగత కూడా, కర్మణి :- ఆరాధన విషయంలో, అభ్యాసాత్ :- ఎన్నో సార్లు అభ్యాసనం వలన కలుగుతుంది.
భావం:- అగ్ని, జలం మొదలైన వాటికి అవిభాగత ఉంటుంది. ఆరాధన విషయంలో ఎన్నోసార్లు అభ్యాసనం వలన అవిభాగత కలుగుతుంది.
వివరణ:- జీవాత్మ, పరమాత్మలు భేదం లేదు. ఆరెండు ఒక్కటే. కేవలం వస్తురూపం పొందటం వలన భేద భావం కనిపిస్తుంది. అగ్నికి వేడి-ప్రకాశం, జలానికి చల్లదనం వీటికి విడదీయరాని అవిభాగత ఉంటుంది. అలాగే శుద్ధమైన జీవాత్మకు పరమాత్మలో అవిభక్తతత ఏర్పడుతుంది. ఇది నిత్యం. ముముక్షువులు నిర్వికల్ప సమాధిలో, చిత్తవృత్తులు నశించి, స్వయంగా శుద్ధ స్వరూపులై, అభ్యాసం వలన అవిభక్త భావన కలిగి, పరమాత్మలో చేరతారు.
సాంఖ్య దర్శనం(5, 116):- "సమాధి, సుషుప్తి, మోక్షేషు బ్రహ్మరూపత్ " సమాధిలోనూ, సుషుప్తిలోనూ, మోక్షంలోను జీవులకు బ్రహ్మరూపత కలుగుతుంది... అందువలన బ్రహ్మదర్శనం కోసం ఆరాధన ఎంత అవసరమో నిత్యఅభ్యాసం కూడా అంతే అవసరం. దానితో బ్రహ్మసామ్యం కలుగుతుందని సూత్రాభిప్రాయం. ఆత్మ ఉపాధి వలన భిన్నంగా కనబడుతుంది. కాని వాస్తవంలో విశేషం లేదు. వేదాంతంలో జీవబ్రహ్మభేదం అనేక పర్యాయములు చెప్పడం వలన జీవుడు, ఈశ్వరుడు వేరుగా కనిపిస్తున్నారు. ఉపాధుల వలన సూర్యప్రకాశం వేరువేరుగా కనబడుతున్నా సూర్యుడు ఒక్కడే. ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు నీటికుండలలో ప్రతిబింబాలు వేర్వేరుగా కనిపిస్తాయి. నీరు స్వచంగా ఉంటే బింబం ప్రకాశ వంతంగా ఉంటుంది. నీరు కదిలితే బింబం కూడా కదులుతుంది. దేహము కుండ, మనస్సు నీరు, పరమాత్మ సూర్యుడు అనుకుంటే మనస్సు స్వచ్చంగా ఉంటే వానిలో పరమాత్మ జ్ఞానం కలిగి ఇంద్రియాలు వాటి ఉపాధులను పరమాత్మ వదిలేస్తే, జీవాత్మ నశించి అక్కడ చైతన్యరూపమైన పరమాత్మయే ఉంటాడు. తాను జీవుడిని అని అనుకోవడమే భ్రమ, అసత్యం. స్వప్నపురుషుడు స్వప్నంలో అనేక దృశ్యాలు, అనుభవాలుచూసి అవన్నీ యదార్ధమేనని భ్రమపడుతుంటాడు. మేల్కొన్న తరువాత అవన్నీ మాయేనని తెలుసుకుంటాడు. జాగ్రదావస్థలో చూస్తున్న దృశ్యప్రపంచం, ఉపాధులు అన్నీ మాయేనని యదార్ధంగా అంతా పరమాత్మేనని గ్రహించాలి. ఈ ఆత్మ భేదం ఉపాధుల వలన ఏర్పడినదే. స్వతః అయితే ఏకాత్మ తత్వమే. అందువల్లనే వేదాంతాలలో అభ్యాసం చేత అనేక పర్యాయములు జీవ ప్రాణులకు అభేదం ప్రతిపాదించబడింది.
సూత్రం :- 344
" అతో నంతేన తధాహి లింగమ్ "
అతః:- ఆ అవిభాగత వల్ల, అనంతేన :- అపరిచ్చిన రూపంతో, వ్యాపక రూపంతో బ్రహ్మ దర్శనం కలుగుతుంది. తధాహి :- అని, లింగమ్ :- శాస్త్రాలంటున్నాయి.
భావం :- జీవేశ్వరుల మధ్య అవిభాగత వలన అపరిచ్చిన్న రూపంతో, వ్యాపక రూపంతో బ్రహ్మ దర్శనం కలుగుతుంది.
వివరణ:- జీవాత్మకు, పరమాత్మకు మధ్య ఉపాధుల, అజ్ఞానం వలన భేదం వచ్చింది. ఉపాధులు నివృత్తి చెందగానే వారి మధ్య అభేదం కలుగుతుంది. అప్పుడే జీవుడు కూడా ఆనందమయమైన, అనంతమైన బ్రహ్మ అవుతాడు. జీవేశ్వరుల మధ్య భేదాభేదాలు రెండు ఉంటాయి. పారమార్దికంగా వారి మధ్య తేడా లేదు. మోక్షం పొందనంతవరకు ఇద్దరి మధ్య భేద భావంతో, జీవుడు తాను పరమాత్మ కన్నా భిన్నమనే అనుకుంటాడు. సాధనలో, సమాధిస్థితిలో తాను అనేవాడు లేడని , ఆత్మదర్శనం చేసుకొని, ఉన్నదాంతా ఈశ్వరుడేనని అభేద స్థితికి వస్తాడు అని పూర్వ పక్షం వారి ఆక్షేపణ.
ఋగ్వేదం (1, 2, 7, 20):- ఆత్మవిదులు పరమాత్మను అంతటా చూస్తారు. ఆకాశంలో సూర్యుడు తన ప్రకాశంలో వ్యాపకుడై ఉన్నట్లుగానే వ్యాపకుడైన పరమాత్మను వీక్షిస్తారు. జీవుడు పరమాత్మలో ఐక్యం పొందుతాడు అని శ్రుతి రూపమైన లింగం ఉన్నది కదా! జీవుడు తనలో ఉన్న అజ్ఞానాన్ని జ్ఞానంచేత పోగొట్టుకుని, శ్రవణమననాదులను నిరంతరం అభ్యసించడం వలన శుద్ధుడైన జీవుడికి సమాధి అవస్థలో సర్వవ్యాపకుడైన ఈశ్వరుడి సాక్షాత్కారం లభిస్తుంది. అనంతుడైన ఈశ్వరునితో ముమక్షువులు ఏకత్వాన్ని పొందుతారు. ఆవిధంగానే ఎవడైతే ఆపరబ్రహ్మను తెలుసుకుంటాడో, అతను బ్రహ్మగానే అవుతాడు. ఎల్లప్పుడూ బ్రహ్మగానే ఉన్న జీవుడు బ్రహ్మను పొందుతాడు.
సూత్రం :- 345
" ఉభయ వ్యపదేశాత్ అహి కుండలవత్ "
ఉభయ వ్యపదేశాత్ :- రెండు రకాలుగా చెప్పారు కనుక, అహి కుండలవత్ :- కుండలాకారంగా ఉన్న సర్పం లాగా బ్రహ్మాన్ని అంగీకరించాలి.
భావం :- రెండు రకాలుగా చెప్పారు కనుక కుండలాకారంగా ఉన్న సర్పం లాగా బ్రహ్మాన్ని అంగీకరించాలి.
వివరణ:- జీవుడికి, ఈశ్వరుడికి మధ్య భేదం లేదు. పాము చుట్ట చుట్టుకొని పడుకుంటుంది.అప్పుడు దానిని కుండల సర్పం, సర్పకుండలం అని రెండురకాలుగా వ్యవహరిస్తారు. ఉన్నది ఒక్కటే సర్పం. చుట్టచుట్టుకొని పడుకున్న పాముకు, నిలువుగా ఉన్న పాముకుఉన్న తేడా ఎంతో, జీవాత్మ పరమాత్మల మధ్యతేడా కూడా అంతే. బారుగా ఉన్న పాముకు, పాముచుట్టకు తేడాలేదు. అలాగే జీవుడు, పరమేశ్వరుడు ఒక్కటే. అలాగే బ్రహ్మాన్నికూడా జ్ఞానస్వరూపం, జ్ఞానాశ్రయం అని రెండు రకాలుగా సంభోదించడంలో ఏదోషంలేదు. నిర్వికారుడైన పరమేశ్వరుని ధ్యానిస్తున్న వాడే జీవుడు. పరాత్పరుడైన ఆ దివ్యపురుషుణ్ణి జీవుడు పొందుతున్నాడు. ఇదే వీరి మధ్య భేదం. మూర్తామూర్త రూపకమైన జగత్తు కన్నా భిన్నం బ్రహ్మ అన్నారు. జగత్కారణం బ్రహ్మ అన్నారు. అయితే బ్రహ్మ స్వరూపం ఎలాంటిది? బ్రహ్మం జ్ఞానానికి ఆశ్రయమా? లేక జ్ఞాన స్వరూపమా? జ్ఞానానికి ఆశ్రయమైతే ప్రజ్ఞానం బ్రహ్మ.
ఐతరేయోపనిషత్తు( 3, 3 ):- ప్రజ్ఞానమే బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని జ్ఞాన స్వరూపంగా ఎందుకు వర్ణిస్తారు? పోనీ జ్ఞాన స్వరూపమైతే, యః సర్వజ్ఞ సర్వవిత్.
ముండకోపనిషత్తు( 1, 1, 5 ):-ఆయన సర్వజ్ణుడు. అంతా తెలిసినవాడు అని ఎందుకన్నారు? ఇలా జ్ఞానస్వరూపం, జ్ఞానానికి ఆశ్రయం అని రెండు రకాలుగా ఒప్పుకోవాలి? దానికి సమాధానం ఈ సూత్రంలో చెప్పారు.
బృహదారణ్యకోపనిషత్తు:-ఎవరు లోపలఉంటూ, అన్నింటిని నియమిస్తున్నాడో అతడే ఆత్మ అని చెప్పారు. ఇక్కడ నియమిస్తున్న వాడు, నియమింపబడేవాడు ఇద్దరూ ఒక్కటే. మహావాక్యాలు కూడా ఈ మాటే చెబుతాయి. తత్త్వమసి - నీవే ఆత్మవు, అహం బ్రహ్మాస్మి-నేనే పరబ్రహ్మను, కాబట్టి జీవాత్మ, పరమాత్మ రెండుఒకటే, వేరుకాదు. ధ్యానించేవాడు - ధ్యానింప బడేది, అనే సంబంధం చేత చూచేవాడు-చూడదగిన వాడు, అనే సంబంధం చేత నియమించేవాడు-నియమింపబడేవాడు అనే సంబంధం చేత కొన్ని చోట్ల జీవునకు ప్రాజ్ఞనకు భేదం చెప్పబడుచున్నది. కొన్ని చోట్ల తత్వమసి జీవేశ్వరులకు అభేదం చెప్పబడుచున్నది. ఈ విధంగా భేదాభేదాల రెండింటి వ్యపదేశం ఉన్నప్పుడు కేవలం అభేదమే గ్రహింపడినట్లయితే భేద వ్యపదేశానికి ఆధారం లేకుండా పోతుంది. అందుచేత ఉభయవ్యపదేశం కనబడుచున్నది. ఇక్కడ తత్వం అహి కుండల వలె ఉంటుంది. ఒక జంతువును చూసి ఇది సర్పం అంటే అది అభేదం. దానిని గూర్చి కుండలం ( పాము చుట్ట ) దాని శరీరం పొడవు, ఇత్యాది విధంగా చెప్పినట్లయితే ఎలా భేదం ఉండదో, అట్లే బ్రహ్మాన్ని కూడా జ్ఞానస్వరూపంగా, జ్ఞానాశ్రయంగా వ్యవహారించారు.
సూత్రం :- 346
" ప్రకాశాశ్రయవత్ వా తేజస్త్వాత్ "
వా :- లేదా, తేజ స్వాత్ :- తేజస్సు అనే గుణం వలన, ప్రకాశాశ్రయావత్ :- ప్రకాశానికి ఆశ్రయమైన ( కారణమైన తేజస్సులాగా, బ్రహ్మం జ్ఞాన స్వరూపమని, జ్ఞానాశ్రయమని తెలుసుకోవాలి.
భావం :- తేజస్సు అనే గుణం వలన ప్రకాశానికి ఆశ్రయమైన బ్రహ్మం జ్ఞాన స్వరూపమని, జ్ఞానాశ్రయమని తెలుసుకోవాలి.
వివరణ :- సూర్యునికి సంబంధమైన ప్రకాశం, దానికి ఆశ్రయ మైన సూర్యుడు ఈ రెండు కూడా తేజస్సులే. ఆ రెండు ఏ విధంగా అభిన్నములో, అట్లే జ్ఞాన స్వరూపమైన బ్రహ్మం , జ్ఞానశ్రయమైన బ్రహ్మ రెండు ఒక్కటే.
యజుర్వేదం(22, 1) :- " తేజోసి శుక్రం అమృతమ్ " బ్రహ్మ తేజస్సు, శుక్రం, అమృతం " అగ్ని విద్యుత్తు లాంటి పదార్ధాలు ప్రకాశ స్వరూపాలు, ఇతర పదార్ధాలు ప్రకాశించేటట్లు కూడా చేస్తాయి. అవి ప్రకాశాలు, ప్రకాశానికి ఆశ్రయాలు కూడా. అలాగే బ్రహ్మం జ్ఞాన స్వరూపం, జ్ఞేయం కూడా. అందువలన జ్ఞానానికి ఆశ్రయం. కాబట్టి బ్రహ్మాన్ని జ్ఞాన స్వరూపం, జ్ఞానాశ్రయమని వర్ణించారు. ప్రకాశానికి, ప్రకాశానికి ఆశ్రయమైన సూర్యునికి భేదం లేదు. సూర్యుని ప్రకాశమైన వెలుగు, ఎండను సూర్యుని నుండి వేరుగా ఉన్నాయని, వాటిమధ్య భేదం ఉన్నట్లుగా భావిస్తారు. యదార్ధంగా వాటిమధ్య భేదం లేదు. జీవుడు, పరమేశ్వరుడు మధ్య ఉన్న భేదం, అభేదం రెండు ఒక్కటేనని అంగీకరించాలి. జీవేశ్వరుల మధ్య భేదాన్ని అంగీకరిస్తే జీవుడు ఎప్పటికి ఈశ్వరుడు కాలేడు. ఇద్దరి మధ్య అభేదాన్ని అంగీకరిస్తే యదార్ధంగా ఉన్నది పరమాత్మయే నని, జీవుడనే వాడు లేడని తెలుస్తుంది.
సూత్రం :- 347
" పూర్వవత్ వా "
పూర్వవత్ పూర్వం ( 2, 3, 43 ) లో చెప్పినట్లుగా, వా :- జీవాత్మ లాగా బ్రహ్మాన్ని కూడా నిర్ధారించవచ్చును.
భావం :- పూర్వం చెప్పినట్లుగానే బ్రహ్మాన్ని కూడా నిర్ధారించవచ్చును.
వివరణ:-(2, 3, 43)సూత్రంలో బ్రహ్మతో జీవికిగల సంబంధాన్ని వివరించారు. జీవాత్మ బ్రహ్మానికి అంశమని, తండ్రి కొడుకులకు అంశ, అంశి భావం ఉన్నట్లే, జీవబ్రహ్మల సంబంధం ఉన్నదని శాస్త్రాలు చెబుతున్నాయి. అంశం అంటే కుమారుడు, అంశి అంటే తండ్రి అలాగే బ్రహ్ - అంశి, జీవుడు - అంశ. బ్రహ్మ జీవులందరికి తండ్రిలాంటి వాడని భావం. జీవుడికి ఈశ్వరుడికి భేదం చెప్పిన, చెప్పక పోయినా కూడా జీవుడు ఈశ్వరుని అంశమే. ఈ భేదం ఉపాధి వలన వచ్చింది. అంటే అవిద్య అజ్ఞానం వలన వచ్చింది. అవిద్య నశిస్తే ఈ భేద భావం నశిస్తుంది.
ప్రశ్నపనిషత్తు( 4, 9 :- ఏష హి ద్రష్టా, స్రష్టా, శ్రోతా, ఘ్రాతా, రసయితా, మంతా, బోద్ధా, కర్తా, విజ్ఞానాత్మ, పురుషః " జీవుడు జ్ఞానంతో బాటు దర్శక, స్పర్శ, శ్రవణాది, జ్ఞానాలకు ఆశ్రయుడు. అలాగే పరమాత్మకూడా జ్ఞానస్వరూపుడైన జ్ఞానాశ్రయుడని చెప్పవచ్చును. అవిద్యతో ఏర్పడిన బంధాన్ని తొలగించాలంటే ఆత్మ జ్ఞానంతో మోక్షాన్ని సాధించాలి. అలాకాక అహి కుండల న్యాయం చేత అంటే పాము యొక్క చుట్ట వలె పరమాత్మ యొక్క ఒక అవయవంగా ఉన్న ఒక ఆత్మ నిజంగానే బద్ధుడు అవుతాడు అని అంగీకరిస్తే అప్పుడు పారమార్దిక మైన బంధాన్ని తిరస్కరించడం శక్యం కాదు. కనుక మోక్ష శాస్త్రము వ్యర్థం అయిపోతుంది. ఇక్కడ శ్రుతి భేదాభేదాలను రెండింటిని ఒకే విధంగా నిర్దేశించడం లేదు. ఆభేదాన్ని ప్రధానంగా ప్రతిపాదింపదగినదిగా నిర్దేశిస్తూ, మరొక విషయం చెప్పాలని అభిప్రాయంతో ప్రత్యక్షాదుల ద్వారా 'ప్రకాశాది వచ్చా వైశేష్యం ' అని చెప్పడం జరిగింది.
సూత్రం :- 348
" ప్రతి షే ధాత్ చ "
చ :- అంతే కాక, ప్రతిషేధాత్ :- గుణ గుణి భావాల నిషేధం వలన కూడా బ్రహ్మాన్ని జ్ఞాన స్వరూపం అని చెప్పవచ్చును.
భావం :- గుణ గుణి భావాల నిషేధం వలన కూడా బ్రహ్మాన్ని జ్ఞాన స్వరూపం అని చెప్పవచ్చును.
వివరణ:-జ్ఞానమనేది గుణం. ఆ గుణం గుణి కన్నా వేరు కాదు. గుణస్వరూపం కానేరదు. ఇలా జ్ఞానతత్త్వాన్ని, జ్ఞానం ఉన్న వాడిని వేరుచేయలేము. ఈ గుణగుణిభావం బ్రహ్మానికి వర్తించదు. పరమాత్మకన్నా భిన్నమైన మరొక చైతన్యాన్ని నిషేదిస్తోంది. బ్రహ్మ కంటే వేరైనా ప్రపంచం, జీవుడు లేరు. జీవుడు అని అనుకోవడం నిజం కాదు. నేను పరమాత్మను అనేదే నిజం. ప్రకృతిలో కనిపిస్తున్న వృక్షాలు, జంతువులు, పక్షులు అన్నీ పరమాత్మ. పరమాత్మ కన్నా వేరైనా ద్రష్ట ఎవరు లేరు. బ్రహ్మకారణ రహితుడు, కార్యరహితుడు బ్రహ్మకన్నా భిన్నమైనది ఏది లేదు. నీతి అనే పదం బ్రహ్మను నిరోధించదు.
పరాధికరణం ( 3, 2, 31 )
సూత్రం :- 349
" పరమతః సేతూన్మాన సంబంధ భేద వ్యపదేశాభ్యః "
ఇది పూర్వ పక్ష సూత్రం. అతః :- బ్రహ్మం కన్నా, పరం :- సూక్ష్మమైనది. సేతువు :- వంతెన, ఉన్మానం :- కొలత, సంబంధం :- ఆత్మతో బ్రహ్మ కున్న సంబంధం, భేదం :- చూసే వాడికి, చూడబడే వాడికి భేదం
భావం:- దృశ్యమాన ప్రపంచంకన్నా సూక్ష్మమైనది బ్రహ్మం అని అన్నారు. మరి బ్రహ్మం కన్నా పరం ఇంకొకటి లేదా? సేతువు, ఉన్మానం, సంబంధం, భేదం అని ఉపనిషత్తులలో వర్ణాలు ఉన్నాయి కదా! అందువలన బ్రహ్మం కన్నా పరమైనవి ఎందుకు ఉండ రాదు? అని పూర్వ పక్ష వాదన.
వివరణ:- ఇంతవరకు బ్రహ్మకన్నా పరమైనది ఏదిలేదు అని అన్నారు. కాని వేదంలో కొన్ని చోట్ల సేతువు అంటూ భేదాన్ని చెప్పడం వలన బ్రహ్మ కన్నా వేరైన వస్తువు ఏదైనా ఉన్నదా? అని అడిగాడు నారాయణ భట్టు. సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. సేతువు, ఉన్మానం, సంబంధం, భేదములను చెప్పడం వలన బ్రహ్మంకన్నా వేరైనా వస్తువు ఉన్నదని తెలుస్తోంది అంటున్నారు. సేతువు :- నదులు, కాలవల పైన దాటడానికి కట్టిన నిర్మాణం, ఛాందోగ్యంలో పరమేశ్వరుడు ఈ జగత్తును దాటించే సేతువు అని చెప్పారు. ఉన్మానం :- ఇంత పొడవు, బరువు, పరిమితి అని కొలత తూకము చెప్పబడింది. ఛాందోగ్యం లో బ్రహ్మకు నాలుగు పాదాలున్నాయి.అని చెప్పబడింది. సంబంధం:- ఆత్మతో బ్రహ్మకున్న సంబంధం. సుషుప్తిలో జీవుడు బ్రహ్మతో కలుస్తున్నాడు అని ఛాందోగ్యంలో చెప్పారు. భేదం :- చూసే వాడికి, చూడబడేవాడికి భేదం. పరమాత్మ చూడదగిన వాడు. తెలుకోదగిన వాడు అన్నారు. అంటే చూసేవాని కన్నా తెలుసుకునే దాని కన్నా భిన్నమైన వాడు. దీని వలన ఈశ్వరుని కన్నా వేరైనా వాడు ఇంకొకడు ఉన్నాడు అని తెలుస్తోంది. అని వారి వాదం.
ఛాందోగ్యోపనిషత్తు ( 8, 4, 1 ):- ఇక్కడ బ్రహ్మాన్ని సేతువుతో పోల్చారు. సేతువుకు అవతల ఏమి లేకుండా ఉండదు కదా! సేతువుకు అవతల ఏదైనా ప్రదేశం ఉంటుంది. దీని వలన బ్రహ్మనికి పరంగా ఏదో ఉంటుందని తెలుస్తోంది కదా!
ఋగ్వేదం (8, 4, 17, 3) :-" పాదో న్య విశ్వా భూతాని " సమస్త భూతాలు బ్రహ్మనికి ఒక కొలత ఏర్పడుతుంది. బ్రహ్మనికి నాలుగు పాదాలు అన్నారు. కనుక బ్రహ్మం పరిమితమై అంత కన్నా పరమైనది ఇంకొకటి ఉన్నదని తెలుతోంది కదా! అలాగే సంబంధం వ్యపదేశాల వల్ల బ్రహ్మానికి పరతత్వం మరొకటి ఉంటుందని అనుకోవాలి
ఛాందోగ్యోపనిషత్తు( 8, 12, 3 ) :- జీవుడు పరం జ్యోతి అయిన పరబ్రహ్మను పొంది, స్వస్వరూపంతో ఉంటాడు. జీవుడు పొందే వాడు. జీవుడికి బ్రహ్మ పొందదగినది.ఇలా జీవబ్రహ్మాలకు ప్రాప్తి, ప్రాప్తవ్యభావం ఏర్పడుతుంది. జీవుడికి బ్రహ్మం ప్రాప్తవ్యమైనట్లు, మరో ప్రాప్తవ్యం బ్రహ్మనికి పరంగా ఉండవచ్చు కదా! బ్రహ్మసాక్షాత్కారం కలిగిన తరువాత ముముక్షువులు పొందే చోటు బ్రహ్మం కాక బ్రహ్మ పదం అన్నారు.
కఠోపనిషత్తు(3, 8 ):- ముక్త జీవుడు మళ్ళీ పుట్టుక లేని బ్రహ్మ పదాన్ని పొందుతాడు. దీని వలన బ్రహ్మ పదం, బ్రహ్మ కన్నా వేరు అని తెలుస్తోంది. బ్రహ్మకన్నా పరతత్వం మరొకటి ఉందని తెలుస్తోంది. ఇలా శ్రుతులలో కొన్ని వాక్యాలు కనబడటం వలన బ్రహ్మకన్నా ఉత్కృష్టమైన మరొక తత్త్వం ఉందని పూర్వపక్ష వాదన. సేతువ్యపదేశం వలన ఆత్మశబ్దం చేత చెప్పబడిన బ్రహ్మ సేతువు అని చెప్పబడుచున్నది. జలప్రవాహాన్ని అడ్డుకునే మట్టి కర్రలు మొదలైన వాటి సముదాయాన్ని సేతువు అని పేరు. ఇక్కడ సేతు శబ్దం ఆత్మ విషయంలో ప్రయోగించబడింది. లౌకిక మైన సేతువు దాటి సేతువు కంటే భిన్నమైన అనాత్మ వస్తువును పొందుతాడు అని తెలుస్తోంది. మనుషులకు నగరాలతో సంబంధం ఉన్నట్లు మిత్రులకు మిత్రులతో సంబంధం ఉన్నట్లు, జీవులకు సుషుప్తిలో బ్రహ్మతో సంబంధం ఉంటుందని చెబుతున్నది. అందువలన బ్రహ్మ కన్నా పరమైనది ఏదో ఉన్నదని తెలుస్తోంది. భేద వ్యపదేశం కూడా ఈ విషయాన్ని సూచిస్తోంది. బ్రహ్మ బంగారు రంగుతో ప్రకాశిస్తున్న జ్యోతి స్వరూపుడు. ఈశ్వరునికి ఆదిత్యుడు ఆధారమని చెప్పి, అక్షి పురుషుడు, సూర్య మండలం లోని బ్రహ్మ వేరు అని పూర్వ పక్షం అభిప్రాయం. దీనిని మహర్షి నాలుగు సూత్రాలలో సమాధానం చెప్పారు.
సూత్రం :- 350
" సామాన్యాత్ "
సామాన్యాత్ :- సామాన్యమైన పోలిక వలన, తు :- మాత్రమే
భావం :- సామాన్యమైన పోలిక వలన మాత్రమే బ్రహ్మాన్ని సేతువుతో పోల్చారు.
వివరణ :- బ్రహ్మ సేతువు వంటి వాడు అనడం కన్నా బ్రహ్మం కన్నా వేరైన వస్తువు ఇంకొకటి ఉన్నదని కాదు. సేతువు నీటిని అడ్డగించి ప్రవాహాన్ని ఆపుతుంది. నదీజలం వల్ల త్రోవకు అడ్డురాకుండా ఉంటుంది. అలాగే బ్రహ్మం జగత్తును ధరించి ఉన్నది. ఇలాంటి ధారణ అనే పోలికతో బ్రహ్మాన్ని సేతువు అన్నారు. కాని మరొకటి కాదు. ఇతర విషయాల్లో బ్రహ్మాన్ని సేతువుతో పోల్చరాదు. సేతువు నీటిప్రవాహన్ని నిలబెట్టినట్లుగా జగత్తును, దాని కట్టుబాట్లను నిలపడమే ఆత్మకు సేతువుతో ఉన్న పోలిక. ఇక్కడ సేతువు అంటే సేతువును దాటి బ్రహ్మాన్ని పొందాలి. సేతువును రాయి తోనే, చెక్కతోనో చేస్తారు. అంత మాత్రాన బ్రహ్మం దారు పాషాణ మయం అవుతుందా? కనుక ఈ పోలికతో బ్రహ్మనికి మరొక తత్వం ఉందని అనుకోవడం పొరబాటు. బ్రహ్మం కన్నా భిన్నమైన వేరొక వస్తువు ఉండటానికి వీలు లేదు. అందుకు ప్రమాణం ఏది లేదు. ఆత్మ సేతువు అని మాత్రమే చెప్పింది కాని ఆత్మ కంటే పరమైనది ఉన్నదని చెప్పలేదు కదా! సేతువుకు మరొక వస్తువు లేకపోతే సేతుత్వం కుదరదు. కనుక మరొక వస్తువును కల్పించాలి అన్నట్లయితే న్యాయం కాదు. ఇది బ్రహ్మనికి అజత్వాన్ని (జన్మ రాహిత్యం) బోధించే శృతికి విరుద్ధం కదా! విషయాన్ని అర్ధం చేసుకోవడానికి, లోపల ఉన్న సమస్త ధర్మములతో బంధిస్తాడు. ఎవరైతే జ్ఞానం కలిగి ఆధ్యాత్మిక సాధనలో మోక్షార్థులై ఉంటారో సంసార సాగరాన్ని దాటడానికి బ్రహ్మ సేతువుగా ఉపయోగపడతాడు. సేతువుకు ఆవల ఒడ్డు ఉంటుంది కాని బ్రహ్మనికి ఒడ్డు లేదు. అతడు వ్యాకరణం దాటాడు అన్నప్పుడు వ్యాకరణశాస్త్రాన్ని పొందాడు అని మాత్రమే అర్ధం కాని దానిని దాటినవాడు అనే అర్ధం కాదు. అట్లే ఆత్మ సేతువును దాటుతోందని కాదు. పొందడం అనే అర్ధాన్ని అది బోధిస్తుంది. పుట్టిన ప్రతి వస్తువు యొక్క సముదాయం జన్మాదికం వల్లనే జరుగుతుందనీ, కార్యం కారణం కంటే భిన్నం కాదని నిర్ధారణ చేయబడింది.
పరాధికరణం ( 3, 2, 33 )
సూత్రం :- 351
" బుద్ధ్యర్థః పాదావత్ "
పాదావత్ :- లోకంలో పాద వ్యవహారం లాగా, బుద్ధి అర్ధః :- ఈ వర్ణన బ్రహ్మాన్ని అర్ధం చేసుకోవడానికి చేశారని గ్రహించాలి.
భావం :- లోకంలో పాద వ్యవహారంలా ఈ వర్ణన బ్రహ్మాన్ని అర్ధం చేసుకోవడానికి చేశారని గ్రహించాలి.
వివణ :- బ్రహ్మకు నాలుగు పాదాలున్నాయని కేవలం ఉపాసన కోసం బ్రహ్మకు పరిమితి, కొలత చెప్పబడ్డాయి. ఒక వస్తువు పరిమాణం తెలియడానికి కొలతలు ఉపయోగిస్తాము. అలాగే కొలత, కొలిచిన వస్తువు వేరే అని తెలుపదు. పరమాత్మకు ప్రపంచమంతా ఒక పాదం అయినప్పుడు అది పరమాత్మ ఆధిక్యాన్ని తెలుపుతుంది. ముముక్షువులకు బ్రహ్మాన్ని గురించి స్పష్టంగా తెలియజేయడానికే ఈవర్ణన చెప్పబడింది. తేలికగా ఉండటం కోసమే బంగారాన్ని పావలాఎత్తు, తులం అని చెప్పినట్లుగానే, బ్రహ్మాన్ని ఉపాసన చెయ్యడం కోసమే ఈ పాదవ్యపదేశం చెప్పబడింది కాని బ్రహ్మాన్నిమించి మరొకటి ఉందని కాదు. ఉన్మానం చెప్పడం వలన బ్రహ్మకంటే పరమైనది ఏది చెప్పబడిందో, దాని విషయంలో చెప్పబడుచున్నది. ఉన్మాన వ్యపదేశం వలన కూడా బ్రహ్మ కన్నా వేరైనా వస్తువు ఉన్నదని చెప్పడానికి కాదు. బుద్ధి కోసం చెప్పబడింది. అంటే ఉపాసన కోసం చెప్పబడింది అని అర్ధం. బ్రహ్మ యందు బుద్ధి స్థిరంగా నిలపడం కోసమే బ్రహ్మను చతుష్పాదని, అష్ట గిట్టలని , షోడశకళలని, వికారాలద్వారా ఉన్మాన కల్పన చేయబడుచున్నది. పురుషులలో ఉత్తమబుద్ధులు, మధ్యమబుద్ధులు, మందబుద్ధులు కూడా ఉంటారు. అందరు అవికారము, అనంతం అయిన బ్రహ్మయందు బుద్ధిని నిలుపజాలరు కదా! ఆధ్యాత్మికంగా బ్రహ్మకు ప్రతీకంగా చెప్పబడిన మనస్సు అధిదైవతంగా బ్రహ్మకు ప్రతీకగా చెప్పబడిన ఆకాశం, వీటిలో వాగాదులు వాక్కు, ప్రాణం, చక్షస్సు, శ్రోత్రాలు మనస్సు యొక్క పాదాలని, అగ్ని, వాయువు ఆదిత్య, దిక్కులు ఆకాశం యొక్క పాదాలను ధ్యానం కోసమే కల్పించబడ్డాయి. ధ్యానం చెయ్యాలంటే సులభమైన పద్ధతి ఉండి, బుద్ధి నిలకడగా ఉంటేనే సాధ్యమౌతుంది. సాధకుకలైనవారికి, ఆత్మజ్ఞానం పొందిన వారికీ ఆత్మయందు బుద్ధి స్థిరముగా ఉంటుంది. ఈజగత్తు మొత్తాన్ని ఒక అంశగా, ఒక పాదంగా భావిస్తున్నాను అన్నాడు పరమాత్మ. దూరదృష్టితో ఆలోచిస్తే పరమాత్మలేని స్థితి లేదు. ఎన్నో సూర్య కుటుంబాలు, ఎన్నో నక్షత్ర మండలాలతో ఉన్న అనంతమైన జగత్తును చూడటం, కొలతలు చెప్పడం అసాధ్యం. అనంతమైన జగత్తుకు కనిపించే జగత్తు ఒకపాదం మాత్రమే. జీవుడిది అణుత్వం, ఈశ్వడిది మహతత్త్వం. జీవుడిది అంతఃకరణ, ఈశ్వరుడిది మాయ. ఆయనకు లోబడే అన్నీ ఉంటాయి కాని ఆయన ఎవరికీ లోబడి ఉండదు. ఉపాధులతో తాదాత్మ్యం చెందిన జీవుడు ఆ ఉపాధులు అసత్యమని, అంతా పరమేశ్వరుడి మాయేనని గ్రహిస్తే, జీవుడు మిధ్య అని, ఉన్నదంతా పరమాత్మయేననే విషయం బోధపడుతుంది. దూరంగా పెద్ద దీపం వెలుగులో మన నీడ గోడ మీద పడుతుంది. వెలుగు సత్యమని నీడ నిజం కాదు అని, నీడలాంటి జీవుడు అసత్యమని, చైతన్య రూపమైన పరమాత్మ సత్యం, జ్ఞానం అనంతం బ్రహ్మ అని అవగతమౌతుంది.
సూత్రం :- 352
" స్థాన విశేషాత్ ప్రకాశాదివత్ "
ప్రకాశాదివత్ :- ప్రకాశం, ఆకాశం లాంటి వాటి లాగా, స్థాన విశేషాత్ :- స్థాన విశేష సంబంధం వలన.
భావం :- ప్రకాశం, ఆకాశం వలె స్థాన విశేష సంబంధం వలన నిజానికి కొలతలు లేని బ్రహ్మాన్ని మన అవగాహన కోసం కొలతలను సూచించే పదాలతో బోధించడం యోగ్యమైనదే.
వివరణ:- ప్రకాశంవలెనే ఉపాధి యోగం వల్ల బ్రహ్మమందు సంబంధం చెప్పారు. సూర్య ప్రకాశానికి కొలత ఏమి ఉండదు. కాని కిటికీగుండా ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు దాన్ని వాతాయన(కిటికీ) ప్రకాశం అంటారు. అలాగే ఘటములో ఉంటే ఘటాకాశమని, మఠంలోఉంటే మఠాకాశం అని ఆకాశాన్ని వ్యవహారిస్తారు. ఈఉపాదులు ఏమిలేకపోతే అది మహదాకాశామే. ఈవ్యవహారం స్థాన భేదం వలన కలిగింది. ఈ విధంగానే బ్రహ్మం కొలతకు లోబడకపోయినా భూమ్యాది స్థాన సంబంధం వలన బ్రహ్మకు నాలుగు పాదాలున్నాయని చెప్పడంలో తప్పేమి లేదు. సంబంధం, భేదం ఈ రెండు బ్రహ్మ కన్నా వేరైనా వస్తువు ఉన్నదని చెప్పలేదు. బ్రహ్మ ఒక్కడే అయినప్పటికీ బుద్ధి మొదలైన ఉపాధుల సంబంధం వలన జీవుడు, ఈశ్వరుడు వేరు అనే భేదం కలుగుతోంది. సుషుప్తిలో జీవుడు తన ఉపాధులన్నింటిని వదలి, తాను ఒక్కడే సుషుప్తిలో ప్రవేశించి బ్రహ్మంలో విశ్రమిస్తున్నాడు. ఆఉపాధులు తొలగిపోతేనే జీవబ్రహ్మైక్య సిద్ధి లభిస్తుంది. సుషుప్తిలో ఉపాధి భేదం నశిస్తుంది. ఘటాకాశం మహదాకాశంలో కలసి పోయినట్లుగా జీవుడు ఈశ్వరుడిలో ఏకమౌతాడు. సూర్యునికి అడ్డుగా చేతివేళ్ళు అడ్డుపెడితే సూర్య కాంతి వంకరగా పడుతుంది. వేళ్ళు తొలగిస్తే సూర్య రశ్మి సవ్యంగా పడుతుంది. అలాగే ఉపాధి భేదం పోయి, అవిద్య నశిస్తే జీవుడికి, ఈశ్వరుడికి మద్యభేదం ఉండదు. స్థానవిశేషాన్ని బట్టి ఒకేవస్తువునకు రెండు వ్యపదేశాలు కుదురుతాయి. ఆత్మకు బుద్ధి మొదలైన స్థానవిశేషాలతో సంబంధం ఉన్నప్పుడు విశేషంజ్ఞానం కలుగుతుంది. ఆఉపాధులు ఉపశమించగానే ఆ జ్ఞానం శాంతిస్తుంది. సుషుప్తిలో ఆ విశేష జ్ఞానమే జీవునకు పరమాత్మలో కలిగిన సంబంధం. అంతే కాని పరిమితత్వాన్ని బట్టి కాదు. పరిమితమైన జీవుడు పరమాత్మతో కలవడం చేత కాదు. అదే విధంగా భేద వ్యపదేశం వలన కూడా బ్రహ్మకు కలిగిన ఉపాధి కల్పిత భేదాన్ని బట్టి మాత్రమే ఉపచారం చేత చెప్పబడుచున్నది. అంతే కాని బ్రహ్మకు ఈ సంబంధము, భేదములు చెప్పడం వలన బ్రహ్మకన్నా వేరే తత్వం ఉన్నదని కాదు.
సూత్రం :- 353
" ఉపపత్తేశ్చ "
ఉపపత్తేః :- ఇది సిద్దిస్తుంది. చ :- కూడా.
భావం:- బ్రహ్మం పొందదగినది, పొందే వాడు జీవుడు. ఈ సంబంధం జీవాత్మ పరమాత్మలకు సిద్ధిస్తుంది.
వివరణ:- శృతివాక్యాల వలన సంబంధ భేదాలు చెప్పడం ముఖ్యం కాదు. పొందదగినది బ్రహ్మం, పొందేవాడు జీవుడు అన్నప్పుడు బ్రహ్మానికి మించిన పరతత్వం మరొకటి ఉందని ఎలా సూచిస్తుంది? రెండు తత్వాల మధ్య ఉండే సంబంధం ఆ రెండు పదార్ధాలే బోధిస్తుంది కాని, మూడోతత్వం ఎక్కడ నుండి వస్తుంది? జీవుడు బ్రహ్మపదం చేరుకుంటాడు అంటే బ్రహ్మ, పదం రెండు ఒకటే. విష్ణు పదం అంటే విష్ణువు విశ్వరూపం అని అర్ధం. ఆత్మ చైతన్యం అన్నప్పుడు ఆత్మ వేరు, చైతన్యం వేరు అని భావం కాదు. చైతన్య స్వరూపమైన ఆత్మ అనే అర్ధాన్నే గ్రహించాలి. కనుక బ్రహ్మానికి పరంగా మరొక తత్త్వం ఉంటుందని వాదించడం సరి అయినది కాదు. ఇది స్వరూపంతో సంబంధమే అని చెబుతున్నారు. స్వరూపం ఎన్నటికీ దూరం అవడం ఉండదు. కనుక ఈ సంబంధం తనని తాను పొందడమే. నర నగర న్యాయం :- ఈ విషయంలో నర నగర న్యాయం కుదరదు. వేర్వేరు వస్తువులైన నరుడు, నగరము దూరంగా ఉండవచ్చును. నరుడు నగరంలో ప్రవేశిస్తే ఆనగరాలతో నరుడికి సంబంధం కలిగింది అని చెప్పడం యుక్తం. నరుడు, నగరము రెండు ఒకటి కాదు. జీవునికి తన స్వరూపమైన ఆత్మ నుండి విడిపోవడం అనేది లేనప్పుడు జీవుడు వచ్చి ఆత్మలో కలవడం అసలు లేనే లేదు. ఉపాధి చేత జీవుడిగా అతని స్వరూపం కప్పబడిపోవడం చేత, ఉపాధి కృతభేదం వలన వేరుగా ఉన్నట్లు కనబడుతున్నాడు. ఆఉపాధి తొలగిపోగానే జీవభావం పోయి, ముక్తుడైన జీవుడు ఆత్మగా మిగిలిపోతాడు. ఛాందోగ్యంలో సుషుప్తిలో జీవుడు తన రూపాన్ని పొందుతాడు అని చెప్పబడింది. ప్రతిబింబం లాంటి జీవభావం పోయి మిగిలేది ఆత్మభావం. ఒక్కటే ఉపాధివలన వచ్చినరూపం మాయమైపోగా నిజం స్థితి తెలుస్తుంది. ఆకాశం ఒక్కటే అయినా దానికి స్థానాల చేత ఏర్పడిన భేద వ్యపదేశాన్ని పురుషుని బైట ఉన్న ఆకాశం, పురుషుని లోపల ఉన్న ఆకాశం, పురుషుని హృదయంలో ఉన్న ఆకాశం అని తెలియజేస్తుంది.
సూత్రం :- 354
" తధా న్య ప్రతిషేదాత్ "
తధా :- ఆ విధంగా, అన్య ప్రతి షేదాత్ :- బ్రహ్మం కన్నా మించి వేరే పదార్ధం ఏది లేదని నిషేదించారు.
భావం:- బ్రహ్మకన్నా భిన్నమైన దానిని నిషేధించడం వలన కూడా బ్రహ్మ కంటే భిన్నమైన పదార్ధం ఏది లేదని నిషేదించారు.
వివరణ:- ఇతర వస్తువులన్నింటిని నిషేధించడం వలన పరమాత్మకన్నా భిన్నమైనది ఏది లేదని తెలుస్తుంది. ఏ సమస్తము బ్రహ్మయే. ఆత్మయే. ఈ బ్రహ్మంలో నానాత్వం ఏమి లేదని ఛాందోగ్యం, బృహదారణ్యకోపషత్తు చెబుతున్నాయి.
శ్వేతాశ్వరోపనిషత్తు( 3, 9) :- యస్మాత్ పరం నాపరం అస్తి కించిత్, ఈవాక్యాన్ని బట్టి బ్రహ్మంకన్నా పరతత్త్వం మరొకటి ఉందనడం సంగతం కాదు. బ్రహ్మకన్నా వేరొకటి లేదు. కాబట్టి బ్రహ్మ అద్వితీయం. ఆత్మ అన్నింటి కంటే లోపల ఉన్నది అని చెప్పే శృతిని బట్టి కూడా పరమాత్మ కంటే వేరుగా మరొక అంతరాత్మ లేదని నిశ్చయింపబడుతుంది.ఇతరమైన దానిని నిషేధించడం వలన కూడా బ్రహ్మం కంటే పరమైన వస్తువు లేదని తెలుస్తుంది. నేనే క్రింద కూడా, ఆత్మయే క్రింద కూడా. శృతి వాక్యాలు ఆత్మకంటే వేరుగా ఉన్న వస్తువును నివారిస్తున్నాయి. ఉన్నదాంతా సర్వవ్యాపకమైన పరమాత్మయే అయినప్పటికీ, జీవుడి అజ్ఞానం వలన అది ప్రపంచంలా కనిపిస్తున్నది. జీవుడంటే జడాత్మాకమైన శరీరం మాత్రమే కాదని, సచ్చిదానంద స్వరూపం, జ్ఞాన స్వరూపమని, బుద్ధి స్వరూపమని, ముక్త స్వరూపమని, సర్వం ఖల్విదం బ్రహ్మ ఉన్నదాంతా బ్రహ్మమేనని శ్రుతులు బోదిస్తున్నాయి.
సూత్రం :- 355
" అనేన సర్వగతత్వే మాయామాది శబ్యేభ్యః "
మాయమ శబ్ద దిభ్యః అని కొన్ని చోట్ల ఉన్నది. అనేన :- బ్రహ్మ కన్నా పరమైనది, మరొకటి లేదనడం వలన, అయమాది శబ్దే భ్యః :- ఆయాము, విభుత్వం వ్యాప్తి లాంటి శబ్ద ప్రయోగాల వలన, సర్వ గతత్వం :- బ్రహ్మ అన్ని పదార్ధాలలోనూ లోపల, బయట నిండి ఉంటుందని తెలుసుకోవాలి.
భావం:- బ్రహ్మకన్నా పరమైనది, మరొకటి లేదనడం వలన, ఆయమాది శబ్ద ప్రయోగాల వలన, అన్ని పదార్ధాలలోనూ లోపల, బయట నిండి ఉంటుందని తెలుసుకోవాలి.
వివరణ:- బ్రహ్మకన్నా భిన్నమైనది ఏది లేదని చెప్పడం చేత ఆత్మ యొక్క సర్వగతత్వం కూడా సిద్ధిస్తుంది. అట్లు కాకపోతే సిద్ధించదు. శ్రుతి, ఉపనిషత్వాక్యాల్లో బ్రహ్మం విభువు, వ్యాపకం, గొప్పది అని అనేక చోట్ల స్పష్టంగా వర్ణించారు.
ఋగ్వేదం (8, 4, 17, 3) :- బ్రహ్మం ఎంతో గొప్ప తత్వం.
ఛాందోగ్యోపనిషత్తు (3, 14, 3) :- పృధివి, అంతరిక్షం, దివం, లోకాలు వీటన్నింటి కన్నా బ్రహ్మం గొప్పది.
యజుర్వేదం(3, 2, 8) :- ఆబ్రహ్మ ఓతప్రోతం. ప్రాణుల్లో విభువు. బ్రహ్మం ఈ ప్రపంచానికి లోపలా, వెలుపలా ఉన్నది. బ్రహ్మకు సర్వగతత్వాది ధర్మాలు ఉండటంవలెనే ఈ ప్రపంచాన్ని సృష్టించడానికి, పోషించడానికి, లయం చెయ్యడానికి సమర్థుడైనాడు. కనుక బ్రహ్మయే అన్నింటి కన్నా మించిన పరతత్వమని సూత్రానికి అర్ధం. సేత్వాదులు (పరిచ్చినమైనవి) నిరాకరించడం వలన ఇతరమైన వాటి నిషేధాన్ని ఆశ్రయించడం బ్రహ్మకు భిన్నమైనది ఏదిలేదని చెప్పడం వలన ఆత్మయొక్క సర్వగతత్వం సిద్ధిస్తుంది. బ్రహ్మ కన్నా భిన్నమైన వస్తువులను నిషేదించక పోతే ఒక వస్తువు మరొక వస్తువు కంటే భిన్నం అవుతుంది. గాన ఘటం, పటం కంటే భిన్నమైనట్లు బ్రహ్మ యదార్ధమే అయినా ఇతర వస్తువుల కంటే భిన్నమని చెప్పాలి కదా! ఘటం ఉన్నా చోట పటం ఉండదు. పటం ఉన్న చోట ఘటం ఉండదు. అట్లే ఆత్మ కన్నా భిన్నమైన వస్తువులున్నాయి అని అంటే ఆ వస్తువులు ఉన్నచోట ఆత్మ ఉండదు. కనుక ఆత్మ సర్వ తత్వం కుదరదు. ఆత్మ సర్వగతమని ఆయామ శబ్దాల వలన తెలుస్తుంది. ఆయమ అంటే వ్యాప్తి, సర్వ వ్యాపకం అని అర్ధం. ఆ ఆత్మ అంతటా వ్యాపించినది. స్థిరమైనది. కదలనిది, అతి ప్రాచీనమైనది, సర్వదా ఉండేది. బ్రహ్మ ఎట్లు సత్యమో, జగత్తు కూడా సత్యమైతే జగత్తు ఉన్న చోట ఆత్మ ఉండటానికి వీలులేదు. ఆత్మ ఒక్కటే సత్యం. జగత్తు దాని మీద ఆరోపించబడింది. ఆత్మయే జగత్తుగా భాసిస్తోందని చెబితే ఆత్మకు సర్వ గతత్వం కుదురుతుంది. తాడు మీద పాము ఉన్నప్పుడు, ఆ పాము ఉన్న చోటు అంతటా తాడు ఉన్నట్లుగా, జగత్తుఉన్న స్థానంలో బ్రహ్మ ఉంది అని చెప్పవచ్చును. కనుక బ్రహ్మ సర్వగతానికి భంగం లేదు. స్తంభం, చెట్టు, గుట్టలు, జీవాత్మ, పంచభూతాలు అన్నీ స్థూలమూలే, వాటికి శబ్ద స్పర్శ రూప రస గంధాలు కలిస్తేనే అవి స్థూల పదార్ధములయ్యాయి. కనుక వాటికీ సర్వవ్యాపకత్వం కుదరదు. సూక్ష్మాతి సూక్ష్మమైన బ్రహ్మకి సర్వంతర్యామిగా, అపరిచ్చిన్నంగా, సర్వగతత్వం ఉంటుందని శ్రుతి వాక్యాల వలన నిర్ధారణ చేయబడింది. స్వర్గ లోకం కన్నా పెద్దది ఆత్మ. శ్రుతి ఉపనిషత్ వాక్యాల్లో బ్రహ్మం విభువు, వ్యాపకం, గొప్పది అని వర్ణించారు.
సూత్రం :- 356
" ఫల మత ఉపపత్తేః "
అతః - అన్నింటి కన్నా ఎంతో సూక్ష్మం అని బ్రహ్మాన్ని వర్ణించడం వలన, ఫలం :- ఆ బ్రహ్మమే జీవులు చేసే శుభ, అశుభ ఫలం ఇస్తాడని, ఉప పత్తేః :- సిద్ధిస్తోంది.
భావం :- అన్నింటి కన్నా సూక్ష్మం అని బ్రహ్మాన్ని వర్ణించడం వలన, ఆ బ్రహ్మమే జీవులకు శుభాశుభ ఫలాలు ఇస్తాడని సిద్ధిస్తోంది.
వివరణ:- గురుదేవా "మానవులు ఇష్టము, అనిష్ఠము, మిశ్రమము అని మూడు రకాల కర్మ ఫలాలను అనుభవిస్తున్నారు. ఈ కర్మఫలాలను ఇచ్చేవారు ఎవరు? అని కృష్ణశర్మ అడిగాడు. దానికి రత్నకరుడు సమాధానం చెబుతున్నాడు. ఉపపత్తి వలన కర్మ అనేది సర్వాధికారి, సర్వజ్ణుడు అయిన ఈశ్వరుడే సృష్టి , స్థితి, లయ కార్యములను చేస్తూ, దేశకాలవిశేషాలు తెలిసిన వాడవడం వలన కర్మలు చేసే వాళ్లకు వాళ్ళు చేసిన కర్మలకు ఫలితం ఇస్తాడు. జగజ్జన్మాది కారణమైన బ్రహ్మం వల్లనే జీవులు ఆచరించే శుభాశుభ కర్మలకు సుఖ దుఃఖ రూపాలైన ఫలాలు లభిస్తాయి. జీవులు నానా విధాలైన కర్మల్ని, నానాప్రదేశాల్లో, వివిధ కాలాలలో, వివిధ లోకాల్లో చేస్తారు. వాటన్నింటిని వాస్తవరూపంలో తెలిసిన వాడే వాటికి తగిన ఫలితాన్ని ఈయగలడు. అలాంటి శక్తి సామర్ధ్యలు ఉన్నవాడు ఈశ్వరుడే. ఆయన సర్వజ్ణుడు, సర్వంతర్యామి. కర్మయే ఫలాన్ని ఇస్తుందనే వాదన సరి అయినది కాదు. క్షణంలో నశించే కర్మ వలన కాలాంతరంలో ఉండే ఫలం లభిస్తుందని చెప్పడం ఉపపన్నం కాదు. అభావం వలన భావ వస్తువు పుట్టదుకదా! కర్మ నశిస్తూ దాని సమయంలోనే తనకు తగిన ఫలాన్ని ఇస్తూ నశిస్తుంది. దాని ఫలాన్నే కాలంతరంలో కర్త అనుభవిస్తాడు కదా! అనే సందేహం ఉంది. దానికి సమాధానం చెప్పబడింది. భోక్తతో సంబంధించడానికి పూర్వం అది ఫలం కాజాలదు. ఏ సుఖం, లేదా ఏ దుఃఖం ఏ కాలంలో ఆత్మ చేత అనుభవించ బడుతుందో అదే ఫలం అని లోకంలో ప్రసిద్ధంగా ఉంది. ఆత్మకు సంబంధించని సుఖాన్ని గాని, దుఃఖాన్ని గాని ఫలం అని లౌకిలులు ఎవరు భావించారు కదా! కర్మ చేసిన వెంటనే ఫలోత్పత్తి కలగక పోవచ్చును. కర్మకు కార్యమైన( కర్మ వలన పుట్టిన ) అపూర్వం వలన ఫలం పుడుతుంది అని శంక. కర్మ వలన పుట్టిన అపూర్వం వలన ఫలితం వస్తుందనడం యుక్తం కాదు. అచేతనమైన అపూర్వం ఒకటుందని చెప్పడానికి ప్రమాణం లేదు. అర్ధాపత్తి ప్రమాణం అన్నా సరికాదు. ఈశ్వర సిద్ధి చేతనే అర్ధాపత్తి క్షేణిస్తుంది. ఏదో ఒక యాగం చేస్తే స్వర్గం లభిస్తుందని శ్రుతి చెబుతుంది. శ్రుతి చెప్పినది అసత్యం కాదు. అనిత్యమైన కర్మ స్థిరమైన అపూర్వాన్ని పుట్టిస్తుంది. అది యాగం చేసిన వాని ఆత్మతో కలసి ఉండి తగిన దేశకాలాలలో ఫలితం ఇస్తుంది. అది అర్ధాపత్తి. కర్మ అనిత్యమైన దాని ఫలాన్ని ఈశ్వరుడు తగిన సమయంలో ఇస్తాడని అంగీకరించినా అర్ధాపత్తి సరిపోతుంది. ఈ అర్ధాపత్తి చేత ఈశ్వరుడు సిద్ధిస్తున్నాడు కనుక ఇది అపూర్వాన్ని సాధింప జాలదు. కర్మ ఫలం పరమేశ్వరుని వలననే కలుగుతుందని చెప్పడమే సమంజసంగా ఉంటుంది. ఈశిత అంటే అధికారం నెరపేవాడు, ఈశితవ్యుడు అంటే అధికారానికి లోబడి ఉండవలసినవాడు అనే వ్యావహారిక అవస్థలో బ్రహ్మనికే అధికారం ఉన్నట్లు వర్ణించబడింది.
సూత్రం :- 357
" శ్రుతత్వాచ్చ "
చ :- పైగా, శ్రుతత్వాత్ :- బ్రహ్మయే కర్మ ఫలదాత అని శ్రుతులు అంటున్నాయి.
భావం :- బ్రహ్మయే కర్మ ఫల ప్రధాత అని శ్రుతులు అంటున్నాయి.
వివరణ :- కర్మ ఫలాన్ని ఈశ్వరుడే ఇస్తాడని శ్రుతులు చెబుతున్నాయి. ఈశ్వరుడే ప్రాణులకు అన్నం ఇచ్చేది, ధనం ఇచ్చేది, భోగాన్ని ఇచ్చేది, కర్మ ఫలాన్ని ఇచ్చేది,
ఋగ్వేదం(1, 2, 2, 6):- ఓప్రకాశ స్వరూపా! నీవు దాతకు మేలు కలిగిస్తావు. ( 8, 1, 5, 1 ) :- నేను దాతకు భోజనం ప్రసాదిస్తాను, ఇలాంటి వేదం వాక్యాలు ఈశ్వరుడే కర్మ ఫల దాత అని ప్రత్తిపాదిస్తున్నాయి. అన్నం అంటే కర్మ ఫలం. ఇంద్రియాలకు విషయాలు అన్నం, దృశ్యం అన్నమే, ముక్కుకు వాసన ఇచ్చేది అన్నమే. ఈశ్వరుడే కర్మాధ్యక్షుడు, కర్మఫల ప్రదాత. ఏసభకైనా అధ్యక్షుడే కీలక పాత్ర పోషిస్తాడు. కర్మకు అధ్యక్షుడైన ఈశ్వరుడు జీవులు చేసుకున్న కర్మలను బట్టి స్వర్గ భోగాలు, నరకయాతనలు, మరల మరల జన్మలు సంభవించేలా చేస్తుంటాడు. జైమిని మహర్షి కర్మ ఫల ప్రదాత ఈశ్వరుడేనని అంగీకరించకుండా కర్మయే ఫలితాన్ని ఇస్తుందని చెప్పాడు. కర్మ నశిస్తుంది కదా! ఫలితం ఎలా వస్తుంది? నశించిన కర్మ ఎప్పుడో ఫలితం ఇవ్వడమేమిటి? అనే సందేహానికి సమాధానంగా అపూర్వ గురించి చెప్పాడు. యజ్ఞ యాగాదులు చేసేటప్పుడు హోమాగ్నిలో నెయ్యి, సమిధలు అన్నీ సమర్పించిన కర్త దేహన్ని విడిచిపెట్టిన తరువాత ఈ అపూర్వ(సూక్ష్మ శక్తి) అతనిని స్వర్గానికి తీసుకోనిపోతుంది. కర్మ ఇవ్వక పోయినా దాని వలన వచ్చిన అపూర్వ ఫలితాన్ని ఇస్తుందని జైమిని అభిప్రాయం.
సూత్రం :- 358
" ధర్మం జైమినిః అత ఏవ "
ఇది పూర్వ పక్ష సూత్రం. జైమినిః :- జైమిని మహర్షి, ధర్మం :- ధర్మాధర్మ శబ్దాలు సూచించే శుభాశుభ కర్మలు చేయడం వలన కలిగే సంస్కారాలు ఫలాన్ని ఇవ్వడం, అత ఏవ :- సరి అయినది అంటున్నాడు.
భావం :- పూర్వపక్షం వారి వాదన ప్రకారం జైమిని మహర్షి ధర్మాధర్మాలు సూచించే శుభాశుభ కర్మలు చెయ్యడం వలన కలిగే సంస్కారాలు ఫలితాన్ని ఇస్తాయనడం సరి అయినదే.
వివరణ:- జైమినిమహర్షి పూర్వ మీమాంస, వ్యాస మహర్షి ఉత్తర మీమాంస వ్రాశారు. జైమిని పూర్వ మీమాంసలో ఈశ్వరుణ్ణి అంగీకరించరు. ఈశ్వరుడు కాని, యాగాది క్రతువులు గాని ఫలాన్ని ఇవ్వరని కర్మల వలన కలిగిన అపూర్వం అనే సూక్ష్మ శక్తి ఫలితాన్ని ఇస్తుంది. యాగాది రూపమైన ధర్మమే ఫలితాన్ని ఇస్తుందని, కర్మ ఫలితాన్ని ఇవ్వదనే మాట వీరు కూడా అంగీకరిస్తున్నారు. బ్రహ్మం జీవుడు కర్మ చేయాలనుకొని ఫలం ఇస్తాడా? కర్మలను చేయకూడదని ఫలం ఇస్తాడా? కర్మల్ని చెయ్యకూడదనుకుంటే బ్రహ్మం స్వయంగా తన ఇష్ట ప్రకారం ఒకడికి సుఖం, మరొకడికి దుఃఖం, ఒకడికి తక్కువ, ఇంకొకడికి ఎక్కువ ఇచ్చినట్లు అవుతుంది కదా! ఇవి బ్రహ్మనికి పక్షపాతం, రాగ ద్వేషాలు ఆపాదిస్తాయి కదా! ఒకడికి తాను చేసిన కర్మలకు ఫలితాలు లభిస్తాయి కదా! ఇక బ్రహ్మం ఇందులో చేసే దేముంది? అందువలన బ్రహ్మ కర్మ ఫల ప్రదాత ఎలా అవుతాడు? ఆచార్యుడైన జైమిని ధర్మమే ఫలం ఇస్తుందని తలచుచున్నాడు."స్వర్గ కామోయ జేత "స్వర్గం మీద కోరిక ఉన్నవాడే యజ్ఞం చెయ్యాలి. యజ్ఞం చేసిన వారికి కర్మఫలం వలన స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది. అలా జరగకపోతే, యాగాన్ని అనుష్టించేవారు ఉండరు. అప్పుడు ఈ వ్యపదేశం వ్యర్థం అవుతుంది. క్షణ కాలంలో నశించే కర్మ వలన ఫలం కలగడం ఉపపన్నం కాదు అని వారి వాదన. సూర్యుడు స్వయంగా ప్రకాశిస్తూ, భూమిని ఆకర్షిస్తున్నాడు. భూమి సూర్యుని చుట్టూ తిరగడం వలన ఋతువులు ఏర్పడటం, పంటలు పండటం, ప్రాణులు తినడానికి వీలుగా తయారవుతున్నాయి. సకాలానికి దున్నడం వలన సరియైన సమయంలో పంటలు పండుతున్నాయి. దీనిలో బ్రహ్మ ప్రమేయం ఏమి లేదు కదా! కర్మ అనేది ఫలం లభించే సమయంలో ఉండక పోయినా ఆ కర్మ సంస్కారం ధర్మం, అధర్మ ఫలం లభించేంత వరకు ఉంటాయి కదా! కనుక కర్మలే ఫలాన్ని ఇస్తాయనడంలో తప్పేముంది అని పూర్వ పక్ష వాదన. దానిని వ్యాసుడు ఖండిస్తూ, సమాధానం చెబుతున్నాడు.
సూత్రం :- 359
" పూర్వంతు బాదరాయణో హేతు వ్యపదేశాత్ "
తు:- ఈవాదం సరియైనది కాదు. బాదరాయణః :- గ్రంథ కర్త అయిన వ్యాసుడు, హేతు వ్యపదేశాత్ :- దీనికి కారణం బ్రహ్మయే.
భావం:- కర్మలే ఫలితాన్ని ఇస్తాయనే వాదం సరైనదికాదు. గ్రంథకర్త అయిన వ్యాసుడు దీనికి కారణం బ్రహ్మ అని చెబుతున్నాడు.
వివరణ :- చేసిన కర్మలకు ఫలితాన్ని ఇచ్చేది ఈశ్వరుడే అంటారు బాదరాయణుడు. కర్మఫల ప్రదాత అన్నింటికీ కారణమైన బ్రహ్మమే కాని ఇతరమైనవి కావు.
సాంఖ్య దర్శనం ( 3, 56 ):- "స హి సర్వ విత్ సర్వ కర్తా " ఏ వాక్యాలు బ్రహ్మమే సర్వనికి కారణంగా కర్తగా నిర్దేశిస్తున్నాయి. అలాంటి బ్రహ్మం కర్మఫల రూప కార్యానికి కారణం ఎందుకు కాదు. బ్రహ్మం లోకాలను శాసించేవాడు. ఆయన శాసనాలను ఉల్లంఘించడం, చేతనాలకు గాని, అచేత నాలకు గాని శక్యం కాదు.
బృహదారణ్యకోపనిషత్తు(5, 6, 1):- బ్రహ్మం సర్వానికి అధిపతి. సర్వం శాసించే వాడు. సూర్య చంద్రులు ఆయన శాసనానికి విరుద్ధంగా ఓషధులు జనించవు. పంటలు పండవు. బ్రహ్మం వైషమ్య పక్షపాతాది దోషాలు లేనివాడు. జీవులు సత్కర్మలే చేయాలని తలపోస్తాడు. తదనుగుణంగా ఫలాలు ఇస్తాడు. ( 2, 5, 15 ) :- సర్వ భూతాధిపతి, అన్నీ భూతాలకు రాజైన పరబ్రహ్మమే కర్మఫల ప్రదాత. మరొకటి కాదని వైదిక సిద్ధాంతం. కర్మ స్వయంగా కాని, అపూర్వంగా కాని కర్మ ఫలానికి కారణం కాదు. ఈ రకంగా అన్ని కర్మలకు ఫలాన్ని ఇచ్చేవాడు బ్రహ్మ. కౌషీతకి ఉపనిషత్తులో ఆ పరమేశ్వరుడు ఎవరిని ఈ లోకంలో ఉద్ధరించాలనుకుంటాడో వారితో మంచి పనులు చేయిస్తాడు అని చెప్పబడింది. హేతు వ్యపదేశం వలన ధర్మాధర్మాలలో కూడా హేతువుగా ధర్మాన్ని, అధర్మాన్ని చేయించే హేతువు ఈశ్వరుడే.
భగవద్గీత:- ఏ యే భక్తుడు నా ఏయే స్వరూపాన్ని శ్రద్ధ తో పూజించడానికి కోరతాడో, ఆ యా భక్తునికి నిశ్చలమైన అలాంటి శ్రద్ధనే ఇస్తాను. అతడు ఆశ్రద్ధతో ఆస్వరూపాన్ని ఆరాధించడానికి కోరతాడు. దాని వలన నేనే సమకూర్చిన ఆయా కామాలను పొందుతాడు అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. సృష్టికి హేతువు ఈశ్వరుడే నని ఫలానికి హేతువు అనగా ప్రజలను వాళ్ళ వాళ్ళ కర్మలకు అపురూపంగా సృష్టిస్తాడు అని పూర్వ పక్షి వాదన సరియైనది కాదు. ఎందువలననగా ఈశ్వరుడు ఆ యా మానవులు చేసిన ప్రయత్నాన్ని బట్టి ఫలం ఇస్తాడు. పాపాత్ములు సుఖాలు అనుభవించడానికి, పుణ్యాత్ములు కష్టాలు అనుభవించడానికి కారణం పూర్వ జన్మలలో వాళ్లు చేసుకున్న పాప, పుణ్య కర్మల ఫలితములే. ఏ దేవతను ఆరాధిస్తే, ఆ దేవత కర్మలకు ఫలితం ఇస్తారని భావిస్తారు. పరమాత్మ సంకల్పంతోనే దేవతలు అనుగ్రస్తారనేది సత్యం.
తృతీయపాదం
సర్వ వేదాంత ప్రత్యయాధికరణం ( 3,3,1)
సూత్రం :- 360
" సర్వ వేదాంత ప్రత్యయం చోదనా ద్యవిశేషాత్ "
చోదనాది అవిశేషాత్ :- విధి మొదలైన వాటిలో ఏ భేదం లేనందు వలన, సర్వవేదంత ప్రత్యయం :- ఉపనిషత్తులన్నింటిలో పేర్కొన్న బ్రహ్మోపాసనలలో తేడా ఏమి లేదు.
భావం:-విధి మొదలైన వాటిలో ఏ భేదం లేనందువలన ఉపనిషత్తులన్నింటిలో పేర్కొన్న బ్రహ్మోపాసనలలో తేడా ఏమి లేదు.
వివరణ:- ఈ తృతీయధ్యాయంలో ఉపాసనల గురించి వివరించారు. కర్మలాగా ఉపాసన సైతం జ్ఞాన సాధనమే. వేదాంతంలో దహరోపాసన, శాండిల్యోపాసన, వైశ్వానరోపాసన లాంటి అనేక ఉపాసనలను వివరించారు. అవి ఒకదానికన్నా మరొకటి శ్రేష్ఠమా? లేక సమానమా? అనే విషయంతో బాటు బ్రహ్మోపాసన కూడా ఈ అధ్యయంలో మహర్షి వివరించారు. ఉపనిషత్తు లలో పేర్కొన్న బ్రహ్మోపాసనలలో తేడా ఏమి లేదు. వేదాంతాలు అంటే ఉపనిషత్తులు ఈశ, కేశ, కఠాది పది ఉపనిషత్తులలో వేదానుకూలాలు, ప్రమాణాలు. వీటిలో దహరం లాంటి పేర్లతో బ్రహ్మో పాసన విధించారు. వీటిలో తేడా ఏమి లేదు. చోదన అంటే విధి. ఈ విధిని ఉపాసీత(ఉపాసించాలి) ధ్యాయిత(ధ్యానించాలి), వేద(తెలుసుకోవాలి) అనే పదాలతో ఉపనిషత్తులలో బ్రహ్మోపాసన విధించారు. ఉపాసనలలోగాని, వాటివలన లభించే ఫలాలలోగాని భేదముండదు. ఛాందోగ్య, బృహదారణ్యకాల లో చెప్పిన ముఖ్యప్రాణోపాసన ఒక్కటే. రెండిటిలో ప్రాణం శ్రేష్టమే. జ్యేష్టం అని చెప్పబడింది. అటువంటి ప్రాణాలను గురించి తెలుసుకున్న వాడు జేష్టుడు, శ్రేష్ఠుడు అని చెప్పబడింది. అలాగే పంచాగ్ని విద్య, శాండిల్య విద్య, వైశ్వానర విద్యలు చెప్పబడ్డాయి. ఛాందోగులు దహరోపాసనకు గాని, శాండిల్య విద్యోపాసనకు గాని, వైశ్వానరోపాసనకు గాని, ఏఫలం వస్తుందో, అదే ఫలం కలుగుతుందని వాజసనేయ శాఖీయులు చెప్పారు. బ్రహ్మోపాసనకు ఫలం బ్రష్మ సాక్షాత్కారమే. గురువర్యా! అన్ని ఉపనిషత్తులలో చెప్పబడిన ఉపాసనలు ఒకటేనా? వేరు వేరా? అని అడిగాడు కృష్ణ శర్మ. సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. ఉపాసనలో ఉప అంటే సమీపంలో, ఆసన అంటే కూర్చుండుట. ఉపాసనలు రెండు రకాలు. సగుణోపాసన, నిర్గుణోపాసన.
సగుణోపాసన:- దేహభిమానం వలన కలిగి ఉన్నవానికి అవ్యక్తమైన నిర్గుణ పరబ్రహ్మం లభించడం కష్టం. పరమేశ్వరుడు అంతటా ఉన్నప్పటికీ ఆయన స్వరూపాన్ని ఎదురుగా చూస్తూ ఏకాగ్ర చిత్తంతో ఆరాదిస్తూ, మనస్సుని నిత్యం భగవంతునిపై నిలపడమే సగుణోపాసన.
నిర్గుణోపాసన:- నిరాకారుడు, నిర్గుణుడు సర్వవ్యాపి అయిన భగవంతుని యదార్ధ తత్వాన్ని తెలుసుకోవడానికి ముందుగా సగుణోపాసన చేస్తే చిత్త స్థైర్యం ఏర్పడుతుంది. ఆ తరువాత నిర్గుణో పాసనతో ఆత్మవిచారణ చేసి, ఆత్మజ్ఞానం పొంది ఆత్మగా మిగిలిపోవడమే మోక్షం. ఉపాసన విధానాలను బట్టి, వాటి ఫలితాలను రెండు రకాలుగా తెలియజేశారు. 1. దృష్ట ఫలితం, 2. అదృష్ట ఫలితం. ఇహలోకసౌఖ్యాలు దృష్ట ఫలితం.( కంటికి కనిపించేవి) ఏదైనా ఒక వృత్తి చేసినప్పుడు జీతం వస్తుంది. అది దృష్ట ఫలితం. ఆత్మ జ్ఞానం గురించి గురువుల ద్వారా శ్రవణం చేస్తారు. మననం చేస్తారు. దాని ఫలితం కనిపించదు.అది అదృష్ట ఫలితం. ఎపుడో అది గొప్పఫలితాన్ని ఇస్తుంది. వేదాంతశాస్త్రపఠనం అంత సులభమైన విషయం కాదు. చదవాలనే కోరిక ఉండాలి. చెప్పేవారుండాలి. చెప్పే గురువులు ఉన్నా వినాలనే మనసుండాలి. జీవుడు దైనందిన జీవితంలో ఎన్నో కర్మలుచేస్తూనే ఉంటాడు. అవన్నీ వదలిపెట్టి పోయే కర్మలే. వాటికొరకు జీవితాంతం శ్రమిస్తూ, సుఖదుఃఖాలకు లోనవుతారు. కాని మనతో వచ్చే కర్మలను కోసం ఎవరూ ఆలోచించరు. మానవుడు మాధవుడిగా, జీవుడు దేవుడిగా తెలియజేసే ఆత్మ జ్ఞానం ఎంతో గొప్పది. అవి పొంద లేనప్పుడు ఎంత తెలితేటలున్నా, శూన్యహస్తలతోనే ఈ లోకాన్ని విడిచిపెడతారు.
సూత్రం :- 361
" భేదాన్నేతి చేన్నైక స్యామపి "
భేదాత్ :- వేదాంత భేదం వలన, న ఇతి చేత్ :- అన్ని వేదాంతాల్లో విధించిన బ్రహ్మోపాసనల్లో భేదం లేదనడం పొరబాటు అంటారా? న :- అది సరియైనది కాదు. ఎందుకంటే ఏకస్యామ్ అపి :- ప్రతి ఉపనిషత్తులోనూ బ్రహ్మోపాసనలో తేడా లేదని ప్రతిపాదించారు. వేద :- తెలుసుకో, ధ్యాయిత :- ధ్యానం చెయ్యి అనే విధి వాక్యాల్లో తేడా లేనందుకు వలన, ఉపనిషత్తులలో ప్రతిపాదించిన బ్రహ్మోపాసనలో భేదం ఉండదా? ఉండదని అర్ధం.
భావం:-అన్ని వేదాంతాల్లో విధించిన బ్రహ్మోపాసనల్లో భేదం లేదనడం పొరబాటు అంటారా? అది సరియైనదికాదు. ప్రతి ఉపనిషత్తులో ప్రతిపాదించిన బ్రహ్మోపాసనలో తేడా లేదని ప్రతిపదించారు. తెలుసుకో, ధ్యానం చెయ్యి అని విధి వాక్యాల్లో తేడా లేనందువలన ఉపనిషత్తులలో ప్రతిపాదించిన బ్రహ్మోపాసనలో భేదం ఉండదా? అంటే ఉండడనే సిద్ధాంతం. ఒకే అర్ధాన్ని అనేక వాక్యాలు తెలియజేస్తాయి. కాని భిన్నార్దాలు తెలుపవు.
వివరణ:- ఇక్కడకూడా ఒక విశేషాన్ని అశంకించి పరిహరిస్తున్నారు. గుణ భేదం ఉండటం వలన విజ్ఞానాలకు భేదం ఉన్నది అన్నట్లయితే సరికాదు. ఒకే విద్యలో గుణభేదం కుదురుతుంది. ద్రవ్యభేదం, దేవతా భేదాలను బట్టి యాగంలో భేదం వస్తుంది. అలాగే వేద్యుడు, ఉపాసదేవత, విద్య వీటి వలనకూడా భేదం ఉంటుందనేది సరికాదు. విజ్ఞానాలతో గుణభేదం కనబడుచున్నది గాన వాటికి సర్వవేదాంత ప్రయత్నం కుదరదు. పంచాగ్ని విద్యలో బృహదారణ్యకంలో ఆరుఅగ్నులు ఆత్మ బోధ చెయ్యగా, ఛాందోగ్యంలో ఐదుఅగ్నులే చెప్పాయి. అందుచేత ఉపాసన భేదం, విధానంలో నానాత్వం వస్తున్నాయని వారి వాదన. ఇది నిజం కాదు. రూపభేదం, గుణభేదం కొద్దిగా ఉండవచ్చును. ఈ తేడాలు అంత ముఖ్యమైనవి కావు. అందువలన నానాత్వం సిద్ధించదు. గుణోపసంహారాన్ని గ్రహించడానికి కూడా వీలు లేదు. ఎందుచేతననగా 5 అనే సంఖ్యకు విరోధం వస్తుంది. గుణోపసంహారం అనగా ఒకే విద్యను (ఈ ఘట్టంలో విద్య, విజ్ఞానం, ఉపాసన, సమానార్ధకాలు) రెండు, మూడు శాఖలలో చెప్పినప్పుడు ఏదైనా ఒక శాఖలో అధికంగా చెప్పిన గుణాలను ఇతర శాఖలలోని విద్యలోనికి తెచ్చి, అన్వయించుకొనడం. ఇక్కడ ఛాందోగ్యులు 5 సంఖ్యతో ముగించిన తరువాత ఆరవ దానిని చేర్చి గుణోపసంహారం చెయ్యడం కుదరదని భావం. అట్లే ప్రాణ సంవాదంలో ఛాందోగులు శ్రేష్ఠ ప్రాణం కంటే భిన్నమైన వాక్కు, చక్షువు, మనస్సు అనే నాలుగు ప్రాణాలను పఠిస్తున్నారు. వాజసనేయులు అయితే రేతస్సును పఠిస్తున్నారు. ఆవాస, ఉద్వాస భేదాన్ని బట్టి వేద్యం భిన్నం అవుతుంది. ఆవాసం అనగా క్రొత్త దానిని చేర్చడం, ఉద్వాసం అనగా ఉన్నదానిని తీసివేయడం. ఒకే విద్యలో కూడా ఈ విధమైన గుణ భేదం ఉపపన్నమే. ఆరవదైన అగ్నిని ఉపసంహరించడం కుదరకపోయినా ద్యులోకం మొదలైన అగ్నులు కూడా రెండింటిలో గుర్తింప బడుతున్నాయి. కనుక విద్యా భేదం అనడానికి వీలు లేదు. ఛాందోగులకు, వాజస నేయులకు ఇద్దరికీ కూడా ఆరు అగ్నుల ఉపాసన ఉన్నదని చెప్పవచ్చును.
సూత్రం :- 362
" స్వాధ్యాయస్య తధా త్వేన హి సమాచారేధికారాచ్చ సవవచ్చ తన్నియమః "
స్వాధ్యాయస్య :- ముండకోపనిషత్తు అధ్యయనం చేయడానికి శిరోవ్రత ధారణ చెయ్యాలి. హి :- ఎందుకంటే, సమాచారే తధా త్వేన :- ఆ శాస్త్రాధ్యయన అనుష్టానానికి శిరోవ్రతం ధర్మం అని ప్రసిద్ధి ఉన్నది. అధికారాత్ :- శిరోవ్రతం ముండకోపనిషత్తు అధ్యాయానికి సంబంధించినది. చ :- అంతే కాక, సవత్ :- యజ్ఞంలో మంత్రం ఎలాగో, తత్ నియమః :- స్వాధ్యాయానికి శిరోవ్రతం నియమం.
భావం :- ముండకోపనిషత్తు అధ్యాయం చెయ్యడానికి శిరోవ్రత ధారణ చెయ్యాలి. ఎందుకంటే ఆ శాస్త్ర అధ్యయనానికి శిరోవ్రతం ధర్మం అని ప్రసిద్ధి ఉన్నది. అంతేకాక యజ్ఞం లో మంత్రం ఎలాగో, స్వాధ్యాయానికి శిరోవ్రతం నియమం.
వివరణ:- ఉపనిషత్తులు ఎన్నో ధర్మలను వర్ణించాయి. దీని వలన బ్రహ్మోపాసన భిన్నం కావచ్చును కదా! ముండనం అంటే శిరస్సుపై జుట్టును తొలగించుట అని అర్ధం. ముండనం చేయించుకోవడం ద్వారా అన్నీ కోరికలను పరిత్యజించి మోక్ష ప్రాప్తికి ప్రయత్నం ప్రారంభించడం, దానికొరకు సన్యాసం స్వీకరించడం జరుగుతుంది. అటువంటి మోక్షేచ్ఛ కలవారికి ఉపదేశాన్ని అందించే ఉపనిషత్తు ముండకోపనిషత్తు. ముండకోపనిషత్తులో బ్రహ్మవిద్యకు శిరోవ్రతం ధర్మంగా ఉపదేశించారు. శిరోవ్రతం బ్రహ్మ చర్యాది అనుష్టానాలలో ఒకటి. దానిని ముండకోపనిషత్తులో అధ్యయన ధర్మంగా చెప్పారు.
ముండకోపనిషత్తు(3,2,10):- విధిపూర్వకంగా శిరోవ్రతాన్ని చేసుకున్న వాళ్లకు ఈ బ్రహ్మవిద్యను బోధించాలి. అధర్వణికులు ఈవ్రతం చెబితే, వాజసనేయులు, ఛాందోగులు ఈధర్మం విధించలేదు. బ్రహ్మోపాసనలో తేడా లేకపోతే ప్రతి వేదాంతంలో వేరు వేరు ధర్మాలు ఎందుకు చెబుతారు? (3, 2, 11):- శిరోవ్రతం ఆచరించనివాడు ముండకోపనిషత్తును అధ్యయనం చెయ్యడు. ఈవాక్యం వలన శిరోవ్రతం అధ్యయనధర్మం అని తెలుస్తోంది. కనుక ఈవ్రతం బ్రహ్మవిద్యాధర్మం కాదు. స్వాధ్యాయనానికి సంబంధించినది. అలాగే యజ్ఞాలలో దేవతాస్మరణ నియామంగా చెయ్యాలి. అదే విధంగా ముండకోపనిషత్తు అధ్యాయానికి శిరోవ్రతం ఆచరించాలి. ఈధర్మం ఇతర ఉపనిషత్తులు చదవడానికి వర్తించదు. కనుక ఈవ్రతం అధ్యయన ధర్మమే కాని బ్రహ్మవిద్యాధర్మం కాదు. దేవి భాగవతం వంటి వాటిలో శిరోవ్రతం అనే ఉపాసన ఉన్నది. అది ముండకోపనిషత్తులో మాత్రమే చెప్పబడింది. ఇంకే ఉపనిషత్తులో చెప్పలేదు. కనుక ఉపాసనలో భేదం ఉందనడం సరికాదు. ఈ బ్రహ్మవిద్యను శిరో వ్రతం ఆచరించిన వాళ్ళకే చెప్పాలి. స్వాధ్యాయ ధర్మంగా ( ఒకరి స్వీయ అధ్యయన ధర్మంగా ) వేదం వ్రతాలను ఉపదేశించే ఒక గ్రంధంలో అధర్వణికులు ఇది కూడా వేదవ్రతంగా వ్యాఖ్యనించారు. శిరో వ్రతం ఆచరించని వారు దీనిని అధ్యయనం చేయలేరు. బ్రహ్మ విద్యను స్వీకరించలేరు. బ్రహ్మ విద్యను బోధించే గ్రంథమే ప్రకృతం గాన, ఈధర్మం గ్రంథవిశేషంతో మాత్రమే సంబంధిస్తుంది. ఇతర వేదాలలో చెప్పబడిన త్రేతాగ్నితో సంబంధించినది కాకపోవడం చేతను, ఇది అధర్వణికులకు మాత్రమే అని ఏ విధంగా నియమించడబడుచున్నదో అట్లే ఈ ధర్మం కూడా స్వాధ్యాయ విశేషంతో సంబంధం ఉండటం వలన, ఇది విద్యకు సంబంధించిన విషయం కాదు. విద్యా భేద హేతువు కాదు.
సూత్రం :- 363
" దర్శయతి చ "
చ :- అంతే కాక, దర్శయతి :- ప్రతి వేదంతంలోనూ, ఒకే బ్రహ్మం ఉపాస్యమని, బ్రహ్మోపాసనలో భేదం లేదని చెప్పారు.
భావం :- ప్రతి వేదాంతంలోను ఒకే బ్రహ్మం ఉపాస్యమని, బ్రహ్మోపాసనలో భేదం లేదని చెప్పారు.
వివరణ:-వేదాలలోకూడా వేద్యుడు అంటే తెలుసుకొనదగినవాడు. ఉపాసన ఒకటే అని చెప్పబడింది. వేదాలు, ఉపనిషత్తులు అన్నీ ఒకే బ్రహ్మోపాసనను ఉపదేశిస్తున్నాయి. అందుకే బ్రహ్మోపాసన అభిన్నమని గ్రహించాలి.కాబట్టి ఉపనిషత్తులలో రకరకాల ఉపాసనలు చేసినప్పటికి వాటిలో ఏకరూపత్వమున్నది.
ఋగ్వేదం(4, 4, 24, 1):- మహామహిమాన్వితుడు, సమస్త లోకాలు ధరించే వాడు, సకల జ్ఞాన ప్రకాశకుడు, అన్నింటి కన్నా గొప్ప తత్త్వమైన పరమాత్మిక జ్ఞానులు మనసుతో ధ్యానిస్తున్నారు. బుద్ధి వికసితం చేసుకుంటారు.
కఠోపనిషత్తు(5, 12 ):- సర్వ ప్రాణులకు అంతరాత్మ యై, అన్నింటిని వశంలో ఉంచుకునే వాడు ఒక్కడే.
శ్వేతాశ్వరోపనిషత్తు(6, 11):- సమస్త భూతాలలోనూ గూఢంగా ఉండే దేవుడొక్కడే. అన్ని వేదాల్లోను, ఉపనిషత్తులలోనూ ఒకే బ్రహ్మం ఉపాస్యం అని ఉపదేశించాయి. అందువలన ఉపనిషత్తులలో బోధించిన ఉపాసనా విద్యలు భిన్నం కావు. వాటి ప్రయోజనం ఒక్కటే. సమస్తవేదాలు ఏస్థానాన్ని నిర్గుణబ్రహ్మను బోదిస్తున్నాయో, అవే విద్యైకత్వాన్ని స్పష్టంగా ప్రతిపాది స్తున్నాయి. సర్వవేదాలలో నిర్గుణమైన, సగుణమైన తెలుకోదగినది ఒక్కటే బ్రహ్మం. ఒక శాఖలోని విషయం మరొకశాఖ లోనికి అన్వయించుకోవాలని సూచించారు. బ్రాహ్మణులు గొప్పదైన ఉక్థంలో శాస్త్రంలో ముఖ్యభాగంలో, అధ్వర్యువులు అగ్ని యందు, ఛాందోగులు మహావ్రతంలో చర్చిస్తున్నారు అని సర్వవేదాలలో వేద్యమైనది. "పరమేశ్వరుడు తల మీదకు ఎత్తబడిన భయంకరమైన వజ్రం "అని కారకంలో చెప్పబడిన ఈశ్వరగుణం భయహేతుకమై, నరుడు ఎప్పుడైతే ఈ అద్వితీయ బ్రహ్మయందు ఈషన్మాత్రం భేదంకూడా చూస్తాడో అప్పుడు వానికి భయం కలుగుతుందని తైతరీయంలో భేదాన్ని నిందించడానికి పరామర్శించడం మైనది. అట్లే వాజసనేయంలో ప్రాదేసికమాత్రంగా చెప్పబడిన వైశ్వానరుణ్ణి సిద్ధవత్తుగా అంగీకరించి పరామర్శించడం కనబడుతుంది. అట్లే సర్వవేదాంత ప్రత్యయములుగా ఒక శాఖలో విధించబడిన ఉక్థాదులను మరొక చోట ఉపాసనాదుల నిమిత్తం గ్రహించబడినది. ఉపనిషత్తులలో రకరకాల ఉపాసనలు చేసినప్పటికి వాటిలో ఏకరూపత్వం ఉన్నది.
ఉప సంహారాధికారణం ( 3, 3, 5 )
సూత్రం :- 364
" ఉప సంహారోర్ధా భేదాత్ విధి శేషవత్ సమానే చ "
సమానేచ :- అన్ని వేదాంతాలలో ఉపదేశించిన బ్రహ్మోపాసన ఒక్కటే. అర్ధ అభేదాత్ :- ప్రయోజనంలో కూడా భేదం లేదు. విధి శేషవత్ :- విధులైన అగ్ని హోత్రాది కర్మల్ని వేర్వేరు చోట్ల ఉపదేశించినా ఒక చోట సమన్వయం చేసుకోవాలి. ఉపసంహారం :- వివిధ శాఖలలో చెప్పిన గుణాలు ఒకే సంబంధం ఉన్నవని గుర్తించాలి.
భావం :- అన్ని వేదాంతాలలో ఉపదేశించిన బ్రహ్మోపాసన ఒక్కటే. ప్రయోజనం లో కూడా భేదం లేదు. విధులైన అగ్నిహోత్రాది కర్మల్ని వేర్వేరు చోట్ల ఉపదేశించినా ఒక చోట సమన్వయం చేసుకోవాలి. వివిధ శాఖలలో చెప్పిన గుణాలు ఒకే సంబంధం ఉన్నవని గ్రహించాలి.
వివరణ:- ఈఅధికరణంలో ఒక శాఖలోని గుణాలను వేరొక శాఖలోనికి అన్వయించడం గురించి తెలియజేశారు. విభిన్న ఉపనిషత్తులలో వివరించిన గుణాల్లో పరస్పర సంబంధం ఉంది. వివిధ శాఖలోని గుణాలను మనము సమన్వయం చేసుకోవాలి. వాటి ప్రయోజనాలలో తేడా ఏమి లేదు. అవన్నీ ఉపాసనకు ఉపకరిస్తాయి. ఉపసంహారం అంటే ఒక చోట చెప్పిన గుణాల్ని, ధర్మాన్ని ఇంకొక చోట అన్వయింపజెయ్యాలి. విభిన్న బ్రాహ్మణ శాఖల్లో వర్ణించిన అగ్నిహోత్రాది కర్మలన్నీ సమానమే. అలాగే ఉపాసనలో కూడా గుణోపసంహారం జరగాలి. ఉపాసనలో భేదం ఉండదు. ఒక శాఖలో కొన్ని ధర్మాలు చెబితే ఇంకొక శాఖలో ఉపసంహారం చేయవచ్చును. అంటే ఉపాసకుడు అన్నిశాఖలలోని గుణాలను నేర్చుకొని అన్వయింప జేయవచ్చును. ఇందులో దోషంలేదు. వేదాంతశాఖలలో భేదం లేనప్పుడు సమానమైన విద్యలో చెప్పబడిన గుణాలు ఆ శ్రుతికి మాత్రమే సంబంధించి ఉంటాయా? లేక ఒక చోటలేని వాటికి ఇతర శాఖల నుండి ఉపసంహరించాలా? అని సందేహం. బ్రహ్మ విద్యకు అక్కడ చెప్పిన గుణాలతో ఉపకారం సిద్ధిస్తున్నప్పుడు ఇతర శాఖలనుండి ఉపసంహారం అనావశ్యకం అని పూర్వపక్షవాదన. అలాంటప్పుడు వెనుక చేసిన విద్యైకత్వ విమర్శ అనావశ్యకం అని ఉపసంహారం చెయ్యాలని సిద్ధాంతం. ఇది గుణోపహారం వల్ల లభించే ప్రయోజనాన్ని చెప్పే సూత్రం. ఏ విధంగా సర్వవిజ్ఞానలు సర్వ వేదాంత ప్రత్యయాలు అనే విషయం నిశ్చితం. ఒక చోట చెప్పిన విజ్ఞాన గుణాలను సమానమైన మరొక విజ్ఞానంతో కూడా ఉప సంహారం జరుగుతుంది. ఈ రెండు విజ్ఞానాలలో భేదం లేదు. ఉపాసన లో వాటి ప్రయోజం ఒక్కటే. ఒక చోట విజ్ఞానానికి ఉపకారకమైన ఆ గుణాలు ఏ ప్రయోజనం ఉన్నదో, అదే రెండవచోట కూడా ఉన్నది. రెండుచోట్ల అదే ఉపాసన కదా! అగ్నిహోత్రాది విధికి అంగాలుగా ఉన్న ధర్మాలను అగ్నిహోత్రాది కర్మలు అభిన్నములవడం చేత అన్ని చోట్ల ఉపసంహరించడం ఎట్లో ఇక్కడ కూడా అంతే. అగ్ని హోత్రం అనే కర్మ ఒక్కటే. అయితే విజ్ఞానా భేదం ఉంటే మాత్రం ఆ గుణాలు మరొక విజ్ఞానంతో సంబంధించినవి అవడం చేత ప్రకృతి, వికృతి భావం లేకపోవడం చేత ఉపసంహారం ఉండదు. విజ్ఞానం ఒక్కటే అయితే ఉప సంహారం ఉంటుంది. కొన్ని యాగాలకు కావలసిన అంగాలన్నీ చెప్పబడతాయి. ఆ యాగాలకు ప్రకృతి యాగాలని పేరు. కొన్ని యాగాలకు కొన్ని అంగాలు మాత్రమే చెప్పబడతాయి. వీటికి వికృతి యాగాలు అని పేరు. ఇలా కొన్ని అంగాలు మాత్రమే చెప్పిన వికృతి యాగాన్ని ప్రకృతి యాగంలా చెయ్యాలి. అనగా వికృతి యాగానికి చెప్పకుండా విడిచిపెట్టిన అంగాలను ప్రకృతి నుండి గ్రహించాలి. రెండు విజ్ఞానాలు ఒక్కటే అయినప్పుడు వాటి మద్య ప్రకృతి వికృతి భావం లేదు. వివిధ శాఖలలో చెప్పిన గుణాలను మనం సమన్వయం చేసుకోవాలి.
అన్యధాత్వాధికరణం ( 3, 3, 6 )
సూత్రం :- 365
" అన్యధాత్వం శబ్దాదితి చేన్నా విశేషాత్ "
శబ్దాత్ :- ఉపాసనను విధించే శ్రుతి వాక్యం వలన, అన్య ధాత్వం :- ఒక శాఖలో చెప్పిన గుణాలు మరొక శాఖలో గ్రహించకూడదు, ఇతి చేత్ :- అని అనడం, న :- సరియైనది కాదు, అవిశేషాత్ :- బ్రహ్మనికి, ఆయన గుణాలకు భేదం లేదు.
భావం: ఉపాసనను విధించే శ్రుతి వాక్యం వలన ఒక శాఖలో చెప్పిన గుణాలు మరొక శాఖలో గ్రహించకూడదు అని అనడం సరియైనది కాదు. బ్రహ్మనికి, ఆయన గుణాలు భిన్నం కావు.
వివరణ:- ఛాందోగ్యం, బృహదారణ్యకం లో చెప్పిన ప్రాణవిద్యలు రెండు వేర్వేరు కాదు. వీటిలో ఇతరమైన అంశం ఏమి లేదు. ఉద్గీతను గురించి చెబుతూ ఛాందోగ్యంలో ఓంకారాన్ని ఉద్గీత దృష్టితో ఉపాశించాలి అని చెప్పారు. ఇక్కడ ఉద్గీత కర్మగా చెప్పబడింది. అదే బృహదారణ్యాకంలో ముఖ్యప్రాణాన్ని ఉద్గీత కర్తగా చెప్పబడింది. దేవతల కోసం ముఖ్య ప్రాణం ఉద్గానం చేసింది. ఉద్గీథ ఒక చోట కర్తగా, మరొక చోట కర్మగా చెప్పబడింది. కాబట్టి ఉద్గీథ విద్యలు భిన్నమైనవి అనే వారి వాదన సరియైనది కాదు. ఉద్గీథ లో ఉత్ అంటే ప్రాణం, గీత్ అంటే వాక్కు. ఇది ప్రణవ మంత్రం. ఆ ప్రాణం మూలంగానే ఈ జగత్తంతా స్థిరమై నిలబడి ఉంది. పరమాత్మను గానం చేసే గీతను ఓంకార అనే మంత్రరూపంలో జపించడమే ఉద్గీథం. ఉద్గోపాసన అంటే ఓంకారానుస్థానం. దేవతలకు దానవులకు యుద్ధం జరిగినప్పుడు దేవతలకు పరాజయం కలిగింది. ముక్కు ద్వారా సుగంధ దుర్గంధాల మిశ్రమ కర్మలకు ఫలితం కలిగిందే తప్ప అసురులను జయించే శక్తి పొందలేక పోయారు. దేవతలందరు వాక్కు, కళ్ళు, చెవులు, మనస్సు ద్వారా ఉద్గీతోపాసన చేయగా, అసురులు వాటన్నింటిని పాపాలతో తిప్పి కొట్టారు. అదెలాగంటే వాక్కు సత్యాన్ని, అసత్యాన్ని పలుకుతుంది. కళ్ళు అందమైన రూపాన్ని, పాపమైన కురూపాన్ని చూస్తుంది. చెవులు మంచిమాటలు, చెడుమాటలను వింటుంది. మనస్సు పాపాన్ని, పుణ్యాన్ని కూడా భావిస్తుంది. అందుకే దేవతలు అసురులను ఏమి చెయ్యలేక పోయారు. చివరగా దేవతలు ముఖ్యప్రాణాన్ని ఆధారంగా చేసుకొని ఉద్గీథోపాసన చేయగా, అసురులు దేవతలను ఏమి చెయ్యలేక వారే నశించిపోయారు. ఈ విధంగా ముఖ్య ప్రాణం గురించి జ్ఞానాన్ని సమృద్దిగా పొందిన వారికి ఎలాంటి పాపం అంటదు. అటువంటి వారికీ అపకారం చేయతలపెట్టినవాడు రాతి మీద కొట్టిన మట్టి ముద్దలా నాశనమై పోతాడు. ప్రణవోపాసన ఇంద్రియాల ద్వారా జరగలేదు. దేహంలోని ముఖ్య శక్తి అయిన ప్రాణాన్ని ఆధారంగా చేసుకొని ప్రణవోపాసన జరిగిందని స్పష్టంగా చెప్పబడింది.
ప్రాణ విద్య:- ఒకసారి ఇంద్రియాలన్నీ నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకున్నాయి. అన్నింటికన్నా మనస్సు నేనే ప్రధానమైన దానను అని తీర్పు కోసం బ్రహ్మ దగ్గరుకు వెళ్ళింది. బ్రహ్మ నేను తీర్పు చెప్పను. పాంచభౌతిక శరీరం నుండి ఒక్కొక్కటే బయటకు వెళ్ళండి. ఎవరు వీడితే చైతన్యం పోతుందో, శక్తి హీనులోతారో వారే గొప్పవారు అన్నాడట. ముందుగా వాక్కు బయటకు పోయి, ఏడాది తరువాత తిరిగి వచ్చి చూస్తే మిగతా అవయవాలన్నీ సక్రమంగానే పనిచేస్తున్నాయని, జీవక్రియలు జరగటంలోఎలాంటి ఇబ్బందులు లేవని గ్రహించింది. ఆ తరువాత పంచేంద్రియాలు ఒక్కొక్కటే శరీరాన్ని విడిచిపెట్టినా, యధాతధంగా మిగిలిన అవయవాలు పనిచేస్తూనే ఉన్నాయనీ, తాము గొప్పవారం కామని అర్ధం చేసుకున్నాయి. చివరిగా ప్రాణం వెళ్ళిపోయింది. శరీరం నిర్వీర్యం అయిపోయి, ఇంద్రియాలన్నీ అచేతనమయ్యాయి. దీనిని బట్టి ప్రాణం శ్రేష్ఠమైనది. ప్రాణమే బ్రహ్మం అని ఇంద్రియలాన్నీ అంగీకరించాయి. ప్రాణోపాసనలో ప్రాణంతో పరమాత్మను ఉపాసించడం. కౌషీతకి బ్రాహ్మణం లో ప్రాణ విద్యను గురించి వివరించారు.
శాండిల్య విద్య:- శాండిల్య విద్యను శాండిల్య మహర్షి చే బోధించబడింది. దీనిలో జగత్తునే పరమాత్మగా ఉపాసన చెయ్యడం. సర్వం ఖల్విదం బ్రహ్మ, కనిపించే జగత్తంతా పరమాత్మగానే ఉపాసన చెయ్యడం. జగత్తు పరమాత్మ నుంచి వచ్చింది, తిరిగి ఆయనలోనే కలసి పోతోంది. ఈ జగత్తు అశాశ్వతం కదా! అని సందేహం కలగవచ్చును. మనలో ఉన్న అజ్ఞానం వలన అది జగత్తుగా కనిపిస్తోంది, యదార్ధంగా అది పరమాత్మయే. ఇంద్రియాలను జయించి, నిశ్చలబుద్ధితో శాస్త్ర జ్ఞానంతో ఉపాసన చేస్తే సత్యం బోధపడుతుంది. రాయిని పరమాత్మగా చూసినట్లే జగత్తును పరమాత్మగా భావించి ఉపాసించాలి.
సత్యవిద్య:- వాజసనేయులు శతపధబ్రాహ్మణంలో సత్యమే బ్రహ్మమని తలచి ఉపాసన చేయాలనీ చెప్పారు. జ్ఞానం, ఆనందం లాంటి గుణాలు బ్రహ్మ స్వరూపమే. అయితే ఆయన నిర్గుణుడు అనడానికి కారణం సత్వరజస్థమో గుణాలులేని పరబ్రహ్మమే సత్య స్వరూపం.
సూత్రం :- 366
" న వా ప్రకరణ భేదాత్ పరోవరీయస్త్వాదివత్ "
ప్రకరణ భేదాత్ :- రెండు విధాలుగా వర్ణించడం వలన, న అన్య ధాత్వం :- గుణాల్ని గ్రహించడమే అని అనడం తగదు. అవిశేషాత్ :- ఉపాశించవలసిన తత్వంలో భేదం లేనందుకు వలన, పర అనరీయ స్త్వాదివత్ :- బ్రహ్మం అన్నింటి కన్నా గొప్పది అనే విషయంలో ఏవివాదం లేనందుకు వలన గుణగ్రహణం చేయవచ్చును. దీనికి పై సూత్రం నుంచి అన్యథాత్వం, అవిశేషాత్ అనేవి అనువృత్తులు.
భావం :- రెండు విధాలుగా వర్ణించడం వలన గుణాలను గ్రహించడమే అని అనడం తగదు. ఉపాసించవలసిన తత్త్వంలో భేదం లేనందు వలన బ్రహ్మం అన్నింటి కన్నా గొప్పది అనే విషయంలో వివాదం లేనందున గుణ గ్రహణం చేయవచ్చును.
వివరణ:- కొన్ని విద్యలు ఒకటిగా కనిపించినా అవి భిన్నములేనని ఈప్రకరణంలో తెలియజేశారు. రెండు విధాలుగా వర్ణించడం వలన గుణాలను గ్రహించలేము అని అనడం సరి కాదు. బ్రహ్మం అన్నింటి కన్నా గొప్పది అని విషయంలో ఏ వివాదం లేనందున, ఉపాసించవలసిన తత్త్వం లో భేదం లేనందున గుణ గ్రహణం చేయవచ్చును.
ఛాందోగ్యోపనిషత్తు ( 1, 6, 6 ):- ఉద్గీథ ఉపాసన రెండు రకాలుగా చెప్పడం జరిగింది.
1.హిరణ్యశ్మశ్రువు, హిరణ్యకేశుడై బ్రహ్మాన్ని ఉపాసించడం ఉద్గీత. 2.పరోవరీయాది (అంటే అన్నింటికన్నా గొప్పది) గుణాలతో కూడిన ఉద్గీథ ఉపాసన చెప్పారు. ఉపాసన ఒకే శాఖకు చెందిన ప్రకరణ భేదాన్ని బట్టి కొంచెం భేదం ఉన్నట్లు కనిపిస్తుంది. హిరణ్యశ్మశ్రుత్వాది గుణ విశిష్ట ఉపాసన ఒకటి, పరోవరీయస్త్వాది గుణవిశిష్ట ఉపాసన మరొకటి. ప్రకరణభేదం వలన, గుణ భేదం వలన ఉపాసనల్లో భేదం ఉన్నట్లు కనిపిస్తుంది. కాని వీటిలో బ్రహ్మ ఒక్కటే ఉపాస్య దైవం. ఛాందోగులు సృష్టి, స్థితి, లయలకు కర్తగా బ్రహ్మాన్ని సర్వం ఖల్విదం బ్రహ్మగా ఉపసించాలన్నారు. వాజసనేయులు శతపధబ్రాహ్మణంలో "సత్యం బ్రహ్మేతి ఉపాసీత " సత్య రూపంలో బ్రహ్మ ఉపాస్యుడన్నారు.
ఛాందొగ్యోపనిషత్తు(1, 2, 5 :- ప్రాణముద్గీతథ ముపాసాం చక్రిరే " ప్రాణం అంటే బ్రహ్మం. ఈ ఉపాసన ప్రాణం అనే నామంతో చేస్తారు. కనుక దీనిని ఉద్గీథం అన్నారు.(ఓం అనే అక్షరాన్ని ఉద్ గీథాన్ని అనగా ఉద్గీథంలో ఒక అవయవమైన ఓం అనే అక్షరాన్ని ఉపాసించాలి.)
బృహదారణ్యకం 1, 3, 1 నుంచి 24 వరకు ఉన్న ప్రసంగంలో ఉండే ప్రాణప్రదం బ్రహ్మ బోధకం. ఆ ప్రాణమే ఉద్గీంథం. ఉత్ అంటే ప్రాణం, గీథ్ అంటే వాక్కు ఆప్రాణం మూలంగా ఈజగత్తంతా స్థిరమై నిలిచివుంది. ఉద్గీథావయవమైన ఓంకారం ఉపాసించ దగినది అని ప్రస్తావించి దాని యందు రసతమం మొదలైన గుణాలను చెప్పి పృదవ్యాధి రసాలలో ఓంకారం రసవత్తరమైనది. ఇదియే ఆర్తి, సమృద్ధి అని ఓంకార గుణాలను చెప్పడం జరిగింది. ఈ విశ్వాశాన్ని ధరించే ప్రాణమే బ్రహ్మం. ఆయన్ని "ఓం " అనే వాక్కుతో గానం చెయ్యాలి. ఓం పదంతో ఉపాసించి బ్రహ్మాన్ని పొందడమే ఉద్గీథ విద్య.ఈ విద్యను ఛాందోగ్యం లో, బృహదారణ్యకం లో సమానంగా వర్ణించారు. వీటిలో చెప్పిన ఉపాసనల్లో ఎటువంటి తేడా కనిపించడం లేదు. ఉపనిషత్తులలో వర్ణించిన బ్రహ్మోపాసనలలో భేదం లేదు. అందువలన ఒకచోట వర్ణించిన గుణాలు మరొక చోట సంగ్రహించడంలో దోషం లేదు.
సూత్రం :- 367
" సంజ్ఞాతశ్చేత్త దుక్త మస్తి తు తదపి "
సంజ్ఞాతః :- అనేక సంజ్ఞల వలన, అన్వధాత్వం :- గుణాలను గ్రహించడం వీలు కాదని అనడం, న :- సరియైనది కాదు. తత్ ఉక్తం :- సమన్వయం చేసుకోవాలని ముందే చెప్పాము. అస్తి తు తదపి :- సంజ్ఞల ఐక్యత ప్రతి వేదాంతంలో ఉంది.
భావం :- అనేక సంజ్ఞల వలన గుణాలను గ్రహించడం వీలు కాదని అనడం సరియైనది కాదు. సంజ్ఞల ఐక్యత ప్రతి వేదాంతంలో ఉంది. దానిని సమన్వయం చేసుకోవాలి.
వివరణ :- ఉద్ గీథ, ఉపాసన ఒక్కటే అయినా అనేక నామాలతో విభిన్న ఉపాసనలు చెప్పారు కదా! అ ఉపాసనలు వేర్వేరు కదా! వేర్వేరు కాకపోతే వేర్వేరు నామాలు ఎందుకున్నాయి? అంటే ఉపాసనలను అనుసరించి ఉపాస్య దైవాన్ని వేర్వేరు పేర్లతో పిలుస్తారు. ఒకచోట బ్రహ్మం, ఇంకొక చోట వైశ్వానరుడు, మరొక చోట అక్షరం, అలాగే దహరం, జ్యోతి, ప్రాణం, భూమి, ఆకాశం అని అనేక నామాలతో ఉపాస్య దైవాన్ని ఆయా ఉపాసనలలో వ్యవహరిస్తారు. కాని ఉపాస్య దైవం ఒక్కరే. అయితే అది అనేకోపాసన అవుతుంది. లోకంలో ఒక వస్తువుకు అనేక పేర్లు ఉండవచ్చును. ఒక వ్యక్తిని మనిషి, బ్రాహ్మణుడు, వదాన్యుడు అని పిస్తున్నారు కదా! అలాగే జగజ్జన్మాది కారణం అయిన ఈశ్వరుడికి వైశ్వానరాది అనేక నామాలున్నాయి. " సర్వత్ర ప్రసిద్దోపదేశాత్ " (1, 2, 1)లో చెప్పినట్లు ఉపాసనా ప్రకరణంలో అంతటా ప్రసిద్ధమైన బ్రహ్మాన్నే ఉపాస్య దైవంగా ఉపదేసించడం వలన బ్రహ్మం అంటే పరబ్రహ్మం అనీ, పరమేశ్వరుడు అనీ గ్రహించాలి. వస్తువు గుణ కర్మ స్వరూప సంబంధాన్ని బట్టి అనేక సంఖ్యలుండటంతో భేదం లేదు. ఇలా ఉపాస్యం లో భేదం లేకపోవడం వలన ఉపాసన లో కూడా భేదం ఉండదు. సంజ్ఞకత్వం భిన్న విద్యలకు కూడా ఉన్నది. ఒకే సంజ్ఞ ఉండటం చేత విద్యైకత్వం న్యాయమైనది. రెండు చోట్ల కూడా ఉద్గీతవిద్య అని ఒకే సంజ్ఞ ఉన్నది కదా! అని అన్నట్లయితే అది కూడా ఉపపన్నం కాదు. వేర్వేరు విద్యలుగా నిశ్చితములైన పరోవరీయస్త్వాద్యుపాసనలలో ఉద్గీత విద్య అని ఒకే సంజ్ఞ కనబడుచున్నది. ఒకే పేరు ఉండటం చేత ఒకే ఒకే విద్య అనీ చెప్పవలసిన పని లేదు. సంజ్ఞ, ఉపాసన విద్య వేర్వేరు అయినప్పటికీ, ఒకే పేరుతో రెండు విద్యలలోభేదం ఉన్నప్పటికీ, ఉపాస్య దైవం బ్రహ్మం ఒక్కరే అనీ గ్రహించాలి.
వ్యాప్త్యధికరణం ( 3, 3, 9 )
సూత్రం :- 368
" వ్యాప్తేశ్చ సమంజసం "
చ :- అలా కాదు, వ్యాప్తేః :- బ్రహ్మ వ్యాపకం కనుక, సమంజసం :- అన్ని స్థానాలోనూ బ్రహ్మోపాసన తగినదే.
భావం :- బ్రహ్మ వ్యాపకం కనుక అన్ని స్థానాల్లోనూ బ్రహ్మోపాసన తగినదే.
వివరణ:-ఉపాసించవలసిన తత్త్వంలో భేదం లేనందున బ్రహ్మం అన్నిటికన్నా గొప్పదే. అన్ని స్థానాలలో బ్రహ్మోపాసన తగినదే. గురువుగారు! ఓంకారమనేది ఋగ్వేదం, యజర్వేదం, సామవేదాలు మూడింటిలో వ్యాప్తమై ఉన్నది కదా! కాబట్టి ఓంకారాన్ని ఏ వేదంలోని ప్రణవంగా గ్రహించాలి? అని అడిగాడు నారాయణ భట్టు. సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. ఉద్గీత అనేది ఓంకారానికి విశేషణం. అందుచేత సామవేదం లోని ప్రణవంగా గ్రహించాలి. ఓంకారం అన్ని వేదాలలో ప్రతి ఋక్కకు, ప్రతి అనువాకానికి ముందు, చివర కూడా ఉంటుంది. అయితే ఉద్గీతాన్ని ఓంకారానికి విశేషంగా చెప్పారు. కాబట్టి సామవేద అవయవంగా దీనిని ఉపాసించాలి. సంఖ్యా భేదం వలన బ్రహ్మోపాసనలో భేదం లేదంటున్నారు. కాని, ఆ బ్రహ్మోపాసన ఒకసారి హృదయంలో, మరొక చోట ఆదిత్యునిలో, ఇంకొక చోట అక్షిలో వేరే చోట అంతటా విధించారు. స్థాన భేదాన్ని బట్టి స్థానిక భేదం ఉంటుంది కదా! అయితే ఉపాస్యంలో భేదం, భిన్నత ఎందుకుండదు? దానికి సమాధానం చెప్పబడింది. మోక్షాన్ని ఆపేక్షించే వ్యక్తులకు విభిన్న రుచులు, భిన్న శక్తి యుక్తులు ఉంటాయి. కొందరికి హృదయంలో, మరికొందరికి ఆదిత్యునిలో, ఇంకొందరికి అక్షిలో, అన్యులకు సర్వత్రా బ్రహ్మాన్ని ఉపాసించడం రుచికరం కావచ్చును. యోగ్యతను అనుసరించి వాళ్ళు ఎక్కడ ఉపాసించినా దోషం లేదు. బ్రహ్మ సర్వ వ్యాపకం కదా! " ఓమిత్యే తదక్షర ముద్గీథ ముపాసీత " అనునప్పుడు అక్షరానికీ, ఉద్గీథానికీ ( అక్షరమే ఉద్ గీథమని) సమానార్ధం వినబడుచున్నది. దీనిని బట్టి అధ్యాసను గ్రహించాలా? అపవాదం గ్రహించాలా? ఏకత్వం గ్రహించాలా? విశేషత్వం గ్రహించాలా? అని నాలుగు పక్షాలు భాసించడం వలన ఏ పక్షం న్యాయమైనది అని విచారణ చేయబడినది. అధ్యాస అనగా రెండు వస్తువులను రెండు వస్తువులుగా గ్రహిస్తూనే, వాటిలో ఒకదాని యందు మరొకటి అనే బుద్ధి అభ్యసించబడుతుంది. చీకటిలో త్రాడును చూసి పాము అనుకుంటారు. త్రాటి యందు పాము అధ్యస్తము అంటే ఆరోపించబడుతోంది. ఒక వస్తువు నందు మరొక వస్తువును ఆరోపించుతే అధ్యాస. ఆకాశంలో చంద్రుడు ఒక్కడే ఉన్నా దృష్టిదోషం చేత రెండుగా కనిపిస్తుంది. ఎడారిలో నీరు లేకపోయినా ఎండమావులు కనిపిస్తాయి. అట్టి మిధ్యారోపమే అధ్యాస. విష్ణువు ప్రతిమ నందు విష్ణుత్వాన్ని ఆరోపించినా, అది ప్రతిమ అనే బుద్ధి కూడా ఆనువర్తిస్తూనే ఉంటుంది. అట్లే ఉద్గీథ మీద అక్షరబుద్ధి అభ్యసించబడుతుంది. లేదా అక్షరం మీద ఉద్ గీథ బుద్ధి అభ్యసించ బడుతుంది. అపవాదం అనగా ఒకవస్తువు మీద మిధ్యాబుద్ధి నిశ్చితంగా కలిగి తరువాత యదార్ధ బుద్ధి కలిగి పూర్వం ఏర్పడిన మిధ్యా బుద్ధి నశిస్తుంది. దేహేంద్రియసంఘాతం చేత జీవుడు తాను పరమాత్మ కన్నా వేరుగా ఉన్నాను అనే మిధ్యా బుద్ధి నశించి, తత్త్వమసి నేను నీవై ఉన్నాను అంటే జీవుడు, దేవుడు ఒక్కటే అనే యదార్ధ బుద్ధి కలుగడమే అపవాదం. ఆత్మయందు ఆత్మ బుద్ధి కలుగగా ముందు కలిగిన తరువాత మిద్యా బుద్ధి తొలగించ బడుతుంది. ఇక్కడ అక్షర బుద్ధి, ఉద్గీథ బుద్ధి ఒకదాని చేత మరొకటి నివర్తింప జేస్తుంది. సర్వత్రా బ్రహ్మం ఉండటం వలన యోగ్యతను అనుసరించి వారు ఎక్కడ ఉపాసించినా దోషం లేదు.
సర్వాది భేదాధికరణం ( 3, 3, 10 )
సూత్రం :- 369
" సర్వ భేదా దన్య త్రేమ్ "
సర్వఅభేదాత్ :- అన్ని వేదాంతాలలోనూ, బ్రహ్మోపాసన భిన్నం కానందువలన, ఇమే :- మున్ముందు వర్ణించబోయే బ్రహ్మం గుణాలు, అన్యత్ర :- ఇది వరకు వేరే స్థలాలలో వర్ణించిన గుణాల సారాంశం ఒక్కటే.
భావం:-అన్ని వేదాంతాలలో బ్రహ్మోపాసన భిన్నం కానందున మున్ముందు వర్ణించబోయే గుణాలు, ఇది వరకు వేరే స్థలాలలో వర్ణించిన గుణాల సారంశం ఒక్కటే.
వివరణ:- అన్నివేదాంతాలలో బ్రహ్మోపాసన ఒకచోట నిర్దేశించని గుణాలు, వేరేచోట నిర్దేశించినప్పుడు వాటిని బ్రహ్మోపాసనకు ఉపకరించే లాగా గ్రహించి స్వీకరించాలి. గురువుగారు! ప్రాణవిద్య అనేది బృహదారణ్యక, ఛాందోగ్యాలలో ఒక్కటే. అక్కడ ప్రాణమే శ్రేష్టమూ, జ్యేష్ఠమూ అని చెప్పబడినది. ఈ ఉపనిషత్తులలో ఇంద్రియాలకు కూడా వశిష్టాత్వాది గుణాలు చెప్పబడ్డాయి. అంటే
వాక్కుకు - సుస్థిరత్వం
చక్షువుకు - ప్రతిష్ఠాత్వం( చక్కగా నిలిచే శక్తి
శ్రోత్రానికి - సంపత్త్వం (ఇతరుల అభిప్రాయం తెలుకునే శక్తి )
మనస్సుకు - అవయవత్వం ( అన్ని ఇంద్రియాలకు ఆధారం )
రేతస్సుకు - జనిత్వం ( ఉత్పత్తి కారకం )
కౌశితకీ ఉపనిషత్తులో శ్రేష్ఠత్వం మాత్రమే చెప్పారు. కాని వశిస్థాది గుణాలు చెప్పలేదు. నేను వశిష్టుడనై ఉండటం అనేది ఏది కలదో, అందుచేత నువ్వు వశిష్టుడవైన్నావు, ఇత్యాది వాక్యాల చేత ప్రాణాన్ని తిరిగి ఇచ్చివేయబడినట్లు చెప్పబడింది.వాగ్మి సుఖంగా ఉంటాడు. వాక్కుకు సుస్థిరత్వం అనే గుణం, వశిష్టత్వం అనే గుణం ఉన్నాయి. కళ్ళు చక్కగా కలవాడు పాదాలను నిలుపుగలడు. అందుచేత చక్షువులో ప్రతిస్థాన అనే గుణం ఉంది. వినడం ద్వారా సమస్త ప్రయోజనాలు పొందవచ్చును. ఇతరుల అభిప్రాయాలను తెలుసుకోవచ్చును. అందుచేత శ్రోత్రంలో సంపత్ అనే గుణం ఉంది. మనస్సు అన్ని ఇంద్రియాలకు ఆధారం, సమస్త భోగాలకు ఆశ్రయం. అందువలన మనస్సుకు అవయవత్వము అనే గుణం ఉంది. ప్రాణం శ్రేష్టమని తలచిన వాగాదులన్నీ ఈ గుణాలను ప్రాణానికి అర్పించినట్లుగా రెండు శాఖలలోనూ వివరించాయి. ప్రాణ సంవాదం లో ప్రాణానికి శ్రేష్ఠత్వం చెప్పబడింది. కాని వశిష్టాది గుణాలు చెప్పబడలేదు. ఈ గుణాలను ఇతర స్థలాలలో చేర్చాలా? అక్కర లేదా? అనేది సంశయం. "ఏవం" అని ఉండటం చేత చేర్చవలసిన పని లేదని చెప్పబడింది. ఏవం అంటే 'దీనిని తెలుసుకొని' అని అర్ధం. ఇది వేద్యమైన వస్తువును, ప్రకృతి విద్యలో ఉన్న గుణాలను, దగ్గరగా ఉన్న వస్తువును మాత్రమే తెలుపడానికి సమర్ధంకాని ఇతరశాఖలలో ఇతరవిద్యలలో ఉన్న గుణసముదాయాన్ని చెప్పే సమర్ధత లేదు. అందుచేత శాఖాంతరాలలో ఉన్న వాటిని గ్రహించవలసిన పని లేదు. దేవదత్తుడు మరొక దేశం వెళ్ళినప్పుడు ఆగుణాలున్నవాడుగా అక్కడి వాళ్ల చేత గుర్తింప బడకపోయినా, ఆ గుణాలు లేనివాడైపోడు. కొంత పరిచయం ఏర్పడిన తరువాత ఆ దేశంలో కూడా ఏ విధంగా అతని గుణాలు గుర్తింపబడతాయో, అట్లే సంబంధాన్నిబట్టి ఒకశాఖలో ఉపాసించదగినవిగా చెప్పబడినవి మరొక శాఖలో చేర్చబడతాయి. అందువలన ప్రధానమైన ఒకే విజ్ఞానానికి సంబంధించిన ధర్మాలు ఒకే చోట చెప్పబడుకున్నా కూడా వాటిని అన్నీ ఉపసంహరించుకోరు.
ఆనందాధ్యధికరణం ( 3, 3, 11)
సూత్రం :- 370
" ఆనందాదయః ప్రధానస్య "
ప్రధానస్య:-చిదచిదాత్మకమైన సకలజగత్తుకు ముఖ్యడైన బ్రహ్మానికి, ఆనందాదయం:- ఆనందం, జ్ఞానంలాంటి గుణాలున్నాయి.
భావం :- చిదచిదాత్మకమైన సకల జగత్తుకు ముఖ్యడైన బ్రహ్మానికి ఆనందం, జ్ఞానం లాంటి లక్షణాలున్నాయి.
వివరణ:- బ్రహ్మస్వరూపం ప్రతిపాదించే శ్రుతులలో ఆనంద రూపత్వం, విజ్ఞాన రూపత్వం, సర్వగతత్వం మొదలైన కొన్ని బ్రహ్మకుసంబంధించిన ధర్మాలు కొన్నిచోట్ల వివరించబడుతున్నాయి. ఈఆనందాది ధర్మాలలో ఏవి ఎక్కడ వినబడు తున్నాయో వాటిని అక్కడ మాత్రమే గ్రహించాలా? లేక అన్నింటిని అన్ని చోట్ల గ్రహించాలా? అని సంశయం. ఈ సూత్రంలో ప్రధానం అంటే బ్రహ్మ. ఆరి అనే పదంతో జ్ఞానం, వ్యాపకత, సత్యం లాంటి గుణాలను గ్రహించాలి. ఈ గుణాలన్నీ బ్రహ్మ స్వరూపాన్ని బోధించేవే. ప్రధానమైన బ్రహ్మ యొక్క ఆనందం మొదలైన ధర్మాలన్నీ అన్ని స్థలాలలో గ్రహించాలి. వీటన్నిటిని తైత్తరీయంలో బాగా వివరించారు. ఈ గుణాలను సర్వత్రా గ్రహించడం వలన ఉపాసన ఫలజనకం అవుతుంది కనుక ఆనందత్వం మొదలైన ధర్మాలను సర్వత్ర అన్వయించుకోవచ్చును. ఉపనిషత్తులలో పరబ్రహ్మ నిర్గుణుడు, ఆనంద స్వరూపుడు, విజ్ఞాన రూపుడు, సద్రూపుడు, పూర్ణుడు అని చెప్పడం జరిగింది. వీటిలో కొన్ని ధర్మాలు కొన్ని చోట్ల చెప్పబడ్డాయి. అయినప్పటికీ ఉపనిషత్తులలో చెప్పదలచినది నిర్గుణ బ్రహ్మను గురించే కాబట్టి ఆ ధర్మాలు ఎక్కడ అవసరమైతే అక్కడ వాటిని చెప్పవచ్చును.
సూత్రం :- 371
" ప్రియశిరస్త్వాద్య ప్రాప్తి రుపచయా పచయోహి భేదే "
ప్రియ శిరః తు ఆది అప్రాప్తిః :- బ్రహ్మోపాసన లో ప్రియం, శిరస్సు మొదలైన వాటిని గ్రహించరు. హి :- ఎందుకంటే, ఉపచయ అపచయే :- వృద్ధి క్షయాలు, భేదే :- నానాత్మక భిన్న వస్తువులలో సంభవిస్తాయి.
భావం :- బ్రహ్మోపాసనలో ప్రియం, శిరస్సు మొదలైన వాటిని గ్రహించరు. ఎందుకంటే వృద్ధి క్షయాలు నానాత్మక భిన్న వస్తువులలో సంభవిస్తాయి.
వివరణ:- తైత్తరీయంలో ఆనందాది గుణాలను వర్ణించిన చోట ప్రియం, శిరస్సు లాంటి పదాల ప్రసక్తి ఉంది కదా? వాటిని కూడా బ్రహ్మోపాసనలో గ్రహించాలా? అనే ప్రశ్నకు వ్యాసుడు ఈ సూత్రంలో బదులిస్తున్నాడు.
తైత్తరీయెపనిషత్తు ( 2, 5 ):- బ్రహ్మకు ప్రియం శిరస్సు, మోదం దక్షిణ పక్షం, ప్రమోదం ఉత్తర పక్షం, ఆనందం ఆత్మ అన్నారు. బ్రహ్మోపాసనలో ఆనందాది గుణాలను గ్రహిస్తున్నాం కదా! ప్రియం, మోదం లాంటి వాటిని కూడా గ్రహించాలా? కొన్నింటిని గ్రహించి, మరికొన్నిటిని విడదీయడం సబబేనా? అని సందేహం. దానికి సమాధానం చెప్పబడింది. బ్రహ్మకు శిరస్సు పక్షం లాంటిది. వికల్పించారు. వాటికీ సంబంధించిన గుణాలకు వృద్ధిక్షయాలు ఉంటాయి. ప్రియం కన్నా మోదప్రమోదాలు ఎక్కువ. ప్రమోదం కన్నా ప్రియమోదాలు తక్కువ అవుతూ ఉంటాయి. కనుక ప్రియ మోదాలు జ్ఞానానందాల్లాగా బ్రహ్మ గుణాలు కానేరవు. శిరస్సు, పక్షం లాంటివి బ్రహ్మనికి కల్పితాలే కాని స్వాభావికాలు కాదు. ఇవి బ్రహ్మనికి స్వాభావిక గుణాలు కావు.
ప్రియము :- తన వారిని చూసినప్పుడు కలిగే ఆనందం,
మోదము :- కోరుకున్నది లభించినప్పుడు కలిగే సంతోషం.
ప్రమోదము :- మోదం ఎక్కువైనప్పుడు కలిగేది.
ఆనందం :- అన్నింటిని మించిన సంతోషం.
ప్రియము, మోదము, ప్రమోదం అనేవి సంతోషంలో హెచ్చుతగ్గులు, ఈధర్మాలను ప్రతి చోట చెప్పటానికి లేదు. ఇవి శోక ధర్మాలు మాత్రమేనని ప్రతిపాదించి యున్నారు. పరబ్రహ్మం మీద చిత్తం నిలపడంకోసం ఉపాయాలుగా మాత్రమే ఈ ధర్మాలు చెప్పబడ్డాయి. కాని వీటిని ఉపాసించాలి అనే ఉద్దేశ్యంతో చెప్పబడలేదు. ఈదృష్టితో చూస్తే కూడా ప్రియశిరస్త్వాదులు ఏవిధంగాను కూడా ఇతర స్థలాలలో ప్రాప్తించవు. అయితే ప్రియ శిరస్త్వాదులు బ్రహ్మ ధర్మాలు అని కల్పించుకొని ఆచార్యుడు ప్రియశిరస్త్వాద్యప్రాప్తి అని ఈన్యాయం చూపాడు. నిజానికి ఇవి బ్రహ్మ ధర్మాలు కావు. ఉపాస్య దైవం బ్రహ్మ ఒక్కయే అయినా కూడా ఉపసనా భేదాలు ఉండటం చేత ఒక చోట ఉన్న ధర్మాలు మరొక చోట ప్రాప్తించవు. ఒక స్త్రీ ఛత్రం చేత, మరొక స్త్రీ చామరం చేత ఇద్దరూ స్త్రీలు ఒకే రాజును ఉపాసించినప్పుడు ఉపాస్యుడు ఒకడే అయినా కూడా ఉపాసనలో భేదాలు, ధర్మాల వ్యవస్థ ఏ విధంగా ఉంటాయో, అట్లే ఇక్కడ కూడా సగుణబ్రహ్మ విషయంలో భేద వ్యవహారం ఉన్నప్పుడు గుణాలలో హెచ్చుతగ్గులు ఉండటానికి అవకాశం ఉంటుంది. కాని నిర్గుణపరబ్రహ్మ విషయంలో ఉండదు. అందువలన ఒక చోట వినబడుతున్న సత్య కామత్వాది ధర్మలకు మరొకచోట ప్రాప్తి లేదు.
సూత్రం :- 372
" ఇతరే త్వర్ధ సామాన్యాత్ "
ఇతరేతు :- ప్రియశిరస్త్వా దులు గాని, ఇతర ఆనందాది గుణాలు, అర్ధ సామాన్యాత్ :- బ్రహ్మ సామాన్యం కావటం వలన, అన్ని బ్రహ్మోపాసనలలో గ్రహిస్తారు.
భావం :- ప్రియశిరస్త్వాదులు గాని, ఇతర ఆనందాది గుణాలు గాని బ్రహ్మ సామాన్యం కావటం వలన అన్ని బ్రహ్మోపాసనలలో గ్రహిస్తారు.
వివరణ:- బ్రహ్మమనేది సర్వత్రా ఉండేదే. కాబట్టి ఆనందాది ధర్మాలు సర్వత్రా అన్వయింపవలసినదే. ఇలా అన్వయింపకపోతే బ్రహ్మతత్త్వాన్ని బోధించే మహావాక్యాల అర్ధం తెలియదు. అందుకనే ఆనందం, సత్యం లాంటి గుణాలను సర్వత్రా అన్వ యించుకోవాలి. బ్రహ్మ స్వరూపాన్ని ప్రతిపాదించడం కోసం మాత్రమే చెప్పబడుచున్న ఇతరములైన ఆనందాది ధర్మాలైతే, ప్రతిపాదింపదగిన బ్రహ్మ ఒకటే అవడం చేత అవన్ని కూడా అన్న చోట్ల తెలియ బడతాయి. ఆనందాదులు బ్రహ్మ స్వరూప బోధకాలు. బ్రహ్మానుబంధాలు. బ్రహ్మంతో బాటు గ్రహించవలసినవి. బ్రహ్మ సాక్షాత్కారం కలిగినప్పుడు ఆయన స్వరూపాలైన ఆనందాదిగుణాలు కూడా ప్రత్యక్షం అవుతాయి. కనుక వాటిని బ్రహ్మోపాసనలన్నిటిలోనూ గ్రహిస్తారు. వాటి ప్రయోజనం బ్రహ్మాన్ని తెలుసుకోవడం మాత్రమే.
అధ్యానాధికరణం ( 3, 3, 14 )
సూత్రం :- 373
" అధ్యానాయ ప్రజోజనాభావత్ "
అధ్యానాయ :- చింతన కొరకు బ్రహ్మాన్ని సకల పదార్ధ పరం అని చెప్పాడు. కాగా, ప్రయోజన అభావాత్ :- ప్రయోజనం లేనందువలన ఇంద్రియార్ధాదులలోని పరత్వాన్ని చెప్పలేదు.
భావం:- చింతన కొరకు బ్రహ్మాన్ని సకల పదార్ధపరం అని చెప్పాడు. ప్రయోజనం లేనందువలన ఇంద్రియార్ధాదులలోని పరత్వాన్ని చెప్పలేదు.
వివరణ:- ధ్యానపూర్వకమైన సాక్షాత్కారం కొరకు పురుషుడే పరుడుగా చెప్పబడుచున్నాడు. ఇంద్రియాదుల పరత్వం చెప్పబడటం లేదు. ఎందువలనంటే దాని వలన జ్ఞానప్రయోజనం లేదు. బ్రహ్మాన్ని ప్రాకృతిక పదార్ధాలన్నిటికన్నా పరం, ఉత్కృష్టం అని చెప్పారు. ఇది ఉపాసన కొరకే. మిగిలిన పదార్ధాలు ఇంద్రియాదులు వాటిలో ఉండే పరత్వం ఉపాసనకు లక్ష్యం కాదు. అందువలన వాటి పరత్వం ఆనందాదులలాగా ఉపాసనకు లక్ష్యం కాదు.
కఠోపనిషత్తు (3, 10, 11):- ఇంద్రియాల కన్నా శబ్ద స్పర్శాదులు సూక్ష్మాలు. వాటి కన్నా మనస్సు, దాని కన్నా అహంకారం, అంత కన్నా మహాత్తు, దాని కన్నా ప్రకృతిసూక్ష్మం. బ్రహ్మాన్ని మించిన సూక్ష్మం మరొకటి లేదు. బ్రహ్మం సూక్ష్మ తత్వాన్ని గ్రహించడానికి అనువుగా ఈక్రమం వివరించారు. బ్రహ్మోపాసనతో ఆనందాది గుణాల్లాగా సకలపదార్ధ పరత్వాన్ని గ్రహించాలా? అంటే ఇంద్రియాదిపదార్ధాల పరత్వం బ్రహ్మోపాసనలో ప్రయోజనకారి కాదు. కనుక ఆయా పదార్ధాల సూక్ష్మత్వం బ్రహ్మోపాసన సమయంలో గ్రహించవలసిన అవసరం లేదు. పదార్ధ పరతత్వ చింతన వలన కలిగే ప్రయోజనం వేరు. బ్రహ్మోపాసన వేరు. బ్రహ్మోపాసన ప్రయోజనం ముక్తి. పదార్ధ పరత్వ చింతన వలన ముక్తి కలుగదు. ఇక్కడ ఇంద్రియల కన్నా వాటి లక్షణాలు, వాటి కన్నా మనస్సు, మనస్సు కన్నా బుద్ధి, ఇలా ఒకదాని కన్నా ఒకటి ఎక్కువ చెప్పడం కాదు. ఇవి ఒకదాని కన్నా మరొకటి శ్రేష్ఠమైనవి అని చెప్పి పరమపురుష సాక్షాత్కారం పొందడమే ఇక్కడ లక్ష్యం. అన్నింటి కన్నా ఉత్కృష్టమైనవారు పురుషుడు. అతన్ని తెలుసుకున్న మరు క్షణమే ముక్తి కలుగుతుంది. జ్ఞాన పూర్వక సమ్యక్ జ్ఞానం కోసమే పురుషత్వం ఇక్కడ చెప్పబడింది. అంతే కాని మిగిలినవన్ని ఒకదాని కన్నా మరొకటి గొప్పది అనీ చెప్పడానికి కాదు. అలా చెప్పడం వలన ప్రయోజనం ఏమి లేదు. సకలానర్ధ సముదయాలకు అతీతుడైన పురుషుడు ఇంద్రియల కంటే పరుడుగా తెలియబడినట్లయితే మాత్రం మోక్షసిద్ధి రూపమైన ప్రయోజనం కనబడుచున్నది. ఆయా వస్తువులు పరమైనవి అని ధ్యానించడం సమ్యక్ దర్శనం కోసం చెప్పబడుచున్నది.
సూత్రం :- 374
" ఆత్మ శబ్దాచ్చ "
చ :- అంతే కాక, ఆత్మ శబ్దాచ్చ :- ఆత్మ శబ్ద ప్రయోగం వల్ల పరమాత్మ గూఢతను ప్రతిపాదించే కఠోపనిషత్తు వాక్యం వలన, ఉపాసనా స్థలాలలో బ్రహ్మ పరత్వాన్నే గ్రహించాలి.
భావం :- ఆత్మ శబ్ద ప్రయోగం వలన పరమాత్మ గూఢతను ప్రతిపాదించే కఠోపనిషత్తు వాక్యం వలన ఉపాసనా స్థలాలలో బ్రహ్మ పరత్వాన్ని గ్రహించాలి.
వివరణ:-ఇక్కడ ఆత్మశబ్దం ఉండటం వలనకూడా పురుషుడే తెలియదగినవాడు. కేవలం పురుషుణ్ణి ప్రతిపాదించడం కోసమే.
కఠోపనిషత్తు(3, 12):- ఆత్మ శబ్దవాచ్యు డైన ఆ పరమేశ్వరుడు సర్వభూతాలలో గూఢంగా ఉంటాడు. ఆయన్ని తెలుకోలేము అని ఆయన సూక్ష్మతను బోధించారు. బ్రహ్మ పరత్వమే ఇక్కడ సంగతం. ఇతర పదార్ధాల పరత్వం కాదు. బ్రహ్మ పరత్వమే ఉపాషనలో గ్రాహ్యం. ప్రకృత్వాదుల పరత్వం కాదు. ఉపనిషత్వాక్యంలో ఉన్న ఆత్మ శబ్ద ప్రయోగం ఇదే బోధిస్తుంది. కాగా గూఢాత్మలో ఆత్మ అంటే పరమాత్మ! జీవత్మా! తరువాత వాక్యం(3, 13) లో జీవాత్మ ప్రసక్తి వచ్చింది కదా! కఠోపనిషత్తులో చెప్పినట్లుగా ఆత్మ అనేది సూక్ష్మమైన బుద్ధితో మాత్రమే గ్రహింపబడుతుంది. ఈఆత్మ సర్వవస్తు జలమందు ఉన్నది. కాని పైకి కనిపించదు. సూక్ష్మ బుద్ధి కలవారు మాత్రమే దీనిని గుర్తించగలుగుతారు. వివేకవంతుడు ఇంద్రియాలను - మనస్సులో లీనం చెయ్యాలి. మనస్సును - బుద్ధిలో లీనం చెయ్యాలి. బుద్ధిని - మహాతత్త్వంలో లీనం చెయ్యాలి. మహతత్త్వాన్ని - ఆత్మలో లీనం చెయ్యాలి. ఇవన్నీ ఆత్మ జ్ఞానం కోసం చెప్పబడ్డాయి. కాని ఒకదానిని మించి ఒకటి గొప్పదని చెప్పడానికి కాదు. ఈ రకంగా పరుడైనవాడు పరమాత్మ. ప్రకృతుడైన పురుషుడు ఆత్మ అని చెప్పుచున్నది. దీనిని బట్టి మిగిలినవన్ని అనాత్మ పదార్ధాలని తెలుస్తున్నది. ఆ ఆత్మ తెలుసుకోవడం చాలా కష్టమని, సూక్ష్మ బుద్ధి కలవారికి మాత్రమే ఆత్మ తెలియదగినదని చెప్పుచున్నది. ఆ విషయమే సూత్రాలలో తెలియజేయబడింది. శ్రుతి యొక్క అనేక అభిప్రాయాలు పురుషుని యొక్క విషయంలోనే కాని ఇతరుల విషయం లో తెలియడం లేదు.
ఆత్మగృహీత్యధికరణము ( 3 , 3 , 16 )
సూత్రం 375
" ఆత్మ గృహితి రితర వదుక్తరాత్ "
ఆత్మ గృహితః :- ఆత్మ అనే శబ్ద ప్రయోగం, ఇతర వదత్ :- ఇతర వేదాంత వాక్యాల లాగా, ఉత్తరాత్ :- కఠోపనిషత్తులో తరువాత వచ్చిన వాక్యాన్ని బట్టి పరమాత్మకు వర్తిస్తుందని తెలుసుకోవాలి.
భావం :- ఆత్మ అనే శబ్ద ప్రయోగం ఇతర వేదాంత వాక్యాల లాగా కఠోపనిషత్తులో తరువాత వచ్చిన వాక్యాన్ని బట్టి పరమాత్మకు వర్తిస్తుందని తెలుసుకోవాలి.
వివరణ:- వేదాలయందు ఆత్మశబ్దానికి పరమాత్మ అని అర్ధం. అలాగే ఇక్కడ కూడా చెప్పాలి. సృష్టిరచన చెయ్యడం పరమాత్మ లక్షణం. అది పరమాత్మ ధర్మం కనుక ఆత్మ శబ్దానికి అర్ధం పరమాత్మయే. తైత్తరీయంలో ఆత్మ నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, మొదలైన భూతాలు పుట్టాయి అని చెప్పబడింది." గుడోత్మాన ప్రకాశవత్" అనే వాక్యంలో ఆత్మ పదం పరమాత్మ వాచకం. జీవాత్మకు సూచించదు.
కఠోపనిషత్తు(3, 13) :- ప్రాజ్ణుడు వాక్కును మనస్సుతో నియంత్రించాలి. ఆ మనస్సును జ్ఞానఆత్మలో నిరోధించాలి. జ్ఞాన ఆత్మను మహత్ ఆత్మలో నియమించాలి. ఆ మహాత్ ఆత్మను శాంత ఆత్మలో నియమించాలి. ఇక్కడ వాక్కు అన్నప్పుడు మిగతా జ్ఞానేంద్రియలని గ్రహించాలి. ఇంద్రియాలు బాహ్య ప్రపంచంలో తాము గ్రహించే విషయాలను మనస్సుకు అర్పిస్తాయి. అందువలన సాధకుడు ఇంద్రియలను మనస్సుతో నియంత్రించాలి. ఆమనస్సును అహంకారంతో, అహంకారాన్ని బుద్ధి తోను, నియంత్రించాలని చెప్పబడింది. ఇలా చిత్తవృత్తిలన్నింటిని నిరోధించి, శుద్ధమైన బుద్ధిని పరమాత్మలోలగ్నం చేసి, ప్రాజ్నుడు బ్రహ్మ సాక్షాత్కారం చేసుకుంటాడు. జీవుడు అంతర్యామి అయిన ఈశ్వరుణ్ణి తెలుసుకొనే స్థితిని ఇక్కడ బోధించారు. అలాంటి వాడినే ఆత్మదర్శి అంటారు.
అధర్వవేదం(10, 8, 44):- ధీరుడు, అజిరుడు, సర్వ శక్తిమంతుడు, సర్వజ్ణుడు, సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుణ్ణి ఎరిగిన వాడు మృత్యు రూప సంసార భయం నుండి తరిస్తాడు.
తైత్తరీయోపనిషత్తు(2, 1) :- ఆ ఈశ్వరుడి వలన ఆకాశాది భూతజాతం ఏర్పడింది. ప్రారంభంలో ఇదంతా ఒక్క ఆత్మ మాత్రమే ఉండేది. మరొకటి ఏది చలించలేదు. నేను ఈ లోకాలను సృష్టిస్తాను అని ఆలోచించి, స్వర్గాన్ని, అంతరిక్ష లోకాన్ని, మర్త్యలోకాన్ని, పాతాళ లోకాన్ని, భూలోకాన్ని సృజించాడు. లోకాల సృష్టి చెప్పడం చేత పరమాత్మ సృష్టి కర్త అని చెబితే, ముందుగా మహా భూత సృష్టి చెప్పాలి. కాని ఇక్కడ లోకాల సృష్టి చెప్పబడుతోంది. ఈలోకాలను నరాకారంలో ఉన్న హిరణ్య గర్భుని చేత చేయబడుచున్నదని శ్రుతులలో, స్మృతులలో చెప్పబడుచున్నది. అతడే పురుషుడని చెప్పబడుచున్నాడు. అతడే లోకాలను సృజంచిన బ్రహ్మ దేవుడని, దేవతల సృష్టి కర్త ప్రజాపతి అని, ఆత్మ శబ్దం కూడా ఈ ప్రజాపతి విషయంలో ప్రయోగింపబడింది.
సూత్రం :- 376
" అన్వయాదితి చేత్ స్యాదవధారయాత్ "
అన్వయాత్ :- అర్ధం పట్టి అన్వయం చేస్తే ఆత్మ శబ్దం బ్రహ్మం కాక జీవాత్మ అని గ్రహించవచ్చును. ఇతి చేత్ :- అంటారా! అది కాదు. అవధారణాత్ :- పూర్వపద ప్రసంగాన్ని బట్టి నిర్ధారిస్తే ఆత్మ శబ్దం, స్యాత్ :- పరమాత్మ బోధకం అవుతుంది.
భావం :- అర్ధాన్ని బట్టి అన్వయం చేస్తే ఆత్మ శబ్దం బ్రహ్మం కాక జీవాత్మ అని గ్రహించవచ్చును అంటారా? అది కాదు. పూర్వపద ప్రసంగాన్ని బట్టి నిర్ధారిస్తే ఆత్మ శబ్దం పరమాత్మ బోధకం అవుతుంది.
వివరణ:-లోకాలను సృష్టించడం పరమాత్మ పని కాదు, అది హిరణ్య గర్భుని పని అని కొందరి వాదన. అందుకనే హిరణ్య గర్భడు అని అర్ధం చెబితేనే బాగుంటుంది అని వారంటారు. ఇది తప్పు. సృష్టికి పూర్వం ఉన్నది పరమాత్మయే కాబట్టి ఇక్కడ ఆత్మఅంటే పరమాత్మ అనే అర్ధం చెప్పాలి. ఐతరేయంలో కూడా ఆత్మ అంటే పరమాత్మ అనే అర్ధం చెప్పారు. ఆత్మశబ్దానికి ఆత్ అనే ధాతువు, సాతత్యగమనం అని అర్ధం. ఆత్ ధాతువుకాక , ఆప్ + ఆ +దా, అద్ అనే ధాతువులు కూడా ఉన్నాయి. ఆప్ అంటే సర్వత్రా వ్యాపించడం. ఆ + దా అంటే అన్నింటిని గ్రహించడం. అన్నింటిని నియంత్రించడం. అద్ అంటే కారణ ప్రకృతిలో స్టూలప్రపంచాన్ని లయం చెయ్యడం అనే అర్ధాలు ఉన్నాయి. ఇవన్నీ పరమాత్మకే వర్తిస్తాయి. అత్ - సాతత్య గమనే అంటే నిరంతరంగా అంతటా ప్రాప్తంకావడం. ఇది పరమాత్మలక్షణం. ఆత్మఅంటే జీవాత్మ అనే అర్ధం ఉన్నా, పూర్వాపర ప్రసంగాన్ని బట్టి అన్వయం చేసుకోవాలి. వాక్యసమన్వయాన్ని ఆత్మశబ్దానికి హిరణ్యగర్భుడా? లేక పరమాత్మా అనే సందేహం కలుగుతుంది. హిరణ్యగర్భుణ్ణే గ్రహించాలి అనడం యుక్తం కాదు. ఉత్పత్తికి పూర్వం ఏకత్వాన్ని నిర్ధారించడం పరమాత్మను గ్రహిస్తేనే కుదురుతుంది. ఇక్కడ చెప్పిన లోక సృష్టిని ఇతర శ్రుతులలో ప్రసిద్ధమైన మహాభూత సృష్టి తరువాత జరిగిన దానినిగా అన్వయిస్తారు. అనగా పరమాత్మ ప్రప్రథమంగా లోకాలను సృష్టించాడు అని కాకుండా ప్రప్రథమంగా మహాభూతాలను సృష్టించి తరువాత లోకాలను సృష్టించాడు అని అన్వయిస్తాయి అని అర్ధం. ఒక శ్రుతిలో చెప్పిన విశేషాలను మరొక శ్రుతిలో ఉపసంహరించ వలసి ఉంటుంది. స్రష్ట పరమేశ్వరుడే. ముందు మహా భూతలను సృష్టించి, తరువాత లోకాలను సృజించి, నేను లేకుండా ఈ శరీరం ఎలా ఉంటుంది అని ఆలోచించి, ఈ శరీరంలో బ్రహ్మ రంద్రం ద్వారా సూక్ష్మ శరీరంతో ప్రవేశించాడు.
కఠోపనిషత్తు(1, 3, 13):- మంత్రంలో శాంత ఆత్మని అన్నచోట పరమాత్మ అర్ధ ప్రయోగమే అనే గ్రహించాలి. చివర్లో అశబ్దం, అస్పర్శం, అరూపం(3, 15)లో సందర్బాన్ని బట్టి చూస్తే అవి పరమాత్మని బోధించే గుణాలే. ఇలా బ్రహ్మస్వరూపాన్ని తెలిపే గుణాలు విభిన్నాలైనా, ఉపాసనల్లో వర్ణించడం వలన ఉపాసనల్లో ఏకత్వం సిద్ధిస్తుంది. ఉపాస్య తత్వం కూడా ఒక్క బ్రహ్మయే అని నిర్ణయమౌతుంది.ఎక్కడ ఏ అర్ధం ప్రయోగించాలో ప్రసంగపు పూర్వపరాల్ని విచారించి తెలుసుకోవాలి.
కార్యాఖ్యానాధికరణం ( 3, 3, 18 )
సూత్రం :- 377
" కార్యాఖ్యానా దపూర్వమ్ "
కార్యా ఆఖ్యానాత్ :- ఈ జగత్తంతా బ్రహ్మ కార్యంగా చెప్పారు కనుక, అపూర్వం :- బ్రహ్మ కారణ రహితం.
భావం:- ఈ జగత్తంతా బ్రహ్మ కార్యంగా చెప్పారు. కనుక బ్రహ్మ కారణ రహితం. ఈ దృశ్య మాన జగత్తంతా బ్రహ్మ నిర్మిత కార్యంగా ఎన్నో చోట్ల వ్యాఖ్యనించారు.
వివరణ:- అన్ని అనుష్టానాల శుద్ధికోసం ఆచమనాన్ని నిత్యకృత్యంగా వేదంలోను, పురాణాలలోనూ కూడా చెప్పబడింది. అందుకే ఉదకాన్ని వస్త్రంగా భావించడం విధేయం. అంతేతప్ప ఆచమనం కాదు. అన్నాన్ని ఉదకంతో కప్పడమనేది అపూర్వ మైన విషయం. కనుక అపూర్వమైన వస్త్రంగా భావించారు. అన్నాన్ని నగ్నంగా లేకుండా చేయటం అంటే కప్పటం అనే అపూర్వమైన ధ్యానం విధేయం.
మాండూక్య ఉపనిషత్తు ( 1,1,7 ) :- బ్రహ్మం సర్వానికి కారణం. అక్షర బ్రహ్మం వలన సృష్టి కాలంలో ఈ విశ్వం జనిస్తుంది.
శ్వేతాశ్వరోపనిషత్తు(6,16):-"సవిశ్వకృత్" ఆపరమేశ్వరుడే అన్నిటినీ ఉత్పన్నంచేసేవాడు. ఈవేదాంతవాక్యాలన్నీ ప్రపంచాన్ని బ్రహ్మకార్యంగా వర్ణిస్తున్నాయి. బ్రహ్మమే అన్నింటికీ కారణం కాని కార్యం కాదు. బ్రహ్మనికి మరొక కారణం లేదు. బ్రహ్మం అపూర్వం, కారణ రహితం. కనుక ఉపాసనల్లో బ్రహ్మ స్వరూప బోధకాలైన జ్ఞాన, ఆనందాది గుణాలనే కాక, అపూర్వత్వగుణాలను కూడా గ్రహీంచాలి.
బృహదారణ్యకోపనిషత్తు (2, 5, 19):- "తదే దద్ బ్రహ్మ అపూర్వ మన పర మనంతరం "అనే వాక్యంలో బ్రహ్మ అపూర్వం అనీ స్పష్టంగా తెలియజేశారు. ఛాందోగులు, వాజసనేయులు ప్రాణసంవాదంలో ప్రాణానికి అన్నంగా చెప్పడానికే ఉదకాన్ని వస్త్రంగా చెప్పారు. నాకు అన్నం ఏది? వస్త్రం ఏది? అని ప్రాణం వాగాదులను అడిగినప్పుడు శునకములు, క్రిముల వరకు సర్వప్రాణుల చేత భుజంపబడే అన్నం, ఉదకం, వస్త్రం అని చెప్పాయి. అందువలన ఛాందోగులు, వాజసనేయులు విద్వాంసు లైన శ్రోత్రియులు భుజించడానికి ముందు, భుజించిన తరువాత కూడా ఆచమనం చేస్తారు. ఆప్రాణాన్ని నగ్నం కానిదానిగా చేస్తున్నట్లు భావిస్తున్నారు. ఇక్కడ ఆచమనం, అనగ్నతా చింతనము తెలియబడుచున్నవి. ఈ అనగ్నతావాదం ఆచమన స్థితి కోసం చేయబడుచున్నది. ఆచమనం పవిత్రత్వం కొరకు చేసే మరొక క్రియ అని అంగీకరించబడింది. అయితే ఆచమనానికి ఉపయోగించిన జలాన్ని ప్రాణం ధరించడం కొరకు ఉపయోగించే వస్త్రంగా సంకల్పించడం అనే మరొక క్రియ అంగీకరించ బడుచున్నది.
సమానాధికరణము ( 3, 3, 19 )
సూత్రం :- 378
" సమాన ఏవం చాభేదాత్ "
చ:- అంతే కాక, ఏవం :- అపూర్వత్వం గుణం లాగే, అభేదాత్ :- ఉపాస్యం లో భేదం లేనందువలన, సమానః :- అపూర్వత్వానికి సమానమైన అనపరత్వాదుల్ని సైతం గ్రహించాలి.
భావం:- అపూర్వత్వం గుణంవలె ఉపాస్యం లో భేదం లేనందువలన, అపూర్వత్వానికి సమానమైన అన పరత్వాదుల్ని సైతం గ్రహించాలి.
వివరణ:- గురువర్యా! వాజసనేయ శాఖలోని శతపధ బ్రాహ్మణంలో, బృహదారణ్యకంలో శాండిల్య విద్య గురించి చెప్పారు. ఈ రెండు ఒక్కటేనా? వేరు వేరా? వివరించండి, అన్నాడు కృష్ణ శర్మ. వివరిస్తున్నాడు రత్నాకరుడు. రెండింటిలో చెప్పిన విద్య ఒక్కటే. ఉపాస్య వస్తువు ఒక్కటే. విద్యా భేదం లేదు. శతపథ బ్రాహ్మణంలో అనేక గుణాలు చెప్పబడ్డాయి. కాబట్టి అది ఉత్పత్తి విధి. ఆ విద్య విధి విహితము. బృహదారణ్యకంలో గుణ విధి. రెండు విద్యలు సమానమే.
బృహదారణ్యకోపనిషత్తు(2,5,19):- కార్యం లేనిది అనపరం. మట్టికి ఘటం కార్యం. అలా బ్రహ్మం కార్యంగామారదు. అంతరాళంలో దేనికి మధ్యలో విభజించని వస్తువు ఉండదో అది అనంతరం. బ్రహ్మం మధ్యలో ఖాళీ ఉండదు. బ్రహ్మం అఖండం, అవిభజ్యం. బ్రహ్మానికి వెలుపల ఏవస్తువు లేదు. బ్రహ్మం పూర్ణం. కనుక ఆయనకు బయటా, లోపలా అనే వ్యవహారం ఉండదు. సర్వాన్ని ఎరిగిన వాడు. అందువలన అపూర్వత్వం లాగా, అనపరాత్వాదుల్ని కూడా బ్రహ్మోపాసన విద్యలో సర్వత్రా గ్రహించాలి. ఆ గుణానికి సమానమైన అనపరత్వం గుణాలు కూడా గ్రహించాలి. అవి కూడా బ్రహ్మం గుణాలే. బ్రహ్మనికి మనోమయుడు, ప్రాణ శరీరుడు,కాంతి రూపుడు, అనే గుణాలు కలిగిన ఆత్మను ఉపాసించాలి. బృహదా రణ్యకంలో మనోమయుడు, కాంతి రూపుడు, సత్యమైన వాడు, హృదయంలో వ్రీహి వలె యవ వలె వున్నవాడు, సర్వానికి ఈశుడు అని వర్ణించారు. రెండు శాఖలు వేరైనప్పుడు అధ్యయనం చేసేవారు, వేరుగా ఉంటారు. ఒక శాఖలో చెప్పిన విద్యను మరొక శాఖలో చెప్పకపోతే ఆ శాఖ చదవని వారికి తెలియదు. అందుకే పునరుక్తవ్య దోషం లేదని గ్రహించాలి. ప్రాణ సంవాదంలో ఒక చోట అధికంగా ఉన్న గుణాలు మరొక చోట ఉపసంహరింపబడతాయి. విద్య ఒక్కటే అయితే పౌనరుక్య దోషాన్ని పరిహరించడం శక్యం కాదు. రెండింటిలో సమానంగా ఉన్న మనోమయత్వం లాంటి గుణాలు పఠించబడతాయి.
సంబంధాధికరణం ( 3, 3, 20 )
సూత్రం :- 379
" సంబంధా దేవ మన్య త్రాపి "
సంబంధాత్ :- గుణ, గుణి సంబంధం వలన, ఏవం :- వేదాంత వాక్యాల్లో అక్కడక్కడ వర్ణించిన గుణాలను బ్రహ్మోపాసనలో గ్రహిస్తున్నాం కదా! అలాగే, అన్యత్ర అపి :- వేదాంతాల కన్నా భిన్నమైన గ్రంధాల్లో ఉండే సాకారాత్వం లాంటి గుణాలను సైతం గ్రహించవచ్చా? అని శంక.
భావం :- గుణి గుణ సంబంధం వలన వేదాంత వాక్యాల్లో అక్కడక్కడ వర్ణించిన గుణాలను బ్రహ్మోపాసనలో గ్రహిస్తున్నాం కదా! అలాగే వేదాంతాల కన్నా భిన్నమైన గ్రంధాల్లో ఉండే సాకారత్వం లాంటి గుణాలను సైతం గ్రహించవచ్చా? అని శంక.
వివరణ:-ఇదొక సందేహసూత్రం. గురువర్యా! బృహదారణ్యకంలో సత్యబ్రహ్మోపాసన గురించి చెప్పారు. సత్యం అంటే పరబ్రహ్మ. సత్యం అనే మాటలో మూడు అక్షరాలు ఉన్నాయి. 1. స, 2. త్, 3. యం మొదటి, చివరి అక్షరాలు సత్యం. మధ్యలో అక్షరం అసత్యం, మృత్యువు. ఈ మూడింటిలో సత్యం బరువు ఎక్కువై, అసత్యం తేలిపోతుంది. ఈ విధంగా సత్యబ్రహ్మోపాసన చేసిన వానికి మృత్యువు అంటదు. సత్యం అంటే ఆదిత్యుడు. ఆదిత్య మండలంలోని పురుషుడే దక్షిణనేత్రంలో ఉన్న ఆదిత్యడు. తన కిరణాలతో కాంతిని ఇస్తున్న ఆదిత్యుడు కళ్ళ లోనే ఉన్నాడు. అలాగే కళ్ళలోని పురుషుడు ప్రాణాల ద్వారా ఉపకారం చేస్తూ, ఆదిత్య పురుషునిలో లీనమై ఉన్నాడు. ఆదిత్య మండలోని సూర్యుడు, నేత్రంలో ఉండే ఆదిత్యుడు ఒక్కరే. మరణ కాలంలో ఆదిత్యుడు తన కిరణాలను ఉపసం హరించుకోవడం వలన కళ్ళు తమ శక్తిని కోల్పోతాయి. ఆదిత్య మండలంలోని పురుషునికి వ్యాహృతులు, భూః - అనేది శిరస్సు, భువః-అనేది భుజాలు, సువః - అనేది పాదాలు. సత్య బ్రహ్మకు అహః అనేది రహస్య నామం. బ్రహ్మను ఈ విధంగా వ్యాహృతుల రూపంలో తెలుసుకొని ఉపాసన చేసి, పాపాలను వదలి వేసేవారు. ఆధ్యాత్మికానికి రెండు రహస్య నామాలు చెప్పబడ్డాయి. అధి దైవతం లో అహః, ఆధ్యాత్మికంలో అహం, అది అక్షి పురుషుని పేరు. సత్యవిద్యలో నామవ్యవస్థను బట్టి ధ్యానం చెయ్యాలా? ఈరెండు పేర్లను ఆదిత్య, అక్షిపురుషులిద్దరికీ అన్వ యింప వచ్చునా? అని సంశయం. శతపధ బ్రాహ్మణం, శాండిల్య విద్య ఒకే శాఖకు సంబంధించినవి. ఒకే ఉపాసనకు సంబంధించినవి. ఈ రెండు విద్యలకు గుణోపసంహారం చెప్పబడింది. అలాగే సత్య విద్యలో చెప్పిన రెండు పేర్లు అహః, అహం ఉపసంహారం చేయ వచ్చునని వారి వాదన. సత్యపద వాచ్యుడైన ఆ హిరణ్యగర్భుడు ఉదకం నుండి పుట్టినట్లు చెప్పి, దానికి అంగంగా సత్యం అనే అక్షరాలు ఉపాసన చెప్పబడింది. ఆ సత్యమే ఆదిత్య మండలోని పురుషుడు, అక్షి స్థానం లోను ఉన్నదని చెప్పి, మళ్ళీ ఆదిత్య స్థాన గతి పురుషుణ్ణి ముందుకు తీసుకు వచ్చి భూర్బువవస్సువరో రూపమైన మూడు వ్యాహృతులు మూడు అంగాలుగా "అహం" అనే పేరు చెప్పబడింది. ఈ విధంగా అహః అనేది అధి దైవత నామం, అహం అనేది ఆధ్యాత్మ నామం. ఈ రెండు ఒకే విద్యతో సంబంధం ఉండటం వలన, రెండు ఉపనిషత్తులను రెండు చోట్ల పటించవచ్చును.
సూత్రం :- 380
" న వా విశేషాత్ "
వా :- అది సరియైనది కాదు. విశేషాత్ :- వేదాంత వాక్యాలు విశిష్టమైనవి. కనుక, న :- వేదాంతాలు కాని ఆధునిక గ్రంధాల్లో బ్రహ్మానికి ఆపాదించిన సాకరత్వాది గుణాలు ఉపాసన విద్యలో గ్రహించడం ఉచితం కాదు.
భావం :- వేదాంతాలు కాని ఆధునిక గ్రంధాల్లో ఆపాదించిన సాకరత్వాది గుణాలను ఉపాసన విద్యలో గ్రహించడం ఉచితం కాదు.
వివరణ:-వేదవేదాంగాలు బ్రహ్మాన్ని, ఆయన గుణాలను, యధాతధంగా వర్ణించడంలో సామర్ధ్యం ఉన్నవి. వేదాలు ఈశ్వరీయాలు. వేదాంగాలు ప్రధాన ఉపనిషత్తులు, ఋషి నిర్మితాలు. అవి వేదానుకూలాలు. అందులో వర్ణించిన బ్రహ్మం గుణాలు ప్రామాణికాలు. ఉపాసనలో గ్రాహ్యలు. బ్రహ్మానికి ఆకారం ఉన్నదని, బ్రహ్మం ఒక చోట ఉంటాడని, వర్ణించే వాక్యాలు స్వీకరణీయం కాదు. విద్యలకు రెండు స్థలాల్లో ప్రాప్తి లేదు.ఉపాసన వలన స్థాన విశేషాలను బట్టి రెండు చోట్ల ప్రాప్తి లేదు. అధి దైవికపురుషుణ్ణి ప్రస్థావించి వానికి ఉపనిషత్తు 'అహః' అనీ, ఆధ్యాత్మికపురుషుణ్ణి ప్రస్థావించి వానికి "అహం" అనీ ఉపనిషత్తు చెబుతున్నది. ఈ రెండు, స్థానాలను బట్టి చెబుతున్నవి. అలాంటప్పుడు రెండుచోట్ల ఎలా ప్రాప్తిస్తాయి? అనేది శంక. సత్యమైన బ్రహ్మకు రెండుస్థానాలు చెప్పడం చేత అధి దైవత పురుషుడు, ఆధ్యాత్మిక పురుషుడు కూడా ఒక్కరే. అవస్థావిశేషాన్ని బట్టి ఆపురుషుణ్ణి ఆఅవస్థలో ఉన్నప్పుడు మాత్రమే వర్ణించడం యుక్తంగా ఉంటుంది. ఆచార్యస్వరూపంలో మార్పులేకపోయినా ఆచార్యుడు కూర్చునిఉన్నప్పుడు ఏవిధమైన అనువర్తనం చెప్పబడిందో, అతను నిలబడి ఉన్నప్పుడు ఉండదు. నిలబడిఉన్నప్పుడు చెప్పిన అనువర్తనం కూర్చునిఉన్నప్పుడు ఉండదు. కనుక, అతని స్వరూపంలో భేదం ఉండదు. అతని స్వరూపానికి సంబంధించిన ధర్మానికి గ్రామాన్ని బట్టి, అరణ్యాన్ని బట్టి విశేషం ఉండదు. రెండు చోట్ల ధర్మం తుల్యంగానే ఉండవచ్చును. అందువలన రెండు ఉపనిషత్తులకు వ్యవస్థ ఉంటుంది. బ్రహ్మనికి ఆకారం ఉందని, ఒకే చోట ఉంటాడని వర్ణించే వాక్యాలు స్వీకరణీయం కావు. జన్మ, జరాది వికారాలుంటాయని చెప్పే అవాస్తవిక వర్ణనలు గ్రాహ్యం కావు. గుణి, గుణ సంబంధం వలన సాకారత్వాది గుణాలు ఉపాసనలో గ్రహించలనడం తగదు. ఏదైనా విషయంలో వైరుధ్యం వచ్చినప్పుడు వేదవేదంగాలను ప్రమాణంగా తీసుకోవాలి. అవైదిక గ్రంధాలను కాదు.
సూత్రం :- 381
" దర్శయతి చ "
చ :- పైగా, దర్శయతి :- బ్రహ్మం, బ్రహ్మం గుణాలు యధాతధంగా వర్ణించడంలో వేదవేదాంత వాక్యాలకు విశిష్టత ఉన్నది.
భావం :- బ్రహ్మం, బ్రహ్మం గుణాలు యధా తధంగా వర్ణించడంలో వేద, వేదాంత వాక్యాలకు విశిష్టత ఉన్నది.
వివరణ:- ఛాందోగ్యంలో ఆదిత్యాంతర్గత పురుషుని రూపం, కంటిలోని పురుషుని రూపం ఒక్కటిగా వర్ణించబడ్డాయి. అతని పేరే ఇతని పేరు అని ఆదిత్యపురుషుని లక్షణాలను, అక్షిపురుషునిలో ఆరోపించి చెప్పారు. ఈ విధమైన ఆరోపణ లేనిదే పరస్పర గుణ సంహారం కుదరదు. కాబట్టి ఇక్కడ ఇద్దరి పురుషులకు రెండు పేర్లకు ఉప సంహారం లేదు.
తైత్తరీయ బ్రాహ్మణం ( 3, 12, 9 ) :- వేదం తెలియని వాడు, స్వరూప స్వభావాల్లో గొప్ప దైన బ్రహ్మాన్ని తెలుసుకోలేడు. దీన్ని బట్టి వేదమే బ్రహ్మం. ఆయన గుణాలను బాగా బోధిస్తుందని తెలుస్తోంది.
ముండకోపనిషత్తు( 3, 2, 6) :- ఉపనిషత్తులలో వర్ణించిన పురుషుడి గురించి అడుగుతున్నాను. ఉపనిషత్తుల విజ్ఞానం మూలంగా బ్రహ్మస్వరూపాన్ని బాగా తెలిసినవాళ్ళుఅని, యాజ్ఞవల్కుడు లాంటి మహర్షులు చెప్పడం వలన, వేదవేదాంతా లలో బ్రహ్మస్వరూపాన్ని ప్రతిపాదించడంలో నిశ్చితంగా సమర్ధాలు. ఇతర గ్రంధాలు కానేరవు అని స్పష్టమౌతోంది. అయితే పురుషుడు ఒక్కడే అయినా స్థానాలువేరు కాబట్టి ఒకస్థానంలో ఉన్న పురుషుడికి చెప్పిన ధర్మాలు, మరొక స్థానంలో ఉన్న పురుషునకు వర్తించుననే అభిప్రాయం చేతనే వీని రూపాదులే వాని రూపాదులు, వాని రూపాదులే వీని రూపాదులు అని అతిదేశం చేయవలసి వచ్చింది. దీనిని బట్టి ఇలాంటి అతిదేశం లేకపోతే అవి పరస్పరం వర్తించవు అని సూచింపబడు తున్నది.
సంభృత్యధికరణం ( 3, 3, 23 )
సూత్రం :- 382
" సంభృతి ద్యు వ్యా ప్త్యపి చాతః "
చ :- కాగా, అతః :- ఉపాస్య భేదం లేనందువలన, సంభృతి ద్యువ్యాప్తి, అపి :- సంభృతి, ద్యువ్యాప్తి అనే గుణాలు కూడా బ్రహ్మోపాసనలో గ్రహించాలి.
భావం :- ఉపాస్య భేదం లేనందు వలన సంభృతి, ద్యు వ్యాప్తి అనే గుణాలు కూడా బ్రహ్మోపాసనలో గ్రహించాలి.
వివరణ:- సంభృతిఅంటే జగన్నిర్మాణం, రక్షణ, ఉపసంహారంలాంటి సమస్తశక్తులు ఉండటం, ద్యువ్యాప్తి అంటే లోకాలన్నిటిలో వ్యాపించడం, ఈరెండు గుణాలుకూడా అపూర్వత్వాది గుణాలవలె బ్రహ్మోపాసనలో గ్రాహ్యములే. పంచభూతాలను సృష్టించి నది బ్రహ్మే. అవి బ్రహ్మయొక్క శక్తి రూపాలు. కాబట్టి బ్రహ్మ మిక్కిలి శ్రేష్ఠమైనది. బ్రహ్మను ఎవరూ అతిక్రమించలేరు అని రాయణీయ శాఖ, ఛాందోగ్య శాఖ లోని భిలకాండ లో ఒక చోట బ్రహ్మం యొక్క వీర్యం సమృద్ధి, స్వర్గ వ్యాప్తి చెప్పబడింది. ఈ గుణలన్నీ ఈశాఖకు సంబంధించిన ఉపనిషత్తులందే చెప్పబడింది. ఇవి శాండిల్య విద్యలో అన్వయిస్తాయా? ఇవి, ఉపనిషత్తులలో చెప్పబడిన విద్యలు ఒకటేనా? అని సందేహం. స్థానబేధం వలన నామభేదం వచ్చినట్లుగా స్థానంభేదం వలెనే సంభృత్యాదులు శాండిల్య విద్య యందు ఉపసంహరించ బడవు. ఛాందోగ్యంలో నాఆత్మ హృదయంలో ఉన్నది అన్నారు. ఇంకొక చోట దాహరాకాశంలో ఉన్నది అన్నారు. ఉపకోశలవిద్యలో కంటి యందు కనిపించే పురుషుడు అని చెప్పారు. ఈ రకంగా వేరువేరు స్థానాలు చెప్పబడినా, సంభృత్యాది గుణాలు చెప్పబడ లేదు. కాబట్టి ఈ గుణాలకు పై విద్యాలలో ఉపసంహారం లేదు. రాణీయ శాఖ లోని బ్రహ్మగుణాలు ప్రత్యక్షోపాసనకు చెందినవి.
అధర్వణ వేదం:- (19, 3, 22, 21):- బ్రహ్మనికి జగదుత్పత్తి, స్థితి, లయలు చేసే శక్తులున్నాయి. పృథవి మొదలు కొని దివం వరకు ఉన్న సమస్తలోకాలలోనూ బ్రహ్మం వ్యాపించి ఉన్నాడు. ఇలా వేదాల్లో జగత్తుని పుట్టించి లయం చేసే అన్ని శక్తులు న్నాయని అన్ని లోకాలలోనూ వ్యాపించే సంభృతి, ద్యు వ్యాప్తి అనే గుణాలు వర్ణించారు. ఈ గుణలన్ని వర్ణించారు. ఈ గుణాలన్ని కూడా అపూర్వత్వాది గుణాల లాగా ఉపాసనల్లో గ్రహించాలి. రాణాయశాఖ వారి భిల గ్రంధంలో బ్రహ్మ కారణంగా గల ఆకాశోత్పాదనం, దేవాదుల ఉత్పత్తి, వీర్య సంభృతి, ద్యునివేశం మొదలైన విభూతులు పఠించబడుతున్నాయి. ఆ విద్యలలోనికి బ్రహ్మయొక్క విభూతులు, బ్రహ్మసంబంధం వలన ఉపసంహారం చేయవచ్చును. సంభృతి, ద్యువ్యాప్తి మొదలైన విభూతులు శాండిల్య విద్యలో ఉపసంహరించ కూడదు. అవి అధిదైవికమైనవి. అవి ఈ విద్యలో ఎలా ప్రాప్తిస్తాయి? అని సందేహం. అయతన విశేషాలు ఏమి లేని షోడశకళలు మొదలైన ఇతరమైన బ్రహ్మవిద్యలున్నాయి. ఇది నిజమే. ఇక్కడ సంభృత్యాదులను ఉపసంహరించక పోవడానికి ఒక విశేషం ఉంది. దూరంగా ఉన్న విద్యలు సమానమైన గుణాలను చెప్పడం వలన ఉపస్థాపితము లైనప్పుడు దూరంగా ఉన్న గుణాలు కూడా ఉప సంహరించబడతాయి. బ్రహ్మసంబంధం ఉండటం వలన ఇతర ప్రదేశాలలో ఉన్న విద్యలకు సంబంధం ఉండవచ్చును. బ్రహ్మ ఒకటే అయినా కూడా వేరు వేరు విభూతులను బట్టి వేరు వేరు విధాలుగా ఉపాసించబడుతుంది.
పురుష విద్యాధికరణం ( 3, 3, 24 )
సూత్రం :- 383
" పురుష విద్యాయా మివ చేత రేషా మనామ్నానాత్ "
పురుషవిద్యాయాం ఇవ:- పరమపురుషుడి ఉపాసనలో లాగా, ఇతరేషాం:- ఒకచోట వర్ణించిన గుణాలు కాక ఇతర గుణాలను, అనామ్నానాత్ :- మరొక చోట వర్ణించక పోయినా క్రోడీకరించి, సమన్వయం చేసుకొని, ప్రతి బ్రహ్మోపాసన లోను గ్రహించాలి.
భావం :- పరమ పురుషుడి ఉపాసానలో లాగా ఒకచోట వర్ణించిన గుణాలు కాక, ఇతర గుణాలను మరొక చోట వర్ణించక పోయినా క్రోడీకరించి, సమన్వయం చేసుకొని, ప్రతి బ్రహ్మోపాసనలో గ్రహించాలి.
వివరణ:- పురుషవిద్య అంటే పురుష ఉపాసన, విద్య అంటే ఉపాసన, పురుషుడు అంటే ఈశ్వరుడు, పరమ పురుషుడు, పరమాత్మ. "సహస్ర శీర్షాః పురుషః సాహస్రాక్షః " ఈ మంత్రంలో పురుషోపాసన ఉన్నది. ఈశ్వరుడి వ్యాపకత్వం గురించి వర్ణించింది. దీనిలో ఆనందాది గుణాల వర్ణన లేదు. అక్కడా, ఇక్కడా చెప్పిన గుణాలను సంగ్రహించుకొని ఉపాసించాలి. అలా ఇతరస్థలాలనుంచి గుణాలను గ్రహించడం వలన బ్రహ్మస్వరూపం సంపూర్ణంగా బోధపడుతుంది. పురుషయజ్ఞం మీద భిన్నాభిప్రాయాలున్నాయి. ఛాందోగ్యంలో, తాండినాయక, పైంగిరహస్యబ్రాహ్మణాల్లో పురుషయజ్ఞం గురించి చెప్పి, పురుషుడికి యజ్ఞ రూపం కల్పించారు.
ఛాందోగ్యోపనిషత్తు :- పురుష విద్య ఈ విధంగా చెప్పబడింది. పురుషుడే యజ్ఞం. అతని ఆయుర్ధాయం లో మొదటి 24 సం – ప్రాతత్సవనం, తరువాత 44 సం - మాధ్యందిన సవనం, చివరి 48 సం - తృతీయ సవనం. సవనం అంటే యజ్ఞంలో ఇచ్చే బలి. ఈ విద్యను ఎవరైతే తెలుసుకుంటారో వారు 116 సం. జీవిస్తారు. అతనికి ఆకలిదప్పికలు లేకపోవడం, ఇష్టమైన వస్తువులను తీసుకోకపోవడమే దీక్ష అని వివరించారు.
తైత్తరీయోపనిషత్తు:- యజమానే యజ్ఞం, భార్య - శ్రద్ధ, శరీరం - కట్టె, రొమ్ము - యజ్ఞ వేదిక, వక్ష స్థలం - వేడి, రోమాలు -బర్హిస్సు, శిఖ - వేదం ( దర్భాల కట్ట ), హృదయం - యూప స్థంభం, కామం - ఆజ్యం, కోపం - పశువు, తపస్సు - అగ్ని, శాంతింప జేసే దమం - దక్షిణ, వాక్కు - ఋత్విక్కు, ప్రాణం - ఉద్గీథ, చక్షుస్సు - అధ్వర్యువు, మనస్సు - బ్రహ్మ, శ్రోత్రం - అగ్నీత్, ఎంతవరకు జీవిస్తాడో అధి దీక్ష, తిన్నది హవిస్సు, త్రాగేది - సోమపానం, రమించడం - ఉపసరం, సంచరిస్తాడు, కూర్చుంటాడు, నిలబడతాడు, ఇది ప్రవర్గ్యం. తపోదానదికం చేస్తాడు. అది దక్షిణ రోగాదులు వచ్చినప్పుడు వసు రుద్రాదులను ప్రార్ధిస్తాడు. ఇది ఆశీర్వాదం. దీనిలో మంత్రాల ప్రయోగం చేయబడుతుంది. ముఖం ఆహవనీయాగ్ని, మాట్లాడటం - ఆహుతి, వీని విజ్ఞానం హోమం, సాయంకాలం, ప్రాతః కాలాలలో తింటాడు, అది సమిధలు, ప్రాతః, మధ్యాహ్న కాలాలు పవనాలు, అహోరాత్రాలు దర్శ పూర్ణ మాసాలు. అర్ధ మాసాలు, మాసాలు,చాతుర్మాశ్యలు, ఋతువులు, ఇవి పశు బంధాలు, సంవత్సరాలు - పరివత్సరాలు, ఇవి అహర్గణాలు. ఇది సర్వవేదనమైన యజ్ఞం. మరణమే - అవభృథ స్నానం.ఈ యజ్ఞానికి ఫలం 116 సం. జీవితం. తైత్తరీయం లో, ఛాందోగ్యం, తాండి నాయక శాఖలో చెప్పినవి పురుష విద్యలే. వీటిలో మరణమే అనుభృతం వంటి సమాన ధర్మాలు ఉన్నప్పటికీ తేడాలే ఎక్కువగా వున్నాయి. ఈ రెండు ఒక్కటి కాదు. ఒక శాఖలోని ధర్మాలు రెండవ దానిలో అన్వయించరాదు.
వేధాద్యధికరణం ( 3, 3, 25 )
సూత్రం :- 384
" వేధాద్యర్ధ భేదాత్ "
అర్ధ భేదాత్ :- ఏ ప్రయోజనం లేనందువలన, వేధాది :- భేదించడం, నాశనం చేయడం, లాంటి గుణాలను బ్రహ్మోపాసనలో గ్రహించరాదు.
భావం :- ఏ ప్రయోజనం లేనందుకు వలన భేదించడం, నాశనం చేయడం లాంటి గుణాలను బ్రహ్మోపాసనలో గ్రహించరాదు.
వివరణ:- గురుదేవా! ఉపనిషత్తులు ప్రారంభించేటప్పుడు అధర్వశాఖవారు ఓదేవతా! నా శత్రువుయొక్క సమస్త అవయవా లను ఛేదించు, హృదయాన్నిఛేదించు అంటూ శత్రుసంహార మంత్రాలను చదువుతారు. మిగిలిన ఏ శాఖలోనూ భగవంతుణ్ణి స్తుతిచేస్తూ, మనకు వరుణుడు, మిత్రుడు సుఖాలిచ్చు గాక! వంటి మంత్రాలు చదువుతారు. మరి వీటన్నింటిలో విద్యలో ఉపశమహరించు కోవచ్చునా? అని సందేహం వెలిబుచ్చాడు నారాయణభట్టు. సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. హృదయాన్ని ఛేదించు మొదలైన అభిచారిక మంత్రాలు, వీటి అర్ధంలో తేడా ఉన్నది. కాబట్టి వీటికి విద్యలోనూ, ఉపాసనలోనూ ఉపసంహారం లేదు.
ఋగ్వేదం(10, 87, 4):- ఓ తేజస్వరూప బ్రహ్మమా! మా యజ్ఞ ఉపాసనాదుల వలన నీవు ప్రసన్నుడివై, నీ బాణాల్ని వజ్ర సమానం చేసి, వాటితో రాక్షసుల హృదయాలను చేధించు, విరోధుల భుజాలను ఖండించు. (10, 87, 5):- ఓఅగ్నీ! రాక్షసుల చర్మం వలిచెయ్యి. నీవజ్రం వాళ్ళని చంపాలి గాక! తోడేళ్ల వంటివి వాళ్ళ మాంసఖండాలను ఎత్తుకు పోవుగాక! ఇలాంటి మంత్రాల్లో బ్రహ్మం దుష్టులను దండించే వైనం కనిపిస్తుంది. ఈ దుష్టహృదయ ఖేదన, దుష్టనాశ గుణాలను, బ్రహ్మోపాసనలో ఆనందవ్యాపకత్వాదిగుణాల్లా గ్రహించాలా? గ్రహించకూడదా? అనీ సందేహంవస్తే, వేదాంతదర్శకకర్త వ్యాసుడు గ్రహించరాదని చెబుతున్నాడు. బ్రహ్మోపాసనకు ఫలంముక్తి. శతృ సంహారం, దుష్టనాశనం కాదు. ముముక్షువులకు సౌమ్యభావం ఉండాలి. అప్పుడే ఆనందాది గుణాలతో కూడిన బ్రహ్మాన్ని ఉపాసిస్తూ ధ్యానిస్తాడు. కనుక వేధాది గుణాలను గ్రహించరాదు. అగ్ని ష్టోమ బ్రాహ్మణంలో అగ్నిష్టోమమే బ్రహ్మ. అగ్నిష్టోమం చేసే దివసం బ్రహ్మ. అందుచేత ఈ దివసంలో సాధించవలసిన కర్మను ఎవరు చేస్తారో వాళ్ళు ఆబ్రహ్మ అనే సాధనం చేత బ్రహ్మనే పొందుతారు. క్రమంగా మోక్షం పొందుతారు. ఛాందోగ్యంలో పుత్రునికి దీర్ఘాయువు కొరకు త్రిలోకాలను ఒక కోశంగా ఉపాసన చెప్పబడింది. "భూః ప్రపద్యే " తండ్రి పఠించే ప్రార్ధన మంత్రం. పుత్రుని పేరు మూడుసార్లు చెప్పబడుతుంది. ఈ ఫలానాపుత్రునితో కలసి ఈ భూలోకాన్ని, పరలోకాన్ని కూడా పొందుదురు గాక! అని దీని అర్ధం. అందువలన ఉపాసనా విద్యలలో కూడా మంత్రాలు అంగాలుగా ఉండటం కనబడుచున్నది. ఏ మంత్రం ఏ కర్మ యందు వినియోగించాలి. ఏది దేనికి అంగము అని నిర్ణయించడానికి శ్రుతి, లింగం, ప్రకరణం, స్థానం, సమాఖ్య అనేవి ఉపయోగిస్తాయి.
హాన్యాధికరణం ( 3, 3, 26 )
సూత్రం :- 385
" హానౌ తూపాయన శబ్ద శేషత్వాత్ కుశాచ్ఛంద్ర స్తుత్యుప గానవత్ తదుక్తం "
హానౌ :- త్యాగం, విడిచిపెట్టడం, ఉపాయన శబ్ద :- ఉపాదానం, శేషత్వాత్ :- సాన్నిద్యం, కుశా :- ఛందస్తుతి, ఉప గానవత్ :- కుశ, ఛంద స్తుతి, ఉపగాన శబ్దాలకు ఔందు బర్యాది శబ్దాల సామీప్యం వలన అర్ధాన్ని గ్రహించాలి. తదుక్తం :- పూర్వ మీమాంస అంటున్నది.
భావం :- త్యాగం, విడిచిపెట్టడం, సాన్నిధ్యం, ఛందస్తుతి, ఉపగాన శబ్దాలకు ఔందు బర్యాది శబ్దాల సామీప్యం వలన అర్ధాన్ని గ్రహించాలని పూర్వ మీమాంస అంటున్నది.
వివరణ:- ఇది కఠిన మైన సూత్రం. జాగ్రత్తగా చదివి అర్ధం చేసుకోవాలి.
ఛాందోగ్యోపనిషత్తు(8, 13, 1):- "అశ్వ ఇవ రోమాణి విధూయ పాపం చంద్ర ఇవరాహోః ముఖాత్ ప్రముచ్య, ధూత్వా శరీర మకృతం కృతాత్వా బ్రహ్మలోక మభిసంభవామి"" అశ్వం శిధిలమైన వెంట్రుకలను విదిలించుకున్నట్లు పాపాన్ని విడిచిపెట్టి, చంద్రుడు రాహువు నుండి విడుదలై ప్రకాశవంతుడైనట్లుగా, నేను నా శరీరాన్ని విడిచిపెట్టి, పరమాత్మ సాక్షాత్కారంతో కృత కృత్యుడనై, బ్రహ్మాన్ని చేరతాను. విధూనవ శబ్దనికి త్యాగమని అర్ధం. గుర్రం తన శరీరాన్ని శుద్ధం చేసుకుంటుంది కదా! అలాగే ఆత్మజ్ఞాని బ్రహ్మోపాసనతో పాపాలను విదిలించుకుంటాడని అర్ధం కదా! బ్రహ్మోపాసనకు ఫలం ప్రయోజనం, పాప పుణ్య సమస్త వాసనల పరిత్యాగం - నాశం తద్వారా మోక్ష ప్రాప్తి కలుగుతుంది. వాసనలున్నప్పుడు మోక్ష ప్రాప్తి కలుగదు. కనుక ఉపాసనకు అర్ధం ఫలం. పాప నాశనం, పాప త్యాగం. ఛాందోగ్యంలో విధూయ శబ్దానికి అర్ధం ఇదే. ఈ వాక్యంలో " రాహాః ముఖాత్ ముచ్య " రాహువు ముఖం నుండి విడివడ్డ అని అర్ధం. కౌషీతకి బ్రాహ్మణంలో ఈ విధూవన శబ్దం తో బాటు ఉపాయన శబ్దం కూడా ఉంది. ఉపాయనం అంటే గ్రహించడం అనీ అర్ధం.
కౌషీతకీఉపనిషత్తు (1, 4):- తత్ సుకృత దుష్కృతే ధూనుతే తస్య ప్రియాజ్ఞాతయః సుకృతం ఉపయంతి అప్రియా దుష్కృతం "ఆత్మజ్ఞాని సుకృత, దుష్కృతాలను త్యజిస్తాడు. ధూనుతే అంటే అతని ప్రియులు సుకృతాన్ని, ఉపయంతి అంటే అప్రియులు దుష్కృతాన్ని గ్రహిస్తారు. బ్రహ్మజ్ఞాని సుకృత దుష్కృతాలను విడిచి పెడతాడని భావం. అతడు విడిస్తేనే కదా వేరే వాళ్ళు గ్రహిస్తారు. ఉపయంతి అంటే దగ్గరలో ఉండటం వలన విధూవన శబ్దానికి విడుపు అనే అర్ధం గ్రహించడం సమంజసం. కౌషీతకిలో బ్రహ్మజ్ఞానిని ప్రేమించే వాళ్ళు పుణ్యాలు చేస్తారని, అతణ్ణి ద్వేషించే వాళ్ళు పాపాలు చేస్తారని గ్రహించాలి అని పూర్వమీమాంస లో జైమిని తెలియజేశాడు. పూర్వమీమాంస దర్శనం ( 10, 8, 15 ) :-"అపి తు వాక్య శేషః స్యాత్ " ఒకచోట చెప్పిన అర్ధం, వేరే చోట చెప్పిన విషయానికి సంబంధించిన అర్ధానికి శేషం అంగం అవుతుంది. కనుక ఛాందోగ్యంలో, కౌషీతకీలో వున్నా విధూవన శబ్దాలు సమానార్ధకలు. రెండిటిలో అర్ధం పరిత్యాగమే. ఇలాగే ఒకచోట పఠించినది మరొకచోట అంగం అవుతుంది. అందుకు కుశీ, ఛందస్తుతి, ఉపగానం పదాలను దృష్టాంతలుగా వ్యాస మహర్షి సూత్రంలో చూపించారు. కుశ" వనస్పతిలో నిర్మించిన కుశలు నిన్ను రక్షించుగాక యజ్ఞంలో ఉద్గాత తాను చేసిన స్తోత్రాన్ని లెక్కించడానికి పుల్లలను ఉపయోగిస్తాడు. వాటిని "కుశ" అంటారు. ఇది ఏవనస్పతితో నిర్దేశించలేదు. శాట్యాయనులశాఖలో కుశః అంటే ఉదుంబరం అంటే బూరుగుచెట్టు అని చెప్పారు. ఇలాసమాన విషయాల్లో పఠించిన వాక్యానికి, వేరే శాఖలో పఠించిన వాక్యం శేషం, అంగం అవుతుంది.
ఛంద స్తుతి :- ఒక శాఖలో 'చందోభిః స్తువతే 'చందస్సులలో స్తుతి చేస్తారు. ఇది సామాన్య వాక్యం. ఛందస్సు లో దేవ, అసుర అని రెండు రకాలున్నాయి. ఈ రెండింటిలో ఏది ముందు స్తుతించాలో, ఏది తరువాత స్తుతించాలో విశేచించి చెప్పలేదు. పైంగిక శాఖలో దేవ ఛందస్సులను ముందుగా ప్రయోగించాలని చెప్పారు. అసుర ఛందస్సు తరువాత స్తుతి చెయ్యాలని చెప్పారు. అసురాలలో ఒక్కో చరణంలో తొమ్మిది వర్ణాలు ఉంటాయి.
ఉపగానం :- ఒక శాఖలో ఋత్విక్కులు ఉపగానం చేస్తారని ఉన్నది. ఋత్విక్కులలో బ్రహ్మ లాంటివారు చాలా మంది ఉంటారు. వీరిలో ఎవరు ఉపగానం చేస్తారో తెలియ జేయలేదు. తైత్తరీయశాఖలో అధర్వుడు ఉపగానం చేయరాదని, మిగిలినవారు చేయవచ్చునని నిర్ణయించారు. ఈ ఉదాహరణ ను బట్టి కౌషీతకం లో పఠించిన వాక్యం, ఛాందోగ్యం లో ఉన్నా దానిని వాక్య శేషం అంగం అవుతుంది.
సాంపరాయాధికరణం ( 3, 3, 27 )
సూత్రం :- 386
" సాంపరాయే తర్త వ్యాభావాత్ తధాహ్యన్యే "
సాంపరాయే :- మోక్షంలో, తర్త వ్యాభావత్ :- భోగించడానికి, తరించడానికి ఏమి ఉండదు. తధాహి అన్యే ..అని ఇతర శాఖల వాళ్ళు అంగీకరిస్తున్నారు.
భావం :- మోక్షంలో భోగించడానికి తరించడానికి ఏమి ఉండద ని ఇతర శాఖల వాళ్ళు అంగీకరిస్తారు.
వివరణ:- యోగి తానుపొందిన జ్ఞానంవలన దేహాన్నివదిలే సమయంలో సుకృత, దుష్కృతాలను వదలివేస్తాడు. విద్వాంసుడు మరణం సమయంలో, ప్రాణాలు బయటకు పోయేటప్పుడు శరీరంతో బాటే పాప పుణ్యాలు కూడా వదిలేస్తాడు, అంతే కాని అతని మరణానంతరం అతనితో బాటు వెళ్లవు. ఛాందోగ్యంలో చెప్పినట్లుగా గుర్రం తన శరీరాన్ని విదిలించి మట్టిని వదలి వేసినట్లుగా జ్ఞాని పాపపుణ్యాలను ఇక్కడే వదిలివేస్తాడు. అతను మరణించిన తరువాత అతని ఆస్తులను అతని వారసులు పొందుతారు. స్నేహితులు పుణ్య కర్మలను, విరోధులు పాప కర్మలను పొందుతారని చెప్పబడింది.
శ్వేతాశ్వరోపనిషత్తు(1, 10):- బ్రహ్మఉపాసన వలన తత్త్వజ్ఞానం, ఆత్మదర్శనం పొంది, సమస్త సాంసారిక భావన నుంచి విముక్తుడౌతాడు. జీవుడు పుణ్య పాపాలన్నింటిని అనుభవించి విశ్వాన్ని విడుస్తాడు.
ముండకోపనిషత్తు(3, 1, 3):- బ్రహ్మ జ్ఞాని పుణ్య పాపాలను విడిచి నిర్దోషియై పరమపదాన్ని పొందుతాడు.
కౌషీతకి బ్రాహ్మణం(1, 4):- అప్పుడు పుణ్యపాపాలను త్యజిస్తాడు. అనేకచోట్ల పుణ్యపాపాలను రెండింటిని త్యజిస్తాడని ఉన్నది. ఉపాసన వలన బ్రహ్మసాక్షాత్కారం కలుగుతుంది. అప్పుడు ఉపాసకుడికి మోక్ష ప్రాప్తికి మించి అనుభవించి, తరించడానికి ఏమి ఉండదు. కనుక బ్రహ్మ సాక్షాత్కారం వలన పుణ్య పాపాలు రెండు నశిస్తాయి.
సూత్రం :- 387
" ఛందత ఉభయా విరోధాత్ "
ఉభయ విరోధాత్ :- రెండు విధాలైన ఉపనిషత్వాక్యాల్లోనూ ఏ విరోధమూ లేదు అని, ఛందతః :- జ్ఞానులైన వక్తల అభిప్రాయం.
భావం :- రెండు విధాలైన ఉపనిషత్వాక్యాలలోనూ ఏ విరోధం లేదు అని జ్ఞానులైన వక్తల అభిప్రాయం.
వివరణ:-జీవించిఉండగానే యమనియమాలతో కాలం వెళ్ళబుచ్చుతున్నాడు. అతను నియమనిష్టలతో జీవితం సాగిస్తాడు కనుక కర్మ క్షయం అయిపోవచ్చును. యమ అంటే నియంత్రణ. మౌలిక ఆధ్యాత్మిక జీవన సూత్రాల మీద ఆధిపత్యం కలిగి ఉండటం. పతంజలి మహర్షి 5 యమాలను గురించి ప్రవచించారు.
1. సత్యం :- ఎప్పుడు సత్యాన్నే పలకడం.
2. అహింస :- హింసాత్మక చర్యలను పూర్తిగా విసర్జించడం.
3. బ్రహ్మచర్యం :- ఎప్పుడు మధ్యే మార్గాన్ని అనుసరించడం.
4. ఆస్థేయ :- ఇతరుల ఆస్థి పట్ల అసూయ ఉండక పోవడం,
5.అపరిగ్రహం .అవసరం కానిది ఇతరులు ఇచ్చినా తీసుకోకపోవడం.
నియమం:-అంటే తప్పనిసరి దైనందిన కార్యకలాపాలు మన ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో కొన్ని కార్యకలాపాలు తప్పనిసరి. ఇవి 5 నియమాలు.
1.శౌచం :- శరీరాన్ని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం,
2. సంతోషం :- మనస్సును ఎప్పుడు ఉల్లాసంగా ఉంచుకోవడం,
3. స్వాధ్యాయం :- చక్కని ఆధ్యాత్మిక గ్రంధాలను సదా చదువుతూ ఉండటం,
4. తపస్సు :- నిద్రాహారాదులను క్రమక్రమంగా తగ్గిస్తూ ఉండటం,
5. ఈశ్వర ప్రణీదానం :- అంతా ఈశ్వరమయమే అన్న భావనతో సదా ఉండటం.
ఇవి సాధ్యం అవాలంటే నిత్యఅనునిత్యయోగం, ఆధ్యాత్మికజ్ఞానం తప్ప వేరే శరణ్యం లేదు. ఈ యమ, నియమాలను అనుసరించే వారికి జీవించి ఉండగానే కర్మ క్షయం అవుతుంది. మరణాత్పూర్వమే సాధనావస్థ లోనే ప్రయత్నం చేయడం కుదురుతుంది. ఆప్రయత్నాన్ని బట్టి సుకృత, దుష్కృత కర్మలు తొలగిపోతాయి. బ్రహ్మ ప్రాప్తి మాత్రం దేహాన్ని వదలిన తరువాత జరుగుతుంది.
గతేరర్థ వత్వాధికరణము (3, 3, 29)
సూత్రం 388
"గతేరర్ధ వత్వా ముభయధా న్యధాహి విరోధః
ఉభయధా :- రెండు విధాలని అంగీకరించాలి. గతేః :- బ్రహ్మోపాసకుడుకి దేవయాన గతి ఉన్నది అనే మాటను, అర్ధ వత్వం :- సార్ధకత ఉన్నది. హి :- ఎందుకంటే, అన్యధా :- అలాకాని పక్షంలో, విరోధః :- చెప్పిన వాక్యాల్లో విరోధం ఉంటుంది కదా!
భావం :- రెండు విధాలను అంగీకరించాలి. బ్రహ్మోపాసకుడికి దేవయాన గతి ఉన్నది అనే మాటకు సార్ధకత ఉన్నది. ఎందుకంటే అలా కాని పక్షంలో చెప్పిన వాక్యల్లో విరోధం ఉంటుంది.
వివరణ:-గురువర్యా! పాపపుణ్యాలను వదలి పెట్టే సందర్భంలో కొన్ని చోట్ల దేవయానం చెప్పారు. కొన్ని చోట్ల ఏమి చెప్పలేదు. పాప పుణ్యాలను వదలి పెట్టిన తరువాత జ్ఞానులందరు దేవయాన మార్గం ద్వారానే వెడతారా? అని అడిగాడు కృష్ణ శర్మ. సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. బ్రహ్మోపాసన రెండు రకాలు. ఒక దానికి గతి ఉన్నది. మరొక దానికి లేదు. ఉపాసనాపద్ధతి, నిర్గుణవిద్యాపద్ధతి అని రెండుపద్ధతులున్నాయి. వీటిలో ఉపాసనాపద్దతిలోమాత్రమే దేవయానమార్గ మున్నది. నిర్గుణోపాసన సందర్భంలో దేవయానమార్గంలేదు. అజ్ఞానం పోయిన తరువాత పాపపుణ్యలను వదలి, నిర్మలుడై పరబ్రహ్మను చేరతాడు అని ముండకోపనిషత్తు చెబుతున్నది. ఉపాసకుడికి బ్రహ్మప్రాప్తి కలగడానికి ముందు ఏదైనా అడ్డంకి కలిగితే ఈ శరీరం విడిచి మరొక శరీరం పొందే గతి కలుగుతుంది. దీనిని దేవాయనగతి అంటారు. నిరంతరం బ్రహ్మాన్ని ఉపాసించి, పుణ్య పాపాలన్నిటిని త్యజించి, ఎలాంటి అభ్యంతరాలు లేని బ్రహ్మ జ్ఞాని ఈ శరీరాన్ని విడిచి, ఇక్కడే బ్రహ్మాన్ని పొందుతాడు. అతడికి గతి ఉండదు. గతి అనేది ఉపాసనకు ఫలం. పుణ్య పాపలకు కాదు. బ్రహ్మో పాసనకు దేవయాన గతి ఉందనడం నిరర్ధకం కాదు. ఇలా గతి ఉండడం, లేకపోవడం రెండూ ఉన్నాయి.
బృహదారణ్యాకోపనిషత్తు(1,3):- ఇక్కడే బ్రహ్మాన్ని పొందుతాడు అంటూ గతి చెప్పలేదు. ఈవాక్యాల్లో విరోధం ఉందని అనుకోకూడదు. ఆటంకం కలిగినప్పుడు శరీరపాతం కాగానే ఉపాసకుడు దేవాయన మార్గంలో వేరేశరీరంలో ప్రవేశించి, అడ్డంకి తొలగిపోగానే బ్రహ్మాన్ని పొందుతాడు. పూర్ణ బ్రహ్మజ్ఞానికి ఏగతి లేదు. అందువలన గతి ఉన్నదనడము, గతి లేదనడము రెండూ సార్ధకమే. నిరర్ధకం కావు అనీ గ్రహించాలి.
గతీరర్ధ వత్వాధికరణం ( 3, 3, 30 )
సూత్రం :- 389
" ఉపపన్నః తల్లక్షణార్ధోప లబ్దిఃలోకవత్ "
ఈత్ లక్షణ అర్ధ ఉపలబ్ధేః :- గతి, కారణం, ప్రాప్తి ఉండటం, ఉపపన్నః :- సహెతుకమే.
భావం :- బ్రహ్మసాక్షాత్కారం కాని ఉపాసకుడికి కూడా గతి ఉంటుందని ఎలా అంటున్నారు? ఆ గతికి ఫల ప్రాప్తి లేదు కదా! అంటే ఈ లోకంలో మనం చూస్తున్నట్లుగా గతి, కారణం ప్రాప్తి ఉండటం సహేతుకమే.
వివరణ:- సగుణోపాసకుడికి సగుణబ్రహ్మ ప్రాప్తి, నిర్గుణ బ్రహ్మోపాసకుడికి నిర్గుణ పరబ్రహ్మ ప్రాప్తి లభిస్తాయి. లోకంలో ఒకడు ఏదో సాధించాలని వేరే దేశానికి వెళ్ళడానికి ఏదో ఒక మార్గం కావాలి. అలాగే ఉపాసకుడు వెళ్ళడంలో విడ్డూరం ఏముంది? దేశాంతరగమనం వలన ప్రయోజనం ఉన్నట్లే, లోకాంతర గతికి విశేష ఫల ప్రాప్తి ఉంటుంది. లోకాంతరగతి ఉపాసకుడికి హేతువు. ఈ ఉపాసనకు ఫలితం బ్రహ్మ సాక్షాత్కారం. అది ఇక్కడే లభించ వచ్చును. ఒక చోట అనే నిర్భంధం ఏమి లేదు. సగుణబ్రహ్మను పొందటానికి దేవయాన మార్గం అవసరం. ఈ మార్గం ద్వారా వెళ్లిన వాళ్ళకి ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి. సకల భోగాలు దక్కుతాయి. నిర్గుణోపాసకుడు నిర్గుణ స్వరూపం పొందటానికి మార్గం అంటూ ఏది అవసరం లేదు. నిర్గుణ విద్యలో దేవయాన ప్రసక్తి లేదు.
ప్రశ్నోపనిషత్తు(5, 5):- ఓంకార యుక్తంగా చేసిన ఉపాసన ఉపాసకుణ్ణి బ్రహ్మలోకానికి తీసుకువెడుతుంది. జీవాత్మల భోగం కొరకు భూమి మీద మొదలైన లోకలోకాంతరాల సృష్టి జరుగుతుంది. వాటి కంటే సూక్ష్మం జీవాత్మ తత్త్వం. అలాంటి పరతత్త్వాన్ని ఉపాసకుడు చేరతాడు. "పాప్మనా వినిర్ముకతః "పాప పుణ్యాల నుంచి విముక్తుడై, ఈ దేహంతో గాని, అన్య దేహంతో గాని బ్రహ్మాన్ని పొందుతాడు. కనుక బ్రహ్మోపాసనకు గతి ఉన్నదని స్పష్టమౌతోంది.
అనియమాధికరణం ( 3, 3, 31 )
సూత్రం :- 390
" అనియమః సర్వేషా మవిరోధః శబ్దాను మానాభ్యాయం "
సర్వేషాం:-దేవయానమార్గంలో బ్రహ్మ లోకం చేరిన బ్రహ్మోపాసకులకందరికి, అనియమః :- బ్రహ్మ ప్రాప్తి కలగాలనే నియమం ఏమి లేదు. అవిరోధః :- ఈ విషయంలో ఏ వైరుధ్యం లేదు అని శబ్ద అనుమానాభ్యామ్ :- శ్రుతి, స్మృతుల వలన తెలుస్తోంది.
భావం :- దేవయాన మార్గంలో బ్రహ్మ లోకం చేరిన బ్రహ్మోపాసకులందరికి బ్రహ్మ ప్రాప్తి కలగాలనే నియమం లేదని శ్రుతి, స్మృతుల వలన తెలుస్తోంది.
వివరణ :- ఉపాసనలను బట్టి దేవయాన మార్గం ద్వారా బ్రహ్మ లోకాన్ని పొందే బ్రహ్మోపాసకులందరికి బ్రహ్మోపాసన ఫలంగా బ్రహ్మసాక్షాత్కారం కలుగుతుందా అనే ప్రశ్నకు ఈ సూత్రంలో సమాధానం చెప్పబడింది. గురువు గారు! సగుణోపాసనలో దేవయానం తప్ప నిర్గుణోపాసనలో దీని ప్రసక్తి లేదు. సగుణోపాసనలో కూడా కొన్ని చోట్ల దేవయానం చెప్పబడింది. కొన్ని చోట్ల చెప్పబడలేదు. ఉదా:- పంచాగ్నివిద్య, ఉపకోశలవిద్యలలో దేవయానం చెప్పబడింది. మధు విద్య, శాండిల్య విద్య, వైశ్వానర విద్య లలో ఇది చెప్పబడలేదు. ఈవిద్యలలో దేవయానం అన్వయింపవచ్చునా? అని అడిగాడు కృష్ణశర్మ. సమాధానం చెబుతున్నాడు రత్నకరుడు. సగుణోపాసన లన్నింటిలో దేవయానం చెప్పడంలో తప్పు లేదు. ఛాందోగ్యంలో పంచాగ్నివిద్య తెలుసుకున్న వారు, శ్రద్ధ, తపస్సు మొదలైన ధర్మాలతో ఉపాసన చేసిన వారు అర్చిరాది మార్గాన్ని పొందుతారు. అంటే నిర్గుణ బ్రహ్మోపాసన చేసిన వారు అర్చిరాది మార్గం ద్వారా బ్రహ్మ లోకం చేరతారు. రకరకాల ఉపాసనలు చేస్తూ ఉపాసకులు దేవాయన గతిలో బ్రహ్మలోకం చేరతారు. అందరికీ బ్రహ్మ సాక్షాత్కారం అవుతుందనే నియమం లేదు. పరిపూర్ణమైన సాధనాసంపత్తి ఉన్నవాళ్ళకే బ్రహ్మసాక్షాత్కారం లభిస్తుంది. ఉపాసనలో ఏదైనా అనివార్య బాధ కలిగినప్పుడు, బ్రహ్మసాక్షాత్కారం లభించదు. అలాంటి వాళ్లకు వాళ్ళు చేసిన ఉపాసనలకు ఫలితంగా ఐశ్వర్యాదులు అనుభవించడానికి అనువైన విశిష్ట దేహ సంబంధం ఈ లోకంలో లభిస్తుంది. బ్రహ్మ సాక్షాత్కారం కలిగిన వాళ్ళు ముక్తులౌతారు.
ఛాందోగ్యోపనిషత్తు(4, 15, 6):-"ఏతేన ప్రతిపద్యమానా ఇమంమానవమావర్తం నావర్తంతే " దేవయాన మార్గంలో బ్రహ్మలోకం చేరిన వాళ్లకు బ్రహ్మసాక్షాత్కారం కలిగిన తరువాత ఈ మానవచక్రంలోకి రారు. ఈ వాక్యంలో వైరుద్యం లేదు. కనుక బ్రహ్మలోకం చేరిన తరువాత వాళ్లందరికీ బ్రహ్మ సాక్షాత్కారం కలగాలనే నియమం లేదు. అది అనుష్టాన సాధనసంపత్తి, సమగ్రత పై ఆధారపడి ఉంటుంది. కనుక బ్రహ్మసాక్షాత్కారం కలగడం, కలగక పోవడం రెండూ సంభవమే. ఉపనిషత్తులలో పేర్కొన్న ఉపాసనల్లో కొన్నింటిలో ఛాందోగ్యంలో పంచాగ్నివిద్య, ఉపకోసల విద్యలలో దేవయాన మార్గం ఉన్నది. మధు విద్య, శాండిల్య విద్య, వైశ్వానర విద్యలలో ఇది కనిపించదు. కాబట్టి ఏ విద్యల్లో దేవయానం ఉన్నదో ఆ విద్య వలన జీవుడికి దేవయాన గతి వర్తిస్తుంది. అందువలన దేవయాన గతి అన్యత్రా గ్రహించకూడదు. ఇది ఒక విద్యకే పరిమితం కాదు. అన్ని ఉపాసనల్లో ఇది ఫలిస్తుంది. దీనికి ప్రమాణాలు అనేకం ఉన్నాయి. కర్మ మార్గం అనుసరించే వాళ్లకు పితృ యానం, జ్ఞాన మార్గులకు దేవయానం అని రెండు గతులు నిర్దేశించారు. కర్మానుస్థాన ఫలం పితృయానం, బ్రహ్మోపాసన ఫలం దేవయానం అని చెప్పబడింది.
బృహదారణ్యకం(6, 2, 15/ 16):- కొన్ని ఉపాసనల్లో దేవాయన గతిని పేర్కొనక పోయినా అన్ని ఉపసనా ఫలాలు సమానమే. ప్రతి ఉపాసన ప్రతిఫలం బ్రహ్మ సాక్షాత్కారమే కానక్కరలేదు. మిగతా వాటికి ఐశ్వర్య ప్రాప్తి ఫలాలు తప్పక ఉంటాయి. ఈ దేవయానమార్గంలో శ్రద్ధ, తపస్సులు గలవారు మాత్రమే చెప్పబడ్డారు. విద్యా బలం లేకుండా కేవలం శ్రద్ధ, తపస్సు చేత ఈ గతి లభించదు. ఏ బ్రహ్మలోకంలో కామాలు, కామక్రోధాదులు మరలిపోతాయో అట్టి బ్రహ్మలోకస్థానంలో విద్యచేత ప్రవేశిస్తారు.
యావదధికరణం ( 3, 3, 32 )
సూత్రం :- 391
" యావదధికార మనస్థితి రాధికారికాణామ్ "
అధికారికాణామ్ :- అధికారం ఉన్నవాళ్లకు, యావదధికారాం :- ఆ అధికారం ఉన్నంత వరకు, అవస్తితిః :- ఉనికి ఉంటుంది.
భావం :- బ్రహ్మ సాక్షాత్కారం వలన మోక్షధికారం లభించిన వాళ్లు ఆ అధికారం ఉన్నంత వరకు బ్రహ్మలోకంలో ఉనికి ఉంటుంది.
వివరణ:-ఈ అధికరణంలో ముక్తులైన వారు ధర్మరక్షణ కోసం మళ్ళీ జన్మించవచ్చునని తెలియజేశారు. గురువు గారు! జ్ఞాని ఆదేహాన్ని వదలిన తరువాత అతనికి ఇంకొక శరీరం ఉంటుందా? ముక్తి అనేది నియమమా? అనివార్యమా? లేక పాక్షికమా? బ్రహ్మవేత్తలుకూడా మళ్ళీ జన్మించినట్లుగా పురాణాలలో చెప్పబడింది. వేదాచార్యుడైన అపాంతరతముడే మళ్ళీ కృష్ణద్వైపాయణుడుగా పుట్టాడు. సనత్కుమారుడే ఈశ్వరాజ్ఞతో కుమారస్వామిగా పుట్టాడు. నారదుడు వశిష్ఠుడుగా మళ్ళీ జనించినట్లుగా చెప్పబడింది. కాబట్టి ఈ దేహము విడిచిన తరువాత జ్ఞానికి ముక్తి లభిస్తుందనే నియమం ఏది లేదనిపిస్తోంది కదా! అన్నాడు నారాయణభట్టు. సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. అపాంతరతముడు మొదలైన వారు లోకం కోసం ఈశ్వరునిచే అధికారంలో నియమించబడ్డారు. వీరు ఆ అధికారి సంపాదాకమైన కర్మ క్షయం అయ్యేవరకు అలాగే ఉంటారు. ఈమహానుభావులు మరల శరీరం ధరించడానికి ఏ కర్మలు చేశారో అవి క్షయం అయ్యేవరకు ఆ అధికారంలోనే ఉంటారు. శరీర ధారణ చేస్తారు. వీరికి దేహ సంబంధమైన లింగ శరీరం నుండి విముక్తి కలగగానే మోక్షం వస్తుంది. ఆధ్యాత్మ శాస్త్రాల్లో జీవుడి మోక్ష దశను వర్ణించిన చోట వాస్తవికత తెలిపే కొన్ని సంకేతాలు లభిస్తాయి. వాటిని పరిశీలిస్తే మోక్ష దశలో ముక్తుడు ఎంతకాలం ఉంటాడో తెలుస్తుంది.
ఛాందోగ్యోపనిషత్తు(4, 15, 6 ):-" ఏతేన ప్రతిపద్యమానా ఇమంమానవ మావర్తం నా \వార్తంతే " దేవయాన మార్గంలో బ్రహ్మాన్ని పొందిన జ్ఞానులు ఈ మానవఆవర్తనానికి తిరిగి రారు. దీనిఅర్ధం ఏమిటంటే ఏ మానవఆవర్తనంలో ముక్తులయ్యారో ఆ మానవ ఆవర్తనంలోనికి తిరిగి రారు. మరో మానవ ఆవర్తనంలోనికి వస్తారని భావం. ఇక్కడ ఆవర్తనం అంటే కల్పం.
ఛాందొగ్యో పనిషత్తు(8, 15, 1):- బ్రహ్మజ్ఞానం పొంది ముక్త దశలో ఎంత కాలం ఉండాలో అంత కాలం బ్రహ్మ లోకంలో ఉంటాడు. మధ్యలో తిరిగి రారు.
బృహదారణ్యకోపనిషత్తు(6, 2, 15):- " తేషు బ్రహ్మ లోకేషు పరాం పరావతో వసంతి "ముక్తులు చాలా కాలం బ్రహ్మలోకంలో వసిస్తారు. వీటిని బట్టి ముక్తులు అనంత కాలం బ్రహ్మంలో ఉంటారనడం పొసగడం లేదు. ముక్తులకు పునరావృత్తి లేదంటే అర్ధం వాళ్ళు మోక్షానందం అనుభవించే సమయంలో తిరిగి రారు అనే. కనుక ముక్తాత్మలు తమకు అధికారం ఉన్నంత వరకు బ్రహ్మానందాన్ని అనుభవిస్తారని, పిదప మళ్ళీ జన్మిస్తారని తెలుస్తోంది.
అక్షరధ్యధికరణం ( 3, 3, 33 )
సూత్రం :- 392
" అక్షరధియాం త్వవరోధః సామాన్య తద్భావాభ్యామ్ ఔప సదవత్ తదుక్తమ్ "
సామాన్య తత్ భావాభ్యామ్ :- ఉపాస్య దైవం సమానం అయినందు వలన, అస్థూలత్వాదులు బ్రహ్మ ధర్మాలు కావడం వలన, అక్షరధియాం:- అక్షరవిద్యతో పేర్కొన్న గుణాలను, అవరోధః:-ఉపాసనలలో గ్రహించాలి. ఔపసదవత్ :- ఉపసద్ ఆహుతుల్ని ఉదాహరణగా తీసుకోవాలని, తదుక్తం :- మీ మాంస శాస్త్రము చెబుతోంది.
భావం :- సామాన్య ఉపాస్య దైవం సమానం అయినందువలన అస్థూలత్వాదులు బ్రహ్మ ధర్మం కావడం వలన అక్షర విద్యలో పేర్కొన్న గుణాలను ఉపాసనలలో గ్రహించాలి. ఉపసద్ ఆహుతుల్ని ఉదాహరణంగా తీసుకోవాలని మీమాంస శాస్త్రము చెబుతోంది.
వివరణ:-ఈ అధికరణంలో అక్షరానికీ సంబంధించిన నిషేధ భావాలకు ఉపసంహారం ఉంది. గురువర్యా! బ్రహ్మాన్ని గురించి చెప్పేటప్పుడు అవ్యయుడు లేనివాడు అనే నిషేధ వాక్యాలలో చెప్పారు. ఉదా. ఆకారం లేని వాడు, గుణం లేని వాడు, ఇంద్రి యాల చేత గ్రహింపబడని వాడు. ఈరకంగా కొన్ని చోట్ల చెప్పారు. కొన్ని చోట్ల చెప్పలేదు. ఈ రకంగా చెప్పని చోట, చెప్పిన చోటునుంచి అన్వయింప వచ్చునా? అని ప్రశ్నించాడు నారాయణ భట్టు. సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. ఉపాస్య దైవం సమానం అయినందువలన వస్తు భేదం లేనందువలన బ్రహ్మకు సంబంధించిన నిషేధర్ధక భావాలు ఉపసంహరించాలి. ఈ నిషేధ వాక్యాల ద్వారా బ్రహ్మ మొక్కటేనని తెలుస్తుంది. బ్రహ్మకు సంబంధించిన నిషేధ వాక్యాలకు ఉప సంహారం ఉన్నది.
ముండకోపనిషత్తు(1, 1, 5/6):- బ్రహ్మానికి స్థూలత్వాది ధర్మాలు లేనట్లుగా చెబుతూ, బ్రహ్మస్వరూపాన్ని తెలిసేటట్లు చేయాలనీ యత్నించారు. ఈ అస్థూలత, అనణుత్వం, అహస్వత్రం లాంటి గుణాలను బ్రహ్మోపాసన ల్లో సర్వత్రా గ్రహించాలా? వద్దా? అంటే గ్రహించాలనే మహర్షి చెబుతున్నారు. అక్షరబ్రహ్మవిద్యలో వివరించిన బ్రహ్మధర్మాలు సర్వత్రా గ్రహించాలి. అన్ని ఉపాసనలలో ఉపాస్యుడైన బ్రహ్మం ఒక్కటే. గుణాలు కూడా ప్రాచుర్యం వహించినవే. కనుక ఒక చోట గ్రహించిన గుణాలు వేరే చోట బ్రహ్మ స్వరూపాన్ని గ్రహించడానికి తోడ్పడతాయి. ఇక్కడ మహర్షి ఒక ఉదాహరణ ఇచ్చాడు. "ఔప సదనత్ " నాలుగు రోజులలో పూర్తి అయ్యే చతూరాత్రం అనే అహీనయజ్ఞం ఒకటున్నది. అందులో అధర్వుడు పురోడాశం అనే ద్రవ్యం గల ఏక కపాలం మొదలు ద్వాదశకపాలం వరకు కొన్ని ఆహుతులిస్తాడు. పురోడాశం అంటే బియ్యం పిండితో చేసే రొట్టె వంటి హోమద్రవ్యం. ఆ ఆహుతుల్ని ఉపసద్ అంటారు. ఈ ఆహుతుల్ని తాండ్య బ్రాహ్మణంలో ఉన్న అగ్నేర్ వే హోత్రం వేరే ధ్వరం " లాంటి మంత్రాలలో ఇస్తారు. ఈ బ్రాహ్మణం సామవేదానికి చెందినది. ఈమంత్రాన్ని ఉద్గాథ ఉచ్చరించాలి. అధ్వర్యుడు పఠించకూడదు. కాని చతూరాత్రంలో పురోడాశం ఇవ్వడమే ముఖ్యం. ఈ కార్యాన్ని అధ్వర్యుడే చెయ్యాలని నియమం. కాబట్టి మంత్రోచ్చారణ పురోడాశానికి అంగం కావడం వలన అధ్వర్యుడే చేస్తాడు. ఇక్కడ పురోడాశం ఇచ్చే ఆధ్వర్యుడికి, ఉద్గాథ ఉచ్చరించే మంత్రాలకు సంబంధం ఉంది. అలాగే విభిన్న శాఖలలో పటించే అస్థూలత్వాది గుణాలు సైతం సర్వత్రా ఉపాస్య బ్రహ్మంతో సంబంధించి ఉంటాయని సమాన్వయం చేసుకోవాలి పూర్వమీమాంస (3, 3, 9) :- "గుణ ముఖ్య వ్యతిక్రమే తదర్ధ త్వాన్ము ఖ్యనవేద సంయోగం" గుణముఖ్యాల్లో తేడా వచ్చినప్పుడు మంత్ర సంబంధం ముఖ్యంతో ఉంటుంది. ఈగుణం ముఖ్యాన్ని సంపన్నం చేయడానికే. దీనిని బట్టి ముఖ్యమైన ఉపాస్య బ్రహ్మంతో అన్ని ఉపాసనల్లో గుణాలకు సంబంధం ఉంటుందని స్పష్టమౌతోంది.
ఇయదధికరణం ( 3, 3, 34 )
సూత్రం :- 393
" ఇయదామననాత్ "
ఆమనయాత్ :- శాస్త్రాల్లో చెప్పిన, ఇయత్ :- అన్ను గుణాలను గ్రహించాలి.
భావం :- శాస్త్రాల్లో ఎన్ని గుణాలు పఠించారో, అన్ని గుణాలను గ్రహించాలి.
వివరణ:- ఈ అధికరణంలో ద్వాసుపర్ణా, ఋతంబిబన్తౌలలో చెప్పిన విద్య ఒక్కటేనని చెప్పబడినది. జగజ్జన్మాదులకు కారణం అచింత్యశక్తి యుక్తమైన బ్రహ్మం గుణాలకు అవధి లేదు. అయిన ముముక్షువులు ఉపాసనకు ఉపకరించే శాస్త్రాల్లో వర్ణించిన గుణాలను ఒక ఉపాస్యవిద్య నుంచి మరోదానిలో సంగ్రహించాలని ఋషులు చెబుతున్నారు. అల్పజ్నుడైన జీవుడు సర్వ గుణ సంపన్నుడైనా బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి సమర్ధుడు కాడు. జగత్ కర్త్తృత్వం లాంటివి విధి రూపకంగా, అస్థూలత్వం లాంటి వాటిని నిషేధ రూపకంగా, గ్రాహ్య గుణాలుగా వర్ణించారు. 3-1-11నుంచి 3-3-33వరకు చెప్పిన సూత్రాలోని బ్రహ్మ స్వరూప గ్రాహక గుణాలను గ్రహించాలి. ఈ రెండింటి యందలి విద్య ఒక్కటే. తెలుసుకోవలసిన రూపాన్ని రెండు చోట్ల ఒకటిగా చెప్పారు. కాబట్టి విద్యలలో ఐక్యం ఉన్నది. కనుక రెండింటిలోను చెప్పదలచిన విద్య ఒక్కటే. అధర్వణికులు, శ్వేతాశ్వతరులు కూడా ఆధ్యాత్మ ప్రకరణంలో "ద్వాసు పర్ణ, అభిచాభి శీతి " అనే మంత్రాన్ని పఠిస్తున్నారు.అట్లే నరులు కూడా "యితం - త్రినాచికేతాః " అను మంత్రం పఠిస్తున్నారు. ఇక్కడ విద్యలకు ఏకత్వమా? భేదమా? అని సంశయం. ద్వాసుపర్ణ అనే మంత్రంలో ఒకరికి భోకృత్వం, మరొకరికి అభోకృత్వం కనబడుచున్నవి. వేద్యం వేరైనప్పుడు విద్యలు వేరేవుతాయి కదా! వేద్యమైన అక్షరం ఒకటే గాన విద్య కూడా ఏకమే అవడం చేత అక్షరధీలకు ఉపసంహారం ఉంటే ఉండవచ్చును. కాని ఇక్కడ వేద్య భేదం చేత విద్య కూడా భిన్నమే గాన ఉపసంహారం ఉండదు. ఈ రెండు మంత్రాలూ జీవుడు రెండవవాడుగా గల జీవేశ్వరులను ప్రతిపాదిస్తున్నాయి. కాని మరొక అర్ధాన్ని ప్రతిపాదించలేదు.
అంతరాత్వాధికరణం ( 3, 3, 35 )
సూత్రం :- 394
" అంతరా భూత గ్రామవత్ స్వాత్మనః "
దీనికి ఆమననాత్ అనేది పూర్వ సూత్రం నుంచి అనువృత్తి. భూత గ్రామవత్ :- తన దేహము లోని తన ఆత్మలాగా, స్వాత్మనః :- తన ఆత్మ, అంతరా :- మధ్యలో బ్రహ్మాన్ని ఉపాసించాలి. అమననాత్ :- శాస్త్రాల్లో చెప్పారు.
భావం :- తన దేహంలోని తన ఆత్మ లాగా, తన ఆత్మ మధ్యలో బ్రహ్మాన్ని ఉపాసించాలని శాస్త్రాల్లో చెప్పారు.
వివరణ:-రెండూచోట్ల సర్వాంతరత్వాన్ని చెప్పారు. శ్వేతాశ్వరోపనిషత్తులో చెప్పినట్లుగా సమస్త భూతాలయందు సర్వాంత రత్వం అయిన ఆత్మ ఒక్కటే. జీవుడు తనని తాను తన దేహ మధ్యంలో ఉన్నట్లు ఎలా తెలుసుకుంటాడో, ఉపాసకుడు పరమేశ్వరుణ్ణి తనఆత్మ మధ్యలో ఉపాసించాలి. ఈశ్వరుడు అన్నిభూతాల్లో అంతటా వ్యాపించి ఉన్నట్లుగా తన లోను వ్యాపించి ఉన్నాడు. కనుక తనలోనే ఉపాసించి సాక్షాత్కారం చేసుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. స్వాత్మకు అంతరామ్ననం లో భేదం లేదు కనుక విద్వైకత్వమే. రెండూ చోట్ల కూడా భేదం లేకుండా సర్వాన్తరమైన (అన్నింటికన్నా లోపల ఉన్న) ఆత్మను గురించి ప్రశ్నించడం, సమాధానం చెప్పడం జరిగింది. ఒకే దేహంలో రెండూ ఆత్మలు సర్వన్తరాలుగా ఉండవు కదా! అప్పుడు ఒక ఆత్మకు సరియైన సర్వాన్తరత్వం చెప్పవలసిన ఉంటుంది. మరొక దానికి భూత గ్రామానికి వలె సర్వాంతరత్వం ఉండదు. అట్లే ఇక్కడ కూడా ముఖ్యమైన సర్వాంతరత్వం (ఒకదానికే గాని అన్నింటికీ) ఉండదు. అట్లే ఇక్కడ కూడా. భూత గ్రామవత్ అనేది మరొక శ్రుతిని నిర్దేశిస్తుంది. సమస్త భూత సముదాయంలో ఒకే ఆత్మ సర్వాంతరం అని ఏ విధంగా చెప్పబడిందో అట్లే ఈ బ్రాహ్మణాలలో కూడా అని అర్ధం. కఠోపనిషత్తు, శత పధబ్రాహ్మణంలో తన ఆత్మ లో వ్యాపించి ఉన్నట్లు అక్కడే దానిని గ్రహించాలన్నట్లు స్పష్టంగా వివరించారు. కనుక హృదయ స్థితమైన ఆత్మలోనే బ్రహ్మాన్ని ఉపసించాలని సిద్ధాంతం. శాస్త్రాన్ని అనుసరించి స్వాత్మ లోనే పరబ్రహ్మోపాసన చేయాలనీ అంటున్నారు.
అంతరత్వదికరణం ( 3, 3, 36 )
సూత్రం :- 395
" అన్యధా భేదానుపపత్తి రితి చేన్నోప దేశాంతర వత్ "
అన్యధా :- వేర్వేరుగా చెప్పిన, భేద అనుపపత్తిః :- ఉపాసనా భేదాలు సిద్ధించవు కదా! ఇతి చేత్ :- అని అనడం, న :- సరియైనది కాదు. ఉపదేశ అంతరవత్ :- ఇది వరకే చెప్పిన కర్మోపదేశం లాగా అదీ సిద్ధిస్తుంది. స్వాత్మనః :- కనుక పరబ్రహ్మోపాసన తన ఆత్మలోనే చెయ్యాలి.
భావం :- వేర్వేరుగా చెప్పిన ఉపసనా భేదాలు సిద్ధించవు కదా అనీ చెప్పడం సరియైనది కాదు. ఇదివరకే చెప్పిన కర్మోపదేశం లాగా అదీ సిద్ధిస్తుంది. కనుక పరబ్రహ్మోపాసన తన ఆత్మలోనే చెయ్యాలి. ఇక్కడ అంతరా, స్వాత్మనః అనేవి అనువృత్తులు.
వివరణ:-విద్యాభేదం అంగీకరించకపోతే శ్రుతిభేదం ఉపపన్నంకాదు అని చెప్పడం సరియైనదికాదు అనిచెప్పడం సమంజసం కాదు. ఛాందోగ్యంలో తత్త్వమసి అన్నదానిని 9సార్లు చేసినప్పటికి విద్యాభేదం కలగలేదు. అది అభ్యాసం కొరకు చెప్పబడింది. అలాగే ఇక్కడ కూడా. విద్యలో భేదం లేకపోతే ఒకే మాట లేదా విషయం రెండూ సార్లు చెప్పబడవు అనీ పూర్వ పక్ష వాదన. తత్త్వమసి 9 సార్లు చెప్పినా విద్యలో భేదం రాలేదు. పునరుక్తి దోషం కలుగలేదు. కాబట్టి ఉషుస్తీ, కహాళ బ్రాహ్మణలలో చెప్పిన విద్య ఒక్కటే.
ఛాందొగ్యోపనిషత్తు ( 5, 18, 1 ) :- ఇందులో ఆదిత్యాదుల్లో బ్రహ్మోపాసన చేయరాదని, ద్యులోకం నుంచి పృధివి దాకా ఉన్న సమస్త విశ్వంలో వ్యాపించి ఉన్న విరాట్ బ్రహ్మ స్వరూపాన్ని ఉపాసన చేయాలనీ విధించారు.
అధర్వణ వేదం(10, 7, 32):- హృదయంలో ఉన్న స్వాత్మలోనే బ్రహ్మోపాసన అంటున్నారు కదా! మరి పైన వివరించిన సమస్త విశ్వవ్యాప్త విరాట్ స్వరూపఉపాసన ఎలా సిద్ధిస్తుంది? స్వాత్మ కన్నా విశ్వం వేరే కదా! అంటే ఇదివరలో అధికార భేదం వలన కర్మోపదేశంలో తేడా కలుగుతుందని చెప్పాము. అలాగే ఉపాసనల్లో ఉపదేశ భేదం ఉన్నది. కాని ఉపదేశాలలో భేదంఉన్నా సమస్తబ్రహ్మోపాసన ఆత్మలోనే సంభవం అని సూత్రాభిప్రాయం. బ్రహ్మచారులు, గృహస్తులు, వానప్రస్థులు,అగ్ని హోత్రాన్ని ద్రవ్యాహుతుల్ని, ఇచ్చి బయట భూమి మీదో, వేదిక పైనో చేస్తారు. దీన్ని విరక్తుడైనా వైశ్వానర ఉపాసకుడు ఆధ్యాత్మిక అగ్ని హోత్రం చేస్తారు.
ఛాందోగ్యం (5, 18, 2):- వక్షస్థలం వేదిక, రోమాలు బర్వి, హృదయం గర్హ పత్య అగ్ని, మనస్సు అన్వాహార్య పచనం, ముఖం ఆహవనీయం. (5, 24, 2, 3):- "యఏతదేవం విరిత్వాగ్నిహోత్రం జూహాతి" ఈ వాక్యాల్లో దీన్ని అగ్నిహోత్రం అన్నారు. విరక్తులు ఈ విధంగా అగ్నిహోత్రాన్ని తమ శరీరల్లోనే చేస్తారు. బయట భౌతికంగా చెయ్యరని భావం. ఇలా అధికార భేదం వలన కర్మభేదం సిద్ధిస్తుంది. ఐశ్వర్యప్రాప్తి లాంటి ఫలాన్ని ఆశించకుండా ఆనందనుభావం కోరే బ్రహ్మ జ్ఞానీ తన ఆత్మలోనే బ్రహ్మాన్ని ఉపాసిస్తాడు. అయితే ఈ ఉపాసన ఫలించిందని ఎలా తెలుస్తుంది. దీనికి అవధి ఉందా?
వ్యతిహారాధికరణం ( 3, 3, 37 )
సూత్రం :- 396
" వ్యతిహారో విశింషంతి హీతరవత్ "
వ్యతి హారః :- ఉపాస్య, ఉపాసకుల్లో పరస్పరం ఏకరూపత బోధ పడడమే ఉపాసనకు అవధి అని తెలుసుకోవాలి. హి :- ఎందుకంటే, ఇతరవత్ :- ఇతర శాస్త్రాలు, విశింషంతి :- విశేషంగా వర్ణిస్తున్నాయి.
భావం :- ఉపాస్య, ఉపాసకుల్లో పరస్పరం ఏకరూపత బోధ పడడమే ఉపాసనకు అవధి అని తెలుసుకోవాలి. ఎందుకంటే ఇతర శాస్త్రాలు విశేషంగా వర్ణిస్తున్నాయి.
వివరణ:- ఉపాసకుడు ఉపాసన చేస్తూ, క్రమంగా ఉపాస్య బ్రహ్మంతో తనకు సారూప్యం ఏర్పడినట్లుగా అనుభవం పొందడం ప్రారంభిస్తాడు. ఈఅవస్థే ఉపాసనకు పరామవధి. ఇదే బ్రహ్మసాక్షాత్కారం. ఏకరూపత అంటే ఉపాసకుడు బ్రహ్మానందం అనుభవించడం. ఉపాసన పరాకాష్ట చెందినప్పుడు ఉపాసకుడు బ్రహ్మంతో తనకు ఏకరూపత కలిగినట్లు భావిస్తాడు. ఏకరూపతా భావం ఉన్నంత మాత్రాన జీవుడు, పరమేశ్వరుడు ఒక్కటే అని అనుకోకూడదు. అది ఉపాసకుడు బ్రహ్మానందం అనుభవించేస్థితి మాత్రమే. బ్రహ్మం ఆనందస్వరూపం. ఉపాసన పరామావధికి చేరినప్పుడు బ్రహ్మ తన స్వరూపాన్ని ఉపాసకుడుకి వెల్లడి చేస్తాడు.
ముండకోపనిషత్తు( 3, 3, 4):- ఉపాసనకు పరమావధి, వ్యతిహారం, ఉపాస్య, ఉపాసకుల ఏకరూపత జరుగుతుంది. ఇతర విషయాలలో లాగా జీవుడేబ్రహ్మ, బ్రహ్మేజీవుడు. ఉపాసకుడే సూర్యమండలం లోని పురుషుడు. ఆ పురుషుడే ఉపాసకుడు అని పఠిస్తున్నారు. ఈరకంగా రెండూ రూపాలను ఉపాసన చెయ్యాలా? లేక ఒకే విధమైన ఉపాసన చెయ్యాలా? అని సందేహం. ఒకే విషయాన్ని ఒకసారి అటు, ఒకసారి ఇటు చెప్పడం వ్యతిహారం. ఇక్కడ జీవేశ్వరుల పరస్పర విశేషణ విశేష్య భావం వ్యతిహారం. నేనే నువ్వు అన్నప్పుడు ఈశ్వరుడు విశేషణం. నేను అనే జీవుడు విశేష్యం. ఏకరూపమైన మతి చెయ్యాలని అంటున్నారు. ఇక్కడ జీవాత్మకు పరమాత్మతో ఏకాత్వన్ని ప్రతిపాదించడం తప్ప చెప్పవలసినది మరొకటి ఏమి లేదు. వ్యతిహారం చెప్పడం ఎందుకంటే ఏకత్వాన్ని దృఢం చెయ్యడం కొరకు నువ్వే నేను, నేనే నువ్వు అని చెప్పడంలో ఏకత్వాన్ని గట్టిగ నొక్కి చెప్పినట్లు అవుతుంది. ఆదిత్య మండలంలోని పరమాత్మ, కంటిలో ఉన్న అక్షి పురుషుడు ఒక్కరే.
సత్యాద్యధికరణం ( 3, 3, 38 )
సూత్రం :- 397
" సైవ హి సత్యాదయః "
హి :- ఏ కారణంతో, స ఏవ :- ఛాందోగ్యంలో చెప్పిన శాండిల్య విద్యనే బృహదారణ్యకంలో చెప్పారో, అదే కారణం వలన, సత్యాదయః :- ఛాందోగ్యం లో వర్ణించిన సత్య, సంకల్పాదులు,
భావం :- ఏ కారణంతో ఛాందోగ్యంలో చెప్పిన శాండిల్య విద్యనే బృహదారణ్యకంలో కూడా చెప్పారో, అదే కారణం వలన ఛాందోగ్యం లో వర్ణించిన సర్వేశానత్వాది గుణాలు పరస్పరం ఒక ఉపాసన నుంచి మరొక ఉపాసనలో గ్రహించాలి.
వివరణ:-గురువర్యా! బృహదారణ్యకంలో అహర్నాసమైన బ్రహ్మాన్ని ఈవిధంగా వ్యాహృతుల రూపంలో తెలుసుకొని ఉపాసన చేసేవాడు పాపాలను వదలివేస్తాడు. ఆ సత్యమే ఆదిత్యుడు. ఆదిత్యమండలం లోని పురుషుడే దక్షిణ నేత్రంలో ఉన్న పురుషుడు అని చెప్పబడింది. మరి ఈరెండు సత్యవిద్యలు ఒక్కటేనా? వేరువేరా? అని అడిగాడు కృష్ణశర్మ. దానికి సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. బృహదారణ్యకంలో చెప్పిన సత్యవిద్యలు రెండూ ఒక్కటే. ఈ రెండింటిలోనూ ఉపాస్యుడు హిరణ్యగర్భుడే.
ఛాందోగ్యోపనిషత్తు(3, 14, 1/2/3):- సర్వం ఖల్విధం బ్రహ్మ. " జ్యాయా నేభ్యో లోకేభ్యః " ఈ వాక్యంలో శాండిల్య విద్యను వర్ణించారు. బృహదారణ్యకంలో ( 5, 61 )లో చెప్పిన విద్య రెండూ ఒక్కటే.
శత పధ బ్రాహ్మణం(10, 6,3,2,):-"సఆత్మనా ముపాసీత మనోమయం ప్రాణ శరీరం భారూపమ్" లో ఉన్న శాండిల్య ఉపాసన, ఛాందోగ్యం లో వర్ణించిన దానితో సమానమే. పై ఉపాసనలన్ని ఒక్కటే. ఈ విద్యను శాండిల్యుడు ప్రారంభించాడు. మిగిలిన ఆచార్యులు దీన్నే వర్ణించారు. ఒక చోట ఉన్న విద్యను సర్వత్రా గ్రహించాలని సూత్రాభిప్రాయం. వాజసనేయంలో హృదయం అనే హిరణ్యగర్భుణ్ణి ప్రస్తావించి, సత్యవిద్య పఠించ బడింది. సర్వ వ్యాపకం, పూజ్యం, భౌతికము లన్నింటి కంటే ముందుగా పుట్టినది అయిన ఈ హిరణ్యగర్భుడనే బ్రహ్మను సత్యం బ్రహ్మ అని ఎవరు ఉపాసిస్తారో అతడు ఈ లోకాలను జయిస్తాడు. హిరణ్యగర్భుడనే పేరు గల బ్రహ్మమే సత్యం. సత్యమ్ మూడు అకారాలు గల పదం. స, త్, యమ్. 1, 3 అక్షరాలు సత్యమైనవి. మధ్యనున్నది అసత్యం. రెండూ ప్రక్కలా సత్యం చేత పరివృతమైనందున మధ్య నున్న అసత్యం కూడా సత్యమే అవుతుంది. హిరణ్యగర్భుడనే నామధేయం గల ఏ సత్యమున్నదో అదే ఆదిత్య మండలం లోని పురుషుడు. ఆ సత్యమే కుడి కంటిలో ఉన్న పురుషుడు. శాండిల్య విద్య, సత్య విద్యలలో పేర్కొన్న సత్య సంకల్పాదులు, గుణాలు ఒక ఉపాసన నుండి మరొక ఉపాసనలో గ్రహించాలి.
కామ్యాధికరణం ( 3, 3, 39 )
సూత్రం :- 398
" కామాది తరత్ర తత్ర చాయ తనాది భ్యః "
ఇతరత్ర :- బృహదారణ్యకం లో వర్ణించిన, కామాది :- సత్య కామం లాంటి గుణాలను, తత్ర చ :- ఛాందోగ్యంలో పేర్కొన్న దహర విద్యలో కూడా గ్రహించాలి. ఆయతనాదిభ్యః :- హృదయం ఆయతనాది సమాన ధర్మం వలన రెండు స్థలాలలో చెప్పిన విద్య ఒక్కటే.
భావం :- బృహదారణ్యాకంలో వర్ణించిన సత్య కామం లాంటి గుణాలను, ఛాందోగ్యంలో పేర్కొన్న దహర విద్యలో కూడా గ్రహించాలి. హృదయం ఆయతనాది సమాన ధర్మం వలన రెండు స్థలాలలో చెప్పిన విద్య ఒక్కటే.
వివరణ:- గురుదేవా! ఈ శరీరాన్ని బ్రహ్మపురం అంటారు. రాజ్యానికి అధికారులు, సేవకులు ఉన్నట్లే, శరీరానికి ఇంద్రియాలు, మనస్సు ఉన్నాయి. హృదయస్థానంలో ఒక పద్మం ఉన్నది. దాన్నే హృత్పద్మం అంటారు. అతడు ధర్మాధర్మ రహితుడు. జరా మృత్యువులు లేనివాడు. శోకరహితుడు. పాప రహితుడు. జరా మృత్యువులు లేనివాడు. కోరికలను వెంటనే పొందే శక్తి కలవాడు అని ఛాందోగ్యం లో చెప్పబడింది. బృహదారణ్యకంలో ఆత్మ గొప్పది. పుట్టుక లేనిది. అది ప్రాణమునందు, ఇంద్రియాలలో ఉంటుంది. విజ్ఞాన రూపమైనది. స్వయం జ్యోతి. దహరాకాశం లోనే ఈ పురుషుడు శయనిస్తాడు.అందరిని వశం చేసుకోగలుగుతాడు. ఛాందోగ్యంలోని విద్య సగుణము అని, బృహదారణ్యకం లోని విద్య నిర్గుణం అని అంటారు. కాబట్టి ఈ రెండింటికి భేదం ఉన్నదా? లేదా? వివరించండి అన్నాడు కృష్ణ శర్మ. సత్య కామత్వం మొదలైన గుణాలు బృహదారణ్యకం లోకి, బృహదారణ్యకం లోని సర్వ వశిత్వాది గుణాలు ఛాందోగ్యంలోకి ఉపసంహరించుకోవచ్చును. రెండింటి యందు హృదయమే ఆయతనం. బ్రహ్మమేఉపాస్యం. కాబట్టి ఇక్కడ సగుణ, నిర్గుణ భేదం ఉన్నప్పటికీ విద్యా స్తుతి కోసం ఉపసంహరించు కోవచ్చును.
ఛాందోగ్యోపనిషత్తు (8, 1, 1) ( 8, 1, 5 ):- హృదయంలో దహరాకాశం ఉన్నట్లు దహరోపాసన ప్రారంభించి సత్య కామాది గుణాలను వర్ణించారు. అలాగే బృహదారణ్యకం లో కూడా ( 4, 4, 22 ) ఆ పరమాత్మ ఈ హృదయంలో ఉన్న ఆకాశంలో ఉన్నాడు అన్ని చెప్పి హృదయాకాశంలో ఉన్న బ్రహ్మానికి వశత్వం లాంటి గుణాలున్నాయని వివరించారు. ఇలా రెండూ చోట్ల వర్ణించిన ఈ రెండూ విద్యలు ఒకటేనా? వేరా? ఛాందోగ్యంలో దహరాకాశం ఉపాస్యం అన్నారు. బృహదారణ్యకం లో హృదయాకాశం లో ఉన్న ఆత్మ ఉపాస్యం అంటున్నారు. ఎందుకీ స్వరూప భేదం? ఉపాసనల్లో తేడా ఉన్నదా? అంటే రెండూ చోట్ల హృదయ రూపమైన ఆశ్రయం ఒక్కటే. ఉపాసనకు ఆశ్రయం రెండూ చోట్ల హృదయమే. ఛాందోగ్యంలో చెప్పిన ఆకాశం అంటే బ్రహ్మమే ఆకాశం బ్రహ్మ వాచకమని ఇది వరకే చెప్పారు. రెండూ చోట్ల చెప్పిన దహరోపాసన ఒక్కటే. ఛాందోగ్యంలో వర్ణించిన గుణాలు బృహదారణ్యకోపాసనలోను, బృహదారణ్యకంలో వర్ణించిన గుణాలు ఛాందోగ్యంలో గ్రహించాలి. ఆ గుణయుక్త బ్రహ్మమే ఉభయత్రా ఉపాస్యమని గ్రహించాలి.
దహర విద్య :- బ్రహ్మ రంధ్రమునందు చిన్న కమలము, ఆ కమల మధ్యమున సూక్ష్మ మైన శూన్య స్థానం, ఆ శూన్యమే దహరాకాశం అనబడును. దీనిని తెలుసుకున్న వాడు బ్రహ్మను తెలుసుకొనును. ఈ తెలుసుకునే విద్యనే దహర విద్య లేక ప్రాణ విద్య అంటారు.
ఆదరాధికరణం ( 3, 3, 40 )
సూత్రం :- 399
" ఆదరాద లోపః "
ఆదరాత్ :- బ్రహ్మోపాసన అత్యంత ఆదరంతో చెయ్యాలి. అప్పుడే అలోపః :- అది ఏ లోపం లేకుండా ఉండి సఫలీ కృతం అవుతుంది.
భావం :- బ్రహ్మోపాసన అత్యంత ఆదరంతో చెయ్యాలి. అప్పుడే అది ఏ లోపం లేకుండా ఉండి సఫలీకృతం అవుతుంది.
వివరణ:-గురువర్యా! వైశ్వానరుడు భోజనసమయంలో ముందుగావడ్డించిన అన్నాన్ని హవనంచెయ్యాలి అంటే ప్రాణాహుతు లివ్వాలి. మొదటి ఆహుతి 'ప్రాణాయ స్వాహాః ' అంటే ప్రాణం తృప్తి పడుతుంది. దీని వలన నేత్రం, ఆదిత్యుడు, ద్యులోకం దేవతలు తృప్తి పడతారు. అందుకే వలన భోక్త సంతానం, పశువులు, తేజస్సు, బ్రహ్మ వర్చస్సు పొందుతాడు. రెండవ ప్రాణాహుతి ' వ్యానాయ స్వాహః ' దీని వలన వ్యాన వాయువు తృప్తి చెందుతుంది. అందువలన శ్రోత్రం, చంద్రుడు, దిక్కులు, అధిష్టాన దేవతలు తృప్తి పొందుతారు. అంటూ ప్రాణాహుతుల వలన ఫలితం చెప్పబడింది. ఒకవేళ ఎప్పుడైనా భోజనం చెయ్యక పోతే అంటే భోజనం లోపం కలిగినప్పుడు ప్రాణాగ్ని హోత్రానికి లోపం కలుగుతుందా? అన్ని ప్రశ్నించాడు కృష్ణ శర్మ. భోజనం లోపం కలిగినప్పటికి అగ్నిహోత్ర లోపం ఉండదు. అతిధుల వలన ముందు భోజనం చెయ్యాలి అని జాబాల శ్రుతి చెబుతున్నది. కాబట్టి ఒక వేళ భోజన లోపం కలిగినా ప్రాణాగ్ని హోత్రానికి లోపం కలుగదు. యోగ దర్శనంలో చెప్పినట్లుగా బ్రహ్మోపాసన దీర్ఘ కాలం, నిరంతరం, సత్కార బుద్ధితో, శ్రద్ధతో చేసినప్పుడే ఫలవంతమౌతుంది. ముముక్షువులు సంసారిక సుఖలన్నింటిని విడిచి బ్రహ్మోపాసనకు పూనుకుంటాడు.
కఠోపనిషత్తు ( 3, 14 ) :- సదా సచేతనుడై నిరంతరం అభ్యాస శీలుడై ఉండే వాడే ఈ దుర్గమ మార్గాన్ని తరించగలడు.
బృహదారణ్యకోపనిషత్తు ( 6, 2, 15 ) :- శ్రద్ధతో, తపస్సుతో, ఏకాంతంలో సత్య బ్రహ్మాన్ని ఉపాసిస్తారు. అప్పుడే బ్రహ్మ ప్రాప్తి కలుగుతుంది అని రెండింటిలో వర్ణించారు. ఇలా ఉపాసనతో ఆదరం ఉండాలని ప్రకటించారు. అలా చేసినప్పుడు ఉపాసన లోపించకుండా ఫలిస్తుంది. భోజనలోపం కలిగినప్పుడు మరొక ద్రవ్యాన్ని గాని ప్రతినిధి రూపంలో ఉపయోగించి ప్రాణాన్ని హోత్రం చెయ్యాలి. నిర్గుణ బ్రహ్మ విషయంలో ఉపాసన లేకపోయినా స్తుతి కోసం గుణాల లోపం ఉండకుండా బ్రహ్మోపాసన అత్యంత శ్రద్ధతో చేసినప్పుడే ఫలవంతమౌతుంది.
సూత్రం :- 400
" ఉపస్థితే త స్తద్వచనాత్ "
తత్ వచనాత్ :- ఛాందోగ్య వచనం చెప్పినట్లు, అతః :- ఈ బ్రహ్మోపాసన వలన, ఉపస్థితే :- బ్రహ్మ జ్ఞానం కలిగి మోక్షం వస్తుంది.
భావం :- ఛాందోగ్య వచనం చెప్పినట్లు ఈ బ్రహ్మోపాసన వలన బ్రహ్మ జ్ఞానం కలిగి మోక్షం వస్తుంది.
వివరణ:- దీర్ఘ కాలం నిరంతరం సత్కార బుద్ధితో బ్రహ్మాన్ని ఉపాసించినప్పుడే బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది. అదే మోక్షం. ఆదరాతిశయంతో ఉపాసించనివాడికి మోక్షం లభించదని భావం. భోజనం ద్రవ్యం దగ్గరగా ఉన్నప్పుడు ముందుగా లభించి నట్టి పదార్ధంతోనే ప్రాణాన్ని హోత్రం చెయ్యాలి. భోజనం లేకపోతే ప్రాణాహుతులుండవు. అంటే భోజనం దొరకనప్పుడు ప్రాణాగ్నిహోత్రానికి లోపమే. భోజనలోపం కలిగినప్పుడు మరొక ద్రవ్యాన్ని ఎలా ప్రతినిధిగా చేర్చగలం? సిద్ధంగా తినడానికి వచ్చిన అన్నాన్ని ఆశ్రయించి విధించబడిన ఆహుతులు కూడా అలాృటీ అన్నం లోపించినప్పుడు లోపిస్తాయి కాని మరొక ద్రవ్యం ఉదకం లాంటివి ప్రతినిధిగా కల్పించబడవు. ముఖ్యాగ్ని హోత్రంలో స్టండిలమే ( తేనే వంటి ప్రదేశం ) కాని వేరే లేదు. భోజనానికి ఏ కాలమో ఆ కాలంలోనే ఈ ప్రాణాగ్ని చేయబడాలి. ముఖ్యాగ్ని హోత్రానికి సంబంధించిన కొన్ని ఉపస్థనాది ధర్మాలు కూడా ఏదో విధంగా ఈ అగ్నిహోత్రం లో కుదరవు. అతిధులు భోజనం చేసిన తరువాత గృహ స్వామి భోజనం చెయ్యాలి అన్ని శాస్త్రము ఉండగా, అతిధుల కంటే ముందుగా ఎలా భోజనం చేస్తాడు అనే శంకకు అవకాశం లేదు. అనగా ఈ వాక్యం వైశ్వానర విద్యోపాసన చేసేవారికి వర్తిస్తుంది. అయితే ఈ వాక్యం చేత ప్రాణాగ్ని హోత్రం నిత్యమని చెప్పడానికి శక్యం కాదు. అందువలన భోజనానికి లోపం కలిగితే ప్రాణాగ్ని హోత్రానికి లోపమే.
తన్నిర్ధారణాధికరణం ( 3, 3, 42 )
సూత్రం :- 401
" తన్నిర్ధారణా నియమ స్తధ్రుష్టేః పృథక్ హ్య ప్రతి బంధం ఫలమే "
తత్ నిర్ధారణ అనియమః:-అలాంటి నియమం లేదు. తత్ దృష్టేః :- అది బ్రహ్మ దర్శనం కన్నా, పృథక్ :- వేరు, హి :- ఎందుకంటే, అప్రతి బంధః :- ప్రతిబంధం లేకపోవడమే దానికి ఫలం.
భావం :- అలాంటి నియమం లేదు. అది బ్రహ్మ దర్శనం కన్నా వేరు. ఎందుకంటే ప్రతిబంధం లేకపోవడమే దానికి ఫలం.
వివరణ:- ప్రతిబంధనాశనం, బ్రహ్మదర్శనం ఈ రెండూ బ్రహ్మోపాసనకు ఫలితాలే. ఉపాసనకు ప్రతి బంధకాలు నశించడం ఫలమనీ, ఆస్థితే బ్రహ్మజ్ఞానమనీ, దానికి మించిన బ్రహ్మజ్ఞానం మరొకటి లేదనీ అనుకోకూడదు. ఉపాసనవలన ప్రతి బంధకాలు నశించకుండానే బ్రహ్మజ్ఞానం కలుగుతుందనికూడా భావించకూడదు. బ్రహ్మదర్శనం, ప్రతిబంధకాలు లేకపోవడం వేరే. ఉపాసన వలన అడ్డంకులు తొలగిపోతాయి. కాని బ్రహ్మజ్ఞానం కలుగుతుందని నిర్ణయించడానికి వీలుకాదు. బ్రహ్మ విద్యకై సద్గురువును ఆశ్రయించి, దీర్ఘకాలం నిరంతర శ్రద్ధతో చేసిన బ్రహ్మోపాసన వలన బ్రహ్మజ్ఞానం కలగడానికి ప్రతిబంధకమైన చిత్తవిక్షేపాదులు సమూలంగా నశిస్తాయి. అంతఃకరణ శుద్ధం అయిన తరువాత చేసిన ఉపాసన వలన బ్రహ్మజ్ఞానం జనిస్తుంది. ఆత్మలోకి అంతర్ముఖత చెందడం వలన ఆత్మసాక్షాత్కారం పొందిన తరువాతే మోక్ష సిద్ధి లభిస్తుంది. బ్రహ్మదర్శనం, ప్రతిబంధకాలు నశించడం వేర్వేరు ఫలితాలిస్తాయని మహర్షి చెబుతున్నారు.
ముండకోపనిషత్తు ( 3, 1, 9 ) :- సూక్ష్మ వ్యాపక తత్త్వమైన పరమాత్మను చిత్త శుద్ధితో తెలుసుకోవాలి.
యోగ దర్శనం(1, 29) :- ఆత్మ చేతన జ్ఞానం. అంతరాయల భావం కలుగుతుంది. చేతనాచేతనాల వివేక సాక్షాత్కారమే ఆత్మ జ్ఞానం. ఆత్మసాక్షాత్కారం కలిగితే బ్రహ్మసాక్షాత్కారం సునాయాసంగా కలుగుతుంది. ఉపాసనల వలన ప్రతిబంధనాల నివారణ జరిగి, బ్రహ్మసాక్షాత్కారం కలుగుతుంది. కనుక ఉపాసనలు రెండూ ఫలాలే. ఉపాసనల వలన చిత్త విక్షేపాది ప్రతి బంధకాలు, చిత్తవ్యాపారాలు నశించి చిత్తం ప్రసన్నమౌతుంది. అప్పుడు ఋతంభరాప్రజ్ఞ ఏర్పడుతుంది. ఋతం అంటే సత్యం, భరా అంటే పూర్తి, సత్యంతో నిండిన ఆకాంక్షను ఋతంభరా అంటారు. శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మల మధ్య సమతౌల్యాన్ని తీసుకు వచ్చి, ఏకాగ్రత, సామర్ధ్యం, నిబద్ధత కలిగిస్తుంది. ఈ ప్రజ్ఞను సాధించ గలిగితే ఆ వ్యక్తి సాధువు, ఋషి, మహర్షి, రాజర్షి, దేవర్షి ఏమైనా కాగలడు. కొన్ని ఉపాసనలు కర్మాంగాలను ఆశ్రయించి ఉంటాయే కాని అవి కర్మంగాలు కావు. ఉపాసనలకు, కర్మలకు నిత్య సంబంధం లేదు అని వేదం చెబుతోంది. కర్మలకు, ఉపాసనలకు ఫలం వేరుగా చెప్పబడింది. కర్మ ఫలం వేరు. ఉపాసన ఫలం వేరు. కాబట్టి కర్మ ఫలం అనుభవించడానికి ఉపాసనలు ప్రతిబంధకాలు.
ప్రధానాధికరణం ( 3, 3, 43 )
సూత్రం :- 402
" ప్రదానవ దేవ తదుక్తమ్ "
ప్రదానం :- దానం యజ్ఞం లోపాన్ని తొలగిస్తుంది. ఏవ :- అలాగే, తత్ :- ఉపాసన ప్రతి బంధకాలను తొలగించి జ్ఞానానికి సాధనం అవుతుంది. ఉక్తం :- పూర్వ మీమాంస దర్శనం లో అన్నారు.
భావం :- దానం యజ్ఞ లోపాన్ని తొలగిస్తుంది. అలాగే ఉపాసన ప్రతి బంధకాలను తొలగించి జ్ఞానానికి సాధనం అవుతుందని పూర్వమీమాంస దర్శనంలో అన్నారు.
వివరణ:-యజ్ఞనిర్వహణలో యజ్ఞవేదికపై కూర్చుని, యజ్ఞాన్ని అనుష్టించే ఋత్విక్కులకు, యజ్ఞం ముగిసిన తరువాత ఇచ్చే వస్త్ర, ధనాదులను దక్షిణగా ఇస్తారు. విద్వాంసులైన బ్రాహ్మణులకు వస్త్రాలు, ధనం, బంగారం లాంటివి దానం చేస్తారు. దానినే యజ్ఞదక్షిణ అంటారు. ఆదక్షిణ ఇవ్వకపోతే యజ్ఞం సంపూర్ణం కాదు. అధి విశిష్ట దానం. కనుక దానిని ప్రదానం అంటారు. ఈప్రదానమే యజ్ఞలోపాన్ని తొలగించినట్లే, బ్రహ్మోపాసన కూడా చిత్త విక్షేపాది ప్రతి బంధకాన్ని తొలగిస్తూ బ్రహ్మ జ్ఞానానికి సాధనం అవుతుందని పూర్వ మీమాంసా దర్శనంలో చెప్పబడింది.
పూర్వ మీమాంస(3, 7, 11) :- యజ్ఞకర్మకు దీక్ష, దక్షిణ అనేవి ప్రధాన అంగాలు. ఎంతో దీక్షతో యజ్ఞం చేసి, బ్రాహ్మణులకు దక్షిణ ఇస్తేనే యజ్ఞఫలం దక్కుతుంది. అలాగే ఉపాసనకూడా అడ్డంకులన్నింటిని తొలగించి బ్రహ్మజ్ఞానం కలిగించడానికి సాధనం అవుతుంది. ఛాందోగ్యంలో సంవర్గ విద్యలో శరీరాన్ని ఉద్దేశించి ప్రాణాన్ని, దేవతలను ఉద్దేశించి వాయుధ్యానం సూచించబడింది. ఇప్పుడు చాలా గ్రంధాలు ప్రాణం, వాయువు ఒక్కటే నని ప్రకటించాయి. ఇక్కడ వాయువు, ప్రాణాన్ని విడి విడిగా భావించాలి. వాయువు వేరు ప్రాణం వేరు అన్ని శ్రుతులు చెబుతున్నాయి. ఇంద్రుడు ఒక్కడే అయినప్పటికీ అతని సామర్ధ్యల ప్రకారం రాజు, చక్రవర్తి, సార్వభౌముడు అన్ని విడి విడిగా అర్పణలు ఇచ్చినట్లు గుణ భేదాల చేత వేరేవుతున్నారు. అట్లే వాయుప్రాణాలను స్వభావంలో తేడా లేనప్పటికి వాటిని వేరుగా ఉంచాలి. ఎందుకంటే వారి వేరు వేరు నివాసాల కారణంగా వారి విధులు భిన్నంగా ఉంటాయి. వాయు తత్వం లో భేదం లేకపోయినా ఆధ్యాత్మ, అధి దైవత స్థానాలను బట్టి వాయువు, ప్రాణం అనే వాటి ఉపాసనలు వేరు వేరుగానే ఉన్నాయని జైమినిమహర్షి పూర్వ మీమాంస లో తెలియజేశారు.
లింగభూయస్త్వాధికరణం ( 3, 3, 44 )
సూత్రం :- 403
" లింగ భూయస్త్వాత్తద్ధి బలీయస్త దపి "
లింగ భూయస్త్వాత్ :- బహుళమైన ప్రమాణాల వలన, తత్ హి :- ఆ బ్రహ్మ జ్ఞానమే, బలీయం :- బలీయమైన సాధనం, అని, తత్ అపి :- శాస్త్రాల్లో చెప్పి యున్నారు.
భావం :- బహుళ ప్రమాణాల వలన ఆ బ్రహ్మ జ్ఞానమే బలీయ మైన సాధనం అన్ని శాస్త్రాల్లో చెప్పి యున్నారు.
వివరణ:- మనసుచేత చింతింపబడిన దానిని మనశ్చిత్తం అంటారు. శతపధబ్రాహ్మణంలో మనస్సు చేత చింతింపబడినట్టి, వాక్కుచేత సంపాదింపబడినట్టి, ప్రాణం, చక్షవులు, శ్రోత్రము, మొదలైన వాటి చేత సంపాదించబడిన వాటి వాటి వృత్తి రూపమైన ముప్పై ఆరువేల అగ్నులను చూసింది అన్ని చెప్పబడింది. మనోవృత్తులు అసంఖ్యాకములైనా కూడా మానవుని ఆయుర్దాయం 100 సం. 100×360= 36000 అహోరాత్రులలో కలిగే మనో వృత్తులు 36000 అని చెప్పబడింది. వీటిని అగ్నిగా, సూర్యునిగా, ఆత్మస్వరూపులుగా భావించి ధ్యానించ వచ్చును.ఇవి మనస్సుచేత సంపాదించబడిన మనశ్చితాలు. ఈ విధంగా మనస్సు మొదలైన వాటి చేత చింతింప బడినవిగా చెప్పబడినటువంటి అగ్నులు కర్మలకు సంబంధించినవా? లేక ఉపాసనకోసం చెప్పా బడినవా? అని శంక. ఈ అగ్నులన్నీ స్వతంత్రములు. ఈ భూతములు, ప్రాణులు మనస్సులో ఏమి సంకల్పించినా అవన్నీ ఈ అగ్నులే చేస్తాయి. ఉపాసకుడు నిద్రపోతున్నా మేల్కొని ఉన్నా అతని కోసం ఈ సమస్త భూతాలు ఎల్లవేళలా ఈ అగ్నుల్ని సంపాదిస్తూనే ఉంటాయి. కనుక ఇవన్నీ స్వతంత్రములే. వీటిని మనోమయం, మనోరూపాలు అంటారు. అట్లే వాక్కు, ప్రాణం మొదలైనవి కూడా తమ తమ వృత్తిలే రూపాలుగా గల వృత్తులను చూచాయి.
ఛాందోగ్యోపనిషత్తు(7, 1, 3):-తరతిశోక మాత్మవిత్ బ్రహ్మాన్ని ఎరిగిన వాడు బ్రహ్మరూప మోక్షపదాన్ని పొందుతాడు. బ్రహ్మ జ్ఞాని మోక్షాన్ని పొందుతాడు. వ్యాపకుడైన పరమాత్మను ఎరిగినవాడు దుఃఖాన్ని తరించి ఆనందరూప మోక్షాన్ని పొందుతాడు. బ్రహ్మ జ్ఞానమే మోక్షసాధనమని బోధించారు.
సాంఖ్య దర్శనం ( 3, 23 ) :- బ్రహ్మ జ్ఞానమే ముక్తికి మార్గం.
యజుర్వేదం ( 30, 18 ) :- ఈశ్వరుణ్ణి తెలుసుకొని మృత్యువును తరిస్తాడు. కనుక బ్రహ్మజ్ఞానమే ముక్తి సాధనం అన్ని సిద్ధాతం. బ్రహ్మజ్జానమే మోక్షానికి బలీయమైన సాధనమని ఆధ్యాత్మ శాస్త్రాల్లో చెప్పియున్నారు.
లింగ భూయస్త్వాధికారణము ( 3, 3, 45 )
సూత్రం :- 404
" పూర్వ వికల్పః ప్రకారణాత్ స్యాత్ క్రియా మానసవత్ "
ప్రకారణాత్ :- మోక్షానికి జ్ఞానం, కర్మ రెండూ సాధనలని చెప్పారు. పూర్వ వికల్పః స్యాత్ :- వైకల్పికంగా జ్ఞానం లాగా కర్మ కూడా సాధనం. క్రియా మానసవత్ :- బాహ్య క్రియ అయిన అగ్ని హోత్రానికి, మానసిక క్రియ వికల్పం కదా!
భావం :- ఇది పూర్వ పక్ష సూత్రం. మోక్షానికి కర్మ, జ్ఞానం రెండూ సాధానాలని చెప్పారు కనుక వైకల్పికంగా జ్ఞానం లాగా కర్మ కూడా సాధనమౌతుంది. బాహ్య క్రియ అయిన అగ్ని హోత్రానికి మానసిక క్రియ వికల్పం కదా!
వివరణ:- మోక్షానికి జ్ఞానం, కర్మ రెండూ సాధనలే కదా! అందువలన కేవలం జ్ఞానమే సాధనం అనడం ఎలా పొసగుతుంది? బాహ్య క్రియ అయిన అగ్ని హోత్రానికి మానసిక క్రియ వికల్పం కదా! అన్ని పూర్వ పక్ష వాదన.
కౌషీతకీ బ్రాహ్మణం(2, 4, 5):- ఏతా ఆజ్యాహుతేర్జుహాతి వాచంతే మయి జుహా మ్యసౌ స్వాహా " అన్ని మొదటి వాక్కు ప్రాణం లాంటి వాటి బాహ్య కర్మలు చెప్పి, తరువాత దాన్నే మానసకర్మ రూపంలో వర్ణించారు. ( 2, 4, 6 ) :- ఇక్కడ మానసిక అగ్నిహోత్రాన్ని వర్ణిస్తున్నారు. మనిషి మాట్లాడినంత సమయం ప్రాణాన్ని గ్రహించలేదు. శ్వాసించ లేదు. అప్పుడు వాక్కుతో ప్రాణాన్ని ఆహుతి చేస్తాడు. అలాగే శ్వాస తీసుకునేటప్పుడు మాట్లాడలేడు. అప్పుడు శ్వాసతో వాక్కును ఆహుతి చేస్తాడు. అవి అమృతాహుతులు. వీటికి అంతం లేదు. ఇవి అనంతాలు. జాగ్రదావస్థలోను, నిద్రలోనూ ఎప్పుడు ఈ అగ్నిహోత్రం జరుగుతూనే ఉంటుంది. ఇతర బాహ్య ఆహుతులు అల్పమైనవి. వాటికి అంతం ఉంది. పూర్వ విద్వాంసులు ఈ హోమం చేసే వారుకాదు. ఈశావాస్యంలో కూడా మోక్షాన్ని కర్మద్వారా కాని, జ్ఞానంద్వారా కాని పొందవచ్చును. జ్ఞానమొక్కటే సాధనమని అనడం తగదు. అందువలన కర్మ, జ్ఞానాలు వైకల్పికాలు అన్ని తెలుస్తోంది కదా! యావజ్జీవితం కర్మలు చేయాలని విధించారు. తరువాత ఆత్మ జ్ఞానాన్ని ఉపదేశించి జ్ఞానంతో అమృత ప్రాప్తి కలుగుతుందన్నారు. ఒకే ప్రకరణం లో కర్మ, జ్ఞానం గురించి చెప్పారు. దీని వలన ఒకప్పుడు కర్మ వలన, మరొకప్పుడు జ్ఞానం వలన మోక్షం లభిస్తుందని తెలుతోంది. కనుక కర్మ, జ్ఞానం రెండూ వైకల్పిక సాధనా లవుతున్నాయి.అప్పుడు కేవలం జ్ఞానం మాత్రమే సాధనం అనడం పోసగడం లేదు.
సూత్రం :- 405
" అతి దేశాచ్చ "
చ :- పైగా, అతిదేశాత్ :- ఒక దాని ధర్మం మరో దానిలో ప్రాప్తించడం వలన, వికల్పం అనడం సబబే.
భావం :- ఒక దాని ధర్మం మరో దానిలో ప్రాప్తించడం వలన వికల్పం అనడం సబబే అన్ని స్పష్టమౌతోంది.
వివరణ:- ఒక ధర్మాన్ని ఇంకొక దాని యందు ఆరోపించడాన్ని అతిదేశం అంటారు. ఈ అతి దేశం వలన కూడా ఈ అగ్నులు క్రియాంగాలే అన్ని పూర్వ పక్షం వారి వాదన.
ఈశావాస్యోపనిషత్తు(14, 11) :- మృత్యువును తరించడం, అమృతాన్ని పొందడం, రెండూ ఒక్కటే. మొదటిది కర్మ ఫలం, రెండవది జ్ఞానఫలం కార్యం. ఇలా ఒక సాధనా కార్యాన్ని, ఇంకొక సాధన కార్యంగా చెప్పారు. కనుక మోక్షానికి జ్ఞాన కర్మలు, వైకల్పిక సాధనాలు కదా! అగ్ని కర్రలను ఏ విధంగా దహనం చేస్తుందో అలాగే జ్ఞానం కర్మలను భస్మం చేస్తుంది. జ్ఞానాన్ని మించినది లేదు. కర్మయోగసిద్ధిని పొందిన వాడు జ్ఞానాన్ని తనలోనే తెలుసుకుంటాడు. జ్ఞానం అంటే స్వస్వరూప జ్ఞానం. నీ యొక్క అసలు రూపమే సచ్చిదానంద స్వరూపం. ఈ శరీరం నీది కాదు. నువ్వు ఆత్మవు అన్ని తెలుసుకోవడం. ఈశ్వరార్పితంగా కర్మలు చేస్తూ, సద్గురువులను వినయంతో సేవించి, ప్రార్ధించి జ్ఞానాన్ని గ్రహిస్తే సర్వభయాలనుండి, బంధాల నుండి, సంచిత కర్మలను నుండి విముక్తి పొందడమే ముక్తి. అదే మోక్షం. ఈ జ్ఞానం వలన జ్ఞానాగ్ని పుడుతుంది. దీనిలో సర్వ కర్మలు నశించిపోతాయి. దానితో మృత్యువు నుండి తరించడం, అమృతత్వాన్ని పొందడం జరుగుతుంది.కర్మ ఫలం ద్వారా జ్ఞాన ఫలాన్ని సాధించవచ్చునని తెలియ జేశారు.
సూత్రం :- 406
" విద్వైవ తు నిర్ధారణాత్ "
తు :- ఈ వాదన సరియైనది కాదు. నిర్ధారణాత్ :- జ్ఞాన కర్మలను వేర్వేరుగా నిర్ధారించారు. కనుక విద్య ఏవ :- జ్ఞానమే మోక్ష సాధనం.
భావం :- ఈ వాదన సరియైనది కాదు. జ్ఞాన కర్మలను వేరువేరుగా నిర్ధారించారు. కనుక జ్ఞానమే మోక్ష సాధనం అని చెప్పియున్నారు.
వివరణ:- ముందు సూత్రంలో చెప్పినట్లుగా మోక్షసాధనానికి జ్ఞాన, కర్మలు వైకల్పిక సాధనలు అన్ని చెప్పడం సరియైనది కాదు. ఉపనిషత్తులో బ్రహ్మజ్ఞానమే మోక్షసాధనంగా చెప్పారు. బ్రహ్మసాక్షాత్కారం తప్ప మరొకటి మోక్షసాధనం కాదని నిర్ధారించారు. జ్ఞానమే మోక్ష సాధనమని, కర్మ జ్ఞానానికి సాధనమని చెప్పియున్నారు.
ఈశావాస్యోపనిషత్తు:- నిష్కామ కర్మ చిత్తంలోని విక్షేపాది ప్రతి బంధకాలను తొలగించి, జ్ఞానోదయానికి సాధనం అవుతుంది. అందువలన వికల్పానికి తావు లేదు. నిష్కామకర్మ లో ఇంద్రియ నిగ్రహం కలిగి, బుద్ధి యందు సర్వేంద్రియీలు నిక్షిప్తం చేసి, సదా ఆ అంతరంగిక యజ్ఞము నందు నిమగ్నడై ఆత్మనుభూతి చెందుతాడు. సామాన్య వ్యవహారంలో సుఖ దుఃఖాసక్తి పొందక ఇంద్రియ వ్యాపారముల యందు నిమగ్నం కాక, ఆత్మానందం పొందిన వాళ్లే జ్ఞానులు. అంటే కర్మ ఫలాలు జ్ఞానాన్ని కలిగిస్తాయి కాని మోక్షాన్ని ఇవ్వవు. జీవితంలో ఒక రోజులో పుట్టే ఆలోచనలన్నీ ఒక మనోవృత్తి అనుకుంటే జీవితంలో ముప్పై ఆరు వేల మనోవృత్తులంటాయి. ఇవి మనస్చితాలు. ఈ విధంగా మనస్సు చేత చింతింపబడినవిగా చెప్పబడిన ఈ అగ్నులు కర్మంగాలు కావు. ఈ మనస్చిదాగ్నులు స్వతంత్రమైన విద్యాత్మకాలు. ఇది తెలుసుకున్న ఉపాసకుడు వీటిని అగ్నిగా, సూర్యునిగా, ఆత్మ స్వరూపులుగా భావించి ధ్యానించి, సంపాదించ గలుగుచున్నాడు.
సూత్రం :- 407
" దర్శనాచ్చ "
దర్శనాత్ చ :- ప్రమాణాలైన దర్శనాల వలన కూడా జ్ఞానమే మోక్ష సాధనమని నిర్ణయించాలి.
భావం :- ప్రమాణాలైన దర్శనాల వలన కూడా జ్ఞానమే మోక్ష సాధనమని నిర్ణయించాలి.
వివరణ :- (3, 3, 44) సూత్రంలో చెప్పిన ఉదాహరణలను సమన్వయం చేసుకోవాలి. వాటి వలన జ్ఞానమే మోక్ష సాధనం అని తెలుస్తోంది. ఇందుకు లింగం కనబడటం వలన కూడా ఇవి విద్యలే. ఇవి స్వతంత్రమైనవి అని చెప్పడానికి లింగం కూడా కనబడుచున్నది. వాక్చితాగ్ని, ప్రాణ చితాగ్ని, ఘ్రాణ చితాగ్ని, చక్షు చితాగ్ని, కర్మ చితాగ్ని అంటే హస్త కర్మేంద్రియాల చేత చితమైన అగ్ని, ఇవన్నీ అగ్నిచయన ప్రకరణం. సమస్త భూతాలు మనస్సు చేత దేనినైనా సంకల్పిస్తే అది ఈ అగ్నుల పనియే అని తెలుస్తోంది. ఈ విధంగా తెలుసుకున్న వాడు మెలకువగా ఉన్నా, నిద్రిస్తున్నా, సమస్త భూతాలు వాని కోసం అగ్ని చయనం చేస్తుంటాయి. ఎవరైతే నిష్కామకర్మ చేస్తారో తనలోనే స్వస్వ రూపాన్ని చూస్తాడో, ఆ ఉపాసకుడు ఆత్మానందం పొందే జ్ఞానం సంపాదిస్తాడు. ఆ జ్ఞానమే మోక్షానికి సాధనమని తెలుస్తోంది.
సూత్రం :- 408
" శ్రుత్యాది బలీయ స్త్వాచ్చ న బాధః "
శ్రుతి అది బలీయ స్త్వాత్ చ :- శ్రుతి వాక్యాలకే ఎక్కువ బలం ఉంది. కనుక, న బాధః :- మిగతా వాక్యాలలో భేదం లేదు.
భావం :- శ్రుతి వాక్యాలకు ఎక్కువ బలం ఉంది, కనుక మిగతా వాక్యాలలో భేదం లేదు.
వివరణ :- శ్రుతి, లింగ వాక్యాలు ప్రకరణ కన్నా బలమైనవి. కాబట్టి ఈ అగ్నులు స్వతంత్రములు అనడానికి సంశయం లేదు. ఈ విషయం తెలుసుకున్న ఉపాసకుడు నిద్రిస్తున్నా, మేల్కొన్నా అతని కోసం ఈ భూతాలన్నీ అగ్ని రచన చేస్తూనే ఉన్నాయి. ఇలాంటి శ్రుతి వాక్యాల వలన అగ్నులు కర్మాంగాలు కావు.
మీమాంస దర్శనం(3, 3, 14 ) :- శ్రుతి, లింగం, వాక్యం, ప్రకరణం, స్థానం, సమాఖ్య అనే ఈ ఆరింటిలో తేడా ఉంటే, తరువాత దాని కన్నా ముందు పదమే బలీయం అవుతుంది. శ్రుతి అన్నింటి కన్నా బలీయమైనది. ప్రకరణాల కన్నా వేద వాక్యాలకే బలం ఎక్కువ. ఇతర వాక్యాలు వాటిని బాధించవు. కనుక జ్ఞానమే మోక్ష సాధనం. ఏ మంత్రాన్ని ఏ కర్మ యందు వినియోగించాలి? ఏది దేనికి అంగం అని నిర్ధరించడానికి శ్రుతి, లింగమ్, వాక్యం, ప్రకరణం, స్థానం, సమాఖ్య అనేవి ఉపయోగపడతాయి. శ్రుతి మిగతా వాటి కన్నా బలీయమైనది. లింగం తరువాత నాలుగింటి కన్నా బలీయమైనది . వాక్యం... ప్రకరణం, స్థానం, సమాఖ్య కన్నా బలీయమైనది.
1.శ్రుతి :- ఇతరాపేక్ష లేకుండా ప్రత్యక్షంగా ఒక విషయం లో విధించే శబ్దం. " కదాచన స్తరీరసి" ఇది ఇంద్రుణ్ణి స్తుతించే మంత్రం. (ఇది లింగం ) అయితే ఐన్ద్ర్యా గార్హ పత్య ముపతిష్ఠతే " (ఇది శ్రుతి ) ఈ ఇంద్రదేవతాకమైన మంత్రం చేత గర్హ పత్య అగ్నిని స్తుతించాలి. ఈ శ్రుతి లింగం కన్నా బలీయం కనుక దీని చేత ఇంద్రుణ్ణి స్తుతించాలి. 2. లింగం :- దర్శ పూర్ణమాస ప్రకరణంలో పురోడాశాన్ని ( అగ్నికి ఇచ్చే ఆహుతి ) " స్యోనం తే సదనం కరోమి, ఘృతస్య ధారయా సుశేవం కల్పయామి తస్మిన్ సీదామృత్ ప్రతితిష్ట వ్రీహీణాం మేధ సుమన్య మానః " ఓ! పురోడాశమా! నీకు మంచి కల్పిస్తున్నాను. ఆ స్థానంలో కూర్చో! స్యోనం కల్పయామి దీని అర్ధాన్ని బట్టి ఈ మంత్రం సదనానికి, స్థానం ఏర్పరచడానికి అంగం అని తెలుస్తోంది. తరువాత వాక్యం కలిపితే కూర్చోబెట్టగల అనే అర్ధం వస్తుంది. మొదటి లింగాన్ని బట్టి ఈ పూర్వార్ధం సదనానికి అంగమని గ్రహించాలి. ఈవిదంగా వాక్యంకన్నా లింగం బలీయమైనది. 3.వాక్యం:-"ఇంద్రాగ్నులు దర్శయాగ దేవతలు " ఇంద్రాగ్ని ఇదం హవిరజుషేతాం మహాజ్యుయో క్రాతామ్ " అనే సూత్రంలో ఇంద్రాగ్ని అనే లింగం ఉండటం చేత అది దర్శాంగం అని తెలుస్తోంది. 'ఇదం హవిః 'వాక్యం ఇంద్రాగ్నిలో అన్వయిస్తుంది. ప్రకరణం కంటే వాక్యం బలేయమైనది. 4.ప్రకరణం :- అంటే పరస్పరాకాంక్ష. దీనిలో రెండూ విషయాలు చెప్పబడ్డాయి. 1. ఏమి చెయ్యాలి? అనే ఆకాంక్ష. 2. ఇది చేసి దేనిని సంపాదించాలి? అనే ఆకాంక్ష ఉంటుంది. అప్పుడు రెండూ కలిపి అన్వయించుకుంటే ఎలా చెయ్యాలో, ఏమి చెయ్యాలో తెలుస్తుంది. 5.స్థానం :- ఒకే ప్రదేశంలో చెప్పడం, లేదా చెయ్యడం. పాఠం కాని, అనుష్టానం కాని ఒకే ప్రదేశంలో చెయ్యడం. 6. సమాఖ్య :- యోగార్ధం చెప్పడానికి వీలున్నప్పుడు శబ్దం." హోతృ చమనః " హోత యొక్క చమనం అని అర్ధం. ఈ అర్ధాన్ని బట్టి హోత అనే ఋత్విక్కు చమన భక్షణానికి అంగం అని తెలుస్తోంది. స్థానం అనేది మిగిలిన ఐదింటి కన్నా దుర్భలం.
సూత్రం :- 409
" అనుబంధా దిభ్యః ప్రజ్ఞాన్తర పృధ క్త్వవద్ దృష్ట వచ్చ తదుక్తం
" ప్రజ్ఞాంతర పృధక్త్వవత్ :- ఉపాసకులు ఫలాన్ని బట్టి వేరే అయినట్లుగా, అనుబంధాదిభ్యః దృష్ట వత్ :- కర్మలకు వేరే ఫలాన్ని చూస్తున్నాం, చ :-అందువలన, కర్మకు జ్ఞానం తో వికల్పం లేదు. తదుక్తం :- శాస్త్రాల్లో చెప్పారు.
భావం :- ఉపాసకులు ఫలాన్ని బట్టి వేరే అయినట్లుగా, కర్మలకు వేరే ఫలాన్ని చూస్తున్నాం. అందువలన కర్మకు జ్ఞానంతో వికల్పం లేదు.
వివరణ:- అనుబంధం మొదలైన వాటి వలన కూడా మనస్చిదాదులకు కర్మాంగత్వం లేదు. ఇవి స్వతంత్రాలు. అవేష్టి అనే క్రతువును రాజసూయం నుండి పైకి తీసినట్లుగా మనస్చితాదులను కర్మ ప్రకరణం నుండి విడదీయాలి. అవి కర్మంగాలు కావు. ఉపాసన గాని, కర్మానుస్థానం గాని ఏదో ఒక విశేష ఫలం కోసం గాని చేస్తారు. కనుక ఫలభేదం వలన ఉపాసనల్లో భేదం ఉంది. అంతే కాని ఒకానొక ఫల ప్రాప్తి కోసం ఉపాసనల్లో వికల్పం కల్పించలేము. అలాగే జ్ఞాన కర్మల ఫలాలు కూడా భిన్నంగా ఉంటాయి. మోక్షం, మృత్యు తరణం, ప్రతి బంధకాలు తొలగిపోవడం లాంటి ఫలాలు. ఇంతే కాక వీటి సాధనలోను అనుష్టానాలోనూ తేడాలుంటాయి. ఉపాసన కోసం చేసే సాధనానుష్ఠానాలు వేరు, కర్మ కోసం చేసే సాధనానుష్ఠానాలు వేరు. కనుక వీటిలో వికల్పం లేదు. ఒకదాని ఫలం మరొకటి సాధించదు. ఇదివరలో ఈశావాస్యోపనిషత్తు మంత్రాల్లో జ్ఞాన కర్మల ఫలభేదాలు చెప్పబడ్డాయి.
మనుస్మృతి(12,104):-విప్రుడికి తపస్సు, కర్మ, విద్య, జ్ఞానం, మోక్ష ప్రదాయకాలు. ఇందులో తపస్సు పాపాలను తుడిచివేస్తుంది. జ్ఞానంతో అమృతత్వం పొందుతారు. ఇలా కర్మకుఫలం భిన్నంగా నిశ్చయించినప్పుడు అది జ్ఞానానికి వికల్పం ఎన్నడూ కానేరదు. మోక్షం కోసం జ్ఞాన కర్మతో వికల్పం లేదంటున్నారు. ఉపాసనలన్నింటికి సమాన ఫలమే. వాటి అనుష్ఠానంలో వికల్పం అంగీకరించాలి. ఒకలక్ష్యాన్ని చేరుకోవడానికి అనేకమార్గాలు ఉన్నప్పుడు, ప్రతివ్యక్తి ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొని లక్ష్యాన్ని చేరతాడు. ఉపాసనలన్నింటికి లక్ష్యం బ్రహ్మ ప్రాప్తి. కనుక ఏదో ఒక ఉపాసన అనుష్ఠించి ముముక్షువులు బ్రహ్మప్రాప్తిని పొందుతారు. అందువలన ఉపాసనల అనుష్ఠానంలో వికల్పం ఉన్నది. యజ్ఞ ఫలాలు భిన్నంగా ఉంటాయి. విభిన్న ఫలాలు కోరుకునే వ్యక్తి విభిన్న యజ్ఞ కర్మలు చెయ్యాలి. అక్కడ సమచ్చయమే కాని, వికల్పం పనికి రాదు.
సూత్రం :- 410
" న సామాన్యాద ప్యులబ్ది ర్మృుత్యు వన్నహి లోకాపత్తిః "
సామాన్యాదపి :- సామాన్యంగా పరిశీలించి చూస్తే కూడా, న :- జ్ఞానానికి, ఉపాసనతో వికల్పం లేదు. ఎందుకంటే, ఉపలబ్ధే :- ఫలాలు వేరు వేరుగా లభిస్తాయి. మృత్యు వత్ :- మృత్యు పదం, నహి లోకా పత్తిః :- లోక సంహారం చేయలేదు కదా!
భావం :- సామాన్యంగా పరిశీలించి చూస్తే కూడా, జ్ఞానానికి ఉపాసనతో వికల్పం లేదు. ఎందుకంటే ఫలాలు వేరు వేరుగా సాధనలు లభిస్తాయి. మత్యు పదం లోక సంహారం చేయలేదు కదా!
వివరణ:- మృత్యు శబ్దం లాగా మనశ్చితాది అగ్నులకు మానసత్వ సాదృశ్యం ఉన్నప్పటికీ అవి క్రియంగాలు కావని శ్రుతుల వలన తెలుస్తోంది. ఫలాలు వేరుగా లభించడం వలన జ్ఞాననామంతో సామ్యంఉన్నా, జ్ఞానానికి,ఉపాసనతో వికల్పం కలుగదు. జ్ఞానానికి విద్య, లేక ప్రజ్ఞ అంటారు. ఉపాసనను కూడా విద్య అంటారు. ఉపాసన కూడా ఒక రకంగా జ్ఞాన రూపమే. కాని ఇవి మోక్షానికి వైకల్పిక సాధనలు కావు. ఎందుకంటే జ్ఞానానికి, ఉపాసనకు భిన్న ఫలాలు ఉన్నాయి. అగ్నికి, పరమేశ్వరుడికి మృత్యువు అనే పేరుంది.
బృహదారణ్యకోపనిషత్తు ( 3, 2, 10 ):- అగ్నే మృత్యువు. అది వస్తువులను నాశనం చేస్తుంది.
శతపధబ్రాహ్మణం ( 10, 5, 23 ) :- సమస్త విశ్వ లోక సంహారకుడైన పురుషుడే మృత్యువు అని ఈశ్వరుడికి మృత్యువు అని పేరు. మృత్యువు అనే పేరు, నాశనం - అగ్నికి, ఈశ్వరుడికి సమానం కాగా, అగ్ని ఈశ్వరుడిలా సర్వ సంహారకుడు కానేరడు కదా! అగ్ని ఈశ్వరుడికి వికల్పం కాలేడు. జ్ఞానానికి ఫలం మోక్షం. ఉపాసనకు ఫలం చిత్తశుద్ధి. కనుక జ్ఞానానికి ఉపాసన విద్య వికల్పసాధనం కాదు. పురుషుడే మృత్యువు, అగ్నియే మృత్యువు అను వాక్యాల చేత అగ్న్యాదిత్య పురుషుల విషయంలో మృత్యుశబ్దం సమంగానే ప్రయోగించబడినా కూడా రెండింటికి పూర్తి స్వామ్యం ఏ విధంగా లేదో అట్లే ఇక్కడ కూడా. ఓగౌతమా! ఈ లోకమే అగ్ని, ఆదిత్యుడే సమిధి. అనే చోట సమిధులు మొదలైన వాటితో సామ్యం చెప్పినంత మాత్రాన లోకం అగ్నిత్వాన్ని పొందదు. జ్ఞాన విద్యకు, ఉపాసన విద్యకు అనుష్టానం ఒకటే అయినప్పటికీ వాటి ఫలాలు వేరుగా ఉంటాయి. జ్ఞానానికి, వికల్పంతో వికల్పం కలుగదు.
సూత్రం :- 411
" పరేణ చ శబ్దస్య తాద్విధ్యం భూయస్త్వాత్త్యనుబంధః "
చ :- పైగా, పరేణ :- జ్ఞానం వలన మోక్షం కలుగుతుందనేది నిశ్చయం. శబ్దస్య తాద్విధ్యం :- ఇది ఇలాగ అని శాస్ట్రాల్లో విధించారు. భూయస్త్వాత్ :- అలాంటి శాస్త్ర నిర్ణయం వలన, అనుబంధః :- జ్ఞానానికి మోక్షం తో సంబంధం ఉందని తేలుతోంది.
భావం :- పైగా జ్ఞానం వలన మోక్షం కలుగుతుందనేది నిశ్చయం. ఇది ఇలాగ అని శాస్త్రాల్లో వివరించబడింది.. అలాంటి శాస్త్ర నిర్ణయం వలన జ్ఞానానికి మోక్షంతో సంబంధం ఉందని తెలుస్తోంది.
వివరణ:- జ్ఞానానికి మోక్షంతో సంబంధం ఉందని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. పూర్వం అంటే కర్మ, పరం అంటే జ్ఞానం. పర శబ్దం ఇక్కడ జ్ఞానార్ధకం. ఆధ్యాత్మికశాస్త్రాల్లో ఎన్నోచోట్ల జ్ఞానం వలనే మోక్షం లభిస్తుందనే విషయం తెలియబడింది. ఉపాసకుడు ఎవరు? ఉపాసన దేహంతో చేస్తాం కదా! దేహం నశిస్తుంది కదా! దేహానికి అతిరిక్తంగా ఉపాసన ఉన్నదా? మోక్షం ఎవరికీ లభిస్తుంది? అని సందేహాలున్న సూత్రం ఉత్తరబ్రాహ్మణాన్ని, పూర్వబ్రాహ్మణాన్ని బట్టి మనశ్చిదాదులను చెప్పే ఈ బ్రాహ్మణంకూడా అటువంటిదే. కేవలం విద్యావిధిత్వం కలిగినటువంటిది. మానసికాగ్ని విద్యలో సంపాదింపదగిన కర్మంగాలు అనేకం ఉన్నాయి. కాబట్టి ఈ మానసికాగ్ని స్వతంత్రమైన పురుషార్ధ హేతువు అని, ఈ అగ్నులు ఉపాసనాత్మకాలు కాని కర్మంగాలు కావు. భగవంతుడు మానవజన్మ ఇవ్వడానికి కారణం మోక్షాన్ని సాధించడానికే. మోక్షం అంటే ఆత్మ యొక్క స్వస్వరూపమే గాని మరొకటి కాదు. ఆరోగ్యం అనేది జీవుడి యొక్క స్వరూపం. కాని వేడిమి, చల్లదనం వలన వాత, పిత్త, కఫాలు ఎక్కువకావడం వలన శారీరిక వ్యాధి కలిగి, దాని నివారణకు ఔషధాలు సేవిస్తారు. వ్యాధి రాక ముందు ఆరోగ్యంగానే ఉన్నారు. అదే విధంగా మోక్షం అనేది మనయొక్క స్వరూపం. దానిలో బంధనం అనే భ్రమ ఏదైతే కలిగిందో, దానిని దూరం చేసుకోవడానికి బ్రహ్మ జ్ఞానం అవసరం. బ్రహ్మ జ్ఞానం పొందడానికి ప్రతిరూపాలైన శాస్త్రాలలోని సాధనలన్నీ ఉపాసకుడు శ్రవణ, మనన, నిధి ధ్యాసలతో జీవితాంతం ఉపాసన చేసి, తానే పరమాత్మ అనే స్థితిని దర్శించాలి. దేహం అశాశ్వత మైనప్పటికి, శాశ్వతమైన ఆత్మ చైతన్యంతో నిర్గుణ బ్రహ్మాన్ని ఉపాసిస్తే బ్రహ్మ సాక్షాత్కారం లభిస్తుంది.
శరీర వ్యతిరేకాధికరణం ( 3, 3, 53 )
సూత్రం :- 412
" ఏక ఆత్మనః శరీరే భావత్ "
ఆత్మనః :- జీవాత్మ, శరీరే :- శరీరంలో, భావత్ :- ఉంటుంది. ఏకే :- కొందరు, జ్ఞానం తో మోక్షం వస్తుందని అంగీకరించరు.
భావం :- జీవాత్మ శరీరంలో ఉంటుంది. శరీరం లేకుండా ఉండదు. కనుక కొందరు జ్ఞానం వలన మోక్షం వస్తుందని అంగీకరించరు.
వివరణ:- ఈఅధికరణంలో ఆత్మ దేహం కన్నా భిన్నమైనదని తెలియజేస్తున్నారు. శరీరమనేది ఉన్నప్పుడే ఆత్మ యొక్క ధర్మాలకు అస్తిత్వం ఉన్నది. కాబట్టి దేహం కన్నా వేరైనటువంటి ఆత్మ అనేది ఏది లేదు అని చార్వాకుల అభిప్రాయం. ప్రాణం, చైతన్యం మొదలైన ధర్మాలు శరీరం ఉంటేనే కనిపిస్తాయి. శరీరం లేకపోతే ఉండవు. కాబట్టి శరీరం కన్నా వేరైన ఆత్మ లేదని వారి వాదన. దేహాన్ని విడిచి ఆత్మ కనిపించదు. కాలంతరంలో అసమర్ధమై శరీరం నశిస్తుంది. పంచతత్త్వాలతో దేహం ఏర్పడి, దానిలో చైతన్యం ఉత్పన్నం అవుతుంది. మట్టి ఘటంగా మారిన తరువాత నీటిని తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ఘటంగా మారక ముందు మట్టితో నీటిని తీసుకురాలేము. అలాగే పంచ తత్త్వాలు విడిగా ఉన్నప్పుడు వాటిలో చేతనత్వం కనబడుతున్న దేహంతో బాటు జీవాత్మ ఏర్పడుతుంది. దేహాన్ని మించి జీవాత్మ అనేది వేరుగా లేదు. ఉపాసన అనుష్ఠానం దేహంతోనే చేస్తాము. కనుక ఉపాసన ముందుగా జ్ఞానం వలన వస్తుందనేది సరియైనది కాదు అని వారి వాదన. దేహమే ఆత్మ అని, దేహం కంటే భిన్నమైన ఆత్మ లేదని అంటారు. బాహ్యమైన పృథి వ్యాదుల్లో చైతన్యం కనబడక పోయినా, శరీరాకారంలో పరిణమించిన భూతాల్లో చైతన్యం ఉండవచ్చునని, ఆ శరీరమే పురుషుడు అని, స్వర్గానికి వెళ్ళడానికి గాని, మోక్షం పొందడానికి గాని శరీరం కంటే వేరుగా ఆత్మ లేదని చార్వాకుల వాదన. ఆత్మ యొక్క అస్తిత్వాన్ని గురించి సూత్రం లేదు. ఇక్కడైతే బాదరాయణుడిచేత స్వయంగా ఆత్మ అస్థిత్వాన్ని ముందుగా ఆక్షేపించి అది స్థాపించబడింది. నాస్తికత్వాన్ని నివారించడం కోసమే ఆత్మ స్థిత్వాన్ని యుక్తి చేత ప్రతిపాదించాడు. ఆత్మ యొక్క అసలు రూపం వేదాంతలను సేవిస్తే తెలుస్తుంది. బంధం, మోక్షాధికారం సిద్ధించడానికై ఇక్కడ దేహం కంటే భిన్నమైన ఆత్మ యొక్క ఉనికి సాధించ బడుచున్నది. దేహం కంటే భిన్నమైన ఆత్మ లేకపోతే పరలోకంలో ఫలంగా గల విధులు ఉపపన్నములు కావు. శాస్త్ర ప్రారంభం లోనే శాస్త్ర ఫలాన్ని అనుభవించడానికి యోగ్యమైన దేహానికి భిన్నమైన ఆత్మ యొక్క అస్తిత్వo చెప్పబడింది.
సూత్రం :- 413
" వ్యతిరేక స్తద్ భావాభావిత్వ న్నతూపలబ్ది వత్ "
వ్యతిరేకః :- శరీరం కన్నా ఆత్మ భిన్నం. తత్ భావాభావిత్వాత్ :- శరీరం ఉన్నప్పుడు కూడా చనిపోయినప్పుడు అందులో ఆత్మ లేకపోవచ్చును. న :- ఆత్మ అనేది దేహం కాదు. తు :- ఎలాగంటే, ఉప లబ్దివత్ :- జ్ఞానం, విషయం కన్నా భిన్నం అయినట్లుగా,
భావం :- శరీరం కన్నా ఆత్మ భిన్నం. శరీరం ఉన్నా చనిపోయిన తరువాత అందులో ఆత్మ లేకపోవచ్చును. కనుక ఆత్మ అనేది దేహం కాదు. ఎలాగంటే, జ్ఞానం విషయం కన్నా భిన్నం అయినట్లుగా, విషయం ఉన్నా అందులో జ్ఞానం లేకపోవచ్చును కదా!
వివరణ:- ఆత్మ అనేది దేహం కన్నా వేరైనది. మృతునికి శరీరం ఉన్నప్పటికీ చైతన్యం ఉండదు. ఒక్కోసారి శరీరం ఉన్నా చైతన్యం ఉండదు. రూపాదులు శరీర ధర్మాలు. దేహధర్మలైనా రూపాదులు దేహం ఉన్నంత వరకు ఉంటున్నాయి. ప్రాణం, చేష్టలు మొదలైనవైతే మృతావస్థలో దేహం ఉన్నా కూడా ఉండటం లేదు. దేహధర్మాలైన రూపాదులను ఇతరులు ప్రత్యక్షంగా చూడగలుగుతున్నారు. కాని ఆత్మధర్మాలైన చైతన్య స్మృత్యాదులను ఇతరులు గ్రహింపజాలరు. జీవించి ఉన్న అవస్థలో వీటి ఉనికిని నిశ్చయింపవచ్చును. కాని దేహం లేనప్పుడు ఇవి లేవని నిశ్చయంగా చెప్పడానికి శక్యం కాదు. ఈ దేహం పతనమైన తరువాత కూడా ఆత్మధర్మాలు, దేహంతరం లోనికి సంచరించడం చేత ఒకవేళ అనువర్తింప వచ్చు కదా! దేహం లేనప్పుడు చైతన్యస్మృత్యాదులు ఉండవనీ నిశ్చితంగా చెప్పడానికి శక్యం కాదు కనుక ఉండవచ్చునేమో అనే సంశయానికి తావు లేకపోలేదు. సంశయం మాత్రం చేత కూడా పరపక్షం నిషేధింపబడుతుంది. చైతన్యం అలా కాదు. అది శరీరం కన్నా భిన్నం. అదేఆత్మ. ఆత్మయే ఉపాసనాది కార్యాలు చేస్తుంది. అవి చేయడానికి శరీరం ఆత్మకు సాధనం మాత్రమే. ఆత్మ దేహంతో బ్రహ్మ సాక్షాత్కారం అయ్యేంత వరకు కార్యాలు చేస్తుంది. ఆ తరువాత జ్ఞానంతో మోక్షాన్ని పొందుతుంది. కాబట్టి శరీరానికి చైతన్యాది ధర్మాలుంటాయనడం సరి కాదు. సమాధి స్థితిలో శరీరం ఉంటుంది. కాని దానిలో చైతన్యం కనిపించదు. కనుక శరీరం ఆత్మ కాదు. ఆత్మ శరీరం కన్నా వేరైనది.
అంగావబద్దాధికరణం ( 3, 3, 55 )
సూత్రం :- 414
" అంగావ బద్ధాస్తు న శాఖాసు హి ప్రతి వేదమ్ "
అంగావ బద్దాః తు :- జ్యోతిష్టోమాది కర్మాంగాలైన ఉద్గీథాదుల్లో చెప్పిన ఉపసనా విధులు, ప్రతి వేదం :- ప్రతి శాఖలోనూ గ్రహించాలి. శాఖాసు హి :- అవి అన్ని శాఖలలో ఉండాలనే నియమం, న :- ఏమి లేదు.
భావం :- జ్యోతిష్టోమాది కర్మాంగాలైన ఉద్గీథాదుల్లో చెప్పిన ఉపాసనా విధులు ప్రతి శాఖలోనూ గ్రహించాలి. అవి అన్ని శాఖలలో ఉండాలనే నియమం లేదు.
వివరణ:-ఓంకారాన్ని ఉద్గీథంగా ఉపాసించాలి అని ఛాందోగ్యంలోచెప్పారు. ఇలా ప్రతివేదంలోనూ, ప్రతిశాఖలోనూ చెప్ప బడ్డాయి. కాబట్టి ప్రతిశాఖలోనూ ఉద్గీథాన్ని ఉపాసనావిధులను ఆశాఖలో మాత్రమే గ్రహించాలా? లేక అన్ని శాఖలకు సంబంధించినవా? అని ప్రశ్నించాడు కృష్ణశర్మ. కర్మాంగాలైన ఈఉపాసనా విధులు ఈశాఖయందే అని లేదు అని ప్రతి వేదంలో, ప్రతి శాఖలో చెప్పబడ్డాయి. ఉపాసనా విధులు ఏ శాఖలో ఉన్నా ప్రతి చోటా గ్రహించాలి. జ్యోతిష్టోమాది కర్మలు వాటికి అంగలైన ఉద్గీథాది ఉపాసనా విధులకు సంబంధించిన వర్ణనలు వివిధ శాఖలలో కనిపిస్తాయి. కొన్ని శాఖలలో కనిపించవు. అయినా వీటిని అన్ని శాఖలలో అనువర్తించుకొని అనుష్టించాలి.
ఛాందోగ్యోపనిషత్తు(1, 1, 1):- "ఓం ఇత్యేత అక్షరముద్గీథ ముపాసీత" ఈ ఉద్గీథఉపాసన సామాన్య విధి. దీనిని ఏదో ఒక శాఖాకు చెందిన కర్మాంగంలోనే అనుష్టించాలనే వ్యవస్థ ఎక్కడా లేదు. కనుక అన్ని శాఖలలోనూ జ్యోతిష్టోమ ప్రసంగం ఉన్న చోట దీన్ని గ్రహించవచ్చు. ఇలాగే ఇతర ఉపాసనల విషయాల్లో కూడా అన్వయించుకోవాలని సూత్రాభిప్రాయం. ఉద్గీత అనేది ప్రణవ మాత్రం. ఉత్ అంటే ప్రాణం, గీత్ అంటే వాక్కు, ఓంకారాన్ని ఓం అని దీర్ఘoగా గానంచేస్తూ ఉపాసించాలి. దీనినే ఓంకారానుష్టానం అంటారు. ఉద్గీథాది కర్మావయవాలకు సంబంధించిన ఏ ప్రత్యయాలు ప్రతివేదంలోనూ శాఖాభేదాలలో విధిoపబడియున్నాయో అవి ఆయా శాఖలలో ఉండే ఉద్గీథాదులలో ఉంటాయా అని సంశయం. ఉద్గీతావయవమైన ఓం కారం మీద ప్రాణ దృష్టి, హింకారమే పృథవి, ప్రస్థావం, అగ్ని, ఉద్గీతం, అంతరిక్షం, ప్రతీహారం, ఆదిత్యుడు, నిధనం, ద్యులోకం. ఈ విధంగా హింకారాది పంచ రసాయనమందు పృథ వ్యాది లోక దృష్టి, ఉక్తం అనే శాస్త్రము మీద పృథవి దృష్టి, ఇష్టకాచితమైన అగ్ని మీదలోక దృష్టి, ఈ కర్మాంగాలను ఆశ్రయించిన ఉపాసనలు చెప్పబడ్డాయి. వీటి విషయంలో సంశయం. ప్రతిశాఖలోను స్వరాదుల భేదం చేత ఉద్గీథాదులు కూడా భిన్నములౌతాయి. కనుక ఈ సంశయం ఏర్పడింది. ఇవి తమ శాఖలో ఉన్న ఉద్గీథాదుల విషయంలోనే విధింపబడాలి. "ఉద్గీథ ముపాసీత" (ఉద్గీథాన్ని ఉపాసించాలి). అని సామాన్యంగా విధించబడినప్పుడు ఏఉద్గీథాన్ని అని ఆకాంక్ష కలిగినప్పుడు దగ్గరగా స్వశాఖలో ఉన్న దానిచేతనే ఆకాంక్షలు తీరిపోతాయి. గాన ఈఉపాసన ఏ శాఖలో ఉన్నదో, ఆ శాఖలోనే ఉన్న విధంగా ఉపాసన చెయ్యాలి. ఆకాంక్ష తీరిన తరువాత దానిని కాదని మరొక శాఖలో విధించిన విశేషాన్ని గ్రహించడానికి తగిన కారణం లేదు. అందుచేత శాఖా భేదాన్ని బట్టి ఉపాసన వ్యవస్థ చేసుకోవాలి. దేహాత్మలు భిన్నమైనవి కనుక ఆత్మధర్మాలు దేహంలో ఎలా సంభవించవో, అట్లే ఆయా వేదాలలో ఉన్న ఉద్గీథాదులు వేరువేరు కనుక ఒక వేదంలో విధించిన ఉద్గీథాద్యుపాసనలు వేదాంతరంలో ఉన్న ఉద్గీథాద్యుపాసనలలో సంభవించవు అని పూర్వ పక్షం వారి వాదన. ప్రతి వేదంలోను తమ శాఖలోనే వ్యవస్థితములు కాకూడదు. అన్ని శాఖలలోనూ అనువర్తించాలి. ఉద్గీథాన్ని ఉపాసించాలి అని సామాన్య రూపంలో చెప్పినప్పుడు ఉద్గీథం అనేది ఏ శాఖలో ఉన్నా దాని ఉపాసన ప్రత్యక్షంగా శ్రుతి అనే ప్రమాణం చేత చెప్పినట్లుగా భావించాలి.
సూత్రం :- 415
" మంత్రాది వద్వా విరోధః "
మంత్రాది వత్ వా :- మంత్రాలు, లేక ద్రవ్యం లాంటి వాటి లాగా, అవిరోధః :- అలా గ్రహించడంలో ఏ వైరుద్యం ఉండదు.
భావం :- ఒక శాఖలో విధించిన ఉపాసనలను మరొక శాఖలో గ్రహిస్తే వాటిలోని మంత్రాలూ, లేక ద్రవ్యం లాంటి వాటి లాగా ఏ మాత్రం వైరుద్యం ఉండదు.
వివరణ :- ఒక శాఖ యందు చెప్పిన ఉద్గీథాదులను ఇతర శాఖల యందు చెప్పినప్పటికి ఇబ్బంది లేదు. ఒక వేదంలో ఉండే మంత్రాలను మరో వేదంలో ప్రతిపాదించే కర్మల్లో కూడా పఠిస్తారు. కాబట్టి ఒక శాఖలో చెప్పిన ఉపాసనను ఇతర శాఖలలో అన్వయం చేసుకోవడంలో దోషం లేదు. ఉద్గీథాదులు అన్ని శాఖలకు సంబంధించినవే.
తైత్తరీయ సంహిత (7, 5, 5, 2) :- అద్వర్వవేసజనీయం శస్యం " అధ్వర్వుడు చేసే కర్మలో సజనీయ సూక్తాన్ని పఠించాలి అని ఉంది. యజుర్వేదం అధ్వర్యుడికి సంబంధించినదే కనుక అతను చేసే కర్మలలో యజుర్వేద మంత్రాలు ప్రయోగించాలి. కాని ఈ తైత్తరీయసంహిత సజనీయసూక్తాన్ని పఠించాలని అంటున్నది. సజనాస ఇంద్రః అనే ఈ సజనీయసూక్తం ఋగ్వేదంలో (2, 6, 7, 1 ) లో ఉన్నది. ఇలా పఠించడంలో దోషమేమున్నది? కనుక ఒక శాఖలో చెప్పిన కర్మలు, గుణాలు మరొక శాఖలో గ్రహించవచ్చును. ఇక ప్రతి కర్మలోనూ వాటి అంగాలైన ఉపాసలుంటాయి. వైశ్వానరోపాసన విషయంలో ఏమి చెయ్యాలి? అందులో వ్యష్టి, సమిష్టి అని రెండూ రకాల ఉపాసనలను వర్ణించారు. ఆ రెండింటిలో దేన్ని గ్రహించాలి? ఉద్గీథాదులు అన్ని శాఖలకు సంబందించినవే.
భూమ జ్యాయస్త్వాధికరణం ( 3, 3, 57 )
సూత్రం :- 416
" భూమ్నః క్రతువ జ్ఞాయస్త్వం తథా హి దర్శయతి "
క్రతువత్ :- దర్శ పూర్ణ మాసం లాంటి యాగాలలో లాగా, జాయస్త్యం :- ప్రధానంగా, భూమ్నః :- సమిష్టి ఉపాసనే గ్రహించాలి. తథాహి దర్శయతి :- శాస్త్రాలు అంటున్నాయి.
భావం :- దర్శ పూర్ణమాసం లాంటి యాగాలలో వలె ప్రధానంగా సమిష్టి ఉపాసనే గ్రహించాలి.
వివరణ :- ఛాందోగ్యంలో వైశ్వానరోపాసన గురించి వివరించారు.
ఛాందోగ్యోపనిషత్తు(5, 10, 1):- దానిలో దివం లాంటి ఒక్కో అంగంలో వ్యష్టి రూపంలోనూ వైశ్వానరోపాసన ఉన్నది. తరువాత "సర్వేషు లోకేషు సర్వేషు భూతేషు" అని సమిష్టి ఉపాసన నిర్దేశించారు. కనుక ఈ రెండు ఉపాసనలను గ్రహించాలా? లేదా ఏదో ఒక దాన్నా అని సందేహం కలుగుతుంది. వైశ్వానర సమష్టి ఉపాసన భూమకు అంగి. అదే ప్రధానం, ప్రామాణికమని వ్యాసమహర్షి చెప్పారు. శాస్త్రము ఆ సమష్టిఉపాసనే నిర్ధారించింది. దర్శపూర్ణమాసయాగాలలో ప్రయాజాదిఅంగాలతో కూడిన ప్రధాన ప్రయోగాన్నే అనుష్టించాలి. ప్రయాజాది అంగాలను వేర్వేరుగా అనుష్టించరు. కనుక వ్యష్టి ఉపాసన ప్రస్తావన వచ్చినప్పుడు దేనిని నిరసించారు. ప్రాచీనశీలుడు మరికొందరు జిజ్ఞాసువులు కేకయదేశ రాజైన అశ్వపతి మహారాజు వద్దకు వెళ్లి, వైశ్వానర విద్యను వివరించమని అడుగుతారు. రాజు ప్రాచీన శీలుణ్ణి" నువ్వు వైశ్వానరాత్మను ఏ విధంగా ఉపాసన చేస్తున్నావు? అని అడుగుతాడు. దానికి ప్రాచీనశీలుడు, రాజా! నేను ద్యులోకాన్ని వైశ్వానరాత్మగా భావిస్తున్నాను అంటాడు. దానికి మహారాజు, నువ్వు ఉపాసించేది "సుతేజ" అనే పేరుతో ప్రసిద్ధి చెందిన వైశ్వానరాత్మ. ఈ ఉపాసన వల్లనే నీ కులం వారు తరతరాలుగా కర్మనిష్టా పరతంత్రులౌతారు. సుతేజమనే ఈఆత్మ వైశ్వానరాత్మలో నాలుగవ భాగం మాత్రమే. అది వైశ్వానరాత్మకు శిరోభాగం వంటిది. విశ్వరూపుడు అతనికి నేత్రం, వాయువే అతని ప్రాణం, ఆకాశం అతని శరీరం, జలం పొత్తి కడుపు, పృథవి పాదాలు. వారు చేసే ఉపాసన గురించి చెప్పాడు. అశ్వపతిమహారాజు వ్యష్టి ఉపాసన నిరకరిస్తూ, సమిష్టిఉపాసన వర్ణించి అది చేయమని ఉపదేసిస్తాడు. కనుక వైశ్వానర సమిష్టి ఉపాసన ప్రధానం. అనుస్టేయం కూడా. వ్యస్టి ఉపాసనకు అనుస్టేయత లేదు. పరమాత్మ ఉత్క్రుష్ఠుడని, ఆయన మొదట సృష్టి, సమిష్టి రూపమైన హిరణ్య గర్భుడు, ప్రజాపతి లేక ఈశ్వరుడు. ఆయనే ఈవ్యష్టిరూపమైన సృష్టి చేశాడని, ఆయనే ప్రాణంగా అన్నింటిలో ఉంటున్నాడని పిప్పలాద మహర్షి పశ్నోపనిషత్తులో తెలియజేశాడు. అందువలన సమిష్టిరూపమైన హిరణ్యగర్భుని, ప్రజాపతిని ఉపాసించాలని గ్రహించాలి.
శబ్దాది భేదాధికరణం ( 3, 3, 58 )
సూత్రం :- 417
" నానా శబ్దాది భేదాత్ "
శబ్దాది భేదాత్ :- పేర్లలో, విధానంలో భేదాలు ఉండటం వలన, నానా :- ఉపాసనలు అనేక రకాలు. ఒక్కటి కావు.
భావం :- పేర్లలో, విధానంలో భేదాలు ఉండటం వలన ఉపాసనలు అనేక రకాలు.
వివరణ:-ఛాందోగ్యంలోని శాండిల్యవిద్య, దహరవిద్య, మధువిద్య, వైశ్వానరవిద్య లాంటి ఉపాసనలు విభిన్న ఉపనిషత్తులలో కనిపిస్తాయి. వీటన్నింటికి ఉపాస్య దైవం బ్రహ్మం ఒక్కటే. అయినా ఉపాసనలన్నీ ఒక్కటి కావు. వేద, ఉపాసీత, ధ్యాయిత, క్రతుం, కుర్వీత లాంటి శబ్దాలు భిన్నములైనవి. గుణాలలోనూ, అనుష్టాన విధానాలలోనూ తేడాలున్నందున ఉపాసనలు కూడా భిన్నంగా ఉంటాయి.వేద్యం అంటే తెలిదుకొనదగినది ఒకటే. దహర, శాండిల్య, వైశ్వానర విద్యలలో గుణ భేదం ఉన్నది కాబట్టి ఈ విద్యలన్నీ వేర్వేరుగా ఉంటాయి. యాగానికి ద్రవ్య, దేవతల వలె విద్యకు వేద్యమే రూపం. శ్రుతిలో వేరుగా కనబడుతున్నా కూడా "మనోమయః ప్రాణశరీరం ", కం బ్రహ్మ ఖం బ్రహ్మ, " సత్య కామః సత్య సంకల్పః ఇత్యాదులలో వేద్యుడైన ఈశ్వరుడొక్కడే. అట్లే వేద్యమైన ప్రాణం ఒక్కటే. వేద్యం ఒక్కటైనప్పుడు విద్య కూడా ఒక్కటే అని చెప్పబడింది. ఈ పక్షంలో వేర్వేరు గుణాలను చెప్పడమే అభిప్రాయం కాబట్టి శ్రుతులలో భేదం ఉన్నా అవి వ్యర్థం కావు. అందుచేత విద్యకు పరిపూర్ణనత్వం రావాలంటే ఒకే వేద్యానికి సంబంధించిన స్వపరశాఖలలో విధించబడిన గుణసముదాయాన్ని ఉపసంహ రించాలి. అక్కడక్కడ ఉపాస్యమైన ప్రాణం ఒక్కటే అయినా భేదం లేకపోయినా ఒకచోట ఒక విధమైన గుణం ఉపాసించాలి. మరొక చోట మరొక విధమైన గుణం ఉపాసించాలి. కనుక ప్రాణాలతో బాటు చెప్పిన గుణాల భేదాన్ని బట్టి వేద్యం భిన్నం అవడం చేత విద్యా భేదం తెలియబడుచున్నది.
వికల్పాధి కరణం ( 3, 3, 59 )
సూత్రం :- 418
" వికల్పో అవిశిష్ట ఫలత్వాత్ "
అవిశిష్ట ఫలత్వాత్ :- అన్ని ఉపాసనలకు సమాన ఫలమే కనుక, వికల్పః :- ఉపాసనలను అనుష్టించడంలో వికల్పం ఉన్నది.
భావం :- అన్ని ఉపాసనలకు సమాన ఫలమే కనుక ఉపాసనలను అనుష్టించడంలో వికల్పం ఉన్నది.
వివరణ :- ఉపాసనలు అనేకం అయితే వాటి అనుస్థానంలో వికల్పం అంగీకరించాలా? సముచయాన్ని అంగీకరించాలా? అనేది సందేహం వచ్చినప్పుడు వికల్పాన్నే అంగీకరించాలి. సగుణోపాసన చేసేటప్పుడు వేర్వేరు విద్యలనే ఉపసించాలి. ఎందుకంటే అక్కడ వేద్యం అంటే తెలుకోదగిన వస్తువు వేరు. సాక్షాత్కరించే దేవత వేరు. ఉపసనా ఫలం వేరు. శాండిల్యాది విద్యలలో నిర్గుణో పాసన నిర్వహించాలి. దీనిలో ఆత్మసాక్షాత్కారం జరుగుతుంది. వేద్యం తనని తాను తెలుసుకోవడం. ఫలితం మోక్షం. ఉపాసకుడు ఐహిక బంధాలు తెంచుకొని జ్ఞానియై పరమాత్మలో లీనం అవడమే ముక్తి. ఒక లక్ష్యం చేరడానికి అనేక మార్గాలు ఉన్నప్పుడు లక్ష్యాన్ని చేరుకోవాలనుకునే వ్యక్తి ప్రతి మార్గాన్ని అనుసరించాలనే నియమం లేదు. ఏదో ఒక మార్గాన్ని అనుసరించినా, అతను లక్ష్యాన్ని చేరతాడు. ఈ ఉపాసనలన్నింటికి లక్ష్యం ఒక్క బ్రహ్మ ప్రాప్తి మాత్రమే. అందుకే ముముక్షువులు ఏదో ఒక ఉపాసన అనుష్టించి బ్రహ్మ ప్రాప్తిని పొందవచ్చును. అందువలన ఉపాసనల అనుష్టానంలో వికల్పం ఉంది. సముచ్చయం కాదు. యజ్ఞాలు అనేక రకాలుగా ఉండటం వలన, విభిన్న ఫలాలు కోరుకునే వారు విభిన్నములైన యజ్ఞ కర్మలు చెయ్యాలి. ఆ విషయంలో సముచ్చయమే కాని వికల్పం ఉండదు.
కామ్యాధికరణం ( 3, 3, 60 )
సూత్రం :- 419
" కామ్యాస్తు యధాకామం సముచ్చీయేరన్ నవా పూర్వహే త్వ బావాత్ "
కామ్యః తు :- సకామ ఉపాసనలను, అనుష్టానాలను మాత్రం, యధా కామం :- తమ తమ కోరికలను బట్టి, సమ్ముచ్చీ యెరన్ :- కలిపి అనుష్టించాలి. వా :- అలా కాక, న :-సముచ్చయం కాక, విడి విడిగా చేస్తే, వాటిలో పూర్వ హేతు అభావాత్ :- ముందు చెప్పినట్లుగా, ఫలాలు లభించడం లో సమానత్వం ఉండదు.
భావం :- సకామ ఉపాసనలను, అనుష్టానాలను తమ తమ కోరికలను బట్టి అనుష్టించాలి. అలా కాక, సముచ్చయం కాక విడివిడిగా చేస్తే వాటిలో ముందు చెప్పినట్లుగా ఫలాలు లభించడంలో సమానత్వం ఉండదు.
వివరణ:-గురువర్యా! బ్రహ్మోపాసన ఒకటిగానే అనుష్టించాలి. మరి కామ్యోపాసన అంటే ఏమిటి? వీటిని విడివిడిగా ఉపాసిం చాలా? సమిష్టిగా ఉపాసించలా? అని అడిగాడు కృష్ణశర్మ. కామ్యవిద్యలు రెండు రకాలు. 1.దైవ సాక్షాత్కారం, 2. భోగ ప్రాప్తి. 1. మొదటి వానిలో కొంత కాలం ఉపాసన చేస్తాడు. తరువాత ఇంకొక ఉపాసన చేస్తాడు. ఆ తరువాత ఇంకొకటి చేస్తే సాధకుడుకి దేని మీద ఏకాగ్రత కుదరక గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. ఉపాసకుడు తదాత్మ్యం చెందితే తానే పరమాత్మ అవుతాడు. కాబట్టి ఇలాంటి ఉపాసనలు చేసేటప్పుడు ఒకే రకమైన ఉపాసన చెయ్యాలి. రెండది భోగ ప్రాప్తి :- ఇందులో సాధకుడు కోరినది పొందుతాడు. అతడికి సుఖము, భోగము లభిస్తాయి. ఇక్కడ ఉపాసన మార్చవలసిన పని లేదు. కామ్యో పాసనలను మన ఇష్ట ప్రకారం ఉపాసించవచ్చును. బ్రహ్మ సాక్షాత్కారం కాక, ఇతర ఐశ్వర్యాది ఫలాన్ని ఆశించి చేసే వాటిని కామ్య ఉపాసనలు అంటారు. అలాంటి వాటిని అనుష్టించే వాళ్ళ కోరికలను బట్టి అనుష్టానాలు ఉంటాయి. ఏదో చిన్న ఫలం ఆశించే వాళ్ళు అది లభించడానికి అనువైన ఉపాసన అనుష్టిస్తారు. అదే ఫలాలు కోరుకునే వాళ్ళు అనేక ఉపాసనలు చేస్తారు. అందువలన కామ్యోపాసనలలో వికల్పం, సముచ్చయం లాంటివి ఉండవు.ఈ ఉపాసనలో ఫలాలను ఆశించేవారు స్వతంత్రులు.
యధాశ్రయ భావాధికరణం ( 3, 3, 61 )
సూత్రం :- 420
" అంగేషు యధా శ్రయ భావః "
అంగేషు :- కర్మ అంగ ఉపాసనల్లో, యధా ఆశ్రయ భావః :- ఆశ్రయానుసారం విధానం జరుగుతుంది.
భావం :- కర్మాంగ ఉపాసనల్లో ఆశ్రయానుసారం విధానం జరుగుందని పూర్వ పక్ష వాదన.
వివరణ:- అంగోపాసన విషయంలో వికల్ప, సముచ్చయ వ్యవస్థల గురించి నాలుగు పూర్వపక్షసూత్రాలు చెప్పబడ్డాయి. గురుదేవా! లౌకికఉపాసనలు ఇష్టం వచ్చిన విధంగా ఆచరించ వచ్చును. మరి కర్మాంగాలైనట్టి ఉద్గీథాదులను కలిపి అనుష్టించాలా? విడివిడిగా అనుష్టించాలా? అని అడిగాడు నారాయణభట్టు. కర్మంగాలైనటువంటి ఆశ్రతఉపాసనల్లో సమచ్చయం వలన అనుష్టాననియమం ఉంది. అంటే కర్మాంగాలకు, వాటిని ఆశ్రయించిన అంగాలుగా చెప్పబడ్డ ఉపాసనలకు ఒకే నియమం వర్తిస్తుంది. అంటే ఉపాసనలను ఉద్గీథాల్లాగా సముచ్చయంగా అనుష్టించాలి. కామ్యోపాసనంలో వలె, కర్మకు అంగాలైన ఉద్గీథాది అంగ ఉపాసనల్లో కూడా నియమం ఉంటుంది. కనుక సమచ్ఛయాన్ని అంగీకరించాలి. ఎందుకంటే ఆశ్రయాన్ని అనుసరించి అంగానుస్థానం జరగాలి. అంగోపాసనకు ఆశ్రయం కర్మ. అన్ని అంగాలు కలిపి ప్రధాన కర్మను సంపన్నం చేస్తాయి. ఇదే కర్మానుష్టానం ప్రకారం ప్రయాజ, అనుయాజాది పేర్లున్న అంగాలాన్ని కలిపి తమ ప్రధాన అంగోపాసనను సంపన్నం చెయ్యాలి. అందువలన అంగోపాసన అనుష్టానంలో సమచ్ఛయాన్ని ఒప్పుకోవాలని పూర్వ పక్ష వాదన. కర్మాంగలైన ఉద్గీథాదుల యందు వాటిని ఆశ్రయాలైన స్తోత్రాదులు ఏ విధంగా కలసి జరుగుతాయో అట్లే ప్రత్యయాలు కూడా చేయబడతాయి. ఎందువలననగా ప్రత్యయాలు అంటే భావనలు ఆశ్రయాల మీద ఆధారపడతాయి.
యధాశ్రయ భావాధికరణం ( 3, 3, 62 )
సూత్రం :- 421
" శిష్టేశ్చ "
శిష్టేః చ :- శిష్టులు, శాస్త్రము చెప్పిన విధానాల వలన కూడా, అంగోపాసన అనుష్టించడంలో సముచ్చయాన్ని అంగీకరించాలి.
భావం :- శిష్టులు, శాస్త్రము చెప్పినట్లుగా అంగోపాసన అనుస్థానంలో సముచ్చయాన్ని అంగీకరించాలి.
వివరణ:- ఇదికూడా పూర్వపక్ష సూత్రమే. కర్మాంగాలైన ఉద్గీథ లాంటి ఉపాసనలను శాస్త్రము ఎలా చెప్పిందో అలాగే అంగాశ్రితాలైనా ఉపాసనల విధానం కూడా ఉన్నది. కర్మాంగాలకు వాటిని ఆశ్రయించిన ఉపాసనలను వేదాలు విధాన భేదాన్ని ఉపదేశించవు. కర్మాంగాల వలేనే ఉపాసనలను సముచ్చయంగానే అనుష్టించాలి.
ఛాందోగ్యోపనిషత్తు (1, 1, 1) :- ఓ! మిత్యేత దక్షర ముద్గీథం ఉపాసీత " ఓం అనే అక్షర ఉద్గీథాన్ని ఉపాసించాలి అని విధానం. ఆశ్రయంతో సమానవిధానం ఉన్నప్పుడు అనుష్టానంకూడా దానితో సమానంగాఉండాలి. కనుక అంగోపాసనలలో సముచ్చయం, ఉపాసనలన్నీ అనుష్టించాలనే నియమం ఉంది. ఆశ్రయాలైన స్తోత్రాదులు మూడు వేదాలలోనూ ఏ విధంగా విధించబడ్డాయో వాటిని ఆశ్రయించిన ప్రత్యయాలకు ( భావనలు ) కూడా ఆ విధంగానే విధించ బడ్డాయి. అంగాలకు వాటిని ఆశ్రయించిన ప్రత్యయాలకు ఉపదేశాన్ని బట్టి కూడా విశేషం ఏమి లేదు.
యధాశ్రయ భావాధికరణం ( 3, 3, 63 )
సూత్రం :- 422
" సమాహారాత్ "
సమాహారాత్ :- కర్మ లోపాన్ని ( కొరతను ) పూర్తి చెయ్యడం వలన, అంగోపాసనల్లో యధాశ్రయ భావం ఉందని తెలుస్తోంది.
భావం :- ఇది పూర్వ పక్ష సూత్రమే. కర్మ లోపాన్ని పూర్తి చెయ్యడం వలన అంగోపాసనల్లో యధాశ్రయ భావం ఉన్నదని తెలుస్తోంది.
వివరణ:- సమాహారం వలన ఋగ్వేదులకు సంబంధించిన ప్రణవం అంటే ఓంకారానికి, సామవేదానికి సంబంధించిన ఉద్గీతానికీ ఐక్యత చెప్పబడింది.
ఛాందోగ్యోపనిషత్తు(1, 5, 5) :- ఉద్గీథమే ప్రణవం, ప్రణవమే ఉద్గీథం అని ఏకత్వోపాసన విధించి, తరువాత దాని ఫలం గురించి కూడా చెప్పారు. ఋగ్వేదుల ప్రణవం, సామవేదుల ఉద్గీథం-వీటి ఏకత తెలిసిన ఉద్గాత (వేదమంత్రాలు చదివేవాడు) సామగానం లోని అశుద్ధిని హోత (ఆహతికి పూర్వం మంత్రాన్ని పఠించి దేవతలను యజ్ఞభూమికి తీసుకు వస్తాడు) కూర్చున్న స్థానం నుంచి సరిచేసి, కర్మలోపాన్ని పూర్తి చేస్తాడు. దీనితో ఉద్గాతకు ప్రతి అంగోపాసనలో ఆశ్రయాన్ని అనుసరించి సముచ్చయాన్ని అంగీకరించి తీరాలి. హోత్ర కర్మ ద్వారా ఉద్గీథంలోని లోపాలను సరిచేస్తాడు. ఉద్గాత తన కర్మలో కలిగిన లోపాన్ని హోత్ర కర్మచేత సరిదిద్దుకుంటాడు. ఋగ్వేదంలో చెప్ప బడిన ప్రణవము సామ వేదంలో చెప్పబడిన ఉద్గీథము ఒక్కటే అని ఛాందోగ్యోపనిషత్తులో " యఉద్గీతః న ప్రణవః, య ప్రణవః న ఉద్గీథః " అని చెప్పబడింది. దీని చేత ఉద్గీథావయవమైన ప్రణవాన్ని హోత్ర ప్రణవాన్ని అభిన్నములుగా ఉద్గాథ అనుసంధానం చెయ్యాలని విధించబడు చున్నది. ఇలా చెయ్యడం వలన ఉద్గీథం లో అంగలోపాదుల చేత ఏమైనా దోషాలున్నా, నిర్ధుష్టంగా చేసిన హోత్ర కర్మ చేత సరి దిద్దు కొనవచ్చును. దీని వలన సామవేదంలో విధించ బడిన ఈ ఉపాసనకు ఋగ్వేదంలోని ప్రణవంతో సంబంధం తప్పని సరియైనది. ఈ విధంగా అంగాశ్రీతోపాసన లకు సమూచ్చయం చెయ్యాలి అని సూచించారు.
సూత్రం :- 423
" గుణ సాధారణ్య శ్రుతేశ్చ "
చ :- పైగా, గుణ సాధారణ్య శ్రుతేః :- గుణం సాధారణం అని చెప్పే శ్రుతి వలన,
భావం :- గుణం సాధారణం అని చెప్పే శ్రుతి వలన అంగోపాసానానుస్థానాలలో సముచ్చయం ఒప్పుకోవాలి.
వివరణ:-ఇది ప్రతిపక్షసూత్రం. ఉపాసనలకు ఆశ్రయమైన ప్రణవం అన్ని వేదాలకు సాధారణమే. కాబట్టి దానిని ఆశ్రయించిన ఉపాసనలకు కూడా సముచ్చయానుస్థానం సిద్ధిస్తోంది. గుణ కర్మాంగమైన ఉపాసనాహితమైన ఓం సర్వ సర్వ కర్మలలోనూ సమానంగా ఉంటుందని ఉపనిషత్తు అంటున్నది.
ఛాందోగ్యోపనిషత్తు(1, 1, 9):- ఓం తో ఋగ్వేదం, యజుర్వేదం, సామ వేదాలు ప్రవృత్తమవుతున్నాయి. అధ్వర్యుడు 'ఓం' ను ఉచ్చరించి మంత్రాన్ని పఠిస్తాడు. హోత ఓం ను ఉచ్చరించి స్తుతిస్తాడు. ఉద్గాత 'ఓం' అంటూ గానం చేస్తాడు. ఇక్కడ త్రయీ విద్యతో ఓం కు సమాన సంబంధం ఉంది. ఇది కర్మకు అంగాలైన ఉద్గీథం లాంటి ఉపాసనల అనుష్టానంలో సముచ్చయాన్ని సూచిస్తుంది. ఇక్కడ గుణం అంటే కర్మకు అంగాలైన ఉపాసనలకు ఆశ్రయమైన 'ఓం' ను అన్ని వేదాంతలతో సంబంధం చెప్పారు. దేనిని బట్టి' ఓం' ను ఆశ్రయించి ఉండే ఉపాసనల అనుష్టానంలో సముచ్చయ నియమం ఉండాలని తెలుస్తోంది. ఉద్గీథానికీ కర్మతో సముచ్చయం ఉంటుంది. ఉద్గీథం ఒక గానం, కర్మకు అంగం. ఉద్గీథం అన్నా, ప్రణవం అన్నా ఒక్కటే. ఉద్ గీతం ఏకర్మకు అంగమో, ఆకర్మ ఉద్గీథాన్ని ప్రయోగించకుండా పూర్తి కాదు. ఉద్గీథానికీ కర్మ ఆశ్రయమైనట్లు, ఉద్గీథోపాసనకు ఉద్గీథం ఆశ్రయం. ఇలా కర్మతో ఉద్గీథానికీ సముచ్చయం ఉన్నప్పుడు ఉద్గీథంతో ఉపాసనకు సముచ్చయం తప్పక ఉండాలి. కర్మతో ఉద్గీత గానం, ఉపాసన అవసరం. ఇలా కర్మతో ఉపాసనకు తప్పనిసరిగా సముచ్చయం ఏర్పడుతుంది. ఈ ప్రతి పక్ష సూత్రాలన్నింటికి వ్యాస మహర్షి రెండూ సూత్రాలలో సమాధానం చెబుతున్నారు.
సూత్రం :- 424
" న వా తత్ సహభావా శ్రుతేః "
తత్ సహభావ అశ్రుతేః :- కర్మకు, ఉపాసనకు సహభావాన్ని బోధించే శ్రుతి లేనందు వలన, న వా :- అంగోపాసనల్లో ఆశ్రయ భావం అనుసరించి నియమం విధించడానికి వీలు లేదు.
భావం :- కర్మకు, ఉపాసనకు సహ భావాన్ని బోధించే శ్రుతి లేనందు వలన, అంగో పాసనల్లో ఆశ్రయ భావాన్ని అనుసరించి, నియమం విధించడానికి వీలు లేదు.
వివరణ:-కర్మకు, ఉపాసనకు సముచ్చయంలేదని సూత్రానికి అర్ధం. మూడు వేదాలలోను విహితమైన అంగాలకు స్తోత్రాలకు సమాధానం ఉన్నదని శ్రుతి చెబుతున్నది. కాని ఆశ్రయాలకు, ఆశ్రితాలకు సహభావం లేదు. కాని ఉపాసన అనుష్టించవచ్చును. లేదా మాన వచ్చును.
ఛాందోగ్యోపనిషత్తు(1, 1, 10):- కర్మ, ఉపాసన ఈ రెండూ భిన్నమైనవి. ఉపాసన లేకుండా కూడా కర్మానుష్టానం చేయ వచ్చును. ఉపాసనతో బాటుగా కర్మచేస్తే అధిక ఫలం లభిస్తుంది. దీనితో కర్మతో ఉపాసనకు సముచ్చయ నియమం లేదని తెలుస్తోంది. శాస్త్రాల్లో కర్మాంగాలకు, ఉపాసనాలకు వేర్వేరుగా ఫలాన్ని చెప్పారు. ఏ ఉపాసన ఎవరికీ రుచిస్తుందో, అతను దానిని అనుష్టిస్తాడు. క్రతువు పూర్తి కావడానికి అంగానుష్టానం చెయ్యాలి. కనుక అంగానుష్టానానికి, క్రతువుకి సంబంధం ఉన్నది. కాగా, ఉపాసన పురుషుడికి సంబంధించినది. అది పురుషార్ధం సిద్ధించేటట్లు చేస్తుంది. కర్మకు, ఉపాసనకు సముచ్చయం లేదు. కర్మతో దాని అంగకర్మలకు సహభావం శాస్త్రంలో స్పష్టంగా చెప్పారు. కాని ఉపాసనకు సహభావం చెప్పలేదు.ఇంతకు ముందు కర్మ ఫలం వేరు, ఉపసనాఫలం వేరు అని అని నిర్ణయించారు. కర్మ ఫలాన్ని పొందటానికి దాని అంగకర్మలను అనుష్టిస్తే చాలు. ఉపాసనల అనుష్టానంతో పని లేదు. కనుక కర్మతో ఉపాసనకు నియమంగా సహభావం అవసరం లేదని తెలుస్తోంది. ఉపాసనలు ఇష్ట ప్రకారమే చేయ బడతాయి. కాని వాటికి సహ భావం, సముచ్చయం తప్పక ఉండాలి అనే నియమం లేదు.
సూత్రం :- 425
" దర్శ నాచ్చ "
చ :- ఇంతే కాక, దర్శనాత్ :- శాస్త్రాల వలన ఈ విషయం బలపడుతోంది.
భావం :- శాస్త్రాల వలన ఈ విషయం బలపడుతోంది.
వివరణ :- శ్రుతులు చెప్పినట్లుగా ఉపాసనలకు సహభావం లేదు. శ్రుతులు ఆ విధంగా చెప్పడం వలన ఉపాసనలకు సహభావం లేదు. వాటిని ఇష్టం వచ్చినట్లుగా అంటే విడి విడిగానో, కలసో అనుష్టించవచ్చును.
ఛాందోగ్యోపనిషత్తు(4, 17, 10) :- ఇలా తెలిసిన బ్రహ్మ యజ్ఞాన్ని, యజమానిని, అందరూ ఋత్విక్కులను రక్షిస్తాడు. ఇక్కడ బ్రహ్మ తన జ్ఞానంతో ఋత్విక్కులందరిని రక్షిస్తాడన్నారు. ఉపాసనకర్మల్లో అంతటా అంగాలతో పాటు సమానంగా అనుష్టించే టట్లయితే, ఋత్విక్కులందరికి అది తెలిసి ఉండాలి. అప్పుడు తెలిసిన బ్రహ్మ వాళ్ళని రక్షిస్తాడని చెప్పే అవసరం ఉండదు. కర్మనుష్టానం తో ఋత్విక్కులందరికి కర్మలు, వాటి అంశాలు బాగా తెలుసును. ఉపాసనలతో కూడా కర్మతో అంగాలకులాగా నియత సముచ్చయం ఉన్న పక్షంలో ఋత్విక్కులందరికి వాటి జ్ఞానం ఉండటం తప్పని సరి అవుతుంది. అప్పుడు బ్రహ్మ తన జ్ఞానంతో ఇతర ఋత్విజుల్ని రక్షిస్తాడని చెప్పడం వ్యర్థమే కదా! కనుక కర్మలతో ఉపాసనలను నియతంగా సముచ్చయం అనుష్టానం చేయవచ్చని మహర్షి అభిప్రాయం.
పురుషార్ధాధికరణం ( 3, 4, 1 )
సూత్రం :- 426
" పురుషార్ధోతః శబ్దాదితి బాదరాయణః "
అతః :- ఇది వరకే చెప్పినట్లు, పురుషార్ధః :- మోక్షం సిద్దిస్తుందని, శబ్దాత్ :- వేద, ఉపనిషత్ వాక్యాల వలన తెలుస్తుందని, బాధరాయనః :- వ్యాసుడు అంగీకరిస్తున్నారు.
భావం :- బ్రహ్మజ్ఞానం పురుషార్ధ సాధనమని, దాని వలనే మోక్షం సిద్ధిస్తుందని వేద, ఉపనిషత్ వాక్యాల వలన తెలుస్తుందని వ్యాసుడు అంగీకరిస్తున్నారు.
వివరణ:- ఇప్పటి వరకు జ్ఞానసాధనలైన ఉపాసనల గురించి తెలియజేశారు. మోక్షమే పరమ పురుషార్ధమని మోక్ష ప్రాప్తికి బ్రహ్మజ్ఞానమే సాధనమని, అది ఇతరసాధనలను ఆపేక్షించదని ఈ పాదంలో మహర్షి తెలియజేస్తున్నారు. గురువుగారు! ఉపనిషత్తులలో చెప్పబడిన ఆత్మజ్ఞానం కర్మలతో కలసి మోక్షానికి సాధకమౌతుందా? అని అనుమానం వ్యక్తం చేశాడు కృష్ణ శర్మ. సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. పూర్వపాదంలో వర్ణించినట్లుగానే ఉపాసనవల్ల జనించిన జ్ఞానం బ్రహ్మానందప్రాప్తి లక్షణమైన మోక్షానికి స్వతంత్రసాధనమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఛాంగ్యోపనిషత్తులో ఉద్దాలకుడు శ్వేతకేతువుకు ఆత్మజ్ఞానాన్ని వివరిస్తూ, ఆత్మ అనేది ఎక్కడో ఆకాశంలో లేదు. నిన్ను నువ్వు తెలుసుకోవడమే ఆత్మ జ్ఞానం. ఆత్మజ్ఞాని మోక్షాన్ని పొందుతాడు అని చెప్పాడు. ముండకోపనిషత్తులో మనోమయుడు ఈ అన్నమయ శరీరంలోనే ఉన్నాడు. ఈ విషయం తెలిసిన వాడు ఆత్మతత్త్వాన్ని సాక్షాత్కరింపజేసుకోగలుగుతాడని చెప్పబడింది. బృహదారణ్యకంలో బ్రహ్మజ్ఞాని కూడా బ్రహ్మమే అవుతాడు అని చెప్పబడింది. ఈ విధంగా గురువు ఆదేశానుసారం, ఆత్మ జ్ఞానం తెలుసుకొని, పరబ్రహ్మను శోధించి తెలుసుకున్నవాడు మోక్షం పొందుతాడు. జ్ఞానం మోక్షానికి సాక్షాత్ సాధనం. దీనికి వేరే సాధనం అవసరం లేదు. మరోదానికి అంగం కానేరదు.
పురుషార్ధాధికరణం ( 3, 4, 2 )
సూత్రం :- 427
" శేషత్వాత్ పురుషార్ధవాదో యధాన్వేష్వితి జైమినిః "
పురుషార్ధ వాదః :- ఉపాసన జనిత జ్ఞానం వలన పరమ పురుషార్థమైన మోక్షం సిద్ధిస్తుందనడం, అర్ధ వాదః :- కేవలం అర్ధ వాదం మాత్రమే. ఎందుకంటే యధా అన్వేషు :- ద్రవ్య సంస్కార కర్మాంగాల్లా, శేషత్వాత్ :- ఇది కూడా కర్మాంగమే.
భావం :- మొదటి పూర్వపక్ష సూత్రం. ఉపాసన జనితమైన జ్ఞానం వలన పరమ పురుషార్ధ మైన మోక్షం సిద్ధిస్తుందనడం అర్ధవాదం మాత్రమే. ద్రవ్య సంస్కార కర్మాంగాల్లా ఇది కూడా కర్మాoగమే అని జైమిని మహర్షి అంటున్నాడు.
వివరణ:-2 నుంచి 7వ సూత్రం వరకు పూర్వపక్షం వారి వాదన తెలియజేయబడినది. వాటిని ఖండిస్తూ వ్యాసమహర్షి 8 నుండి 13వ సూత్రం వరకు సమాధానం చెప్పారు. కర్తృరూపంలో ఆత్మఅనేది కర్మకు అంగమే. అంటే ఆత్మ, ఆత్మను గూర్చిన జ్ఞానం ఈరెండూ కర్మాంగాలే అని జైమిని అభిప్రాయం. పార లౌకిక కర్మల్లో ప్రవృత్తి కలగడానికి దేహం కన్నా ఆత్మ వేరే అని తెలుసుకోవడం అవసరం. ఆ కర్మలకు ఫలం దేహాన్ని విడిచిన తరువాత పరలోకంలో లభిస్తుంది. ఆత్మ దేహం కన్నా భిన్నం అని ఎరిగిన వాడికే ఇది సంభవం. యజ్ఞకర్మల్లో కర్తగా ఉండేవాడిని ఆత్మ తత్త్వజ్ఞానం కలిగించడమే ఆధ్యాత్మిక విద్య ప్రయోజనం. కర్త అయిన ఆత్మకు కర్మ అంగం. ఆత్మ జ్ఞానం వలన ఫలం లభిస్తుంద నేది అర్ధ వాదం మాత్రమే. కర్మకు ఉన్న ఇతర అంగాల ఫల నిర్దేశనం అర్ధవాదం అయినట్లుగానే ఆత్మ జ్ఞాన ఫలం కూడా అర్ధ వాదమే.
తైత్తరీయసంహిత (3, 5, 7, 2 ) :- యజ్ఞం లో ఉపయోగించే పాత్రలో జూహు అనేది ఒకటున్నది. దానిని మోదుగ కట్టేతో చేస్తే యజ్ఞకర్త అపకీర్తి పొందడు అని నిర్దేశించారు. ఇక్కడ ఈ యజ్ఞఫలం అర్ధవాదం మాత్రమే. జూహును ఫలాశయంతో చేయాలనీ మాత్రమే దీని భావం. యజ్ఞం చేసేటప్పుడు యజమాని కంటికి అంజనం పెడతారు. దీని ఫలంగా శత్రువు చూపును విచ్చిన్నం చేస్తుంది. అన్నారు. ఏ ఫల నిర్దేశం కూడా అర్ధ వాదమే.
తైత్తరీయ సంహిత ( 6, 1, 1, 5 ):- సంస్కారం కోసం యజమాని కంటికి అంజనం పెట్టుకోవాలి. ఇలాగే "తరతి శోక మాత్మ విత్ " ఆత్మజ్ఞాని తరిస్తాడు అని చెప్పిన ఫల నిర్దేశనం కూడా అర్ధ వాదమే. కర్తలో కర్త రూపంగా ఉండేవాడికి అనుష్ఠానానికి పూర్వం దేహం కన్నా ఆత్మ వేరే అని తెలుసుకోవడం తప్పనిసరి అని ఈ వాక్య భావం. కాబట్టి మోక్షానికి జ్ఞానం స్వతంత్ర కారణం అనడం ప్రామాణికం కాదని, ఆత్మ జ్ఞాన విచారణ మోక్షానికి సాధనాలుఅనిచెప్పే వాక్యాలు ప్రశంస కోసమేనని జైమిని వాదన.
సూత్రం :- 428
" ఆచార దర్శనాత్ "
ఆచారః :- జ్ఞానులు కర్మలు అనుష్ఠిస్తూ ఉంటారు అని, దర్శనాత్ :- శాస్త్రాలు చెబుతున్నాయి.
భావం :- జ్ఞానులు కర్మలు అనుష్ఠిస్తూ ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి.
వివరణ:- పూర్వ పక్షం వారి రెండవ సూత్రం. ఆచారం కనబడటం వలన కూడా జ్ఞానమనేది స్వతంత్రంగా జ్ఞాన సాధనం కాదు. విదేహాధిపతి అయిన జనకమహారాజు గొప్పగొప్ప దక్షిణలిచ్చి యజ్ఞాలు చేశాడు. ఆయన ఆత్మజ్ఞాన సంపన్నుడు, జన్మ రాహిత్యం పొందినవాడు. మహాత్ములకు జ్ఞానం వచ్చాక కూడా గొప్ప దక్షిణలిచ్చి యజ్ఞయాగాలు చేశారంటే కర్మ చేసినట్లే కదా! బ్రహ్మజ్ఞానం కూడా కర్మజ్ఞానం కలిగిఉన్నది కదా! అష్టావక్రుడు లాంటి ఆత్మజ్ఞానం పొందినవారు కూడా వ్యయ ప్రయాసలతో యజ్ఞయాగాదులు ఎందుకు చేస్తున్నారు? కర్మఫలం వలనే మోక్షం వస్తుంది అనేది జైమిని మహర్షి అభిప్రాయం.
ఛాందోగ్యోపనిషత్తు ( 5, 11, 5 ) :- మహానుభావులారా! నేను యజ్ఞం చేసేవాడిని అని అశ్వపతి తన దగ్గరకు వచ్చిన బ్రహ్మ జ్ఞానార్దులైన మహాశీలుడు లాంటి శ్రోత్రియులైన విద్వాంసులను ఉద్దేశించి అంటాడు.
బృహరణ్యకోపనిషత్తు ( 3, 1, 1) :- విదేహరాజైన బ్రహ్మ వేత్త జనకుడు బహు దక్షిణలతో కూడిన యజ్ఞం చేసినట్లు ఉన్నది. జ్ఞానులైన శిష్ట జనాలు యజ్ఞాలు చేయడాన్ని బట్టి చూస్తే, జ్ఞానానికి స్వతంత్ర ఫలం లేదని, అది కర్మకు అంగమని, కర్మానుష్టానం వల్ల ఫలం లభిస్తుందని స్పష్టమౌతోంది.
సూత్రం :- 429
" తత్ శ్రుతేః "
తత్ :- జ్ఞానం కర్మకు అంగమని, శ్రుతేః :- శాస్త్ర ప్రమాణాలంటు న్నాయి.
భావం :- జ్ఞానం కర్మకు అంగమని శాస్త్ర ప్రమాణాలంటున్నాయి.
వివరణ:- ఇది మూడవ పూర్వ పక్ష సూత్రం. విద్య అనేది కర్మ శేషం. అంటే జ్ఞానం కర్మలకు అంగం.
ఛాందోగ్యోపనిషత్తు(1, 1, 10):- "యదేవ విద్యయా కరోతి, తదేవ వీర్యవత్తరంభవతి "విద్య-జ్ఞానంతో చేసిన కర్మ శక్తివంత మైనది. ఇక్కడ విద్యయా - విద్యతో అని కరణర్ధంతో తృతీయ విభక్తిని ప్రయోగించడం వలన విద్య కర్మాంగం, సాధనం అని తెలుస్తోంది. కర్మసంపన్నం కావడానికి ఇతరసాధనాలు దాని అంగాలైనట్లుగా, జ్ఞానం కూడా కర్మకు అంగమని తాత్పర్యం. విద్య, శ్రద్ధ, యోగం అనే ఈమూడింటితో కలసి చేసిన కర్మ శక్తివంతమైనది. జ్ఞానంతో కూడిన కర్మ శక్తివంతమైనదని, జ్ఞానం కూడా కర్మాంగమేనని, అవి విడి విడిగా ఉండవనీ జైమిని అభిప్రాయం.
సూత్రం :- 430
" సమన్వారంభణాత్ "
సమన్వ ఆరంభణాత్ :- జ్ఞానం, కర్మల సమాన అనుగమనం వలన జ్ఞానం కర్మకు అంగం.
భావం :- జ్ఞానం, కర్మలను సమాన అనుగమనం వలన జ్ఞానం కర్మకు అంగం.
వివరణ:- ఇది ఐదవ పూర్వ పక్ష సూత్రం. విద్య, కర్మ రెండింటి సమచ్చయం కనబడటం వలన విద్య కూడా కర్మాంగమే అని తెలుస్తోంది. జీవుడు చనిపోయిన తరువాత అతని విద్య, కర్మ రెండూ కూడా అతని వెంట వెడతాయి. వాటి వలన అతడు కర్మ ఫలితం పొందుతాడు. ఈ రెండూ ఫలితాన్నివ్వటంలో ఒకదానికొకటి సహాయ పడతాయి. అందుచేత విద్య అనేది స్వాతంత్రం కాదు. కర్మాంగమే అని వారి వాదన.
బృహదారణ్యకోపనిషత్తు ( 4, 4, 2 ) :- పరలోకానికి వెళ్లే జీవాత్మకు జ్ఞాన కర్మలు అనుసరిస్తాయి అని చెప్పటం వలన జ్ఞానం ఫలాన్నివ్వడంలో స్వతంత్రం కారణం కాదని, కర్మకు అంగమై ఉపకరిస్తుందని తెలుస్తోంది. విద్యాకర్మలు ఫలాన్ని ఇవ్వడం వలన విద్య కర్మాంగమే. విద్యాకర్మలు పరలోకానికి వెడుతున్న వానిని వెంబడిస్తాయి. విద్యాకర్మలు ఫలం ఇవ్వడంలో పరస్పర సహకారులుగా ఉంటాయి. కనుక విద్యకు స్వతంతం లేదని వారి వాదన.
సూత్రం :- 431
" తద్వతో విధానాత్ "
తద్వతః :- జ్ఞానం ఉన్నవాడికి, కర్మ విధించడం వలన,
భావం :- జ్ఞానం ఉన్నవాడికి కర్మ విధించడం వలన జ్ఞానం కర్మాంగమే అవుతుంది.
వివరణ :- ఇది ఐదవ పూర్వ పక్ష సూత్రం. శ్రుతిని బట్టి అన్ని వేదాల అర్ధాన్ని తెలుసుకున్నవారికి కూడా కర్మను విధించడం కనిపిస్తోంది. కాబట్టి విద్య కర్మాంగమే అని వారి వాదన.
ఛాందోగ్యోపనిషత్తు:- నియమానుసారం గురువును సేవించి, శుశ్రుాషలు చేసి, వేదాధ్యయనం పూర్తి చేసి, సమావర్తనం చెంది, గృహస్థాశ్రమం స్వీకరించి, స్వాధ్యాయం చేస్తూ, విద్యార్థులకు విద్య బోధిస్తూ, ఈ రకంగా కర్మలు చేస్తూ, బ్రహ్మ విద్య సాధన చెయ్యాలి. ఇలా ఇతరములైన నిత్య కర్మలు చేస్తూ బ్రహ్మలోకం చేరతాడు. ఈ విధమైన శ్రుతి సమస్త వేదార్ధ జ్ఞానం ఉన్నవానికే కర్మాధికారం అని చెబుతున్నది. అందువలన కూడా విజ్ఞానం స్వతంత్రంగా ఫల హేతువు కాజాలదు. కనుక విద్య కర్మాంగమే అని వీరి వాదన.
సూత్రం :- 432
" నియమాత్ చ "
చ :- పైగా, నియమాత్ :- నియమం వలన కూడా జ్ఞానం కర్మకు అంగమే.
భావం :- కర్మ వలనే కాకుండా నియమం వలన కూడా జ్ఞానం కర్మకు అంగమని తెలుస్తోంది. నియమం అంటే శాస్త్ర విధి.
వివరణ:- ఇది ఆరవ పూర్వపక్ష సూత్రం. జీవించి ఉన్నంత వరకు కర్మ చెయ్యాలని వేదం చెబుతోంది. కర్మ చేస్తూనే వంద సంవత్సరాలు బ్రతకాలని కోరుకోవాలి. అలా చెయ్యడం వలన అశుభ కర్మ నీకు అంటదు అని చెప్పబడింది.
యజర్వేదం (40, 2):- కర్మలు చేస్తూనే ఇక్కడ నూరేండ్లు బ్రతకాలని కోరుకో, అని జ్ఞానికి యావజ్జీవం కర్మనుష్ఠాన నియమం విధించారు. కనుక కర్మ వలన ఫలం లభిస్తుందని గోచరిస్తోంది కదా!
శత పధ బ్రాహ్మణం ( 12, 4, 1, 1 ):- అగ్ని హోత్రం జరామరణ పర్యంతం చేయతగ్గ సత్రం. ముసలితనమో, మృత్యువో వచ్చి నప్పుడు మాత్రమే ఈ కర్మ మనల్ని విడిచి పెడుతుంది. అని అనటం వలన ఆయువు ఉన్నంత కాలం కర్మ అనుష్టించడంలో జ్ఞానం కర్మకు అంగమని స్పష్టమౌతోంది. కనుక సుదీర్ఘమైన పూర్వ పక్ష వాదన తరువాత వ్యాస మహర్షి పై ఆరు సూత్రాలను సమాధానం చెబుతూ సూత్రీకరించారు.
సూత్రం :- 433
" అధికోపదేశాత్తు బాదరాయణ స్త్వెవం తద్దర్శనాత్ "
తు :- ఈ వాదం సరియైనది కాదు. అధిక ఉపదేశాత్ :- జ్ఞానాన్ని కర్మాంగంగా ప్రకటించడం ఉచితం కాదని బాదరాయణస్య :- వ్యాసుడు, ఏవం :- ( 3, 4, 1 లో ) ఇది వరకే చెప్పి ఉన్నారు. తత్ దర్శనాత్ అధిక ఉపదేశాత్ :- వేద, ఉపనిషత్తులలో దీని విషయంలో అధికంగా ఉపదేశించారు.
భావం:- ఈవాదం సరియైనది కాదు. జ్ఞానాన్ని కర్మాంగంగా ప్రకటించడం ఉచితం కాదని వ్యాసుడు ఇది వరకే చెప్పియున్నారు. వేదాలలోనూ, ఉపనిషత్తులలోనూ దీని విషయంలో అధికంగా ఉపదేశించారు. కనుక జ్ఞానమే మోక్షానికి కారణం, అది కర్మాంగం కాదు.
వివరణ:- ఇది (3, 4, 2) సూత్రానికి సమాధానం. విద్య అనేది కర్మ శేషం కాదు. జ్ఞానమనేది స్వతంత్రంగానే మోక్ష సాధనమని వ్యాస భగవానుడు అంటారు. ఎందుకంటే వేదాంతంలో కర్మిష్టి గురించి కర్మ శేషుడైన వాని గురించి, సంసారి గురించి చెప్పిన దానికన్నా అసంసారి చిన్మాత్రుడైన పరమేశ్వరుని గురించే ఎక్కువగా చెప్పబడింది. ఈశ్వరుడు సర్వజ్ణుడు, సర్వవేత్త అంటూ ఈశ్వరుణ్ణి గురించి ఎక్కువగా ఉపనిషత్తులలో చెప్పడం వలన ఆత్మ జ్ఞానం కర్మాంగం కాదని తెలుస్తోంది. కర్మిష్టి ఆత్మజ్ఞానం పొందినవాడుగా గుర్తింపబడ్డాడు. పరమాత్మను పొందాలంటే ఆత్మ జ్ఞానం ద్వారా పొందిన జ్ఞానమే సాధనమని, కర్మ కాదని తెలియజేశారు. కర్మకు ఎంత జ్ఞానం కావాలో అంతే జైమిని మహర్షి ఉపదేశించాడు. కర్మలు చేయడానికి శరీరం కన్నా ఆత్మ వేరు అని తెలిస్తే చాలు. అది శబ్ద అనుమాన ప్రమాణాల వలన కలుగుతుంది. ఆ జ్ఞానం కర్మకు అంగం అనవచ్చును. కాని వేదాంతశాస్త్ర రూపంలో చేసిన ఉపదేశం దీనికి మించినది. అది ఆత్మ, పరమాత్మల సాక్షాత్కారానికి యుక్తమైనది. శరీరాదుల నుంచి ప్రకృతి వరకు ఉన్న సమస్త జడ తత్త్వాల కన్నా ఆత్మ చేతనత్వం ఎంతో భిన్నం. సర్వజ్ఞం, సర్వ శక్తి మంతం అయిన పరమాత్మ చేతన, అచేతనాలన్నిటికి అధిష్టాత. జగజ్జన్మాదులకు మూలకారణం. బాదరాయణుడి దర్శనంలో ఈ ఉపదేశ్యమే ఉన్నది. ఇలాంటి జ్ఞానం వలన కర్మ సమూహం నశిస్తుంది.
ముండకోపనిషత్తు(2, 2, 7):- నిరంతరం అభ్యాసం చేసే ఉపాసకుడు ఆత్మజ్ఞానంతో ఆనందరూప బ్రహ్మసాక్షాత్కారం చేసుకుంటాడు. ఆత్మ, పరమాత్మలను తెలుసుకునేది పర విద్య. ఈ జ్ఞానం కర్మ సమూహాన్ని నాశనం చేస్తుంది. కనుక అది కర్మాంగం ఎన్నటికీ కాదు. దీనిని బట్టి ఆచార్యులలో మత భేదం ఉన్నదని అనుకోకూడదు. ఈ తేడా అధికార భేదాన్ని బట్టి వస్తుంది. అపరా విద్యలో అంతర్గతమైన ఆత్మ జ్ఞానం కర్మకు అంగం కావచ్చును. పరా విద్య బోధిత బ్రహ్మ జ్ఞానం మోక్ష సాధనం. అది కర్మాంగం కాదని అభిప్రాయం.
సూత్రం :- 434
" తుల్యంతు దర్శనమ్ "
తు :- జ్ఞానం కర్మకు అంగం కానేరాదు. దర్శనం :- శిష్ఠాచార దర్శనం లాగా, తుల్యమ్ :- శాస్త్రంలో కర్మనుష్ఠానం శిష్టాచారమైనట్లు, కర్మ త్యాగం కూడా శిష్టాచారంగా భావించాలి.
భావం :- జ్ఞానం కర్మకు అంగం కానేరాదు. శిష్ఠాచార దర్శనం లాగా శాస్త్రంలో కర్మనుష్ఠానం శిష్టాచారమైనట్లు, కర్మ త్యాగం కూడా శిష్ఠాచారంగా భావించాలి. ఇది 3, 4, 3 కు సమాధానం.
వివరణ:- తత్త్వజ్ఞానం కర్మలకు అంగం కాదు అనే మాటకు వేద ప్రమాణం ఉంది. కావషేయమానులు, బ్రహ్మజ్ఞానులు వారు "మనం వేదాధ్యయనం చెయ్యటంఎందుకు యజ్ఞయాగాదులు చెయ్యటంఎందుకు? అనిఅడిగారు. దానికి బృహదారణ్యకంలో నేనే పరమాత్మను అని తెలుసుకొని, బ్రాహ్మణులైనవారు పుత్రులు, ధనం, మొదలైన ఐహికవాంఛలను వదలి, భిక్షాటన చేస్తూ ఉంటారు అని చెప్పబడింది. అంటే బ్రహ్మజ్ఞానులు కర్మలు చెయ్యరు. కర్మచేసినా, చేయకపోయినా వారికి ఒక్కటే. కాబట్టి విద్య కర్మాంగం కాదు.
బృహదారణ్యకోపనిషత్తు(4, 4, 22):- బ్రహ్మ ప్రాప్తి కోరే సన్యాసులు సర్వం త్యజిస్తారు. శ్రేష్ఠ విద్వాంసులు సంతానం లాంటి వాటిని కూడా కోరుకోరు. ఈలోకం, ఆత్మ మనదే అయినప్పుడు ఈ సంతానం మనం ఏమి చేసుకుంటాం? ఈ కారణాల వలన ఆత్మ జిజ్ఞాసువులు సంతానం, ధనం, కీర్తి అన్నింటిని వదిలేసి జీవన యాత్ర కొరకు భిక్షాటనం చేస్తారు. కర్మానుష్ఠానం గృహస్థాది ఆశ్రమాల్లో చేస్తారు. ఆత్మ జిజ్ఞాసువులు కర్మలను త్యజిస్తారు. (2, 4, 15):- యాజ్ఞవల్క్యుడు సన్యసిస్తూ తన భార్య అయిన మైత్రేయికి బ్రహ్మజ్ఞానం అమృతత్వానికి సాధనమని అంటాడు. తాను సర్వంత్యజిస్తాడు. ఇలా కర్మనుష్ఠానం శాస్త్ర దృష్టిలో సమానం కావడం వలన జ్ఞానం కర్మకు అంగం అనడం ప్రామాణికం కాదు. కర్మానుష్ఠానాన్ని చిత్తశుద్ధి కోసం శాస్త్రాలు నిర్దేశించాయి. జనకమహారాజు యజ్ఞ యాగాదులు సమాజశ్రేయస్సు కోసమే నిర్వహించాడు. యధారాజా తధాప్రజా అన్నట్లు రాజు యజ్ఞయాగాదులు నిర్వహిస్తే ప్రజలు కూడా నిర్వహిస్తారు. రాజు అవినీతి పరుడైతే ప్రజలు కూడా అవినీతి మార్గాన్నే అనుసరిస్తారు. జనకుడికి కర్మతో పని లేదు. లాభం లేదు. సాధారణ ప్రజలు, మోక్షాన్ని పొందాలనుకునే వారు విధిగా క్రతువులు నిర్వహించాలి. లోకకళ్యాణం కొరకు మాత్రమే మహారాజు యజ్ఞయాగాదులు చేశాడు కనుక జ్ఞానమే మోక్షానికి సాధనమని, కర్మ సాధనం కాదని వ్యాస మహర్షి తెలియజేశారు.
సూత్రం :- 435
" అసార్వత్రికీ "
అసార్వత్రికీ :- యదేవ విద్యయా అనే ఈ వాక్యం సర్వ విద్యా విషయకం కాదు.
భావం :- ఈ సూత్రం ( 3, 4, 4 ) కి సమాధానం. యదేవ విద్యయా అనే ఈ వాక్యం సర్వవిద్య విషయకం కాదు.
వివరణ:- ఛాందోగ్యం(1, 1, 10)లో విద్యాయుక్తుడై శ్రద్ధతో, యోగంతో, చేసిన కర్మ మిగతా వాటి కన్నా ప్రబలంగా ఉంటుందని చెప్పబడింది. ఉద్గీత, ఉపాసన విద్యకు సంబంధించినదే కాని సర్వఉపాసనలకు చెందినది కాదని నిశ్చితంగా తెలుస్తోంది. యదేవ విద్యయా కరోతి అనే శ్రుతి అన్ని విద్యలకు సంబంధించినది కాదు. ఎందువలననగా అది ప్రకృతమైన విద్యకు సంబంధించినది. విద్య, శ్రద్ధ, యోగం తో కలసి చేసిన కర్మ శక్తివంత మౌతుంది. కర్మద్వారా జ్ఞానం పొందవచ్చును కాని మోక్షాన్ని పొందలేరు. పరమాత్మ జ్ఞానస్వరూపుడు కనుక ఆత్మజ్ఞానం తప్పనిసరిగా పొందాలి. వారే మోక్షాన్ని పొందగలరు.
సూత్రం :- 436
" విభాగః శతవత్ "
శతవత్ :- నూరు నాణాల లాగా, విభాగః :- విద్యా విభాగాన్ని కూడా తెలుసుకోవాలి.
భావం :- రూపాయికి నూరు నాణేల లాగా విద్యా విభాగాన్ని కూడా తెలుసుకోవాలి.
వివరణ:-ఇది (3, 4, 5)కి సమాధానం. ఒకరూపాయికి అనేక చోట్ల వాడుకలో నూరు భాగాలుగా విభజించారు. పది రూపాయి లను ఇద్దరికీ పంచి ఇవ్వాలంటే చెరొక ఐదురూపాయిలు ఇస్తారు. అలాగే విద్య, కర్మ ఈరెండూ పరలోకం వెళ్లేవాళ్ళను అనుసరిస్తాయి. సాధకులకు విద్యను, కర్మను విభయించే ఇవ్వాలి. ఇక్కడ విద్య జ్ఞానిని అనుసరిస్తే, కర్మ సంసారిని అనుసరిస్తుంది.
బృహదారణ్యకోపనిషత్తు(4, 4, 2):- తం విద్యా కర్మణీ సమన్వార భేతే " విద్య అంటే అపర విద్య. పరా విద్య కాదు. ఎందుకంటే ఈప్రకరణం కామించే వాడికి సంబంధించినది. అపరా విద్యకు చెందిన ప్రసంగం. ఇక్కడ విద్య, కర్మ అనే విభాగాన్ని నాణేల విభాగంలాగా తెలుసుకోవాలి. ఒకడి నుంచి భూమిని, మరొక వ్యక్తి నుంచి ఎద్దుల్ని తీసుకొని వాళ్ళిద్దరికీ తన దగ్గర ఉన్న సొమ్మును విభజించి చెల్లిస్తారు. అలాగే పరలోక యాత్రకుడికి విద్య, కర్మ రెండూ ఉపయోగపడతాయి. జ్ఞానికి విద్య, కర్మిష్టికి కర్మ సహాయకాలు. కనుక విద్య అనేది కర్మకు అంగంగా ఎన్నటికీ సిద్ధించదు. (4, 4, 6):- " ఇతి ను కామాయ మానః " అని తరువాత అన్నారు. దాని తరువాత కామించని వాడి గురించి " అధా కామాయ మానః " అని చెప్పారు. ఈ విధంగా బ్రహ్మ జిజ్ఞాస ప్రకరణాన్ని వేరే చేశారు. పరావిద్య వలన బ్రహ్మ జ్ఞానం సిద్ధిస్తుంది. కనుక అది కామనకు క్షేత్రం కాదు. కామనకు చెందిన ప్రకరణంలో చెప్పిన కధనం పరా విద్యాంతర్గతం కాదు. కర్మ, జ్ఞానం రెండూ కలసి ఉండవు. రెండూ వేర్వేరు గానే ఉంటాయి. పాప పుణ్యాలు, జ్ఞానం జీవుడు మరణించిన తరువాత వెంట వెడతాయి. ఎవరైతే మోక్షార్థులై జ్ఞాన మార్గంలో ఉంటూ శ్రవణ, మనన, నిధి ధ్యాసలతో ఆత్మ జ్ఞానం పొందుతారో వారి వెంట జ్ఞానం వెడుతుంది. ఈ కారణం చేత జ్ఞానం, కర్మ వేరు. పాప పుణ్యాలు రెండింటిలో చేసిన పాపాలకు శిక్ష అనుభవించక తప్పదు. సత్కర్మలు చేస్తే సద్గతులు కలగవచ్చును. మంచి జన్మ రావచ్చును. జ్ఞాని మాత్రం పాపపుణ్యలను ఇక్కడే వదలివేస్తాడు. అతనిని దూషించిన వారికీ పాప కర్మల ఫలితం , అతనిని సేవించి, పూజించిన వారికి పుణ్యకర్మ ఫలితం చేరతాయి.
సూత్రం :- 437
" అధ్యయన మాత్రవతః "
అధ్యయన మాత్రవతః :- వేదాధ్యయనం చేసే వాడికి మాత్రమే కర్మానుష్ఠాన విధానం చెప్పారు కాని బ్రహ్మ జ్ఞానికి కాదు.
భావం :- వేదాధ్యయనం చేసే వాడికి మాత్రమే కర్మానుష్ఠాన విధానం చెప్పారు కాని బ్రహ్మ జ్ఞానికి కాదు.
వివరణ:- ఇది (3, 4, 6)కు సమాధానం. వేదాధ్యయనం చెయ్యాలి. శిష్యులకు బోధించాలి అనేది వేదాధ్యయనం చేసే వారికీ చెప్పారు కాని బ్రహ్మజ్ఞానులకు కాదు. ఛాందోగ్యంలో చెప్పిన గురువుకు శుశ్రుష చేసి విద్యను అభ్యసించాలి అనే విధులు కర్మాధికారం కోసం చెప్పినదే కాని జ్ఞాని కోసం కాదు. జ్ఞాని అయినవాడికి వేదాధ్యయనం, కర్మానుష్ఠానం అవసరం లేదు.
ఛాందోగ్యోపనిషత్తు(8, 15, 1):- ఆచార్య కులాత్ వేద మధీత్య అనే వాక్యంలో వేదార్ధ జ్ఞాతకు కర్మానుష్ఠానం విధిస్తుంది. వేదం అధీత్య అంటే వేదాన్ని అధ్యయనంచేసి అని అర్ధం. అధ్యయనం అంటే ఆచార్యుడి వలన వేద పదాల అర్ధం తెలుసుకోవడం. అలాంటి వాడికే కర్మనుష్టానం. బ్రహ్మజ్ఞానికి కాదు. కాబట్టి జ్ఞానం కర్మకు అంగం కానేరదు. వేదాధ్యయనం చేసే వారి కోసం కర్మలు నిర్దేశించబడ్డాయి.వేదం అభ్యసించి దేవాలయాలలో అర్చకస్వాములుగా ఉండటం, వేదపాఠశాలలో విద్యార్థులకు వేద విద్య బోధించడం, యజ్ఞయాగాదులు నిర్వహించడం మొదలైన కర్మలు నిర్వహించడానికి ఉపనిషత్తులలోని మంత్రాలు తెలుసుకోవాలి. కర్మలుచేసే వాడికే విద్య బోధిస్తారు. తనని తాను తెలుసుకున్న బ్రహ్మ జ్ఞానికి యజ్ఞ యాగాది క్రతువులు అవసరం లేదు. నిష్కామ కర్మలు చేస్తూ జ్ఞానాన్ని సంపాదించడానికి కర్మలు చెయ్యాలి కాని జ్ఞానం పొందిన తరువాత కర్మానుష్టానంతో అవసరం లేదు. కేవలం ఆత్మ జ్ఞానం వలనే మోక్షం సిద్ధిస్తుందని మహర్షి అభిప్రాయం.
సూత్రం :- 438
" నా విశేషాత్ "
అవిశేషాత్ :- విశేషించి చెప్పడం వలన, న :- బ్రహ్మ జ్ఞానం కర్మకు అంగం కాదు.
భావం :- విశేషించి చెప్పడం వలన బ్రహ్మ జ్ఞానం కర్మకు అంగం కాదు.
వివరణ:-ఇది(3, 4, 7)కు సమాధానం. లోకంలో అగ్నిహోత్రాది కర్మలుచేస్తూ వందసంవత్సరాలు బ్రతకాలని చెప్పినది కర్మిష్ఠులకే కాని బ్రహ్మజ్ఞానులకు కాదు. ఆయుఃపర్యంతం కర్మలు చేయాల్సిన వాడు జ్ఞానా? అజ్ఞానా? వీరిలో ఎవరు చేయాలో విశేషించి చెప్పలేదు. ఇది సామాన్యవచనం. బ్రహ్మజ్ఞాని సంపత్తి కోసం నిష్కామకర్మానుష్ఠానం చెయ్యాలి. ఇది బ్రహ్మజ్ఞాని కానివాడికి కావాలి. ఇలాంటివాడే ఆయుః పర్యంతం కర్మలను చేస్తాడు. జ్ఞాని అయిన వాడు కర్మలు చేయడం, చేయకపోవడంలో స్వతంత్రుడు. బ్రహ్మజ్ఞాని కాని వాడికి కర్మానుష్ఠానం తప్పనిసరి. ఇలాంటి నియమం ఉండటం వలన జ్ఞానం కర్మకు అంగం అనడం సిద్ధించడం లేదు. ఆత్మజ్ఞానం పొందాలనుకునే వారు మనోబుద్ధుల్లో దోషం లేకుండా ఉండాలి. ఈ జగత్తంతా వ్యాపించినది సర్వంతర్యామి అయిన పరమాత్మయే అనే భావన మనస్సులో రావాలి. కర్మలు చేస్తూ ఉంటే మనస్సుకు కళంకం అంటదు. జ్ఞానం పొందే వరకు నిష్కామ కర్మలు చెయ్యాలి. నామరూపగుణాలకు సంబంధించిన కర్మలన్నింటిని త్యాగం చేస్తేనే జ్ఞానం కలిగి, తద్వారా మోక్షం వస్తుంది.
సూత్రం :- 439
" స్తుతయే నుమతిర్వా "
వా :- లేదా, స్తుతయే :- కర్మను ప్రశంసించడానికి, అనుమతిః :- జీవిత పర్యంతం కర్మానుష్టా నాన్ని అనుమతించవచ్చును.
భావం :- కర్మను ప్రశంసించడానికి జీవిత పర్యంతం కర్మానుష్ఠానాన్ని అనుమతించ వచ్చును.
వివరణ:- తత్త్వజ్ఞానికి కర్మానుష్టానం కేవలం స్తుతి కోసమే. జీవిత పర్యంతం కర్మ చెయ్యనప్పటికీ తత్త్వవేత్త యందు విద్యా సామర్ధ్యం వలన కర్మ లోపం ఉండదు. జ్ఞానాన్ని కలిగించడానికి కర్మలు ఎంతో ఉపకరిస్తాయి. అందువలన అవి స్తుతికి యోగ్యమైనవి. యజ్ఞయాగాది క్రతువులు ఘనంగా నిర్వహించినప్పుడు చూసిన వారందరు ప్రశంసిస్తారు. అందుచేత అలాంటి ఉపకరించే కర్మలను త్యజించడం జ్ఞానికి ఉచితం కాదు. శిష్టాచారాన్ని పాలించడానికో, లోక వ్యవహారానికో జ్ఞాని సైతం జీవితపర్యంతం కర్మలను అనుష్ఠించవచ్చును. దానినే " కుర్వ న్నేహ " లాంటి శాస్త్ర వచనాలు అనుమతిస్తాయి. కనుక, ఇది కర్మను స్తుతించడానికే కాని జ్ఞానం కర్మాంగం అని చెప్పడానికి కాదు. లేదా "ఈశావాస్యమిదం" అనే ప్రకరణం బ్రహ్మ జ్ఞానానికి సంబంధించినదని అనవచ్చును. అప్పుడు జ్ఞాని కర్మలు చేస్తూ కూడా వాటితో ప్రభావితుడు కాడు. ఆత్మ జ్ఞాని కేవలం సాక్షిగా మాత్రమే చూస్తాడు. ఆకర్మలన్నిటికీ అతడు కర్త కాదు. కర్మలు జ్ఞానిని లోబరచుకోవు. దీనినే " న కర్మ లిప్యతే నరే " జ్ఞానికి కర్మలు అంటవు.
సూత్రం :- 440
" కామ కారేణ చైకే "
చ :- అది కాక, ఏకే :- కొందరు, కామ కారేణ :- జ్ఞానులు ఇష్టానుసారంగా అగ్ని హోత్రాదులు చేయవచ్చును. లేదా విడువ వచ్చును.
భావం :- జ్ఞానులు ఇష్టానుసారం అగ్ని హోత్రాది కర్మలు చేయవచ్చును. లేదా విడువ వచ్చును.
వివరణ:-కౌషీతకీ, వాజసనేయశాఖలకు సంబంధించినవాళ్ళు, జ్ఞానిఅయినవాళ్ళు, తమ ఇష్టప్రకారం కర్మలను పరిత్యజించ వచ్చును. వాజసనేయశాఖవారు కొందరు గృహస్థాశ్రమాన్ని త్యాగం చెయ్యాలని చెబుతున్నారు. అంటే జ్ఞానులైన వారు, సంసారబంధాలు విడిచి పెట్టినవారు, విరాగులు ఈ సంతానకర్మల వలన ప్రయోజనం లేదు. మనకు ఆత్మలోకం కావాలి అని భావించే వారు కర్మలకు ప్రాధాన్యం ఇవ్వరు.
కౌషీతకీబ్రాహ్మణం(2, 5):-అంతంఉన్న ఇతర ఆహుతులు కర్మ మయాలు అవుతున్నాయి. అందువల్ల పూర్వ విద్వాంసులు అలాంటి ఆహుతులతో హోమం చెయ్యరు.
బృహదారణ్యకోపనిషత్తు(4, 4, 22):-ఉత్తమజ్ఞానులు సంతతి కోరుకోరు. బహుకర్మలుండే గృహస్థాదిఆశ్రమాల్లో ప్రవేసించా లనుకోరు. సంతతివలన తమకు ఏమి ప్రయోజనం? అంటారు. వాళ్లకు ధనం, సంతతి, ప్రతిష్టలతో ప్రయోజనం లేదు. వాళ్లకు సర్వం బ్రహ్మమయమే. అందువలన వాళ్ళు అన్ని విడిచి పెట్టి భిక్షాటన తోనే జీవనం గడుపుతారు. ఇలాంటి ప్రసంగాన్ని బట్టి జ్ఞానులు కర్మలను కోరి త్యజిస్తారని, స్పష్టమౌతోంది. కనుక జ్ఞానం కర్మాంగంకాదు. కొందరు స్వేచ్ఛగా కర్మలను పరిత్యజిస్తారు. కొందరు విద్వాంసులు విద్యాఫలాన్ని ప్రత్యక్షం చేసుకున్నవారై, ఆ విద్య యొక్క అవస్టంభం అంటే దాని బలం చూసుకొని ఇతర ఫలాలకు సాధనలైన సంతానాదులు నిష్ప్రయోజనాలని, నిస్సంశయంగా చెబుతున్నారు. ప్రాచీనులైన విద్వాంసులు సంతానం కోరుకోవడం లేదు. మనకు ఆత్మ అనే లోకంఉండగా సంతానంతో పని ఏమి? అని వాజసనేయ శ్రుతి చెబుతున్నది. విద్యాఫలం వెంటనే అనుభవానికి వస్తుంది. కర్మఫలం వలె కాలాంతరంలో లభించేది కాదు అని అనేక పర్యాయములు చెప్పియున్నారు. ఆత్మజ్ఞానం ఎంతగొప్పదో, ఎంత అపురూపమైనదో, తెలుసుకుంటేనే ఆత్మజ్ఞానం ప్రాధాన్యత తెలుస్తుంది. జ్ఞానం స్వతంత్రమైనదని, జ్ఞానమే మోక్షానికి సాధనమని చెప్పబడింది. కర్మల వలన మోక్షం రాదని తెలుస్తోంది.
సూత్రం :- 441
" ఉప మర్ధం చ "
ఇక్కడ ఏకే అనేది అనువృత్తి. చ :- కాగా, ఉపమర్దం :- కొన్ని శాఖల వాళ్ళు జ్ఞానం వలన కర్మలు నశిస్తాయని అంటున్నారు.
భావం :- కొన్ని శాఖల వాళ్ళు జ్ఞానం వలన కర్మలు నశిస్తాయని అంటున్నారు. కనుక జ్ఞానం కర్మకు అంగం కానేరదు.
వివరణ:- కొందరు విద్వాంసులు వైరాగ్యం గురించి చెబుతున్నారు. విద్యావేత్తకు సర్వము ఆత్మ స్వరూపంగా కనిపిస్తుంది. అతడికి కర్త అనే భావం ఉండదు. కర్మ జరగాలంటే కర్త, కర్మ రెండూ ఉండాలి. అన్ని వ్యవహారాలనుంచి విడుదలైన తరువాత బ్రహ్మవేత్తకు సర్వము ఆత్మ అయినప్పుడు ఉన్నదంతా ఒక్కటే అయినప్పుడు చేసేది - చేయబడేది, చూసేది - చూడబడేది ఏమి ఉండదు. ఆ రెండూ ఒక్కటైన ఆత్మజ్ఞానికి కర్త, కర్మ, క్రియ ఉండవు. అటువంటి కర్మ అవసరం లేదు. విద్యాఫలం అంటే ఆత్మసాక్షాత్కారం స్వస్వరూప జ్ఞానంలో కర్మ చేయాలంటే అవకాశం ఉండదు. కర్మలు అవసరం లేదు. జ్ఞానం స్వతoత్రం. కాబట్టి విద్య కర్మాంగం కాదు.
ముండకోపనిషత్తు(2, 2, 8):-ఆపరబ్రహ్మ సాక్షాత్కారంతో అతడి కథలు క్షీణిస్తాయి. అంటే అతను చేసిన కర్మలు ఫలోత్పాదన శక్తిని కోల్పోతాయని భావం. దీనిని బట్టి జ్ఞానం కర్మకు అంగమైన పక్షంలో జ్ఞానం వలన కర్మలు నశిస్తాయి అనడం పోసగదు కదా! కనుక జ్ఞానం కర్మకు అంగం కాదు.
సూత్రం :- 442
" ఊర్ధ్వ రేతస్సు చ శబ్దే హి "
ఊర్ధ్వ రేతస్సు :- ఊర్ధ్వ రేతస్సులో కర్మానుష్టానం ఉండదు. హి :- కదా, చ :- పైగా, శబ్దే :- శాస్త్రాల్లో ఊర్ధ్వ రేతస్కు లున్నట్లు ప్రమాణాలున్నాయి.
భావం :- ఊర్ధ్వరేతస్సులో కర్మానుష్ఠానం ఉండదు కదా! పైగా శాస్త్రాల్లో ఊర్ధ్వరేతస్కులున్నట్లు ప్రమాణాలున్నాయి.
వివరణ:- నైష్ఠిక బ్రహ్మచర్యం పాటిస్తూ, బ్రహ్మజ్ఞానం కొరకు ప్రయత్నించే త్యాగుల్ని ఊర్ధ్వరేతస్కులు అంటారు. వీరికి బ్రహ్మ చర్యం, సన్యాసం అనే రెండు ఆశ్రమాలలోనే సంబంధం ఉంటుంది. వీళ్ళ ఆశ్రమాల్లో బ్రహ్మజ్ఞాన నిష్ఠ శాస్త్రవిహితం. కాగా వీరికి అగ్నిహోత్రాదికర్మలు ఆచరించడం తప్పని సరికాదు. బ్రహ్మవిద్య కేవలం సన్యాశ్రమంలోనే వినిపిస్తుంది. ఇంకెక్కడా వినిపించదు. కాబట్టి విద్య కర్మాంగంకాదు. యతులకు అగ్నిహోత్రాది కర్మలులేవు. వారి దృష్టిలో విద్య అంటే బ్రహ్మజ్ఞానం. ఆత్మలోకం కోరే సన్యాసులు కర్మలు త్యజిస్తారు. వారు కర్మలు చెయ్యరు. కర్మ చేసినా, చెయ్యక పోయిన వారికీ ఫలితం ఒక్కటే. కాబట్టి బ్రహ్మవిద్య స్వతంత్రంగానే మోక్ష సాధనం అని చెప్పబడింది.
ఛాందోగ్యం(5, 10, 1):- వీళ్ళు అరణ్యంలో శ్రద్ధతో తపస్సుచేస్తూ, ఉపాసిస్తుంటారు. (2, 23, 1):- ధర్మస్కందాలు మూడు. యజ్ఞం, ధ్యానం, అధ్యయనం. మొదటిదైన యజ్ఞాన్ని ఆచరించే వాళ్ళు పుణ్య ఫలాలైన సుఖాలను పొందుతారు. రెండవది తపస్సు. మూడవది గురుకుల వాసం, బ్రహ్మ చర్యం. ఇలా బ్రహ్మ చర్యాది తపస్సులు శ్రద్ధతో చేసి బ్రహ్మజ్ఞానం ఉన్న వాళ్ళు మోక్షానికి అర్హులౌతారు. ఇలాంటి ఊర్ధ్వరేతస్కులకు శాస్త్రాల్లో జ్ఞాన నిష్ఠను విధించారని పై వాక్యాల వలన తెలుస్తోంది. జ్ఞానం కర్మాంగం ఎన్నటికీ కాదని, జ్ఞానమే మోక్షానికి స్వతంత్ర కరణం అని చెప్పారు.
ముండకోపనిషత్తు (1, 2, 11):- శాంతులు, బ్రహ్మ జిజ్ఞాసువులు బిక్షాటనం చేస్తారు. శ్రద్ధతో తపస్సు చేస్తూ ఉపాసిస్తారు.
బృహదారణ్యకోపనిషత్తు(4, 4, 22):- బ్రహ్మప్రాప్తికోరి, విరక్తులైన వాళ్ళు సన్యాసులౌతారు. .ఊర్ధ్వరేతస్కులైనవారు శ్రద్దా తపో నిష్ఠులై అరణ్యంలో నివసిస్తూ, ఆత్మరూపమైన లోకాన్ని కోరుకుంటూ ఉపాసిస్తారు. గార్హస్థ్యం గ్రహించినా, గ్రహించక పోయినా ఋషిఋణం, దేవఋణం, పితృఋణం అనే మూడు ఋణాలను తీర్చుకున్నా, తీర్చుకొనక పోయినా ఊర్ధ్వరేతస్త్వం శ్రుతి, స్మృతులలో ప్రసిద్ధంగా ఉంది. అందువలన విద్య స్వతంత్రమైనది.
పరామర్శధికరణం ( 3, 4, 18 )
సూత్రం :- 443
" పరామర్శం జైమిని రచోదనా చాపవదతి హి
జైమినిః:- జైమినిమహర్షి ప్రకారం, శబ్ద :- పూర్వ సూత్రంలో చెప్పిన ఛాందోగ్య వాక్యంలో ఉండే సన్యాస ఆశ్రమం కేవలం ఔపచారికం. విధి కానేరాదు. హి :- ఎందుకంటే, ఆచోదనా :- అందులో విధిని సూచించే పదాల ప్రయోగం లేదు. చ :- పైగా, అపవదతి :- నిషేదిస్తోంది కూడా.
భావం :- ఇది పూర్వపక్ష సూత్రం. జైమినిమహర్షి ప్రకారం పూర్వసూత్రంలో చెప్పిన ఛాందోగ్యవాక్యంలో ఉండే సన్యాస ఆశ్రమం కేవలం ఔపచారికమే. విధికానేరదు. ఎందుకంటే దానిలో విధిని సూచించే పదాల ప్రయోగం లేదు. పైగా నిషేదిస్తోంది కూడా.
వివరణ:- గురువు గారు! బ్రహ్మ విద్య ద్వారానే మోక్షం వస్తుంది అన్నారు. సన్యాసాశ్రమంలో దీనికి కర్మ అనేది లేదన్నారు. అయితే అసలు సన్యాసాశ్రమం అనేది ఉన్నదా? ఉంటే దానిని ఆచరించవచ్చునా? లేదా? అని అడిగాడు నారాయణ భట్టు. సన్యాసాశ్రమంగురించి చెప్పడంలో విధాయకమైన గుణాలు ఏమిలేవు. కొన్ని శ్రుతులు దీనిని నిషేధించాయి. అయినప్పటికీ శాస్త్రాలు సన్యాసాశ్రమాన్ని అంధపరంపరన్యాయంగా చెప్పాయి అని జైమిని అభిప్రాయం. అంధపరంపరన్యాయం అంటే ఒక గ్రుడ్డివాని చెయ్యిపట్టుకొని మరొక గ్రుడ్డివాడు అలానడచి వెడుతుంటాడు. త్రోవలో ఏమున్నదో ముందు నడిచేవాడికి తెలియదు. వెనుక నడిచే వాడికి తెలియదు. అదేవిధంగా ఒక శాస్త్రంలో చెప్పారు కాబట్టి ఇంకొక శాస్త్రంలో సన్యాసాశ్రమం గురించి వ్రాశారు. అసలు ఆశ్రమాలు మూడేనని అని జైమిని మహర్షి అభిప్రాయం.
1. బ్రహ్మ చర్యం :- గురుకుల వాసంలో గడిపేది.
2. గృహస్థాశ్రమం :- యజ్ఞం, వేదాధ్యయనం, దానాలు చేసేది.
3.వానప్రస్థం :- తపస్సు చేయుట
ఈ రకంగా మూడు ఆశ్రమాలే చెప్పబడ్డాయి. వాటిలో సన్యాసాశ్రమం లేదు అని జైమిని అంటాడు.
తైత్తరీయసంహిత(1, 5, 2, 1):-దేవసంబంధమైన అగ్నిని త్యజించినవాడు వీరఘాతకుడౌతాడు. కనుక అగ్నిహోత్రాది కర్మలను విడిచి పెట్టినవాడు నిందాపాత్రుడన్నమాట. అలాగే శాస్త్రము గృహస్థాశ్రమాన్ని ప్రశంసిస్తోంది.
తైత్తరీయాసంహిత(1,11):-ఆచార్యునికి కావలసిన ధనాన్ని తెచ్చిఇచ్చి, సంతతిక్రమాన్ని విచ్చేధనంచెయ్యకు అని స్నాతకు డైన శిష్యునికి ఉపదేశం. స్నాతకుడివై, గృహస్థా శ్రమాన్ని స్వీకరించి సంతానాన్ని వృద్ధి చెయ్యి అని అర్ధం. ఎందుకంటే సంతాన హీనుడు లోకంలో సుఖపడడు.
ఐతరేయబ్రాహ్మణం(7, 13, 12) :-ఈ శాస్త్రవచనాలు గృహస్థాశ్రమ త్యాగాన్ని నిషేదిస్తున్నాయి. కర్మత్యాగం చేసే ఆశ్రమాన్ని ఇలా శాస్త్రాలు అంగీకరించడం లేదు కదా! కాషాయవస్త్రాలు ధరించిన వారు మాత్రమే సన్యాసులు కారు. సం - న్యాసం పూర్తిగా కర్మలను సన్యసించినవారు సన్యాసులు. అలాంటి వారికే బ్రహ్మవిద్యాధికారం వస్తుంది. గురువు శుష్రూష చేసి అత్యంత శ్రద్ధాభక్తులతో గురువు దగ్గర విద్య నేర్చుకొని, శ్రవణం, మననం చేస్తూ, కర్మలను పూర్తిగా విడిచిన వారికే బ్రహ్మవిద్యాప్రాప్తి లభించి, తద్వారా మోక్షాన్ని పొందగలరు.
సూత్రం :- 444
"అనుష్టేయం బాదరాయణః సామ్యశ్రుతేః "
సామ్యశ్రుతేః:-మూడుఆశ్రమాలసామ్యాన్ని బోధించే శాస్త్రాలు ఉన్నాయి. అనుష్టేయం:- పరివ్రాజకఆశ్రమం అనుష్టించాల్సినదే. బాదరాయణః :- బాదరాయణుడి మతం.
భావం :- మూడు ఆశ్రమాల సామ్యాన్ని బోధించే శాస్త్రాలు ఉన్నాయి. పరివ్రాజక ఆశ్రమం అనుష్టించ వలసినదేనని బాదరాయణుడి మతం.
వివరణ:-ఈ అధికరణంలో సన్యాసాశ్రమం గురించి వేదాలలో చెప్పబడినట్లు తెలుస్తోంది. సన్యాసాశ్రమం అనుష్ఠించదగినదని వ్యాసుడు అంటారు. వేదంలో గృహస్థాశ్రమంతో బాటే సన్యాసాశ్రమం కూడా ఉందని చెప్పారు. ముందు చెప్పిన మూడు ఆశ్రమాల వలన పుణ్య లోకాలు ప్రాప్తిస్తాయని చెప్పారు. నాల్గవది అయిన సన్యాసాశ్రమం దీనికి భిన్న మైనది. ఇది మోక్ష ప్రాప్తి సిద్ధించడానికి ఉపయోగపడుతుంది. అందుకే దీనిని అనుష్ఠించాలి.
ఛాందోగ్యోపనిషత్తు(2, 23, 1):-"త్రయోధర్మస్కంధాః బ్రహ్మసంస్ధోమృతత్వ మేతి " ఇందులో ఆశ్రమాలన్నింటిని సమానంగా వర్ణించారు. ధర్మానికి మూడుఆధారాలు. అవి యజ్ఞం, అధ్యయనం, దానం, అనేవి గృహస్థాశ్రమంలో మొదటిస్కందం. తపస్సు ప్రధానంగాఉన్న వానప్రస్థ రెండోస్కందం. ఆచార్యకులంలో బ్రహ్మ చర్యాన్ని పాటిస్తూ, నిర్వహించే బ్రహ్మచర్య ఆశ్రమం మూడవస్కంధం. ఈమూడు ఆశ్రమాల్లో కర్మనుష్ఠానం సమానమే. ఈ ఆశ్రమధర్మాలను పాటించినవారికి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. దాని తరువాత నాల్గవ ఆశ్రమం సన్యాసం. కామ్యకర్మలను త్యజించి, నిరంతర శ్రద్ధతో, ఉపాసన ద్వారా బ్రహ్మ సాక్షాత్కారం చేసుకునే వాణ్ణి బ్రహ్మ సంస్థ అంటారు. సన్యాశ్రమం కర్మ త్యాగ భరితం. జ్ఞానప్రదమైనది కూడా.ఛాందోగ్యం లో ఆశ్రమాలన్నిటిని సమానం అన్నారు. ఒక దాన్ని చెప్పి, మరో దానిని విడిచి పెట్టలేదు. అందువలన కర్మ ప్రధానమైన ఆశ్రమమే వేద విహితం అనకూడదు.
జాబాలి ఉపనిషత్తు:- బ్రహ్మ చర్యాన్ని పూర్తి చేసిన తరువాత గృహస్థు కావాలి. ఆ తరువాత వానప్రస్థం, తరువాత సన్యాసం స్వీకరించాలి. ఎప్పుడు విరక్తి కలిగితే అప్పుడే సన్యసించాలి. ఇక్కడ ఇతర ఆశ్రమలతో బాటు సన్యాశ్రమానికి కూడా విధి స్పష్టంగా ఉంది. అందువలన సన్యాసాశ్రమం శాస్త్ర విహితమే.గృహస్థాశ్రమంలో అగ్ని హోత్రం తప్పనిసరిగా చెయ్యాలి. దానిని నిషేధిస్తే పుత్ర ఘాతకుడు అవుతాడు. అగ్ని హోత్రాన్ని విడిస్తే సన్యాసి అవుతాడు. ఇది గృహస్థులకు మాత్రమే చెప్పినది కాని పరివ్రాజకులకు, సన్యాసులకు అగ్నిహోత్రం, యజ్ఞయాగాది కర్మలు చెప్పలేదు. అందుకే సన్యాసాశ్రమం అమృతత్వమని శ్రుతి సమ్మతమని చెప్పారు.అతను గృహస్టు అయిన,వాన ప్రస్థుడైనా సన్యాసాశ్రమం స్వీకరించవచ్చును.
సూత్రం :- 445
" విధిర్వా ధారణవత్ "
వా :- లేదా, ధారణ వత్ :- తైత్తరీయ సంహిత లో 'ధారయతి ' అనే శబ్ద ప్రయోగం లాగా, విధిః :- ప్రవ్రజంతి అనేది కూడా విధే అవుతుంది.
భావం :- తైత్తరీయ సంహిత లో ధారాయతి అనే శబ్ద ప్రయోగం లాగా ప్రవ్ర జంతి కూడా విధే.
వివరణ:- తైత్తరీయ సంహితలో మహా పితృయజ్ఞం లో ప్రేతాగ్ని హోత్రం ప్రసంగం ఒకటి ఉన్నది. సమిధను క్రింద ఉండేటట్లు పట్టుకొని తీసుకొనివెళ్ళాలి. దైవ హోమంలో దేవతల కోసం స్రుక్ దండానికి పై భాగంలో సమిధను పట్టుకొని ధరించాలి అని చెప్పడానికి ధారాయతి అనే విధివాక్యాన్ని ప్రయోగించారు. అలాగే ప్రవ్రజంతి(సన్యాస విధి)అనే విధివాక్యంకూడా చెప్పబడింది. ధారయతి అనే స్థలంలో ధారణ అని వాడారు. ఇలా వాడటాన్ని అపూర్వం అంటారు.
మీమాంసదర్శనం(3, 4, 3):- విధిస్తు ధారణే పూర్వత్వాత్ స్యాత్ అన్న విధి వాక్యాల వలన ప్రాప్తించని కారణంగా ధారయతి అంటే ధారణ విధి అని గ్రహించాలి. ఈ న్యాయమే ప్రవ్రజంతి అనే చోట కూడా వర్తిస్తుంది. కనుక సన్యాసాశ్రమం శాస్త్ర విహితమే. ప్రవ్రజంతి అంటే సన్యాసవిధి అని అంటున్నారు. అది బ్రహ్మలోకాన్ని ప్రశంసించే పదం ఎందుకు కాకూడదు? విధిలో చెప్పక పోయినప్పటికి సన్యాసావస్థ ఉంది. మొదటి మూడుఆశ్రమలలోనూ ఫలితం పుణ్య లోకాలు. సన్యాసాశ్రమానికి మోక్షం అని వేదాలలో చెప్పబడింది. సన్యాసమే బ్రహ్మ. బ్రహ్మశ్రేష్టుడు కదా! అందుచేత బ్రహ్మ అని చెప్పబడిన సన్యాసం కూడా పరమే. ఆతపస్సులన్నీ తక్కువ తరగతికి చెందినవే. సన్యాసమే అన్నింటి కన్నా గొప్పది. 'సన్యాసం చేత పరిశుద్ధమైన అంతఃకరణ గల యతులు', 'వేదాంత విజ్ఞానం చేత సునిచితమైన విషయంగలవాడు' మొదలైన శ్రుతులు బ్రహ్మ సంస్థునికి కర్మలు లేవని చూపుచున్నాయి. అందువలన పరివ్రాజకునికి ఆశ్రమం వలనే అమృతత్వం లభిస్తుంది. "బ్రహ్మచర్యం - వానద్వా " అనే శ్రుతి ద్వారా బ్రహ్మచర్యం నుంచి గృహస్టు, ఆ తరువాత వానప్రస్థుడుగా కావాలి. ఈ శ్రుతి కర్మ ఫలాపేక్ష లేని వాడిని దృష్టిలో ఉంచుకొని చెప్పినదని చెప్పడానికి శక్యం కాదు.. గోదానాది వేద వ్రతాలు చేసిన చేయక పోయిన, స్నాతకుడైనా, కాకపోయినా ఎవరైనా సన్యసించవచ్చును. అందువలన కర్మాచరణ చేయని ఊర్ధ్వరేతస్కులకు సన్యాసాశ్రమాలు విధించడం వలన విద్య స్వతంత్రమే అని, కర్మాంగం కాదని తెలుస్తోంది.
స్తుతి మాత్రాధికరణం ( 3, 4, 21 )
సూత్రం :- 446
" స్తుతి మాత్ర ముపాదానా దితి చేన్నా పూర్వత్వాత్ "
ఇక్కడ:- విధి, ధారణవత్ అనే రెండూ పదాలు అనువృత్తిగా వస్తాయి. ఉపదానాత్ :- బృహదారణ్యకంలో లోక మిచ్చంతః అని ఉన్నది. ప్రవ్రజంతి అనే పదం బ్రహ్మ లోకాన్ని ప్రశంసించడానికి మాత్రమే. ఇతి చేత్ :- అని అనడం, న :- సరి యైనది కాదు.
భావం:- విధి, ధారణ అనే రెండు పదాలు అనువృత్తిగా వస్తాయి. బృహదారణ్యకం(4, 4, 22)లో లోకమిచ్చంతః అనే పదం ఉన్నది. స్తుతి మాత్రం - ప్రవ్రజంతి అనే పదం బ్రహ్మలోకాన్ని ప్రశంసించడానికి మాత్రమే అని అనడం సరియైనది కాదు. ఎందుకంటే అపూర్వత్వాత్ విధి ధారణవత్ అంటే ధారణ లాగా ప్రవ్రజంతి కూడా విధి మాత్రమే అవుతుంది. బృహదారణ్యకం లో ప్రవ్రజంతి అనే పదం సన్యాసాన్ని విధించదు. బ్రహ్మలోకాన్ని మాత్రమే స్తుతిస్తుంది. 'లోకమిచ్చంతః' బ్రహ్మ లోకాన్ని కోరే వాళ్ళు అన్నింటిని త్యజిస్తారు అనడంలో ప్రధానంగా బ్రహ్మ లోకం గొప్పదనం అవగతమవుతుంది. లోకం గొప్పదనం, త్యాగానికి కారణం కనుక ఇక్కడ సన్యాసం గౌణం(అప్రధానం). అందువలన ప్రవ్రజంతి విధి వాచకం కావడం లేదు కదా! అంటే సన్యాసాన్ని విధిoచే మరో వాక్యం లేదు. అందుకే మీమాంస దర్శనంలో ధారాయతి అన్నారు. అలాగే సన్యాస విధి అపూర్వం కనుక ప్రవ్రజంతి విధాయకపదమే కాని స్తుతిమాత్ర పదం కాదు. ఉద్గీథం అన్నింటి కన్నా శ్రేష్ఠమైనది. అది పరమ రూపమైనందున సర్వోత్తమమైనది. అయితే వేదాలలో వాటి శ్రేష్ఠతను స్తుతించడం జరిగినది. ఈకీర్తనం ఉద్గీథాన్ని స్తుతిం చడానికా? లేక ఉపాసన కోసమా? అని సందేహం. ఉద్గీథాది శ్రుతులు కర్మాంగాలుగా గ్రహించబడ్డాయి. అందుచేత అది స్తుతి కోసమే అనడం సరియైనది కాదు. ఉద్గీథాదులు శ్రేష్ఠమైన గుణాలతో కూడుకొని ఉంటాయనే విషయం గాని, వాటి ఉపాసన కాని ఏ ప్రమాణం చేత ప్రతిపాదించబడలేదు. అవి అపూర్వములు. అందుచేతనే శ్రేష్ఠమైన గుణాలతో కూడిన ఉద్గీథోపాసనమే ఈ వాక్యాలలో చెప్పబడింది.
సూత్రం :- 447
" భావ శబ్దాచ్చ "
చ :- పైగా, భావ శబ్దాత్ :- భావం, క్రియకు ప్రవ్రజ్య అనేది సూచించడం వలన ప్రవ్రజంతి విధి వాచకమే.
భావం :- పైగా భావం, క్రియకు ప్రవ్రజ్య అనేది సూచించడం వలన ప్రవ్ర జంతి విధి వాచకమే.
వివరణ:- ప్రవ్రజంతి విధివాచకమే. కాని స్తుతివాచకం కాదు. బృహదారణ్యకం లో ( 4, 5, 1 ) లో యాజ్ఞ వల్క్యుడు సన్యాస ప్రకారణాన్ని ప్రారంభించి అంతలో బృహధారణ్యాకోపనిషత్తు(4, 5, 25) మైత్రేయి! ఇదే అమృతత్వప్రాప్తికి మార్గం అని చెప్పి సన్యసిస్తాడు. యాజ్ఞవల్క్యఋషి , తన ఇద్దరు భార్యలలో ఒకరైన మైత్రయిని పిలిచి, మైత్రేయీ ! నేను గృహస్థాశ్రమం వదలి సన్యాసం తీసుకోదలచాను. దానికై నీఅనుమతి కోరుచున్నాను. నీకు, కాత్యాయనికి నా సంపద విభజించి ఇస్తాను అన్నాడు. ఈధనంతో నాకు ముక్తిలభిస్తుందా? మోక్షం రాదుకదా! మోక్షాన్నిఇవ్వలేని ధనం వ్యర్థంకదా! నీవు దేనిని ముక్తికి సాధనంగా తెలుసుకున్నావో దానిని నాకుకూడా ప్రసాదించు అన్నదిమైత్రేయి. అప్పుడుఆమెకు బ్రహ్మవిద్యను బోధించాడు. ప్రవ్రజంతి ని ప్రవవ్రాజ అని సన్యాసవిధిని తెలిపారు. కాబట్టి ప్రవవ్రాజ పదం ప్రవ్రజంతి విధిని స్పష్టంగా తెలియజేస్తాయి. కనుక ఇది విధి వాచకం. ఉద్గీతముపాసీత, సామోపాసీత లాంటివిధులు ప్రత్యక్షంగాఉన్నాయి. ఈవాక్యాలన్నీ ఉపాసనావిధులనే బోధిస్తాయి.
పారిప్లవాధికరణం ( 3, 4, 23 )
సూత్రం :- 448
" పారిప్లవార్ధా ఇతి చేన్న విశేషిత్వాత్ "
పారి ప్లవార్ధః :- కధలు పారిప్లవం కోసమే. ఇతి చేత్ :- అని అనడం, న :- సరియైనది కాదు. విశేషిత్వాత్ :- అందులో విశేష ప్రతిపాదన ఉన్నది.
భావం :- కధలు పారిప్లవం కోసమే అనడం సరియైనది కాదు. అందులో విశేష ప్రత్తిపాదన ఉన్నది.
వివరణ:-పారిప్లవకర్మ అంటే అశ్వమేధయాగంలో రాత్రిపూట యజమానిని సకుటుంబంగా కూర్చోపెట్టి, అధ్వర్యుడు వేదాలలో ఉన్న కధలు చెప్పడం. బృహదారణ్యకంలో మైత్రేయి కథ ఈరకంగా చెప్పినదే కదా! లేక విద్యను స్తుతించడం కోసం చెప్పినదా? అని అడిగాడు నారాయణభట్టు. ఇక్కడ పారిప్లవం అనే మాట ఉన్నందువలన మైత్రేయికథ పారిప్లవం అనకూడదు. వేదాలలో కొన్నికధలు మాత్రమే అలా చెప్పబడ్డాయి. కాబట్టి ఉపనిషత్తులలో కథలన్నీ విద్యావిశేషాలు తప్ప కర్మశేషాలు కావు అని చెప్పాడు రత్నాకరుడు. అశ్వమేధం లాంటి చాలా కాలం చేసే యాగాలలో యజమానికి తగిన సమయంలో వినిపించే కధలను పారిప్లవం అంటారు.
ఆశ్వలాయనశ్రౌతసూత్రం(10, 6, 10):- దీనిలో పారిప్లవాన్ని చెప్పాలి అనే విధి ఉన్నది. ఇలాంటి కధలు మనోరంజకం కోసమే చెబుతారు. వీటికి స్వరూపప్రాముఖ్యం లేదు. మైత్రేయి-యాజ్ఞవల్క్య, ప్రతర్ధన-దైవోదాసి, భృగు - వరుణ, శ్వేత కేతు - వరుణ మొదలైన కథలన్నీ మనోరంజకంకోసం చెప్పినవే. ఈకథల వలన విషయం ఇంపుగా అర్ధం అవుతుంది. వీటిలోని ఘటనలు వాస్తవాలు కాదు. కనుక యజ్ఞవల్క్యుడు సన్యాసగ్రహణం విధిపూర్వకం అని సిద్ధించడం లేదు కదా! అంటే పారిప్లవంలో చెప్పిన కధలు కల్పనలు కావు. విశిష్టరూపాలు. శతపధబ్రాహ్మణంలో పారిప్లవకథలున్నాయి. అశ్వమేధ యాగం సంవత్సర కాలం పడుతుంది. 36 దశాహాల్లో పూర్తి అవుతుంది. ఈదశాహాల్లో రోజుకు ఒకటి చొప్పున ఒక విశిష్టమైన కథ చెప్పాలని నిర్దేశించారు. మొదటి రోజు కథ "మనూర్ వైవస్వతో రాజా " అని ఉంది. ఇలా పది రోజులకు పది విశిష్ట కధలు చెప్పాలి. ప్రతి దశహంలో మొదటి దశాహంలో చెప్పిన కథలను అదే క్రమంలో చెబుతారు. అందుకే వీటిని పారిప్లవాలు అంటారు. పారిప్లవం అంటే ప్రవాహం అని శతపధబ్రాహ్మణంలో నిర్వచించారు. ఇవి విశేషరూపంలో ఉండటం వలన వీటి ప్రయోజనం మనోరంజకం కాదు. ఇవి బ్రహ్మవిద్య కోసం ప్రతిపాదించినవి. ఈ కథలవలన కఠినమైన విషయాలను సరళంగా తెలుసుకుంటాడు. అందుకే మహర్షుల జీవితంలోని సంఘటనలను గ్రహించి, వాటి ఆధారంగా తత్త్వబోధ చేశారు. ఇవి ప్రామాణిక మైనవి. 'యాజ్ఞ వల్క్యుడు ప్రవ్రజించాడు' అనేది సన్యాస విధానం గురించి తెలుపుతుంది. సన్యాసాశ్రమం లో జ్ఞాన ప్రాప్తి ఉండటం వలన జ్ఞానం కర్మకు అంగం కాదు.
సూత్రం :- 449
" తధా చైక వాక్యతోపబంధాత్ "
చ :- ఇలాగ, తధా :- జ్ఞానం కర్మాంగం అని సిద్ధించక పోవడం వలన, ఏక వాక్యత ఉపబంధాత్ :- మోక్ష ప్రాప్తి సాధించే విషయాన్ని తెలిపే వాక్యాలలో ఏక వాక్యత ఉండటం వలన మోక్షానికి జ్ఞానం స్వతంత్ర కారణం.
భావం :- జ్ఞానం కర్మాంగం అని సిద్ధించక పోవడం వలన మోక్ష ప్రాప్తి సాధించే విషయాన్ని తెలిపే వాక్యాలలో ఏక వాక్యత ఉండటం వలన మోక్షానికి జ్ఞానం ప్రధాన స్వతంత్ర కారణం అని సిద్ధిస్తోంది.
వివరణ:- ఈ పారిప్లవ కధలు విద్య కోసం చెప్పినవి. ఈ కథలన్నీ ఆయా చోట్ల ఉన్న విద్యలలో ఏకవాక్యతను కలిగి ఉన్నాయి. కథల వలన ఉపాసనకు ఫలం ఏమి లేదు. శిష్యులకు విద్య యందు అభిలాష కలిగించడానికి, ఆ విద్యను సులభంగా బోధించడానికి ఇటువంటి కధలు చెప్పబడ్డాయి. అంతే కాని ఈకధలు క్రతు కర్మంగాలు కావు.
ఋగ్వేదం(1-164- 23) :- బ్రహ్మాన్ని ఎరిగినవాళ్ళు అమృతత్వాన్ని పొందుతారు. బ్రహ్మజ్ఞానం పొందిన వాడు ఎంతో గొప్ప స్థితిని పొందు తాడని, బ్రహ్మమును తెలుసుకోవడం అంటే జనన మరణం చక్రం నుండి విముక్తి పొందడం.
తైత్త రీయోపనిషత్తు(2, 1) :- బ్రహ్మవేత్త పరమ శ్రేయస్సును పొందుతాడు. బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలంటే మనస్సు బ్రహ్మలో లీనంకావాలి. తపస్సే బ్రహ్మం. తపస్సు అంటే మనస్సు, ఇంద్రియాలను ఆత్మమీదనే కేంద్రకరించడం, మంచి మాటలతో మంగళకరమైన పనులు చేస్తున్నప్పుడు ఆమాటలు, పనుల రూపంలో భగవంతుడు అభివ్యక్తమౌతాడు. ఇలాంటి శ్రుతి ఉపనిషత్వాక్యల్లో ఏకవాక్యత ఉన్నది. కనుక పరమ పురుషార్థమైన మోక్షానికి జ్ఞానం స్వతంత్ర కారణం.
అగ్నీంధనాద్యధికరణం ( 3, 4, 25 )
సూత్రం :- 450
" అత ఏవ చాగ్నీం ధనాద్యనపేక్షా "
అత ఏవ చ :- అందువల్లే, అగ్ని ఇంధనాది అనపేక్ష :- అగ్ని హోత్ర, దర్శ పూర్ణ మసాది కర్మలు అపేక్షితాలు కావు.
భావం :- మోక్షానికి జ్ఞానం ప్రధాన కారణం అందువల్లే అగ్ని హోత్ర, దర్శ పూర్ణ మాసాది కర్మలు అపేక్షితాలు కావు.
వివరణ:-గురుదేవా! బ్రహ్మవిద్య పురుషార్ధాన్ని కలిగించడంలో కర్మను ఆపేక్షిస్తుందా? అని అడిగాడు కృష్ణ శర్మ. సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. బ్రాహ్మణులు వేదాధ్యయనం చేత, యజ్ఞం చేత, దానం చేత, పర బ్రహ్మను తెలుసుకుంటారని కొన్ని చోట్ల చెప్పబడింది. అందువలనే జ్ఞానానికి కర్మ సాధనమని, మోక్షానికి కర్మ సహాయం కూడా అవసరమని కొందరు వాదిస్తారు. మోక్షం అనేది చతుర్విధ పురుషార్ధలలో నాలుగవది. ఆమోక్షం సాధించడానికి అగ్ని, ఇంధనాలు, జ్ఞాన సముపా ర్జనకు అవసరం లేదు. విద్య స్వతంత్రంగానే పురుషార్ధహేతువు. కాబట్టి దానికి కట్టెలు, అగ్నిహోత్రం అవసరంలేదు. బ్రహ్మ విద్య మోక్షాన్ని కలిగించడంలో అగ్నిహోత్రాది కర్మల్ని ఆపేక్షించదు.కనుక బ్రహ్మజ్ఞానం మోక్షప్రాప్తికి సాధనమని తెలుస్తోంది.
సర్వాపేక్షాధికరణం ( 3, 4, 26 )
సూత్రం :- 451
సర్వాపేక్షా చ యజ్ఞాది శ్రుతేరశ్వవత్ "
అశ్వవత్ :- గుర్రం లాగే, యజ్ఞాది శ్రుతేః :- జ్ఞాన ప్రత్తిపాదనలు అని శాస్త్రాలు అనడం వలన, సర్వాపేక్షా చ :- జ్ఞానోత్పత్తికి అన్ని కర్మలన అపేక్ష ఉంటుంది.
భావం :- గుర్రం లాగే యజ్ఞాదులు, జ్ఞాన ప్రతిపాదనలు అని శాస్త్రాలు అనడం వలన, జ్ఞానోత్పత్తికి అన్ని కర్మలను అపేక్ష ఉంటుంది.
వివరణ:-జ్ఞానోత్పత్తికి విహితకర్మలు ఉపయోగిస్తాయా అంటే ఉపయోగిస్తాయనే చెప్పాలి. విద్యకు అన్ని ఆశ్రమాలలోనూ కర్మలు అవసరమే. యజ్ఞయాగాదులు జ్ఞానోత్పత్తికి హేతువులు. గుర్రం పొలందున్నడానికి ఉపయోగపడకపోయినా రధం లాగడానికి పనికివస్తుంది. అలాగే కర్మలు మోక్షాన్ని ఇవ్వకపోయినా జ్ఞానోత్పత్తికి సాధనమౌతాయి. కర్మలను విధించే శాస్త్రాలు నిరర్ధకం కావు. విద్యను పొందడంలో ప్రతిబంధకాలు ఉన్నప్పుడు ఇంద్రియ జ్ఞానం కలగదు. ఆటంకాలన్నీ తొలగిపోయిన తరువాత ఇంద్రియాల వలన జ్ఞానం కలుగుతుంది. రాగ ద్వేషాలు, విక్షేపాలు ఉన్నంత వరకు, అంతః కరణంలో ఉండే మాలిన్యాలు ప్రతిబంధకాలు అవుతూనే ఉంటాయి. ఈ అడ్డంకులు పోవడానికి నిష్కామ కర్మానుష్టానం ఉపకరిస్తుంది. కాబట్టి నిష్కామ వైదిక కర్మలు అంతః కారణాన్ని శుద్ధి చేసి జ్ఞానోత్పత్తికి సహాయ పడతాయి.
బృహదారాణ్యకోపనిషత్తు(4,4,22):- బ్రహ్మజిజ్ఞాసువులు పరమాత్మను వేదాధ్యయనం, యజ్ఞం, దానం తపస్సులతో తెలుసుకోవాలనుకుంటారు. బ్రహ్మజిజ్ఞాస యజ్ఞాదిఅనుష్టానంతో కలుగుతుంది. అంటే జ్ఞానోత్పత్తికి కర్మానుష్ఠానం అవసర మని శాస్త్రం చెబుతోంది. మోక్షప్రాప్తికి జ్ఞానం స్వతంత్రకారణం కాగా, జ్ఞానోత్పత్తికి కర్మానుష్ఠానం కావాలి. సర్వే వేదాః బ్రవీమి సమస్త వేదాలు ఏ అత్యుత్తమస్థానాన్ని బోధిస్తున్నాయో, సమస్తమైన తపస్సులు దేనిని చూపుచున్నాయో, దేనిని కోరుచూ బ్రహ్మచర్యం ఆచారిస్తున్నారో, ఆపదాన్ని గూర్చి నీకు సoగ్రహంగా చెబుతున్నాను". ఇత్యాది శ్రుతి ఆశ్రమకర్మలు విద్యాసాధనములనే విషయాన్నీ తెలియజేస్తున్నాయి. కర్మల చేత పాపకర్మల వలన కలిగే పాపాలు పక్వములౌతాయి. జ్ఞానం అత్యుత్తమ గతి. కర్మఫలాలు పక్వమైన తరువాత జ్ఞానం ప్రవహిస్తుంది. అశ్వవత్ అనేది యోగ్యత విషయంలో నిదర్శనం. యోగ్యతను అనుసరించి అశ్వం నాగలి లాగడానికి ఏ విధంగాను కట్టబడదు. రధం లాగడానికి మాత్రమే ఉపయోగిస్తారు. అట్లే ఆశ్రమధర్మాలు విద్య చేత ఫలసిద్ధి కొరకు ఆపేక్షించజాలవు. జ్ఞానోత్పత్తికి ఆపేక్షించ బడతాయి. గుర్రానికి తన వలన సిద్ధించే వేరే ఏ ప్రయోజనాన్ని కోరుకున్నా, తన ఉత్పత్తికి,దాని తల్లిదండ్రుల సంయోగం కావాలి కదా! శత్రువులను చంపడానికి గుర్రం అవసరం లేదు. కాని శత్రువును సమీపించడానికి గుర్రం కావాలి. అలాగే మోక్షం లభించడానికి జ్ఞానానికి కర్మలు అవసరం లేకపోయినా, జ్ఞానోత్పత్తికి ఆటంకములైన రాగ ద్వేషాదులను తొలగించడానికి కర్మనుష్టానం కావాలి.
సూత్రం :- 452
“శమదమాద్యుపేతః స్యాత్ తథాపి తు తద్విధేః "
తథా అపితా :- సర్వ కర్మ అపేక్ష ఉన్నప్పటికీ, శమదమాది ఉపేతః :- ముమక్షువుకి శమదమాది సాధనా సంపత్తి కావాలి. తత్ విధేః :- అని విధించారు. తత్ అంగతయా :- జ్ఞాన సాధన రూపంలో, తేషాం :- శమదమాదుల్ని, అవస్య అనుష్టే యత్వాత్ :- తప్పక అనుష్టించాలి.
భావం :- సర్వ కర్మ అపేక్ష ఉన్నప్పటికీ, ముముక్షువుకి శమదమాది సాధనా సంపత్తి కావాలి అని విధించారు. జ్ఞాన సాధన రూపంలో శమదమాదులను తప్పక అనుష్ఠించాలి.
వివరణ:-మోక్షగామికి అంతఃకరణశుద్ధి, బాహ్యశుద్ధి కూడా అవసరం. అగ్నిహోత్రాది కర్మానుష్ఠానం వలన అంతఃకరణాన్ని శుద్ధి చేయవచ్చును. అది జ్ఞానోత్పత్తికి సంపూర్ణ సాధనాలు కావు. అందుకే విద్య స్వతంత్రం మైనదే కాని మోక్షగామి షట్ సంపత్తి అయిన అంతరంగ సాధనాలు శమం, దమం, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం అలవరచుకోవాలి.
బృహదారణ్యకోపనిషత్తు(4,4,23):-ఈ షట్సంపత్తి ఉన్నవాడు తనలో పరమాత్మను తెలుసుకుంటాడు. ఈ శమదమాదులు జ్ఞానానికి సహాయపడతాయి. ఆధ్యాత్మశాస్త్రాల్లో బ్రహ్మ జ్ఞానానికి సాధనా చతుష్టయం అవసరం అని చెప్పారు. ఆత్మనాత్మ వివేకం, వైరాగ్యం, షట్సంపత్తి, ముముక్షుత్వం అనే నాల్గింటిని సాధనాచతుష్టయం అంటారు. వీటితో బాటు నిరంతరం ప్రణవధ్యానం చేయుటవలన బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. ఆనందానుభూతి కలిగి, బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది. అదే జీవన్ముక్తవస్థ స్థితి అంటారు. యజ్ఞాదికర్మలతో అంతఃకరణ శుద్ధి, శమదమాదులతో ప్రణవధ్యానం చేసినప్పుడు బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది.
సర్వాన్నాను మత్యధికరణం ( 3, 4, 28 )
సూత్రం :- 453
" సర్వాన్నాను మతిశ్చ ప్రాణాత్యమే తద్దర్శనాత్ "
చ:-అంతేకాక, సర్వాన్నానుమతిః:-ఛాందోగ్య, బృహదారణ్యకాలలో అన్నిటిని తినవచ్చు అని చెప్పినవాక్యాన్ని, ప్రాణాత్య యే:- ప్రాణాలమీదకి వచ్చినప్పుడు మాత్రమే అనిగ్రహించాలి. తత్ దర్శనాత్:- అని అట్టిపరిస్థితులలోనే ఊటంకించారు.
భావం:- ఛాందోగ్యం, బృహదారణ్యకాలలో అన్నింటిని తినవచ్చును అని చెప్పిన వాక్యాన్ని ప్రాణాల మీదకు వచ్చినప్పుడు మాత్రమే అని గ్రహించాలని అట్టి పరిస్థితులలోనే ఉటంకించారు.
వివరణ:- ఉపాసకుడు అన్నిఅవస్థలలో అన్ని తినవచ్చునా? జీవించడానికి అన్నంకానిది ఏదిఉండదు. అన్ని తినవచ్చును అని ఛాందోగ్యంలో చెప్పబడింది.
మనుస్మృతి(5-28):- జీవించడానికి అన్ని తినవలసినదే. ఉపాసకుడు ప్రాణసంకటం వచ్చినప్పుడు మాత్రమే ఏమైనా తినవచ్చును. ఆపద్ధార్మంగా అన్ని తినదగినవే అని వ్యాసుడు తెలియజేశాడు.
ఛాందోగ్యోపనిషత్తు(1,10,1):- దీనిలో ఒకకధనం ఉన్నది. ఒకప్పుడు కురుదేశంలో మిడతల దండు పంటలను తినేసింది. చక్రుడి మనవడు ఉషస్తి అనే ఋషి తన భార్యతో తినడానికి ఏమిలేని పరిస్థితులలో, ఆకలి దప్పులతో అలమటిస్తూ, ఇభ్య అనే గ్రామం చేరుకున్నాడు. ఆఊళ్ళో మావటివాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఉషస్తి అక్కడ ఒక మావటివాడు అలసందులు (బొబ్బర్లు) తింటుండగా చూసి, ఆకలితట్టుకోలేక, తనకికూడా కొంచెం పెట్టమని అడిగాడు. మావటివాడు తన దగ్గర ఎంగిలి చేసినవి తప్ప ఏమిలేవని చెప్పాడు. ఉషస్తి అవే పెట్టమన్నాడు. మావటివాడు మిగిలినవి ఇచ్చేశాడు. అతనువాటిని తీసుకొని కొన్ని భార్యకు పెట్టి, తాను కొన్ని తిని, మిగిలినవి మరునాటికి దాచుకున్నాడు. మావటివాడు త్రాగడానికి నీళ్లు కావాలా? అనిఅడిగాడు. ఉషస్తి మావటివాడి ఇంటి జలాన్ని గ్రహించలేను అన్నాడు. ఎందువలన? అని అతను అశ్చర్య పోయి, ఎంగిలి అలసందులు తిన్నారుకదా! నీళ్లు ఎందుకు త్రాగడానికి నిరాకరిస్తున్నారు? అని అడిగాడు. ప్రాణం నిలబడిన తరువాత అభక్ష్యభక్షణం చేయకూడదు అన్నాడు.
ఛాందోగ్యోపనిషత్తు(1,10,4):- ఉషస్తి ఇలా చెబుతున్నాడు. వీటిని తినకపోతే ప్రాణం పోయేది. నీటి విషయంలో అలాకాదు. దీనినిబట్టి ప్రాణరక్షణకోసం దొరికిన ఆహారాన్ని ఉపయోగించుకోవచ్చును. నీరు వద్దంటే అది నిషిద్దాహారం అని తెలుస్తోంది. అందువలన ఉపాసకుడు శుద్ధసాత్వికాహారాన్ని మాత్రమే స్వీకరించాలి. భక్ష్యాభక్ష్య విచక్షణ విడిచి అన్ని తినమని ఏశాస్త్రాలు చెప్పవు. ఈ విషయంలో ఉపాసకుడు ఎంతో సావధానంగా వర్తించాలి. విషయాల మీద ఆకర్షణ పెరిగితే ఉపాసకుడు పదభ్రష్ఠుడౌతాడు. కుక్కలు, పిల్లులు, పక్షులు మొదలైన జంతువుల ఆహరమే నీకు ఆహారం కాబట్టి ప్రాణాపాయ స్థితిలో ఏరకమైన ఆహారాన్నైనా స్వీకరించవచ్చని బృహదారణ్యకంలో కూడా చెప్పబడింది.
సూత్రం :- 454
" అబాధాచ్చ "
చ :- అంతే కాక, అబాధాత్ :- శ్రుతి విరోధం లేనందుకు వలన, ఆపత్ సమయంలో తినవచ్చును.
భావం:- అంతే కాక శ్రుతి విరోధం లేనందుకు వలన ఆపత్సమయంలో తినవచ్చును.
వివరణ:-ప్రాణాపాయస్థితిలో దేనినైనా తినవచ్చునని ఛాందోగ్య, బృహదారణ్యకాలలో చెప్పబడింది. అంతేకాక శ్రుతిలో కూడా విరోధం లేనందువలన ప్రాణాలుపోయే స్థితిలో ఏఆహరం దొరికినా తినవచ్చును. కాగా జ్ఞానార్ధికి ఆహారశుద్ధి ఉండాలి.
ఛాందోగ్యోపనిషత్తు(7,26,2):- ఆహారశుద్ధి వలన అంతఃకరణ శుద్ధమౌతుంది. తద్వారా జ్ఞానం సిద్ధిస్తుంది. ఈవాక్యం ప్రాణ సంకట సమయంలో అన్ని తినవచ్చుననే కధనాన్ని సార్ధకం చేస్తుంది. అన్నిదశలలో అన్నింటిని తింటే ఆహారశుద్ధి ఉండదు. భక్ష్యాభక్ష్యనిర్ణయశాస్త్రం ఈ విధంగా చెప్పింది. కాబట్టి ఆచరణీయమే. వేదంలో ఆహరం నిర్మలంగా పరిశుద్ధంగా ఉంటేనే మనస్సుకూడా పరిశుద్ధంగా ఉంటుందని చెప్పబడింది. అందుకే ఇదితినవచ్చును, ఇదితినకూడదు అని నిర్ణయించబడింది. ఇలాచెప్పడం శాస్త్రవిరుద్దం కాదు. ఉపాసకుడు కేవలం ప్రాణాలు రక్షించుకోవడం కోసమే ఆ సమయంలో అన్ని తినవచ్చును అని చెప్పడం జరిగింది.
సూత్రం :- 455
" అపి చ స్మర్యతే "
చ :- రాగా, స్మర్యతే అపి :- స్మృతి కూడా ప్రాణాపాయ స్థితిలో నిషిద్ద భోజనానికి అనుమతి ఇస్తున్నది.
భావం :- స్మృతి కూడా ప్రాణాపాయ స్థితిలో నిషిద్ద భోజనానికి అనుమతి ఇస్తున్నది.
వివరణ:-స్మృతులలోకూడా ఈవిషయం చెప్పబడింది. ప్రాణంపోయే స్థితిలో ఇది తినవచ్చునా? తినకూడదా? అని విచారణ చెయ్యవలసిన అవసరం లేదు.
మనుస్మృతి(10, 104) :- ప్రాణ సంకటం ఏర్పడినప్పుడు ఏది తిన్నా పాపం అంటుకోదు. ఆకాశానికి బురద అంటదు కదా! అభక్ష్య ఆహారగ్రహణం ఆపద్ధర్మమేకాని, ఇతర సమయాల్లో తగదని భావం. ఆపత్కాలంలో విద్వాంసునికి, అవిద్వాంసునికి కూడా భేదం ఏమి లేకుండా సర్వాన్న భక్షణం ప్రాణ సంకటం పొందినప్పుడు ఎక్కడ లభించినదైనా, అన్నం తిన్నవానికి తామరకుమీద నీరు అంటనట్లుగా పాపం అంటుకోదు అని స్మృతిలో చెప్పబడింది. అట్లే 'మద్యంనిత్యబ్రాహ్మణః' బ్రాహ్మణుడు పూర్తిగా మధ్యాన్నినిషేదించాలి. సురత్రాగిన బ్రాహ్మణుని నోటిలో సలసల మరుగుతున్న సురను అతను మరణించే వరకు నింపాలి. సుర త్రాగినవాళ్ళు వందజన్మలు పురుగులుగాపుడతారు. అభక్ష్యభక్షణం వలనకూడా పురుగు జన్మ వస్తుందని, అభక్ష్యాన్ని తినకూడదని స్మృతిలో చెప్పబడింది.
సూత్రం :- 456
" శబ్దశ్చాతో కామకారే "
అతః :- అందువలన, శబ్దః చ :- వేదం కూడా, అకామకారే :- ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకూడదు.
భావం :- అందువలన వేదం కూడా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించకూడదు అంటున్నది.
వివరణ:-ఆహారవిషయంలో స్వేచ్ఛ పనికిరాదు. శాస్త్రంలో అంగీకరించిన వాటినే తిని, నిషేధించిన వాటిని వదలివేయాలి. ఋగ్వేదం(7, 5, 33, 6):- క్రాంతదర్శులైన ఋషులు సప్తమర్యాదలను స్థాపించారు. దొంగతనం, పరస్త్రీగమనం, బ్రహ్మహత్య, భ్రూణహత్య, సురాపానం, పాపాచరణం, పాపాల్నిదాచడానికి అసత్యంచెప్పడం, ఇవి 7మర్యాదలు. వీటిలో ఒకదానిని చేసినా పాపిఅవుతాడు. అన్నపానాదులలో ఇష్టంవచ్చినట్లు ప్రవర్తించేవాడు, సురాపానం లాంటి వాటిల్లో తగులుకుంటారు. ఈమర్యాదలు ఉల్లంఘించి పాపిఅవుతాడు. ఈఆచారాన్ని ఛాందోగ్యంలోను, మనుస్మృతిలోనూ వివరించారు. దూరాచారు లతో సాంగత్యంకూడా పాపమే. అందువల్ల ఉపాసకుడు ఆహారవిహారాల్లో కామకారి కాకూడదు. మనుస్మృతి ( 11, 95) :- దివ్యాహారంతినే బ్రాహ్మణుడు నిషిద్ధమైన, యక్ష, రాక్షస, పిశాచాలు తినే అన్నం తినకూడదు. మధ్యమాంస, సురాసేవనం చేయకూడదు అని చెప్పడంవలన బ్రహ్మజిజ్ఞాసువు ఆహారవిషయంలో కామకారి కాకూడదు అని తెలుస్తోంది. వేదాధ్యయనంచేస్తూ, విషయాలుతెలుసుకుంటూ, మోక్షం కోరేవాడు బ్రాహ్మణుడు, బ్రహ్మ జ్ఞాని అయినవాడు ప్రాణం పోయే పరిస్థితులలోకూడా మద్యం సేవించరాదు. భోజనంసమయంలో స్వేచ్ఛ లేదని, నిషిద్దాహారాన్ని వదలివేయాలని శ్రుతి వాక్యం ఉన్నది.
ఆశ్రమ కర్మాధికరణం ( 3, 4, 32 )
సూత్రం :- 457
" విహితత్వా చ్చాశ్రమ కర్మాపి "
చ :- అంతే కాక, విహితత్వాత్ :- శాస్త్ర విహితం కావడం వలన, ఆశ్రమ కర్మల అపి :- ఆశ్రమ కర్మలు కూడా పాటించాలి.
భావం :- ఉపాసకుడు భోజన సమయంలో కామకారిగా ఉండకూడదనే నియమం ఉన్నది. అంతే కాక శాస్త్ర విహితం కావడం వలన ఆశ్రమ కర్మలు పాటించాలి.
వివరణ:-బ్రహ్మజ్ఞానం కోసం ప్రయత్నించే మానవుడు శుద్ధహారం ఎలా గ్రహించాలో అలాగే ఆశ్రమకర్మలు అనుష్టిoచాలి. మోక్షాపేక్ష లేనివారు, విద్యాసిద్ధి అవసరం లేనివాడు నిత్యకర్మలు చెయ్యాలా? అవసరం లేదా? ఒక వేళ కర్మ చేస్తే జ్ఞానం కోసం ఒకసారి, నిత్యసిద్ధి కోసం ఒకసారి మొత్తం రెండుసార్లు చెయ్యాలా అని సందేహం. ముముక్షవు కానివాడు కూడా ఆశ్రమవిహిత కర్మలు చెయ్యాలని వేదాలు చెబుతున్నాయి. నిత్యసిద్ధి కోసం ఒకసారి, జ్ఞానంకోసం ఒకసారి, ఇలారెండు సార్లు చెయ్యనవసరం లేదు. ఒక్కసారి చేస్తే చాలు.
ప్రశ్నపనిషత్తు(1,10):-తపస్సు, బ్రహ్మచర్యం, శ్రద్ధ, ఉపాసన వీటిద్వారా ఆత్మను తెలుసుకొని ఆదిత్యమార్గాన్ని జయిస్తారు.
మనుస్మృతి(4,14):-ఈశాస్త్రవచనాలవలన ఉపాసకుడుకూడా ఆశ్రమధర్మాలను అనుష్ఠించవలసినదే. కర్మలకోసం ఒకసారి, జ్ఞానంకోసం ఒకసారి కర్మలను ఆచరించాలని పూర్వపక్షవాదన. సర్వాపేక్ష ఇత్యాది శ్రుతివలన ఆశ్రమధర్మాలు కూడా విద్యాసాధనములని నిశ్చయింపబడింది. 'యావజ్జీవన మగ్నిహోత్రం జుహాతి' ఈశ్రుతిని అనుసరించి జీవించి ఉన్నంత కాలం నిత్యకర్మయైన అగ్నిహోత్రం నిర్వహించాలి. ముముక్షవు కానివాడికి కూడా ఆశ్రమంలో ఉన్నందున నిత్యకర్మలు అనుష్ఠించాలి.ఏకర్మఫలం ఆశించకూడా చిత్తశుద్ధితో కర్మలుచేస్తూ ఉంటే జ్ఞానంవస్తుంది. ఫలితం ఆశించకుండా చేయాల్సిన కర్మలు చేస్తూఉంటే రావలసినకాలంలో ఫలితం అదేవస్తుంది. ఈసత్కర్మలు అన్నీ పాపక్షయం చేసి, జ్ఞానానికి సహకరిం చేలా చేస్తాయి. బ్రహ్మజ్ఞానంకోసం ప్రయత్నించేవాడు శుద్ధాహారం ఎలాగ్రహించాలో, అలాగే ఆశ్రమకర్మలు అనుష్టిం చాలి.
ఆశ్రమ కర్మాధికరణం ( 3, 4, 33 )
సూత్రం :- 458
" సహకారి త్వేన చ "
చ :- పైగా, సహకారి త్వే న :- ఆశ్రమ ధర్మాలు జ్ఞానోత్పత్తికి సహకరిస్తాయి.
భావం :- ఆశ్రమ ధర్మాలు జ్ఞానోత్పత్తికి సహకరిస్తాయి. కనుక ఉపాసకుడు ఆశ్రమ కర్మలను ఆచరించవలసినదే.
వివరణ:-జ్ఞానం జనించడానికి సంహరించే కర్మలు, ఆశ్రమకర్మలు రెండూ వేరు కాదు. విద్యోత్పత్తిలో యాగాది కర్మలు సహకారిరూపంలో అనుష్ఠించదగినవి. ఇవి రెండూ పరస్పర సహకారం కలవి కాబట్టి రెండు సార్లు చెయ్యవలసిన అవసరం లేదు. ఈ నిత్యకర్మలే జ్ఞానం కోసం తోడ్పడతాయి. ఈ రెండింటి ప్రయోజనాలు వేరు కాదు. యావజ్జీవితం అగ్నిహోత్రం చెయ్యాలి కనుక ఈనిత్యకర్మలే జ్ఞానసిద్ధిని కలిగిస్తాయి. యజ్ఞం చేసేటప్పుడు చండ్రకర్ర యూపస్థంభంగాను ఉపయో గిస్తుంది. లౌకికంగాను ఉపయోగిస్తుంది. అదేవిధంగా నిత్యకర్మలు రెండువిధాలుగాను ఉపయోగిస్తాయి. అశ్వమేధ యాగంచేసేటప్పుడు యాగశాలలో 21యూపస్థంబాలను పాతేవారు. అవి మారేడు, మోదుగ, చండ్ర, దేవదారు, శ్లేష్మాతకకర్రలతో చేసేవారు. దానిలో ఒక స్థంబానికి యజ్ఞాశ్వాన్ని కట్టేవారు.
సూత్రం :- 459
" సర్వధా పి త ఏవోభయలింగాత్ "
అభయ లింగాత్ :- శ్రుతి, స్మృతి ప్రమాణాల వలన, సర్వధా అపి తయేవ :- అన్ని విధాలా అవి ఒకటే.
భావం :- శ్రుతి స్మృతి ప్రమాణాల వలన అన్ని విధాలా ఆ కర్మలు ఒక్కటే.
వివరణ:-ఉపాసనలో ఏకర్మలు అనుష్ఠించాలని చెప్పారో అవేకర్మలు ఆశ్రమకర్మల రూపంలో విధించారు. అవే జ్ఞానం సిద్ధించడానికి సహకరిస్తాయి. విద్యాసహకారికర్మలు, ఆశ్రమకర్మలు వేరేకావు. యాగాది కర్మలు ఆశ్రమత్వ పక్షంలోనూ, విద్యాసహకారిత్వపక్షంలో కూడా అనుష్ఠింపదగినవే. ఎవరూ ఫలితం ఆశించకుండా నిష్కామకర్మలు చేస్తారో అతనికి మోక్షం లభిస్తుంది. వైదికకర్మలను చేత సంస్కరంపబడిన వారికే విద్యోత్పత్తి కలుగుతుంది. "యస్యైతేష్టా చత్వారిం శత్ "ఎవరికైతే ఈ నలభైఎనిమిది సంస్కారాలుంటాయో, వాటిలో యజ్ఞ యాగాదులు కూడా ఉన్నాయి. గౌతమీ ధర్మశాస్త్రంలో యజ్ఞాలు కూడా సంస్కారాలని అవి చిత్త శుద్ధి కలిగిస్తాయని చెప్పబడింది.
ఋగ్వేదం ( 10, 90, 16 ) :- విద్వాంసులు యజ్ఞంతో పరమాత్మను ఉపాసిస్తారు. ఆ ధర్మాలు శ్రేష్ఠమైనవి.
మనుస్మృతి(2, 28):- వేదధ్యయనం, వ్రత నియమాలు, హోమాలు, వేదప్రాతిత కర్మలు, జ్ఞానం, ఉపాసన, దర్శపూర్ణ మాసాది ఇష్టులు, చక్కటి సంతానం, పంచమహాయజ్ఞలు, అగ్నిష్ఠోమాది కర్మలు అన్ని దేహంలో ఉండే ఆత్మను బ్రహ్మ ప్రాప్తికి యోగ్యుడుగా చేస్తాయి. విద్యకు సహకరించే కర్మలే ఆశ్రమకర్మలు కూడా. అందుకే బ్రహ్మోపాసనతో పాటు ఆశ్రమ కర్మల్ని కూడా ఆచరించాలి.
సూత్రం :- 460
" అనభి భవం చ దర్శయతి "
దర్శయతి చ :- ఉపనిషత్తు కూడా, అనభి భవం :- ఆదరాన్ని ఈ విషయంలో చూపిస్తుంది.
భావం :- ఉపనిషత్తు కూడా ఈ విషయంలో ఆదరాన్ని చూపిస్తుంది.
వివరణ:-అభిభవం అంటే తిరస్కారం, అనభిభవం అంటే సత్కారం, ఆదర్శం. ఉపనిషత్ వాక్యాలు కూడా ఆశ్రమకర్మ విషయలో ఆదరాన్నిప్రకటిస్తూ, ఆశ్రమకర్మలను అనుష్ఠించవలసినదే అని చెబుతున్నది.'ఏష... అను విందతే ' ఏ ఆత్మ బ్రహ్మచర్యం వలన పొందుతాడో అది ఏనాటికి వానికి దూరంకాదు. బ్రహ్మచర్యాది సాధనాసంపన్నుడైన వాడు పొందిన ఆత్మజ్ఞానం, రాగక్లేశాలవలన నాశనం పొందదు. అందువలన యజ్ఞాదులు ఆశ్రమకర్మలుగా ఉంటాయి. అవి ఆత్మజ్ఞానా నికి సహకారులుగా ఉంటాయి. ఆశ్రమాలకు సంబంధించిన కర్మలుకూడా సాధకునిలోని అవిద్య, రాగము, ద్వేషము మొదలైన క్లేశాలను పోగొట్టి జ్ఞానానికి సహాయకారులౌతాయి. ఆశ్రమధర్మాలు నిర్వహించేవారి జ్ఞానసాధనకు సహకరించేవి నాలుగువిషయాలు. యజ్ఞం, దానం, తపస్సు, స్వాధ్యాయం. ఇవి రోజుచెయ్యాలా? అని సందేహం రావచ్చును. అవకాశం వచ్చినప్పుడు యజ్ఞయాగాదులు నిర్వహించడం, దానం చెయ్యడం, నిరంతరం భగవంతుని స్మరిస్తూ, తపించడం, అదే తపస్సు, గురువు ద్వారా విన్న భగవంతుని లీలలను స్వాధ్యాయం చెయ్యగలిగితే బ్రహ్మ విద్యా ప్రాప్తి కలుగుతుంది. దీని వలన బుద్ధిసూక్ష్మం చెంది, చిత్తశుద్ధి కలిగి ఆత్మజ్ఞానం లభిస్తుంది. ఒకవేళ సత్గ్రంధాలను శ్రవణం చేసి, ఆగిపోతే రాగక్లేశాలు నాశనం కావు. బ్రహ్మజ్ఞానం కలుగదు. కాబట్టి మోక్షాపేక్ష లేనివారు కూడా ఆశ్రమకర్మలు అనుష్ఠించవలసినదే.
విధురాధికరణం ( 3, 4, 36 )
సూత్రం :- 461
" అంతరాచాపి తు తద్దృష్టేః "
అంతరఅపిచ:-ఆశ్రమకర్మానుష్టానం లేకుండా జ్ఞానం ఉత్పన్నం అవుతుందని, తత్ దృష్టేః :- ఎన్నో చోట్ల చూడవచ్చును.
భావం :- ఆశ్రమ కర్మానుస్థానం లేకుండా జ్ఞానం ఉత్పన్నం అవుతుందని ఎన్నో చోట్ల చూడవచ్చును.
వివరణ:- యజ్ఞాది ఆశ్రమకర్మల్ని జ్ఞానోత్పత్తికి తప్పక అనుష్ఠించాలా? వద్దా? శాస్త్రాల్లోచెప్పిన కర్మలను అనుష్ఠించక పోయిన, ఆశ్రమరహితులకుకూడా బ్రహ్మవిద్యాధికారం ఉన్నదా? అన్న సంశయం కలగవచ్చును. విధురులు(మృత పత్నీకులు), ద్రవ్యాదిసంపదలు లేనివాళ్లకు, ఏదోఒక ఆశ్రమం స్వీకరించకుండా మధ్యలో ఉన్నవాళ్లకు బ్రహ్మవిద్యాధికారం ఉన్నదా? లేదా అని సంశయం కలుగగా ఉన్నది అనే సమాధానంచెప్పారు. వేదాలలో ఆశ్రమరహితులైన వారికికూడా బ్రహ్మవిద్యాధికారం ఉన్నదని చెప్పబడింది. ఆశ్రమరహితులు అంటే భార్య మరణించినవారు, ధనంలేకపోవడం వలన గృహస్థాశ్రమ ధర్మాలు నిర్వహించలేని వారు కూడా బ్రహ్మ విద్యను పొందవచ్చును. వీరికి ఆశ్రమ కర్మలేవి ఉండటానికి అవకాశం లేదు. రైక్వుడు మహాజ్ఞాని, అతను ఎలాంటి ఆశ్రమకర్మలు చేయలేదు. వాచక్నవీ, గార్గిలాంటి జ్ఞానులు అంతే. రైక్వుడు జానశ్రుతికి బ్రహ్మవిద్య ఉపదేశించాడు. గార్గి జనకుడిసభలో విద్వాంసులు ఎదురుగా యాజ్ఞవల్క్యునితో వాదించిన విధుషీమణి. వీరు బ్రహ్మవేత్తలుగా చెప్పబడ్డారు. శాస్త్రాల్లో ఆశ్రమకర్మలను పాటించని విదురుడు కూడా గొప్ప జ్ఞాని. కనుక శమదమాదుల్లాగా ముముక్షవులకు యజ్ఞాదికర్మలు తప్పక అనుష్ఠించవలసినదే. ఆశ్రమధర్మాలు పాటించని వారికీ కూడా బ్రహ్మవిద్యాధికారం ఉన్నదని చెప్పబడింది .
సూత్రం :- 462
" అపిచ స్మర్యతే "
అపిచ :- అంతే కాక, స్మర్యతే :- ఆశ్రమ కర్మానుష్ఠానం లేకుండానే జ్ఞానం కలగుతుందని స్మృతులు చెబుతున్నాయి.
భావం :- ఆశ్రమ కర్మనుష్టానం లేకుండానే జ్ఞానం కలుగుతుందని స్మృతులు చెబుతున్నాయి.
వివరణ:-జ్ఞానానికి సహకరించే కర్మల్ని రకరకాల ఆశ్రమాల్లో చేస్తుంటారు. ఆశ్రమకర్మలు నిర్వహిస్తూ బ్రహ్మవిద్యను పొంది, తద్వారా మోక్షాన్నిసాధించవచ్చును. కానిఆశ్రమకర్మానుష్టానం లేకుండానే జ్ఞానం కలుగుతుందని స్మృతులు చెబుతున్నాయి.
మనుస్మృతి(2, 87):-జపంవల్లనే బ్రాహ్మణుడు సిద్ధిపొందుతాడు. ఇందులో సంశయంలేదు. ఇతర యాగాదికర్మలు చేసినా, చేయకపోయినా అతను ప్రణవజపంతోనే పరమాత్మకు ప్రియమైన బ్రాహ్మణుడు అవుతాడు. అందువలన బ్రహ్మజ్ఞానికి శమదమాదుల్లాగా ఆశ్రమకర్మలు యజ్ఞాదులు అనుష్ఠించవలసిన అవసరంలేదు. ఇతిహాసాలలో ఏఆశ్రమం లేనట్టి సంవర్తనుడు మొదలైన వాళ్ళు దిగంబరులుగా సంచరించడం, ఏఆశ్రమదర్మాలు నిర్వహించకుండానే ప్రణవజపంతోనే మహాయోగులైనట్లు చెప్పబడింది. కాబట్టి ఆశ్రమ రహితులకు కూడా బ్రహ్మ విద్యాధికారం ఉన్నది.
సూత్రం :- 463
" విశేషానుగ్రహాచ్చ "
విశేషానుగ్రహాచ్చ :- ఆశ్రమ కర్మలు పాటించని వాళ్లపై కూడా పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది.
భావం :- ఆశ్రమ కర్మలు పాటించని వారికి కూడా పరమేశ్వరుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది.
వివరణ:-ఈశ్రుతి, స్మృతులలో రైక్వాదులు జ్ఞానులు అని తెలుస్తున్నదని, వాళ్లకు విద్య లభించడానికి కారణం ఏమిటో చెప్పబడుచున్నది. వారికి ఏఆశ్రమం లేకపోయినా, ఆశ్రమకర్మలు యజ్ఞాదులు అనుష్ఠించకపోయినా, జపం, తపం, ఉపవాసం, దేవతారాధన, సర్వభూతదయ కలిగిఉండటం, మొదలైన ధర్మవిశేషాలచేత ఉపాసనవలన బ్రాహ్మణుడికి బ్రహ్మ జ్ఞానం లభిస్తుంది. అనేక జన్మల పుణ్యఫలం వలన మోక్షం పొందుతారని స్మ్మతి చెబుతోంది.
కఠోపనిషత్తు(2, 23):-అన్యసాధనాలు, సఫలం అయినా, కాకపోయినా పరమేశ్వరుడు ప్రసన్నుడైన ఉపాసకుడికి బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఆయన అనుగ్రహం వలన జ్ఞాన ప్రాప్తి కలిగినప్పుడు బ్రాహ్మణుడు జపం ద్వారానే మోక్షాన్ని పొందవచ్చును. కర్మనుష్ఠానం తప్పనిసరి కాదు. 'అనేక... గతిమ్' అను స్మృతివలన జన్మాంతరాలలో సంచితమైన సంస్కారవిశేషాలు కూడా విద్యను అనుగ్రహిస్తాయి అని చెప్పబడింది. అనేకజన్మల ద్వారా సిద్ధుడై తరువాత ఉత్తమ గతిని పొందుతాడు అని భగవద్గీతా వాక్యానికి అర్ధం. అందువలన విధురాదులకు కూడా విద్యయందు అధికారం ఉండటం విరుద్దం కాదు.
సూత్రం :- 464
" అతస్త్వితర జ్జ్యాయో లింగాచ్చ "
అతః:- ఆశ్రమ కర్మల కన్నా, ఇతరత్ తు :- శమదమాదులే, జ్యాయః :- మేలైనవి. లింగాత్ చ :- శాస్త్రాలు అంటున్నాయి.
భావం:-ఆశ్రమకర్మలకన్నా శమదమాదులే మేలైనవి. గొప్ప అంతరంగసాదనాలు. కనుక వాటిని పాటించాలని శాస్త్రాలు అంటున్నాయి.
వివరణ:-ఏఆశ్రమం లేకపోవడంకన్నా, ఆశ్రమం కలిగిఉండటమే శీఘ్రమైన విద్యావ్యాప్తికి సాధనం. ఏఆశ్రమంలో లేకపోయినా విద్యాధికారం ఉన్నప్పుడు ఆశ్రమధర్మాలు ఎందుకు నిర్వహించాలి అనే సందేహం వస్తుంది. ఏఆశ్రమం లేకుండా ఉండే కన్నా ఏదో ఒక ఆశ్రమాన్ని ఆశ్రయించడం శ్రేయస్కరం. ఆశ్రమం లేకుండా బ్రాహ్మణుడు ఒక్క రోజు కూడా ఉండకూడదు. ఒకసంవత్సరం దూరంగాఉంటే ప్రాయిశ్చిత్తం కూడా చేసుకోవాలి. 'తేనైతి-తైజసశ్చ'పుణ్యం చేసిన బ్రహ్మ వేత్త శుద్ధ సత్వం కలవాడై బ్రహ్మ మార్గం చేత బ్రహ్మను పొందుతాడు అని శ్రుతి చెబుతోంది.
బృహదారణ్యకోపనిషత్తు(4, 4, 23):-ముముక్షువులు శమదమాదుల్ని తప్పక పాటించాలి. యజ్ఞాదిక ఆశ్రమకర్మలను అవకాశం ఉంటే అనుష్ఠించవచ్చును. అవకాశంలేకపోతే దోషంలేదు. అధికారం ఉన్నప్పుడు మాత్రం తప్పక అనుష్టించాలి. బ్రహ్మచారులు, వానప్రస్థులు, సన్యాసులు వీళ్ళని ఊర్ధ్వరేతస్కులంటారు. బ్రహ్మచర్యం నుండి వానప్రస్థం, సన్యాసానికి వెళ్లడం, గృహస్థాశ్రమంనుంచి వానప్రస్థం, సన్యాసాశ్రమానికి క్రమంగా పోవడం దీనిని ఆరోహణ విధానం అంటారు. జ్ఞానానికి యజ్ఞయాగాదికర్మలు బహిరంగ సాధనలు. శమదమాదులు ముఖ్య అంతరంగసాధనలు. బహిరంగంకన్నా అంతరంగం మేలైనది. ఆశ్రమకర్మల కన్నా ఉపవాసాదులు ఎక్కువ సహకరిస్తాయి.
తద్భుతాధికరణం ( 3, 4, 40 )
సూత్రం :- 465
" తద్ భూతస్య తు నాతద్భావో జైమినే రపి నియమాత్ర ద్రూపాభావేభ్యః "
తత్ భూతస్య :- నైష్ఠిక బ్రహ్మచారి, వాన ప్రస్థ, సన్యాసి అయిన వాడికి, న అతత్ భావః :- ఉన్న ఆశ్రమం నుంచి అవరోహణం జరగ కూడదు, జైమినేః అపి :- జైమిని, వ్యాసుడు వీళ్ళ మతం. నియమాత్ అతత్ రూప అభావేభ్యః :- అలాంటి నియమం, ఆచారం లేదు.
భావం :- నైష్ఠిక బ్రహ్మచారి వానప్రాస్థ, సన్యాసి అయిన వాడికి ఉన్న ఆశ్రమం నుంచి అవరోహణ జరగకూడదని జైమిని, వ్యాసుడు అలాంటి నియమం, ఆచారం లేదని చెప్పినారు.
వివరణ:-గురువుగారు! సన్యాసాశ్రమం స్వీకరించిన వాడు ఐహికవాంఛలతో, ఇంద్రియలాలసత్వంతో, ఇతరకారణముల చేత, తిరిగి గృహస్థాశ్రమాన్ని స్వీకరించవచ్చునా? అని అడిగాడు కృష్ణశర్మ. సన్యాసాశ్రమంలో ఉన్నవాడు తిరిగి వచ్చి గృహస్థాశ్రమం స్వీకరించరాదు. ఆశ్రమభ్రంశం పనికి రాదు. గురువు ఆజ్ఞానుసారం నాలుగు ఆశ్రమాలలో ఏదో ఒక దానిని గ్రహించి మరణకాలం వరకు ధర్మపరుడై ఆఆశ్రమంలోనే ఉండాలి. బ్రహ్మచారి గృహస్థాశ్రమానికి రావాలని కొన్ని శ్రుతులు, బ్రహ్మచర్యం నుంచి ఒక్కసారిగా సన్యాసాశ్రమం స్వీకరించాలని కొన్ని శ్రుతులు చెబుతున్నాయి. ఊర్ధ్వరేతస్కులు ఉన్నత ఆశ్రమంచేరి, మళ్ళీ ఏదో కారణంచేత పూర్వాశ్రమానికి చేరవచ్చునని శాస్త్రాల్లో ఎక్కడా చెప్పబడ లేదు. శిష్ఠులైన వారెవరూ అలా చెయ్యలేదు. సన్యాసాశ్రమాన్ని అంగీకరించని జైమిని కూడా ఇందుకు ఒప్పుకోలేదు. బ్రహ్మచారి వివాహం చేసుకొని, కోరికలన్నీ తీరిన తరువాతనే సన్యాసం స్వీకరించాలి.
ఛాందోగ్యోపనిషత్తు(2, 28, 1):-నైష్ఠికబ్రహ్మచారి జీవన పర్యంతం ఆచార్యకులంలో నియమాలతో, తపస్సుతో జీవితం గడపాలి. అతను గృహస్థాశ్రమం స్వీకరిస్తే నైష్ఠిక పతనం జరుగుతుంది.
మనుస్మృతి(6, 34):-బ్రహ్మచర్యంనుంచి గృహస్థాశ్రమం స్వీకరించి అగ్నిహోత్రాదులు చేసి, జితేంద్రీయుడై, భిక్ష, బలిదానాలు చిరకాలంచేస్తూ, చివరకు సన్యాసం స్వీకరించాలి. ఆశ్రమధర్మలను పాటించి మరణించిన తరువాత పరలోకంలో ఉన్నతిని పొందుతాడు. ఇక్కడ ఆశ్రమలకు ఆరోహణే కాని అవరోహణ లేదు.
జాబాలోపనిషత్తు:-ఆచార్యులు ఇద్దరూ ఉత్తరాశ్రమంనుంచి పూర్వశ్రమానికి వెళ్లడం శిష్టాచారం కాదని అభిప్రాయం పడ్డారు. ఒకవేళ సన్యాసి గనుగ పతనమైతే, అధోగతి పాలవుతాడని ఈశావాశ్యోపనిషత్తులో చెప్పబడింది.
సూత్రం :- 466
" న చాధికారిక మపి పతనాను మానాత్ తదయోగాత్ "
అధికారికం అపిన :- ఎలాంటి అధికారిక ప్రాయిశ్చిత్తం లేదు. పతన అనుమానాత్ :- అతణ్ణి పతితుడని శిష్ఠులు అనుమానిస్తారు. కనుక తత్ అయోగాత్ :- అతడికి ప్రాయిశ్చిత్త యోగం లేదు.
భావం :- అలా పూర్వశ్రమానికి వెడితే ప్రాయిశ్చిత్తం ఉన్నదా? ఎలాంటి అధికారిక ప్రాయిశ్చిత్తం లేదు. అతణ్ణి పతితుడని శిస్టులు అనుమానిస్తారు. అతడికి ప్రాయిశ్చిత్త యోగం లేదు.
వివరణ:-నైష్టికబ్రహ్మచారి కనుక పతనంఅయితే అతనికి ప్రాయిశ్చిత్తంలేదు. అలాంటి ప్రాయిశ్చిత్తం అనేది ఉంటే అది మాములు బ్రహ్మచారికే కాని సన్యాసికి కాదు.
పూర్వమీమాంసాదర్శనం(6, 8, 21):- పతితుడైన ఊర్ధ్వ రేతస్కుడికి ప్రాయిశ్చిత్తం లేదు. పతనం నిశ్చయమైన వాడికి ఇక ప్రాయిశ్చిత్తం ఏముంటుంది? కాగా అపకీర్ణబ్రహ్మచారికి సంబంధించినది, ఊర్ధ్వరేతస్కుడైన నైష్ఠికునికి సంబంధించినది కాదు. వాళ్ళు మళ్ళీ పూర్వమార్గంలో నడుస్తారని ఆశించలేము.
సూత్రం :- 467
" ఉప పూర్వ, మపి త్వేకే, భావ మశనవ త్తదుక్తం "
ఏ కేతు :- కొందరు ఆచార్యులు మాత్రం, ఉప పూర్వం అపి :- ఈ పతనానికి, భావం :- ప్రాయిశ్చిత్తం ఉందంటున్నారు, అశనవత్ :- తినకూడనివి తిన్నప్పుడు, తదుక్తం :- ప్రాయిశ్చిత్తం ఉన్నది కదా!
భావం :- కొందరు ఆచార్యులు మాత్రం ఈ పతనానికి ప్రాయిశ్చిత్తం ఉన్నదని అంటున్నారు. తినకూడనివి తిన్నప్పుడు ప్రాయిశ్చిత్తం ఉన్నది కదా!
వివరణ:-నైష్ఠికబ్రహ్మచారికి ప్రాయిశ్చిత్తం లేదని పూర్వపక్షవాదన. నైష్ఠికబ్రహ్మచారికి ప్రాయిశ్చిత్తం ఉన్నదని శ్రుతి వాక్యం చెబుతోంది. ఒకవేళ సంభోగిస్తే దానికి ప్రాయిశ్చిత్తం ఉన్నది. గురుభార్య యందు మహాపాతకంగా చెప్పబడింది. దానికి ప్రాయిశ్చిత్తంలేదు. ప్రాయిశ్చిత్తంజరిగినా సత్పురుషులు వారిని వెలివేస్తారు. వానప్రస్థ, పరివ్రాజకులకు కూడా ప్రాయిశ్చిత్తం ఉన్నదని జైమిని అంటాడు. దీక్షలోపం వచ్చినప్పుడు వారు 12రోజులు కృచ్చవ్రతం ఆచరించాలి. అంటే సోమలత మినహా మిగిలిన చెట్లు, పొదలు, తృణకాష్టాదులను, గడ్డిమొక్కలకు నీరుపోసి పెంచాలి. శాస్త్రవిహితమైన ప్రాణాయామాదులు కూడా చెయ్యాలి.
మనుస్మృతి(11, 160):-ఆత్మశుద్ధిని కోరుకునే వాళ్ళు నిషిద్దభోజనం చెయ్యకూడదు. ప్రమాదవశాత్తు ఎప్పుడైనా తినడం జరిగితే వెంటనే వమనాదులతో శుద్ధి చేసుకోవాలని అభక్ష్యభక్షానికి ప్రాయిశ్చిత్తం ఉన్నది. అలాకాక బుద్ధిపూర్వకంగా తిన్నా ప్రాయిశ్చిత్తం ఉన్నది. (11, 45):- అభక్ష్యభక్ష్యానికి ప్రాయిశ్చిత్తం ఉన్నట్లే, ఊర్ధ్వరేతస్కుడు పతితుడైనప్పుడు ఆ పతనాన్ని చిన్నపాపంగా భావించి ప్రాయిశ్చిత్తం ఉన్నదని కొందరు అంటున్నారు. తైత్తరీయసంహితలో వాతరశనుడు మొదలైన ఋషులు దోషరహితులం కావాలంటే ఏమిచెయ్యాలని అడిగారు. భ్రూణహత్య మహాపాతకం, దాని కన్నా స్వల్పమైనది ఉపపాతకం. దానినుంచి విముక్తుడౌతాడు. నైష్ఠికబ్రహ్మచారి ఊర్ధ్వరేతస్సు నుండి పతనం కావడం ఉప పాతకమని, అది మహాపతకం కాదని, దానికి ప్రాయిశ్చిత్తాన్ని ఒప్పుకోవాలని కొందరు ఆచార్యులంటున్నారు. శాస్త్ర ప్రకారం ప్రాయిశ్చిత్తం ఉన్నది. ప్రాయిశ్చిత్తంలేదనే స్మృతి వాక్యం బ్రహ్మచర్యం కాపాడుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చెయ్యాలి అని చెప్పడం కోసమే వ్యాఖ్యనించారు.
బహిరధికరణం ( 3, 4, 43 )
సూత్రం :- 468
" బహిస్తూభయ థాపి స్మృతే రాచారా చ్చ "
ఉభయథా అపి తు :- ప్రాయిశ్చిత్తం ఉన్నా, లేకపోయినా, బహిః :- అతణ్ణి బహిష్కరించాలి. ఎందుకంటే స్మృతేః ఆచారాత్ చ :- స్మృతులు, ఆచారాలు అలా అంటున్నాయని వేదవ్యాసుని అభిప్రాయం.
భావం :- నైష్ఠికుడు పతనమైనప్పుడు ప్రాయిశ్చిత్తం ఉన్నా, లేకపోయినా అతణ్ణి బహిష్కరించాలని స్మృతులు, ఆచారాలు అలా అంటున్నాయని వేదవ్యాసుని అభిప్రాయం.
వివరణ:-ఊర్ధ్వరేతస్కులు పతనం జరిగితే రెండు రకాల పాతకాలు కలుగుతాయి. 1. ఉపపాతకం, 2. మహా పాతకం. కాని వారు ఏరకంగా పతనమైనప్పటికి వారు బహిష్కరింపదగినవారే. శిష్ఠులు వారిని బహిస్కరించాలి. ప్రాయిశ్చిత్తం చేసి నప్పటికి అతని మనస్సు చెడ్డవృత్తులనుంచి మరలడం సంభవం కాదు.
మనుస్మృతి(11,190):బాలహంతకులు, కృతఘ్నులు శరణుజొచ్చిన వారిని చంపేవారు, స్త్రీహంతకులు, వీళ్ళు ప్రాయిశ్చిత్తంచేసుకున్నా, వారితో సహవాసంచేయకూడదు. సంఘంలోఉంచరాదని స్మృతులు, ఆచారాలు చెబుతున్నాయి. ' ఆరుడో..స ఆత్మహా ', ఆరూడ.. చరేత్ ' అరూడపతితుడు అంటే పైఆశ్రమానికి వెళ్లి పతితుడైనవాడు, ఉరి తీయబడినవాడు, సర్పాదులు కరిచిన వాడు, పరజాతితో కలిసిన వాడు, అయిన బ్రాహ్మణుణ్ణి స్పృశిస్తే చాంద్రాయణ వ్రతం చెయ్యాలి. శిష్ఠులు అలాంటి వారితో యజ్ఞ, అధ్యయన, వివాహాదులు చేసికొనరు కదా! అలాంటి వారికి రెండు రకాల పాపాలు కలుగుతాయి.1.ఈ లోకంలో అశుద్ధి, 2. పరలోకంలో అశుద్ధి. వీరు చాంద్రయణ వ్రతం చేసినందున పరలోకశుద్ధి చేసుకుంటే రెండవ దోషం పోతుంది. నరకాదికం రాదు. కాని మొదటిది పోదు. ఐహికశుద్ధి తొలగించుకుంటే శిష్ఠులతో వ్యవహారం పెట్టుకోవచ్చును. కాని, ఈప్రాయిశ్చిత్తాల వలన పారలౌకికశుద్ధి తొలగి పోయినా, ఐహిక శుద్ధి మాత్రం తొలగదు. అలాంటి ప్రాయిశ్చిత్తంలేదు. చంద్రాయణవ్రతం:-చంద్రుడి అయినాన్ని బట్టి ఆహారనియమాలతో పాపపరిహారార్ధం చేసే వ్రతం. ఇది శుక్ల పాడ్యమి రోజంతా ఉపవాసం చేసి, ఆ రాత్రి ఒక్క గోధుమ పిండి ముద్దను తినాలి. విదియ నాడు 2, తదియ నాడు 3 ముద్దలు చొప్పున పెంచుకుంటూ తినాలి. పౌర్ణమినాడు 15 ముద్దలు తినాలి. మర్నాడు పాడ్యమి రోజున 14 ముద్దలు, విదియ 13 ముద్దలు, అలా రోజు ఒకముద్ద తగ్గించుకుంటూ తినాలి. అమావాస్య రోజు ఉపవాసం చెయ్యాలి. ఇలా నెల రోజులు చేసి ప్రాయిశ్చిత్తం చేసుకోవాలి. వానప్రస్థులు 12 రోజులు కృచ్ఛవ్రతం చేయాలి. సన్యాసులు కృచ్ఛవ్రతం చేసి, సోమతల తప్ప మిగతా వృక్షాలకు నీరు పోసి, ప్రాణాయామం చెయ్యాలి.
స్యామ్యధికరణం ( 3, 4, 44 )
సూత్రం :- 469
" స్వామినః ఫలశ్రుతే రిత్యాత్రేయః "
ఫలశ్రుతే :- ఉపాసకుడికి ఫలశ్రుతి ఉన్నది, స్వామినః :- యజమానే ఉపాసనాంగ కర్మలను అనుష్ఠించాలి. ఆత్రేయః :- ఆత్రేయముని అభిప్రాయం.
భావం :- ఉపాసకుడికి ఫలశ్రుతి ఉన్నది. అందువలన యజమానే ఉపాసనాంగ కర్మలను అనుష్ఠించాలి అని ఆత్రేయ ముని అభిప్రాయం. కర్మ ఫలం యజమానికే లభిస్తుంది కదా!
వివరణ:-గురువర్యా! కర్మాంగ ఉపాసనలను ఆచరించవలసినది ఋత్విక్కా? లేక యజమానా? అని సందేహం వ్యక్తం చేశాడు నారాయణభట్టు. రత్నకరుడు సమాధానం చెబుతున్నాడు. కర్మాంగోపాసనల కర్త యజమానే అని ఆత్రేయ ముని అభిప్రాయం. ఉపనిషత్తులలో చెప్పిన దానిని బట్టి కర్తకే ఫలం లభిస్తుంది. కాబట్టి ఉపాసకులకు కూడా కర్త యజమానే అని వారి వాదన.
ఛాందోగ్యోపనిషత్తు(2, 3, 2):-అతడి కోసమే వర్షిస్తుంది. నిశ్చయంగా అతడే వర్షించే టట్లు చేసుకుంటాడు. ఇది తెలుసుకొని, అతడి దృష్టిలో పంచవిధసామ్యాన్ని ఉపాసిస్తాడు. ఇక్కడ యజమానికి ఫలప్రాప్తి చెప్పారు. ఉపాసనఫలానికి అతడే అధికారి. అదే ఉచితం. దాన్ని అనుష్ఠించినది అతనేకదా! కనుక యజమానే అనుష్ఠానంచెయ్యాలని ఆత్రేయముని అభిప్రాయం. యజ్ఞాన్ని నిర్వహించేవాడు ఋత్విక్కే. కాని యజ్ఞాన్ని నిర్వహించడానికి అన్ని సమకూర్చుకొని చేయించేవాడు, దాని ఫలాన్ని కోరుకునే వాడు యజమాని. కర్త యజమానే కనుక కర్తృత్వం కూడా ఆయనదే అని పూర్వపక్షవాదన.
సూత్రం :- 470
" ఆర్త్వి జ్యమి త్యౌడులోమి స్తస్మై హి పరిక్రీయతే "
ఆర్త్విజ్యం :- అంగోపాసన ఋత్విజుడిది. ఇతి :- అని, ఔడు లోమిః :- ఔడులోమి ఆచార్యుడి మతం. హి :- ఎందుకంటే, తస్మై :- ఆ అంగానుష్టానం కోసం, పరిక్రీయతే :- ఋత్విక్కుకు ధనం ఇస్తాం కదా!
భావం:-అంగోపాసన ఋత్విజుడిదేనని ఔడులోమి ఆచార్యుని మతం. ఎందుకంటే ఆ అంగానుష్ఠానం కోసం ఋత్విక్కుకు ధనం ఇస్తాం కదా!
వివరణ:-ఈ ఉపాసనలకు కర్త యజమానే అని ఔడులోమి అనే ఆచార్యుడు అంటున్నాడు. యజమానికి ఫలం సంపాదించి పెట్టడం కోసం దక్షిణఇచ్చి ఋత్విక్కును కొన్నాడు. అక్కడ చేసేది ఋత్విక్కే. కాని ఆఫలితాన్ని అతడు యజమానికి సంక్రమింపజేస్తాడు అని ఔడులోమి అంటాడు. అంగాలైనఉపాసనల్ని అనుష్ఠించడానికి యజమాని ఋత్విజుల్ని నియమించుకుంటాడు. వారిని అంగోపాసన కోసం ఎన్నుకొని అనుష్ఠానం తరువాత వాళ్లకి శ్రమకు తగ్గ ఫలం యజమాని ఇస్తాడు. అప్పుడు వాళ్ళని కొన్నట్లేలెక్క. అంగోపాసన సంపన్నం చెయ్యడం ఋత్విజుల కర్తవ్యం. యజమానుడిది కాదు.
ఛాందోగ్యోపనిషత్తు(1, 10, 11):- దీనిలో ఉపాస్థి కధనం తెలుసుకోవాలి. అక్కడ యజమాని శుల్కo ఇచ్చి యజ్ఞానుష్ఠానం కోసం ఉపస్థిని ఋత్విజుడిగా ఎన్నుకుంటారు. కనుక అంగానుష్ఠానం ఋత్విజుడే చెయ్యాలని ఔడులోమి అభిప్రాయం.
సామ్యధికరణం ( 3, 4, 46 )
సూత్రం :- 471
" శ్రుతే శ్చ "
చ :- పైగా, శ్రుతి వాక్యాల వలన యజ్ఞ కర్మ ఋత్విజులదే అని తెలుస్తోంది.
భావం :- శ్రుతి వాక్యాల వలన యజ్ఞకర్మ ఋత్విజులదేనని తెలుస్తోంది. అయినా ఫలం యజమానికి లభిస్తుంది.
వివరణ:- శ్రుతులలో ఋత్విక్కు చేసిన ఉపాసనాఫలం యజమానికి చెందడం గురించి ఈ సూత్రంలో చెప్పబడింది. యజ్ఞంలో ఋత్విక్కులు ఏ కోరికను కోరతారో దానిని యజమాని కొరకే కోరతారు.
శతపధబ్రాహ్మణం(1, 3, 1, 6):- యజ్ఞంలో ఋత్విజులు ఇచ్చే ఆశీర్వాదం యజమానికి దక్కుతుంది. దీనిని బట్టి ఆశీర్వాదం లాగా ఋత్విజులు అనుష్ఠించే ఉపాసనాంగాల ఫలం కూడా యజమానికే లభిస్తుంది. ' తస్మాత్ ఆ గాయని ' ఇట్లు తెలుసుకున్న ఉద్గాథ నీకొరకు ఏకోరికను గానం ద్వారా సాధించాలి అని అడగాలి. ఈ శ్రుతి ఋత్విక్కులు కర్తగా గల చేసిన యజ్ఞఫలం యజమానుని చేరుతుంది. యజ్ఞం చేసేటప్పుడు ఋత్విక్కు కోరే కోరికలన్ని యజమాని కోసమే. కాని దాని వలన వచ్చే ఫలంమాత్రం యజమానిదే. వారు ఇచ్చే ఆశీర్వాదన యజమానికే లభిస్తుంది. దీనిని బట్టి ఆశీర్వాదం లాగా ఋత్విజులు అనుష్టించే ఉపాసనాంగాల నుండి కూడా ఫలం యజమానికే లభిస్తుంది. అందువలన ఉపాసనలకు కర్త ఋత్విక్కులే.
సహకార్యాంతర విద్యధికరణం ( 3, 4, 47 )
సూత్రం :- 472
" సహ కార్యాంతర విధిః పక్షేణ తృతీయం తద్వతో విధ్యాదివత్ "
సహకరిఅంతరనిధిః :- బృహదారణ్యకంలో మరోసాధనం గురించి చెప్పారు. తృతీయం:- అది మూడోసాధనం. తద్వతః :- బ్రహ్మ జ్ఞానం ఉన్నవాళ్లకు, విధి ఆదివత్ :- విధినిషేధాల్లాగా, పక్షేణ :- ఇది వైకల్పికంగా అనుష్ఠించ వలసిన సాధనం.
భావం :- బృహదారణ్యకంలో మరొకటి, మూడో సాధనం గురించి చెప్పారు. అది బ్రహ్మ జ్ఞానం ఉన్న వాళ్ళు విధి నిషేధాల్లాగా వైకల్పికంగా అనుష్ఠించ వలసిన సాధనం.
వివరణ:-బృహదారణ్యాకంలో మూడోసాధనం గురించి చెప్పారు. మొదటిది - యజ్ఞాది కర్మలు, రెండవది - బహిరంగ సాధనలు, శమదమాదులు, అంతరంగం సాధనలు, మూడవది - మౌనం. పరబ్రహ్మను తెలుసుకున్నవాడు పరమ సుఖాన్ని బ్రహ్మభావాన్ని పొందుతాడు. బ్రాహ్మణుడైన వాడు, బ్రహ్మను గురించి తెలుసుకోవాలనుకునే వాడు మొదటిగా శాస్త్ర పరిజ్ఞానం సంపాదించాలి. తరువాత దానిని దృఢపరచుకోవడానికి మననంచెయ్యాలి. అప్పుడు బ్రహ్మవేత్త అవుతాడు. ఇక్కడ శాస్త్రపరిజ్ఞానంతో బాటు మౌనంకూడా చెప్పబడింది. విద్యకు సహకరి మౌనం. మూడవ విధి అయిన ధ్యానం మౌనంగానే జరగాలి.
బృహదారణ్యాకోపనిషత్తు, కహాల బ్రాహ్మణం (3, 5, 1):- బ్రహ్మజ్ఞాని కావాలనుకున్న వ్యక్తి - పాండిత్యం, శాస్త్రాధ్యయనం, శాస్త్రశ్రవణం, బాగా సంపాదించి శక్తిమంతుడై ఉండాలి. శ్రవణానికి మననం బలం. మననం చేయనిదే ధృడత్వం రాదు. బ్రహ్మజ్ఞానం విషయంలో శ్రవణం అయిన తరువాత గంభీరంగా మననం చెయ్యాలి. ఇలా శ్రవణ మననాలు చేసి ముని కావాలి. మౌనంగా ఉండే వాడే ముని. ఇతర వ్యవహారాలన్నింటికి దూరంగా ఉండి, ధ్యాననిమగ్నుడు కావాలి. ఇలా శ్రవణ మనన ధ్యానాలు చేసి సంపన్నుడైన వాడే బ్రాహ్మణుడు. జ్ఞాని అయిన తరువాత శ్రవణమననాదులను ఐచ్చికంగా అనుష్టించవచ్చును. బ్రహ్మజ్ఞానికి పాపకర్మలు అంటవు. ఈదశలో బ్రహ్మజ్ఞాని శ్రవణ మననాదులు చేసిన చేయక పోయినా లాభం, నష్టం ఉండవు. దీనినే వికల్పం అంటారు. అతడు స్వతంత్రడు. అయిన నిషిద్దాచరణ చేయరాదు.
ముండకోపనిషత్తు(3, 1, 4) :- ఆత్మలో చరించే వాడు, బాహ్య వ్యాపారన్ని విడిచిపెట్టిన వాడు, జ్ఞాన ధ్యానాది పుణ్య కర్మల్లో నిష్ఠుడైన వాడు, బ్రహ్మవిధుల్లో శ్రేష్టుడు, బ్రహ్మ జ్ఞాని స్వాతంత్రుడైనా లోక క్షేమం కోసం విహిత కార్యలే ఆచరిస్తాడు. నిషిద్ద కార్యాలను త్యజిస్తాడు. అంటే విధి, నిషేధ్ధాల్లో స్వతంత్రం ఉండదు.
సూత్రం :- 473
" కృత్స్న భావాత్తు గృహిణోప సంహారః "
తు :- అయితే, కృత్స్న భావాత్ :- సంపూర్ణ జ్ఞాన సాధనాలు గృహస్థాశ్రమ వాసులకు లభ్యమౌతున్నాయి. గృహిణా :- గృహస్తుడు కూడా, ఉప సంహారః :- బ్రహ్మ విద్యను గ్రహించ వచ్చును.
భావం:- సంపూర్ణజ్ఞానసాధనాలు గృహస్థాశ్రమవాసులకు సైతం లభ్యమౌతున్నాయి. అందువలన గృహస్థు బ్రహ్మ విద్యను గ్రహించవచ్చును. గృహస్థాశ్రమంలోకూడా జ్ఞానసాధనాలన్నీ లభిస్తాయి. కాబట్టి గృహస్థుకూడా విద్యను ప్రాప్తించుకో వచ్చును.
వివరణ:-గృహస్థాశ్రమం శ్రేష్టమని చెప్పబడింది. అలాగని సన్యాసాశ్రమం లేదని కాదు. గృహస్టు స్వర్గ సుఖాలు కోరుకుంటే, యజ్ఞయాగాదులు చేసి వాటిని పొందవచ్చును. వారికి శమదమాదులు కూడా అవసరమే. మోక్షం కావాలనుకుంటే బ్రహ్మజ్ఞానసిద్ధి పొందవచ్చును. అందుకే గృహస్థాశ్రమం శ్రేష్టం అని చెప్పారు.
ఛాందోగ్యోపనిషత్తు(8, 15, 1):-గురుసేవ చేసినతరువాత, మిగతా సమయంలో అధ్యయనం పూర్తి చేసి, స్నాతకుడై, గృహస్టుడై, కుటుంబంలోఉండి, పవిత్రస్థానంలో ఆత్మచింతనచేస్తూ, ఇంద్రియాలను తనవశంలో ఉంచుకొని, ఏప్రాణిని హింసించకుండా యావజ్జీవం నడచుకునే వాడు బ్రహ్మలోకాన్ని పొందుతాడు. ఇలా గృహస్థాశ్రమంలోనూ, బ్రహ్మలోక ప్రాప్తి విద్యను గురించి చెప్పారు. ఉపాసకుడికి శమదమాదులతో పాటు యజ్ఞాదికర్మలు నిర్వహించడానికి ఎన్నో సాధనాలు కావాలి. అవి గృహస్థాశ్రమంలో సులభంగా లభిస్తాయి. బ్రహ్మజిజ్ఞాసువు విషయాసక్తి నుంచి ఇతర వ్యాపారాల నుంచి విరక్తుడు కావాలి. ఇవి సాధ్యపడిన గృహస్థుడికి బ్రహ్మవిద్య ప్రాప్తి యుక్తమే.
సూత్రం :- 474
" మౌనవ దితిరేషా మప్యుపదేశాత్ "
మౌనవత్ :- నిధి ధ్యాసనం లాగా, ఇతరేషా అపి :- ఇతర సాధనాంతరాలను కూడా, ఉపదేశాత్ :- శాస్త్రం ఉపదేశిస్తోంది.
భావం :- జ్ఞాన సాధనలన్నింటిలో నిధి ధ్యాసనం ఒక్కటే ఆచరణీయమా? అంటే నిధి ధ్యాసనం లాగా ఇతర సాధనాంతరాలను కూడా శాస్త్రం ఉపదేశిస్తోంది.
వివరణ:-గృహస్టుకు సన్యాసాశ్రమాలు శ్రుతిసమ్మతాలు. అలాగే వానప్రస్థ, సన్యాసాశ్రమాలు కూడా సమ్మతాలే. ఈ నాలుగుఆశ్రమాలలోని ధర్మాలను అనుష్ఠించాలి. ఈరకంగా పాండిత్య బాల్యలతో బాటు మౌనం కూడా విధేనని గ్రహించాలి. బాల్యం అంటే రాగద్వేషాలు లేని నిర్మలభావం. శాస్త్రం నిధిధ్యాసలతో బాటు శమ, దమ వివేకాదుల్ని జ్ఞానసాధనాలుగా నిర్దేశించినది. జ్ఞానప్రాప్తికోసం శాస్త్రం సూచించిన సాధనలన్నీ అనుష్ఠించదగినవే. ఏదోఒక సాధనంవలన మోక్షంరాదు. జ్ఞానసాధనకు ఊర్ద్వరేతస్కులకు ఆశ్రమం ఉపయుక్తమైన అన్యగృహఆశ్రమాల సహకారం లేనిదే బ్రహ్మవిద్య సిద్ధించదు. బ్రహ్మచర్యo మొదలైన ఆశ్రమాలు పాటించడం అవసరం. సాధనాలన్ని అనుష్టేయాలే. ఆశ్రమాలను కూడా ఉపేక్షించరాదు. అందువలన నిధి ధ్యాసనం ఒక్కటే ముఖ్య సాధనమని అనుకోకూడదు.
అనావిష్కారాధికరణం ( 3, 4, 50 )
సూత్రం :- 475
" అనావిష్కు ర్వన్న న్వయాత్ "
అన్వయాత్:-సాధనసంపదతో సంబంధం ఉండటంవలన, అనావిష్కుర్వన్:- గురువు ఉపదేశించిన సాధనాలను ప్రకటం చేయకుండా ఆచరణలో తత్పురుషుడు కావాలి.
భావం :- సాధనా సంపదతో సంబంధం ఉండటం వలన గురువు ఉపదేశించిన సాధనలను ప్రకటం చేయకుండా ఆచరణలో తత్పురుషుడు కావాలి.
వివరణ:- బాల్యం అంటే రాగద్వేషాలు లేని నిర్మలభావం అని భావించాలి. గురువు గారు! బాల్యం అంటే చిన్నతనం అనా? చిన్నపిల్లలు చేసే పనులు అనా? దంభం, దర్పం తెలియనిస్థితా? వీటిలో ఏ అర్ధాన్ని గ్రహించాలి? అని అడిగాడు కృష్ణశర్మ. సమాధానం చెబుతున్నాడు రత్నకరుడు. బాల్యం అంటే తన జ్ఞానాదులను ఇతరులకు వ్యక్తం చెయ్యకుండా కేవలం పవిత్ర భావం కలిగి ఉండటం. బాలుడు అంటే ఇంద్రియప్రాబల్యం లేనివాడు, దంభం, దర్పం లేకుండా నిర్మల స్వభావం కలవాడు. ఇక్కడ యతులు అనుష్ఠించదగినది జ్ఞానాభ్యాసం. బాలలుచేసే సకలచర్యలు అంగీకరిస్తే జ్ఞానాభ్యాసం కుదరదు. అందుచేత బాలునిలోని భావవిశేషము, అప్రరూడెంద్రీయాత్వాధికము (ఇంద్రియాల గట్టిదనం) గ్రహింపబడుతోంది.
మనుస్మృతి(2, 110):- జ్ఞానియై కూడా తెలియనివాడి లాగా మెలగడమే బుద్ధిమంతుల లక్షణమని మనువు అంటాడు. అనుష్ఠానాదిసాధనాలు ఈజన్మలోనే జ్ఞానోత్పత్తిని కలిగిస్తాయి. వివేకవైరాగ్యలు, యమనియమాదులు, శమదమ తితిక్షాదులు, శ్రవణమననాదులు ఇవన్నీ జ్ఞానసాధనలు. గురువు బోధించి నట్లుగా వీటిని నిరంతరం అభ్యసించడం వలన జ్ఞానప్రాప్తి కలుగుతుంది. ఫలప్రాప్తి కలగనంత వరకు తన ప్రవృత్తిని ప్రకటించకూడదు. ముందుగానే ప్రకటిస్తే సాధకుడికి విఘ్నాలు కలగవచ్చును. అభిమానాదులు ఏర్పడవచ్చును. జ్ఞానం, అధ్యయనం, ధార్మికత్వం, మొదలైన వాటి చేత తాను విఖ్యాతుడిగా చేసికొనకుండా, దంభదర్పాది రహిత్తుడై ఉండాలి. అప్రరూడేంద్రియుడవడం చేత బాలుడే విధంగా పరుల ఎదుట తనని తాను ప్రకటించుకోవడానికి అభిలషించడో, అట్లే ఉపాసకుడు కూడా ప్రవర్తించాలి. రహస్య ధర్మాన్ని అవలంభించిన వాడై, విద్వాంసుడై యుండి, ఎవరికీ తెలియని పద్ధతిలో ప్రవర్తించాలి.
ఐహికాధికరణం ( 3, 4, 51 )
సూత్రం :- 476
" ఐహికమ ప్యప్రస్తుత ప్రతిబంధే తద్దర్శనాత్ "
అప్రస్తుత ప్రతిబంధే అపిః :- అడ్డంకులు కలగకపోయినట్లయితే, ఐహికం :- ఈ జన్మలోనే జ్ఞానం కలుగుతుంది. అని తద్దర్శనాత్ :- కొన్ని నిదర్శనాలు కనిపిస్తున్నాయి.
భావం :- అడ్డంకులు కలగక పోయినట్లయితే ఈ జన్మలోనే జ్ఞానం కలుగుతుందని కొన్ని నిదర్శనలు కనిపిస్తున్నాయి.
వివరణ:-ఈఅధికరణంలో జ్ఞానోత్పత్తి ఈజన్మలోనే కలుగుతుందని చెప్పబడింది. శ్రవణమననాది సాధనలకు కర్మశేషం అడ్డం కానప్పుడు ఈ జన్మలోనే జ్ఞానోత్పత్తి కలుగుతుంది. ఒకవేళ కర్మ ప్రతిబంధకం ఏవైనా ఉంటే మరుజన్మలో జ్ఞానం కలుగుతుంది. జ్ఞానసాధనలన్ని సమకూరి, ఆచరించినప్పుడు బలీయమైన పూర్వ కర్మలు అడ్డు పడకపోతే, ఈ జన్మలోనే జ్ఞానప్రాప్తి కలుగుతుంది. లేదా మరుజన్మలో లభిస్తుంది. వామదేవుడు, కపిలుడు, శుకుడు, మొదలైన వాళ్ళు తమ బాల్యంలోనే జ్ఞానులుగా ఉండటాన్ని నిరూపించే శబ్దప్రమాణాలున్నాయి. కాగా జనకుడు, రైక్వుడు, లాంటివాళ్ళు ఈ జన్మలోనే జ్ఞానులుకావడం ప్రసిద్దమే. వాయుదేవుడికి గర్భంలో ఉండగానే జన్మాంతరశ్రవణం వలన జ్ఞానం కలుగుతుంది. ఒక కర్మఫలాన్ని ఇవ్వడానికి ప్రారంభించడం అనేది దేశం, కాలం, నిమిత్తాల కలయిక వలన జరుగుతుంది. కర్మలు కొన్ని విరుద్దఫలాన్నిచ్చేవిగా ఉంటాయి. ఇతర కర్మల ఫలం ఇవ్వకుండా అడ్డు తగిలితే తమ ఫలం ఇచ్చివేయవచ్చును. వాటి బలాబలాల మీద ఆధారపడి ఉంటుంది. కృష్ణా! చేస్తున్న యోగానికి సిద్ధిని పొందని వాడు ఏ గతిని పొందుతాడు అని భగవద్గీతలో అర్జునుడు శ్రీ కృష్ణుని అడిగాడు. నాయనా! మంచి పని చేసే వాడు ఎవడూ కూడా దుర్గతిని పొందడు కదా! అనేకజన్మల యందు సంసిద్దుడై ఉత్తమగతిని పొందుతాడని చెప్పాడు. ఈజన్మలో కలిగినా, పరలోకంలో కలిగినా విద్యాహక్కు ప్రతిబంధ క్షయాన్ని బట్టి మాత్రమే ఉంటుంది.
ముక్తి ఫలాధికరణం ( 3, 4, 52 )
సూత్రం :- 477
" ఏవం ముక్తిఫలానియమ స్తదవస్థాధృతేః తదవస్థాధృతేః "
ఏవం :- జ్ఞానం లాగా, ముక్తి ఫలానియమం :- జ్ఞాన ఫలమైన ముక్తిలో ఐహిక, ఆముష్మిక భేదాలు లేవు. తత్ అవస్థ ధృతేః :- జ్ఞానావస్థలో ముక్తి లభించడం నిశ్చయం.
భావం :- జ్ఞానం లాగా జ్ఞాన ఫలమైన ముక్తిలో ఐహిక, ఆముష్మిక భేదాలు లేవు. జ్ఞానావస్థలో ముక్తి లభించడం నిశ్చయం.
వివరణ:-గురువుగారు! జ్ఞానానికి ఫలితం ముక్తి కదా! మరి ఆముక్తి అందరికీ కలుగుతుందా? లేక అందులో తారతమ్యం ఉందా? అని అడిగాడు కృష్ణశర్మ. సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. బ్రహ్మ సాక్షాత్కారంలాగానే ముక్తి ఫలంలో కూడా తారతమ్యం లేదని అన్ని ఉపనిషత్తులలో మోక్షంఒక్కటేనని చెప్పబడింది. ముండకోపనిషత్తులో బ్రహ్మవేత్త సాక్షాత్తు బ్రహ్మమే అవుతాడని చెప్పబడింది. నిరాకారుడు, నిర్గుణుడు, భేదరహితుడు అయిన పరమేశ్వరుడే ముక్తికి స్వరూపమని చెప్పబడింది. కనుక ముక్తిలో భేదాలుండవు. బ్రహ్మసాక్షాత్కార రూపమైన జ్ఞానప్రాప్తి కలగడంతోటే మోక్షం లభిస్తుంది. ఈ దశలో జ్ఞానం కలగడం, ముక్తి లభించక పోవడం జరగదు.
ముండకోపనిషత్తు(3,1,3):-జగత్కర్తఅయిన ఈశ్వరుడి సాక్షాత్కారం కలగగానే జ్ఞాని పుణ్యపాపకామనలన్నీ విడిచేసి పరబ్రహ్మ ప్రాప్తి పొందుతాడు. బ్రహ్మప్రాప్తే ముక్తి. కనుక ఐహిక ఆముష్మిక నియమం లేదు. శ్రవణ, మనన, నిధిధ్యాసలను పట్టుదలతో చేస్తే సూక్ష్మాతిసూక్ష్మ మైన ఆత్మచైతన్యం నేనే అనే స్థితికి చేరుకుంటారు. చివర తదవస్థాధృతే అని రెండు సార్లు ప్రయోగించడం అధ్యాయ సమాప్తిని సూచిస్తుంది.
చతుర్ధాధ్యాయము, మొదటిపాదం
ఆవృత్త్యధికరణం ( 4, 1, 1 )
సూత్రం :- 478
" ఆవృత్తి రసకృదుపదేశాత్ "
అసకృత్ :- శాస్త్రాల్లో అనేక మార్లు ఉపదేశించినట్లుగా, ఆవృత్తిః :- నిరంతర అభ్యాసం చెయ్యాలి.
భావం :- శాస్త్రాల్లో అనేక మార్లు ఉపదేశించినట్లుగా నిరంతర అభ్యాసం చెయ్యాలి.
వివరణ:-ఈఅధ్యాయంలో బ్రహ్మజ్ఞానఫలాన్ని, దానికి అంతరంగసాధనం అయిన నిధిధ్యాస అభ్యాసాన్ని ఉపదేశిస్తున్నాడు వ్యాసుడు. వెనుకటి అధ్యాయంలో విద్యాసాధనాలు నిరూపించి, ఈఅధ్యయంలో ఫలం నిరూపించబడుతోంది. మొదటి పాదంలో జీవన్ముక్తి, రెండవ పాదంలో ఉత్క్రాంతి, మూడవ పాదంలో అర్చిరాది మార్గం, నాల్గవ పాదంలో జ్ఞానోపాసనలు, ఫల నిర్ణయం గురించి చర్చించడమైనది. శాస్త్రాల్లో అనేకపర్యాయములు నిర్దేశించినట్లు సాధనల్లో ముఖ్యమైన నిధి ధ్యాసనాన్ని జ్ఞానప్రాప్తి కలిగే వరకు నిరంతరం అభ్యాసం చెయ్యాలి. బ్రహ్మసాక్షాత్కారానికి శ్రవణమననాదులు చేసి, విన్నదానిని మననం ఎన్నిసార్లు చెయ్యాలనే సందేహం వస్తుంది. జ్ఞానాన్ని ఆవృత్తి చెయ్యాలి. విన్నదానిని మరచిపోతాం కనుక అదే విషయం మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉండాలి. జీవభావం పూర్తిగా నశించే వరకు, జ్ఞానప్రాప్తి కలిగే వరకు, సమాధి స్థితి ఏర్పడే వరకు, ఆత్మసాక్షాత్కారం అయ్యేవరకు ఈసాధన చేస్తూనే ఉండాలి. నిరంతరంధ్యానం చెయ్యకపోతే బ్రహ్మ సాక్షాత్కార రూపమైన సమాధి స్థితి ఏర్పడదు. వడ్లు ఎంతసేపు దంపాలి అంటే ధాన్యం దంచేటప్పుడు ఒకటి రెండు సార్లు దెబ్బలు వేసినంత మాత్రాన సరిపోదు. బియ్యం వచ్చే వరకు దంచాలి.
ఛాందోగ్యోపనిషత్తు(6, 8, 7):-సఆత్మా తత్త్వమసి శ్వేతకేతోః" అదిఆత్మ దానిపట్ల నిష్ఠ ఉన్నవాడివికా. అని శ్వేత కేతువుకు ఎన్నో పర్యాయములు బోధించారు. అలాగే ఆత్మసాక్షాత్కారం అయ్యేవరకు వాటిని మననం చేస్తూనే ఉండాలి. భగవద్గీతలో వైరాగ్యంతో నిరంతరం చింతన చేస్తూంటేనే అభ్యాసవైరాగ్యాలు మోక్షసిద్ధిని కలిగిస్తాయని చెప్పబడింది.
ఆవృత్త్యధికరణం ( 4, 1, 2 )
సూత్రం :- 479
" లింగాచ్చ "
చ :- పైగా, లింగాత్ :- శాస్త్ర వచనాల వలన నిధి ధ్యాసనం ఆవృత్తి సిద్ధిస్తోంది.
భావం :- శాస్త్ర వచనాల వలన నిధి ధ్యాసనం ఆవృత్తి సిద్ధిస్తోంది. లింగాలు అంటే శబ్దాలు అని అర్థం. శబ్ద పూర్వకమైన వేదం అని అర్థం.
వివరణ:-ఈవిషయాన్ని నిరూపించే గుణాలు కూడా ఉన్నాయి. ఛాందోగ్యంలో ఆదిత్యుడే ఉద్గీత అంటూ ఒక ఆదిత్యోపాసన వలన ఒక్కపుత్రుడే కలుగుతాడు, కాబట్టి ఆదిత్యకిరణాలను ఆదిత్యునికన్నా భిన్నమైన వాటిని ధ్యానించు అని చెప్పబడింది. ఆత్మజ్ఞానం కావాలంటే విన్నవాటినే మళ్ళీమళ్ళీ వినాలి. మననం చెయ్యాలి. ఒక్క ఆదిత్యున్ని ఉపాసన చేస్తే ఒక్క కుమారుడే కలుగుతాడు. ఈశబ్దం ఒక్కడే కుమారుడు కలిగితే మోక్షం వస్తుంది. ఒక్కడు అంటే లేనట్లేనని చాలామంది పుత్రులను కోరుకునేవారు. ఆదిత్యునికంటే భిన్నంగా ఉండే ఆదిత్యకిరణాలను చాలా సార్లు ఉపాసన చేస్తుంటే మోక్ష సిద్ధి లభిస్తుంది.
బృహదారణ్యాకోపనిషత్తు(4, 5, 6):- బ్రహ్మ సాక్షాత్కారం మానవజీవన లక్ష్యం. కనుక శ్రవణ, మనన, నిధి ధ్యాసనాలు అనే సాధానాల వలన దానిని పొందవచ్చును.
తైత్తరీయెపనిషత్తు(2, 7):- ఉపాసకుడైన జీవుడికి అదృశ్య మైన బ్రహ్మంలో నిర్భాధ ప్రతిష్ట పొందినవాడికే నిర్భయ స్థితి కలుగుతుంది. అలాంటి అభయ స్థితి సంపాదించడానికి నిరంతరంగా ధ్యానం చెయ్యాలి. దీనికి పూర్వ పక్షం వారి వాదన ఉన్నది. సాధ్యములైన ఫలాలు గల ప్రత్యయాలలో అనగా సగుణోపాసనలలో ప్రత్యయాల ఆవృత్తి ఉంటే ఉండవచ్చును. అతిశయం ఉండటానికి అవకాశం ఉంది. పరబ్రహ్మకు సంబంధించిన ఏప్రక్రియ నిత్యశుద్ధబుద్ధముక్త స్వభావమైన ఆత్మ యైన పరబ్రహ్మను అందజేస్తుందో దానికి ఆవృత్తి ఎందుకు? ఆవృత్తి చేసిన కూడా ఆ ప్రతీతి కలగదు కదా! అని సందేహం. తత్త్వమసి అనే మాటకు ఒక్కసారి వినగానే బ్రహ్మజ్ఞానం కలిగించకపోతే దానిని ఆవృత్తి చేసినంత మాత్రాన జ్ఞానం కలిగిస్తుందనే నమ్మకం ఏమిటి అని వారివాదన. ఒకయుక్తివాక్యం చేత కూడా సామాన్యరూపం లోనే జ్ఞానం కలుగుతుంది. విశేషరూపమైన జ్ఞానం కలగదు. ఎలాగంటే నా గుండెలో నొప్పిగా ఉంది. అన్న వాక్యం వలన దేహం వణకడం మొదలైన లింగం వలన అతడు నొప్పితో బాధ పడుతున్నాడని తెలుస్తుంది. కాని ఆ బాధను తాను అనుభవించలేడు. అవిద్య తొలగాలంటే విశేషఅనుభవం ఉండాలి. అందుకే దాని అర్ధం ఆవృత్తి కావాలి. ఎన్ని సార్లు చేసిన విశేషంజ్ఞానం పుట్టదు. ఆ శాస్త్రయుక్తులను వంద సార్లు ప్రయోగించినా కూడా తెలుసుకోవడం శక్యం కాదు కదా! ఆత్మలో అంశాలేవి లేకపోయినా ఆఆత్మమీద ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి విషయాలు, వేదనలు అనేకమైన అంశాలు ఆరోపించబడతాయి. వాటిని తొలగించడానికి జ్ఞానం యుక్తమే. ఛాందోగ్యంలో తత్త్వమసి అని అనేక పర్యాయములు శ్వేత కేతువుకు ఉపదేశించారు. అది ఒకసారి శ్రవణం, మననం చేసినంత మాత్రాన జ్ఞానం కలగదు. సాధారణంగా శ్రవణం, మననం ద్వారా చిత్తాన్ని స్థిరపరచుకున్నప్పటికి ఆ స్థితిలో ఉండాలంటే నిధి ధ్యాసనం చేస్తూనే ఉండాలి. తత్త్వమసి అంటే దాని అర్ధాన్ని జీర్ణం చేసుకోవాలి. దేహేంద్రియ మనోబుద్ధులకు వేరుగా వున్నవాడు పరమాత్మయే. నేనే పరమాత్మ, పరమాత్మే నేను అనే స్థితికి చేరుకోవడానికి నిరంతరంగా నిధి ధ్యాసనం చేస్తూనే ఉండాలి.
ఆత్మత్వోపాసనాధికరణం ( 4, 1, 3 )
సూత్రం :- 480
" ఆత్మీతి తూప గచ్ఛంతి గ్రాహయంతి చ "
ఆత్మా ఇతి తు :- సర్వ వ్యాపక పరబ్రహ్మం అనే, ఉప గచ్ఛంతి :- వైదికులు అంగీకరిస్తారు, గ్రాహయంతి చ :- ఇలాగే ఉపనిషత్తులు, వేదాలు వెల్లడిస్తున్నాయి.
భావం :- నిధి ధ్యాసనానికి విషయం ఏది? సర్వ వ్యాపక పరబ్రహ్మం అనే వైదికులు అంగీకరిస్తారు. ఇలాగే ఉపనిషత్తులు, వేదాలు వెల్లడిస్తున్నాయి.
వివరణ:-గురువు గారు! పరబ్రహ్మోపాసన చేసేటప్పుడు ఆపరమాత్మను నేనే అని భావించలా? పరమాత్మ వేరు, నేను వేరు అని ధ్యానించాలా? అని అడిగాడు కృష్ణశర్మ, దానికి సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. నేనే పరమాత్మను అనే అహంప్రత్యయంతోనే ఉపాసనచెయ్యాలి. అప్పుడే పరబ్రహ్మసాక్షాత్కారం అవుతుంది. ఆపరమాత్మ కోసం సగుణోపాషన చేసినా, నిర్గుణోపాసన చేసినా, నేనే ఆపరమాత్మను అని ఉపాసన చెయ్యాలి. పరమాత్మ వేరు, నేను వేరు అనే ద్వైతం పనికి రాదు. అయమాత్మ బ్రహ్మ , తత్త్వమసి, వంటి మహా వాక్యాలు పరమాత్మ నిత్య, శుద్ధ, బుద్ధ, ముక్త స్వరూపుడని, జీవేశ్వరులు ఒక్కటేనని తెలియజేస్తాయి.
ముండకోపనిషత్తు ( 2, 2, 6 ) :- సర్వ వ్యాపక మైన పరమాత్మను ఓం అని ధ్యానించు.
యజుర్వేదం(32, 11):- వేదాభ్యాసం, ధర్మాచరణం, యోగానుష్ఠానాల మూలంగా చేతన, అచేతన పదార్ధాలస్వరూపాన్ని ఎరిగిన ఉపాసకుడు బ్రహ్మాన్ని ప్రవేశించి, ఆనందాన్ని అనుభవిస్తాడు. కనుక పరమపురుషప్రాప్తికి నిరంతర ఆవృత్తి అవసరం అని సూత్రార్ధం. ద్వైత భావనతో ఉపాసించడమే సమంజసమని పూర్వపక్షివాదన. పరమాత్మ నిరాకారుడు, నిర్గుణుడు, సర్వంతర్యామి. జీవుడు సాకారుడు, కర్త, భోక్త పాప పుణ్య ఫలాలు అనుభవించే వాడు. గుణాలున్నవాడు, దేహేంద్రియ మనోబుద్ధులకు పరిమితం మైనవాడు. జీవేశ్వరులిద్దరి మధ్య అనేక భేదాలుండటం వలన ఇద్దరూ ఒక్కటి కాదని వారి వాదన. అద్వైత భావనతోనే ఇద్దరూ ఒక్కటే అని చెప్పబడింది. ఇద్దరూ ఒక్కటే అయితే అహం బ్రహ్మస్మి అనే ధ్యానం వృధా అని వారి వాదన. ప్రకృతిలో జంతువులు, వృక్షాలు, పశు పక్ష్యాదులు, అంతటా నిండి ఉన్న ఆత్మయే నీలో ఉన్న ఆత్మ. ఆత్మ అంటే పరమాత్మ భావనతో ఉపసించాలి. ఆత్మకు పరమాత్మకు భేదాలు లేవు. నేను పరమాత్మను అనే జ్ఞానం లేకపోవడంతో జీవుడికి, ఈశ్వరుడికి మధ్య భేదాలు కనిపిస్తున్నాయి. ఆ అజ్ఞానంతోనే నేను ఆత్మను అనే సంగతి మరచిపోయి జీవుడినే అనుకుంటారు. ఓ పరమాత్మా నీవే నేను, నేనే నీవు అంటోంది జాబాలోపనిషత్తు. నిరంతర నిధి ధ్యాసనతో మననం చేస్తే దేహేంద్రియ మనోబుద్ధులు నశించి, నేను జీవుడిని కాదు పరమాత్మనే భావన కలుగుతుంది. ఆ తరువాతే మోక్షప్రాప్తి కలుగుతుంది.
ప్రతీకాధికరణం ( 4, 1, 4 )
సూత్రం :- 481
" న ప్రతీకే న హి సః "
ప్రతీకే :- ప్రాకృతిక పదార్ధాలను, న :- ధ్యానం చెయ్యకూడదు. హి :- ఎందుకంటే, సః :- ప్రతీక పదార్ధాలు, న :- ధ్యాన విషయం కానేరావు.
భావం :- ప్రాకృతిక పదార్ధాలను ధ్యానం చెయ్యకూడదు. ఎందుకంటే ప్రతీక పదార్ధాలు ధ్యాన విషయం కానేరావు.
వివరణ:- భగవంతుని బదులుగా ఒక ప్రతీక అంటే ప్రతిమను పెట్టుకొని, దానినే ఇష్టదైవంగా భావిస్తు ధ్యానం చెయ్యడాన్ని ప్రతీకోపాసన అంటారు. ఛాందోగ్యంలో మనస్సే బ్రహ్మ, ఆదిత్యుడే బ్రహ్మ, నామమే బ్రహ్మ అని ఉపాసించాలి. సృష్టిలో కనిపించే వృక్షాలు, మృగాలు, నదులు, పర్వతాలు, ఆకాశం, వాయువు అన్నీ పరమాత్మ సృష్టించినవే. కాని వాటిని ప్రతీకలుగా చేసుకొని ధ్యానించకూడదు. కాబట్టి నేనే బ్రహ్మను, నేనే మనస్సును, నేనే ఆదిత్యుణ్ణి అని ఉపాసించలా? లేక ప్రతీక రూపంలో ఉన్న బ్రహ్మాన్ని ఉపాసించలా? అని పూర్వపక్షంవారి సందేహం. ప్రతీకలో బ్రహ్మబుద్ధి పనికి రాదు. ఎందుచేత నంటే ఉపాసకుడు ప్రతీక స్వరూపుడు కాదు. బంగారు కిరీటం, బంగారు కంకణం రెండింటిలో ఉన్నది బంగారమే. కాని నామరూపాలలో తేడాఉన్నది. అదేవిధంగా ప్రతీకలన్ని బ్రహ్మదృష్టిలో ఏకత్వం ఉన్నప్పటికీ స్వరూపంలో తేడా ఉన్నది. అందువలన నేనే ప్రతీకాన్ని అని ఉపాసించకూడదు. ఆకాశం, వాయువు పరమాత్మచే సృష్టించబడినవి. కాని ఆకాశం బ్రహ్మం కాదు. బ్రహ్మంలక్షణాలను వర్ణించేటప్పుడు వాటిని ఉపమానాలుగా చేసికొని, బ్రహ్మఆకాశంలా విశ్వమంతటా సర్వవ్యాపకమై ఉన్నాడని చెబుతారు. ఏదైనా వ్రతం చేసేటప్పుడు ముందుగా పసుపుముద్దను వినాయకుడిగా ధ్యానిస్తాము. పసుపుముద్దను వినాయకుడు అనకూడదు. ఈప్రాకృతికమైన నామరూపాత్మకమైన జగత్తు సృష్టి వెనుక ఉన్న పరమాత్మతత్త్వాన్ని అవగాహన చేసుకొని, సమాధిస్థితిలో ఉన్న శుద్ధ చైతన్యాన్ని దర్శించి నేనే బ్రహ్మాన్ని అనే ఏకత్వభావనను ఉపాసకుడు పొందగలగాలి. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవి ఏమి నేను కాదు. జ్ఞానేంద్రియాలు నేను కాదు. చిదానందరూపమైన శివుణ్ణి నేను అనుకొని, ఉపాధి లేని స్థితిలో సూక్ష్మాతిసూక్ష్మ మైన, యదార్ధమైన బ్రహ్మాన్ని ఉపాసించాలి. ఉపాసకుడు ఉపాధులన్నీ వదిలించుకొని, ఉపాధులులేని ఆత్మను ఉపాసిం చాలి. ప్రతీకోపాసన చేసేవారికి ఇవిచెప్పబడలేదు. మోక్షాన్నికోరే ముముక్షువులు ఎలాఉపాసించాలో చెప్పబడింది.
బ్రహ్మదృష్ట్యధికరణం ( 4, 1, 5 )
సూత్రం :- 482
" బ్రహ్మ దృష్టి రుత్కర్షాత్ "
ఉత్కర్షాత్ :- ఎంతో ఉత్కృష్టం కావటం వలన, బ్రహ్మ దృష్టిః :- అన్నింటిలో బ్రహ్మాన్ని దర్శించాలి.
భావం :- ఎంతో ఉత్కృష్టం కావటం వలన అన్నింటిలో బ్రహ్మాన్ని దర్శించాలి.
వివరణ:-ఉత్కృష్టమైనవి కాబట్టి మనస్సు మొదలైన వాటి యందు బ్రహ్మ దృష్టి ఉంచి ఉపాసించాలి. నికృష్టమైన సేవకుణ్ణి నువ్వు గొప్పవాడివి, నువ్వే రాజువి అని పొగిడి పనిచేయించుకున్నట్లే, మనస్సును నువ్వే బ్రహ్మవి అని భావించి ఉపాసించాలి. ఛాందోగ్యంలో మనస్సు, ఆకాశం, ఆదిత్యుడులాంటి వాటిని బ్రహ్మభావంతో ఉపాసించాలని చెప్పారు. బ్రహ్మం సర్వవ్యాపకం. కనుక విశ్వం ప్రకటమౌతోంది. ఈవిశ్వంలో ఉండే ప్రాకృతిక పదార్ధాలలో మనస్సు, ఆకాశం, ఆదిత్యుడు మిగతా వాటి కన్నా ఉత్కృష్ట మైనవి. ఆదిత్యడు బ్రహ్మం జ్యోతిర్మ మయం, జ్ఞానాత్మకం అని స్ఫురణకు తెస్తుంది. ఆకాశం బ్రహ్మ వ్యాపకత్వాన్ని గుర్తు చేస్తుంది. ఈవస్తువులన్నీ బ్రహ్మం వలన ప్రకటమౌతు, తమలో ఉండే బ్రహ్మాన్ని స్ఫురణకు తేవడంవలన వాటిని ఉత్కృష్టాలు అన్నారు. శుద్ధమైన మనస్సు ధ్యానానికి సహకరిస్తుంది. తమకు ఇష్టమైన ప్రతీక పెట్టుకొని ఉపాసించాలి. మనస్సుని బ్రహ్మంగానా! బ్రహ్మాన్ని మనసుగా ఉపాసించలా! అలాచెప్పలేరు కనుక బ్రహ్మము నందు దృష్టి ఉంచి ధ్యానించాలని పూర్వపక్షివాదన. మనస్సు, బ్రహ్మం రెండింటిలో ఉత్కృష్టమైనది బ్రహ్మం. కనుక ఉత్కృష్టమైన దానిలో అల్పమైన మనస్సునుఉంచి ఉపాసించాలి. అల్పమైనవాటిలో ఉత్కృష్టమైనవివుంచి ఉపాసించ కూడదు. మనస్సు నందు బ్రహ్మాన్ని ఉంచి, అల్పమైన ప్రాణము నందు బ్రహ్మం పై దృష్టి ఉంచి ఉపాసించాలి. "మనోబ్రహ్మే త్యుపాసీతా" అనే శ్రుతిలో మనస్సుని బ్రహ్మ అని ఉపాసించు. బ్రహ్మాన్ని మనస్సుగా భావించరాదు. మనస్సు మొదలైన జడపదార్ధాలను బ్రహ్మంగాపరిగణించి ఉపశించాల్సిందేనని చెప్పారు. వాటి ఉత్కర్షవలన బ్రహ్మనుపాసించాలని మహర్షులు సూచించారు. కాని అవే బ్రహ్మం అని ఉపాసించడానికి కాదు.
ఆదిత్యాది మత్యధికరణం ( 4, 1, 6 )
సూత్రం :- 483
" ఆదిత్యాది మతయ శ్చాoగ ఉపపత్తేః "
ఉపపత్తేః :- సులభం కావటం వలన, అంగే :- కర్మాంగమైన ఉద్గీథంలో, ఆదిత్యాది మతయః :- ఆదిత్యాది భావనల్ని, చ :- కూడా చెప్పారు.
భావం :- మనస్సే బ్రహ్మ అని భావించి ఉపాసించడం సులభం కావడం వలన కర్మాంగమైన ఉద్గీథంలో ఆదిత్యాది భావనాలను కూడా చెప్పారు.
వివరణ:-కర్మాంగములయందు దేవతాభావం ఉండాలా? అని సంశయం. అంగమైన ఉద్గీథాదికర్మలయందు ఆదిత్య భావం ఉండి తీరాలి. అప్పుడే సంపూర్ణమైన ఫలం లభిస్తుంది. ఈరకమైన ఉపాసనలు కర్మఫలాన్ని సంపాదించు కోవడం కోసం ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి కర్మాంగలైన ఉద్గీథాదుల యందు దేవతాద్రుష్టి ఉండాలి. ఉత్ అంటే ప్రాణం. ఆ ప్రాణం మూలంగానే ఈజగత్తంతా స్థిరమై నిలబడింది. గీథ్ అంటే వాక్కు. ఈవిశ్వాసాన్ని ధరించే ప్రాణమే బ్రహ్మం. ఆయన్ని గానం చేసే గీథ్ అంటే వాక్కు (ఓం కారం)రూపంలో తెలుసుకోవాలి. ఓం పదంలో ఉపాసించి బ్రహ్మాన్ని పొందడమే ఉద్గీథ విద్య.
ఛాందోగ్యోపనిషత్తు:-(1, 3, 1):-"య ఏ వాసౌ తపతి తముద్గీత ముపాసీత" ఈతపించేవాణ్ణి ఉద్గీథబుద్ధితో ఉపాసించాలి అని అర్ధం. అయితే కర్మకు యజ్ఞానికిఅంగాలైన ఉపాసనలవిషయంలో కర్మాంగాలైన ఉద్గీథాదుల్ని ఆదిత్యులుగ పరిగణించాలా? లేక ఆదిత్యాదులను ఉద్గీథాలు అనుకోవాలా? అని సందేహంవస్తే కర్మాంగాలైన ఉద్గీథాదులలో ఆదిత్య భావనతో ఉపాసించడం వలన ఆకర్మలు ఎంతో శక్తిమంతమవుతాయి అంటున్నారు వ్యాసమహర్షి. ఉద్గీథం ఓం కారో చ్చారణ-జపం చెయ్యడంవలన హృదయంలోఉండే అజ్ఞానం, భయం దూరమౌతాయి. అలాగే ఆదిత్యోదయంవలన అంధకారం, భయం ఈలోకంలో అంతరిస్తాయి. కనుక ఉద్గీథాదికర్మాంగాలలో ఆదిత్యాదిభావనతో ఉపాసించాలని చెప్పారు.
ఆసీనాధికరణం ( 4, 1, 7 )
సూత్రం :- 484
" ఆసీనః సంభవాత్ "
ఆసీనః :- కూర్చుని ధ్యానం చెయ్యడం, సంభావత్ :- సులువుగా వీలవుతుంది.
భావం :- నిధి ధ్యాసనం ఎలా చెయ్యాలి? కూర్చుని ధ్యానం చెయ్యడం సులువుగా వీలవుతుంది.
వివరణ:-కర్మాంగాలకు సంబంధించిన ఉపాసనలలో ఉపాసనకర్మ మీద ఆధారపడి ఉంటుంది. కనుక ఆసనాన్ని గురించిన చింత అవసరం లేదు. సమ్యక్ దర్శనం విషయంలో కూడా అది వస్తువుమీద ఆధారపడి ఉంటుంది. అప్పుడు కూడా ఆసనం చింత ఉండదు. ఇతరమైన ఉపాసనలలో ఉపాసన మానసికం గాన కూర్చునే చెయ్యాలని చెబుతున్నారు. ఉపాసకుడు ఆసీనుడై, బ్రహ్మసాక్షాత్కారంకోసం నిత్యం ధ్యానంచెయ్యాలి. కూర్చునే ఉపాసనచేస్తే ద్యాస నేలమీద ఉంటుంది. ముందు ప్రశాంతంగా సిద్ధ పద్మాసనంలోనే స్థిరంగా కూర్చుని ఆతరువాత ఉపాసన చెయ్యాలి. నిలబడి గాని, నడుస్తూగాని, పడుకొనిగాని ధ్యానం చెయ్యకూడదు. అలా చేస్తే విక్షేపాదులు కలుగుతాయి. పడుకొని చేస్తే నిద్రావశుడు కావచ్చును. ఉపాసనఅనగా సమానమైన జ్ఞానప్రవాహాన్ని నడిపించడం అవి నడుస్తున్న వారికీ, పరుగేత్తే వారికీ సంభవం కాదు. నిలబడినప్పుడు మనస్సు దేహాన్ని నిలబెట్టుకోనడంలో వ్యాపకమై ఉంటుంది. సూక్ష్మవస్తువులు చూడజాలదు. శయనించిన వానిమనస్సు అకస్మాత్తుగా నిద్రచేత ఆక్రమింపబడుతుంది. కూర్చున్నప్పుడు ఇలాంటి దోషాలు అనాయాసంగా పరిహరించవచ్చును. గాన ఉపాసన సంభవమౌతుంది. జ్ఞానప్రవాహానికి పరమాత్మ భావనకు ఎటువంటి ఆటంకం లేకుండా ధ్యానంలో నిమగ్నమవ్వాలి. తైలధార ఏ ఆటంకం లేకుండా పై నుండి క్రిందికి ఎలా పడుతుందో, అదే విధంగా ఉపాసకుడు ధ్యానం కూడా కొనసాగాలి.
ఆసీనాధికరణం ( 4, 1, 8 )
సూత్రం :- 485
" ధ్యానాచ్చ "
చ :- పైగా, ధ్యానాత్ :- నిధి ధ్యాసనం అంటే ధ్యానమే.
భావం :- ధ్యానం కూర్చునే చెయ్యాలి. పైగా నిధి ధ్యాసనం అంటే ధ్యానమే.
వివరణ:-ఉపాసన ధ్యానరూపమైనది. కాబట్టి కూర్చునే చెయ్యాలి. ఉపాసన అంటేనే ధ్యానం. ఏకాగ్రచిత్తంతో స్థిరంగా తన యొక్క ఆసనాన్ని పవిత్రమైన ప్రదేశంలో స్థిరంగా ఉంచుకొని, ఆసనభద్దుడై, లక్ష్యాన్ని సాధించడానికి ధ్యానంచెయ్యాలి. అష్టాంగయోగంలో ధ్యానం ఏడవది. అది చిత్తఏకగ్రాత వలనే కలుగుతుంది. ఏకాగ్రతకు ఒక ఆసనంలో పరిమితం కావడం ముఖ్యం. అష్టాంగాలలో ఆసనం మూడవది. యోగశాస్త్రంలో పద్మాసనం మొదలైన ఆసనాలు చెప్పబడ్డాయి.
సూత్రం :- 486
" అచలత్వం చాపేక్ష్య "
ధ్యానంలో అచలత్వం చ :- నిశ్చలత్వం కూడా, అపేక్ష్య :- కావాలి.
భావం :- ధ్యానంలో నిశ్చలత్వం కూడా కావాలి.
వివరణ:-నిధిధ్యాసనం చేసే ముందు ముముక్షువు అంగ చంచత్వం పోగొట్టుకోవాలి. శరీరంలోని అవయవాలు చలిస్తుంటే చిత్త ఏకాగ్రత సాధించడం సాధ్యం కాదు. అచలం అంటే కదలలేనిది, నిశ్చలంగా కదలకుండా ఉండేది అని అర్ధం. అదే విధంగా పృధివి ధ్యానంచేస్తున్నట్లుగా ఉన్నది అంటే కదలకుండా, నిశ్చలంగా ఉండటం. ఒక చెట్టు కొమ్మ కదిలిస్తే చెట్టంతా కదులుతుంది. అవయవాలు చలిస్తుంటే చిత్తఏకగ్రాత సాధ్యం కాదు. కనుక ఉపాసన ధ్యాన సంబంధమైనది కనుక ధ్యానం చేసేటప్పుడు నిశ్చలత్వం అవసరమని, అది స్థిరంగా కూర్చుని ఉన్నప్పుడే సాధ్యమౌతుందని చెప్పబడింది.
సూత్రం :- 487
" స్మరంతి చ "
స్మరంతి చ :- పతంజలి మహర్షి కూడా కూర్చునే ధ్యానించాలని చెప్పాడు.
భావం :- పతంజలి మహర్షి కూడా కూర్చునే ధ్యానించాలని చెప్పాడు.
వివరణ:-స్మృతులలోకూడా ఇదే చెప్పబడింది. ఉపాసకుడు పరిశుద్ధమైన స్థలంలో ఆసనం ఏర్పాటు చేసుకోవాలని స్మృతులు చెబుతున్నాయి.
యోగదర్శనం(2, 29):- "యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణా, ధ్యాన సమాధయోష్టావంగాని " ఈ సోపానం క్రమంలో ఆసనం మూడవది, కాగా ధ్యానం ఏడవది. ఉపాసనకు అంగం అని శిస్టులు "శు చౌ... ఆత్మనః " తన యొక్క ఆసనాన్ని పవిత్రమైన ప్రదేశంలో స్థిరంగా ఉంచుకొని ధ్యానంచెయ్యాలి. అందువల్లనే యోగశాస్త్రంలో పద్మకం మొదలైన ఆసనాల గురించి చెప్పబడింది. ఉపాసకుడు తానే బ్రహ్మం అని తెలుసుకునే వరకు సమాధిపర్యంతం చేసే ధ్యానాన్ని నిధి ధ్యాసనం అంటారు.
ఏకాగ్రతాధికరణము ( 4, 1, 11 )
సూత్రం :- 488
" యత్రైకాగ్రతా తత్రా విశేషాత్ "
అవిశేషాత్ :- నిధి ధ్యాసనం, చిత్త ఏకాగ్రత :- వీటిలో విశేషమైన తేడా లేదు. యత్ర :- ఎక్కడ, ఏకాగ్రత్త :- చిత్త ఏకాగ్రత్త కలుగుతుందో, తత్ర :- అక్కడే ధ్యానం చెయ్యాలి.
భావం:- నిధిధ్యాసనం వీటిలో విశేషమైన తేడా లేదు. దాదాపు సమానం. అందువలన ఎక్కడ చిత్త ఏకాగ్రత కలుగుతుందో, అక్కడే ధ్యానం చెయ్యాలి.
వివరణ:- ఈఅధికరణంలో మనస్సు ఏకాగ్రతే ప్రధానం అని చెప్పబడింది. ఎప్పుడు, ఎక్కడ ఏ దిక్కుగా ఎలా అయితే మనస్సు ప్రశాంతంగా, ఏకాగ్రతగా ఉంటుందో ఆ విధంగానే ఉపాసన చెయ్యాలి. దిక్కులు, దేశకాలాలు అనే నియమాలు కర్మలకే ఉంటాయి కాని ఉపాసనలకు ఉండవు.
శ్వేతాశ్వరోపనిషత్తు(2, 10):- స్థలం, సమం శుద్ధంగా ఉండాలి. కంకర, అగ్ని, ఇసుక ఉండరాదు. ధ్వని, జలం, ప్రదేశం మనస్సుకు అనుకూలంగా ఉండాలి. ఇలాంటి కంటికి ఇంపైన గుహలో గాని, ఈదురుగాలులు వీచని ప్రదేశంలో గాని ధ్యానం చెయ్యాలి. ఇవన్నీ చిత్తఏకాగ్రతకు అనుకూలంగా ఉండాలని గ్రహించాలి. చిత్తఏకగ్రత ఎక్కడ లభిస్తుందో అక్కడే ధ్యానం చెయ్యాలి. దీనికి దేశ, కాలాది భేదాలు అంతగా పాటించవలసిన అవసరం లేదు. అయితే మనస్సుకు నచ్చిన ప్రదేశంలో ఆహ్లాదకరమైన ప్రశాంతవాతావరణంలో సుఖాసనంమీద కూర్చుని ఉపాసన చెయ్యాలి. ఇవి ఉన్నప్పటికీ ఏకాగ్రత లేనిదే ఫలితం రాదు. కాబట్టి ముందుగా ఏకాగ్రత ప్రధానమని చెప్పబడింది.
ఆప్రాయణాధికరణం ( 4, 1, 12 )
సూత్రం :- 489
ఆ ప్రాణాయాత్ తత్రాపి హి దృష్టమ్
" ఆ ప్రాణాయాత్ :- మరణం కలిగే వరకు ధ్యానం చెయ్యాలి. హి :- అని, తత్ర అపి దృష్టమ్ :- శాస్త్ర విధుల్లో నిర్దేశించారు.
భావం :- మరణం కలిగే వరకు ధ్యానం చెయ్యాలని శాస్త్ర విధుల్లో నిర్దేశించారు.
వివరణ:- ఈ అధికారణంలో మరణపర్యంతం ధ్యానం చెయ్యాలని చెప్పబడింది.
ప్రశ్నపనిషత్తు(5, 1):- మనుషులు మరణపర్యంతం వరకు ఓంకారాన్ని ధ్యానించాలి. కనుక, నిరంతరం సత్కారబుద్ధితో బ్రహ్మసాక్షాత్కారం కలిగే వరకు ధ్యానం చేయాలనీ తెలుస్తోంది. దేహపాతం జరిగేంతవరకు స్థిరత్వంకోసం యత్నించాలి. ఇలా నిరంతరం నిధి ధ్యాసనం చేయటం వలన జ్ఞానం కలుగుతుంది. ఉపాసకులు కర్మల లాగానే కొంతకాలం పాటు చేసి వదలివేయవచ్చును. జీవితాంతం చెయ్యవలసిన అవసరం లేదని ప్రతిపక్షవాదన. అది సరియైనది కాదు. ఉపాసనలు మరణం పర్యంతం చెయ్యవలసినదేనని వేదాలు చెబుతున్నాయి. మరణం సమయంలో ఏఆలోచనలతో ఉంటే జీవుడు ఆ లోకాలకే పోతాడు. ఆజన్మ ఎత్తుతాడు. జడభరతుడు ఎందుకు ఉదాహరణ. ప్రాణత్యాగ పర్యంతం ఆవర్తనం చేస్తూనే ఉండాలి. ఎందుకంటే చివరి ప్రయత్నాన్ని బట్టి అదృష్టఫలం లభిస్తుంది. జన్మాన్తరంలో అనుభవించదగిన ఫలాన్ని ప్రారంభిస్తున్న కర్మలుకూడా అలాంటి భావం ఉంటేనే కాని అవి ఫలప్రారంభం చెయ్యజాలవు. ఏలోకాన్ని గురించి సంకల్పం ఆసంకల్పించబడిన లోకంలో కూడా ఫలస్ఫూర్తి కలిగిన తరువాత మనస్సు ప్రాణంతో లీనం అవుతుంది. ప్రాణం తేజస్సుతో కూడి జీవునితో కూడా సంకల్పించబడిన లోకానికి తీసుకొని వెడుతుంది. తృణజలూకా న్యాయం కూడా చెప్పబడింది. గడ్డి మీద సంచరించే ఒక జలగ వంటి పురుగు అవతల నున్ను గడ్డి పరకను మునుగాళ్ళతో పట్టుకొని, తరువాత వెనుక నున్న గడ్డి పరక మీద తన పట్టును వదులుతుంది. అట్లే జీవుడు భావన ద్వారా రాబోయే శరీరాన్ని పట్టుకొని ఈ శరీరాన్ని వదులుతాడని శృతి వాక్యంలో చెప్పబడింది. అందువలన ప్రాణత్యాగ పర్యంతం ఉపాసకుడు నిత్యం ధ్యానిస్తూనే ఉండాలి.
తదధిగమాధికరణం ( 4, 1, 13 )
సూత్రం :- 490
" తదధిగమ ఉత్తర పూర్వఘయో రశ్లేష వినాశౌతత్ వ్యపదేశాత్ "
తత్ అధిగమ :- పరమాత్మ సాక్షాత్కారం కలిగిన తరువాత, ఉత్తర పూర్వ అఘయోః :- ఇది వరకటి, తరువాత పాపాలు సైతం, అశ్లేష వినాశౌ :- నిశ్శషంగా నశిస్తాయి., తత్ వ్యపదేశాత్ :- శాస్త్రాల్లో చెప్పారు.
భావం:-పరమాత్మసాక్షాత్కారం కలిగిన తరువాత ఇది వరకటి, తరువాత పాపాలు సైతం నిశ్శేషంగా నశిస్తాయని శాస్త్రాల్లో చెప్పారు.
వివరణ:-ఈఅధికరణంలో జ్ఞానికి పూర్వోత్తరకృతపాపాలు అంటవని చెప్పబడింది. బ్రహ్మ సాక్షాత్కారం వలన పాప మంతా నశిస్తుందా, నశించిందా? అని సంశయం. నిరంతర నిధి ధ్యాసనం అభ్యసించడం వలన పరబ్రహ్మ సాక్షాత్కారమవుతుంది. అప్పుడు పూర్వోత్తర పాపాలన్నీ నశిస్తాయి. వాటితో ఏసంబంధం ఉండదు. బ్రహ్మజ్ఞానం కలగడమే మోక్షం. అప్పుడు జ్ఞాని పాపకార్యాలు ఆచరించడు. అతనికి పాపసంబంధం తెగిపోతుంది. పూర్వకృతపాపాలు జ్ఞానాగ్నితో దగ్ధమౌతాయి. తామరాకుమీద నీటిబొట్టు ఏరకంగా దానికిఅంటదో, అలాగే బ్రహ్మజ్ఞానికి పాపం అంటదు. బ్రహ్మజ్ఞానికి వెనుకటి పాపాలతోను, రాబోయే పాపాలతోను ఎట్టి సంబంధం ఉండదు.
ఛాందోగ్యం(4, 14, 3):- కమలపత్రానికి జలం అంటనట్లు బ్రహ్మజ్ఞానికి పాపాలు అంటవు. (5,24,3) :-సన్నటి పుల్ల చివరలో ఉన్న దూదిలాంటి కోమల పుష్పం అగ్నిని తాకి వెంటనే దగ్ధమైనట్లుగా, బ్రహ్మజ్ఞాని పూర్వపాపాలాన్ని నశిస్తాయి అంటే పూర్వసంచితపాపాలు జ్ఞానంతో దగ్ధమౌతాయి. పాపసంబంధం లేదంటున్నారు. కర్మలకు క్షయం ఉండదు. పాపకర్మలైన పుణ్యకర్మలైన అనుభవించితీరాలి. కొన్ని కర్మలకు ప్రాయిశ్చిత్తంగా కొన్ని పరిష్కారమార్గాలు చెప్పబడ్డాయి. ప్రాయిశ్చిత్తo లేని కర్మలు అనుభవించాలి. ఎన్నియుగాలైన కర్మ ఫలితం అనుభవించవలసినదే అని పూర్వపక్షవాదన. బ్రహ్మజ్ఞానం కలిగిన తరువాత వెనుకటి పాపాలు నశించిపోతాయి. అజ్ఞానం తొలగిపోయిన తరువాత జీవుడు జీవభావం విడిచిన తరువాత, ఆత్మ భావం వచ్చిన తరువాత చేసిన కర్మలు, చేయబోయే కర్మలు నశిస్తాయి. కాని ఈ దేహం ఎంతకాలం ఉండాలో అంత వరకు ఏదో ఒక కర్మ చెయ్యకుండా ఉండరు. వారు చేసిన పుణ్యకర్మలు వారిని సేవించిన వారికీ, గురువు ఉపదేశం పొందిన వారికి చేరతాయి. ఒకవేళపాప కర్మ చేస్తే వారిని ధూషించిన వారికి, విమర్శించిన వారికీ, బాధ పెట్టిన వారికీ ఆ పాపకర్మల ఫలితం తగులుతుంది. బ్రహ్మజ్ఞానం వచ్చిన వారికీ ఏ కర్మ ఫలితాలు అంటవు.
ఇతర సంశ్లేషాధికరణం ( 4, 1, 14 )
సూత్రం :- 491
" ఇతరస్యా ప్లేవ మసంశ్లేషః పాతే తు "
ఇతరస్య అపి :- పుణ్యంతో కూడా బ్రహ్మ జ్ఞానికి, ఏవం :- అలాగే, అసంశ్లేషః :- సంబంధం ఉండదు, పాతే తు :- శరీరం పతనం తరువాత బ్రహ్మ ప్రాప్తి కలుగుతుంది.
భావం :- పూర్వోత్తర పాపాలతో సంబంధం లేనట్లుగానే పుణ్యంతో కూడా బ్రహ్మజ్ఞానికి సంబంధం ఉండదు.శరీరం పతనం తరువాత బ్రహ్మ ప్రాప్తి కలుగుతుంది.
వివరణ:-బ్రహ్మజ్ఞానికి పాపాలుఅంటవు. మరి చేసిన పుణ్యాల సంగతేమిటని సందేహం రావచ్చును. బ్రహ్మజ్ఞానికి పాపమే కాదు. పుణ్యంకూడా అంటదు. అవిరెండూ నశించిపోతాయి. ఆలా నశించకపోతే వాటిని అనుభవించడానికి అతను మళ్ళీ ఈ లోకంలో జన్మించాలి. కాబట్టి బ్రహ్మవేత్త పుణ్య,పాపాలు రెండింటి నుంచి తరిస్తాడు.
బృహదారణ్యాకోపనిషత్తు :- ( 4, 4, 22 ) :- బ్రహ్మజ్ఞాని పాప పుణ్యాలు రెండింటిని తరిస్తాడు.
ముండకోపనిషత్తు(2, 2, 8):- పరబ్రహ్మసాక్షాత్కారం చేసుకున్న వాడికి కర్మలన్నూ క్షయిస్తాయి. దేహాన్ని ప్రారబ్దకర్మలు విడిచిపెట్టవు. అవి అనుభవించితీరాలి. కాగా ఇతర సంచితకర్మలు బ్రహ్మజ్ఞానిని అంటవు. ప్రారబ్దకర్మల భోగానంతరం అతడికి దేహపాతం జరుగుతుంది. బ్రహ్మజ్ఞానం కలిగిన తరువాత అతడికి ముందు, తరువాత చేసిన పుణ్యాలతో సంబంధం ఉండదు. ప్రారబ్దకర్మఫలాన్ని అనుభవించిన తరువాత ముక్తుడౌతాడు. బ్రహ్మసాక్షాత్కారం పొందిన ఉపాసకుడు పుణ్యపాపాలతో బద్ధుడుకాక, ప్రారబ్దకర్మ ఫలభోగానంతరం దేహాన్నివిడిచి బ్రహ్మంతో నిరాటంకంగా ఆనందాన్ని అనుభ విస్తాడు. పుణ్యం నశించేది కాదు. ఎందుకంటే జ్ఞానానికి పుణ్యానికి విరోధం లేదు. పుణ్యం అలాగే ఉంటుందని పూర్వ పక్ష వాదన. బ్రహ్మజ్ఞానికి పాపంతో బాటే పుణ్యం కూడా నశిస్తుంది. పుణ్యఫలం పోకపోతే దానిని అనుభవించడానికి మరల జన్మ వస్తుంది. దొంగతనం చేస్తూ పట్టుబడిన ఒక దొంగను రాజభటులు తరుముకొని వస్తుంటే, అతనికి పెద్ద బండరాయి తలకి తగిలి చనిపోతాడు. ఇప్పుడు భటులు శిక్ష వేయడానికి దొంగ లేడు కదా! అదే విధంగా పాపకర్మలు, పుణ్య కర్మలు చేసిన జీవుడు బ్రహ్మజ్ఞానం పొందగానే అతనిలోని జీవుడు నశిస్తాడు కనుక చేసిన కర్మ ఫలాలు అనుభవించలేడు. అందుకే బ్రహ్మవేత్త రెండింటి నుంచి తరిస్తాడు.
అనారబ్దాధికరణము ( 4, 1, 15 )
సూత్రం :- 492
" అనారబ్ధ కార్యే ఏవతు పూర్వే తదవధేః "
అనారబ్ధ కార్యే :-ఏ పుణ్యపాపాలు తమ ఫలాన్ని అనుభవించేటట్లు చేయడానికి శరీర రూప కార్యాన్ని ప్రారంభించలేదో, ఆ పుణ్యపాపాలు, ఏవతు:- మాత్రమే, పూర్వే:- ఈజన్మలో చేసిన సంచితకర్మలు, తత్ అవధేః :-వాటికీ బ్రహ్మజ్ఞానమే అవధి.
భావం :- ఏ పుణ్య పాపాలు తమ ఫలాన్ని అనుభవించేటట్లు చేయడానికి శరీర రూప కార్యాన్ని ప్రారంభించలేదో, ఆ పుణ్య పాపాలు మాత్రమే ఈ జన్మలో చేసిన సంచిత కర్మలు, వాటికీ బ్రహ్మజ్ఞానమే అవధి.
వివరణ:-బ్రహ్మజ్ఞానికి అరబ్ద, అనారబ్దకర్మలు రెండూ నశిస్తాయి. అనారబ్ద కర్మలు అంటే పూర్వకర్మలు, సంచితకర్మలు మాత్రమే జ్ఞానం వలన నశిస్తాయి. అరబ్ద కర్మలనే ప్రారబ్ధ కర్మలు అంటారు.ఇవి ఫలితం ఆరంభించిన కార్యాలు అరబ్ద కర్మలు అనబడతాయి. ఫలితం ఇవ్వడం ప్రారంభించని కర్మలు అనారబ్జ కర్మలు అంటారు.
ఛాందోగ్యోపనిషత్తు(6, 14, 2):-బ్రహ్మజ్ఞానికి దేహపాతం కలిగేవరకు ముక్తి లభించడంలో ఆలస్యం అవుతుందన్నారు. కాగా సంచిత, పాపపుణ్యాలు రెండూ జ్ఞానాగ్నిలో నశిస్తాయంటున్నారు. మరి అగ్నిహోత్రాది శుభకర్మలను ఎవరు ఆచరించాలి. ప్రారబ్దకర్మలు వదలిపెట్టిన బాణంలాంటివి. వాటివేగం తగ్గించడం ఎవరివల్లా కాదు. అనారబ్ద కర్మలు అమ్ముల పొదిలోని బాణాల్లాంటివి. కాబట్టి జ్ఞాని అనారబ్దకర్మలను నాశనంచేసుకోగలడు. ప్రారబ్దకర్మల నుండి తప్పించుకోలేము. బ్రహ్మజ్ఞానికి శరీరపాతం వరకు ప్రారబ్దం ఉంటుంది. శరీరపాతం జరగగానే అతనికి ముక్తి లభిస్తుంది. అతడే జీవన్ముక్తుడు. కర్మ ఫలాన్ని అనుభవించడానికి ఒకానొక దేహం లభిస్తుందో అవి ప్రారబ్దాలు. ఇప్పుడున్న దేహంతో చేసే కర్మలు క్రియా మాణాలు. వీటిలో కొన్ని ప్రారబ్దకర్మలను అనుభవించడానికి తోడ్పడతాయి. ఈ క్రియమాణ కర్మలఫలాన్ని ప్రారబ్ద కర్మల్తో బాటు అనుభవించాలి. అలా ఈదేహంతో అనుభవించడానికి వీలులేని క్రియామాణాలు సంచితకర్మలలో జమ అవుతాయి. ఈజన్మలోనూ, పూర్వజన్మలోనూ చేసిన కర్మల్ని, ఈజన్మలో అనుభవించడానికి వీలుకాని కర్మలను సంచితాలు అంటారు. ఇలాంటి కర్మలనే అనారబ్దకర్మలు అన్నారు. బ్రహ్మజ్ఞానం కలిగిన తరువాత ఆజ్ఞానాగ్నివలన సంచిత కర్మలన్నీ నశిస్తాయి. ప్రారబ్దకర్మలు నశించవు. వాటిని అనుభవించి తీరాలి. భోగంవలన ప్రారబ్దకర్మలు నశించడం తోటే దేహం పతనమౌతుంది. అతనికి ముక్తి లభిస్తుంది. అతనే జీవన్ముక్తుడు.
అగ్ని హోత్రాధికరణం ( 4, 1, 16 )
సూత్రం :- 493
" అగ్ని హోత్రాది తు తత్కార్యాయైన తద్దర్శనాత్ "
అగ్ని హోత్రాది తు :- అగ్ని హోత్రం, అధ్యయనం లాంటి ఆశ్రమ విహిత శుభ కర్మలు మాత్రం, తత్ కార్యాయ ఏ వ :- జ్ఞాన ప్రాప్తి కొరకే అని, తద్దర్శనాత్ :- శాస్త్రాలంటున్నాయి.
భావం :- అగ్నిహోత్రం, అధ్యయనం లాంటి ఆశ్రమ విహిత శుభ కర్మలు మాత్రం జ్ఞాన ప్రాప్తి కొరకే అని శాస్త్రాలంటున్నాయి.
వివరణ:-నిత్యనైమిత్తికకర్మలు మోక్షంకోరుకునే వారు చెయ్యాలా? వద్దా? అని సందేహం. మోక్షాన్ని కోరుకునేవారు మోక్ష సాధనకి సంబంధించిన కర్మలు చెయ్యాలి కాని నిత్యనైమిత్తిక కర్మలు చెయ్యవలసిన అవసరం లేదు. జ్ఞాన ప్రాప్తి కలిగిన తరువాత కర్మలన్ని నశించిపోతాయి కదా అని పూర్వపక్షవాదన. అగ్నిహోత్రం, వేదాధ్యయనం, సంద్యోపాసన లాంటి కర్మల్ని ఆయా ఆశ్రమాలలో కర్తవ్యలుగా విధించారు. వాటి ఫలం నశించదు. ఈ నిత్యకర్మలు మనస్సుకి ప్రశాంతతను చేకూరుస్తాయి. ఆత్మజ్ఞానం సంపాదించడానికి సహాయపడతాయి. మనస్సు ప్రశంతంగా ఉంటే బుద్ధిసూక్ష్మత ఏర్పడి, ఉపనిషత్తులు అవగతమౌతాయి. వేదాధ్యయనంవలన ఆత్మజ్ఞానం పొందానికి పరోక్షంగా ఈ నిత్యనైమిత్తికకర్మలు అవసరం. ఈ నిత్యకర్మలు జ్ఞానోత్పత్తికొరకే చెయ్యాలి. వీటిని అనుష్ఠించడంవలన చిత్తశుద్ధి కలిగి జ్ఞానోదయం అవుతుంది. దాని వలన కర్మ నశిస్తుంది. అదే వీటి ఫలం. అందుకే వీటికి నాశనం లేదు. ఇలాంటి కర్మలను శాస్త్రం కూడా విధిస్తోంది.
బృహదారణ్యాకోపనిషత్తు(4, 4, 22):-బ్రాహ్మణులు వేదాధ్యయనం, యజ్ఞం, దానం, నశించని తపస్సు. వీటి వలన పరమాత్మను తెలుసుకోవాలనుకుంటారు. కనుక ఆశ్రమవిహితకర్మలు బ్రహ్మజ్ఞాన సాధకాలు, ఫలోత్పాదకాలు, అనాశకాలు. ఈ అగ్నిహోత్రాది నిత్యనైమిత్తిక కర్మలు అన్ని జ్ఞానంతో సాధించే మోక్షం కోసమే. కర్మ కనుక ఫలం ఇవ్వకుండా నశిస్తే అది నాశన మౌతుంది. ఈ నిత్య కర్మలు ఫలం ఇచ్చి నశిస్తాయి. ఆ ఫలమే జ్ఞానం.
అగ్నిహోత్రాద్యధికరణం ( 4, 1, 17 )
సూత్రం :- 494
" అతోన్యాపి హ్యేకేషా ముభయోః "
అతః :- అగ్ని హోత్రాదుల కన్నా, అన్యా అపి :- వేరేవి కూడా ఉన్నాయి, హి :- ఎందుకంటే, ఉభయోః :- వాటికీ శుభాశుభ కర్మల ఫలితాలున్నాయని, ఏకేషామ్ :- కొందరంటారు.
భావం :- అగ్ని హోత్రాదుల కన్నా వేరేవి కూడా ఉన్నాయి. ఎందుకంటే వాటికీ శుభాశుభ కర్మల ఫలితాలున్నాయని కొందరంటారు.
వివరణ:- కొన్ని శాఖల వారి అభిప్రాయంలో అగ్నిహోత్రాది నిత్య కర్మల కన్నా స్వర్గ ప్రాప్తి కోసం చేసే కర్మలు వేరు. ఈ విషయాన్ని జైమిని, వ్యాసుడు కూడా ఒప్పుకున్నారు. కర్మలు నాలుగు రకాలు.1. నిత్య కర్మలు, 2. నైమిత్తిక కర్మలు, 3. కామ్య కర్మలు, 4. నిషిద్ద కర్మలు. శాస్త్రం విధించిన ఆశ్రమ కర్మలు నిత్యకర్మలు, కామ్యకర్మలు అని రెండు రకాలు. అగ్ని హోత్రాదులు నిత్య కర్మలు. ఒక ఫలితాన్ని ఆశించి చేసేవి కామ్య కర్మలు. సంపద, సంతానం, హోదా, అధికారం కోసం చేసే కర్మలు, వాజపేయం, రాజసూయం లాంటి కర్మలు. ఈ కామ్య కర్మలు జీవాత్మను కర్మ చక్రంలో మరింత బంధించి వేస్తాయి. ఇవి పునర్జన్మకు కారణమౌతాయి. యజ్ఞ యాగాదులు నిష్కామ కర్మలు. వీటికి బ్రహ్మ జ్ఞానమే ఫలితం.
ముండకోపనిషత్తు ( 3, 1, 3 ) :- జ్ఞానికి పుణ్య పాపాలు నశిస్తాయి.
కౌషీతకీబ్రాహ్మణం (1, 4):- అప్పుడు పుణ్య పాపాలు రెండూ నశిస్తాయి. కనుక జ్ఞానం వలన కామ్య కర్మల వలన వచ్చే ఫలితాలు కూడా నశిస్తాయని అర్ధం చేసుకోవాలి. కామ్యకర్మలు జ్ఞానోత్పత్తికి కారకాలు కావు. అవి కోరికలను తీరుస్తాయి. కామ్య కర్మల ఫలాలు అనుభవించడానికి ముందే ఒక వ్యక్తి సాధన సంపత్తి వలన బ్రహ్మజ్ఞానం పొందాడని అనుకుందాం. అప్పుడు అతనికి ఆ వాజపేయాది కర్మలు నశిస్తాయి. నిత్య నైమిత్తిక కర్మలు మోక్షాపేక్ష కలవారు ఆచరించదగిన కర్మలే.
విద్యా జ్ఞాన సాధనాధికరణం ( 4, 1, 18 )
సూత్రం :- 495
" యదేవ విద్యయేతి హి "
యదేవ విద్య యేతి హి, యదేవ విద్యయా ఇతి :- ఏది విద్యతో అని ఛాందోగ్య వాక్యం వలన, హి :- నిశ్చయంగా, ఉపాసనతో కూడిన కర్మే జ్ఞానరూప ఫలం ఇస్తుంది.
భావం :- ఏది విద్యతో అని ఛాందోగ్య వాక్యం వలన నిశ్చయంగా, ఉపాసనతో కూడిన కర్మే జ్ఞానరూప ఫలం ఇస్తుంది.
వివరణ:-కర్మలు రెండు రకాలు 1. జ్ఞానంతో కూడిన ఉపసనా కర్మలు, 2.జ్ఞానం లేని ఉపాసన లేని కర్మలు. జ్ఞానంతో కూడిన ఉపాసనా కర్మలే మోక్షాన్ని ఇస్తాయి. కాని జ్ఞానంలేని కర్మల వలన ప్రయోజనం లేదు. వాటిని ఆచరించకూడదు అని పూర్వపక్షవాదన. జ్ఞానసహితకర్మలు, జ్ఞానరహితకర్మలు రెండూ బ్రహ్మ జ్ఞానానికి సాధనాలవుతాయని సూత్రకారుడి అభిప్రాయం.
ఛాందోగ్యోపనిషత్తు(1, 1, 10):-శ్రద్దాపూర్వకంగా విధిని అనుసరించి ఉపాసనసహితంగా చేసిన కర్మ ఎంతో బలవత్తరమైనది అని పఠిస్తున్నారు. ఉపాసన వేరు, కర్మ వేరు. ఉపాసనతో కూడిన కర్మ చిత్తశుద్ధిని కలిగించి జ్ఞానాన్ని ఇస్తుందా? లేక ఉపాసన లేని కర్మ జ్ఞానాన్నిస్తుందా? అని సందేహం. కామ్యకర్మలు, నిష్కామకర్మలు రెండూ చిత్తశుద్ధిని కలిగిస్తాయి. కాని శ్రద్ధతో చేసిన కర్మ, జ్ఞానసహితమైనకర్మ ఎక్కువ ఫల దాయకం ఇస్తుంది. శీఘ్రంగా కోరిన ఫలాన్ని ఇస్తుంది. ఉపాసనారహిత కర్మలైన యజ్ఞం, దానం, తపస్సు సైతం చిత్త శుద్ధిని ఏదో ఒక విధంగా మోక్షాన్ని ఇవ్వడానికి సహాయ పడుతాయి. శుభకర్మ కర్తని మంచి మార్గంలో నడిపిస్తుంది. ఆతరువాత నిష్కామకర్మ ఎక్కువ ఫలదాయకం. కేవలం కర్మవలన మాత్రమే జ్ఞానప్రాప్తికలగదు. ఉపాసనాసహితమైన ఓంకారోపాసన శీఘ్రంగా జ్ఞానం కలిగించడానికి హితకరమని చెప్పబడింది. జ్ఞానప్రాప్తి కలగాలంటే శాస్త్ర విహిత ఉపసనా సహిత కర్మలు నిర్వహించాలి.
ఇతరక్ష పణధికరణం ( 4, 1, 19 )
సూత్రం :- 496
" భోగేన, త్విత, రే క్షపయిత్వా, సంపద్యతే
భోగేన తు :- ఉపాసకుడు ప్రారబ్ద కర్మ ఫలాన్ని అనుభవించే, ఇతరే :- సుకృత, దుష్కృత కర్మలు, క్షపయిత్వా :- నాశనం అయిన తరువాత, సంపద్యతే :- బ్రహ్మాన్ని పొందుతాడు.
భావం :- ఉపాసకుడు ప్రారబ్ద కర్మ ఫలాన్ని అనుభవించే సుకృత, దుష్కృత కర్మలు నాశనం అయిన తరువాత బ్రహ్మాన్ని పొందుతాడు.
వివరణ:-గురువుగారు! బ్రహ్మజ్ఞానం పొంది, మోక్షానికి అధికారియై, ప్రారబ్దవశాన దేహపాతం వరకు జీవించి ఉన్నట్లే దేహపాతం తరువాత కూడా ప్రారబ్దం అనుభవించడం కోసం శరీరం ధరించవలసి వస్తే అప్పుడు ముక్తి కలుగుతుందా? అని అడిగాడు కృష్ణశర్మ. ప్రారబ్దకర్మ అనుభవించగానే, కర్మక్షయమై, దేహపాతం జరుగుతుంది. బ్రహ్మజ్ఞానం కలిగిన తరువాత సంచితకర్మలు నాశనమౌతాయి. ప్రారబ్దకర్మలు తప్పనిసరిగా అనుభవవించే వరకు దేహం ఉంటుంది. కర్మ క్షయం కాగానే, దేహపాతం జరిగిన తరువాత మరల జన్మరాదు. సంచితకర్మలు బ్రహ్మజ్ఞానంతో నశిస్తాయి. ప్రారబ్ద కర్మలు అనుభవిస్తేనే నశిస్తాయి. జీవుడు తాను ఏ పాపంచేశానో అని బాధ పడుతూ దుఃఖిస్తూ ప్రారబ్దకర్మలు అనుభవిస్తాడు. జీవన్ముక్తుడు ఈకర్మలు తాను విధిగా అనుభవించాలని, శరీరానికే బాధలు కాని తనకు వాటితో ఏ సంబంధం లేనట్లుగానే ప్రవర్తిస్తాడు.
ఛాందోగ్యోపనిషత్తు(6, 14, 2):-"తస్య తావదేవ చిరం " బ్రహ్మజ్ఞానం కలగగానే ముక్తి కలగదని, ప్రారబ్దకర్మ భోగం పూర్తి అయిన తరువాత శరీరపాతం జరిగి ముక్తుడౌతాడని స్పష్టమౌతోంది. పూర్వజన్మలో చేసిన ప్రారబ్దకర్మలను అనుభవించ డానికే ఈజన్మ. ప్రారబ్దభోగం పూర్తికానంత వరకు జీవుడు దేహం నుండి ముక్తుడుకాడని భావం. కర్మ, ఉపాసన, జ్ఞానం వీటిలో కర్మ, ఉపాసనలు జ్ఞాన సాధనాలు. జ్ఞానానికి ఫలం ముక్తి. పరబ్రహ్మ ప్రాప్తి. జన్మ రాహిత్యమే మోక్షం.
వాగధికరణం ( 4, 2, 1 )
సూత్రం :- 497
" వాజ్ మనసి దర్శనా చ్చబ్దాచ్చ "
వాక్ :- వాగింద్రియం, మనసి :- అంతరింద్రియమైన మనస్సుతో లయం అవుతుంది. దర్శనాత్ :- ప్రత్యక్షంగా గమనించడం వలన, శబ్దాత్ చ :- శబ్ద ప్రమాణం వలన తెలుస్తోంది.
భావం :- వాగింద్రియం అంతరింద్రియమైన మనస్సుతో లయమవుతుంది. ప్రత్యక్షంగా గమనించడం వలన, శబ్ద ప్రమాణం వలన తెలుస్తోంది.
వివరణ:-ఈఅధికరణంలో మరణసమయంలో ఇంద్రియ వృత్తిలన్నీ మనస్సులో లీనమవడం గురించి తెలియజేయబడింది. మరణానంతరం జీవాత్మ పరలోకాలకు వెడతాడు. దానినే ఉత్క్రాంతి అంటారు. మృత్యు సమయంలో ఇంద్రియాలు తమ పనులను చేయడం మానివేస్తాయి. మరణం ఆసన్నమైనప్పుడు ఎవరు పిలిచినా, ఎంత ప్రయత్నం చేసిన మాట్లాడలేరు. ఈ విషయం లోకంలో అందరికీ తెలిసినదే. అప్పుడే వాక్కు మనస్సులో లయమైనట్లు చెబుతారు.
ఛాందోగ్యోపనిషత్తు(6, 8, 6):- మరణించే పురుషుడి వాక్కు మనస్సుని చేరుతుందని ఉద్దాలకుడు శ్వేతకేతువుతో చెబుతాడు. అవసానదశలో వాక్కు మనస్సు నందు, మనస్సు ప్రాణం నందు, ప్రాణం తేజస్సు నందు లీనమౌతాయి. ఇదే ఉత్క్రాంతి క్రమం. ఇక్కడ వాక్కు లయమౌతోందా? వాగింద్రియం లయమౌతోందా? వాక్ వ్యాపారం లయమౌ తోందా? అని సందేహం. వాక్కులయమవడం అంటే వాగింద్రియ వ్యాపారం లయమవడమే. ఇక వాక్కు పుట్టకుండా ఉండటమే లయం కావడం. జీవి ఇక మాట్లాడలేడు. క్రమముక్తిలో జీవుడు పాంచ భౌతిక దేహం నుండి విడిపోయి, దేవయాన మార్గం ద్వారా బ్రహ్మలోకాన్నిచేరి, కల్పాంతంవరకు ఉండి, ఆతరువాత పరమాత్మలో లయమౌతాడు. పాపాత్ములైన, విద్వాంసు లైనప్పటికీ వారికి ఉత్క్రాంతితప్పదు. బ్రహ్మవిద్యోపాసకులు ఉపనిషత్తులద్వారా జ్ఞానాన్ని పొంది, సాధన చేస్తూ, జీవన్ముక్తిని పొందుతారు. వారికి ఉత్క్రాంతి ఉండదు. తాను ఆత్మ స్వరూపుడననే యదార్ధ సత్యాన్ని తెలుసుకుంటాడు.
సూత్రం :- 498
" అత ఏవ చ సర్వాణ్యమ "
అత ఏవ :- పై కారణాల వలేనే, సర్వాణి :- మిగిలిన నేత్రాదింద్రియాలన్నీ, అను :- వాక్కును అనుసరించి మనస్సును చేరతాయి.
భావం :- వాక్కు వలెనే మిగిలిన నేత్రాదింద్రియాలన్నీ వాక్కును అనుసరించి మనస్సును చేరతాయి.
వివరణ:- వాక్కుతో బాటే ఇతర ఇంద్రియ వ్యాపారాలు మనస్సుతో లయం అవుతాయి. వృత్తులు లయమౌతాయి, కాని వాటి స్వరూపాలు లయం కావు.
ప్రశ్నపనిషత్తు(3, 9):- శాంత తేజస్కుడైన జీవుడు మనసులో లీనమైన ఇంద్రియాలతో బాటు పునర్జన్మను పొందుతాడు. మరి మనస్సు ఎక్కడ లయమౌతుంది? చక్షురాది ఇంద్రియాలు చూడటం, వినడం, రుచి, స్పర్శ అన్నీ వాటి పనులను మాత్రమే లయం చేస్తాయి. ఇంద్రియాలు లయంకావు. దేహం వదలిన తరువాత మరొక శరీరం ధరించడానికి, కర్మలు అనుభవించాడానికి మనస్సు ఇంద్రియాలతో వెడుతుంది. ఇంద్రియాలు లయం అయితే పునర్జన్మ ఉండదు. మరణానికి ముందే మనస్సు పనిచేస్తున్నప్పుడే, తెలివిఉన్నప్పుడే, వాక్కుతో బాటు మిగిలిన ఇంద్రియాలు అన్ని ఒక్కొక్కటే పడిపోతాయి. మాట్లాడడానికి మాటలు రావు. రుచి చూడాలంటే ఏమి తినలేరు. కంటితోఎవరిని చూడలేరు. ఎవరైనా తట్టి లేపినా స్పర్శ తెలియదు. ఎందుకంటే ఇంద్రియ వ్యాపారమంతా మనస్సులో లయమౌతుంది.
మనోధికరణం ( 4, 2, 3 )
సూత్రం :- 499
" తన్మనః ప్రాణ ఉత్తరాత్ "
ఉత్తరాత్:-ఛాందోగ్యంలో తరువాతవాక్యంలో, తత్ మనః:- ఇంద్రియాలతో కూడిన మనస్సు, ప్రాణే :- ప్రాణాన్ని చేరుతుంది.
భావం :- ఛాందోగ్యలో తరువాత వాక్యంలో ఇంద్రియాలతో కూడిన మనస్సు ప్రాణాన్ని చేరుతుందని చెప్పబడింది.
వివరణ:- అన్ని ఇంద్రియాలను తనలో లయం చేసుకున్న తరువాత మనస్సు ప్రాణంలో లయమౌతుంది. అంటే మనో వ్యాపారాలన్నీ ప్రాణంలో లయమౌతాయని గుర్తించారు.
ఛాందోగ్యోపనిషత్తు(6, 8, 6):- తర్వాత మనఃప్రాణే అని ఉన్నది. మనస్సు ప్రాణాన్ని చేరుతుందని అర్ధం. ప్రాణమంటే ముఖ్యప్రాణం. ఇలా ఇంద్రియాలతో కూడిన మనస్సు ప్రాణంలో లయమౌతుందని సూత్రానికి అర్ధం. కార్యం ఎప్పుడు కారణంలోనే లయమౌతుంది. జలం కార్యం ప్రాణం కారణం, అన్నం కార్యం మనస్సు కారణం, జగత్తు కార్యం పరమాత్మ కారణం. మనస్సుకు ప్రాణం కారణం కనుక మనస్సు ప్రాణంలో లయమౌతుంది. మనస్సు స్వరూపలయమౌతుందని పూర్వపక్షవాదన. దీనికి సూత్రకారుడు సమాధానం చెప్పాడు. మరణ సమయంలో ఇంద్రియ వ్యాపారలన్నీ మనస్సులో లయమైన తరువాత మనస్సు ప్రాణంలో లయమౌతుంది.ఆ సమయంలో ఏ ఆలోచనలు ఉండవు. మనో వ్యాపారాలు లయమౌతాయి కాని మనస్సు స్వరూపం లయం కాదు. ఈ మనస్సు ఇంద్రియాలతో కలసి అన్ని అనుభవించి మరల పునర్జన్మకు కారణం అవడానికి దోహదపడుతుంది.
అధ్యక్షాధికరణం ( 4, 2, 4 )
సూత్రం :- 500
" సో ధ్యక్షే తదుప గమాదిభ్యః "
సః :- ఆ ప్రాణం, తత్ ఉపగమ ఆదిభ్యః :- జీవుడి ప్రాప్తి, అనుగమనం :- అవస్థానం ( స్థితి ), వీటి వల్ల, అధ్యక్షే :- ఇంద్రియాలకు అధ్యక్షుడైన జీవుణ్ణి చేరుతుంది.
భావం :- ఆ ప్రాణం జీవుడి ప్రాప్తి అవస్థానం వలన ఇంద్రియాలకు అధ్యక్షుడైన జీవుణ్ణి చేరుతుంది.
వివరణ:- ప్రాణం ఆత్మలో లీనమౌతుందని అర్ధం. దేహాన్ని విడిచి జీవాత్మతో చేరుతుంది.
బృహదారణ్యాకోపనిషత్తు(4, 3, 38):-అంత్యకాలంలో ప్రాణాలన్నీ ఆత్మను చేరతాయి. ఇదే ఉపగమనం. (4, 4, 2):- ఈ ఆత్మ శరీరం నుండి వెళ్ళిపోతుంది. ఆత్మ ముఖ్య ప్రాణం. దానిని ఉపప్రాణాలు అనుసరించి వెడతాయి. ఇది అనుగమనం. తరువాత ఆ జీవుడు సర్వేంద్రియాలతోనూ, చేసిన కర్మలతోనూ కూడి ఉంటాడు. ఇలా ప్రాణాదులు ఆత్మతో వెళ్ళిపోతాయి. మనస్సు ప్రాణాపానది వృత్తులు ఏవి కూడా శరీరంలో ఉండక అన్నీ జీవుణ్ణి చేరి జీవుడితో బాటు వెళ్ళిపోతాయి. ఇక్కడ తత్ అంటే ఇంద్రియాలకు అధిపతి జీవుడు అని అర్ధం. ఉపగమం అంటే ప్రాప్తి. అవస్థానం అంటే స్థితి. దేహానికి, ఇంద్రియాలకు అధ్యక్షుడైన జీవునియందు లయమౌతుంది. ఇంద్రియాలతో కూడిన అవిద్యా జన్యమైనట్టి ఈ శరీరం వృద్దాప్యం కారణంగా క్షీణిస్తుంది. అప్పుడు చెట్టు నుంచి పండు రాలినట్లుగా శరీరంలోని పురుషుడు ఈ అవయవాలను వదలించుకొని కర్మానుసారం మరియొక యోనిలో జన్మించడం కోసం వెడతాడు. ప్రాణం, అవయవాలు ఉంటే కాని కర్మ ఫలాన్ని అనుభవించలేరు. ఈ రకంగా ముఖ్యప్రాణం బయటకు వెళ్ళేటప్పుడు దానితో బాటుగా ఇంద్రియవ్యాపారాలన్నీ నిష్క్రమిస్తాయి. ప్రాణం తేజస్సులో లయమౌతుంది అంటే జీవుడిని పొందుతుందని అర్ధం. నిజంగా ప్రాణం లయమవు తుందా అంటే అవుతుందనే చెప్పారు. రాజుగారి వెంట భటులు, పరివారం వెళ్లినట్లుగా, నిష్క్రమించేటప్పుడు అన్ని ఇంద్రియవృత్తులు, మనస్సు ముఖ్య ప్రాణం జీవుడిని అనుసరిస్తాయి.
సూత్రం :- 501
" భూతేషు తచ్ఛ్రు తేః "
భూతేషు :- ప్రాణాలతో కూడిన ఆత్మ సూక్ష్మ భూతాల్లో చేరుతుందని, తత్ శృతేః :- శృతి వాక్యాల వలన తెలుస్తోంది.
భావం :- ప్రాణాలతో కూడిన ఆత్మ సూక్ష్మ భూతాలలో చేరుతుందని శృతి వాక్యాల వలన తెలుస్తోంది.
వివరణ:-ప్రారబ్దకర్మలు అనుభవించిన తరువాత జీవుడు ఈ స్థూలదేహాన్ని విడిచి నిరాధారుడిగా పైకిపోడు. అవసాన సమయంలో స్థూలదేహంవిడిపోతుంది. అప్పుడు జీవుడు సూక్ష్మశరీరంతో ప్రయాణిస్తాడు. దానిలో 13కరణాలు ఉంటాయి. 10 బాహ్య కరణాలు (5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం -వీటిని ప్రాణం అని సూచిస్తారు. వీటిని బుద్ధి, ముఖ్యప్రాణం, శ్రేష్ఠప్రాణం అని అంటారు) 3అంతఃకరణాలు, 5సూక్ష్మభూతాలు అన్నికలసి 18 తత్త్వాలతో కూడి ఉంటుంది. వీటితోనే జీవుడు ప్రయాణంచేస్తాడు. దానినే కారణశరీరం అంటారు. ఇదే జీవుడికి వాహకశరీరం. స్థూలదేహం కర్మానుష్టానానికి, భోగానికి ఆశ్రయం. స్థూలదేహంతోనే బ్రహ్మజ్ఞానం సంపాదించ వచ్చును. ప్రళయకాలంలోను, బ్రహ్మ జ్ఞానం కలిగి ముక్తిపొందినప్పుడు జీవుడికి ఈ సూక్ష్మశరీరం ఉండదు. జీవుడు అవసానసమయంలో తేజస్సుతో కూడి చరించే భూతసూక్ష్మలతో ప్రాణంతో కూడినవాడై ఉంటాడు. తేజస్సు అంటే అగ్ని అని అర్ధం. తేజస్సు లేకపోతే శక్తి లేక అన్ని జడమైపోతాయి. అగ్నిమొదలైన అన్నిభూతాలు తేజస్సు అని గ్రహించాలి. సూక్ష్మభూతాలే జీవుడికి ఉపాధులు. అవి జీవునిలో లయం అయినప్పటికీ, పునర్జన్మకి దోహదపడతాయి. ప్రాణం ఆ భూతసూక్ష్మాలను పొందినట్లే అని గుర్తించాలి. అందుకే ప్రాణాలు జీవునిలో లయం అవుతాయి.
సూత్రం :-502
" నైకస్మిన్ దర్శయతో హి "
ఏకస్మిన్ :- కేవలం ఒక్క తేజస్సు తోనే, న :- ప్రాణాలతో పాటుగా జీవాత్మ చేరడు. హి :- అని, దర్శయతః :- శాస్త్రాలు అంటున్నాయి.
భావం :- కేవలం ఒక్క తేజస్సు తోనే ప్రాణాలతో పాటుగా జీవాత్మ చేరడని శాస్త్రాలు అంటున్నాయి.
వివరణ:-జీవుడు అవసానసమయంలో ప్రాణాలు తేజస్సుతోకూడి వెడతాడని, తేజస్సులోనే ఉంటాడని పూర్వపక్ష వాదన. అది సరియైనదికాదు. అంత్యకాలంలో తేజస్సుఒక్కటే ఉండదు. సమస్తభూతలు ఉంటాయి. మరణసమయంలో శరీరాన్ని విడిచి మరొకశరీరాన్ని ధరించేటప్పుడు అన్నిభూతాలయొక్క సూక్ష్మాoశంయందు సూక్ష్మశరీరంతో ఉంటాడు. మరణ సమయంలో వాక్కు మొదలైన ప్రాణాల పరివారంతో పాటుగా జీవాత్మ పృదివ్యాది స్థూలభూతాలకు కారణమైన సూక్ష్మ భూతాలతోకూడి ఉంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి. మరొకజన్మ రావడానికి సూక్ష్మభూతాలన్నీ అవసరమే కనుక ప్రాణం జీవుని యందు లయమౌతుంది.
బృహదారణ్యాకోపనిషత్తు(4, 4, 5):- పాతదేహాన్ని విడిచి, కొత్త దేహాన్ని పొందడానికి సిద్ధమౌతున్నప్పుడు జీవాత్మ పృథవి మయం, జలమయం, వాయుమయం,ఆకాశమయం, తేజోమయం అవుతాడు.
మనుస్మృతి(1, 27):-సూక్ష్మాలైన పంచాతన్మాత్రాలతో ఇదంతా క్రమంగా జనిస్తుంది. కనుక జీవాత్మ కేవలం ఒక్క తేజస్సు తోనే చేరక, సమస్త భూతాలలో చేరి, పంచతన్మాత్రాలతో కూడి వేరే దేహంలో ప్రవేశిస్తాడు. ప్రాణస్తేజసి అన్నప్పుడు తేజస్సు ప్రధానమని, మిగిలిన భూతాలు ఉప లక్షణాలు అని గ్రహించాలి.
బృహదారణ్యకోపనిషత్తు(3, 2, 13):-అది కర్మే. జీవుడికి ఆశ్రయం. వాస్తవానికి జీవుడికి సూక్ష్మదేహం ఆశ్రయమైనా కర్మే జీవుణ్ణి ఉచ్ఛనీచజన్మలకు తీసుకువెడుతుంది. కనుక జీవుడికి కర్మ ఆశ్రయమని చెప్పారు. పుణ్యకర్మలవలన పుణ్య యోని పాపకర్మల వలన పాపయోని లభిస్తాయి. బృహదారణ్యాకంలో యాజ్ఞవల్క్యుడికి, ఆర్తబాగుడికి ఒక సంవాదం జరిగింది. మరణసమయంలో వాక్కు మొదలైన కరణాలన్నీ తమవ్యాపారాలు మానుకుంటాయి. అప్పుడు జీవాత్మ ఎక్కడ ఉంటాడు అనే ప్రశ్నఉంది. జీవాత్మ వాగాదికారణాలతో పాటుగా సూక్ష్మభూతాలతో కూడి మరో దేహానికి వెడతాడు.
ఆసృత్యుపక్రమాధికరణం ( 4, 2, 7 )
సూత్రం :- 503
" సమానా చాసృత్యుపక్రమా దమృతత్వం చామపోష్య "
ఆసృతిఉపక్రమాత్:-లోకాంతరగతి ప్రారంభంవరకు, సమానాచ:-ఉపాసకులకు, వేరే జీవులకు మరణకాల గతి సమానమే. చ :- ఎందుకంటే, అనుపోష్య :- శరీరాన్ని వదలి పెట్టి, అమృతత్వం :- ఉపాసకులు అమృతత్వాన్ని పొందుతారు.
భావం :- లోకాంతర గతి ప్రారంభం వరకు ఉపాసకులకు, వేరే జీవులకు మరణకాల గతి సమానమే. ఎందుకంటే, శరీరాన్ని వదలి పెట్టి ఉపాసకులు అమృతత్వాన్ని పొందుతారు.
వివరణ:-నిర్గుణబ్రహ్మోపాసకులకు, సగుణ బ్రహ్మోపాసకులకు వేరే వేరే మార్గాలలో ప్రయాణిస్తారు. నిర్గుణ బ్రహ్మోపాసకులు బ్రహ్మజ్ఞానం పొంది, దానిని అనుభవంలోనికి తెచ్చుకోవడానికి సద్గురువును ఆశ్రయించి, సాధనచేసే వారికీ ఉత్క్రాంతి ఉండదు. వారి ప్రాణాలు నిష్క్రమించవు. వారు ఎక్కడికి వెళ్లకుండానే బ్రహ్మంగానే మిగిలిపోతారు. సగుణబ్రహ్మోపాసకులు జీవుడి మరణానంతరం ఉత్క్రాంతి ఉంటుంది. వీరు క్రమముక్తిద్వారా శరీరాన్ని విడిచి, బయటకు వచ్చాక పితృయాన మార్గం ద్వారా స్వర్గలోకం, సూర్యలోకం, చంద్రలోకం ద్వారా బ్రహ్మలోకాన్ని చేరతారు. ఉపాసకులుకాని వారు చేసిన పుణ్య కర్మలను అనుసరించి స్వర్గలోక సుఖలను అనుభవించి తిరిగి భూమిపైన మరల జన్మిస్తారు. పాపాత్ములు సంసారం చక్రంలో అనేక జన్మలు ఎత్తి కర్మలను అనుభవిస్తుంటారు. సగుణ విద్యలో అమృతత్వం కేవలం గౌణమేనని పూర్వ పక్ష వాదన. ఎక్కడో వందశ్రుతులలో ఒక్కలాగే చెప్పి, ఏ ఒక్కదానిలోనో తేడా చెబితే, వారు దానినే నమ్మి,సమర్ధిస్తారు. దానిని గౌణమని అంటారు. క్రమముక్తి ద్వారా అమృతత్వం ఎప్పటికో వస్తుంది. నేను అనే జీవభావం పోయి నేను ఆత్మ స్వరూపమే అని అనుభూతి వచ్చిన తరువాత అమృతత్వం లభిస్తుంది. ఉపోష్య అంటే సమీపంలో నివసించడం, అనుపోష్య అంటే దగ్గరలో లేకపోవడం. జ్ఞాని మరణించిన తరువాత శరీరాన్ని విడిచి ముక్తుడై అమరత్వాన్ని పొందుతాడు. ఆత్మ సూక్ష్మదేహం దగ్గరలో ఉండి ఎప్పుడూ పయనిస్తూ వేరే శరీరానికి వెడుతుంది. బ్రహ్మసాక్షాత్కారం కలిగిన జీవుడు స్థూల దేహం విడవ వలసి వచ్చినప్పుడు సూక్ష్మ దేహం కూడా విడిపోతుంది. దీనినే అనుపోష్య అంటారు.
కఠోపనిషత్తు(6, 16):-హృదయనాడులు 101. వాటిలో ఒకటి బ్రహ్మరంద్రం వైపు వెడుతుంది. అదే సుషమ్ననాడి. ఆ నాడిలో ప్రవేశించి దేహంనుండి విడువడే జీవుడు అమృతత్వం పొందుతాడు. ఇది జ్ఞానికి కలిగే ఉత్క్రాంతి విధం. ఇతర అజ్ఞానులకు ఇతరనాడుల ద్వారా ఉత్క్రాంతి కలుగుతుంది. వారు వేరే శరీరాలలో ప్రవేశిస్తారు. ఇలా కరణాల ఉప సంహారానికి గతిసమానమే. నాడుల్ని చేరేవరకు జ్ఞానికి, అజ్ఞానికి ఉత్క్రాంతిసమయం సమానమే. దేవయానం ప్రారంభానికి జ్ఞానికి అజ్ఞానికి ఉత్క్రాంతి అనేది ఒకే రకంగా ఉంటుంది. జ్ఞానం లేనివాడి ప్రాణాలు దక్షిణమార్గాన పోతాయి. ఆయా మార్గాల వరకు ఉపాసకుడైనజ్ఞానికి, ఉపాసకుడుకాని అజ్ఞానికి కూడా భూతసూక్ష్మఅవయవాలు సమానమే. దేవయాన మార్గం ద్వారా వెళ్ళని వాళ్ళకి బ్రహ్మలోకప్రాప్తి కలగదు. ఉత్క్రమణవరకు ఇంద్రియాలు మనస్సులో లీనమవడం, మనస్సు ప్రాణంలో, ప్రాణాలు జీవంలో లీనం కావడం సమానమే.
సంసార వ్యప దేశాధికరణం ( 4, 2, 8 )
సూత్రం :- 504
" తదా పీతేః సంసార వ్యపదేశాత్ "
సంసారవ్యపదేశాత్ :- శరీరం ఉన్నంత వరకు ప్రపంచం ఉంటుంది. కనుక తత్ :- ఆ సూక్ష్మ శరీరం, ఆ అపీతేః :- ముక్తి పర్యంతం ఉంటుంది.
భావం :- శరీరం ఉన్నంత వరకు ప్రపంచం ఉంటుంది. ఆ సూక్ష్మ శరీరం ముక్తి పర్యంతం ఉంటుంది.
వివరణ:-ఈ అధికరణంలో దేహంలో వేడి సూక్ష్మశరీరం వల్లనే ఉంటుందని తెలియజేశారు. సృష్టి కాలంలో సూక్ష్మశరీరం వలనే జీవులకు సంపర్కం ఏర్పడుతుంది. అది ప్రళయం వరకు ఉంటుంది. జననమరణాలలో సూక్ష్మదేహం ఒక్కటే అయినా స్థూలదేహాలు మారుతూ ఉంటాయి. అజ్ఞానులు తాము చేసిన కర్మఫలాన్ని అనుభవించడానికి వేరొక యోనిలో ప్రవేశిస్తారు. పుణ్యకర్మలు ఉత్తమయోనులు పొందుతారు. పాపాత్ములు నీచయోనులైన క్రిమి కీటకాలుగా పుడతారు. అధమాధములు రాళ్లు, రప్పలు, చెట్లుగా పుడతారు. అజ్ఞానుల సూక్ష్మశరీరానికి కారణమైన తత్త్వాలు ప్రళయకాలంలో తమ కరణాల్లో లీనమౌతాయి. బ్రహ్మజ్ఞానం కలిగిన జీవుడికి స్థూల దేహపాతం జరిగే వరకు సూక్ష్మదేహంతో సంబంధం ఉంటుంది. జ్ఞానికి సంచితకర్మలు, ప్రారబ్దకర్మలు నశించినతరువాత స్థూలదేహంతో బాటు సూక్ష్మదేహం కూడా విడిపోతుంది. తేజస్సు మొదలైన భూతాలు మోక్షపర్యంతం ఉంటాయి. ఆత్మకు శరీరంతో సంబంధం ఉన్నంత వరకే విషయసుఖాలపై అనుభూతి ఉంటుంది. సంసారం అంటే దేహసంబంధమైనది. ప్రళయంలోను, మోక్షంలోను దేహ సంబంధం ఉండదు. ఇతరసమయాలలో సూక్ష్మశరీరంతో సంబంధం ఉంటుంది. తేజస్సు మొదలైన సూక్ష్మ, భూత సూక్ష్మాలకు పరమాత్మయందు లయం కావడమే మిగిలి ఉందని గ్రహించాలి.
సంసార వ్యపదేశాధికరణం ( 4, 2, 9 )
సూత్రం :- 505
" సూక్ష్మం ప్రమాణతశ్చ తధోప లబ్ధేః "
ప్రమాణతః చ :- ప్రమాణం వలన, తధా ఉపలబ్ధేః :- ఎంతో సూక్ష్మం కావటం వలన, సూక్ష్మం :- సూక్ష్మ శరీరం ఇంద్రియ గోచరం కాదు.
భావం :- ప్రమాణం వలన ఎంతో సూక్ష్మం కావటం వలన సూక్ష్మ శరీరం ఇంద్రియ గోచరం కాదు.
వివరణ:-సూక్ష్మ శరీరం ఇంద్రియాలకు గోచరం కాదు. సూక్ష్మ దేహం ఎంతో చిన్నది కనుక ఇంద్రియాలు తెలుసుకోలేవు. కేవలం అనుమానప్రమాణంతో గుర్తించాలి. శరీరం నుండి వెళ్లి పోతున్న జీవుడికి ఆశ్రయ భూతమైన తేజస్సు ప్రమాణాన్ని బట్టి, స్వరూపాన్ని బట్టి చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఆ సూక్ష్మశరీరం జీవుడికి జీవించి ఉన్నంత కాలం ఆధారభూతంగా ఉండి, ఈశరీరాన్ని వదలివెళ్లేటప్పుడు, వేరే శరీరంలో ప్రవేశించదానికి, బ్రహ్మ లోకానికి వెళ్లడానికి ఆధార భూత మౌతుంది. భూతసూక్ష్మాలతో కూడిన తేజస్సు చాలా సూక్ష్మమైన నాడీమండలం గుండా పోతుంది.
బృహదారణ్యకోపనిషత్తు(4, 4, 2):-సూక్ష్మశరీరంతో కూడిన జీవుడు చక్షురాది ఇంద్రియాల నుంచి, ఇతర నాడుల నుంచి వెళ్ళిపోతాడు. కనుక సూక్ష్మ శరీరం ఇంద్రియ గోచరం కాదు.
సూత్రం :- 506
" నోప మర్ధే నాతః "
అతః :- సూక్ష్మం కావటం వలన, ఉప మర్ధేన :- స్థూల శరీరం నశించినా, న :- సూక్ష్మ శరీరం నశించదు.
భావం :- సూక్ష్మ శరీరం సూక్ష్మం కావటం వలన స్థూల శరీరం నశించినా సూక్ష్మ శరీరం నశించదు.
వివరణ:-సూక్ష్మశరీరం అత్యంత సూక్ష్మమైనది. సన్నని దారపు పోగులో వెయ్యోవంతు కూడా ఉండదు. స్థూల శరీరానికి ఒరిపిడి కలిగినా, సూక్ష్మశరీరానికి బాధ కలగదు. అది స్వచ్ఛమైనది. సూక్ష్మమైనది. స్వచ్ఛమైనది కనుకనే స్థూల శరీరానికి ఏదైనా బాధకలిగినా అది సూక్ష్మశరీరానికి అంటదు. మరణించినప్పుడు స్థూలశరీరాన్ని అగ్నితో దహనం చేసినా సూక్ష్మశరీరం దహింపబడదు. ఉపమర్దనం అంటే దహనం లాంటి వాటి వలన నశించడం అని అర్ధం. దాహదులచే స్థూల శరీరాన్ని పీడించినా కూడా ఈ సూక్ష్మశరీరం పీడింప బడదు.
సూత్రం :- 507
" అ స్యైవ చోపపత్తే రేష ఊష్మా "
వేషః ఉష్మా:- ఈ స్థూల శరీరం మనకు తెలిపే వేడిమి, అస్య ఏ వ :- సూక్ష్మ దేహానికి సంబంధించినదే అని, ఉప పత్తేః :- యుక్తి వలన తెలుస్తోంది.
భావం :- ఈ స్థూల శరీరం మనకు తెలిపే వేడిమి, సూక్ష్మ దేహానికి సంబంధించినదే అని యుక్తి వలన తెలుస్తోంది.
వివరణ:-సూక్ష్మశరీరం ఉన్నదా, లేదా? అని ఎలా తెలుస్తుంది? అంటే ఈ స్థూలశరీరాల్లో అందరూ అనుభవించే ఆవిరి లేదా ఉష్ణం స్థూలదేహానికి సంబంధించినది కాదు. అది సూక్ష్మదేహానికి సంబంధించినది. స్థూల దేహానికి సంబంధించినదే. అయితే మృతదేహంలో కూడా వేడిఉండాలి. దేహధర్మాలైన రంగు లాంటి గుణాలు కొన్ని మృతదేహంలో కూడా ఉంటాయి. కాని ఉష్ణం మాత్రం ఉండదు. అది సూక్ష్మదేహంతో జీవుడి నుంచి ఉత్క్రమణ చేస్తుంది. సూక్ష్మ శరీరం ఉన్నప్పుడే ఆ ఆవిరి ఉంటుంది. అదే దేహంలోని వేడి. అవసానసమయంలో కాళ్ళు, చేతులు చల్లబడిపోతాయని అంటారు. అంటే సూక్ష్మ శరీరం వెళ్లిపోవడం వలన శరీరం చల్లబడిపోతుంది. జీవించి ఉన్నప్పుడు ఇది వేడిగాఉంటుంది. మరణించినప్పుడు చల్లగా ఉంటుంది. అలా అన్నిదేహలలో అందరికీ తెలిపే ఉష్ణతఆధారంగా ఒకసూక్ష్మదేహం ఉన్నదని యుక్తిమూలంగా తెలుస్తోంది.
ప్రతిషేదాధికరణం ( 4, 2, 12 )
సూత్రం :- 508
" ప్రతిషేధా దితి చేన్న శారీరాత్ "
ప్రతిషేధాద్ ఇతి చేత్ :- బృహదారణ్యకంలో జీవుడి ఉత్క్రమణం చేయడని నిరకరించడం వలన, న :- సరియైనది కాదు. శారీరాత్ :- అక్కడ జీవుడి నుంచి ఉత్క్రమణం నిషేదించారే కాని శరీరం నుంచి కాదు.
భావం :-బృహదారణ్యకంలో జీవుడు ఉత్క్రమణం చేయడని నిరాకరించడం వలన, ముక్తి దాకా సూక్ష్మ శరీరం ఉంటుంద నడం తగదు అని చెప్పడం సరియైనది కాదు. అక్కడ జీవుడి నుంచి ఉత్క్రమణం నిషేదించారే కాని, శరీరం నుంచి కాదు.
వివరణ:-గురువుగారు! అవసానదశలో ప్రాణాలు ఉత్క్రమిస్తాయా? అని అడిగాడు నారాయణభట్టు. సగుణారాధన చేసే వాడి ప్రాణాలు ఉత్క్రమిస్తాయి. కాని బ్రహ్మవేత్త ప్రాణాలు ఉత్క్రమించవు అని అనడం సరి కాదు. ఊత్క్రమణ అనేది జీవుడి నుంచి కాదు. అతని శరీరం నుంచి జరుగుతుంది.
బృహదారణ్యకోపనిషత్తు(3, 2, 11):-ఈపురుషుడు మరణించేటప్పుడు ప్రాణాలు ఉత్క్రమిస్తాయా లేదా అని ఆర్తభాగుడు యాజ్ఞవల్క్యుని అడిగాడు. అవి ఇక్కడే లీనంఅవుతాయి. అతను లావెక్కుతాడు. నిండిపోతాడు. నిండి చనిపోయి శయనిస్తాడు అని యాజ్ఞవల్క్యుడు సమాధానం ఇచ్చాడు. దీనినిబట్టి ప్రాణాలు జీవునితో బాటు ఉత్క్రమించవని తెలుస్తోంది కదా! అందుచేత ముక్తిపర్యంతం సూక్ష్మశరీరం జీవుడితో కూడి ఉంటుందనడం పొసగడం లేదుకదా! ఉపనిషత్తులలో చెప్పిన ప్రాణోత్క్రమణ నిరాకరించడం, శరీరం నుంచి ఉత్క్రమించదు అని అర్ధం కాదు. ప్రాణపదానికి అర్ధం సూక్ష్మశరీరం. అది స్థూలశరీరం నుంచి వెళ్ళిపోతుంది, కాని జీవాత్మ నుంచి కాదు. ఉపనిషత్తులలో పురుషుడు అంటే జీవుడు, శరీరం కాదు. జీవుడి నుంచి ప్రాణాలు ఉత్క్రమించవు. సూక్ష్మశరీరం ముక్తి వరకు జీవుడితోనే ఉంటుంది. జ్ఞాని సూక్ష్మ దేహం, స్థూల దేహంతో బాటు వాటి కరణాల్లో లీనమై నశిస్తుంది.
సూత్రం :- 509
" స్పస్టో హ్యే కేషామ్ "
ఏకే షామ్ :- కౌషీతకి శాఖకు సంబంధించిన వాళ్ల అభిప్రాయంలో, స్పష్ట హి :- జీవాత్మ ప్రాణాలతో పాటు శరీరం నుంచి ఉత్క్రమిస్తుంతుందని స్పష్టంగా అంటున్నారు.
భావం :- కౌషీతకీ శాఖకు సంబంధించిన వాళ్ల అభిప్రాయంలో జీవాత్మ ప్రాణాలతో పాటు శరీరం నుంచి ఉత్క్రమిస్తుందని స్పష్టంగా తెలియజేశారు.
వివరణ:-ఈఅధికరణంలో నిర్గుణబ్రహ్మవేత్త ప్రాణాలు ఉత్క్రమించవని చెప్పబడింది. కొంతమంది సూత్రకారులు బ్రహ్మవేత్తకు ఉత్క్రాంతి లేదని చెప్పారు. బృహదారణ్యకంలో మానవుడు చనిపోయినప్పుడు బ్రహ్మవేత్త ప్రాణాలు ఉత్క్రమిస్తాయా అని అడిగాడు ఆర్తభాగుడు. తత్త్వజ్ఞానియొక్క ప్రాణాలు పరమాత్మలో లీనంఅవుతాయి కాని అతనికి ఉత్క్రమణ లేదు.సామాన్య మానవుడి లాగానే బ్రహ్మవేత్తకూడా మరణిస్తాడు. కాని అతనికి పునర్జన్మ ఉండదని యాజ్ఞవల్క్యుడు సమాధానం ఇచ్చాడు. మరి మరణించిన వానికి ప్రాణాలు ఉత్క్రమిస్తాయి కదా అని సందేహం రావచ్చును. బ్రహ్మవేత్తకు ప్రాణాలు ఉత్క్రమించవు. అవి పరమాత్మలో లీనం అవుతాయి.
కౌషీతకీబ్రాహ్మణం(3, 4):- జీవుడు ఈశరీరం నుంచి ఉత్క్రమించేటప్పుడు జీవుడు, ప్రాణాలు రెండూ శరీరంలో కలిసి ఉంటాయి కనుక ప్రాణాలతోకలిసే ఉత్క్రమిస్తాడు. కనుక జీవుడితో బాటు లింగశరీరం ఉత్క్రమిస్తుందని ముక్తి పర్యంతం విడువదని తెలుస్తోంది.
సూత్రం :- 510
" స్మృర్యతే చ "
సూక్ష్మ శరీరంలో జీవుడు ఉత్క్రమిస్తాడని, స్మృర్యతే చ :- స్మృతిలో కూడా చెప్పారు.
భావం :- సూక్ష్మ శరీరం లో జీవుడు ఉత్క్రమిస్తాడని స్మృతిలో కూడా చెప్పారు.
వివరణ:-బ్రహ్మసాక్షాత్కారం పొందిన వాడికి ప్రాణాలు ఉత్క్రమించడం గాని, దేవయానాది మార్గాలు గాని లేవని పురాణాలూ చెబుతున్నాయి. కాబట్టి బ్రహ్మవేత్త ప్రాణాలు ఉత్క్రమించవు.
మనుస్మృతి(1, 56) :-మనుస్మృతిలో మృత్యుసమయం వర్ణన వున్నది. ఈజీవుడు ఇంద్రియాలతో కూడి చాలా కాలం ఉంటాడు. ఇంద్రియాలు, జీవుడు బ్రహ్మజ్ఞానం విడిచి తపస్సును ఆశ్రయించి ఉన్నప్పుడు తమ వ్యాపారాన్ని విడిచి పెడతాయి. అప్పుడా జీవుడు ఏ కార్యము చేయడు. స్థూల శరీరం నుంచి నిష్క్రమిస్తాడు.
మనుస్మృతి(1, 56):-అణుపరిమాణం ఉన్న జీవుడు తన్మాత్రాలు సూక్ష్మభూతాలతో కూడి స్థావరజంగమయోనుల్లో కర్మల ననుసరించి ప్రవేశించి, స్థూలశరీరాన్ని గ్రహిస్తూ, విడుస్తూ ఉంటాడు. ఇలా జీవుడు ముక్తి లభించే వరకు సూక్ష్మ లింగ శరీరంతో నానాయోనుల్లో చేరడానికి ఉత్క్రమిస్తాడని భావం. బ్రహ్మవేత్త శరీరంలోనే ఉండి యోగబలం చేత విశిష్టమైన ఒక ప్రదేశం చేరి అక్కడ శరీరం విడిచిపెట్టాడు అని గ్రహించాలి. అందుచేతనే అతనిని అన్నిభూతాలు చూచాయి అని చెప్పబడింది. శుకన్తు....అభవత్ అంతరిక్షంలో ఉన్న శుకుడైతే వాయువు కంటే శీఘ్రమైన గమనం చేసి తన ప్రభావాన్ని చూసి సర్వభూతాలలో లీనమైపోయాడు అని అర్థం. అందుచేతనే బ్రహ్మవేత్తకు ప్రాణాలు ఉత్క్రమించవు అని చెప్పబడింది.
కలాప్రళయాధికరణం ( 4, 2, 15 )
సూత్రం :- 511
" తాని పరే తథాహ్యా హ
తాని :- వాగాది ఇంద్రియాలు లీనం అయిన సూక్ష్మ భూతాలు, పరే :- బ్రహ్మంలో లీనం అవుతాయి. హి :- అని, తధా ఆహ :- ప్రమాణాలున్నాయి.
భావం :- వాగాది ఇంద్రియాలు లీనం అయిన సూక్ష్మభూతాలు బ్రహ్మంలో లీనం అవుతాయని ప్రమాణాలున్నాయి.
వివరణ:-గురువుగారు! బ్రహ్మవేత్త ప్రాణాలు ఉత్క్రమించవు అన్నారు. మరి అతని ఇంద్రియాలు, భూతాలు పరమాత్మలో లీనం అవుతాయా? లేక తమతమ ప్రకృతుల యందు లయమౌతాయా? అని అడిగాడు కృష్ణశర్మ. బ్రహ్మవేత్త ప్రాణాలు అంటే ఇంద్రియాలు, భూతాలు పరమాత్మలోనే లీనం అవుతాయి. ప్రశ్నోపనిషత్తులో పదహారుకళలకు పరమేశ్వరుడే ఆధారం. కనుక అతని యందే లయమౌతాయని చెప్పబడింది. జ్ఞానికి మోక్షం కలిగినప్పుడు పదిహేను కళలు వాటి వాటి ఉత్పత్తిస్థానాన్ని పొందుతాయని ముండకోపనిషత్తులో చెప్పబడింది. గంగా, యమున, సరస్వతి, గోదావరి, కృష్ణ ఇలా నామరూపాలున్న నదులన్నీ సముద్రంలో కలిసిపోయినప్పుడు వాటికున్న పేర్లు పోయి, సముద్రం అనే పేరే వస్తుంది. అలాగే పదహారుకళలు పరమేశ్వరుని చేరినప్పుడు వాటికి నామరూపాలుండవు. దానిని పురుషుడు అని అంటారు. సమాధిస్థితిలో ఉన్నప్పుడు ఈకళలన్నీ ఆత్మలో లీనం అవుతాయి.
ఛాందోగ్యోపనిషత్తు(6, 8, 8):- వాగాది ఇంద్రియాలు తమలో లీనం చేసుకున్న సూక్ష్మ భూతలు, లింగ శరీరం, దానితో ఉన్న జీవుడు పరబ్రహ్మంలో లీనమౌతాడు. ఆదశలో జీవుడికి ఎలాంటి సుఖదుఃఖాలు ఉండవు. సమాధి, ముక్త అవస్థలలో జీవుడు ఆనందం అనుభవిస్తాడు. బండిచక్రానికి ఉండే ఆకులన్నీ ఇరుసుమీద ఆధారపడినట్లుగా, ఈ కళలన్నీ పురుషుడి మీద ఆధారపడి ఉంటాయి. ఈ పదహారుకళలు అతను సృష్టించినవే. ఈ రకంగా నిర్గుణ పరబ్రహ్మ వేత్త ఇంద్రియాలు బ్రహ్మలో లీనం అవుతాయి.
కలా విభాగాధికరణం ( 4, 2, 16 )
సూత్రం :- 512
" అవిభాగో వచనాత్ "
వచనాత్ :- ఛాందోగ్యంలో ఇచ్చిన దృష్ఠాంతం వలన సంపత్తి అంటే ,అవిభాగః :- విభజించడానికి వీలులేని సంయోగ విశేషం.
భావం :- ఛాందోగ్యం లో ఇచ్చిన దృష్టాంతం వలన సంపత్తి అంటే విభజించడానికి వీలులేని సంయోగ విశేషం.
వివరణ:-"వాజ్ మనసి సంపద్యతే" వాగాదిఇంద్రియాలను మనస్సు మొదలైన వాటిలో సంపత్తి అన్నారు. ఈ సంపత్తి విభజించడానికి వీలులేనిదే కాని ఒకటై పోవడం, లయం అనికాదు. జ్ఞానియొక్క షోడశకళలు అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనస్సు బ్రహ్మంలో పుర్తిగా లయమౌతాయి. అప్పుడు వాటి నామరూపాలు నశించి అన్ని కలసి పురుషుడు అని వ్యవహరించబడతాడు. ఈ రకంగా లయమైనప్పుడు సాధకుడు కళలు లేనివాడు అవుతాడు. అంటే అతను ముక్తుడౌతాడు.
ఛాందోగ్యోపనిషత్తు(6, 9, 12):- సోమ్యా! తేనెటీగలు తేనెను చేకూరుస్తాయి. అనేక చోట్ల నుండి అనేక వృక్షాల నుండి పుష్ప రసాన్ని ఒకచోట చేర్చి, మధువును వృద్ధిచేస్తాయి. ఆతేనె వేర్వేరు చెట్లకు సంబంధించినవని అవి స్వయంగా గుర్తించలేవు. అలాగే సమస్తజీవులు లీనమై సత్ ను చేరి, భిన్న వ్యవహారాలకి లోను కారు. ఈస్థితినే లయం, సంపత్తి అంటారు. తేనెలో చేరిన విభిన్నరసాలను వేర్వేరుగా వ్యవహరించడానికి వీలు కానట్లే, బ్రహ్మంలో జీవులు లీనమై వేర్వేరుగా వ్యవహరించే వీల్లేనిస్థితిలో ఉంటారనడమే సంపత్తి, లయం, శబ్దార్ధం. అంతే కాని జీవులు బ్రహ్మం అవుతారని కాదు. జీవుల స్వరూపానికి హానికలగదని సూత్రం భావం. విద్వాంసుని కలా ప్రళయం ఇతరుల వలె సావశేషంగా ఉంటుందా? నిరవశేషంగా ఉంటుందా అని సందేహం. జ్ఞాని యొక్క ఇంద్రియాలు బ్రహ్మలో లయమౌతాయి కనుక దానిని నిరవశేషం అంటారు. అజ్ఞాని మరణించినా అతనితో బాటే షోడశకళలు వెంట ఉంటాయి. దానిని సావశేషం అంటారు. దోసపండు తోడిమ నుండి పూర్తిగా విడిపోయినట్లుగా ఉండదు. అలాగని అతుక్కొని ఉండదు. ఆదేవిధంగా జ్ఞాని ఇంద్రియాలు బ్రహ్మంలో ఒకటై పోయి లయం కావు. లేదా విభజించడానికి వీలుగా ఉండవు.
తదేకోధికరణం ( 4, 2, 17 )
సూత్రం :- 513
" తదేకోగ్ర జ్వలనం తత్ ప్రకాశితద్వారో విద్యాసామర్ధ్యత్, తచ్ఛేష గత్యనుస్మృతి యోగాచ్చ హార్ధానుగృహీతః శతాధికయా"
విద్యాసామర్ధ్యత్ :- ఉపాసనవిద్య మహత్తువలన, తత్ శేష గతి అనుస్మృతి యోగాత్:-అవిద్యాఫలితమైన గతిస్మరణ వలన, తత్ ఓకః అగ్రజ్వలనం:- బ్రహ్మంలో లీనమైన లింగశరీరంలో ఉన్న జీవాత్మకు స్థానంఅయిన హృదయఅగ్రభాగం ప్రకాశస్తుంది, తత్ ప్రకాశితద్వారః :- హృదయఅగ్రభాగ ప్రకాశంతో వెలుగొందే నిష్క్రమణ ధ్వారం వద్ద, హార్ధ అనుగ్రహీతః :- హృదయంలో ఉండే బ్రహ్మం అనుగ్రహించిన ఉపాసకుడు, శతాధికయా :- నూటికి మించి ఉన్న నాడుల్లో బ్రహ్మనాడి అనే సుషమ్ననాడితో శరీరం నుంచి నిష్క్రమిస్తాడు.
భావం :- ఉపసనా విద్య మహాత్తు వలన, ఆ విద్యా ఫలితమైన గతి స్మరణ వలన బ్రహ్మంలో లీనమైన లింగ శరీరంలో ఉన్న జీవాత్మకు స్థానం అయిన హృదయ అగ్ర భాగం, ప్రకాశంతో వెలుగొందే నిష్క్రమణ ధ్వారం వద్ద ఉపాసకుడు నూటికి మించి ఉన్న నాడుల్లో బ్రహ్మనాడి అనే సుషమ్నా నాడి ద్వారా శరీరం నుంచి నిష్క్రమిస్తాడు.
వివరణ:-ఈసూత్రంలో సగుణబ్రహ్మవేత్త యొక్క ఆత్మసుషమ్నానాడి ద్వారా నిర్గమిస్తుందని చెప్పబడింది. మరణ సమయంలో అన్నికరణాలు సంకుచితాలై జీవుడుకి నిలయమైన హృదయంలో లీనమౌతాయి. అన్ని కరణలు వాటి వ్యాపారాలు మానివేసి, హృదయంలో తమకు అధ్యక్షుడైన జీవాత్మను చేరతాయి. సగుణోపాసకుని ఆత్మ శరీరం నుంచి బయటకు వచ్చేటప్పుడు జీవునికి నివాసస్థానమైన హృదయం చివరిభాగంలో ఒక జ్వలన కలుగుతుంది. హృదయాన్ని అధిష్టించిన బ్రహ్మచేత అనుగ్రహింపబడి, బ్రహ్మవిద్యాసామర్ధ్యం వలన, గతిని ధ్యానించడం వలన, నూటఒకటవదైన సుషమ్నానాడి ద్వారా నిష్క్రమిస్తాడు.
కఠోపనిషత్తు(6, 16):- హృదయం నుండి 101 నాడులు బయలుదేరతాయి. అందులో సుషమ్నా మూర్ధవైపు వెడుతుంది. ఈశ్వరుడి వ్యవస్థ వలన కర్మలను అనుసరించి దేహాన్ని విడిచి పెట్టేటప్పుడు ప్రతి వ్యక్తి తనకు రాబోయే యోని గురించి తెలుస్తుంది. ఇది మృత్యుకాలపు కష్టాన్ని తగ్గిస్తుంది. దానిని స్మరిస్తూ జీవుడు ఈదేహాన్ని విడిచిపెడతాడు. పరమేశ్వరుడు కర్మలు చేసే వ్యక్తిని ఇలా అనుగ్రహిస్తాడు. ఉపాసకుడు సుషమ్నానాడి ద్వారా శరీర నుంచి నిష్క్రమిస్తాడు. ఇతర కర్మనుష్టానపరులు ఇతర నాడుల ద్వారాలను స్మరిస్తూ వాటిద్వారా దేహాన్ని విడుస్తారు.
బృహదారణ్యకోపనిషత్తు(4, 4, 1):-ఆజీవుడు వ్యాపారాలతోఉన్న తేజోమయకరణాలను మృత్యుకాలంలో తనతో చేర్చుకొని హృదయాన్ని తీసుకువెడతాడు. అప్పుడు లింగశరీరంతో బాటు జీవుడు హృదయంలో ఉంటాడు. దేహంలో అప్పుడు ఇంద్రియకార్యాలేవి జరగవు. అదే జీవుడు శరీరంనుంచి నిష్క్రమించేసమయం. అప్పుడు హృదయభాగం ప్రకాశవంత మౌతుంది. అక్కడ నుంచే హితా అనే హృదయనాడులు పైకి వస్థాయి. ఇవి 101. ఈ నాడుల నుంచే జీవులను వాళ్ళ కర్మలను అనుసరించి వివిధ గతులు కలుగుతాయి. వీటిలో సుషమ్నా ఒకటి. దానికి మూర్ధంలో ఉండే బ్రహ్మరంద్రంతో సంబంధం ఉంటుంది. ఇతరనాడులకు చక్షురాది ఇంద్రియాది ప్రదేశాలతో సంబంధం ఉంటుంది. దేహం నుంచి బయటకు వెళ్ళడానికి అనువైన ఈహృదయం తెరుచుకోనంతవరకు జ్ఞానులు, అజ్ఞానులు అందరూ సమానంగా వాగాది ఇంద్రియాలతో కూడిన సూక్ష్మశరీరంతో బాటు సమానంగా ఉత్క్రమణ చేస్తారు. ధ్వారం తెరుచుకున్న తరువాత వాళ్ళ వాళ్ళ కర్మలను అనుసరించి వేర్వేరు గతులు కలుగుతాయి. మార్గాలు వేరేవుతాయి. పూర్వజ్ఞానికి స్థూలసూక్ష్మదేహాలు రెండూ అక్కడే సమాప్తం అవుతాయి. అతను అమృతత్వం పొందుతాడు. అజ్ఞాని నవరంద్రాలలో ఏదో ఒక మార్గంలో నిష్క్రామిస్తాడు. అతనికి బ్రహ్మ లోక ప్రాప్తి లేదు.
రశ్మ్యధికరణం ( 4, 2, 18 )
సూత్రం :- 514
" రశ్మ్యనుసారీ "
రశ్మ్యనుసారీ :- బ్రహ్మనాడి ద్వారం గుండా ఉత్క్రమించే బ్రహ్మ జ్ఞాని సూర్యరశ్మిని అనుసరించి బ్రహ్మాన్ని పొందుతాడు.
భావం :- బ్రహ్మ నాడి ద్వారా ఉత్క్రమించే బ్రహ్మజ్ఞాని సూర్యరశ్మిని అనుసరించి బ్రహ్మాన్ని పొందుతాడు.
వివరణ:-ఉపాసకుడు ఈశరీరం నుంచి ఉత్క్రమించేటప్పుడు పగలు మరణించినా, రాత్రి మరణించినా విశేషం ఏది లేకుండా రశ్ములను అనుసరిస్తాడా? లేక పగలు మాత్రమేనా? ఈ తేజోసంబంధం పగలు, రాత్రి ఎప్పుడు మరణించినా ఉంటుందా? అని సంశయం కలుగుతుంది. ఉపాసకుడు ఈ శరీరంనుంచి నిష్క్రమించేటప్పుడు 101 వ నాడి అయిన బ్రహ్మనాడి ద్వారా పైకి వెళ్లి, పగలు మరణించినా, రాత్రి మరణించినా తేజోరశ్ములను అనుసరించి బ్రహ్మాన్ని పొందుతాడు.
ఛాందోగ్యోపనిషత్తు(8, 6, 5):-జ్ఞాని ఈ శరీరంనుంచి వెళ్ళేటప్పుడు సూర్యరశ్మలతో పైకి వెడతాడు. దీనిని బట్టి సుషమ్నా నాడికి రశ్ములతో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.
ముండకోపనిషత్తు(1, 2, 11):-బ్రహ్మోపాసకుల కర్మలు క్షీణిoచగా సూర్యుని ద్వారా పయనిస్తారు. కనుక సూర్య రశ్ములే బ్రహ్మలోకయాత్రకు ఉపకరిస్తాయని స్పష్టమౌతోంది. సుషమ్నాద్వారా ఈ దేహంనుండి నిష్క్రమించిన ఉపాసకుడు ఆ నాడితో సంబంధం ఉన్న సూర్యకిరణాలను అనుసరించి పగలు, రాత్రి అనే భేదం లేకుండా బ్రహ్మలోకం చేరతాడు.
సూత్రం :- 515
" నిశినేతి చేన్న సంబంధస్య యావద్దేహభావిత్వా ద్దర్శయతి చ
నిశినఇతిచేత్:-రాత్రిపూట రశ్మి సంబంధం ఉండదని అనడం, న:-సరియైనది కాదు, సంబంధస్య:-నాడీరశ్మి సంబంధం, యావత్ దేహభవిత్వాత్:-దేహం ఉన్నంతవరకు ఉండే స్వభావంఉన్నది అని దర్శయతిచ:-ఉపనిషత్తుకూడా తెలియజేస్తోంది.
భావం :- రాత్రి పూట రశ్మి సంబంధం ఉండదని అనడం సరియైనది కాదు. నాడీ రశ్మి సంబంధం దేహం ఉన్నంత వరకు ఉండే స్వభావం ఉన్నదని ఉపనిషత్తు తెలియజేస్తోంది.
వివరణ:-సాధారణంగా దేహానికి సూర్యరశ్మితో సంబంధం పగలు మాత్రమే ఉంటుందని అనుకుంటారు. కాని నాడులకు, సూర్యరశ్మికి దేహం ఉన్నంత వరకు సంబంధం ఎప్పుడు ఉంటుంది. అందుచేత రాత్రులందు జీవుడు కిరణాలను అనుసరించడని చెప్పడంలో అర్ధం లేదు. ఈవిషయాన్నే ఉపనిషత్తు తెలియజేస్తోంది.
నిరుక్తం(2, 2, 2):-సూర్యుడి రశ్మి చంద్రుడు ప్రకాశించేలా చేస్తోంది. ఆదిత్యునివల్లనే చంద్రునికి కాంతి లభిస్తుంది. అందువలన పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడు దేహానికి సూర్యరశ్మితో సంబంధం ఉంటుంది. ఉపాసకుడు మరణించినా, అతని గతిలో ఏమార్పు ఉండదు. రాత్రి పూట సూర్యుడు ఉండదు కదా! మరి రాత్రులందు మరణించిన వారికి సూర్యరశ్మితో సంబంధం ఉండదని కొంత మంది సందేహిస్తారు. అది నిజం కాదు. నాడులకు, సూర్యరశ్మికి ఉన్న సంబంధం వస్తూపోతూ ఉండేదికాదు. శరీరం ఉన్నంత వరకు ఇది ఉంటుంది. దేహంలో అన్ని నాడులలో వ్యాపించి ఉండే పిత్తరసం సూర్యుని తేజస్సే. జీవుడు పగలుమరణించినా, రాత్రిమరణించినా ఆసమయంలో సూర్యరశ్మి ఉన్నా లేకపోయినా మృతి చెందిన వెంటనే సూర్యరశ్మి ప్రాప్తి కలుగుతుంది.
దక్షిణాయనాధికరణం ( 4, 2, 20 )
సూత్రం :- 516
" అత శ్ఛాయనే పి దక్షిణే "
అతః చ :- అందువల్లే, దక్షిణే ఆయనే అపి :- కృష్ణ పక్షంలో కూడా దేహానికి సూర్య రశ్మి సంబంధం ఉంటుంది.
భావం :- దక్షిణాయనం కృష్ణపక్షంలో కూడా దేహానికి సూర్య రశ్మి సంబంధం ఉంటుంది.
వివరణ:-గురువర్యా! ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని, ఆకాలంలో మరణించిన వారు బ్రహ్మ లోకానికి వెడతారని, దక్షిణాయనంలో మరణించిన వారికి బ్రహ్మలోక ప్రాప్తి లేదంటారు? ఇది నిజమేనా? అని అడిగాడు కృష్ణశర్మ. ఉత్తరాయణం, దక్షిణయనం సూర్యగమనం వలన కలిగేవి కావు. అవి దేవయాన, పితృయాన మార్గాలు. ఈ జ్ఞానమనేది ఎప్పుడూ ఉండేదే. దక్షిణయానంలో చనిపోయినప్పటికీ బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. అలాగే అజ్ఞానులు ఏ కాలంలో మరణించినా బ్రహ్మలోకప్రాప్తి లభించదు. జ్ఞానిదేహంతో సూర్యరశ్మికి సంబంధం ఉంటుందని సమాధానం ఇచ్చాడు గురువుగారు. ఉత్తరాయణంలో మరణించిన వారికి బ్రహ్మలోక ప్రాప్తి వస్తుందని, దక్షిణాయానం లో మరణించిన వారు బ్రహ్మ లోకం చేరలేరని, అందుకే భీష్మడు సూర్యరశ్మి ఎక్కువగా ఉండే ఉత్తరాయణం వరకు వేచి ఉన్నాడని పూర్వ పక్ష వాదన. కృష్ణపక్షంలో దక్షిణాయానంలో ఎప్పుడు మరణించినా జ్ఞాని దేహంతో సూర్యరశ్మికి సంబంధం ఉంటుంది. ఉత్తరాయణం, దక్షిణాయానం సూర్యగమనం వలన కలిగే కాలాలు కావు. ఉత్తరాయణ దేవత, దక్షిణాయన దేవత అని వీరు కాలాధి దేవతలు. వీరు సంవత్సరం పొడవునా సంచరిస్తుంటారు. వీరిని అతివాహిక దేవతలు అంటారు. అంటే మోసుకొని పోయేవారు అని అర్ధం. సగుణోపాసన చేసిన వారు ఏ కాలంలో, ఏ పక్షంలో, పగలు, రాత్రి ఎప్పుడు పోయినా బ్రహ్మలోకం చేరతారు. ప్రారబ్ద కర్మలు నశించిన తరువాత జ్ఞాన సాధనతో చేసిన ఉపాసన దక్షిణయానంలో వృధా కావు. ఉత్తరాయణంలో మరణించినా వారందరు బ్రహ్మ లోకంపోతే, ఇక సత్కార్యాలు చెయ్యవలసిన అవసరం ఏముంటుంది. భీష్ముడు 58 రోజులు అంపశయ్య మీద వుండి, ఉత్తరాయణం లో మరణించడానికి కారణం శ్రీకృష్ణుడు చెంత నుండగా, పాండవులకు ధర్మ సూక్ష్మాలు, శాస్త్ర వచనాలు బోధించడానికి, తన తండ్రి శంతనుడు ఇచ్చిన వరం 'స్వచ్ఛంద మరణం ' యొక్క శక్తి తెలుసుకోవడానికి, తన తండ్రి వరం ఎంతో గొప్పదని, దాని ప్రభావం లోకానికి వెల్లడి చెయ్యడానికి, కొంత కాలం వేచి చూశాడు. కాని ఉత్తరాయణం కోసం కాదు. మరణం ఆసన్నమయ్యేవరకు ఎవరైనా ఎదురు చూడవలసిందే. మానవ జీవిత లక్ష్యం జన్మ రాహిత్యం, మోక్షం సాధించడం. అలాగే భీష్మడు తాను చెయ్యవలసిన కర్తవ్యం పూర్తి కాగానే బ్రహ్మ సాయుధ్యాన్ని పొందాడు.
దక్షిణాయనాధికరణం ( 4, 2, 21 )
సూత్రం :- 517
" యోగినః ప్రతిచ స్మర్యత్ స్మార్తే చైతే "
యోగినః ప్రతిచ :- కాల విశేషం వలన మరణించిన విషయంలో యోగికి ఆవృత్తి, అనావృత్తి కలుగుతాయని, స్మర్యతే :- చెప్పారు. ఏతే చస్మార్తే :- ఇవి రెండూ స్మార్తాలే.
భావం :- కాల విశేషం వలన మరణించిన విషయంలో యోగికి ఆవృత్తి, అనావృత్తి కలుగుతాయాని చెప్పారు. ఇవి రెండూ స్మార్తాలే. అంటే స్మృతులను అనుసరించినవే.
వివరణ:-కర్మత్యాగులైన జ్ఞానయోగులు కొందరు అనావృత్తిని, కర్మానుష్టానపరులైన కర్మయోగులు ఆవృత్తిని పొందే మరణకాలం గురించి స్మృతుల్లో చెప్పబడింది. ఆయోగుల కోసం చెప్పే స్మృతిలో కాలవిశేషాన్ని వివరించారు. ఈ యోగం సాంఖ్యం అనే పురాణాల్లో చెప్పబడింది. కాని వేదంలో చెప్పబడ లేదు. కనుక అవి వేదప్రమాణాలు కావు. అయితే వేదాలలో చెప్పబడిన దేవయాన, పితృయానాలు, పురాణాలలో చెప్పబడ్డ అర్చిరాది, దూమమార్గం ఒక్కటే అని చెప్పవచ్చును. భగవద్గీతలో యోగుల కోసం అర్చిరాది మార్గం, దూమమార్గం గురించి చెప్పబడింది. అగ్ని, జ్యోతి, దినం, శుక్ల పక్షం, ఉత్తరాయణం వీటిలో మరణించే జ్ఞానయోగి బ్రహ్మాన్ని పొందుతాడని చాలా మంది అనుకుంటారు. రాత్రి, కృష్ణ పక్షం, దక్షిణాయాణం వీటిలో మరణించిన వారు చంద్రరశ్మిని పొంది కర్మయోగి అనిపించుకుంటాడని అతను మళ్ళీ జన్మిస్తాడని భావిస్తారు. కాని ఇది వాస్తవం కాదు. ఈమార్గాల వాస్తవికతలు గుర్తించిన యోగి ఎన్నడూ మోహంలో పడిపోడు. కాలవిశేషం వలన మరణించడం చేత ముక్తికలుగదు. క్రమముక్తికి కాల నియమం లేదు. జ్ఞానియైన వాడు దక్షిణాయనంలో మరణించినా బ్రహ్మలోకం చేరతాడు. పూర్ణజ్ఞానికి ఎప్పుడు మృత్యువు వచ్చినా అతని సద్గతికి ఎలాంటి ప్రతి బంధకము ఉండదు.
అర్చిరాద్యధికరణం ( 4, 3, 1 )
సూత్రం :- 518
" అర్చిరాదినా తత్ ప్రధితేః "
అర్చిరాదినా:-శరీరంనుంచి మూర్ధన్య నాడిగుండా బయటపడి, ఉపాసకుడు దేవాయానం అయిన అర్చిరాది మార్గంలో బ్రహ్మలోకం చేరతాడని, తత్ ప్రధితే :- ప్రసిద్ధి ఉన్నది.
భావం :- ఉపాసకుడు శరీరం నుంచి మూర్ధన్యనాడి గుండా బయట పడి, దేవయానం అయిన అర్చిరాది మార్గంలో బ్రహ్మాన్ని చేరతాడని ప్రసిద్ధి ఉన్నది.
వివరణ:-బ్రహ్మలోకానికి వెళ్లే భిన్నమార్గాల గురించి వేదంలో చెప్పబడ్డాయి. బృహదారణ్యకంలో వీరు జ్యోతిరభిమాన దేవతనుపొందుతారు. ఉపాసకుడు ఈలోకంనుంచి వెళ్ళేటప్పుడు పురుషుడు వాయువుతోవస్తాడు. ముండకోపనిషత్తులో వారు పాపరహితులై సూర్యునిద్వారా ఉత్తరాయణమార్గాన బ్రహ్మలోకం చేరతారు. కౌషీతకిఉపనిషత్తులో దేవయాన మార్గం పొంది, అగ్నిలోకానికి వెడతాడు. ఈ మార్గలన్నింటికి సంబంధం ఉన్నదా? లేదా? అనేది సందేహం. ఉపాసకుడు ఉత్క్రమించడానికి శాస్త్రంలో ఒకమార్గం ప్రసిద్ధంగా ఉన్నది అదే అర్చిరాది మార్గం లేదా దేవయానమార్గం అంటారు. అన్ని చోట్ల అర్చిరాది మార్గమే చెప్పబడింది. బ్రహ్మ లోకానికి మార్గం అర్చిరాది మార్గమే.
ఛాందోగ్యోపనిషత్తు(5, 10, 1):- అర్చిపదం కిరణవాచకం. అంటే రశ్మి. దాని నుంచి విద్యత్తు వరకు ఉన్న మార్గాన్ని దీనిలో సూచించారు. దీనిని అనుసరించి ఉపాసకుడు బ్రహ్మలోకాన్ని చేరతాడు. ఛాందోగ్యంలో శ్వేతకేతువు ఉద్దాలకునితో " మానవుడు మరణించిన తరువాత ఈ నాలుగు భూతాలు ఆయా భూతలతో కలసి పోతాయి. మానవుని యోగ్యత అనేది అతను చేసిన కర్మలను మీద ఆధారపడివుంటుంది. అతను ఆత్మానుభావం పొందినట్లయితే వెలుగు బాట అయిన అర్చిరాదిమార్గంలో ప్రయాణిస్తాడు. అక్కడ పుణ్య ఫలాన్ని అనుభవించి మోక్షన్ని పొందుతాడు. అతనికి పునర్జన్మ ఉండదు. అతనికి అక్కడ శాశ్వత మైన ఆనందం లభిస్తుంది. వాయ్వాదిమార్గాలన్ని దీనిలోనే అన్వయింపబడతాయి. ఎక్కడైనా మార్గం చెప్పకపోతే అది కూడా ఆర్చిరాది మార్గమేనని గ్రహించాలి. ఉపాసనలు వేర్వేరు ఉన్నట్లే, బ్రహ్మాన్ని చేరే మార్గాలు కూడా వేరుగానే ఉంటాయి. అవిఅన్నీ ఒక్కటి కాదు అని పూర్వపక్ష వాదన. క్రమ ముక్తి లేదా జీవన్ముక్తి కోరుకునే ఉపాసకులు అర్చిరాదిమార్గం ద్వారా జ్యోతి, సూర్యుడు, వాయువు, అగ్నిని చేరతారని చెప్పారు. అర్చి అంటే వెలుగు అనిఅర్ధం. జీవన్ముక్తుడు మరణించిన తరువాత కల్పాంతం వరకు బ్రహ్మలోకంలో ఉండి, ఆ తరువాత బ్రహ్మంలో లీనం అవుతారు. ఉపాసనలు, బ్రహ్మాన్ని చేరే మార్గాలు, అన్ని ఒక్కటేనని, చేరే బ్రహ్మం ఒక్కటేనని గ్రహించాలి. కల్పం అంటే 14 మన్వంతరాలు, 1 మన్వంతరానికి - 71 మహాయుగాలు, 1మహాయుగానికి - 4 యుగాలు అని చెప్పబడింది. సూర్యలోకం, చంద్రలోకం అంటే మనం చూస్తున్న గ్రహాలుకాదు. ఉపాసకుడు గురుసేవ, ఉపదేశం, జ్ఞానసమపార్జన, సాధన, ఆత్మ ధ్యానంలో తానే బ్రహ్మాన్ని అని తెలుసుకుంటేనే జీవన్ముక్తుడౌతాడు.
వాయ్వధికరణం ( 4, 3, 2 )
సూత్రం :- 519
" వాయు మబ్దా ద విశేష విశేషాభ్యామ్ "
అబ్దాత్ :- సంవత్సరం నుంచి, వాయుమ్ :- వాయువును చేరతారని అంగీకరించాలి అని, అవిశేష విశేషాభ్యమ్ :- సామాన్య, విశేష వాక్యాల వలన తెలుస్తోంది.
భావం :- సంవత్సరం నుంచి వాయువును చేరతారని అంగీకరించాలని సామాన్య, విశేష వాక్యాల వలన తెలుస్తోంది.
వివరణ:-ఈఅధికరణంలో ఉత్క్రమించే జీవుడు సంవత్సరదేవత, తరువాత వాయువును పొందుతాడని చెప్పబడింది. మోక్షార్థులు అర్చిరాది మార్గం ద్వారా బ్రహ్మలోకం చేరే మార్గాల గురించి ఉపనిషత్తులలో చెప్పబడింది.
కౌషీతకిఉపనిషత్తు:-ఉపాసకుడు ముందుగా అగ్నిలోకానికి వెళ్లి, అక్కడ నుంచి వరుసగా వాయు, వరుణ, ఇంద్ర, ప్రజాపతి లోకాలకు పోయి, అక్కడ నుంచి బ్రహ్మలోకం చేరతాడు.
ఛాందోగ్యోపనిషత్తు:- ఉపాసకుడు వరుసగా అర్చిరభిమాన దేవతను, దినాభిమాన దేవతను, శుక్లపక్ష అభిమానదేవతను, ఉత్తరాయణదేవతను, సంవత్సరదేవతను, సూర్యలోకం, చంద్రలోకం, విద్యుత్తులోకం, ఆతరువాత బ్రహ్మలోకం చేరతారు. అమాయకపురుషుడు అంటే దేవత బ్రహ్మలోకంనుంచి విద్యుత్తులోకం వచ్చి, అతడిని బ్రహ్మలోకం తీసుకొని వెడుతుంది.
బృహదారణ్యకోపనిషత్తు(5, 10, 1):-ఈలోకంనుంచి నిష్క్రమించే పురుషుడు వాయువును పొందుతాడు. రధచక్రంలో మధ్య ఉండే రంధ్రంలాగా వాయువు అతనిని ఆదిత్యుని వైపు వెళ్ళడానికి సహకరిస్తుంది. ఆకాశంలో ఘనీభవించిన ఆ వాయువు పగిలిపోయి మార్గం ఇస్తుంది. ఆమార్గం గుండా ఉపాసకుడు సూర్యలోకం చేరతాడు. కౌషీతకి, ఛాందోగ్యంలో వాయుమార్గం చెప్పబడలేదు. ఛాందోగ్యంలో సంవత్సరం స్థానం, బృహదారణ్యకంలో దేవలోకం చెప్పారని తెలుస్తోంది. ఈ రెండింటిని సమానంగా పరిగణిoచి, బృహదారణ్యకంలో వాయుపదాన్ని విశేషంగా నిర్దేశించడం వలన, సంవత్సరం తరువాత ఆదిత్యపదానికి ముందు వాయుపదాన్ని చేర్చి సమన్వయం చేసుకోవాలి. అప్పుడు మాసం నుంచి సంవత్సరం, దాన్నుంచి దేవలోకం, అక్కడ నుంచి వాయువు, దాని నుంచి ఆదిత్యున్ని చేరతారని ఒక క్రమం ఏర్పడింది.
వరుణాధికరణం ( 4, 3, 3 )
సూత్రం :- 520
" తడితోధి వరుణః సంబంధాత్ "
తడితః:-విద్యుత్తుకు, అధి:-పైన, వరుణః:-వరుణలోకంఉందని తెలుసుకోవాలి సంబంధాత్:-ఈరెండింటికి సంబంధంఉన్నది.
భావం :- విద్యుత్తుకు పైన వరుణ లోకం ఉందని తెలుసుకోవాలి. ఈ రెండింటికి సంబంధం ఉన్నది.
వివరణ:-ఈఅధికరణంలో విద్యుత్ దేవత తరువాత జీవుడు వరుణలోకాన్ని చేరతాడని చెప్పబడింది. విద్యుత్తు తరువాత వరుణుడికి స్థానముంటుంది. విద్యుత్తు అంటే మెరుపు, వరుణుడు అంటే వర్షం. వరుణశబ్దం అంటే వరించ తగినవాడు, ఈశ్వర వాచకమైన జలానికి పర్యాయ పదంగా వాడతారు.
కౌషీతకిబ్రాహ్మణం(1, 3,):- ఇక్కడ వరుణఅంటే జలం. ఉపాసకుడు దేవయానమార్గంలో ముందు అర్చి అంటే అగ్ని లోకాన్ని పిదప క్రమంగా వాయువు, ఆదిత్యుడు, వరుణుడు, ఇంద్రుడు, ప్రజాపతి అనే లోకాలను చేరతాడు.
ఛాందోగ్యోపనిషత్తు(7, 11, 1):- మెరుపు మెరుస్తుంది. ఉరుముతుంది, వర్షిస్తుంది, అని వర్ణించారు. కనుక విద్యుత్తు తరువాత వరుణపదం రావాలి. అప్పుడు వరుణుడి నుంచి ఇంద్రుడు, ప్రజాపతి, బ్రహ్మలోకాల క్రమం ఏర్పడుతుంది. ఇదే దేవయానం. మెరుపుమెరిశాక వర్షం వస్తుంది. వరుణపదం విద్యుత్తు తరువాత ఉండాలని, విద్యుత్తుకు వరుణుడికి సంబంధం ఉందని చెప్పారు.
అతివాహికాధికరణం ( 4, 3, 4 )
సూత్రం :- 521
" అతి వాహికా స్తలింగాత్ "
తత్ లింగాత్ :- శాస్త్ర వచనాలను బట్టి అర్చిరాదులు, అతి వాహికః :- ఒక చోటు నుంచి మరొక చోటుకు చేర్చే వాహనాలు.
భావం:-శాస్త్రవచనాలను బట్టి అర్చిరాదులు ఒకచోటు నుంచి మరొకచోటుకు చేర్చే వాహనాలు. వీరు అతివాహక దేవతలే.
వివరణ:-అర్చిరాదిమార్గంలో అనేకమైన లోకాలు చెప్పబడ్డాయి. అవి గుర్తుకోసమా? భోగాలుఅనుభవించే లోకాలా? త్రోవలో విశ్రాంతి తీసుకోవడానికి స్థానాలా? లేక ఉపాసకుని బ్రహ్మలోకానికి తీసుకొని పోయే దేవతలా? అని సంశయం కలుగుతుంది. బ్రహ్మలోకానికి ప్రయాణమయ్యే వాడికి ఇవన్నీ అతివాహికలు. ఈఅర్చిరాదులన్నీ ఉపాసకుణ్ణి వెంట బెట్టుకొని బ్రహ్మలోకానికి తీసుకొని వెడతారు. విద్యుల్లోకం నుంచి దివ్య పురుషుడు బ్రహ్మలోకానికి తీసుకువెడతాడు. ప్రతి లోకంలోనూ ఆయా దేవతలు ఉపాసకుని జాగ్రత్తగా తరువాత లోకానికి చేరుస్తారు. అందువల్లనే వారందరు అతివాహికలే.
ఛాందోగ్యోపనిషత్తు(8, 6, 5):- ఆత్మ ఈశరీరం ద్వారా ఉత్క్రమించి రశ్ముల ద్వారా పైకి వెడుతుంది. మనోవేగంతో ఆదిత్యుణ్ణి చేరుతుంది. ఈ రశ్ములే అతివాహకాలు. ఇవి రశ్ముల రూపంలో గాని, విద్యుత్తరంగ రూపంలో గాని ఉండవచ్చును. వీరిని బ్రహ్మం వరకు చేర్చేవాడు అమానవపురుషుడు. అతను చేతనదేవుడని, దివ్యశక్తి అని అంటారు. అజ్ఞానస్వరూపం కావచ్చును. లేదా లింగ శరీరం కావచ్చును. అదే ఆత్మను బ్రహ్మం వరకు తీసుకెడుతుంది. లింగశరీరం సర్గారంభం నుంచి ఎప్పుడు ఆత్మతోనేఉంటుంది. జీవుడికి ముఖ్యాశ్రయం లింగశరీరమే. ఈసూక్ష్మదేహం సహకారంతోనే జీవుడు బ్రహ్మ సాక్షాత్కారం చేసుకుంటాడు. వీరికి ఉత్క్రమణఉండదు. స్థూలశరీరంతోబాటు సూక్ష్మశరీరం కూడా అతణ్ణి విడిచి వెళ్ళిపోతాయి.
బృహదారణ్యాకోపనిషత్తు 8, 13, 1):-ఉపాసకులకు దేవయానగతి పూర్వబ్రహ్మజ్ఞానం కలగక, పూర్ణత్వానికి దగ్గరలో ఉండే వారికీ, పూర్ణజ్ఞానికి సూక్ష్మదేహం ఉండదు. ఆస్థితి కలిగే వరకు ఉపాసకుడు సూక్ష్మదేహంతో ఉండి, ఉత్తమ శరరాలలోకి వెడుతుంటాడు. కనుక జీవుణ్ణి బ్రహ్మంలో చేర్చే అమానవ పురుషుడు లింగ శరీరమే అనడం సంగతంగా కనిపిస్తుంది. గ్రామానికిగాని, నగరానికిగాని బయలుదేరిన వాడు లోకంలో నువ్వు ఇక్కడ నుంచి ఆ పర్వతం దగ్గరకు వెళ్ళు, తరువాత మర్రిచెట్టు దగ్గరకు వెళ్ళు. తరువాత నది దగ్గరకు వెళ్ళు. అక్కడ నుంచి గ్రామం గాని నగరం కాని చేరుకుంటావు అని ఏ విధంగా ఉపదేశించబడతాడో, అట్లే ఆర్చిరాదిమార్గంలో లోకాల గురించి చెప్పబడింది. అవి మార్గ చిహ్నాలు. అవి ఆకాశ ప్రదేశప్రతీకలు మాత్రమే. ఆస్థలాలలో సూర్యరశ్మి ఆవరించి ఉంటుంది. ఆ వెలుగుమార్గంలోనే జీవాత్మ సూక్ష్మశరీరంతో దేశాంతరానికి వెడుతుంది. ఆత్మరశ్ముల్ని ఆశ్రయించి తాను వెళ్ళవలసిన ప్రదేశాన్ని చేరుతుందని శాస్త్రాలంటున్నాయి. సూక్ష్మ శరీరం జీవుడికి నిరంతరం వాహకం. సూర్యరశ్మికి తాత్కాలిక వాహనం అనవచ్చును. ఉపాసకుడికి నిర్దేశించిన గమ్యం ప్రకాశమానంగా ఉంటుంది. జీవుడు ఈ ప్రదేశాలను క్షణమాత్రంలో దాటి చేరుకుంటాడు. ఇవి భోగ భూములు కావు. విశ్రమించే స్థానాలు కావు. ఇతర ప్రాణులు పితృయాన మార్గంలో అంటే చీకటి మార్గంలో ప్రయాణిస్తారు.
సూత్రం :- 522
" ఉభయ వ్యామోహాత్తత్సిద్ధేః "
ఉభయ వ్యామోహత్:- రెండు రకాలైన మార్గ చిహ్నాల జ్ఞానం లేకపోవడం చేత, తత్ సిద్దే :- అర్చిరాదులు అతివాహకాలని సిద్ధిస్తోంది.
భావం :- రెండు రకాలైన మార్గచిహ్నాల జ్ఞానం లేకపోవడం చేత అర్చిరాదులు అతివాహకాలని సిద్ధిస్తోంది.
వివరణ:-మరణసమయంలో స్థూలశరీరాన్ని వదలి ఉపాసకుడు లోకాంతరాలకు వెళ్ళినప్పుడు, అతను వెళ్లే మార్గలన్నీ జడములు, అచేతనాలు. అందుచేత అవి వ్యామోహితీలు. వ్యామోహపదం వలన జీవుడు శరీరహీనుడు, మార్గజ్ఞానం లేనివాడని మహర్షి చెబుతున్నారు. సూక్ష్మశరీరాలు జడాలు కాబట్టి వాటికి సంకల్పంఉండదు. ఉపాసకుడు శరీరహీనుడు. మార్గజ్ఞానం లేనందున బ్రహ్మలోకం చేరలేడు. అర్చిరాదిమార్గంలో ఉన్న విద్వాంసునికి దేహం లేకపోవడం వలన ఇంద్రియాల సముదాయం ముద్దగా అయిపోయి, జీవుడు స్వయంగా ఏది చేయడానికి సమర్ధుడు కానందున అచేతనంగా ఉంటాడు. అర్చిరాదులు కూడా అచేతనాలే. అందుచేత అర్చిరాదుల అభిమానదేవతలు వారిని తమ యొక్క లోకాలకు తీసుకొని వెడతారు. అగ్నిస్వామిగా ఉన్న లోకానికి వెళ్లిన వాళ్ళను అగ్ని ముందుకు నడిపిస్తాడు. వాయువు స్వామిగా ఉన్న లోకానికి వెళ్లిన వాళ్ళను వాయువు ముందుకు నడిపిస్తాడు. ఈ దేవతలు అన్ని కాలాల యందు, అన్ని సమయాల యందు ఉంటారు. దక్షిణయాణం, రాత్రి పగలు ఎప్పుడైనా వారుంటారు.
సూత్రం :- 523
" వైద్యుతే నైవ తత స్తచ్చతేః "
తత్ శృతేః :- ఈ విషయంలో శాస్త్రాలు చెప్పడం వలన, తతః :- విద్యుత్తుకు తరువాత, వైద్యుతేన ఏవ :- విద్యుత్తు ఆవిర్భావం వల్లే ఉపాసకుడి ఆత్మ ముందుకు వెడుతుంది.
భావం :- ఈ విషయంలో శాస్త్రాలు చెప్పడం వలన విద్యుత్తుకు తరువాత, విద్యుత్తు ఆవిర్భావం వలనే ఉపాసకుడి ఆత్మ ముందుకు వెడుతుంది.
వివరణ:- ఉపాసకుడు స్థూలశరీరాన్ని విడిచి ఉత్క్రమించి, అర్చిరాదులమూలంగా విద్యుత్ లోకం చేరతాడు. ఉపాసనల ఫలితంగా సూక్ష్మశరీరం అర్చిరాదులను అనుసరిస్తూ ఉపాసకుణ్ణి బ్రహ్మంవరకు చేస్తుంది. దీనినే బ్రహ్మలోకప్రాప్తి అంటారు. పూర్వపక్షం వారి వాదన ఒకటుంది. బ్రహ్మ లోకం నుంచి అమానవ పురుషుడు అగ్ని లోకానికి వచ్చి, ఉపాసకుని సూక్ష్మ శరీరాన్ని బ్రహ్మలోకానికి తీసుకొని వెడతాడని చెప్పారు కదా! మధ్యలో వరుణ, ఇంద్ర, ప్రజాపతి లోకాలను ఎందుకు చెప్పారు? వారి అవసరం లేదు కనుక వారు అతివాహిక దేవతలు కారు అని విమర్శించారు. ప్రతిపక్షంవారు ఎంత సూక్ష్మంగా విమర్శిస్తే, సూత్రకారుడు అంత సూక్ష్మంగా సమాధానం చెప్పారు. అమానవపురుషుడు సూక్ష్మశరీరం తీసుకొని విద్యుత్లోకంనుండి బయలుదేరేటప్పుడు వరుణ, ఇంద్ర, ప్రజాపతి దేవతలు అమానవపురుషునికి సహాయకులుగా ఉండి, ముందులోకాలకు చేర్చుతారు. విద్యుత్తు, వరుణ ఇంద్ర, లోకాలు అర్చిరాది మార్గాలు, ఆ తరువాతవి దేవతా లోకాలు. దేవతా స్వరూపలైన అర్చిరాదులు అతివాహికలు అని యుక్తంగానే చెప్పబడింది. అర్చిరాదులలో అతివాహికలు మానవులు అని, విద్యుత్తు తరువాత మాత్రం అమానవ పురుషుడని చెప్పబడింది. కాని చివరకు వారందరు అర్చిరాద్యభిమాన దేవతలు అని చెప్పడం వలన వీళ్ళు కూడా అమానవులేనని చెప్పినట్లవుతుంది.
కార్యాధికరణం ( 4, 3, 7 )
సూత్రం :- 524
" కార్యం బాదరి రస్య గత్యుపపత్తేః "
అస్య గతి ఉపపత్తేః :- ఉపాసకుడి గతి నిర్ధారణ అయి ఉన్నది, కార్యం :- అతడి గతి కార్యబ్రహ్మమే అని, బాదరి :- బాదరి ఆచార్యుని అభిప్రాయం.
భావం :- ఉపాసకుడి గతి నిర్ధారణ అయి ఉన్నది. అతడి గతి కార్య బ్రహ్మమే అని బాదరి ఆచార్యుని అభిప్రాయం.
వివరణ:-దేవయానంద్వారా ఉపాసకుడు బ్రహ్మలోకం చేరతాడు కదా! ఒకచోట బ్రహ్మం అని, మరొక చోట బ్రహ్మ లోకం అని చెప్పారు. అక్కడ బ్రహ్మ అంటే పరబ్రహ్మా? లేక కార్య బ్రహ్మా? అని సంశయం కలుగుతుంది. అమానవపురుషుడు ఉపాసకుణ్ణి ముందుగా కార్యబ్రహ్మ దగ్గరకు చేరుస్తాడు. కార్యబ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ, అంటే సగుణబ్రహ్మ. పర బ్రహ్మ అంటే సర్వంతర్యామి, సర్వత్రావ్యాపకత్వం ఉన్నవాడు. ఈ తత్వాన్ని పొందడానికి ఉపాసకుడికి గతి అవసరం లేదు. ఇక్కడ ఉపాసకుడికి గతిని(మార్గాన్ని) వర్ణించారు కనుక ఇది ముఖ్యబ్రహ్మం కాదు. కార్య బ్రహ్మమేనని బాదరాయణుడి అభిప్రాయం. కార్యబ్రహ్మం అంటే ఒక విశేషప్రదేశం. ఉపాసకుడి ఆత్మ అక్కడకుచేరి, బ్రహ్మాన్ని పొందుతుంది. అనివార్యంగా ఉపాసకుడు ఆత్మ సాక్షాత్కారంతో బ్రహ్మప్రాప్తి పొందే ప్రదేశమే బ్రహ్మలోకం. ఛాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు లలో ఉపాసకుడి గతి బ్రహ్మలోకమనే చెప్పాయి. ఈ దేహంతో బ్రహ్మ సాక్షాత్కరించిన ఉపాసకుడి ఆత్మకు స్థూల సూక్ష్మ దేహాలు నశించి, శరీరం విడివడడంతోటే బ్రహ్మప్రాప్తి కలుగుతుంది. ఇక్కడ బ్రహ్మప్రాప్తి కలగని ఉపాసకుడు ఉత్క్రమించి, పొందే బ్రహ్మమే కార్య బ్రహ్మం అని బాదరాయణుని అభిప్రాయం.
సూత్రం :- 525
" విశేషితత్వా చ్చ "
" చ :- అలాగే, విశేషితత్వాత్ :- విశేషణాల వలన స్పష్టం చేసినందు చేత కార్యబ్రహ్మాన్నే ఉపాసకుడు చేరుకుంటాడని సూత్రానికి అర్ధం.
భావం :- ఉపాసకుడి గతి కార్యబ్రహ్మమేనని చెప్పబడింది. అలాగే విశేషణాల వలన స్పష్టం చేసినందువలన కార్య బ్రాహ్మన్నే ఉపాసకుడు చేరుకుంటాడని సూత్రార్ధం.
వివరణ:- ఇంకొక శ్రుతిలో కూడా ఉపాసకుడు ముందుగా సగుణ బ్రహ్మను చేరుకుంటాడని చెప్పబడింది.
బృహదారణ్యకోపనిషత్తు(6, 2, 15):- ఉపాసకఆత్మలు చాలాకాలం అక్కడ నివసిస్తారు. అక్కడ బ్రహ్మలోకానికి చాలా కాలం నివసించడం అనేవి విశేషణాలు. దీని వలన బ్రహ్మలోకాలు, అనే విశేషణం వలన అక్కడ ఉపాసకులు ఉండటం అనేవి తెలుస్తున్నాయి. 'బ్రహ్మ లోకాన్ 'అనడం లో వీటిలో చాలా లోకాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనిని బట్టి బ్రహ్మలోకాలకు ఒక అవధి, ఒక ప్రదేశం ఉన్నదని తెలుస్తోంది. బ్రహ్మప్రాప్తి అలాంటిది కాదు. బ్రహ్మను పొందిన ఆత్మ ఒక సీమితి. పరిమితం ప్రదేశంలో ఉండదు. బ్రహ్మానందం అనుభవిస్తూ సర్వత్రా విహరిస్తుంది. కనుక బ్రహ్మలోకాలు అనేకం ఉంటాయి కాని అవి బ్రహ్మ లోకాలు కావు. కార్యబ్రహ్మ విషయంలోనైతే కార్యబ్రహ్మలో ఉండే ఆయా అవస్థల భేదాన్ని బట్టి బహువచనంలో చెప్పబడింది. కాని అవి బ్రహ్మం కావు. బ్రహ్మ సృష్టించిన లోకాలు. అక్కడ కొంత కాలం ఉండి పిదప నిర్బాధగా బ్రహ్మాన్ని పొందుతాడు. కనుక బ్రహ్మలోకాలు అంటే కార్య బ్రహ్మo అని బాదరి అభిప్రాయపడటం సమంజసమే. పరబ్రహ్మ స్త్రీ, పురుష లింగ భేదం లేనివాడు, సర్వంతర్యామి, సర్వవ్యాపి, సృష్టి స్థితి లయలకు అధిపతి ఆయనే. కార్య బ్రహ్మగా సృష్టి కార్యక్రమం నిర్వహిస్తాడు. ఆయనే స్థితి కారకుడు విష్ణువు, లయం చేసేటప్పుడు లయకారకుడుగా శివుడు అని తెలియజేయబడింది. ఉన్నది పరబ్రహ్మ మొక్కటే , రెండవది లేదు అని గ్రహించాలి.
సూత్రం :- 526
" సామీప్యాత్తు తత్వ్యపదేశః "
సామీప్యాత్ తు :- సామీప్యం వలన, తత్ వ్యపదేశః :- ఆ పదం ఉపదేశిస్తుంది.
భావం :- సామీప్యం వలన బ్రహ్మపదం బ్రహ్మ సామీప్యాన్ని ఉపదేశిస్తుందని సూత్రార్ధం.
వివరణ:-సామీప్యాన్ని బట్టి అయితే కార్యబ్రహ్మకూడా బ్రహ్మ అని చెప్పబడుచున్నది. తు శబ్దం అశంకను నివర్తింప జేయడం కోసం, అపర బ్రహ్మకు సమీపంగా ఉండటం వలన దాని విషయంలో కూడా బ్రహ్మ శబ్ద ప్రయోగం విరుద్ధం కాదు.
ఉపాసన కోసం మనోమయత్వాది గుణాలతో కూడినదిగా చెప్పబడే నిర్వికారబ్రహ్మమే కార్యబ్రహ్మము. అందుచేతనే సగుణ బ్రహ్మను కూడా బ్రహ్మమనే అంటారు. బ్రహ్మం అందరికీ సమీపంలో ఉండే తత్త్వం. కాని అందరూ బ్రహ్మసమీపంలో ఉండరు. అజ్ఞానంతో కూడిన జీవుడు బ్రహ్మానికి దూరం అవుతాడు. ఒక వస్తువు దగ్గరలో ఉందని తెలియనప్పుడు అది దూరంగా ఉన్నట్లే అనిపిస్తుంది. ఉపాసకుడు పూర్ణంగా విరక్తుడైన స్థితిలోనే బ్రహ్మసామీప్యాన్ని గుర్తించి బ్రహ్మాన్ని పొందుతాడు. ఇక్కడ బ్రహ్మపదం బ్రహ్మసామీప్యాన్ని, కార్యబ్రహ్మాన్ని బోధిస్తుంది. దేవయాన మార్గంలో పయనించిన వాళ్లకు ఆవృత్తి లేదని చెబుతున్నది. బ్రహ్మం అందరికీ సమీపంలో ఉండే తత్త్వం.
సూత్రం :- 527
" కార్యాత్యయే తదధ్యక్షేణ సహాత్ః పరమభిధానాత్ "
అతః పరమ్ :- కార్యబ్రహ్మం తరువాత, అభిధానాత్ :- బ్రహ్మాన్ని పొందుతాడని చెప్పారు. అందువలన, కార్యా త్యయే :- కార్యబ్రహ్మ లోకాన్ని దాటిన తరువాత, తత్ అధ్యక్షేణ సహ :- ఆ లోకాలకు అధ్యక్షుడైన బ్రహ్మాన్ని చేరతాడు.
భావం :- కార్యబ్రహ్మాన్ని పొందిన ఉపాసకుడు బ్రహ్మాన్ని ఎప్పుడు పొందుతాడు అంటే కార్య బ్రహ్మం తరువాత బ్రహ్మాన్ని పొందుతాడని చెప్పారు. కార్య బ్రహ్మ లోకాన్ని దాటిన తరువాత ఆ లోకాలకు అధ్యక్షుడైన బ్రహ్మాన్ని చేరతాడు.
వివరణ:-కార్యబ్రహ్మకు కల్పాంతమునందు ప్రళయం సంభవించినప్పుడు, బ్రహ్మఆయుర్దాయం పూర్తైన తరువాత, ఆ కార్యబ్రహ్మ పరబ్రహ్మంలో లీనంఅవుతాడు. ఆ బ్రహ్మతోబాటే బ్రహ్మలోకం చేరిన జ్ఞానులుకూడా పరబ్రహ్మలో లీనం అవుతారు. అదే క్రమముక్తి.
బృహదారణ్యాకోపనిషత్తు(4, 4, 8):-ధ్యానశీలులైన బ్రహ్మజ్ఞానులు స్వర్గలోకం అంటే కార్యబ్రహ్మ లోకం పొంది, పిదప విముక్తులై బ్రహ్మాన్ని పొందుతారు.
ప్రశ్నోపనిషత్తు(5, ):-అతణ్ణి సామాలు బ్రహ్మలోకానికి చేరుస్తాయి. అప్పుడు అతను ప్రకృతికన్నా సూక్ష్మమైన, జీవ ఘనమైన, తన స్వరూపంకన్నా సూక్ష్మమైన, సర్వలోకవ్యాప్తమైన ఈశ్వరుణ్ణి సాక్షాత్కారం చేసుకుంటాడు. అదే బ్రహ్మ సాక్షాత్కారం.
తైత్తరీయోపనిషత్తు(2, 1):- బ్రహ్మజ్ఞాని పరాన్ని, బ్రహ్మదర్శనాన్ని పొందుతాడు. అదే మోక్షం. సామం అంటే త్రిమాత్రిక. ఓంకారరూప బ్రహ్మాన్ని ధ్యానించడం, ఓంకారం ఈశ్వరుడి సర్వోత్తమ నామం. ఉపాసనకు ఓం సర్వ శ్రేష్ఠ సాధనం. అలాంటి ఉపాసనకు ఫలం బ్రహ్మలోకప్రాప్తి. బ్రహ్మోపాసకుడు కార్యబ్రహ్మలోకాన్ని చేరి, నిరంతరం బ్రహ్మనిష్ఠుడై, బ్రహ్మాన్ని ఉపాసిస్తూ, కార్య బ్రహ్మ లోకంలో సుఖానుభావం పూర్తి కావడం తోటే, సర్వ లోకాధ్యక్షుడై బ్రహ్మాన్ని చేరతారు. ఇక్కడ పూర్వపక్షంవారి వాదన ఒకటుంది. కార్యబ్రహ్మ కల్పాంతంలో పరబ్రహ్మలో లీనం అవుతాడు కదా! అనిత్యమైన కార్యబ్రహ్మ క్రమముక్తిని ఇస్తున్నాడు కాని శాశ్వతమైన ముక్తిని ఇవ్వలేదు కదా? సగుణోపాసకులు వారి సాధనలో కృతకృత్యు లైనప్పుడు దేవయానమార్గంలోనే ముందుగా కార్యబ్రహ్మనే చేరుతారు. ప్రళయం సంభవించినప్పుడు కార్యబ్రహ్మతో బాటే కల్పాంతంలో పరబ్రహ్మలో లీనమౌతారు. ఒక్కొక్క కల్పంలో ఒక్కక్కరు బ్రహ్మగా అవతరిస్తారు.
సూత్రం :- 528
" స్మృతేశ్చ "
స్మృతేశ్చ:-స్మృతుల ప్రమాణం వలన కూడా ఉపాసకుడు కార్యబ్రహ్మ లోకాన్ని దాటి పరబ్రహ్మాన్ని చేరాతాడని తెలుస్తోంది.
భావం :- స్మృతులు ప్రమాణం వలన కూడా ఉపాసకుడు కార్యబ్రహ్మ లోకాన్ని చేరి,పరబ్రహ్మాన్ని చేరతాడని తెలుస్తోంది.
వివరణ:-బ్రహ్మలోకం చేరిన ఉపాసకులు ఆత్మజ్ఞానం పొంది, కల్పాంతంవరకు బ్రహ్మలోకంలో కార్యబ్రహ్మవద్దనే ఉండి, కల్పాంతమున, ఆబ్రహ్మతో కలసి పరబ్రహ్మలో చేరి పరమపదాన్ని పొందుతారు. ఈవిషయాన్ని స్మృతికూడా అంగీకరిస్తున్నది. కార్యబ్రహ్మకు మాత్రమే సంబంధించిన గతి శ్రుతులలో కూడా వినబడుచున్నది.
సూత్రం :- 529
" పరం జైమినిః ముఖ్యత్వాత్ "
ముఖ్యత్వాత్ :- ముఖ్యార్ధంలో ప్రయోగించడం వలన ఉపాసకుడు అర్చిరాది మార్గంలో, పరం :- పరబ్రహ్మలో చేరతాడని, జైమినిః :- జైమిని ఆచార్యుడు పేర్కొన్నాడు.
భావం :- బ్రహ్మ అంటే పరబ్రహ్మ అనే ముఖ్యార్ధoలో ప్రయోగించడం వలన ఉపాసకుడు అర్చిరాది మార్గంలో పర బ్రహ్మలో చేరతాడని జైమిని ఆచార్యుడు పేర్కొన్నాడు.
వివరణ:-ఈకార్యాధికరణంలో 4-3-7నుంచి 4-3-11వరకు తన సిద్ధాంతసూత్రాలలో సగుణోపాసకుడు దేవయాన మార్గంలో కార్యబ్రహ్మను చేరడం, కల్పాంతంలో పరబ్రహ్మలో పరమపదం చెందడం, స్మృతులు కూడా ఈ విషయాన్నీ అంగీకరించడం, గతి, గమనం, లోకాలు మొదలైన పదాలు కార్యబ్రహ్మకు సంబంధించినవేనని, పరబ్రహ్మకు కాదని బాదరాయణుడి అభిప్రాయం. 4-3-12నుంచి 14వరకు పూర్వపక్షంవారి అభిప్రాయాలను బాదరాయణుడే సూత్రాలరూపంలో తెలియజేస్తున్నారు.
ఛాందోగ్యోపనిషత్తు ( 4, 15, 6 ) :- " స ఏనాన్ బ్రహ్మ గమయతి " అతడు వీళ్ళని బ్రహ్మనికి చేరుస్తాడు. ఇక్కడ బ్రహ్మం అంటే ముఖ్యార్ధం పరబ్రహ్మం. కనుక ఉపాసకుడు దేవయాన మార్గంలో బ్రహ్మాన్ని చేరతాడు. కార్యబ్రహ్మాన్ని కాదు. బ్రహ్మ శబ్దానికి ముఖ్యమైన ఆలంబనం పరబ్రహ్మ కనుక ఇక్కడ గతి పరబ్రహ్మేనని జైమిని అభిప్రాయపడుతున్నాడు.
సూత్రం :- 530
" దర్శనాచ్చ "
చ :- పైగా, దర్శనాత్ :- శాస్త్రాల్లో పరబ్రహ్మం విషయంలోనే బ్రహ్మ పదాన్ని ప్రయోగించడం ఉపాసకుడు పరబ్రహ్మనే చేరతాడని సూత్రార్ధం.
భావం :- శాస్త్రాల్లో పరబ్రహ్మం విషయంలోనే బ్రహ్మ పదాన్ని ప్రయోగించడం, ఉపాసకుడు పరబ్రహ్మనే చేరతాడు, కాని కార్యబ్రహ్మని కాదు.
వివరణ:- ఇది పూర్వపక్షసూత్రం. బ్రహ్మనాడి ద్వారా వెళ్లిన ఉపాసకుడు ముక్తిని పొందుతాడు. అంటే అమృతత్త్వాన్ని పొందుతాడని వేదం చెబుతోంది. అమృతత్త్వమనేది పరబ్రహ్మం వలనే సంభవం. కార్యబ్రహ్మకు అమృతత్త్వాన్నిచ్చే శక్తి లేదు. కాబట్టి ఇక్కడ బ్రహ్మ అంటే పరబ్రహ్మే అని గ్రహించాలి.
తైత్తరీయోపనిషత్తు ( 2, 1 ) :- ఉపనిషత్తు పరబ్రహ్మాన్ని సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని వర్ణించాయి. సత్ శబ్దానికి అర్ధం ఈ సృష్టికి పూర్వం పరబ్రహ్మ ఒక్కడే ఉన్నాడు. సత్తు కాని అసత్తు కాని వాటికీ కారణలు కాని ఏమి లేవు. సృష్టిలో అన్ని నశించిపోయినా మిగిలి ఉండేవాడు, ఎల్లప్పుడూ ఒక్కడే ఉండేవాడు పరబ్రహమే అనేది సత్యం.జ్ఞాయతే ఇతి జ్ఞానం తెలిసేది కనుక జ్ఞానం. పరమాత్మకు సంబంధించిన నిజమైన జ్ఞానం వేదముల వలన తెలుస్తుంది. ఆయనే సర్వజ్ణుడు. "అంతం న విద్యతే ఇతి అనంతం " దేనికి అంతం లేదో, తెలియదో, అది అనంతం. బ్రహ్మనికి మొదలు కాని, చివర కాని లేవు. అందువలనే బ్రహ్మం అనాది, అనంతo అని చెప్పబడింది. ఈవాక్యాల్లో అంతటా బ్రహ్మపదం పరబ్రహ్మనే తెలుపుతూ, ముఖ్యార్థంగా ప్రయోహించడం వలన, బ్రహ్మఅంటే పరబ్రహ్మమేనని, కార్యబ్రహ్మ కాదని పూర్వపక్ష వాదన.
సూత్ర:-531
"న చ కార్యే ప్రతి పత్త్యభి సంధిః "
కార్యే :- కార్యబ్రహ్మంలో, ప్రతిపత్తి అభిసంధిః :- ఉపాసకుడు చేరతాడనే విషయం, న చ :- లేనే లేదు.
భావం :- కార్య బ్రహ్మంలో ఉపాసకుడు చేరతాడనే విషయం లేనే లేదు.
వివరణ:-ఇది పూర్వపక్షసూత్రం. సగుణోపాసకులకు బ్రహ్మలోకమేప్రాప్తి. ఇక్కడ బ్రహ్మఅంటే పరబ్రహ్మమే కాని కార్యబ్రహ్మ కాదని వారి వాదన. ఏ శాస్త్రంలో ఉపాసకుడు కార్యబ్రహ్మను చేరతాడనే విషయం లేదు. బ్రహ్మ పదం ముఖ్యార్థం పరబ్రహ్మమేనని తెలుపుతోంది.
ఛాందోగ్యోపనిషత్తు(8, 13, 1):-"అకృతం కృతాత్మా బ్రహ్మలోక మభిసంభవామీతి " నేను కృతకృత్యుడనై అకృతబ్రహ్మలోకానికి చేరుతున్నానని ఉపాసకుడు అంటున్నాడు. ఇక్కడ బ్రహ్మలోకానికి ముందు అకృత అనే విశేషణం ఉన్నందున అది బ్రహ్మదర్శనం అనే అర్ధం వస్తుంది. "ప్రజాపతేః.... ప్రపద్యే " ప్రజాపతి యొక్క సభాగృహాన్ని ప్రవేశస్తారు అనేది కార్యబ్రహ్మను పొందడానికి సంకల్పం కాదు. 'నామ రూపయో బ్రహ్మ' అని కార్యబ్రహ్మకంటే విలక్షణమైన పరబ్రహ్మయే ఇక్కడ చెప్పబడుతోంది. పరమాత్మకు యశః అంటే పరమాత్మకే యశస్సు అనే ప్రసిద్ధి ఉండటం వలన కూడా అది పరబ్రహ్మమే అని, గతి శ్రుతులు పరమాత్మను పొందాలనే విషయాన్ని తెలియజేస్తాయి. సగుణోపాసకుడు, ఆత్మ జ్ఞాన సంపన్నుడైనప్పుడు అతనికి పరబ్రహ్మే గతి. గత్యుపపత్త్యాదులచేత ఒక పక్షం, ముఖ్యత్వాది హేతువుల చేత మరొక పక్షం, ఈ విధంగా రెండు పక్షాలు ఆచార్యునిచేత సూత్రీకరించబడ్డాయి. కేవలం బుద్ధిని వికసింపజేయడం కోసం, సిద్ధాంత సూత్రాలపై నమ్మకం, గ్రహణ శక్తి, జ్ఞాన శక్తి కలిగి ఉండటం కోసమే ఈ సూత్రాలు చెప్పబడ్డాయి.
అప్రీతికాలంబనాధికరణం ( 4, 3, 15 )
సూత్రం :- 532
"అప్రతీకాలంబానా న్నయతీతి బాదరాయణ ఉభయధా దోషాత్తత్ క్రతుశ్చ "
అప్రతీక ఆలంబనాన్ :- సూర్యాది ప్రాకృతిక పదార్ధాలను ఆలంబనంగా చేసుకొని ఉపాసకులను, నయతి :- తీసుకొని వెడుతుంది. ఇతి :- అని, బాదరాయణః :- సూత్రకారుడైన వ్యాసుని మతం, ఉభయధా :- రెండు ప్రకారాలుగా, అదోషాత్ :- దోషం లేదు. కనుక తత్ క్రతుః :- ఇందులో బ్రహ్మ ప్రాప్తికి సంకల్పమే ప్రధానం, చ :- అంతే కాక, కార్య బ్రహ్మాన్ని ప్రాప్తించడం కూడా సరియైనదే.
భావం :- సూర్యాది ప్రాకృతిక పదార్ధాలను ఆలంబనంగా చేసుకొని, ఉపాసకులను తీసుకొని వెడుతుందని సూత్రకారుడైన వ్యాసుని మతం. రెండూ ప్రకారాలుగా దోషం లేదు. ఇందులో బ్రహ్మ ప్రాప్తికి సంకల్పమే ప్రధానం. కార్య బ్రహ్మం ప్రాప్తించడం కూడా సరియైనదే.
వివరణ:- ఉపాసకులంతా బ్రహ్మలోకం చేరుతారా? లేక వారిలో కొందరినే దివ్యపురుషుడు బ్రహ్మలోకానికి తీసుకొని వెడతాడా? అని సందేహం. జ్ఞానులైన వారందరిని ఆదివ్యపురుషుడు బ్రహ్మలోకం చేరుస్తాడు. ఏఉపాసన చేస్తే ఆఫలం లభిస్తుంది. పంచాగ్ని విద్య, దహర విద్య , వైశ్వానర విద్య మొదలైనవి ఉపాసించిన వారు బ్రహ్మలోకం చేరతారు. ప్రతీకోపాసకులు కాకుండా మిగిలిన వారంతా బ్రహ్మోపాసకులే వారు బ్రహ్మలోకం చేరటంలో సందేహం లేదు. ప్రతీకోపాసకులు నామము, వాక్కు, మనస్సు మొదలైన వాటిని ఉపాసిస్తారు. వాటిలో బ్రహ్మోపాసన లేదు. కనుక వారికి బ్రహ్మలోక ప్రాప్తి లేదు. కాని ప్రతీకాలను ఆలంబనంగా చేసుకొని సాక్షాత్ ఆనందస్వరూపబ్రహ్మాన్ని ఉపాసించే ఉపాసకులకు అమానవుడు దేవయాన మార్గంలో బ్రహ్మం వరకు చేరుస్తాడని, వారికీ బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందని వ్యాసుని అభిప్రాయం. బ్రహ్మోపాసనం సమర్ధమైన హేతువు అని అంగీకరించాలి. దానిని ఏ విధంగా సేవిస్తారో అదే అవుతుంది. బ్రహ్మను ఉపాసించిన వాడే బ్రహ్మకు సంబంధించిన ఐశ్వర్యాన్ని పొందుతాడు. ప్రతీకోపాసనలో బ్రహ్మక్రతుత్వం లేదు కనుక బ్రహ్మ అప్రధానంగా ఉంటుంది. బ్రహ్మ క్రతువు కానివాడు కూడా బ్రహ్మను పొందుతాడు అని చెప్పబడింది కదా! అని సందేహం. బ్రహ్మ క్రతువు కాని దానిని చెప్పిన చోట, ఉపాసకుడు దేనిని ధ్యానిస్తాడో, అతడు దానిని పొందుతాడు. కార్యబ్రహ్మ విషయకమైన ఉపాసన చేసినవాడే బ్రహ్మలోకం చేరతాడు.
సూత్రం :- 533
"విశేషం చ దర్శయతి "
విశేషం చ :- ప్రతీకాలను ఆలంబనంగా తీసుకొని ఉపాసించే వాళ్ల కన్నా, అప్రతీక బ్రహ్మోపాసకులకు విశేష ఫలం కలుగుతుందని, దర్శయతి :- శాస్త్ర ప్రమాణాలంటున్నాయి.
భావం :- ప్రతీకాలను ఆలంబనంగా తీసుకొని ఉపాసించే వాళ్ళ కన్నా, అప్రతీక బ్రహ్మోపాసకులకు విశేష ఫలం కలుగుతుందని శాస్త్ర ప్రమాణాలంటున్నాయి.
వివరణ:-అప్రతీకోపాసకులకు సాక్షాత్ బ్రహ్మప్రాప్తిరూప విశేషఫలం కలుగుతుందని ఛాందోగ్యం(5, 10, 2) లోను, బృహదారణ్యకం(6, 2, 15)లోను చెప్పబడింది. వారే అర్చిరాది దేవయానమార్గంలో బ్రహ్మాన్ని చేరతారనే విషయం నిశ్చయమైనది. ప్రాకృతిక పదార్ధాలను ఉపాసనకు ప్రతీకాలుగా గ్రహించకూడదని 4- 1-4 సూత్రంలో తెలియజేశారు. ప్రతీకలో బ్రహ్మభావన చేయడం, వాటిని బ్రహ్మఅని ఉపాసించకూడదు. ఒక ప్రతిమను ఇష్టదైవంగా భావించి ధ్యానం చెయ్యడాన్ని ప్రతీకోపాసన అంటారు. అవి బ్రహ్మ పదార్ధాలు అయినప్పటికీ, వాటిలో చేతనతత్త్వాలు లేవు. ఛాందోగ్యంలో మనస్సే బ్రహ్మ, ఆదిత్యుడే బ్రహ్మ, నామమే బ్రహ్మ అని ఉపాసించాలి. ఇవన్నీ పరమేశ్వరుడు సృష్టించినప్పటికీ, బ్రహ్మత్వదృష్టిలో ఏకత్వం ఉన్నప్పటికీ వాటిలో బ్రహ్మబుద్ధి పనికి రాదు. ఎందుకంటే ఉపాసకులూ ప్రతీకస్వరూపులు కారు. నేనే ప్రతీకాన్ని అని ఉపాసించలేరు. సనత్కుమారుడు నారదునికి ఆత్మజ్ఞానం బోధిస్తూ ప్రతీకోపాసన గురించి, ఫలవిశేషం గురించి వివరిస్తాడు. నామాన్ని బ్రహ్మగా ఉపాసిస్తే దాని ప్రభావం కొంతకాలమే ఉంటుంది. నామంకన్నా వాక్కు గొప్పది. వాక్కుకన్నా మనస్సు గొప్పది. ఫలవిశేషాన్ని బట్టి వాటిని ఉపాసించినప్పుడు ఒకదాని కన్నా మరొకటి ఎక్కువకాలం ప్రసరించడం వలన వారు ఫలితాన్ని బట్టి అవి ప్రసరించినంత వరకు స్వేచ్ఛగా విహరిస్తారు. కాని వారికీ బ్రహ్మలోకప్రాప్తి ఉండదని తెలియజేశాడు.
చతుర్ధ పాదం
సంపద్యావిర్భావాధికరణము ( 4, 4, 1 )
సూత్రం :- 534
"సంపద్యావిర్భావః స్వేన శబ్దాత్ "
స్వేన శబ్దాత్ :- ఛాందోగ్యంలో ఉన్న స్వేన పద ప్రయోగం శబ్ద ప్రమాణం వలన, సంపద్య :- బ్రహ్మాన్ని పొంది, ఆవిర్భావః :- తన స్వరూపంలో ఉండి ఆనందాన్ని అనుభవిస్తాడు.
భావం :- ఛాందోగ్యంలో ఉన్న స్వేన పద ప్రయోగం శబ్ద ప్రమాణం వలన బ్రహ్మాన్ని పొంది తన స్వరూపంలో ఉండి ఆనందాన్ని అనుభవిస్తాడు.
వివరణ:-ఈఅధికరణంలో ముక్తపురుషుడు స్వరూపంలో ఉంటాడని చెప్పబడింది.
ఛాందోగ్యోపనిషత్తు(8, 12, 3):- బ్రహ్మసాక్షాత్కారం పొందిన జీవుడు ఈశరీరం నుండి విడివడి, పరంజ్యోతి అయిన బ్రహ్మాన్నిపొంది, తన రూపంలో ఉంటాడు. అప్పుడు కైవల్యం ప్రకటమతుంది. ఇక్కడ స్వేన రూపేణా అనడం వలన జీవాత్మ సంసారదశలో ఉన్నప్పుడు అతణ్ణి స్థూల, సూక్ష్మ శరీరాలు ఆవరించి ఉంటాయి. అతను రాగద్వేషాలకు వశుడై ఉంటాడు. బ్రహ్మసాక్షాత్కారం పొందిన తరువాత ఆ శరీర బంధనాల నుంచి విడిపోయి, తనస్వరూపంలో తాను ఉంటాడని స్పష్టమౌతోంది. ఇలా బంధనాల నుంచి విముక్తుడు కావడం వలన జీవుడు స్వస్వరూపంలో బ్రహ్మంలో ఉంటాడు. గురువు గారు! జీవుడు శరీరాన్ని వదలి పరబ్రహ్మను పొంది స్వరూపంలో నిలుస్తాడు అని ఛాందోగ్యం లో చెప్పబడింది కదా! ముక్తి అంటే స్వర్గంలా ఉంటుందా? స్వర్గంపొందిన వారు సుఖాలనుభవించి ఉత్తరజన్మలు ఎత్తుతారు. అలాగే ఈ ముక్తుడుకూడా ఏదైనా ఆధిక్యాన్ని పొందుతాడా? లేక స్వస్వరూపంలోనే ఉంటాడా? అని అడిగాడు కృష్ణశర్మ. జీవుడు తానైన రూపంలో ఉండటమే ముక్తి. అదే స్వరూపస్థితి. అజ్ఞానం తొలగి పోగానే స్వస్వరూపం తెలుస్తుంది. ప్రకాశరూపమైన ఆత్మసాక్షాత్కారం పొంది, ఆ ఆత్మరూపంలో విద్వాంసుడు ఆవిర్భూతుడౌతాడు. ముక్తి అనేది పుట్టదు అని సమాధానం చెప్పాడు. స్వశబ్దం వలన ముక్తి పొందినవాడు స్వస్వరూపం, చైతన్యరూపంలో ఉంటాడు. అదే స్వస్వరూప స్థితి. జీవుడు తనలోని అజ్ఞానాన్ని తొలగించుకొని, ఆత్మజ్ఞానంతో సూక్ష్మాతి సూక్ష్మమైన ఆత్మను సాక్షాత్కరించుకొని, ముక్తిలోనే జీవాత్మ స్వస్వరూపంలో ఉంటాడు. ఈ స్థితికోసం ఎక్కడికి వెళ్లనవసరం లేదు.
సూత్రం :- 535
"ముక్తః ప్రతిజ్ఞానాత్ "
ప్రతిజ్ఞానాత్ :- శాస్త్రo ఘోషించడం వలన, ముక్తః :- ముక్తుడైన వాడి స్వరూపం తెలుసుకోవచ్చును.
భావం :- శాస్త్రం ఘోషించడం వలన ముక్తుడైనవాడి స్వరూపం తెలుసుకోవచ్చును.
వివరణ:-ముక్తిపొందిన పురుషుడు పూర్ణానంద స్వరూపంలో ఉండిపోతాడు. జీవుడు సంసార దశలో అవిద్యలో బంధించబడి, ఆత్మజ్ఞానం కలిగిన తరువాత శుద్ధుడు, ముక్తుడు అవుతాడు.
ఛాందోగ్యోపనిషత్తు(8,7,1):-ఈశుద్దాత్మ జరామృత్యువులు, ఆకలిదప్పులు అనే దుఃఖాలనుంచి దూరుడై, సత్యకాముడు, సత్య సంకల్పుడై ఉంటాడు. అలాంటి ఆత్మను అన్వేషించాలి. ఇది ఆత్మకు సంసారిక వ్యవస్థారహితమైన రూపం. ఈసంసారావస్థలో జీవాత్మ స్థూల, సూక్ష్మ శరీరాలతో ఉండి ప్రియా ప్రియములతో, ఆకలి దప్పికలతోను, రాగద్వేషాలతోను వికృతుడై, వాటికి వశమై ఉంటాడు. ఇది జీవాత్మ స్వస్వరూపం కాదు. ముక్తిలోనే జీవాత్మ స్వస్వరూపంలో ఉంటాడు. ఈవిషయాన్ని తెలిపే ప్రజాపతి వాక్యం ఒకటున్నది. ఛాందోగ్యోపనిషత్తు(8, 12, 3):- ఆ ఆత్మను తెలుసుకొని, ఆత్మజ్ఞానం ఆధారంగా బ్రహ్మసాక్షాత్కారం పొంది, ఆత్మ ఈ శరీరం నుంచి వెలువడి, పరంజ్యోతిని పొంది తన కైవల్య రూపంలో ప్రకటమౌతుంది. ఏది పరంజ్యోతో అదే ఉత్తమ పురుషుడు. అతడితో జీవాత్మ తన స్వస్వరూపంతో ప్రవేశిస్తుంది. ఇలా ఆత్మ పురుషుణ్ణి పొందడమే మోక్షం.
ముండకోపనిషత్తు(3,2,8):-ఆత్మ బ్రహ్మాన్ని సాక్షాత్కారం చేసుకున్నప్పుడు నామరూపాలను పోగొట్టు కొని, పరాత్పరుడైన పరమేశ్వరుణ్ణి పొందుతుంది. ప్రకృతి కన్నా జీవాత్మ పరం అంటే సూక్ష్మం. జీవాత్మ కన్నా పరమాత్మ పరం. ఆయన పరాత్పరుడు అంటే సూక్ష్మాతిసూక్ష్ముడు. అలాంటి పరమాత్మను పొందడమే ఆత్మకు ముక్తావస్థ. కైవల్య రూపంలో ఉండటం. పూర్వావస్థలోను, ఇప్పుడు కూడా స్వరూపం మారనప్పుడు, ఒకటే అయినప్పుడు విశేషం ఏమిటనే సందేహానికి సమాధానం చెప్పబడింది. ఇప్పుడు అతను ముక్తుడు. సర్వబంధాలనుండి విముక్తుడై శుద్ధ ఆత్మస్వరూపంలో ఉంటాడు. వెనుకటి అవస్థలలో జాగ్రదావస్థలో ఇంద్రియధర్మాలను తనపై ఆరోపించుకొని, స్థూల శరీరం గురించి అహంకారం కలిగివుంటాడు. అజ్ఞానంతో తాను ఆత్మ చైతన్యరూపమని తెలుసుకోలేక అంధుదౌతాడు. స్వప్నావస్థలో అలసి నిద్రించినప్పుడు, ఇంద్రియాలు నిశ్శబ్దంగా మనస్సులో లీనమై ఉంటాయి. కోరికలు అణచి వేయబడిన రాగద్వేషాల గురించి ఆలోచిస్తూ వాటిని స్వప్నంలో అనుభవిస్తాడు. సుషుప్తిలో స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు(అవిద్య) ఈ అవస్థలో ఉండవు. అందుకే ఏమి తెలియని స్థితిలో ఉంటాడు. ఈ విధంగా అవస్థాత్రయ కలుషితమైన స్వరూపంలో ఉంటాడు. అంతవరకుఉన్న బంధం తొలగిపోగానే మోక్షం అనే ఫలం లభిస్తుందని చెప్పారు. కాని వాస్తవంగా క్రొత్తగా ఏదో లభించడం వలన వచ్చిన ముక్తి కాదు. అది జీవన్ముక్తస్థితి. రోగం పోగానే ఆరోగ్యవంతుడైనట్లుగా, అజ్ఞానం తొలగి పోగానే ముక్తి లభిస్తుందని చెప్పడం కూడా అటువంటిదే.
సూత్రం :- 536
"ఆత్మ ప్రకరణాత్ "
ప్రకరణాత్.. ప్రకరణాన్ని బట్టి, ఆత్మా :- ఆత్మనే గ్రహించాలి.
భావం :- ఛాందోగ్యం ( 8, 12, 3 ) చెప్పినట్లుగా తన రూపంలో ప్రకటం కావటం అంటే సంప్రసాదం అన్నారు. అదొక అవస్థ కదా! దానిని ఎలా తెలుసుకోవాలి అంటే ప్రకరణాన్ని బట్టి ఆత్మనే గ్రహించాలి.
వివరణ:-ప్రకరణాన్నిబట్టి జ్యోతి అంటే ఆత్మ అనే అర్ధమే కాని భౌతికమైన వెలుగు కాదు. ఇది ఆత్మను గురించి చెప్పే ప్రకరణం. దానిని దేవతలు జ్యోతిగానే చూస్తారని చెప్పబడింది. ముక్త పురుషుడు ఆ స్వస్వరూపంలోనే అంటే ఆత్మ రూపంలోనే ఉంటాడు.
ఛాందోగ్యోపనిషత్తు(8,7,1):-ఆత్మప్రకరణం ప్రారంభమవుతుంది. ఈశరీరం నాశనంలేని ఆత్మకు అధిష్టాన మని చెప్పి, ఈశరీరంతో ఉన్నప్పుడు జీవుడికి ప్రియాప్రియములు కలుగుతాయి. శరీరంతో సంబంధం విడిపోయినప్పుడు సుఖదుఃఖాలుండవు. అలాంటి అవస్థను లక్యంగా ఉంచుకొని "ఏష సంప్రసాదో అస్మాత్ శరీరాత్" అని చెప్పినందుకు ఈప్రకరణాన్ని బట్టి సంప్రసాద శబ్దం ఆత్మ వాచకమని తెలుస్తోంది. ఆత్మ జ్ఞానం ఉన్నవాడు పరంజ్యోతిని చేరుకుంటాడు అని శ్రుతివాక్యం. జీవుడిగా పాపప్రక్షాళనం చేసుకొని జరామరణములు లేని ఆత్మస్వరూపంలో ఆత్మజ్ఞాని పరంజ్యోతిని చేరుకుంటాడు. స్వప్నంలో ఏదేహం సృష్టించుకుంటాడో, అదేవిధంగా స్వర్గంలో భావనాత్మాకమైన రూపాన్నిధరించి, నిర్గుణ పరబ్రహ్మ లో ఐక్యం చెంది, బ్రహ్మానందాన్ని అనుభవిస్తారు.
సూత్రం :- 537
” అవిభాగేన దృష్టత్వాత్ "
దృష్టత్వాత్:-శాస్త్రాలను పరిశీలిస్తే, అవిభాగేన:-ఆత్మ పరంజ్యోతినిచేరి, అవిభక్తంగాఉంటుందని తెలుస్తోంది.
భావం :- శాస్త్రాలను పరిశీలిస్తే, ఆత్మ పరంజ్యోతిని చేరి, అవిభక్తంగా ఉంటుందని తెలుస్తోంది.
వివరణ:-ఈప్రకరణంలో ముక్తునికి, పరబ్రహ్మకు తేడాలేదని తెలియజేస్తున్నారు. జీవుడు పరబ్రహ్మను పొందడం అంటే ఏమిటి? రాముడు ఊరు విడిచిపెట్టి, వేరేగా ఉండటం లాంటిదా? లేక నది సముద్రాన్ని చేరి, అవిభక్తంగా ఉండటం లాంటిదా? అని సందేహం. దీనికి వ్యాసమహర్షి సప్రమాణంగా సమాధానం ఇస్తున్నారు. వేదం ముక్తపురుషునికి, బ్రహ్మకు భేదంలేదని, ముక్తపురుషుడు బ్రహ్మతో అవిభక్త రూపంలో ఉండి, విడదీయడానికి వీలులేని విధంగా నిరతిశయానంద స్వరూపంగా ఉంటాడని చెప్పింది. "అహం బ్రహ్మ్మాస్మి" ముక్త పురుషుడు పరమాత్మయే.
ముండకోపనిషత్తు(3, 2, 8):- ప్రవహించుచున్న నదులు తమయొక్క నామరూపములను వదిలి సముద్రమునందు ఏరీతిగా లీనమైపోవునో, అదే రీతిగా ఆత్మజ్ఞానవంతుడు నామరూపముల నుండి విముక్తుడై పరాత్పరుడగు పరమాత్మను పొందుచున్నాడు. బ్రహ్మజ్ఞాని పుణ్యపాపాలను విడిచి నిర్మలుడై, పరమసామ్యాన్ని పొందుతాడు. ఆఅవస్థలో జీవాత్మకు ఆనందానుభూతి తప్ప మరొకటి ఉండదు. బ్రహ్మ సాక్షాత్కారం చేసుకున్న జీవుడు బ్రహ్మంలో అవిభక్తంగానే ఉంటాడు. రాముడు ఊరు విడిచి, వేరేచోటుకి వెళ్ళినప్పటికీ, తన నామరూపాలు కోల్పోయి, దానిలో ఐక్యంచెందే స్థితిలేదు. సముద్రంలో నదినీరు కలిస్తే అది నామరూపాలు కోల్పోయి అవిభక్తంగా ఉంటుంది. జ్ఞానంకల ముక్తుని ఆత్మకూడా స్వస్వరూపంలో అంటే ఆత్మరూపంలో ఉంటుందని గ్రహించాలి
బ్రహ్మాధికరణం ( 4, 4, 5 )
సూత్రం :- 538
" బ్రాహ్మేణ జైమిని రుపన్యాసాదిభ్యః "
ఉపన్యాసాధిభ్యః :- ఉపనిషత్తులలో ఉన్న వర్ణనల వలన, బ్రాహ్మేణ :- జీవాత్మ ముక్తావస్థలో బ్రహ్మ సంబంధిరూపంలో ఉంటాడని, జైమినిః :- జైమిని ఆచార్యుని అభిప్రాయం.
భావం:-ఉపనిషత్తులలోఉన్న వర్ణనలవలన జీవాత్మ ముక్తావస్థలో బ్రహ్మ సంబంధిరూపంలో ఉంటాడని జైమిని అభిప్రాయం.
వివరణ:-ఇది ప్రతిపక్షసూత్రం. ఈఅధికరణంలో ముక్తాత్ముడైనవాని లక్షణాలను గురించి తెలియ జేస్తున్నారు. ముక్తపురుషుడు సత్యసంకల్ప సర్వజ్ఞత్వాది లక్షణాలు కలవాడైఉంటాడా అని సందేహం. జైమిని అభిప్రాయం ప్రకారం సర్వజ్ఞత, సర్వేశ్వరత్వం, అనే లక్షణాలు కలిగి ఉంటాడు.
ఛాందోగ్యోపనిషత్తు(8, 7, 1):-బ్రహ్మం ఆనందరూపుడు. సత్యసంకల్పుడు, సత్యకాముడు అని వర్ణించారు. జీవుడు బ్రహ్మాన్ని పొంది ఆనందాన్ని అనుభవిస్తాడు అనే మాటను బ్రహ్మరూపంలో ఉంటాడని జైమిని అభిప్రాయం. (7, 25, 2) 'తస్య సర్వేషు లోకేషు కామచారో భవతి' ముక్తాత్మ అన్ని లోకాల్లో స్వేచ్ఛగా సంచరిస్తాడు. బ్రహ్మం సర్వత్రా వ్యాపించిఉంటాడు. బ్రహ్మనికి గతి, సంచారం ఉండదు. కాని ముక్తాత్మ సర్వలోకాలలో సంచారం చెయ్యగలడని చెప్పడం వలన ముక్తాత్మ బ్రహ్మం కన్నా భిన్నం అని స్పష్టంగా తెలుస్తోంది. బ్రహ్మ సర్వవ్యాపి. వ్యాపకత్వానికి గతి ఉండదు కదా! జీవుడు సంచారం చెయ్యగలడు. 'స్వేన రూపేణ ' అని అనడం వలన జీవుడు మోక్షంలో కూడా తన అస్థిత్వాన్ని పోగొట్టుకోడని అర్ధం. అంతే కాని బ్రహ్మ రూపాన్ని పొందుతాడని, బ్రహ్మంలో లీనమైపోతాడని కాదు. జీవుడు బ్రహ్మమే అనడం యదార్ధం కాదు. బ్రహ్మనికి సర్వజ్ఞత, సర్వేశ్వరత్వం అనే లక్షణాలు కలిగి ఉంటాడు. ముక్త పురుషుని ఆత్మ పాప రహితుడు, ముసలితనం, చావు, శోకము, ఆకలి, దప్పిక లేనివాడు, సత్య కాముడు, సత్య సంకల్పుడు అని ఛాందోగ్యం లో చెప్పబడింది.
సూత్రం :- 539
"చితితన్మాత్రేణ తదాత్మకత్వా దిత్యౌడు లోమిః "
తత్ ఆత్మకత్వాత్ :- చేతన స్వరూపం వలన, చితి తన్మాత్రేణ :- తన చేతనమాత్ర స్వరూపంతో మోక్షంలో జీవుడుంటాడు. ఔడులోమిః :- ఔడులోమి ఆచార్యుని అభిప్రాయం.
భావం :- చేతన స్వరూపం వలన తన చేతన మాత్ర స్వరూపంతో మోక్షంలో జీవుడుంటాడని ఔడులోమి ఆచార్యుని అభిప్రాయం.
వివరణ:- ఇది ప్రతిపక్షసూత్రం. జీవుడు చేతనస్వరూపుడు కాబట్టి ముక్తపురుషుడు కూడా చైతన్య రూపంలో ఉంటాడని ఔడులోమిఆచార్యుని అభిప్రాయం. జీవుడు మోక్షానికి ముందు, దేహేంద్రియాది ప్రాకృతిక పదార్ధాలతో పరివేష్టితుడై ఉంటాడు. ఈపదార్ధాలకు చేతనత్వం లేదు. మోక్షంలో వాటి సంబంధం ఉండదు. అప్పుడు జీవుడు కేవలం చేతన స్వరూపంతో ఉంటాడని శాస్త్రలంటున్నాయి.
బృహదారణ్యాకోపనిషత్తు(4, 5, 13) :- 'కృత్స్నః ప్రజ్ఞాన ఘన ఏవ, 'యోగదర్శనం ( 2, 20 ) దృష్టా దృశి మాత్రః ' ఈవాక్యాలలో జీవుడు చేతన రూపంలో ఉంటాడని తెలియజేస్తున్నాయి. తైత్తరీయంలో సత్యము, జ్ఞానము, అనంతమైనది పరబ్రహ్మ అని చెప్పబడింది. బృహదారణ్యాకంలో ఆత్మ బాహ్యభ్యంతరాలు లేనిది. సంపూర్ణమైనది. ప్రజ్ఞాన ఘనమైనది. ఆత్మజ్ఞానికి శోకము, మోహము, దుఃఖము ఉండవు. బ్రహ్మ చైతన్యస్వరూపుడు కనుక బ్రహ్మను పొందే ముక్తపురుషుడు కూడా చైతన్య స్వరూపుడై ఉంటాడని ఔడులోమి అభిప్రాయం.
సూత్రం :- 540
"ఏవ మప్యుపన్యాసాత్ పూర్వభావా దవిరోధం బాదరాయణః "
ఉపన్యాసాత్ :- శాస్త్ర ప్రమాణం వలన, ఏవం అపి :- చేతన మాత్ర స్వరూపంతో ఉంటాడని చెప్పినా, పూర్వ భావాత్ :- బ్రహ్మ రూపంలో ఉంటాడని చెప్పినా, అవిరోధం :- రెండింటిలో ఏ వైరుద్యం లేదని, బాదరాయణః :- బాదరాయణుడి అభిప్రాయం.
భావం :- శాస్త్ర ప్రమాణం వలన చేతన మాత్ర స్వరూపంతో ఉంటాడని చెప్పినా, బ్రహ్మ రూపంలో ఉంటాడని చెప్పినా, రెండింటిలో ఏ వైరధ్యం లేదని బాదరాయణుడి అభిప్రాయం.
వివరణ. ఈసూత్రంలో ప్రతిపక్షంవారి సూత్రాలకు వ్యాసమహర్షి సమాధానం చెబుతున్నారు. మోక్షంలో జీవుడు ప్రకృతి సంబంధాన్ని విడిచిపెట్టి కేవల చేతనరూపంలో ఉంటాడని ఔడులోమి చెప్పినది శాస్త్రానికి అనుకూలమే. బ్రహ్మానందం అనుభవించే జీవుడు బ్రహ్మసంబంధ రూపంలో ఉంటాడని జైమిని చెప్పినది శాస్త్ర విరుద్దం కాదు. ముక్తుడు చైతన్యస్వరూపుడు అని చెప్పినప్పటికీ, బ్రహ్మకుండే సత్యసంకల్పం, సర్వజ్ఞత మొదలైన గుణాలుకూడా ముక్తి యందు కూడా సంభవిస్తాయి. పరబ్రహ్మకుండే లక్షణాలన్నీ ముక్త పురుషునికి కూడా ఉంటాయని ప్రతిపక్షంవారు సమర్ధించలేదు. ముక్తాత్మ బ్రహ్మంకన్నా భిన్నo కాదు. జీవుడు మోక్షంలో తన అస్థిత్వాన్ని పోగొట్టుకొని, బ్రహ్మంలో లీనమై బ్రహ్మమైపోతాడు. బ్రహ్మానికున్న సత్య సంకల్పుడు, సత్య కాముడు, సర్వజ్ఞత, సర్వేశ్వరత్వం మొదలైన లక్షణాలు ముక్తాత్మకు కూడా సంక్రమిస్తాయని వ్యాస మహర్షి సమాధానం ఇచ్చాడు.
సంకల్పాధికరణం ( 4, 4, 8 )
సూత్రం :- 541
" సంకల్పాదేవ తు తచ్ఛ్రుతేః"
తత్ శ్రుతేః :- శ్రుతి కథనం వలన, సంకల్పాత్ ఏవ :- సంకల్పం తోటే కలుగుతుంది.
భావం:-మోక్షంలో జీవుడికి కామచారరూపంలో అనుభవం ఉంటుందని ఛాందోగ్యం(7,25,2)లో చెప్పారు. అది సంకల్పంవలన కలుగుతోందా? లేదా? అంటే శ్రుతి కథనం వలన సంకల్పంతోటే కలుగుతుంది.
వివరణ:- అర్చిరాదిమార్గాన బ్రహ్మలోకం చేరిన ఉపాసకుడికి భోగ్యవస్తువులను సృష్టించడం అనేది సంకల్పమాత్రం చేత సాధ్యమా? లేక ప్రయత్నపూర్వకంగా సాధ్యమా? అని సందేహం. లోకంలో ఏపని చెయ్యాలన్నా సంకల్పంతోబాటు ప్రయత్నంకూడా ఉండాలి. దానికి తగిన సాధనాసంపత్తి కూడా అవసరం. ఇవి సమకూరినప్పుడే ఆపని నెరవేరుతుంది. మోక్షంలో అలాకాక సంకల్పం మాత్రం చేతనే జీవుడికి సమాచారం కలుగుతుంది. వేరే ఏ సాధనాలు అవసరం లేదు. ఈ సంకల్పం అంతఃకరణ వృత్తి కాదు. కేవలం ఆత్మనుభూతే. జ్ఞానియైన వాడు కోరినంతనే అంటే సంకల్ప మాత్రం చేతనే పితృదేవతలు మొదలైన వారు ప్రత్యక్ష మౌతారు.
ఛాందోగ్యం(8, 2, 10):- ఏప్రదేశాన్ని ఏకోరికను జీవుడు కోరుకుంటాడో, అది అతనికి చేరుతుంది. దానిలో అతడు సంపన్నుడై ఆనందిస్తాడు. మోక్షంలో జీవుడికి అలాంటి స్వాభావిక సామర్ధ్యం కలుగుతుంది. అదే సంకల్పరూపం. దానితోనే అతడికి అనుభూతి కలుగుతుంది.
శతపధ బ్రాహ్మణం(14, 4, 2, 17):-ముక్తాత్మ తన శక్తిరూపసంకల్పంతో అన్ని అనుభవిస్తుంది. ఈ వాక్యాన్ని చూసి మోక్షంలో వాగాదిఇంద్రియాలు కలుగుతాయని పొరబడకూడదు. ఇంద్రియాలు ప్రాకృతికాలు కదా! అవి ఎక్కడ నుంచి వస్తాయి. కనుక మోక్షంలో సంకల్పమాత్రంతో జీవుడు అన్ని అనుభవిస్తాడని సూత్రతాత్పర్యం. ఛాందోగ్యంలో చెప్పినట్లుగా తానేబ్రహ్మ అని తెలుసుకున్నవాడు సమస్త లోకాలలో విహరించగలుగుతాడు. సత్యకాముడై దహరాకాశంలో బ్రహ్మను సేవించిన వాడు మరణానంతరం పితృలోకం కోరితే పితృగణం ప్రత్యక్షమౌతుంది. వారితోబాటుగా పితృలోకాలకు పోయి పితృలోక అనుభవాలతో సంపన్నుడై మహిమన్వితుడౌతాడు. అలా సమస్తలోకాలు చెరగలుగుతాడని చెప్పబడింది. కనుక జీవుడికి మోక్షంలో సంకల్పమాత్రం చేత సర్వమూ పొందగలుగుతారు. ముక్తుని సంకల్పం సామాన్య జనుల సంకల్పం కంటే విలక్షణమైనది.
సూత్రం :- 542
" అత ఏవ చానన్యాధిపతి "
అతఏవ:-సత్యసంకల్పంవల్లనే, అనన్యఅధిపతిః :- జీవుడికి మరో అధిపతి ఉండడు. స్వతంత్రు డౌతాడు.
భావం :- సత్య సంకల్పం వల్లనే జీవుడికి మరో అధిపతి ఉండడు. స్వతంత్రుడౌతాడు.
వివరణ:-మోక్షంలో సంకల్పమాత్రం చేత జీవుడు అన్ని అనుభవిస్తాడు. ఈ దశలో జీవుడికి అధిపతి అనేవాడు ఉంటాడా? అంటే సత్య సంకల్పం వలనే అతను స్వతంత్రుడౌతాడు. అతనికి బ్రహ్మం తప్ప మరొక అధిపతి ఉండడు. వ్యర్థం కాని సంకల్పం కలవాడు కనుకనే విద్వాంసుడు అనన్యాధిపతిగా గతి ఉన్నప్పుడు, తప్పనిసరి కానప్పుడు సంకల్పించడు కదా! 'అధ.. భవతి' ఇక్కడ సగుణోపాసన ద్వారా, ఎవరు వెడతారో, సత్యసంకల్పంతో వాటిని పొందుతారు. ఆత్మను తెలుసుకొన్న వారికి అతనికి వేరే ప్రభువు అంటూ ఎవరూ ఉండరు. అతనికి చక్రవర్తి వలెనే అన్ని లోకాలలో సంచారముంటుంది. అతను కోరినంత మాత్రానే అన్ని లోకాలు పొందగలుగుతాడు.
ఛాందోగ్యోపనిషత్తు(7,25,2):-సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడైన పరమాత్మను తెలుసుకుంటూ ఆత్మానందం అనుభవిస్తూ, స్వరాట్ అవుతాడు. అన్ని లోకాలలోనూ అతనికి యదేచ్ఛాసంచారం కలుగుతుంది. ఎక్కడా ప్రాకృతిక ప్రతి బంధకాలుండవు. ఈశ్వరుడే అతనికి అధిపతి.
అభావాధికరణం ( 4, 4, 10 )
సూత్రం :- 543
" అభావం బాదరి రాహ హ్యేవమ్ "
ఏవమ్ :- శాస్త్రాలు చెప్పినట్లుగా, అభావం :- మోక్షానందం అనుభవించడానికి శరీరాలుండవు, హి :- అని, బాదరిః :- బాదరముని, ఆహ :- అంటున్నాడు.
భావం:-శాస్త్రాలు చెప్పినట్లుగా మోక్షనందం అనుభవించడానికి శరీరాలుండవని బాదరముని అంటున్నాడు.
వివరణ:-ముక్తపురుషులకు సంకల్పమాత్రం చేతనే కోరిన లోకాలు పొందుతారని అన్నారు. సంకల్పం కావాలంటే మనస్సుకావాలి, అంటే ముక్తపురుషునికి మనస్సు, ఇంద్రియాలు అన్నీ ఉంటాయా అని సందేహం. ప్రాకృతిక సుఖదుఃఖాలు అనుభవించడానికి శరీరేంద్రియాలు అవసరం. మోక్షానందం అలాంటిది కాదు. కనుక అక్కడ శరీరాదుల అవసరం లేదని బాదరి ఆచార్యుని అభిప్రాయం. విద్వాంసుడు అంటే జ్ఞానియైనవాడికి మరణానంతరం శరీరం ఉండదు. ముక్తపురుషునికి శరీరం, ఇంద్రియాలు ఉండవు. విద్వాంసునికి మనస్సుకన్నా భిన్నమైన శరీరం, ఇంద్రియాలు ఏవి బ్రహ్మలోకంలో ఉండవని వ్యాసుడు తెలియజేశాడు. ముక్తునికి సంకల్పసాధనమైన మనస్సు ఉంటుందనే విషయం మాత్రం నిశ్చితమే. ఐశ్వర్యం పొందిన మహీయమానుడైన అంటే పూజ్యుడైన సగుణ బ్రహ్మోపాసకునికి శరీరేంద్రియలు ఉండవాని తలుస్తున్నాడు. ఎందువలనంటే ' మనసైతాన్.... బ్రహ్మ లోకే ' బ్రహ్మ లోకంలో ఉన్న కామాలను భోగ్య వస్తువులను మనస్సుతో చూస్తూ రమిస్తాడని శ్రుతి వాక్యం ఉన్నది. (ఈసందర్భంలో మాత్రం మనస్సు అంటే ఆత్మ అనే భావించాల్సివుంటుంది. ఎందుకంటే ముక్తపురుషునికి అంతఃకరణ వుండదు.)
సూత్రం :- 544
" భావం జైమినిర్వికల్పా మననాత్ "
మోక్షంలో శరీరాలు ఉంటాయని, వికల్ప అనుమానాత్ :- శాస్త్రల్లో వికల్పం చెప్పారని, జైమినిః :- జైమిని ఆచార్యుడు చెబుతున్నాడు.
భావం :- మోక్షంలో శరీరాలుంటాయని, శాస్త్రాల్లో వికల్పం చెప్పారని జైమిని ఆచార్యుడు చెబుతున్నాడు.
వివరణ:-ఇది ప్రతిపక్షసూత్రం. ముక్తపురుషునికి మనస్సుతోబాటు శరీరలుంటాయని జైమిని అభిప్రాయం. శాస్త్రంలో వికల్పాలు చెప్పడం వలన శరీరేంద్రియాల ఉనికిని జైమిని అంగీకరిస్తున్నాడు. ఎందువలనంటే ముక్తుని విషయంలో అనేక రూపాలలో ఉండటాన్ని వికల్పంగా చెబుతున్నారు. శరీరభేదం లేకుండా అనేక విధాలుగా ఉండడు కదా!
ఛాందోగ్యోపనిషత్తు(7,26,2):- ముక్తాత్మను గురించి వర్ణిస్తూ జీవుడు 1, 3, 5, 7, 9, 11, 10, 20, 100, 1000 రకాలుగా అవుతాడని చెప్పడం జరిగింది. ఈ అనేక విధాలు కావడానికి జీవుడికి శరీరం కావాలి. లేని పక్షంలో సంభవం కాదు. ఇలాంటి వికల్పవచనం వలన మోక్షంలో జీవుడికి శరీరాదులుంటాయని జైమిని అభిప్రాయపడుతున్నాడు. ఈవికల్పం నిర్గుణమైన భూమవిద్యలో చెప్పబడినా కూడా సగుణావస్థలో ఉన్న ఈ ఐశ్వర్యాన్ని సగుణ విద్యాఫలంగా ఇక్కడ గ్రహించబడుచున్నది.
సూత్రం :- 545
" ద్వాదశాహవ దుభయ విధః బాదరాయణో అతః "
అతః :- శాస్త్ర వచనం వలన, ద్వాదశాహావత్ :- ద్వాదశాహం లాగా, ఉభయ విధః :- రెండు రకాలుగా, బాదరాయణః :- సూత్రకారుడు అంగీకరిస్తున్నాడు.
భావం :- శాస్త్ర వచనం వలన, ద్వాదశాహం లాగా రెండు రకాలుగా సూత్రకారుడు అంగీకరిస్తున్నాడు.
వివరణ:-ఈసూత్రంలో ముక్తాత్మ అనేకవిధాలుగా శరీరాదులుంటాయని ఛాందోగ్యం(7, 26, 2)లో చెప్పిన శాస్త్రీయసమస్యను పరిష్కారించడానికి వ్యాసుడు ప్రమాణాలను ఉదాహరిస్తున్నాడు. రెండు విధాలైన శ్రుతులు కనిపిస్తున్నాయి. మనసా అనే విశేషణంవలన ఒకటి, వికల్పమవడం వలన ద్వాదశాహంలాగా ఒకటి. 2 రోజుల నుంచి 12 రోజుల వరకు జరిగే యజ్ఞానికి అహీనం అని పేరు. 12 అంతకన్నా ఎక్కువ దినాలు చేసే యజ్ఞానికి సత్త్రం అనిపేరు. అభివృద్ధిని, ఐశ్వర్యాన్ని కోరేవారు ద్వాదశాహాన్ని ఆశ్రయించాలనీ, సంతానం కోరేవారి చేత ద్వాదశాహం చేయించాలి అని శృతి యందు చెప్పబడింది. ఒక శృతి యందు కర్తలు అనేకమంది చేత చేయబడిన యాగాన్ని సత్త్రం అంటారు. దీనిని ద్వాదశాహ సత్త్రం అంటారు. రెండవశ్రుతిలో ఒక్కని చేత మాత్రమే చేయబడే యాగాన్ని అహీనము అంటారు. దీనిని ద్వాదశాహఅహీనము అంటారు.
బౌధాయనశ్రౌతసూత్రాలు(11, 3):- కాగా పన్నెండు దినాల్లో గాని, అంతకన్నా ఎక్కువ రోజుల్లో కాని పూర్తి అయ్యే యజ్ఞాలను సత్త్రాలు అంటారు. (11, 4):- 12 రోజుల్లో జరిపే ఇష్టులు సత్రం - అహీనం అని రెండూ విధాలుగా చెబుతారని కాత్యాయనశ్రౌతసూత్రం.
కాత్యాయనశ్రౌతసూత్రం(12, 1, 4):- పై శ్రౌతసూత్రాలు చూసినా ద్వాదశాదియాగాలను రెండు పేర్లతో చెప్పే వీలున్నది. అలాగే ముక్తాత్మలకు మోక్షంలో శరీరం ఉండదనడం శాస్త్రసమ్మతమే. నానా విధాల ఐశ్వర్యాలు అక్కడ జీవుడు అనుభవిస్తాడని చెప్పడం శాస్త్రవిహితమే. కాని ఇదంతా ముక్తజీవునికి సంకల్పమాత్రంతో లభిస్తుందనడం మరువకూడదు. ఆసంకల్పం ఆత్మకు మోక్షదశలో కలిగే సామర్ధ్యమే. శాస్త్రంలో మోక్షంలో జీవుడికి శరీరం ఉండదని స్పష్టంగా చెప్పినట్లుగా, శరీరం ఉంటుందని ఎక్కడా చెప్పలేదు. ఛాందోగ్యం(7,26,2)లో కూడా శరీర ఇంద్రియాలను శబ్దంతో నిర్దేశించక పోవడం గమనించాలి. రెండుచోట్ల చెప్పిన వాక్యాలు సంకల్పానుభవానికే వర్తిస్తాయి. మోక్షంలో శరీరేంద్రియలకు ఎన్నడూ ప్రసక్తిలేదని బాదరాయణుడి అభిప్రాయం. సంకల్పానుసారం ఇష్టమైనది చేయవచ్చునని పూర్వ మీమాంస శాస్త్ర కర్త సిద్ధాంతo చేశారు. బ్రహ్మ లోకాన్ని పొందినవారు స్వతంత్రులు. వారి సంకల్పం తిరుగులేనిది. అందుచేత శరీరం కావాలనుకుంటే సశరీరుడౌతాడు. శరీరం వదలదలుచుకున్నప్పుడు అశరీరుడౌతాడు. ఎందువలనంటే సంకల్పానికి అట్టి బలంఉంది. సంకల్పాలుకూడా విచిత్రంగా ఉండవచ్చును. ద్వాదశాహక్రతువు వలె రెండువిధాలైన లింగం గల శ్రుతులు కనబడటం వలన ద్వాదశాహ సత్త్రం అని, అహీనం అని కూడా ఎలా అంగీకరించ బడిందో, అట్లే ఇక్కడ కూడా వర్తిస్తుందని సూత్రకారుని అభిప్రాయం.
సూత్రం :- 546
" తన్వభావే సంధ్యవ దుపపత్తేః "
తను అభావే :- శరీరం లేకపోయినా, సంధ్యవత్ :- స్వప్నం లాగా, ఉపపత్తేః :- ముక్తాత్మకు అనుభూతి సిద్ధించే వీలున్నది.
భావం :- శరీరం లేకపోయినా, స్వప్నం లాగా ముక్తాత్మకు అనుభూతి సిద్ధించే వీలున్నది.
వివరణ :- ఇంద్రియ సహితమైన శరీరం లేనప్పుడు స్వప్నావస్థలో శరీరేంద్రియ విషయాలు లేకపోయినా కూడా పిత్రాదికామాలు ఏ విధంగా జ్ఞానరూపంలో కలుగుతాయో అదే విధంగా మోక్షంలో కూడా ఆ అనుభూతులు కలుగుతాయి. సంధ్య అంటే స్వప్నం లేదా స్వప్నావస్థలో ఉన్న పురుషుడు. జీవుడికి స్వప్నావస్థలో శరీరేంద్రియాలతో సంబంధం లేకుండానే అనుభూతి కలుగుతుంది. అలాగే ముక్తాత్మకు
కూడా ఇంద్రియాలతో నిమిత్తం లేకుండా అనుభూతి కలుగుతుంది. ఇక్కడ మోక్షాన్ని స్వప్నంతో పోల్చారు. స్వప్నంలో అంతఃకరణ మాత్రమే పనిచేస్తుంది. ఇతర ఇంద్రియాలు పనిచెయ్యవు. మోక్షంలో శరీరం, ఇంద్రియ, అంతఃకరణ ఏమి ఉండవు. బ్రహ్మలోకంలో ఇంద్రియాలతో కూడిన దేహం లేకపోయినప్పటికి స్వప్నం లాగా మానసికంగా విషయాలు పొందుతారు. స్వప్నంలో అనేక విషయాలు చూస్తారు. అనేక పదార్ధాలు తింటారు. భోగాలు అనుభవిస్తారు. కాని అక్కడ శరీరం, ఇంద్రియాలు ఏమి ఉండవు. అవన్నీ స్వప్నంలో యదార్ధమే.
అలాగే బ్రహ్మలోకంలో బ్రహ్మసాక్షాత్కారం వలన ఆత్మలో విలక్షణమైన సామర్ధ్యం ఏర్పడుతుంది. దాని వలన శరీరం లాంటివి లేకపోయినా, ఆత్మకి నేరుగా అనుభూతి కలగుతుంది. అందుచేత స్వరూప సామర్ధ్యం తోటే ఆనందం అనుభవిస్తాడని తెలియజేశారు.
సూత్రం :- 547
" భావే జాగ్రద్వత్ "
భావే :- శరీరం ఉన్నప్పుడు, జాగ్రత్ వత్ :- మేలుకొని ఉన్న పురుషునికి కలిగినట్లుగానే, జీవన్ముక్తునికి కూడా అనుభూతి కలుగుతుంది.
భావం:- శరీరం ఉన్నప్పుడు మేలుకొనిఉన్న పురుషునికి కలిగినట్లుగానే, జీవన్ముక్తునికి కూడా అనుభూతి కలుగుతుంది.
వివరణ:- శరీరం ఉన్నప్పుడు జాగ్రదావస్థలో వలె అనుభూతి కలుగుతుంది. స్వప్నావస్థలో శరీరం లేనప్పుడు మనస్సుతోనే అనుభవిస్తారు. ముక్తపురుషునికి శరీరం ఉండటం, లేకపోవడం అనేది అతని సంకల్పం వల్లనే జరుగుతుంది. జీవన్ముక్తదశలో ఆనందం అనుభవించడంలో జీవుడికి శరీరేంద్రియాలు, మనస్సుతో సంబంధం ఉండదు. అయినా బ్రహ్మజ్ఞాని జీవన్ముక్త దశలో స్వస్వరూపజ్ఞానంతోనే నిత్య వ్యవహారాలను నిర్వహిస్తూ, ఆనందానుభూతిలో నిమగ్నమై ఉంటాడు.
ప్రదీపాధికరణం ( 4, 4, 15 )
సూత్రం :- 548
" ప్రదీప వదావేశ స్తథా హి దర్శయతి "
ప్రదీపవత్ :- దీపం తన వెలుగులో అన్నిటికీ కాంతి ఇస్తున్నట్లుగా, ఆవేశః :- జీవన్ముక్తుడికి అన్ని వ్యవహారాలలో ప్రవేశం కలుగుతుందని, తథా హి దర్శయతి :- శాస్త్ర వాక్యాలంటున్నాయి.
భావం :- దీపం తన వెలుగులో అన్నిటికి కాంతి ఇస్తున్నట్లుగా ముక్తునికి అన్ని వ్యవహారాలలో ప్రవేశం కలుగుతుందని శాస్త్ర వాక్యాలంటున్నాయి.
వివరణ:- జీవన్ముక్తదశలో దేహవ్యాపారాలు ఎలా చేయగలుగుతాడో ఈ సూత్రంలో చెప్పబడింది. జ్ఞాని అయిన జీవన్ముక్తుడు ఒకశరీరాన్నే పొందుతాడా? లేక అనేక శరీరాలు పొందుతాడా? అవి ఆత్మతో కూడి ఉంటాయా? లేక ఆత్మలేకుండా మరబొమ్మాల్లా ఉంటాయా అని సందేహం. విద్వాంసునిచేత నిర్మించబడిన అనేక శరీరాలలో విద్వాంసుడు ప్రదీపంలాగా ఆవేశిస్తాడు. ముక్తుడు ఆత్మ భోగం కావాలనుకున్నప్పుడు అనేక శరీరాలను పొందుతాడు. ఒకేఆత్మతో ఒకేశరీరoతో భోగం అసంభవం. ఉన్నది ఒక్కటే ఆత్మ దానికి మినహాయింపు లేదు, కనుక అన్నిశరీరాలలో అన్నిఆత్మలు ఉండే అవకాశం లేదు. ఒక దీపం అనేక వత్తులకు అంటుకొని అనేక దీపాలుగా ప్రకాశిస్తునట్లుగా, ముక్తుడు తానొక్కడే అయినా అనేక రూపాలను పొంది, అనేక శరీరాలలో ఆవేశిస్తాడు.
ప్రశ్నోపనిషత్తు(4, 11):- సోమ్యా! ఈశ్వరుణ్ణి ఎరిగిన జ్ఞాని అంతా తెలిసిన వాడై అన్నిటిలో ప్రవేశిస్తాడు.
ఛాందోగ్యోపనిషత్తు(7, 26, 2):- బ్రహ్మజ్ఞానియైన జీవన్ముక్తుడు మృత్యువు, రోగం, దుఃఖాల నుండి దూరమౌతాడని తెలుసుకుంటే, అన్నిటిని అన్ని విధాలనుండి పొందుతాడు. ఇలా ఉపనిషత్తులు ముక్తాత్మ ప్రభావాన్ని వర్ణిస్తున్నాయి. దీపం ఒక చోట ఉండి, అన్నిటిని తన ప్రకాశంతో ఆవేశించి, వెలిగేలా చేస్తున్నట్లుగానే ముక్తుడిలో ఉద్భవించిన జ్ఞానైశ్వర్యంతో దైహికవ్యాపారాలు చేస్తూ, ఆనందానుభూతిలో నిమగ్నమై ఉంటాడు.
సూత్రం :- 549
" స్వాప్యయ సంపత్యో రన్యతరాపేక్ష మావిష్కృతం హి "
స్వాప్యయః:- సుషుప్తి, సంపత్తిః :- మోక్షం, ఈరెండు దశల్లోను, అన్యతర అపేక్షo :- వేరొకదాన్ని ఆపేక్షించి, బాహ్యఅభ్యంతరజ్ఞానం కలుగుతుందని శాస్త్రంఅంటున్నది. హి:-ఎందుకంటే, ఆవిష్కృతం:-ఈ విషయాన్ని బృహదారణ్యకం ఇది వరకే ఆవిష్కరించింది.
భావం:-సుషుప్తి, మోక్షం ఈరెండూదశల్లోను వేరొకదాన్ని ఆపేక్షించి బాహ్యభ్యంతర జ్ఞానం కలుగు తుందని శాస్త్రం అంటున్నది. ఎందుకంటే ఈ విషయాన్ని బృహదారణ్యకం ఇది వరకే ఆవిష్కరించింది.
వివరణ:-స్వాప్యయము అంటే సుషుప్తి, ఇక్కడ సుషుప్తి, మోక్షం ఈ రెండింటిలోను ఏదో ఒక దానిని ఉద్దేశించి మాత్రమే చెప్పబడింది. మోక్షంలో అతనికి ప్రాకృతిక పదార్ధజ్ఞానం ఉంటుందా అంటే ఉండదనే విషయాన్ని తెలియజేస్తున్నారు.
బృహదారణ్యాకోపనిషత్తు(4, 3, 21):- బ్రహ్మసంపర్కం కలిగిన ఈపురుషుడు బాహ్యఅభ్యంతరాలను ఎరుగడు అన్నారు. (4, 5, 15):-అక్కడ ఆత్మ అప్పుడు దేనిని దేనితో తెలుసుకుంటుంది? అన్నారు. ఇక్కడ జ్ఞానసాధనాలు లేవు. విషయము లేదు. అప్పుడు జ్ఞాన అభావమే కదా! అయితే ముక్తాత్మ సర్వజ్ఞసమానం అని ఎలా అంటారు? అంటే ఈవాక్యాలు సుషుప్తికో, మోక్షానికో సంబంధించినవి. మొదటి వాక్యంలో జీవుడికి సంబంధం కలిగినప్పుడు సుషుప్తిదశలోలాగా జీవుడు బాహ్యభ్యంతరాలను ఎరుగడు అన్నారు. ఇక రెండోవాక్యం మోక్షానికిచెందినది. అక్కడ జీవుడు ఆనందంలో మునిగి ఆనందా నుభూతిలోనే ఉంటాడు. (4, 5, 15):-అంతాఆత్మగా ఎక్కడఅనుభవం కలుగుతుందో అక్కడ ఏది తెలుసు కోవాలి? అనడంతో ఆత్మానందంలో మునిగితేలే ముక్తాత్మ వేరే తెలుసుకోవలసినది ఏమి ఉండదని భావం. మోక్షంలో ప్రాకృతికపదార్ధజ్ఞానం ఉండదు. కేవలం బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉంటారు. కనుకనే సర్వజ్ఞసమానత చూపారు. స్వసామర్ధ్యంతో అంతా తెలుసుకోగల శక్తి ఉంటుందని అర్ధం. సుషుప్తిలో జ్ఞానం అనేది మనోబుద్ధుల నుండి ఇంద్రియాల నుండి ఉపసంహరించబడుతుంది. అంటే అవి జ్ఞానంతో పనిచెయ్యవు. అది నిరూపయోగంగా ఉన్న జ్ఞానం. అందుకే సుషుప్తిలో ఉన్న జీవుణ్ణి ప్రాజ్నుడు అంటారు. ఆప్రాజ్నుడే ఆత్మ అని చెప్పబడింది. సుషుప్తిలో గాఢనిద్రలో బాహ్యఅభ్యంతరాలను ఎరుగడు. మోక్షంలో జీవన్ముక్తుడు స్వరూపజ్ఞానంతో, స్వసామర్ధ్యంతో అన్నిటిలో ఉన్న ఆత్మ చైతన్యాన్ని దర్శించి, బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు.
సూత్రం :- 550
" జగద్ వ్యాపార వర్ణం ప్రకారణాదసంహితత్వాచ్చ "
ప్రకారణాత్ :- శాస్త్రాల్లో, అసంవిహితత్వాత్ చ :- జగత్తు ఉత్పత్తి ప్రసంగంలో జీవాత్మ ప్రసక్తి లేనందువల్ల, జగద్ వ్యాపార వర్ణం :- జగద్రచనా వ్యాపారం తప్ప మిగిలిన ఐశ్వర్య ప్రాప్తి ముక్తాత్మలకు కలుగుతుంది.
భావం :- శాస్త్రాల్లో జగత్తు ఉత్పత్తి ప్రసంగాలలో జీవాత్మ ప్రసక్తి లేనందువల్ల, జగద్రచనా వ్యాపారం తప్ప మిగిలిన ఐశ్వర్య ప్రాప్తి ముక్తాత్మాలకు కలుగుతుంది..
వివరణ:-ముక్తపురుషుడు సంకల్పమాత్రం చేత జగత్తును సృష్టించగలడా? అని సందేహం. జగద్రచనా వ్యాపారం తప్ప మిగిలిన ఐశ్వర్యప్రాప్తి ముక్తాత్మాలకు కలుగుతుంది. విద్వాంసుడికి అణిమాది అష్ట సిద్ధులన్నీ లభిస్తాయి.
అష్టసిద్ధులు:-సాధకుడు యోగమార్గంలో ముందుకు సాగుతున్నప్పుడు, ఒకస్థాయిలో అతను భౌతికమైన సూత్రాలను దాటిపోతాడని చెబుతోంది యోగం. పంచేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, ఈ ఎనిమిదింటిని జయించిన వారికే అష్ట సిద్ధులు కలుగుతాయి.
1. అణిమ :- శరీరమును అతి చిన్నదిగా చేయుట.
2.మహిమ :- శరీరమును అతి పెద్దదిగా చేయుట,
3.గరిమ :- శరీరం బరువును విపరీతంగా పెంచుట.
4. లఘిమ :- శరీరమును అతి తేలిక చేయుట
5. ప్రాప్తి :- కావలసిన వస్తువులు పొందుట.
6. ప్రాకామ్యం :- కావలసిన భోగాలు అనుభవించడం.
7. ఈశత్వం :- ఎవరిపైనైనా, దీనిపైనైనా అధికారం పొందుట.
8. వశీత్వం :- అన్ని భూతాలను లోబరచుకొనుట.
ముక్తులందరూ ఆపరమేశ్వరుణ్ణి అన్వేషించి వారిస్వరూపం తెలుసుకోవడం కోసం ప్రయత్నించి, తద్వారా అణిమాద్యైశ్వర్యాలు పొందినట్లు చెప్పబడింది.అణిమాది అష్టసిద్ధులు లభిస్తాయి, కాని జగత్తును సృష్టించే శక్తి మాత్రం ఉండదు. జగదుత్పత్తిలయాలు, జగద్వ్యాపారం, కర్మఫలప్రధానం లాంటి కార్యాలు ఈశ్వర సామర్ధ్యనికి చెందినవి. సృష్టి సమయంలో పరమేశ్వరుడు ఒక్కడే ఉంటాడు. అతనికి సన్నిహితులు గాని, అతనితో సమానమైన వారు గాని ఎవరూ ఉండరు.
తైత్తరేయోపనిషత్తు ( 1, 6, 2 ) :- స్వరాజ్యాన్ని పొందుతాడు.
ఛాందొగ్యోపనిషత్తు ( 7, 25, 2 ) :- అతడు అన్ని లోకాల్లో స్వేచ్ఛగా విహరిస్తాడు. జగదుత్పత్తి లాంటి వాటిని వర్ణించే ఘట్టాల్లో బ్రహ్మకు సాక్షాత్ సంబంధాన్ని పేర్కొన్నారు. అక్కడ ముక్తాత్మల ప్రసక్తే లేదు.
సూత్రం :- 551
" ప్రత్యక్షోపదేశా దితి చేన్నాధికారిక మండల స్థోకేః
ప్రత్యక్షఉపదేశాత్ ఇతి చేత్ :- ఉపనిషత్తులలో ముక్తాత్మ సామర్ధ్యం ప్రత్యక్షంగా వర్ణించారు కదా అని అనడం, న :- సరియైనది కాదు. ఎందుకంటే, అధికారిక మండల స్థోకేః :- జగద్రచన లాంటి కార్యాలు జీవాత్మ అధికారిక పరిధిని మించినది.
భావం :- ఉపనిషత్తులలో ముక్తాత్మ సామర్ధ్యం ప్రత్యక్షంగా వర్ణించారు కదా! అని అనడం సరియైనది కాదు. ఎందుకంటే జగద్రచన లాంటి కార్యాలు జీవాత్మ అధికారిక పరిధిని మించినది.
వివరణ:-విద్వాంసుడికి ఈశ్వరునితోబాటు సమానమైన ఐశ్వర్యం కలుగుతోంది. అంతమాత్రం చేత జగద్వ్యాపారం, జగత్కర్తృత్వం కలగవు. వీరందరూ బ్రహ్మలోకంలో ఉంటూ, పరబ్రహ్మకు లోబడి ఉంటారే కాని లోకాలను సృష్టించే అధికారం వీరికిలేదు. సగుణ బ్రహ్మోపాసన చేయడం వలన ఈశ్వర సాయుధ్యం పొందినవాళ్లకు ఎలాంటి అడ్డులేని ఐశ్వర్యం లభిస్తుందా? లేదా కొన్ని అడ్డంకులు ఉన్న ఐశ్వర్యం లభిస్తుందా? అని సంశయం.' జగద్వ్యాపారి, జగద్వ్యాపారవర్జమ్ ' అని పఠించడం వలన జగత్తును సృష్టించడo మొదలైన పనులు మినహాయించి, అణిమాద్యైశ్వర్యం సంకల్పం కలగవచ్చును. కేవలం పరమేశ్వరుడొక్కడికే జగద్వ్యాపారవిషయంలో అధికృతులు అంటే అధికారం కలవాడుగా ఆ పరమేశ్వరుణ్ణి ప్రకృతంగా చేసుకొని జగత్కర్తృత్వాధికం చెప్పబడింది. అతడే నిత్యమైన వేదశబ్దం చేత మాత్రమే తెలియబడుచున్నాడు. మిగిలిన వారంతా ముక్తులే. జగద్రచన లాంటి కార్యాలు జీవాత్మ అధికార పరిధికి మించినవి. ముక్తాత్మ విషయంలో చెప్పిన విషయాలు బ్రహ్మం నిర్వర్తించే జగదుత్పత్తి కార్యాలకు సంబంధించినవికావు. స్వరాజ్యం పొందడం, కామాచారణం, ఆదరణీయత లాంటివి ముక్తాత్మకు సాధ్యమైనవే. ఏ ఒక్కని సంకల్పాన్ని అందరూ అంగీకరిస్తారో, అతడే నిత్య సిద్ధుడైన ఈశ్వరుడు. ఇతరులందరూ పరమేశ్వరుని అభిప్రాయాన్ని అనుసరించి ఉంటారని గ్రహించాలి.
సూత్రం :- 552
" వికారావర్తి చ తథా హి స్థితి మాహ "
ఇది ముక్తాత్మ ఐశ్వర్యం విషయం. వికారావర్తి :- ముక్తాత్మ ఐశ్వర్యం వికృత వస్తువులకే పరిమితం, చ :- అని, తాథా హి స్థితిం ఆహ :- శాస్త్రాలు చెబుతున్నాయి.
భావం :- ఇది ముక్తాత్మ ఐశ్వర్య విషయం. ముక్తాత్మ ఐశ్వర్యం వికృత వస్తువులకే పరిమితమని శాస్త్రాలు చెబుతున్నాయి.
వివరణ:-జీవుడి ఐశ్వర్యం రెండురకాలుగా ఉంటుంది. 1. జ్ఞాన రూపం, 2. క్రియా రూపం. జ్ఞాన రూపమైన ముక్తాత్మ ఐశ్వర్యం. బ్రహ్మం మొదలుకొని ప్రకృతి వరకు ఉండే అన్ని తత్త్వాలను తెలుసుకుంటాడు. భావ పదార్ధాలను తన విషయాలుగా చేసుకుంటాడు. కనుకనే సర్వజ్ఞ సమానుడన్నారు. క్రియారూప ఐశ్వర్యం అంటే జగత్వ్యాపార ప్రక్రియ. ప్రకృతి పరిణమించి వికృతమయ్యే కార్యకలాపం ఈశ్వర వ్యవస్థ. ఇందులో ముక్తాత్మ ప్రమేయం లేదు. ముక్తాత్మ స్వరాట్ కావడం, అన్ని లోకాల్లో సంచరించడం, వికృతికి సంబంధించినదే. బ్రహ్మనికి చెందిన ఐశ్వర్యం అంత కంటే మించినది.
యజుర్వేదం ( 31, 3 ) :- 'పరమేశ్వరుడి మహిమకు హద్దు లేదు ' అని వేదవచనం. పరమేశ్వరుడికి సగుణ రూపము, నిర్గుణ రూపము అని రెండు రకాల రూపాలు ఉన్నవని వేదంలో చెప్పబడింది.
సగుణ రూపం :- పరబ్రహ్మ సకల చరాచర సృష్టికి ఆధార భూతమై, సృష్టి కర్త కారణ బ్రహ్మగా, వారిని పోషించే స్థితి కర్త విష్ణువుగా, సృష్టిని లయం చేసే లయ కర్త శివుడిగా, ప్రకృతి అంతటా వ్యాపించి, సర్వ వ్యాపకమై, వికారరూపంలో ఆయారూపాలలో కనిపిస్తాడు. విశ్వం, సమస్తభూతాలు కలసి పరమేశ్వరుడి ఒకపాదం మాత్రమే. జీవుడికి దివ్యనేత్రాలు లేనందున, అతని చర్మచక్షవులకు, మాయా నేత్రలకు ప్రపంచమే కనిపిస్తుంది కాని వికారానికి ఆవల ఉన్న పరబ్రహ్మ గోచరించడు.
నిర్గుణరూపం:- పరమేశ్వరునిరూపం వికారమందు మాత్రమే ఉండేదికాదు. నిత్యమై, నిర్గుణుడై, నిర్వికారమై, స్వయంప్రకాశమై, ఎలాంటి వికారాలు లేకుండా ఆదిత్య మండలంలోని పరబ్రహ్మ స్వరూపం మూడు పాదాలతో ఉంటుంది. ఆ నిర్గుణ రూపాన్ని నిర్గుణ బ్రహ్మోపాసకులు మాత్రమే పొందగలరు, కాని సగుణోపాసకులు పొందడం అసంభవం.
సూత్రం :- 553
" దర్శయతి శ్చైవo ప్రత్యక్షానుమానే "
ప్రత్యక్షానుమానే :- ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలు రెండూ, దర్శయతిః చ :- తెలుపుతున్నాయి.
భావం:-బ్రహ్మానికిఉన్న ఐశ్వర్యం అపరిమితంఅని, ప్రత్యక్షఅనుమాన ప్రమాణాలు రెండూ తెలుపుతున్నాయి.
వివరణ:-ప్రత్యక్షం అంటే శ్రుతి, అనుమానం అంటే ఉపనిషత్తులు. జ్యోతిరూపుడైన పరబ్రహ్మయందు లోకాలను ప్రకాశింపజేసే సూర్యుడు ప్రకాశింపడు. చంద్రుడు కాంతులివ్వడు. తారలు ప్రకాశింపవని ఉపనిషత్తులు చెబుతున్నాయి. అవి వేదంలో భాగాలు. ఇదే విషయాన్ని పురాణాలూ చెబుతున్నాయి. స్వయంప్రకాశకుడైన పరమాత్మను సూర్యచంద్రాగ్నులు ప్రకాశింపజేయలేవని భగవద్గీత చెబుతోంది. పరమాత్మది అన్నితేజస్సులకన్నా అధికమైనతేజస్సు. కాబట్టి సగుణనిర్గుణరూపాలు రెండూ ఉన్నాయి.
యజుర్వేదం ( 40, 5 ) :- ఆ పరమేశ్వరుడు అన్నిటి లోపల, వెలుపలా ఉంటాడు.
ఋగ్వేదం ( 1, 52, 22 ) :- ఓ ఈశ్వరా! నీవు ఈ విస్తృత లోకాంతరాలను దాటి కూడా ఉన్నావు.
కఠోపనిషత్తు(5, 15), శ్వేతాశ్వరోపనిషత్తు(6, 14), ముండకోపనిషత్తు (2, 2, 10) :- సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇవేవి ఈశ్వరుణ్ణి ప్రకాశింపజేయలేవు. ఆయన ఉనికివల్లే అవన్నీ ప్రకాసిస్తున్నాయని ప్రమాణాలంటున్నాయి. విశ్వకర్త లేకపోతే ఇవన్నీ వెలగవు. కనుక బ్రహ్మం ఐశ్వర్యం వికృత ప్రపంచాన్ని కాక సమస్త కార్యకారణాత్మక ప్రపంచాన్ని మించిఉన్నది. ఆయన ఐశ్వర్యం పరిమితి లేనిది. పరబ్రహ్మకి ఉన్న ఐశ్వర్యం అపరిమితమని, వికారాలులేని సర్వవ్యాప్తమైన, స్వయం ప్రకాశమైన జ్యోతి స్వరూపుడైన పరబ్రహ్మ నిర్గుణరూపాన్ని, శ్రుతులు, స్మృతుల వలన తెలియజేయబడింది. సూర్యుని కన్నా పెద్దవైన నక్షత్రాలుకూడా పగలు సూర్యునివెలుగులో కనబడవు. పరజ్యోతిస్సు వికారాతీతంగాఉండటం ప్రసిద్ధమే. లోకాలను ప్రకాసింపజేసే సూర్యుడు, రాత్రి ప్రకాశించే చంద్రుడు, తారలు ఏమాత్రం పరబ్రహ్మను ప్రకాశింపజేయలేవు. స్వయంప్రకాశకుడైన పరబ్రహ్మ ఉనికివలనే సూర్యచంద్రాగ్నులు ప్రకాశిస్తు న్నాయని శ్రుతులు, స్మృతుల వలన తెలుస్తోంది.
సూత్రం :- 554
" భోగమాత్ర సామ్య లింగాచ్చ "
చ:- కాగా, భోగమాత్రసామ్యలింగాత్ :- ముక్తదశలో జీవుడు బ్రహ్మంలో ఉండి బ్రహ్మానందం అనుభవిస్తాడు.
భావం :- పరబ్రహ్మనికి అన్ని తేజస్సుల కన్నా అధికమైన తేజస్సు. ముక్త దశలో జీవుడు బ్రహ్మంలో ఉండి బ్రహ్మానందం అనుభవిస్తాడు.
వివరణ:-ముక్తాత్మ అలాంటి భోగం అనుభవించడంలో బ్రహ్మంతో పోలిక చెప్పారు. అక్కడే బ్రహ్మంతో సమానత్వం. ఉపాసకులకు ఈశ్వరునితో పాటుగా భోగమాత్రమైన స్వామ్యమే ఉన్నదని వేదాలు చెబుతున్నాయి. అందుచేత వారికి జగత్తును సృష్టించే శక్తి, అధికారం లేవు.
తైత్తరీయోపనిషత్తు(2, 1):-సత్యం, జ్ఞానం, చైతన్యం అయిన అనంతబ్రహ్మాన్ని ఎరిగినవాడు ఆనందరూప బ్రహ్మంతో బాటు అన్ని కామాలను అనుభవిస్తాడు. బ్రహ్మాన్ని పొందినవాడికి ఏకామనలు ఉండవు. నిష్కాముడై ఆనందాన్ని అనుభవిస్తాడని భావం. ఈసత్యఆప్త కామతే ముక్తాత్మలో బ్రహ్మనికి స్వామ్యం. సమస్తప్రాణులు హిరణ్యగర్భడిని పూజించినట్లే, ఉపాసకునికి కూడా భోగసాధనాలవుతాయి. బ్రహ్మ లోకంలో చేరిన ఉపాసకులతో బ్రహ్మ, ఓఉపాసకులారా! ఇక్కడ అమృతరూపమైన జాలాన్ని నేను ఉపయోగిస్తున్నట్లే మీరుకూడా ఉపయోగిస్తారు.' అంటే వీరికి భోగస్వామ్యమే తప్ప జగద్వ్యాపారం లేదు. భోగంలోమాత్రమే పరమేశ్వరునితో స్వామ్యం ఉన్నదని చెప్పే లింగం ఉండడంవలన ఉపాసకుడికి నిరంకుశైశ్వర్యం లేదని చెప్పబడింది. కార్యబ్రహ్మోద్యుపాసన చేసిన విద్వాంసులకు ఐశ్వర్యం నిరంకుశం కాదు. వీళ్ళ భోగంమాత్రమే అనాదిసిద్ధుడైన ఈశ్వరుని భోగంతో సమానంగా ఉంటుంది. బ్రహ్మ లోకానికి వెళ్లిన ఉపాసకులతో హిరణ్యగర్భుడు అంటాడు.
'తమాహ - - - అసౌ' ఈ అమృత రూపాలైన ఉదకాలు నా చేత భుజింపబడుతున్నాయి. ఏలోకం నీకు కూడా '. 'యథైతాం - - అవంతి'- ఈసగుణబ్రహ్మను సమస్తభూతాలు ఏవిధంగా సేవిస్తాయో, ఆ దేవతోపాసన చేసిన వానిని కూడా సేవిస్తాయి. తేనో - - జయంతి ' ఆ దేవత ( సగుణ బ్రహ్మకు) కొరకు సాయుధ్యాన్ని, సమాన రూపత్వాన్ని, సలోకత్వాన్నికూడా ఉపాసకులు జయిస్తారు (పొందుతారు). ఉపాసకునికి కార్యబ్రహ్మతో బాటుగా జగత్సృష్టితప్ప ఇతరభోగాలన్నీ అనుభవిస్తాడని, వానికీ నిరంకుశాధికారం ఉండదని, సమస్తమైన ప్రాణులు కార్యబ్రహ్మను ఎలా పూజిస్తాయో, ఉపాసకుని కూడా అదే విధంగా పూజిస్తాయని శ్రుతి వాక్యాల వలన తెలుస్తోంది.
సూత్రం :- 555
" అన్నావృత్తిః శబ్దాత్ అనావృత్తిః శబ్దాత్ "
అనావృత్తిః :- ముక్తాత్మ తిరిగిరాడని, శబ్దాత్ :-శబ్ద ప్రమాణమున్నది.
భావం :- ముక్తాత్మ తిరిగిరాడని శబ్ద ప్రమాణమున్నది.
వివరణ:- బృహదారణ్యకంలో చెప్పినట్లు ఈశరీరాన్ని విడవడంతోనే మోక్షాన్ని పొందినవాడు దేవయాన మార్గంలో బ్రహ్మాన్నిపొంది ముక్తుడౌతాడు. వీరంతా కల్పాంతం వరకు బ్రహ్మలోకంలో ఉండి, కల్పాంతాన పరబ్రహ్మలో లీనమౌతారు.ఈ సృష్టిలో మరల జన్మించడు. స్వస్వరూప సామర్ధ్యం వలన బ్రహ్మానందం అనుభవిస్తూ సర్వత్రావిహరిస్తాడు. అతనికి ప్రాకృతికబంధం ఏదిఉండదు. ముక్తాత్మ తన ఇచ్చానుసారం ఈవ్యవస్థను దాటలేడు. ఇది బ్రాహ్మివ్యవస్థ. స్వతంత్రంగా ఈ వ్యవస్థను ఉల్లంఘించలేడు. ముక్తులకు ఈ వ్యవస్థ లో జననమరణ పరంపర ఉండదు.
బృహదారణ్యాకోపనిషత్తు(6,2,19):- వాళ్ళు ఆబ్రహ్మలోకంలో చాలాకాలం వసిస్తారు. వాళ్లకు పునరావృత్తి లేదు.
ఛాందోగ్యోపనిషత్తు(4, 15, 5):-దేవయానమార్గంలో బ్రహ్మలోకంపొందిన జ్ఞానులు ఈ మానవఆవర్తనంలో తిరిగి రారు. అర్చిరాదిమార్గం గుండా బ్రహ్మ లోకం చేరిన వారికి పునరావృత్తి లేదు. కఠోపనిషత్తులో చెప్పినట్లుగా బ్రహ్మనాడి గుండా వెళ్లిన వారికి అమృతత్త్వం లభిస్తుంది. జ్ఞానసాధనలో స్వస్వరూప జ్ఞానంలో నిలిచి, ఆత్మజ్ఞానం పొందుతారో వారికి అఖండమైన బ్రహ్మానందం లభిస్తుంది. వీరంతా కల్పంతం వరకు బ్రహ్మ లోకంలో ఉండి, కల్పాంతాన పరబ్రహ్మలో లీనమౌతారు. ఒక సూత్రాన్ని రెండు సార్లు ప్రయోగిస్తే గ్రంధ పరిసమాప్తిని సూచిస్తుంది.మానవజీవిత పరమార్ధం మోక్షమేననే స్థిర నిశ్చయంతో ఉపాసకులు సమస్త ప్రతి బంధకాలు తొలగించుకొని, బ్రహ్మ సూత్రముల అంతరార్ధాన్ని గ్రహించి,అహం బ్రహ్మాస్మి అనే అనుభవాన్ని పొందితే, శాశ్వతమైన, అఖండమైన చిదానంద స్థితి లభిస్తుంది.
బ్రహ్మసూత్ర శాంకర భాష్యం సమాప్తం.
అందరికీ నమస్కారం. నేనుగతంలో బ్రహ్మసూత్రములను చదవాలని కోరుకున్నాను. అప్పుడు నాకు శ్రీనోరి శ్రీనాథవెంకటసోమయాజులు గారి "బ్రహ్మసూత్రదర్శనము" లభించింది. వారు చాలా గ్రంథములు, భాష్యములు, సూత్రములు వగైరాలెన్నియో పరిశీలించి, చాలాగొప్పగా బ్రహ్మసూత్రము లకు వివరణలు యిచ్చారు. నిస్సందేహంగా చాలా గొప్ప రచన. కాని, ప్రస్తుత సామాజిక పరిస్థితులలో అంతటి గంభీరమైన భాషను చదివి, అర్థంచేసుకునే విధంగా ప్రజానీకం ఉన్నారా? అనే ప్రశ్న ఉదయించింది. ఇంకాస్త తేలికగా, వాడుకభాషలో వివరణ వుంటే బాగుంటుంది అని నా మనస్సుకుఅనిపించింది. కాని నేనుఅంతటి విద్యావంతుడను కానందున,ఎటువంటిప్రయత్నము చేయలేకపోయాను. కొంతకాలానికి, నాకు ఫేస్ బుక్ లో "పరశురామం" గ్రూపులో, శ్రీమతి చెల్లూరి విజయలక్ష్మిగారు పోస్టు చేసిన బ్రహ్మసూత్రముల వివరణ నాకుకనపడింది. వారు బ్రహ్మసూత్రములకు చాలా తేలికభాషలో, సామాన్య ప్రజానీకానికి కూడా సులువుగా అర్థమయ్యే భాషలో వివరించారు. అప్పుడు ఇన్నేళ్ళ నాఅన్వేషణకు తగినసమాధానం, ఫలితం కనిపించిందని అనుకున్నాను. అంతకు ముందే నేను, బ్రహ్మజ్ఞానానికి, తత్త్వవిచారణకు సంబంధించిన కొంత సమాచారం "తత్త్వవిశ్లేషణ" అనే నా వెబ్ సైట్ లో పొందుపర్చాను. కాని బ్రహ్మసూత్ర వివరణ కూడా అందులో చేర్చితే, అది సంపూర్ణమవుతుంది, అనే భావన ఉండేది. ఇప్పుడు శ్రీమతి చెల్లూరి విజయలక్ష్మిగారు వివరించే బ్రహ్మసూత్రాలను నా వెబ్ సైట్ లో ఉంచితే చాలా బాగుంటుందన్న భావన వచ్చింది. తదుపరి శ్రీమతి విజయలక్ష్మిగారిని ఫోనులో సంప్రదించి, వారు రోజుకొక సూత్రంగా వివరిస్తున్న బ్రహ్మసూత్రములను ఒకే సంపుటంగా ఎడిట్ చేసి, కోరిన జిజ్ఞాసువులకు అందించుటకు, నా తత్త్వవిశ్లేషణ వెబ్ సైట్ లో పొందుపర్చుటకు, వారి అనుమతి కోరాను. వారు ఎంతో విశాల హృదయంతో, నాకోరికను మన్నించి, అనుమతిని దయచేశారు. అందులకుగాను వారికి నేను అనేకానేక కృతజ్ఞతాభివందనములు తెలియ జేస్తున్నాను. ఈమహా యజ్ఞమునకు శ్రీమతి చెల్లూరి విజయలక్ష్మిగారు మూల స్తంభము వంటివారు. కాబట్టి వారికి ప్రథమ తాంబూలం ఇవ్వాలి. ఎందుకంటే ఎంతో లోతుగా అన్వేషిస్తేనే గాని బ్రహ్మసూత్ర వివరణ చెయ్యలేరు. శ్రీమతి విజయలక్ష్మిగారు ఎంతగా శ్రమించారో, నేను అవగతం చేసుకున్నాను. కాబట్టి ప్రప్రథమంగా వారికి నా కృతజ్ఞతాభి వందనములు, ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను.
నేను ముందర, శ్రీమతి విజయలక్ష్మిగారు ఫేస్ బుక్ లో పెట్టే బ్రహ్మసూత్రాలను ఏరోజుకారోజు మాయొక్క "సుబోధ" వాట్సప్ గ్రూప్ లో పెట్టేవాడిని. వాటన్నింటినీ భద్రపరచి, మళ్ళీ వాటిని గంపగుత్తగా నాకు పంపించారు శ్రీమతి బండి భ్రమరాంబగారు. వారు కూడా బ్రహ్మజ్ఞానులు, నిరంతర యోగాభ్యాసకులు. కాబట్టి వారు వీటిని ఇంత జాగ్రత్తగా కాపాడి, తిరిగి నాకు పంపించారు. లేకపోతే ఈపనిని నేను చేసి ఉండేవాడిని కాను. కాబట్టి దైవప్రసాదిత సహోదరి, శ్రీమతి బండి భ్రమరాంబగారికి నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏమిటంటే, సాధ్యమైనంత వరకూ అక్షరదోషాలు లేకుండా జాగ్రత్త పడినాను. వయోభారంవల్ల ఎక్కువ శ్రద్ధ పెట్టలేక పోయినాను. ఏమైనా అక్షరదోషాలు వుంటే మన్నించి, సరిచేసుకొని చదువుకొనవలసినదిగా ప్రార్థన.
ఇక చివరిగా, అతి ముఖ్యమైనది ఏమిటంటే, నాకు ప్రతీ విషయంలోను మార్గదర్శిగా వ్యవహరించి, వెన్నుదన్నుగా నిలచి, తగు సలహాలనిచ్చి, ప్రోత్సహించి, నన్ను ముందుకు నడిపిన ప్రాణమిత్రులు శ్రీకాశావజ్ఝల వెంకటనరసింహ మూర్తి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు, ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ఇంతమంది, వారివారి పంథాలలో ఎంతో కృషి చేస్తేనే ఈ బృహత్కార్యం పూర్తయిందని, చదువరులు గ్రహించకోర్తాను.
ఈ మహత్కార్యంలో పాల్గొన్న ప్రతీవారికీ, చదువరులకు ఆ పరమాత్మ బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కలిగించి, జీవన్ముక్తి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ఇట్లు,
బుధజనవిధేయుడు.
శ్రీరామ జయరామ జయజయ రామ
బ్రహ్మ సూత్రములు
ఉపోద్ఘాతం
బ్రహ్మసూత్రాలను సూత్రప్రాయంగా చిన్న చిన్న మాటలలో చెప్పడం వలన దానికి భాష్యాలు వస్తే కానీ అర్ధం కావని వాటిని ఎవరో మహాత్ములు మాత్రమే అర్ధం చేసుకోగలరు కానీ సామాన్యులకు సాధ్యం కాదు. వేదాంతమార్గంలో ఉన్నవారు వాటిని అర్ధం చేసుకుని అనేక రకాల భాష్యాలు రచించడం జరిగింది. ఇప్పటికీ భాష్య రచనలు వస్తూనే ఉన్నాయి. శంకరాచార్యులకన్నా ముందు బ్రహ్మసూత్రాలకు భాష్యం వ్రాయడం జరిగింది. శ్రీగోవిందపాదాచార్యుల ఆదేశంతో శ్రీశంకరాచార్యులు కాశీ క్షేత్రం వెళ్లి బ్రహ్మ సూత్రాలకు భాష్యం వ్రాశారు. అంతకు ముందు 10 మంది వరకు భాష్యం వ్రాశారు. ఒక మహాత్ముడు అందరూ వ్రాషిన భాష్యాలు పరిశీలించి, శంకరుల భాష్యం ఒక్కటే అనుకూలంగా ఉందని ప్రశంశించారు. అదే పరమతాత్పర్యం అని వర్ణించబడింది. గోవిందపాదాచార్యులు అద్వైతమతానికి పునాది వేస్తే దానిని శంకరులు అద్వితీయంగా వ్యాప్తి చేశారు. వారి కృషిని, మేధాశక్తిని, పరిశీలనా శక్తిని పాశ్చాత్యులు ఇప్పటికి ఆశ్చర్య పోతుంటారు. ఇంతటి మేధాశక్తి గల ఈమహాత్ముడు చెప్పిన మార్గాన్ని అనుసరిస్తూ వేదాలకు అంతంలో ఉన్న ఉపనిషత్తులయొక్క భావాలను సమన్వయం చేస్తూ అద్భుతంగా అందించిన గ్రంథం బ్రహ్మసూత్రములు. ఇవి కేవలం ఉపనిషత్తుల మీద ఆధారపడి ఉన్నాయి. ఏ పురాణాలు ఇతిహాసలమీద ఆధారపడి లేదు. శృతులలో ఉన్న వైరుధ్యాన్ని తొలగించడానికి బ్రహ్మసూత్రాలు రచించడం జరిగింది. బ్రహ్మసూత్రాలు ఎలా వచ్చాయి? ఎక్కడ నుండి తెచ్చారు? వేదం చెప్పిన మార్గాన్ని అనుసరిస్తూ మనకు షట్ దర్శనాలు వచ్చాయి. వేదాంతచర్చ అంతా దీనిలోని ఉంది .వాటికి ఎక్కువ ప్రచారం లేకపోవడం వలన వాటి జోలికి ఎవరు పోవడం లేదు. 1.వైశేషిక దర్శనం:-కణాద మహర్షి, 2.న్యాయదర్శనం:-గౌతమ మహర్షి , 3.సాంఖ్య దర్శనం:-కపిల మహర్షి , 4.యోగదర్శనం :-పతంజలి మహర్షి , 5.పూర్వ మీమాంస :-జైమిని మహర్షి 6.ఉత్తరమీమాంస:-వేదవ్యాసమహర్షి రచించారు. పూర్వమీమాంస కర్మకాండకు, సంబంధించినది. 5 దర్శనాలలో కర్మకాండ గురించి వివరించి 6వ దర్శనం నుంచి జ్ఞానకాండ మొదలైనది. 5 దర్శనాలు చక్కగా పరిశీలించి, విశ్లేచించి, విచారణచేసి, గ్రహించి వేదవ్యాసుడు ఉత్తర మీమాంస సూత్రాలు అధ్యయనం చెయ్యడం జరిగింది. ఇవి కేవలం ఉపనిషత్తుల మంత్రాల మీద ఆధారంగాచేసుకొని, ఉత్తర మీమాంస జ్ఞానకాండకు జీవన్ముక్తిని మోక్షాన్ని అందించడమే వీటి ప్రధాన లక్ష్యం. వేదాంత శ్రవణం పాపహరణం అన్నట్లుగా వేదాంతం వినడం కూడా గొప్ప విషయమే. పూజలు, యజ్ఞయాగాది క్రతువులు, నోములు, వ్రతాలు, రకరకాల కర్మలు పుణ్యం కోసం చేస్తూ ఉంటాము. పుణ్య కర్మలు చేస్తే పుణ్య ఫలాలు అనుభవిస్తారనడంలో సందేహం లేదు. అది గొప్ప విషయమే. ఉపనిషత్తులు నీవు పరమాత్మవే అని తెలియజేస్తున్నా మోక్షాన్ని అందుకోవడం సాధ్యం కాదనీ, జ్ఞానం అందుకోవడం వీలయ్యే పని కాదనీ, జ్ఞానబోధ చేసేవారు లేరనీ, తెలుసుకునే తీరికలేక వినలేమనీ, లౌకిక వ్యవహారాలలో ఎప్పుడు బిజీగా ఉంటున్నామనీ చాలా మంది చెబుతుంటారు. ఆ పుణ్యకర్మలన్నీ చేస్తే ఎంత పుణ్యమో, వేదాంతం వింటే అంత పుణ్యం. ఎందుకంటే వాసనా క్షయం పాపహరణం, వేదలు ఉపనిషత్తులు ఏమి చెప్పినా నీవు పరమాత్మవే తత్త్వమసి అనే చెబుతాయి. మోక్షస్థితిలో నిలిచిపోవాలి అనుకునే వారికి వేదాంత శ్రవణం చేస్తుంటే తన యదార్ధ స్వరూపం తెలుసుకొని, తాను పరమాత్మను అనే భావం వస్తుంది. ప్రతి నిత్యం శ్రవణం చెయ్యడం వలన క్రమంగా నేను దేహాన్ని అనే భావన తొలగిపోయి నేను పరమాత్మను అనే భావన స్థిరపడుతుంది. వాసనా క్షయం పాపహరణం, వేదాంతం వింటే మోక్షం వస్తుంది. ఒకవేళ ఏదో రకంగా మనసు నిలకడగా లేకపోయినా, చెవుల్లో ఆ శబ్దాలు పడతాయి కనుక అది పాప హారణమే. ప్రతి రోజు శ్రవణం, ధ్యానం చేస్తుంటే ఆభావన స్థిరపడుతుంది. బ్రహ్మాన్ని గురించి సూత్రప్రాయంగా తెలియజేసేవి, పరమాత్మ తత్త్వాన్ని తెలియజేసేది, బ్రహ్మతత్త్వాన్ని తెలియజేసేది బ్రహ్మసూత్రాలు. ఉత్తర మీమాంసకు వేదాంత మీమాంస అని పేరు. ఈ బ్రహ్మసూత్రాలు ఎందుకు చెప్పవలసి వచ్చింది? ప్రతి మనిషి పుట్టినస్థితి నుంచి చివరి క్షణం వరకు తాను పొందబోయే ఆనందం గురించి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. 1.ఆనందం కోసం కొందరు మణులు, రత్నాలు జాతి రాళ్లు ధరిస్తారు. 2.కొందరు మంత్రాలను ఉపదేశం పొంది మంత్రసిద్ధి సాధిస్తారు.3.కొందరు నోములు, వ్రతాలు, వైదిక కర్మలు ఆచరిస్తూ పురాణాలు, ఇతిహాసాలు వింటూ ఉంటారు. కొందరు జపధ్యానాలు, సత్కర్మలు చేస్తూ ఆనందం పొందుతారు. శాశ్వతమైన, అఖండమైన, అనంతమైన, ఆనందం మోక్షనందమే. అందులో ఉండే ఆనందం మోక్షానందం అనుభవించే వారికి తెలుస్తుంది. రకరకాల కర్మల వలన ఆనందం వస్తుందో రాదో తెలియదు కాని కర్మఫలాలు మాత్రం వస్తాయి. దానిని అనుభవించడానికి జన్మలు రావడం మరల కర్మలు చెయ్యడం, పునరపి మరణం పునరపి జననం ఈ జననం జనన మరణ చక్రంలో బంధీలౌతారు. ప్రవహించే నదిలో ఒక సుడిగుండం నుండి తప్పించుకొని మరియొక సుడిగుండంలో చిక్కుకునే కీటకంలా మానవుడు కూడా ఒక జన్మ నుండి మరొక జన్మకు కర్మ బంధాలతో చిక్కుకొని మార్గం చెప్పేవారు లేక, రకరకాల కష్టాలతో అశాంతితో గడిపేస్తున్నారు. జన్మ దుఃఖం, జరా దుఃఖం నుండి తప్పించుకోవడానికి బ్రహ్మజ్ఞానం పొంది, అహం బ్రహ్మాస్మి స్థితికి చేరుకునే ప్రయత్నం చెయ్యడమే సాధకుడి కర్తవ్యం. శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వగలిగే జ్ఞానం ఉపనిషత్తులు, వేదాలు పరిశీలించి అర్ధంచేసుకుని బాదరాయణుడు వేదవ్యాసులు సూత్రం రూపంలో అందించిన జ్ఞానమే బ్రహ్మసూత్రాలు. సామాన్యమైన మానవుడు ఉపనిషత్తులన్నింటిని శ్రవణం చేయడం అధ్యయనం చెయ్యడం సమన్వయపరచుకొని నిశ్చయించుకోవడం అసాధ్యం. అనేకమైన ఉపనిషత్తులు అత్యంత గాఢమైన భావాలనువ్యక్తం చేసినందువలన, ఆ మంత్రాల భావాలను అర్ధం చేసుకోలేరు. ద్వాపర యుగంలో మనిషి ఆయుర్దాయం 200 సం. ఉంటే అది కలియుగంలో 100 సం. క్షీణించి, బాల్యం ఆటపాటలు, విద్య వివాహం, లౌకిక వ్యవహారాలతో సగం వయస్సు తరిగిపోతే, మిగిలిన 50 సం. ఎప్పుడు మృత్యువు వస్తుందో తెలియని అయోమయ స్థితిలో ఉపనిషత్తులు అధ్యయనం చేసి మోక్షప్రాప్తికై తపిస్తూ సాధన చెయ్యడానికి వయస్సు సరిపోదు. అయినప్పటికీ సాధన ప్రారంభిస్తే అది మరుజన్మలలోనైన మోక్షప్రాప్తి సిద్ధిస్తుంది. బాదరాయణుడు, వ్యాసులవారు ఒక్కరేనా? అనే విషయం పై భిన్నాభిప్రాయలు వాదోపవాదనలు ఉన్నాయి. వేదవ్యాసులవారు, బాదరాయణుడు ఒక్కరేనని కొందరు, బాదరాయణుడు ఆవహించి వ్యాసులవారిచే బ్రహ్మసూత్రాలు వ్రాయించారని కొందరు, వ్యాసులవారికే మరో పేరు బాదరాయణుడని కొందరు వారి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. బ్రహ్మసూత్రాలు వంటి మహత్తర గ్రంధం రచించడం సామాన్య విషయం కాదనీ, త్రికాల జ్ఞానం కలిగినవారు, అత్యంత జ్ఞాననిది కలిగినవారు, విష్ణుస్వరూపుడైన వాడు, లక్షశ్లోకాలతో మహాగ్రంధాలు, ఇతిహాసాలు వ్రాసినవారు, అఖండ చరిత్ర కలిగినవారు, విశాలబుద్ధి కలవారు, ధర్మనిధి, వేదాలను రచించిన వారు, పరమ జ్ఞాన స్వరూపుడైన వేదవ్యాసునికితప్ప మరొకరికి బ్రహ్మసూత్రాలు రచించడం సాధ్యమౌతుందా? ప్రస్థానత్రయం తెలుసుకుంటే మూడుమార్గాల్లో మానవుడు చేరుకోవలసిన గమ్యస్థానం మోక్షం అని అవగాహన కలుగుతుంది.1.ఉపనిషత్తులు, 2.బ్రహ్మ సూత్రాలు 3.భగవద్గీత. వాస్తవంగా మూడు కూడా జ్ఞానం గురించే బోధించాయి. ఈ మూడు.. మూడు మాజలీలు అనుకుందాం.
మొదటి మజిలీ:-ఉపనిషత్తులు శృతి ప్రస్థానం అంటారు. దీనిలో వేదాధ్యయనం నిత్యం నిర్వహించాలి.
రెండవ మజిలీ:-బ్రహ్మసూత్రాలు:-తర్క ప్రస్థానం:-దీనిలో ఉపనిషత్తులు తర్కించి, మననం చేసి విచారణ చెయ్యాలి.
మూడవ మజిలీ:-భగవద్గీత:-స్మృతి ప్రస్థానం:-ధర్మ శాస్త్రం ఇతిహాసాలు, పురాణాలు, శాస్త్రాలు, వేదంగాలు వాటిలో ఉన్న విషయాలు గుర్తు చేసుకొని చెప్పినదే భగవద్గీత.
1.మరల మరల స్మృతిని నిరంతరం వ్యాఖ్యానం చేస్తూ ఆత్మ చైతన్యంతో బుద్ధి నిలిపి నిధి ధ్యాసలు చెయ్యాలి. ఉపనిషత్తులు గురుముఖతః శ్రవణం చెయ్యాలి.2.విన్న దానినిచింతన చేస్తూ ఉండాలి. 3.భగవద్గీత తో అన్యమైన ఆలోచనలు రాకుండా నిధి ధ్యాసలు చెయ్యాలి. ఈ మూడు ప్రస్థాన త్రయం తెలుసుకుంటే శ్రవణ మనన నిధి ధ్యాసలు చేస్తే మోక్షం లభిస్తుంది. ఉపనిషత్తులన్నింటిని నెత్తిన పెట్టుకొని మన శిరస్సులలోనికి బాగా ఎక్కించడం కోసం వేదవ్యాసులు బ్రహ్మ సూత్రాల ద్వారా అద్భుత ప్రయోగం చేశారు. ఈ ప్రస్థాన త్రయం అధ్యయనం అవగాహన చేసి అనుభూతి పొందగలిగితే కోటానుకోట్ల జన్మల నుండి వచ్చిన కర్మలన్నీ నశించి, మానవ జన్మ సార్ధకమౌతుంది. ఉపనిషత్తులు పరిపక్వమైన సాధకులకోసమనీ, బ్రహ్మ సూత్రాలు జిజ్ఞాస పరులైన వారికోసమని, భగవద్గీత సామాన్యమైన గృహస్తుల కోసమని చెబుతుంటారు. బ్రహ్మ సూత్రాలు చాలా క్లిష్టమైనవి, కష్టమైనవి, సూత్రాల రూపంలో ఉండటం వలన వాటిని విడమరిచి చెప్పడం చాలా కష్టం కనుక ఇవి జన సామాన్యంలో లేవు. బ్రహ్మ సూత్రాలు పూర్తిగా తెలుసుకునే అవకాశం ఉంటే ప్రస్థాన త్రయం పూర్తి చేసినట్లవుతుంది. సూత్రానికి ఉండే లక్షణాలు:-4 ,1.అల్పాక్షరం ..తక్కువ అక్షరాలు ఉండాలి.ఎంత చిన్న చందస్సయిన 32 అక్షరాలు ఉండాలి. మంత్రాలు పాదాలు 4 ఉండాలి. 2.సందేహాలకు తావు లేకుండా ఉండాలి. 3.సారవత్.అన్ని శాస్త్రాల సారం ఉండాలి. 4. విశ్వతోముఖం జ్ఞానానికి సంబంధించిన అన్ని విషయాలు చెప్పాలి. 5.సూత్రాల్లో పొల్లు మాటలు, అనవసర మాటలు ఉండకూడదు. 6..ఏ రకమైన దోషాలు లేనటువంటిది. ఎవరు తప్పు పట్టకుండా అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అది తప్పు అనకుండా దేనికి సంబంధించిన పదమో తెలుసుకోవాలి .ఈ 6 లక్షణాలు ఉంటే సూత్రం అంటారు. దీనిలో ఛందస్సు ఉండదు. ఇలాంటి సూత్రాలలో బ్రహ్మాన్ని తెలియజేస్తుంది కనుక బ్రహ్మసూత్రాలు అని పిలువబడింది. ఇంకా ఏమైన పేర్లు ఉన్నాయా? 1.బ్రహ్మ సూత్రాలు వేదాంత విషయాలు తెలియజేస్తుంది కనుక వేదాంత సూత్రాలు అని 2.ఆత్మకు ఉపాధి శరీరం కనుక ఆత్మజ్ఞానం తెలిజేస్తుంది కనుక శారీరక భాష్యం అని 3.ఆరు దర్శనాలలో చివరది ఉత్తర మీమాంస కనుక ఉత్తర మీమాంస సూత్రాలన్నారు. 4.బ్రహ్మ సూత్రాలు చింతన, సన్యాశ్రమానికి చెందినది కనుక భిక్షు సూత్రాలు అని పిలువబడ్డాయి. ఎవరు ఎలా భావించినా పరమాత్మ స్వరూప స్వభావాలు వివరించినటువంటి సూత్రాలు కావడం వలన బ్రహ్మ సూత్రాలకు భిన్నాభిప్రాయాలు లేవు. త్రిమతాచార్యులైన అద్వైతం.. శంకరాచార్యులు, విశిష్టాద్వైతం.. రామానుజా చార్యులు, ద్వైతం. మధ్వాచార్యుల వారు బ్రహ్మసూత్తములకు భాష్యం వ్రాశారు. శంకరుల భాష్యం ఒక్కటే ప్రచారంలో ఉండగా మిగిలినవి రెండు కనుమరుగైనవి. అభేదవాదం, భేదాభేదవాదం, భేదవాదం, శైవాద్వైతం, వీరశైవాద్వైతం, రకరకాల వాదనలున్నాయి. శ్రీశంకరచార్యులకు ముందు 10 మంది బ్రహ్మసూత్రాలకు భాష్యం వ్రాసినా శంకరుల భాష్యం రాగానే అవన్నీ అదృశ్యమైపోయాయి. శ్రీ శంకరుల తరువాత కూడా కొన్ని భాష్యాలు కొంతమంది వ్రాయడం జరిగింది. విశిష్టాద్వైత పరంగా శ్రీ రామనుజాచార్యులు శ్రీ భాష్యం, ద్వైత మతాచార్యులు శ్రీ మధ్వాచార్యులు పూర్ణ ప్రజ్ఞ భాష్యం, శైవ వైష్ణవ పరంగా శ్రీ కంఠుల వారి శైవ భాష్యం, వేద విశిష్టాద్వైత శ్రీపతి వారి శ్రీకార భాష్యం, అవిభాగాద్వైతం విద్యాభిక్షు వారి విజ్ఞానామృతం, భేదాభేదం భాస్కరాచార్యుల వారి భాస్కర భాష్యం, శుద్ధద్వైతం వల్లభాచార్యుల వారి అనుభాష్యం, మధ్వాచార్యులు వారి గోవింద భాష్యం.. వ్రాసినప్పటికి అన్నింటినీ పరిశీలించిన పండితులు శంకరుల భాష్యమే సూత్రాలకు అనుగుణంగా ఉందని అదే పరమ తాత్పర్యమని నిగ్గు తేల్చారు. శంకరుల భాష్యం అంత తేలిగ్గా అర్ధం చేసుకోవడం కష్టం. అంతా పూర్తిగా అర్ధం అయినట్లే ఉంటుంది. చాలా కష్టపడితేనే అర్ధం అవుతుంది. అది కొంత మందికి మాత్రమే అర్ధం అవుతున్నందున, ఆయన శిష్యులు అవి అన్నీ అర్ధం అయ్యేలా భాష్యం వ్రాయడం జరిగింది. వారిని అనుకరిస్తూ మరి కొంతమంది భాష్యాలు వ్రాయడం జరిగింది. అందువలన బ్రహ్మసూత్రాలు ఈ మాత్రమైన లోకంలో ప్రచారం కావడానికి కారణమయ్యాయి. శంకరుల ప్రధమ శిష్యుడు సదానందుడు పంచపాదిక అనే పేరు మీద శంకరులను అనుకరిస్తూ గ్రంధం వ్రాశాడు. శంకరులు సదానందుడు చాలా ప్రియమైన శిష్యుడు. వారికి నలువురు శిష్యులుండేవారు. మిగిలిన ముగ్గురూ సదానందుడిపై అసూయ చెందారు. అతనికి అంత విజ్ఞానం లేకపోయినప్పటికీ శంకరులు ఎందుకు ప్రియశిష్యుడిగా చూస్తున్నారో అర్ధం కాలేదు. అది గమనించిన శంకరులు ఒకరోజు కట్టెల కోసం గంగానదికి ఆవలి ఒడ్డుకు వెళ్లిన సదానందుడుని వెనక్కి వచ్చెయ్యమని సైగ చేశారు. గంగానదిలో వరద ఉధృతి ఎక్కువగా ఉంది. సదానందుడు అదేమి గమనించకుండా గురువు ఆజ్ఞ ప్రకారం గంగానదిలో అడుగులు వేస్తూంటే, అతని పాదాల క్రింద పద్మాలు వచ్చి మునిగిపోకుండా ఒడ్డుకు చేర్చాయి. అది అతని గురుభక్తికి తార్కాణం. అందుకే అతనికి పద్మ పాదాచార్యులు అనే పేరు వచ్చింది. మిగిలిన శిష్యులు వారి తప్పు తెలుసుకొని అతని గురుభక్తి ఎంత గొప్పదో గ్రహించారు. సదానందుడు తన భాష్యంలో నాలుగు సూత్రాలు మాత్రమే వ్రాశాడు. 555 శ్లోకాలలో 4 శ్లోకాలకే భాష్యం వ్రాశారని విమర్శించిన వారున్నారు. కొందరు పండితులు ఈ 4 సూత్రాలు చదివితే మొత్తం 555 శ్లోకాల భావం చదివినట్లేనని తెలియజేసారు. మండనమిశ్రుడు మహమేధావి అతని పేరు సురేశ్వరచార్యులు. అతను వ్రాసిన భాష్యం ప్రచారంలోకి రాదని, వచ్చే జన్మలో అతను వ్రాసినది ఆమోదయోగ్యం అవుతుందని శంకరులు అన్నారట. సురేశ్వరచార్యులు తరువాతి జన్మలో భామతీవ్యాఖ్య అనే పేరుతో భాష్యం వ్రాశారు. ౧౩వశతాబ్దంలో అమరానందుడు కల్పతరువు అనేభాష్యం, 16వశతాబ్దంలో అప్పయ్యదీక్షితులు పరిమళ అనే భాష్యం వ్రాశారు. సురేశ్వరచార్యులు భామతిని అమరానందుడు కల్పతరువు చేస్తే, అప్పయ్యదీక్షితులు పరిమళాన్ని అద్దాడు అని మధురంగా వ్యాఖ్యానించారు. కంచి కామకోటి పీఠాధిపతి అప్పయ్యదీక్షితులను 2వ శంకరులుగా అభివర్ణించారు. సంస్కృతంలో ఉన్న వ్యాఖ్యానాలు అర్ధం చూసుకోలేరు కనుక కొందరు వేద వేత్తలు తెలుగులో వ్యాఖ్యలు అందించడం వలన సంస్కృతం లాంటి గంగా ప్రవాహంలో కంఠం లోతు ప్రయాణించవలసిన మనలని నడుం లోతు వరకు తెచ్చారు. వీటిపై ప్రవచనాలు ఇస్తున్న కొంత మంది మహాత్ములు మనలని మోకాలి లోతు వరకు తెచ్చారు. ఆధ్యాత్మిక జ్ఞాన పిపాసులైన వారు అంతా వారి కర్తవ్యం ఏమిటో తెలుసుకొని మోకాలి లోతు నీటిలో ప్రయాణించవలసిన అవసరం ఉంది. బ్రహ్మ సూత్రాలు మనం అర్ధం చేసుకోవడానికి కొంత వరకు కష్టపడవలసినదే. బ్రహ్మసూత్రాలు బహు నిఘాడమైనవి, జ్ఞాన సంబంధమైనవి, అర్ధం కానివి, అయినప్పటికీ వాటిని విశ్లేషణ చేసి అవగాహన చేసుకొని ఆచరణలో పెడితే మోక్షప్రాప్తి తధ్యం. సూత్రం రూపంలో ఉన్నవి కేవలం బ్రహ్మ సూత్రాలే కాదు, పతంజలి యోగ దర్శనం, గౌతమ మహర్షి న్యాయ సూత్రాలు, కపిల మహర్షి సాంఖ్య దర్శనం, కణాది మహర్షి వైశేషిక దర్శనం, పాండ్య మహర్షి వ్యాకరణసూత్రాలు, మహర్షి ధర్మ సూత్రాలు, నారదుడు భక్తి సూత్రాలు, అన్ని సూత్రాల రూపంలోనే వ్రాయబడినవి. అనేకమైన ఉపనిషత్తులలో కనిపించే వైవిధ్యాన్ని సమన్వయం చేసి ఒకే భావాన్ని అర్ధమయ్యేటట్లు చేసి ఏకాభిప్రాయం తెచ్చేందుకు ఈ బ్రహ్మసూత్రం రచనని వేదవ్యాసులవారు మనకు అందించారు. బ్రహ్మజ్ఞానం రావాలన్నా, కలగలన్నా, స్థిరపడలన్నా, బ్రహ్మ సూత్రాలు తప్పనిసరిగా అర్ధం చేసుకోవాలి. ఆత్మనుసంధానం చేసుకునే పద్ధతి తెలుస్తుంది. బ్రహ్మ సూత్రాలు పరిమాణంలో తక్కువ విజ్ఞానంలో చాలా విశాలమైనవి. అణువంత సూత్రానికి సాగరమంత భావం. 13 సం. వయస్సులో బాల శంకరులు కాశీ క్షేత్రం వెళ్లి బ్రహ్మ సూత్రాలకు భాష్యం వ్రాశారు. వృద్ధులైన పండితులు ఎందరో ఉన్నా ఎవరు ఈప్రయత్నం చేయలేదు. వ్రాసిన తృప్తికలగలేదు. బ్రహ్మ సూత్రాలలో 4 అధ్యాయాలు ఉంటాయి. 1.సమన్వయధ్యాయం 2.అవిరోదాధ్యయం 3.సాధనాధ్యాయం 4.పరాధ్యయం.1.సమన్వయాధ్యాయం.. ఉపనిషత్ వాక్య సమన్వయాన్ని తెలియజేసి ఉపనిషత్ వాక్యాల వైరుధ్యాన్ని తొలగించి వాటిని సమన్వయం జేస్తుంది. 2.అవరోధాధ్యయం:- ఇతర మతాల, ఇతర అభిప్రాయాలు అద్వైతానికి విరుద్ధంగా ఉన్నవి నిరోధించడం ఖండించడం. 3.సాధనాధ్యాయం:- దీనిలో మోక్షార్థులకు సాధనాలు పరమాత్మను అందుకోవాలనే సాధనలో. 4.పరాధ్యాయమ:- సాధన చేస్తే ఫలితం వచ్చి మోక్షాన్ని తెలియజేసే అధ్యాయం. ఒక్కొక్క అధ్యాయంలో 4 పాదాలున్నాయి. ఒక్కొక్క పాదంలో కొన్ని అధికారణలు ఉన్నాయి. ఎన్నైనాఉండవచ్చును. ఒక్కొక్క అధికారణంలో కొన్ని సూత్రాలు ఉన్నాయి. 4 అధ్యాయాలకు 16 పాదాలు, 141 అధికారణలు, 555 శ్లోకాలు ఉన్నాయి. ఉపనిషత్తులు 3 భాగాలు ఉంటాయి.1.కర్మ కాండ 2.ఉపాసనా కాండ 3.జ్ఞాన కాండ. బ్రహ్మజ్ఞానమే విద్యఅన్నారు. హేతు పూర్వకంగాపొందలేము. హేతు పూర్వకంగా అంటే చర్చల ద్వారా, వాదోపవాదాల ద్వారా గుర్తు పెట్టుకొని అనుభవ పూర్వకంగా రావాలి బ్రహ్మ విద్య. ఇది అసాధ్యమైనదనే భావం లోకంలో ఉంది.
అధ్యాయం...పాదాలు...అధికారణలు...సూత్రాలు
1 4 39 134
2. 4 47 157
3. 4 67 186
4. 4 35 78
----------------------------------------------------------
4 16 141 555
----------------------------------------------------------
శంకరులు బ్రహ్మసూత్రాల్లో కొన్ని ఉపనిషత్తులు కఠ, ప్రశ్న, ముండక , ఐతరేయ, కేన, ఛాందోగ్య, శ్వేతాస్వతర, కౌసీతకి మొదలైన వాటిలోని అనేక మంత్రాలను చెప్పడం జరిగింది. ఎంతో విస్తృతమైన, విశ్లేషణ, ఋజువులతో సహా చేసిన వారి ప్రయత్నం మానవమేధకు అందేది కాద అద్వైతం అంటే ఏమిటి? ఏకమేవా అద్వైతం బ్రహ్మ.. పరమాత్మ ఒక్కటే రెండవది లేదు. ఉన్నదంతా పరమాత్మే. కంటికి కనబడేవన్ని పరమాత్మే. శృతవాక్యం వలన సృష్టికి ముందు చూసేది, చూడబడేది ఏది లేదు. అప్పుడు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. ఏ రూపం లేనివాడు నిరాకరుడు, సూక్ష్మతి సూక్ష్మ మైన రూపం గలవాడు. ఆకాశం కంటికి ఎలా కనబడదో పరమాత్మ కూడా కనబడడు. పరమాత్మ తాను ఒక్కడే ఉన్నప్పుడు అనేక రూపాలలో తాను కనిపించాలని సంకల్పించి, తన స్వశక్తి అనే మాయతో ఈ ప్రపంచంలో జీవుల్లాగా కనిస్తున్నాడు. కనిపించే జీవులందరు పరమాత్మ స్వరూపలే. అనేక రూపాలుగా కనబడటం, ఉన్నది ఉన్నట్టుగా మరొక రూపంలో కనబడటం, పరమాత్మను చూడగలిగితే ఈ ప్రపంచం కనబడదు. అజ్ఞానం కారణంగా మనకు ప్రపంచమే కనిపించి బ్రహ్మం ఒక్కటే అనే సత్యాన్ని గ్రహించలేకపోతున్నాము. జీవ బ్రహ్మైక్యం:- ఈ అద్వైతసిద్ధాంతాన్ని ఎవరు అనుసరిస్తున్నారో వారికి ఒక సందేహం వస్తుంది. ఉన్నదంతా బ్రహ్మమే, నేను కూడా బ్రహ్మాన్ని అయినప్పుడు బ్రహ్మాన్ని చేరుకోవలసిన అవసరం ఏముంది? బ్రహ్మ ఎవరు? బ్రహ్మాన్ని అందుకునేవారు ఎవరు? పొందేవారు, పొందబడేవారు రెండు ఒక్కరే. తను బ్రహ్మాన్ని అని తెలుసుకో లేనివాడు బ్రహ్మాన్ని గురించి తెలుసుకుని, తానే ఆత్మచైతన్యరూపంలా. బ్రహ్మంగా నిలిచిపోతాడు. పొందే జీవుడు, పొందబడే పరమాత్మ ఒక్కటే. అద్వైతంలో జీవుడు, కర్మలు, కర్మఫలాలు, స్వర్గం నరకం జననం, మరణం ఇతర లోకాలకు పోవడం రావడం అన్ని ఆత్మనుభూతి పొందేవరకే, వీటిని విశ్లేషించి వైరాగ్యం పొంది ఆత్మగా, బ్రహ్మంగా, మోక్షాన్ని అందుకోవడమే బ్రహ్మ సూత్రాల యొక్క లక్ష్యం.
విశిష్టాద్వైత సిద్ధాంతం:- దీనిలో కొద్దిపాటి తేడాలున్నాయి. ఏకమేవా బ్రహ్మ వీరు కూడా ఒప్పుకుంటారు. జీవులందరు పరమాత్మలో అంశీభూతాలు. పరమాత్మ దేహంలో భాగాలు, జీవుల అంగాలతో కూడిన పరమాత్మ ఒక్కరే. అంతా ఒక్కటే అయినప్పుడు ఎలా విడిపోయారు? జీవాత్మలన్ని స్వతంత్రించి బయటకు వచ్చి సుఖదుఃఖాలు అనుభవిస్తారు. పరమాత్మను భక్తితో శరణాగతి చేత బుద్ధిశుద్ధి చేసుకొని, భగవత్దర్శనం చేసుకొని, స్వస్వరూప ఆవిర్భావం పొంది, వైకుంఠం చేరి విష్ణువు యొక్క బ్రహ్మానందం పొందుతారు. అంగాలన్ని బయటపడి స్వతంత్రంగా జన్మించి అనేక కష్టనష్టాలు అనుభవించి పరమాత్మను శరణాగతి కోరి విష్ణువును చేరితే సరిపోతుంది.
ద్వైత సిద్ధాంతం:- భక్తితో మోక్షం పొందే జీవుడు వేరు అనేది ఈ సిద్ధాంతం. జీవులు కర్మలను అనుసరించి తిరిగి జన్మిస్తుంటారు. సంసారబంధంలో చిక్కుకున్న జీవులు కర్మబంధాలు తొలగించుకొని, ముక్తిని పొంది, బ్రహ్మనిష్టుడైన గురువును చేరి, యదార్ధజ్ఞానాన్ని పొంది, తన హృదయ కమలమునందు పరమాత్మను బింబరుపంలో దర్శించి, వదిలించుకో వలసిన సంచిత కర్మలన్నింటిని వదిలించుకుని, చివరి దేహం నుండి బయటపడి, బ్రహ్మలోకం నుండి బ్రహ్మాండం లయమయినప్పుడు ఆయనతో బాటు విరాజానదిలో స్నానం చేసి, సూక్ష్మ శరీరం నుండి విముక్తులై, శ్వేత ద్వీప వాసులైన వాసుదేవుని సందర్శించి, భగవంతుని సాన్నిధ్యంలో ఉపాసన చేస్తూనే ఉంటారు. ముక్తుల్లో ఉత్తమ, మధ్యమ, అధమ రకాలు ఉన్నాయి. బ్రహ్మానందంలో భేదాలు అంగీకరిస్తారు. మృతి చెందిన జీవుడు లోపల బయట తన స్వరూపంతో లీలాగుహ్య సచ్చాత్మ దేహంలో గాని సంకల్ప మాత్రం చేత సిద్ధించిన దివ్య భోగాలు యోగ్యతానుసారంగా అనుభవిస్తారు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత అర్ధం చేసుకునే స్థాయి ఉంటేనే బ్రహ్మ సూత్రాలు జిజ్ఞాసతో అర్ధం చేసుకోగలరు. బ్రహ్మ సూత్రాల ప్రయోజనం ఏమిటి? ఉపనిషత్తుల విద్యను మననం చేస్తూ ఉండటమే దీని ప్రయోజనం. సూత్రం అంటే తాడు. పువ్వులను, పూసలను దండగా గుచ్చడానికి తాడు ఎలా అవసరం అదే విధంగా వేదాంత వాక్యాలనే రంగురంగుల పుష్పాలను గుచ్చి మాలగా తయారుచేసిన బ్రహ్మ సూత్రాలు అనే తాడు మోక్షార్థులు ధరించడం ఎంతో అవసరం.
బ్రహ్మసూత్రములు
1వ అధ్యాయం, 1వ పాదం, 1వ అధికారణం,
సూత్రం :- 1.
''అథాతో బ్రహ్మ జిజ్ఞాసా'
అథ:- ఆ తరువాత, అతః:-అందువలన, బ్రహ్మ జిజ్ఞాసా:-బ్రహ్మాన్ని గురించి తెలుసుకోవాలనే కోరిక.
భావం :- సంపూర్ణంగా ఉండడానికి కర్తవ్యః కలపాలి. అంటే బ్రహ్మ విద్య చెయ్యాలి. ఈ సూత్రం తెలుసుకోకుండా ఏమి తెలుసుకున్నా ప్రయోజనం ఉండదంటారు పెద్దలు. "ఆ తరువాత".. అంటే సాధనా చతుష్టయ సంపద సాధించిన తరువాత, "ఎందువలన" అంటే ...కర్మఫలం అనిత్యమని జ్ఞానం శాశ్వతమని తెలుసుకొని, మోక్షాన్ని కోరుకోవాలి. సాధనాచతుష్టయ సంపద సాధించిన తరువాత కర్మఫలాలు అనిత్యమని తెలుసుకొని, జ్ఞాన ఫలం నిత్యమైనది కనుక మోక్షార్థులు బ్రహ్మ జిజ్ఞాస చెయ్యాలి. "అథ" మంగళ వాచకం. ఏ శాస్త్ర గ్రంధం ప్రారంభించాలన్నా మంగళకర శబ్దాలతోనే ప్రారంభించాలి. మనం చేసే పనులు ఆటంకం కలగకుండా అవి నిర్విఘ్నంగా కొనసాగాలని "ఓం" అని "శ్రీ "అని మొదలుపెడతారు. వ్యాసులవారు అథ తోనే ఉత్తర మీమాంస పూర్వ మీమాంస ప్రారంభించారు.
వివరణ.. సాధనాచతుష్టయ సంపద:- పూర్వకాలంలో శిష్యులు వారికి కావలసిన జ్ఞానం అందించవలసిన మహానుభావులు, శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు, కరుణాసముద్రుడు ఎక్కడ దొరుకుతాడా అని విచారణ చేసి వారిని చేరేవారు. గురువు వారికి అర్హత ఉన్నదో లేదో తెలుసుకోవడానికి ఎన్నో పరీక్షలు పెట్టేవారు. గురువుచెప్పే మాటలు వింటూ ఆచరిస్తూ, సేవాభావంతో గురువుకు సేవ చేసేవారు. శిష్యుడిచేత హీనమైన పనులు కూడా చేయిస్తూ వారిలో అహంకారం ఉందా లేదా అని పరీక్షించే వారు. సాధనాచతుష్టయ సంపద చదివిన తరువాత వైరాగ్య ధోరణి వచ్చిందని నమ్మిన తరువాత అప్పుడు బోధ మొదలు పెట్టేవారు. గురువు ఏది బోధించిన సులభంగా గ్రహించేవారు. సాధనాచతుష్టయంలో 4 సాధనాలు చెప్పబడ్డాయి. 1.నిత్యానిత్య వస్తువివేకం:- నిత్యవస్తువులు, అనిత్య వస్తువులు ఏవి? లోకంలో మనం చూస్తున్నవన్నీ అనిత్యమైన వస్తువులే. నిత్యమైనది పరమాత్మ ఒక్కడేనని గ్రహించాలి. 2.వైరాగ్యం..ఈ లోకంలో, పరలోకంలో అనుభవించే సుఖాలు, భోగాలు అనిత్యమని తెలుసుకొని వాటిమీద వైరాగ్యం పెంచుకోవాలి. పరలోకంలో భోగాలు అనుభవిస్తున్న పుణ్య ఫలాలు ఖర్చు అయిన తరువాత మరల భూమి మీద జన్మ ఎత్తక తప్పదని తెలుసుకొని వైరాగ్య ధోరణి పెంచుకోవాలి. వివేకంతో కూడిన వైరాగ్యం ఉంటేనే పరమాత్మను చేరుకునే మార్గం సుగమం అవుతుంది. 3.శమాది షట్కము:- దీనిలో శమము, దమము, మనస్సు, బుద్ధి చిత్తం అహంకారం నిర్వచింపబడ్డాయి.1.శమము:-అంటే మనోనిగ్రహం, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే అంతరేంద్రియాలను వాటి వృత్తులను పోనీయక బ్రహ్మము నందే నిరంతరం నిలపటాన్ని శమము అంటారు. సామాన్యులైనవారు ఎదురుగా భోగ వస్తువులు ఆనందాన్ని ఇచ్చేవి ఉన్నప్పుడు వాటి మీద కోరిక కలగకుండా మనస్సును స్వాధీనంలో ఉంచుకోవాలి. 2.దమము:-అంటే ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియములను బాహ్య విషయములవైపు పోనీయక మరలించి ఆత్మ యందే లగ్నం చెయ్యడం. దీనిలో కర్మేంద్రియాలను నిగ్రహించడం ముఖ్యమైనది. లేడి సంగీతానికి లొంగిపోయి వేటగాడు భార్య సంగీతం వినిపిస్తుండగా లేడి అక్కడకు రాగానే వేటగాడు దానిని బంధించి చంపేస్తాడు. ఏనుగు స్పర్శ జ్ఞానం తో కామ సంపర్కం చాలా ఎక్కువగా ఉండటం వలన వేటగాడు ఆడ ఏనుగును చెట్టుకి కట్టి, దాని ముందు పెద్ద గొయ్యి తవ్వి పైన ఆకులు గడ్డితో కప్పివేస్తాడు. ఏనుగు అది గమనించక ఆడ ఏనుగు దగ్గరకు వస్తూనే గోతిలో పడిపోతుంది. తరువాత దానిని లొంగదీసుకొని దాని దంతాలు అమ్ముకుంటాడు. దీపం పురుగు దీపకాంతికి దీపం దగ్గర వచ్చి దాని చుట్టూ తిరువుతూ ప్రాణం పోగొట్టుకుంటుంది. చేపకు జిహ్వ చపల్యం ఎక్కువ కనుక రసేంద్రీయానికి లొంగి వేటగాడి గాలానికి వేసిన ఎర వలన గాలానికి చిక్కి చనిపోతుంది. తుమ్మెద మకరందం కోసం పద్మం పై వాలి మకరందాన్ని గ్రోలుతుంది. చీకటి పడటంతో పువ్వు ముడుచుకుపోయి తుమ్మెద దానిలో చిక్కుకుంటుంది. జీవుడైతే పంచేంద్రియాలకు లొంగిపోతాడు కనుకనే ఇంద్రియాలను కట్టడి చెయ్యాలి. 3..ఉపరవం;- విషయములు యందు దోష దృష్టిని విచారణ చేసి వాటిని తిరస్కరించడం. మరల ఇంద్రియాలు వాటి స్వభావం ప్రకారం బయట విషయాల జోలికి పోనీయకుండా నిలపడాన్ని ఉపరతి అంటారు. 4..తితిక్ష;- అంటే ఓర్పు. శీతోష్ణాదులు, సుఖదుఃఖాలు, మానావమానాలు, లాభనష్టాలు మొదలైనవి వస్తుంటాయి పోతుంటాయి. అవి స్థిరంగా ఉండవు. అందుచేత వీటిని సహనంతో ఓర్చుకోవడం అలవాటు చేసుకోవాలి. శ్రీ కృష్ణుడు పాండవుల దగ్గర కొన్నాళ్ళు ఉండి తిరిగి వెళ్లిపోతున్నప్పుడు ధర్మరాజు, కృష్ణా! నీ దగ్గర నుంచి మంచి ఉపదేశం తీసుకోవాలని ఉంది. నాకు శ్రేయస్సు కలిగించే మాట చెప్పమని అడిగాడు. శ్రీకృష్ణుడు ఒక కాగితం మీద వ్రాసి నీకు ఎప్పుడైనా కష్టం కలిగినప్పుడు ఇది తెరిచి చదువు. అంత వరకు తెరవొద్దు అన్నాడట. పాండవులు అరణ్యవాసంలో భీముడు, ద్రౌపది అన్న మాటలకు బాధ పడి కష్టం కలిగి, కృష్ణుడు ఇచ్చిన కాగితం విప్పి చదివాడు. ఇది ఇలానే ఉండదు అని అర్ధం వాచ్చే మాట వ్రాశాడు. అది చదివి మళ్ళీ మనకి మంచిరోజులు వస్తాయి. ఈకష్టాలు ఇలాగే ఉండవు అని అనుకున్నాడు. 5..శ్రద్ధ:- శాస్త్రముల యందు గురువాక్యాలయందు విశ్వాసం కలిగి ఉండటాన్ని శ్రద్ధ అంటారు. భగవంతుని మీద, గురువు మీద విశ్వాసం లేకపోతే గురుబోధ స్వీకరించలేరు. భగవంతుని యదార్ధ స్వరూపం తెలియదు. నీవెవరో తెలియకపోతే మోక్షం రాదు. 6..సమాధానం:- తన బుద్ధిని అన్ని విధాలా బ్రహ్మయందే ఎప్పుడు స్థిరపరుచుకొని ఉండటాన్ని సమాధానం అంటారు. మరికొందరు శాస్త్రమందు చెప్పబడిన విషయాలు, గురువుచే ఉపదేశింపబడిన వాక్యాలు రెండూ ఒక్కటే అని శృతిలో చెప్పబడింది. అనుభవములచేత ఆత్మనిశ్చయం పొంది సంశయాలను నివృత్తి గావించు కోవడమే సమాధానం. 4..ముముక్షుత్వం;-సంసారబంధ నివృత్తి ఎప్పుడు ఏ విధంగా కలుగుతుందో అని ఆలోచిస్తూ మోక్షమందు ఆపేక్ష కలిగి ఉండటాన్ని ముముక్షుత్వం అంటారు. మోక్షం సాధించాలనే కోరిక లేకపోతే పై సాధనాలు వ్యర్ధమే. ఎవరైతే శాశ్వత ఆనందం పొందడమే ఏకైక కోరికతో మోక్షం కోసం తపన చెందుచూ మోక్ష మార్గం అన్వేషిస్తారో వారికి మాత్రమే మోక్షం వస్తుంది. ఈవిధంగా మనోనిగ్రహం ఉన్నవాడు ఇంద్రియాలను మనస్సులో లీనం చేసుకోవాలి. మనస్సును బుద్ధిలోను, బుద్ధిని మహత్తత్వంలోను విలీనం చేసి దాన్ని ప్రశాంతమైన ఆత్మలో విలీనం చేసుకోవాలనేదే సాధన అని కఠోపనిషత్తు చెబుతుంది. ఇలా సాధన చతుష్టయం పొందినవారు ఆత్మను తన ఆత్మలోనే చూస్తాడు. మోక్షం మీద తీవ్రమైన కోరిక ఉంటేనే బ్రహ్మజ్ఞానం కోసం ప్రయత్నించి సద్గురువును సేవించి సఫలమౌతాడు. ఈసూత్రంలో అతః అనే పదం చదివాము.
బ్రహ్మజిజ్ఞాసా:-బ్రహ్మాన్నిగురించి తెలుసుకోవాలి. బ్రహ్మవిద్య తెలుసుకోవడానికి 3 కారణాలున్నాయి. 1.తాపత్రయాల విముక్తి, 2,దుఃఖ నివృత్తి. 3 మోక్ష సాధన.
1.తాపత్రయ విముక్తి:-1.ఆది దైవిక తాపాలు 2. ఆది భౌతిక తాపాలు 3. ఆధ్యాత్మిక తాపాలు. 1.ఆది దైవిక తాపాలు అంటే దైవం చేత కల్పించబడిన కష్టాలు.ఆద్యాత్మిక ప్రవచనాలు వినడానికి బయలుదేరే ముందు తుఫానులు, సునామీలు లేదా హఠాత్తుగా వర్షం పడటం వలన రకరకాల ఆటంకాలు అనుకోని ప్రళయాలు వస్తుంటాయి. గురువు సముఖంలో కూర్చుని జ్ఞానం పొందడానికి మొట్టమొదట దైవం చేత కల్పించబడిన ఆటంకాలు తొలగిపోవాలి. 2.ఆధిభౌతిక తాపాలు:- మన చుట్టూ ఉన్న భూతాలు పశుపక్ష్యాదులు క్రిమికీటకాలు, జంతువులు, మనుషుల వలన ఆటంకాలు ఏర్పడుతుంటాయి. అనుకోకుండా బంధువులో స్నేహితులో వస్తే, వెళ్లలేని పరిస్థితి. హఠాత్తుగా తేనెటీగ కుడుతుంది. చాలా అసహనంగా ఉండి వెళ్లలేకపోతారు. చుట్టూ ఉన్న భూతాల వలన కలిగే ఆటంకాలు తొలగిపోవాలి. 3.ఆధ్యాత్మిక తాపం:- మన లోపల నుండి వచ్చే తాపం. ఈ రోజు మనసు ఏమి బాగాలేదు. రేపు విందాం అనిపిస్తుంది. ఈ రోజు నిద్ర బాగా వస్తోంది అని అంతరంగంలో నుండి వచ్చిన ఆటంకాలు ఏదైనా కార్యక్రమం ముగిసిన తరువాత ఓం శాంతి శాంతి శాంతిః. 1.ఆదిదైవిక శాంతి కోసం 2.ఆది భౌతిక, 3.ఆధ్యాత్మిక శాంతి కోసం చెపుతాం. 1.దుఃఖ నివృత్తి కోసం బ్రహ్మవిచారణ చెయ్యాలి. జీవితంలో దుఃఖాలు వస్తుంటాయి. ఏదైనా కోరిక వస్తే అది తీరకపోతే దుఃఖం వస్తుంది. మనచేతిలోని విలువైన వస్తువు పోతే దుఃఖం, నష్టం వచ్చినా ఇబ్బందే. ఆశించింది జరగకపొయినా చెడు జరిగినా దుఃఖం వస్తుంది. బ్రహ్మవిచారణ సక్రమంగా సాగాలంటే దుఃఖ నివృత్తి జరగాలి.
3.మోక్ష సాధన:-బ్రహ్మ జిజ్ఞాస సాధించాలంటే దుఃఖాలు పోవాలంటే వేరే మార్గాలు ఉన్నాయి కదా. బ్రహ్మవిద్యే అవసరమా? అవి తాత్కాలికమైన సుఖాలే. రోగం వస్తే డాక్టర్ దగ్గరకు పోతుంటే దుఃఖం పోతుంది .రోగం మళ్ళీ రాదన్న గ్యారంటీలేదు. పేదరికం పోవాలంటే ధన సంపాదన ముఖ్యం. సంపాదించినప్పుడు ఆనందం, ఆ ఉద్యోగం పోతే దుఃఖం. ఇల్లు కట్టుకుంటే అప్పులు తీర్చలేక దుఃఖం. ఆనందం వెనుక ఎప్పుడు దుఃఖం నీడలా ఉంటుంది. ఈ దుఃఖాలన్ని శాశ్వతంగా పోవాలంటే జన్మరాహిత్యం జరిగి మోక్షం రావాలి.
బ్రహ్మైక్య జ్ఞానం:- నేను బ్రహ్మం ఒక్కటే అహం బ్రహ్మాస్మి అనే భావన రావాలి. ఉపనిషత్తుల విచారణ చేస్తే బ్రహ్మ జిజ్ఞాస వలననే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. శాశ్వతానందమైన మోక్షం కలగడమే బ్రహ్మప్రాప్తి. అద్వైతంలో బ్రహ్మం ఎవరు? అందుకునేది ఎవరు? అనే ప్రశ్నకు సమాధానంగా ఆ ఇద్దరు ఒక్కరేనని చెబుతుంది. బ్రహ్మం తనకి తాను మరచిపోయి విడిపోయి లౌకిక వ్యవహారాలలో మునిగిపోయి, తన స్థితి తాను తెలుసుకొని, బ్రహ్మంగా మరిపోతాడు. బ్రహ్మం బ్రహ్మన్ని తెలుసుకునేవాడు ఒక్కరే. జ్ఞానసాధనతో జనన మరణ చక్రం నుండి తప్పించుకొనేందుకు బ్రహ్మవిచారణ చేసి బ్రహ్మ జిజ్ఞానసతో మోక్షాన్ని అందుకొని బ్రహ్మమే తాను అని గ్రహించాలి. బ్రహ్మం ప్రసిద్ధమా? అంటే తెలిసిందా? లేదా అప్రసిద్దమా? అంటే తెలియనిదా? బ్రహ్మ నీకు తెలిసినదా?తెలియనిదా అని ప్రశ్నిస్తే బ్రహ్మం ప్రసిద్ధమే అనుకోండి. తెలిస్తే విచారణ ఎందుకు? అని అడుగుతారు. తెలియదు అన్నామనుకోండి?తెలియక పోతే విచారణ చేసి ప్రయోజనం ఏముంది? అంటారు. బుద్ధితో విచారణ చెయ్యాలి. బ్రహ్మం అనేది బుద్ధి క్షేత్రానికి అందేది కాదు. సాధన చేద్దామన్నా ప్రయోజనం ఏముంది? దానికి సమాధానం బ్రహ్మ ప్రసిద్ధమే. బ్రహ్మకి సంబంధించిన సామాన్యజ్ఞానం ప్రసిద్ధం. శాస్త్రాలలో పరమాత్మ లక్షణాలు తెలియజేస్తారు కనుక వాటిని తెలుసుకోవడమే శాస్త్ర జ్ఞానం అంటారు.
2. బ్రహ్మాన్ని తెలుసుకోవాలనే కోరిక సమంజసమే అయినా దానికి అనుభవ జ్ఞానం ఉండాలి అనడంలో వివాదాలు, అభిప్రాయ బేధాలు ఉన్నాయి. చైతన్యంతో ఉన్న దేహమే బ్రహ్మం అని పామరులు, చార్వాకులు, నాస్తికులు అంటారు. మరికొందరు ఇంద్రియాలు బ్రహ్మం అనీ, ఇంద్రియాలను ప్రేరేపించి వాటి చేత పనులు చేయిస్తున్న మనస్సు ఆత్మ అనీ, కొంతమంది మనస్సును నిగ్రహించే బుద్ధినే ఆత్మ అనీ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. బౌద్ధులలో హీనయానం శూన్య వాదులు శూన్యం తప్ప ఏమీ లేద అదే బ్రహ్మం అన్నారు. కొందరు దేహేంద్రియాలకు వేరుగా ఉన్న కర్త, భోక్త అయినటు వంటివాడే ఆత్మ అన్నారు. మరికొందరు దేహేంద్రియాలకు వేరుగా ఉండే అహంకారము బ్రహ్మం అని విశ్లేషించారు. సాంఖ్యులు దేహాదుల కన్నా వేరైనటువంటి ఆత్మ కేవలం భోక్తే కానీ కర్త కాదు అన్నారు. మరికొందరు భోక్త కన్నా వేరుగా ఉన్న సర్వజ్ఞుడు సర్వశక్తి మంతుడు అయినటువంటి ఈశ్వరుడు ఉన్నాడు. ఆయనే బ్రహ్మ అని యోగులు తెలియజేసారు. కొంతమంది అవిద్య ఉపాధులతో కూడి ఉన్నటువటువంటి జీవాత్మని జీవుణ్ణి ఈశ్వరుడితో సమం అన్నారు. జీవేశ్వరులకు భేదం లేదు. ఎంతకాలం జీవేశ్వరుల భేదబుద్ధి మనలో ఉంటుందో అంత కాలం ఈ సంసారతాపత్రయం వదలదు.ఈ వేదంతాన్ని ఆశ్రయించిన సిద్ధాంతాలు జీవుడు ఈశ్వరుడు ఒక్కరే అన్నారు. ఒక సామాన్యుడు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం మొదలు పుట్టినవాడు ఒక మార్గాన్ని నిశ్చయించుకొని, మార్గాన్ని చూపించే గురువు లేనటువంటివాడు, ఏవో శాస్త్రాలు తిరగేసినవాడు, ఇన్నిరకాల భావాలు కలిగి ఉంటే ఏమి చెయ్యాలి? ఇది తప్పు ఇది ఒప్పు ఇది ఎందుకు తప్పు అని విశ్లేషణ చేసే శక్తి ఉండదు. ఎవరికి నచ్చిన సిద్ధాంతం వారు పాటిస్తారు అనే నిర్ణయానికి వస్తారు. ఒక దాన్ని అనుసరించిన కొంతకాలానికి మరొక సిద్ధాంతాన్ని అనుసరిస్తారు. ఎప్పటికి సరిఅయిన మార్గం దొరకదు. ఇన్ని రకాల అభిప్రాయ భేదాలు ఉన్నాయి కనుక ఆది శంకరులు అద్వైతసిద్ధాంతంలో ప్రతిపాదించి బ్రహ్మజిజ్ఞాస చేసి విచారణ చేసినట్లయితే ఆబ్రహ్మజిజ్ఞాసే మనలను సరి అయిన స్థానంలో నిలుపుతుందని ఒక మార్గాన్ని సూచించారు. సంసార సాగరంలో ఉండే దుఃఖలన్నింటిని దుఃఖ నివృత్తి చేసి శాశ్వత ఆనందప్రాప్తి లభించడం కోసం, పరమాత్మను గురించి తెలుసుకోవడం కోసం, బ్రహ్మజిజ్ఞాస చెయ్యమని బ్రహ్మ సూత్రాలు మనకు అందించారు. బ్రహ్మసాక్షాత్కారం కలగగానే హృదయగ్రంథులు విడివడతాయి. సంశయాలు నశిస్తాయి. కర్మలు క్షయమౌతాయి. కనుక బ్రహ్మజ్ఞానానికి మోక్షం ప్రయోజనం. దానికి బ్రహ్మ జిజ్ఞాస కావాలి.
సూత్రం .2
" జన్మాదస్య యతః "
జన్మ - ఉత్పత్తి , ఆది - స్థితి ప్రళయాలు, అస్య - ప్రత్యక్షాది ప్రమాణాలతో తెలిసే ఈ జగత్తు. యతః - ఎవరి వల్ల కలుగుతున్నాయో ఆ తత్త్వమే బ్రహ్మ - పరబ్రహ్మము.
భావం :- ఎవరి వలన ఈ భూతజాలం ఉత్పన్నం అవుతున్నాయో, ఎవరి వల్ల అవి జీవిస్తున్నాయో, చివరకి ఎందులో ప్రవేసిస్తున్నాయో అదే బ్రహ్మమని తెలుసుకో.
వివరణ :- ప్రత్యక్షంగా కనిపిస్తున్న ఈ జగత్తు సృష్టికి ఎవరు కారణమౌతున్నారో ఎవరి వలన సృష్టిలోని జీవరాసులన్ని జీవిస్తున్నాయో చివరకు ఇందులో లయమవుతున్నాయో అదే బ్రహ్మము. ప్రపంచంలో అనేక అనుభవాలు పొందుతూ అవి సత్యమేనని భావిస్తున్నాము. మన యొక్క యదార్ధ స్థితి ఆత్మ స్థితికి, బ్రహ్మ స్థితికి రాలేకపోతున్నాము. జగత్తును స్వప్నంతో పోల్చి స్వప్నం చూస్తున్నంత సేపు సత్యం, మెలకువ రాగానే అసత్యం అని గ్రహించి, ఆత్మదర్శనం చేసుకోవాలంటే జగత్తు పుట్టుక, అస్తిత్వం, అంతం ఎలా జరుగుతోందో విశ్లేషణ చెయ్యాలి. జగత్తుని చూస్తూ పరమాత్మ అని భావిస్తే కుండను చూసి మట్టి అని భావించాలి. మట్టికి నామరూపాలు తగిలిస్తే అది కుండ అని పిలవబడుతుంది. కుండ లన్నింటి నామరూపాలు తీసేసి పగలుగొడితే అంతా మట్టే గోచరిస్తుంది. కార్యరూపమైన కుండ ఉన్నదంటే, దానికి కారణ రూపమైన మట్టి ఉన్నట్లే. కార్యరూపమైన నగ ఉన్నదంటే దానికి కారణరూపమైన బంగారం ఉంటుంది. కార్యరూపమైన జగత్తుకు దానిని సృస్థించిన పరమాత్మే కారణరూపమౌతున్నాడు. తైత్తరీయోపనిషత్తులో వరుణుడు తన పుత్రుడైన భృగువుకి జగత్తుయొక్క పుట్టుక, నివశించుట, నశించి పోవుట అంటే సృష్టి, స్థితి, లయ గురించి చెబుతూ, అన్ని పరమాత్మ చేతనే నిర్వహింపబడుతున్నాయి. దేనియందు ఈసమస్త భూతాలు పుడుతున్నాయో దేనియందు ఇవన్నీ జీవిస్తున్నాయో చివరగా దేనియందు లయమౌతున్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నించు. అదియే బ్రహ్మము అని చెప్పాడు. ఏదైనా సృష్టి జరగాలంటే మూడు కారణాలు చెప్పబడ్డాయి. నిమిత్తకారణం, ఉపాదానకారణం, ఉభయకారణం. బ్రహ్మ చేతనాపదార్ధం కనుక నిమిత్తకారణం అవుతాడు. జగత్తు దేనితో తయారు చేయబడింది? అది ఉపాదానకారణం. అలా తయారు చేయడానికి పరమాత్మ కన్నా వేరే ఏదైనా ఉంటే పరమాత్మ పరిమితమైపోతాడు. నశించిపోతాడు. అందుకని వేరే పదార్ధం ఉండకూడదు. మరి ముడి సరుకు ఇది? పరమాత్మ నిమిత్త కారణం అనడంలో సందేహం లేదు. ఏమి లేకపోతే శూన్యం అని అర్ధం. శూన్యం నుంచి ఏమి రాదుగా? ఒకవేళ పుట్టించినట్లుగా చూపిస్తే హస్తలాఘవంతో మాయ చేసి వస్తువులు చేస్తారు. మహాత్ములు యోగులు, విభూతి గొప్పవాళ్లకు గొలుసులు ఇస్తుంటారు. విభూతి పడాలంటే ఒక మాత్ర వేళ్ళ మద్యలో పెట్టుకొని దానిని నలిపి విభూతిలా చేస్తారు. వస్తువులు చేతి మడతలోనో ఎక్కడో పెట్టుకొని అటు ఇటు త్రిప్పి వారి చేతిలో వేస్తారు. మేజిక్ శూన్యం నుంచి రాదు. కనికట్టు ద్వారా రప్పించి మనకు ఉన్నట్లుగానే గోచరింపజేస్తారు. జగత్తుని కనికట్టు చేశారు. సృష్టికి ముందు బ్రహ్మమే ఉన్నాడు అన్యమైనవి లేవు. ఇక్కడ బ్రహ్మమే ఉపాదాన కారణం నిమిత్తకారణం కూడా. రెండూ ఆయనే. బంగారం ఇస్తే మనం కోరిన విధంగా వస్తువులు చేస్తాడు. ఇవ్వకుండా చెయ్యడు కదా! ఉపనిషత్తులలో చెప్పబడిన విధంగా సాలెపురుగు తన గూటిని దాని నోటిలోని జిగురు పదార్ధంతోనే దారంలా గుండ్రంగా గూడు అల్లుతుంది. సాలెపురుగు నిమిత్త కారణం. స్వప్నం ఉపాదాన కారణం మనస్సు నిమిత్త కారణం. మనస్సే స్వప్నాన్ని సృష్టిస్తుంది. స్వప్నానికి మనస్సు ఎలాంటిదో జగత్తుకు పరమాత్మ ఉభయకారణమై జగత్తుకు సృష్టి స్థితి లయ అన్నియు పరమాత్మే నిర్వహిస్తున్నాడు. ఆయన మనస్సులో పుట్టినది మనస్సులో జీవించినది, మనస్సులోనే లయమైయినది జగత్తు. నీటి బుడగలు కూడా ఉపమానంగా చెప్పుకోవచ్చును. సముద్రం దగ్గర చిన్న పెద్ద నీటిబుడగలు అనేకం ఏర్పడు తుంటాయి. నీటిబుడగలు నీటిలోనే పుడతాయి. దానిలోని చితికిపోయి కలసిపోతాయి. నీరు నీటిబుడగని తయారు చేయడం ఉభయకారణం. పరమాత్మ దృష్టిలో జగత్తులో అన్ని నీటిబుడగలే. క్షణభంగురాలే. సృష్టి స్థితి లయ ఏవిధమైన మార్పు లేకుండా ఆధారమైనది ఒకటుంది. అదే సర్వ వ్యాపకమైన పరమాత్మ. బ్రహ్మము సర్వాధారం, సర్వనియామకం, జగజ్జన్మాదులకు నిమిత్త కారణం సర్వ శక్తిమంతం.
సూత్రం..3
" శాస్త్ర యోనిత్వాత్ "
శాస్త్ర యోనిత్వాత్ అంటే వేదానికి కారణం.
భావం:- బ్రహ్మ వేదానికి కారణం. సర్వజ్ఞమ్ సర్వ శక్తిమంతం. శాస్త్రం అంటే వేదం. అది ఈ లోకంలోని మానవాళి హితాన్ని చేకూర్చడానికి అహితాన్ని వర్జించడానికి కావలసిన సాధనాలని శాసిస్తుంది. సర్వ ఉపాయాలకు అన్ని విద్యలకు వేదమే నిలయం.
వివరణ :- హిందుధర్మంలో అత్యంత మౌలికమైన ప్రమాణంగా వేదాలను గుర్తిస్తారు. వేదములను శృతులు అనీ అమ్నాయములు అనీ అంటారు. విద్ అనే ధాతువుకు తెలియుట అన్న అర్ధాన్ని బట్టి వేదములు భగవంతుని ద్వారా తెలుపబడినవి అనీ, అవి ఏమానవుని చేత రచించబడలేదనీ విశ్వాసం. కనుకనే వేదములను అపౌరుషేయములు అని కూడా అంటారు. వేదములను తెలుసుకున్న ఋషులను ద్రష్టలు అంటారు. ద్రష్ట అంటే దర్శించినవాడు అని అర్ధం. హిందు శాస్త్రం ప్రకారం వేదాలను ఋషులు భగవంతుని నుండి విని గానం చేశారు. అందుకే వాటిని శృతులు అన్నారు. కావలసిన వాటిని తీర్చి, అక్కరలేని వాటిని రాకుండా చేసే ఆధ్యాత్మిక ఉపాయమే వేదం. వేదానికి మత భేదాలు పక్షపాతం ఉండవు. వేదం మహత్తరమైన శాస్త్రం అయితే సృష్టికర్త బ్రహ్మ అంతకు మించిన జ్ఞానం కలవాడు. శాస్త్రాలను నిర్మించే మహనీయులకు అందులో ఉండే విషయపరిజ్ఞానం కన్నా ఎక్కువ జ్ఞానం ఉంటుంది. అల్పజ్ఞానం ఉన్నవాడు అధిక విజ్ఞాన గ్రంధాలు వ్రాయలేడు. అందుకే బ్రహ్మ సర్వశక్తిమంతుడు. వేదాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి? వేదాలు అత్యంత మౌలికమైన ప్రామాణిక గ్రంధాలు. దాదాపు అన్ని తత్త్వములవారు శాక్తేయము, వైష్ణవము, శైవము, అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం వారు తమదే వేదాలను అనుగుణంగా ఉన్న మార్గమని సమర్ధించుకునేవారు. వేదాల యొక్క ప్రభావం మతాలకు మాత్రమే పరిమితం కాలేదు. పాలనా పద్ధతులు, ఆయుర్వేదం, ఖగోళం, దైనందిన ఆచారములు ఇలా ఎన్నో నిత్య జీవన కార్యాలు వేదాలతో ముడిపడి ఉన్నాయి . బౌద్ధమతం మాత్రం వేదాలను త్రోసిపుచ్చింది. ఈ వేదములను అర్ధం చేసుకోవాలంటే మన ఋషులు వాటికి ఎన్నో వివరణ గ్రంధాలు ఇచ్చారు. వాటినే వేదాంగములు అన్నారు. అవి 1.శిక్ష, 2.వ్యాకరణము, 3.ఛందస్సు, 4.నిరుక్తము, 5.జ్యోతిషము, 6.కల్పం. వేదంలోని ఋక్కులు, యజస్సులు, సామలు, అన్నీ కలసి ఒకేఒక వేద రాశిగా ఉండేది. ఎవరైనా వేదం నేర్చుకునేవారు చెయ్యాలంటే మొత్తం వేదరాశిని అధ్యయనం చెయ్యవలసి వచ్చేది. కృతయుగం నుండి ద్వాపరయుగం వరకు వేదవిద్యార్ధులు వేదం అధ్యయనం చెయ్యడం బహుకష్టమని ఎక్కువమంది ఉత్సాహం చూపేవారు కాదు. మొదట కలగలుపుగా ఉన్న వేదరాశిని వ్యాసమహర్షి ఒక క్రమపద్ధతిలో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదంగా విభజించారు. దేవతా స్తోత్రాలు,చరిత్రలు శ్లోకములుగా ఉన్నభాగాన్ని విడదీసి ఋగ్వేదంగా పేరు పెట్టారు. యజ్ఞాలు, యాగములు, అవి చేసే విధానాలు, వాటి వివరాలు, క్రతువులకు సంబంధించిన వివరాలు యజుర్వేదం లో పేర్కొన్నారు. వేదంలో సౌమ్యంగా పాడుకోతగ్గవిగా ఉన్న భాగములను సామవేదమని అన్నారు. ఇవి కాకుండా మిగిలిన భాగములు అధర్వణవేదంలో చేర్చారు. అందుకే వ్యాసభగవానుడు వేదవ్యాసుడు అయ్యాడు. వేదాలను ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదంగా విభజించి తన శిష్యులైన శైలుడు, వైసంపాయనుడు , జైమిని, సుమంతుడు అనే వారికి ఉపదేశించాడు. వారు తమ శిష్యులకు ఉపదేశించారు. అలా గురుశిష్యపరంపరగా ఈ నాలుగు వేదాలు వేల సం.గా సంక్రమిస్తూ వచ్చాయి. వేదాలను ఉచ్చరించడంలో స్వరానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. అన్ని వేదాలు కలిపి 1180 అధ్యాయలు, లక్ష పైగా శ్లోకాలు ఉండాలని అంటారు. కానీ మనకు లభించినవి 20,023 మాత్రమే. ఈ సంఖ్య 20,379 అని కూడా అంటారు.
సూత్రం ..4
తత్తు సమన్వయాత్ ( 1 ,1 ,4 )
తత్ :-ఆ శాస్త్ర కారణత్వం , తు:- కూడా సమన్వయాత్:-నిష్పన్నం అవుతుంది.
భావం:-శాస్త్ర కారణత్వం కూడా బ్రహ్మమే ,అది బ్రహ్మ విషయంలో నిష్పన్నం అవుతుంది. బ్రహ్మమే నిమిత్తం అని సూత్రానికి అర్ధం. సమన్వయం వల్ల తెలియదగినది అని కూడా అర్థం.
వివరణ:- శాస్త్ర ప్రామాణకత్వం సమన్వయం వల్ల మాత్రమే తెలుసుకోవలసినది. సమన్వయం అంటే వేదాంత వాక్యాలను పరస్పర విరోధంలేకుండా ఏకాభిప్రాయం సాధించడం. వేదాంతవాక్యాలు అన్ని ఒకచోట లేకుండా విడివిడిగా అనేక ప్రకరణములలో ఉన్నాయి. అవి కర్తను గురించి చెప్పినవి కాదు. కేవలం బ్రహ్మం గురించి చెప్పబడినవి. అన్ని వేదాంత వాక్యాలు ఒకే అర్థంలో బ్రహ్మకు సంబంధించిన జ్ఞానాన్ని కలిగజేస్తాయి. కనుక మహవాక్యాలు కర్మాంగాలు కాదు. వాటి ముఖ్య ఉద్దేశ్యం బ్రహ్మమే."సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ" ఈ వాక్యంలో సత్యం, జ్ఞానం, అనంతం అనే పదాలు బ్రహ్మ గురించి చెప్పినవి. అంతే కాకుండా ఉపక్రమ ఉప సంహారాది షడ్ విధ లింగాలు అంటే ఏదైనా ఒక విషయం యొక్క తాత్పర్యాన్ని నిర్ణయించే సాధనాలు:-6. 1.ఉపక్రమము, ఉపసంహారం :-ప్రారంభం 2.అభ్యాసం :-మళ్ళీ మళ్ళీ చెప్పడం 3.అపూర్వత :- లోగడ చెప్పినది కాకుండా కొత్త విషయం చెప్పడం 4.ఫలము :- ప్రయోజనము 5.అర్ధవాదము :- అర్ధాన్ని విచారించడం 6.ఉపపత్తి :- యుక్తి.
మహా వాక్యాల అర్ధం పరబ్రహ్మ. ప్రతిచోటా ఉపనిషత్తుల ప్రారంభంలోను, అంతంలోను కూడా బ్రహ్మను గురించి చెప్పబడింది. ఛందోగ్యోపనిషత్తులో ఉద్ధాలకుడు తన కుమారుడైన శ్వేతకేతువునకు బ్రహ్మోపదేశం చేస్తూ ఈ సృష్టి పూర్వం జగత్తు అంతా సత్తుగానే ఉండేది అని ప్రారంభించి ఇదంతా ఆత్మస్వరూపమే అని పూర్తి చేశాడు. తత్త్వమసి :- ఆ పరమాత్మయే నీవు అనే పదాన్ని అనేక మార్లు చెప్పాడు. అదే "అభ్యాసం". .ఉప్పు నీటిలో కలిసిన అది నీకు కనిపించదు. అలాగే బ్రహ్మ కూడా సర్వత్రా వ్యాపించినా నీకు కనిపించడు అంటాడు. అది "అపూర్వత". "బ్రహ్మ విద్ బ్రహ్మైవ భవతి":- అనే వాక్యం వలన బ్రహ్మను తెలుసుకున్నవాడు బ్రహ్మమే అని చెప్పబడినది. ఇది "ఫలము". ఎవడైతే బ్రహ్మలో అనేక రూపాలు చూస్తాడో అంటే బ్రహ్మ ఒకరు కాదు అనేకులున్నారు అని అనుకుంటాడో అతను గానుగకు కట్టిన ఎద్దులాగా సంసారమనే బండి చక్రంలో పడి తిరుగుతుంటాడు అని కఠోపనిషత్తు చెప్పింది. ఇది "అర్ధవాదము." కుమ్మరి మట్టితో అనేక రకాలపాత్రలు తయారుచేస్తారు.వాటి రూపాలు వేరైనా వాటిని తయారు చేయడానికి ఉపయోగించిన మట్టి ఒక్కటే. ఇది ఉపనిషత్తులలో ప్రతిపాదించింది. ఇది "ఉపపత్తి." 'పూర్వం చతుర్వేదాధ్యయనం చేసిన సంపన్నులైన గురువు లందరికి బ్రహ్మ గురువు, వేదశాస్త్ర నిర్మాత, కాలవిభజనకు లొంగని వాడు అని అన్నాడు పతంజలి. బ్రహ్మ కాలస్వరూపుడు. పుట్టిన ప్రతి జీవి కాలం తీరగానే కాలధర్మం ప్రకారం మృత్యువు బారిన పడక తప్పదు. సృష్టి, లయం రెండు కాల స్వరూపాలే. ఆ రెండు కలిపితే కాలం అనవచ్చును. భూతకాలంలో అంటే జరిగిపోయిన కాలంలో పుట్టిన వాళ్ళు రాబోయే కాలంలో మరణిస్తారు. ఆ పుట్టిన సమయం మరణించే సమయం మధ్యనున్న కాలమే వర్తమానం. బ్రహ్మ అశరీరుడు కనుక ఆయనకు కాలవిభజన వర్తించదు. హితాహితాలను గుర్తించి యోగ్యమైన జ్ఞానాన్ని ప్రసాదించే శబ్దజాలాల సృష్టి కర్త బ్రహ్మ. మానవులకు జ్ఞానోదయం కలిగించడానికి వేదరాశిని సృష్టించి, వేదములలోను, శాస్త్రములలోను విధిగా పాటించవలసిన నియమము లను, వాటిని పాటించక పోతే వచ్చే కష్టనష్టాలను నిష్కర్షగా తెలియజేసిన బ్రహ్మకన్నా అధికుడు లేడు. వేదములలోను శాస్త్రములలోను చెప్పబడిన విషయములను కాదని ఎవరైతే తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారో వారికి సుఖం లభించదు. ఉత్తమగతులు కలగవు. వేదములు శాస్త్రములు మనకు కొన్ని విధి నిషేధాలు ఏర్పరచాయి. చేయకూడని విధులు చెప్పాయి. చేయవలసిన విధులు చెయ్యకుండా చేయకూడని విధులు చేస్తే మోక్షం ఎప్పటికి రాదు. అశాస్త్రీయంగా యాగాలు, పూజలు చేస్తే ఫలితం కలగకపోగా పాపం చుట్టుకుంటుంది. బంగారు ఆభరణాలు వ్యావహారిక సత్యం అయితే ఆభరణాలలో ఉన్న బంగారం పారమర్ధిక సత్యం. అలాగే పరమాత్మ పారమర్ధిక సత్యం, సృష్టి స్థితి లయ నిర్వహించడం వ్యావహారిక సత్యం. అందరూ పరమాత్మ స్వరూపాలే అని తెలుసుకోవడమే జ్ఞానం. ఇలా అర్ధం చేసుకుంటే పరమాత్మ కాలస్వరూపుడు అని అర్ధం అవుతుంది.
ఈక్షత్యధికరణం
సూత్రం..6
" ఈక్షతేర్నా శబ్దమ్"
-జగత్తుకు కారణం చేతనమా? అచేతనమా? ఈక్షతేః ..సంకల్పం వలన బ్రహ్మం జగజ్జన్మాదులకు కారణం అయినదనీ,
అశబ్దం:-వేదం, శాస్త్రాలు చెప్పలేదు కదా అని అనడం, న:- సరియైనది కాదు.
భావం :- శబ్దం అంటే ఋగ్వేదాది శాస్త్రాలు, ఈక్షణం అంటే సంకల్పం, బ్రహ్మసంకల్పం వలన సృష్టి జరిగిందని ఎక్కడా చెప్పలేదు కదా! అని అనడం సరియైనది కాదు. బ్రహ్మ ఈక్షణ పూర్వకంగా తేజోమయమైన అగ్నిని, జగత్తును సృష్టించాడు. ఆయన జగజన్మాదులకు నిమిత్తం. ఈక్షణపూర్వకమైన సృష్టికి కర్త అయిన బ్రహ్మం అని ఛందోగ్యం వర్ణించింది. ఇది శబ్ద ప్రతిపాదితమే అవుతుంది.
వివరణ :- జగత్తుకు కారణం చేతనమా! అచేతనమా? జగత్తుకు కారణం బ్రహ్మసంకల్పమేననే విషయం వేదాలలో, శాస్త్రాలలో చెప్పలేదు కదా! అని అనడం సమంజసం కాదు. సాంఖ్యులు చెప్పేటటువంటి జడమైన ప్రకృతి ఈక్షణమనే పనికి కర్తగా చెప్పలేదు.అంటే బ్రహ్మ సంకల్పం లేదని వారి అభిప్రాయం.
ఛందోగ్యోపనిషత్తు:- ఉద్దాలక అరణి తన కుమారుడు శ్వేతకేతువుకి ఆత్మజ్ఞానం వివరిస్తూ ఈ జగత్తు అంతా సృష్టికి పూర్వం నామారుపాలతో కూడి లేదు. అద్వితీయంగా ఉండేది. కేవలం సత్తు మాత్రమే ఉండేది. ఆ రకంగా ఉన్న పరమాత్మ తాను అనేకం కావాలి అని సంకల్పించి, లోకాలను సృష్టించి, అనేక రూపాలు పొందాలనుకున్నాడు అని చెప్పాడు.
ఇతరేయోపనిషత్తు:- జీవాత్మ. పరమాత్మ రెండు ఒక్కటే . మరణానంతరం జీవాత్మ పరమాత్మతో లీనం అయిపోతుంది. ఆలోచనాపూర్వకంగా ఈ లోకాలను సృష్టించింది. సృష్టి జరగడానికి ముందు జగత్తు అంతా బ్రహ్మమయంగా ఉండేది. దానికి భిన్నమైన పదార్ధం లేదు. దానినే ఆత్మ అంటారు. ఆ ఆత్మయే లోకాలను సృష్టించింది.
ప్రశ్నపనిషత్తు:-దీనిలో 1 వ ప్రశ్నలో ప్రజాపతి సృష్టి చెయ్యాలనే కోరికతో రయి, ప్రాణం అనే జంటను సృష్టించాడు అని చెప్పి 3 వ ప్రశ్నలో ఆత్మ నుంచే ప్రాణం పుట్టింది. శరీరాన్ని ఆశ్రయించి నీడ ఉన్నట్లుగా ఆత్మ పైన ప్రాణం విస్తరించి ఉంది. నీడకు స్వతంత్రమైన అస్తిత్వం లేనట్లే, ప్రాణానికి కూడా స్వతంత్రంగా అస్తిత్వం లేదు అని చెప్పబడినది.
ముండకోపనిషత్తులో అంగీరసుడు తన శిష్యుడైన శౌనకునికి బ్రహ్మతత్త్వాన్ని వివరిస్తూ, ప్రజ్వరిల్లిన అగ్ని నుండి అదే విధమైన ఆకారం, గుణము వేలకొలది నిప్పు రవ్వలు బయటకు వచ్చినట్లే, పరబ్రహ్మ నుండి అనేకమైన శరీరాలు రూపాలు వెలువడి మళ్ళీ అందులోనే లీనమైపోతున్నాయి. బ్రహ్మ స్వయంప్రకాశం కలవాడు. నిరాకారుడు, బాహ్యంతరాలలో ఉండేవాడు. పుట్టుక ,ప్రాణము, మనస్సు లేని వాడు, పరిశుద్ధుడు, మాయకు అతీతుడు, అతని నుండే ప్రాణము, మనస్సు, సమస్త ఇంద్రియములు, పంచభూతాలు, పుడుతున్నాయి. వీటన్నింటిలో ఈక్షణ అనే దానికి కర్త ఆత్మ అనే చెప్పారు. అంతే కాని ప్రకృతి కాదు. కాబట్టి చేతన ధర్మము గల బ్రహ్మమే ఈ జగత్తుకు కారణం.
సూత్రం..6:
గౌణశ్చేన్నాత్మ శబ్దాత్;
ఆత్మ శబ్దాత్ :-ఆత్మ శబ్దంతో సూచించడం వలన గౌణః చేత్ :-"ఈక్షణం" అనే పదంప్రయోగం ప్రకృతివాచకం అనిభావించడం న :-సరియైనది కాదు. గౌణము..అప్రధానం కాదు.
భావం..ఈ వేదాంత దర్శనంలో గుణం అంటే ప్రకృతి ప్రధానం అంటే బ్రహ్మం. ఈక్షితి అంటే చూపు అనే శబ్దం అప్రధానం కాదు. అనగా ప్రాముఖ్యత లేదు అని చెప్పడానికి వీలులేదు.అంటే ఇక్కడ ఆత్మ అనేది జగత్తుకు కారణము.
వివరణ...ఆత్మ చేతనమైనది. జడమైన ప్రకృతికి ఆత్మ పదం చెప్పలేదు.ఆత్మ శబ్దానికి ప్రకృతి అనే అర్థం లేదు.ఆత్మ శబ్దం బ్రహ్మానికి వర్తిస్తుంది. వేద వాజ్మయం లో చెప్పబడిన అంశాలు:-1.బ్రహ్మాన్ని ఎరిగినవాడు మృత్యువుకి భయపడడు. పుట్టిన ప్రతీ జీవికి మరణం తప్పదు.మరణించిన వానికి జన్మ తప్పదు. అనివార్యమైన ఈ విషయం గురించి ఆలోచించడం అవివేకం. ఆత్మ నాశనం లేనిది అని తెలుసుకొని జీవుడిని ఈ సంసార సాగరం నుండి పరమాత్మను చేర్చేది బ్రహ్మవిద్య అనే నావ మాత్రమే. 2. ప్రవచనాలతో బ్రహ్మం లభించదు. ప్రవచన కర్తలు మోక్ష సాధనకు తగు సూచనలు ఇవ్వగలరే కానీ బ్రహ్మవిద్య బోధించలేరు. బ్రహ్మాన్ని చేరుకునే మార్గం తెలియజేసి, మోక్షసాధన చేయడానికి ఆత్మవిద్యను బోధించే సద్గువురువుల అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. 3.బ్రహ్మానికి అగ్ని తల, సూర్యచంద్రులు నేత్రాలు, దిక్కులు చెవులు, వేదాలు వాక్కులు, వాయువు ప్రాణం, విశ్వం హృదయం, పృధివి పాదాలు. అలాంటి ఈ బ్రహ్మం అన్ని భూతాలకు అంతరాత్మ.
శ్వేతాశ్వనోపనిషత్తు:- ఒకే దేవుడు అన్ని భూతాల్లో గుప్తంగా ఉన్నాడు. ఆయన సర్వ వ్యాపి. అన్ని భూతాలకు అంతరాత్మ అన్న వాక్యాలలో బ్రహ్మాన్ని ఆత్మ శబ్దంతో వ్యవహరించారు. అంతే కాని అచేతనమైన ప్రకృతికి కాదు.
ఐతరేయోపనిషత్తు:- ప్రధమాధ్యయంలో సృష్టి ఏ విధంగా జరిగిందో వివరించబడింది. ఆత్మయే ఆలోచనాపూర్వకంగా ఈ లోకాలను సృష్టించి లోకపాలకులను, విరాట్స్వరూపుని, ఇంద్రియాలను, ఇంద్రియాధిదేవతలను, ఇంద్రియాలకు అన్నం సృష్టించింది. ఇప్పుడు పరమేశ్వరుడు ఇంద్రియాలతో కూడిన మానవశరీరంలో ప్రవేశించాలి అనుకొని శిరస్సు నుండి బ్రహ్మరంధ్రం ద్వారా మానవశరీరంలోకి ప్రవేశించాడు.
ఛాన్దోగ్యోపనిషత్తు:- ఉద్ధాలకుడు తన కుమారుడైన శ్వేత కేతువునకు ఆత్మజ్ఞానం వివరిస్తూ, మొదట ఉన్నది ఏకైక పరబ్రహ్మ, అది అనేకం కావలనుకుంది, రకరకాల రూపాలతో వస్తువులుగా, జీవులుగా, రూపుదాల్చింది. ద్రవ, ఘన, వాయు పదార్ధాలుగా మార్పుచెంది, అనేకరూపాలతో సృష్టి ఆకారం పొందింది. ఈరకంగా పరమాత్మ నుంచే అన్ని వచ్చాయి. తాను అనేకం కావాలనుకున్నప్పుడు సత్తు మొదటగా అగ్నిని సృష్టించింది. అగ్ని నుండి జలము, జలము నుండి భూమి ఏర్పడ్డాయి. అప్పుడు సత్తు అగ్ని, జలము, అన్నములలో ప్రవేశించి ఆయా రూపాలుగా వ్యక్తమైంది. జీవుడు ఈ శరీరానికి చేతనుడైన యజమాని. బ్రహ్మానికి జీవుడు స్వరూపం. మానవుడు నిదురించేటప్పుడు తాత్కాలికంగా ఆత్మలో లీనమౌతాడు. మరణకాలంలో వాక్కు మనస్సులో లీనమౌతుంది. మనస్సు ప్రాణంలో లీనమౌతుంది. ప్రాణం తేజస్సుతో కలిసిపోతుంది. చివరకు అది పరమశక్తిలో కలిసిపోతుంది. ఆ శక్తి చాలా సూక్ష్మమైనది. కానీ విశ్వమంతా వ్యాపించి ఉన్నది. అదే సత్యము, అదే నిత్యము, అదే ఆత్మ, అదే నీవు శ్వేతకేతు ఆఆత్మ నీవే అని ఉద్ధాలకుడు చెప్పాడు. ఈ రకంగా నువ్వే ఆత్మ అని ఉపదేశం చేశారు.అంటే ఆత్మ జీవుడు ఒక్కటే అని చెప్పబడినది.
సూత్రం :- 7
"తన్నిష్టస్య మోక్షోపదేశాత్ "
తత్ నిష్ఠస్య:- బ్రహ్మంలో నిష్ఠ ఉన్నవాడికి మోక్షోపదేశాత్ :-మోక్షం లభిస్తుందని శాసించడం వలన.
భావం:-బ్రహ్మనిష్ఠ లో ఉన్నవాడికి మోక్షం లభిస్తుంది.ఇక్కడ ఆత్మ ప్రకృతికి సంబంధించినది కాదు.ఆత్మకు మాత్రమే సంబంధించినది.
వివరణ:- బ్రహ్మనిస్ట ఉన్నవారు శరీరపాతం కాగానే ముక్తుడై బ్రహ్మాన్ని పొందుతాడు అని ఉన్నది. ఈస్థితిలో ఆత్మ శబ్దం ప్రకృతి వాచకం ఎలా అవుతుంది? ప్రకృతి నిష్ఠ మోక్ష హేతువు కాదు కదా! ప్రకృతి బ్రహ్మనుండి ఆవిర్భవించినప్పటికి ఆత్మ శబ్దం ప్రకృతికి వర్తించదు. ఎందుకంటే ప్రకృతి జడమైనది, అశాశ్వతమైనది. బ్రహ్మ చైతన్యమైనది, శాశ్వతమైన ఆనంద స్వరూపం. కనుక ఆత్మశబ్దం బ్రహ్మం కి వర్తిస్తుంది. మానవుడికి ప్రకృతి స్థూల, సూక్ష్మ రూపాలు తెలియవలసినదే. ప్రకృతిలో ఉండే ఆనందానికి అశాశ్వతమైన సుఖాలకు భ్రమసి దానితో రమించకుండా మోక్షాన్ని కోరుకొని బ్రహ్మసాక్షాత్కారం కోసం నిరంతరం ప్రయత్నించాలి. రాగ ద్వేషాలు మోక్షానికి ప్రతిబంధకాలు. అవి హేయమైనవి. కాబట్టి స ఆత్మా, తత్త్వమసి లోని ఆత్మ శబ్దం బ్రహ్మ వాచకం. పోనీ ఈక్షణం కూడా ప్రకృతి వాచకం కాదా? అంటే కాదు అనే చెబుతున్నారు. ఆత్మనిష్టుడైన వాడికి మాత్రమే మోక్షోపదేశం చెయ్యడం వలన ప్రకృతిని ఆత్మ శబ్దంతో చెప్పడానికి వీలు లేదు. శరీరము జడం, అది ఆత్మ కాదు. శ్వేత కేతువు ఆత్మజ్ఞానాన్ని పొందే ఉపాయమేదో వివరించండి అన్నాడు. శ్వేతకేతూ! ఒక మనిషి చేతులు కట్టివేసి, కళ్ళకు గంతలు కట్టి, భయంకరమైన అరణ్యంలో వదలివేశావనుకో! అప్పుడు అతనికి తను ఎక్కడ ఉన్నాడో తెలియదు. దారితెన్ను తెలియదు. పగలు, రాత్రి కూడా తెలియవు. పిచ్చివాడిలా అరుస్తూ ఏడుస్తూ తిరుగుతాడు. ఎవరైనా వచ్చి కళ్ళకు గంతలు విప్పేస్తే అతనికి త్రోవ కనిపిస్తుంది. కనిపించని దారిలో వెడుతూ, తనకు కనిపించినవారిని తన ఊరికి దారి చెప్పమని అడుగుతాడు. అటువంటి ఆత్మనిష్ఠ గలవారికి శరీరం వదలడమే ఆలస్యం మోక్షం వస్తుంది. అతను బ్రహ్మ అవుతాడు. బ్రహ్మనిష్టాపరుడైన వానికి సరియైన మార్గం చూపించే సద్గురువు ఉపదేశిస్తేనే మోక్షం అందుకోగలడు అని చెప్పాడు గురువు.
ముండకోపనిషత్తు :- జీవాత్మ. పరమాత్మ రెండు ఒక్కటేనని వివరిస్తూ, ఒకే పేరు, రూపం గల రెండు పక్షులు ఒక చెట్టు మీద కూర్చునిఉన్నాయి. అందులో ఒకటి జీవి, కర్మఫలాలు అనుభవిస్తోంది. రెండవది పరమాత్మ. కర్మఫలాలు ఏమి లేకుండా కూర్చుంది. శరీరమే ఆ వృక్షం అయినప్పుడు ఆ పక్షులు దానిలో భాగలే, ఆ రెండు ఒక్కటే అవుతాయి. జీవాత్మ పరమాత్మ ఒక్కటేనని భావం. పరమాత్మ దివ్యుడు, సూక్ష్మాతి సూక్ష్మమైనవాడు అజ్ఞానులకు దూరంగా, జ్ఞానులకుదగ్గరగా ఉంటాడు. అతనికి రూపం లేదు. కంటికి కనిపించదు. ఆత్మ మనలోనే సూక్ష్మ రూపంలో ఉంది. ఆత్మ సాక్షాత్కారం జరగాలంటే చిత్తశుద్ధి అవసరం.శుద్ధమైన అంతఃకరణ గల జ్ఞాని కోరుకున్నది పొందగలడు. అతనికి పునర్జన్మ ఉండదు. అతనే సాక్షాత్తు పరబ్రహ్మ అని చెప్పదమైనది. పరబ్రహ్మ అంటే ఎవరు? సాధకుని శరీరమా? కాదుకదా! మరణానంతరం శరీరం మట్టిలో కలిసిపోతుంది. మరి బ్రహ్మ అంటే శరీరాన్ని నడిపించే చైతన్యమేదైతే ఉందో అదే జీవాత్మ, పరమాత్మ రెండు ఒక్కటే. అంటే జడమైన సాధకుని శరీరం బ్రహ్మకాదు. చేతనమైన ఆత్మయే బ్రహ్మం. సాధకుడికి శరీరమే ఆత్మ అనుకుంటే అంధ, వృషభ న్యాయంలా ఉంటుంది. పూర్వకాలంలో ఒక గ్రుడ్డివాడు తన బంధువుల ఇంటికి అడవిలోనుండి పోవాలి. ఆ అడవిలో పెద్దరాయి తగిలి పడిపోతాడు. ఒక తుంటరి అతని సమాచారం తెలుసుకొని గడ్డి మేస్తున్న ఒక పొగరుబోతు ఆబోతును తీసుకువచ్చి, దాని తోక పట్టుకుంటే మీ బంధువుల ఇంటికి చేరుస్తుంది అని చెబుతాడు. దాని తోక పట్టుకోగానే పరుగు పెట్టడం మొదలుపెట్టింది. గ్రుడ్డివాడు క్రింద పడిపోయి దెబ్బలు తగిలి ప్రాణాపాయం తెచ్చుకున్నాడు. శరీరమే ఆత్మ అనుకున్నవారి గతి ఇలాగే ఉంటుంది. కనుక జడమైన సాధకుని శరీరం ఆత్మకాదు. అతనికి ఉన్న జీవాత్మయే పరబ్రహ్మ. ప్రజాపతి చేసిన ఉపదేశాన్ని తప్పుగా అర్ధం చేసుకున్న రాక్షసులు ఈ శరీరమే ఆత్మ అనుకోని భ్రష్టులయ్యారు.
సూత్రం 8.
'హేయత్వావచనాచ్చ
'చ :- పైగా హేయత్వావచనచ్చ :-ప్రకృతి నిష్ఠ హేయం అగ్రాహ్యం.
భావం :- పైగా ప్రకృతి నిష్ఠ హేయమైనది. ఆత్మ శబ్దం ప్రకృతికి వాచకం కానేరదు.
వివరణ :- ప్రకృతి అనేది అనాత్మ, జడము. ప్రకృతే ఆత్మ అయిఉంటే తేలికగా అర్ధం చేసుకోవడం కోసం స్థూల అరుంధతి న్యాయంగా తత్త్వమసి అని చెప్పినప్పటికీ, ఆ తరువాత యదార్ధమైన దానిని గ్రహించేటట్లు చెయ్యడం కోసం ముందు చెప్పిన దాన్ని నిరాకరించాలి. అలా చెయ్యలేదు కాబట్టి జడమైన ప్రకృతి యదార్ధం కాదు అని వాదన.
స్థూల అరుంధతీ న్యాయం:- అరుంధతి వశిష్ఠ మహర్షి భార్య. మహా పతివ్రత. నిత్య సౌభాగ్యవతి. వశిష్ఠుడు సప్త ఋషులలో ఒకరు. నక్షత్ర మండలంలో ఉత్తర దిక్కున సప్తఋషులు ఉంటారు. సప్త ఋషి మండలం పైన ధ్రువ మండలం ఉంది. సప్త ఋషి మండలంలో క్రింద వరుసలో నున్న 3 నక్షత్రాలలో మధ్యన ఉండేది వశిష్ఠ నక్షత్రం. వశిష్ఠ నక్షత్రానికి దిగువగా అతి సమీపంగా ఉండే అతిచిన్న నక్షత్రము అరుంధతి. చాలా జాగ్రత్తగా చూస్తే గాని కనిపించదు. స్థూల అరుంధతి న్యాయం అంటే చాలా చిన్నదైనా అరుంధతి నక్షత్రాన్ని చూడడానికి దానికి దగ్గరలో ఉన్న పెద్ద నక్షత్రం అయిన వశిష్ఠ నక్షత్రాన్ని ఆనవాలుగా చూపించి, ఆ తరువాత అది కాదని దాని ప్రక్కన ఉన్న అరుందతి నక్షత్రాన్ని చూపుతారు. అలాగే ఏదైనా ఒక సూక్ష్మమైన విషయాన్ని తెలియజేసేటప్పుడు అది సులభంగా అర్ధం కావడానికి ఇంకొక స్థూల విషయాన్ని ముందుగా చెప్పి, ఆతరువాత అది సులభంగా అర్ధం కావడానికి, అది కాదు అని అసలు విషయం చెబుతారు. ప్రకృతి నిష్ఠ హేయమైనది కనుక మానవుడికి ప్రకృతి తత్త్వం తెలియాల్సి ఉంది. సకల కార్యములను కలగజేయడానికి ప్రకృతే మూలకారణం. ఆకార్యముల వలన కలిగే సుఖదుఃఖములను అనుభవించడానికి పురుషుడే కారణం. ఈ పురుషుడు ప్రకృతిలో లీనమై ఏవేవో కారణములతో ఎన్నో కార్యములు చేస్తుంటాడు. ఇది సహజం. దానికి మూల ప్రకృతే కారణం. ప్రకృతిలో ఉన్న వస్తువులు సాధించడం కోసం అనేక కార్యములు నిర్వహించడం వలన సుఖదుఃఖాలు కలుగుతుంటాయి. పురుషుడు అనే జీవాత్మ ఆ సుఖదుఃఖములను అనుభవిస్తున్నట్లు భ్రమ చెందుతుంటాడు. నిజానికి సుఖాలు దుఃఖాలు అనే లేవు. అది కేవలం మానసికస్పందన మాత్రమే. ప్రకృతి వలన కలిగే సుఖదుఃఖములకు మూలం పురుషుడు. నిజానికి పురుషునికి ఎటువంటి సుఖదుఃఖములు వికారములు లేవు. కానీ ప్రకృతిలో ఉండి కార్యములు చేయుట వలన ఆ కార్యములు వలన కలిగే సుఖదుఃఖములకు జడమైన ప్రకృతి అనుభవించలేదు. పురుషుడు అనుభవిస్తున్నట్లుగా కనిపిస్తున్నాడు కానీ పురుషునికి ఏ వికారములు లేవు. ప్రకృతి మాయ అని తెలుసుకొని రాగద్వేషాలను వదలి శాశ్వతమైన ఆనందం కోసం మోక్షాన్ని కోరుకొని, బ్రహ్మ సాక్షాత్కారం కోసం నిరంతరం ప్రయత్నం చెయ్యాలి. ప్రకృతి హేయమైనది కనుకనే ఆత్మ శబ్దం ప్రకృతికి వర్తించదు.
సూత్రం :-9
”స్వాప్యయాత్”
'స్వ - సత్ , అప్యయం -లయం , స్వాప్యయాత్ :- సుషుప్తిలో జీవుడు బ్రహ్మంలో లయమౌతాడు.
భావం :- జీవుడు సుషుప్తిలో నిద్రిస్తున్నప్పుడు బ్రహ్మం లో లీనమౌతాడు.అందువల్ల నిద్రిస్తున్నాడని అంటారు.
వివరణ:-నిద్రపోతున్నప్పుడు మానవుడు ఎక్కడికిపోతున్నాడు? అన్న శ్వేతకేతువుకు తండ్రి ఉద్ధాలకుడు చెబుతున్నాడు. నాయనా! నిద్రపోతున్నప్పుడు మనిషి తాత్కాలికంగా ఆత్మలో తాదాత్మ్యం చెందుతాడు. తేనెటీగలు తోట అంతా తిరిగి మకరందాన్ని స్వీకరించి తేనెగా తయారుచేస్తాయి. ఆ తేనె పువ్వులనుంచి స్వీకరించినదే. కానీ ఏ చుక్క ఏ పూవునుండి తీసిందో చెప్పలేము. అలాగే జీవరాశులు విడివిడిగా ఉన్నప్పటికీ ఆత్మలోనే లీనమై ఉంటాయి. అది నిద్రాసమయం. లేదా మరణసమయ .ఏదైనా కావచ్చును. గాఢ నిద్రలో గతం తెలియదు.
బృహదారణ్యకోపనిషత్తు..జీవి నిద్రిస్తుండగా ఇంద్రియముల యొక్క విషయాలన్నీ అంటే వాక్కు మొదలైన ప్రాణాల విజానాన్ని పూర్తిగా గ్రహించి హృదయాకాశంలో నిద్రిస్తున్నాడు .ఈ రకంగా సుషుప్తిలో ఇంద్రయాలన్నీ ఆత్మలో లీనం చెందుతాయని చెప్పబడింది.
జాగ్రదావస్థ:- ఈ స్థితిలో ఒక వ్యక్తి తన శరీరభాగాలు మఱియు వాటియొక్క స్వేచ్ఛసంకల్పంతో పనిచేస్తాయి. జ్ఞాన వస్తువులు అందుబాటులో ఉంటాయి. తన కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియలకు సంబంధించిన స్థూల శరీరం అవగాహన ఉంటుంది. స్థూల, సూక్ష్మ, కారణ శరీరరాలు అందుబాటులో ఉండి ప్రతిదాన్ని అనుభవించిన వారిని విశ్వ అని పిలుస్తారు. ఈ స్థితి స్వప్నానికి సుషుప్తికి సాధ్యం కాదు. ఈ స్థితిలో జీవా అనిపిలుస్తారు. వికల్పాలు ఉన్నాయి.దీనికి కారణం దీనికి కారణం అతను స్థూల సూక్ష్మ శరీరాలను కలిగిఉన్నాడు.
స్వప్నావస్థ:- ఒక వ్యక్తి జాగ్రదావస్థలో సేకరించిన అనుభవాలు కలలో సంభవిస్తాయి. కలలు నిర్దిష్ట క్రమంలో లేవు. యాదృచ్చికం. కోరికల గురించి ఆలోచిస్తూ అణచివేసిన రాగద్వేషాలను మేలుకొన్న స్థితిలో ఉన్న అనుభవాలు కలలో వస్తాయి. ఇది సగం నిద్రలో ఉన్న స్థితి. ఒక నిర్దిష్ట విషయం గురించి ఆలోచిస్తూ ఆ సమస్యలకు పరిష్కారం కలలో కూడా జరుగుతుంది. అసంపూర్తిగా ఉన్న కోరికలు లేదా వాసనలు తరచుగా కలలో వస్తాయి. కల సమయంలో వేరే పరధ్యానం ఉండదు. కనుక ఆలోచనలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. కలలో తనతో తను మాత్రమే లావాదేవీలు జరుపుతారు. అతన్ని తేజసా అంటారు.
సుషుప్తి:- ఆ స్థితిలో ఏమి తెలియదు. మూడు శరీరాలు కరిగిపోతాయి. ప్రతి ఒక్కరికి నిద్ర తప్పనిసరి. ఈ అవస్థలో శరీరము స్థూల సూక్ష్మ కారణ శరీరముల యొక్క అభిమానం లేదు. వ్యక్తిత్వం పోయింది. జాగ్రదావస్థలో ఉన్న స్థూల శరీరమునకు చెందిన అభిమానం గాని స్వప్నమునకున్న, సూక్ష్మ శరీరమునకు చెందిన అనుభూతిగాని ఏమియు ఎరుగడు. గాఢ నిద్రావస్థ నిత్యానుభవ రూపమైన స్వస్వరూపానుభూతిని అనుభవించును. అనగా తాను సాక్షిచైతన్యమగు జీవుడు స్వస్వరూపము నందు లయించును. నేనేమి ఎరుగను? అంటాడు, అనగా స్వప్నమునందు గాంచిన విషయములుగాని జాగ్రదావస్థలో ఐహిక సుఖములు గాని ఏమి కానరావు. దీనినే సుషుప్తి అని పేరు.సుఖానుభవం కష్టం నష్టం దుఃఖం ఎరుగడు. జాగ్రదావస్థలో జీవుడు జడమైన చేతనాత్మకమైన బాహ్య విషయములలో తగులుకొని ఉంటాడు.సుషుప్తిలో విషయాల నుంచి విరక్తుడై సత్ లో లీనమైనట్లుగా ఉంటాడు.
సాంఖ్య దర్శనం:-సమాధిలోను సుషుప్తిలోను మోక్షంలోను జీవుడు బ్రహ్మ సారూప్యం చెందుతాడు. బ్రహ్మంలో అవిభక్తముగా ఉంటాడు. సత్ లో లయం కావడం స్వపతి. సత్ శబ్దం ప్రకృతి వాచకం కాదు. జీవుడు ప్రకృతిలో లయం కాడు. జీవుడిలాగా ప్రకృతి సైతం బ్రహ్మాన్ని ఆశ్రయించి ఉంటుంది.జీవుడుకి ప్రకృతి భోగస్థానం. లయస్థానం కాదు. భోగమున్నంత వరకు ఆనుభవించి జీవుడు ప్రకృతిని వడాలివేస్తాడు. జీవుడు నాశరహితమైన పరమాత్మను చేరతాడు. సత్ శబ్దం బ్రహ్మాన్ని బోధిస్తుంది. ఆ బ్రహ్మమే ఈక్షణ కర్త. అది బ్రహ్మ ధర్మమే అవుతుంది.కానీ ప్రకృతి ధర్మం కాదు.
సూత్రం :- 10
"గతిసామాన్యాత్"
గతి :- జ్ఞానత్వం ఈక్షణం:-సంకల్పం
భావం:- జ్ఞానత్వం వలన కూడా ఈక్షణం ప్రకృతి ధర్మం కానేరదు. పర్యాలోచన పూర్వక జ్ఞానం. జ్ఞానం చేతన ధర్మమే కానీ జడధర్మం కాదు.ప్రకృతి జడం. కనుక ఈక్షణం బ్రహ్మధర్మమే.
వివరణ :- వేదాంతములన్ని చేతనమైన బ్రహ్మయే జగత్కారణం అని చెబుతున్నాయి. కాబట్టి జగత్కారణం ప్రకృతి కాదు. బ్రహ్మమే. ఉపనిషత్తులలో ఒకసారి జగత్తుకు కారణం బ్రహ్మ అని ఇంకోసారి కాదు అని చెప్పలేదు. ప్రతి చోట ఉపనిషత్తులు ఈ జగత్తుకు కారణం బ్రహ్మమే అని చెప్పాయి.
ముండకోపనిషత్తు :- శౌనకుడికి అంగీరసుడు ఈ విషయాన్ని చెబుతూ ' ప్రజ్వరిల్లిన అగ్ని నుండి అదే విధమైన ఆకారం, గుణము కల వేలకొలది నిప్పురవ్వలు వెలువడినట్లు పరబ్రహ్మము నుండి అనేకమైన జీవరాసులు ఉద్భవించి మళ్ళీ అందులోనే లీనమౌతాయి.' అని చెప్పాడు. సాలెపురుగు ఏసహాయం లేకుండానే తన శరీరం నుండి దారాలను తయారుచేసి వాటిని మళ్ళీ తానే మ్రింగేస్తుంది. భూమినుండి ఓషధులు పుడుతున్నట్లుగా, మానవశరీరం మీద రోమాలు పుడుతున్నట్లుగా, అక్షర పరబ్రహ్మము నుండి ఈ జగత్తు పుడుతున్నది.
తైత్థరీయోపనిషత్తు :- సృష్టికి మూలం ఆత్మ. దాని నుంచి ఆకాశం పుట్టింది. పంచభూతాలు పుట్టాయి. పంచభూతాల వలనే శరీరం ఉద్భవించింది.' అని చెప్పబడినది. ఈరకంగా ప్రతి ఉపనిషత్తుకూడా ఈ జగత్తుకు కారణం బ్రహ్మయే అని చెబుతున్నాయి. ఈ శరీరం ఎలా ఏర్పడింది? గతజన్మల కర్మలననుసరించి పంచభూతల యొక్క పంచీకరణ వలన శరీరం తయారైనది. సుఖదుఃఖాలు అనుభవించడానికి క్షేత్రం లాంటిది. నేను అనుకుంటున్న స్థూల దేహం స్వతంత్రంగా ఏ పని చేయలేదు. జీవుడు కష్టసుఖాలు అనుభవించడానికి అది ఒక ఇల్లు లాంటిది. బ్రహ్మ సృష్టి ఆవిర్భావంలో పంచభూతాలు ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి సృష్టించబడ్డాయి.ఇవన్నీ పంచీకరణ చెందటం వలన కంటికి కనిపిస్తున్నాయి. పంచభూతాలు ఒక్కొక్కటి మిగిలిన నాలుగు పంచభూతాల్లో కలిసిపోయి పంచీకరణ చెందుతాయి. అంటే భూమిలో జలం అగ్ని వాయువు ఆకాశం ఒక్కొక్కభాగం వచ్చి కలిసిపోతాయి. అలాగే జలంలో భూమి అగ్ని వాయువు ఆకాశం కలిసి పోతాయి. అలా అగ్ని, వాయువు, ఆకాశం కూడా కలసి పంచీకరణ చెంది, ఈ పంచభూతలతోనే శరీరం ఏర్పడింది. ఎముకలు భూమికి, రక్తం చీము జలానికి, ఉష్ణోగ్రత అగ్నికి, పీల్చే గాలి వాయువుకి, శరీరం లోపల ఖాళీప్రదేశం ఆకాశానికి సంబంధించినవి. జీవుడు ఈ స్థూలదేహం వదిలి పెట్టి వెళ్లిన తరువాత సూక్ష్మ దేహం ఏ పుణ్యం చేసిందో ఏ పాపం చేసిందో ఆ వాసనలు కోరికలు వాటిని తీర్చుకోవడానికి మళ్ళీ జన్మ వస్తుంది.పూర్వ జన్మల పాపాపుణ్యాల వలన పంచీకరణ ద్వారా ఏర్పడిన పంచభూతల వలన శరీరం ఏర్పడుతుంది. జన్మ ఎలా వస్తుంది? సూక్ష్మ రూపంలో ఉన్న జీవుడు వానబిందువు రూపంలో వ్యవసాయ క్షేత్రంలో పడి, విత్తనం మొలక వస్తుంది. దానికి పండిన ధాన్యం ఎవరు అన్నంగా స్వీకరిస్తారో ఆ తండ్రి లో వీర్యంగా మారి, తల్లి గర్భంలో ప్రవేశించి గర్భస్థ శిశువుగా పెరుగుతాడు. ఏ ధాన్యంగింజ ఎవరు తినాలో, వారి పాప పుణ్యాల ఆధారంగా ఎవరికి పుట్టాలో, వారే ఆ గింజలు తినాలని సంకల్పించేది పరమాత్మే. మానవుని యొక్క వాదనలకు అనుగుణంగా స్థూల శరీరం పనిచేస్తుంది. స్థూల సూక్ష్మ శరీరాలు చైతన్యవంతం అవుతాయి. ఆశలు, ఆశయాలు, బాధ్యతలు, సూక్ష్మ శరీరం చేసేది. స్థూల శరీరం నిలబడటం, మాట్లాడటం, నిద్ర, పనులన్నీ సూక్ష్మ శరీరం చెబుతునట్లే చేస్తుంది. ఆత్మ చైతన్యమే నేను అనే సూక్ష్మశరీరంలో ప్రకాశింపజేసి, స్థూలశరీరం పనిచేసేటట్లు ప్రేరేపించబడుతుంది. స్థూలశరీరంలో కల్పితమైన ఆలోచనలతో కల్పితమైన ప్రపంచంలో విహరిస్తుంటుంది. శరీరాన్ని నిర్మించుకొని ఈ రెండు వ్యవస్థలు ఆత్మ చేత ప్రకాశింపబడుతున్న మనోబుద్ధులు చేత పనిచేస్తుంటాయి. స్థూల సూక్ష్మ శరీరాలతో బాటు కారణ శరీరం కూడా ఉంటుంది అది అవిద్య, అమాయకత్వం వలన ఆత్మ తెలియకుండా చేసి వాసనలు అనే ముసుగులో ఆత్మను తెలుసుకోలేకుండా చేస్తుంది. ఈ మూడు వ్యవస్థలను ఆత్మ సాక్షిగా చూస్తూ ఉంటుంది.
సూత్రం..11
శ్రుతత్వాచ్చ
చ:- పైగా. శృతత్వాత్ :- శాస్త్రాలు కూడా అలాగే అంటున్నాయి.
భావం :-సృష్టికి పూర్వం బ్రహ్మం ఒక్కడే ఉన్నాడు.ఆయన ఈక్షించాడు అంటే సంకల్పించాడు అని స్పష్టంగా ఉంది. ఈక్షతధర్మం ప్రకృతిది కాదని తెలుతోంది. ఇలా జగజ్జన్మాదులకు సర్వజ్ఞమైన బ్రహ్మమే నిమిత్తకారణం.
వివరణ :- సర్వజ్ఞుడైన బ్రహ్మమే ఈ జగత్తుకు కారణం అని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. కనుక ఈ జగత్తుకు కారణం చేతనమైన బ్రహ్మమే కానీ అచేతనమైన ప్రకృతి కాదు అని 5వ అధికారణం పూర్తిచేశారు రత్నాకరుడు. గురువుగారు! ఈశ్వరుడు ఒక్కడే అయినప్పటికీ సాకారం నిరాకారం అని రెండు రకాలుగా చెప్పబడుతున్నాయి. నామము, రూపము, వికారం, ఉపాధి వీటితో కూడినవాడు ఉపాస్యుడు. ఈయనే సాకారుడు. నామరూపవికారములు లేనివాడు నిరాకారుడు అనబడతాడు.ఈ ఇద్దరిలో ఎవరు బ్రహ్మ? కాస్త వివరించండి?అని అడిగాడు నారాయణ భట్టు. నాయనా! వీరిద్దరిలో ఎవరి వల్లనైతే నీకు శాశ్వత ఆనందం కలుగుతుందో అతడే బ్రహ్మ. ఈ విషయం 6వ అధికారణం లో వివరించబడింది అని చెప్పాడు. ఆత్మలు రకాలు:- ఆత్మలు 2 రకాలు .జీవాత్మ పరమాత్మ. విశ్వవ్యాప్తంగా ఉండే శక్తి పరమాత్మ. జీవులలో ఉండే తన అంశను జీవాత్మ అంటారు. ఈ జీవాత్మలో పరమాత్మ సాకారరూపంలో ఉంటాడు. నామము, రూపము. వికారం, ఉపాధి వీటితో కూడిన వాడే జీవాత్మ. ఈయనే సాకారుడు. నామరూపవికారములు లేనివాడు పరమాత్మ. వీరిద్దరిలో ఎవరు బ్రహ్మ? అని సందేహం వస్తే ఎవరి వలన జ్ఞానసిద్ధి కలిగి ఆత్మానందం వస్తుందో వారే బ్రహ్మ అని నిర్ణయించారు. గంగ, బ్రహ్మపుత్ర, సింధు, యమునా, సరస్వతి, గోదావరి, కృష్ణ, కావేరి మొదలైన నదులన్ని వ్యవసాయక్షేత్రాలను సస్యశ్యామలం చేస్తూ, చివరికి సాగరంలో కలసిపోతాయి. ఆ తరువాత వాటి నామరూపాలు అస్తిత్వం కోల్పోయి సాగరంగానే మిగిలిపోతాయి. నదులన్ని కలసినప్పటికి దానిని సాగరం అనే అంటారు కానీ నదులు అనరు. అదే విధంగా జీవాత్మలన్ని పరమాత్మతో కలసిపోయినప్పుడు వారి నామరూపాలు అస్తిత్వం కోల్పోతారు.అందుకే విశ్వవ్యాప్తమైనది బ్రహ్మమేనని చెప్పబడింది క్షరం, అక్షరం ద్వైతమే కానీ నిజానికి అద్విైతం కారణం. ఒకే సమయంలో ఇద్దరు ఉనికి సాధ్యం కావడం లేదు. అంటే ఉంది అనుకున్నప్పుడు లేనిదానికి ఉనికి లేదు. లేదు అనుకున్నప్పుడు ఉండటం జరుగదు. అద్వైతంలో రెండు ఒక్కటే. జీవాత్మ ఉంటే పరమాత్మ కనబడడు.పరమాత్మ కనిపిస్తే జీవాత్మ కనబడడు. పరమాత్మ వాస్తవం.జీవం వెంట పరుగులు తీస్తున్న ఆత్మ పరుగిడుతున్నంతకాలం క్షరమే. పరుగెత్తడం ఇహం. అంటే ఈ లౌకిక ప్రపంచంలో జీవాత్మ ఎప్పుడు పరుగుపెడుతుంటాడు కనుక దానిని క్షరం అన్నారు. పరమాత్మతో కలిసిన తరువాత ఇక పరుగు పెట్టలేని స్థితి .అది అక్షరం. అదే పరం. ఏ వికారం అజ్ఞానం భ్రమలకు ఎరుగనిది అక్షరం. ఆవికారాలకు అజ్ఞానం భ్రమలకు అవకాశమిచ్చినది దేహరూపంలో వ్యక్తమైన ఆత్మ. నశించేది ఆత్మ కాదు. ఆత్మ తొడుకున్నరూపమే. అంటే మానవదేహమే. పరమాత్మ అపరిమితం. జీవాత్మ పరిమితం. భౌతికం అనే కంచె లేకపోతే ఇహము పరము రెండు ఒక్కటే. ఇహంలోని ఆత్మ పరంలోని పరమాత్మ అక్షరాలే. రెండు ఒక్కటే కాబట్టి అక్షరమే. అంటే ఆత్మను ఆవరించిన భౌతికత నశిస్తోందే తప్ప ఆవరణలకు అతీతమైన ఆత్మ నశించడం లేదు. సృష్టింపబడు తున్నది నశిస్తోందే కానీ సృష్టికి మూలమైనది నశించడం లేదు. ఆత్మకు పరివర్తనకు అవకాశం ఇవ్వదు .అంటే క్షయం, నాశనము, వికారం. భ్రమ అనేవి జీవాత్మకు సంబంధించినవి. ఆత్మ ఒక్కో పర్యాయం ఒక్కో శరీరాన్ని ఒక్కో భౌతిక పదార్ధాన్ని జగతిని చేరుతుంటుంది. అలా ఆత్మ భౌతిక రూపంలో ఉన్న పదార్ధాన్ని చేరినప్పుడు దానిని క్షరతత్త్వం అని, ఆత్మ వాటినుండి విడివడినప్పుడు అక్షరతత్త్వం అని అంటారు. అందుకే ఇహంలో ఆత్మ క్షరం గాను పరంలో ఆత్మను అక్షరంగా చెప్పుకుంటాము. క్షరం అంటే నశించేది అక్షరం అంటే నాశరహితమైనదని అదే పరబ్రహ్మమని శ్రీ కృష్ణ పరమాత్మ అక్షరపరబ్రహ్మ యోగంలో చెప్పాడు. ఆత్మ నిత్యమైనది, సత్యమైన జ్ఞానం కలిగినది, రూపం లేనిది నిత్యానందస్వరూపమైనది, ఆది అంతములు లేనిది కనుకనే సృష్టికి మూలం ఆత్మే అంటే పరమాత్మేనని ఈక్షణధర్మం అంటే సంకల్పం చెయ్యాలనే ధర్మం బ్రహ్మనిదే కానీ ప్రకృతికి వర్తించదు.
ఆనందమయాధికారణం:- ( 1,1,12 )
సూత్రం..12
ఆనందమయోభ్యసాత్
అభ్యాసాత్ :-అనేక విధాలుగా శాస్త్రాలు ఘోషించడం వలన ఆనందమయం :-బ్రహ్మమే ఆనందం
భావం :-ఆనందమయుడు అనే శబ్దాన్ని పరబ్రహ్మను సూచించడానికి ఉపనిషత్తులలో శాస్త్రాలలో ఘోషించడం వలన విజ్ఞానమయం కన్నా భిన్నమైన అంతరాత్మ ఆనందమయమని అంటే బ్రహ్మమే ఆనందమని తెలియజేశారు.
వివరణ;- తైత్తరీయోపనిషత్తు:-మానవ శరీరంలో పంచకోశాలైన అన్నమయకోశం, ప్రాణమయకోశం, మనోమయకోశం, విజ్ఞానమాయకోశం, దాటిన తరువాత ఆనందమయం కోశం ఉన్నది. అదే పరమాత్మ స్థానం. చరాచర జగత్తు అంతా బ్రహ్మమయమే. సృష్టికి పూర్వం అంతా శూన్యంగానే ఉండేది. ఆ శూన్యంలో పరబ్రహ్మ ఒక్కడే ఉండేవాడు. అతనే నామరూపములతో జగత్తును సృష్టించాడు. అతడే ఆనందమాయమైన బ్రహ్మ. బ్రహ్మను తెలుసుకున్నవారు మోక్షానికి అర్హులు. అంటే తానే పరబ్రహ్మ అవుతాడు. పరబ్రహ్మను తెలుసుకున్నవాడికి జ్ఞానము ఇష్టకామ్యార్ధ సిద్ధి కలుగుతుంది. సాయుజ్యం లభిస్తుంది. ఆనందమయుడు బ్రహ్మ. అంటే ఆనందం కలగజేసేవాడు బ్రహ్మ. ఆనందం అంటే క్షణికమా? శాశ్వతమా ? కోరికలను అనుభవించడం వలన పొందే ఆనందం క్షణికానందం. అనుభవించగానే ఆ ఆనందం తరిగిపోయింది. రెండవది శాశ్వతమైన ఆనందం.అదే బ్రహ్మానందం. ఆనందమయం కోశం అంటే పూర్తిగా ఆధ్యాత్మిక పరమైన దేహం. ఆత్మ పరమాత్మతో ఐక్యమయ్యే స్థితి. దీనిని మనం ముక్తి అంటున్నాము. దీనిలో ధ్యాన స్థితి నుండి ధారణా స్థితికి చేరి సమాధి స్థితి ని పొందడాన్నే ముక్తి అంటారు. ఆనందమయం కోశం ఆత్మకు దగ్గరగా ఉంటుంది. .సంపూర్ణ ఆనందంతో ఆత్మ యొక్క ప్రతిబింబంగా కనిపిస్తుంది. కలలు లేని సుషుప్తిలో ఇది పూర్తిగా వ్యక్తమౌతుంది. ఇది 5 కోశాలలో సూక్ష్మమైనది. గాఢమైన నిద్రలో మనస్సు ఇంద్రియాలు పనితీరు ఆగిపోయినప్పుడు అది పరిమిత ప్రపంచానికి మరియు ఆత్మకు మధ్య నిలుస్తుంది. సుషుప్తిలో ఆనందమయకోశం సాధారణంగా పూర్తి స్థాయిలో అపరిమితమైన ఆనందంతో ఉంటుంది. స్వప్నావస్థ లో ఇది పాక్షిక అభివృద్ధి మాత్రమే ఉంటుంది. ఆనందమయకోశం ఆత్మ యొక్క ప్రతిబింబం. అక్కడ ఆనందం పరిపూర్ణమైనది. ఆనందమయకోశంలో ఉండే ఆనంద పురుషుడికి: 1. ప్రియము (తనవారిని చూసినప్పుడుకలిగే ఆనందం)-శిరస్సు 2.మోదము (కోరుకున్నది లభించినప్పుడు కలిగే ఆనందం (దక్షిణ పక్షం) 3..ప్రమోదము (మోదము ఎక్కువైనప్పుడు కలిగేది) ఉత్తర పక్షం 4.ఆనందం (అన్నింటిని మించింది) ఆత్మ.అని చెప్పబడినది. ఇక్కడ చివరలో ఆనందాన్ని మించింది లేదు. అదే పరమాత్మ. అఖండ బ్రహ్మానందం ఎలా ఉంటుందో సూచనాప్రాయంగా నైనా తెలుసుకోవాలంటే తైత్తరీయో పనిషత్తులో చెప్పినట్లుగా భూలోకంలో ఒక చక్రవర్తి పొందే ఆనందం ఒక సామాన్య మానవుడు పొందే ఆనందం కన్నా గొప్పది. చక్రవర్తి కన్నా 100 రేట్లు ఆనందం మానవగంధర్వులది. వారి కన్నా 100 రెట్లు దేవ గంధర్వులు, వారికన్నా 100 రేట్లు పితృదేవతలు, వారికన్నా 100 రెట్లు అగ్రదేవతలు, వారి కన్నా 100 రెట్లు ధర్మ దేవతలు, వారి కన్నా 100 రెట్లు యముడు అగ్ని మొదలైనవారిది, వారికన్నా 100 రెట్లు దేవతల అధిపతి అయిన దేవేంద్రుడిది, వారి కన్నా 100 రెట్లు దేవేంద్ర సభలో ఉన్న బృహస్పతిది, వారి కన్నా 100 రేట్లు విరాట్ పురుషుడు ఈశ్వరుడు బ్రహ్మాది. ఈ ప్రకారం ఎవరెవరు ఎంతెంత ఆనందాన్ని పొందినా అది బ్రహ్మానందంలో వెయ్యొవంతు మాత్రమే. అంతకన్నా 1000 రేట్లు ఆనందం మోక్షం పొందిన మానవులు పొందుతారు. వీరందరూ అశరీరులు, కనుక బ్రహ్మానందాన్ని పొందే యోగ్యత వీరికి లేదు. ఆ బ్రహ్మానందాన్ని పొందే అర్హత, అదృష్టం పరమేశ్వరుడు మానవులకు మాత్రమే కల్పించాడు.
సూత్రం:- 13
'"వికార శబ్దాన్నేతి చేన్న ప్రాచుర్యాత్"
;వికార శబ్దాత్ :- ఆనందం ఒక వికారం కనుక న:-బ్రహ్మ నిలయం కాదు. ఇతి:-అని చేత:-అంటారా? న:-సరియైనది కాదు. ప్రాచుర్యాత్:-అది ఆనంద ఆధిక్యాన్ని తెలుపుతుంది.
భావం:-ఆనందం ఒక వికారం కనుక బ్రహ్మం ఒక ఆనందనిలయం కాదు, అని అనడం సరియైనది కాదు. అది ఆధిక్యాన్ని సూచిస్తుంది కానీ వికారాన్ని కాదు.
వివరణ:-బ్రహ్మానికి కాయం, వ్రణాలు ఉండవు. అందువల్ల ఆయనకు ప్రియఅప్రియాలతో సంబంధం ఉండదు. సుఖఃదుఃఖాలు లేవు. బ్రహ్మ నిత్యం. ఆయనకు ఏరూపములేదు. అవయవరహితమైన పరబ్రహ్మ ఆనందస్వరూపుడు. ఆనందమే బ్రహ్మమని తెలుసుకోవాలి.అమృతమై ఆనందరూపంలో ప్రకాశించే బ్రహ్మాన్ని ధీరుడు విజ్ఞానంతో తెలుసు కుంటాడు. బ్రహ్మ విజ్ఞానమయం ఆనందమయం. శరీరం, ప్రాణం, మనస్సు విజ్ఞానం ఈనాలుగు జీవాత్మకు సంబంధించినవి. పంచభౌతిక మైనది జీవాత్మకు శరీరం అయినట్లు విశ్వమంతా బ్రహ్మకు శరీరంగా వర్ణించారు. మనస్సు తొలగిపోయి ఆత్మ సాక్షాత్కారం సిద్దిస్తే ఎలా ఉంటుంది? మనిషి అప్పుడు ఆత్మస్థితిలో ఉంటాడు. కేవలం ఆనందం మాత్రమే ఉంటుంది. ఆ ఆనందం పొందడానికి అందరూ అర్హులే. మరి ఆ ఆనందం అందరికి ఎందుకు లభ్యంకావడం లేదు? మానవుడు కదిలించే దానిని వదిలేసి, కదిలేదాన్ని చూసుకుంటూ ఇదే నేను అనుకుంటున్నాడు. మన ఆలోచనల వలన శరీరం కదులుతోంది అంటే కదిలించే చైతన్యం నిరాకారం. ఆకారం లేని చైతన్యానికి మరణం లేదు. ఒకగ్రామంలో ఇళ్లన్ని తగలపడి బుగ్గిపాలైతే, అక్కడ ఆకాశంకూడా బూడిద అవుతుందా అని ఒకరు సందేహం వెలిబుచ్చారు. శూన్యంలో ఏమి ఉండదు. కనుక కాలడానికి అవకాశం లేదు. శరీరం కదిలించే ఆత్మకు కూడా నాశనం లేదు. ఒక శరీరం మరణిస్తే ఆత్మ ఇంకో శరీరాన్ని దరిస్తుంది. మానవుడు దృష్టి జ్ఞానమయం కనుక శరీరభ్రాంతిని వదిలిపెట్టి, కేవలం ఆత్మ ఒక్కటే సత్యమని, అదే తన యొక్క రూపమని, తాను నశించే ఈ శరీరం కాదని గ్రహించగలడు. అలా గ్రహించడమే జన్మ, కర్మలనుంచి శరీరాలనే భ్రమ నుంచి మానవునికి విముక్తి. అదే మానవశరీరం ధరించడం యొక్క పరమప్రయోజనం కూడా. మానవుడు జీవితాంతం లోక విషయాలు భావించకపోతే సుఖదుఃఖాలు అతని అనుభవంలోకి రావు. ఆ స్థితినే పరమ శాంత స్థితి, మోక్షం, బ్రహ్మానందం అంటారు. అట్టి పరమశాంత స్థితి రావాలంటే మానవుడు చేయవలసినది మనస్సులో ఏది భావించకపోవడమే. అసలు అలాంటి బ్రహ్మానందస్థితి లభిస్తుంటే అది వదిలిపెట్టి, మాకు ఎదో లభిస్తే ఆనందం, మరేదో పొందితే ఆనందం అని చేతిలోని ద్రాక్షపళ్లు నేలమీద జారవిడిచి , ఆహా! వేపచెట్టుకు వ్రేలాడుతున్న వేపపళ్ళు ఎంత తియ్యగా ఉంటాయో కదా! అవి కోసుకుంటాను అని వేపచెట్టు ఎక్కేవాడిని ఏమనాలి? భగవంతుని మనస్సులో భావన చేసిన వాడే భగవంతుడు అవుతాడు. అజ్ఞానం తొలగించు కున్న ప్రతి మానవునికి ఇది అర్ధం అవుతుంది. ఎవరైతే నిరంతరం శ్రీరామచంద్రుని గుణగణాలను గుర్తుచేసుకుంటు భావన చేస్తారో, అతను కొన్నాళ్ళకు శ్రీరామ చంద్రుడే అయిపోతారు. ఇదే సత్యం. ఉన్నచోటనే భగవంతుణ్ణి నిత్యం ధ్యానం చెయ్యాలి. అలా చేస్తూ ఉంటే మనసులోకి వారి దైవీ శక్తి కలిగిన చైతన్య శక్తి ప్రవేశించి, మన అజ్ఞానాన్ని దగ్ధం చేస్తుంది. సత్యాన్ని తెలుసుకోనంతవరకు శాంతి ఉండదు. మనిషి యొక్క స్థితి ఆనందమయం. అప్పుడు ఈ శరీరం ఉన్నా పోయినా దుఃఖం కలగదు. కాలంతో కూడా సంబంధం తెగిపోయి అనంతంగా ఆ ఆనందంలో అతను మునిగితెలుతూ ఉంటాడు. ఇక్కడ సృష్టి అనేది ఉండదు. మీరు ధరించిన శరీరం దాని ప్రభావం ప్రకారం అవి నశించేంతవరకు ఈ లోకంలో నిలచి ఉంటుంది. కానీ మీ దృష్టి దానిమీద, శరీరం మీద ఉండదు. మీ కళ్ళు చూస్తున్నట్లు, పలకరిస్తున్నట్లు ఉంటాయి కానీ మీ దృష్టి మీ కళ్ళల్లో ఉండదు. అది మోక్షానందంలో తెలియాడుతూ ఉంటుంది.అందుకే ఆనందమయ శబ్దం బ్రహ్మకు ఉండే ఆనందాధిక్యాన్ని బోధిస్తుందే కానీ వికారశబ్దం అనడం సరి అయినది కాదు.
సూత్రం :- 14
"తద్ధేతు వ్యపదేశాచ్ఛచ"
అంతే కాక, తత్ హేతు వ్యపదేశాత్ :- ఆనందానికి హేతువుగా బ్రహ్మాన్ని శాస్త్రాలు వర్ణిస్తున్నాయి.
భావం:- తైత్తరీయం లో బ్రహ్మానందాన్ని ఆనందమయం అంటున్నారు. బ్రహ్మమే జీవుల్ని ఆనందింపజేస్తోంది. బ్రహ్మం కన్నా జీవుల్ని ఆనందింపజేసే తత్త్వం మరొకటి లేదు. పైగా జీవులన్నీ ఈ బ్రహ్మానందాన్ని పొందే ఆనందిస్తున్నాయి అని అన్నారు. కనుక బ్రహ్మమే ఆనందం. జీవాత్మ కాదు.
వివరణ:- ఆనందానికి హేతువు బ్రహ్మ కాబట్టి ఆనందమయుడంటే పరమాత్మ కాని వేరు కాదు. బ్రహ్మాన్ని చేరుకోవాలంటే మోక్షం పొందాలి. మోక్షం రావాలంటే నిష్కామకర్మ ఆచరిస్తూ కర్మఫలాలు త్యజించడం వలన జ్ఞాని అయినవాడు మోక్షాన్ని పొందుతాడు. ఈ సాధన ధ్యానయోగానికి దారితీస్తుంది. ఫలాశక్తిని విడిచి బ్రహ్మార్పణ బుద్ధితో కర్మ చేసే సన్యాసికి సర్వం బ్రహ్మమయంగా కనిపిస్తుంది. ఇదే బ్రహ్మజ్ఞానానికి అత్యవసరం. ఎల్లప్పుడూ చేయదగిన కర్మను సంగరహితంగా చేసిన మానవుడు పరమపదాన్ని పొందుతాడు. బ్రహ్మాన్ని చేరుకోవాలంటే విద్యలలో ఉత్తమమైనది అతి నిగూఢమైనది బ్రహ్మవిద్య. ఈ బ్రహ్మవిద్య మోక్షరహాస్యాన్ని తెలియజేస్తుంది. పరమాత్మ ఆధ్వర్యంలోనే సకల చరాచార సృష్టి జనిస్తోంది. కల్పాంతంలో ఆయనలో లయమైపోయి మళ్ళీ కల్పాదిలో సృష్టింపబడుతోంది. మర్రి చెట్టు ఎంత పెద్దదిగా ఉన్నా, దాని విత్తనం చాలా చిన్నదిగా ఉంటుంది. అంత చిన్నవిత్తనంలో పెద్ద మర్రి చెట్టు నిక్షిప్తమై ఉన్నట్లే, పరమాత్మలో లయమైన తరువాత సృష్టి అంతా ఆయనలో నిక్షిప్తమై ఉంటుంది. ఈ జగత్తుకు తండ్రి, తల్లి, అన్న, కర్మఫలప్రధాత, ప్రణవనాదం, వేదాలు, వేదం విద్య వేదాల ద్వారా తెలియదగినవాడు, సర్వాన్ని భరించేవాడు, సాక్షి, సృష్టి స్థితి లయ కారకుడు, సత్ పురుషుడు, అమృతుడు, ఆ బ్రహ్మయే. అంటే పరమేశ్వరుడే. మూఢులు ఆయన తత్త్వం తెలియక వ్యర్ధమైన ఆశలతో నిష్ప్రయోజనమైన కర్మలతో నశిస్తున్నారు. సజ్జనులు సదా జ్ఞానయోగం ద్వారా ఆరాధిస్తున్నారు. అనన్యచింతనతో ఉపాసించేవారి యోగక్షేమాలు ఆయనే వహిస్తాడు. బ్రహ్మాన్ని చేరుకోవాలంటే బంధాలతో చిక్కుకోకూడదు కర్మలు 3 రకాలు. కర్మ, అకర్మ, వికర్మ. ఫలాపేక్ష రహితుడు కర్తను అనే అహంకారాన్ని జ్ఞానాగ్నిచే దగ్ధంచేసేవాడు. బుద్ధిమంతుడు, కోరికలు లేనివాడు, జయాపజయాలపట్ల సమబుద్ధిగలవాడు, సందేహారహితుడు, ఈర్ష్యారహితుడు బంధాలతో చిక్కుకోడు. ఈశ్వరప్రీతిగా మాత్రమే కర్మలు చేయు వానికి ప్రారబ్ధం కూడా నశిస్తుంది. కానీ బాధించవు. ఇవ్వబడునది, ఇచ్చేవాడు, ఇచ్చుటకు ఉపయోగించే పదార్ధములు కూడా బ్రహ్మమే. జ్ఞానాన్ని తెలుసుకుంటే సమస్తాన్ని నీయందే చూడవచ్చు, మోహానికి గురి కావు. కర్రలు అగ్నిచేత, కర్మలు జ్ఞానం చేత దహింపబడతాయి. కర్మయోగ స్థితి పొందినవారు జ్ఞానాన్ని తనలోనే చూసుకుంటాడు. శ్రద్ధ జ్ఞానం లేనివారు సందేహాలు కలిగిన వారు నమ్మకం లేనివారు చెడిపోతారు. ఇహపరాలకు దూరం అవుతారు. సన్యాసమంటే ఏమిటి? కోరికలతో కూడిన కర్మలను చేయక పోవడమే సన్యాసం. త్యాగమంటే ఏమిటి? చేసిన కర్మఫలాలను భగవంతునికి సమర్పించడం త్యాగమని పండితులు చెబుతున్నారు. ఆత్మగా ఉండాలంటే ఏమి చెయ్యాలి? ఇంద్రియాల వెంట పరుగు పెడుతున్న మనస్సును ఆత్మవైపు అంతర్ముఖం చెయ్యాలి. ఇంద్రియాలు వాటి పని అవి చేస్తున్నప్పటికీ నిశ్చలంగా ఉండగలగడం ఆత్మగా ఉండడానికి ప్రయత్నం చెయ్యడం, ఆత్మ సాక్షిగా చూస్తోందని గ్రహించడం. తాను ఎల్లప్పుడూ సచ్చిదానందస్వరూపమని నిరంతరం ధ్యానం చేస్తూ ఉండాలి. బ్రహ్మమును ఏ మహనీయుడు తన బుద్ధి యందు హృదయ కుహరమునందు ఉన్నాడని తెలుసుకొనుచున్నాడో అతడు జ్ఞానస్వరూపుడగు బ్రహ్మం లోఉండి, బ్రహ్మం తో బాటు సకల కార్యములను చేయుచు, బ్రహ్మ స్వరూపమే తన సహజ స్వరూప స్థితి అని గ్రహించి బ్రహ్మానందాన్ని పొందగలడు.
సూత్రం :- 15
"'మాంత్ర వర్ణిక మేవ చ గీయతే "
చ- అంతేకాక , మాంత్ర వర్ణికమ్ ఏవ :- ఉపనిషత్ మంత్రాలు బ్రహ్మం ఆనందమయమని, గీయతే;- కీర్తిస్తున్నాయి.
భావం :- ఉపనిషత్ మంత్రాలు బ్రహ్మం ఆనందమయమని కీర్తిస్తున్నాయి. మంత్రాల్లో చెప్పబడినట్టి బ్రహ్మమే బ్రాహ్మణంలో గానం చేయబడుతున్నది. సత్యం. జ్ఞానం, అనంతం, బ్రహ్మ ఆకాశాది పంచభూతాలను ఆ బ్రహ్మమే సృష్టించింది.
వివరణ:- తైత్థరీయోపనిషత్తు :- హృదయంలో జీవాత్మ అంతర్యామిగా వ్యాపించి ఉన్న బ్రహ్మాన్ని తెలుసుకొని ప్రకృతి బంధాలనుండి విడిపోయి, శుద్ధ బ్రహ్మంతో కూడి బ్రహ్మానందాన్ని పొంది నిర్భయుడవుతాడు. కాబట్టి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే వాక్యంలోని బ్రహ్మమే ఆనందం, బ్రాహ్మణంలో ఉన్న బ్రహ్మమే ఆనందమయుడు అని కీర్తింపబడుచున్నాడు. ఇది తైత్తరీయోపనిషత్తులో బ్రహ్మ ఆనందవల్లి అధ్యాయంలో బ్రహ్మలక్షణ వాక్యం. ఆకాశం, వాయువు, అగ్ని, జలము, పృధ్వి లను సృష్టించింది బ్రహ్మమే. తరువాత ఆభూతాలలో ప్రవేశించి బుద్ది రూపమైన గుహలోనే పరబ్రహ్మ ఉన్నాడు. వారుణి విద్యలో వరుణ మహర్షి కుమారుడు భృగు మహర్షి విద్యాభ్యాసం పూర్తిచేసి బ్రహ్మోపదేశం చెయ్యమని తండ్రిని అడుగుతాడు. బ్రహ్మవిద్య ఉపదేశిస్తే తెలిసేది కాదు.తపస్సు చేసి తెలుసుకోమన్నాడు. అలా తపస్సు చేసి భ్రుగువుకు వరుసగా అన్నం, ప్రాణం, మనస్సు, విజ్ఞానం, ఆనందానికి కారణం కావనీ, చివరకు ఆనందమే బ్రహ్మమని తెలిసింది. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ :- ఇది తైత్తరీయోపనిషత్ లో బ్రహ్మ ఆనందవల్లి అధ్యాయంలో బ్రహ్మలక్షణాల వాక్యం.
1.సత్యం :-ఇది పారమర్ధిక సత్యం, త్రికాల సత్యం అని తెలుసుకోవాలి. భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఇది సత్యం. సత్యమనేది ఎప్పుడు ఒక్కటే. రెండవది ఉండదు. శృతి ప్రమాణం. మన అనుభవాలు జాగ్రత, స్వప్న, సుషుప్తి వ్యవస్థలలో ఆత్మ ఉన్నది. ఒక కాలంలో ఉండి ఇంకో కాలంలో ఉండకపోవడం ఉండదు. త్రికాలములలో ఆత్మ సత్యమైనది. సత్యం రెండు రకాలు. పారమర్ధిక సత్యం, వ్యావహారిక సత్యం. సూర్యుడు ఎల్లప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు. అది పారమార్ధిక సత్యం. సూర్యుడు పగలు కనిపిస్తాడు, రాత్రి కనబడదు.అది వ్యావహారిక సత్యం. తల్లి గర్భంలో పిండం ఆత్మరూపమే. శిశువు లోపల బయట, ఆత్మను తెలుసుకున్నవారిలో, తెలుసుకోలేనివారిలో త్రికాలములలో ఉండేది ఆత్మే. అనిత్యమై మార్పుల చెందే దృశ్యప్రపంచానికి ఆధారమైనది, నిత్యమైనది, ఆత్మ. సృష్టి స్థితి లయ ఆత్మ వలననే జరుగుతున్నాయి. 2. జ్ఞానం :- జ్ఞాన స్వరూపం దేహేంద్రియ మనోబుద్ధుల్ని ఎల్లప్పుడూ తెలుసుకుంటూ, వృత్తులను తెలుసుకుంటూ ఉండే ఆత్మచైతన్యం జాగ్రదావస్థలోనే కాదు సుషుప్తిలో కూడా ఏ అనుభవాలు లేని వ్యవస్థలో కూడా ఆత్మ తెలుసుకుంటూనే ఉంటుంది. ఏమి ఉన్నా లేకపోయినా మనస్సు, బుద్ధి ఉన్నా ఆత్మ అక్కడే ఉంటుంది అని తెలుసుకోవడమే జ్ఞాన స్వరూపం.
3.అనంతం:- అంతం లేనిది అఖండమైనది, అపరిమితమైనది అటువంటి ఆనందమయమైన ఆత్మను నేను, సత్యం జ్ఞానం అనంతం లక్షణాలున్న ఆనందం నేను, ఆత్మ పరబ్రహ్మమైతే నేను కూడా పరబ్రహ్మమే, అహం బ్రహ్మాస్మి అని విచారణ చేసి, విశ్లేషణ చేసి, నేను ఆత్మను అనే జ్ఞానాన్ని స్థిరపరచుకోవాలి. అదే మోక్షం. అలా భావన చేస్తుంటే అజ్ఞానం అంతా తొలగిపోయి ఆత్మనే అవుతారు.
సూత్రం :- 16
"నేతరో నుపత్తేః"
ఇతరః:- బ్రహ్మం కన్నా ఇతరుడైన జీవాత్మ న :- ఆనందమయం కాదు. అనుప పత్తేః:- జీవాత్మ ఆనందమయుడనటం యుక్తి కాదు.
భావం :- జీవాత్మ సత్యాన్ని సృష్టించలేదు. బ్రహ్మ కన్నా ఇతరుడైన జీవాత్మ ఆనందమయుడనటం యుక్తి కాదు. బ్రహ్మమే ఆనందమయం.
వివరణ :- బ్రహ్మం సంకల్పించి ఈ బ్రహ్మాండంలో ఉన్నదంతా సృష్టించాడు. ఇది పరమాత్మకు చెల్లుతుంది. ఆనందమయుడు అనే శబ్దానికి అర్ధం పరబ్రహ్మము కన్నా ఇతరులు ఎవరూ లేరు. సృష్టి ప్రారంభానికి ముందు పరమాత్మ సృష్టి చెయ్యాలి అని కోరుకున్నాడు. ఈరకంగా కోరడం అనే ధర్మం జీవుడుకి వర్తించదు. అది బ్రహ్మానికి వర్తిస్తుంది. గురువు గారు! పరమాత్మ నిరాకరుడు, నిర్గుణుడు దేని యందు ఆసక్తి లేనివాడు కదా! మరి సృష్టి , స్థితి , లయ ఎందుకు చేస్తున్నాడు? వీటితో అతనికి సంబంధం ఏమిటి? అసలు సృష్టి చెయ్యడం అతని లక్షణమా? లేక తన వినోదం కోసం చేస్తున్నాడా? అని ప్రశ్నించాడు కృష్ణ శర్మ. రత్నాకరుడు ఇలా చెబుతున్నాడు, భగవంతుడు ఆకారం లేనివాడు. ఇచ్చారహితుడు గుణ రహితుడు నిజమే, అయినా ఈ సృష్టి ఎందుకు చేస్తున్నాడు? అన్నదే సందేహం. ఈ పరబ్రహ్మ సృష్టి చెయ్యాలి అనుకొని తనలోని కొంత శక్తిని బయటకు పంపాడు. అయితే అసలు సృష్టి ఎందుకు చెయ్యాలని అనుకున్నాడు? గతంలో ప్రళయం సంభవించినప్పుడు కర్మ పరిపక్వం కాకుండా తనలో లీనమైపోయిన జీవరాశుల యొక్క కర్మ క్షయం చేసి, వారికి మోక్షం కలిగించాలని ఆలోచనలో సృష్టి చేయాలని సంకల్పించాడు. జగత్తు అంతా లయం అయిపోగానే జీవరాశి అంతా నశించిపోయింది. వస్తుజాలం రూపుమాసిపోయింది. ఈ పరిస్థితిలో కర్మ క్షయం చెందిన జీవరాశులు పరమాత్మలో లీనమైపోయాయి. అంటే సాయుధ్యం పొందాయి. మరి క్షయం కానీ జీవుల గతి ఏమిటి? కర్మఫలాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మ ఎత్తాలి కదా! మరి అవి ఏ విదంగా పరబ్రహ్మంలో కలసిపోతాయి? అన్నదే ప్రశ్న. ప్రళయకాలంలో కర్మక్షయం అయిన జీవరాశితో బాటు మూట కట్టుకొని పరమేశ్వరుడిలో లీనమౌతాయి.ఇంకా కర్మలు అనుభవించవలసిన జీవరాశులు వారి కర్మలను క్షయం చేసి మోక్షం ప్రసాదించాలనే కోరికతో సృష్టి కార్యక్రమం చేస్తున్నాడు. సృష్టించడం అనేది జీవులకు మోక్షాన్ని ఇవ్వడానికే కానీ తన లీలావినోదం కోసం కాదు.
ఐతరేయోపనిషత్తు:- ఆత్మయే ఆలోచనాపూర్వకంగా ఈ లోకాలను సృష్టించింది. సృష్టి జరగడానికి ముందు జగత్తు అంతా బ్రహ్మమయంగా ఉండేది. దానికి భిన్నంగా పదార్ధం లేదు. దానినే ఆత్మ అంటారు. తోలుబొమ్మలాటలో తెరమీద తోలుబొమ్మలు కథలోని అంశాలకు అనుగుణంగా కదులుతూ, మాట్లాడుతూ, చలిస్తుంటాయి. మనకు బొమ్మలు సహజంగా నటిస్తున్నట్లు కనిపిస్తాయి. కానీ వాటిని కదిలించే సూత్రధారి పైన కూర్చుని వాటిని ఆడిస్తుంటాడు. బ్రహ్మ కూడా జీవులందరిని తోలు బొమ్మల్లా ఆడించే సూత్రధారి. జీవులు కేవలం జడమైన పాత్రధారులు మాత్రమే. ఉన్నది ఒక్కటే పరబ్రహ్మమైనప్పుడు రెండవది లేనప్పుడు ఆనందమయం పరబ్రహ్మమే అవుతాడు. జీవాత్మ ఆనందమయుడు అనడం యుక్తి కాదు.
సూత్రం:- 17
'భేద వ్యపదేశాచ్చ"
'చ:- ఇంకా భేద వ్యపదేశాచ్చ:- జీవాత్మని వేరుగా చెప్పడం వలన అతడు ఆనందమయుడు కాదు.
భావం :-జీవాత్మకు పరమాత్మకు భేదం చెప్పడం వలన జీవుడు ఆనందమయుడు కాదు అని తెలుస్తోంది. ఇద్దరు ఒక్కటే అజ్ఞానం వలన రెంటికి తేడా ఉందని అనుకుంటున్నారు.
వివరణ:- వాస్తవంగా చూస్తే జీవాత్మకు పరమాత్మకు భేదం లేదు. కానీ యదార్ధం తెలియక అజ్ఞానం వలన ఈ రెండింటికి మధ్య తేడా ఉందని అనుకుంటారు.
ముండకోపనిషత్తు:- ఈ విషయమే ఈ ఉపనిషత్తులో వివరించడం జరివింది. ఒకే చేటు మీద రెండు పక్షులు కూర్చుని ఉన్నాయి.1.పరమాత్మ.2.జీవాత్మ ఆ రెండు ఒక్కటే అయినప్పటికీ అజ్ఞానం వలన రెండింటికి తేడా ఉందని అనుకుంటారు. పరమేశ్వరుడు లోకాలకు ప్రాణులను సృష్టించిన తరువాత బ్రహ్మరంద్రం గుండా ప్రాణులలో ప్రవేశించి నవరంద్రాలతో కూడిన ఈ దేహంలో ఉంటూ గుండె, ప్రాణులలో ప్రవేశించి ఇంద్రియాలతో అన్ని సుఖాలు అనుభవిస్తూ, బయటకు పోయే మార్గం తెలియక పంజరంలో బంధించిన పక్షిలాగా కొట్టుమిట్టాడుతుంటాడు. అతడు శరీరంలో ఉన్నంత వరకు ఈశరీరాన్ని, ఉన్న బంధాలను తనవే అనుకుంటాడు. అతడే జీవాత్మ. జీవాత్మ కనుక వచ్చిన త్రోవనే బ్రహ్మరంద్రం ద్వారా బయటకు వెళ్లగలిగి నట్లైతే అది పరమాత్మతో లీనం అవుతుంది. అంతవరకు అజ్ఞానంతో ఉన్న పరబ్రహ్మ వేరని తెలుస్తోంది. అంతే కాని నిజానికి ఒక్కటే. ఆనందమయమే రసం. ఆ రసాన్ని పొంది జీవాత్మ ఆనందిస్తాడు. అలా ఆనందించలేకపోవడానికి కారణం మాయ. ఈ ప్రకృతే మాయగా సృష్టించబడింది. అసలు మాయ అంటే ఏమిటి? మాయలో పడటమే ఈ జీవితంలో అన్నింటి కన్నా ఆశ్చర్యకరమైన విషయం. ఈ జీవితమనే అడవిలో మన మనస్సు అజ్ఞానంతో, దారితెన్ను తెలియక, తికమక పెడుతూ ఉంటుంది. ఈ ప్రకృతి మన ఇహలోక జీవితం శాశ్వతం సంపూర్ణం ఎన్నటికీ మారనిది సుఖమైనది అంటుంది. దీనికి మన మనస్సు అంటుకుపోయినంత కాలం మనజీవితం తాత్కాలికంగా అసంపూర్ణమే. నిరంతరం మార్పులు చెందుతూ కొరతలతో కూడినదై విచారకరమైనది దుఃఖభూయిష్టమైనది. గత జన్మల కర్మల స్వభావమును బట్టి మనం ఇహలోకంలో ఆశలు పెంచుకొని, రాగద్వేషాలతో, ఆశలు కోరికలు కలుగుతుంటాయి. నాది అనే మమకారం నేను అనే అహంకారం అనే మాయలో పడి అనేక వస్తువులు కోరుకుంటాం. వ్యాధులు మరణాలు వద్దనుకుంటాం.మహా మేధావులు మనిషికి కోరికలు ఉండాలి లేకపోతే చచ్చినట్లేనని అంటారు. తల్లిదండ్రులను, జన్మను, బంధువులను, మరణాన్ని, ఎప్పుడు ఏది జరగాలో కోరుకున్నట్లే జరగాలని భ్రమపడతాం. ఈ మూర్ఖత్వమే అజ్ఞానం అని గ్రహించాలి.
కేనోపనిషత్తు :- బ్రహ్మం వలన మనస్సును ప్రేరేపించి పంచేంద్రియాలను, బుద్ధి, అహంకారం, పంచకర్మేంద్రియాలకు శక్తి సామర్ధ్యాలు ఇచ్చి వాటియొక్క కార్యకలాపాలకు మూలమైనది. సర్వకార్యకలాపాలకు బ్రహ్మమే మూలమని సర్వం బ్రహ్మమయమని జ్ఞానం పొందిన మహనీయులు తెలియగలదు. అట్టి మానవోత్తములకే సర్వసృష్టి బ్రహ్మమయంగా గోచరించును. సచ్చిదానందస్వరూపమగు బ్రహ్మం మినహా ఇతరమేవియు బ్రహ్మిభూతులకు గోచరించదు. దేహేంద్రియ మనోబుద్ధులకు శక్తిని కలిగించేది బ్రహ్మం. అందువలన వాటి గ్రహణశక్తి ద్వారా బ్రహ్మం గోచరించుట అసంభవం. ఆధ్యాత్మిక పరిభాషలో ఇంద్రియప్రేరితములైన కార్యకలాపములు, విషయ వృత్తులు, నిగ్రహం లేని మనో వికారం, దేహభ్రాంతి నుండి సాధకుడు విముక్తి పొందాలి. అట్టి విముక్తి శమదమాదుల వలన, వివేకవైరాగ్యముల వలన కలుగును. తరువాత శ్రవణమనననిధిధ్యాసల వలన కలుగును. ఈసాధనాలు చిత్తశుద్ధితో తీవ్రతరం చేస్తూ అంత శీఘ్రంగా జ్ఞానాగ్ని రగుల్కొని నిజస్వరూపమగు ఆత్మయందు బ్రహ్మానందభరితుడగును. పూర్వజన్మ సుకృతం వలన సత్యాన్వేషణ చేయుటకు మోక్షాసక్తులై ప్రయత్నించుచున్న ముముక్షువులలో ఒకానొకడు మాత్రమే పరమాత్మను తెలుసుకొని నిజస్వరూపమగు జ్ఞానం కలవాడగును. జీవాత్మ పరమాత్మకు భేదం లేనప్పటికీ ఆనందమయుడు నిమిత్తకారకుడైన బ్రహ్మమే అవుతాడు కానీ జీవాత్మ కాదు.
సూత్రం :-18
"కామాచ్చ నానుమానాపేక్ష"
కామాత్:- కోరిక ఉన్నందువల్ల, అనుమానాపేక్ష :-ప్రకృతి కూడా, న:- ఆనందమయం కాదు. కోరిక :-సంకల్పం, చేతన:- ధర్మం వలన
భావం:-ప్రకృతి జడమైనది. కామం చేతన ధర్మం ప్రకృతిలో చేతన ధర్మమైన సంకల్పం ఉండదు. సంకల్పించేది బ్రహ్మ ధర్మం కాబట్టి ఆనందమయశబ్దం ప్రకృతికి వర్తించదు.
వివరణ :- తైత్తరీయోపనిషత్తు:- కామము అంటే కోరిక. అతను కామించాడు అంటే సంకల్పించాడు అని అర్ధం. కోరిక ప్రకృతి ధర్మం కాదు. ప్రకృతి అచేతనం, జడం, కామం చేతన ధర్మం. ప్రకృతి ఆనందమయం అయితే అందులో చేతనధర్మమైన సంకల్పం కూడా ఉండాలి కదా! అలా లేదు కదా! కామం సంకల్పం అనేవి బ్రహ్మధర్మం, అందుకే ఆనందమయశబ్దం బ్రహ్మ వాచకమే.
చతుర్విధ పురుషార్ధములు:- మానవ జీవితం యొక్క నాలుగు లక్ష్యాలు...1. ధర్మ:- ధర్మానికి నైతిక విలువలు. 2.అర్ధ :-శ్రేయస్సు, ఆర్ధిక విలువలు. 3.కామ:ఆనందం, ప్రేమ, మానసిక విలువలు 4.మోక్షం :-విముక్తి, ఆధ్యాత్మిక విలువలు. మూడవపురుషార్ధమైన కామం కళలు, భావోద్వేగాలు, ప్రేమ శృంగారం సంబంధాలు, ఇతర శాస్త్రాల ఆనందం కోసం అన్వేషిస్తారు. ధర్మం విసర్జిస్తే అర్ధం, కామం, లాభం మరియు ఆనందం సామాజిక గందరగోళానికి దారితీస్తుంది. ఈ మాయా ప్రపంచంలో మనిషి మనస్సే కోరికల పుట్ట. కోరికలే బంధాలకు మూలం. కోరికలు సాగరతరంగాల వలే ఒకదాని వెంట మరొకటి పుట్టుకొస్తూనే ఉంటాయి. ఒక కోరిక తీర్చుకోగానే దాని వలన ఆనందం వచ్చినా, అది తాత్కాలికమైనదే. మరల ఇంకో కోరిక దానిని సాధించుకోవడానికి అనేక ప్రయత్నాలు చెయ్యడం, అనుకున్నది జరిగితే ఆనందం, లేకపోతే దుఃఖం కలుగుతుంది. సుఖదుఃఖాలకు హేతువు సంకల్పాలే. అర్ధము, కామము, ధర్మాలయొక్క ప్రాధాన్యత సహజంగా వయస్సును బట్టి మారుతూ ఉంటాయి. చిన్నపిల్లలకు ఆటలమీద, విద్యపట్ల మక్కువ ఎక్కువగా ఉంటుంది. యుక్తవయస్సు వచ్చినవారికి ఒకరి పట్ల ఒకరికి మనస్సులో అనురాగం ఉండాలని వారి సాంగత్యం కోరుకుంటారు. కుటుంబాన్ని పోషించుకోవడానికి సంపాదన మీద కోరిక కలుగుతుంది. ఆఆశ ఉండటం తప్పు కాదు, ధర్మబద్ధమైన సంపాదనే ఉండాలి. కానీ సంపాదనే జీవితం కాకూడదు. అదే తృష్ట అవుతుంది. సర్వకాల సర్వావస్థలలో డబ్బు గురించే ఆలోచిస్తూ తన స్థితి తాను మరచిపోయి, తన దృష్టికి వేరే ఏమి కనబడని స్థితికి చేరకూడదు. ఇక వృద్ధాప్యంలో మనస్సు భగవంతుని వైపు మరల్చాలని కోరిక ఉంటుంది. లేదా పిల్లల ప్రేమ పొందాలని వారి ఆశ్రయంలో సుఖంగా ఉండాలని కోరిక ప్రగాఢంగా ఉంటుంది. ఆనందం, కోరిక, మానవ ప్రవర్తనను నడిపిస్తుంది. ఇది ఇంద్రియాలకు సంబంధించినది. కానీ కళ, సంగీతం, అందం, ప్రేమ, సాన్నిహిత్యం, ఆప్యాయత, దయ ఇవి జీవితానికి ఆనందాన్నిస్తాయి. సరిఅయిన సంకల్పం ధర్మం వైపు నడిపిస్తుంది. దానిని ఎంతో దృఢనిశ్చయంతో నెరవేర్చడానికి సహాయ పడుతుంది. మితిమీరిన కోరికలు అనర్ధ దాయకం. అతిగా తినడం, వ్యసనం, బద్ధకం, దురాశ, కామానికి దారి తీస్తుంది. కోరికను అనుసరించే సంకల్పం ఉంటుంది. దురదృష్టవషత్తు కామము అనగానే సెక్స్ మాన్యువల్ గా తప్పుగా అన్వయించబడింది. ఇది వాస్తవానికి ధర్మం, దయగల జీవనానికి మార్గదర్శి. ఇది ప్రేమ యొక్క స్వభావం గురించి కుటుంబజీవనం మరియు మానవజీవితం లోని ఆనందం గురించి చర్చిస్తుంది. కోరిక వస్తువును కనుగొనడం, వస్తువు గురించి నేర్చుకోవడం, బావోద్వేగ సంబంధాన్ని ఏర్పరచడం, ఇంద్రియ అనుభవం గురించి తెలియజేస్తుంది. ఎవని కర్మాచరణములు కామ సంకల్పములు కావో, ఎవని కర్మలు జ్ఞానమనే అగ్నిచే కాల్చబడినవో అట్టివారిని పండితులని విద్వాంసులని భగవద్గీతలో చెప్పబడింది. మనస్సు యొక్క కోరికలకు సూచనలు ఇచ్చే జడమైన బుద్ధికి చైతన్యశక్తిని ఇచ్చేది బ్రహ్మమే కనుక బ్రహ్మమే ఆనందమయమని మనస్సులో కలిగే కోరికలు, ప్రకృతి ధర్మంకానేరదు అని గ్రహించాలి.
సూత్రం :- 19
'"అస్మిన్నశ్యచ తద్యోగం శాస్తి '
అస్మిన్:- ఆనందమయమైన బ్రహ్మంలోనే అస్య:-ముముక్షువైన ఈజీవుడికి తత్యోగం:-మోక్షప్రాప్తిని శాస్ట్రిచ :-శాస్త్రాలు శాసిస్తున్నాయి.
భావం:- ఆనందమయమైన బ్రహ్మంలోనే ఈ జీవుడికి మోక్షప్రాప్తి కలువుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. సత్వరజస్తమో గుణాలతో కూడిన ప్రకృతి ఆనందమయం కాదు అని సూత్రానికి అర్ధం.
వివరణ:- తైత్తరీయోపనిషత్తు :- ఆనందమయమైన బ్రహ్మంలోనే ముముక్షువునకు అభయ ప్రాప్తి, మోక్షం కలుగుతాయి. ప్రకృతి పట్ల ప్రాపంచిక వ్యవహారాలలో మునిగిపోయి సంసారసాగరంలో బంధీ అయినవానికి మోక్షప్రాప్తి కలుగదు. భయమే కలుగుతుంది. ప్రకృతి సదా పరిణామం చెందుతూ ఉంటుంది.దానికి సాత్విక , రాజస, తామస, అవస్థలు కారణమౌతాయి. అందువలన జీవుడికి అభయం లభించదు. అజ్ఞాని అయిన వాడికి జ్ఞానసముపార్జన జరిగిన తరువాత అతని ఆత్మ పరమాత్మతో లీనం అయిపోతుంది. పరమాత్మ యందు తాదాత్మ్యం గలవాడికి సంసారబంధాలు ఉండవు. ద్వైదిభావం ఉన్నవాడికి సంసారం భయం ఉంటుంది.
1.సత్వగుణం:- సత్వగుణం రజోగుణం తమోగుణములలో సత్వగుణం స్వఛ్చమైనది. నిర్మలమైనది. ప్రకాశవంతమైనది. ఎటువంటి ఒడిదుడుకులు ఉపద్రవాలు లేనిది. ప్రకృతిలో 3 గుణాలు ఒకదానితో ఒకటి కలసి ఉన్నాయి. ఒకే గుణం ఉన్న జీవి ఉండదు. ఎందుకంటే ఏ పని చేయడానికైనా రజోగుణం కావాలి. పనిచేసి అలసిపోతే విశ్రాంతి తీసుకోవడానికి నిద్ర పోవడానికి తమోగుణం కావాలి. పరమసాత్విక గుణం కలవారికైనా రజోగుణం, తమోగుణం లేకపోతే జీవితం సాగదు. కాకపోతే సత్వగుణం ఎక్కువగా రజస్తమోగుణాలు కొద్దిపాళ్ళల్లో ఉన్నవారికి శుద్ధసత్వగుణ సంపన్నుడు అంటారు. వీరు ప్రకాశవంతంగా, నిర్మలంగా, ఉంటారు. తెలివితేటలతో వెలిగిపోతుంటారు. సోమరితనం ఉండదు. విషయగ్రహణ శక్తి, ధారణా శక్తి అంటే జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుంది. మనస్సు నిర్మలంగా చెడు ఆలోచనలు లేకుండా ఒత్తిళ్లకు లోనుకాకుండా ప్రశాంతంగా సమత్వబుద్ధి కలిగివుంటారు. ఈ సత్వగుణంతో బాటు మానవసహజమైన అహంకారం చేరుతుంది. దీనినే సాత్వికాహంకారం అంటారు. నేను పండితుడను, పరమ భక్తుడను, జ్ఞానిని, నాకంతా తెలుసు, నేను పరమయోగిని, దేవుడు నాకు కనబడతాడు ,అని కొందరు స్వామిజీలు అనడం మనం వింటుంటాము. మోక్షాన్ని పొందాలంటే ఈ సాత్వికాహంకారం ఉండకూడదు.
2..రజోగుణం:- రజోగుణం ప్రాపంచిక విషయాల మీద రాగం అంటే ఆసక్తిని కోరికలను కలువజేస్తుంది. రజోగుణం నుండి తృష్ణ, కోరికలు పుడతాయి. ఆ కోరికలు తీరడం కోసం అనేక కర్మలు చేస్తారు. అవి జీవాత్మకు బంధిస్తాయి. ప్రాపంచిక విషయాల పట్ల తృష్ణ, ఆసక్తి, ప్రేమ, ప్రీతి కలగడమే కాకుండా అవి స్వంతం చేసుకోవాలి అనే కోరిక కలుగుతుంది. అదే తృష్ణ అంటారు. అది కోరికకు పరాకాష్ట. కోరినది దొరికితే అభిమానం, చేజారిపోతుందేమోనని భయం కలిగి, ఇవే బంధములకు కారణమౌతోంది. కోరికలు ఉండటం తప్పుకాదు. శృతి మించిన కోరికలు, అవి లేకపోతే బ్రతకలేము అనే తృష్ణను పెంచుతాయి. దీనివలన దుఃఖమే కానీ సుఖం ఉండదు.
3..తమోగుణం:-ఇది సకల జీవరాశులకు మోహాన్నీ కలుగజేస్తుంది. ఈ తమోగుణం పరాకుగా ఉండటం, నిర్లక్యం, సోమరితనం, నిద్ర, మొదలైన లక్షణాలతో ఉంటారు. మానవులలో అజ్ఞానం సహజం. లేనిదానిని ఉన్నట్లుగా భ్రమచెందటమే అజ్ఞానం. తాడుని చూసి పాము అనుకొని భయపడటమే అజ్ఞానం. ఎంతమంది మరణిస్తున్నా, తను మాత్రం శాశ్వతంగా ఉంటాననుకోవడం, సుఖం వచ్చినప్పుడు గంతులేయడం, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోవడం, అజ్ఞానం. ప్రపంచంలో ఏ వస్తువు శాశ్వతం కాదు, మార్పుచెందేవి, నశించేవి అని తెలిసినా వాటికోసం వెంపర్లాడటం అజ్ఞానం. తమోగుణం ఈ అజ్ఞానం లోనుంచి పుట్టినదే. ప్రాపంచిక వస్తువులమీద మోహం కలిగిస్తుంది. ఆలోచనాశక్తి, విచక్షణా జ్ఞానాన్ని నశింజేస్తుంది. మొండితనాన్ని మూర్ఖత్వాన్ని పెంచుతుంది. ఈ తమోగుణం ఉన్నవారు ఎప్పుడు పరధ్యానంగాఉండటం, ఏ పని మీద శ్రద్ధ లేకపోవడం, సోమరితనం, ఎప్పుడు నిద్రపోవడానికి సుముఖత చూపడం ఇవన్నీ తమోగుణం లక్షణాలు. ఈ అజ్ఞానం ఉన్నవారు సంసారబంధాలలో సులభంగా చిక్కుకుంటారు. అందుకే ఈ తమోగుణాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నించాలి. జీవుడు సంసారబంధనాలలో చిక్కుకొని దుఃఖసాగరంలో మునిగిపోతున్నాడు.అజ్ఞానం తొలగిపోగానే సంసారబంధం త్రెంచుకొని ఆనందమయమైన పరమాత్మతో లీనమైపోతాడు.ఈ రకంగా ఆనందమయుడు చైతన్యమైన బ్రహ్మమే కానీ జడమైన ప్రకృతి కాదు.
తైత్తరీయోపనిషత్తు.బ్రహ్మనిష్ఠలో అంతరాయం కలిగి ,ప్రకృతి నిష్ఠ వున్న ముముక్షువునకు భయమే కలుగుతుంది. అభయప్రాప్తి , మోక్షం కలుగదు.ఆనందమయం బ్రహ్మమే కాని ప్రకృతి కాజాలదు.
అంతరధికరణం ( 1,1,20 )
సూత్రం ..20
"' అంతస్త ద్ధర్మోపదేశాత్'"
తత్ ధర్మ ఉపదేశాత్ :-పాపరహితంలాంటి బ్రహ్మధర్మం ఉపదేశించడం వలన అంతః :-బ్రహ్మమే అని గ్రహించాలి.
భావం :-పాపరహితమైన బ్రహ్మధర్మాలు ఉపదేశించడం వలన అంతః శబ్దానికి అర్ధం బ్రహ్మమే అని గ్రహించాలి.
వివరణ:-ఛాందోగ్యోపనిషత్తు:-ఆదిత్యుడిలోను అక్షిలోను ఉండే అంతఃపురుషుడు ఉపాస్యుడు అయితే ఈపురుషుడు జీవాత్మా? పరమాత్మా? బ్రహ్మం సర్వవ్యాపి కదా! ఇలాంటి బ్రహానికి సూర్యుడు కానీ, నేత్రం కానీ, ఎలా ఆధారం అవుతుంది? ఛాందోగ్యంలో ఆయనకు బంగారురంగు కేశాలున్నాయని వర్ణించారు. ఇలాంటి రూపం జీవాత్మకు ఉంటుంది కదా !బ్రహ్మానికి రూపం లేదు కదా! అని ఉపనిషత్తు అంటోంది. బ్రహ్మకు శరీరం లేదు. శబ్దస్పర్శరూపాలు లేవు. సర్వపాపరహితుడు, నిర్మలుడు, ధర్మాలు బ్రహ్మకు చెందుతాయి. యోగదర్శనంలో ఈశ్వరుడికి కేశములతో సంబంధం లేనివాడని వర్ణించారు. కాబట్టి అక్షిలో ఉండే అంతఃపురుషుడు బ్రహ్మమే. యోగదర్శనంలో బ్రహ్మలక్షణాలు:-సృష్టి స్థితి లయ కారకుడు పరమేశ్వరుడు తనలో అంతర్గతంగా ఉన్న సృష్టిని బహిర్గతం చెయ్యడం, ఉన్న సృష్టిని తనలోకి లయం చేసుకోవడం, సకల చరాచర సృష్టిని స్థితి చేస్తున్నాడు. పరబ్రహ్మ అంటే ఎవరు? జీవులు దేనివలన జన్మిస్తున్నాయో చివరకు దేనియందు లయమౌతున్నాయో అదే పరబ్రహ్మము. వరుణ మహర్షి కుమారుడు భృగు మహర్షి విద్యాభ్యాసం పూర్తి చేసి, బ్రహ్మ విద్యను బోధించమని, పరబ్రహ్మస్వరూపం ఎక్కడ ఎలా ఉంటుందో, చెప్పమని తండ్రిని కోరతాడు. చరాచర జగత్తు ఎవరి వలన అవిర్భవిస్తోందో, ఎవరి వలన పోషింపబడుతుందో, లయమౌతోందో అదే పరబ్రహ్మ. అన్నం, ప్రాణం, చక్షువు, శ్రోతం, మనస్సు పరబ్రహ్మస్వరూపాలే. ఒకరు చెబితే తెలిసేది కాదు .ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి కానీ పరబ్రహ్మస్వరూపం ఇదేనని చెబితే తెలిసేదికాదు. స్వయంగా ఆత్మానుభవం పొందాలి. తపస్సు చేసి తెలుసుకోమని సలహా ఇచ్చాడు తండ్రి. భృగువు కొన్నాళ్ళు తపస్సు చేసి తిరిగి వచ్చి అన్నమే పరబ్రహ్మస్వరూపం, అన్నం వలననే ఈ జగత్తు జీవిస్తోంది,ఆహారం తీసుకోకపోతే శరీరం ప్రాణాలతో ఉండదు. కనుక అన్నమే పరబ్రహ్మము అని తెలిసింది అన్నాడు. అన్నం జీవులకు ఆహారమే కానీ, అన్నమే పరబ్రహ్మము కాదు మళ్ళీ తపస్సు చెయ్యి అన్నాడు తండ్రి. మళ్ళీ కొన్నాళ్ళు తపస్సు చేసి తిరిగి వచ్చి ఇప్పుడు ప్రాణమే పరబ్రహ్మము అని తెలుసుకున్నాను. ప్రాణం ఉంటేనే శరీరం లేకపోతే చనిపోతారు, కళేబరం అంటారు, కనుక ప్రాణమే పరబ్రహ్మము అన్నాడు. ప్రాణం పరబ్రహ్మము కావచ్చును. కానీ ప్రాణమే పరబ్రహ్మము కాదు. మళ్ళీ తపస్సు చెయ్యమన్నారు తండ్రి. భృగువు మళ్ళీ కొన్నాళ్ళు తపస్సు చేసి తిరిగి వచ్చితండ్రి! మనస్సే పరబ్రహ్మము అని తెలుసుకున్నాను. మనస్సు వలననే స్త్రీపురుషులు ఆకర్షించబడి సృష్టి జరుగుతోంది. అన్నింటికన్నా ముఖ్యమైనది మనస్సే, అందుకే మనస్సే పరబ్రహ్మము అన్నాడు. కాదన్నారు తండ్రి. మళ్ళీ తపస్సు చేసి తిరిగివచ్చి విజ్ఞానమే పరబ్రహ్మము అన్నాడు. విజ్ఞానం అంటే లౌకికవిషయాల గురించి పరిజ్ఞానం, సాధనా సంపత్తిని తెలుసుకోవడం పరబ్రహ్మము కాదు అన్నాడు. మళ్ళీ తపస్సు చేసి తండ్రి! ఈ సారి తెలుసుకున్నది ఆనందమే పరబ్రహ్మము. ఆనందం వలననే జీవులు బ్రతుకుతున్నాయి అని చెప్పగానే వరుణమహర్షి మహదానందం చెంది కుమారుడికి బ్రహ్మవిద్య బోధించాడు. సత్యం, జ్ఞానం, ఆనంతం, బ్రహ్మ. సత్యం ,నిత్యం, శాశ్వతమైనవాడు, అనంతమైన జ్ఞానం కలవాడు, మార్పు లేనివాడు, జగత్తుకు ఆధారమైనవాడు, నిరాకరుడు, నిర్గుణస్వరూపుడు, దేనియందు ఆసక్తి లేనివాడు, సత్వరజస్తమోగుణములు లేనివాడు, ఈ గుణాలు ఆయననుంచి వస్తాయి. అభిమానం, ప్రేమ, రాగద్వేషాలను అతీతుడు, రూపము, గుణము లేనివాడు,. ఏదిలేనివాడు సృష్టి ఎందుకు చేస్తున్నాడు? అది ఆయన లక్షణమా? లేక వినోదామా? గతంలో ప్రళయం సంభవించినప్పుడు కర్మ పరిపక్వం కాకుండా తనలోనే లీనమైపోయిన జీవరాశుల యొక్క కర్మలను లయం చేసి వారికి మోక్షాన్ని కలిగించాలనే ఉద్దేశ్యంతో ఈ సృష్టి చేయాలని సంకల్పించాడు. ఇక్కడ ఒక సందేహం వస్తుంది. కర్మపరిపక్వం కాకుండా పరబ్రహ్మంలో ఎలా లీనమౌతున్నాయి? జీవరాశులు తమతో బాటే కర్మలన్నీ మూటకట్టుకొని పరమేశ్వరిదిలో లీనమయ్యాయి. పరమేశ్వరుడికి సృష్టి, స్థితి, లయ చెయ్యడం లక్ష్యమే కానీ, లీలావినోదం కాదు. సృష్టి జరగకముందు జగత్తు బ్రహ్మమయంగా ఉండేది. ఆ ఆత్మ పరబ్రహ్మం లోకాలన్నింటిని సృష్టించింది.భూలోకమును మత్స్య లోకం అంటారు. ఇక్కడ పుట్టిన ప్రతివాడు మరణించక తప్పదు. సాక్షాత్తు అవతారపురుషుడు కూడా అవతార పరిసమాప్తి చెయ్యవలసినదే. ఇంద్రియాలకు అధిష్టానదేవతలను, అన్నాన్ని, ప్రాణికోటిని సృష్టించి అందరిలో తను ఉండాలని బ్రహ్మరంద్రం గుండా శరీరాలతో ప్రవేశించడం సృష్టి చెయ్యడం ఆయన లక్షణం. సృష్టిలో కనిపించే ప్రతి వస్తువు అశాశ్వతమైనది. బ్రహ్మం అప్రసిద్ధమైనది. నామరూపాత్మకమైన జగత్తంతా పరబ్రహ్మము వలన సృష్టించబడుతోంది. జగత్తుకు ఉపాదాన కారణం, నిమిత్తకారణం పరబ్రహ్మమే. నామరుపాత్మకమైన జగత్తును ముందుగానే ఊహించుకొని తరువాత సృష్టించాడు. గురువు శిష్యునికి బోధించేటప్పుడు రూపవర్ణన చేస్తూ, బ్రహ్మాన్ని పురుషరూపంలో వర్ణించారు. ఆయనకు ఏ విధమైన కేశములు, క్లేశములు ఉండవని గ్రహించాలి.
సూత్రం :- 21
"భేద వ్యపదేశాచ్చానః"
భేద వ్యాపదేశచ్చః:- ఆధార ఆధేయరూపాల్లో వేర్వేరు అని చెప్పడం వలన అంతః పురుషుడు అన్యః:- అక్షి ఆదిత్యులకన్నా భిన్నుడే.
భావం :- అక్షి, పురుషుడికి, ఆధారం అని పురుషుడు ఆధేయమని వర్ణించారు. కనుక అక్షి ఆదిత్యుల కన్నా పురుషుడు వేరే కనుక అంతః పురుషుడు అక్షి ఆదిత్యులకన్నా భిన్నమైన బ్రహ్మమే.
వివరణ:- సూర్యుడు వేరు, పరమాత్మ వేరు, పరమాత్మ సూర్యునిలోనే ఉన్నాడు. కానీ అతను సూర్యుడు కాదు.
బృహదారణ్యకం:- సూర్యుడు అన్ని భూతాలకు మధువు. అన్ని భూతాలు ఆదిత్యునికి మధువు లాంటివి. ఆదిత్యునిలో ఉన్న ప్రకాశవంతమైన పురుషుడే శరీరంలోని కనులలో ఉండే తేజోమయమైన పురుషుడు ఇద్దరు ఒక్కటే. అదే ఆత్మ. పరమాత్మ ఆదిత్యలోకంలో ఉంటాడు. ఆదిత్యలోకం అతన్ని ఎరుగదు. ఆదిత్యలోకమే అతని శరీరం. ఆదిత్యలోకంలో ఉంటూ ఆదిత్యలోకాన్ని నియంత్రిస్తాడు. అతడే అంతర్యామి అయిన ఆత్మ. కాబట్టి ఆదిత్యునికి భిన్నమైన వాడు ఆ పరమాత్మ అంటూ వివరించాడు రత్నాకరుడు. ముందు సూత్రంలో, దీనిలో బ్రహ్మ లక్షణాలను వర్ణించారు.
పరిణామక్రమం:- భూలోకంలో పుట్టిన జీవులకు పరిణామ క్రమం ఉంటుంది. వాటినే షడ్వికారాలు అంటారు. జాయతే, అస్థి, పరిణయతే, వర్ధతే, క్షీయతే, నశ్యతే. జాయతే.. పుడుతుంది, అస్థి పోషిపబడుతుంది, పరిణయతే. పరిణామం పొందు చున్నది, వర్ధతే పెరుగుతుంది.. క్షీయతే నశిస్తుంది. ఈ ఆరు పరిణామాలు సృష్టి పొందుచున్నది. ఇవన్నీ కలిసిపోయి 3 దశలు అయ్యాయి. పుట్టడం పెరగడం--సృష్టి , పరిణామం వృద్ధిచెందడం ..స్థితి, క్షీణించడం ..నశి చడం కలసి లయ అన్నారు. ఈ రకంగా సృష్టి, స్థితి, లయకు పరబ్రహ్మ కారణం.
శాస్త్రాలు :- శాసించేది శాస్త్రం, ఏ రకంగా చెయ్యాలి, ఏరకంగా చెయ్యకూడదు అని నిర్దేశించేదే శాస్త్రం. అదే వేదం. మహత్తర విషయాలు కూడా సర్వజ్ఞుడైన బ్రహ్మచేత చెప్పబడినవి. అన్ని విషయాలలో పరిజ్ఞానం కలిగి వివరించడమనేది పరమేశ్వరునికే సాధ్యం.
శాస్త్రాలు 2 రకాలు;-1.పౌరుషేయములు 2.అపౌరుషేయములు.
1.పౌరుషేయములు:- పురుషులచేత చెప్పబడినవి.ఇవి 10.
1.పురాణములు, 2.న్యాయశాస్త్రం, 3.మీమాంస, 4.శిక్ష, 5.ధర్మశాస్త్రం, 6.కల్పం, 7.వ్యాకరణం, 8.నిరుక్తము, 9.ఛందస్సు, 10.జ్యోతిషం.
1.పురాణములు:- దీనికి 5 లక్షణములు ఉన్నాయి. సర్గము, ప్రతి సర్గము, వంశము, మన్వంతరము, వంశాల చరిత్ర, అనే పంచ లక్షణాలు కలిగినది పురాణము.
1సర్గము :- సకల ప్రపంచ సృష్టిని విస్తరించేది.
2ప్రతి సర్గము ;-సకల ప్రపంచము లయమయ్యే లక్షణం తెలిపేది. 3.వంశం:- పృధు ప్రియ వ్రతాదుల వంశోత్పత్తిని వివరించటం. 4.మన్వంతరము:-ఏ కల్పంలో ఏ మనువు కాలంలో ఏమి జరిగిందో చెప్పడం 5.వంశాలచరిత్ర:-ఏ వంశములవారు పరిపాలించారో వారి చరిత్రలు .
పురాణాలు 18 వ్యాసులవారు వ్రాశారు. ఉపపురాణాలు 18 వ్యాసులవారి శిష్యులు వ్రాశారు. 1.న్యాయశాస్త్రం: దీనికి మరోపేరు తర్కశాస్త్రం. దీనిలోని షోడశపదార్ధములను (౧౬) తెలుసుకుంటే మోక్షప్రాప్తి లభిస్తుంది. ప్రమాణం, ప్రమేయం, సంశయం, ప్రయోజనం, దృష్టాంతం, సిద్ధాంతం, అవయవం, తర్కం, నిర్ణయం, వాదం, జల్పం, వితండం, హేత్వాభాసం, ఛలం, జాతి, నిగ్రహస్తానం.
మీమాంస:- వేదాలలో పురాణాలలో కూడా వాటి అర్ధం వివాదం వస్తే వాటిని తీర్చుకోవడం మీమాంస చెల్పబడింది.
శిక్ష :-వేదం, శ్లోకాలు, మంత్రములలోని అక్షరములను స్వరములను ఉచ్చారణ సరైన రీతిలో బోధించేది.
ధర్మ శాస్త్రం ;-హిందు మతానికి సంబంధించిన ఆధారాలు నియమాలు, సిద్ధాంతాలు, తత్త్వాలను వివరించేవి హిందు ధర్మ శాస్త్రాలు.
కల్పం: 1.వేదాంగములలో ఒకటి. 1.కాలమానము :-హిందు కాలమానం ప్రకారం బ్రహ్మకు ఒక పగలు ( 14 మన్వంతరాలు సంధ్య )
2.వ్యాకరణము :-వేదార్ధముల కోసం వ్యాకరణం ఉపయోగిస్తారు.నన్నయ సంస్కృతంలో ఆంద్రశబ్దచింతామని వ్రాశాడు.
3.నిరుక్తము:-ఒక వేదంలోని సంస్కృత పదాలను అర్ధం తెలియజేస్తుంది .దీని కర్త యస్కుడు. వేదం శబ్ద వివరణ నిఘంటువు శాఖ పూర్ణ, నిరుక్తము అనేవికూడా ఉన్నాయి.
4.ఛందస్సు:- పద్యాలు, శ్లోకాలు, వేదం, మంత్రాలు కూడా ఛందోబద్ధంగా వ్రాయబడినవి .పద్యాలను వ్రాయడానికి ఉపయోగించే విధానాన్ని ఛందస్సు అంటారు. చందస్సును సంస్కృతంలో రచించిన వేదాలలో కూడా ఉపయోగించారు.
5జ్యోతిషం:- భవిష్యత్తును తెలుసుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది విశ్వసించే విధానం.ఇది నిర్ధుష్టమైన హిందు ధర్మ శాస్త్రం. జీవి జీవితంలో జరిగినది జరుగుతున్నది జరగబోయేది జననకాల గ్రహస్తితి ప్రకారం జీవితంలో వివిధ అంశాల గురించి చెప్పబడతాయి.
పౌరుషేయములు. బ్రహ్మ సృష్టించిబడిన వేదములు 4. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం.
ఒక్కొక్క వేదంలో 4 ఉపవిభాగాలున్నాయి. మంత్రసంహిత,బ్రాహ్మణము,అరణ్యకము,ఉపనిషత్తులు.
నాలుగు వేదాలలో కలిపి 1180 అధ్యాయాలు ఉన్నాయి. లక్ష పైగా శ్లోకాలు ఉన్నాయి.మనకు లభించినవి 20023 మాత్రమే.
సూత్రం :- 22
"'ఆకాశ స్తల్లింగాత్'"
తత్ లింగాత్ :- బ్రహ్మాన్ని బోధించటానికి అనువుగా సామగ్రి ఉండటం వలన, ఆకాశః:- ఆకాశం, బ్రహ్మ బోధకమే.
భావం :- ఆకాశ శబ్దం బ్రహ్మసూచకం. పంచభూతాల్లోని ఆకాశం కాకుండా ఇది మాదాకాశం పరబ్రహ్మ స్వరూపం, సకల చరాచర సృష్టికి కారణమైనది.
వివరణ:- ఛాందోగ్యోపనిషత్తు:-ఈ లోకానికి గతి ఏది? ఆకాశం. ఈ భూతాలన్ని ఆకాశం వలననే ఉత్పన్నం అవుతున్నాయి. ఆకాశంలోనే అస్తమిస్తున్నాయి. వీటికన్నా ఆకాశం ఎంతో గొప్పది. ఆకాశమే పరమగతి. ఈ ఆకాశపదం పృథివ్యాప్తి పంచ భూతాల్లోని ఆకాశాన్ని సూచించడం లేదు. ఆకాశం అన్ని భూతల ఉత్పత్తికి కారణంగా చెప్పారు. ఇది బ్రహ్మానికి లింగమే. (గుర్తు). భూతాకాశం సర్వభూతోత్పత్తికి కారణం కాజాలదు బ్రహ్మమే సర్వభూత ఉత్పత్తి స్థితి లయలకు కారణం. ఆనందమయ ఆకాశం బ్రహ్మ వాచకంగా వాడారు. పృధివి అంతరిక్షం ద్యులోకం సర్వలోకాలకన్నా బ్రహ్మశ్రేష్టం కనక ఆకాశం బ్రహ్మవాచకం.
తైత్తరీయోపనోషత్తు :- దేని వల్ల ఈ భూతాలు ఉత్పత్తి అయి జీవిస్తూ, ఎందులో లీనమౌతున్నాయయో అది బ్రహ్మమని తెలుసుకో!
బృహదారణ్యకోపనిషత్తు:- విజ్ఞానమయం ఆనందమయంమైన బ్రహ్మమే అన్నిటికీ పరాయణం కనుక ఆకాశమే బ్రహ్మమని అర్ధం.
ఛాందోగ్యోపనిషత్తు:- శిలకుడు, దార్బల్యుడు, ప్రవాహనుడు, ఉద్గీత మీద వాదోపవాదాలు చేస్తుంటారు. శిలకుడు అడుగుతు న్నాడు:- ఈ లోకానికి ఆధారం ఏది? ప్రహనుడుచెబుతున్నాడు, స్వరాభిన్నమైన ఆకాశమే ఈ లోకానికి ఆశ్రయం, ఆకాశం అంతటా అవరించిఉన్నది. ఆకాశం అంటే పరబ్రహ్మ. సమస్త లోకాలు జీవకోటి అంతా కూడా ఆకాశరూపమైన పరబ్రహ్మ నుంచే ఉద్ధరించి అందులోనే లీనమౌతున్నాయి.కాబట్టి ఈ లోకానికి పరబ్రహ్మ ఆధారం. వాయువు మొదలైన భూతాలన్ని ఆకాశం నుంచే పుడుతున్నాయి. ఎంతమాత్రం చేత ఆకాశం అంటే భూతాకాశం కాదు. అది పరమాత్మ కాబట్టి ఆకాశం అనగానే భూతాకాశం స్ఫురించినా దాని అర్ధం మాత్రం పరమాత్మయే అన్నారు రత్నాకరుడు. నామరుపాల చేత విడిగా కనిపించే అనేక మంది కర్తలతోను, కర్మఫలాలతోను అనుభవించే భోక్తలతోను ఉహించడానికి కూడా శక్యంకానీ విధంగా సృష్టి రచనా విధానం తెలియబడుతోంది. సృష్టి ఇదివరలో లేనిది, ఇప్పుడు కల్పించబడి కనిపించేదని స్థూలంగా అనుకోవచ్చును. సృష్టిని పూర్వం బ్రహ్మమొక్కటే ఉండేది. మాయల చేత బహురూపమైన బ్రహ్మ ప్రత్యక్షమైనది. దీనికి మించి ద్వితీయ వస్తువు ఏది లేదు. ఈ ఆత్మయే బ్రహ్మ. సర్వమును అనుభవించేది, తెలుసుకొనేది, జీవుడు కాదు బ్రహ్మమేనని గ్రహించాలి.
ప్రాణాధికరణం:- ( 1, 1, 23 )
సూత్రం :- 23
"అత ఏవ ప్రాణహః "
ప్రాణం :- ప్రాణ శబ్దం కూడా , అతఏవ:- ఈ కారణం వల్ల బ్రహ్మవాచకమే.
భావం:- ప్రస్తావం అనే భక్తి విశేషం ఉన్నవాళ్లు ప్రళయ వేళలో ప్రాణం అనే దేవతలా ప్రవేశించి సృష్టి సమయంలో బయటకు వస్తాయి. దీనిలో ప్రాణ శబ్దం బ్రహ్మ వాచకమే.
వివరణ :- ప్రాణమనేది బ్రహ్మ వాచకం కానీ సాధారణ ప్రాణ వాచకం కాదు. ఇప్పటిదాకా బ్రహ్మాన్ని వ్యాపకం అని నిర్ణయించారు.మహర్షి ఇప్పుడు బ్రహ్మం స్వయం జ్యోతి అని సూత్రీకరిస్తున్నారు.
ఛాందోగ్యోపనిషత్తు:- ఉషస్తి, చాక్రాయణుడు యాగం చేస్తన్న ఋత్వికులను పిలిచి మీరు ఇప్పుడు చేసే కార్యకలాపాలకు అధిష్టాన దైవం ప్రాణం. అన్ని జీవ రాశులు ప్రాణంలో ప్రవేసిస్తాయి. ప్రాణంతోనే జీవిస్తాయి. ఇక్కడ ప్రాణం అంటే పరబ్రహ్మ. ఉద్ధాలకుడు తన కుమారుడైన శ్వేతకేతువుకు సుషుప్తి అవస్థను గురించి వివరిస్తాడు. సుషుప్తావస్థలో మనస్సు, ఇంద్రియాలు పనిచేయడం మానివేస్తాయి. ఇంద్రియాలన్ని అలసట చెంది, ఒక్కొక్కటి మనస్సులో లీనమౌతాయి. మనస్సు ప్రాణంలో లీనమౌతుంది. సుషుప్తిలో ఒక్క ప్రాణం మాత్రమే మేల్కొని ఉంటుంది. ఆ ప్రాణమే ఇంద్రియాల యొక్క మనస్సు యొక్క అలసటను తీరుస్తుంది.ఇక్కడ ప్రాణం అంటే ప్రాణనాడులలోని ప్రాణమే అని ముందు అనిపించినా ఇంద్రియాలు మనస్సు అన్ని ప్రాణంలో లీనమౌతాయి.అని చెప్పడం వలన ప్రాణం అంటే పరమాత్మ కానీ వేరు కాదు. సుషుప్తిలో జీవుడు ఎలా ఉంటాడు? సుషుప్తి అంటే గాఢమైన నిద్ర.ఈ స్థితిలో అవయవాలు, ఇంద్రియాలు హాయిగా నిద్రపోతాయి. మనసు కూడా పనిచేయదు. ప్రాణం మాత్రం తిరువుతుంది. గాఢనిద్ర నుండి మేలుకొన్నాక నాకేమి తెలియదు, చాలా హాయిగా ఉంది అంతాడు. ఇక్కడ తమోగుణం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. చిత్తాన్ని, అహంకారాన్ని వదలి మనోబుద్ధులతో జీవుడు హృదయ స్థానంలో ఉంటాడు. స్వప్నావస్టాలో కంఠంలోను, జాగ్రదావస్థలో కంటిలోను, జీవుడు ఉంటాడు. ఇంద్రియాలు అవిద్య, అజ్ఞానంలో మునిగిపోయి ఉంటాయి. సుషుప్తిలో ప్రాజ్ఞుడు అని, జాగృదావస్థలో విస్సుడు అని, స్వప్నావస్థలో తేజస్సుడు అని పిలువబడతాడు. ఇంద్రియవ్యాపారం అంతా నశించిపోయిన స్థితి. దీనిని మాయ అనే అజ్ఞానం అంటారు. పగలంతా కష్టపడి పనిచేసి అలసిపోయి, ఇంటికి వచ్చి భోజనం చేసి, సుఖంగా పాన్పు మీద నిద్రిస్తే, ఏ కలలు రాకుండా హాయిగా నిద్రపోతారు. మూడు అవిద్యావస్తువులు ప్రకటించడం జరుగుతుంది. 1.అజ్ఞానం, 2.అహంభావం, 3.సుఖము ప్రకటిత మౌతాయి. మనస్సు, బుద్ధి, హృదయంలో కలసిపోతాయి. ఇవన్నీ ముఖ్యప్రాణంలో కలసిపోతాయి. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలలో కలసిపోతాయి. జ్ఞానేంద్రియాలు మనస్సులో, మనస్సు ప్రాణంలో కలసిపోతాయి. ఈరకంగా బుద్ధి, మనస్సు, ప్రాణం కలసి మెలకువ రాగానే హాయిగా బ్రహ్మాండంగా ఉంది అంటాడు. అంటే జ్ఞానం ఒక్కటే ఉంది. ఈ పురుషుడు ప్రాజ్ఞుడు కోరికలు ఉండవు. కలలు రావు. ఈ స్థితిలో ప్రాజ్ఞుడు శరీరం అంతా సంచారం చేస్తూ ఉంటాడు. అతన్ని చూస్తే చేతనుడా? అచేతనుడా? అనిపిస్తుంది. మతి ఉందా ? లేదా? అనుకుంటాము. ఈ సుషుప్తిలోనే ప్రాజ్ఞుడికి బ్రహ్మభావన కలుగుతుంది. గాఢనిద్రలో పరమతత్వం పొందుతాడు. తన ఆత్మ స్థితిని పొందుతాడు. అప్పుడు అక్కడ ప్రాజ్ఞుడే, కానీ జీవుడు అజ్ఞానంతో కలసి ఉంటాడు కనుక పరమాత్మ కాదు.
జ్యోతిశ్చరణాధికరణం:- (1, 1, 24 )
సూత్రం :- 24
" జ్యోతిశ్చరణాభిధానాత్ "
చరణ అభి ధానాత్ ;- ఛాందోగ్య చరణంలో ఉన్న, జ్యోతిః :- జ్యోతి పదం సైతం బ్రహ్మవాచకమే. చరణం అంటే పాదం.
భావం :- ద్యులోకానికి పరంగా ప్రకాశించే జ్యోతి అన్నింటికన్నా ఉత్తమ అనుత్తమ లోకాల్లోనూ వెలుగుతుంది. అదే ఈ మనుష్య శరీరంలో ఉన్నది. సూర్యుడు, అగ్నిలోని తేజస్సులు బ్రహ్మ వాచకం కాదు.
వివరణ :- జీవుడు ఈ శరీరాన్ని విడిచి పరమజ్యోతిని చేరి స్వస్వరూపంతో ఉంటాడు అనే వాక్యంలో జ్యోతి శబ్దం బ్రహ్మాన్ని తెలియజేస్తుంది. నిర్వధికం అయిన బ్రహ్మంలో ప్రకాశించే ఆదిత్యాగ్నులు ఒక భాగం మాత్రమే. కనుక ఉపనిషత్ వాక్యం కాని శబ్దం స్వయం జ్యోతి అయిన బ్రహ్మమే కానీ సూర్యాది తేజోవాచకం కాదని స్పష్టమౌతోంది. ఇక్కడ జ్యోతికి చరణములు అంటే పాదములు చెప్పడం వలన జ్యోతి అంటే పంచభూతాల్లోని అగ్ని కాదు. సాక్షాత్తు పరమాత్మయే.
ఛాందోగ్యోపనిషత్తు:- గాయత్రి అనబడే బ్రహ్మ యొక్క మహిమ గొప్పది. పృధ్వి రూపమైన గాయత్రి శరీరంలో ఉండే పంచభూతాలు, ఇంద్రియాలు అన్ని ఒకటి పురుషుని శరీర రూపమైన గాయత్రియే. పురుషుని హృదయ కమలంలో ఉండే పురుషుడు ఇద్దరు ఒకటే. అంటే పురుషుని లోని గాయత్రిలోనే ప్రాణాలు ప్రతిష్ఠితమై ఉన్నాయి. ఈ జగత్తంతా బ్రహ్మ యొక్క విభూతే. శుద్ధబ్రహ్మ, కార్యబ్రహ్మ కన్నా గొప్పది. పాంచభౌతికమైన జగత్తంతా శుద్ధ బ్రహ్మ యొక్క పాదమే. మిగిలిన 3 పాదాలు అమృత స్వరూపమైన బ్రహ్మము ఇదే. లోకాలపైన ఉత్తమోత్తమ లోకాలలో ఏ తేజస్సు ప్రకాశిస్తుందో అదే ప్రాణుల హృదయంలో ఉన్న తేజస్సు. ఇప్పుడు ప్రతిపాదించిన తేజస్సును ఆదిత్యుని యొక్క తేజస్సు గానే గ్రహించాలి. బ్రహ్మము నకు గుర్తు లేదు. రూపరహితమైన బ్రహ్మం దీప్యతే అని చెప్పడం సరికాదు. అంతే కాక ద్యులోకం పైన అని ఒక హద్దు పరిమితి చెప్పబడింది. సర్వాత్వకమైన బ్రహ్మ సర్వత్రా ప్రకాశిస్తూ ఉండాలి కదా! ఈ జ్యోతిని పంచభూతాలలో అగ్నిగా భావించాలి. అగ్నిగా గ్రహించాలన్నా ఆరూపంలో అగ్ని ద్యులోకానికి పైనే ఉంటుంది కానీ మరెక్కడా ఉండదు. కుక్షిలో ఉన్న జఠరాగ్ని రూపంలో కూడా గ్రహించడం సమంజసం కాదు. కారణం ఆ ఉష్ణత చేతితో తాకితే తెలుస్తుంది. దాని ఘోష చెవికి వినబడుతుంది అని చెప్పబడినది. కానీ అది జడపదార్ధం కనుక బ్రహ్మవాచకం కాదు. నిర్గుణ బ్రహ్మము అద్వితీయము అని ఎక్కడ చెప్పబడిందో దానికి మోక్షఫలసిద్ధి కలుగుతుంది. ఎక్కడ సగుణబ్రహ్మంగా చెప్పబడిందో అక్కడ జీవుడికి ఇహపర సుఖములు లభిస్తాయి.
సూత్రం :- 25
" ఛందో భిదానా న్నేతి చేత్ న , తథా చేత్తోర్పణ నిగదాత్ , తథా హి దర్శనమ్..'"
ఛందః అభిధానాథ్ :- ఛాందోగ్య వాక్యంలో గాయత్రి ఛందస్సు గురించి చెప్పారు కనుక, న:- తరువాత వచ్చిన వాక్యంలో జ్యోతిః అనే పదం బ్రహ్మాన్ని సూచించదు. ఇతి చేత్ :- అని భావించడం న :-సరియైనది కాదు. తధా :- ఓం ఎలాగో గాయత్రి కూడా అలాగే కనుక చేతః అర్పణ నిగదాత్ :- అది ప్రతిపాదించే బ్రహ్మంలో మనస్సుని ప్రవేశించడాన్ని బోధించినందువల్ల జ్యోతిః పదం తో బ్రహ్మాన్ని గ్రహించాలి. తధాహి :-ఆ విధం గానే దర్శనమ్ :- ఇలాంటి వర్ణన వేరొక చోట కూడా ఉన్నట్లు గ్రహించాలి.
భావం:- గాయత్రి ఛందస్సుకు చెప్పడం వలన బ్రహ్మపరంగా చెప్పలేదు అన్నది సరియైనది కాదు. చందస్సుకు సంబంధించిన బ్రహ్మము యందు మనస్సును నిలుపుకోవాలని చెప్పడం వలన ఛందోరూపంలో బ్రహ్మం నిర్దేశింపబడినదని సూత్రార్థం. ప్రస్తుత సందర్భంలో గాయత్రి ఒక ఛందస్సు రూపమనే కాని, బ్రహ్మ యొక్క గుర్తుగా అంగీకరించబడలేదు.
వివరణ:- ఛాందోగ్యోపనిషత్తు:- ఈ భూత ప్రపంచమంతా గాయత్రే. ఆ గాయత్రి.. వాక్కు, భూతం, పృధివి, శరీరం, ప్రాణం, హృదయం, అనే ఆరు విధములుగా ఉన్నది. గాయత్రి కన్నా ఎక్కువ మహిమ కలది బ్రహ్మం. అన్ని భూతాలు ఆయనకు ఒక పాదం. తక్కిన పాదత్రయం అమృతం అని వివరించారు. జ్యోతిః అనే పదం గాయత్రి చందస్సును బోధించదు. ఛందస్సు వర్ణనాతీతం. అది సర్వ భూతాత్మకం కానేరదు. బ్రహ్మమే సర్వభూతాత్మకం. గాయత్రి అనే పదాన్ని బ్రహ్మం అనే పదంతో ప్రయోగించినప్పుడు మాత్రం బ్రహ్మం సర్వాధిస్టానకారణం. కనుక ఆ పదం సర్వభూతాత్మకం అవుతుంది. అప్పుడు గానం చేస్తే రక్షించే బ్రహ్మమే గాయత్రి. బ్రహ్మకు రక్షణకర్తృత్వం ద్యోతకమవుతుంది. రక్షణ కర్తృత్వం చేతనపదార్ధం, ఛందస్సు జడమైనది, కనుక జ్యోతిః పదం బ్రహ్మవాచకమే. గాయత్రి మంత్రం చందస్సును చెబుతోంది కనుక అది బ్రహ్మం కాదు అని వాదన. అయితే శృతులలో గాయత్రి ఛందస్సు ద్వారా గాయత్రి యందు బ్రహ్మము నందు చిత్తాన్ని ఏకాగ్రం చెయ్యాలి అని చెబుతున్నారు. కాబట్టి బ్రహ్మమే నాలుగు పాదములు కలది అని చెప్పారు. కానీ అది బ్రహ్మ అని చెప్పలేదు అని కొంతమంది అంటారు కదా అని ప్రశ్నించాడు నారాయణ భట్టు. గాయత్రి ఛందస్సు ద్వారా గాయత్రిలో ఉన్న బ్రహ్మమునందు మనస్సు నిలిపి అదే సత్యము అని ఉపాసించాలి. ఈ సమస్తము గాయత్రే అంతేకాని అక్షరముల కూర్పు కాదు.
సూత్రం :- 26
'భూతాది పాద వ్యపదేశోపపత్తే శ్చేవమ్
చ :-ఆ బ్రహ్మంలోనే భూతాది పాదవ్యాపదేశ ఉప్పతేహ్:- భూతం, పృధివి, శరీరం హృదయం అనే 4 పాదాల కథనం సిద్ధించడం వల్ల ఏకం :- గాయత్రి పదం కూడా బ్రహ్మాన్ని ఉపదేశిస్తుంది.
భావం:- ఇది నాలుగు పాదాలున్న గాయత్రి అని వర్ణించినందున గాయత్రి బ్రహ్మ వాచకం అవుతుంది.
వివరణ: ఛాందోగ్యోపనిషత్తు: బ్రహ్మంలోనే ఈభూతజాతమంతా గాయత్రి అంటూ ప్రారంభించి, భూతం, పృధివి, శరీరం, హృదయం, అనే వాటిని వివరించి, తరువాత ఇది ఆరు విధాలైన నాలుగు పాదాలున్న గాయత్రి అని ముగించారు. ఒకవేళ ఇది గాయత్రి చందస్సయితే దానికి భూతం, పృధివి, శరీరం, హృదయాన్ని పాదాలుగా వర్ణించరు కదా! ఛందస్సు వర్ణనాత్మకం. కనుక గాయత్రి బ్రహ్మ వాచకం. బ్రహ్మం పూర్ణం, ఏ మార్పులు లేవని తెలుసుకున్నవారికి అవ్యయమైన సంపదలు కలుగుతాయి. బ్రహ్మమే శ్రీకరం పూర్ణం. పూర్ణ మదః, పూర్ణ మిదం, పూర్ణాత్ పూర్ణముదచ్యతే, పూర్ణస్య పూర్ణ మాదాయ, పూర్ణమేవావశిష్యతే (శుక్ల యజుర్వేదం) పరబ్రహ్మము అన్ని విధాలా సదా పరిపూర్ణం. జగన్నిర్మాణ కర్త అయిన పరమాత్మ నిమిత్తంగా ఉన్న ఈ జగత్తు పూర్ణం. పూర్ణ బ్రహ్మం నుంచి పూర్ణం గ్రహించినా పూర్ణమే అవుతుంది.ఈ విధంగా గాయత్రి పదం, జ్యోతి పదం రెండు బ్రహ్మ వాచకాలే. వేద ఛందస్సు:- వేదాలలో ముఖ్యంగా అనుష్టుప్ (8.అక్షరాలు), బృహతి ( 9 అక్షరాలు), పంక్తి ( 10 ), త్రిష్టుప్ ( 11 అక్షరాలు ), జగతి ( 12 అక్షరాలు ), అనబడు ఛందములను ఉపయోగించారు. మిక్కిలి ప్రసిద్ధి చెందిన ఛందస్సు త్రిపద గాయత్రి ఛందస్సు. అది ' తత్స వితుర్వరేణియం భర్గో దేవస్య ధీమహి థియో యోనః ప్రచోదయాత్' కొందరు మొదటి పాదంలో వరేణ్యం అంటారు.అప్పుడే గాయత్రి ఛందస్సు 23 అక్షరాలే. ఇది గాయత్రిలో ఒక ప్రత్యేకత. గాయత్రీమాతకు మూడు పేర్లు.. గాయత్రి, సావిత్రి, సరస్వతి. ఇంద్రియాలకు నాయకత్వం వహించునది గాయత్రి, సర్వమును పోషించునది సావిత్రి, వాక్దేవతా స్వరూపిణి సరస్వతి. అనగా హృదయం, వాక్కు మరియు క్రియ. త్రికరణ శుద్ధి గావించునదే గాయత్రి మంత్రం. సకల వేదముల సారం ఈ గాయత్రి మంత్రం. ఈమెకు తొమ్మిది వర్ణనలు ఉన్నాయి.1 ఓం ,2. భూః, 3 భువః, 4 సువః, 5 తత్, 6 సవితుర్, 7 వరేణ్యం, 8 భర్గో, 9 దేవస్య .
ప్రతి పదార్ధం:- ఓం, ప్రణవ నాదం, భూః :- భూలోకం, పదార్ధములు చేరిక, దేహము, హృదయం, మెటీరియలైజేషన్. భువః :- భువర్లోకం, ప్రాణ శక్తి, వైబ్రేషన్ సువః :- స్వర్గలోకం ,ప్రజ్ఞానం, రేడియేషన్ ఈ మూడు మన శరీరంలోని ఉన్నాయి. తత్ :-ఆ సవితుర్ :-సమస్త జగత్తును వరేణ్యం:- వరింపదగిన భర్గో :- అజ్ఞానాంధకారమును తొలగించునట్టి దేవస్య :- స్వయంప్రకాశ స్వరూపమైన బ్రహ్మను ధీమహి :- ధ్యానించుచున్నాను. కనుక వర్ణన, ధ్యానం, ప్రార్ధన ఈ మూడు ఒక్క గాయత్రీ మంత్రం లోనే లీనమై ఉన్నాయి. గాయత్రీ మంత్రం బ్రాహ్మణునికి చిహ్నం. గాయత్రీ మంత్రం జపిస్తే బ్రహ్మ తేజస్సులా వ్యక్తిత్వం తేజోమయంగా ఉంటుంది. మానసికబలం ఉంటే ప్రకాశంగా ఉంటుంది. గాయత్రీమంత్రం ద్వారా గాంభీర్యం, మానసిక ఆనందం, సూర్యభగవానుని కిరణములు భూమి మీద పడగానే చీకటి మాయమైనట్లు, మనిషిలోని అజ్ఞాన తిమిరం తొలగిపోయి, బుద్ధివికాశం, వ్యక్తిత్వం శక్తి, విజ్ఞానం వికశించి మనస్సు బ్రహ్మానికి చేరువవుతుంది.
సూత్రం:- 27
" ఉపదేశ భేదాన్నేతి చేన్నో భయస్మిన్నా ప్యవిరోధాత్"
ఉపదేశం భేదాత్ :- ఉపనిషత్తు చేసిన ఉపదేశాల్లో భేదం ఉండటం వలన న :- సరి అయినది కాదు.ఇతి చేత :- జ్యోతి అనే పదం బ్రహ్మవాచకం అనడం ఉభయస్మిన్ అపి:- రెండు వాక్యాలలో అవిరోధాత్:- అర్ధ విరోధం వైరుధ్యం లేదు.
భావం:- ఉపనిషత్ చేసిన ఉపదేశాల్లో భేదం ఉండటం వల్ల జ్యోతి అనే పదం బ్రహ్మ వాచకం అనడం సరియైనది కాదు.రెండు ఉపదేశాల్లో అర్ధం ఒక్కటే.
వివరణ:- ఈ రెండు ఉపదేశాలు:- 1. గాయత్రివా ఇదంసర్వం:- ఇదంతా గాయత్రీ అని ప్రారంభించి, దానికి ఉదాహరణగా త్రిపాదస్యామృతం దివి, ద్యులోకంలో ఈబ్రహ్మం అమృతపాదత్రయం అంటూ ద్యులోకానికి బ్రహ్మానికి ఆధారంగా ఉపదేశించారు. 2 ."యదతః పరో దివః", ఈ ద్యులోకానికి ఒకచోట ఆధారంగా మరొకచోట అవధిగా వర్ణించడం వైరుధ్యం కాదా! ఈరెండు ఉపదేశాల్లో అర్ధవిరోధం ఉంది కదా! అంటే ఏ మాత్రం అర్ధ విరోధం లేదంటున్నారు వ్యాసమహర్షి. బ్రహ్మం సర్వ వ్యాపకం. ఆయన భూమినుంచి ద్యులోకం వరకు అంతటా లోపల బయట అనే భేదం లేక వ్యాపించి ఉన్నాడు. యజుర్వేదం :- "తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః" :- ఈ బ్రహ్మం సర్వంలో అంతర్ బహిర్భాగాల్లో ఉన్నాడు. కనుక వ్యాపకమైన బ్రహ్మం ద్యులోకం లోను దానికి పరంగానూ ఉన్నాడని చెప్పడంలో వైరుధ్యమేమున్నది? రెండు ఉపదేశాల్లో అర్ధభేదం లేదు. కాబట్టి జ్యోతి పదం బ్రహ్మవాచకమే. ఉపదేశ వాక్యాలు వేరుగాఉండటం వల్ల వాక్యంలో చెప్పిన వస్తువు భిన్నం కాదు. గాయత్రి మంత్రాన్ని ఎన్ని రకాలుగా ఉపదేశించినా అందులో చెప్పబడ్డ బ్రహ్మ ఒక్కటే. లోకంలో చెట్టు చివర కూర్చున్న డేగను గూర్చి ఆ డేగ చెట్టు చివర ఉంది అని, ఆ డేగ చెట్టు కొన అవతల ఉంది అని చెప్పడం కనబడుతుంది. అట్లే ద్యులోకంలో ఉన్న బ్రహ్మను గురించి, ద్యులోకానికి అవతల ఉన్న బ్రహ్మ గురించి అని చెప్పబడుతోంది. మరొకడు ఇలా వ్యాఖ్యానించాడు. లోకంలో డేగను వృక్షంతో సంబంధం లేకపోయినా వృక్షాగ్రం మీద డేగ ఉంది. వృక్షాగ్రం పైన డేగ ఉంది అని చెప్పినా రెండిటి అర్ధం ఒక్కటే. అదే విధంగా ద్యులోకం కంటే దూరంగా ఉన్నా, ద్యులోకంలో ఉంది అని చెప్పినా ఈ వాక్యంలో ప్రత్యభి జ్ఞానం ( అదే ఇది అనే జ్ఞానం)ఉంది.అందుచేత జ్యోతిః శబ్ద వాక్యం బ్రహ్మ వాచకమే అవుతుంది.
ప్రతర్దనాధికరణం :- ( 1, 1, 28 )
సూత్రం :- 28
" ప్రాణ స్తథానుగమనాత్."
తథా:- జ్యోతిపదం బ్రహ్మవాచక మైనట్లే అనుగమనాత్ :- బ్రహ్మధర్మలు ఉండటం వలన ప్రాణః :-కౌశీతకీ బ్రహ్మణంలో ఉన్న ప్రాణ శబ్దం కూడా బ్రహ్మవాచకమే.
భావం :- జ్యోతి పదం బ్రహ్మ వాచకమైనట్లే బ్రహ్మ ధర్మాలు ఉండటం వలన కౌశీతకీ బ్రహ్మణంలో ఉన్న ప్రాణ శబ్దం కూడా బ్రహ్మవాచకమే.
వివరణ:- కౌశీతకీ బ్రాహ్మణము:- ఈ బ్రాహ్మణంలో ఇంద్ర ప్రతర్ధనులకు సంబంధించిన కథ ఉన్నది. గురువర్యా! గతంలో ప్రాణాధికారణం చెబుతూ ప్రాణమే బ్రహ్మ అని చెప్పారు. కానీ ప్రాణాలు వాయు రూపమా? దేవతా? పరబ్రహ్మ స్వరూపమా? అనే అనుమానం ఇంకా పట్టి పీడిస్తోంది. కాబట్టి దీన్ని గురించి పూర్తిగా వివరించండి? అన్నాడు కృష్ణ శర్మ. ఆ మాటలు విన్న రత్నాకరుడు ప్రాణాన్ని వివరించడం మొదలుపెట్టాడు. పూర్వకాలంలో కాశీ నగరాన్ని దినోదాసు అనే రాజు పరిపాలిస్తుండే వాడు. అతను చాలా పండితుడు. విద్వాంసుడు. పరాక్రమశాలి. ధర్మపరాయణుడు అతని పాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో హాయిగా ఉన్నారు. దినోదాసు కుమారుడు ప్రతార్ధనుడు తండ్రికి తగ్గ తనయుడు. ఒకసారి దేవ దానవులకు భీకరమైన పోరు జరుగుతున్నది. దానవుల ధాటికి తట్టుకోలేక దేవతలు వెనుకంజ వేశారు. ఆ సమయంలో ఇంద్రుడు తమకి ఎవరు సహాయం చేస్తారా అని ఆలోచిస్తుంటే దినోదాసు గుర్తుకు వచ్చాడు. వెంటనే తమకు సహాయంగా రావలెనని దినోదాసుకు కబురు పంపాడు. విషయం తెలుసుకున్న దినోదాసు తన కుమారుడైన ప్రతార్ధనుడిని దేవతలకు సహాయంగా పంపాడు. ఆ యుద్ధంలో చివరకు దేవతలే విజయం సాధించారు. విజయోత్సవ సభ ఏర్పాటు చేసి దానికి ప్రతార్ధనుడిని ఆహ్వానించారు. ఇంద్రుడు ప్రతర్ధనుడి శౌర్య పరాక్రమాలను ప్రశంసించి రాజా! దేవతలకు చాలా సహాయం చేసి విజయానికి కారకుడివయ్యావు. నీకు ఏమి వారం కావాలో కోరుకో అన్నాడు. దానికి నేను మానవుడను. నాకు హితమైనది పరమ పురుషార్ధమైనది ఏదో దాన్ని ప్రసాదించవలసినది అన్నాడు ప్రతార్ధనుడు. బ్రహ్మజ్ఞానం తప్ప మానవులకు హితమైనది ఏది లేదు. పురుషార్ధాలలో కూడా నలుగవది మోక్షమే. పరమాత్మను గురించి తెలుసుకున్న పురుషుడు జననమరణాల నుండి విముక్తుడౌతాడు. మోక్షం పొందాలంటే బ్రహ్మజ్ఞానం తప్ప వేరే సాధనం లేదు. పరబ్రహ్మకు సంబంధించి జ్ఞానం కలిగినంతనే మానవుడి కర్మక్షయం అయిపోతుంది. కర్మక్షయం కావడమే పురుషార్థం. సహోవాచ. ప్రాణోస్మి ప్రజాత్మా తం మా మాయు రమృతం ఇతి ఉపాస్య, ఆ మాటలు విన్న ఇంద్రుడు నేను ప్రాణాన్ని ప్రజ్ఞాత్మను, అటువంటి నన్ను ఆయువుగా అమృతత్త్వం గాను తలచి, ఉపాసన చెయ్యి అన్నాడు. అంటే ఇక్కడ ప్రాణం అంటే ముఖ్యప్రాణమా, బ్రహ్మమా ఈ రెండు శబ్దాల ప్రయోగం రెండింటికీ ఉన్నది. అన్నిచోట్ల ముఖ్య అర్ధం ప్రాణమే. ఎవరి వశంలో ఈసర్వం ఉన్నదో అలాంటి ప్రాణానికి నమస్కారం. అన్నిచోట్ల ప్రాణశబ్దం బ్రహ్మవాచకమే. లోకంలో అందరూ ప్రాణం అంటే తమ శరీరంలో ఉన్న ప్రాణమని భావిస్తారు. కానీ శాస్త్రల్లో ప్రాణశబ్దం బ్రహ్మాన్నే సూచిస్తుంది. ఇక్కడ ఉపాస్యమైన ప్రాణమంటే దైవమే. బ్మహ్మం కన్నా హితమైనది మరియొకటి లేదు. ముఖ్యప్రాణాన్ని ఉపాసించినవాడు దుఃఖరహితుడు కాలేడు అని చెప్పాడు ఇంద్రుడు. ఈ విషయం కౌశీతకీ ఉపనిషత్తులో చెప్పబడింది.
ప్రతర్దనాధికరణం :- ( 1, 1, 29 )
సూత్రం :- 29
'న వక్తు రాత్మొపదేశాదితి చేదధ్యాత్మ సంబంధ భూమా హ్యాస్మిన్ వక్తుః’
కౌశీతకీ బ్రహ్మణంలో వక్త అయిన ఇంద్రుడు ఆత్మ ఉపదేశాత్ :- తనను గురించి ఉపదేశించాడు కనుక న :- ప్రాణ శబ్దం బ్రహ్మ వాచకం కానేరదు. ఇతి చేత్ :- అనడం సరియైనది కాదు. హి :-ఎందుకంటే, అస్మిన్:- ఈ కౌశీతకీ బ్రహ్మణ ప్రకరణంలో అధ్యాత్మ సంబంధ :-పరమాత్మకు సంబంధించిన దర్మాల వివరణ భూధూ :- విరివిగా ఉన్నాయి. కనుక ప్రాణం అంటే బ్రహ్మమే.
భావం:- ఇంద్రుడు తనగురించి ఉపదేశించమన్నాడు కనుక ప్రాణశబ్దం బ్రహ్మ వాచకం కాదు అని చెప్పడం సరియైనది కాదు. కౌశీతకీ బ్రాహ్మణంలో పరమాత్మ ధర్మాలు వివరించబడ్డాయి. కనుక ప్రాణం అంటే బ్రహ్మమే.
వివరణ;- కౌశీతకీ బ్రహ్మణంలో బ్రహ్మ యొక్క ధర్మాలను వివరించారు. ఆధ్యాత్మిక ధర్మంలో ప్రాణం అంటే బ్రహ్మమే అని గ్రహించాలి. వాక్కును కాదు, వక్తను తెలుసుకోవాలి అని ప్రారంభించి బండి చక్రంలోని ఆకుల్లో ఎలాగైతే పట్టు ఉంటుందో, చక్ర మధ్యభాగంలో ఎలాగైతే ఆకులు ఉంటాయో, అలాగే భూతమాత్రలు ప్రజ్ఞామాత్రలలోను, ఆప్రజ్ఞామాత్రలు ప్రాణంలోను ఉంటాయి ఆ ప్రాణమే ప్రజ్ఞాత్మ, ఆనందం, అజరం, అమృతం కూడా. ఇక్కడ భూమాత్రలు అంటే పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశ., శబ్దాది తన్మాత్రలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలైన సూక్ష్మ భూతాలు, ప్రజ్ఞా మాత్రలు అంటే ఇంద్రియాలు నుండి జనించిన పంచజ్ఞానాలు. ప్రజ్ఞలు పంచేంద్రియమాత్రలు కన్ను, ముక్కు,చెవి ,నాలుక, చర్మము. ఇక అర్పితాలంటే విషయరూపంలో అర్పించినవి. కనుక పంచ సూక్ష్మ భూతాలు చక్రపు పై భాగం లాగా, పంచేంద్రియాలు వాటి వల్ల కలిగే నేత్రాది పంచజ్ఞానాలు చక్రపు ఆకుల్లాగా, ప్రాణం బ్రహ్మం నాభి చక్ర మధ్యభాగం లాగా ఇక్కడ వర్ణించారు. అంటే ఏమిటి? సూక్ష్మ, స్థూల భూతాలు వాటిని గ్రహించే సాధనాలైన ఇంద్రియాలు, ఇంద్రియాలను సాధనంగా ఉపయోగించే సమస్త జీవులు ప్రాణంతోనే ఇమిడి ఉన్నాయని భావం. ఇలాగ సర్వాధారమైన ప్రాణం బ్రహ్మమే అవుతుంది. కానీ ఇంద్రుడుకాదు. ఆ బ్రహ్మకు పృధ్వి ద్యులోకాన్ని ధరించి ఉంది. ఆబ్రహ్మమే భూమి, స్వర్గం అనే రెండింటిని ధరించి ఉంది. ఆబ్రహ్మమే అన్ని భూతాలకు ఆధారం. కర్మలకు అధ్యక్షుడు. ఇలాంటి సర్వాధారత్వం బ్రహ్మధర్మమే అవుతుంది. ఇంద్ర ధర్మం కాదు. అలాగే ముఖ్యప్రాణత్వం కూడా బ్రహ్మధర్మమే. ప్రాణమంటే జీవనం. జీవక్రియకు జీవుడు ఆధారమైనా అది జీవుడి ఆధీనంలో ఉండదు. జీవుడు బ్రహ్మాధీనమే. జీవనం బ్రహ్మాధీనం. జీవనం జీవాత్మ ఆధీనం అయితే ఈ లోకంలో మరణాలు ఉండవు.
కఠోపనిషత్తు:-ప్రాణాల మూలంగా కానీ, అపానం వల్ల గాని మానవుడు జీవించడు. ప్రాణాపానాలు ఆశ్రయించేది బ్రహ్మాన్ని. ఆయన మూలంగానే జీవిస్తారు. పైగా ఆయుష్షు కూడా బ్రహ్మమే.
బృహదారణ్యకోపనిషత్తు:- అందువల్ల విద్వాంసులు, జ్యోతులకు జ్యోతి అమృతమైన ఆయువును ఉపాసిస్తారు. అలాగే వాక్ వ్యాపారానికి కూడా బ్రహ్మమే హేతువు.
కేనోపనిషత్తు:- దేన్ని వాక్కుతో చెప్పడానికి వీలు కాదో, ఎవరి వల్ల వాక్కు ప్రవర్తిస్తుందో, ఆయనే బ్రహ్మము అని తెలుసుకో. ఇదేవిధంగా వక్తృత్వము, ఆయుష్షు, ముఖ్యప్రాణం, సర్వాధారాత్వం.. ఇవ్వన్నీ ధర్మాలు బ్రహ్మానికి సంబంధించినవే. కనుక ప్రాణ శబ్దం అన్ని రకాలుగా పరబ్రహ్మాన్ని బోధిస్తోంది కానీ జీవ ప్రాణాన్ని సూచించదు. ఇవి ఇంద్ర ధర్మాలు కానేరావు. ఇంద్రుడు తనని గురించి చెప్పాడు కదా! నేనే ప్రాణాన్ని ప్రజ్ఞానాత్మను అన్నాడు. ఇంద్రుడు దేవత కాబట్టి ఇది దేవాత్మను గురించి చెప్పినది అని భావించరాదు. ఇది పూర్తిగా బ్రహ్మ పదమే అన్నాడు రత్నాకరుడు. (ఇక్కడ నేను అని నిజంగా దేన్ని అనుకోవాలో, దాన్ని ఉపాసించమని ఇంద్రుడు ప్రబోధించాడు.}
ప్రతార్ధనాధికరణం ( 1, 1 31 )
సూత్రం :- 31
'జీవ ముఖ్య ప్రాణ లింగ న్నేతి చేత్ నోపాసా త్రై విధ్యాత్ ఆశ్రి తత్త్వాన్ ఇహతద్యోగాత్ '"
జీవ ముఖ్య ప్రాణ లింగాత్;- జీవుడికి ముఖ్య ప్రాణ ధర్మాలు ఉండటం వలన న:- ప్రాణ శబ్దం బ్రహ్మ వాచకం కాదు. ఉపాసనా త్రైవిద్యాత్:- మూడు రకాల ఉపాసనలు ఒప్పుకోవలసి వస్తుంది. ఆశ్రి తత్త్వాన్:- ప్రాణ శబ్దం బ్రహ్మనికే వర్తిస్తుంది. ఇంతే కాక ఇహ:- శాస్త్రంలో, తద్యోగాత్:- బ్రహ్మ ధర్మ సంబంధాలే వివరించారు.
భావం:- జీవుడికి ముఖ్య ప్రాణధర్మలు ఉండటం వలన ప్రాణ శబ్దం బ్రహ్మవచకం కాదు అని అనడం సరియైనది కాదు. జీవాత్మ, ముఖ్య ప్రాణం, పరమాత్మ అనే మూడు రకాల ఉపాసనాలు ఒప్పుకోవలసి వస్తుంది. ప్రాణ శబ్దం బ్రహ్మనికే వర్తిస్తుంది. ఇంతేకాక శాస్త్రాలలో బ్రహ్మ ధర్మ సంబంధాలు వివరించారు.
వివరణ:- ప్రాణం అంటే జీవాత్మ, ముఖ్యప్రాణం అని అర్ధాలు ఉన్నాయి. మరి ముఖ్యప్రాణం బ్రహ్మం అని ఎలా చెబుతున్నారు? అనే ప్రశ్నకు ఈ సూత్రం సమాధానం చెబుతోంది. వ్యాస మహర్షి కూడా బ్రహ్మాన్ని దృఢ పరుస్తున్నాడు.
కౌషీతకీ బ్రాహ్మణము:- వాక్కును కాదు. వక్తను తెలుసుకో అనే వాక్యంలో జీవాత్మ అని స్పష్టంగా తెలుస్తోంది. వాక్కు ఇంద్రియ వ్యాపారం జీవాత్మకు చెందినదే. అప్పుడు ప్రాణశబ్దం జీవాత్మకు సంబంధించినది కదా! శరీరధారణ అనే ధర్మం ఉన్నప్పుడు ముఖ్య ప్రాణం జీవాత్మకు వర్తిస్తుంది అనే సందేహం సరిఅయినది కాదు.
కేనోపనిషత్తు:- జీవి యొక్క ముఖ్యప్రాణం పరబ్రహ్మమే. ఆత్మ నుండి ప్రాణం పుడుతుందని, శరీరాన్ని ఆశ్రయించి నీడ ఉన్నట్లుగా ఆత్మపైన ప్రాణం వ్యాపించి ఉన్నది. నీడకు స్వతంత్రమైన అస్తిత్వం లేనట్లే ప్రాణానికి కూడా స్వతంత్రమైన అస్తిత్వం లేదు. మనస్సులో పుట్టిన సంకల్ప వికల్పాల వల్లనే ఇది శరీరంలోకి వస్తుంది. కాబట్టి ప్రాణం పరబ్రహ్మ నుండి పుడుతుంది. ఆ పరబ్రహ్మను ఆశ్రయించి ఉన్న ప్రాణం కూడా పరబ్రహ్మ స్వరూపమే. ఈ ప్రాణమే ప్రజ్ఞాత్మ, ఆనందం, అమృతమయం. ప్రాణం ,జీవాత్మ, ముఖ్యప్రాణం ఉంటే 3 ఉపాసనలు చెయ్యాలి. కానీ చెయ్యవలసినది బ్రహ్మోపసన ఒక్కటే. ప్రాణికోటిలో ఏ జీవి కూడా ప్రాణంతోనే జీవించదు. ఈ రెండింటి కన్నా అతీతమైన దాని వల్ల, ఈ రెండిటి కన్నా ఆశ్రితమైన దాని వల్ల జీవిస్తున్నాము. అదే పరబ్రహ్మ. వామదేవుడు ఈ ప్రజ్ఞాతమే ఆనందం, అజరం, అమృతం అన్నారు. ముఖ్యప్రాణం జీర్ణమైపోయింది. అజరం, అమృతం రెండు బ్రహ్మనికే వర్తిస్తాయి. జీవోపాసన, ప్రాణోపాసన చెయ్యడం హితంకాదు. బ్రహ్మోపాసనే చెయ్యాలని చెప్పాడు. అందువలన ప్రాణమే పరబ్రహ్మమని మొదటి పాదం పూర్తి చేశాడు రత్నాకరుడు. మొదటి అధ్యాయంలో మొదటి పాదం సమాప్తం. 16 పాదాలలో ఒక పాదం పూర్తి అయినది.
అధ్యాయం :-1 , 2వ పాదం
మొదటి పాదంలో అనేక విషయాలు చెప్పి అవన్నీ బ్రహ్మం గురించినవని నిరూపించడం జరిగింది. కానీ ఇంకా బ్రహ్మను సూచించినట్టు వాక్యాలు ఉన్నాయి. వాటిని 2, 3 పాదాలలో వివరిస్తున్నారు. కంటికి కనిపించిన చరాచర జగత్తు అంతా పరబ్రహ్మ స్వరూపమే. జీవకోటి వస్తుసముదాయమంతా కూడా పరబ్రహ్మ నుంచి పుట్టి, మళ్ళీ అందులోనే లయమై పోతున్నది. పురుషుడు క్రతుమయుడు. అంటే నిశ్చయ జ్ఞానం కలిగినటువంటివాడు. మానవుడు ఏ విధమైన సంకల్పాలు కలిగి ఉంటాడో చనిపోయిన తరువాత కూడా ఆ ఫలితాన్ని పొందుతాడు. మరణకాలంలో ఏ భావాలతో శరీరం విడిచిపెడతాడో ఆ భావాలకు తగిన ఫలితాన్ని పొందుతాడు. దీనికి భాగవతంలో చెప్పిన జడభరతుడు కధ ఉదాహరణగా చెప్పవచ్చును. పూర్వకాలంలో అజనాభము అనే దేశాన్ని ఋషభుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతని భార్య జయంతి. వీరికి 9 మంది కుమారులు. పెద్దవాడు భరతుడు. ఇతడు వేదవేదంగాలు చదివినవాడు. పరాక్రమశాలి. ధర్మపరుడు. తండ్రి తరువాత భరతుడే రాజయ్యాడు. ఇతని భార్య పంచజనని. చాలా సం.లు ప్రజారంజకంగా పరిపాలించి రాజ్యాన్ని కుమారులను వదలి వానప్రస్థానికివెళ్లాడు. నదీతీరంలో కుటీరం నిర్మించుకొని నివసిస్తున్నాడు.అతనికి తల అంతా జడలు కట్టిపోయింది. అందుకే అతనిని జడభరతుడు అనేవారు. ఒకరోజు జడభరతుడు నదిలో స్నానం చేస్తుండగా గర్భిణీ అయిన లేడి ఆనదీతీరానికి వచ్చింది. ఆసమయంలో ఆకాశం మేఘావృతమైనది. ఉన్నట్టుండి పెద్ద ఉరుము ఉరిమైంది. దానికి ఆ లేడి భయపడి బిడ్డను ప్రసవించి మరణించింది. తల్లిలేని లేడిపిల్లను పెంచసాగాడు జడభరతుడు. దానిమీద అపారమైన ప్రేమను పెంచుకొని దైనందిన కార్యక్రమాలు కూడా వదలి, దాని గురించే ఆలోచిస్తూ ఉండేవాడు. చివరకు మరణకాలంలో ఆ లేడి పిల్లను గురించి ఆలోచిస్తూ ప్రాణం వదిలాడు. ఆ ఫలితంగా అతను మరుజన్మలో లేడిగా పుట్టాడు. కాబట్టి మానవుడు ఏ విషయం స్మరిస్తూ ప్రాణాలు వదులుతారో ఆవిషయం పొందుతాడు. అందుకే నేను బ్రహ్మాన్ని పొందుతాను అని నిశ్చయించుకొని బ్రహ్మం గురించి ఆలోచించాలి అన్నాడు రత్నాకరుడు. ఆమాటలు విన్న నారాయణ భట్టు స్వామి! శరీరానికి, ఇంద్రియాలకు అధిపతి అయిన జీవాత్మకు మనస్సు, ఇంద్రియాలు మొదలైన వాటితో సంబంధం ఉంది. పరమాత్మ ప్రాణరహితుడు. శరీరం లేనివాడు. ఇటువంటప్పుడు మనోమయుడు,ప్రాణము, శరీరము గలవాడు అని చెప్పబడ్డ జీవాత్మ ఉపాస్యుడు ఏ విధంగా అవుతాడు అని అడిగాడు. ఆ మాటలు విన్న రత్నాకరుడు ఛాందోగ్యంలో సర్వం ఖల్విధం బ్రహ్మ తజ్జలానితి శాంత ఉపాసీత అనే వాక్యం బ్రహ్మోపాసనావిధిని గురించి చెప్పడం లేదు. శమాన్ని గురించిచెబుతోంది. అంటే శాంతుడవై పైన చెప్పిన గుణాలు గల బ్రహ్మాన్ని ఉపాసించు. శాంతం అంటే రాగద్వేషాలు లేకుండా అని ఈ వాక్యంలో బ్రహ్మోపాసన ప్రధానం కాదు. ఇక్కడ ఉపాసించవలసినది జీవాత్మనే. ఈ విషయానికి సమాధానంగానే తరువాత సూత్రంలో తెలియజేస్తున్నారు.
"'సర్వత్ర ప్రసిద్ధ్యధికరణం' ( 1. 2 .1 )
సూత్రం :- 32
'సర్వత్ర ప్రసిద్ధోపదేశాత్'
సర్వత్ర :- ఉపాసనా ప్రకరణంలో అంతా ప్రసిద్ధ ఉపదేశాత్ :-ప్రషిద్ధమైన బ్రహ్మాన్ని ఉపాస్య దైవంగా ఉపదేశించినందువల్ల
భావం:- ఛాందోగ్యంలో శాండిల్యవిద్యలో వర్ణించిన బ్రహ్మమే పరబ్రహ్మము అనీ పరమేశ్వరుడని గ్రహించాలి.
వివరణ:- ఛాందోగ్యోపనిషత్తు:- సర్వం ఖాల్విధం బ్రహ్మ ,తజ్జలానితి శాంత ఉపాసీతా' ఇదంతా బ్రహ్మమయం. వేదాంత వాక్యాలలో ఈజగత్తు అంతా బ్రహ్మమయమేనని శృతులు చెబుతున్నాయి. అంతా బ్రహ్మ మనోమాయాది ధర్మాలు కలవాడుగా చెప్పడం వలన మూలవస్తువును విడిచిపెట్టడం ఉండదు. ఇతర వస్తువులను గురించి చెప్పడం ఉండదు. అలా చేస్తే అది దోషమే అవుతుంది. కానీ ఇక్కడలా జరగలేదు. ఇక్కడ ఉపాసించేవాడు, ఉపాసించబడేవాడు కూడా బ్రహ్మమే. కేవలం ఉపాసించడం కోసమే అతనికి మనోమాయాది ధర్మాలు చెప్పబడ్డాయి. ఇదంతా బ్రహ్మమయం, శాంతుడైన వాడు ఇదంతా బ్రహ్మవల్ల జనించినదని, బ్రహ్మాలయమని, బ్రహ్మస్థితమని ఉపాసించాలి. ఆపురుషుడు క్రతుమయుడు. ఈ లోకంలో క్రతువైన పురుషుడు గతించిన తరువాత క్రతువే అవుతాడు. క్రతువును ఉపాదించాలి. ఇక్కడ బ్రహ్మశబ్దం పరబ్రహ్మ బోధకమా? జీవాత్మ సూచకమా? అంటే బ్రహ్మశబ్ద ప్రయోగం రెండు అర్ధాలలోను ఉంది.
బృహదారణ్యకోపనిషత్తు:- స వా అయమాత్మా బ్రహ్మ విజ్ఞానమయం:- ఈవాక్యంలోని బ్రహ్మ అనే పదం జీవాత్మ పదం. కనుక శాండిల్య విద్యలో బ్రహ్మపదం మనోమయం, ప్రాణమయం అనే విశేషణాలు జీవాత్మకే వర్తిస్తాయి కదా! శరీరంలో ఉన్నవాడు జీవాత్మకదా! అంటే ఉపాసనా విధానాలలో ప్రషిద్ధమైన బ్రహ్మాన్ని ఉపదేశించారు. శాండిల్యవిద్య ఉపాసనా ప్రకరణమే. ఇందులో బ్రహ్మ అంటే పరబ్రహ్మమే. జీవాత్మ కాదు. వేదవాజ్ఞ్మయంలో కనిపించే అగ్ని, ఇంద్రుడు, వరుణుడు, సుపర్ణుడు, బృహస్పతి, ప్రజాపతి, వాయువు, సవిత్రుడు, చంద్రుడు, ప్రాణం లాంటి శబ్దాలు బ్రహ్మాన్ని బోధిస్తాయి. ఉదాహరణకు అన్ని పదార్ధాలలో అగ్రణి కనుక బ్రహ్మాన్ని అగ్ని అంటారు. అగ్ని భౌతిక పదార్ధాలన్నింటిలో అగ్రణి. ఆధి దైవిక తత్త్వాలలో సూర్యుడు అగ్రణి. ఆధ్యాత్మిక పదార్ధాలలో బ్రహ్మమే అన్నింటికన్నా అగ్రణి. అగ్రణి అంటే ప్రధానం. అలాగే నిరతిశయమైన ఐశ్వర్యం ఉన్నవాడు ఇంద్రుడు. వేదశాస్త్రాలలో అనేక పదాలతో బ్రహ్మం గుణగణాలు తెలుపుతాయి. అందువల్ల అగ్ని మొదలైన పదాలు తటస్తించినప్పుడు నానార్ధాలను గ్రహించక, స్తుతి ఉపాసన ప్రకరణాలలో బ్రహ్మాన్ని గ్రహించాలి.
ఋగ్వేదం:- సత్ రూపమైన ఒకే తత్త్వమైన పరమాత్మకు విద్వాంసులు ఎన్నో రకాలుగా ఇంద్రుడు, మిత్రుడు, వరుణుడు, అగ్ని దివ్యుడు సుపర్ణుడు గరుత్మంతుడు యముడు అని వ్యవహరిస్తారు. అదే అగ్ని, ఆదిత్యుడు వాయువు, చంద్రుడు, శుక్రుడు, జలం, ప్రజాపతి అని యజుర్వేదం బ్రహ్మమని వ్యవహరిస్తున్నారు. ఆయనే దాత, విధాత, వాయువు, ఆకాశం, ఆర్యముడు, వరుణుడు, రుద్రుడు, మహాదేవుడు, అగ్ని, సూర్యుడు మహాయముడు. కాబట్టి ఉపాసనా ప్రకరణములలో వాడే పైశబ్దాలు ఉపాస్యుడైన పరబ్రహ్మాన్ని సూచిస్తాయి. మనోమయం అంటే బ్రహ్మను మనస్సుతో ఉపాసించతగ్గది అని భావం. ప్రాణమయం అంటే ప్రాణమే శరీరంగా ఉండే బ్రహ్మం. ఋషులు బ్రహ్మాన్ని మనోమయం అని వ్యవహరిస్తారు. ఈ శబ్దాలను బట్టి జీవాత్మ అని భావించరాదు. ఆ బ్రహ్మం ప్రాణానికి ప్రాణం. ఇక్కడ బ్రహ్మానికి ప్రాణాన్ని శరీరంగా వర్ణించారు. సర్వాంతర్యామి అయిన బ్రహ్మం ప్రాణాంతర్గతుడని భావం. అందువలన శాండిల్య విద్యలో వర్ణించిన బ్రహ్మం పరబ్రహ్మమే కానీ జీవాత్మ కాదు. సర్వం ఖల్విధం బ్రహ్మ, ఈ వికారములన్ని బ్రహ్మం నుండి పుడుతున్నవి. దాని లోనే లీనమౌతున్నవి. దాని నుండి మెదులుతున్నవి. కనుక సర్వం బ్రహ్మమయం. అంతా ఒకే ఆత్మ అయినప్పుడు రాగాదులకు అవకాశం లేదు. అందువలన శాంతుడై ఉపాసన చెయ్యాలి.
సూత్రం :- 47
' శ్రుతోపనిషత్కగత్యభిధానాచ్చ '
శ్రుతూపనిషత్ కః:- బ్రహ్మవిద్యను అనుష్టానం చేసినవాడికి గతి అభిధానాథ్ చ :- ఏ గతి లభిస్తుందో, అక్ష్యంతర పురుషుడిని ఉపాసించిన వాడికి కూడా అదే కలుగుతుంది.
భావం :- బ్రహ్మ విద్యను అనుష్ఠానం చేసిన వాడికి ఏ గతి పడుతుందో అక్ష్యంతర పురుషుణ్ణి ఉపాసించిన వాడికి కూడా అదే కలుగుతుంది. బ్రహ్మ విద్యానుష్ఠానపరుడికి దేవయాని గతి లభిస్తుంది. నేత్రాంతర పురుషుడే బ్రహ్మ.
వివరణ:- శృతులు, స్మృతులు ఉపనిషత్ రహస్యాలు విన్న వారికి దేవయానమార్గం చెప్పటం వలన ఇతను పరమాత్మ స్వరూపుడే అని తెలుస్తుంది. ఉపాసకుడు బ్రహ్మచర్యము, తపస్సు మొదలైనవి ఆచరిస్తూ నియమ నిష్ఠలతో సాధన చేసినట్లయితే అతను ఆత్మ సాక్షాత్కారం పొందుతాడు. అటువంటివాడు ఉత్తరాయణ మార్గం ద్వారా ఆదిత్యలోకం చేరతాడు. అతనికి జన్మ ఉండదు. ఇదే విధంగా అర్చిరాది మార్గం గురించి భగవద్గీతలో చెప్పబడింది. కాబట్టి అక్షి పురుషుడు పరబ్రహ్మమే. తపస్సు చేత, బ్రహ్మచర్యం చేత, శ్రద్ధతో విద్య చేత ,ఆత్మను అన్వేషించి శరీరపాతానంతరం ఆదిత్యుని ద్వారా సగుణబ్రహ్మస్థానానికి వెడతారు. ఈబ్రహ్మ వ్యష్టి, సమిష్టిరూపాలైన ప్రాణులకు స్థానం. వాస్తవంలో ఇది నిత్యం. భయ రహితమైన నిర్గుణ రూపమే. ఇది ఉత్తమమైన గమ్యస్థానం. దీని నుండి వెనుకకు రారు. ఈ ఉపాసకుడు మరణించినప్పుడు పుత్రులు సంస్కారం చేసినా, చేయకపోయినా వాళ్ళు అర్చి దేవత వైపే వెడతారు. ఇది దేవమార్గం. బ్రహ్మ మార్గం, ఈ మార్గం ద్వారా వెళ్లిన వాళ్ళు ఈ మానవలోకానికి జననమరణరూప సంసారంలోకి తిరివి రారు. అందువల్ల ఇక్కడ చెప్పిన బ్రహ్మవేత్తకు సంబంధించిన ప్రసిద్ధమైన గతి చేత అక్షి స్తానంలో ఉన్న పురుషుడు బ్రహ్మమేనని నిశ్చయింపబడింది. అర్చిరాది మార్గం:- 1వ భాగం: కౌషీతకీ బ్రహ్మణంలో అర్చిరాది మార్గం అంటే ఏమిటో చెప్పబడింది. మానవుడు మరణించిన తరువాత అతని ఆత్మ అర్చిరాది మార్గం ద్వారా పరమపదాన్ని చేరుకుంటుంది. ముందుగా మానవుడు మరణించే సమయంలో వివేకాన్ని కోల్పోతాడు. అంటే సృహ తప్పడం అంటారు. ఆ సమయంలో వాక్కు మొదలైన ప్రాణాలన్ని ఆత్మ ఎదురుగా నిలబడతాయి. ఇంద్రియాలన్ని తమ యొక్క తేజస్సును ఉపసంహరించుకుని పని చేయడం మనేస్తాయి. తేజస్సుపోతే ఇంద్రియాలు పనిచేయవు. ఉదాహరణకు కన్నుకి ఆదిత్యుడు అధిష్టానదేవత. అతను కళ్ళను అనుగ్రహించడం మానేసి ఆదిత్యరూపం పొందుతాడు. కళ్ళు కనబడవు. చెవి అధిదేవత చెవిని వదలిపోగానే చెవులు వినబడవు. రసాధిదేవత శరీరం నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. అప్పుడు రుచి తెలియదు. క్రమేణా స్పర్శ తగ్గుతుంది. అంటే జ్ఞానేంద్రియాలు వాటి పనులు అవి మానేస్తాయి. అతనికి మనస్సు ఆత్మతో ఏకమైనప్పుడు ఆలోచనా శక్తి ఉంటుంది. ఆత్మ వేరవగానే ఆ శక్తి నశిస్తుంది. ముందుగా కర్మేంద్రియాలు కాళ్ళు, చేతులు పనిచేయవు. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలలో లీనమైపోతాయి. జ్ఞానేంద్రియాలు మనస్సులో, మనస్సు ప్రాణంలో లీనమౌతుంది. అదే ముఖ్య ప్రాణం జీవాత్మ. జీవాత్మ ప్రాణం శరీరం నుండి బయలుదేరడానికి సిద్ధంగా ఉంటుంది. ప్రాణం హృదయగ్రంధి దగ్గరకు వస్తుంది. అంటే శరీరంలోని శక్తి అంతా ప్రాణంతో కలసి ఆ ప్రాణం హృదయ గ్రంధిని చేరుతుంది. అక్కడనుంచి బయటకు రావడానికి రెండు మార్గాలు ఉన్నాయి. 1.మొదట వచ్చిన మార్గం, బ్రహ్మ రంద్రం గుండా లోపలికి వస్తాడు. అదే మార్గం గుండా ప్రాణం బయటకు పోతుంది. 2.శరీరానికి ఉన్న నవరంధ్రాలు. నవరంధ్రాలలో ఏదో ఒక రంధ్రం గుండా ప్రాణం బయటకు పోతుంది. కొంత వరకు పుణ్యం చేసిన వారికి పై భాగంలో ఉన్న కన్ను, ముక్కు, చెవి ద్వారా ప్రాణం బయటకు పోతుంది. దుర్మార్గాలు చేసిన వారికి అదోముఖంలో ఉన్న రంధ్రాల ద్వారా ప్రాణాలు బయటకు పోతాయి.
సూత్రం :- 48
'అనవస్థితే రసంభవాచ్చ నేతరః"
అనవస్థతే :- స్థిరంగా ఉండకపోవడం వలన, చ:- ఇంకా, అసంభవాత్:- అమృతత్త్వాది గుణాలు లేకపోవడం వలన, ఇతరః:-జీవాత్మ న:-అక్షిపురుషుడు కాదు.
భావం:- అక్షిలో ఉండకపోవడం వలన అమృతత్త్వాది గుణాలు లేకపోవడం వలన జీవాత్మ నేత్రపురుషుడు కాదు. అమృతతత్వం, గుణసంపన్నుడు అయిన పరమాత్మే కంటిలో ఉన్న పురుషుడు.
వివరణ:- నిలకడలేకపోవడం వలన అమృతత్త్వం అభయత్వం మొదలైన గుణాలు అసంభవమైనందున అక్షయ పురుషుడు జీవాత్మ, ఛాయాత్మ కాదు. అతడు పరమాత్మ. ఛాయాత్మ అంటే ప్రతిబింబం కలవాడు. మన ఎదురుగా నిలుచుని ఉన్నవాడి ప్రతిబింబం మన కంట్లో పడుతుంది. అతడు ఛాయాత్మ. ఇది ఎప్పుడు నిలకడగా ఉండదు. ఎందుకంటే ఉపాసన చేసే టప్పుడు ఎదురుగా ఏ ఆకారాన్ని ఉంచుకోము. పోనీ జీవాత్మ అందామా అంటే అది ఒక్క కాంతిలోనే ఉండదు. శరీరమంతా వ్యాపించి ఉంటుంది. ఉపాసన కోసం పరమాత్మకు కన్ను స్థానంగా చెప్పారు. అంతే కాని జీవాత్మకు కాదు. అమృతత్త్వం అభయత్వం ఇత్యాది గుణాలు జీవాత్మకు, ఛాయాత్మకు లేవు. ఒక్క పరమాత్మకు ఉన్నాయి. ఉపాసన చేసేటప్పుడు ఉపాసకుడు తనకు దగ్గరగా నేత్రమునందు చూడబడుతున్న పురుషుణ్ణి ఉపాసించాలి. తన కంటిలో ఛాయపురుషుడు కనబడదు కదా! ఉపాసనాకాలంలో తన కంటిలో ప్రతిబింబం కలిగించే పురుషుణ్ణి ఒకనిని ఎదురుగా ఉంచుకొని ఉపాసన చెయ్యాలి అనుకోవడం సరి అయినది కాదు. ఈ శరీరం తొలగిపోగానే ఛాయాత్మ కూడా తొలగిపోతుంది. దీనికి అమృతత్త్వాది గుణాలు ఉండవు. విజ్ఞానాత్మ సమస్త శరీరేంద్రియాలలోను సమంగానే సంబంధించి ఉన్నప్పుడు నేత్రంలోనే ఉన్నాడు అని చెప్పడం శక్యం కాదు. విజ్ఞానాత్మ పరమాత్మ కంటే అభిన్నుడే అయిన కూడా అవిద్య, కామం, కర్మ వీటిచేత ఏర్పడిన మరణత్వం భయము కూడా ఆరోపించబడ్డాయి. విజ్ఞానాత్మ ఐశ్వర్యవంతుడు గాన వానిలో ఉపపన్నములు కుదరవు. దేవతాత్మ నేత్రాధిష్టాన దేవత ఆదిత్యుడు సూర్యరశ్ముముల వలన ఉన్నాడని చెప్పుకొనుట వలన అతను బయట నున్నవాడు, కనుక ఆత్మ అని చెప్పలేము. ఆ దేవాత్మకు కూడా ఉత్పత్తి, నాశనము ఉన్నట్లు శృతిలో చెప్పబడింది. దేవతలకు అమృతత్వం చిరకాలం ఉంది అని చెప్పబడినది, కానీ ఏ నాటికి నాశనం లేదు అని చెప్పలేదు. తైత్థరీయోపనిషత్తు:- పరబ్రహ్మను గురించిన భయంతోనే గాలి వీస్తుంది. సూర్యుడు ఉదయిస్తాడు. అగ్ని, చంద్రుడు తమతమ విధులను నిర్వహిస్తారు. ఐదవాడైన యముడు చంపదగిన వాళ్లదగ్గరకు పరుగెత్తి వెడుతున్నారు. పరమాత్మ ఒక్కడే అమరుడు. అతడే అక్షిలో పురుషుడు అని గ్రహించాలి. కంటిలో పురుషుడు ప్రత్యక్షంగా కనబడుతున్నట్లు సర్వవిదితం అన్నట్లు కనబడుతోంది. పరమేశ్వరుడు ఆ విధంగా కనబడటం లేదు కదా! అలాంటప్పుడు దృశ్యతే అని ఎలా చెప్పబడింది? అనే సంశయం. శాస్త్రంలో ఉండే ప్రసిద్ధిని బట్టి పండితులలో ఉండే ప్రసిద్ధిని బట్టి పరమేశ్వరుడు కంటిలో కనబడుతున్నాడని భావించి ఉపాసకులకు అభిరుచి కలిగించడం కోసం దృశ్యతే అని చెప్పబడినది. అర్చిరాది మార్గం ( 2 వ భాగం ) చివరి క్షణాల్లో ప్రాణాలు ఎలా పోతాయో జాగ్రత్తగా చూడాలి. ఒకసారి అడవిలో 4 సింహాలు ఒక గొర్రె మీద పడ్డాయి. అది తప్పించుకొని పారిపోతు నీళ్ల మడుగులో దూకింది. సింహాలు నీళ్ళల్లోకి దిగవు కనుక ఒడ్డునే కొంత సేపు వేచి చూసి వెళ్లిపోయాయి. జింక దురదృష్టం, ఆ నీళ్ళమడుగులో ఊబి ఉంది. దానిలో కూరుకుపోతుంటే బయటకు రాలేక దిక్కులు చూస్తోంది. కొంతసేపటికి హైనాల గుంపు వచ్చి గొర్రె మీదపడి చంపి చీల్చుకొని తినేసాయి. మరణ సమయంలో ఏ రకమైన గతి పడుతుందో ఆలోచించాలి. పాపం చేసిన వాళ్ళు ఎటువంటి జన్మ ఎత్తుతారు?ఎటువంటి మరణం సంభవిస్తుందో తెలుస్తుంది. ఉదయం పూట మేకలను గొర్రెలను కబేళాలకు తీసుకువెళ్లి వాటిని చంపుతుంటే మిగతా జంతువులు చూస్తూనే ఉంటాయి. కానీ అవి ఏమి చెయ్యలేని స్థితిలో ఉంటాయి. చాలా పాపకార్యలు చేసిన వాళ్ళు పశుపక్ష్యాదులుగా జన్మిస్తుంటారు. వాళ్ళు చూస్తూచూస్తూ, ఏడుస్తూ, కర్మ ఫలితాన్ని అనుభవిస్తారు. ఒక్కొక్కసారి భగవంతుడు ఒక అవకాశం ఇస్తూ ఉంటాడు. ఒక పెద్దాయన విమానంలో ప్రయాణం చేస్తుంటే అత్యవసరంగా విమానం ల్యాండ్ అవుతోంది. పరిస్థితి చెయ్యి దాటిపోయింది. ఒకోసారి పేలిపోవచ్చును అని ప్రకటన చేశారు. అందరూ అరుపులు, కేకలు, భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నారు. ఆ పెద్దాయనకు కొన్ని వందల కోట్ల ఆస్తి ఉంది. ఆ క్షణంలో అతనికి తను చేసిన దుర్మార్గాలు, పాపాలు కనబడ్డాయి. భగవంతుడా! నాకు ఒక్క అవకాశం ఇవ్వు. మంచి పని చేస్తాను అని కోరుకున్నాడు. అదృష్టం కొద్దీ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఆ సమయంలో చావుకు బ్రతుక్కి మధ్య తేడా తెలిసింది. వెంటనే ట్రస్ట్ ఏర్పాటుచేసి చిన్న పిల్లలకు, అనాధలకు ఉచితంగా వైద్యసేవలు చెయ్యడం మొదలు పెట్టాడు. ఇప్పుడు అతను హాయిగా ఉంది వైద్యం చేయిస్తున్నాను అన్నాడట. భగవంతుడు అవకాశం ఇవ్వడం ఒక ఎత్తు. దానిని సద్వినియోగం చేసుకోవడం ఒక ఎత్తు. అలా చెయ్యకపోతే చాలా నీచమైన జన్మలు వస్తాయి. అవసాన సమయం అతను చేసిన కర్మల మీద ఆధారపడి ఉంటుంది. సూక్ష్మశరీరం బయటకు వెళ్లిన తరువాత ఉష్ణోగ్రత తగ్గి శరీరం చల్లబడిపోతుంది. అప్పుడే మరణించినట్లు చెబుతారు. మరణించిన తరువాత జీవుడితోబాటు అతను చేసిన కర్మేంద్రియాలు పంచభూతాలు మనస్సు అతనితోబాటే వెళ్లిపోతాయి. ఇంకొక దేహం పొంది, కర్మ ఫలం అనుభవించడానికి వెడతాయి. మానవుడికి శరీరాన్ని ఇచ్చేవి పంచభూతాలు ఇంద్రియాలే. జ్ఞానులకు పునర్జన్మ ఉండదు. వారి ప్రాణం బ్రహ్మరంద్రం గుండా బయటకు వెడుతుంది. వారి కర్మలు క్షయమై పరబ్రహ్మలో కలసిపోతారు.
సూత్రం 49:
''అంతర్యా మ్యధి దైవాదిషు తద్ధర్మ వ్యపదేశాత్'"
తత్ ధర్మ వ్యపదేశాత్:- బ్రహ్మ ధర్మాలు చెప్పడం వలన అధి దైవాదిషు:- పృథివ్యాదుల్లో, అంతర్యామి :-బ్రహ్మాన్ని అంతర్యామిగా వర్ణించారు.
భావం :- అధి దైవికాది సమస్త పదార్ధాలలో అంతర్యామిగా ఉన్నవాడు బ్రహ్మమే అని ఆయన ధర్మాలు వెల్లడిస్తున్నాయి.
వివరణ:- పరమేశ్వరుడు సర్వ వ్యాపి. అన్ని భూతముల యందు అంతర్యామిగా ఉన్నవాడే అంతర్యామి అంటున్నారు కదా! ఇక్కడ అంతర్యామిగా చెప్పబడినవాడు పంచభూతాల యొక్క అధిదేవతా? లేక పరమేశ్వరుడా? కాస్త వివరించండి? అన్నాడు నారాయణ భట్టు. రత్నాకరుడు చెబుతున్నాడు. అధిదైవములైన పంచభూతాలు సూర్యుడు, చంద్రుడు, అధి యజ్ఞము మొదలైన వాటి యందు అంతర్యామిగా చెప్పబడినవాడు, అమృతత్త్వం మొదలైన ధర్మాలు కలవాడు పరమాత్మ యే. పరమేశ్వరుడు అంతర్యామిగా ఉంటూ వాటిని నియంత్రిస్తున్నాడు. అందుకనే పరమేశ్వరుని యందు భయంతోనే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. చంద్రుడు చల్లదనాన్ని ఇస్తున్నాడు. ఆపరమాత్మే అన్నింటికన్నా, అందరికన్నా శక్తిమంతుడు. బృహదారణ్యకోపనిషత్తు:- పరమేశ్వరుడు అన్ని భూతములయందు ఉన్నాడు. ఆభూతాలు ఆయన్ని ఎరుగవు. ఆభూతాలే అతని శరీరం. సర్వభూతాల్లో ఉంటూ వాటిని నియంత్రిస్తున్నాడు. అతడే అంతర్యామి అయిన నీఆత్మ అని చెప్పబడినది. అయితే పరమాత్మ నామరూపాలు లేనివాడు అశరీరి. మరి శరీరం లేనివాడు ఇతరులను ఎలా నియంత్రిస్తున్నాడు? అనే సందేహం రావచ్చును. అతడు ఎవరిని, దేనిని, నియమిస్తాడో వారి వారి శరీరాలతో ఇంద్రియాలతో వారిని నియమిస్తున్నాడు. వారి శరీరం ఇంద్రియాలతోనే తను శరీరం ఇంద్రియాలు కలవాడు అవుతున్నాడు. అందుకనే అంతర్యామి అయిన వాడు ఆత్మ. విజ్ఞానం ఉన్నా విజ్ఞానం కన్నా భిన్నం. విజ్ఞానం పరమాత్మను ఎరుగదు. విజ్ఞానం ఆయన శరీరం. బ్రహ్మం విజ్ఞానాత్మ అయిన జీవాత్మను కూడా నియంత్రిస్తుంది. ఈధర్మం ప్రకృతిలో లేదు. జీవాత్మది అణుస్వరూపం. అన్నిటా ఒకే క్షణంలో ఉండలేదు. జీవాత్మ యోగాభ్యాసాల వలన ఐశ్వర్యాన్ని సంపాదించినా, జగత్తుని నియంత్రిచలేదు. యోగశక్తులు జగద్వ్యాపారాన్ని నిర్వహించలేవు. అలాంటి ఐశ్వర్యం పరమాత్మకు ఉంది. ఆయనే సర్వభూతాంతరాత్మ. కాబట్టి పరమాత్మని అంతర్యామి శబ్దంతో గ్రహించాలి.
అర్చిరాది మార్గం ( 3 వ భాగం ): సగుణ బ్రహ్మను ఆరాధించినవాడు మరణించిన తరువాత అతని ప్రాణం సుషమ్ననాడి ద్వారా బ్రహ్మరంద్రం నుండి బయటకు పోతుంది. సుషమ్ననాడి బ్రహ్మరంద్రానికి కలపబడి ఉంటుంది. ఉత్తరాయణ మార్గం ద్వారా అర్చిరాది మార్గం నుండి సూర్యలోకానికి వెడతాడు. శరీరం నుండి బయటకు రాగానే కళ్ళు కనిపించవు. విపరీతమైన కాంతితో సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు. అతడికి ద్వారం ఎక్కడుందో తెలియదు. అందుకే నీకాంతిని కొంచెం ఉపసంహరించు కోవయ్య అని సూర్యుణ్ణి ప్రార్ధిస్తాడు. సూర్యుడు తన కాంతిని ఉపసంహరించుకోగానే ఆజీవుడు సూర్యమండలంలోకి అడుగుపెట్టి అర్చిరాదిమార్గం గుండా అనేక లోకాలగుండా ప్రయాణం చేస్తున్నప్పుడు దేవతలు, దేవదూతలు, అప్సరాంగనలు, సాయం చేయగా బ్రహ్మలోకం చేరతాడు. సగుణారాధకుడు ఉత్క్రమించిన తరువాత సూర్య రశ్మిని అనుసరిస్తాడు అంటారు. మరి రాత్రిపూట చనిపోతే సూర్య రస్మి ఉండదు కదా ! అప్పుడు సూర్యరశ్మి ఎలా ఉంటుంది అని సందేహం రావచ్చును.శరీరంలోని నాడులలో ఉన్న పిత్తరసం ఏదైతే ఉందో అదే సూర్యుడి తేజస్సు. కాబట్టి ఉత్క్రమించిన జీవుడు ఎప్పుడు మరణించినా సూర్యరశ్మిని అనుసరించి వెడతాడు. ఉపాసన చేసినవాడు దక్షిణాయణంలో పోయినా బ్రహ్మలోకానికి వెడతాడు. పుణ్య కార్యాలు, యజ్ఞయాగాది క్రతువులు, దానధర్మాలు చేసినవాడు దక్షిణాయన మార్గం గుండా చంద్రలోకం వెళ్లి అక్కడ నుండి స్వర్గలోకం వెళ్ళి అక్కడ స్వర్గసుఖాలు అనుభవించి తిరిగి భూలోకంలో మిగిలిన కర్మఫలాలు అనుభవించడానికి జన్మిస్తాడు. ఉత్తరాయణంలో మరణిస్తే స్వర్గానికి, దక్షిణాయణంలో మరణిస్తే నరకానికి పోతారని అంటుంటారు. కాలమానం తెలపడానికి 2 అయనాలుగా విభజించారు కానీ ఎప్పుడు పోయినా యోగీశ్వరుడు, జ్ఞాని బ్రహ్మలోకం చేరి పరబ్రహ్మలో లీనమౌతాడు. మహాజ్ఞాని అమావాస్యనాడు మరణించిన బ్రహ్మలోకం చేరతాడు.
సూత్రం :- 50
"'న చ స్మార్త మత ద్ధర్మా భిలాపాత్ '"
అతత్ ధర్మ అభిలాపాత్:- అంతర్యామి ప్రకరణంలో ప్రకృతి ధర్మాలు చెప్పనందువలన , స్మార్తం:- స్మృతిలో వర్ణించిన జడ ప్రకృతి, చ- కూడా, నా:- అంతర్యామి కాదు.
భావం:- అంతర్యామి ప్రకరణంలో ప్రకృతి ధర్మాల ప్రసక్తి లేదు. దీనిలో బ్రహ్మధర్మాల వర్ణన ఉండటం వలన అంతర్యామి శబ్దం ప్రకృతి బోధకం కాదు. ప్రకృతి అంతర్యామి కాదు.ఇది బ్రహ్మ బోధకమే.
వివరణ:- అంతర్యామి పరబ్రహ్మ. అంతేకాని సాంఖ్యులు చెప్పే ప్రకృతి కాదు. అంతర్యామికి ఉన్న ధర్మాలు ప్రకృతికి వర్తించవు అన్నాడు రత్నాకరుడు. అంతర్యామిగా ప్రకృతిని అంగీకరించకపోతే జీవిని అంగీకరించవచ్చు కదా!అన్నాడు కృష్ణ శర్మ. సాంఖ్య స్మృతి:- సాంఖ్య స్మృతి ప్రతిపాదించిన ప్రధానం అంటే ప్రకృతి కూడా అంతర్యామి శబ్దవాచ్యం కాదు. సృష్టికి కారణం అయిన శాశ్వతమైన అంశం సాత్విక, తామస, రజోగుణాలకు మూలం. మనం కళ్ళతో చూడగలిగే మనస్సుతో భావించే, శరీరంతో స్పర్శించే వాస్తవప్రపంచం. సాంఖ్య దర్శనం ప్రకారం పురుషుడు అనగా జ్ఞానం ఆధిభౌతిక సృహ. హిందు ధర్మ శాస్త్రాలలో జీవుడు ప్రకృతి, తత్త్వం, మోక్షము, వంటి విషయాలను విశ్లేషించే తత్వశోధనా రచనలను దర్శనాలు అంటారు. సాంఖ్యము, యోగం, వైశేషికము, న్యాయము, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస అనే 6 ఆస్తికదర్శనాలలో అత్యధిక ప్రాధాన్యత కలిగినది సాంఖ్యదర్శనం. దీనిలో ప్రకృతి పురుషుడు రెండు విభిన్న అంశాలు. పురుషుడు:- అంతటా వ్యాపించి ఉన్న నిరాకారం, ఆత్మతత్త్వం. ఇంద్రియములకు తెలియరానిది. మాటలతో చెప్పజాలనిది. ఏమాలిన్యములు అంటవు. అతడు శాశ్వతము. ఎవరూ సృజించ లేరు. పురుషుడు దేనిని సృజించడు. ప్రకృతి:- ప్రకృతిని ఎవరు సృజించలేరు. కానీ ప్రకృతికి సృజించే లక్షణం ఉంది. అన్ని జీవులు పురుషుని యదార్ధ బాహ్యస్వరూపములు. ప్రకృతి వలన ఉద్భవించిన భౌతికదేహాలు పురుషుని బాధిస్తాయి. జీవుడు తన గురించి సరి అయిన జ్ఞానం లేనందున తాను శరీరం మాత్రమేనని భ్రమించడం వలన సంసారదుఃఖం ఏర్పడుతుంది. ఆత్మజ్ఞానం కలిగినప్పుడు ఆబంధం నుంచి విముక్తి కలువుతుంది. ప్రకృతి ఊహింప శక్యం కానిది. తెలియ శక్యం కానిది. అంతటా నిద్ర పోతున్నట్లుగా ఉంటుంది. సమస్త వికారాలు కారణం అవడం చేత అదికూడా అంతర్యామి అనడం కుదరదు. దానివి కాని ధర్మాలు చెప్పడం వలన అదృష్టత్వం మొదలైన నిర్దేశం దాని విషయంలో కుదరదు. ప్రకృతి అచేతనమని వాళ్ళు అంగీకరించారు. చూడబడనిది చూస్తుంది. ఉహించబడనిది, ఊహిస్తుంది. తెలియబడనిది తెలుసుకుంటుంది అని చెప్పబడినది. ప్రకృతికి కూడా ఆత్మతత్వం కుదరకపోవడం వలన అంతర్యామి కాదని గ్రహించాలి.
సూత్రం :- 51
"'శారీరశ్చో భయే పి హి భేదేనైన మదీయతే"
శారీరః చ :-శరీరంలో ఉండే భోక్త అయిన జీవాత్మ కూడా, న:- అధిదైవతంగా చెప్పే పరమాత్మ కాదు. హి:- ఎందుకంటే, ఉభయ్ అపి :- కాణ్వం, మాద్యందినం అనే రెండు శాఖలోను, భేదేన:- జీవాత్మ కంటే వేరే అని, ఏనం :- అంతర్యామిని, అధీయతే:- పఠిస్తున్నారు, భావిస్తున్నారు. జీవాత్మ శరీర ధారి కదా !
భావం:- శరీరంలో ఉండి భోగాలు అనుభవించే జీవాత్మ అధిదైవతంగా చెప్పే పరమాత్మ కాదు. ఎందుకంటే కాణ్వం, మాద్యందినం అనే రెండు శాఖల్లోనూ జీవాత్మ కంటే పరమాత్మ వేరే అని భావిస్తున్నారు. జీవాత్మ శరీరం లోని దేహేంద్రియ మనోబుద్ధులతో కూడి ఉన్నాడు కదా!
వివరణ:- బృహదారణ్యకోపనిషత్తు:- ఎవడు పృధివిలో ఉండి, పృధ్వి కన్నా భిన్నుడో అని కాణ్వులు, మాద్యందినులు భావిస్తారు. విజ్ఞానాత్మయైన జీవాత్మలో ఉండి కూడా ఎవడు జీవాత్ కన్నా భిన్నుడో అని కాణ్వులు, ఆత్మలో ఉండి కూడా ఎవడు ఆత్మకన్నా భిన్నుడో అని మాధ్యందినులు చదువుతారు. దీనివలన అంతర్యామి జీవాత్మకన్నా భిన్నుడే అని తెలుస్తోంది. ఇక్కడ విజ్ఞానపదం విజ్ఞానాత్మకమైన జీవాత్మ, కనుక ఈ ప్రకరణంలో అంతర్యామి అంటే బ్రహ్మం. జీవాత్మ, ప్రకృతి కావు.అంతర్యామి అంటే జీవి కాదు.ఈ జీవి అంతర్యామి కన్నా భిన్నమైనవాడు. శరీరం ఉన్నందుకు జీవికి కొన్ని లక్షణాలు ఉంటాయి. కంటితో చూడటం, నోటితో మాట్లాడటం, నాలుకతో రుచి చూడటం, చెవులతో వినడం, మొదలైన లక్షణాలు ఉంటాయి. కానీ పంచభూతాలను నియంత్రించే శక్తి జీవుడికి లేదు. అందుకే అంతర్యామి అంటే పరమాత్మే. అతడు అన్ని భూతాలలోను ఉంటాడు. అందరి దేవతలలో ఉంటాడు. అందరిని నియమిస్తాడు.అతని వలననే ఈ జగత్తు అంతా సవ్యంగా నడుస్తోంది. ఈరకంగా అధిదేవతలయందున్నవాడు పరమాత్మే కానీ వేరు కాదు. ఘటాకాశం వలె ఉపాధుల చేత ఉపాధి అయిన, పరిచ్చిన్నుడవడం చేత పూర్తిగా పృథివ్యాధుల లోపల ఉండటానికి, వాటిని నియమించదానికి సమర్థుడు కాదు. అంతర్యామి అయిన ఈశ్వరుడనేవాడు ఎవడున్నాడో అతను, అతని కంటే భిన్నమైన ఏశరీరుడు ఉన్నాడో అతడు, ఈ విధంగా ఒకే దేహంలో ఇద్దరు దృష్టలు ఉండటం ఎలా కుదురుతుంది. వీని కన్నా వేరుగా మరొక ద్రష్ట ఎవరు లేరు. మరొక నియంత ఎవరు ఉండే ప్రసక్తి లేదు. నియంతయా? నియంత కానీ వాడా అనే విశేషం ఏమి లేకుండా మరొక ద్రష్ట అనేవాడు ఎవడు లేడు అని చెప్పబడినది కూడా. దీనికి సమాధానం చెప్పబడుతోంది. శరీరుణ్ణి అంతర్యామిగా ఈవిధంగా వేరువేరుగా చెప్పడం అవిద్యచేత ఏర్పడిన శరీర ఇంద్రియాదిరూపమైన ఉపాధులను నిమిత్తంగా చేసుకొని ఏర్పడినదే కానీ పారమర్ధికం కాదు. ప్రత్యగాత్మలు ఉండవు కదా! ఉపాధిని బట్టి ఘటాకాశం, మహాకాశం అన్నట్లు ఒకే ఆత్మకు భేదవ్యవహారం ఉంటుంది. ఉపాధులను బట్టి ఈభేదం తెలుసుకునేవాడు, తెలియబడేవాడు ఇత్యాది భేదాలు చెప్పే శృతులు, ప్రత్యక్షాది ప్రమాణాలు, సంసారానుభవం, విధి, ఇదంతా ఉపపన్నం అవుతుంది. ఎక్కడ భేదభావం ఉన్నట్లు కనబడుతుందో అక్కడ ఒకడు మరొకణ్ణి చూడటం అనేది ఉంటుంది. అజ్ఞానం ఉన్నప్పుడే అలా చూడబడుతుచున్నది. సర్వమూ ఆత్మయే అయినప్పుడు దేనిని దేనితో చూస్తాడు. అంతా పరమాత్మ ఆత్మచైతన్యమే అయినప్పుడు రెండవది లేనప్పుడు జీవాత్మ అంతర్యామి కాదు అని గ్రహించాలి.
సూత్రం:-51
"'అదృశ్యత్వాది గుణకో ధర్మోక్తః"
అదృశ్యత్వాదిగుణనం:-అదృశ్యత్వం, సర్వజ్ఞత లాంటి గుణాలు బ్రహ్మనికే ఉన్నాయని, ధర్మోక్తః:- శాస్త్రాలలో ధర్మాలు చెప్పారు.
భావం :-అదృశ్యత్వం. సర్వజ్ఞత లాంటి గుణాలు బ్రహ్మనికే ఉన్నాయని శాస్త్రాలలో బ్రహ్మధర్మాల గురించి వివరించారు.
వివరణ :- ముండకోపనిషత్తు:- (1, 1. 5 ) దేని ద్వారా ఈ అక్షర పరబ్రహ్మము తెలుస్తుందో అదే పరావిద్య. ఆ పరబ్రహ్మము జ్ఞానేంద్రియాలకు గోచరం కాదు. కర్మేంద్రియాలకు పట్టుబడదు. కారణం లేనిది, ఏ వర్ణాలు లేనిది ,చేతులు, కాళ్ళు లేనిది, శాశ్వతం ,వ్యాపకం ,అంతటా ఉండే తత్త్వం. ఎంతో సూక్ష్మం, వృద్దిక్షయలు లేనిది,జగత్కారణం. బ్రహ్మ అంటే అక్షరం. క్షరం కానిది. నాశనం లేనిది. అన్నింటికన్నా గొప్పది అంతకంటే పెద్దది. ఈ ప్రపంచంలో అన్నింటికీ ఒక పేరు ఒక రూపం ఉంది. ఏదో రోజు అవి నశించిపోతాయి. లేక మార్పులు చెందుతాయి. నాశనం లేకుండా ఏ మార్పు లేనటువంటిది పరబ్రహ్మమే. దీనినే పరా ప్రకృతి అంటారు. అదృశ్యగుణం ప్రకృతికి ఉంది. అది కూడా అక్షర పదార్ధమే. పృథివ్యాది భూతాలకు కారణం అయిన ప్రకృతి భూతయోని కూడా. భూతయోనిలో యోని శబ్దం నిమిత్తకారణాన్ని సూచిస్తుంది. ఉపాదానకారణాన్ని కాదు. దృష్టాంతంలో సాలీడు శరీరం జడ పదార్ధం. సాలీడులోని చేతన పదార్ధానికి అధిష్టానం ఆత్మ. అది తంతువుల్ని సృష్టించి గూడు అల్లి, మళ్ళీ తనలో ఇముడ్చుకుంటుంది. స్వయంగా ఏ వికారాన్ని పొందదు. సాలీడు సృష్టించి సంహరిస్తుంది. అలాగే పరమాత్మ కూడా ప్రకృతిని అధిష్టించి జగత్తుని నిర్మించి లయం చేస్తాడు.కానీ ఆయన స్వరూపంతో ఏ వికారమూ ఉండదు. ఇక్కడ సాలీడు నిమిత్త కారణం. దాని శరీరం ఉపాదాన కారణం.ఈ విధంగానే ప్రకృతి జగత్తుకు ఉపాదాన కారణం. పరమాత్మ నిమిత్త కారణం. భూతయోని అయిన బ్రహ్మం వలన జగత్తు సృష్టించబడుతోంది. ఓషధులు మొలకెత్తదనికి పృధివి ఆధారం. పరమాత్మ ఆధారంగా ప్రకృతి నుంచి జగత్తు పుడుతుంది. విభిన్నమైన పంటలకు వాటి విత్తనాలు కారణం. అలాగే పృథివ్యాది భూతాలు వాటి ఉపాదాన కారణం అయిన ప్రకృతి నుంచి జనిస్తాయి. ఇకపోతే జీవాత్మ శరీరంలో ఉన్నంతవరకు శరీరంనుండి వెంట్రుకలు, గోళ్లు పుట్టి పెరుగుతాయి. వాటి కోసం పురుషుడు ఎలాంటి ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. అదే విధంగా పరమాత్మ ప్రకృతి నుంచి భూత సృష్టి జరుగుతుంది. తగిన సమయంలో ప్రకృతిలో లీనమౌతుంది. ఇదే సాలీడు దృష్టాంతం సారాంశం. దీని వలన అక్షర శబ్దం పరమాత్మ బోధకమే కానీ అన్యబోధకం కాదు అని తేలుతుంది. యః సర్వజ్ఞః సర్వవిత్ " (1, 1, 9 ) సర్వజ్ఞుడు, సర్వ విదుడు అనే గుణాలు ప్రకృతికి వర్తించవు అని అంటారా? జీవాత్మ కూడా అక్షరమే కదా! దానికి నాశం లేదు కదా! సర్వజ్ఞత్వం చేతన ధర్మం. జీవాత్మ చేతకుడే కదా ప్రకృతి చేతనమా కాదు. జీవాత్మ అల్పజ్ఞుడు.సర్వజ్ఞుడు కాదు. బ్రహ్మ అది దైవతము అన్ని దేహములలో ఆత్మ స్వరూపంగా నిలచి ఉంది. ఆయనే అది యజ్ఞము. అంటే సమస్త జీవరాసులలో ఆత్మ స్వరూపుడుగా వెలుగుచున్న యజ్ఞస్వరూపమును అధి యజ్ఞము అంటారు. ఒక్కొక్క శరీరంలో ప్రాణ శక్తిగా ప్రకటితమౌతున్నాడు. లేకపోతే శరీరం పడిపోతుంది. ఒక్కొక్క ప్రాణిలో పరిమితంగా ఉన్న ప్రాణశక్తి విశ్వ చైతన్యమును ఆదియజ్ఞం అంటారు. దీనినే విరాట్ స్వరూపం పురుషుడు అంటారు. పురుషుడు అంటే సమస్త జీవరాసులలో ఉండే ఆత్మచైతన్యమే.
సూత్రం :- 53
"విశేషణ భేద వ్యాపదేషాభ్యాం చ నౌతరౌ '"
విశేషణం :-పరమేశ్వర సూచకాలైన విశేషణాలని భేద:- తేడాలని, వ్యపదేశభ్యాం :- చెప్పడం వలన, చ :-కూడా , ఇతరౌ :-ప్రకృతి, జీవాత్మలు రెండింటికి న:- అదృశత్వాది గుణాలు లేవు.
భావం: పరమేశ్వరుని సూచకాలైన విశేషణాలనూ, తేడాలును చెప్పడం వలన ప్రకృతి, జీవాత్మలకు అదృశ్యత్వాధి గుణాలు లేవు.
వివరణ:-ముండకోపనిషత్తు:-(2, 1, 1) ప్రజ్వలించే అగ్నినుంచి అనేకవేల అగ్నికణాలు ఎలా ఉద్భవిస్తాయో, అలాగే అక్షరమైన ప్రకృతి నుంచి పృధివ్యాదులు, అనేక కార్య వస్తువులు పుడుతున్నాయి. ప్రకృతి నుంచే సృష్టి జరిగిందని చెప్పారు. దాని కంటే వేరైనా పరమాత్మను, సమస్త భూతాలు పరమాత్మ నుండే ఉద్భవించినందున ఇలా అక్షరంగా, భూతయోనిగా వర్ణించారు. (2, 1 ,2 ):- పరమాత్మ దివ్యుడు, రూపం లేనివాడు, సృష్టికి లోపల బయట ఉండేవాడు, జన్మరహితుడు, ప్రాణ రహితుడు, మనోరహితుడు, ఏకర్మలు అంటని వాడు, స్వచ్ఛమైన వాడు, అక్షరం కన్నా సూక్ష్ముడు. అక్షరం అంటే ఇక్కడ ప్రకృతి. దాని కన్నా సూక్ష్మం జీవాత్మ. జీవాత్మ కన్నా సూక్ష్మం పరమాత్మ. పై మంత్రంలో ఉన్న విశేషణాలు పరమాత్మవే. అంతేకాక సూక్ష్మమైన జీవాత్మకన్నా సూక్ష్మమైనదని స్పష్టంగా వర్ణించారు. అదృశ్యాది గుణాలు భూతయోనిత్వం, దివ్యత్వం, అక్షరత్వం, ఈ విశేషణాలు జీవాత్మను ఉద్దేశించి ప్రయోగించినవి కావు. అక్షరాత్ పరతః పరః అనే శబ్దజాలం సర్వాంతర్యామి సూక్ష్మతమమయిన పరమాత్మను సూచిస్తాయి. కానీ జీవుడుకి ప్రకృతికి కాదు. జీవుడు అవిద్య చేత ఏర్పడిన నామ రూపాత్మకమైన జగత్తు మీద అభిమానం కలిగి వాటి ధర్మాలను తన మీద కల్పించుకోవడం చేత ఈ దివ్యత్వాది లక్షణాలు కుదరవు కదా! అక్షరం అంటే నామరూపాలకు బీజమైనది. ఈశ్వరశక్తి రూపమైనది. భూతముల యొక్క సంస్కారాలతో కూడినది. ఈశ్వరుడు ఆశయంగా కలది. ఆఈశ్వరుడి ఉపాధి అయిన అన్యాకృతం (సృష్టికి పూర్వం జగత్తు ఈశ్వరుని యందు విలీనమై ఉన్న పూర్వ వ్యవస్థ.). అది సమస్త వికారములతో కూడినది. ఈ విధంగా వికార పరమైన ఆ అక్షరం కంటే పరమైనవాడు పరమేశ్వరుడు అని, భేదం చేత భిన్నమైనవాడు అని చెప్పడం వలన పరమేశ్వరుడే భూతయోనిగా ప్రతిపాదింపబడుచున్నాడు.
సూత్రం :- 54
"రూపోప న్యాసా చ్చ "
రూప ఉపన్యాపాత్:- పరమాత్మ రూపకధనం ఉపనిషత్తులలో చెప్పినందువల్ల చ:- కూడా, జీవ ప్రకృతులు భూత యోనులు కానేరావు.
భావం:- పరమాత్మ యొక్క రూపాన్ని ఉపనిషత్తులలో చెప్పినందు వరన కూడా జీవాత్మ, ప్రకృతులు భూతయోనులు కానేరావు.
వివరణ:- పరమాత్మ రూపాన్ని చెప్పడం వలన భూత యోని అంటే పరమాత్మే కానీ వేరు కాదు.
ముండకోపనిషత్తు:- ( 2, 1, 3 ):- ఈ ప్రకృతి నుంచి ప్రాణం, మనస్సు, ఇంద్రియాలు, ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి, ఉత్పన్నమౌతున్నాయి. అది ప్రకృతి వర్ణన. (౨ 1 4 ):- ఆయనకు ఆగ్ని తల, చంద్రసూర్యులు నేత్రాలు, దిక్కులు చెవులు, వేదాలు వాక్కు, వాయువు ప్రాణం, విశ్వం హృదయం, పృధివి పాదాలు, ఆయన సర్వభూతాంతరాత్మ, ఈ వర్ణన జీవప్రకృతులకు చెల్లదు. ప్రకృతి, పంచభూతాలు అంతరాత్మ కానేరదు. ప్రకృతి జీవులకన్నా సూక్ష్మం కాదు. కనుక జీవులకు అంతరాత్మకాజాలదు. జీవుడుకూడా సర్వాంతర్యామికాలేడు. ప్రకృతికి, జీవుడికి ఈశ్వరుడే అంతరాత్మ. వేదాలలో పరమాత్మ యొక్క సర్వాంతర్యామత్వాన్ని వర్ణించారు. ఋగ్వేదం:- విశ్వతః చక్షురుత విశ్వతోముఖః విశ్వతో భాహురుత విశ్వతస్పాత్ 'సహస్రశీర్షా పురుషా సహస్రక్ష: సహస్రపాత్(8,417,1) పరమాత్మ నేత్రాలు, ముఖం, చేతులు, విశ్వమంతా ఉన్నాయి. ఆయన అంతా వ్యాపించిఉన్నాడు. దీనివల్ల భూతయోని అక్షరం ఈశ్వరుడే. ఆపరమేశ్వరుని నుంచే చతుర్వేదాలు, మంత్రాలు పుట్టినవి. మౌంజీ బంధనాది దీక్షలు, అగ్నిహోత్రాది యజ్ఞాలు, దక్షిణలు, యజ్ఞాలకు కాల ప్రమాణం, సూర్య చంద్ర లోకాలు, ఉత్తరాయణ, దక్షిణాయన మార్గాలు పుట్టాయి. అష్టవశువులు, ఏకాదశరుద్రులు, ద్వాదశాదిత్యులు, పుట్టారు. కర్మాధికారంగల మానవులు పుట్టారు. పశువులు, పక్షులు, ఉశ్వాసనిశ్వాసలు, ధ్యానాలు, పురుషార్ధాలు సాధించడానికి వీలైన తప్పస్సు, శ్రద్ధ. మితభాషణ, హితభాషణ, అష్టవిధ మైధునాలు త్యజించడం ద్వారా ఆచరించే బ్రహ్మచర్యం, పుట్టాయి. పరబ్రహ్మం నుంచే సప్తప్రాణాలు (కళ్ళు 2 ముక్కులు 2 చెవులు 2 నోరు 1)పుట్టాయి. 7 ఆహుతులు, 7 ప్రాణాలు సంచరించే స్థానాలు, సప్త సముద్రాలు, పర్వతాలు, నదులు, వివిధరకాల ధాన్యాలు, షడ్రుచులు, అన్ని పరమాత్మ నుంచే పుట్టాయి అని చెప్పబడినది. అంటే ఆరూపాలన్ని పరమాత్మవే. ఈరూపం జీవుడిది కాదు. సర్వ భూతాలకు ఆత్మగా ఉండటం ప్రకృతి లక్షణం కాదు. ఈ లక్షణాలన్నీ పరబ్రహ్మవే. అదృశ్యాది రూపం గలది, భూతాయోని పరబ్రహ్మ తప్ప వేరేమి కాదు.
వైశ్వానరాధికరణం:- ( 1, 2 ,24 )
సూత్రం :- 55
'వైశ్వానరః సాధారణ శబ్ద విశేషాత్"
సాధారణ శబ్ద విశేషాత్.. వర్ణనలో ఉన్న ఆత్మ వైశ్వానరుడు లాంటి పదాలకు విశేషార్ధాలు తెలియజేయడం వలన వైశ్వానరః:-ఛాందోగ్యంలో పఠించిన వైశ్వానరుడు పరబ్రహ్మకు
భావం:- ఆత్మను వైశ్వానరుడు అని వర్ణించుట వలన ఛాందోగ్యంలో పఠించిన వైశ్వానరుడు పరబ్రహ్మమే.
వివరణ:- గురువుగారు! ఆత్మ అంటే జీవాత్మ, పరమాత్మ అలాగే వైశ్వానరుడు అంటే జఠరాగ్ని, భూతాగ్ని, అగ్ని దేవుడు. వీరిలో ఎవరు వైశ్వానరుడు అని అడిగాడు కృష్ణశర్మ. శిష్యుని సందేహం విని కృష్ణ శర్మ ఇలా చెబుతున్నాడు. సాధారణ శబ్ద విశేషాల చేత వైశ్వానరుడు పరమాత్మే.
ఛాందోగ్యోపనిషత్తు:- ఐదుగురు మహా శ్రోత్రియులు ఒక చోట చేరి మీమాంస చెయ్యడం మొదలు పెట్టారు. ఉపమన్యుని కుమారుడు ప్రాచీన శీలుడు, పులుషుని కుమారుడు సత్య యజ్ఞుడు, భల్లుని కుమారుడు ఇంద్రద్యుమ్నుడు, శర్కరాక్షుని కుమారుడు జనుడు, అశ్వతరాస్యుని కుమారుడు బుడిలుడు, వీరందరూ ఆత్మ అంటే ఏమిటి ? బ్రహ్మం అంటే ఏమిటి? అని తర్కించుకుంటూ ఒక నిర్ణయానికి రాలేక. ఈ వైశ్వానరాత్మ అంటే బాగా తెలిసినవాడు ఉద్ధాలకమహర్షి అని నిశ్చయించుకొని ఆయన దగ్గరకు వెళ్లారు. ఆయన వీరిని తీసుకొని కేకయ దేశాధిపతి అయిన అశ్వపతి దగ్గరకు వెళ్లారు. వైశ్వానరాత్మను గురించి బోధించమని ప్రార్ధించారు. రాజు వీరందరినీ విడివిడిగా వైశ్వానరాత్మను ఎలాఉపాసన చేస్తున్నారని అడిగాడు. వారు ద్యులోక, వైశ్వానర, ఆదిత్య, వాయు, ఆకాశ, అప్, పృధ్వి లను ఉపాసిస్తున్నామని చెప్పారు. అందుకు రాజు మీరు చేస్తున్న ఉపాసన తప్పు. మీరు నన్ను అడగకుండా సుతేజస్వ, విశ్వ రూపత్వం, పృథగ్వర్మాత్మవ్వ, బహలవ్యరయిత్వా, ప్రతిష్టాత్మ మొదలైన గుణాలున్ట్లు వైశ్వానరుని అంగాలైన ద్యుసూర్యాదులనే వైశ్వానరుడుగా భావించి, ఉపాసించినట్లైతే, అప్పుడు వరుసగా మీకు శిరస్సు పడిపోవడం, అంధత్వం, ప్రాణాలు పోవడం, దేహం శిథిలం అయిపోవడం, పాదాలు పగిలిపోవడం, జరిగిఉండేది. అవి అంగాలను ప్రత్యేకంగా ఉపాసించ డాన్ని నిందించి, సుతేజస్త్వం అనే గుణం కల ద్యులోకం ఆత్మ అయిన ఈ వైశ్వానరుని శిరస్సు, విశ్వరూపత్వం అనే గుణం గల సూర్యుడు నేత్రం ఇత్యాది రీతిలో ద్యుసూర్యాదులు మూర్ధనులని చెప్పి, సమస్త వైశ్వానర ధ్యాన విధానాన్ని బోధించాడు. ద్యు సూర్య, వాయు, ఆకాశ, పృధ్విలలో సుతేజస్త్వాది గుణాలున్న వాటిని వేరువేరుగా ఉపాసించకూడదు. ఈ వైశ్వానరునకు పగలు తల, సూర్యుడు కన్ను, వాయువు ప్రాణం, దేహ మద్యం ఆకాశం, మూత్రం జలం, పాదాలు పృధివి, ఉరస్సు వేది, రోమాలు దర్భాలూ,హృదయం గర్హపత్యాగ్ని, మనస్సు అన్వాహార్యం, నోరు ఆహవనీయం, ఈ వాక్యాలలో వైశ్వానరం ఏది? జఠరాగ్నా? భూత్వగ్నా సూర్యుడా జీవాత్మయా పరమాత్మయా అనే సందేహం కలుగుతోంది. ఈ ఉపనిషత్ వాక్యంలో వైశ్వానరపదాన్ని అన్ని అర్ధాల్లోనూ వాడారు కదా !అంటే బృహదారణ్య కోపనిషత్తు 5 9 1 ) అయమగ్నిః వైశ్వానరో యో యామంతః, పురుషేయేనేద మన్నం పచ్యతే యదిద మధ్యతే. పురుషుడు తినే అన్నాన్ని పచనం చేసే అగ్ని వైశ్వానరం. వైశ్వానరం అంటే జఠరాగ్ని. శతపద బ్రాహ్మణము:-వైశ్వానరం అంటే భూతాగ్ని. ఋగ్వేదం:-దేవతలు అన్ని ఈభువనాలకు వైశ్వానరాగ్నిని పగళ్లకు కేతువుగా చేశారు. ఇక్కడ సూర్య దేవతార్ధంలో వైశ్వానర శబ్దాన్ని ప్రయోగించారు.
కఠోపనిషత్తు:-(౧ 7):-వైశ్వానరః ప్రవిశత్య తిధిః బ్రాహ్మణో గృహాన. వైశ్వానరుడు బ్రాహ్మణ అతిధి ఇంటికి వచ్చాడు. ఇక్కడ వైశ్వానర శబ్దం జీవాత్మ పట్ల ప్రయోగించారు.కాగా ఛాందోగ్యంలో పఠించిన వైశ్వానరుడు పరబ్రహ్మమే. ఇక్కడ ఆత్మానాం వైశ్వానరః ముపాస్తే. అని ఆత్మ శబ్దం లో విశిష్టమై ఉన్నది. మనకు అక్కడక్కడ కనిపించే ప్రయోగాలు పరమాత్మ వాచకంగా ఉన్నాయి.
తైత్థరీయోపనిషత్తు:-(౨ 1)తస్మాద్వా ఏతస్మాదాత్మక ఆకాశః సంభూతః. ఆఆత్మ వలన ఆకాశం జనించింది. ఇలాంటి వాక్యాలలో ఆత్మ అంటే పరమాత్మ. కనుక ఆత్మ శబ్దంతో బాటు వచ్చిన వైశ్వానర శబ్దం కూడా పరమాత్మ బోధకమే. వైశ్వానరాత్మకు ద్యులోకం శిరస్సు అన్నారు.ద్యులోకం జీవాత్మకు మూర్ధ కాజాలదు అని తెలియజేశారు. అందువలన వైశ్వానర పదం పరమాత్మ బోధకమే.
వైశ్వానరాధికరణం:- ( 1, 2, 25 )
సూత్రం :- 56
"'స్మర్య మాణ మను మానం స్వాదితి'"
స్మర్యమాణం :- స్మృతులలో వర్ణించిన పరమేశ్వరుడి రూపమే, అనుమానం:- దీనికి ప్రమాణం ఇతి స్వాత్:- అందువల్ల వైశ్వానర శబ్దం పరమాత్మ వాచకమే.
భావం:- స్మృతులలో వర్ణించిన పరమేశ్వరుడి రూపం ప్రమాణంగా వైశ్వానర శబ్దం పరమాత్మ వాచకమే.
వివరణ:- అధర్వణ వేదం :- పరమాత్మకు భూమి-పాద పీఠం, అంతరిక్షం-ఉదరం, ద్యులోకం-శిరస్సు, సూర్యచంద్రులు- నేత్రాలు, అగ్ని-ముఖము, ఆకాశం-నాభి, దిక్కులు-శ్రోత్రములు, అయినాయో అలాంటి బ్రహ్మానికి నమస్కారం. ఇక్కడ చెప్పిన వైశ్వానరుడు పురాణాల్లోని పరమేశ్వరుడు ఒక్కరే. అగ్నిర్ముర్దా అనే ముండకవాక్యంలో వర్ణించిన రూపం పరమాత్మ వాచకమే. ఛాందోగ్యమంత్రం తస్యహవా ఏతస్య అని వైశ్వానరరూపవర్ణన చేశారు. ఈ వర్ణన వేదమంత్రాలలోని పరబ్రహ్మ రూపాన్ని స్ఫురింపజేస్తుంది. అందువల్ల ప్రకరణంలో ఉండే వైశ్వానరపదం పరమాత్మ బోధకమే. ఈ వైశ్వానరశబ్దం పరమేశ్వరుణ్ణి బోధిస్తుంది అనడానికి అనుకూలంగా అనగా లింగంగా, ఉహింపజేసేదిగా అవుతుందని అర్ధం. ఉహించడానికి శక్యం కాని రూపం గల అతడే సకల భూతాల కారణం అని గ్రహించాలి. కొన్ని చోట్ల స్మృతిలో చెప్పిన విషయానికి సమర్ధమైన శృతి లభించక పోవచ్చును. దానికి విరుద్ధమైన శృతివాక్యం ఉండి ఉంటుంది. కానీ మనకిప్పుడు లభ్యం అవడం లేదని అనుకోవాలి. ఈ విధంగా స్మృతి వాక్యం శృతి వాక్యానికి అనురూపకం. ఉహింపజేసేది. ఇది మీమాంసులు చెప్పే వేదాంతులు కూడా అంగీకరించిన పద్ధతి.
భగవద్గీత:- "అహం వైశ్వానరో భూత్వా ప్రాణినామ్ దేహమాశ్రితః|ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్" శ్రీకృష్ణ పరమాత్మ వైశ్వానరుడు అనే అగ్ని రూపంలో ప్రాణుల శరీరంలో ఉంటూ, వారి శరీరాలకు కావలసిన వేడిని ఇస్తూ, వారు తిన్న4 విధములైన ఆహారమును పచనం చేస్తున్నానని చెప్పాడు. బయటేకాదు. జీవరాసులలో లోపల కూడా అగ్ని రూపంలో ఉండేది వైశ్వానరుడే. అదే జాఠరాగ్ని. ప్రాణులు తిన్న 4 విధములైన ఆహారపదార్ధాలను భక్ష్యాలు, భోజ్యములు, లేహ్యములు, చోష్యములను జీర్ణం అయ్యేలా చేసున్నాడు. లోపల ఉన్న జఠరాగ్ని బాగా ప్రజ్వరిల్లాలంటే గాలి కావాలి. అదే మనం పీల్చే గాలి. ఈ ప్రాణ వాయువు లోపల ఉన్న అగ్నికి శక్తినిస్తుంది. ఆ జఠరాగ్ని మనం తినే ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. అందుకే గాయత్రి మంత్రం చెబుతూ భోజనం ప్రారంభిస్తారు. ఆ ఆహారం పరబ్రహ్మ స్వరూపం, అది జీర్ణం చేసే వైశ్వానరుడు పరబ్రహ్మమే.
సూత్రం :- 57
శబ్దాది భ్యోన్తః ప్రతిష్టానాచ్ఛ నేతి చేత్ న, తథా దృష్ట్యుపదేశ సంభవాత్ పురుషమపి చైవ మధియతే :-
శబ్దాదిభ్యః;- వైశ్వానరశబ్దం తల, శ్రోతం లాంటి అవయవాలతో జోడించి చెప్పడంవలన, అంతఃప్రతిష్టానాత్:- శరీరంలో ఉన్నందు వలన, న;- వైశ్వానరః పదం పరమాత్మను బోధించదు, ఇతి చేత ;- అని భావించడం, న:- సరి అయినది కాదు. తదా దృష్టి ఉపదేశాత్:- వైశ్వానర శబ్దం పరమాత్మ అర్ధంలోనే ప్రసిద్ధమైనది. అసంభావాత్:-ఇతర జీవాత్మ లాంటి అర్ధాలలో శిరస్సు, మొదలైన అవయవ దృష్టి అసంభవం. పురుషం అపిచ:- శరీరంలో ఉండే అంతర్గత చైతన్యంగా, ఏవమ్ :- వైశ్వానరుణ్ణి, అధీయతే:- పఠిస్తున్నాను.
భావం:- వైశ్వానర శబ్దం తల, శ్రోతం మొదలైన అవయవాలతో జోడించడం వలన, శరీరంలో ఉన్నందువలన, వైశ్వానర పదం పరమాత్మను బోధించదు అని భావించడం సరియైనది కాదు. వైశ్వానర పదం పరమాత్మ అర్ధంలోనే ప్రసిద్ధమైనది. ఇది జీవాత్మకు అసంభవం. శరీరంలో ఉండే అంతర్గత చైతన్యంగా వైశ్వానరుణ్ణి పఠిస్తున్నాను.
వివరణ:- వైశ్వానర శబ్దం అగ్నికి పరమాత్మకు కూడా సంబంధించినది. అంతే కాని జఠరాగ్నికి కాదు. ఈ ప్రకరణంలో జఠరాగ్ని రూపంలో పరమేశ్వరోపాసన చెప్పబడింది. అంతే కాని వైశ్వానరుడు పరమాత్మే.
ఛాందోగ్యోపనిషత్తు:- వైశ్వానర పదం ఆత్మ శబ్దంతో సమ్మిళితమై ఉంది. అందువల్ల అది జఠరాగ్ని లాంటి ఇతర శబ్దాలకు వర్తించదు. శిరస్సు లాంటి అవయవాలతో వర్ణించినవి కావు. పృధివి నుండి ద్యులోకం వరకు ఉన్న ప్రదేశాలలో ఒక్కొక్క దాన్ని వైశ్వానరాత్మగా భావించి, ఉపాసించి, మూర్ధ పతనం లాంటి అర్ధాలు గ్రహించకుండా ఉండేందుకు పరమాత్మను విరాట స్వరూపునిగా తెలిపేందుకు అశ్వపతి అలా పోలికలతో వర్ణించాడు. నిరాకారుడైన పరమాత్మకు వాస్తవంగా అవయవాలు ఉండవు. వైశ్వానరుడు సర్వాంతర్యామి,సర్వాధారుడు, శరీర కాదు. పరమాత్మ సర్వ ప్రపంచాంతర్వర్తి అని వేదం, సర్వ భూతాంతరాత్మ అని కఠోపనిషత్తు తెలియజేస్తోంది. శరీరంలో ఉండే జీవులకు లాగా బ్రహ్మాండమంతా నిండి ఉన్న పరమాత్మకు ద్యులోకం లాంటివి అవయవాలని చెప్పడంలో విడ్డురం ఏమి లేదు.
ఋగ్వేదం:-(1, 4, 25, 1 ): వయా ఇదగ్నే, అగ్నయస్తే అన్యే త్వే విశ్వే అమృతా మాదయంతే, వైశ్వానర, నాభిరసి క్షితీనాం స్తూణేవ జనాన్ ఉపమిద్ యయందః. ఓ ప్రకాశ స్వరూపా! ఇతర అగ్నులు నీకు అవయవాలు. విశ్వాత్ముడవు అయిన నీలో అందరూ ముక్తులై ఆనందం అనుభవిస్తున్నారు. ఓ వైశ్వానరా! నీవు అన్ని పదార్ధాలలో అంతరాత్మగా ఉన్నావు. అన్ని ప్రాణుల్ని ఇంటిలో ఉండే స్తంభం లాగా ఆధారంగా దరిస్తున్నావు. ఇలా వేదంలోను అవయవ కల్పన ఉన్నది. ఇది పరమేశ్వరుణ్ణి వర్ణించే శైలి అనుకోవాలి. అంత మాత్రాన ఆయనకు అవయవాలు ఉంటాయని కాదు. వాజసనేయులు వైశ్వానరుణ్ణి పురుషాంతర్వర్తి అని అంటారు. అందువల్ల వైశ్వానర శబ్దం పరబ్రహ్మ వాచకమే కానీ జఠరాగ్ని లాంటి వాటిని బోధించదు.
సూత్రం :- 58
"'అత ఏవ న దేవతా భూతం చ "'
అత ఏవ :- పై కారణాల వలన దేవత:- సూర్యాదిదేవతలు, భూతం:- ఆకాశాది భూతాలు, చ:-కూడా న:- వైశ్వానరుడు కారు.
భావం:- సూర్యుడు అగ్నిమయుడు. ద్యులోకంలో (సూర్యలోకంలో) ప్రకాశిస్తుంటాడు. ద్యోతకం అంటే ప్రకాశం. అతడు వెలుగుని, వేడిని ఇచ్చి ప్రకాశిస్తుంటాడు. కనుక సూర్యుణ్ణి దేవత అంటారు. సూర్యాది దేవతలు, ఆకాశాది పంచ భూతాలు వైశ్వానరుడు కారు.
వివరణ:- నిరుక్తము:-( 7 ,5 ):-దేవో దానాద్ దా దీపనాద్వా ద్యోతనాద్వా ద్యుస్థానో భవతీతివా' దానం, దీపం, ద్యోతనం, ద్యుస్థానంలో ఉండటం అనే గుణాల వలన దేవత అని అంటారు. అగ్ని కానీ సూర్యుడు కానీ పంచ భూతాలు కానీ వైశ్వానరః పదవాచ్యాలు కానేరవు. వీటికి ద్యులోకం మొదలైనవాటికి పరమాత్మకు శిరస్సులాంటి అవయవాలుగా కనిపించవు. ఇవి సర్వాంతర్యామి, సర్వాధారం కాలేవు. లేదా పురుషునితో (పరమాత్మ) పురుష పదవాచ్యాలు కూడా కావు. కనుక వైశ్వానరః పదం పరమాత్మ వాచకమే కానీ సూర్యాదులకు వర్తించదు. సూర్యుడు స్వయంప్రకాశకుడు. తనకు తానుగా ప్రకాశిస్తూ, లోకానికి వెలుగుని , వేడిని, కాంతిని ఇస్తూ జీవకోటి మనుగడకు ఆధారమౌతున్నాడు. సూర్యుని యొక్క వెలుగు చంద్రుని మీద పడటం వలన చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. సూర్యుడు ఆనంతకోటి విశ్వంలో ఒక నక్షత్రం మాత్రమే. ఆ నక్షత్రం కూడా కొంత కాలానికి వేడిని, వెలుగును కోల్పోతుంది. సూర్యుడికి ప్రకాశించే శక్తినిచ్చిన పరమాత్మ కాలాతీతుడు. సూర్యుని వలన, చంద్రుని వలన ప్రకాశింపబడడు. అలాగే భూమిమీద వెలుగునిచ్చేది అగ్ని. రాత్రి పూట దీపం రూపంలో కాంతులు వెదజల్లితే ఆవెలుగులో అన్ని వస్తువులు చూడగలరు. ఇవేమీ లేకపోయినా కళ్ళు మూసుకుంటే అన్ని వస్తువులు కనిపిస్తాయి. అక్కడ పరమాత్మ జ్ఞాననేత్రం ఉంటుంది. పరమాత్మను చూడాలంటే జ్ఞానజ్యోతి సాయంతో పరమపదం చేరుకోగలరు. మంత్రవర్గంలో భూతాగ్ని కూడా ద్యులోకాదులలో సంబంధం ఉన్నట్లు కనబడటం వలన అగ్నిని పరమేశ్వరుని ముఖంగాను సూర్యలోకాన్ని పరమేశ్వరుని శిరస్సుగాను పోల్చి చెప్పినందున, అలాంటి భూతాగ్నికి ఐశ్వర్యం ఉండటం వలన సూర్యాది దేవతలు పంచభూతాలు వైశ్వానరుడని చెప్పడం తగదు. ఉష్ణత్వం, ప్రకాశం స్వరూపంగా గల భూతాగ్నికి ఐశ్వర్యంతో సంబంధం ఉన్నా కూడా ద్యుమూర్ధత్వాది కల్పన కుదరదు. ఎందువలననగా అది సూర్యలోకానికి కారణం కాదు. దాని ఐశ్వర్యం కూడా పరమాత్మ మీదనే ఆధారపడి ఉన్నది. నిరాకరుడు, సర్వాంతర్యామి అయిన పరబ్రహ్మకు మాత్రమే వైశ్వానరుడు శబ్దం వర్తిస్తుంది.
సూత్రం :- 59
"సాక్షాద ప్యవిరోధం జైమినిః"
సాక్షాత్:- వైశ్వానర శబ్దం సాక్షాత్తు పరబ్రహ్మాన్ని తెలుపుతుందని, అవిరోధం అపి :- ఏ మాత్రం విరోధం లేదని జైమినిః :- జైమిని మహర్షి అంటున్నాడు. విశ్వేషామ్:- సమస్త చేతనాలకు, నేత:-కర్మ ఫలాన్ని ఇచ్చే స్వామి, విశ్వానరుడు.
భావం:- వైశ్వానర శబ్దం సాక్షాత్తు పరబ్రహ్మాన్ని తెలుపుతుందని, ఇందులో ఏ మాత్రం విరోధం లేదని, సమస్త చేతనాలకు కర్మ ఫలాన్ని ఇచ్చే స్వామి వైశ్వానరుడేనని జైమిని మహర్షి అంటున్నాడు. విశ్వానరుడే వైశ్వానరుడు.
వివరణ:-వైశ్వానర పదానికి అగ్నికి సంబంధం ఉంది. వైశ్వానర పదం పరమాత్మకు సంబంధించినది.అంతే కాని జఠరాగ్నికి కాదు. ఈప్రకరణంలో జఠరాగ్ని రూపంలో పరమేశ్వరోపాసన చెప్పబడింది. అంతే కాని వైశ్వానరుడు పరమాత్మే. ఎందువలన ఆయన్ని వైశ్వానరుడు అన్నారు? సమస్తజీవులకు కర్మఫలాన్ని ఇస్తాడు. లేదా వాళ్ళు తమతమ కర్మఫలాన్ని అర్ధించ డానికి ఆయన దగ్గరకు వస్తారు. ఇలా విశ్వానికి అధికారి పరమాత్మే కానీ వేరెవరు కాదు. పరమాత్మ జడమైన చేతనాత్మక కార్యాలన్నింటికి రాజు. ఆయనే భూత భవిష్యత్ వర్తమానాలతో కూడిన ఈ ప్రపంచానికి అధిష్టానం అని ఋగ్వేదం పేర్కొంది.
అధర్వణ వేదం :- ఈశ్వరుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని అతిక్రమించి విరాజిల్లుతున్నాడు. సర్వం అతడిలో ప్రతిష్ఠితం. ఆయనే సర్వానికి ఈశ్వరుడు. సర్వం అతని వశంలో ఉన్నది. అలాంటి ప్రాణ రూపుడైన పరమాత్మకు నమస్కారం. ఇలా వేదాలు ఈశ్వరుడి సర్వాధిపత్యాన్ని గురించి తెలియజేస్తున్నాయి. సర్వలోకాంతర్యామిత్వం, సర్వకర్మఫలం, దాతృత్వం, సర్వనాయకత్వం, పరమాత్మలోనే ఉన్నాయి. కనుక వైశ్వానర శబ్దం పరబ్రహ్మ వాచకమే. జఠరాగ్నిని ఉపాధిగా గల పరమేశ్వరుడు ఉపాసించదగినవాడు అని ఇంతకుముందు చెప్పబడింది. ఏఉపాధి లేకుండానే పరమేశ్వరుని ఉపాసించ వచ్చని జైమినిమహర్షి చెబుతున్నాడు. జఠరాగ్నిని గ్రహించని పక్షంలో, పరమేశ్వరుడు అంతరంలో జఠరాగ్ని రూపంలో లోపల ప్రతిష్టింపబడ్డాడని చెప్పడం విడ్డురం కదా! అది విడ్డురం కాదని చెబుతున్నారు. జఠరాగ్నిని ఉద్దేశయించి ఏ శబ్దం చెప్పబడలేదు. దానిని బోధించే పదం లేదు. తల మొదలు గడ్డం వరకు ఉన్న పురుషావయవాలు వృక్షం మీద శాఖలు ప్రతిష్ఠితమై ఉన్నట్లుగా భావించాలి. అంతస్టం అంటే ఉదరంలో ఉందని కాదు. నఖ నుండి శిఖ వరకు శిరస్సు నుండి చుబుకం వరకు ఉన్న అవయవాలు చెట్టుమీద కొమ్మలు ఉన్నట్లుగా భావించాలి. వాటిలో వైశ్వానరుణ్ణి శాఖమీద కూర్చున్న పక్షి వలే వృక్షం లోపల ఉన్నది అని చెప్పినట్లుగా పురుషాంతర ప్రతిష్ఠితుడు అని చెప్పవచ్చును. అంతస్టః అంటే సాక్షి అని మరొక అర్ధం ఉంది. జీవుని యొక్క శుద్ధ చైతన్యరూపం పురుషునితో సాక్షిగా ఉన్నది. వైశ్వానర పదం పరమాత్మ విషయంలో వర్తించగలదు. తన ఆత్మగా గాని, తన అధీనులుగా కలవాడు అని వైశ్వానర శబ్దానికి పరమాత్మ అని అర్ధం చెప్ప వచ్చును.
సూత్రం :- 60:
"అభి వ్యక్తే రీత్యా శ్శరధ్యః
అభివ్యక్తేః:-పరమేశ్వరుడు ప్రాదేశమాత్రుడు (జానెడుప్రమాణం కలవాడు అనిఅర్ధం) అభివ్యక్తిని బట్టి అనగా పరమేశ్వరుడు ఆ విధంగా సాక్షాత్కరిస్తాడు అని అశ్మరధుడు అనే ఆచార్యుడు అన్నాడు. ఇతి :- అని. అశ్మరధ్యః- అశ్మరధుడు అనే ఆచార్యుడు అభిప్రాయం.
భావం:- ఉపాసకుల హృదయంలో వ్యక్తం కావడం వలన పరమాత్మ ప్రాదేశమాత్రుడుగా జానెడు ప్రమాణంలో సాక్షాత్కరిస్తాడని అశ్మరధుడు అనే ఆచార్యుడి అభిప్రాయం.
వివరణ :- ఉపాసకులకు అనుగ్రహించడం కోసం హృదయం మొదలైన స్థానాలలో ఉంటున్నాడు. అతడు ఉండే స్థానాన్ని బట్టి స్వల్ప పరిమాణం గలవాడని అశ్వరధుడు అనే ఋషి చెప్పాడు. మోక్షాన్ని కోరుకునే వాళ్ళు అనన్య భక్తితో ఈశ్వరుణ్ణి వేద విధానాలతో ఉపాసిస్తారు. ప్రకృతిని దాని వలన కలిగే కార్యాన్ని విడిచిపెట్టి వాళ్ళు క్రమంగా ఆత్మస్థితులౌతారు. భగవంతుని అనుగ్రహం ఆయనకు మనం ఏమి ఇచ్చామో అనే దాని మీద ఆధారపడి ఉండదు. ఇచ్చినవాడి మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. అతడి మనస్సులో నిర్మలమైనభక్తి. ఏకాగ్రమైనభక్తి, అనన్యభక్తి ఉంటే చాలు. మనస్సును పరమాత్మకు అర్పించి శరణు కోరితే నిశ్చయంగా భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. భగవంతుని మీద భక్తి నిలిపి మనసును లగ్నంచేసి, అహంకారాన్ని వదలి వేసి, పరమాత్మే పరమగతిగా భావించాలి. ఇక్కడ హృదయపుండరీకం భౌతికం కావడం వలన దాన్ని శాస్త్రజ్ఞులు ప్రాదేశమాత్రం అంటారు. హృదయంలో ప్రకట మవడం చేత పరమాత్మ ప్రాదేశమాత్రుడు అంటారు. ప్రాదేశమాత్రుడికి అంగుష్ఠమాత్రుడికి తేడా ఏమీ లేదు. ఈ రెండు ఈశ్వర వచకాలే.
కఠోపనిషత్తు:-(6 ,17):- అంగుష్ఠమాత్రః పురుషోన్తరాత్మ, సదా జనానాంహృదయే సన్నివిష్ఠః. అంగుష్ఠమాత్రుడు అంతరాత్మ అయిన పురుషుడు జీవుల హృదయంలో సదా సన్నివిష్ఠుడై ఉంటాడు. కనుక వైశ్వానరుడైన ఈశ్వరుణ్ణి ప్రాదేశమాత్రుడుగా వ్యవహరిస్తారు. మహాప్రమాణం కలవాడైన పరమేశ్వరుడు ప్రాదేశమాత్రుడని చెప్పడం అభివ్యక్తిని బట్టి కావచ్చును. పరమేశ్వరుడు ఉపాసకులకు జానెడు ప్రమాణంలో సాక్షాత్కరిస్తాడు. ప్రాదేశమాత్రానికి మరొక అర్ధంచేబుతారు. పరమేశ్వరుని స్థానాలైన హృదయాది ప్రదేశాలలో విశేషించి అభివ్యక్తు డౌతాడు. అందువల్ల అభివ్యక్తిని బట్టి. పరమేశ్వని యందు కూడా ప్రాదేశమాత్ర శృతి కుదురుతుంది.
సూత్రం :- 61
అనుస్మృతేః బాదరిః
అనుస్మృతే:- ప్రాదేశమాత్రమైన హృదయంలో ఉన్న మనస్సు చేత స్పరించడం వలన, బాదరి: :- బాదరి ముని అభిప్రాయం.
భావం:- ముందు శ్రద్ధగా విని, పిదప స్మరించడం, చింతన చెయ్యడం, ద్వారా పరమాత్మ ప్రాదేశ మాత్రుడని బాదరి ముని అభిప్రాయం.
వివరణ:- బాదరి అనే ఆచార్యుడు ధ్యానం వల్ల ప్రాదేశ మాత్రుడుగా చెప్పబడుచున్నాడని చెప్పాడు. పరమేశ్వరుడు సర్వ వ్యాపకుడు. అయినప్పటికీ కుంచంతో కొలిచిన బియ్యం కుంచంబియ్యమే ఉన్నట్లుగా, పరిభిన్నమైన మనస్సుతో ధ్యానం చేస్తున్నాం కాబట్టి పరిభిన్నుడుగా చెప్పబడుచున్నాడు. పరమాత్మ గురించి శాస్త్రాల వల్ల తెలుసుకొని, తరువాత ఆయన సాక్షాత్కారం కోసం ముముక్షువులు తమ హృదయాలలో సదా ఆయన్ని స్మరిస్తుంటారు. దీనినే ఉపాసన అంటారు. యోగులు హృదయపుండరీకాన్ని ప్రాదేశమాత్రం అని వ్యవహరిస్తారు. అందువల్ల అందులో ఉపాసించే ఈశ్వరుణ్ణి ప్రాదేశమాత్రుడు అంటారని బాధరముని అభిప్రాయం. ఈ పరమాత్మ గుప్పెడంత హృదయంలో ఉన్న మనస్సు చేత స్మరించబడతాడు. అందుచేత ప్రాదేశమాత్రుడని చెప్పబడుచున్నాడు. కుంచంతో కొలిచిన బియ్యం కుంచమే ఉన్నట్లుగా హృదయంలో ఉన్న పరమాత్మ హృదయమంతే ఉంటాడు. నిజానికి పరమాత్మకు ఒక రూపం, ఆకారం ఏమి ఉండవు. ఆయన విశ్వమంతా నిండి ఉండగలడు. అణురూపంలోను ఉండగలడు. పరమాత్మ ప్రాదేశమాత్రుడు కాకపోయిన ప్రాదేశమాత్ర తత్త్వాన్ని చెబుతున్న శృతివాక్యాన్ని సార్ధకం చెయ్యడానికి ప్రాదేశప్రమాణం గలవానిగా స్మరించాలి. ఇది సూత్రానికి రెండవ అర్ధం. ఈ విధంగా పరమేశ్వరుని విషయంలో ప్రాదేశ సూత్ర శృతి అనుస్మృతిని బట్టి ఏర్పడినది బాదరి ఆచార్యుడు భావిస్తున్నాడు.
భగవద్గీత:-(9-22) అనన్యాశ్చింతయంతో మామ్ యేజనాః పర్యుపాసతే తేషామ్ నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం'. ఏ మానవుడు సర్వకాల సర్వావస్తల యందు నన్నే ధ్యానించుచున్నాడో అట్టివాని యోగక్షేమములు నేనే వహించుచున్నాను అని శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పాడు. సత్గ్రంధ పఠనం, సత్సాంగత్యం రెండూ భగవంతుని మీద భక్తిని పెంచుతాయి. సత్గ్రంధాలలోని భగవంతుని కథలను సత్సాంగత్యంలో నిత్యం శ్రవణం, మననం, నిధి, ధ్యాసలతో అనన్య భక్తిని పెంచుకోవాలి. ఇతరములైన ఆలోచనలు, చింతలు, భావాలు, మనస్సులో పెట్టుకోకుండా ఏకాగ్రచిత్తంతో నిరంతరం ధ్యానం చేస్తూ భగవంతుని యందు చిత్తమును లగ్నం చేసినవారి యోగక్షేమాలు ఆయనే భరిస్తానని హామీ ఇచ్చారు. అనన్యభక్తి అంటే సాటిలేని భక్తి, పోల్చలేని భక్తి. తమని తాము అర్పించుకుంటూ, ఏ పని చేస్తున్న పరమాత్మకు అర్పించుకోవడం, వారి ప్రయత్నం వారు చేస్తూ, ఇక వారి వల్ల కానప్పుడు నీవే తప్ప నితః పరంబెరుగ అనే స్థితికి వస్తే పరమాత్మే ప్రక్కన ఉండి వారి యోగ క్షేమలు చూస్తాడు. ఇలా స్మరణ చేసి ఉపాసించే వారి హృదయంలో ఉన్న ఈశ్వరుణ్ణి ప్రాదేశమాత్రుడని అంటారు.
సూత్రం :- 62
'సంపత్తే రీతి జైమినిః తథా హి దర్శయతి "
సంపత్తే :- సంపత్తి కారణంగా, ఇతి:-అని, జైమినిః:- జైమిని మహర్షి అంటున్నాడు. తధాహి :-అలాగే, దర్శయతి:- వాజసనేయ బ్రహ్మణాన్ని ఉదాహరిస్తున్నాడు.
భావం :-సంపత్తి కారణంగా పరమేశ్వరుడు ప్రాదేశమాత్రుడని జైమిని మహర్షి అంటున్నాడు. ఈ విషయంలో వాజసనేయ బ్రాహ్మణాన్ని ఉదాహరిస్తున్నాడు.
వివరణ :- వాజసనేయ బ్రహ్మణంలో ద్యులోకం మొదలు భూమి వరకు వైశ్వానరునికి శిరస్సు మొదలు గడ్డం వరకు అవయవాలుగా చెప్పబడినవి. ద్యులోకాది ప్రదేశాలు వైశ్వానరుడి అంగాలుగా వర్ణించడం చూశాము. ఇక ప్రాదేశమాత్రంలో తల నుంచి చుబుకం వరకు వుండే ముఖప్రదేశంలో తల, కళ్ళు, నాసిక, గడ్డం లాంటి అవయవాలతో వైశ్వానరుని వాజసనేయ బ్రహ్మణంలో ఇలా వర్ణించడం వలన ఆయన్ని ప్రాదేశమాత్రుడంటారని జైమినిముని ద్యులోకం నుంచి భూమి వరకు ఉన్న ప్రదేశాలు వైశ్వానరుడికి శిరస్సు లాంటి అవయవాలని శతపధ బ్రహ్మణంలో వర్ణించారు.
శతపధ బ్రాహ్మణము:-ఇప్పటి దాకా దేవతలను ప్రాదేశమాత్రంగా వివరించారు. ఇప్పుడు ఆయా దేవతలను అవయవాలుగా పోల్చి చెబుతాడు. వైశ్వానరవిద్యకు సమానప్రకరణమైన వాజసనేయ బ్రహ్మణంలో ద్యులోకం (సూర్యలోకం)మొదలు పృధివి వరకు ఉన్న అవయవాలను అధ్యాత్మము (శరీరము నందు)శిరస్సు మొదలు చుబుకం వరకు ఉన్న దేహావయవాలతో ఆరోపిస్తూ పరమేశ్వరునికి ప్రాదేశ మాత్ర సంపత్తిని చూపుచున్నది కదా! ప్రాదేశ మాత్రుడుగా కల్పించబడిన పరమేశ్వరుణ్ణి బాగుగా ఎరిగిన దేవతలు పూర్వం ఆ పరమేశ్వరుణ్ణి ప్రత్యగాత్మగా పొందారు. అదే విధంగా ద్యులోకం వైశ్వానరుడి మూర్ధ, అదే సూర్యుడు వైశ్వానరుని నేత్రమని, నాసికారంద్రాలలో ఉన్న ప్రాణాన్ని చూపుతూ వాయువుఅని, ముఖంలో ఉన్న ఆకాశాన్ని వైశ్వానరుడి దేహమధ్యమని, ముఖంలో జలం ఉదకమని అదే వైశ్వానరుడి మూత్రమనీ, భూలోకం చూపుతూ ఇదే పాదరూపమైన పృధివి అని అన్నాడు. చుబుకం అనగా ముఖం క్రింది భాగం గడ్డం వాజసనేయంలో ద్యులోకానికి అతిష్టాత్వగుణం అని ఆదిత్యునికి సుతేజస్త్వగుణమని చెప్పబడింది. ఇక్కడ అవయవాలను పోల్చడం సంపత్తి. ప్రాదేశం అంటే పరిమాణం. ఇదే జైమిని మహర్షి అభిప్రాయం.
సూత్రం :- 63
'ఆమనంతి చైన మస్మిన్ '
చ:-అంతేకాక, ఏనం:-వైశ్వానరుని, అస్మిన్:- శిరస్సుకు చుబుకానికి మధ్యనున్నట్లు, ఆమనంతి:- జాబాలులు పఠిస్తున్నారు.
భావం:- వైశ్వానరుని దివి నుండి పృధివి దాకా ఉండే ప్రదేశాలలో అవయవాలుగా చూడవచ్చునని ఛాందోగులు చెబుతారు. అందువలన వైశ్వానరుని ప్రాదేశమాత్రుడంటారని వ్యాసుని అభిప్రాయం.
వివరణ:- జాబాలిశాఖవారు పరమేశ్వరుని శిరస్సును గడ్డానికి మధ్యప్రదేశంలో ఉపాసించాలని అంటున్నారు. అభివృద్ధి కారణంగా ప్రాదేశమాత్రుడని ఆశ్మరధ్యుడు అన్నాడు. అనుస్మృతి వలన ప్రదేశమాత్రుడని బాదరి అన్నాడు. సంపత్తి కారణంగా ప్రాదేశమాత్రుడని జైమిని అన్నాడు. ద్యులోకాది ప్రాదేశనిమిత్తంగా ప్రాదేశమాత్రుడని వ్యాసుడు అన్నాడు. జగత్తును వివరించడానికి దాన్ని ద్యులోకం, ఆకాశం, వాయువు, జలం, పృధివి అని శాస్త్రంలో విభాగాలు చేశారు. ఆ ద్యులోకాన్ని పరమాత్మకు శిరస్సులాంటి అవయవాలుగా కల్పించారు. అప్పుడే ఆయన సర్వాంతర్యామిత్వం, సర్వ వ్యాపకత్వం, సర్వాధిష్టాతృత్వం బాగా బోధపడతాయని అలా పోల్చారు. అందువలన వైశ్వానరుని ప్రాదేశమాత్రు డంటారని వ్యాస మహర్షి మతం.
జాబాలోపనిషత్తు:- జీవుడు దేనియందు ప్రతిష్ఠితమై ఉన్నాడు? వరుణకు నాసికి మధ్య భాగంలో. వరుణ అంటే దేమిటి? ఇంద్రియాలు చేసిన అన్ని పాపాలను హరించేది. నాసి అంటే ఏమిటి? సర్వ పాపాలు నశింపజేసేది. అందుకే భ్రూనాసికల మధ్యభాగమే వారణాసి అని ద్యులోకానికి పరలోకానికి సంధి అని చెప్పబడినది. కాబట్టి వైశ్వానరుడు అంటే పరమాత్మ.
మాండుక్యోపనిషత్తు:-కనిపించే జగత్తంతా పరబ్రహ్మ స్వరూపమే. పైకి కనిపించే విశ్వం మాత్రమే బ్రహ్మకాదు. కనిపించ కుండా లోపల ఉండే ఆత్మ కూడా బ్రహ్మమే. అంటే కనిపించేది, కనిపించనిది కూడా బ్రహ్మమే. బ్రహ్మకు 4 పాదాలుంటాయి. అందులో మొదటి పాదం వైశ్వానరుడు. అంటే విశ్వంలోని నరులందరిలో సమానంగా ఉండేవాడు. వారందరికీ ప్రతినిధి విశ్వం యొక్క వ్యష్టి రూపం వైశ్వానరుడైతే, సమిష్టి రూపం విరాటస్వరూపం అని చెప్పబడినది. కాబట్టి వైశ్వానరుడంటే బ్రహ్మ తప్ప ఇంకవరూ కాదు అంటూ రెండవ పాదాన్ని ముగించాడు రత్నాకరుడు.
ద్యుభ్వాధ్యాధికరణం :- ( 1, 3 ,1 )
సూత్రం :-64
'"ద్యుభ్వాధ్యాయతనం స్వ శబ్దాత్'"
ద్యు:- ద్యులోకం, భూ :- భూలోకం, ఆది :- మొదలైన, ఆయతనం:- లోకాలకు ఆధారం బ్రహ్మమేనని తెలుసుకోవాలి. స్వ శబ్దాత్;- పరమాత్మను ముండకంలో ఆత్మ శబ్దంతో వ్యవహరించడమే కారణం.
భావం:- ద్యులోకం, భూలోకం మొదలైన లోకాలకు ఆధారం బ్రహ్మమేనని తెలుసుకోవాలి. ముండకోపనిషత్తులో పరమాత్మను ఆత్మశబ్దంతో వ్యవహరించడమే దీనికి కారణం.
వివరణ:-గురువుగారు! ముండకోపనిషత్తులో అక్షరపురుషుడు చెప్పబడే ఆపరబ్రహ్మలో ద్యులోకం (సూర్యలోకం), భూమి , అంతరిక్షం, ఇంద్రియములు, మనస్సు అన్ని వస్త్రంలో దారపు పోగుల వలె బాగా కలసిఉన్నాయి. అది అద్వితీయ బ్రహ్మ. అదే మోక్షానికి సేతువు అని చెప్పబడినది. ఇక్కడ సేతువు అంటే ఒక ఒడ్డు నుంచి ఇంకొక ఒడ్డుకు చేర్చేది అని అర్ధం కదా! సేతువు పరిమితమైనది. మరి అపరిమితమైన పరమాత్మ, పరిమితమైన సేతువు ఎలా అవుతాడు? లేకపోతే ఈ సేతువు ప్రకృతికానీ వాయువుకానీ అవుతుందా? కాస్త వివరించండి అని అడిగాడు నారాయణభట్టు. ఆ మాటలు విన్న రత్నాకరుడు శిష్యుని సందేహం తీర్చాడు. ద్యులోకం, భూలోకం, ప్రాణం, మనస్సు, అంతరిక్షం గల ఈ జగత్తుకు ఆధారమైనది పరబ్రహ్మ. పైన చెప్పిన స్వ అనేది పరబ్రహ్మ వాచకం. శృతులలోనేక చోట్ల ఈ శబ్దంతోనే ఆత్మను సూచించారు.
ముండకోపనిషత్తు:- పరమాత్మలోనే ద్యులోకం, పృధివి, అంతరిక్షం మనస్సుతో కూడిన జీవులు ఆశ్రయించి ఉన్నాయి. ఆయనే ఆత్మ అని తెలుసుకోవాలి. సమస్త ప్రపంచం, అగ్నిహోత్రాది కర్మలు, తపస్సు, అన్ని ఆయన రూపమే. అన్నింటి యందు పరమాత్మ ఉన్నాడు. సమస్త ప్రాణుల హృదయాలలో ఉన్నాడు. సూర్యాది గ్రహాలను ప్రకాశింపజేసేది బ్రహ్మమే. అదే ప్రాణం. అదే వాక్కు. అదే మనస్సు. అదే సత్యం అమృతమయం అని చెప్పబడినది. ఇక్కడ ముల్లోకాలకు ఆధారం ఆత్మ, జగత్తుకు ఉపాదాన కారణం ప్రకృతా? జీవాత్మా? పరమాత్మా? కారణాన్ని ఆశ్రయించి కారణం ఉంటుంది కదా! వస్త్రంలో దారపు పోగుల్లా, కుండలాలల్లోని బంగారంలా, ద్యులోకంతో కూడిన విశ్వమంతా ప్రకృతిని ఆశ్రయించి ఉంటుంది. కార్యం ఉపాదానకరణాన్ని విడచి మరొక చోట ఉండదు. అందువల్ల ద్యులోకం, భూలోకం లాంటి ప్రకృతి ఎందుకు కారణం కాకూడదు? ఈ ఆయతనం జీవాత్మ కూడా కావచ్చు కదా! జీవాత్మ భోక్త. లోకాలు భోగ్యాలు. పై ఉపనిషత్ వాక్యంలో వర్ణించిన ప్రాణంతో కూడిన మనస్సంబంధమైనది కూడా జీవాత్మ ఉన్నది. కనుక ఆత్మ శబ్దం ఇక్కడ జీవాత్మకు వర్తించదు. అంటే ప్రకృతిని ఆత్మశబ్దంతో ఎవరూ వ్యవహరించరు. ఈజగత్తులో లోకాలు కాక మనఃసహిత చేతనజీవాత్మలు ఎన్నో ఉన్నాయి. వీటన్నింటికి ప్రకృతి ఆయతనం కానేరదు. జడచేతనాత్మకమైన జగత్తుకు ఈశ్వరుడే ఆయతనం, ఆశ్రయం. జీవాత్మ ద్యులోకానికి భూలోకానికి ఆధారం కాదు. ఈలోకాలు ఆధేయాలు. ఆత్మ అధిష్టానం. అలాంటి ఆయతన ఆత్మ పరమాత్మే. జీవాత్మకు కేవలం భోకృత్వ సంబంధం ఉంది. పరమాత్మ తప్ప ఎవరూ ఈ జగత్తుకు అధిష్టానం కాదు. కనుక ఈ ఉపనిషత్ వాక్యంలోకి ఆత్మపదం పరమాత్మని సూచిస్తుంది. ఆయనే పృధివి ద్యులోకాన్ని ధరించి ఉన్నాడు. ఆయన ఉజ్జ్వలమైన ద్యులోకం దృఢమైన పృధివి, స్వర్గం, నాకం ధరించాడు.
అధర్వణ వేదం :- పృధివి, ద్యులోకం, అంతరిక్షం, దిక్కులు వీటన్నింటిని పరమాత్మ ధరించాడు. ఆయనలోనే సమస్త భవనాలు ఇమిడి ఉన్నాయి అని వేదాలు వర్ణిస్తున్నాయి. కాబట్టి పరమాత్మే విశ్వాయతనం, విశ్వాదిష్ఠానం అని రుజువు అవుతుంది. కనుక ఆత్మపదం ఇక్కడ పరమాత్మ వాచకమే. అమృతస్య ఏషా సేతుః ఆయనే సేతువు అన్న చోట ఈ సేతు పదం కూడా పరమాత్మకు వర్తిస్తుంది. కానీ ప్రకృతికి కాదు. ముముక్షువులు సంసారసాగరాన్ని తరించి అమృతత్వాన్ని పొందుతారు. అది పరమాత్మ మోక్షప్రాప్తికి సాధనం అని భావం.
సూత్రం :- 65
'ముక్తో పసృప్య వ్యపదేశాచ్ఛ"
ముక్త ఉపశృప్య వ్యాపదేశాత్ చ :- జీవన్ముక్తులైన బ్రహ్మవిదులకు ప్యాప్యం అని చెప్పినందువలన కూడా ద్యు, భూ లాంటి ఆయతనం బ్రహ్మమే అని అంగీకరించాలి సూత్రార్థం.
భావం:- జీవన్ముక్తులైన బ్రహ్మవిదులకు బ్రహ్మాన్ని గురించి ఉపదేశించుట వలన ద్యులోకం, భూలోకం వంటి వాటికి ఆయతనం బ్రహ్మమే అని అంగీకరించాలి.
వివరణ:- ముక్తులచే పొందదగినది అని చెప్పడం వలన ద్యులోకం, భూలోకం మొదలైన వాటికి అధిష్టానం బ్రహ్మమే. నేను, నాది అనే అహంకార మమకారాలు అజ్ఞానం. ఈఅజ్ఞానం వలననే శరీరం మొదలైన వాటికి గౌరవసత్కారాలవలన రాగం ఉద్భవిస్తుంది. దేహాన్ని అగౌరవపరిస్తే ద్వేషం కలుగుతుంది. శరీరం నాశనం అవుతుందేమోనని భయం, దాని మీద మోహం, ఈ రకంగా అవిద్య అనేక రకాలుగా ఉంటుంది. దీనికి విరుద్ధం ముక్తి. రాగద్వేషాలు లేనప్పుడు పొందే స్థానమే ముక్తి. అదే భూమి, స్వర్గం మొదలైనవాటికి అధిష్టానం బ్రహ్మ.
ముండకోపనిషత్తు:- ఆత్మ వేదాధ్యయనం వలన గాని, శాస్త్రజ్ఞానం వలన కానీ తెలియబడుతోంది. ఆత్మసాక్షాత్కారం నందు అకుంఠిత దీక్ష గల వారికే ఇది బోధపడుతుంది. ఐహిక బంధాలతో కూరుకుపోయిన వాడికి, కర్మ పరిత్యాగం చెయ్యని వాడికి, ఆత్మసాక్షాత్కారం జరగదు. బ్రహ్మనిష్ఠాగరిష్ఠలైన సన్యాసులకే ఇది గోచరిస్తుంది. జ్ఞానులైన మహర్షులు తమ హృదయంలో దర్శించిన ఆత్మనే పరమాత్మగా తెలుసుకుంటారు. ఉపనిషత్సారమైన బ్రహ్మజ్ఞానం తమ ధ్యేయంగా నిశ్చయించి సన్యసించిన యతీశ్వరులకు మాత్రమే బ్రహ్మలోకం ప్రవేశించి ముక్తి పొందుతారు. ముక్తి పరమపురుషులకు మాత్రమే కలుగుతుంది. ఆత్మ సాక్షాత్కారం కాగానే రాగద్వేషపూరితమైన హృదయగ్రంధి విడిపోతుంది. అన్ని సందేహాలు, కర్మలు, నశిస్తాయి. జ్యోతిస్సులకు జ్యోతిస్సు, శుద్ధం నిష్కళం, అయిన బ్రహ్మాన్ని ఆత్మవిదులు తెలుసుకుంటారు. పిదప ఉపనిషత్తులు, బ్రహ్మవిదులు, జీవన్ముక్తులు పొందవలసిన బ్రహ్మాన్ని గురించి ఉపదేశించాయి. విశ్వకర్మ, విశ్వనియంత, భూతయోని, ప్రకాశుడైన పరమపురుషుణ్ణి చూసి విద్వాంసుడు పుణ్యపాపాలనుంచి విముక్తుడై, నిరంజనుడై అత్యంత సమీపంగా ఉంటాడు. పరమాత్మతో అవిభాగమై జీవాత్మ ఉంటాడు. ప్రవహించే నదులు తమతమ రూపాలను విడిచి సముద్రాన్ని చేరి, అందులో అవిభక్తమై ఉంటాయి. అలాగే జీవాత్మ నామరూపాలనుంచి ముక్తుడై పరబ్రహ్మాన్ని చేరతాడు. యుక్తపురుషులు పరబ్రహ్మాన్ని పొందుతారు. కానీ ప్రకృతిని పొందరు. అందువలన ద్యుభ్వాధ్యాయతనంగా చెప్పిన ఆత్మ పరమాత్మని సూత్రానికి అర్ధం.
సూత్రం:- 66
" నానుమా మత చ్ఛబ్ధాత్ "
అనుమానం :- ప్రకృతి, న;- ద్యు, పృధివి లోకాలకు ఆధారం లేదు. అతః శబ్దాత్ :- ఈ ప్రకరణంలో ప్రకృతిని ప్రతిపాదించే శబ్దప్రయోగంలేదు.
భావం:- ప్రకృతి ద్యు, పృధివి లోకాలకు ఆధారం లేదు. ఈ ప్రకరణంలో ప్రకృతిని ప్రతిపాదించే శబ్ద ప్రయోగం లేదు. కనుక ప్రకృతి ద్యులోకాధిష్ఠానం కానీ, ఆత్మ కానీ కానేరదు.
వివరణ:- ఇక్కడ ప్రకృతి అని చెప్పే శబ్దం లేనందువలన అనుమాన ప్రమాణంలో ప్రకృతి ద్యుభ్వాదులకు అధిష్టానం అని చెప్పరాదు. బ్రహ్మాన్ని ప్రతిపాదించడానికి అనేకమైన విశేషాలు గతంలో చెప్పారు. కానీ ఇంకొక దానికి అలాంటివి చెప్పలేదు. కాబట్టి స్వర్గము, పృధివి మొదలైన వాటికి అధిష్టానం బ్రహ్మమే. అతః శబ్దాత్:- ప్రధానాన్ని చెప్పే శబ్దం ఏదీ లేకపోవడం వలన, ప్రధానం కంటే భిన్నమైన ఆత్మకు చెప్పే శబ్దం ఉండటం వలన, ప్రకృతి ప్రధానంగా బ్రహ్మాన్ని గురించి చెప్పబడే ప్రధానమైన హేతువు ఉన్నట్లుగా మరొక అర్ధాన్ని బోధించే విశిష్ట హేతువు ఏమి లేదు అని చెబుతున్నరు. అనుమానం:- ( ప్రకృతి ):-సాంఖ్యులు స్మృతులలో ప్రకృతిని ప్రధానంగా చెప్పినందున ఇక్కడ ద్యుభ్వాధ్యాయతనంగా గ్రహింపజాలదు. ఎందువలననగా అతచ్చబ్దం వలన అచేతనమైన ప్రధాన్నాన్ని ప్రతిపాదించిన శబ్దం తచ్ఛబ్దం. తచ్ఛబ్దం కానిది అతచ్చబ్దం. అక్కడ అచేతనమైన ప్రధాన ప్రతిపాదకమైన శబ్దం ఇది లేదు. 'యః సర్వజ్ఞ సర్వవిత్ ; ఇత్యాది శబ్దం ఇక్కడ ఉంది. అందుచేతనే అచేతనమైన వాయువు కూడా ఇక్కడ ద్యుభ్వాధ్యాయతనంగా గ్రహింపబడదు.
సూత్రం :- 67
" ప్రాణ భృత్ చ్చ "
ప్రాణ భృచ్చ :- ప్రాణధారి అయిన జీవాత్మ కూడా న :- ద్యుభ్వాధ్యాయతనం కాదు.
భావం:- ప్రాణధారి అయిన జీవాత్మ కూడా ద్యులోకం, పృధివిలాంటి వాటికి ఆధారం కాదు. ఆత్మ శబ్దం పరమాత్మకే వర్తిస్తుంది.
వివరణ:- ప్రాణాలను భరించేవాడు ప్రాణభృత్తు అంటే జీవుడు. అయితే విజ్ఞానాత్మా అయిన జీవుడు కూడా ద్యుభ్వాదులకు అధిష్టానం కాదు. జీవుడు సర్వజ్ఞుడు కాదు. అతనిలో ఆత్మత్వం, చేతనత్వమున్నాయి. కానీ జీవుడు ఉపాధి పరిచ్చిన్నుడు అంటే శరీరం ఉపాధిగా ధరించినవాడు. అందుకని జీవుడు సర్వజ్ఞుడు కాదు. మరి సర్వజ్ఞుడు బ్రహ్మమే. ప్రాణభృత్తుకు అనగా విజ్ఞానాత్మకు అంటే జీవునకు ఆత్మత్వ చేతనత్వాలు ఉన్నాయి. అయినప్పటికీ పరిచ్చిన్నమైన అత్యల్పంగా కుదించబడిన జ్ఞానంకల విజ్ఞానాత్మకు సర్వజ్ఞత్వాలు కుదరవు. అందుచేత అతచ్చబ్దాత్ అంటే ప్రకృతిని ప్రతిపాదించే శబ్ద ప్రయోగం వలననే జీవుడుకూడా ద్యుభ్వాధ్యాయతనంగా గ్రహింపదగినవాడు కాదు. పరమాత్మ చిత్ప్రకాశం, ఎల్లప్పుడూ నిత్యమై, జ్ఞానస్వరూపమై తాను స్వయంగా ప్రకాశిస్తూ ప్రపంచంలోని పదార్ధములన్నింటిని ప్రకాశింపజేస్తాడు. స్వయంజ్యోతి స్వరూపుడై తనకు విలక్షణమైన సకల జడ సముదాయములగు శరీరము, మనస్సు, ఇంద్రియములు, బుద్ధి మొదలగు వాని యందు ఎల్లవేళలా ప్రకాశించును. సచ్చిదానంద స్వరూపమైన జీవుడి నిజస్వరూపమునకు అతడి ఉపాధులే అవరోధాలు. ఉపాధులన్నీ అనాత్మ పదార్ధములు. ఇవి అజ్ఞానం వలన గోచరించెడి జడ సముదాయాయములను జ్ఞానంతో విడవవలెను.
ముండకోపనిషత్తు:-పరమాత్మ సర్వజ్ఞుడు. సర్వవిదుడు. సర్వజ్ఞత్వం, సర్వనేతృత్వం జీవాత్మకు వర్తించవు. జీవాత్మ అల్పజ్ఞుడు. కాబట్టి ప్రాణాధారి అయిన జీవాత్మ ద్యుభ్వావాధ్యాయతనం కాదు.
ప్రశ్నోపనిషత్తు;- (4 ,11 ):- "తదక్షరం వేదయతే యస్తు సోమ్య! స సర్వజ్ఞః సర్వమే వావివేశ ." ఓ సోమ్యా! అక్షరాన్ని ఎరిగినవాడు సర్వమూ పొందుతాడు. అన్నవాక్యంలో బ్రహ్మవిదులు, సర్వజ్ఞులు అవుతారని అన్నారు కదా! అప్పుడు సర్వజ్ఞత్వ విశేషణం జీవాత్మకు చెల్లుతుంది కదా! కనుక జీవాత్మ ద్యుభ్వాధ్యాయతనం ఎందుకు కాదు? తరువాత సూత్రంలో దీనికి సమాధానం చెబుతున్నారు. అతచ్చబ్దాత్ అనే హేతువు ప్రకృతికి, జీవుడికి రెండింటికి సమానమే. కనుక నామమాన ప్రాణ భృతాపచ్చష్ఠాత్ అని ఒకే సూత్రంలో చెప్పవచ్చును కదా! అనే సంశయం కలగవచ్చును. ప్రాణభృచ్చ అనేది రాబోయే సూత్రాలలో కూడా అన్వయించడం కోసం వేరే సూత్రంగా రచించబడింది.
సూత్రం :- 68
'భేద వ్యపదేశాచ్చ"
భేద:-ఆత్మను పరమాత్మకన్నా వేరేఅని వ్యపదేశాచ్చ:-చెప్పడం వలన, ప్రాణాధారి అయిన జీవాత్మ ద్యుభ్వాద్యాయతనం కాదు.
భావం:- జీవాత్మకు పరమాత్మను మధ్య భేదం చెప్పడం ప్రాణాధారి అయిన జీవాత్మ ద్యుభ్వాధ్యాయతనం కాదు.
వివరణ:- జీవాత్మకు పరమాత్మకు మధ్య భేదం చెప్పడంవలన జీవుడు అధిష్టానం కాదు. ముండకోపనిషత్తులో చెప్పినట్లుగా సంసారమనే వృక్షం మీద రెండు పక్షులు కూర్చుని ఉన్నాయి. ఒకటి కర్మ ఫలాలు అనుభవిస్తోంది. రెండవది చూస్తూ కూర్చుంది. అజ్ఞానంతో ఉన్నంతకాలం అవి రెండూ పక్షులుగానే కనిపిస్తాయి. జ్ఞానం కలిగిన తరువాత అవి రెండూ ఒక్కటే అని తెలుస్తుంది. అదే మోక్షం. కాబట్టి అధిష్టానం బ్రహ్మమే అని చెప్పారు. మరి ఏ కారణం చేత ద్యుభ్వాధ్యాయతంగా గ్రహింపకూడదు? 'తమేవైకం జానధమాత్మానాం" ఆత్మ శబ్దవాచ్యాన్ని తెలుసుకో? అనే వాక్యంలో పరమాత్మ జ్ఞేయం. జీవాత్మ జ్ఞాత అని వర్ణించారు. జ్ఞాత అయిన జీవుణ్ణి ఇలా వేరుగా ఉపదేశించడం వలన జీవాత్మ ద్యుభ్వాధ్యాయతం కాదు. అది పరమాత్మే. పరమాత్మయందు జ్ఞాత తెలుసుకునేవాడు, జ్ఞానం తెలుసుకోవడం, జ్ఞేయం తెలుసుకోబడేది. ఉదాహరణకు స్తంభం జ్ఞేయం, దానిని తెలుసుకొనే నేను జ్ఞాత, స్తంభం గురించిన వివరాలు తెలుసుకోవడం జ్ఞానం. దీనిని త్రిపుటి అంటారు. చిదానంద స్వరూపమైన ఆత్మ తనంత తానుగా ప్రకాశిస్తోంది. ఆత్మను తెలుసుకోవడానికి ఆత్మసాక్షాత్కారం, ఆత్మానుభూతికి కష్టం చేసి సాధన చేస్తే అది కనబడుతుందా? కనబడితే అది త్రిపుటి అవుతుంది. నువ్వు ఫలానా అని తెలుసుకుంటే త్రిపుతిలో ఉన్నట్లే. పరమాత్మ సాక్షాత్కారం లభిస్తే నువ్వు పరమాత్మే అవుతావు. తెలుసుకోవలసిన అవసరం లేదు. నువ్వు పరమాత్మవి అయినప్పుడు తెలుసుకోవు. తెలుసుకోవడం లేదు. తెలుసుకునేవాడు ఎవడో వాడే తెలియబడతాడు. పరమాత్మను మనం అందుకోవడం కాదు. పరమాత్మే తనంతతనుగా తెలియబడతాడు. పరమాత్మ స్వయంప్రకాశం. తెలియబడేస్థితి కోసమే ఈసాధన. జ్ఞాత అయిన జీవాత్మకు జ్ఞేయం అయిన పరమాత్మకు భేదం చెప్పబడటం వలన జీవుణ్ణి ద్యుభ్వాధ్యాయతనంగా గ్రహింపకూడదు. తమేవైకం జానధమాత్మానాం అని ఇక్కడ జ్ఞేయం జ్ఞాత భావాన్ని పురస్కరించుకొని భేదవ్యపదేశం కూడా ఉంది. జీవుడైతే ముముక్షువు అందుచేత జ్ఞాత. తెలుసుకునేవాడు. పరిశేషన్యాయం చేత ఆత్మశబ్దం చేత చెప్పబడే బ్రహ్మ జ్ఞేయం. తెలియదగినది. అదే ద్యుభ్వాధ్యాయతనంగా తెలియ బడుచున్నది. కానీ జీవుడు కాదు. ఇద్దరిలో ఒకరిని చూసి ఇతడు చాలా తెలివైనవాడు అని అంటే రెండవ వాడు తెలివైన వాడు కాదు అని చెప్పకపోయినా తెలుస్తుంది.అదే పరిశేష న్యాయం.
సూత్రం :- 69
"ప్రకరణాత్"
ప్రకరణాత్ చ :- ఇది పరమాత్మ ప్రకరణం అవడం కూడా జీవుణ్ణి ద్యుభ్వాధ్యాయతనంగా గ్రహించకూడదు అని అర్ధం.
భావం:- ఇది పరమాత్మ ప్రకరణం అవడం వల్ల ప్రాణాలను ధరించే జీవుడు అధిష్టానం కాలేదు. ఏదైనా అర్ధం చెప్పేటప్పుడు సందర్భాన్ని బట్టి చెప్పాలి. అందుచేత అన్నిటికీ అధిష్టానం బ్రహ్మమే.
వివరణ:-బృహదారణ్యకం:-ఆత్మావారే దృష్ట్రవ్యః శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్యః' ఆత్మే చూడతగినది. మననం చెయ్య వలసినది. ధ్యానం చెయ్యవలసినది అని యాజ్ఞవల్కుడు మైత్రేయితో అంటాడు. ఇక్కడ బ్రహ్మ పదార్ధమే జ్ఞేయం. తెలుసు కునే వాడు జ్ఞాత.
ముండకోపనిషత్తు:-( 1 ,1, 3 ):-భగవాన్! ఏది తెలుసుకుంటే ఇదంతా తెలుస్తుంది? అనే ఈ ప్రశ్న జీవాత్మకు ఒప్పదు. జీవాత్మ జ్ఞానం సర్వవిజ్ఞానానికి కారణం కాదు. ఇలా ప్రకరణంలో పరమేశ్వరవిషయిక చర్చ ఉన్నందున ఆయనే ద్యుభ్వాధ్యాయతనం. ప్రాణధారి జీవాత్మ కాదు. సర్వాత్మకమైన పరమాత్మను తెలుసుకుంటే ఇదంతా తెలుస్తుంది. కానీ కేవలం జీవుణ్ణి తెలుసుకుంటే ఏమి తెలియదు కదా! ఆత్మ స్వరూపుడైన ఆపురుషుడు నిజముగా మహా ప్రభువు. సర్వ నియామకుడు, జ్యోతిఃస్వరూపుడు, అత్యంత నిర్మలమైన వాడు, ఇతని వల్ల అన్ని జీవులు చలించుచూ అభివ్యక్తమగు చున్నవి. సర్వేంద్రియ కార్యకలాపములతో ప్రకాశించుచు సర్వమునకు నియామకుడైన ప్రభువై అలరారు ఆత్మస్వరూపుడు ఆరాధ్యుడు. దేవతలకు ప్రభువు ఎవరో సర్వలోకములు ఎవని యందు సాగుచున్నావో ద్విపాదులగు మానవులను చతుష్పాదులగు జంతువులను ఎవరు పాలించుచున్నారో సత్ చిదానంద స్వరూపుడగు ఆ భగవంతుడే ఎల్లప్పుడూ ఆరాధ్యుడు. అవసరమైనప్పుడు లోక కళ్యాణార్ధమై ధర్మ సంస్థాపన కొరకు ఈ జగద్రక్షకుడు ఉన్నాడు. సర్వ లోకములకు ప్రభువై అన్ని జీవుల యందు దాగి ఉన్నాడు. బ్రహ్మఋషులు, దేవతలు ఆయన్ని సాక్షాత్కరించుకొని జననమరణ పాపముల నుండి విముక్తులౌతున్నారు. ఈ సర్వలోకములు శాశ్వతముగా పరిపాలించే వాడు పరమాత్మే. ఆవినాశి, సర్వజ్ఞుడు, సర్వ వ్యాపి అయిన ఆ జగద్రక్షకుడే తప్ప మరెవరూ సర్వ లోకములకు అధిష్టానం కాదు.
సూత్రం :- 70
స్థి త్యద నాభ్యంచ
స్థితి :- సాక్షిరూపంగా ఉండటం వలన, అదనాభ్యాం:- కర్మ ఫలం అనుభవించడం వలన, చ:- కూడా
భావం ;- పరమేశ్వరుడు సాక్షి రూపంగా ఉదాసీనంగా ఉండటం వలన, జీవుడు కర్మఫలం అనుభవించడం వలన లోకాలకు అధిష్టానం బ్రహ్మమే.
వివరణ:- పరమేశ్వరుడు ఉదాశీనంగా ఉండటం, జీవుడు కర్మ ఫలం అనుభవించడం అనే గుణాల వలన ప్రాణాలు ధరించే జీవుడు అధిష్టానం కాదు. సాక్షిగా ఉండటం పరమేశ్వరుడి ధర్మం. జీవాత్మ జ్ఞాత. పరమాత్మ జ్ఞేయం. పరబ్రహ్మాన్ని గురించి తెలుకునేవాడు జ్ఞాత. ఏదైతే సకల చరాచర సృష్ఠికి మూలమైనదో ఆపరబ్రహ్మ తత్త్వం జ్ఞేయం అవుతుంది.
ముండకోపనిషత్తు:- (3 1 2 ):- పరమాత్మ, జీవాత్మ అనే రెండు పక్షులు ఒకే చెట్టు మీద ఉన్నాయి. వాటిలో మొదటి పక్షి జీవాత్మ కర్మ ఫలాలను అనుభవిస్తోంది. రెండవ పక్షి పరమాత్మ జీవాత్మ చేసే కార్యకలాపాలన్నింటిని ఉదాసీనంగా కూర్చుని చూస్తోంది. కాబట్టి కర్మలను అనుభవించే జీవుడు శరీరధారి. కాబట్టి అతడు లోకాలకు అధిష్టానం కాదు. ద్యులోకానికి భూలోకానికి అధిష్టానం బ్రహ్మమే. ద్వా సూపర్ణా సయుజా సఖియా అనే వాక్యంలో స్థితి అంటే సాక్షిగా ఉండటం, అదనం అంటే కర్మఫలం నిర్దేశించబడుతున్నాయి. ఇక్కడ చెప్పిన ఆ స్థితి అదనములను బట్టి ఈశ్వరుడు క్షేత్రజ్ఞుడుగా ద్యుభ్వాధ్యాయతనం కుదురుతుంది. చూడబడేది అంతా క్షేత్రమే. ఈ భూమి, గ్రహాలు, గేలాక్షీ, అన్ని క్షేత్రములే. ఈ శరీరం మనచేత చూడబడుతోంది. కనుక ఇది కూడా క్షేత్రమే. క్షీణించే గుణం కలది క్షేత్రం. క్షేణించడం అంటే మార్పు చెందడం. కలుసుకున్నవి విడిపోవడం. పంచభూతలతో నిండిన ఈ శరీరం మరణించగానే పంచ భూతలలో వేటికవి కలసిపోతాయి. అన్నింటిలో ఉండే ఆత్మచైతన్యం క్షేత్రజ్ఞుడు. సర్వజ్ఞుడు. క్షీణించేదే క్షేత్రం అయితే క్షీణించకుండా ఉండేది క్షేత్రజ్ఞుడు. జీవుడు శరీరంలోని అవయవాలను చూచేవాడు గుర్తించేవాడు ఎవరో ఒకరు ఉండాలి కదా! ఆయనే, ఆ తత్త్వమే క్షేత్రజ్ఞుడు. ఇది క్షేత్రము అని తెలుసుకున్నవాడే క్షేత్రజ్ఞుడు. కానీ అజ్ఞానంతో జీవుడు తానే చూస్తున్నట్లు అన్ని కార్యములు తానే నిర్వహిస్తున్నట్లుగా భ్రాంతికి లోనవుతున్నాడు. జీవుడు కేవలం కర్మఫలం అనుభవించడానికి మాత్రమే జన్మలు ఎత్తు చున్నాడు. జీవుడు చేస్తున్న కర్మలకు పరమాత్మ సాక్షిగా చూస్తూ ఉదాసీనంగా ఉంటాడు.అందుకే లోకాలకు అధిష్టానం పరబ్రహ్మమే అని గ్రహించాలి.
సూత్రం :- 71
" భూ మా సంప్రసాదా దధ్యుపదేశాత్ "
సంప్రసాదాత్:- జీవాత్మకన్నా, అధిఉపదేశాత్:- ఈశ్వరుడు అధికుడు అని ఉపదేశించడం వలన, భూమా:- చాందోగ్యంలో వర్ణించిన భూమా అంటే పరమాత్మ. భూమా:-అన్నింటికన్నా గొప్పది.
భావం:-జీవాత్మ కన్నా ఈశ్వరుడు అధికుడని ఉపదేశించడం వలన అన్నింటికన్నా గొప్పది అయిన భూమా అంటే పరమాత్మే.
వివరణ :- ఛాందోగ్యోపనిషత్తు:-( 8, 12, 3 ):-జీవాత్మ ఈ శరీరాన్ని విడిచి పరమాత్మను పొంది స్వస్వరూపాన్ని తెలుసుకొని ఉత్తమపురుషుడౌతాడు. భూమ అంటే ఏమిటో తెలుసుకోవాలి. భూమ మాత్రమే సుఖం, అల్పంలో సుఖం లేదు. భూమనే తెలుసుకోవాలి. భగవాన్! నేనుదాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. దేనిలో ఇంకొకటి చూడమో, వినమో, తెలుసుకోమో, అదే భూమ. ఎందులో ఇతరం చూస్తామో, వింటామో, తెలుసుకుంటామో అది అల్పం. భూమ అమృతం. అంటే పరమాత్మే. నారదుడు ఆత్మజ్ఞానం పొందాలని తపిస్తూ సనత్కుమారుడి దగ్గరకు వెడతాడు. ఆత్మజ్ఞానం లేక శోకసముద్రములో మునిగిన నన్ను దరిచేర్చండి అని అడుగుతాడు. అందుకు సనత్కుమారుడు నీవు తెలుసుకున్న విద్యలన్నీ నామ సమూహములే. అంతకన్నా మిన్నకావు. నామమనేది, వర్ణమనేది బ్రహ్మం నుంచి జనించింది. బ్రహ్మప్రాప్తికి అది సాధనం. కనుక నామమే బ్రహ్మమని ఉపాసించు అన్నాడు. నామం కన్నా గొప్పది ఏమిటి? అని అడిగాడు. దాన్ని ఉత్పత్తి చేసే వాక్కు నామం కన్నా అధికం అన్నాడు. వాక్కు కన్నాగొప్పది ఏదీ అని అడిగాడు? వాక్కు కన్నా మనస్సు, దాని కన్నా సంకల్పం, అంత కన్నా చిత్తం, చిత్తం కన్నా ధ్యానం వీటి కన్నా క్రమంగా విజ్ఞానం, బలం, అన్నం, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, స్మరణం, ఆశ, ప్రాణం ఇవన్నీ ఒకదాని కంటే మరొకటి అధికం అని సనత్కుమారుడు సమాధానం చెప్పాడు. ఈక్రమంలో చేస్తాను అని నిశ్చయమే మనస్సు. ఆ నిశ్చయం వాక్కును ప్రేరేపిస్తుంది. ఆ నిశ్చయనికి కారణం సంకల్పం. ఈసంకల్పానికి కారణం చిత్తం. శాస్త్రీయ విషయాల పట్ల ఏకాగ్రత ధ్యానం. దానికి కారణం విజ్ఞానం. ఈ విజ్ఞానానికి శాస్త్రాలలో ప్రతిపాదించిన విషయం, దాని వలన మనస్సులో ఏర్పడిన సామర్ధ్యం బలం, దానికి అన్నం, అన్నానికి జలం, దానికి అగ్ని, ఆ అగ్నికి వాయువు, దానికి ఆకాశం కారణాలు. ఆకాశాన్ని భోగ్యంగా పరిగణిస్తారు. దాని కోసం ఆశ జనిస్తుంది. ఆశ ఉన్న ప్రాణి తనకు ఇష్టమైనదాన్ని స్మరిస్తాడు. ఆ ఆశకు హేతువు ప్రాణం. జీవాత్మ భోక్త. కనుక జీవాత్మ భూమ కాదా? అంటే పైన చెప్పిన విధంగా ఒక దానికన్నా మరొకటి అధికమైనట్లే ప్రాణం కన్నా భూమ అధికం. ఈ ప్రకరణంలో ప్రాణం అంటే జీవాత్మ అని సత్యం అంటే పరమాత్మఅని గుర్తించాలి. సత్యమే తెలుసుకోతగ్గది అని సనత్కుమారుడి చెప్పాడు. సత్యమే బ్రహ్మం అయితే జీవాత్మ అల్పం భూమ అధికమే అవుతుంది. జీవాత్మ శరీరానికి బద్ధుడై ఉంటాడు. ప్రాణం కంటే ఆశ గొప్పది. నువ్వు అతివాదివా అని ఎవరైనా ప్రశ్నిస్తే అతివాదినేనని సమాధానం చెప్పాలి. ప్రాణాన్ని గురించి తెలిసినవాడు అతివాది అవుతాడు. ఎవడు సత్యం చేత అతివాదం చేస్తాడో అతడు అతివాదం చేసేవాడు. కనుక ప్రాణం కన్నా గొప్పది భూమ ఉపదేశింపబడుతోంది.
సూత్రం :- 72
" ధర్మోపపత్తేశ్చ"
చ:- అంతే కాక , ధర్మ ఉపపత్తేః :- భూమకు చెప్పిన ధర్మాలు పరబ్రహ్మనికే వర్తిస్తాయి.
భావం:- భూమకు చెప్పిన ధర్మాలు పరబ్రహ్మనికే వర్తిస్తాయి. కనుక భూమ పరమాత్మ వాచకమే.
వివరణ: -ఛాందోగ్యోపనిషత్తు:-భగవాన్! ఈభూమ ఎందులో ప్రతిష్ఠితమైఉన్నది? అనిప్రశ్న. తనమహిమలోనే అని సమాధానం. ఈ ధర్మం క్రింద, పైన, వెనుక, ముందు, అన్ని దిక్కులలోను ఆ భూమే. ఆత్మ, ప్రాణం, దిక్కులు, ఆకాశం అన్నింటిటిని ధరించింది. సర్వగతత్వం, స్వమహిమ ప్రతిష్ఠితత్త్వం, సర్వాధారత్వం అనే ధర్మాలు పరమాత్మవే, కానీ జీవాత్మకు చెందవు. ఈశ్వరుడు ఒక్కడే. అది సత్యం. అద్వైతుడుగా ఉన్న ఈశ్వరుడు రెండుగా అయ్యాడు. దానినే పరా ప్రకృతి, అపరాప్రకృతి అంటారు. పరాప్రకృతి అంటే ఈశ్వరుడు. ఆయన నుండి వచ్చినపంచ భూతాత్మక మైన అనంత విశ్వం. దీనినే అర్ధనారీశ్వర తత్వం అంటారు. పరమేశ్వరుడు పరమాత్మ అయితే, అంబ ప్రకృతి. ఇద్దరు వేరు కాదు. పరమాత్మ గుణ రహితము, నిర్గుణము, నిర్వికారము, స్వతంత్రము, నిత్యము, సత్యం. అపరాప్రకృతి 8 విధములుగా విభజించబడింది. భూమి, ఆకాశం, అగ్ని, వాయువు, నీరు, ఇవి ఒకదాని నుండి మరొకటి వచ్చాయి. ఆకాశతత్వం, వాయుతత్వం, జలతత్వం, అగ్నితత్వం, భూమితత్వంతో బాటు మనస్సు, బుద్ధి, అహంకారం, ఈ 8 మరొక దాని మీద ఆధారపడతాయి. వీటికి స్వతంత్రతలేదు. అన్నిపరమాత్మ లోనే ప్రతిష్ఠితమై ఉన్నాయి. ఈధర్మాలు జీవాత్మకులేవు, కనుక భూమా శబ్దం పరమాత్మ వాచకమే. భూమలో దర్శనాది వ్యవహరలేవి ఉండవని చెబుతున్నది. "యత్ర ..పశ్యేతి " ఇత్యాది శృతులలో పరమాత్మ యందు ఇలాంటి వ్యవహారలేవి ఉండవని చెప్పబడింది. సుషుప్తావస్థలో మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు ఏమి పనిచేయవు. ఏ వస్తుప్రపంచం, జీవరాశులు ఏమి కనిపించవు. జీవుడు సుషుప్తిలో మనోకల్పితమైన వృత్తులు లేనందున అపరిమితమైన ఆనందాన్ని అనుభవిస్తాడు. ఆ సమయంలో ప్రాణం ఒకటే చైతన్యవంతంగా ఉంటుంది. జాగ్రదావస్థలోని అనుభవాలన్నీ స్వప్నావస్థలో స్వప్నపురుషుడు దర్శిస్తాడు. సుషుప్తిలో ప్రాణం చైతన్యవంతంగా ఉంటుంది కనుక ప్రాణమే పరమాత్మ ఎందుకు కాకూడదు అని సందేహం రావచ్చును. తెల్లవారగానే సుషుప్తిలో నుంచి మేలుకోగానే జీవుడు లౌకిక వ్యవహారాలతో తాదాత్మ్యం చెందుట వలన ప్రాణం పరబ్రహ్మ కాదు. ప్రాణం కన్నా శ్రేష్ఠమైనది ఆత్మ, సర్వానికి అధిష్టానం భూమనే అంటే పరమాత్మ అని చెప్పబడినది. ఇక్కడ భూమయే సుఖం. అల్పంలో సుఖం లేదు. దుఃఖమిశ్రితమైన సుఖాన్ని నిరాకరించడం చేత భూమ సుఖాత్మకమైన బ్రహ్మాన్ని చూపుతుంది. "యో వై భూమా తదమృతం " అని ఇక్కడ వినబడుచున్న అమృతత్వం కూడా బ్రహ్మాన్ని తెలుపుచున్నది. సత్యత్వం, తన మహిమ నందే తను నిలచి ఉండటం, సర్వగతత్వం, సర్వాత్మకం, అనే ధర్మాలను బట్టి భూమ పరమాత్మయే నని నిశ్చయమైనది.
అక్షరాధికరణం :- ( 1, 3 ,10 )
సూత్రం :- 73
"'అక్షర మంబ రాంత ధృతే '"
అంబర అంత ధృతే :- ఆకాశ పర్యంతం సమస్త ప్రపంచాన్ని తత్ కారణమైన ప్రకృతిని ధరించడం వలన, అక్షరం :- అక్షర పదం పరమాత్మ వాచకమే.
భావం:- ఆకాశం నుండి సమస్త ప్రకృతి జనించుట వలన, అక్షర పదం పరమాత్మ వాచకమే.
వివరణ:- బృహదారణ్యకోపనిషత్తు:- గార్గి, యాజ్ఞ వల్కుడు మధ్య ఓ సంవాదం జరిగింది. "ఎందుకు ఆకాశం ఓతప్రోతమై ఉంది "? అని అడిగింది గార్గి. అందుకు యజ్ఞవల్కుడు, గార్గి! అది అక్షరం, అది స్థూలం కాదు, అణువు కాదు. హ్రస్వము కాదు. అని బ్రాహ్మణులు అంటారు. ఇక్కడ ఆకాశానికి ఆశ్రయంగా వర్ణించింది, జీవాత్మనా పరమాత్మనా? అక్షరం అంటే నాశనం లేనిది.జీవాత్మకు కూడా నాశనం లేదు కదా! ప్రకృతికి కూడా నాశనము లేదు కదా? అంటే జీవులకు భోగం కలిగించడానికి ప్రకృతి ఆకాశాది రూపంలో పరిణమిస్తోంది. కానీ ప్రకృతికి జీవుడు ఆశ్రయం కాదు.నిజానికి ఆశ్రయం ఎవరు? అన్నదే గార్గి ప్రశ్న. అక్షరం ఆశ్రయం అని జవాబు. ఈ అక్షరమే పరబ్రహ్మ.
అధర్వణ వేదం:- "మస్మిన్ భూమిరంతరిక్షం ధ్యౌర్యస్మిన్ అధ్యహితా":-పృధివి , అంతరిక్షం, ద్యులోకం అంతా పరమాత్మలోనే ఉన్నాయి. వికారజాతంతో కూడిన ప్రకృతికి ఆశ్రయం పరమాత్మే. జీవాత్మ కాదు. పంచభూతాత్మక మైన ప్రకృతే ప్రపంచంగా పరిణమిస్తోంది. ఈ అక్షరపదం జీవాత్మకు వర్తించదు. అక్షరం అంటే అకారం నుంచి క్షకారం వరకు గల సమామ్నాయం. అక్షరమే బ్రహ్మ అని అన్నప్పుడు ఈ అక్షర సమామ్నాయమే పరమాత్మ అవుతుంది. అంటే ప్రకృతినే పరబ్రహ్మ అనాలి కదా! అని అనుమానం వ్యక్తం చేశాడు కృష్ణ శర్మ. దానికి సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. అక్షరం అంబరతదృతే భూమి దగ్గర నుండి ఆకాశం వరకు అన్ని రకాలైన స్వరూపాలు అక్షరానివే. అక్షరం అంటే నాశనం లేనిది. అదే పరబ్రహ్మ. సర్వమూ ఆకాశం నుండి ఉద్భవించింది. ఆకాశం పరబ్రహ్మము నుండి ఉద్భవించింది కాబట్టి ఆకాశంతో సహా సమస్తము పరబ్రహ్మ లోనే లీనమై ఉన్నాయి. అందుచేత అక్షరం అంటే పరమాత్మే కానీ ప్రకృతి కాదు. అన్నింటి కన్నా ఉత్తమమైనది, నాశనము, మార్పు లేనిది, అయిన దానిని బ్రహ్మం అంటారు. ఆ బ్రహ్మ యొక్క స్వభావమే అధ్యాత్మము అని చెప్పబడుతోంది. బ్రహ్మ అంటే అక్షరం. అంటే క్షరం కానిది. నాశనము లేనిది అన్నింటికన్నా గొప్పది. అంతకంటే పెద్దది. ఉత్తమమైనది మరొకటి లేదు. "ఓంకార ఏ వేదం సర్వమ్.". ఇదంతా ఓంకారమే. ఈ ఇతర శృతులలో వర్ణం కూడా ఉపాస్యంగా సర్వాత్మకమని తెలుపు చున్నది. అన్ని కారణముల చేత చెప్పబడేది వర్ణమే. అక్షర శబ్దం చేత చెప్పబడేది పరమాత్మయే. ఎందువలననగా పృధివి మొదలు ఆకాశం వరకు ఉన్న కార్యజాతాన్ని అంతటిని ధరించడం వలన త్రికాలములలో సమస్త వికారములు చెందే కార్యజాతమంతా ఆకాశంలో ప్రతిష్టింపబడింది. ఓంకారం బ్రహ్మ సాక్షాత్కారానికి సాధనం. గాన ఓంకారాన్ని స్తుతించడం వలన నిత్యత్వం ,వ్యాపిత్వం అయిన పరమాత్మ గురించి తెలుస్తుంది. ఆయన ఆజ్ఞ నుంచే సూర్యచంద్రులు తమ కర్తవ్యం నిర్వహిస్తున్నారు. శాసించడం పరమేశ్వరుడికి మాత్రమే సంబందించిన కర్మ. ఘటాదులకు కారణమైన అచేతనమైన మట్టి మొదలైన వాటికి ఘటాదులను శాసించే శక్తి లేదు కదా. అందుచేత అక్షరం అంటే పరమాత్మే కాని ప్రకృతి కాదు.
సూత్రం :- 74
" సా చ ప్రశాసనాత్ "
సా చ :- అంబరాంత ధృతి , ప్రశాసనాత్;- ఈశ్వరుడి శాసనం
భావం:- ఆకాశపర్యంతం సమస్తప్రపంచాన్ని, దానికి కారణమైన ప్రకృతిని ధరించడం ఈశ్వరుడి శాసనం వల్లనే సంభవిస్తుంది.
వివరణ :- ధరించడం అనేది ప్రశాసనం వల్లే జరుగుతుంది. ప్రశాసనం అంటే ఆజ్ఞ. ఈ విధంగా ప్రశాసనం చెయ్యడం పరమాత్మ వలననే జరుగుతుంది. కనుక అక్షర పదం పరబ్రహ్మనికే వర్తిస్తుంది. కాలాలను అనుసరించి ప్రకృతి తన కార్యక్రమాలను పరమేశ్వరుడి శాసనాన్ని అనుసరించే నిర్వహిస్తుంది. సూర్యాది లోకాలకు ఉన్న దివ్యధారణా సామర్ధ్యం జీవుడుకి లేదు. ఈ ధారణ జీవాత్మ శక్తికి మించింది. ఏతస్య తిష్ఠతి ;- ఓ గార్గి! ఈ అక్షరం యొక్క ఆజ్ఞ యిదే సూర్యచంద్రులు వారి ధర్మం నెరవేరుస్తున్నారు. ఇత్యాది వాక్యాలలో శాసించడం వినబడుచున్నది. ప్రశాసనం పరమేశ్వరుడికి మాత్రమే సంబంధించిన కర్మ. అచేతనమైన ప్రధానానికి శాసించే అధికారం లేదు. ఘటాలకు కారణమైన మట్టికి ఘటాలను శాసించే శక్తి లేదు.
బృహదారణ్యకోపనిషత్తు:-( 3, 8, 9 );-ఓ గార్గి! ఈ అక్షర శాసనం వలననే సూర్యచంద్రాదులు పృధివి, ద్యులోకాలు ధారణ జరుగుతోంది. అని శాసనపూర్వక ధారణ గురించి పేర్కొన్నారు. కాబట్టి ఇక్కడ అక్షరపదం పరమాత్మ వాచకం. పరమాత్మ సర్వసాహసకుడు. సర్వాధిపతి. సర్వ నియామకుడు. మనుస్మృతి:- అన్నింటిని శాసించేవాడు, సూక్ష్మం కన్నా సూక్ష్ముడు, స్వప్నధీగమ్యుడైన వాణ్ణి పరమపురుషుడిగా తెలుసుకోవాలి. అందువల్ల ఆకాశమంత సమస్త ప్రపంచాన్ని ప్రశాసన పూర్వకంగా ధరించే అక్షరం పరమాత్మ. ఈశ్వరుడు సకల చరాచర భూతముల యొక్క హృదయములలో తిష్ట వేసుకొని ఉన్నాడు. అంతే కాదు. సకల ప్రాణికోటిని తన మాయచేత, యంత్రం తిప్పేవాడు యంత్రమును తిప్పినట్లు, జీవులను నియంత్రిస్తున్నాడు. ఈశ్వరుడు సర్వభూతములలో అంటే సకలజీవరాశుల హృదయాలలో ఆత్మస్వరూపుడుగా నిలచి యున్నాడు. కానీ ఆయనను ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. అదే మాయ. సకల జీవరాశులను తన చేతనాశక్తితో నియంత్రిస్తున్నాడు. తన ఇష్టం వచ్చినట్లు ఆడిస్తున్నాడు. పరమాత్మ జీవులకు స్వేచ్ఛను ఇచ్చాడు. ఆ స్వేచ్ఛను ఎలా ఉపయోగించుకుంటున్నారో హృదయంలో ఉన్న పరమాత్మ సాక్షిభూతంగా చూస్తూ ఉంటాడు. పరమేశ్వరుడి శాసనాన్ని నియమాన్ని అనుసరించే ఆకాశ పర్యంతం ప్రపంచ ధారణ జరుగుతోంది.
సూత్రం :- 75
"అన్యభావ వ్యావృత్తేశ్చ"
అన్యభావ:- పరమాత్మ కన్నా భిన్నమైన ప్రకృతి, జీవాత్మలను, వ్యావృత్తేః చ :- నిరాకరించడం వలన కూడా అక్షరపదం పరమాత్మ వాచకమే.
భావం:- పరమాత్మ కన్నా భిన్నమైన ప్రకృతి, జీవాత్మలను నిరాకరించడం వలన అక్షర పదం పరమాత్మ వాచకమే.
వివరణ:- అన్య భావం అంటే ఈశ్వరునికన్నా భిన్నమైనది అని అర్ధం. పరమాత్మ కన్నా భిన్నమైనవాడు అక్షరునిలో లేదు. కాబట్టి అక్షరం అంటే పరమాత్మే కానీ ప్రకృతి కాదు.
బృహరారణ్యకోపనిషత్తు:- జనకుని కొలువులో ఆధ్యాత్మిక సామ్రాజ్యచక్రవర్తి ఎవరో తెలుసుకోవాలని జనక మహారాజు పరీక్ష పెట్టాడు. ఆ సందర్భంలో యాజ్ఞవల్కునికి, గార్గికి మధ్య వాదన జరుగుతుంది. యాజ్ఞవల్కా! ద్యులోకానికి పైన,భూలోకానికి క్రింద, బ్రహ్మాండం యొక్క మధ్యలో ఉన్నట్టి భూత,వర్తమాన, భవిష్యత్తులుగా పేర్కొనబడినటువంటి ఈ ప్రపంచమంతా దేనిలో వ్యాపించి ఉంది? నక్షత్రాలకు పైన, భూమి క్రింద, ఈ రెంటికి మధ్య భూతభవిష్యద్వర్తమానాలలో ఏముంటుందో వివరించండి? అడిగింది గార్గి. సర్వవ్యాపకమైనది, భూతభవిష్యద్వర్తమానాలలో కూడా ఉండేది ఆకాశం మాత్రమే. అని సమాధానం చెప్పాడు యాజ్ఞ వల్కుడు. మహానుభావా! ఆకాశం కన్నా సూక్ష్మమైనది, సర్వాంతర్యామి అయినది బ్రహ్మమే. ఆది మధ్యాంత రహితమైనది పరమ సత్యం అన్నాడు యాజ్ఞవలకుడు. గార్గి! బ్రాహ్మణులు అక్షరాన్ని ఇలా వర్ణిస్తారు. అక్షరం స్థూలం, సూక్ష్మం ,హ్రస్వ, దీర్ఘం కాదు. లోహితం(అగ్ని), స్నేహం (జలం ),వాయువు, ఆకాశం కాదు. దానికి కళ్ళు ,చెవులు, వాక్కు, మనస్సు లేవు. అంటే ప్రకృతి కాదు. ఇలా అక్షరవర్ణనలో ప్రకృతి, జీవాత్మ స్థూలభూతాలు ఏవి అక్షరం కాదని స్పష్టంగా అన్నారు. అందువల్ల అక్షరపదం పరమాత్మవాచకమే. ఆ అక్షరం స్వయంగా ద్రష్ట. కానీ ఇతరులు దాన్ని చూడలేరు. అక్షరం శ్రోత ఎవరు. దానిని వినలేరు. తను ఆలోచించేది. కాని అది మనస్సుకు విషయం కాదు. అది జ్ఞాత. కానీ జ్ఞానానికి లోబడదు. కళ్ళు, చెవులు, మనస్సు, బుద్ధి అనే సాధనాలు లేకుండానే అక్షరం అన్ని కార్యాలు చేయగలదని భావం.ఈ వర్ణన జీవాత్మ కెన్నడు వర్తించదు. అందువల్ల అక్షర పదం పరమాత్మ వాచకమే. అక్షరం అంటె క్షరము కానిది, నాశనం లేనిది.శాశ్వతమైనది. ఈ లక్షణాలు గలది పరబ్రహ్మమే కానీ ప్రకృతి కాదు. ఈ అక్షరం జీవుడు కాదు అని సూత్రం కూడా అన్వయిస్తున్నారు. దీని కంటే భిన్నమైన చూచేది లేదు, వినేది లేదు, ఆలోచించేది లేదు, తెలుసుకొనేది లేదు. ఉపాధులతో కూడిన జీవుడు అక్షర పదవాచ్యుడు కాదు. అక్షరానికి ఉపాధులేవి లేవు. నేత్రాలు లేనిది, చెవులు లేనిది, వాక్కు లేనిది, మనస్సు లేనిది ,అని శృతి చెబుతోంది. అందువలన అక్షరం అంటే శాసించగలిగే పరమాత్మే కానీ ప్రకృతి కాదు అని గ్రహించాలి.
ఈక్షిత కర్మ వ్యపదేశాధికరణం :- ( 1, 3 13 )
సూత్రం :- 76
"ఈక్షిత కర్మ వ్యపదేశాత్ సః"
ఈక్షిత కర్మ :-ఈక్షణం అంటే సంకల్పం అనే కర్మను, వ్యపదేశాత్:- వర్ణించడం వలన, సః :- ప్రశ్నోపనిషత్తులో ఉటంకించిన పురుషుడు పరబ్రహ్మమే.
భావం:- ఈ ప్రకరణంలో ఈక్షణం అంటే సంకల్పం అనే కర్మను వర్ణించడం వలన ప్రశ్నోపనిషత్తులో చెప్పబడిన పురుషుడు పరబ్రహ్మమే.
వివరణ :- స ఈక్షాం చక్రే ..ఆయన ఈక్షించాడు. ప్రాణం, శ్రద్ధ, ఆకాశం, వాయువు లాంటి పదహారు కళలను ఉత్పన్నం చెయ్యడానికి అనుకూలించే సంకల్ప పూర్వక పర్యాలోచనమే ఈక్షణం. దీన్ని కొన్ని చోట్ల తపస్సని కూడా అంటారు. స తపో తష్యత :- ఆయన తప్పస్సు చేశాడు. ఈక్షణం ధర్మం పరమాత్మకే వర్తిస్తుంది. ఆయన ఈక్షణ మాత్రంలో ప్రాణాధి కళలను సృష్టించగలడు. జీవాత్మకు అలాంటి సామర్ధ్యం లేదు. (6, 1) ఓ భరద్వాజా ! నీకు షోడశ కళలున్న పురుషుడు తెలుసా? అని ప్రశ్న. (6, 2 )ఓ సౌమ్యా! ఈ శరీరంలోనే ఒక పురుషుడు ఉన్నాడు. ఆయనలోనే షోడశ కళలు ప్రభవిస్తున్నాయి అని సమాధానం. ఈ రెండు వాక్యాలలో పురుషుడు అంటే జీవుడా? బ్రహ్మమా? శాస్త్రాలలో పురుష పదాన్ని ఇద్దరి పట్ల వాడతారు కదా! శరీరంలో ఉండే పురుషుడు జీవుడు కదా! అంటే యజుర్వేదం పురుషుడు అంటే పరమాత్మే అని చెప్పింది. దర్శన , స్పర్శనాది గుణాలున్న విజ్ఞానాత్మ పురుషుడు. ఇందులో పురుషుడు జీవుడు. కానీ హృదయపుండరీకంలో ఉన్న ఈశ్వరుణ్ణి శరీరంలో ఉన్నట్లుగానే వర్ణించారు. ఈక్షణం జీవాత్మ ధర్మం కాదు. ఇక్కడ పురుష పదం ప్రాకృతిక శరీరధారి అయిన జీవాత్మకు వర్తించదు. అందువల్ల అది పరమాత్మ బోధకమే. గురువుగారూ! ప్రశ్నోపనిషత్తులో ఓంకారోపసన చేసిన వారు సూర్యలోకానికి వెడతారు అని చెప్పారు కదా! అంటే ఆ పరబ్రహ్మాన్ని ఉపాస్యంగా చెబుతున్నారు. కాబట్టి ఉపాస్యుడు పరబ్రహ్మ సూర్యుడా? దర్శనీయుడు ఎవరు? అని సందేహం వెలిబుచ్చాడు నారాయణభట్టు. ఆ మాటలు విన్న రత్నాకరుడు శిష్యుని సందేహం తీర్చడానికి ఉపక్రమించాడు. దర్శనీయుడు, ధ్యానం చెయ్యదగినవాడు పరమాత్మే కానీ వేరుకాదు. ఇక్కడ పరబ్రహ్మాన్ని ధ్యానంచేయాలి అని చెబుతున్నారు. ఈక్షితిఅంటే చూచుట. దర్శనీయం. ప్రశ్నోపనిషత్తులో సత్యకాముడు పిప్పలాదునికి నమస్కరించి ,మానవులు మరణించే వరకు ఓంకారోపాసన చేస్తే ఏ లోకాలకు పోతాడు? అని అడిగాడు. దానికి పిప్పలాదుడు సమాధానం చెబుతూ ఓంకారమనేది అకార, ఉకార, మకారముల యొక్క సమ్మేళనం. దీనిలో ఒక అక్షరం మాత్రమే ధ్యానిస్తే సాధకుడు సుక్ష్మ శరీరంతో చంద్రలోకానికి వెళ్లి, అక్కడ సుఖాలను అనుభవించి, తిరిగి భూమి మీద జన్మిస్తాడు. మూడు అక్షరాల రూపమైన ఓం కారాన్ని ధ్యానిస్తే సాధకుడు తేజోమయమైన సూర్య లోకానికి పోతాడు. ఆ తరువాత బ్రహ్మలోకం చేరి కల్పాంతం వరకు అక్కడ ఉంది కల్పాంతరమున పరబ్రహ్మంలో లీనమోతాడు అని చెప్పబడినది. కాబట్టి దర్శనీయుడు సూర్యుడు కాదు. సాధకుడు చంద్రలోకం వెళ్లినట్లే సూర్యలోకం చేరతాడు. అంటే ఇక్కడ ఉపాసన చెయ్యవలసినది సూర్యుణ్ణి కాదు. అలాగే దర్శనీయుడు కూడా సుర్యుడు కాదు. పరమాత్మయే అంటూ 4వ అధికరణం పూర్తి చేశాడు రత్నాకరుడు.
దహరాధికరణం :- ( 1, 3 ,14 )
సూత్రం :- 77
"దహర ఉత్తరేభ్యః
ఉత్తరేభ్యః :- మున్ముందు ఉన్న ఛాందోగ్యవాక్యాలను బట్టి దహారః :- ప్రకరణంలో వర్ణించిన దహారాకాశం పరమాత్మ వాచకం.
భావం:- ఛాందోగ్యోపనిషత్తులో చెప్పినట్లుగా ఈ ప్రకరణంలో వర్ణించిన దహారాకాశం పరమాత్మ వాచకం.
వివరణ :- ఆకాశం అంటే భూతాకాశం, లేదా మానవదేహంలో ఉండే దాన్ని దహారాకాశ మంటారు. అంతే కాని పరమాత్మ ఎందుకౌతుంది? అని అనుమానం వ్యక్తం చేశాడు కృష్ణశర్మ. శిష్యుని సందేహం తీర్చడానికి ఉద్యుక్తుదౌతున్నాడు రత్నాకరుడు. శరీరంలో ఉండే ఆకాశాన్ని దహారాకాశం అంటారు. దహారాకాశం అంటే బ్రహ్మమే.
చాందోగ్యోపనిషత్తు:- గాయత్రి ఉపాసన గురించి చెబుతూ శుద్ధబ్రహ్మ, కార్యబ్రహ్మ కన్నా గొప్పది. పాంచభౌతికమైన ఈ జగత్తంతా శుద్ధబ్రహ్మ యొక్క మొదటి పాదమే. మిగిలిన మూడు పాదాలు ఆ పరబ్రహ్మలోనే ఉన్నాయి. గాయత్రి ద్వారా ప్రతిపాదించబడిన 3పాదములు గల అమృతస్వరూపుడైన బ్రహ్మ ఇదే. ఆ పురుషుడికి లోపల,బయట కూడా ఉన్న ఆకాశం ఒక్కటే. అలాగే హృదయం లోపల, బయటఉన్న ఆకాశం ఒక్కటే. అదే ఆత్మ. ఈ రకంగా బ్రహ్మను గురించి తెలుసు కున్నవారు జీవించి ఉండగానే బ్రహ్మస్వరూపం పొందుతారు అని చెప్పబడినది. బాహ్యాకాశం ఎంత ఉన్నదో సూక్ష్మాకాశం, దహారాకాశం కూడా అంతే ఉంటుంది. ఇందులో స్వర్గం, పృధివి రెండు ఉంటాయి. ఆత్మ పాపరహితుడు. జన్మ మృత్యువు, జరామరణములు లేనివాడు. ఆకలి దప్పికలు లేనివాడు. సత్యకాముడు, సత్యసంకల్పుడు. దహారాకాశం భూతాకాశం రెండు ఒకటి కాదు. స్వర్గం, పృధివి రెండు దహరాకాశంలో ఉన్నాయి. కాబట్టి భూమికి, ఆకాశానికి స్వర్గానికి కూడా దహారాకాశమే ఆధారం. ( 8 ,1, 1) ఈ బ్రహ్మపురం అనే మనిషి శరీరంలో ఉన్న చిన్న హృదయకమలం అనే ఇంటిలో సూక్ష్మమైన ఆకాశం ఉన్నది. దాన్ని అన్వేషించి తెలుసుకోవాలి. ఈవాక్యంలో ఉన్న దహరాకాశం జీవాత్మా? పరమాత్మా ? హృదయం జీవులకు కదా ఉంటుంది. దహారం అంటే సూక్ష్మం. జీవాత్మ అణు స్వరూపుడు కనుక దహారాకాశం అంటే జీవాత్మ ఎందుకు కాకూడదు? అంటే ఈ ప్రకరణం లో ఉన్న తరువాత వాక్యాలను బట్టి దహరాకాశం అంటే పరమాత్మ బోధకమే కానీ జీవవాచకం కాదు. (8, 1, 3):-ఈ బయట ఆకాశం ఎంతో, హృదయంలో దహరాకాశం అంతే. ఈ అంతరాకాశంలో పృధివి, ద్యులోకం అగ్ని, వాయువు, సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు, నక్షత్రాలు, ఇహంలో ఉండేవి, లేనివి, అన్నీ ఇమిడి ఉన్నాయి. దీన్ని చూస్తే హృదయకమలంలో ఉండే దహరాకాశం పరమాత్మ వాచకమే. కానీ జీవబోధకం కాదని తెలుతోంది. భూమ్యాకాశాదులు ఈశ్వరునిలో ఇమిడిఉన్నాయి. ఈ దహారాకాశాన్ని తెలిసిన యోగులు అన్ని లోకాలలో స్వేచ్ఛగా చరించగలుగుతున్నారు. భూమవిద్య తరువాత బ్రహ్మపరమైన ఈశరీరంలో అల్పమైన ఏపద్మం ఉన్నదో, దాని లోపల ఏ చిన్న ఆకాశం ఉన్నదో, దాని లోపల ఏది ఉన్నదో, అదే అన్వేషించదగినది. తెలుసుకొనదగినది. ఇక్కడ దహరకాశమన్నా, భూతాకాశమన్నా, విజ్ఞానాత్మ అన్నా పరమాత్మే. ఆకాశ, బ్రహ్మపుర శబ్దాలుండటం వలన ఆకాశ శబ్దం లోను భూతాకాశ శబ్దంలోను, పరమాత్మ అనే అర్ధంలోనే ప్రయోగించబడింది.
సూత్రం :- 78
'గతిశబ్దాభ్యాం తథా హి దృష్టం లింగం చ"
గతి శబ్దభ్యం:- గతి ( గమనం ప్రాప్తి ), శబ్దం :- బ్రహ్మలోకం అనే పదం., చ ;- అంతే కాక ,తధాహి ;- దహరాకాశం విషయంలో లాగా బ్రహ్మ విషయం లోను, దృష్టం :- ఈ గతి, లింగం :- ఈ వాక్యంలో లక్షణాలు కూడా గమనించవచ్చు.
భావం :- గతిని బోధించే వాక్యశేషంలో ఉన్న రెండు శబ్దాల ప్రయోగం వలన దహారాకాశం బ్రహ్మ వాచకం అని తెలుసుకోవాలి. ఈ గతి, శబ్దం అనే పదాలు మరో వాక్యంలో కూడా చూడవచ్చును.
వివరణ :- గతి అంటే గమనం, శబ్దం అంటే బ్రహ్మలోకం. అందుచేత దహరాకాశం అంటే పరమాత్మే. కానీ వేరు కాదు.
ఛాందోగ్యోపనిషత్తు:- ఉద్ధాలకుడు తన కుమారుడైన శ్వేతకేతువుకి సుషుప్తిని గురించి వివరిస్తున్నాడు. మానవుడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు అతడు సుషుప్తిలో ఉన్నాడు అంటారు. ఆ సమయంలో జీవుడు పరమ సత్ ను పొందుతాడు. అంటే తన నిజస్వరూపాన్ని పొందుతాడు. తన ఆత్మను తను పొందుతాడు. కాబట్టి అతన్ని గురించి చెప్పేటప్పుడు అతను నిద్రిస్తున్నాడు అంటారు. సుషుప్తిలో మనస్సు, ఇంద్రియాలు పనిచేయటం మానేస్తాయి. అప్పుడు మిగిలేది ఆత్మ మాత్రమే. ఆ ఆత్మ నిజరూపంలో మిగులుతుంది. ప్రతిబింబం లాంటి జీవభావం పోయి మిగిలేది ఆత్మభావం ఒక్కటే . ఇంద్రియాలన్నీ అలసట చెంది ఒక్కొక్కటి మనస్సులో లీనమైపోతాయి. మనస్సు ప్రాణంలో లీనమైపోతుంది. అంటే సుషుప్తావస్థలో ఒక్క ప్రాణం మాత్రమే మేల్కొని ఉంటుంది. అదే ఇంద్రియాలు అలసటను తీరుస్తుంది. సుషుప్తిలో జీవుడు పరమాత్మను పొందుతున్నాడు కాబట్టి దహరాకాశం అంటే బ్రహ్మమే.
ఛాందోగ్యోపనిషత్తు:-( 8, 3 ,2 ):- దాచిపెట్టిన ధనం ఎక్కడుందో తెలియని వాళ్ళు అక్కడే తిరుగుతూ, దాన్ని పొందలేనట్లు జీవులు నిత్యం బ్రహ్మలోకాన్ని పొంది కూడా దాన్ని తెలుసుకోలేకుండా ఉన్నారు. బ్రహ్మలోకం అంటే దహరాకాశం . ఇలా జీవులు బ్రహ్మలోకాన్ని నిత్యం గమనిస్తూనే ఉన్నారు. ఇలాగే మరో ఉపనిషత్తువాక్యంలో జీవులు నిత్యం బ్రహ్మాన్ని పొందుతునట్లు ఉన్నది. ( 6, 8, 1 ):- పురుషుడు నిద్రిస్తున్నప్పుడు సద్రూపబ్రహ్మాన్ని పొందుతాడు. ( 8 ,15, 1 ):- బ్రహ్మలోకాన్ని పొందుతాడు అని బ్రహ్మలోకం శబ్ద ప్రయోగం కాబట్టి గతి శబ్దం ఈ రెండు దహరాకాశం అయిన బ్రహ్మాన్ని బోధిస్తాయి. ఇదే పరమాత్మ వాచకం. జీవుడు ప్రతిరోజు సుషుప్తావస్థలో బ్రహ్మను చేరతాడు. జీవుడు అక్కడ సత్ తో కలుస్తాడు. అదే మరొక శృతి వాక్యంలో చెప్పబడింది. లోకంలో ప్రకృతమైన దహరాకాశ విషయంలో ప్రయోగింపబడుతున్న బ్రహ్మలోక శబ్దం కూడా. దహరమనగా జీవుడు లేదా భూతాకాశం అనే శంకను తొలగించి అది బ్రహ్మమేనని స్పష్టం చేసింది.
సూత్రం :- 79
"దృతేశ్చ మహిమ్నో స్యాస్మి నుపలబ్దేః"
ధృతేహ్ :- సమాస్త లోకాలను ధరించడం వలన, చ - కూడా, అస్మిన్:- బ్రహ్మానికి, అస్య మహిమ్నః :- జగద్ధారణ మహిమ ఉన్నదని, ఉప లబ్దేః :- మరో ఉపనిషత్తు వాక్యం వల్ల తెలుస్తుంది.
భావం:- సమస్త లోకాలను ధరించడం వలన దహర శబ్దం పరబ్రహ్మ వాచకమని నిశ్చయించాలి. ఎందుకంటే బ్రహ్మానికి జగద్ధారణ మహిమ ఉన్నదని మరో ఉపనిషత్ వాక్యం వలన తెలుస్తుంది.
వివరణ:- ఛాందోగ్యప్రకరణంలో హృదయకమలంలో దహరాకాశం ఉన్నట్లు, అందులోనే పృధివి మొదలైన లోకాలు ఇమిడి ఉన్నట్లు చెప్పారు. తరువాత ఈదహరాకాశాన్ని ఆత్మశబ్దంగా ప్రయోగించారు. అందులో పాపరాహిత్యాది ధర్మాలు వర్ణించారు.
ఛాందోగ్యోపనిషత్తు ( 8, 4, 1 ):- ఆత్మ అనేది అనేక లోకాలు మర్యాదను అతిక్రమించకుండా చేసి ధరించే బంధనం. ఇలా సర్వ లోకాలను ధరించే ఆత్మ పరమాత్మే. వేదంలో కూడా పరబ్రహ్మమే జగద్దారకుడని వర్ణించారు. ఋగ్వేదం దహరాకాశమంటే బ్రహ్మ వాచకమని చెప్పింది. సమస్త జగత్తును లోకాలను ధరించడం అనే మహిమ పరమాత్మ యందు ఉండటం వలన దహర శబ్దం బ్రహ్మనికే వర్తిస్తుంది. బ్రహ్మపురమనే ఈ శరీరంలో దహరాకాశమున్నది. దానిలోని సమస్తం ఉన్నాయి. దానికి సంబంధించినది ఆత్మ. అది ఏ పాపములు అంటనిది. లోకాలను ధరిస్తూ ఉంటుంది. ఈ విధంగా ధృతి అంటే ధరించడం అనే హేతువు వలన ఈ మహిమ ఇతర శృతుల యందు ఆత్మ విషయంలో కూడా కనబడటం వలన దహరం అంటే పరబ్రహ్మమే. దహరాన్ని ఆకాశంతో పోలుస్తూ, దాని యందు అన్ని నిలచి ఉన్నాయని అదే ఆత్మ అని చెప్పబడినది. లోకంలో సేతువు పొలాలలో ఉండే సొత్తు కలిసిపోకుండా ఉండేటట్లు, భారీ నీటి ప్రవాహాన్ని ఏ విధంగా నిలుపుతుందో, అట్లే ఈ ఆత్మ అధ్యాత్మము, అధిదైవం, అధిభౌతికం మొదలైన బేధాల చేత భిన్నంగా ఉన్న లోకాలను, వర్ణాశ్రమాదులను కలిసిపోకుండా ఉండేటట్లు నిలిపే సేతువు. ఈ విధంగా లోకాలను ధరించడం అనేది బ్రహ్మ వలననే జరుగుతుంది. ఆయన ఆజ్ఞ ప్రకారము సూర్యచంద్రులు తిరుగుతున్నారు. అతడే అందరికి ప్రభువు. సర్వభూత పాలకుడు. కాబట్టి లోకాలను ధరించడం అనే కారణం వలన దహరాకాశం బ్రహ్మమే కానీ వేరేది కాదు.
సూత్రం :- 80
'ప్రసిద్దేచ్చ'
ప్రసిద్ధ :- ఆకాశ శబ్దం పరబ్రహ్మము పట్ల ప్రసిద్దంగా వినబడుతోంది. చ :- పైగా
భావం:-ఆకాశ శబ్దం పరబ్రహ్మం పట్ల ప్రసిద్దంగా వినబడుట వలన దహరాకాశ పదం పరబ్రహ్మ వాచకమే.
వివరణ:-ఈకారణం వలన కూడా పరమేశ్వరుడే ఆకాశమని చెప్పబడుచున్నాడు. ఎందువలననగా ఆకాశశబ్దం పరమేశ్వరు డనే అర్థంలో ప్రసిద్ధము. ఆకాశ నిర్వహితా, సర్వాణి సముత్పద్యన్తే.. ప్రయోగాలు కనిపిస్తున్నాయి. ఆకాశశబ్దం జీవుని విషయంలో ప్రయోగించబడినట్లు ఎక్కడ కనబడదు. భూతాకాశం విషయంలో ఆకాశశబ్దానికి ప్రసిద్ధి ఉన్నా కూడా ఉపమాన ఉపమేయ భావాలు కుదరవు. కనుక దానిని గ్రహించకూడదని చెప్పబడింది.
ఛాందోగ్యోపనిషత్తు:- వ్యోమశబ్దం, ఆకాశశబ్దం పరమాత్మని సూచిస్తున్నాయి. ఇలా ఆకాశశబ్దం పరమాత్మ వాచకంగా ఎన్నో చోట్ల ప్రసిద్ధి చెందింది. ఈ ఆకాశపదం పృథివ్యాది పంచభూతాల్లోని ఆకాశాన్ని సూచించడం లేదు. ఆకాశం అంటే అన్ని భూతాలకు ఉత్పత్తికారణంగా చెప్పారు. ఈభూతాలన్ని ఆకాశం వలననే ఉత్పన్నం అవుతున్నాయి. ఆకాశంలోనే అస్త మిస్తాయి. ఇది బ్రహ్మానికి గుర్తుగా సూచించ బడింది. వీటన్నింటి కన్నా ఆకాశం ఎంతో గొప్పది. దేని వలన ఈ భూతాలన్నీ ఉత్పత్తిఅయి జీవిస్తూ ఎందులో లీనమౌతున్నాయో అదే బ్రహ్మం. పృధివి, అంతరిక్షం, ధ్యులోకం, సర్వ లోకాలకన్నా బ్రహ్మశ్రేష్టం. కనుక ఆకాశం బ్రహ్మ వాచకం. అది పరమాత్మ కాబట్టి ఆకాశం అనగానే భూతాకాశం అని స్ఫురించినా దాని అర్ధం మాత్రం పరమాత్మే. కాబట్టి దహారాకాశం అంటే బ్రహ్మమే కానీ జీవుడు కాదు, భూతాకాశం కాదు.
దహరాధికరణం :- ( 1, 3 ,18 )
సూత్రం :- 81
'ఇతర పరామర్శాత్ స ఇతి చేత్ న అసంభావాత్'
ఇతర పరామర్శనాథ్ :- పరమాత్మ కన్నా వేరే అయిన జీవాత్మకు ఈ వాక్యంలో సంబంధం కనిపించడం వల్ల, న ఇతి చేత్ :- దహరాకాశం అంటే జీవాత్మ అని అర్ధం చెప్పడం, న :- తగదు. ఎందుకంటే అసంభావాత్:- పాపరహితత్వం లాంటి ధర్మాలు జీవుడి విషయంలో సంభవంకావు.
భావం:- దహరాకాశం అంటే జీవాత్మ అని చెప్పడం తగదు. ఎందుకంటే పాపరాహిత్యం లాంటి ధర్మాలు జీవుడు విషయంలో సంభవం కాదు. కనుక దహరాకాశం జీవాత్మ కానేరదు.
వివరణ :- సంప్రదాయార్ధంలో జీవుడు అంటే దహరాకాశం అని అర్ధం చెబుతారు. కానీ అది సరియైనది కాదు. అలా అనడానికి వీలు లేదు. బుద్ధి మొదలైన వాటి చేత ఆవరింపబడిన జీవుడుకి ఆకాశంలో సమానత్వం చెప్పడం కుదరదు. శరీరధారి అయిన జీవుడికి పాపాల నుండి విముక్తుడవడం కూడా జరగదు. ఆకాశం బ్రహ్మ నుండి పుట్టినది. సృష్టి ప్రారంభంలో నిరాకరుడు, నిర్గుణస్వరూపుడు అయిన పరమాత్మ నుంచి ముందుగా అవ్యక్తం వచ్చింది. దాని నుంచి మహత్తత్వం దాని నుంచి అహంకారం వచ్చింది. అహంకారం నుంచి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు ఆవిర్భవించాయి. ఇవి పంచతన్మాత్రలు. వీటి నుండి పంచభూతాలు వచ్చాయి. ముందుగా ఆకాశం, వాయువు, అగ్ని ,జలం, భూమి, ఆవిర్భవించాయి. ఆకాశం అంటే భూతకాశమా? మహదాకాశమా? అని సందేహం వస్తుంది? ఇక్కడ ఆకాశం అంటే మహదాకాశమే. అదే పరబ్రహ్మ. మానవ శరీరంలో ఉన్న దహరాకాశం కూడా పరబ్రహ్మ స్వరూపమే.
ఛాందోగ్యోపనిషత్తు:-జీవాత్మ శరీరాన్ని విడిచి పరంజ్యోతిని పొంది తన రూపంలో ఉంటుంది. దీన్ని ఆత్మ అంటారు. ఇక్కడ జీవాత్మ ప్రసక్తి ఉన్నది. అంతమాత్రాన అది దహరాకాశంకాదు. ఎందుకంటే పాపరాహిత్యం, సత్యసంకల్పం లాంటి గుణాలు జీవాత్మ పట్ల సంభవాలు కావు. బుద్ధి మొదలైన ఉపాధులచే పరిమితత్త్వాన్ని అభిమానించే జీవుడికి పాపరాహిత్యమైన ధర్మాలు సంభవింపవుకదా! జీవుడు ఈశరీరం నుండి లేచి అంటే ఈశరీరాదుల కంటే నేను వేరు అని తెలుసుకొని పరబ్రహ్మరూపమైన జ్యోతిస్సును సాక్షాత్కరించుకొని బ్రహ్మరూపాన్ని పొందుతారో అదే ఆత్మ అని చెబుతారు. ముక్తి వచ్చిన తరువాత పరమేశ్వరుడు చేయగలిగే పనులన్నీ చేయాగలుగుతాడా అనే సందేహం రావచ్చును. జగత్కారణం, జగత్ వ్యాపారం సృష్టిలో చేయగలిగే శక్తి పరమేశ్వరుడికే ఉంటుంది. ముక్తాత్మ పరబ్రహ్మానికి లోబడి ఉంటాడు.
సూత్రం :- 82
'ఉత్తరాచ్చేదావిర్భూత స్వరూపస్తు"
ఉత్తరాత్:-ప్రజాపతి పలికిన తరువాత వాక్యాన్ని బట్టి, చేత్:-పాపాలు లేకపోవడం లాంటి గుణాలు జీవాత్మకు వర్తిస్తాయనడం, తు :-సరియైనది కాదు. ఇక్కడ ఆవిర్భూత స్వరూపః :- జీవాత్మ స్వస్వరూపములో ఉండే ముక్తాత్మ.
భావం:- జీవుడికి పాపరాహిత్యం, సత్యసంకల్పం లాంటి గుణాలు స్వాభావికంగా ఉండవు. జీవుడు ఎప్పుడైనా స్వస్వరూపంతో పరమాత్మతో సంబంధం ఉన్నప్పటికీ దహరాకాశం పరబ్రహ్మ వాచకమే.
వివరణ:- ఛాందోగ్యోపనిషత్తు:- ఇంద్రుడు ఆత్మస్వరూపం తెలుసుకోవాలని విరోచనుడితో పాటు ప్రజాపతిని సమీపించాడు. ప్రజాపతి ఇంద్రుడికి ఆత్మోపదేశం చేసాడు. జాగ్రదావస్థకు సంబంధించిన ఆత్మ గురించి ముందు చెప్పి తరువాత క్రమంగా స్వప్న, సుషుప్తి, తురీయావస్థలకు సంబంధించిన ఆత్మ గురించి ఉపదేశం చేసాడు. చివరకు ముక్తావస్థ లో పరమాత్మను పొంది జీవుడు స్వస్వరూపంతో ఉంటాడని చెప్పాడు. అలా ముక్తి పొందిన జీవుడికి కొన్ని గుణాలు శక్తులు లభించ వచ్చును. అంతమాత్రం చేత దహరశబ్దం జీవాత్మ వాచకం కాదు. పూర్వకాలంలో ప్రజాపతి ఆత్మతత్వాన్ని గురించి ఒక ప్రకటన చేసాడు. ఆత్మకు పాపం అంటదు. దానికి ఆకలిదప్పికలు ఉండవు. మానవుడు సత్యకాముడు, సత్యసంకల్పుడు అయి ఆత్మజిజ్ఞాసను అలవారుచుకోవాలి. ఆత్మకోసం అన్వేషించిన వాడు ఆత్మను అనుభవించిన వాడు ఆత్మ స్వరూపాన్ని పొందుతాడు. ఆమాటలు విన్న దేవతలు రాక్షసులు కూడా సత్యాన్వేషణకు బ్రహ్మ దగ్గరకు వెళ్లారు. 32 సం. దీక్ష ఆచరించిన తరువాత కనులలో మెదులుతూ కనిపించే పురుషుడు ఆత్మ అన్నాడు బ్రహ్మ. ఆ మాటలు విన్న రాక్షస రాజు శరీరమే బ్రహ్మ అని ప్రచారం చేశాడు. కానీ ఇంద్రుడు దాన్ని నమ్మలేదు. ప్రజాపతి ఇంద్రుని చాలా సార్లు పరీక్ష చేసి పరబ్రహ్మతత్త్వాన్ని ఉపదేశించాడు. పరబ్రహ్మ మానవుడి హృదయపద్మంలోనే ఉన్నాడు. కనుక దహరాకాశమే బ్రహ్మ. దహర ప్రకరణంలో వర్ణించింది పరమాత్మ స్వాభావిక గుణాలు కనుక దహర శబ్దం పరబ్రహ్మవచకమే.
సూత్రం :- 83
"'అన్యార్ధశ్చ పరామర్శః"
పరామర్శః :- ఈప్రకరణంలో సంప్రసాద శబ్దం జీవాత్మకు సూచించే సంకేతం, చ :- కూడా, అన్య అర్ధః :- భిన్న ప్రయోజనాన్ని ఆశించే ప్రయోగించారు.
భావం :- ఈ ప్రకరణంలో సంప్రసాద అంటే ప్రకృతి అనే పదం జీవాత్మను సూచిస్తుంది. ఇది పరమాత్మ బోధకమే.
వివరణ :- సంప్రసాద అంటే ప్రకృతి అనే శబ్దాన్ని జీవాత్మకు సంబంధించినది. భిన్న ప్రయోజనాన్ని ఆశించే ఈపదం ప్రయోగించారు. సుషుప్తిలోను, ముక్తిలోను జీవాత్మ పరమాత్మను పొంది స్వస్వరూపంతో ఉంటుంది. ఆ పరంజ్యోతి జీవాత్మ కన్నా భిన్నం. ఆ పరబ్రహ్మాన్ని దహర శబ్దంతో సూచించారు. ఇది సూచించడానికి దహర ప్రకరణంలో జీవాత్మ ప్రసక్తి వచ్చింది. 'చ 'పదం జీవాత్మకు దహరాశబ్దంతో వ్యవహరించకూడదని తెలియజేస్తోంది. ఈ జీవపరామర్శ మరొక ప్రయోజనం కొరకు చేయబడింది. సంప్రసాదశబ్దం చేత చెప్పబడిన జీవుడు జాగ్రదావస్థలో దేహేంద్రియములు అనే పంజరంలో బంధించబడి, జీవుడు ప్రకృతిలోని ప్రాపంచిక వ్యవహారాలలో మమేకమై, కంటికి నచ్చిన వస్తుసముదాయంతో, తాత్కాలికమైన సుఖాల కోసం పరితపిస్తూ, వాటి వలన వచ్చే సుఖదుఃఖాలు అనుభవిస్తూ ఉంటాడు. జాగ్రదావస్థలో రకరకాల వాసనలను అనుభవిస్తూ అలసిసొలసి నిద్రలోకి జారుకొని స్వప్నావస్థలోకి వెళ్ళిపోతాడు. ఉదయం తాను అనుభవించిన విషయవాసనలే మనసు మీద ముద్రపడి స్వప్నలోకంలో విహరిస్తాడు. ఈస్థితిలో స్థూలశరీరం పని చెయ్యదు. సూక్ష్మశరీరం మాత్రమే పనిచేస్తుంది. సుషుప్తావస్థలో సూక్ష్మశరీరం, స్థూల శరీరం ఏమి పనిచేయవు. ప్రాణం ఒక్కటే పనిచేస్తుంటుంది. అన్నింటిని వదిలేసిన ఆస్థితిలో అతడు బ్రహ్మయొక్క స్వస్వరూపానందాన్ని పొందుతాడు. అట్టి పాపచింతన లేని సత్యసంకల్పస్థితిలో ఉన్న ఆత్మను ఉపాసించాలి అనిచెప్పడం వరకే ఈ జీవపరామర్శ కానీ, దహర శబ్దానికి జీవుడు తగడు. అది బ్రహ్మవచకం మాత్రమే. నిరక్షరాస్యుడైన ఒక అమాయక చక్రవర్తి తన కుమారుని నుండి ఉత్తరం వస్తే దానిని పంతులు గారి దగ్గరకు తీసుకొని వెళ్లి చదవమంటాడు. చదవాలంటే కళ్ళజోడు కోసం ఇల్లంతా వెదకినా కనబడలేదు. ఆఅమాయకుడు కళ్ళజోళ్ళ షాపుకి వెడితే కంటికి అద్దాలు పెట్టి చదవమన్నాడు. తను చదవలేనని ఉత్తరాలుచదివే కళ్ళజోడు ఇమ్మని అడుగుతాడు. కళ్ళజోడు అంటే కేవలం పరికరం మాత్రమే. అది ఉత్తరాలు చదివదు. నీకు చదువు వస్తేనే చదవగలవు అంటాడు షాపువాడు. అట్లే దేహం, మనస్సు, బుద్ది, ఇంద్రియాలు అన్ని పరికరాలు మాత్రమే. వాటంతట అవి పనిచేయవు. అవి ఆత్మచైతన్యం వలననే పనిచేస్తాయి. అలా ఆత్మగా ఉండటానికి జీవుడు ఉపాధులన్నింటికి భిన్నంగా తనలో ఉన్న ఆత్మయొక్క స్వస్వరూపాన్ని చూడగలగడమే ముక్తి. సుషుప్తిలో, జీవన్ముక్త స్థితిలో పొందేది ఆత్మానందమే అయినప్పటికీ దహర శబ్దం మాత్రం పరబ్రహ్మ వాచకమే.
సూత్రం :- 84
"అల్ప శ్రుతేరితి చేత్త దుక్తం"
శ్రుతీః :- ఉపనిషత్ వాక్యంలో, అల్పాః :-దహరం, అతి సూక్ష్మం అని వర్ణించారు. తత్ ఉక్తం:-ఇదివరకే ఇచ్చాము.
భావం:- ఉపనిషత్ వాక్యంలో దహరం అంటే అతి సూక్ష్మం అని వర్ణించారు. దహరశబ్దం అణు స్వరూపుడైన జీవాత్మకు వర్తిస్తుంది అని అనడానికి సమాధానం ఇది వరకే చెప్పడం జరిగింది.
వివరణ:-దహరం అంటే సూక్ష్మం అల్పం అని అర్ధం. దహరాకాశం అంటే సూక్ష్మమైన ఆకాశమయితే, సూక్ష్మం అని చెప్పినంత మాత్రాన పరమాత్మ కాకపోదు. పరమాత్మ పరమాణువులలో అతి సూక్ష్మరూపంలో కూడా ఉన్నాడని కఠోపనిషత్తులో చెప్పబడింది. కాబట్టి సూక్ష్మరూపంలో ఉన్నప్పటికీ దహరాకాశమంటే పరమాత్మే.
చాందోగ్యోపనిషత్తు:- (8 ,1, 1) "దహరో స్మిన్నంతరాకాశ" హృదయంలో ఉండే ఆకాశం అల్పం, సూక్ష్మం ఇది ఎలా బ్రహ్మవాచకం అవుతుందని సందేహమా? బ్రహ్మసూత్రాలలో (1,2,7) నందు చెప్పబడింది. ఈసూత్రంలోనే ఇందుకు సమాధానం ఉన్నది. పరబ్రహ్మ సర్వవ్యాపకం, అనంతం అయినా హృదయకమలం ఉపాధిగా దహరం సూక్ష్మం అని వర్ణించారు. ఉపాసకుడైన జీవాత్మకూ, ఉపాస్యుడైన పరమాత్మను తెలిసేనిమిత్తం ఈవర్ణన చెప్పబడింది. కనుక దహరాకాశం బ్రహ్మవాచకమే కానీ జీవబోధకం కాదు. "ఏష ఆత్మాన్తంతర హృదయే'" ఈ నాహృదయంలో ఉన్న ఆత్మ అనే వాక్యంలో, బ్రహ్మహృదయంలో ఉంటాడని అంటున్నారు. హృదయం అల్పం కదా! అందులో ఉండే ఆత్మ ఇంకా అల్పం కదా! వడ్లగింజ కన్నా దానిలో ఉండే బియ్యంగింజ ఇంకా అల్పం కదా! హృదయమే అల్పం. అక్కడ ఉండే తత్త్వం పరిమితంగా ఉంటుంది. ఆ అల్పత్వం జీవాత్మపట్ల సబబే కానీ బ్రహ్మానికి ఎలా వర్తిస్తుంది? అనేదే సందేహం. బ్రహ్మం సర్వ భూతాంతరాత్మ. సర్వస్థానగతం. అలాంటప్పుడు హృదయంలో మాత్రం ఉండడా? అలాగే జీవాత్మలోను ఉంటాడు. అల్పమైన హృదయంలోను, అంతకన్నా సూక్ష్మమైన జీవాత్మలోను ఉంటాడు. హృదయపుండరీకంలో ఉన్నంత మాత్రాన అల్పం కాదు .ఆత్మ హృదయస్థానంలో అతి చిన్నదిగా ఉంటుంది. అదే మనం తెలుసుకోవాలి. అందుకనే ఆత్మయే ఉపాస్య అన్నారు. జీవుడు ఉపాసకుడు అన్నారు. బుద్ధికి, విఙ్నానానికి స్థానం హృదయమే. భగవంతుణ్ణి తెలుసుకోవడానికి తగినది హృదయమే. అందుకే పరమాత్మ హృదయంలో ఉన్నాడని చెప్పారు. పరమాత్మ సర్వాంతర్యామి. అయినప్పటికీ ఉపాసన కోసం లింగం అంటే గుర్తు చూపించి ఇది శివుడు ఉపాసించు అని ఎలా చెబుతారో అలాగే ఇక్కడ కూడా పరమాత్మ సూక్ష్మరూపంలో హృదయమందు ఉన్నాడని చెప్పబడింది. పరమేశ్వరుడు హృదయపుండరీకంలో ఉన్నాడని ధ్యానం చెయ్యగా, చెయ్యగా తత్సాక్షాత్కారం లభిస్తుంది. ఎంతోమంది జీవుల హృదయాలలో ఉన్నప్పటికీ వారి దోషాలు ఏమి పరమేశ్వరునికి అంటవు.
అనుకృత్యధికరణం :- ( 1, 3, 22 )
సూత్రం :- 85
" అనుకృతే స్తస్య చ "
చ :- అంతే కాక , తస్య :- పర బ్రహ్మ , అనుకృతే :- హృదయ ఉపాధిని అనుకరించడం వలన,
భావం :- పరమాత్మ హృదయ ఉపాధిని అనుకరించడం వలన ఆయన అల్ప పరిమాణం సిద్ధిస్తుంది. ఘటాదుల్లో ఉండే ఆకాశం ఘటాది ఆకాశాన్ని అనుకరిస్తుంది. అలాగే పరమాత్మ కూడా హృదయపుండరీకాన్ని సంతరించుకున్నట్లు అనుకరిస్తున్నట్లు వ్యవహరిస్తారు. అంత మాత్రాన బ్రహ్మ స్వరూపం అల్పం అని పొరబడరాదు.
వివరణ :- గురువుగారు! సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అక్కడ ప్రకాశించవు. అంతా పరమేశ్వరుని యొక్క కాంతులే అని ముండకోపనిషత్తు లో చెప్పారు. మరి ఆ కాంతి కూడా ఏదో తేజస్సే అయి ఉండాలి కదా! అని అనుమానం వ్యక్తం చేశాడు కృష్ణ శర్మ. ఆ మాటలు విన్న రత్నాకరుడు తన శిష్యుని అనుమానం తీర్చడానికి సిద్ధమయ్యాడు. అనుకరించడం వలననే ఆత్మ యొక్క తేజస్సులోనే సమస్తము ప్రకాశిస్తుంది. అక్కడ సూర్యుడు, చంద్రుడు,నక్షత్రాలు ప్రకాశించవు. ఆ మెరుపులు ప్రకాశించవు. ఈ అగ్ని మాట చెప్పేదేమిటి? ప్రకాశిస్తున్న దానినే అనుసరించి సర్వమూ ప్రకాసిస్తోంది. దాని కాంతి చేతనే ఇదంతా ప్రకాశిస్తోంది అని పఠిస్తున్నాను. అక్కడ ప్రకాశిస్తున్న దేనిని అనుసరించి ఇదంతా ప్రకాశిస్తోందో, దేని కాంతిచేత ఇదంతా ప్రకాశిస్తోందో అది ఏదైనా తేజోధాతువా? లేదా బ్రహ్మయా? అనే సందేహం కలుగుతోంది. తేజో ధాతువు అని ప్రార్ధించింది ఎందువల్ల? తేజోధాతువైన సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు తేజస్వభావులైన చంద్రతారకాదులు భాషించవు అని ప్రసిద్ధము కదా! అట్లే సూర్యునితో సహా ఈ చంద్రతారకాదికం దేని యందు భాసించిందో అది కూడా తేజ స్వభావంకల ఒకానొకటి అని తెలుస్తోంది. నడుస్తున్నవారిని అనుసరించి నడుస్తున్నాడు అన్నట్లు అనుకరణ అనేది సమాన స్వభావం కలవాటిలోనే కనబడుచున్నది కదా! అందుచేత ఒకానొక తేజోధాతువే. తమేవభా0త మనుభాతి సర్వం అని చెప్పిన అనుభవం... అంటే అనుసరించి ప్రకాశించడం ప్రాజ్ఞాత్మ గ్రహిస్తేనే కుదురుతుంది. ప్రాజెనాత్మను గూర్చి సత్య సంకల్పం,శాంతి స్వరూపం,సత్య సంకల్పుడు అని చెప్పుచున్నారు.అంతే కాని సూర్యచంద్రాదులు ఏదో ఒక ధాతువును అనుసరించి ప్రకాశిస్తున్నాయి అని ప్రసిద్ధము. ఒక దీపం మరొక దీపాన్ని అనుసరించి అంటే దాని మీద ఆధారపడి ప్రకాశించదు కదా! అనుకరించడం సమాన స్వభావం కల వాటి మధ్యనే ఉంటుందని చెప్పడం కూడా యుక్తం కాదు. వేరు వేరు స్వభావం కలవాటిలో కూడా కనబడుతున్నది కదా! ఎట్లనగా బాగా కాల్చబడిన ఇనుప గుండు అగ్నిని అనుసరిస్తూ, కాలుస్తున్నా ఆ అగ్నిని అనుసరించి కాలుస్తున్నది. సూర్యాదులు దాని మూలాన్నీబాసిస్తున్నాయి అని చెప్పడం ప్రాజెనాత్మను అంటే జ్ఞానరుపమైన ఆత్మను సూచిస్తుంది. ప్రాజెనాత్మను గూర్చి దేవతలు జ్యోతిస్సులకు కూడా జ్యోతిస్సు, అమృతము అయిన ఆ బ్రహ్మను ఉపాసిస్తున్నారు ఈ లోకంలో ఏది తెలియబడినా బ్రహ్మ అనే తేజస్సు చేతనే తెలియబడుతోంది. బ్రహ్మ స్వయం జ్యోతిః స్వరూపుడు అవడం చేత మరొక దానిచేత దేనిచేతా తెలియబడడు. అలాంటప్పుడు సూర్యచంద్రాదులు బ్రహ్మ విషయంలో ప్రకాశించే ప్రసక్తే లేదు. బ్రహ్మ ఇతరమైన వాటిని తెలిసేటట్లు చేస్తుంది.కానీ బ్రహ్మ మరొక దాని చేత తెలియబడడు.ఇతర జ్యోతిస్సులు ఏమి లేనప్పుడు పురుషుడు అంటే ఆత్మనే జ్యోతిస్సు ఉంటాడు. ఆత్మ దేని చేత తెలియబడదు అని శృతులు చెబుతున్నాయి.
సూత్రం :-86
“అపి చ స్మర్యతే "
అపి :- ఉపనిషత్ వాక్యాల్లోనే కాక, స్మర్యతే:- స్మృతులలో చ :- కూడా
భావం:- ఉపనిషత్ వాక్యాల్లోనే కాకుండా స్మృతులలో కూడా పరమేశ్వరుడు సూక్ష్ముడు అని వర్ణించారు.
వివరణ :- మనుస్మృతి :- ( 12- 122):- ఈశ్వరుడు అల్పం కన్నా అల్పం, సూక్ష్మం , సర్వ ప్రకాశకుడు, అణువు కన్నా సూక్ష్ముడని స్మృతులలో, ఉపనిషత్తులలో వర్ణించారు కనుక దహరాకాశ పదం బ్రహ్మ వాచకమే.
బృహదారణ్యకోపనిషత్తు:- ఒక రోజున యాజ్ఞవల్కుడు జనక మహారాజు ఆస్థానానికి వచ్చాడు. అతనికి నమస్కరించి, జనక మహారాజు తన సందేహాలు తీర్చాలని అడిగాడు. సరేనన్నాడు యాజ్ఞవుల్కుడు.
జనకమహారాజు:- 1.మానవుడు ఏ వెలుగు వల్ల నిత్యకృత్యాలు సాగిస్తున్నాడు?
జ) యజ్ఞవుల్కుడు;- సూర్యుని వెలుగు వల్ల.
2. సూర్యుడు లేకపోతే అంటే రాత్రులు యందు ఏ వెలుగుచేత నిత్యకృత్యాలు సాగిస్తారు? జ).చంద్రుని కాంతిలో
3 .సూర్యుడు, చంద్రుడు ఇద్దరూ లేనప్పుడు అంటే సంధ్యా సమయంలో? జ).అగ్ని కాంతులలో
4 . సూర్యుడు, చంద్రుడు, అగ్ని లేనప్పుడు? జ).వాక్కు సాయంతో
5 .మరి వాక్కు కూడా లేనప్పుడు?
జ).జనక మహారాజా! ఈ వెలుగులన్నింటికి ఆవల ఆత్మజ్యోతి ఉన్నది. ఆ జ్యోతి ప్రకాశకులకు ప్రకాశం, కాంతులకు కాంతి అటువంటి ఆత్మ వల్లనే మానవుడు మనుగడ సాగిస్తున్నాడు. ప్రాణుల్లోనూ బుద్ధి, వృత్తుల యందు ఉండే విజ్ఞానాత్మయే ( జీవాత్మ ) ఆత్మ. ఇంద్రియాల మధ్య స్వయంప్రకాశమై హృదయంలో ఉండే పురుషుడే ఆత్మ. అతడే జ్యోతి స్వరూపుడు.
ముండకోపనిషత్తు:- నతత్ర సూర్యోభాతి నతత్ర చంద్రతారకం --అక్కడ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఏవి ప్రకాశించవు. కేవలం ఆత్మజ్యోతి ప్రకాశం మాత్రమే ఉంటుంది. పరమేశ్వర స్వరూపం జ్ఞానజ్యోతి. ఆజ్యోతి నుంచి అనేక వేల లక్షల కోట్ల కోటానుకోట్ల కిరణాలు ప్రకాశిస్తున్నాయి. అందులో 360 కిరణాలు మాత్రమే మనం తీసుకోగలిగాం. అందులో అగ్ని 108 కిరణములు , రవి 116 కి., చంద్రుడు 136 కి.,తీసుకోగలిగారు. ఈ మొత్తం 360 కిరణాలు సూర్యుడు, చంద్రుడు అన్ని అందరూ ఆ పరమేశ్వరుని కిరణాల వల్లనే ప్రకాశిస్తున్నాయి. ఈ రకంగా బ్రహ్మ వల్లనే ఈ జగత్తు అంతా ప్రకాశిస్తోంది. పరబ్రహ్మ స్వయంప్రకాశం గలవాడు. అణువు కన్నా సూక్ష్మమైన రూపం ప్రాజ్ఞునికే(బ్రహ్మకు) ఉన్నట్లు భగవద్గీతలో చెప్పబడింది. దానిని సూర్యుడూ కానీ చంద్రుడు కానీ అగ్ని కానీ ప్రకాశింపచేయజాలరు. ఏ స్థానాన్ని పొంది తిరిగి వెనుకకు రాదో, అది నా పరమమైన స్థానం. నా స్వరూపం. జగత్తంతా ప్రకాశింపజేసే సూర్యుని కాంతి, చంద్రునిలో కాంతి, అగ్నిలోని కాంతి ఇదంతా నా తేజస్సే అని తెలుసుకో అని చెప్పబడినది.
ప్రమితాధికారణం :- ( 1, 3 , 24 )
సూత్రం :- 87
"శబ్దాదేవ ప్రమితః "
శబ్దాత్ ఏవ :- ఉపనిషత్ వాక్యాల వలన కూడా , ప్రమితః :- అంగుష్ఠ మాత్రుడని పరిమితంగా వర్ణించిన పురుషుడు పరబ్రహ్మమే.
భావం :- ఉపనిషత్ వాక్యాల వలన కూడా అంగుష్ఠ మాత్రుడని పరిమితంగా వర్ణించిన పురుషుడు పరబ్రహ్మమే.
వివరణ :- గురువుగారు! అంగుష్ఠపురుషుడు శరీరం మధ్యలో ఉన్నాడు. అతడే భూత, భవిష్యత్, వర్తమానాలకు ప్రభువు అని కఠోపనిషత్తులో చెప్పారు. ఈ అంగుష్టమాత్రుడు జీవుడా? పరమాత్మా? భారతంలో యముడు సత్యవంతుని శరీరం నుండి అంగుష్ఠమాత్రుడైన పురుషుణ్ణి బయటకు లాగాడు కదా! ఇక్కడ అంగుష్ఠమాత్రుడు జీవుడే కదా! అని అడిగాడు నారాయణ భట్టు. అంగుష్ఠమాత్రుడైన పురుషుడు అంటే జీవుడు కాదు. పరమాత్మే అన్నాడు గురువు.
కఠోపనిషత్తు:-(4-12):-భూత, భవిష్యత్, వర్తమానాలకు ఈశుడైన పురుషుడు అంగుష్ఠమాత్రుడు. శరీరమధ్యలోఉన్నాడు. ఈవర్ణన బట్టి శరీరమధ్యలో అంగుష్ఠమాత్రుడైన పురుషుణ్ణి జీవుడని భ్రమించకూడదు. జీవుడు భూతభవిష్య ద్వర్తమానాలకు ఈశుడు కానేరడు. ఆ నియామకశక్తి పరమాత్మకే ఉంది. కనుక అంగుష్ఠమాత్ర పదం బ్రహ్మనికే అన్వయిస్తుంది. శరీరమధ్యంలో అంగుష్ఠమాత్రుడైన అంటే బొటనవ్రేలు ప్రమాణం కల పురుషుడు ఉన్నాడు. అతడు ధూమం లేని జ్యోతిస్సు వంటివాడు. భూతకాలానికి,భవిష్యత్ కాలానికి కూడా ఈశ్వరుడు. ఇప్పుడు ఉన్నవాడు అతడే. రేపు కూడా అతడే నియామకుడు. ఈ అంగుష్ఠమాత్ర పురుషుడు విజ్ఞానాత్మా? పరమాత్మా? అని సంశయం. అంగుష్ఠ పరిమాణం చెప్పడం వలన విజ్ఞానాత్మయే అనిపిస్తుంది. అనంతమైన పొడవు గల పరమాత్మకు వ్రేలు పరిమాణం ఉపపన్నం కాదుకదా! యముడు సత్యవంతుని శరీరం నుండి పాశాలతో కట్టబడి అంగుష్ఠమాత్రుడైన పురుషుణ్ణి బలంగా లాగాడు అని స్మృతి చెబుతోంది. యముడు బలంగా పరమేశ్వరున్నీ లాగడం కుదరదు కదా! అందుచేత ఇక్కడ అంగుష్ఠమాత్రుడు జీవుడు అని నిశ్చయింపబడింది. అంగుష్ఠమాత్రుడైన పరిమితమైన పురుషుడు పరమాత్మే కావాలి. ఎందువల్ల? ఈశానో భూత భవ్యస్య..భూత భవిష్యత్తులకు ప్రభువు అనే వాక్యం వల్ల ఆయా కాలాలలో ఎలాంటి అడ్డంకులు లేకుండా పాలింపదగినవాడు. వాటి మీద పూర్వ అధికారం కలవాడు ఈశ్వరుడు తప్ప మరెవరూ లేదు కదా! ధర్మానికి , ఆదర్శానికి, భూత భవిష్యత్తులకు అతీతమైనది అయిన దేనిని చూస్తున్నావో అతడే బ్రహ్మ. శబ్దాదేవ ఈశానః అని పేరు వినబడటం వలననే ఇతడు పరమేశ్వరుడు అని తెలుస్తున్నది.
సూత్రం :- 88
"హృద్య పేక్షయాతు మనుష్యాధికారత్వాత్"
హృది ;- హృదయము నందు, అపేక్షయా :- పరమేశ్వరుడు ఉండడాన్ని బట్టి , మనుష్య అధికారత్వాత్ :- మనుషులను గూర్చి చెప్పి నడవడం వలన , శాస్త్రాలను మనుషుల్ని ఉద్దేశించి రచించారు. తు ;- కనుక
భావం :- శాస్త్రాలను మనుషుల్ని ఉద్దేశించి రచించారు. కనుక బ్రహ్మం హృదయంలో ఉండటం వలన ఆ శాస్త్రాలలో అంగుష్ఠ మాత్రుడని వర్ణించారు.
వివరణ :-ఈశ్వరుడు సర్వవ్యాపి అయినప్పటికీ అతడు అంగుష్ఠ మాత్రుడై హృదయస్థానంలో ఉన్నాడు. పరమేశ్వరుడు సర్వాంతర్యామి, సర్వశక్తి సంపన్నుడు, అతని కున్న ఈశత్వం, భూత భవిష్యత్తుల మీద అధికారం జీవికి ఉండవు. పరమేశ్వరుడు ఎందులో ఉంటే ఆరూపంలో ఉంటాడు. అంటే వెదురుబొంగులో ఉండే ఆకాశం సన్నగా పొడవుగా ఉంటుంది. అలాగే చీమ, దోమల యందు పరమాత్మ సూక్ష్మరూపంలో ఉంటాడు. ఈ అంగుష్ఠమాత్రుడు అనే శబ్దం మానవులలో ఉండే పరమాత్మని వర్ణిస్తాయి. కాబట్టి అంగుష్ఠమాత్ర పురుషుడు పరబ్రహ్మ అని అన్నాడు రత్నాకరుడు. పరమేశ్వరుడు సర్వగతమే అయినా కూడా హృదయంలో ఉండడాన్ని బట్టి ఈ అంగుష్ఠమాత్రత్వం వెదురు కణుపును బట్టి ఆకాశం జానెడు అన్నట్లు చెప్పబడుచున్నది. అత్యధిక ప్రమాణంగల పరమాత్మకు అంగుష్ఠ మాత్రత్వం సరిఅయిన రీతిలో కుదరదు కదా! ఈశానః శబ్దాలుండటం వలన పరమాత్మను తప్ప మరెవరిని గ్రహించడం కుదరదు. ప్రాణి భేదాన్ని బట్టి హృదయప్రమాణం ఒకే విధంగా ఉండదు కనుక హృదయాన్ని బట్టి అంగుష్ఠ మాత్రత్వం చెప్పబడింది. శాస్త్రం చెప్పినట్లుగా ఇది మనుషులకే వర్తిస్తుంది. మనుషుల శరీరం ఒక నియతమైన పరిమాణంలో ఉంటుంది. వారి హృదయం వారి అంగుష్ట ప్రమాణంలో నియతంగా ఉంటుంది. అందువలన పరమాత్మ అంగుష్ఠప్రమాణం అని చెప్పబడినది. ఈ అంగుష్ఠమాత్ర పురుషుడు సంసారి అనే గ్రహించాలి. సంసారియైన అంగష్ఠమాత్ర పురుషునికి బ్రహ్మత్వం ఉపదేశించబడుతుంది. వేదాంతాలు రెండు విషయాలు ప్రతిపాదిస్తాయి. 1.కొన్నిచోట్ల పరమాత్మ స్వరూపాన్ని ప్రతిపాదిస్తాయి. 2. కొన్ని చోట్ల విజ్ఞానాత్మకు పరమాత్మ లో ఐక్యాన్ని బోధిస్తాయి. ప్రతి హృదయంలో అంతరాత్మగా చేరి ఉన్న పురుషుణ్ణి బుద్ధి బలంతో అతనే బ్రహ్మ అని తెలుసుకోవాలి.
దేవతాధికరణం :- ( 1, 3 , 26 )
సూత్రం :- 89
"తదుపర్యపి బాధరాయణః సంభావాత్"
సంభవాత్:- బ్రహ్మం వ్యాపకం , తత్ ఉపరిఅపి:- హృదయానికి బయట కూడా ఉంటుంది అని, బాదరాయణః :- బాదరాయణుడు అంటారు.
భావం:- బ్రహ్మం హృదయంలో తన్మాత్రరూపంలో ఉండటం సంభవమే కనుక హృదయం బయట కూడా ఉంటుందని బాదరాయణుడు చెప్పారు.
వివరణ :- బ్రహ్మవిద్యను ఎవరు అభ్యసించాలి? మానవులకు బ్రహ్మోపదేశం పొందే హక్కు ఉన్నది. మరి దేవతలకు బ్రహ్మవిద్యను పొందే హక్కు ఉన్నదా? అన్నాడు కృష్ణ శర్మ. శిష్యుడి అనుమానం తీర్చడానికి సంసిద్ధుదౌతున్నాడు రత్నాకరుడు. మానవుల కన్నా ఉన్నతులు దేవతలు. దేవతలు భోగలాలసులు అనే మాట నిజమే. కానీ వారి భోగం శాశ్వతం కాదు అనే విషయం వారికి తెలుసు. అందుకే వారుకూడా శాశ్వతమైన ఆనందం కావాలి అనుకుంటారు. కాబట్టి వారికి కూడా వైరాగ్యం కలుగుతుంది. అప్పుడే బ్రహ్మవిద్యకు అధికారులౌతారు. బాదరాయణుడు మనుష్యుల కంటే పై వాళ్ళయిన దేవతలకు కూడా బ్రహ్మవిద్యాధికారాన్ని అంగీకరిస్తున్నాడు. వాళ్లకు కూడా బ్రహ్మ విద్యకు ఉండవలసిన లక్షణాలు ఉండటానికి అవకాశం ఉంది. మనుష్యులకు అధికారం ఉంది కాని దేవతలకు అధికారం ఉందా అని సందేహం కలుగుతుంది. దీని గురించే చర్చింపబడుతోంది. దేవతలకు అధికారం లేదు అని పూర్వ పక్షానికి ఫలం దేవత్వం పొందడం ద్వారా క్రమముక్తికి సాధనమైన దహరోపాసనాదులతో మనుష్యుడు ప్రవర్తించకపోవడం, దేవత్వ ప్రాప్తికి ప్రయత్నించడం ఈ సిద్ధాంతంలో చెప్పబడింది. శాస్త్రం మనుష్యులను ఉద్దేశించి చెప్పబడింది కాబట్టి మనుష్యహృదయ ప్రమాణాన్ని అనుసరించి అంగుష్ఠమాత్ర శృతి వచ్చింది. బ్రహ్మజ్ఞానానికి సంబంధించినంత వరకు మనుష్యులకు మాత్రమే ఉద్దేశించబడింది. ఆ పైన దేవతాదుల విషయంలో కూడా ఈ శాస్త్రం ప్రవర్తిస్తుందని బాధరాయణాచార్యులు తలుస్తున్నారు. వాళ్ళకి కూడా అధికారికారణం అంటే అధికారాన్ని కల్పించే హేతువు సంభవిస్తుంది కదా! దేవతలు కూడా భోగవస్తువులు ఐశ్వర్యం అనిత్యమైనవని తలంచి మోక్షాన్ని కోరుకుంటున్నారు. పురాణాలు, ఇతిహాసలలో దేవతలకు కూడా దేహాలు ఉన్నాయని తెలుస్తోంది. అందుకే వాళ్లకు కూడా సామర్ధ్యం సంభవిస్తుంది.బ్రహ్మవిద్యపై వారికి ఎటువంటి నిషేధం లేదు. ఉపనయనం వేదాధ్యయనం కోసమే కదా! దేవతలు స్వయంగా వేదాలు స్ఫురించినవాళ్ళు. దేవేంద్రుడు 101 సం. ప్రజాపతి వద్ద బ్రహ్మచర్యవ్రతం అవలంభించాడు. వరుణుడి కుమారుడు భృగువు తండ్రిని బ్రహ్మోపదేశం చెయ్యమన్నాడు. దేవతలు యజ్ఞాలు చేసి సంతోషపెట్టవలసిన ఇతర దేవతలు లేరు. ఋషులకు ఇతర ఋషులు ఎవరూ లేరు. కనుక వాళ్ళకి కర్మాధికారం లేదు. అందువల్ల దేవతలకు ఉన్న విద్యాధికారాన్ని ఎవరూ కాదనలేరు. దేవతలకు అధికారం ఉన్నా కూడా అంగుష్ఠమాత్ర శృతి వాళ్ళ అంగుష్టాన్ని బట్టి ఉంటుంది.
సూత్రం :- 90
"కర్మణి విరోధ ఇతి చేన్నానేక ప్రతి పత్తేరదర్శనాథ్"
కర్మణి :- జగత్ రచనాత్మక కర్మ యందు, విరోధ ఇతి చేత్ :- విరోధం కలుగుతుంది కదా! అని అన్నట్లయితే న ;- అట్లు కాదు, అనేక ప్రతిపత్తేః :- అనేక రూపాలుగా బ్రహ్మానికి శక్తులున్నాయని, దర్శనాత్:- కనబడడం వల్ల
భావం:-పరబ్రహ్మము సర్వ వ్యాపకమైనప్పుడు జగత్తును సృష్టించే కర్మలో సర్వ వ్యాపకత్వం అడ్డంకి అవుతుంది కదా! అని అనడం తగదు.ఎందుకంటే బ్రహ్మకి అనేక శక్తులున్నాయని శాస్త్రాలంటున్నాయి.
వివరణ:-పరమాత్మ సర్వత్రా వ్యాపించినప్పుడు సృష్టి ఎలా చేయగలడు అనే సందేహం తగదు. బ్రహ్మానికి అనేక శక్తులున్నందున వాటి మూలంగా సృష్టి, స్థితి, లయలు సంభవిస్తాయి. ఋగ్వేదం పరమాత్మ శక్తియుక్తుడని తెలియజేశాయి.
బృహదారణ్యకోపనిషత్తు:- ఈ లోకాన్ని, పరలోకాన్ని సమస్త భూత రాశిని సైతం అంతర్యామిగా ఉండి నియమిస్తున్నాడు. అందుచేత వ్యాపకమైన బ్రహ్మ హృదయంలో అంగుష్ఠమాత్రుడని వర్ణించడం సరిఅయినది. దేవతలకు దేహమున్నది మానవులు చేసే యజ్ఞయాగాదులలో హవిస్సును తీసుకోవడానికి దేవతలు వస్తారు. ఒకేసారి అనేక చోట్ల ప్రత్యక్షమై హవిర్భాగం తీసుకుంటారు. శాకల్యుడు యజ్ఞవల్కుని అడుగుచున్నాడు?దేవతలు ఎంతమంది? 3306 మంది అని సమాధానం చెప్పాడు . మళ్ళీ మళ్లీ ప్రశ్నించగా 33 మంది దేవతల మహిమాలే.6,3,2,1 దేవతలని యాజ్ఞవల్కుడు సమాధానం చెబుతారు. ఒకే దేవత ఒకేసారి అనేక రూపాలు పొందుతుంది. శ్రీ కృష్ణుడు అనేక మంది గోపికలతో ఒకేసారి క్రీడించాడని చెప్పబడింది. 33 మంది దేవతల మహిమ వల్ల ఏర్పడిన రూపాలే 3306 మంది దేవతలు. ఆ 33 మంది :- 8 మంది వసువులు, 11 మంది రుద్రులు,12 మంది ఆదిత్యులు, అశని ( పిడుగు) పశువులు (ఇంద్రుడు). ఈ33 మంది అగ్ని పృధివి, వాయువు, అంతరిక్షం, ఆదిత్యుడు, చంద్ర-నక్షత్రాలలోఅంతర్గతం అవుతారని ..మరల ఈ 6 మూడు లోకాలలో అంతర్గతం అవుతారని, ఈ 3 వేల మంది అన్నప్రాణాలలో అంతర్గతమౌతారు. ఈ అన్నప్రాణాలు వాయువులో, వాయువు ప్రాణంలో అంతర్గతం అవుతాయి. ఈ విధంగా 33 మంది దేవతలు 3306 గా అయ్యారని చెప్పడం చేత దేవతలు వారి ఇచ్చానుసారం అనేక రూపాలు ధరించే సామర్ధ్యం ఉంటుంది. దేవతలకు శరీరాలు ఉంటాయని అంగీకరించి వాళ్లకు కూడా విద్యలయందు అధికారం ఉందని చెబితే, దేహాదులు ఉండటం చేత ఇంద్రాదులకు ఆహూతులు సమర్పించి నప్పుడు వాళ్ళు స్వయంగా ఋత్విక్కులవలె స్వరూపంతో వచ్చి ఆహూతులు స్వీకరించడం ద్వారా యజ్ఞయాగాది కర్మలలో భాగం కావలసివస్తుంది. అనేక యాగాలు జరుగుతున్నప్పుడు ఇంద్రుడు ఒకే సమయంలో స్వయంగా ప్రదేశాలన్నింటికి వెళ్ళలేదు కదా! అని సందేహం కలగవచ్చును. అనేక ప్రతిపత్తి కల దేవత కూడా ఒకే సమయంలో అనేక రూపాలు గ్రహించడం కుదురుతుందని శృతిలో చెప్పబడింది. 33 మంది దేవతలు ఆరు మొదలైన సంఖ్య గల దేవతలలో అంతర్గతమౌతున్నారు అని చెప్పి చివరగాఉన్న ఆఒక్క దేవత ప్రాణం అని, ఆ ఒక్క ప్రాణమే ఓకే సమయంలో అనేక రూపాలలో ఉన్నది అని చెబుతారు.
సూత్రం :- 91
"శబ్ద ఇతి చేన్నాతః ప్రభావాత్ "
ప్రత్యక్ష :- వేదం, అనుమానాభ్యమ్ :- శృతులు, స్మృతులు , అతః ప్రభావాత్:- వ్యాపకుడు, అశరీరుడు, శబ్దే:- వేదాల విషయంలో, ఇతి చేత్ :- ఇది సాధ్యం కాదు అనడం. న :- సరియైనది కాదు.
భావం :- శృతులు,స్మృతులు , ఆశరీరుడైన ఈశ్వరుని నుంచే వేదాలు ఉత్పన్నం అయ్యాయని అంటున్నాయి. ఇది సాధ్యం కాదు అనడం సరియైనది కాదు. ఈశ్వరుడు వ్యాపకుడు,శబ్దరాశి అయిన వేదం ఆయన నుండే ఉద్భవించింది.
వివరణ:-వేదం నిత్యమైనది. దేవతలు అనిత్యులు. దేవతలంతా పూర్వజన్మలో చేసిన కర్మలననుసరించి దైవత్వం పొందిన వారే. అందుకే వారు అనిత్యులు. నిత్యమైన వేదంనుంచి అనిత్యమై దేవతలు ఉద్భవించారు. ప్రజాపతి దేవతలందరిని సృష్టించాడు అని ఇతరేయోపనిషత్తులో చెప్పబడింది. ఈశ్వరునికి శరీరంలేదు. ముఖం లాంటి అవయవాలు లేవు. కనుక శబ్దరాశి అయిన వేదం వ్యాపకబ్రహ్మ నుంచి ఎలా ఉద్భవించింది? అని సంశయం. ఈశ్వరుడు మానవాళిని కర్మలలో ప్రవర్తింపజేయడానికి, నిషిద్ధకర్మలనుంచి నివృత్తి కలిగించడానికి, ఆది మహర్షుల హృదయంలో వేదమంత్రాలను స్ఫురింప జేశాడు. సార్ధకాలు, సస్వరాలు అయిన ఆ మంత్రాలను మహర్షులు ఉచ్చరించి పఠిస్తారు. ఆ కారణం వలన మహర్షులని మంత్రదృష్టలు అంటారు. వాళ్లు మంత్రకర్తలు కారు. రచయిత పరమేశ్వరుడే. దీనికి ప్రమాణం వేదాలు స్మృతులు కనుక వేదాలు ఈశ్వరీయాలు. దేవతలకు దేహం కలదిగా అంగీకరించబడుతున్నా, దేవత ఐశ్వర్యం అంటే సామర్ధ్యం ఉండటం వలన ఒకేసమయంలో అనేకకర్మలకు సంబంధించిన హవిస్సులను తింటే తినవచ్చును. అయినా దానికి శరీరం ఉండటం వలన మనకువలె జననమరణాలు ఉంటాయి కావున నిత్యమైన శబ్దానికి, నిత్యమైన అర్ధంతో, నిత్యమైన సంబంధం అని తెలియబడుచున్నది. అతః ప్రభావాత్ :- ఈ వైదిక శబ్దం నుండే దేవాదికమైన జగత్తు పుట్టింది. వేదం అనాది అయినది. నిత్యమైనది. ఈ విషయాన్ని కొన్ని యుక్తులు చెప్పబడ్డాయి. వారి సిద్ధాంతం ప్రకారం శబ్దము, అర్ధం కూడా నిత్యమైనవి. శబ్దార్ధాల సంబంధం నిత్యమే. అందుచేత వేదం నిత్యం. ఇప్పుడు దేవతలకు శరీరం ఉన్నదని అంగీకరించే పక్షంలో ఆ దేవతలకు కూడా జననమరణాలు ఉంటాయని అంగీకరించాలి. ఒకపిల్లవాడు పుట్టినప్పుడు ఆదేవతకు పేరు పెట్టినప్పుడు అంతకు ముందు ఆపేరు లేదు. అప్పుడు ఈశబ్దం కొత్తగా పుట్టినదే. కనుక నిత్యమైన శబ్దానికి నిత్యమైన అర్ధంతో నిత్యమైన సంబంధం అని అంగీకరించాలి. వేదానికి ఈ నిత్యత్వ, అన్య ప్రమాణ, నిరపేక్ష ప్రమాణాలు కుదరవు కదా! జగత్తుకు కారణం బ్రహ్మ. జగత్తు శబ్దం నుండి పుట్టినదని ఎట్లు చెప్పగలరు? ఈ జగత్తు వైదిక శబ్దాలనుండి పుట్టినదని అంగీకరించినా కూడా శబ్దం విషయంలో తేడా ఎలా పరిహరించబడింది? గోవులు, వస్తువులు మొదలైనవాటికి పుట్టుక ఉన్నా కూడా వాటి ఆకృతులకు(జాతులకు) ఉత్పత్తి లేదు కదా! అట్లే దేవతలు జన్మిస్తుంటారు కానీ వారి జాతి నిత్యమే.
సూత్రం :- 92
"అత ఏవ చ నిత్యత్వం"
అత ఏవ చ :- అందువల్లే, నిత్యత్వం :-వేదాలు నిత్యాలు
భావం :- పరమేశ్వరుడు నిత్యుడు కనుక ఆయన రచించిన వేదాలు నిత్యాలు.
వివరణ :- జీవుడు భోక్త. ప్రకృతి జీవుడికి భోగ్యము. జీవరాశి ప్రకృతి నిత్యాలే. భోక్తలైన జీవులకు హితాహితాలు ఉపదేశించే శాసనమూ నిత్యమే. శాసనమే వేదం. ప్రకృతి అంటే సాత్విక, తామసిక, రజోగుణాల సమన్వయమేనని సాంఖ్యదర్శనంలో చర్చించబడింది. మనం కళ్ళతో చూడగలిగే, మనస్సుతో భావించే, శరీరంతో స్పృశించే వాస్తవ ప్రపంచమే ఈ ప్రకృతి. అందుకే ప్రకృతి జీవుడికి భోగకారణమైనది. భోక్తలైన జీవులకు హితాహితాలు ఉపదేశించే శాసనమే వేదం. వేదంలో పాలనాపద్ధతులు, ఆయుర్వేదం, ఖగోళం, దైనందిన ఆచారాలు, జీవుడు చెయ్యవలసిన కర్మలు, నిషిద్ధకర్మలు అన్ని వేదంలోనే చెప్పబడ్డాయి. ప్రకృతి, పురుషుడు కలిస్తేనే సృష్టి జరుగుతుంది. పురుషుడు అంటే జ్ఞానం, అంతటా వ్యాపించిన నిరాకార ఆత్మతత్వం ఇంద్రియాలకు తెలియనిది, మాటలతో చెప్పజాలనిది. అదే వేదాంతంలో బ్రహ్మ అని వర్ణించబడినది. అన్ని పరిణామాలు, అశాశ్వతమైన పదార్ధాలు ప్రకృతి వల్లనే సంభవిస్తాయి. అన్ని జీవులు పురుషుని బాహ్యస్వరూపాలే. జీవుడికి సరిఅయిన జ్ఞానం లేనందున తాను శరీరం మాత్రమేనని భ్రమించి సంసారదుఃఖంలో మునిగి పోతున్నాడు. ఆత్మజ్ఞానం కలిగినప్పుడు బంధంనుండి విముక్తుడై తనలో ఉన్న పరమాత్మని దర్శించగలడు. సత్వగుణం కలవారు పైలోకాలకు వెడతారు. రజోగుణం ఉన్నవారు మానవలోకంలో, తమోగుణం వాళ్లు అధోలోకాలకు వెడతారు. భోక్తలైన జీవులకు జీవితగమనాన్ని శాసించి, హితవు ఉపదేశించేది వేదమే. నిరాకరుడైన పరబ్రహ్మ ఒక రూపం దాల్చినట్లయితే అదే అక్షరం. దాని నామమే ఓంకారం. అది నిత్యమైనది. ఓంకారం నుండే వేదాలు ఉద్భవించాయి. దేవతలు వేదాల నుంచే ఉద్భవించారు. జగత్తంతా వేదం నుంచే ఆవిర్భవించింది. ప్రతి ప్రళయకాలంలో వేదాలు నశిస్తాయి కదా! అనే సందేహం కలుగుతోంది. ప్రళయకాలంలో ఈ వేదాలు మూడు అకార, ఉకార, మకారములతో కలిసిపోతాయి. అకార, ఉకార, మకారములు ఓంకారంలో చేరిపోతాయి. వేదాలు నిత్యాలు అంటే వ్యావహారికనిత్యాలు అని గుర్తుంచు కోవాలి. పారమర్ధికనిత్యాలు కావు. దేవాది జగత్తు వేదశబ్దం నుండి పుట్టడం వలన వేదం నిత్యమని అంగీకరించాలి. దేవతలు యజ్ఞములచేత, పూర్వజన్మకృతం వలన వేదహక్కును పొందారు. మహర్షులు కూడా యుగాంతంలో అంతర్ధానం చెందినా ఇతిహాసాలతో కూడిన వేదాలను తిరిగి పొందడానికి బ్రహ్మదేవుని చేత అనుమతిపబడ్డారు.
సూత్రం :- 93
"సమాన నామరూప త్వాచ్ఛా వృత్తావస్య విరోధో దర్శనాత్ స్మృతేచ్ఛ"
ఆవృత్తాఅపి:- వేదాలు ప్రతీసర్గ ఆరంభంలో మళ్ళీ ఉత్పన్నం అయినప్పటికీ , అవిరోధః:నిత్యాలు అనడంలో ఏవిరోధం లేదు. సమాననామరూపత్వాత్ :- వాటి నామరూపాల్లో ఎలాంటి తేడా ఉండదు. దర్శనాత్ :-మంత్ర వర్గాల వలన స్మృతేః: - మహర్షులు అనుగ్రహించిన ధర్మశాస్త్రాల వలన కూడా వేదాలు పూర్వోత్తర సర్గలో సమానాలే.
భావం:-వేదాలు ప్రతీ సర్గ ఆరంభంలో మళ్ళీ ఉత్పన్నం అయినప్పటికీ వాటిని నిత్యాలు అనడంలో ఏవిరోధం లేదు. వాటి నామరూపాల్లో ఎలాంటి తేడా ఉండదు. మంత్రవర్గాల వల్ల మహర్షులు అనుగ్రహించిన ధర్మశాస్త్రాల వల్ల కూడా వేదాలు పూర్వోత్తర సర్గలో వలె సమానంగానే ఉన్నాయి కానీ భిన్నంగాలేవని ప్రమాణాలున్నాయి.
వివరణ :- ఒక అక్షరానికి లేదా పదానికి దాని ఆకారమే అర్ధం. ప్రళయకాలంలో సమస్తము నశించిపోతాయి. మళ్ళీ అదే ఆకారాలతో పుడతారనే నమ్మకం లేదు కదా! ప్రళయం సంభవించినప్పుడు సమస్తము పరమాత్మలో లీనమైపోతాయి. సృష్టి జరిగినప్పుడు మళ్ళీపుడతాయి. వేసవికాలంలో చెరువులు ఎండిపోతాయి. వాటిలోని చేపలు, కప్పలు అన్ని చచ్చిపోతాయి. వర్షాలు పడి చెరువులు నిండగానే మళ్ళీ అన్నీ పుట్టినట్లే ఈ సృష్టి, ప్రళయాలు సంభవిస్తాయి. సృష్టి జరిగినప్పుడు మళ్ళీ జీవరాశులు పరమాత్మ నుంచి ఉద్భవిస్తాయి అని ఐతరేయోపనిషత్తు, ముండకోపనిషత్తులో చెప్పబడింది. ప్రళయకాలంలో దేవతలు కూడా పరమాత్మలో లీనం అయిపోయి మళ్ళీ ఆవిర్భవిస్తారు. అందుచేతనే దేవతలు శాశ్వతానందం కోసం ప్రయత్నం చేస్తారు. వారికి బ్రహ్మవిద్యాధికారం ఉన్నది. ఈశ్వరుడు సృష్టి ఆది యందు మహర్షుల ద్వారా ఏయే నామరుపాలున్న వేదాలను ఏ క్రమంలో ప్రకటితం చేశాడో, ఆ వేదాలని అదే క్రమంలో రాబోయే సృష్టిలో సైతం ప్రకటితం చేస్తాడు .వాటిలో ఎలాంటి బేధం ఉండదు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం ఈ పేర్లలోగాని, మంత్రాలలోని వర్ణక్రమం కానీ ఎలాంటి బేధం ఉండదు. భగవంతుడు సర్వజ్ఞుడు. సర్వ శక్తిమంతుడు. కనుక ఆయన సృష్టిలోను, శాసనంలోను ఏ మార్పు ఉండదు.ఆయన ప్రసాదించిన జ్ఞానం త్రికాలములలో ఒకే రకంగా ఉంటుంది. అంతే కాదు. ప్రతి సృష్టిలో కూడా పదార్ధ రచన పూర్వ సృష్టి లాగే ఉంటుంది.
ఋగ్వేదం :- సూర్యచంద్రులు, దివం, పృధివి, అంతరిక్షం, వీటన్నింటికి పూర్వంలాగే విధాత రచించాడు. ఈ జగద్విజ్ఞానమే వేదం. ప్రతి సర్గలోను నామరూపాలుండవు. కనుక అవి నిత్యాలు. సృష్టి, ఉత్పత్తి, వినాశనం ఉన్నా ప్రవాహం ఎలా నిత్యమో, వేదాలు కూడా ప్రవాహ నిత్యాలే.
మనుస్మృతి:- (1,23):- ఋగ్యజుః సామ్య లక్షణాలు ఉన్న నిత్యమైన వేదాన్ని యజ్ఞ సిద్ధి కోసం ఈశ్వరుడు ప్రకటించాడు.
ఇలా వేదాలు ప్రతి సర్గలో ఉద్భవించిన అవి నిత్యాలే.
సూత్రం :- 96
"భావంతు బాదరాయణోస్తి హి"
తు:- జైమినివాదం సరియైనది కాదు, భావః:- శూద్రులకు కూడా వేదాధ్యయన అధికారం ఉన్నదని, బాదరాయణః:- బాదరాయణుడి సిద్ధాంతం. అస్తి :- మధుచ్చంద్రాదుల్లో శూద్రుడు కూడా ఉన్నాడు.
భావం ;- జైమిని చెప్పినట్లుగా శూద్రులకు వేదాధ్యయన అధికారం లేదన్న వాదన సరియైనది కాదు. వారికి కూడా వేదాధ్యయనం చేసే అధికారం ఉన్నదని బాదరాయణుడి అభిప్రాయం.
వివరణ:-వ్యాసుడు(బాదరాయణుడు) శూద్రులకు కూడా వేదాధ్యయనం చేసే అధికారం ఉన్నదని అంటున్నారు. వేద ప్రచారకులైన ఋషుల్లో కవషుడు అనే శూద్రుడు ఉన్నాడని ఋగ్వేదం పదోమండలం 30వ సూక్తంలో ఉన్నది. ఈ సూక్తానికి కవషుడు ద్రష్ట అని ఐతరేయబ్రహ్మణంలో పేర్కొన్నారు. మానవులంతా శాస్త్రానికి అర్హులే. శూద్రపదం జాతివాచకం కాదు. అది గుణవాచకమని వ్యాసుని ప్రతిపాదన. బాదరాయణుడు దేవాదులకు కూడా అధికారం ఉన్నదని తెలియజేస్తున్నాడు. అధికారానికి కావలసిన ఆర్థిత్వం(కోరిక), తెలుసుకునే సామర్ధ్యం ఉన్నప్పుడు వారిని నిరాకరించ కూడదు. మనుషులలో కూడా బ్రాహ్మణాదులకు అందరికి రాజసూయయాగం చెయ్యడానికి అధికారం లేదు. అక్కడ ఏ న్యాయమే ఇక్కడ కూడా అదే వర్తిస్తుంది. శ్రుతలలో దేవాదులకు అధికారాన్ని సూచిస్తూ దేవతలలో ఎవరెవరు ఆత్మ స్వరూపాన్ని తెలుసుకున్నారో అతను ఆబ్రహ్మగానే అయ్యాడు. దేవతలలో ఇంద్రుడు, అసురులలో విరోచనుడు బ్రహ్మవిద్య కొరకు ప్రజాపతి దగ్గరకు వెళ్ళారు. దేవతలు ఐశ్వర్యవంతులు అవడంచేత తమ ఇష్టప్రకారం ఆయా శరీరాలను ధరించడానికి సామర్ధ్యం ఉంది. ఇంద్రుడు గొర్రెరూపం ధరించి కాణ్వాయణుడైన మేధాతిరిని అపహరించాడు. ఆదిత్యుడు పురుషరూపం దాల్చి కుంతిని సమీపించాడు. వీరందరిలో భూతధాతువు మాత్రం అచేతనమే. వాటిని అధిష్టించిన దేవతలు చేతనులు. విధివాక్యాలను బట్టి ఇంద్రాదులకు విగ్రహాదులు ఉండవలసిన అవసరం ఉందని తెలుస్తోంది. రూపం లేని ఇంద్రాదులను మనస్సులో ధ్యానించడం శక్యంకాదు కదా! మనస్సును ఆయా దేవతలను మనస్సుచేత ధ్యానించాలి అని శ్రుతి చెబుతోంది. మనకు ప్రత్యక్షం కానివి ప్రాచీనులకు ప్రత్యేక్షం కావచ్చును. వ్యాపారులు దేవాదులతో ప్రత్యక్షంగా వ్యవహరించేవారని తెలుస్తోంది. ప్రాచీనులు అత్యధికమైన ధర్మంయొక్క బలం వల్ల దేవతలతో ప్రత్యక్షంగా వ్యవహరించేవారు. కొన్ని ఉపాసనలు చేసినవారు ఆయా దేవలోకములకు వెళ్లి, అక్కడ కాలం ఉండి, తరువాత ముక్తిని పొందుతారు. అదే క్రమముక్తి. దేవతలకు శరీరమే లేకపోతే వాళ్ళ లోకాలకు వెళ్లడం, అక్కడ ఉన్న దేవతలతో కలసి కొంతకాలం ఉండటం కుదరదు. ఈ క్రమముక్తి శాస్త్రాలలో కనబడటం వలన దేవతలకు విగ్రహాలున్నాయని అంగీకరించాలి.
కంపనాధికరణం :- (1, 3, 39)
సూత్రం :- ( 102 )
"కంపనాత్"
కంపనాత్ :- అంటే ప్రాణక్రియకు కారణం కావడం వలన, బ్రహ్మాన్ని ప్రాణః:- ప్రాణ శబ్దంతో వ్యవహరిస్తారు.
భావం :- కంపనం అంటే వ్యాపకబ్రహ్మాన్ని ప్రతిపాదిస్తుంది. ప్రాణక్రియకు కారణమైన ప్రాణ శబ్దం బ్రహ్మాన్ని సూచిస్తుంది. వివరణ:-సమస్తజగత్తు ప్రాణం నుండి పుట్టి చరిస్తోంది. బృహదారణ్యకోపనిషత్తు:- దోషభూయిష్టమైన ఇతర అవయవాలకు ఆత్మతత్వం సిద్దించలేదు. ముఖ్యప్రాణం పాపరహితిమైనది. అందుకే దానికి ఆత్మతత్వం సిద్దించింది. కాబట్టి మిగిలిన ఇంద్రియాలు ప్రాణాల్ని ఆత్మరూపంలో ఆశ్రయించినాయి. పవిత్రమైనప్రాణానికి మృత్యువు ఎప్పుడూ దూరంగానే ఉంటుంది. మృత్యువు ప్రాణం తీసింది అనుకుంటాము. అది తప్పు. ప్రాణాలు పోయిన తరువాత మృత్యువు ఆసన్న మౌతుంది అని చెప్పబడినది. అంటే ఆప్రాణానికి ఆత్మత్వం ఉన్నది. అందుకే సమస్తాన్ని ప్రవర్తింపజేసే ప్రాణం బ్రహ్మమే. ప్రాణం నుండి పుట్టిన ఈ జగత్తంతా ఆ ప్రాణం అంటే, బ్రహ్మ ఇలా ఉండగా కదులుతున్నది అనగా ఈ జగత్తంతా ఆ బ్రహ్మ యందే కదులుతుంది. ఈ బ్రహ్మ పైకి ఎత్తబడిన వజ్రం వలె చాలా భయాంకరమైనది. దీనిని తెలుసుకున్నవారు మరణ రహితులౌతున్నారు. దానిని తెలుసుకోవడం వలన అమృతత్వం లభిస్తుంది. ఈ ప్రాణం అంటే ఏమిటో? భయంకరమైన వజ్రం ఏదో స్పష్టంగా తెలియకపోవడంచేత విచారణచెయ్యగా శరీరంలో 5విధాలుగా ఉండే వాయువే ప్రాణం అని తెలుస్తోంది. ఈ ప్రపంచం అంతా పంచవృత్తి అయిన ప్రాణం అనే పేరు గల వాయువు నందే ప్రతిష్ఠితమై స్పందిస్తున్నది. వాయువే పర్జన్యుడిగా మారితే మెరుపులు, మేఘాలు, వర్షం, పిడుగులు ఏర్పడతాయని అంటారు. అలాంటి వాయువును తెలుసుకోవడం వలన అమృతత్వం లభిస్తుంది. విశేషరూపాలన్ని వాయువే. సామాన్యరూపాలన్ని వాయువే. ఈ విషయం తెలుసుకున్నవారు అపమృత్యు భయాన్ని జయిస్తాడు. మరొక శృతిలో ప్రాణ విజ్ఞానం వలన అమృతత్వం లభిస్తుందని చెప్పబడింది. ఈవాక్యం ప్రాణోపాసనను బోధిస్తుంది. ప్రాణశబ్దం కూడా పరమాత్మ అనే అర్థంలో ప్రయోగించ బడింది. కానీ కేవలం వాయువు కుదరదు. పరమాత్మ భయం చేతనే అగ్ని కాలుస్తుంది. సూర్యుడు ప్రకాశిస్తుంటాడు. ఇంద్రుడు, వాయువు కూడా భయం వల్లనే వారి పనులు చేస్తుంటారు. 5వ దైన మృత్యుదేవత కూడా భయం వల్లనే పరుగుడుతున్నది. రాజుయొక్క శాసనం ప్రకారం ప్రజలు ఎట్లు ప్రవర్తిస్తారో, అట్లే ఈఅగ్ని, వాయువు, సూర్యుడు మొదలైన జగత్తు బ్రహ్మకు భయపడుతూ నియమం ప్రకారం తమ పనిలో నిమగ్నమౌతున్నాయి. అందుకే భయంకరమైన బ్రహ్మ వజ్రంతో పోల్చబడింది. సమస్తభువనాలు ఆయనవలనే చరిస్తున్నాయి. పృధివి, సూర్య లోకాలు పరమాత్మకు వినమ్ర లౌతాయి. ఆయన బలానికి పర్వతాలు భయపడతాయి. అందుకే ఆయన శాసనం వజ్రం కంటే కఠినమైనది. వజ్రం అంటే పిడుగు అనే అర్ధం కూడాఉంది. ఇది వాయువు యొక్క మహాత్మ్యం గా చెప్పబడుతోంది. వాయువే ప్రాణమని, సమస్తాన్ని ప్రవర్తిపజేసే ప్రాణమే బ్రహ్మమని, దానిని తెలుసుకోవడంతో బ్రహ్మజ్ఞానం కలిగి అమృతత్వం సిద్ధిస్తుంది.
జ్యోతిరధికరణం :- ( 1, 3 ,40 )
సూత్రం :- 103
"జ్యోతిద్దర్శనాత్"
దర్శనాత్ :- అనేక శాస్త్రాలలో పరబ్రహ్మము అనే అర్థంలో జ్యోతిః అనే శబ్దాన్ని ప్రయోగించడం వలన, జ్యోతిః :- జ్యోతి శబ్దం పరమాత్మ వాచకమే.
భావం:- అనేక శాస్త్రాలలో జ్యోత్ శబ్దం పరబ్రహ్మము అనే అర్థంలో ప్రయోగించడం వలన జ్యోతిశబ్దం పరమాత్మ వాచకమే.
వివరణ :- ముండకోపనిషత్తు:- పరమేశ్వరుడు సూర్యాది ప్రకాశకతత్వాన్ని సైతం ప్రకాశింపజేసేవాడు. కనుక బ్రహ్మం జ్యోతిస్సులకు జ్యోతిస్సు , వెలుగులకే వెలుగు. ఆయన వల్లనే సర్వం ప్రకాశిస్తున్నాయి.
అధర్వణ వేదం :- శుక్రమ్, భ్రాజం, ప్రకాశం, జ్యోతి అని బ్రహ్మాన్ని వర్ణించారు. కనుక జ్యోతిశబ్దం పరబ్రహ్మమే. ఇక్కడ జ్యోతి శబ్దం చేత చెప్పబడినది చక్షురింద్రియానికి కనబడేది, చీకటిని తొలగించేది, అయిన తేజస్సా? లేక బ్రహ్మయా? అని సందేహం. ప్రసిద్ధమైన తేజస్సే జ్యోతిః శబ్దరాజ్యం" అని ఎందువల్ల ఈఅర్థంలో జ్యోతిశబ్దం స్వార్ధాన్ని విడిచిపెట్టడానికి కారణం ఏది కనబడటం లేదు. మరణించిన తరువాత ఈశరీరం నుండి పైకి లేచిపోతాడో అప్పుడు ఈసూర్యరశ్ముల సహయంతో ఊర్ధ్వలోకాలను చేరతాడు. ముముక్షువు ఆదిత్యుడిని పొందుతాడు అని చెప్పబడినది. అందువలన ప్రసిద్ధమైన తేజస్సే జ్యోతిశబ్ద రాజ్యం. సర్వజగత్తుయొక్క చేష్టలకు కారణం ప్రాణమని చెప్పడం వలన ప్రాణశబ్దానికి అర్ధం బ్రహ్మ అని వెనుకటి అధికరణంలో చెప్పబడింది. అలాగే జ్యోతిః శబ్ద వాచ్యమైనది పరబ్రహ్మయే. బ్రహ్మభావం పొందితే కానీ అశరీరత్వం కుదరదు. పరంజ్యోతిః, ఉత్తమపురుషః అని విశేషణాలు ప్రయోగింపబడ్డాయి. అనగా పరంజ్యోతిగా చెప్పబడిన దానినే ఉత్తమపురుషుడిగా చెప్పడం జరిగింది. ముముక్షువులకు ఆదిత్యప్రాప్తి చెప్పబడినా, అది అత్యంతిక మోక్షం కాదు. వాళ్ళు కొంతకాలం తరువాత మరల జన్మవస్తుంది. గత్యుత్కాలగతులుండకుండా అంటే తిరిగి జన్మరాకుండా పరబ్రహ్మంలో లీనమవ్వడమే మోక్షం అని చెప్పబడినది.
సుషుప్త్య త్కాం త్యధికరణం :- ( 1, 3, 42 )
సూత్రం :- 105
"సుషుప్తి ఉత్కంత్యోః భేదేన"
సుషుప్తిః :- సుషుప్తియందు బయటకువెడలుట యందు , ఉత్క్రాంతిత్యోః :- జీవుడు తన శరీరాన్ని వదలి వెళ్లడం, భేదేన :- జీవాత్మను పరమాత్మ కంటే వేరే అని ఉపదేశించడం వల్ల,
భావం :- సుషుప్తి అంటే గాఢ నిద్రలో జీవుడు తన శరీరాన్ని వదలి వెళ్లడం జీవాత్మను పరమాత్మ కంటే వేరే అని ఉపదేశించడం వల్ల బ్రహ్మ జీవాత్మ కన్నా భిన్నం అని సూత్రానికి అర్ధం.
వివరణ:-బృహదారణ్యకోపనిషత్తు:-(4,3,21):-ఇక్కడ పురుషః అంటే జీవాత్మ. ప్రాజ్ఞః:-అంటే పరమాత్మ, తన ప్రియురాలైన స్త్రీని బాగా కౌగిలించుకొన్న పురుషుడు బయటా, లోపలా అనే తేడా మరచిపోయి తన్మయత్వం చెందినట్లుగా జీవుడు ప్రాజ్ఞుడైన ఈశ్వరుణ్ణి పొంది బాహ్యంగా ఉన్న అభ్యంతరాలను విస్మరించి బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు.
ఉత్క్రాంతి వర్ణన :- బండి బరువుగా ఉన్నప్పుడు శబ్దం చేస్తూ ఈ లోకంలో వెళ్లినట్లుగా జీవాత్మ పరమాత్మను అధిష్టించి ఉన్నప్పుడు ధ్వనిచేస్తూ వెడతాడు. జీవుడు జీవనయాత్ర ముగించుకొని చివరకు శరీరాన్ని విడిచిపెట్టి వేదనతో ఆర్త నాదం చేస్తూ పరమాత్మ అధిష్ఠితుడై వెళ్లి పోతాడు. పై వర్ణనలో సుషుప్తికి, ఉత్క్రాంతికి సంబంధించిన స్థలాలలో జీవాత్మ పరమాత్మ వేర్వేరు అని వివరణ ఉన్నది.వీళ్ళిద్దరూ ఒక్కటే అయితే ఇలాంటి వర్ణన ఉండదు. ఈవాక్యాలలో జీవాత్మని శరీరాత్మ అని, పరమాత్మను ప్రజ్ఞాత్మ అని వర్ణించారు. జీవాత్మకు పరమాత్మలకు ఉండే తేడా సుషుప్తిలో ఉత్క్రమణలో, ప్రళయంలో, ముక్తిలో కూడా ఉంటుంది. ఈ భిన్నం తాత్వికమే కానీ కల్పితం కాదు.
బృహదారణ్యకోపనిషత్తు:- ఆత్మఎవరు? విజ్ఞానమయుడు, బుద్ధిమయుడు, ప్రాణాలలోను హృదయంలోను వాటి కంటే వేరుగా ఉంటాడు. జ్యోతిస్వరూపుడైన ఏ పురుషుడున్నాడో అతడే ఆత్మ . సంసారి యొక్క స్వరూపాన్ని చెప్పడం కోసమే ఉర్దిష్టమైనదా? లేక అసంసారి స్వరూపం ప్రతిపాదించడానికి ఆర్దిష్టమైనడా? అనేదే సందేహం. సంసారి యొక్క స్వరూప మాత్ర ప్రతిపాదనకరమని తేలింది. ప్రాణాలలో ఏ విజ్ఞానమయి ఆత్మ ఉన్నదో అదే గొప్ప ప్రతిపాదన కరమని తేలింది. ప్రాణాలలో ఏ విజ్ఞానమయి ఆత్మ ఉన్నదో అదే గొప్ప జన్మరహితమైన ఆత్మ అని దానిని విడువలేదు. మధ్యలో జాగ్రదావస్ట మొదలైన అవస్థలను చెప్పడం చేత ఆ జీవుణ్ణి గురించే సవిస్తరంగా చెప్పడం జరిగింది. నామారూపాలకన్నా భిన్నంగా చెప్పడం వలన ఆకాశం బ్రహ్మ అని వెనుకటి అధికారణంలో చెప్పబడింది. జీవాత్మ పరమాత్మలు భేదం లేకపోయినా భేదం ఉన్నట్లు కనబడుతోంది. సుషుప్తిలో ఉత్క్రాంతిలో దేహం విడిచి వెళ్ళేటప్పుడు ఈ పురుషుడు ప్రాజ్ఞత్మతో కలిసిపోయి బాహ్యమైన దానిని గాని, లోపల ఉన్నదానిని గాని తెలుసుకోలేడు. ఇక్కడ పురుషుడు అంటే శారీరుడు. ఎందువలనంటే అతడే తెలుసుకునేవాడు. బాహ్యమైన విషయాలు తెలుసుకోవలసి ఉండగా తెలుసుకోవడం లేదు. తెలుసుకునే అవకాశం ఉన్నా దానిని గురించి తెలుసుకోవడం లేదు. సర్వజ్ఞత్వ రూపమైన ప్రజ్ఞ నుండి ఎన్నడూ దూరం కాకపోవడం చేత ప్రాజ్ఞుడు అనగా పరమేశ్వరుడు ఉత్క్రాంతి సమయంలో కూడా ఈ జీవుడు పరమాత్మ చేత అధిష్ఠితుడై వెళ్లనున్నాడు అని జీవుని కంటే వేరుగా పరమేశ్వరుణ్ణి చెప్పడం జరుగుతోంది. ఈ విధంగా బ్రహ్మం జీవాత్మ కన్నా భిన్నంగా ఉన్నట్లు చెప్పబడుతోంది. సుషుప్తిలో పుణ్యం చేత స్పృశించబడక, పాపం చేత స్పృశించబడక హృదయం యొక్క సమస్త లోకాలను దాటినవాడవుతున్నాడు. భౌతికంగా అతను సంసారి అయినప్పటికీ సుషుప్తిలో అతను అసంసారిక స్వరూపాన్ని కలిగి ఆత్మ స్వరూపాన్ని దర్శిస్తున్నాడు.
సూత్రం :- 106
"పత్యాది శబ్దేభ్యశ్చ"
చ - ఇంతే కాక, పతి ఆది శబ్దేభ్యహ్ :- శాస్త్రాలలో ఈశ్వరుణ్ణి పతి లాంటి శబ్దాల్లో సూచించారు.
భావం:- శాస్త్రాల్లో పరమేశ్వరుని పతి లాంటి శబ్దాల్లో సూచించడం వలన బ్రహ్మం, జీవాత్మ వేరు అని తెలుస్తోంది. ఒకవేళ ఇద్దరిలో భేదం లేని పక్షంలో సర్వాధిపతి, ప్రాణశృతి, జగత్పతి, అనే శబ్దాలు ఇద్దరికి వర్తించేవి. కానీ పతి శబ్దం మాత్రం బ్రహ్మవాచకమే.
వివరణ :- భూతాధిపతి, సర్వేశ్వరుడు, భూతరాజు, ఈశానుడు, సర్వాధిపతి లాంటి శబ్దాలు బ్రహ్మాన్ని బోధిస్తాయి. వీటిని జీవుడి విషయంలో ఎక్కడా ఉపయోగించలేదు. దీనిలో పతి మొదలైన శబ్దాలు అసంసారియైన వాడి స్వరూపాన్ని ప్రతిపాదిస్తాయి. ఈ అధికారణంలో సుషుప్తిలో ఉండే పురుషుడు ఆత్మా? కాదా?అని విషయం వివరించబడింది.
బృహదారణ్యకోపనిషత్తు:- జనకుడు యాజ్ఞవల్కుని ఆత్మను గురించి వివరించమని అడిగాడు. అందుకు యాజ్ఞవల్కుడు ప్రాణాల్లో, బుద్ధి వృత్తులలో ఉండే విజ్ఞానజ్యోతి స్వరూపమే ఆత్మ. ఇంద్రియముల మధ్య స్వయంప్రకాశమై హృదయంలో ఉండే పురుషుడే ఆత్మ. అదే ఆలోకంలోనూ, పరలోకంలోనూ సంచరిస్తుంది. కదులుతున్నట్లు కనిపిస్తుంది. స్వప్నంలాగా ఉంటూ దేహేంద్రియములను, మృత్యువును దాటిపోతుంది అని చెప్పాడు. ఆత్మ పురుషుడుకి ఈ లోకం, పరలోకం, అని రెండు స్థానాలున్నాయి. ఈరెండింటి మధ్య స్వప్నజగత్తు మూడవస్థానం. స్వప్నావస్టలో ఉంటూ మిగిలిన రెండు స్థానాలను చూస్తాడు ఆత్మపురుషుడు. నిద్రించేటప్పుడు ఆత్మపురుషుడు సమస్త లోకాలలోని అనుభవాలను తీసుకొని స్థూలశరీరాన్ని వదలి స్వప్నశరీరంలో ప్రవేశించి ఆత్మజ్యోతి రూపమైన ప్రకాశంలో స్వప్నం చూస్తాడు. ఈస్థితిలో అతడు స్వప్నద్రష్ట. ఈ పురుషుణ్ణి తైజసుడు అంటారు. సుషుప్తిలో అతను అన్ని దుఃఖాలను అధిగమిస్తాడు. అదే గాఢనిద్ర. ఈ స్థితిలో అతనికి తల్లి, తండ్రి, అన్నదమ్ములు అనే సంబంధాలు ఉండవు. అయినవారు కూడా కానీ వారే అవుతారు. ఈ స్థితిలో పురుషుడికి పాపపుణ్యాలతో సంబంధం ఉండదు. ఏ భేదభావం ఉండదు. హృదయంలో ఉండే సమస్త శోకలకు అతీతుడు. ఈస్థితిలో వాసనాశక్తి నశించిందని కాదు. అతడు వాసనచూస్తూనే వాసన చూడనట్లుగా ఉంటుంది. సుషుప్తిలో ఆత్మపురుషుడు ఎవరితోనూ మాట్లాడలేడు. వినలేడు. మననం చెయ్యలేడు. అద్వితీయ ఆనందస్థితిలో ఉంటాడు. అలాంటి సుషుప్తిలోని పురుషుడే బ్రహ్మం అని చెప్పారు. ఛాందోగ్యంలో ఉద్ధాలకుడు తన కుమారుడైన శ్వేతకేతువుకు సుషుప్తి గురించి వివరిస్తూ మానవుడు గాఢనిద్రలో ఉన్నప్పుడు అనడు. సుషుప్తిలో ఉన్నాదంటారు. ఆ సమయంలో జీవుడు పరమ సత్తాను అంటే ఆనందాన్ని పొందుతాడు. అంటే తన నిజ స్వరూపాన్ని పొందుతాడు. తన ఆత్మను తాను దర్శిస్తాడు. కాబట్టి సుషుప్తి యందలి పురుషుడు బ్రహ్మమే అని వివరించారు.
అర్ధాంత రత్య వ్యపదేశాధికరణం :- ( 1, 3, 41)
సూత్రం :- 104
"ఆకాశోర్ధాంతదత్వాది వ్యపదేశాత్ "
అర్ధ అంతరత్వాది వ్యపదేశాత్ :- పదార్ధాల అంతర్భాగంలో ఉంటుంది అని చెప్పడం వలన, ఆకాశః:- ఆకాశపదం బ్రహ్మ వాచకం
భావం :- పదార్ధాల అంతర్భాగంలో ఉన్న ఖాళీ ప్రదేశమే ఆకాశం అని చెప్పడం వల్ల ఆకాశపదం బ్రహ్మ వాచకం.
వివరణ :- ఇక్కడ ఆకాశం అంటే బ్రహ్మ. పంచభూతలలో ముందు పుట్టినది ఆకాశం. ఆకాశం బ్రహ్మనుండి పుట్టినది. కాబట్టి ఆకాశం కూడా బ్రహ్మమే. అందుచేత దహరాకాశం కూడా బ్రహ్మమేనని గతంలో చెప్పబడింది. ఇందులో ఆది అని ప్రయోగించడం వలన అసంగత్వం, సూక్ష్మత్వం లాంటి విశేషగుణాలు తెలుపుతోంది. ఈగుణాలు బ్రహ్మకు వర్తిస్తాయి. పంచ భూతాలలో ఒకటైన ఆకాశం ఇతర స్థూలపదార్ధాలలో అంతర్భాగమై వ్యాపించిఉన్నట్లుగా, బ్రహ్మ ప్రాకృతిక పదార్ధాలలోనే కాక జీవుల్లోనూ ఉండి అలిప్తంగా, సూక్ష్మంగా ఉన్నందువల్ల ఆకాశపదంతో వ్యవహరిస్తారు. బ్రహ్మం విభువు, సర్వాత్మకం, సర్వగతం, అసంగం. ఎందులోనూ కలవనివాడు. ఇక్కడ ఆకాశశబ్దం పరబ్రహ్మయా ? భూతాకాశమా? అని విచారించగా ఆకాశశబ్దం భూతాకాశం అనే అర్ధంలోనే రూఢం అవడం చేత భూతకాశమే అని చెప్పడం యుక్తంగా ఉంటుంది. నామ రూపాలను నిర్వహించడానికి అవకాశం ఇవ్వడం ద్వారా భూతకాశంలో కూడా అన్వయించడానికి కుదురుతుంది. జ్యోతిః అంటే పరబ్రహ్మ, నామరూపాలకన్నా భిన్నమైనది ఆకాశమనీ, భూతాకాశాన్నే ఉపాసించాలని చెప్పబడింది. నామ రూపాలకన్నా భిన్నమైన పదార్ధం బ్రహ్మతప్ప మరొకటి లేదు. ఎందువలనంటే సమస్త వికార సముదాయము కూడా నామారుపాలతో కూడి ఉంది. అనేక జీవులకు కూడా నామరూపాలున్నట్లుగా తెలుస్తోంది కదా! పరమాత్మ యొక్క ఆత్మయైన ఈజీవుని రూపంలో ఈజగత్తులో ప్రవేశించి నామరూప విభాగానికి కర్త బ్రహ్మమేనని తెలుస్తోంది. బ్రహ్మ ప్రాకృతికపదార్ధాలలోనే కాక జీవుల్లోకూడ సూక్ష్మంగా ఉన్నందువల్ల ఆకాశాధికారణ న్యాయాన్ని ప్రవర్తింపజేయడం ద్వారా ఆకాశపదం బ్రహ్మ వాచకమని నిర్ణయించబడింది.
అనుమానికాధికరణం :- ( 1, 4 , 1)
సూత్రం :- 107
ఆనుమానిక మప్యేకే షామితి చేన్న శరీరరూపక విన్యస్తగృహీతేర్ధర్మయతి చ
ఏకే షాం :- కొందరు, ఆనుమాని కం అపి:- ప్రకృతి కూడా జగత్తు, జన్మాదులకు కారణం , ఇతి చేత్ :-అని అంటారు. న ;- అది సరి అయినది కాదు. శరీర రూపక విన్యస్త గృహేతేః :- ప్రకృతిని శరీర రూపం అని పోల్చారు. చ:- అంతే కాక , ఈ విషయంలో దర్శయితి :- ఉపనిషద్వాక్యాలు అలాగే ప్రతిపాదిస్తాయి.
భావం :- ప్రకృతి కూడా జగత్తు, జన్మాదులకు కారణం అనడం సరియైనది కాదు. ప్రకృతిని శరీర రూపంతో పోల్చారు. అందువల్ల ప్రకృతి జగత్తుకు కారణం కాదు అని ఉపనిషత్తులు చెబుతున్నాయి.
వివరణ :- వేదాంత వాక్యాలన్నీ జగత్ కారణం బ్రహ్మ అనే చెబుతున్నాయి. ప్రకృతి జగత్కారణం కాదని చెప్పారు. కానీ ఇంకా చాలా చోట్ల ప్రకృతే జగత్కారణమని చెప్పే వాక్యాలు ఉన్నాయి. కపిలుడు మొదలైన వారు ప్రకృతే జగత్కారణం అంటున్నారు. ఇది నిజం కాదు అని నిరూపిస్తే పరమాత్మే జగత్కారణం అనే మాటలకు బలం చేకూరుతుంది.అందుకే ఈ పాదాన్ని చెబుతున్నారు.
అధర్వవేదీయ ముండకోపనిషత్తు:-(1,1,7) సాలీడు తంతువుల్ని సృజించి మళ్ళీ తనలో ఇముడ్చుకుంటుంది. భూమి నుండి ఓషధులు జనిస్తాయి. శరీరంలో ఆత్మ ఉన్నప్పుడు రోమాలు ఉద్భవిస్తాయి. అలాగే అక్షరం నుంచి విశ్వం ఉదయిస్తుంది. ఇక్కడ అక్షరప్రకృతిని శరీరంతో పోల్చారు. ఆత్మ అధిష్టించిన శరీరం నుంచి ఎలాగ కేశాలు, నఖాలు, జనిస్తాయో అలాగే బ్రహ్మం అధిష్టించిన ప్రకృతి నుంచి సమస్త పదార్ధాలు ఉద్భవిస్తాయి. కనుక ప్రకృతి స్వతంత్ర కారణం కానేరదు. అది జడం కనుక ముఖ్యకారణం బ్రహ్మమే. ప్రకృతి జగత్తుకు ఉపాదాన కారణం. అందువల్ల జగత్ జన్మాదులకు కారణం బ్రహ్మమే.
కఠోపనిషత్తు:- ఈశరీరం రథం లాంటిది. కర్మఫలాన్ని అనుభవించే జీవాత్మ దాని యజమాని. బుద్ధి సారధి, మనస్సే కళ్లెం, ఇంద్రియాలు గుర్రాలు, విషయమే మార్గం. కాబట్టి ఇంద్రియాలను నడిపే సారధి నేర్పరి కాకపోతే గుర్రాలు అదుపులో ఉండవు. అందుకనే ఇంద్రియాలు-మనస్సు అధీనంలోను, మనస్సు-బుద్ధి అధీనంలోను, బుద్ధి-యజమాని ఆధీనంలో ఉండాలి. విజ్ఞానహీనుడు మనస్సును అదుపులో ఉంచుకోలేక తాను చేరవలసిన గమ్యం చేరలేడు. మోక్షాన్ని పొందలేదు. వివేకవంతుడు బుద్ధి కలవాడు కనుక మనస్సును అదుపులోఉంచుకొని పరమపదాన్ని చేరగలుగుతాడు. ఇంద్రియముల కన్నా-వాటి విషయాలు శ్రేష్ఠమైనవి. విషయములకన్నా-మనస్సు శ్రేష్ఠమైనది. మనస్సుకన్నా-బుద్ధి శ్రేష్ఠమైనది. బుద్ధి కన్నా-మహత్తత్త్వం శ్రేష్ఠమైనది. మహత్తత్త్వంకన్నా-అవ్యాకృతప్రకృతి శ్రేష్ఠమైనది. ప్రకృతికన్నా-సూక్ష్మరూపి అయిన పురుషుడు గొప్పవాడు. పురుషుడు అంటే పరమాత్మ. ఇంతకు మించినది ఏదీ లేదు. ఇదే పరాకాష్ట. అతన్ని చేరేవారు తిరిగిరారు. ఇక్కడ అవ్యాకృత ప్రకృతి అంటే శరీరం అని అర్ధం. ఇంద్రియాలు గ్రహాలు. అనగా గ్రహించేవి అని అర్ధం. గ్రహాల కన్నా విషయాలు గొప్పవి. విషయాలు లేకపోతే ఇంద్రియాలకు పనే లేదు కదా! అని శృతిలో చెప్పబడింది. విషయ ఇంద్రియాల వ్యవహరమంతా మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. అందుచేత మనస్సు విషయాల కంటే పరం. భోగ వస్తువుల సముదాయం బుద్ధిని అధిరోహించి భోక్తను చేరుతుంది. కావున బుద్ధి మనస్సు కంటే పరమైనది. బుద్ధి కంటే పరమైనది ఆత్మ. ఇక్కడ యోగసాధన చెప్పబడింది. వాక్కును మనస్సు చేత నిగ్రహించాలి. బాహ్యమైన వ్యవహారాలు విడిచి మనోనేత్రంతో ఉండాలి. విషయములను గురించి వచ్చే ఆలోచనలకు అభిముఖంగా ఉండే మనస్సును కూడా వస్తువుల యొక్క వికల్పాలలో ఉండే దోషాలను చూడటం ద్వారా అవన్నీ అశాశ్వతమైనవనే విషయం బుద్ధిలో నిలపాలి. ఆ బుద్ధిని సూక్ష్మం చేసి గొప్పదైన ఆత్మయందు నిలపాలి. ఆ ఆత్మే పరమపురుషుడైన పరమాత్మ.
సూత్రం :- 108
"సూక్ష్మంతు తు తదర్హత్వాత్"
అర్హత్వాన్:- కార్యనిమిత్తమే కారణం , తత్ తు;- ప్రకృతి మాత్రం , సూక్ష్మం :- సూక్ష్మమే కానీ స్థూలం కాదు.
భావం :- ప్రకృతిని శరీరస్థానంలో ఉదాహరణగా ఇచ్చారు. శరీరం స్థూలం కదా! ప్రకృతి స్థూలం అయితే కార్యం కావాలి కదా! కారణం ఎలా అవుతుంది? అంటే కార్యనిమిత్తమే కారణమని ప్రకృతి మాత్రం సూక్ష్మమే కానీ స్థూలం కాదు అని వివరించారు.
వివరణ :- శరీరం తో పోల్చిన మాత్రాన ప్రకృతి శరీరంలాగా స్థూలం కావాలనే నియమం ఏమి లేదు. ఉదాహరణలో ఉండే రెండు వస్తువులు అన్ని విషయాలలో సమానం అని అనుకోకూడదు. ప్రకృతి ప్రపంచంలో ఉండే సమస్త పదార్ధాలను మూలకారణం. ప్రకృతిలో కనిపించే వృక్షాలు, పర్వతాలు,నదులు, సముద్రాలు ఇలా ఎన్నో ఉద్భవించడానికి కారణ మౌతోంది. ఆకార్యాన్ని చేపట్టేది ప్రకృతే. కనుక అది ఎంతో సూక్ష్మం. ఉపనిషత్తులలో ప్రకృతి సూక్ష్మమనే వివరించాయి. అది ఒక కారణం. వెనుకటి సూత్రంలో అవ్యక్తము అంటే శరీరము అన్నారు కదా! మరి శరీరం స్థూలమైనది. అటువంటప్పుడు ఈశరీరం అవ్యక్తం ఎలా అవుతుంది? వ్యక్తం కానీ దానిని అంటే స్పష్టంగా కనిపించని దానిని అవ్యక్తము అంటారు. స్థూలశరీరానికి కారణభూతమైన కారణశరీరం అవ్యక్తమవుతుంది. స్థూలం అంటే మిక్కిలి స్పష్టంగా కనబడే శరీరం. అస్పష్టంగా ఉన్నది కారణరూపంలో సూక్ష్మంగా ఉన్న శరీరమే. పంచభూతాలతో పంచీకరణ చెందినది స్థూల శరీరం. పంచీకరణ చెందని సూక్ష్మ శరీరంలో పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం అవ్యక్తంగా ఉండి పనిచేస్తుంటాయి. మనస్సు చెప్పినట్లుగా కర్మేంద్రియాలు పనిచేయాలి. జ్ఞానేంద్రియాలు ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ తెలుసుకొని మనస్సుకు తెలియజేస్తాయి. మనస్సు.. బుద్ధి సూచనలతో, ప్రేరణతో కర్మేంద్రియాలచేత పనిచేయిస్తుంది. మనస్సు, బుద్ధి , సూక్ష్మ శరీరం జీవుడికి ఈ ప్రపంచంలో భోగ సాధనాలుగా ఉపయోగపడతాయి. మానవుల యొక్క వాసనలకు అనుగుణంగా స్థూల శరీరం పనిచేస్తుంది. ఆశలు, ఆశయాలు, బాధ్యతలు ,అన్ని సూక్ష్మ శరీరానివి. చేసేది, నిలబడటం, మాట్లాడటం, పనిచేయడం, స్థూలశరీరం సూక్ష్మశరీరం చెప్పినట్లుగా చేస్తూ కల్పితమైన ఆలోచనలతో ప్రపంచంలో విహరిస్తుంటుంది. పనిముట్లు లేకుండా వడ్రంగి ఏవిధంగా పనిచెయ్యలేడో, మనోబుద్ధులు లేకుండా సూక్ష్మశరీరం పనిచెయ్యదు. అందుకే శరీరం అవ్యక్తశబ్దానికి తగిఉన్నది అని చెప్పబడినది. నామరూపాలతో ఉన్న ఈ జగత్తు సృష్టకి పూర్వం నామరూపాలేవీ లేకుండా బీజశక్త్యవస్థలో ఉండి అవ్యక్తంగానే ఉంటుంది.
అనుమానికాధికారణం :- (1, 4, 3 )
సూత్రం :-109
"తద ధీనత్వా దర్ధవత్ "
తత్ అధీనత్వాత్:- ప్రకృతి బ్రహ్మాధీనం కావడం వల్ల, అర్దవత్:- అవ్యక్తావస్థ ప్రయోజనం కలది.
భావం:- ఈజగత్తు ప్రాణులకు భోగసాధనం. ప్రపంచంలో నివసించే ప్రాణులు వాళ్ళ కర్మఫలాలను అనుభవించడానికి జగత్తును సృష్టించాడు. అందుకే ప్రకృతి బ్రహ్మాధీనం అవుతోంది.
వివరణ:- అవ్యక్తం అంటే కారణ శరీరం అయినప్పుడు ప్రకృతి అంటే శరీరమే. ఈజగత్తంతా చేతనుడైనటువంటి ఈశ్వరుని వల్లనే సృష్టించబడినందువల్ల అది సార్ధకమైనది. అయితే అవ్యక్తమనేది ఈశ్వరాధీనమైనందువల్ల అది స్వతంత్రం కాదు. ఈశ్వరునిచేత అధిష్టితమైన మాయ కారణం. ఈ మాయయే అవిద్య. అవ్యక్థము, అక్షరము ఆకాశము అంటారు. జగత్తుకి కారణం ఈశ్వరుడు అంటూ మధ్యలో మాయ, అవిద్య అంటారేమిటి, అని ఆడిగాడు కృష్ణశర్మ. సృష్ఠికి పూర్వం అంతా పరమేశ్వరుని ఆధీనంలో ఉండేది. శక్తిరహితుడైన పరమాత్మకు ఏప్రవృత్తి ఉండదు. ముక్తిపొందిన పురుషులు మళ్ళీ జన్మించరు. అవిద్య, అజ్ఞానం అనేవి పరమేశ్వరుని ఆధీనంలో ఉంటుంది. ఆత్మసాక్షాత్కారం పొందని మానవులు ఈ అవిద్యను ఆశ్రయిస్తారు. ఇదే మాయాశక్తి. అవ్యక్తము. దీనినే ఆకాశము అని కూడా అంటారు. పరమాత్మ ఈ మాయాప్రకృతి కన్నా వేరైనవాడు. మాయే ప్రకృతి. మాయకు అధిపతి పరమాత్మ. అవ్యక్తంనుంచి మహాత్తత్త్వము పుట్టినది. మహత్తు అంటే హిరణ్యగర్భరూపమైన బుద్ధి. కాబట్టి మహత్తత్వం కన్నా అవ్యక్తం గొప్పది. అవ్యక్తమే అవిద్య అనే మాయ. శరీరం అవ్యక్తకారణం. శరీరం లాగానే ఇంద్రియాలు కూడా అవ్యక్తంగా వికారరూపాలు. ఈజగత్తు యొక్క ప్రాజ్ఞవస్థ(అనగా సృష్ఠికి పూర్వం ఉన్నఅవస్థారూపం) ప్రధానంగా పరమేశ్వరుడి చెప్పుచేతలలో ఉంటుంది. పరమేశ్వరుడి మాయ వలన మహానిద్ర సంసారులైన జీవులందరు స్వరూపజ్ఞానశూన్యులై నిద్రపోతూ ఉంటారు. శరీరం స్థూలం, సూక్ష్మం అని 2రకాలు. కంటికి కనబడుతున్నది స్థూలం. కంటికి కనబడనిది సూక్ష్మం. దీనిమీదనే ఆధారపడి ఉంది కనుక జీవుని కంటే సూక్ష్మశరీరం పరమైనది. ఇంద్రియవ్యాపారం విషయాలమీద ఆధారపడిఉన్నది. ఇంద్రియాలు అర్ధాల కన్నా పరమైనవి. స్థూలశరీరం ఉల్లిపాయలు మొదలైనవాటి వలే దుర్గంధ లోపభూయిష్టమై ఉంటుంది. దానిని శోధించడం, నిరూపించడం సులభం. కానీ సూక్ష్మశరీరం అలా కాదు. దానిని శోధించడం, గ్రహించడం కష్టం. ప్రకృతి అనే మాయలో పడిపోయిన సూక్ష్మశరీరాన్ని అవిద్యను తొలగించి మోక్షం వైపు మరల్చడం అంత సులభసాధ్యం కాదు. ఇక్కడ ప్రకృతి అంటే శరీరమని , సృష్ఠికి ముందు ప్రకృతి అవ్యక్తమని, స్థూల శరీరంలో ఉండే కారణ శరీరం అంటే అజ్ఞానం అవ్యక్తమైనది గ్రహించాలి. జగత్తును సృష్టించే శక్తి ప్రకృతికి లేదు. మట్టి జడమైనా కుమ్మరి అధీనంలో ఉండి కుండలాంటి వస్తువులకు కారణమౌతోంది. అలాగే ప్రకృతి సైతం బ్రహ్మాధీనమై పదార్ధోత్పత్తికి ఉపాదానకారణమౌతోంది. కనుక ప్రకృతి పరాధీనమే. స్వతంత్రంకాదు.
సూత్రం :- 110
"జ్ఞేయ త్వావచనా చ్చ"
జ్ఞేయత్వ :- ప్రకృతిని జ్ఞేయ పదార్ధంగా, అవచనాత్ :- చెప్పలేదు. చ :- పైగా
భావం :- ప్రకృతిని జ్ఞేయ పదార్ధంగా చెప్పలేదు. అందువల్ల అది బ్రహ్మాధీనమైన జగత్కారణం అవుతోంది.
వివరణ:- ప్రకృతిని జ్ఞేయపదార్ధంగా అంటే తెలుసుకోతగ్గదిగా చెప్పలేదు. ప్రకృతి బ్రహ్మాధీనమై జగత్తు ఆవిర్భవించడానికి కారణం అవుతోంది. ఒకవేళ ప్రకృతి జగజ్జన్మాదులకు స్వతంత్ర కారణమైతే ,దాన్ని జ్ఞేయ అంటే ప్రకృతి పదార్ధంగా వర్ణించే వాళ్ళు. స్వతంత్ర కారణమైన బ్రహ్మాన్ని తెలుసుకోవడమే పరమపురుషార్ధమైనది. అందుకే బ్రహ్మజ్ఞేయం, కానీ ప్రకృతి కాదు.
తైత్తరీయోపనిషత్తు(3,1):-దీనిలో బ్రహ్మమే తెలియవలసిఉందని అన్నారు. అందుచేత ప్రకృతి బ్రహ్మాధీనమై జగజన్మాదు లకు కారణం అవుతోంది. అంతే కాని స్వతంత్రం కాదని ఈసూత్రానికి అర్ధం. అవ్యక్తము అని, జ్ఞేయము అని చెప్పలేదు. కాబట్టి అవ్యక్తము అంటే ప్రదానం ( ప్రకృతి) కాదు.
సాంఖ్యదర్శనం:- సాంఖ్యులు పురుషత్వం లాగానే ప్రధానత్వం కూడా తెలుసుకోవాలని అంటారు. సాంఖ్యంలో పురుషుడు, ప్రకృతి రెండు విభిన్న అంశాలు అనేది ముఖ్య మౌలిక సూత్రం. సృష్టిలో అన్ని ఈ రెండింటిమీద ఆధార పడ్డాయి. పురుషుడు:-(ఆత్మ):-అంతటా వ్యాపించిఉన్న నిరాకారఆత్మతత్వం, ఇంద్రియాలకు తెలియనిది, మాటలతో చెప్పజాలనిది. శాశ్వతము, ఏవిధమైన మాలిన్యాలు అంటనిది. ప్రకృతి:- సాంఖ్యుల దృష్టిలో సృష్ఠికి కారణం శాశ్వతమైన ప్రకృతే. ప్రకృతిని ఎవరు సృజించలేరు. ప్రకృతికి సృజించే లక్షణం ఉంది. సృష్ఠికి ప్రకృతి, పురుషుడు(జీవుడు) ప్రధానకారణాలు. ఆత్మ చైతన్యవంతమైనది. ప్రకృతి పదార్ధానికి, పరిణామానికి మూలమైనది. ప్రకృతి సత్వము, రజస్సు, తమము అనే 3 గుణాలతో కూడి ఉంటుంది. ప్రకృతి, పురుషుల సంయోగం వలన బుద్ధి జనిస్తుంది. ఆ బుద్ధి చేసే చేష్టలు మనిషిని సంసారంలో బంధిస్తాయి. ఈగుణములను బట్టి జీవులు, పదార్ధాల లక్షణాలు మారతాయి.పరిణామం జరుగుతుంది. అణిమాది విభూతులు పొందడానికి ప్రధానాన్ని( ప్రకృతిని) ఉపాసించాలి అంటారు సాంఖ్యులు. జ్ఞానం వలన ఈ సంసారం బంధాల నుండి విముక్తి కలుగుతుంది.
సూత్రం :- 111
"వదతీతి చేన్న ప్రాజ్ఞో హి ప్రకరణాత్ "
వదతిఇతిచేత్:-ప్రకృతిని జ్ఞేయం అని ప్రమాణాలున్నాయనడం, న ;- సరి అయినది కాదు. హి:- ఎందుకంటే , ప్రకరణాత్ :- కఠోపనిషత్తులోని అవ్యక్తప్రకరణం వలన, ప్రాజ్ఞః:- పరమేశ్వరుడే జ్ఞేయం భావం :- ప్రకృతి జ్ఞేయము(అంటే తెలుకోతగ్గది) అని ప్రమాణాలు ఉన్నాయనడం సరియైనది కాదు. ఎందుకంటే కఠోపనిషత్తులో అవ్యక్తప్రకరణం వలన పరమేశ్వరుడే జ్ఞేయము అని గ్రహించాలి. ప్రకృతి జ్ఞాన సాధనం, ముక్తి సాధనం కాదు.
వివరణ :- ప్రధానాన్ని అంటే ప్రకృతి ని జ్ఞేయముగా చెప్పలేదు. ఇక్కడ పరబ్రహ్మను గూర్చియే చెప్పుచున్నారు. జీవుడి కర్మేంద్రియాలకు ఉండే శబ్ద, స్పర్శ రూప, రస, గంధాలు లేనిది, అనాది, అవ్యయము, ఆనంతము, అయిన మహత్తు కన్నా పరమైనది, నిశ్చలమైనది, అయిన బ్రహ్మాన్ని తెలుసుకున్నవారు మృత్యువాత పడరు అని ఉపనిషత్తులలో చెప్పబడింది. ఇక్కడ తెలుసుకోవలసినది ప్రధానాన్ని గురించికాదు. పురుషుని(ఆత్మ)కన్నా పరమైనవాడు లేడు. కనుక అతన్ని గురించి తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానం వలన మాత్రమే మృత్యువు నుండి తప్పించుకొని బ్రహ్మాన్ని చేరే అవకాశం ఉంది. కాబట్టి తెలుసుకోతగ్గవాడు బ్రహ్మమే.
కఠోపనిషత్తు:-(3,15):- మహత్తుకన్నా పరమైన ప్రకృతిని తెలుసుకుంటే మృత్యు ముఖం నుంచి విడివడతారని అన్నారు కదా! అప్పుడు ప్రకృతి జ్ఞేయం కదా! అది స్వతంత్ర కారణం ఎందుకు కారాదు? అనే సందేహం రావచ్చును. కఠోపనిషత్తు మంత్రంలో మహత్తుకన్నా సూక్ష్మమై శబ్ద స్పర్శ రూప రసాది గుణ రహితముగా వర్ణించింది బ్రహ్మాన్ని కానీ, ప్రకృతిని కాదు. ఇందులో తెలుసుకొని ముక్తుడౌతాడన్నది బ్రహ్మం గురించే. ప్రకృతిని తెలుసుకున్నంత మాత్రాన ముక్తి కలుగదు. బ్రహ్మజ్ఞానమే మోక్షదాయకం. మహత్తుకన్నా పరం, సూక్ష్మం, ధృవం అయినది బ్రహ్మమే. ప్రకృతిలో జగత్కారణం బ్రహ్మమే. సాంఖ్యుల అభిప్రాయం ప్రకారం ప్రధానం జ్ఞేయం అని, ఏది శబ్ద రహితమో, స్పర్శ లేనిదో,రూపం లేనిదో, మార్పు లేనిదో, రసం లేనిదో, ఆధ్యంతలు లేనిదో, మహత్తు కంటే పరమో అయిన ఏప్రధానం శృతిలో చెప్పబడినదో దానినే అన్వేషించాలి. కేవలం ప్రధానాన్ని అన్వేషిస్తూ, చేతనాత్మను తెలుసుకోవడం వల్ల మృత్యుముఖం నుండి విముక్తుడవడం, వీరు అంగీకరించారు.ఆశబ్దాది ధర్మాలు ప్రాజ్ఞాత్మకే ఉన్నట్లు ఉపనిషత్తులలో చెప్పబడింది. అందువలన ఇక్కడ ప్రధాన జ్ఞేయం అనిగాని, అవ్యక్తం అనిగాని నిర్దేశంచబడలేదు.
సూత్రం :- 112
"త్రయాణా మేవ చైవ ముపన్యాసః ప్రశ్నచ్చ"
ఏవం :- ఇలా జ్ఞేయరూపకంగా, త్రయాణాం ఏవం :- అగ్ని, జీవుడు, బ్రహ్మం అన్న మూడింటినే, ఉపన్యాస: :- కఠోపనిషత్తులో ప్రశ్నోత్తర రూపంలో వర్ణించారు. చ :- పైగా , ప్రశ్నః :- ప్రశ్న కూడా మూడింటి గురించే ఉంటుంది.
భావం :- కఠోపనిషత్తులో అగ్ని, జీవుడు, బ్రహ్మం గురించి ప్రశ్నోత్తర రూపంలో వివరించబడింది.
వివరణ:-కఠోపనిషత్తు:- నచికేతుడి కథ. వాజశ్రవుడు(ఉద్ధాలకుడు) అనే బ్రహ్మణుడు విశ్వజిత్ యాగం చేస్తాడు. యాగం చివర అతనికి ఉన్న సంపదనంతా దానం చేయాలి. కానీ మంచివాటిని తన దగ్గర ఉంచుకొని, ఎందుకు ఉపయోగానికి పనికిరాని ముసలి గోవులను, గొడ్డులను, దానం చేస్తాడు. వాజశ్రవుని కుమారుడు నచికేతుడు దానిని గమనించి, తన తండ్రిని పాపం నుంచి విముక్తుణ్ణి చెయ్యాలని, అతనిని ఆనందలోకాలకు పంపాలని భావిస్తాడు. నేను నీకు సంపాదనే కదా! నన్ను ఎవరికి దానంఇస్తావు అని అడుగుతాడు. తండ్రి సమాధానంచెప్పడు. అలా మూడుసార్లు ఆడిగేసరికి తండ్రికి కోపంవచ్చి నిన్ను యముడికి దానం చేస్తాను అంటాడు. యాగం పూర్తి అయిన తరువాత తను అన్న మాటకి చాలా బాధ పడతాడు. నచికేతుడు ఆడినమాట తప్పకూడదు. అసత్యదోషం అంటకూడదు కదా! నన్ను యముడు దగ్గరకు పంపండి అంటాడు. నచికేతుడు యమలోకం వెడతాడు. అక్కడ యముడు కనిపించకపోవడంతో మూడురాత్రులు ఉపవాసంతో ఉంటాడు. యముడు తిరిగి వచ్చి అతిధిని ఉపవాసం వుంచినందుకు, పరిహారంగా, ప్రాయిశ్చిత్తం చేసుకోవడానికి మూడు వరాలను కోరుకోమంటాడు. ఓ యమధర్మరాజా! మొదటివరంగా నేను ఇక్కడనుంచి ఇంటికి వెళ్ళినప్పుడు మాతండ్రి నన్ను సంతోషంగా ఆహ్వానించాలి. అతని పాపాలన్నీ తొలగిపోవాలి. యముడు తధాస్తు అంటాడు. రెండవవరం:- స్వర్గంలో మృత్యుభయం, ఆకలిదప్పులు, వృద్ధాప్యం, భయం, దుఃఖం ఏమి ఉండవు. అలాంటి మార్గం చేరుకోవడం యజ్ఞం ద్వారానే సాధ్యమౌతుంది. అగ్నిని ఆరాధించే అగ్నిచయనం గురించి వివరించమని అడిగాడు. స్వర్గప్రాప్తికి సంబంధించిన యజ్ఞాన్ని దానికి సంబంధించిన క్రతువును యముడు నచికేతుడికి బోధించి అప్పటినుండి ఆ యజ్ఞానికి నాచికేతయజ్ఞం అని పేరు వస్తుందని వరమిచ్చాడు. 3వవరం:-మరణం మీద నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. మరణించిన తరువాత ఇంద్రియాలు, అవయవాలు, మనస్సు మొదలైన వాటితో జీవాత్మకు సంబంధం ఉందని కొందరు, లేదని కొందరుఅంటారు. చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు? బ్రహ్మజ్ఞానం గురించి చెప్పమన్నాడు. తనంతటతాను ప్రత్యక్షమైతే కావలసినవి కోరుకొమ్మంటే నాతండ్రి నన్ను అభిమానించాలి, భయాన్ని జయించే స్వర్గం కావాలి, మరణరహస్యం తెలియజెయ్యాలి, అని ఈపిల్లవాడు పారమార్ధిక కోరికలను కోరడం యముడికి సైతం ఆశ్చర్యం కలిగించింది. నువ్వు చిన్నవాడివి. ఈ వయస్సులో నీకు బ్రహ్మజ్ఞానం చెప్పినా అర్ధం కాదు. మరొక వరం కోరుకోమన్నాడు. నీకు కావలసినంత ధనకనక వస్తువాహనాలను కాంతలను ఇస్తాను తీసుకువెళ్ళమన్నాడు యముడు. కానీ నచికేతుడు వాటన్నింటిని తిరస్కరించి, నాకు బ్రహ్మజ్ఞానం తప్ప మరేదీ అవసరం లేదు అన్నాడు. యముడు అతని పట్టుదలకు,దీక్షకు సంతసించి చెప్పడం ప్రారంభిస్తారు. మనిషికి 2మార్గాలుంటాయి. 1.శ్రేయోమార్గం, 2.ప్రేయోమార్గం. మొదటిది నివృత్తిమార్గం, రెండవది ప్రవృత్తిమార్గం. మనిషికి నిగ్రహం లేకపోతే జననమరణ చక్రంలో బంధీలౌతారు. ఆత్మను అన్వేషిస్తూ అంతర్ముఖుడయ్యే వాడు ఎక్కడో అరుదుగాఉంటాడు. మొదటఆత్మ బాహ్యవస్తువులతో విషయాలతో కల్పించుకుంటుంది. మేలుకొన్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు ఆత్మ సాక్షిభూతంగా ఉంటుంది. తననితాను తెలుసుకుంటే, ఆత్మ అన్నింటికీ ఆధారమని గ్రహించి, అన్ని దుఃఖాల నుండి విముక్తుడై అనంతమైన నిత్యమైన ఆనందాన్ని పొందుతాడు. జీవుడు నిద్రపోయినప్పుడు కూడా తాను మేల్కొని అన్ని విషయాలు తెలియజేస్తూ నిత్యమై శుద్ధమై ఉండేదే ఆత్మ. అన్ని లోకాలు అందులోనే ఉంటాయి. ఆత్మ పరమాత్మగా భిన్న రూపాలలో కనిపిస్తుంది. ఉన్నదంతా ఒక్కటే ఆత్మ. ఆపరమాత్మ తనలోనే ఉన్నాడన్న జ్ఞానం కలిగితే శాశ్వతఆనందం పొందుతాడు. దీనిని అజ్ఞానులు పొందలేరు. అనిశ్చితమైన వాటిలో చేతనారూపంలో ఉండే ఆత్మను దర్శించగలిగేవాడు ధీరుడు మాత్రమే. హృదయంలో 101 గదులుంటాయి. వాటిలో ఒకటి తనలో ప్రయాణిస్తుంది. దాని ద్వారా మనిషి అమృతత్వాన్ని పొందుతాడు. మిగిలినవి అన్ని వైపులా ప్రయాణించి అంతరిస్తాయి. ధీరుడైన వాడు తనలోని ఆత్మను, అంతరాత్మని పరమాత్మని తెలుసుకోవడమే జ్ఞానంఅని యముడు నచికేతుడికి బ్రహ్మోపదేశం చేస్తాడు. నచికేతుడు మృత్యువును జయించి పరబ్రహ్మతత్త్వాన్ని పొందుతాడు. ఆతరువాత నచికేతుడు ఇంటికి వెళ్ళినప్పుడు తండ్రి ఎంతో ఆనందంతో స్వాగతం పలుకుతాడు. కఠోపనిషత్తులో అగ్ని, జీవాత్మ, పరమాత్మల గురించి స్పష్టంగా వివరించింది. కాని ప్రధానాన్ని అంటే ప్రకృతిని గురించి ఎక్కడా చెప్పలేదు.
సూత్రం :- 113
" మహద్వచ్చ "
మహత్ వత్ :- వికారమైన మనస్సులాగా, చ :- ఇతర జ్ఞానేంద్రియ ,కర్మేంద్రియాల వలే మూల ప్రకృతి బ్రహ్మాధీనం.
భావం :- శరీరం, మనస్సు ఇంద్రియాలన్ని జీవుడికి లోబడి ఉండి, తమతమ కార్యాలు నిర్వర్తిస్తాయి. స్వతంత్రంగా పనిచేయవు. అలాగే మూల ప్రకృతికూడా పరమాత్మకు లోబడి జగజ్జన్మాదులకు కారణమౌతుందే కానీ స్వతంత్రంగా కాదు.
వివరణ :- మహత్తు(బుద్ధి) అనే పదం సాంఖ్యులు చెప్పే పదం కాదు. అలాగే అవ్యక్తం కూడా సాంఖ్యులు చెప్పే ప్రధానం కాదు. అవ్యక్తం అనే పదానికి అర్థం శరీరం అంతే కాని ఆత్మ కాదు. సాంఖ్య దర్శనం :- హిందు ధర్మ శాస్త్రాలలో జీవుడు, ప్రకృతితత్త్వం, మోక్షం వంటి విషయాలు విశ్లేషించే తత్త్వ శోధనా రచనలను దర్శనాలు అంటారు. ఇవి 6 ఆస్తిక దర్శనాలు 1.సాంఖ్యము, 2.యోగము,3 వైశేషికము, 4.న్యాయం, 5.పూర్వ మీమాంస, 6.ఉత్తర మీమాంస. వీటిలో మూల ప్రకృతికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేది సాంఖ్య దర్శనం. కపిల మహర్షి దీనిని ప్రవర్తింపజేశాడు. విశ్వసృష్ఠికి మూలప్రకృతి ప్రధాన కారణమని ఈదర్శనసారాంశం. ప్రకృతి సత్వము, రజస్సు, తమము అనే 3గుణాలతో కూడి ఉంటుంది. ప్రకృతి పురుషుడు (జీవుడు) సంయోగం వలన బుద్ధి జన్మించి, ఆ బుద్ధిచేష్టల వలన సంసారబంధం ఏర్పడుతుంది. సాంఖ్యవాదం ప్రకారం జ్ఞానానికి 3 ప్రమాణాలు:- 1.ప్రత్యక్ష ప్రమాణాలు:- మన ఇంద్రియాలద్వారా తెలిసేవి. (స్వయంగా చూసేవి, విన్నవి, స్పృశించేవి.) దీనిలో మరల 2 విధానాలు. ఎ. నిర్వికల్పప్రమాణం :- ఇంద్రియాలు ద్వారా గ్రహించేది. కానీ అర్ధం కానిది. ఒక చిన్నపిల్లవాడు ఒక జంతువును చూస్తాడు. కానీ వాడికి దాని గురించి ఏమి తెలియక పోవచ్చును. b) సవికల్ప ప్రమాణాలు :- ఇంద్రియాల ద్వారా గ్రహించడమే కాక అర్ధం చేసుకున్నది. ఆ విషయానికి, మరో విషయానికి ఉన్న భేదం తెలుస్తుంది. ఇది సరిఅయిన జ్ఞానానికి ఆధారం. 2). అనుమాన ప్రమాణాలు :- ఇలా కావచ్చును అని ఊహించింది. ప్రత్యక్షప్రమాణాల వల్ల గ్రహించిన విషయాన్ని ఉపయోగించి, తెలియని విషయాన్ని అంచనా వేయడం, ఉదాహరణకు పొగ కనిపించింది కనుక నిప్పు ఉన్నదని చెప్పడం. 3). శబ్ద ప్రమాణం :- వేరే వారు చెప్పగా విన్న విషయాలు. బ్రహ్మసూత్రములు 1-4-1నుండి 1-4-7 వరకు అనుమానికాధికరణంలో అనుమాన ప్రమాణాలు ఆధారంగా చెప్పబడినవి. సృష్టిలో అన్ని ప్రకృతి పురుషుల మీదనే ఆధారపడ్డాయి. పురుషుడు అంటే నిర్వికార స్వతంత్ర ఆత్మరూపం. ఇది శాశ్వతం, ఎవరూ సృజించలేరు. పురుషుడు దేనిని సృజించడు. ప్రకృతి అనాదిగా ఉన్నదే. దానిని ఎవరూ సృజించలేరు. కానీ ప్రకృతికి సృజించే లక్షణం ఉంది. అన్ని పరిణామాలు, అశాశ్వతమైన పదార్ధాలు కూడా ప్రకృతి వల్లనే సంభవిస్తాయి. అన్ని జీవులు పురుషుని బాహ్యస్వరూపాలే. ప్రకృతి వలన ఉద్భవించిన భౌతిక రూపాలు తిరిగి ప్రకృతిలోనే లీనమై పోతాయి. అందుకే సాంఖ్యులు ప్రకృతినే ప్రధాన అంశంగా వర్ణించారు.
సృష్టి సిద్ధాంతం:- సాంఖ్యము సత్కార్యవాదాన్ని సమర్ధిస్తుంది. దీని ప్రకారం ఏదైనా పనిలో కారణం, ఫలితం కలసి ఉంటాయి. ఉన్నదేది నశించదు. లేనిదేది ఉత్పన్నం కాదు. అంతా పరిణామమే. వీరి ప్రకృతిపరిణామవాదం ప్రకారం మూలప్రకృతే అన్నిటికీ కారణం. అదే వివిధ రూపాలుగా పరిణామం చెంది తిరిగి మూలప్రకృతిలో లీనమౌతుంది. ఇలా చక్రగతిలో విభజన, విలీనం సంభవిస్తుంటాయి. కపిలముని ప్రతిపాదించిన సాంఖ్యంలో ఈశ్వరుడికి స్థానం లేదు. అందుకు కారణం ఈశ్వరుడి ఉనికిని రుజువు చెయ్యడం సాధ్యం కాదు. పరిణామంలేని ఈశ్వరుడు పరిణామాత్మకమైన సృష్ఠికి కారణం అని చెప్పడం అసంబద్దమంటారు. తరువాత కాలంలో సాంఖ్యులు ఈశ్వరతత్వాన్ని సాంఖ్యవాదంలో ప్రవేశపెట్టారు. వీరు ఆత్మజ్ఞానం వలన భౌతికబంధాలనుండి విముక్తి పొంది మోక్షాన్ని పొందవచ్చునని అంగీకరించారు. సాంఖ్యులు చెప్పిన మూలప్రకృతి కూడా పరమాత్మకు లోబడి జగజ్జన్మాదులకు కారణమౌతుంది కానీ స్వతంత్ర కారణం కాదని ఈ సూత్రానికి అర్థం.
సంఖోప సంగ్రహాధికరణం :- ( 1, 4 , 11 )
సూత్రం :- 117
" న సంఖ్యోప సంగ్రహాదపి నానాభావా దతిరే కా చ్ఛ"
సంఖ్య ఉపసంగ్రహాత్ అపి :- ఏకత్వసంఖ్య ఉన్నప్పటికీ, నానాభావాత్ :- అనేక కారణములను ప్రతిపాదించినందువల్ల, చ :- అంతే కాక, అతి రేకాత్ :- ఇంకా అధికంగా ఎంతో చెప్పినందువల్ల, న :- ప్రకృతి జగత్తుకు స్వతంత్ర కారణం కాదు.
భావం :- ఏకత్వసంఖ్య ఉన్నపటికీ ప్రకృతికి అనేక కారణాలు ప్రతిపాదించి నందువల్ల ప్రకృతి జగత్తుకు స్వతంత్ర కారణం కాదు.
వివరణ:- జగత్తుకు అనేక కారణాలు ఉన్నాయి. మోహాన్ని కలుగజేస్తుంది కనుక ప్రకృతిని మాయ అన్నారు. ప్రకృతి జగత్తు రూపంలో పరిణామం చెంది, పురుషులకు మోహాన్ని కలిగిస్తుంది. ఈ మాయకు స్వామి ఈశ్వరుడు మాయి. ఆయన ఈ జగత్తుకు నిమిత్త కారణం. మహత్తు, అహంకారాది సర్వ జగత్తుకు ప్రకృతి మూలకంగా నిర్మాణమౌతుంది అని నిర్వచింపబడినది. దీనితో ప్రకృతి ఉపాదానకారణం అని తెలుతోంది. స్వామిత్వం ఈశ్వరుడికి ఉండటం వలన మాయ స్వతంత్ర కారణం కాదు. కార్య జగత్తులో కూడిన ప్రకృతి కి పరమాత్మ అధిష్టానం కనుక ఆయన ప్రకృతి కన్నా అధికుడు అని వాజసనేయులు బృహదారణ్యకంలో చెప్పారు. దీని వలన ప్రకృతి జగత్తుకు స్వతంత్ర కారణం కాదని స్పష్టమౌతోంది. లోకంలో జీవులుచేసుకున్న పాపపుణ్యాలు అనుభవించడానికి పరమేశ్వరుడు ప్రకృతిఅనే మాయను సృష్టించాడు. దానిలో సర్వజగత్తు నదులు, సముద్రాలు, పర్వతాలు,వృక్షాలు, పక్షులు, జంతువులు, అనేక జీవరాశులను సృష్టించి నందువల్ల ప్రకృతి, జగత్తుకు కారణం పరమాత్మే కానీ ప్రకృతి కాదు.
బృహదారణ్యకోపనిషత్తు:-(4-4-17):- పరబ్రహ్మంలోనే ప్రాణాదులు, ఆకాశం, ప్రతిష్ఠితమై ఉన్నాయి. ఆఆత్మను బ్రహ్మంగా తెలుసుకొని, మృత్యువును జయించి తరిస్తారు. ఇక్కడ ఆకాశం అంటే ప్రకృతి. పంచప్రాణాలు, పంచజనులు బ్రహ్మానికి అధిష్టానమై ప్రకృతికి ఆధారమైనది. నిమిత్త కారణమును ఆధార కారణమని, అధిష్టానకారణమనీ అంటారు. ప్రకృతికి ఆధారమైన బ్రహ్మం దానికన్నా అధికం. ప్రకృతి జగత్తుకు పరతంత్రకారణం. అందువలన "జన్మాదస్యయతః" అనే సూత్రంలో వర్ణించిన నిమిత్తకారణమైన బ్రహ్మలక్షణం నిర్దుష్టమైనది. గురువుగారు! పంచ పంచ జనులు అంటే 25 తత్త్వాలేనా? అని అడిగాడు కృష్ణ శర్మ. పంచ పంచ అంటే ఐదు ఐదులు 25 తత్త్వాలని సాంఖ్యులు చెబుతున్నారు. ఆ తత్త్వాలు పంచభూతాలు- 5, తన్మాత్రలు - 5, జ్ఞానేంద్రియాలు -5, కర్మేంద్రియాలు - 5, మనస్సు, మహత్తత్వం, అహంకారం, ప్రకృతి, పురుషుడు కలిపి 25 . సాంఖ్యులు చెప్పిన తత్త్వాలన్ని పరస్పర విలక్షణాలు కలిగి ఉంటాయి. పంచ అంటే ఐదు అని అర్ధం. ఇవి 5 సమూహాలుగా ఉండాలి. ఒక సమూహంలోని ఐదింటికి ఒకే లక్షణాలు ఉండాలి. కానీ అవి అలా లేవు. వాటి ధర్మాలు వేరు వేరుగా ఉన్నాయి. కాబట్టి పంచ పంచ జనులు అంటే 25 తత్త్వాలు కాదు. ఐదు ప్రాణాలను పంచ జనులు అంటారు.ఈ పంచప్రాణాలే ప్రకృతికి ఆధారం. ఇవన్నీ పరబ్రహ్మంలోనే ఉంటాయని గ్రహించాలి.
చమసాధికరణం :- ( 1, 4 , 10 )
సూత్రం :- 116
కల్పనోపదేశా చ్చ మధ్వాదివదవిరోధః"
మధుఆదివత్:- మధువులాంటి వాటిలాగా, కల్పన ఉపదేశాత్ చ :- పోలిక ద్వారా ఉపదేశించడం వలన కూడా, అవిరోధః :- మూల ప్రకృతిని వ్యక్త రూపంలో ఉండే అజతో పోల్చి చెప్పడం లో ఏవైరుధ్యం లేదు.
భావం :- ఆదిత్యాదులందు మధువును చెప్పినట్లుగానే అజా శబ్దంతేజో లక్షణం. అంటే తేజస్సు, జలం, అన్నం వీటి లక్షణాలు మూల ప్రకృతిలో కూడా అజా శబ్దం చెప్పబడినది.
వివరణ:-మూలప్రకృతి అవ్యక్తం కదా! వ్యక్తమైన అజను ఎరుపు, తెలుపు, నలుపు రంగులు ఉంటాయి కదా! ఎలా పోలుస్తారు? అనే సందేహం రావచ్చును.
చాందోగ్యోపనిషత్తు:-( 3 ,1, 1):- "అసౌవా ఆదిత్యో దేవమధు,
బృహదారణ్యకోపనిషత్తు.."వాచం ధేమం ఉపాసీత" (5,8,1) ఈ ఆదిత్యుడు దేవమధువు. వాన్ అనే ధేనువును ఉపాసించు అనే వాక్యాలలో సూర్యుడు మధువు కాకపోయినా మధువు లాగా ఆనందం కలిగిస్తాడు. కనుక అలా పోల్చారు. అలాగే వాక్కు ధేనువు కాకపోయినా వాక్కు ఆవులాగా ఎంతో ఉపకరిస్తుంది. కనుక అలా ఉదహరించారు. ఈ విధంగానే ఈ జగత్తుకు ఉపాదానకారణమైన మూలప్రకృతి, కారణరూపంలో అవ్యక్తమైన తెలుపు, నలుపు రూపాలున్న మేకతో పోల్చి వర్ణించారు. అంత మాత్రాన ప్రకృతి అవ్యక్తం కాకపోదు. వాడు నిప్పులాంటివాడు. ఆ పిల్లవాడు సింహం అని పోల్చి చెప్పినంత మాత్రాన మనుష్యత్వం లేకపోలేదుకదా! ప్రకృతిలో ఉండే అవ్యక్తం తాత్వికం, కల్పితం కాదు. కనుక పోల్చడంలో వైరుధ్యం లేదు. అజాంఏకంలో ఈ ఒకసంఖ్య ప్రకృతి ఒక్కటే జగత్కారణం అని సూచించడం లేదా? అప్పుడది స్వతంత్ర కారణం అవుతోంది కదా! దీనికి సమాధానం తరువాత సూత్రంలో చెప్పబడినది. ఆకాశంలో కనిపించే సూర్యుడు దేవతలను తృప్తిపరుస్తాడు. అతడు దేవతలకు మధువు లాంటి వాడు. ఈవిధం గానే అజాశబ్దం చెప్పబడినది. అజము అంటే మేక. ఇది మూడు రంగుల్లో ఉంటుంది. ఎరుపు, తెలుపు, నలుపు తప్ప ఇతర రంగులు ఉండవు. ఈ మేక తనవంటి మేకలను ఉత్పత్తిచేస్తోంది. అలాంటి మేకను మేకపోతు సేవిస్తుంది. అంటే ప్రకృతిని అజ్ఞాని అహింస జీవుడు సేవిస్తాడు. వేరొక మేకపోతు తాను అనుభవించిన మేకను వదిలేస్తుంది. అంటే జ్ఞాని అయిన వాడు తాను అనుభవించిన ప్రకృతిని వదలివేస్తున్నాడు. త్యాగభోగాలలో ప్రకృతి యందు సమత్వమే ఉంటుంది అని చెబుతున్నాయి. సూర్యోపాసన కోసం మధువును కల్పించి చెప్పారు. అంతేకాక నిజంగా సూర్యుడు మధువు కాదు. అలాగే ప్రకృతి యందు మేకను కల్పించి చెప్పారు. అజము అంటే ప్రకృతి కాదు. లోకంలో ఒక ఆడమేక దైవ వశంచేత రోహిత, శుక్ల, కృష్ణ వర్ణాలు కలదై, తనతో సమానమైన రూపంకల పిల్లలు కలదిగాను ఉండవచ్చును. ఒక అజం మరొక దానితో ఉండవచ్చును. మరొక మేక అనుభవించి విడిచి పెట్టవచ్చును. అజ్ఞాని అయిన జీవుడు దానిని అనుసరించి ఉంటాడు. జ్ఞాని దానిని విడిచి వేస్తాడు. ఇది క్షేత్రజ్ఞుల భేదాన్ని ప్రతిపాదించాలనే ఉద్దేశ్యం కాదు. బంధ మోక్షాల వ్యవస్థను ప్రతిపాదిస్తున్నారు. మధువు కాని ఆదిత్యునికి ఏవిధంగా మధుత్వం కల్పించబడిందో, ధేనువు కాని వాక్కును ధేనుత్వం ఏవిధంగా కల్పించబడిందో, అగ్నులుకాని ద్యులోకాదులకు ఏవిధంగా అగ్నిత్వం కల్పించబడిందో అలాగే అజ కానిదానికి అజత్వం కల్పించబడుతోంది. అందువల్ల తేజోబన్నలకు అజా శబ్ద ప్రయోగం చేయడంలో విరోధం లేదు.
సూత్రం :- 115
"జ్యోతి రుపక్రమాతు తథా హ్యధీయత ఏకే"
జ్యోతిః ఉపక్రమాతు :- అజా శబ్దం సూచించే సత్వగుణాలు ఉన్న ప్రకృతిని శాసించే బ్రహ్మం శక్తే ఈ జగత్తుకు కారణం. హి:- ఎందుకంటే, ఏ కే :- ఒక శాఖ వాళ్ళు , తధా :- ఆ విధంగానే, అధీయతే :- వర్ణిస్తారు.
భావం :- అజశబ్దం సూచించే సత్వగుణాలు ఉన్న ప్రకృతిని బ్రహ్మంయొక్క శక్తే శాసించగలదు. ఆశక్తే ఈ జగత్తుకు కారణం అవుతుంది. ఒకశాఖ వాళ్ళు ఆవిధంగానే వర్ణిస్తారు.
వివరణ :- తేజస్సు దీనిలో ఉంటుందో దానిని అజ అని గ్రహించాలి. ఛాందోగ్యంలో తేజస్సు, ఉదకము, అన్నము, అనేవి సమస్త జగత్తుకు కారణం అని కార్యమైన వస్తువు కారణం కన్నా భిన్నం కాదు. తేజస్సు, అన్నము లందు అజ యొక్క ఆకృతి లేదు. అందుచేత జన్మ రహితమైన అజ శబ్దం వాటి యందు అన్వయించదు.
శ్వేతాశ్వతర ఉపనిషత్తు:- అజా మేకం(4,5), ద్వా సువర్ణా(4,6), సమాన వృక్షే( 4,7) అనే రెండు మంత్రాలున్నాయి. ఇందులో జీవుడు ప్రకృతి మోహంలో పడి దుఃఖిస్తున్నాడని, తరువాత మోహాన్ని వీడి మహిమాన్వితమైన ఈశ్వరుణ్ణి తెలుసుకొని, దుఃఖరహితుడై ముక్తిని పొందుతున్నాడని ఉన్నది. వీటిని బాగా పరిశీలిస్తే ప్రకృతి పరతంత్రం అనీ, దాన్ని మరోతత్త్వం నియమిస్తున్నదనీ, జీవుడు ప్రకృతికి నియంత అయిన ఈశ్వరుణ్ణి చూసి మోక్షం పొందుతాడనీ తెలుస్తోంది. మూలప్రకృతి మాయఅని ఈఉపనిషత్తు వర్ణిస్తోంది. తేజోవంతమైన ప్రకృతి అజాగా గ్రహింపదగినది. ఈ అజ పరమేశ్వరుణ్ణించి పుట్టినది. జ్యోతిస్సు ప్రారంభంలో కలది, తేజస్సు, ఉదకము, అన్నం, లక్షణంగా గలది. 4 విధాలైన జరాయుజ, అండజ, స్వేదజ, ఉద్భిజములైన ప్రాణిసముదాయానికి ప్రకృతిగా తెలియదగినది. తు శబ్దం నిశ్చయదార్ధకం. అనగా ఈ అజ భూతత్రయరూపమైనది కానీ గుణత్రయరూపమైనది కాదు. కొన్ని శాఖలవారు తేజోబన్నాలకు పరమేశ్వరుడి నుండి ఉత్పత్తి చెప్పి, ఎర్రగా ఉన్నది అగ్ని యొక్క రూపం, తెల్లగా ఉన్నది బలం యొక్క రూపం, నల్లగా ఉన్నది భూమి యొక్క రూపం అనీ ఎరుపు మొదలైన రూపాలున్నట్లు చెబుతున్నాయి. ఇక్కడ రోహితాది శబ్దాలు పోలికను బట్టి ఈ తేజోబన్నాలే గ్రహింపబడుచున్నాయి. రోహితాది శబ్దాలకు ఎరుపు మొదలైన అర్ధాలు ముఖ్యర్ధాలు. రజఃసత్వాది గుణాలకి అర్ధాలు గౌణాలు. అంటే తరువాత చెప్పకోవలసిన అర్థాలు. ఏ పదాల అర్ధం విషయంలో సందేహం లేదో, వాటి సహాయం చేత సందేహంగా ఉన్న పదాలకు అర్ధాలు నిర్ణయించడం యుక్తం అని అంటారు. బ్రహ్మకు సృష్టి ప్రారంభంలో ఏది సహాయంగా ఉండేది? వాళ్ళు ధ్యానయోగం చేత పరమాత్మలో ప్రవేశించి తన సత్వాది గుణాలతో కూడినది నిగూఢంగా ఉన్నది అయిన పరమేశ్వరుడి స్వీయ శక్తిని చూచారు. సమస్త జగత్తును సృష్టించిన పరమేశ్వర శక్తి వాక్య ప్రారంభంలో తెలుస్తున్నది. అజ శబ్దం సత్వగుణాన్ని సూచిస్తుందని, అది ప్రకృతి లక్షణమనీ, దానిని శాసించే శక్తి పరబ్రహ్మకే ఉన్నదని తెలియజేయబడుతోంది.
సూత్రం :- 114
'చమసవత్ అవిశేషాత్"
చమసవత్ :- సోమ పాత్ర లాగా , అవిశేషాత్ :- విశేషంగా చెప్పనందువల్ల ,
భావం:- ఇది పూర్వపక్ష సూత్రం. సోమపాత్ర వలె ఈఅర్ధమే చెప్పాలనే విశేషం లేకపోవడం చేత అజా శబ్దం ప్రధాన వాచకం కాదు.
వివరణ :- చమసము అంటే నాలుగు పలకలుగా చతురస్రంగా ఉండే యజ్ఞ పాత్ర. ఈ పాత్ర లాగానే అజా శబ్దానికి కూడా ప్రత్యేకమైన నిర్ణయం ఏమి లేదు. ఎందుకంటే యజ్ఞంలో ఉపయోగించే పాత్రలన్నీ మనం వాడుకునే గరిటలు లాగా ఎత్తుపల్లాలు వుంటాయి. అలాగే అజా అనే శబ్దం ప్రత్యేకంగా ప్రధానాన్ని చూపుతుందని చెప్పడానికి కారణం ఏమి లేదు.
బృహదారణ్యకోపనిషత్తు:- ఇక్కడ విశేషంగా ఫలానా పాత్ర అని చెప్పినందు వల్ల చమస శబ్దం సోమపాత్రను సూచిస్తుంది. ఒక గిన్నెకు దాని మూతి క్రిందివైపుకు తెరచిఉంది. పైభాగం ఉబ్బెత్తుగా ఉంటుంది. దాని ప్రక్కనే 7గురు ఋషులున్నారు. వేదాల ద్వారా వాదం చేసే హక్కు ఉంది. ఆ గిన్నె శిరస్సు. క్రింది భాగంలో తెరచి ఉండేది నోరు. పై భాగం ఉండేది పుర్రె. సోమపాత్రలో సోమరసం ఉన్నట్లుగా శిరస్సులో అనేకరకాల విజ్ఞానమున్నది అని చెప్పబడినది. ఇక్కడ చమసము అంటే శిరస్సు అని అర్ధం. అజామే అస్య అనే మంత్ర వర్గం వలన రక్త శుక్ల కృష్ణ వర్ణాలు కలది, తనతో సమానమైన గుణాలు కల సంతానాన్ని సృష్టిస్తోంది. అజము అంటే జీవుడు కనుక ఒక జీవుడు మరొక జీవితో శయనించి అనుభవించ బడిన భోగం వలన మరొక జీవికి జన్మను ఇస్తున్నాడు. ఈ మంత్రంలో లోహిత శుక్ల కృష్ణ శబ్దాల చేత రజః, సత్వ, తమో గుణాలు చెప్పబడుతున్నాయి. రంజింపజేసే స్వభావం కలది కనుక రజస్సు ఎరుపు, ప్రకాశ స్వరూపం గాన సత్వం తెలుపు, ఆవరించేది కనుక తమోగుణం నలుపు, ఈ మూడు గుణాలు సామ్యావస్థ అవయవ ధర్మాలు చేత లోహిత, శుక్ల కృష్ణ అని చెప్పబడుచున్నాయి. మూలప్రకృతి దేని నుండి పుట్టదు అని అంగీకరించబడింది కదా! ఆ ప్రకృతిని ఒక అజుడు అనగా పురుషుడు సంతోషిస్తూ లేదా సేవిస్తూ అవిద్య చేత, అదే తన ఆత్మ అనుకొని పొంది అవివేకవంతుడు అవడం చేత, సుఖవంతుడను, దుఃఖవంతుడను, మూడుడను అనుకుంటూ సంసారంలో పడి ఉంటాడు. మరొక అజుడైతే అనగా పురుషుడైతే వివేకజ్ఞానం కలిగి విరక్తుడై ప్రకృతి తనకు కల్పించిన సుఖదుఃఖాలను బంధాలను విడిచిపెట్టి ముక్తుడౌతాడు.
సూత్రం :- 118
"ప్రాణదయో వాక్యశేశాత్"
ప్రాణదయఇతి - వాక్యశేషాత్:- బృహదరణ్యకంలోని వాక్యంలో ఉండే శబ్ద సాన్నిధ్యం వల్ల , ప్రాణ దయః :- పంచ జనులంటే పంచ ప్రాణాలు అని గ్రహించాలి.
భావం :-పంచజనులు అంటే పంచప్రాణాలు అని గ్రహించాలి. పంచజన శబ్దం, మనుష్య వాక్యమైనా శబ్ద సాన్నిధ్యంలో ప్రాణ వాచకం అని అర్ధం చేసుకోవాలి.
వివరణ :- బృహదారణ్యకోపనిషత్తు:-(4,4,18):- ప్రాణానికి ప్రాణం, నేత్రానికి నేత్రం, చెవికి చెవి, అన్నంకి అన్నం, మనసుకి మనస్సు అయిన పురాతన బ్రహ్మాన్ని తెలుసుకుంటారు. ఇక్కడ ప్రాణానికి పంచజన అంటారు. ప్రాణాది పదాలు ఈశ్వర వాచకాలు అని గ్రహించాలి. పంచజన ప్రాణం ఈశ్వరుడే అవుతాడు. అయితే మాద్యందిన పాఠంలో అన్నస్య అన్నం లేదు కదా! దీని గురించి తరువాత సూత్రంలో చెప్పబడినది. పంచజన శబ్దానికి ప్రాణాదులు అని గ్రహించాలి. ప్రాణ, అపాన,వ్యాన, ఉదాన, సమానములే. పంచజనములుఅంటే 25తత్త్వాలు కాదు. పంచప్రాణాలు:- 1.ప్రాణము, 2.అపానము, 3.సమానము, 4.ఉదానము, 5.వ్యాసము 1.ప్రాణము ;- ఇది ముక్కు రంద్రాల నుండి హృదయం వరకు వ్యాపించి ఉన్న శ్వాస కోశాన్ని జ్ఞానేంద్రియములను నియంత్రిస్తుందని చెప్పబడింది. మన వాక్కును, మ్రింగటాన్ని, శరీర ఉష్టోగ్రతలను అదుపులో ఉంచుతూ శరీరంలో ఉర్ధ్వచలనం కలిగి ఉంటుంది. 2. అపానము :- నాభినుండి అరికాళ్ళవరకు వ్యాప్తి చెంది అధో చలనం అనగా కదలికలు కదలిక పై నుంచి క్రిందికి ఉండి, విసర్జన కార్యకలాపాలు నిర్వహిస్తుంది. మలమూత్ర విసర్జన, వీర్యము, బహిష్టు, మరియు శిశు జననం మొదలైనవి నిర్వహిస్తుంది. 3.సమానము:- ఇది నాభి నుండి హృదయం వరకు వ్యాప్తి చెంది ఉంటుంది. మనం తినే ఆహారాన్ని జీర్ణం అయ్యేటట్లు చేసి అది ఒంట బట్టడానికి సహకరిస్తుంది. దాని ద్వారా అవయవాలకు శక్తి కలిగుతుంది. 4.ఉదానము:- ఇది గొంతు భాగం నుంచి శిరస్సు వరకు వ్యాపించి ఉంటుంది. శరీరాన్ని ఊర్ధ్వ ముఖంగా పయనింపజేయడానికి ఇది సహాయపడుతుంది. మనలో నుండి శబ్దం కలగడానికి, వాంతులు చేసుకునేటప్పుడు బహిర్గత మవడానికి మన దైనందిన కార్యాల్లో తూలిపడిపోకుండా ఉండటానికి దోహదపడుతుంది. 5. వ్యానము :- ఇది ప్రాణ అపానాలను కలిపి ఉంచుతుంది. శరీరంలో ప్రసరణ కార్యక్రమాన్ని జరిపిస్తుంది. నాడీ మండలం మొత్తం పనులను నడిపిస్తుంది. మన ప్రాణమయకోశంలో సుమారు 72000 సూక్ష్మ నాడులున్నట్లు చెబుతారు. ఇవి కాక వాటిని నియంత్రించే నాడీ కేంద్రాలు ఉన్నట్లు పెద్దలు చెబుతారు. ఈ ప్రాణ అపాన సమాన ఉదాన వ్యానములనే పంచ ప్రాణాలు అంటారు. ఇవి ఆయా స్థానాలలో ఉన్నా అవసరమైనప్పుడు ఇతర స్థానాలలో సంచరిస్తాయి. ఇవే అగ్నులుగా పరిణమించి మనం తిన్నది రక్తంగా మారడానికి వివిధ దశలలో పనిచేస్తాయి.మనం పీల్చే గాలి లోపల ఇన్ని పరిణామాలు చెందుతుంది. వాయువు నుండి అగ్ని పుడుతుంది.ఇవే పంచజనములు.సాంఖ్యులు చెప్పిన 25 తత్త్వాలు కాదు. ఈ ప్రాణాదుల విషయంలో జన శబ్ద ప్రయోగం ఎలా కుదురుతుంది? తత్త్వాలు విషయంలో మాత్రం జన శబ్ద ప్రయోగం ఎలా కుదురుతుంది?అనే సందేహం రావచ్చును. ప్రాణాదులకు జనులతో సంబంధం ఉండటం వలన వాటి విషయంలో జన శబ్దం కుదురుతుంది. అందుచేత ప్రాణాదులు విషయంలో జనప్రయోగం ప్రసిద్ధమే.
సూత్రం :- 118
జ్యోతి షై కే షామ సత్యన్నే"
ఏకేషాం :- కాణ్వుల పాఠంలో (వాక్య శేషం :- 4-4-18 లో అన్నస్య అన్నమే అనే శబ్దాన్ని పఠించరు. కానీ 4-4-17 కన్నా ముందు మరోవాక్యం ఉంది). అన్నే అసతి:- . అన్నం శబ్దం లేనప్పుడు , జ్యోతిషా:-జ్యోతి పదంతో పూరించుకోవాలి.
భావం :- కాణ్వులకు అన్నం లేకపోయినా జ్యోతిస్సు చేత పంచ సంఖ్య పూరించబడింది.
వివరణ:-బృహదారణ్యకోపనిషత్తు:-(4-4-16):-"తద్దెవా జ్యోతిషాం జ్యోతిరాయః హా పాసతే అమృతమే" ఇందులో జ్యోతిషాం అంటే ఇంద్రియాలకు అని అర్ధం. జ్యోతి పదం ఇంద్రియ వాచకం కాబట్టి అన్నస్య అన్నం లో అన్న శబ్దం మాధ్యందినుల పాఠంలో ఇంద్రియ వాచకం కనుక ఆ ఇంద్రియాన్నే ఇక్కడ జ్యోతి అన్నారని గ్రహించాలి. పంచజన - పంచ ప్రాణ - పంచేంద్రియ- జ్యోతి శబ్దాలు సమానార్ధకాలు. ఏమి తేడా లేదు. ప్రాణ శబ్దం పరమేశ్వర వాచకమే. అధర్వణ వేదంలో పరబ్రహ్మ వాచక శబ్దాలను అర్ధం చేసుకోవడానికి వేదవ్యాసుడు మన హితం కోరి అనేక సూత్రాల రచన చేస్తున్నాడు. జనక మహారాజు బ్రహ్మజ్ఞానాన్ని వివరిస్తూ పరబ్రహ్మ ప్రాణానికి ప్రాణం, చక్షువుకి చక్షువు, శ్రోతానికి శ్రోతమ్, అన్నానికి అన్నం , మనసుకి మనస్సు అంటాడు. వీటిలో అన్నము అనే మాటకు బదులు జ్యోతిని తీసుకోవాలి. ఇప్పుడు పంచ జనులు అంటే ప్రాణము , చక్షువు,శ్రోతము,జ్యోతిష్షు, మనస్సు అంతేకాని 25 తత్త్వాలు కాదు. మాధ్యందిన శాఖకు సంబంధించిన వారి పాఠంలో వాళ్ళు ప్రాణాదులలో అన్నం కూడా పఠిస్తున్నారు. కనుక ప్రాణాదులు పంచ జనులైతే కావచ్చును. ప్రాణాదులలో అన్నం చేర్చని కాణ్వా శాఖీయుల పాఠంలో ప్రాణాదులు పంచ జనులు ఎలా అవుతారు.అందుకు సమాధానం చెబుతున్నారు. కాణ్వులకు అన్నం లేకపోయినా జ్యోతిస్సు చేత పంచ సంఖ్య పూరించబడింది. వాళ్ళు కూడా బ్రహ్మ స్వరూపం నిరూపించడానికి పంచ సంఖ్యను పఠిస్తున్నారు. ఈ జ్యోతిస్సు రెండు శాఖల వారికి కూడా సమానంగా పఠించబడినా కూడా దీనిని సమాన మంత్రంలో ఉన్న పంచ సంఖ్య చేత కొందరు గ్రహిస్తారు. కొందరు గ్రహించరు. రెండూ సమాన మంత్రంలో ఉన్నప్పటికీ, అపేక్ష కారణంగా మాద్యందిన శాఖవారు అన్నాన్ని, కాణ్వులు అది లేకపోవడంతో జ్యోతిస్సుని గ్రహించి దానినే పఠిస్తారు.
కారణత్వాధికరణం :- ( 1, 4 , 14 )
సూత్రం :-120
"కారణ త్వేన చా కాశాదిషు యథా వ్యపదిష్టో క్తేః"
ఆకాశేషు :- ఆకాశం మొదలైన మహత్ తత్త్వ నామరూపాత్మకమైన సమస్త కార్య పదార్ధాలలో, కారణత్వేన :- ఉపాదాన కారణం రూపంలో ఉంటుందని, యధా వ్యపదిష్టో క్తేః :- ప్రకృతి గురించి ఇది వరకు చెప్పం. చ:- కూడా,
భావం :- ఆకాశం మొదలైన మహత్ తత్త్వ నామ రూపాత్మకమైన సమస్త కార్య పదార్ధాలలో ఉపాదాన కారణం రూపంలో ఉంటుందని ప్రకృతి గురించి చదివాము. కనుక ప్రకృతి జగత్తుకు స్వతంత్రకారణం కాజాలదు.
వివరణ:- సకల చరాచరజగత్తుకు కారణం బ్రహ్మ. ఇందులో సందేహం లేదు. ఆకాశాది పంచభూతాలను కూడా పరబ్రహ్మ కారణం అని ఉపనిషత్తులలో చెప్పబడింది. ఒకవేళ ఎక్కడైనా క్రమంలో తేడా ఉండవచ్చును. అంటే పంచభూతలలో ముందుగా ఆకాశం, వాయువు, అగ్ని, జలము, పృధివి ఉద్భవించాయి. అయితే కొన్ని చోట్ల ముందుగా తేజస్సు ఉద్భవించిందని చెప్పారు. ఏమైనా ఈ పంచభూతాలకు కారణం బ్రహ్మమే. అలాగే పరమాత్మ సర్వజ్ఞుడు, సర్వేస్వరుడు, సర్వాత్మ, అద్వితీయుడు అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. కాబట్టి జగత్తుకు కారణం బ్రహ్మ తప్ప వేరొకటి లేదు. కొన్ని చోట్ల ఆకాశంలో సృష్టి మొదలైనదని చెప్పబడింది. కొన్ని చోట్ల తేజస్సుతో మొదలైనదని వినబడుతోంది. కొన్ని చోట్ల ఆత్మ లోకాలను సృజించిందని, స్వర్గం అంతరిక్షంలోను, మర్థ్యలోకం, పాతాళ లోకం సృష్టించిందని చెప్పబడుతోంది. కొన్ని చోట్ల ప్రారంభంలో ఇది కూడా అసత్ గానే ఉండేది. దాని నుండి సత్(ఎప్పుడు ఉండేది, పరబ్రహ్మ) పుట్టినది. ప్రారంభంలో ఇది కూడా అసత్ గానే ఉండేది. అది శుద్ధసద్రూపబ్రహ్మగా అయినది. అది జగత్తుగా మారినది. పూర్వం ఏమి లేని సృష్టి పఠించబడినది. కొన్ని చోట్ల కొందరు ప్రారంభంలో ఇదంతా అసత్తుగానే శూన్యంగానే ఉండేది అని అంటారు. సత్ నుండి అసత్ ఎలా పుట్టింది? ప్రారంభంలో అది సత్ గానే ఉండేది అని అసత్ వాదాన్ని నిరాకరించి సత్పూర్వకమైన జగత్ సృష్టి చెప్పబడుతోంది. ఈజగత్తంతా పూర్వం అవ్యాకృతంగా ఉండేది. అది నామరసాల చేత వ్యాకృతం (వేరు వేరుగా ఉన్నదని) అయినది. అది జగత్తు తనంతట తానే వ్యాకృతమైనదని, నామ రూపాలతో వివక్తమైనదని చెప్పబడుతోంది. ఈ విధంగా అనేక రకాలైన విప్రతిపత్తి కనబడుచున్నది. కర్మ విషయంలో వికల్పం ఉన్నా, వస్తువుల విషయంలో వికల్పం కుదరదు. కనుక వేదాంతవాక్యాలు జగత్కారణాన్ని నిర్ధారణ చేస్తాయని చెప్పడం న్యాయం కాదు. సత్తా, అసత్తా వికల్పాలు కుదరవు. కొన్నిచోట్ల ఆకాశం ముందు పుట్టిందని, కొన్నిచోట్ల తేజస్సు పుట్టినదని చెప్పడంలో, కార్యం విషయంలో వేరుగానే కనబడుతోంది. ఒక కార్యాన్ని బట్టి దాని కారణాన్ని , దానినిబట్టి దాని కారణం వెతుకుతూ పోతే చివరకు మూలకరణమైన బ్రహ్మను గుర్తించవచ్చును.
సూత్రం :- 121
"సమా కర్షాత్" సమాకర్షాత్ అంటే గ్రహించడం
భావం :- సత్ అంటే బ్రహ్మమే. ఈ సత్ రూపకమైన జగత్తు బ్రహ్మమూలకమే. బ్రహ్మకారణంగా ఉన్నది. గ్రహించడం, అన్వయం చేసుకోవడం, పూర్వవాక్యాలలో ఉన్న బ్రహ్మశబ్దాన్ని అన్వయం చేసుకోవాలని భావం.
వివరణ :- ఈ సృష్టి అంతా సత్ నుంచి జరిగిందని ఒక చోట, అసత్ నుంచి జరిగిందని మరొక చోట, చెప్పబడింది. ఇది సమాకర్షణ, దీని వలన ఇబ్బంది ఏమి లేదు. సృష్ఠికి పూర్వం ఈజగత్తంతా అసత్తుగానే ఉండేది. అంటే శూన్యంగానే ఉండేది. అసత్తుతో నిండి ఉండేది. అంతే కాని సృష్ఠికి కారణం అసత్ కాదు. బ్రహ్మను అసత్ అనుకున్నవాడు తాను కూడా అసత్తే అవుతాడు. ఎవడు బ్రహ్మను సద్వస్తువు అనుకుంటాడో తను కూడా సద్వస్తువు అవుతాడు. అది సత్యం, నిత్యం అన్నారు. ఈప్రకృతి సత్యము కాదు. నిత్యము కాదు. సత్యం, నిత్యము అయినది బ్రహ్మ ఒక్కటే. దానికి జరా మరణములు, ఆధ్యంతములు లేవు. అదే శాశ్వతమైనది. కాబట్టి ఈజగత్తు సృష్ఠికి బ్రహ్మతప్ప వేరేది కారణం కాదు. ఛందోగ్యోపనిషత్తు:-(3,19,1):- ఇది ముందు అసత్ అయి ఉండేది. తరువాత సత్ అయింది. వీటిని బట్టి బ్రహ్మమే సృష్ఠికి కారణమని ఎలా చెప్పగలం? అంటే తైత్తరీయంలో, ఛందోగ్యంలో ఉన్న అసత్ శబ్దం అంతకు ముందు నిర్దిష్టమైన బ్రహ్మ ఆకర్షణ (సమాకర్షాత్) వల్ల సృష్టి జరిగిందని గ్రహించాలి. తైత్తరీయోపనిషత్తు:-(2,7):- సృష్ఠికి పూర్వం ఇది అసత్ గానే ఉంది. తరువాత సత్ గా పరిణమించింది. బ్రహ్మవేత్త పరాన్ని పొందుతాడు. ఆనందమయమైన బ్రహ్మం జీవుడుకి అంతరాత్మ. సమాకర్షణ వలన జగత్తుకు మూలకారణం బ్రహ్మయని అన్వయం చేసుకోవాలి.
జగ ద్వాచిత్వాధికరణం :- ( 1, 4 , 16 )
సూత్రం :- 122
"జగ ద్వాచిత్వాత్"
జగత్ :- సృష్టి రచన రూపకమైన కర్తనే , జగత్ అని , వాచిత్వాత్ :- కౌషీతకీ బ్రాహ్మణంలో అన్నారు.
భావం :- సృష్టిరచనా రూపకమైన కర్తనే జగత్తు అనీ కౌశీతకీ బ్రహ్మణంలో అన్నారు. అంతే కాని జడప్రకృతి జగత్కర్త కాదు. చైతన్య రూపమైన ఈశ్వరుడే కర్త.
వివరణ :- గురువుగారు! బృహదారణ్యకోపనిషత్తులో బాలాకి ఉదంతం ఉంది. గార్గ్య గోత్రంలో పుట్టిన బాలాకి అనే ముని ఒకరోజు గర్వంతో, ఆకాలంలో కాశీకి రాజుగాఉన్న అజాతశత్రువు వద్దకు వెళ్లి నీకు బ్రహ్మాన్నిగురించి చెబుతాను అంటాడు. దానికి రాజు సంతోషపడి నీవు బ్రహ్మగురించి చెబితే నీకు వెయ్యి రూపాయలు ఇస్తాను అంటాడు. అప్పుడు బాలాకి సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు, ఆకాశం, వాయువు, జలము, దిక్కులు మొదలైన వాటిలో ఉండే పురుషుడే బ్రహ్మం అన్నాడు. అవి ఏవి బ్రహ్మ కాదు అంటాడు అజాతశత్రువు. ఆదిత్యుడిలో ఉన్న పురుషుడు పరిచ్చిన్నం అవుతాడు. కనుక బ్రహ్మ కానేరడు అని నిరసించి, నీవు నాకు బ్రహ్మం గురించి బోధిస్తానని అబద్ధాలాడావు. నీవు బ్రహ్మవాదివి కావు అన్నాడు రాజు. ఆ మాటలు విన్న బాలాకి రాజునే మంత్రోపదేశం చెయ్యమని కోరతాడు. మానవుడు నిద్రిస్తున్నప్పుడు ఇంద్రియాలన్నీ అతని ప్రాణంలో కలిసిపోతాయి. ఆత్మ స్వప్నావస్థలో ఉన్నప్పుడు దాని కర్మఫలాలు ప్రారంభం అవుతాయి. స్వప్నస్థితిలో ఆత్మ మహారాజులా ఉంటుంది. గొప్ప బ్రాహ్మణుడిలా ఉంటుంది. దేవతలవలే ఉచ్చస్థితి, ఆసురుల వలె నీచస్థితి పొందుతుంది. రాజు గారు దేశంలో సంచరించినట్లే ఆత్మ శరీరంలో స్వేచ్ఛగా విహరిస్తుంటుంది అని చెప్పబడినది. ఓ బాలాకి ! ఎవరు ఈపురుషులకు కర్త? ఈకర్మ ఎవరిదో? ఆయన్నే తెలుసుకోవాలి. ఈవాక్యంలో కర్త ఎవరు? జీవుడా? బ్రహ్మమా? ప్రాణమా? కర్మ అంటే వ్యాపారం. దానికి ప్రాణం కావాలి. ప్రాణం ఉన్నంత వరకే శరీరం ద్వారా కర్మ జరుగుతుంది. కనుక ప్రాణమే తెలుకోదగినది కదా! లేదా కర్మచేసేవాడు జీవుడు. కర్మ అంటే పుణ్యపాపాలు. అవి చేసే జీవుణ్ణి తెలుసుకోవాలి కదా! అంటే పైవాక్యాలను సందరదోచితంగా పరిశీలిస్తే తెలియవలసినవాడు బ్రహ్మమని, ఆయన చేసే కర్మ జగత్ సృష్టి అని తెలుస్తోంది. ఎవరు ఆదిత్యాది పురుషులకు కర్తో, ఎవరి కర్మ జగత్తో, ఆయనే తెలుసుకోదగినవాడు. ఈ సంవాదంలో భగవత్కర్మ జగత్తని తెలుస్తోంది. అంతే తప్ప ప్రాణం, జీవాత్మ జగన్నిర్మాణకర్తలు కారు. కనుక కౌషీతకంలో ఉన్న పురుషుడు బ్రహ్మమే కానీ జీవుడు, ప్రాణాలు కావు.అని చెప్పాడు కాశీరాజు.
సూత్రం :- 123
"జీవ ముఖ్య ప్రాణలింగా న్నేతి తత్ వ్యాఖ్యాతమ్"
జీవముక్త ప్రాణలింగాత్ :- బాలాకి, అజాత శత్రువుల సంవాదంలో జీవుణ్ణి, ముఖ్య ప్రాణాలను సూచించే లక్షణాలు ఉన్నాయి. న :- బ్రహ్మ జ్ఞేయం అంటే తెలుకోతగ్గది కాదు. ఇతి చేత్ ;- అని అంటారా ? తత్ వ్యాఖ్యానం :- ఈ విషయాన్ని నిరాకరిస్తూ ముందే వ్యాఖ్యానించాం కదా!
భావం :- బాలాకి అజాత శతృవుకి జరిగిన సంవాదంలో జీవుణ్ణి ముఖ్య ప్రాణాన్ని సూచించే చర్చ జరిగింది. కనుక ప్రాణం ఉన్న జీవుడి గురించే తెలుసుకోవాలి కానీ బ్రహ్మాన్ని కాదు అని అనుకుంటే ఈ విషయం ముందు సూత్రాలలో చెప్పడం జరిగింది కదా!
వివరణ :- కౌషీతకీ బ్రాహ్మణము:-(4,20):- యజమాని తన భృత్యుల ద్వారా విషయాన్ని అనుభవిస్తాడు. యజమాని ఇచ్చిన అన్నవస్త్రాల ద్వారా భృత్యులు యజమానిని అనుభవిస్తారు. అలాగే జీవుడు ఆదిత్యాది పురుషులు ఇచ్చే ప్రకాశాదుల ద్వారా విషయాన్ని అనుభవిస్తాడు. ఆదిత్యాదులు కూడా జీవులు అర్పించే హావిస్సు మొదలైనవి స్వీకరించి జీవుణ్ణి అనుభవిస్తారు. ఈవాక్యంలో జీవాత్మ ప్రసక్తి ఉంది. అలాగే(4,19) సుషుప్తిలో ప్రాణంతోనే ఏకీభవిస్తుంది అనే వాక్యంలో ప్రాణప్రసక్తి ఉన్నది. కనుక తెలియవలసిన తత్త్వం జీవాత్మ కానీ ముఖ్యప్రాణం కానీ కావాలి కదా! అంటే జీవముఖ్య (1,1,31) అనే సూత్రంలో జీవ, ముఖ్య ప్రాణాల గురించి వివరణ ఉన్నది. జీవుడికి ముఖ్య ధర్మాలు ఉన్నాయి. ప్రాణ శబ్దం బ్రహ్మ వాచకం కాదు. ఎందుకంటే జీవోపాసన, ప్రాణోపాసన, బ్రహ్మోపాసన అని 3 ఉపాసనాలు చెయ్యాలి. అవి హితంకాదు. బ్రహ్మోపాసన ఒక్కటే చెయ్యాలి. వాక్కును కాదు, వక్తను తెలుసుకో, అనే వాక్యంలో జీవాత్మ స్పష్టంగా తెలుస్తోంది. వాక్ ఇంద్రియ వ్యాపారం జీవాత్మకు చెందినదే. అప్పుడు ప్రాణశబ్దం జీవాత్మకు సంబంధించినది కదా! ప్రజ్ఞాత్మ అయిన ప్రాణమే శరీరాన్ని ధరించి మేలుకొలుపుతున్నది. ఈ వాక్యంలో శరీరాధారణ అనే ధర్మం ఉంది. అప్పుడు ముఖ్యప్రాణం జీవాత్మకు వర్తిస్తుంది. ముఖ్యప్రాణ ధర్మం ఉన్నదని ప్రాణశబ్దం బ్రహ్మవాచకం కాదు. కేనోపనిషత్తు:- జీవి యొక్క ముఖ్య ప్రాణం పరబ్రహ్మమే. ఆత్మ నుండి ప్రాణం పుడుతుంది.శరీరాన్ని ఆశ్రయించి నీడలా ఆత్మపైన ప్రాణం వ్యాపించి ఉన్నది. నీడకు స్వతంత్రమైన అస్తిత్వం లేనట్లే ప్రాణానికి కూడా స్వతంత్రమైన అస్తిత్వం లేదు. మనస్సులో పుట్టిన సంకల్పవికల్పాల వలనే ఇది శరీరంలోకి వస్తుంది. కాబట్టి ప్రాణం పరబ్రహ్మ నుండి పుడుతుంది. ఆ పరబ్రహ్మను ఆశ్రయించి ఉన్న ప్రాణం కూడా పరబ్రహ్మ స్వరూపమే. ప్రాణమే ప్రజ్ఞాత్మ .ఆనందం, అమృతమయం. ప్రాణికోటిలో ఏ జీవికూడా ప్రాణంతోనే జీవించదు. అపానంతో అంతకన్నా జీవించదు. ఈ రెండింటికి ఆశ్రితమైన దానివలన జీవిస్తున్నాయి. అదే బ్రహ్మ. వామదేవుడు ఈ ప్రజ్ఞాత్మయే ఆనందం, అజరం, అమృతం అన్నారు. ముఖ్యప్రాణం జీర్ణమైపోయింది. అజరం, అమరం రెండూ బ్రహ్మానికే వర్తిస్తాయి. ఉపదేశం అంటే బ్రహ్మోపాసనే అని తెలియజేశారు.
సూత్రం :- 124
"అన్యార్ధం తు జైమినిః ప్రశ్న వ్యాఖ్యా నాభ్యా మపి చైవ మేకే"
తు:- కాగా, జైమినిః:- జైమిని, అన్యఅర్ధం :- కౌషీతకీబ్రాహ్మణ ప్రకరణంలో జీవాత్మ, ముఖ్య ప్రాణాల వర్ణన వేరే ప్రయోజన నిమిత్తంచేశాడు. అపిచ :- అంతేకాక, ఏకే :- కొందరు వాజసనేయులు, ప్రశ్నవ్యాఖ్యానాభ్యాం :- ప్రశ్నోత్తరాల మూలంగా, ఏవం :- ఈ విధంగానే, ప్రతిపాదిస్తున్నారు.
భావం:- కౌషీతకీ బ్రాహ్మణ ప్రకరణంలో జీవాత్మ, ముఖ్య ప్రాణాల వర్ణన బ్రహ్మ ప్రతిపత్తి కోసం చెయ్యడం జరిగిందని జైమిని మహర్షి చెప్పాడు. కొందరు వాజసనేయులు ప్రశ్నోత్తరాల మూలంగా ఈ విధంగానే ప్రతిపాదిస్తున్నారు.
వివరణ:- కౌషీతకీ బ్రాహ్మణంలో ఉండే ప్రశ్నోత్తరాలను చూసినప్పుడు మధ్యలో జీవాత్మను కీర్తించడానికి కారణం బ్రహ్మ జ్ఞానాన్నీ ప్రతిపాదించడానికి అని తెలుసుకోవాలి.
కౌషీతకీబ్రాహ్మణము:-(4,19):- బాలాకిని నిద్రపోతున్న బ్రాహ్మణుడి దగ్గరకు తీసుకొని వెళ్లి అతనిని లేపమన్నాడు రాజు. అతన్ని ప్రాణం పేర్లతో సంభోదించి మేల్కొలపడానికి ప్రయత్నించాడు. కానీ అతను లేవలేదు. అతన్ని కర్రలతో పొడిచి లేపితే లేచి కూర్చున్నాడు. ఓ బాలాకీ! ఈ పురుషుడు విశేషజ్ఞానం ఏది లేకుండా దేని మీద శయనించాడు? ఈ పురుషుడు ఈ విధంగా కలసిపోయినట్లుగా ఎక్కడ ఉన్నాడు? అనగా ఎవరితో ఐక్యం పొందాడు? ఈ విధంగా ఎక్కడనుండి తిరిగి వచ్చాడు? అని అడిగాడు. జీవుడు నిద్రిస్తుండగా ఇంద్రియాల యొక్క విషయాన్ని గ్రహించి సుషుప్తిలో ప్రాణాన్ని చేరతాడు. అప్పుడు చక్షు, శ్రోతమ్, మొదలైన ఇంద్రియాలు తమతమ విషయాలతోపాటు అతడితో ఏకీభవిస్తాయి. పురుషుడు మళ్ళీ మేలుకొన్నప్పుడు మళ్ళీ ఆఇంద్రియాలు ప్రజ్వలించే అగ్నినుండి వెలువడే నిప్పుకణికల వలె తమ పనులు ప్రారంభిస్తాయి. ఈ వాక్యాన్ని బట్టి జీవుడు సుషుప్తిలో అవిభక్త రూపంలో ఎక్కడ ఉంటాడో, జాగ్రదావస్థలో ఎవరి నుంచి వేరవుతాడో,అతనే కర్త అని, ఆయనే తెలుసుకోవలసిన వాడని స్పస్టమౌతోంది. సుషుప్తిలో జీవుడు పరమాత్మతో, అవిభక్త రూపంలో ఉంటాడని ఉపనిషత్తులంటున్నాయి. నిద్రిస్తుండగా ఇంద్రియాల యొక్క విషయాన్ని గ్రహించి, జీవి హృదయాకాశంలో నిద్రిస్తాడు. అదే పరమాత్మ ఉండే చోటు. నిద్రావస్థలో ఉన్నప్పుడు పురుషుడు అంటే ఆత్మ శరీరం ఇంద్రియాలను తనలో లీనం చేసుకుంటాడు. ప్రాణాలన్నింటిని తనలో ఆకర్షించుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఆకర్షించే పురుషుడే బ్రహ్మ. వాజసనేయులు సైతం బాలాకి అజాత శత్రువు సంవాదాల ద్వారా ఈఅంశాన్ని స్పష్టం చేశారు. ఈ విజ్ఞానపురుషుడు ఎక్కడ ఉన్నాడు? ఈ విధంగా ఎక్కడినుంచి వచ్చాడు? అనే ప్రశ్నలలోను, హృదయం లోపల ఏ ఆకారం ఉన్నదో దానిలో శయనిస్తున్నాడు. అని ప్రతి వచనంలోను పరమాత్మని చెబుతున్నాడు. వాజసనేయులు సైతం బాలాకి అజాత శత్రువు సంవాదాల ద్వారా ఈ అంశాన్ని స్పష్టం చేశారు. ఈ విజ్ఞానపురుషుడు ఎక్కడ ఉన్నాడు? ఈ విధంగా ఎక్కడినుంచి వచ్చాడు? అనే ప్రశ్నలలోను, హృదయం లోపల ఏ ఆకారం ఉన్నదో దానిలో శయనిస్తున్నాడు. అని ప్రతి వచనంలోను పరమాత్మని చెబుతున్నాడు. ఆకాశ శబ్దం పరమాత్మలోనే అనే అర్థం లో ప్రయోగించబడింది.అన్ని ఆత్మలు కూడా పైకి వస్తున్నాయి. ఆత్మలన్ని మరొక చోటు నుండి లేస్తున్నాయి, పరమాత్మయే దానికి కారణం.సుషుప్తి పురుషుణ్ణి లేపడం ద్వారా జీవుడు ప్రాణాదులు కంటే భిన్నుడు అని తెలియజేశారు.
వాక్యాన్వయాధికరణం :- ( 1, 4, 19 )
సూత్రం :- 125
"వాక్య సమన్వయాత్"
వాక్య:- ఐతరేయోపనిషత్తులో జగత్ స్రష్టగా వర్ణించిన ఆత్మకూడా బ్రహ్మమే అని, సమన్వయాత్ :- పూర్వాపర వాక్య సమన్వయం వలన తెలుస్తోంది.
భావం :- ఐతరేయ బ్రాహ్మణంలో జగత్ స్రష్టగా వర్ణించిన ఆత్మ కూడా బ్రహ్మమే నని పూర్వాపర వాక్యసమన్వయం వలన తెలుస్తోంది.
వివరణ :- గురువుగారు! శృతులలో చెప్పిన ఆత్మ శబ్దం జీవిని సూచిస్తుందా? పరమాత్మను సూచిస్తుందా? వివరించండి? అని అడిగాడు కృష్ణశర్మ. రత్నాకరుడు చెప్పడం ప్రారంభించాడు. వాక్యాలకు అన్నింటికీ పరబ్రహ్మయందే అన్వయం కుదురుతుంది. శ్రవణ, మనన,నిధి ధ్యాసలకు యోగ్యమైనది బ్రహ్మమే.
బృహదారణ్యకోపనిషత్తు:- యాజ్ఞవల్కుడు, మైత్రేయి కథ:- యాజ్ఞ వల్కుడు సన్యాసం స్వీకరించాలనే కోరికతో తన ఇద్దరు భార్యలకు తన ఆస్తిపాస్తులను పంచుతానంటాడు. రెండవభార్య అయిన మైత్రేయి ఈ సిరిసంపదలు నాకు వద్దు. నేను దేనివల్ల అమృతురాలను కానో అలాంటి ధనాన్ని నేను ఏమి చేసుకుంటాను? పూజ్యుడవైన నువ్వు నీకు తెలిసిన బ్రహ్మ విద్యను ఉపదేశించు అని అమృతత్త్వాన్ని కోరుకుంది మైత్రేయి. అప్పుడు యాజ్ఞవల్కుడు ఆమెకు ఆత్మవిజ్ఞానం బోదిస్తాడు. మైత్రేయి ! ఆత్మ ప్రయోజనం కోసమే ఒకరికొకరు ప్రియమౌతారు. భార్య భర్తను ప్రేమిస్తుంది. అంటే ఈ ప్రేమ ఆమె భర్త కోసం కాదు. భార్య ప్రయోజనం కోసమే. ద్రష్టవ్యుడిగా, శ్రోత్రవ్యుడిగా చెప్పబడుచున్నది విజ్ఞానాత్మయా? లేక పరమాత్మయా? అనే సందేహం ఎందుకు కలిగింది? ఆత్మవిజ్ఞానం చేతనే సర్వమూ తెలుస్తుంది. ఆత్మ ఒక్కటే చూడదగినది, వినదగినది, మననం చేయదగినది, ధ్యానం చేయదగినది. దర్శన, శ్రవణ, మనన విజ్ఞానంతో అంతా తెలుస్తుంది. విజ్ఞానమయుడైన ఆత్మయే సమస్త భూతాలకు అధిపతి. సమస్త భూతాలకు రాజు. సమస్త దేవతలు, లోకాలు, ప్రాణాలు, అన్ని పరమాత్మలోనే ఇమిడి ఉన్నాయి. ఆ ఆత్మయే పరబ్రహ్మ అని తెలుసుకోవాలి. ఆత్మ అంటే జీవుడి గురించి కాదు. జీవ విజ్ఞానం వలన అమృతత్త్వం లభించదు. ఆత్మ జ్ఞానం చేతనే సమస్తం తెలుస్తుంది కనుక దృష్టవ్యుడు పరమాత్మే. కానీ వేరెవరు కాదు. ఎవడు బ్రహ్మ ఆత్మ కంటే భిన్నమైనదని భావిస్తాడో, వానికి బ్రహ్మ జన్మరాహిత్యం కలుగజేయడు. క్షణికాధికమైన ఈ జగత్తు ఆత్మ కంటే భిన్నంగా స్వతంత్రంగా ఉన్నది అని అనుకుంటారో, వారిని శ్రేయోమార్గం నుండి దూరం చేస్తుంది. ఇక్కడ సమస్త వస్తు సముదాయం కూడా ఆత్మ కంటే భిన్నంగా లేదు అని విషయాన్ని అవతరింపజేస్తాడు. దుందుభి దృష్టాంతం:- దుందుభి, శంఖం, వీణ మొదలైన వాద్యాలన్నీ ఒక్కసారి మ్రోగించినప్పుడు ఒక సామాన్యమైన ధ్వని మాత్రమే వినిపిస్తుంది. దుందుభ్యాదుల విశేషధ్వనులు ఆ సామాన్యధ్వనిలో లీనమైపోతాయి. అందుచేత వాటి యొక్క ధ్వనులు వినబడుతూనే ఉంటాయి. ఈ సామాన్యధ్వని మీద విశేషధ్వనులు ఆరోపించబడతాయి. అదే విధంగా ఆత్మ యొక్క భావం చేత భాసింపబడే సర్వమూ కూడా ఆత్మ మాత్రమే. ఆత్మ కంటే భిన్నం కాదు అని దుందుభి దృష్ఠంతం చెప్పబడింది. అన్ని జలాలకు సముద్రమే ఏ విధంగా ఏకైక స్థానమో అట్లే సకల ప్రపంచ ప్రళయం పొందే ఏకైక స్థానం బ్రహ్మయే.
ఐతరేయోపనిషత్తు:- సృష్ఠికి ముందు ఆత్మ, జగత్తు ఒక్కటిగా ఉండేది. లోకాలను సృష్టించాలని ఆత్మ సంకల్పించి, సృష్టించింది. అదే ఆత్మ బ్రహ్మరంధ్రం ద్వారా శరీరంలోకి ప్రవేశించింది. లోకాలను సృజించే శక్తి సామర్ధ్యం జీవాత్మకు లేవు. అందుకే ఆత్మశబ్దం బ్రహ్మవాచకం. లోకరచన, దర్శన, శ్రవణాది శక్తులను సంపన్నం చెయ్యడం జీవాత్మకు తెలియదు. లోక స్రష్ట అయిన పరమాత్మే చేయగలడు. జీవాత్మ కర్మబద్ధుడై కర్మ ఫలం అనుభవించడానికి పరమాత్మ నియమించిన శరీరంలో పరతంత్రుడై ప్రవేశిస్తాడు. పరమాత్మ సర్వ వ్యాపకుడు, కనుక శరీరంలో కూడా ఉంటాడు.
సూత్రం :- 126
"ప్రతిజ్ఞా సిద్ధేర్లింగ మాశ్మరధ్యః"
ప్రతిజ్ఞాసిద్ధే:-ఐతరేయంలో చేసిన ప్రకటన సిద్ధించడానికి, లింగం:- తనతో అవిభక్తముగా ఉండే జీవాత్మతో పాటు ఈశ్వరుడు శరీర ప్రవేశం చేయడమే తార్కాణం అని, ఆశ్మరద్యః :- ఆశ్మరధ్యాచార్యుని సిద్ధాంతo.ఈ విషయంలోవ్యాసుడు ముగ్గురు ఆచార్యుల అభిప్రాయాలను వరుసగా చెబుతున్నాడు.
భావం :- ఐయితరేయంలో చేసిన ప్రకటన సిద్ధించడానికి తనతో అవిభక్తముగా ఉండే జీవాత్మతోబాటు ఈశ్వరుడు జీవుడి శరీరంలోకి ప్రవేశించాడు అనేదే ఆశ్మరధ్యాచార్యుని సిద్ధాంతం.
వివరణ :- ఆత్మావా ఇదమగ్ర ఆశీత్ :- ఐతరేయోపనిషత్తులో సృష్ఠికి ముందు ఆత్మ, జగత్తు ఒక్కటిగా ఉండేవని చెప్పబడింది. లోకాలను సృష్టించాలని ఆత్మ సంకల్పించడం, సృష్టించడం జరిగింది. లోకాలను సృష్టించే సామర్ధ్యం బ్రహ్మకు తప్పమరెవరికి లేదు. తరువాత పరమాత్మ, జీవాత్మతో పాటు శరీర ప్రవేశం చేసినట్లు ఉంది. జీవాత్మ, పరమాత్మలు వేరు వేరుగా శరీరంలో ప్రవేశించలేదు. ఒక్కటిగానే వెళ్లాయి. అందువలన జగత్ స్రష్ట అయిన ఆత్మ బ్రహ్మమేనని అశ్మరధుడు అంటున్నాడు. ఇక విజ్ఞానం వలన సర్వమూ తెలుస్తుంది. ఇలాంటివి జీవునితో ప్రారంభించడం అనేది సంప్రదాయమని అశ్మరధ్యాచార్యులు చెబుతున్నాడు. ఆత్మ విజ్ఞానం తెలిస్తే ఈదృశ్య జాతమంతా తెలుస్తుంది. ఆత్మయే సమస్తమని ఉపనిషత్తులలో చెప్పబడింది. ఇక్కడ ఆత్మ అంటే జీవాత్మ కాదు. పరమాత్మ అని అర్ధం. జీవాత్మ ద్రష్టవ్యం, శ్రోతవ్యం ఇత్యాది విధంగా చెప్పడం ఆ ప్రతిజ్ఞ యొక్క సిద్ధిని సూచిస్తుంది. విజ్ఞానాత్మ(జీవుడు) పరమాత్మకంటే అన్యుడైతే పరమాత్మను తెలుసుకున్నా కూడా విజ్ఞానాత్మను తెలుసుకొనడం ఉండదు. అందువల్ల ఆప్రతిజ్ఞ సిద్ధించడం కోసం విజ్ఞానాత్మ పరమాత్మలలో ఉన్న అభేదాంశాన్ని పురస్కరించుకొని ఈఘట్టం ప్రారంభించబడిందని అశ్మరాధ్యచార్యుడి అభిప్రాయం. జీవుడు, బ్రహ్మ మధ్య భేదం, అభేదం కూడా ఉంది. అభేదంశాన్ని దృష్టిలో పెట్టుకొని జీవుడితో ప్రారంభించి ఏకవిజ్ఞానేన సర్వవిజ్ఞానాను సమర్ధించబడిందని ఆచార్యుని అభిప్రాయం.
వాక్యాన్వయాధికరణం :- ( 1, 4, 21)
సూత్రం :- 127
"ఉత్క్ర మిష్యతి ఏవం భావాత్ ఔడు లోమిః"
ఉష్క్ర మిష్యతః :- శరీరాన్ని విడిచి మోక్షపథంలో జీవుడు, ఏవం భావాత్:- పరమాత్మతో ఐక్యం కుదురుతుంది. ఔడు లోమిః:- ఔడు లోమి చెబుతున్నాడు.
భావం:- శరీరాన్ని విడిచి మోక్షపథంలో జీవుడు పరబ్రహ్మలో ఐక్యం అవుతాడు. కనుక జీవుడితో పాటు బ్రహ్మం శరీర ప్రవేశం చేసినట్లు ఔడు లోమీ ఆచార్యుడికి అభిప్రాయం.
వివరణ :- ఆత్మ సాక్షాత్కారం జరిగిన తరువాత ఈ దేహాన్ని విడిచిన జీవాత్మ పరమాత్మతో లీనమౌతుంది. కాబట్టి ఔడు లోమి ఆచార్యుడు భవిషత్తులో జరగబోయేదానిని ముందుగానే ఊహించి జీవునితో వాక్యం ప్రారంభించడం తప్పు కాదు అంటాడు ఔడులోమి ఆచార్యుడు. దేహేంద్రియ మనోబుద్ధుల సంఘాతం అనే ఉపాధితో సంపర్కం వలన కలుషితమై పోయిన జీవుడే జ్ఞానంపొంది, ధ్యానం మొదలైన సాధనాలతో అనుష్టించి, నిర్మలుడై దేహాది సముదాయం నుండి పైకి వెళ్ళిపోయినప్పుడు పరమాత్మతో ఐక్యం చెందుతాడు. ఈవిధంగా జీవ పరమాత్మలు అభేదంతో ఉపక్రమం చేయబడిందని ఔడులోమీ అభిప్రాయపడ్డాడు.
ముండకోపనిషత్తు:- ప్రవహిస్తున్న నదులు తమ నామరూపాలను విడిచి ఏ విధంగా సముద్రంలో లీనమైపోతాయో, అట్లే జ్ఞానవంతుడు తన నామరూపాలను విడిచి, దివ్యడైన పరాత్పరుణ్ణి చేరతాడు. ఇత్యాది శృతులు నదులను ఉదాహరణగా చూసి జీవునికి నామరూపాలు ఉన్నాయి అని చెబుతారు. ఏవిధంగా నదులు తమకున్న నామరూపాలును విడిచి సముద్రంలో లీనమై పోతాయో, అట్లే జీవుదు కూడా తనకున్న నామరూపాలను విడిచి పురుషుణ్ణి చేరతాడు అని అర్ధం. జీవుడికి సంసారదశ సత్యమే, ఆదశలో భేదం కూడా సత్యమే. మోక్షంలో జీవుడు పరమాత్మలో అవిభక్తుడై ఉంటాడని, వాక్యాన్ని బట్టి ఐతరేయంలో బ్రహ్మ శరీర ప్రవేశం చేసినట్లుగా వర్ణించారని ఔడులోమీ అభిప్రాయపడ్డాడు.
సూత్రం :- 128
"అవస్థితే రితి కాశ కృత్స్నః "
అవస్థితే :- బ్రహ్మ శరీరంలో స్థితుడై ఉండటం వల్ల, శరీరంలో జీవాత్మతో బాటు ప్రవేశించినట్లు వర్ణించారు. ఇతి :- అని, కాశ కృత్స్న:-కాశకృత్స్నఆచార్యుడి అభిప్రాయం. చిదచిదాత్మకమైన ఈ జగత్తు సమస్తం పరబ్రహ్మానికి శరీరం లాంటిది.
భావం ..బ్రహ్మ శరీరంలో ఉండటం వలన జీవుడితో బాటు శరీరంలో ప్రవేశించినట్లు వర్ణించారు.
వివరణ,,అధర్వ వేదం :- ఆయనకు భూమి పాదం, అంతరిక్షం -ఉదరం, దివం :-శిరస్సు.
బృహదారణ్యకోపనిషత్తు:-ఇలా శాస్ట్రాల్లో జీవప్రకృతులు రెండు బ్రహ్మానికి శరీరాల్లాగావర్ణన ఉంది.వాస్తవానికి శరీరం, జీవుడు రెండూ వేరు అయినా అగ్ని లోహ పిండాలాగా అవిభాజ్యంగా ఉంటాయి. శరీరం లో ఉండే జీవుడు ఇంటిలో ప్రవేశించేటప్పుడు శరీరంతో బాటే వెడతాడు. అలాగే జీవరూపశరీరసహితమైన బ్రహ్మం పాంచభౌతికశరీరంలో ప్రవేశించేటప్పుడు జీవుడితోబాటు ప్రవేశిస్తున్నట్లు ఉపదేశించారని కాశకృత్స్నుడి మతం. అవిద్య ,అజ్ఞానములలో వచ్చిన భేదభావం వల్ల ఆపరబ్రహ్మ జీవరూపంలో ఉన్నాడు. అందుచేతనే జీవాత్మతో వాక్యం ప్రారంభమైనది. కాబట్టి తెలుకోదగినవాడు పరమాత్మ తప్ప వేరెవరు కాదు. వ్యాసులవారు ముగ్గురు ఆచార్యుల అభిప్రాయాలను వరుసగా వ్యక్తపరుస్తున్నారు.
ఆశ్మరధ్యాచార్యుని మతం:-"ఆత్మావా ఇదమగ్ర ఆశీత్" ఆత్మ ఒక్కటే ఉండేది. తరువాత పరమాత్మ జీవాత్మతో పాటు శరీరంలో ప్రవేశించినట్లు ఒక్కటిగానే ప్రవేశించాయి. అందువల్ల జగత్ స్రష్ట అయిన ఆత్మ బ్రహ్మమేనని ఆచార్యుని అభిప్రాయం. జీవబ్రహ్మల మధ్య భేదాలు, ఉన్నప్పటికీ అభేదాంశాన్ని దృష్టిలో పెట్టుకొని జీవునితో ప్రారంభించి ఏక విజ్ఞానేన సర్వవిజ్ఞానాం" అనేది సమర్ధించబడింది.
ఔడులోమి ఆచార్యుని మతం:-జీవ పరమాత్మల మధ్య అవస్థా భేదాన్ని బట్టి సంసార వ్యవస్థలో జీవుడు పంచభౌతికమైన దేహంలో లౌకికవ్యవహారాలలో తాదాత్మ్యం చెంది, సుఖదుఃఖాలకు లోనైనవాడు భగవత్ చింతనతో పరమాత్మలో లీనం అవడం అభేదం స్థితి. తత్త్వమసి నేనే నువ్వు అయి ఉన్నావు అని శరీరాన్ని విడిచి మోక్షపథంలో జీవుడు పరబ్రహ్మ తో అవిభక్తంగా ఉంటాడు. కనుక జీవుడితో పాటు బ్రహ్మ శరీర ప్రవేశం చేసినట్లు ఔడులోమి అభిప్రాయం. నదులన్ని వాటి నామరూపాలు కోల్పోయి సముద్రంలో లీనమైనట్లుగా, మోక్షంలో జీవులందరు పరమాత్మతో లీనమౌతారు.
కాశకృత్స్న ఆచార్యుడి మతం :- ఈ జగత్తంతా పరమాత్మకు శరీరం లాంటిది. ఆయనకు భూమి పాదం, అంతరిక్షం ఉదరం, దివం శిరస్సు గా వర్ణించారు. జీవుడు, ప్రకృతి బ్రహ్మానికి శరీరంగా వర్ణించారు. వాస్తవానికి రెండూ వేర్వేరు. అగ్ని, లోహపిండాల్లా ఉంటాయి. శరీరంతో ఉండే జీవుడు ఇంటిలో ప్రవేశించేటప్పుడు శరీరంతో పాటే వెడతాడు. అలాగే జీవరూప శరీరసహితమైన బ్రహ్మం పాంచభౌతికశరీరంలో జీవుడితో బాటు ప్రవేశిస్తున్నట్లు ఉపదేశించారని కాశకృత్స్నుడి అభిప్రాయం. పరమాత్మ జీవుడిగా ఉన్నాడని బుద్ధి మొదలైన వాటియందు ప్రవేశించి మాట్లాడుతూ వ్యవహరిస్తారని అంటారు. తేజస్సు మొదలైన వాటిని సృష్టించినట్లుగా ఎట్టి వికారాలు లేని పరమాత్మ జీవుడు కాదు అని వారి ఆచార్యుడి మతం.
సూత్రం :- 129
"ప్రకృతిశ్చ ప్రతిజ్ఞా దృష్టాంతాను పరోధాత్"
ప్రకృతిః:- ప్రకృతి, చ:- కూడా, ప్రతిజ్ఞాదృష్టాంత అనుపరోధాత్:- ఈ విషయాన్ని ప్రతిజ్ఞా వాక్యం, దృష్టాంత వాక్యం ధృవపరుస్తున్నాయి.
భావం :-ప్రకృతి జగజ్జన్మాదులకు ఉపాదాన కారణమని దృష్టాంత వాక్యం ధృవపరుస్తోంది.
వివరణ :- గురువు గారూ! ఈ జగత్తుకు బ్రహ్మ ఉపాదాన కారణమా? నిమిత్త కారణమా? కుండలు చెయ్యడానికి కుమ్మరి నిమిత్తకారణం, మట్టి ఉపాదాన కారణం. అలాగే ఆభరణాలకు బంగారం ఉపాదాన కారణం, కంసాలి నిమిత్తకారణం. కుమ్మరి కుండను ఏరకంగా తయారు చేస్తాడో ముందుగా ఊహించి తయారుచేస్తారు. అలాగే స్వర్ణకారుడు బంగారంతో ఏ ఆభరణాలు తయారు చేయాలో ఆలోచిస్తాడు. చాందోగ్యంలో ఈ సృష్టిని గురించి పరబ్రహ్మ ఆలోచించాడు. ఒక్కటిగా ఉన్న పరబ్రహ్మ అనేకరూపాలు కావాలనుకున్నాడు. ప్రశ్నోపనిషత్తులో ఆపరబ్రహ్మ ఆలోచించి ముందుగా ప్రాణాన్ని సృష్టించాడు. ఐతరేయోపనిషత్తులో పరమాత్మ విరాటస్వరూపాన్ని దృష్టిలో ఉంచుకొని తీవ్రమైన ఆలోచన చేసినట్లు చెప్పబడింది. కాబట్టి ఈజగత్తుకు ఉపాదాన కారణం, నిమిత్త కారణం తెలియజేయండి అన్నాడు నారాయణభట్టు. రత్నాకరుడు సమాధానం చెబుతున్నాడు. పరబ్రహ్మ ఈ జగత్తుకు ఉపాదాన కారణం, నిమిత్తకారణం కూడా.
ఛాందోగ్యోపనిషత్తు:- ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ ఉద్ధాలకుడు తన కుమారుడైన శ్వేతా కేతువుతో, నాయనా! శ్వేతకేతూ! శ్రవణ గోచరం కానీ తత్త్వం, ఇంద్రియగోచరమయ్యే విధానం గురించి మీ గురువుగారిని అడిగావా? ఏమిటా విషయం ? అని అడిగాడు. మట్టిని గురించి తెలిస్తే మట్టితో చేసిన రకరకాల వస్తువులకు పేర్లలో తేడా ఉన్నా వాటిని గురించి తెలుస్తుంది. అదే విధంగా బంగారం గురించి తెలిస్తే దానితో తయారుచేసే నగలకు ఏ పేరు పెట్టినా, అందులో ఉన్నది బంగారమే అని తెలుస్తుంది. అలాగే ఏ విషయం తెలుసుకున్నందువలన మనకు అన్ని విషయాలు బోధపడతాయో దాన్ని గురించి తెలుసుకోవాలి. ఇక్కడ ఉపాదానకారణమైన మట్టి సత్యం.అలాగే బ్రహ్మ సత్యం, ఈ జగత్తు ఉపాదానకారణం,నిమిత్త కారణం.కూడా.
కఠోపనిషత్తు:- (5,8):- ఆయన చేతనాచేనాత్మకమైన పదార్ధాలు నిద్రించి ఉన్నప్పుడు మేలుకొని ఉంటాడు. తన సంకల్పంతో జగత్తును నిర్మిస్తాడు. అన్ని నిర్మిత పదార్ధాలకు ఆశ్రయం. ఆయనే శుక్రం, బ్రహ్మం, అమృతం గా వర్ణించారు. ఆయన సంకల్పమే ఈ జగత్తు నిర్మాణానికి ఉపాదాన కారణం. అలాకాక, బ్రహ్మం, ప్రకృతి ఒక్కటే అనుకుంటే జగద్రచన చెయ్యడానికి ఆటంకం ఏర్పడుతుంది.కనుక బ్రహ్మం భోగ్యాలైన జీవులకు అధిష్టానం శుక్రం, అమృతం.అని ఈ ఉపనిషత్తు సారాంశం. (5,9):-అగ్ని భువనంలో ప్రవేశించి ఆయా పదార్ధాల ఆకారాన్ని పొందుతుంది. అలాగే బ్రహ్మం ఒక్కటే అన్ని అనుభూతులకు అంతరాత్మగా వాటి రూపాన్ని పొందడమే కాక వాటి బయట కూడా ఉంటుంది. ఇక్కడ అగ్ని దృష్టతం. బ్రహ్మ జగజ్జన్మాదులకు కారణం కావడం చేత అంతర్యామి రూపంలో ప్రతి పదార్ధంలో ప్రవేశించి, వాటి ఆకారం పొందడమే కాక, పదార్ధల బయట కూడా ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మం తప్ప వేరే ప్రకృతి లేదనుకుంటే ఈ కాటక వాక్యం అసంగతం అవుతుంది. ఈ దృష్టాంతంలో బ్రహ్మం ప్రపంచానికి బయట కూడా ఉండటం వలన బ్రహ్మ నిమిత్తకరణమే కానీ ఉపాదాన కారణం కాజాలదు. ఉపాదాన కారణం కార్యానికి బయట ఉండదు. కాబట్టి ఈ దృశ్య రూప జగత్తుకు ఉపాదాన కారణం ప్రకృతి అనీ, బ్రహ్మం కన్నా భిన్నం అని సూత్రాభిప్రాయం. కేవలం నిమిత్తకరణమే ఉంటుంది ప్రకృతి లేదనుకుంటే జగత్తుకు ఉనికి ఉండదు. బ్రహ్మమే జగత్తుకు ఉపాదాన కారణం అనుకుంటే బ్రహ్మం పరిణామం కావలసి వస్తుంది. బ్రహ్మ నిత్యం,పరిణామి కాదు. బ్రహ్మ నిర్మలం, చేతనం,అయితే జగత్తు మలినం,జడం. కనుక జగత్తుకు ప్రకృతి ఉపాదానకరణ అని అంగీకరిస్తే ప్రతిజ్ఞా,దృష్ష్టాంతలు రెండు సార్ధకం అవుతాయి. బ్రహ్మ నిత్యమే కానీ పరిణామ నిత్యం కాదు. లోకంలో ఏదైనా ఒక పని సఫలం కావాలంటే అనేక కారణాలు అంటే కర్త, కర్మ, కరణం, అధికరణం మొదలైనవి ముందుగా ఉండాలి.ఆ న్యాయాన్ని ఆదికర్త అయిన పరమేశ్వరుడి విషయంలో ప్రవర్తింపజేయడం యుక్తంగా ఉంది. పరమేశ్వరుడు కూడా అనేక సాధనాల సహాయంతో జగత్ సృష్టి చేశాడు. బ్రహ్మ ఉపాదాన కారణం , నిమిత్త కారణంగా కూడా అంగీకరించబడుతోంది. ఎందువలనంటే ఒక దానిని తెలుసుకోవడం చేత తెలుసుకొనబడని ఇతరమైన సమస్తము కూడా తెలియబడుతోంది. ఈ విధమైన సర్వ విజ్ఞానం కార్యం ఉపాదాన కారణం కంటే వేరే ఏది లేదు. కార్యం నిమిత్త కారణం కంటే అభిన్నం కాదు. జగత్ సృష్టికి నిమిత్త కారణం బ్రహ్మమే, సృష్టి చెయ్యాలనే ఆలోచనే ఉపాదానకారణం.
ప్రకృత్యధికరణం :- ( 1, 4, 24 )
సూత్రం :- 130
" అభిధ్యోపదేశాత్ "
చ :- అంతే కాని, అభిద్య:- సంకల్పం, ఉపదేశాత్ :- ఉపదేశం,
భావం :- పరబ్రహ్మ సృష్టి సంకల్పం వలన ప్రకృతి జగత్తుకు ఉపాదానకారణం అని అంగీకరించాలి.
వివరణ:- పరబ్రహ్మ తాను అనేక రూపాలుగా కావాలని కోరుకున్నాడు. ఈ కోరిక వలన బ్రహ్మకు కర్తృత్వం, ఉపాదానత్వం రెండు వస్తాయి. సంకల్పం చేసేవాడు కర్త, సంకల్పానికి కర్మ కావాలి. కర్తృత్వం, కర్మత్వం ఒకరిలో ఉండవు. కనుక సంకల్పం చేసే కర్త బ్రహ్మం, ఆయన సంకల్ప ఫలితం జగత్తు. ప్రకృతి ఉన్నప్పుడే జగద్రచన సాధ్యమౌతుంది. కనుక ఇది ఉపాదానకారణం. సృష్టి సంకల్పం వలన కూడా బ్రహ్మకు కర్తృత్వ, ప్రకృతి తత్త్వాలు తెలుస్తున్నాయి. ఆత్మకు సంకల్పం కలిగిందని చెప్పడం కూడా ఆత్మకు ప్రకృతితత్త్వం, కర్తృత్వం రెండు ఉన్నాయని తెలుస్తోంది. సంకల్పపూర్వకంగా, స్వతంత్రంగా ప్రవర్తించడం చేత కర్త అని తెలుస్తోంది.
తైత్తరీయోపనిషత్తు:-కార్యాకారణమే ఈజగత్తు. ఇంద్రియాలలో తెలియబడే ప్రాణాలు, పదార్ధాలన్నీ దేని వలన పుడుతున్నాయో, పుట్టినవి ఎవని వలన జీవిస్తున్నాయో, ప్రళయ కాలమున దేని యందు లయమౌతున్నాయో, అదే బ్రహ్మమని తెలుసుకోవాలి. ఈజగత్తు జన్మించడానికి బ్రహ్మమే కారణం. బ్రహ్మం అనాది, సనాతనం, జీవుడు, ప్రకృతి కూడా సనాతనమే. సృష్ఠికి పూర్వం జీవులు సూక్ష్మరూపంలో ప్రకృతి బ్రహ్మమును ఆశ్రయించి ఆయన అధీనంలోనే ఉన్నాయి. ప్రకృతికన్నా జీవుడు సూక్ష్మం. జీవుని కంటే సూక్ష్మం బ్రహ్మ. సర్వవ్యాపకం, సూక్ష్మమైన ప్రకృతి ఉపాదాన కారణం కాగా బ్రహ్మ నిమిత్తకారణమై సృష్టి జరిగింది. నిమిత్త కారణమైన పరమాత్మ వలన జగత్తు ఉత్పన్నమైనది. ప్రకృతి ఉపాదానకారణమైనది. కుండకు మట్టి ఉపాదానకారణం. కుండను చేసే కుమ్మరి నిమిత్తకారణం. సమస్త సృష్టిని ఉపాదాన కారణం నుండి నిర్మించి, దానిని ధరించి, అన్ని జీవులకూ ఆహారాన్ని సమకూర్చి, వాటి ప్రయోజనములకు సంబంధించిన వ్యవస్థ ఏర్పాటు చేయడం, మరల ప్రళయకాలంలో తనలో లయం చేసుకునేది బ్రహ్మమే. అదే నిమిత్తకారణం. కారణం లోని గుణాలు కార్యమందుంటాయి. అంటే కుండలో మట్టి లక్షణాలు ఉంటాయి. కారణానికి కారణం లేదు. ప్రకృతి అనాది అయినప్పటికీ పరిణామం చెందుతుంది. ప్రళయకాలంలో సూక్ష్మ రూపం ధరించి పరమాణువుల రూపంలో పరమాత్ముని ఆధీనంలో ఉంటుంది. మళ్ళీ అదే ప్రకృతి తిరిగి సృష్టి జరిగే సమయంలో జగత్తునకు ఉపాదానకారణమౌతుంది. కారణం లేకుండా కార్యం జరగదు. జగమంతా కార్యాకారణ సంబంధమే.
సూత్రం :- 131
"సాక్షాచ్చో భయామ్నానాత్"
చ:-అంతేకాక, ఉభయ :- బ్రహ్మం, ప్రకృతి రెండు, సాక్షాత్ :- ప్రత్యక్షంగా, ఆమ్నాయాత్:- ఉపనిషత్ వాక్యాలలో వర్జితాలు.
భావం :- బ్రహ్మం, ప్రకృతి రెండూ ఉపనిషత్ వాక్యాలలో చెప్పబడిన వర్జితాలు. అంటే జగత్తుకు కారణములు , నిమిత్త కారణం ఉపాదాన కారణం.
వివరణ :- బ్రహ్మకు సృష్టి, లయలు రెండు చెప్పడం వలన అతడు జగత్తుకు ఉపాదానకారణం అవుతున్నాడు. ఈ సమస్తభూతాలు ఆకాశంనుండి పుడుతున్నాయి. ఆకాశంలోనే లీనమౌతున్నాయి అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఆకాశం అంటే పరబ్రహ్మ. అంతే కానీ భూతకాశం కాదు. ఈ జగత్తంతా బ్రహ్మ నుండే పుట్టి, బ్రహ్మలోనే లీనమౌతుంది. ఒక వస్తువు యొక్క సృష్ఠికి, లయానికి ఏది కారణం అవుతుందో అది దానికి ఉపాదానకారణం. మట్టి నుండి పుట్టిన కుండ మట్టిలోనే కలిసిపోతుంది. అందుకే కుండకు మట్టి, జగత్తుకు బ్రహ్మ ఉపాదాన కారణం.
శ్వేతాశ్వరోపనిషత్తు:-(4,10 ):-మాయఅంటే ప్రకృతి. దానికి స్వామి మాయిఅయిన ఈశ్వరుడు అని వేర్వేరుగా వర్ణించారు. ప్రకృతి ఉపాదానం, బ్రహ్మం నిమిత్తకారణం. జీవ పరమాత్మల ఏకత్వభావనే అద్వైతసిద్ధాంతానికి ప్రాతిపదిక. ఉన్నది ఒక్కటే పరబ్రహ్మము. రెండవది లేదు. లేనిది ఉన్నట్లుగా కనబడటమే మాయ. ఈ జగత్తంతా నామరూపాలచే విడిగా కనిపించే అనేకమంది కర్తలతోను, కర్మఫలాలను అనుభవించే భోక్తలతోను, ఉహించడానికి కూడా శక్యంకాని విధంగా కనబడుతున్న సృష్టి అంతా పరమేశ్వరుడు సంకల్పించి సృష్టించిన మాయజగత్తు. అందుకే ఆయనని మాయి అన్నారు. జగత్తు యొక్క జన్మ, స్థితి, ప్రళయం దేని వలన కలుగుతాయో అది బ్రహ్మం అని చెప్పబడినది. సృష్టి అంటే ఇది వరకు లేనిది ఇప్పుడు కల్పించబడి, కనిపించేదేనని స్థూలంగా అనుకోవచ్చును. మాయ అంటే అవిద్య, అజ్ఞానం. ఈఅజ్ఞానం వలన అవివేకం, అవివేకం వలన అభిమానం, అభిమానాదుల వలన రాగాదులు, రాగాదులు వలన కర్మలు, కర్మల వలన పునర్జన్మలు, వాటి వలన దుఃఖం కలుగుతుంది. ఈ మిధ్యాభూతం బ్రహ్మతత్త్వజ్ఞానం వలన మాత్రమే నివృత్తి చేయబడి, సచ్చిదానంద స్వరూపమైన బ్రహ్మాన్ని చేరుకోగలరు.
సూత్రం :- 132
" ఆత్మే కృతేః పరిణామాత్ "
ఆత్మ కృతే :- బ్రహ్మ చేసిన సంకల్ప క్రియ వలన ఈ జగత్తు కలిగింది. పరిణామాత్ :- పరిణామం ద్వారా.
భావం :- బ్రహ్మ చేసిన సంకల్ప క్రియ వలన ఈ జగత్తు ఏర్పడింది.
వివరణ :- ఆత్మ సంబంధమైన కృతి వలన ఆత్మను స్వయంగా సృజించాడు అని చెప్పడం వలన ఈ జగత్తుకు ఉపాదాన కారణం అవుతున్నాడు. అతడే స్వయంగా జగత్తును సృష్టించాడు అని చెప్పడం వలన అతనికి కర్తృత్వం వస్తోంది. అంటే నిమిత్తకారకుడౌతున్నాడు.
తైత్తరీయోపనిషత్తు :- ఆయన సంకల్పించి తపించి ఈసర్వమును సృజించాడు. జ్ఞానపూర్వక సృష్ఠికి కర్త పరబ్రహ్మము నిమిత్తకారణం.
ఋగ్వేదం:-పూర్వం లాగానే బ్రహ్మం సూర్యచంద్రులను రచించాడు. కనుక జగద్రచనకు నిమిత్తకారణం బ్రహ్మమేనని తెలుస్తోంది. ప్రకృతి నుండి జగత్తు పరిణమించింది. కనుక జగత్తుకు ఉపాదానకారణం. బ్రహ్మ తనకు తానే కార్యరూపంలో చేసుకొనుట వలన కూడా బ్రహ్మ ప్రకృతికి ఉపాదానకారణం, కార్యరూపంలో పరిణమించుట వలన కూడా ఉపాదాన కారణం. బ్రహ్మ ప్రక్రియలో ఆత్మను కర్తృత్వాన్ని, కర్మత్వాన్ని కూడా చూపుచున్నది.
భగవద్గీత:-బ్రహ్మసంకల్పం వలన ఈజగత్తు ఏర్పడింది. ఈ ఆనంతవిశ్వం అంతటికీ కారణం బ్రహ్మ. ప్రతి వస్తువుకు రెండు కారణాలు ఉంటాయి. ఉపాదానకారణం, నిమిత్తకారణం. ఈ అనంతవిశ్వం పంచభూతాలైన ఆకాశం, వాయువు, అగ్ని, జలము, పృధివిలతో తయారైనది. వీటిని ఉపాదానకారణం అంటారు. వీటిని తయారుచేయడానికి ఒక శక్తి నేర్పు ఉండాలి. అంటే నిమిత్తకారణం ఉండాలి. అదే పరమాత్మ. ఈ పంచభూతాలు పరమాత్మ నుండే వచ్చాయి. మహాప్రళయ కాలంలో అవన్నీ పరమాత్మతో లీనమైపోయి పరమాత్మ ఒక్కడే ఉంటాడు. నిజానికి పరమాత్మ, ప్రకృతి రెండు ఒకటే. పరమాత్మ నుండి వచ్చిన ప్రకృతి తిరిగి పరమాత్మలోనే లీనం అవుతుంది. పరమాత్మ అధ్వైతుడుగా ఉన్నవాడు రెండు అయ్యాడు. దానినే పరాప్రకృతి, అపరాప్రకృతి అంటారు. పరాప్రకృతి అంటే ఈశ్వరుడు. అపరాప్రకృతి అంటే పంచభూతాత్మకమైన ప్రకృతి. దీనినే అర్ధనరీశ్వర తత్త్వం అంటారు.
సూత్రం :- 133
"యోనిశ్చ హి గీయతే "
చ :- పైగా బ్రహ్మాన్ని, యోనిః:-మూలకారణం యోని అని, హి :-కదా!, గీయతే :- కీర్తించారు.
భావం.ఈ సమస్త సృష్ఠికి మూల కారకుడైన బ్రహ్మను యోనిగా వర్ణించారు.
వివరణ :- యోని అనే పదానికి ఆత్మ అని, ప్రకృతి అని, స్థానము అని వేరు వేరు అర్ధాలలో వర్ణించారు.
ముండకోపనిషత్తు:-(3,1,3):- బ్రహ్మాన్ని యోనిగా వర్ణించడం జరిగింది. ప్రళయకాలంలో జీవులు, ప్రకృతి అన్ని బ్రహ్మం లోనే ఇమిడివుండి, సృష్టివేళలో మళ్ళీ జన్మిస్తాయి. కనుక జడమైన జగత్తుకు బ్రహ్మ అధిష్టానం అవుతోంది కనుక బ్రహ్మాన్ని యోనిగా వర్ణించారు. వివేకవంతులు సమస్త భూతాలకు కారణమైన వానిని అంతటా చూస్తారు అని చెప్పడం వలన యోని అంటే ఆత్మ అనే అర్థంలో గ్రహించాలి. కాబట్టి జగత్తుకు బ్రహ్మ ఉపాదానకారణం, నిమిత్తకారణం కూడా. కనబడుతున్న జగత్తంతా ప్రకృతి నుండి ఉద్భవించింది కనుక యోని అంటే ప్రకృతి అనే అర్థం కూడా ఉంది. స్త్రీ యోని కూడా గర్భానికి ఉపాదానమైనట్లే, ప్రకృతికూడా ఈజగత్తుకు ఉపాదాన కారణమైనది. పురుషుడు అంటే జీవుడు ప్రకృతిలో లీనమై ఎన్నో కార్యములు చేస్తుంటాడు. ఆకార్యములు చేయడానికి ఎన్నో కారణములు ఉంటాయి. ఇది సహజం. ఈ కార్యములకు వాటి కారణములకు మూలంప్రకృతే. పురుషుడు ఆపనులు చెయ్యడం వలన సుఖదుఃఖములను అనుభవిస్తున్నట్లు భ్రమ చెందుతాడు. నిజంగా సుఖదుఃఖాలు అనేవి లేవు. అవి కేవలం మానసిక స్పందన మాత్రమే. పురుషునికి ఎటువంటి సుఖదుఃఖములు, వికారములు ఏమి లేవి. కానీ ప్రకృతిలో ఉండి, ఆకార్యములను చెయ్యడం వలన జడమైన ప్రకృతి అనుభవించలేదు. కాబట్టి పురుషుడే వాటిని అనుభవిస్తున్నట్లుగా కనిపిస్తున్నాడు. కానీ పురుషునికి ఏ వికారములు లేవు.
సర్వ వ్యాఖ్యానాధికరణం :- (1, 4 , 28)
సూత్రం :- 134
" ఏ తేన సర్వే వ్యాఖ్యా తా వ్యాఖ్యా తాః "
ఏ తేన :- ఈ వివేచనతో , సర్వే :- అన్ని సందేహాలకు, వ్యాఖ్యాతాః:- సమాధానం చెప్పడం జరిగింది.
భావం :- మొదటి అధ్యాయంలో అన్ని సందేహాలకు వివేచనతో సమాధానాలు చెప్పడం జరిగింది.
వివరణ:-ఈ నాలుగవపాదంలో చేసిన వ్యాఖ్యానంద్వారా అనేక సందేహాలు నివృత్తి చెయ్యడమేకాకుండా, జగజ్జన్మాదులకు బ్రహ్మం నిమిత్తకారణమని స్పష్టం చేశారు. రెండుసార్లు వ్యాఖ్యాతః అని చెప్పడం అధ్యయసమాప్తిని సూచిస్తుంది. ఇంతవరకు సాంఖ్యుల యొక్క వాదాన్ని తిరస్కరించి జగత్ కారణం ప్రకృతి కాదు బ్రహ్మమేనని నిరూపించారు. అన్ని వాదనలలో సాంఖ్యవాదం బలమైనది. అందుకే సాంఖ్యులను తిరస్కరిస్తే, మిగిలిన వాదనలు కూడా తిరస్కరించినట్లే అని చెబుతూ మొదటిఅధ్యాయం పూర్తిచేశారు. బ్రహ్మసూత్రాలు నాలుగుఅధ్యాయాలలో మొదటిఅధ్యాయం “సమన్వయా ధ్యాయం." ఉపనిషత్వాక్య సమన్వయాన్ని తెలియజేస్తుంది. వాటిలో ఉన్న వైరుధ్యాన్ని తొలగించి సమన్వయం చేస్తుంది. కొన్ని ద్వైతపరంగా, కొన్ని అద్వైతపరంగా, కొన్ని విశిష్టాద్వైతపరంగా, కొన్ని శివసంబంధమైన, ఇలా రకరకాల సంబంధాలతో ఉన్నటువంటి ఉపనిషత్తులు జాగ్రత్తగా సమన్వయం చేయగలిగితే అంతా ఒక్కటే. ఎవరికి అనుకూలమైన రీతిలో వారు ఉపనిషత్తుల అర్ధాన్ని భావాన్ని వ్యాఖ్యానించడం వలన గందరగోళ పరిస్థితి నెలకొంది. అలా గజిబిజిగా ఉన్న వ్యాఖ్యానాలు చదివి ఏది సమంజసమైనదో ఎవరికి అర్ధం కాలేదు. సామాన్యులు ఉపనిషత్తులు చదవడానికి, అర్ధం చేసుకోవడానికి సాధ్యం కాదు. సమన్వయం చెయ్యడం అసలే సాధ్యం కాదు. వీటి మీద ఒక అవగాహన కావాలంటే జీవిత కాలం చాలదు. ఇలాంటి పరిస్థితిలో ద్వాపరయుగం చివరిలో వ్యాసమహర్షి (బాదరాయణుడు) ఈవ్యాఖ్యానాలన్నీ సమన్వయం చేస్తూ, ఒకే అర్ధాన్ని తీసుకు వచ్చి, సరి అయిన పద్ధతిలో దాని యొక్క అర్ధాన్ని గ్రహించేటట్లు చెయ్యడానికి , మోక్షాన్ని ఇవ్వడానికి, అద్భుతమైన జ్ఞానాన్ని, వేదాలని, ఉపనిషత్తులను పరిశోధించి, ఉపనిషత్ మంత్రాలను సమన్వయం చేస్తూ సూత్రరూపంగా బ్రహ్మసూత్రములు రచన చెయ్యడం జరిగింది. అప్పటికి వైరుధ్యం అంతా తొలగిపోయి ఏకాభిప్రాయం కలుగుతుందని ఉపనిషత్తులు చదవలేక పోయినా, అర్ధం చేసుకోలేకపోయినా, బ్రహ్మ సూత్రములు చదివితే ఉపనిషత్తుల సారాంశం తెలుస్తుందని వ్యాసభగవానుడు బ్రహ్మసూత్రములు రచించారు. ఆ సూత్రాలకు భాష్యం వస్తే తప్ప అర్ధం కావని, మహాత్ములే అర్ధం చేసుకోగలరని, సామాన్యులకు అర్ధం కావడం కోసం శ్రీఆదిశంకరులు బ్రహ్మసూత్రములకు భాష్యం వ్రాయడం జరిగింది. ఎంతోమంది భాష్యం వ్రాసినప్పటికి, శంకరుల భాష్యం ఒక్కటే అనుకూలంగా ఉందని, ఆయన వ్రాసిన తాత్పర్యమే పరమతాత్పర్యమని కీర్తించబడింది. ఉపనిషత్ విద్యను మననం చేస్తుండటమే బ్రహ్మసూత్రముల ముఖ్య ఉద్దేశ్యం. బ్రహ్మసూత్రములు 134 సూత్రములతో మొదటి అధ్యాయం సమన్వయాధ్యాయం సమాప్తం.
అధ్యాయం .2, అవిరోధాధ్యాయం
అద్వైతానికి విరుద్ధంగాఉన్న ఇతరమతాలవారి అభిప్రాయాలను నిరోధించడం, ఖండించడం ఈఅధ్యాయంలో వివరించబడింది.
స్మృత్యధికరణం :- ( 2 , 1, 1)
సూత్రం :- 135
"స్మృతి అనవకాశ దోష ప్రసంగ ఇతి చేత్ న అన్య స్మృతి అనవకాశ దోష ప్రసంగాత్"
స్మృతి అనవకాశ దోష ప్రసంగః :- బ్రహ్మం జగజ్జన్మాదులకు కారణమైతే ప్రకృతే కారణం అని చెప్పే స్మృతులకు అవకాశం ఉండదు. ఇది దోషం కాదా! ఇతి చిత్;- అని అనడం, న ;- తగదు. అన్య స్మృతి అనవకాశ దోష ప్రసంగత్ :- బ్రహ్మం జగత్ కారణమని స్మృతులంటున్నాయి.
భావం :- బ్రహ్మం జగజ్జన్మాదులకు కారణమైతే ప్రకృతి కారణం అని చెప్పే స్మృతులకు అవకాశం ఉండదు. స్మృతులన్ని బ్రహ్మమే జగత్కారణమని అంటున్నాయి.
వివరణ :- గురువు గారు! కపిలమహర్షి సర్వజ్ఞుడు అంటారు. సృష్టి ఆరంభంలో పుట్టినటువంటి కపిలుడు పుట్టుకతోనే మహాజ్ఞానియై తన జన్మకు కారణం ఎవరో కనుక్కోవాలని అనుకున్నాడని ఉపనిషత్తులు చెబుతున్నాయి. మరి అటువంటి కపిలుడు చెప్పిన విషయాలు కాదనడానికి వీలులేదు. కపిలమహర్షి బ్రహ్మమే జగత్కారణం అనే విషయంలో సందేహం వెలిబుచ్చాడు కదా! అన్నాడు కృష్ణ శర్మ. నిజమేనయ్యా! కపిలుడు చాలా గొప్పవాడు. సాంఖ్యస్మృతి వ్రాసింది ఆయనే. లోకంలో చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో మనువు మొదలైన వాళ్ళు కూడా కపిలుని వలెనే స్మృతులను వ్రాశారు. అందుకని విషయం నిర్ణయం చేసేటప్పుడు కేవలం సాంఖ్యస్మృతిని మాత్రమే దృష్టిలో ఉంచుకొని నిర్ణయించడం తప్పు. అలాంటప్పుడు అనేకమంది చెప్పినది అంగీకరించడమే మంచిది. ఈసృష్టికి కారణం బ్రహ్మ అనే మాటకు స్మృతులు అంగీకరించాయి. వేదాలు స్వతఃప్రమాణాలు.వాటిని శృతులు అంటారు. వాటిలో ఉన్న అర్ధాన్ని గ్రహించి తేలికభాషలో వ్రాసినవే స్మృతులు . కాబట్టి స్మృతులలో వ్రాసిన విషయాలకు శృతులకు తేడా ఉండవచ్చును. అందుచేత వేదంలో చెప్పిన దానికి విరుద్ధంగా అర్ధం వచ్చేటప్పుడు ఆస్మృతులును అంగీకరించరాడు. జగత్తుకు కారణం బ్రహ్మ అనే విషయం అనేక చోట్ల చెప్పబడింది. వేదానికే ప్రాముఖ్యత ఉన్నది కానీ దానికి విరుద్ధమైన సాంఖ్యస్మృతికి లేదు అని సమాధానం చెప్పాడు గురువు. సాంఖ్యశాస్త్రం:- సాంఖ్యశాస్త్రకర్త కపిలుడు. ఇందులో 6 అధ్యాయాలు ఉన్నాయి. దీనిలో మోక్షసాధనం, పదార్ధతత్త్వజ్ఞానం గురించి వివరించారు. జగత్తు ఆవిర్భావానికి ప్రకృతే కారణం అన్నారు. సత్వరజస్తమోగుణాల సామ్యావస్థే ప్రకృతి అన్నారు. దాని నుంచి మహాత్తత్త్త్వం, దాని నుంచి అహంకారం, అందునుంచి పంచతన్మాత్రలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పుట్టాయి. తన్మాత్రలు నుంచి 5 స్థూలభావాలు, పృథివ్యాధులు పుట్టాయి. అవన్నీ పురుషుడితో కలసి 25 అయినవి. దీని బట్టి జగత్ కారణం ప్రకృతి అని చెప్పినట్లుగా అర్ధం అవుతోంది. సాంఖ్యస్మృతి ప్రమాణం కాదు అనలేము. కపిలమహర్షి ఆప్తుడు. ఆప్తవాక్యం అప్రమాణం కాదు. మొదటి అధ్యాయంలో బ్రహ్మం జగజ్జన్మాదులకు కారణం అన్న సిద్ధాంతం సాంఖ్యస్మృతికి విరుద్ధం అనడం సరికాదు.
మనుస్మృతి:-(1-5 నుండి 1-8) ఈజగత్తుకు మూలప్రకృతి దృష్టిగోచరం కాదు. ప్రత్యక్షప్రమాణం లేదు. అనుమాన ప్రమాణంవలన ఉహించలేము. తర్కానికి వీలులేదు. అలాగే ఈశ్వరుడు వ్యక్తం కానివాడు. నిరతిశయ జ్ఞానత్రయ శక్తులున్నవాడు. ప్రకృతి ప్రేరకుడు. మహదహంకార పూర్వకాలైన సూక్ష్మభూతపూర్వకమైన ప్రకృతిని సృష్టించాలని సంకల్పించారు. ప్రళయకాలంలో ఈప్రకృతికి ప్రత్యక్షప్రమాణం ఉండదు. అనుమాన ప్రమాణాలకు లోబడదు. తర్కానికి విషయం కాదు. ఆ సమయంలో ప్రకృతి బ్రహ్మలో లీనమవడం వలన బ్రహ్మకన్నా వేరుగా ఉందని చెప్పడానికి వీలు లేదు. ఈశ్వరుడు జగత్తును ఉత్పన్నం చెయ్యడానికి ప్రకృతిలో ప్రేరణ కలిగిస్తాడు. ఆయన ప్రకృతి నుంచి ముందుగా మహదహంకారాది పూర్వకమైన సూక్ష్మభూతాలను సృష్టిస్తాడు. దీనిని అనుసరించి పరబ్రహ్మమే జగత్తు ఉత్పత్తికి కారణం అని స్పష్టంగా తెలుస్తోంది. మనువుకానీ, సాంఖ్యకర్త అయిన కపిలుడు కానీ వేదవిదులు, కనుక వాళ్ళ వాక్యాలు ప్రమాణమే. ఇద్దరూ లోకకళ్యాణాన్ని కోరి స్మృతులను రచించారు. వాళ్ళ సిద్ధాంతాలలో వైరుధ్యం ఉండదు. స్థూలదృష్టికి కనిపించే విరోధాలను తొలగించాలని వ్యాసుడు ఈసూత్రం వ్రాశాడు. ప్రకృతి బ్రహ్మప్రేరితం, బ్రహ్మాధీనం. సాంఖ్యంలో ఎక్కడా ప్రకృతి జగత్ జన్మాదులకు స్వతంత్రకారణమని చెప్పలేదు. ఈశ్వరుడికి లోబడి ప్రకృతి మహదాదీ ఉత్పత్తికి కారణం అని చెప్పే సూత్రాలు సాంఖ్యంలో ఉన్నాయి. పురుషుడు ప్రకృతిసంభవుఁడు కాదు. ప్రకృతి పరతంత్రమై ప్రపంచాన్ని ప్రారంభిస్తుంది. ఆపరుడు ఎవరు? అంటే సర్వజ్ఞుడైన పరమేశ్వరుడే. ఈజగత్తును ఎరిగి దానిని నిర్మించేవాడు పరమేశ్వరుడు అని మహదాది ప్రపంచానికి కారణం అని సాంఖ్యశాస్త్రంలో చెప్పబడింది. అందువల్ల సాంఖ్యము వేదాంత వ్యాఖ్యలకు విరుద్ధం కాదు.
సూత్రం :- 136
"ఇతరేషాంచ అనుపలబ్ధేః "
ఇతరేషాంచ:- గౌతముడు, కణాదుడు మొదలైన వాళ్ళు కూడా, అనుపలబ్ధేః:- లోకంలో కానీ, వేదంలో కానీ వారి శాస్త్రాలు కనబడకపోవడం వలన కూడా దోషం కాదు అని అర్ధం.
భావం :- గౌతముడు, కణాదుడు మొదలైన వాళ్ళు కూడా ప్రకృతి జగజ్జన్మాదులకు స్వతంత్ర కారణమన్నట్లు ఋజువు లేనందువలన, వాళ్ళు వ్రాసిన శాస్త్రాలు వేదాంత వాక్యాలకు విరుద్ధం కావు.
వివరణ:-గౌతముడు న్యాయదర్శనంలోను, కణాదుడు రచించిన వైశేషికంలోను ఈశ్వరుడే జగత్కర్త అని చెప్పారు. ఈ రెండూ వైదిక స్మృతులే. వీటిలో ప్రకృతిని పరమాణురూపంలో వర్ణించారు. ఈ పరమాణువులను ఉపాదానకారణంగా తీసుకొని, ఈశ్వరుడు జగత్తుని సృష్టించడం జరిగిందని చెబుతారు. అందుచేత ఈస్మృతులను వేదాంతవాక్యాలకు వైరుధ్యం లేదు. సాంఖ్యస్మృతిలో ప్రధానమైనది ప్రకృతి. మహత్తు మొదలైన తత్త్వాలులేవు. అయితే ప్రకృతి యొక్క పరిణామాలుగా చెప్పబడు చున్న మహాత్తత్త్వం , అహంకారం, తన్మాత్రలు, మొదలైనవి సాంఖ్యులు కల్పించినవి. భూతాలు, ఇంద్రియాలు, వేదంలో చెప్పబడ్డాయి. కానీ ఆరవ ఇంద్రియం అని చెప్పి మహత్తును అంటే బుద్ధిని కల్పించారు సాంఖ్యులు. అందుచేతనే సాంఖ్యము అప్రమాణమైనది. స్థూలసూక్ష్మభూతాలు అయితే వేదంలోను, లోకంలోనూ కూడా ప్రసిద్ధి అవడం చేత వాటిని స్మరించడం అంటే స్మృతిలో చెప్పడం శక్యమే గాని, మహత్తు మొదలైనవి అనగా మహత్తు, అహంకారం , అహంకారం నుండి పుట్టినవిగా చెప్పబడే తన్మాత్రలు వేదంలో గాని లోకంలో గాని ప్రసిద్ధమైనవి కావు. ఐదుఇంద్రియాలచేత అనుభవించిన వాటిని స్మరించవచ్చును. కానీ ఆరవఇంద్రియం లేదు. అలాంటి విషయాన్ని స్మరించడానికీ కూడా శక్యం కాదు. శృతిలో మహదాదులను గురించి చెప్పమన్నట్లు పైకి కనబడేది కూడా ఆమహదాదులకు సంబంధించినది కాదు. సాంఖ్యులు చెప్పిన మహదాదులు అప్రమాణం వలన ప్రధానం యొక్క శృతి కూడా అప్రమాణమే.
యోగ ప్రత్యుక్త్వధికరణం ( 2, 1,3 )
సూత్రం :- 137
"ఏతేన యోగః ప్రత్యుక్తః "
ఏ తేన :- సాంఖ్యాది స్మృతి అవిరోధ వర్ణన వల్ల , యోగః :- యోగశాస్త్ర విరోధాన్ని సైతం, ప్రత్యుక్తః :- నిరాకరించాలి.
భావం :- సాంఖ్యులు వారి స్మృతులలో అవిరోధవర్ణనల వలన యోగ శాస్త్రాన్ని సైతం నిరాకరించాలి.
వివరణ :- సాంఖ్యస్మృతిని ఆధారంగా చేసుకొని వచ్చినది యోగ శాస్త్రం. యోగశాస్త్రంలో కూడా వేదాలను విరుద్ధంగా ప్రకృతే జగత్తుకు కారణంగా వర్ణించారు. అయితే సాంఖ్యస్మృతి నివారించడం వలన, యోగ శాస్త్రాన్ని కూడా నిరాకరించినట్లే అవుతుంది. సాంఖ్యమతాన్ని అనుసరించి యోగశాస్త్రమున్నప్పటికి యోగశాస్త్రంలో ఈశ్వరుడున్నాడు. సాంఖ్యశాస్త్రంలో ప్రకృతే ప్రధానమైనది. ఈరెండింటికి తేడా ఇదొక్కటే. మిగిలినవన్నీ సమానమే. గురువు గారు! ఉపనిషత్తులలో యోగాన్ని వివరించడం జరిగింది. యోగి ఏరకంగా ఉండాలో కూడా చెప్పారు. కఠోపనిషత్తులో సంపూర్ణమైన యోగవిధిని పొందిన నచికేతుడు బ్రహ్మత్వం పొందాడు అని చెబుతారు. కాబట్టి యోగాన్ని, యోగశాస్త్రాన్ని కాదనలేము కదా ! అన్నాడు కృష్ణ శర్మ. దానికి సమాధానం రత్నాకరుడు చెబుతున్నాడు. యోగశాస్త్రం, సాంఖ్య శాస్త్రాన్ని ఆధారం చేసుకుని చెప్పబడింది. సాంఖ్యులు ప్రకృతే జగత్ కారణం అన్నారు. అదే యోగానికి కూడా ఆధారం. మరి సాంఖ్య శాస్త్రానికి ప్రమాణం లేనప్పుడు యోగశాస్త్రానికి ప్రమాణం ఎలా ఉంటుంది? ఈ రెండింటికి వేదప్రమాణం లేదు. వేదప్రమాణాన్ని అంగీకరించినంతవరకే వీటికి ప్రమాణత్వం ఉంటుంది. ఎప్పుడైతే వేదప్రమాణాన్ని ఇవి అంగీకరించలేదో అప్పుడే వీటికి ప్రమాణం లేదు. శృతి విరుద్ధమైన విషయాలలో మాత్రం ఇవి అప్రమాణాలే.
యోగదర్శనం :- దీనిని పతంజలిమహర్షి యోగవిద్యారహస్యాలు క్రోడీకరించి యోగసూత్రాలు రచించాడు. యోగం అంటే చిత్తవృత్తులను నిరోధించడం. జడమైనప్రకృతి పురుషుని అంటే జీవాత్మ సాన్నిధ్యంవలన ప్రభావితమై పరిణామం చెందుతుంది. మొదట ప్రకృతి నుంచి జడం ఉద్భవిస్తుంది. మహాత్ అంటే బుద్ధి. చిత్తానికి వృత్తులుంటాయి. వృత్తులంటే వికారాలు, వ్యాపారాలు, అనుక్షణం చిత్తంలో మార్పులు సంభవిస్తుంటాయి. ఆమార్పులను, వికారాలను నిరోధిస్తే సమాధి స్థితి లభిస్తుంది. ఇదే కైవల్యం. ఈ స్థితికి తోడ్పడేదే యోగం. యోగం అంటే మనోవికారాలను నిరోధించడమే. కామాలకు కారణం, సాంఖ్య, యోగాల చేత అనగా వివేక, ధ్యానాల చేత ఆదేవుణ్ణి తెలుసుకొని, సర్వపాపాలనుండి విముక్తుడు అవుతాడు. ఇది శృతివాక్యం. వేదాపేక్షలేని సాంఖ్యమార్గం చేత, యోగమార్గం చేత, మోక్షంరాదు. శృతి వైదికమైన ఆత్మతత్త్వవిజ్ఞానం తప్ప ఏది కూడా మోక్షసాధనం కాదు అని చెబుతున్నది శృతి. సాంఖ్యులు, యోగులు ద్వైతులే. ఆత్మైకత్వాన్నీ వారు అంగీకరించరు. ఏది శృతిలో కనబడచున్నదో, అక్కడ సాంఖ్యయోగ పదాలచేత దగ్గరగా ఉండటం చేత, వేదోక్తమైన జ్ఞానధ్యానాలే సాంఖ్యయోగంలో చెప్పబడుతున్నాయని గ్రహించాలి. వేదవేత్త కానివాడు బ్రహ్మాన్ని తెలుసుకోలేడని శృతిలో చెప్పబడింది.
స విలక్షణత్వాధికరణం :- ( 2, 1, 4 )
సూత్రం :- 138
"స విలక్షణత్వాత్ అస్య తధాత్వం చ శబ్దాత్'"
అస్య :- ఈ దృశ్య మాన ప్రపంచానికి, విలక్షణాత్ :- విరుద్ధ లక్షణాలున్నందున, న :- ప్రకృతి జగత్తుకు ఉపాదాన కారణం కాదు. శబ్దాత్ ;- శబ్ద ప్రమాణం వలన, తధాత్వం చ:- పంచ భూతాత్మక జగత్తు ప్రకృతి లక్షణ మని తెలుస్తోంది.
భావం :- ఈ జగత్తులో కంటికి కనిపిస్తున్న దృశ్య మాన ప్రపంచానికి విరుద్ధమైన లక్షణాలు ఉండటం వలన ప్రకృతి జగత్తుకు ఉపాదాన కారణం కాదు. శబ్ద ప్రమాణం వలన పంచభూతాత్మకమైన జగత్తు ప్రకృతి లక్షణమని తెలుస్తోంది.
వివరణ:-మొదటి అధ్యాయంలో ఈజగత్తుకు ఉపాదానకారణం ప్రకృతిఅని, నిమిత్తకారణం ఈశ్వరుడని చెప్పారు. ముందు సూత్రంలో జగత్తుకు ఉపాదానకారణం కానేరదని తర్కిస్తున్నారు. ఈ లోకంలో కార్యమునకు, కారణమునకు సమాన లక్షణాలు ఉండటం చూస్తున్నాము. కుండకు మట్టి లక్షణాలు, నగలకు బంగారం లక్షణాలు ఉన్నాయి. అలాగే జగత్తుకు ప్రకృతి లక్షణాలు ఉండాలి. కానీ ఛాందోగ్యంలో చెప్పినట్లుగా మట్టి పలికింది, జలం మాట్లాడింది, అగ్ని చూసింది, ఆ నీరు చూసింది అనే శబ్ద ప్రమాణాన్ని అనుసరించి, పాంచభౌతికమైన జగత్తుకు చేతనాధర్మాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రకృతి అచేతనం జడము అన్నారుకదా! ఇక్కడ కార్యమునకు, కారణమునకు తేడా కనిపిస్తోంది కదా! ఇప్పుడు బ్రహ్మాన్ని ఆశ్రయించిన ప్రకృతి జగత్తుకు ఉపాదానకారణం అవుతోంది. చేతనమైన బ్రహ్మమే జగత్తుకి కారణం అని అనడానికి వీలు లేదు. అది బ్రహ్మకన్నా విలక్షణమైనది. ఏలక్షణాలు గల పదార్ధం నుంచి ఆలక్షణాలు గల పదార్ధాలు పుడతాయి. జడ పదార్ధం నుంచి జడ పదార్ధము పుడుతుంది. కానీ చైతన్యం పుట్టదు. దారం నుండి వస్త్రం తయారవుతుంది. అంతే కాని కుండ తయారుకాదు. జడమైన మట్టి నుంచి జడమైన కుండ పుడుతుంది. బ్రహ్మం చేతనం, ప్రకాశరూపం, ఆనందాత్మకం. మరి జగత్తు అప్రకాశం, దుఃఖరూపం, ఈరెండింటి లక్షణాలు వేరు. కాబట్టి జగత్తుకు కారణం బ్రహ్మకాదు అని తార్కికులు వాదిస్తున్నారు. బ్రహ్మకు, జగత్తుకు విరోధ భావాలు, లక్షణాలు లేవు. బ్రహ్మం చైతన్యమే, అలాగే జగత్తు కూడా చైతన్యమే. ఉపనిషత్తులలో అనేక చోట్ల మృత్తిక చెప్పింది, ఉదకము ఆలోచించింది, వాయువు చెప్పింది, అంటూ పంచభూతాలకు చేతనత్వాలు చెప్పబడ్డాయి. చాందోగ్యంలో ఉపకోశలుడికి అగ్నులు ఉపదేశం చేశాయి. అంతేకాదు, ఇంద్రియాలు కూడా చేతనమే. బృహదారణ్యకంలో ఛాందోగ్యోపనిషత్తులలో ఇంద్రియాలు తమలో ఎవరు గొప్ప అని పొట్లాడుకున్నాయి. తీర్పు కోసం బ్రహ్మ దగ్గరకు వెళ్ళాయి. అప్పుడు బ్రహ్మ మీలో ఒక్కొక్కరే దేహాన్ని విడిచి వెళ్ళండి అంటాడు. ఇతర ప్రాణాలన్నీ ఒక్కొక్కరు బయటకు పోయినా శరీరానికి అంధత్వాది దోషాలు కలిగాయి. కానీ శరీరం పడిపోలేదు. అవన్నీ మళ్ళీ తిరిగి వచ్చాయి. చివరకి ప్రాణ శక్తి శరీరాన్ని విడిచి బయటకు వెళ్ళడానికి ప్రయత్నించగానే మిగిలిన ప్రాణాలన్ని చలించిపోయాయి. దీనిని బట్టి ఆ ప్రాణమే అన్నింటికన్నా శ్రేష్టమని నిర్ధారణ చేయడమైనది. ఈ సంఘటనతో ఇంద్రియాలకు చేతనత్వం ఉందని, జడత్వం లేదని తెలుస్తోంది. కాబట్టి బ్రహ్మ, జగత్తు రెండూ చేతనమేనని, చేతనం నుంచి చేతనమే పుడుతుందని కొందరి తార్కికులు వాదన. " తదాత్వంచ శబ్దాత్" అంటే సమస్త వస్తువులలో చేతనత్వం కనబడకపోయినా, ప్రకృతి చేతనత్వమని కేవలం శబ్దాన్ని (శృతి వాక్యం) వినడం చేత పంచభూతాత్మకమైన జగత్తు ప్రకృతి లక్షణమని తెలుస్తోంది.
సూత్రం :- 139
"అభిమాని వ్యాపదేశస్తు విశేషానుగతిభ్యాం"
తు:-ఈవాదన సరిఅయినది కాదు. విశేష అనుగతిభ్యాం:-(శరీర) విశేషం లోపల ప్రవేశించడం, వీటి వలన, అభిమాని వ్యపదేశహః :- మట్టి పలికింది లాంటి వాక్యాలలో మట్టి ,అగ్ని, జలం మొదలైనవి పలికింది, చూసింది అనే చోట్ల ఈశ్వరుడే ఆ క్రియలకు కర్త అని గ్రహించాలి.
భావం :- మట్టి, అగ్ని, జలం,మొదలైన వాటిలో ఈశ్వరుడు కర్తగా ఉండటం వలన అవి చూసింది, పలికింది అనే క్రియలు జరిగాయి.
వివరణ :- ఈ వాక్యాలలో పృధివి మొదలైనవి కర్తలు కారు. వాటిలో చేతనమైన పరబ్రహ్మ ఉండటమే కారణం. రాముడు పరుగెత్తాడు, ఆటలాడాడు, అనే చోట్ల పరుగెట్టడం, ఆటలాడటం క్రియలు, శరీరంలో ఉండే చేతనత్వమే ఆపనులు చేయించింది. అలాగే "మృత్ అబ్రవీత్ " అనే చోట్ల అచేతనమైన మృత్తికాదులలో ఉండే పరమాత్మ పలికాడు అని గ్రహించాలి. ఇలా పృథివ్యాదులను ఈశ్వరుడికి శరీరంలా వర్ణించడం ఉపనిషత్తులలో కనిపిస్తుంది.
బృహదారణ్యకోపనిషత్తు:-(3,7,3):-పృధివిలో ఉండేవాడు, పృధివికి అంతరుడు, ఆయనకు పృధివి శరీరం అని వర్ణించారు. పృధివిరూపశరీరంలో పరమేశ్వరుడు ప్రవేశించడం వలన శరీరానికి, అందులో ఉండే వ్యక్తికి తాదాత్మ్యం కల్పించారు. మృత్తికాదులు పలికాయి, అన్నప్పుడు మృత్తికాదులు చేతనాలు కావు. ప్రపంచము, ప్రకృతి జడమే. కనుక పృథివ్యాది జగత్తుకు ప్రకృతి ఉపాదానకారణం అనడంలో దోషం లేదు. ఉపనిషత్తులలో ఇంద్రియాలు మాట్లాడాయి అని చెప్పబడినది కదా! అక్కడ ఇంద్రియాలు అంటే వాటి అధిష్టాన దేవతలు అని అర్ధం. ఐతరేయోపనిషత్తులో నోటికి అగ్ని, ముక్కుకు వాయువు, కళ్ళకు సూర్యుడు, చెవికి ఆకాశం, నాలుకకు వరుణుడు, అధిష్టాన దేవతలుగా చెప్పబడ్డాయి. ఇంద్రియాలు, భూతాలు చేతనాలు కావు. అచేతనమని చెప్పబడే పంచభూతాలు, ఇంద్రియాలు కూడా కొన్ని చోట్ల చేతనాలు అన్నట్లు వినబడుతోంది. మట్టి పలికింది.ఆ తేజస్సు చూసింది, అని చెప్పినప్పుడు, ఆ భూతాలలో ఉండే చేతనత్వమైన పరమేశ్వరుడే దానికి కారణం.
సూత్రం :- 140
" దృశ్యతే తు"
తు- ఈసందేహం యుక్తం కాదు. దృశ్యతే:- సూక్ష్మకారణం వలన స్థూలకార్యాలు ఏర్పడటం లోకంలో కనిపిస్తుంది కదా !
భావము:- పృధివ్యాదులు జడం కావచ్చు. వీటిని ప్రకృతి వికారాలు అని ఎలా అంటారు? ప్రకృతి సూక్ష్మం. పృధివ్యాదులు స్థూలం. అందువలన బ్రహ్మాశ్రితమైన ప్రకృతి జగత్ కారణం అనడం సరియైనది కాదు కదా ! అనే సందేహం ఉంది. దానికి సమాధానం ఈ సూత్రంలో చెప్పబడింది. సూక్ష్మకారణములు వలన స్థూలకార్యాలు ఏర్పడటం లోకంలో కనిపిస్తోంది కదా! ఈ దృశ్యమాన ప్రపంచానికి బ్రహ్మాశ్రితమైన ప్రకృతి కారణం .
వివరణ :- చేతనం నుంచి అనేక అచేతన పదార్ధాలు పుట్టాయి. అలాగే అచేతనం నుంచి చేతనాలు పుట్టాయి. కాబట్టి అచేతనమైన జగత్తు చేతనం వలన వచ్చిదనడంలో సందేహం లేదు. బ్రహ్మ చేతనం, జగత్తు అచేతనం, కనుక జగత్తు బ్రహ్మచే సృష్టించబడలేదు అని చెప్పడానికి వీలులేదు. చేతనుడైన పురుషుడి నుండి అచేతనమైన గోళ్లు వెంట్రుకలు పుడుతున్నాయి. అలాగే అచేతనమైన పేడ, పెంటప్రోగుల నుంచి తేళ్లు, జెర్రులు పుడుతున్నాయి. ప్రకృతి, వికృతి అని రెండు ఉంటాయి. ప్రకృతి యొక్క ధర్మాలన్నీ వికృతిలో ఉండవు. పురుషుడు ప్రకృతి అయితే వాని నుంచి వచ్చిన గోళ్లు, వెంట్రుకలు వికృతి. పురుషుడి ధర్మాలు గోళ్లకు వెంట్రుకలకు ఉండవు. పేడ, పెంట యొక్క ధర్మాలు తేళ్లకు జెర్రులకు ఉండవు. అలాగే చేతనుడైన పరమాత్మ యొక్క ధర్మాలు జగత్తులో ఉండవలసిన అవసరం లేదు.కాబట్టి ప్రకృతిలోని సమస్త వికారాలకు ప్రకృతి బ్రహ్మమే. బ్రహ్మ ప్రకృతి అయితే ప్రకృతిలో వచ్చే మార్పులన్నీ వికృతి అనబడతాయి. బ్రహ్మ విషయంలో శృతి(వేదం) ప్రమాణం తప్ప తర్కం పనికి రాదు. అయితే అవసరమైనంతవరకే వేదప్రమాణం ఉన్నంత వరకు మాత్రమే తర్కించాలి.
శ్వేతాశ్వతరోపనిషత్తు:-(౬-౧౨):- ఆయన బీజకారణరూపంలో ఉన్న ప్రకృతిని అనేక రకాలుగా నిర్మిస్తాడు. ఈ లోకంలో సూక్ష్మమైన బీజం నుంచి పెద్ద వటవృక్షం ఏర్పడుతుంది. స్థూలమైన పృథివ్యాది రూపంలో ఉండే జగత్తుకు ఒక సూక్ష్మ కారణాన్ని అంగీకరించక తప్పదు. ఈజగత్తులో స్థూలపదార్ధములన్ని కార్యములు. ఇది తర్కవిరుద్ధం కాదు. తర్కం ఎన్నటికీ లోకవిరుద్ధం కాజాలదు. ప్రకృతి దాని వికారమైన జగత్తు సమానలక్షణాలు ఉండాలంటే అవి ఎలా ఉండాలి ? కార్యకారణములలో సాధారణ అసాధారణ ధర్మాలన్నీ సమానంగా ఉండాలా? అప్పుడు కార్యకారణములలో తేడా ఉండదు కదా! మట్టి నుండి కుండ ఏర్పడినప్పుడు మట్టి చూర్ణంలా, పొడిలా ఉన్నట్లు కుండ కూడా ఉంటుందా ? అందువలన కార్యము కారణమూ సమానంగా ఉండవు. కానీ వాటిలో అసాధారణధర్మాలు సమానంగా ఉంటాయి. ప్రకృతిలోని దాని వికారమైన పృధివ్యాదులలో జడత్వం ఉంది. కార్యం కారణరూపం పొందుతూ క్రమంగా ఎంతో సూక్ష్మరూపాన్ని ధరిస్తుంది. ప్రకృతిని మించి మరో సూక్ష్మకారణం లేదు. పంచభూతాలకు కారణం వాటికన్నా సూక్ష్మమైన తన్మాత్రలు. వాటికీ కారణం వాటికన్నా సూక్ష్మమైన అహంకారం. దానికి కారణం అంత కన్నా సూక్ష్మమైన మహత్తు( బుద్ధి ) దీనినే సాంఖ్యులు లింగం అంటే గుర్తు అన్నారు. దానికి కారణం అంతకన్నా సూక్ష్మమైన ప్రకృతి. దీని కన్నా సూక్ష్మమైనది మరొకటిలేదు. ఈ ప్రకృతే బ్రహ్మాశ్రితమై స్థూలజగత్తుకు కారణమౌతుంది. ప్రకృతికి పంచభూతాలకు జడత్వాది సమాన లక్షణాలు ఉన్నాయి. అందుచేత పృథివ్యాది స్థూలజగత్తుకు ప్రకృతి ఉపాదానకారణం కావడంలో ఏ దోషము లేదు .
సూత్రం :- 141: ప్రకృతి ఎందుకు స్థూల కారణం కాదు ? అనేది సందేహం .
'అసదితి చేన్న ప్రతిషేధ మాత్రత్వాత్
అసత్..ఈ జగత్తుకు కారణం అసత్తని , ఇతి చేత్:- చెప్పడం, న - సరి అయినది కాదు. ప్రతిషేధ మాత్రత్వాత్ :- అది అభావం కదా !
భావం :- ప్రకృతి స్థూల కారణం ఎందుకు కాదు? అనే సందేహానికి సమాధానం ఈ సూత్రంలో చెబుతున్నది. ఈ జగత్తుకి కారణం అసత్ అని చెప్పడం సరి అయింది కాదు.
వివరణ :-అసత్, అభావం అంటే ఉనికి లేకపోవడం అని అర్ధం. నామరూపాలు లేని బ్రహ్మం నామరూపాలు ఉన్న జగత్ కి కారణం. సృష్టికి ముందు అంతా బ్రహ్మమయమే. అసత్ కూడా ప్రకృతి లాగా సూక్ష్మమే కదా అని అనడం సరి అయింది కాదు. అసత్ అంటే అభావం. అది భావాత్మకమైన స్థూలజగత్తుకు ఎలా కారణం అవుతుంది ? సత్ అంటే భావం, అసత్ అంటే అభావం. పంచభూతాత్మకమైన జగత్తు మనకు కనిపిస్తోంది. భావప్రపంచానికి అభావమైన ప్రకృతి కారణం కాజాలదు. భావ, అభావాలు పరస్పర విరుద్ధాలు. విరోధం వలన కార్యకారణ సంబంధం కుదరదు. మట్టి కారణం కుండ కార్యం, మట్టి కుండలో ఉండటం చూస్తున్నము. అభావం భావకార్యరూపంలో అన్వయించదు. అన్వయించే కారణమే ఉపాదానకారణం. స్థూలకార్యం, సూక్ష్మకారణం వలన జనిస్తుంది. కానీ అసత్ కారణం వలన కార్యోత్పత్తి జరగదు. అసత్ ప్రకృతిలాగా సూక్ష్మం అనడం తగదు. ధర్మం ఎప్పుడు భావపదార్ధాన్ని ఆశ్రయించి ఉంటుంది. అందుకే అసత్ ప్రకృతి, సత్ జగత్తుకు కారణం కాదు. సత్ ప్రకృతే బ్రహ్మాశ్రితమై స్థూల జగత్తుకు కారణం అవుతుంది.
బ్రహ్మకారణవాదం:-జగత్తు ఉత్పత్తికి ముందు అసత్ ఉండేది. చేతనమైన బ్రహ్మ, అచేతమైన జగత్కార్యమునకు కారణంగా అంగీకరిస్తే అప్పుడు ఉత్పత్తికి పూర్వం అసత్ అనే మాట వస్తుంది. ఇది కేవలం అభావం ( ప్రతిషేధం ) మాత్రమే. మట్టి, బంగారం అనే కారణముల నుండి కుండ, కుండలాలు మొదలైన కార్యములు పుడుతున్నాయి. అవి పుట్టకముందు వాటి కారణములలో ఉన్నాయి కదా! కుండ పుట్టక ముందు అది సూక్ష్మ రూపంలో మట్టికణాలుగా ఉన్నాయి. ఈ కార్యములు పుట్టకముందు తమకారణంతో ఉన్నాయి. అసలు లేనిది, ఈకారణం నుంచి పుడుతున్నాయా అనేది ప్రశ్న. నైయాదికాదులు అయితే అసలు లేని కార్యమే కొత్తగా పుడుతోంది అంటారు. ఈ వాదానికి ఆరంభవాదం అని పేరు. పుట్టడానికి ముందు కూడా ఈ కార్యం తన కారణంతో ఉంటుంది. ఉంగరం తయారుకాక ముందు అది సూక్ష్మరూపంలో బంగారంలోనే ఉంది.
సత్కార్యవాదం:-సూక్ష్మరూపంలో ఉన్న జగత్తు ప్రయత్నం చేత పైకి కనబడుతుంది అని కొందరంటారు. దీనినే సత్కార్య వాదం అంటారు. సాంఖ్యులు, వేదాంతులు దీనిని అంగీకరిస్తారు. మట్టిలక్షణాలు కుండలోను, బంగారం లక్షణాలు ఉంగరంలోను ఉంటాయి. కాబట్టి కుండ మొదలైన కార్యాలు తాము స్థూలంగా కనబడుతున్నప్పటికీ పూర్వం కూడా సూక్ష్మరూపంలో తమతో సమానమైన లక్షణాలు గల మట్టిలో ఉంటాయి. అట్లే బ్రహ్మ నుండి పుట్టిన జగత్తు తన కారణమైన బ్రహ్మ లోనే ఉంటుంది. ఈ విధంగా సత్కార్యవాడానికి భంగం లేదు.
సూత్రం :- 142
'అపీతౌ తద్వత్ ప్రసంగాదసమంజసం '
అపీతౌ - ప్రళయ కాలంలో, తద్వత్ ప్రసంగాత్ :- కారణమైన ప్రకృతి కార్య జగత్తులాగా , అసమంజసం :- ఈ వాదన యుక్తం కాదు.
భావం :- ప్రళయకాలంలో ప్రతి కార్యవస్తువు కారణమైన జగత్తులో లీనమైపోతుంది అని అంటున్నారు కదా! ఏ జగత్తు స్థూలమైనది, అశుద్ధి అయినది, దుఃఖాత్మకమైనది. అది విలయమై ప్రకృతిరూపం పొందినప్పుడు జగత్తుకి ఉన్న స్థూలత్వాది ధర్మాలు, ప్రకృతికి ఆపాదిస్తుంది. ప్రకృతికి ఈధర్మాలు లేవు. అందుచేత జగత్తు ప్రళయంలో ప్రకృతి రూపాన్ని పొందుతుంది అనడం సమంజసం కాదు.
వివరణ :- ప్రళయకాలంలో కర్మపరిపక్వము చెందని ప్రాణులన్నీ, తమ కర్మలను తమతోబాటే మూట కట్టుకొని, బ్రహ్మలో లీనమౌతాయి.ఇదే విధంగా జగత్తంతా బ్రహ్మలో లీనమౌతుంది. మరి అటువంటప్పుడు జగత్తుకి ఉన్న అవలక్షణాలన్నీ బ్రహ్మకు సంక్రమిస్తాయి. కాబట్టి ఉపనిషత్తులలో చెప్పిన పరిశుద్ధము, చేతనము, అయిన బ్రహ్మ జగత్తుకు కారణం అని చెప్పడానికి వీలు లేదని వాదన, ప్రళయకాలంలో బ్రహ్మకుకూడా జగత్తుయొక్క అశుద్ధ్యాదుల ప్రభావం ఉంటుంది కనుక సర్వజ్ఞమైన బ్రహ్మ జగత్కారణం అని చెప్పడం సమంజసంకాదు. మరొక అర్ధం:- సమస్తమైన జగత్తు బ్రహ్మలో కలసి పోవడం వలన మళ్ళీ పుట్టేటప్పుడు, వేరువేరుగా పుట్టడానికి తగిన కారణం లేకపోవడం వలన ఇది భోక్త, ఇది భోగ్యం అనే విభాగం ఉండదు. అందువలన బ్రహ్మకారణ వాదం అసమంజసం. మరొక అర్ధం :- పరబ్రహ్మలో కలిసిపోయిన జీవులకు మళ్ళీ కర్మాదినిమిత్తం చేత మళ్ళీ జన్మ వస్తుందని అంగీకరిస్తే ముక్తులు కూడా మళ్ళీ పుట్టవలసి వస్తుంది. కనుక బ్రహ్మ కారణంవాదం అసమంజసం. మరొక అర్ధం :- ఈ జగత్తు ప్రళయకాలంలో కూడా బ్రహ్మలో పూర్తిగా కలసిపోకుండా వేరుగా ఉంటుంది అని భావిస్తే, అప్పుడు ప్రళయమే రాదు కదా! అప్పుడు కార్యం, కారణం కంటే భిన్నంగా ఉంటుంది. ప్రకృతి, జగత్తుకి భిన్నంగా ఉంటుంది. ఈ విధంగా కూడా ఈవాదం అసమంజసమే.
సూత్రం ( 143 )
'న తు దృష్ఠాంత భావాత్'
తు :- ఈ సందేహం సరియైనది కాదు. దృష్ఠాంత భావాత్ :- అనేక దృష్ఠాంతములు ఉన్నందు వలన, న అసమంజసం :- ఈ వాదం అసమంజసం కానేరదు.
భావం :- జగత్తుకు ఉన్న అవలక్షణాలన్నీ బ్రహ్మకు సంక్రమిస్తాయనడం సమంజసం కాదు. దీనికి అనేక దృష్ఠాంతములు ఉన్నాయి.
వివరణ:-ఈవాదన సరియైనది కాదు. ఎందుకంటే మట్టిలో కలసిపోయిన కుండ తనకు కారణమైన మట్టిని కలుషితం చేయదు. అలాగే బంగారు ఆభరణాలు బంగారంలో కలసిపోయినప్పుడు, ఆ బంగారాన్ని దూషితం చెయ్యవు. ముండకోపనిషత్తు :- ఈ సమస్తము బ్రహ్మకు సృష్టి ఆరంభంలో అంతా బ్రహ్మమయంగానే ఉండేది. పరబ్రహ్మ స్వయం ప్రకాశం కలవాడు, నిరాకారుడు, పుట్టుక, ప్రాణము, మనస్సు లేనివాడు పరిశుద్దమైనవాడు. అతని నుండే ప్రాణము, మనస్సు, ఇంద్రియాలు పంచభూతాలు పుడుతున్నాయి. గారడీవాడు తాను చేసే మాయద్వారా దూషితుడు కానట్లే, పరమాత్మ కూడా తనలో లీనమైన జగత్తు వలన దూషితుడు కాడు. ప్రళయంలో కార్యం కారణంతో లీనమౌతుంది. కాగా కార్యధర్మాలన్నీ కారణానికి సంక్రమించవు. మట్టి నుంచి తయారైన కుండ పగిలిపోయి, మళ్ళీ మట్టిలో లీనమైపోతుంది. అంచు, గుండ్రని రూపం, నీళ్లు నిల్వ చేసే లక్షణం లాంటి ధర్మాలు మట్టికి సంక్రమించవు. అలాగే కుండలాలు, ఆభరణాలు మొదలైనవి కరిగించినప్పుడు, మళ్ళీ స్వర్ణరూపాన్ని పొందుతాయి. కానీ ఆభరాల యొక్క ఆకారం వాటి ధర్మాలు బంగారానికి అంటవు. పంచభూతాది వికృతజగత్తు ప్రళయంలో వికృతిరూపం దాల్చినా, వాటి ధర్మాలు దానికి సంక్రమించవు అని తెలుస్తోంది. ప్రళయంలో జగత్తంతా స్వధా అంటే ప్రకృతి రూపంలో పరమాత్మను ఆశ్రయించి ఉంటుందని వేద ప్రమాణమని గ్రహించాలి.
ఋగ్వేదం :- ప్రళయంలో మృత్యువు, జీవనం, రాత్రి, పగలు ,ఇవేమి ఉండవు. ప్రకృతితో కూడిన పరమాత్మ తప్ప వేరేది ఉండదు. తనలో కార్యాన్ని ధరించడం వలన ప్రకృతిని స్వధా అంటారు. అందువలన వైదిక మతం అసమంజసం కాదు . స్వప్న సమయంలో జరుగుతున్న వ్యవహారం, అది జరుగుతున్నంతసేపూ అది యదార్ధమే అనిపిస్తుంది. దానికి కారణం ఆ సమయంలో యదార్ధ జ్ఞానం లేకపోవడమే. అదే ప్రకారంగా సుషుప్తి కాలంలో ప్రాణులన్నీ బ్రహ్మలో ఐక్యం పొందుతున్నా కూడా, తిరిగి పూర్వం ఏ ప్రాణులు ఏ విధంగా ఉన్నాయో, అవే ప్రాణులుగా మేల్కొంటున్నాయి. అందుకు కారణం మిధ్యా జ్ఞానమే. ఈ ప్రాణులన్నీ బ్రహ్మ యందు ఏకత్వాన్ని పొంది, బ్రహ్మలో కలసిపోతున్నామని ఎరుగవు. అవి సుషుప్తికి పూర్వం ఏవ్యాఘ్రంగానో, సింహంగానో, వరాహంగానో, మిడత, ఈగ ఇలా ఏ జాతివిభాగంలో ఉండేవో, అవి అలాగే మేల్కొన్న తరువాత అలాగే ఉంటాయి అని శృతి చెబుతోంది. సుషుప్తిలో పరమాత్మయందు అవిభాగం ఏర్పడినప్పటికీ, మిధ్యాజ్ఞానం వలన అది స్వప్నంవలె కనబడుతోంది. అట్లే ప్రళయకాలంలో కూడా జగత్తు బ్రహ్మలో లీనమై, తిరిగి జన్మ రావడానికి కారణమౌతుంది. ముముక్షువులు సమ్యక్ జ్ఞానం చేత మిధ్యాజ్ఞానం పూర్తిగా నశించి, పరబ్రహ్మంలో లీనమై జన్మ రాహిత్యాన్ని పొందుతారు.
సూత్రం :- 144
'స్వపక్ష దోషాచ్చ.
న - అసమంజసం అనేవి అనువృత్తులు (అసమంజసం కాదు). చ - అంతే కాక స్వపక్ష దోషాత్ :- సందేహంలో కార్య ధర్మాలు కారణానికి సంక్రమిస్తాయి అనే దోషం ఉంది.
భావం:- ప్రళయకాలంలో జగత్తు(కార్యం)పర బ్రహ్మంలో(కారణంతో) లీనమైనప్పుడు జగత్తు యొక్క ధర్మాలన్నీ బ్రహ్మానికి సంక్రమిస్తాయి అనే దోషం ఉన్నది. కనుక వైదిక మతం సమంజసమే.
వివరణ..జగత్తుకు అసత్ ప్రకృతి కారణం అంటారు. పృధివ్యాది జగత్తు ప్రళయంలో అసత్ రూపాన్ని పొందుతుంది కదా! అప్పుడు పృధివ్యాదులకున్న స్థూలత్వధర్మాలు అసత్ కు కూడా సంక్రమిస్తాయి. అంటే కార్యధర్మాలు అభావమైన అసత్తులో ఎలా ఉంటాయి? అభావం ధర్మాశ్రయం కదా! కనుక వైదిక మతం అసంజసమే అని చెబుతోంది. సాంఖ్యులు చెప్పే దోషాలు వారి మతంలోనూ ఉన్నాయి. కాబట్టి దోషాలు దోష పరిహారాలు రెండు మతాల్లోనూ సమానమే.
1. బ్రహ్మ కన్నా జగత్తు విలక్షణమైనది ఆ రెండింటికి ప్రకృతి, వికృతుల భావం కుదరదు.
2. సృష్టికి పూర్వం అంతా అసత్తుగానే అంటే ఉనికి లేకపోవడం ఉండేది.
3. ప్రళయకాలంలో జగత్తు అంత బ్రహ్మలో లీనమైపోయినప్పుడు బ్రహ్మ అపరిశుద్ధ మౌతాడు.
ఈ దోషాలు సాంఖ్యమతంలో ఉన్నాయి.
1.శబ్దహీన మైన ప్రకృతి నుండి శబ్దాదులు గల జగత్తు పుడుతోంది. ఈ రెండింటికి కూడా ప్రకృతి, వికృతి భావం కుదరదు.
2. ప్రళయ కాలంలో గుణాలే లేని ప్రకృతిలో గుణాలు గల జగత్తు లీనమైనప్పుడు ప్రకృతి దోష భూయిష్టం అవుతుంది.
3. దోషాలన్నీ సాంఖ్యమతానికి వర్తిస్తాయి. కానీ ఉపనిషత్తులకు వర్తించవు.
స్వపక్షం లోనే దోషాలుండటం వలన ఈఆక్షేపణ సమంజసం కాదు. సాంఖ్యులు ప్రధానమైనది ప్రకృతే కానీ బ్రహ్మ కాదు. సాంఖ్యులు శబ్దాదిహీనమైన ప్రధానం నుండి శబ్దాదులు గల జగత్తు ఉత్పత్తికి కారణమని ప్రళయ కాలంలో కార్యమైనా జగత్తు కారణమైన ప్రకృతిలో లీనమౌతుందని చెప్పారు. ప్రకృతిలో లీనం అయినప్పుడు ప్రళయానికి ముందు ఏ భేదాలు ఉన్నాయో అదే విధంగా మళ్ళీ ఉత్పత్తిలో భేదాలు ఉంటాయని చెప్పడానికి తగినంత కారణం ఏది లేదు. ముక్తులకు మళ్ళీ జన్మ వచ్చే అవకాశం ఉంది. అట్లు కాక కొన్ని భేదాలు అర్హులకు సంబంధించినవి ప్రధానంలో అవిభాగం పొందుతాయి. ముక్తులకు సంబంధించినవి అవిభాగం చెందవు. ఈ విధంగా దోషాలన్నీ సమానమే. సాధారణమైనవే.వీటిని దోషాలుగా పరిగణించి ఎట్టి చూపవలసిన పని లేదు.
సూత్రం :- 145
తర్కా ప్రతిష్టా నాదప్యన్య థాను మేయం ఇతి చేదేవ మప్య విమోక్ష ప్రసంగః'
అసమంజసంన :- అనేవి అనువృత్తులు, తర్కఅప్రతిష్టా వాత్ :- తర్కానికి ప్రతిష్ట నిలకడ లేనందువల్ల, అపి :- తర్కబలం వలన, న అసమంజసం- వైదిక మతాన్ని అసమంజసం అనకూడదు, అన్యధా :-మరొక రకంగా , అనుమేయం ఇతిచేత్ :- తర్కానికి ప్రతిష్ట ఉన్నదని ఊహిస్తారా!, ఏవం అపి :- అలా ఊహించినా, అవి మోక్ష ప్రసంగః :-తర్కానికి అప్రతిష్ట దోషం నుంచి విముక్తి లేదు.
భావం :- తర్కానికి ప్రతిష్ట నిలకడ లేనందున, తర్కబలం వలన వైదికమతాన్ని అసమంజసం అనకూడదు. తర్కానికి అప్రతిష్ట దోషం నుంచి విముక్తి లేదు. నిలకడ లేని తర్కం వైదికమతాన్ని ఎలా కాదంటుంది?
వివరణ :- తర్కం ఒప్పుకోకపోయినప్పటికీ బ్రహ్మయందు వేదాంత వాక్యాలు సమన్వయించడంలో ఆక్షేపణ ఉండదు. ఒక తార్కికుడు చెప్పే అర్ధం, మరొక తార్కికుడు ఒప్పుకోడు. కాబట్టి తర్కం నిలకడ లేనిది. వేదాంతసిద్ధాంతం ప్రకారం జగత్కారణం బ్రహ్మమే. ఇందులో సందేహం లేదు. ఏ విధమైన సందేహాలకు తావు లేకుండా ఉండే జ్ఞానమే తత్త్వజ్ఞానం. ఇందులో విరుద్ధభావాలు లేవు. వేదాలను అనుసరించకుండా చెప్పే జ్ఞానం సమ్యక్ జ్ఞానం కాదు. అటువంటి జ్ఞానం వలన మోక్షం రాదు. కాబట్టి వేదప్రమాణం లేని తర్కం పనికి రాదు. ఈ జగత్తుకు బ్రహ్మమే ఉపాదాన కారణం. అందులో ఏ మాత్రం సందేహం లేదు.
వైశేషిక దర్శనం :-వేదం స్వతః ప్రమాణం. దోష యుక్తమైన తర్కబలంతో వైదికమతాన్ని కాదనకూడదు. అసత్ వాద మతాన్ని వదిలేసి, వైదికమతాన్ని అంగీకరించడం యుక్తమని సూత్రానికి అర్ధం. లోకంలో తర్కాలు రెండు రకాలు. 1.శాస్త్రాన్ని ఆశ్రయించి ఉండే తర్కం శృతి, స్మృతులు అంగీకరిస్తాయి. ఇవి స్వతంత్ర తర్కం. 2.లోకంలో పురుషులు చేసేది, ఇది వేదసమ్మతం కాదు. వేదం సర్వజ్జుడైన ఈశ్వరుణ్ణించి ప్రభవించిందని కణాదమహర్షి అంటాడు. వేదాలు అపౌరుషేయాలు. పురుషులు చేసే తర్కంకూడా ఒకరు చేసినది మరొకరు అంగీకరించరు. వీటిలో ఒక తర్కాన్ని ఉత్క్రుష్టం అని అనలేము. అసద్వాదితర్కం దోషయుక్తం. ఆగమాల సహాయం లేకుండా పురుషులు ఊహామాత్రం చేత చేసిన తర్కాలు అప్రతిష్టాలుగా నిలకడ లేనివిగా ఉంటాయి. కొందరు బుద్ధిమంతులు ప్రయత్నపూర్వకంగా ఊహించిన తర్కాలను వాళ్ళ కంటే ఎక్కువ బుద్ధి ఉన్న వాళ్ళు అర్ధరహితాలుగా చెయ్యడం కనబడుతుంది. వాళ్ళు ఊహించిన తర్కాలను వాళ్ళ కంటే ఎక్కువ బుద్ధిబలం ఉన్నవాళ్లను అభాసం చేస్తున్నారు. అందువలన పురుషుల బుద్ధులు అనేక విధాలుగా ఉండటం వలన తర్కాలు ప్రతిష్ఠితంగా అంటే నిశ్చితంగా ఉంటాయని చెప్పడం శక్యం కాదు.
శిష్టా పరిగ్రహాధికరణం :- ( 2 , 1 , 12 )
సూత్రం :- 146
'ఏతేన శిష్టా పరిగ్రహా అపి వ్యాఖ్యాతః '
ఏతేన:- తర్కానికి ప్రతిష్ట లేదని నిర్ణయించినందువల్ల. శిష్ట అపరిగ్రహ అపి :- శిష్టులు అంగీకరించని అవైదిక శూన్యవాదం లాంటి సిద్దాంతాన్ని సైతం, వ్యాఖ్యాతః :- అసత్ వాదం లాగా వైదికులు అంగీకరించరని వ్యాఖ్యానిస్తున్నాయి.
భావం:- తర్కానికి ప్రతిష్ట లేదని, అవైదిక శూన్యవాదం లాంటి సిద్ధాంతాలను సైతం వైదికులు అంగీకరించరని వ్యాఖ్యానిస్తున్నాయి.
వివరణ :- ఏ సిద్ధాంతాన్నైనా సరే శిష్టులు ఖండిచినట్లైతే ఆసిద్ధాంతాన్ని అందరూ తిరస్కరించినట్లే. కపిలమహర్షి సాంఖ్య దర్శనంలో విశ్వసృష్టికి మూలప్రకృతి ప్రధానకారణమని చెప్పాడు. సాంఖ్యం సత్కార్యవాదాన్ని సమర్థిస్తుంది. దీని ప్రకారం ఏదైనా పనిలో కారణమూ, ఫలితము కలసి ఉంటాయి. ఉన్నది నశించదు. లేనిది ఉత్పన్నం కాదు. ప్రకృతి పరిణామ వాదం ప్రకారం మూల ప్రకృతే అన్నింటికీ కారణం.
వైశేషిక దర్శనం :- దీని కర్త కణాదమహర్షి. అసలు పేరు కశ్యపుడు. దీనిలో ఈశ్వరుడి ప్రసక్తి ఎక్కడా ఉండదు. కార్యం అనేది కొత్తగా పుట్టుకొస్తుంది. కార్యంలో కనబడే లక్షణాలు కారణంతో కనబడవు. మట్టి లోనుండి కుండ తయారైనా, మట్టి లక్షణాలు వేరు, కుండ లక్షణాలు వేరు. కుండ ఆకారంలో మట్టిఉండదు. అణువుల సంయోగం వలన ప్రపంచం ఏర్పడింది. ఆయాఅణువుల గుణాలు, ధర్మాలు సంయోగాన్ని అనుసరించి పదార్ధంయొక్క భౌతికరూపం స్వభావాలు మారు తుంటాయి. ఒకే రకమైన కణజాలాన్ని కలసి వస్తురూపం పొందుతాయి. ఉదా:-అగ్నితత్త్వం గల అగ్నికణాలు సంయోగం చెంది, సూర్యగోళం ఏర్పడింది అని చెబుతారు. వీరిది అసత్కార్య వాదం. అంటే కారణం వేరు, కార్యం వేరు. సాంఖ్యులు అనువాదుల సిద్ధాంతాల నన్నింటిని మనువు వ్యాసుడు వంటి మహానుభావులు ఖండించారు. కొంతవరకు ఈ వాదనలు వేదాలను అనుసరించి ఉన్నప్పటికీ అవి మొత్తం మీద వేద విరుద్ధములే. వీటిలో ముఖ్యమైన సాంఖ్య సిద్ధాంతాన్ని తిరస్కరించడం వలన, వేదాలలో లేనటువంటి కణాది, బౌద్ధ, అక్షపాదమత సిద్ధాంతాలనన్నింటిని కూడా ఖండించినట్లే అవుతుంది. వైదికులు అసత్ వాదాన్ని, శూన్యవాదాన్ని, సాంఖ్యవాదాన్ని ఖండించి, జగత్తుకు బ్రహ్మమే ఉపాదాన కారణమని సమర్ధించారు.
భోక్త్రా పత్త్యధికారణం ( 2,1,13)
సూత్రం :- 147
భోక్త్రా పత్తేరవిభాగశ్చేత్స్యాల్లోకవత్
భోక్త్ర పత్తేః :- భోగ్యానికి మూల కారణమైన ప్రకృతికి భోక్త్ర రూపం అయిన ప్రసక్తి కలుగుతుంది. అవిభాగః చేత్ :- ప్రళయ కాలంలో జీవులు ప్రకృతిలో అవిభక్తులై ఎలా ఉంటారని తెలుసుకోవడం కొరకు, స్యాత్ లోకవాత్ :- లోకానుభవం అవసరమౌతుంది.
భావం :- ప్రళయకాలంలో జీవులు ప్రకృతిలో కలిసిపోయి అవిభక్తులుగా ఎలా ఉంటారో తెలుసుకోవడానికి లోకానుభవం అవసరమౌతుంది.
వివరణ :- గురువుగారు! భోక్త అంటే చేతనుడైన జీవుడు. భోగ్యం అంటే శబ్దాది విషయసమూహం. బ్రహ్మమే జగత్తుకు ఉపాదానకారణం. కాబట్టి భోగ్యవస్తువులకే భోకృత్త్వం లభిస్తుంది. అందుచేత భోక్త, భోగ్య విభాగం కుదరదు కదా! అన్నాడు కృష్ణ శర్మ. ఆ మాటలు విన్న రత్నాకరుడు చెప్పడం ప్రారంభించాడు. బ్రహ్మం ఈ జగత్తుకు ఉపాదాన కారణం. భోక్త రూపంలో కానీ, భోగ్యరూపంలో కానీ కనిపించే జగత్తంతా బ్రహ్మకన్నా భిన్నమైనది కాదు అన్నాడు రత్నాకరుడు . అందువల్ల భోక్త, భోగ్యము అనే విభాగం ఉండదు. కుండ, మూకుడు వీటిలో ఉన్నది మట్టే కాబట్టి వస్తువులలో తేడా ఉన్నప్పటికీ, వాటికీ కారణమైన మట్టిలో తేడా లేదు. అలాగే జగత్తుకు బ్రహ్మ ఉపాదాన కారణం, ఈ జగత్తు, బ్రహ్మ రెండు వేరు కాదు. భోగ్యానికి మూల కారణమైన ప్రకృతి కి భోక్తృ రూపం అయిన ప్రసక్తి కలుగుతుంది. జీవులు రెండు రకాలు. 1.ముక్తులు 2. బద్ధులు. ముక్త జీవులు ఈశ్వరుడిలో అవిభక్తులై ఉండి, ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. బద్ధజీవులు ప్రళయకాలంలో స్థూలశరీరాలు లేకపోవడంచేత, కర్మఫలాలైన సుఖదుఃఖములను అనుభవించే వీలులేక ప్రకృతిలో లీనమై అవిభక్తవ్యవస్థలో ఉంటారు. ప్రకృతి సూక్ష్మం. అంతకన్నా సూక్ష్మం జీవులు. అందుచేతనే ప్రకృతిలో అవిభక్తస్థితిలో ఉండే జీవులను వేరుచేసి, తెలుసుకోవడం శక్యం కాదు. కేవలం శాస్త్రదృష్టితోనే తెలుసుకోగలం. ఈదశలో అసత్ వాడికి ఒక సందేహం కలుగుతుంది. 1.ప్రకృతి భోగ్యం కదా! ప్రళయకాలంలో జీవులు ప్రకృతిలో అవిభక్తస్థితి పొందుతారని ఒప్పుకుంటే, భోగ్యమైన ప్రకృతి భోక్త కావలసివస్తుంది. ప్రకృతిని భోక్త అనడం తప్పుకదా! సమాధానం :- వర్షాకాలం తరువాత వేసవిలో ఓషధులు భూమిలో లీనమై, అవిభక్తస్థితిలో ఉంటాయి. మళ్ళీ వర్షాలు పడటంవలన భూమితడిసి, ఓషధులు మళ్ళీ మొలకెత్తుతాయి. ఇక్కడ భూమి భోగ్యం, ఓషధులు భోక్తలు. అవి భూమిలో ఉన్నంత మాత్రాన భూమి భోక్త కాదు కదా ! భోగ్యమైన ప్రకృతి భోక్తలైన జీవాత్మలు అవిభక్తస్థితిలో తనలో ఉన్నంతమాత్రాన, భోక్త ఎన్నడూ కాదు. రెండు జడ పదార్ధాలు ఒక దానిలో మరొకటి అవిభక్తస్థితిలో ఉన్నప్పుడు ఒకటి తన ధర్మంతో మరొక దానిని ప్రభావితం చేయవచ్చును. కానీ జడపదార్ధం, చేతనపదార్ధాల విషయంలో ఇలా జరగదు. ప్రకృతి భోక్త కాదు. ప్రకృతి జడం. జీవుడు చైతన్యం. ఈ స్వభావం ఏ స్థితిలో ఉన్న మారదు.
సందేహం :- ప్రకృతి కారణం, జగత్తు కార్యం. కార్యం, కారణం కన్నా అన్యమా? అనన్యమా? అనన్యం అయితే ప్రకృతిని ఒప్పుకోవాల్సిన పనిలేదు. ప్రకృతికన్నా భిన్నం అయితే కనుక ప్రకృతి లేకున్నా జగత్తు ఉత్పన్నం అవుతుంది. అనన్యం అయితే ప్రకృతే కార్యం అవుతుంది. కనుక దానికి మరొక కారణం ఉండాలి. ఆ కారణం కూడా అనన్యమైతే దానికి ఇంకో కారణం ఉండాలి కదా! కారణవ్యాపారం వలన కొత్తగా ఏర్పడేది ఏమిలేదు. ఈ సందేహాలకు వ్యాసుడు సమాధానం చెబుతున్నాడు.
సూత్రం :- 148
తదన్యత్వమారంభణశబ్దాదిభ్యః
తత్ అనన్యత్వం:-కార్యరూపజగత్తు ప్రకృతికంటే అన్యం-వేరే కాదు. దీనికి ఆరంభణ శబ్దాదిభ్యః-ఉపనిషద్ వాక్య ప్రయోగం.
భావం :- కార్యరూపజగత్తు, ప్రకృతి కంటే వేరే కాదు అని ఉపనిషత్తు వాక్య ప్రమాణంగా ఉంది.
వివరణ:- ఉత్పత్తికి పూర్వం కార్యం, కారణంకన్నా సదా భిన్నంఅని కానీ, ఎల్లప్పుడూ భిన్నంకాదని కానీ, అంగీకరించకూడదు.
బృహదారణ్యకోపనిషత్తు:-(6,4,7} మృత్తిక మాత్రమే సత్యం అనే ఈవాక్యానికి కారణాన్ని మించి కార్యం అనేది ఏది వేరుగా లేదని చెప్పడం లేదు. అలా అనాలనుకుంటే నామరూపాలు కారణవికారాలు అనే పదాలు ఉండేవి కాదు. మట్టిలో కనిపించే వివిధ రకాల పాత్రలకు నామం, రూపం అనే అంశాలు రెండు కారణ వ్యాపారం వలన జనిస్తాయి. అందుకే కార్యం అంటారు. కావున కార్యం అనిత్యం. కనుక అది సత్తు కాదు. దానికి కారణమైన దానినే సత్థు అంటారు. ఘటం, మూకుడు అనేవి వస్తువుల పేర్లు. వాటి ఆకారమే రూపం. ఇవి రెండు ఉత్పత్తికి పూర్వం మట్టిలో కారణ రూపంలో ఉన్నా, అవి మన కంటికి గోచరించవు. వాటి ఉత్పత్తి జరిగిన తరువాత మాత్రమే కనిపిస్తాయి. దానినే కార్యోత్పత్తి అంటారు. ఈ రూపం లేకపోయినా దాని ఉనికి మట్టిలోఉండి అవ్యక్తంగా ఉంటుంది. కారణరూపమైన మట్టి నుంచి జనించేది కార్యమైన ఘటము, ఉత్పత్తికి పూర్వం ఘటంలా ఉండదు. ఆలా ఉత్పత్తి జరగకపోతే కారణ వ్యాపారం జరగదు కొత్తగా కలిగించే సామర్ధ్యం కారణానికి లేదు. ఇసుకలో తైలం ఏరూపంలోనూ ఉండదు. కనుక ఎన్ని వ్యాపారాలు చేసినా నూనె రాదు. ఉత్పత్తికి ముందు తరువాత కూడా అలాగే ఉంటుంది. దానినే అసత్ అంటారు. గురువుగారు జగత్తుకు బ్రహ్మకు భేదం లేదు అన్నారు. దీని వలన జగత్తుకు భొకృత్వం వస్తుందనే దోషాన్ని కూడా పరిహరించారు. కానీ లోకంలో కనిపించే మట్టికుండ ఉదాహరణగా చెప్పడం వలన కార్యకారణములకు భేదం కనిపిస్తోంది కాబట్టి జగత్తుకు బ్రహ్మకు భేదం ఎందుకు చెప్ప కూడదు? అన్నాడు నారాయణభట్టు. రత్నాకరుడు చెప్పడం ప్రారంభించాడు. కార్యం జగత్తు. కారణం బ్రహ్మ. ఈరెండింటికి భేదంలేదని వేదాలలో చెప్పబడింది. మట్టి తెలుసుకుంటే ఆమట్టితో చేసే వివిధరకాల వస్తువులు పేర్లలోనూ ఉపయోగాలలో తేడా ఉన్నా వాటిని గురించి తెలుస్తుంది. ఎందుకంటే అవన్నీ పేరుకు మాత్రమే వికారాలు. మట్టి అనేది సత్యం. మట్టితో తయారైన పాత్రల రూపంలో తేడా ఉన్నప్పటికీ అవి మట్టి కన్నా భిన్నమైనవి కావు. అలాగే బంగారం ఆభరణములు తేజము జలము అన్నము అనే వాటిని బ్రహ్మకు కార్యంగా చెప్పినప్పుడూ కార్యరూపంలో ఉన్న ఇవి తమకు కారణరూపం కన్నా భిన్నమైనవి కావు. వికారాలన్నీ ఎప్పుడు నామమాత్రమే. ఛాందోగ్యంలో ఉద్దాలకుడి సృష్టి అంతా ఆత్మస్వరూపం. అది సత్యం. అదే ఆత్మ. అదే నీవు ఈ సమస్తము ఆత్మపదార్ధమే. ఇక్కడ భిన్నమైనది ఏది లేదు. కాబట్టి కారణం సత్యం. కార్యం వికారం అందుకే కారణమైన బ్రహ్మ సత్యం. కార్యమైన జగత్తు మిధ్య. కార్యకారణములకు భేదం లేదు.
సూత్రం :- 149
భావో చోప లబ్దేః
చ- అలాగే, భావ -కారణంలో, ఉపాలబ్ధేః - కార్యం లభించడం వలన, అది కారణం కన్నా అన్యం కాదు.
భావం :- కారణం ఉన్నప్పుడే, కార్యం లభించడం జరుగుతుంది.
వివరణ:-ఘటరూపంలో ఉండే కార్యం, మట్టిరూపంలో ఉండే కారణం ఉన్నప్పుడే సంభవిస్తుంది. అలాగే వస్త్రం తంతువులు ఉన్నప్పుడే జనిస్తుంది. లేకుంటే వస్త్రం ఏర్పడదు. మట్టి ఉంటేనే కుండ తయారవుతుంది. బంగారం ఉంటే కుండ ఎలా తయారవుతుంది. కాబట్టి కార్యకారణములకు భేదం లేదు. నియమితమైన కారణములు ఉన్నప్పుడే ఆయా కార్యాలు జనిస్తాయి. కార్యం జనించడానికి నియమం ఉండేది కాదు. వస్త్రం కన్నా మట్టి వేరు. కుండా కన్నా దారాలు అన్యము. దారములున్నప్పుడే వస్త్రం, మట్టి ఉన్నప్పుడే కుండ తయారు చేయడం సంభవం. అందువల్ల వస్రం తంతువులకు అనన్యం. ఒకటి ఉన్నప్పుడు రెండవది ఉండటాన్ని అన్వయం అంటారు. ఒకటి లేనప్పుడు రెండవది కూడా లేకపోవడాన్ని వ్యతిరేకమంటారు. వైశేషిక దర్శనంలో కారణం ఉంటేనే కార్యం ఉంటుంది. కారణం లేనప్పుడు కార్యం లేదు. కనుక కార్యం ఉత్పత్తికి కార్యం కన్నా అన్యం కాదు. జగత్తు ఉత్పత్తికి పూర్వం ప్రకృతి కన్నా అన్యం కాదు అని కణాద మహర్షి అంటాడు. కారణం ఉన్నప్పుడే కార్యం కనబడుతుంది. కార్యం లేనప్పుడు కనబడదు. బంగారం లేకపోతే ఆభరణాలు కనబడవు. మట్టి ఉంటేనే ఘటం కనబడుతుంది. దారాలు ఉన్నప్పుడే వస్త్రం కనబడుతుంది. ఒకటి ఉన్నప్పుడు దానికంటే భిన్నమైనది మరొకటి కనబడదు కదా! (ప్రశ్న) ఒకటి ఉన్నప్పుడు దానికన్నా భిన్నమైనది మరొకటి తప్పనిసరిగా కనబడుతోందికదా! ఉదా:-అగ్ని ఉన్నప్పుడే ధూమం కనబడుతోంది. (సమాధానం) అగ్ని ఆర్పివేసిన కూడా చిన్నపాత్రలో ధూమం కనబడుతుంది. ఇలాంటి ధూమం అగ్ని లేకుండా ఉండదు అని చెప్పిన దోషము లేదు. వాటి మధ్య అభేదం లేదు. కార్యకారణములు అనన్యములనే విషయం కేవలం వినడమే కాకుండా ప్రత్యక్షంగా కనబడుతుంది. అందువలన అనన్యత్వం అంగీకరించాలి.అందుకు బుద్ధి పూర్వకమైన ప్రత్యేక్ష జ్ఞానం ఉండాలి. ఉదా :- తంతువులు ఒక విధమైన కూర్పుమాత్రమే అయినా, పటంలో తంతువుల కంటే భిన్నంగా పటం అనే కార్యం కనబడదు. పడుగు, పేక ప్రత్యక్షంగా కనబడతాయి. దాని వెనుక ఉన్న వస్త్రం బుద్ధికి మాత్రమే గోచరిస్తుంది. అదే విధంగా బ్రహ్మకు జగత్తుకు మధ్య భేదాభేదాలున్నాయని భ్రాంతి కలుగుతుంది. దానిని తొలగిందానికి ఈ అధికారణంలో ఏభేదం లేదని చెప్పబడింది. లోహిత, శుక్ల , కృష్ణ రూపమైన అగ్నికి కారణం వాయువు, దానికి కారణం ఆకాశం, వెనుక అద్వితీయమైన బ్రహ్మమే కనబడుతుంది. సర్వప్రమాణాలు అక్కడే ఆగిపోతాయి. అగ్నిలో ఉన్న ఎర్రటి తేజస్సు, తెల్లని రూపమున్న ఉదకము, నల్లని రూపమున్న పృధ్వి, మూడు రూపాలు విడదీస్తే అగ్ని అంటూ ఏమి మిగలదు. అన్నింటి కలయికే అగ్ని. ఈ విధంగా కారణం కంటే వేరుగా కార్యం లేదని గ్రహించాలి. పంచభూతాలలో పృధ్వి నీరు అగ్ని మాత్రమే కనిపిస్తాయి. వాయువు, ఆకాశం కనబడవు.అందుకే కార్యకారణముల అనన్యత్వం విషయంలో ప్రత్యక్ష జ్ఞానం ఉండాలి.
ఆరంభణాధికరణం :- ( 2,1,16 )
సూత్రం :- 150
'సత్త్వాచ్చావరస్య '
చ :- అంతే కాకుండా , అవరస్య :- కార్యం, సత్వాత్ :- ఉత్పత్తికి పూర్వం కారణరూపంలో ఉందని చెప్పడం వలన ,
భావం :- ఉత్పత్తికి ముందు ఈ జగత్తంతా కారణరూపంలో ఉన్నట్లు ఉపనిషత్తు చెబుతోంది.
వివరణ :- కార్యము అంటే వస్తువు రావడానికి ముందు కూడా ఆవస్తువుకు సంబంధించిన కారణం ఉంటుంది. కాబట్టి కార్యకారణములకు భేదం లేదు. కుండ తయారు కాక ముందు, తరువాత కూడా మట్టి ఉంది. అది అంతా ఒక్కటే పదార్ధం కాని వేరే ఏదికాదు. సృష్టికి ముందు అంతా ఆత్మమయంగానే ఉండేది. మట్టి నుండి కుండ పుట్టినట్లే బ్రహ్మ నుండి జగత్తు ఉద్భవించింది.
ఛాందోగ్యోపనిషత్తు:-(6,2,1):-ఓసౌమ్యా! ఈజగత్తు ఉత్పత్తికి పూర్వం సత్తే అయిఉండేది. ఈజగత్తు కారణం కన్నా అనన్య మైనది. అందుకే దానిని కారణరూపంలో సత్ అని చెప్పబడింది. అనన్యం కాకపోతే ఉత్పత్తికి పూర్వ అసత్ అయివుండేది. కార్యం కారణం కంటే అనన్యం. ఏది దేనియందు ఉండదో అది దానియందు పుట్టదు. తైలం ఇసుక నుండి పుట్టదు. అందువలన కార్యం ఉత్పత్తికి పూర్వం కారణం కంటే అనన్యం గాన పుట్టిన తరువాత కూడా అనన్యమేనని తెలుస్తుంది. సత్త్వమనేది కారణమైన బ్రహ్మలోను, కార్యమైన జగత్తులోను ఒక్కటే అని గ్రహించాలి.
సూత్రం :- 151
'అసద్వ్య పదేశా న్నేతి చేన్న ధర్మాంతరేన వాక్య శేషాత్ '
అసత్ వ్యపదేశాత్ :- కార్యాన్ని ఉత్పత్తికి పూర్వం అసత్ అని ఒకచోట అన్నారు కదా ! అందుచేత, న :- కార్యం, కారణం ఒకటే కాదు వేరే, ఇతి చేత :- అని అంటారా ? న :- సరి అయినది కాదు. ఎందుకంటే, వాక్య శేషాత్ :-తరువాత వాక్యాలు గమనిస్తే , ధర్మాంతరేణ :- వ్యక్తత్వధర్మం కన్నా వేరే అయిన అవ్యక్తరూపధర్మాన్ని పునస్కరించు కొని అసత్ అని వ్యవహరించినట్లు తెలుస్తోంది.
భావం :- కార్యాన్ని ఉత్పత్తికి పూర్వం అసత్ అని ఒకచోట అన్నారు కదా ! కార్యం, కారణం వేరే అని అనడం సరి అయినది కాదు. తరువాత వాక్యాలు గమనిస్తే అవ్యక్తధర్మాన్ని పునస్కరించుకొని అసత్ అని వ్యవహరించినట్లు తెలుస్తోంది.
వివరణ:-ఛాందోగ్యోపనిషత్తు:-ఉత్పత్తికి పూర్వం జగత్తు కారణరూపంలో అవ్యక్తంగా ఉంది. ఇక్కడ సత్ అనే పదం వ్యక్త రూపానికి పర్యాయ పదం. అసత్ అంటే అవ్యక్తమని అనుకోవాలి. ఉత్పత్తికి పూర్వం జగత్తు అవ్యక్తంగా ఉన్నందువల్ల అసత్ శబ్దంతో వ్యవహరించారు. అంతే కానీ స్వరూపంలో అది లేదని కాదు. సృష్టికి ముందు అసత్తు అని చెప్పడం వలన కార్యం కారణరూపంలో లేదు అనడం సరి కాదు. ఎందుకంటే అది అసత్తు కాదు. నామరూపాలు లేకపోవడం వలన అసత్ అన్నారు. కానీ అది సత్తే. బంగారం అంతా కరిగించిన తరువాత దానిని కారణరూపం అంటారు. దానిని ఆభరణాలుగా తయారుచెయ్యడం కార్యరూపం అంటారు. కరిగించిన బంగారంలో నామరూపాలైన ఆభరణాలు కనిపించనందున దానిని అసత్ అని వ్యవహరిస్తారు. కానీ నిజానికి అది సత్తే.
ఆరంభణాధికరణం :- ( 2 , 1 , 18 )
సూత్రం :- 152
యుక్తేః శబ్దాంతరాచ్చ
చ :- అంతే కాక, యుక్తేః :- నియతకారణ, ఉపాదానాది యుక్తి వలన, శబ్దాంతరాత్ :- స్మృతుల వలన కార్యం, కారణం ఒకటే అని తెలుస్తోంది .
భావం :- నియత కారణం, ఉపాదానాది కారణముల వలన స్మృతుల వలన కార్యం, కారణం ఒకటేనని తెలుస్తోంది.
వివరణ :- యుక్తి విషయంగా ఆలోచిస్తే పెరుగుకు పాలు, కుండకు మట్టి, కుండలాలకు బంగారం, ఉపాదాన కారణాలు. ప్రతి కార్యానికి ఒక నియతకారణం కావాలి. పెరుగు కావాలనుకున్నవాడు మట్టిని ఉపాదానకారణంగా కోరడు. సృష్టికి ముందు పెరుగు పాలరూపంలో ఉంటుంది. అలాగే కుండ కావాలనుకున్నవాడు మట్టిని, ఆభరణాలు కావాలనుకున్నవాడు బంగారాన్ని కోరతాడు. అంతే కానీ అసత్తును కోరడు. కార్యం ఉత్పత్తికి పూర్వం కారణం అని తెలిసి ఉండటమే. ఉత్పత్తికి పూర్వం కార్యం అసత్తు అనేవాడు. దధి కోసం పాలను ఉపాదానంగా స్వీకరించడు. కారణంతో కార్యం బొత్తిగా లేని పక్షంలో అది ఎలా ఉత్పన్నం అవుతుంది. ఈ కారణాలు అసత్తు కానేరవు. ఏకారణం ఏకార్యం వలన ఉత్పన్నం అవుతుందో ఆ కారణం ఆ కార్యంలో అన్వితమై ఉండాలి. అసత్తు నుంచి సత్తు జనించేటప్పుడు సత్తులో అసత్తు అన్వితమై ఉండాలి. లోకంలో కార్యజాతమంతా సత్తులో అన్వితమై ఉత్పన్నం కావడం గమనిస్తున్నాము. అభావం నుంచి భావోత్పత్తి కలుగదు. ఉత్పన్నవస్తువేదీ అసత్ కాదు. కార్యమనేది ఉత్పత్తికి పూర్వం కారణరూపంలోనే ఉంటుంది. అందుచేత కార్యకారణములకు భేదం లేదు. మనిషికి కొమ్ములాగా అసత్తుకి ఉత్పత్తి లేదు. కపిలుడు సాంఖ్య శాస్త్రంలో అసత్ వాదాన్ని నిరసించి, సత్ వాదాన్ని ప్రతిపాదిస్తాడు. ఇలా యుక్తివలన, స్మృతివలన, కార్యం తన ఉత్పత్తికి పూర్వం కారణరూపంలో అనన్యమై ఉంటుందని తెలుస్తోంది.
సూత్రం :- 153
" పటవచ్చ "
చ :-అంతేకాక, పటవత్ :-వస్త్రం ఏర్పడడానికి పూర్వం దారాల కన్నా భిన్నం కాదు.
భావం :- వస్త్రం ఏర్పడటానికి పూర్వం దారాల కన్నా భిన్నం కాదు. అలాగే కార్యజాతం ఉత్పత్తికి పూర్వం కారణం కంటే వేరే కాదు.
వివరణ :- మడత పెట్టిన వస్త్రం ఇది వస్త్రమా? లేక మరొక వస్తువా?అని స్పష్టంగా తెలియదు. బట్ట చుట్టబడివున్నా పరచబడి ఉన్నా అది బట్టే. అంటే ఒక్క ఆకారమే మారుతోంది. మూలంలో మార్పు ఉండదు. విడదీసినప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. మడత పెట్టినప్పుడు ఇది వస్త్రం అని తెలిసినా కూడా దాని పొడవు వెడల్పు మొదలైన విశేషాలు తెలియవు. దానిని పరచినప్పుడు మాత్రమే దాని విశేషాలు తెలుస్తాయి. అట్లే తంతువులు మొదలైన కారణాల స్వరూపంలో ఉన్న పటాది కార్యం అస్పష్టంగా ఉండి నేసే సాధనం మగ్గం. సాలెవాడు మొదలైన కారకాల వ్యాపారం చేత అభివ్యక్తమై స్పష్టంగా కనబడుతుంది.అందుచేత మడతపెట్టినా, మడతవిప్పినా వస్త్రంయొక్క న్యాయం చేతనే కార్యం కారణం కంటే అనన్యమైనదని అర్ధం. అలాగే మట్టిగా ఉన్నప్పుడు తెలియని విషయాలు కుండ తయారైన తరువాత తెలుస్తాయి. అంతే కానీ కార్యకారణములైన కుండ మట్టిలలో భేదం ఉండదు. ఈ పృథివ్యాది కార్య జాతమంతా ఉత్పత్తికి పూర్వం ప్రకృతిని మించి వేరే ఏమి కాదు. జగత్తు ప్రకృతి యొక్క విశేషమే. అవస్థకు ఆ అవస్థ ఉన్నదానికి తేడా లేదు కదా! కనుక ఉత్పత్తికి పూర్వం కార్యం కారణం కన్నా అనన్యమే.
సూత్రం ;- 154
యథీ చ ప్రాణాది
యథా :- ఎలాగ, ప్రాణాది :- పంచ ప్రాణాలు
భావం :- ఎలాగ పంచ ప్రాణాలు ముఖ్య ప్రాణం కన్నా వేరే కావో అలాగే పృథివ్యాది జగత్తు కూడా ఉత్పత్తికి పూర్వం ప్రకృతి కన్నా భిన్నంగా కాదు .
వివరణ ;- ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం, అనే 5 ప్రాణాలు ఉత్పత్తికి పూర్వం ముఖ్య ప్రాణం కన్నా వేరు కావు. ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఊపిరి బిగపడతాడు. అంటే వాయువును కుంభిస్తాడు. అప్పుడు అపాన, వ్యాన, ఉదానములనే తేడాలు వాయువుకు వుండవు. అప్పుడు ప్రాణం మాత్రమే ఉంటుంది. ఎందుకంటే వాయు ప్రసరణ జరగడం లేదు. కాబట్టి ప్రాణాయామం ఆపి వేసి నప్పుడు, అవన్నీ యధాతధంగా పని చేస్తాయి. అవయవాలు వంచడం, చాపడం మొదలైన పనులు చేస్తుంటాయి. అంత మాత్రం చేత వీటి మధ్య తేడా ఉన్నదని కాదు. కార్యకారణముల మధ్య ఏమాత్రం భేధం లేదు. అందువలన సమస్త జగత్తు కూడా బ్రహ్మ యొక్క కార్యం అవడం వలన, ఇది బ్రహ్మ కంటే అనన్యం అవడం వలెనే అని తెలుస్తోంది.
ప్రస్నోపనిషత్తు :- ముఖ్యప్రాణం ఇలా అన్నది. మోహాన్ని పొందకండి . నేనే 5 రకాలుగా నన్ను విభజించుకుని, ఈ శరీరాన్ని ధరిస్తున్నాను. ఎలాగ ముఖ్య ప్రాణం తనని తాను పంచ ప్రాణాలుగా విభజించుకుని శరీర ధారణకు ఉపయోగ పడుతున్నాడో, అలాగే ప్రకృతి పృథివ్యాది రూపంలో పరిణమించి జీవుల భోగంగా ఉపయోగపడుచున్నది. ఉత్పత్తి పూర్వం ఈ జగద్రూప కార్యం ప్రకృతి కన్నా వేరే కాదు అనడంలో సందేహం ఏమాత్రం లేదు. కనుక కార్యం కారణం రెండూ ఒక్కటే.
ఇతర వ్యపదేశాధికరణం :- ( 2,1,21 )
సూత్రం :- 155
ఇతర వ్యపదేశాత్ హితాకరణాది దోష ప్రసక్తిః
ఇతర వ్యపదేశాత్ :- బ్రహ్మం జీవాత్మగా వ్యవహరిస్తున్నందువలన, హితా కరణాది దోష ప్రసక్తిః :- హితం, అహితం అనే దోషాలు చేసిన నింద బ్రహ్మకు వస్తుంది కదా !
భావం :- బ్రహ్మం జీవాత్మగా వ్యవహరిస్తున్నందువలన జీవుడు చేసే దోషాల వలన కలిగే ఫలితాలు బ్రహ్మకు వర్తిస్తాయా ? అనేది సందేహం .
వివరణ :- గురువుగారు! కార్యాకారణ సంబంధం లేదన్నారు. అయితే జీవాత్మ, పరమాత్మ రెండు ఒకటే అంటున్నారు కదా ! జీవి కర్మలు చేస్తుంటాడు. ఆ కర్మల ఫలితాలను అనుభవిస్తూన్న అతనికి జనన మరణాలు సంభవిస్తుంటాయి. ఈ కర్మలలో కొన్ని దోషాలు కూడా ఉంటాయి. జీవాత్మ పరమాత్మా ఇద్దరు ఒక్కటే అయినందున, జీవి చేసిన దోషాలు పరమేశ్వరుడి కూడా సంక్రమిస్తాయి కదా! అప్పుడు పరబ్రహ్మ కూడా దోషభూయిష్టుడు అవుతాడు కదా? అని అడిగాడు కృష్ణశర్మ. దానికి సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. జీవుడికి బ్రహ్మత్వం చెప్పడం వలన, బ్రహ్మకు హితాకరణాది దోషం వస్తుంది అంటారు. తత్త్వమసి అనటం వలన జీవుడి యందలి దోషాలు బ్రహ్మకు అంటుతాయని జీవాత్మ, పరమాత్మా రెండు ఒక్కటే అనడం వలన జీవి కుండే లక్షణాలన్నీ బ్రహ్మకు ఆపాదించబడుతున్నాయి. అప్పుడు బ్రహ్మ దోషభూయిష్ఠుడగుచున్నాడు. కాబట్టి అతడు జగత్కారణం అనటం వీలుపడదు అని వాదం అన్నాడు రత్నాకరుడు. జగజ్జన్మాదులకు బ్రహ్మ స్వతంత్ర కారణం అంటున్నారు.ఈ జగత్తు ..బ్రహ్మ నిమిత్తం. బ్రహ్మం స్వతంత్రం. అలాంటి బ్రహ్మ తాను నిర్మించిన ఈ జగత్తు తనకు అహితం చేసేలాగా ఎందుకు నిర్మిస్తాడు. ఎలాగంటే బ్రహ్మానికి జీవుడికి ఎలాంటి భేదం లేదు. బ్రహ్మమే జీవాత్మ రూపంలో ఈ జగత్తులో వ్యవహరిస్తున్నారు. జీవుడు లోకంలో జన్మ జరా మృత్యు రూపమైన కష్టాలను అనుభవిస్తున్నాడు.
చాందోగ్యోపనిషత్తు:- ఈ జీవరూపంలో ప్రవేశించి నామరూపాలు నిర్మిస్తాడు. ఉద్దాలకుడు శ్వేతకేతూ! తత్త్వమసి నీవే ఆత్మవి అంటుంది. ఐతరేయంలో మనుషులను సృష్టించి వారి దేహంలో ప్రవేశించాలనుకున్నాడని చెప్పారు. దీని వలన జీవాత్మ పరమాత్మ ఒక్కటే అని తెలుస్తోంది.ఈ కారణం చేత బ్రహ్మ కున్న సృష్టి కర్తృత్వం జీవికి కూడా వస్తోంది. అప్పుడు ఈ కారణం చేత జీవుడికి ఉన్న జన్మజరాదులు బ్రహ్మకు వస్తాయి కాబట్టి బ్రహ్మ జగత్ కారణం అనడానికి వీలు లేదు అని వారి వాదన.
తైత్తరీయోపనిషత్తు :- ఈ జగత్తు సృష్టించి అందులోనే ప్రవేశించాడు.
శ్వేతాశ్వరోపనిషత్తు :- నీవు స్త్రీవి, పురుషుడివి, కుమారుడివి, కుమార్తెవు, దుష్టులను దండించి, దోషులను దూరం చేస్తావు. సర్వత్రావ్యాపివి ప్రసిద్ధుడివి. ఈఉపనిషత్ వాక్యాలు ఈబ్రహ్మమే జీవరూపంలో జగత్తులో వర్తిస్తాడని స్పష్టంగా అంటున్నాయి కనుక జగత్తుకు బ్రహ్మం స్వతంత్ర కర్త అని అంగీకరిస్తే బ్రహ్మము తనకోసం జగత్తును దుఃఖమయంగా నిర్మించుకున్ననాడే దోషానికి గురి కాక తప్పదు. జగత్తు దుఃఖ కారణమే.
సాంఖ్యం :- జననమరణాదులతో మారిన జగత్తు దుఃఖం బహుళం. సుఖానుభవం ఉన్నా అది దుఃఖమిశ్రితమే కాబట్టి అది కూడా దుఃఖమే. అందువలన సర్వశక్తిమంతం అయిన బ్రహ్మ తన కొరకు ఇలాంటి దుఃఖభాజనమైన జగత్తును ఎందుకు సృష్టించుకుంటాడు? జగత్తు బ్రహ్మకర్తృత్వం అనడంతో దోషభూయిష్టమైన కర్మలు బ్రహ్మకు అంటుతాయి కదా! అనేదే సందేహం.
సూత్రం :- 156
'అధికంతు భేద నిర్దేశాత్ '
తు :- ఆలా అనడం సరి అయినది కాదు,
భేద నిర్దేశాత్ :- భిన్నత్వం నిర్దేశించడం వలన, అధికం :- బ్రహ్మ జీవుని కన్నా అధికం.
భావం :-జీవుడు చేసిన దోషభూయిష్టమైన కర్మలు బ్రహ్మకు ఆపాదించబడటం వలన అతను జగత్కారణం అని అనడానికి వీలులేదు. ఈ వాదన సరి అయినది కాదు. భిన్నత్వం నిర్దేశించడం వలన బ్రహ్మ జీవుడి కన్నా అధికం అని సూత్రానికి అర్ధం.
వివరణ :- సర్వజ్ఞుడు, సర్వ శక్తిమంతుడు అయిన బ్రహ్మ జగత్ కర్త. జగత్తు అనిష్టహేతువు అనేది జీవాత్మపట్ల సత్యమే. కానీ జగజ్జన్మాదులకు కారణమైన బ్రహ్మానికి సహితం కాదు. బ్రహ్మ జీవాత్మకన్నా అధికం. జీవాత్మ పరమాత్మ మధ్య భేదాలు: జీవాత్మ అల్పజ్ఞాని. సర్వజ్ఞత్వం కాదు. అన్నింటిని అన్ని విధాలుగా ఎరుగలేడు. జీవాత్మకు కాలజ్ఞానం లేదు. జీవాత్మకు భూతకాలజ్ఞానం కానీ భవిష్యత్ జ్ఞానం కానీ లేవు. వర్తమానం కూడా కించిత్తే తెలుస్తుంది. కానీ సర్వం తెలుసుకోలేదు. జీవాత్మ అల్పశక్తి మంతం. కనుక తాను చేయదలచినంత చేసే సమర్ధుడు కాదు. కానీ బ్రహ్మ అలా కాదు. సర్వజ్ఞత్వం, సర్వశక్తిమంతం, సర్వకర్త ,బ్రహ్మానికి తెలియని తత్త్వం త్రిలోకంలోనే లేదు. బ్రహ్మకు సమానం కానీ అధికం గానీ మరొకరు లేరు. జీవాత్మకు క్రియాశక్తి, విజ్ఞానం పూర్ణంగాలేవు. అందువలన అతను సాధించే కర్మకూడా సంపూర్ణం కానేరదు. బ్రహ్మకు క్రియాశక్తి, విజ్ఞానం సంపూర్ణంగా ఉన్నాయి. అందువలన అతను సాధించే కర్మ కూడా సంపూర్ణం కాదు. బ్రహ్మకు ఉన్న జ్ఞానక్రియాశక్తులు రెండూ సంపూర్ణమే. జీవాత్మ అణుస్వరూపుడు. అవిద్యతో కోరికలతో విషయవాసనలకు బందీ అవుతాడు. కర్మఫలాలను, సుఖదుఃఖరూపంలో అనుభవించడం వలన హితాహితాలు జీవునికి వర్తిస్తాయి. బ్రహ్మ జగత్కర్త. ఆయనకు క్లేశాలు ఉండవు. రాగద్వేషాలు, బంధనాలు, సంసారపాశాలు ఉండవు. ఏకం, అద్వితీయం జీవులకు కర్మఫల ప్రదాత. జడ చేతనాత్మక సమస్త జగత్తుకు శాసకుడు, గుణ కర్మ స్వరూపాలలో బ్రహ్మం జీవుడి కన్నా ఎంతో అధికం, భిన్నం కూడా. బ్రహ్మ జీవరూపం ఎన్నటికీ కాదు. కనుక జీవుడు అల్పుడని బ్రహ్మం అధికమని తెలుసుకోవాలి. ఋగ్వేదం:- జీవుడు సుఖదుఃఖాలు అనుభవిస్తాడు. పరమాత్మకు అంటవు.ఆయన ప్రకాశశీలి.
ముండకోపనిషత్తు:- జీవుడు అనీశుడు, పరమాత్మ ఈశుడు. బృహదారణ్యకోపనిషత్తు :-పరమాత్మ జీవుడిలో ఉన్నా అతని కన్నా భిన్నమైన వాడు. వీటి వల్ల జగత్తును నిర్మించి తనకు అహితం చేసుకునే దోషం బ్రహ్మకు శాస్త్ర సమ్మతం కాదు.బ్రహ్మ సర్వాంతర్యామి కనుక సర్వాధారం అన్నారు. జీవాత్మ రూపమని చెప్పలేదు. మరణకాలంలో జీవాత్మ పరమాత్మ చేత అధిష్టితమై, శబ్దం చేస్తూ పోతుంది. ఈ రకంగా కర్త, కర్మ భేదం వలన జీవుడికి బ్రహ్మకు భేదం చెప్పారు. బ్రహ్మకు హితము, అహితము అనేవి లేవు. ప్రేమ, అభిమానం, దయ ఏమి లేనివాడు. కాబట్టి ఆయనకు ఏ దోషాలు అంటావు.
సూత్రం :- 157
అశ్మాది వచ్చ తదనుపపత్తిః
చ :- అలాగే, అశ్మాదివత్ :- రాళ్లు మొదలైన వాటిలాగా, తత్ అనుపపత్తిః :- జీవాత్మ కూడా బ్రహ్మరూపం పొందలేదు.
భావం :-జీవుడు చేసిన హితాహిత కర్మఫలాలు బ్రహ్మానికి అంటవు. అలాగే రాళ్లు మొదలైన వాటిలాగా జీవాత్మ కూడా బ్రహ్మ రూపం పొందలేదు.
వివరణ:- ఒకేరూపం గల బ్రహ్మ ఈజగత్తును నిర్మించినప్పుడు కార్యాల్లో వైచిత్య్రం ఉండకూడదు అనేది వాదన. రాళ్లు మొదలైన వాటిలో కార్యవైచిత్య్రం కుదురుతుంది. కనుక పరులు చేసిన ఆక్షేపణకు యుక్తి లేదు. భూమిలో నుంచి అనేక రాళ్ళు పుడుతున్నాయి. వాటిలో కొన్ని బండరాళ్ళు, కొన్ని కంకరరాళ్ళు, కొన్ని వజ్రాలు. ఈరకంగా వాటి విలువలో తేడా లున్నాయి. అన్ని రాళ్లలోనూ పృధ్వీతత్త్వం అనే జాతి సమంగా ఉన్నా, కూడా వజ్ర వైడుర్యాదిమణులు, కొన్ని చాలా విలువైనవి ఉంటాయి. సూర్యకాంతం మొదలైనవి కొన్ని మధ్యమ విలువ కలవిగా ఉన్నాయి. ఈవిధంగా ఆ రాళ్లలోనే అనేక విధాలైన వైచిత్య్రం కనబడుచున్నది. ఒకే నేలమీద మొలిచే విత్తనాలతో చందనం, సుగంధ ద్రవ్యాలయందు అనేక విధాలైన ఆకులు, పువ్వులు, పండ్లు వాసన, రుచి మొదలైన వాటిలో భేదం కనబడుతున్నది. ఒక చెట్టు కాయలు తీయగా ఉంటే, వేరొక చెట్టు కాయలు పుల్లగా ఉంటాయి. మనం తీసుకునే ఆహరం జీరమై, రక్తం, మాంసం, ఎముకలు, మజ్జ, గోళ్లు, వెంట్రుకలుగా మారుతుంది. వీటన్నింటికి రూపంలోనూ, ఉపయోగంలోను, భేదం ఉన్నది. అదే విధముగా ఒకే పరమాత్మ నుంచి పుట్టిన జగత్తు లోను వైవిధ్యం ఉంటుంది. ఇందులో తప్పు లేదు. ఇదేమి దోషం లేదు. పాషాణాది జడ పదార్ధాలకు బ్రహ్మంలో ఉనికి ఉన్నది. అంత మాత్రాన అవి బ్రహ్మం కానేరదు. ఒక సామాన్య ధర్మం ఉన్నంత మాత్రాన ఒక వస్తువు మరొక వస్తువు కానేరదు . మనుష్యత్వం అనే పోలిక ఉన్నంత మాత్రాన నిర్ధనుడు ధనికుడు కాలేదు. అలాగే మూర్ఖుడు జ్ఞానీ కాలేదు. జీవునిలో చేతనత్వం ఉన్నా సర్వజ్ఞత్వాది ధర్మాలు లేనందున బ్రహ్మం కానేరదు.
ఉపసంహార ధర్మాణాధికరణం ( 2,1,24 )
సూత్రం :- 158
ఉపసంహార దర్శనాన్నేతి చేన్నక్షీరవద్ధి
ఉపసంహారదర్శనాత్ :- ఈలోకంలో కుమ్మరి కుండను తయారుచేయడానికి చక్రం, దండం లాంటి పరికరాలు అవసరమైనట్లు, న :- బ్రహ్మానికి ప్రకృతి కన్నా వేరే ఎలాంటి సాధనాలు లేనందువలన, ఇతి చేతన్ :- అని శంకించడం సరి అయినది కాదు. హి ;- ఎందుకంటే క్షీరవాత్ :- పాలు స్రవించేలాగా జగత్తు నిర్మాణం జరుగుతుంది.
భావం:- ఈలోకంలో కుమ్మరి కుండలు చెయ్యడానికి చక్రం, దండం, తాడు మొదలైన పరికరాలు అవసరం అయినట్లు, బ్రహ్మానికి ప్రకృతికన్నా వేరే ఎలాంటి సాధనాలు లేనందువలన బ్రహ్మ జగత్ కారణం కాదు అని శంకించడం సరియైనది కాదు.
వివరణ :- గురువుగారూ ! కుమ్మరివాడు కుండలు చెయ్యాలి అంటే కేవలం మట్టి మాత్రమే కాకుండా కర్ర, చక్రం, దారం మొదలైన ఇతర సాధనాలు కావాలి. మరి జగత్తును సృష్టి చేసే బ్రహ్మకు మాత్రం ఏ రకమైన ఇతర సాధనాలు అవసరం ఉండదా? అని అడిగాడు కృష్ణశర్మ. సమాధాం చెబుతున్నాడు రత్నాకరుడు. పనిచేసేవాడు సాధనాలను సమకూర్చు కుంటాడు. మరి బ్రహ్మకు ఇతర సాధనాలు ఉండవా? అంటే కుమ్మరివాడు ఇతర సాధనాలు ఉపయోగిస్తాడు. మరి బ్రహ్మకు ఇతర సాధనాలు ఏమి లేవు. కాబట్టి జగత్తుకు కారణం బ్రహ్మకాదు అని అనకూడదు. ఉపకరణాలు లేకపోయినా లోకంలో పని జరుగుతుంది. పాలు పెరుగులా మారాలంటే ఏసాధనము అవసరంలేదు. పాలను వేడి చేస్తున్నాం కదా అని అనకూడదు. పాలు త్వరగా తోడుకోవడానికి మాత్రమే వేడి చేస్తున్నాము. వేడి చెయ్యకపోయినా పెరుగు అవుతుంది. పెరుగు అయ్యే గుణం లేకపోతే వీటిని వేడి చేసినా లేదా ఇగరబెట్టినా పెరుగు అవదు. నీటిని వేడి చేసినా పెరుగు అవదు. అలాగే పరమాత్మ సర్వశక్తి సంపన్నుడు. కాబట్టి అతనికి ఇతర సాధనాలు ఏవి అవసరం లేదు. బ్రహ్మకు కార్యము, కారణమూ లేదు. అతనితో సమానమైనవారు కానీ, అతని కన్నా అధికులు గానీ లేరు. కాబట్టి ఏసాధనాలు అవసరం లేకుండానే జగత్తును నిర్మించగలడు. ఆవు ఇతర సాధనాలు ఏవి లేకుండానే సంకల్పమాత్రం చేత దూడకు పాలు స్రవించేటట్లు చేస్తుంది. ఇవన్నీ లోకంలో ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అలాగే బ్రహ్మం భోగం కొరకు సంకల్పమాత్రంతో ప్రకృతిని మహత్తు మొదలైన జగత్తు రూపంలో పరిణమించేటట్లు చేస్తాడు. ఇందులో లోక విరుద్ధం ఏమి లేదు. ఇక్కడ కుమ్మరి లాంటి స్వల్పవ్యక్తులతో ఈశ్వరుణ్ణి పోల్చకూడదు. వాళ్లకు పదార్ధాలను తయారుచేయడానికి సాధనాలు కావలి. లేకపోతే కార్యసాధన జరగదు. ఋగ్వేదం :- ఈశ్వరుని శక్తి అమితమైనది. కనుక బ్రహ్మం జగత్కారణత్వంలో ఏ విరోధం లేదు.
సూత్రం :- 159
" దేవాది వదపి లోకే "
లోకే :- ఈ లోకంలో, దేవాది వత్ అపి :- దేవతలు మొదలైన వాళ్ళు కార్యాలు సాధిస్తున్నారు కదా !
భావం :- ఈ లోకంలో దేవతలు మొదలైన వాళ్ళుకార్యాలు సాధిస్తున్నారు కదా ! ఈ లోకంలో విద్వాంసులు, యోగులు, ఋషులు, మొదలైన వాళ్ళు సంకల్పం మాత్రం తో అనేక కార్యాలు సాధిస్తున్నట్లుగా, బ్రహ్మం కూడా సంకల్పం తోనే బృహద్ కార్యాన్ని నిర్వహిస్తున్నాడు.
వివరణ:- మంత్రశాస్త్రంలో, ఇతిహాసాలలో కూడా దేవతలు అసహాయులై కార్యం చేస్తున్నారని చెప్పబడింది. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలలో దేవతలు, పితృ దేవతలు, ఏసాధన సంపత్తి లేకుండానే, సంకల్పం బలం చేత మహత్తర కార్యాలు చేశారని చెప్పబడింది .సాలెపురుగు ఏసహాయం లేకుండానే గూడు నిర్మిస్తుంది. చిన్నచిన్న కీటకాలను భక్షించడం వలన దాని లాలాజలం గట్టిబడి దారం అవుతుంది. ఆ దారంతోనే అది గూడు నిర్మిస్తుంది. కొంగ మేఘ గర్జనం విని, శుక్ర వీర్యాలు లేకుండానే గర్భం దాలుస్తుంది. పద్మలత కూడా చేతనం చేత ప్రేరేపించబడి అచేతనమైన శరీరంతోనే ఒక సరస్సు నుండి ఇంకొక సరస్సుకు వేళ్ళుచున్నది. కులవృత్తులు నిర్వహించేవారికి తమ కార్యాలను ప్రారంభించడానికి బాహ్యసాధనాలను ఏవిధంగా ఉపయోగిస్తారో, అదే విధంగా దేవాదులకు ఉపయోగించవలసిన అవసరం లేకుండా కార్యాలను నిర్వహిస్తారు. వీరితో బాటు బ్రహ్మకు కూడా బాహ్యసాధనాన్ని ఆపేక్షించడు. ఒక సామర్ధ్యం అందరికీ ఒకేలా ఉండవలసిన అవసరం లేదు.
కృత్స్నప్రసక్ర్త్రధికరణం :- ( 2,1,26)
సూత్రం :- 160
'కృత్స్న ప్రసక్తి ర్నిరవయవత్వ శబ్ద కోపోవా.
బ్రహ్మ సంకల్పం వలన పరిణమించే మూల కారణమయిన ప్రకృతి కి అవయవాలు లేనప్పుడు, కృత్స్న ప్రసక్తహః ;- సంపూర్ణ మైన పరిణామ ప్రసక్తి కలుగుతుంది. నా ;- లేక అవయవాలు ఉంటే, నిరవయవత్వ శబ్ద కూపః:- ప్రకృతి నిరవయవం అని చెప్పే మాటలు నిజం కావు.
భావం:- బ్రహ్మ సంకల్పంచేత పరిణమించే మూలప్రకృతికి అవయవాలు లేనప్పుడు సంపూర్ణమైన పరిణామం కలుగుతుంది. అవయవాలు ఉంటే ప్రకృతి నిరవయవం అని చెప్పే మాటలు నిజం కావు.
వివరణ:- అవయవాలులేని బ్రహ్మ కనుక పరిణామం చెందినట్లైతే బ్రహ్మ పూర్తిగా కార్యరూపంలో పరిణమం చేసినట్లవుతుంది. కొంత భాగమే అయితే బ్రహ్మకు అవయవాలు వచ్చి బ్రహ్మ నిరవయవుడు అన్న శృతికి విరోధం వస్తుంది. ఏది ఎలా చూసినా బ్రహ్మ అనిత్యమౌతుంది. అందుచేత బ్రహ్మ జగత్తుకు ఉపాదానకారణం కాలేదు అని వారి వాదన. బ్రహ్మ పూర్తిగా పరిణామం చెందితే, అంటే జగత్తు బ్రహ్మ రెండు ఒక్కటే .కొంత భాగమే పరిణాయం చెందాడు అంటే జగత్తు లేక బ్రహ్మ ఇంకా కొంచెం భాగం ఉన్నాడు అని అంటే బ్రహ్మ సాకారుడు అని అర్థం. ఏదైనప్పటికీ వేదాలలో చెప్పిన విషయాలకు విరుద్ధమౌతుంది. కాబట్టి జగత్తుకు బ్రహ్మ ఉపాదాన కారణం కాదు అని శంకిస్తారు. నిరవయవమైన బ్రహ్మ క్షీరాదుల వలే పరిణామం చెందుతుంది అని అంగీకరిస్తే బ్రహ్మ నిరవయవం అని చెప్పే శబ్దాలకు విఘాతం కలుగుతూంది. ఏకము, అద్వితీయము అయినా బ్రహ్మ క్షీరాదుల వలె బాహ్య సాధనాపేక్ష ఏమి లేకుండా స్వయంగా పరిణామం చెందుచు జగత్తుకు కారణం అవుతున్నది. కృత్స్న ప్రసక్తి అంటే సంపూర్ణమైన పరిణామ ప్రసక్తి కలుగుతుంది. బ్రహ్మ నిరవయవం గాన సమస్తమైన బ్రహ్మ కూడా కార్య రూపంలో పరిణమిస్తుంది. బ్రహ్మ పృధివ్యాదుల వలె సావయవం అయితే దాని ఒకభాగం పరిణామం చెంది ఉండేది. ఒక భాగం పరిణామం చెందకుండా ఉండేది. శృతులలో చెప్పినట్లుగా ఒక భాగం మాత్రమే పరిణామం చెందడం అనేది కుదరదు. కనుక మొత్తం పరిణామం చెందాలి. కార్యం ఏప్రయత్నం లేకుండానే కనబడుతుంది. కనుక కార్యం కంటే భిన్నమైన బ్రహ్మ లేదు. ఇక్కడ ఆత్మను చూడాలి అనే ఉపదేశం వ్యర్థం అవుతుంది. అంతేకాక బ్రహ్మను పరిణామస్వరూపంలో జన్మనాశనాలు అంగీకరిస్తే, బ్రహ్మను నిరవయత్వాన్ని అంగీకరిస్తే, అనిత్యత్వం అనే దోషం కలుగుతుంది. ఎలా చూసిన ఈ పక్షాన్ని కూర్చడం శక్యం కాదు. లోకంలో అవయవాలు ఉన్నవే ఉపాదానకారణంగా కనబడుతున్నాయి. అందుచేత అవయవాలు లేనిది ఉపాదానం అనడానికి వీలు లేదు.ఇక్కడ వేదాంత సమన్వయం కుదురుతుందా లేదా అనేది సందేహం. బ్రహ్మకు విచిత్రమైన శక్తులున్నాయి. సత్యసంకల్పం ఉన్నందున ఉపాదానత్వం, కర్తృత్వం కూడా బ్రహ్మకు కుదురుతుంది.
సూత్రం :- 161
'శృతేస్తు శబ్ద మూలత్వాత్ '
తు :- జగత్తుకు బ్రహ్మ ఉపాదాన కారణం కాదు అనే శంక సరియైనది కాదు. శబ్ద మూలత్వాత్ :- వైదిక సిద్ధాంతాలు శబ్దాశ్రితాలు కనక, శ్రుతేః :- వేదాలు చెబుతున్నట్లు ,
భావం:- వైదిక సిద్ధాంతాలు శబ్దాశ్రితాలు కనుక, వేదాలు చెబుతున్నట్లు, బ్రహ్మ సంకల్పం మూలంగానే ప్రకృతి జగద్రూపంలో పరిణమిస్తుందని నిశ్చయించాలి. బ్రహ్మసంకల్పం మూలంగానే ప్రకృతి జగద్రూపములో పరిణమిస్తుందని ఉపనిషత్తులు స్పష్టంగా వర్ణిస్తున్నాయి.
వివరణ :- శబ్దమూలక సిద్ధాంతం కేవలం తర్కగమ్యం కాకపోవచ్చును. కేవలం తర్కం అంగీకారం కాదు. సర్వము శృతి మూలకమే. బ్రహ్మం వేద ప్రమాణమైనది. కాబట్టి ఆ దోషం అంటదు.
ముండకోపనిషత్తు (1,1,8, ) బ్రహ్మ సంకల్పం వలన ప్రకృతి పరిణమించి మహదాది రూపాన్ని పొందుతుంది. ఇందులో తపః అంటే సంకల్పగర్జితమైన పర్యాలోచనాత్మక జ్ఞానం, ఇలాంటి శబ్దమూలక సిద్ధాంతం కేవలం తర్కానికి అందదు. పురుష బుద్ధి అల్పం. తర్కం అలాంటి బుద్ధే. ఒక్కోసారి సూక్ష్మవిషయాలు తర్కగమ్యం కాకపోవడం వింతేమీ కాదు. వేదం తర్క నిర్ణయానికి కట్టుబడదు. శబ్ద బ్రహ్మ సంకల్ప పూర్వకంగా జగద్రూపం పరిణమించేటట్లు చేసి, తాను ఇంకా మిగిలి ఉంటాడని చెబుతోంది. కృత్స్నం అంటే సంపూర్ణం. ఇందులో ఒక భాగమే.. ఏక దేశం.. అంశం.
కఠోపనిషత్తు :- మహదాది జగద్రూపంలో ప్రకృతి పరిణమిస్తుంది. ఆ ప్రకృతిలోని ప్రళయంలో జగత్తు లయమౌతుంది. ప్రకృతే లేని పక్షంలో లయమౌతుంది అని చెప్పారు కదా ! అందువల్ల సంకల్ప మాత్రంతో బ్రహ్మ జగత్తును నిర్మిస్తాడనటం నిర్దుష్టమే.
ఛాందోగ్యోపనిషత్తు :- శుద్ధ బ్రహ్మ, కార్య బ్రహ్మ కన్నా గొప్పది. పాంచభౌతిక మైన జగత్తంతా శుద్ధ బ్రహ్మ యొక్క ఒకపాదమే. మిగిలిన మూడుపాదాలు గల అమృతస్వరూపమైన బ్రహ్మఇదే. ఆపురుషునికి బయటా లోపలా కూడా ఉన్న ఆకాశం ఒకటే అని చెప్పబడింది. బ్రహ్మానికి వేద ప్రమాణమున్నది.అందుచేత వారు చెప్పే దోషం బ్రహ్మకు అంటదు. శృతి వలన బ్రహ్మం నుండి జగత్తు పుట్టింది అనీ, కార్యం కంటే వేరుగా బ్రహ్మ ఉన్నదని వినబడుచున్నది. ప్రకృతి వికారాలు వేరు వేరుగా చెప్ప బడుచున్నాయి. శ్రుతులు కూడా ఈ విషయమే చెబుతున్నాయి. అట్లే బ్రహ్మ హృదయంలో ఉంటాడని సుషుప్తిలో జీవుడు సత్తులో అంటే బ్రహ్మలో సంపన్నుడౌతాడని చెప్పబడింది. మొత్తం బ్రహ్మఅంతా కార్యరూపం వినియోగించబడిపోతే అప్పుడు సుషుప్తికి సంబంధించి అనుపపన్నం అవుతుంది. ఎందుకంటే కార్యరూపంలో ఉన్న బ్రహ్మ నిత్యమూ ఉపపన్నమయే ఉండాలి. అవికృతమైన బ్రహ్మ మిగిలి లేదు. అట్లే బ్రహ్మ ఇంద్రియగోచరం కాదు అని చెప్పబడింది. వికారం ఇంద్రియ గోచరం కుదురుతుంది కదా! మొత్తం బ్రహ్మ కార్యరూపంలో పరిణామం చెందిన పక్షంలో కార్యరూపమైన ఆ బ్రహ్మ ఇంద్రియాలకు గోచరం అవుతూనే ఉంటుంది. అలాంటప్పుడు బ్రహ్మ ఇంద్రియగోచరం కాదు అని చెప్పడం అర్ధరహితం కదా ! దీనిని బట్టి కార్యరూపం లోనే కాక ఇంకా బ్రహ్మ ఉన్నది అని తెలుస్తోంది. శృతిలో బ్రహ్మ నిరవయవం అని వినబడుచున్నది.బ్రహ్మ శబ్దమయం. శబ్దమే ప్రమాణంగా కలది. శబ్దం ఎలా చెబితే అలా చెయ్యాలి. అదే అంగీకరించాలి.
సూత్రం :- 162
''ఆత్మని చైవం విచిత్రాశ్చహి'
చ :- సంకల్ప ప్రభావ వైచిత్య్రంలో అసంభవం ఏమి లేదు,. హి :-దీనికి కారణం, ఆత్మని :- పరమాత్మలో,
ఏవం :- ఇలాంటి, విచిత్రాః :- విచిత్ర ప్రభావాలు, నానావిధ శక్తులు ఉండటమే.
భావం :- బ్రహ్మ సంకల్ప ప్రభావం వలెనే ఇలా జరుగుతుంది. దీనికి కారణం బ్రహ్మలో విచిత్ర ప్రభావాలు, నానావిధ శక్తులు ఉండటమే.
వివరణ:-బ్రహ్మలో ఇన్ని రకాల వస్తువులు సృష్టించడం వల్లే స్వప్నాన్ని చూసే ఆత్మలో కూడా అనేక రకాలైన సృష్టులు చెప్పబడ్డాయి. పరమాత్మ సంకల్ప ప్రభావం వల్లే ప్రకృతి మహదాది జగద్రూపం లో ప్రవర్తిస్తోంది. ఆ ప్రభావం ఎంతని ఎలా వర్ణించగలం? ఈ జగత్తంతా బ్రహ్మ యొక్క పరిణామమే. కాబట్టి స్వప్నప్రపంచం లాగా మాయతో కూడినది. ఈ జగత్తు బ్రహ్మ యొక్క ఉపాదాన కారణమే అయినప్పటికీ స్వప్నావస్తలో సాక్షి వంటివాడు. కాబట్టి అతనికి దోషాలు అంటావు. గారడీ వాడి రూపం నాశనం కాకుండానే అతడు సృష్టించిన అనేక వస్తువులు కనిపించినట్లుగానే బ్రహ్మలో కూడా ఈ విచిత్రసృష్టులు కనిపిస్తున్నాయి. ఒక బ్రహ్మలో స్వరూపానికి ఉపమర్ధం (స్వరూపానికి ఏ విధమైన పరిణామాది వికారం లేకుండా) అనేక విధాలైన సృష్టి జరుగుతోంది అని ఈవిషయంలో వివాదం చెయ్యవలసిన పనిలేదు. స్వప్నం చూస్తున్న ఒక ఆత్మలో దాని స్వరూపానికి ఉపమర్ధం ఏది లేకుండా అనేకానేక వస్తువుల సృష్టి జరుగుతోంది. లోకంలో దేవతలు, మాయావులు మొదలైన వాళ్ళ స్వరూపానికి ఉపమర్ధం లేకుండానే విచిత్రమైన సృష్టులు కనబడుతున్నాయి. అట్లే బ్రహ్మ ఒక్కటే అయినా కూడా దాని వ్యాపారానికి ఉపమర్ధం ఏది లేకుండానే అనేకానేకమైన సృష్టి జరుగుతోంది. ఆసమయంలో ఆయన స్వరూపానికి ఏ విధమైన మార్పులు, వికారములు లేకుండానే అనేక విధాలైన సృష్టి జరుగుతోంది.
సూత్రం :- 163
స్వపక్ష దోషాచ్చ
చ :- అంతే కాక, స్వపక్ష దోషాత్ :- పూర్వ పక్ష వాదనలో దోషం ఉంది.
భావం :- ప్రకృతి నిరవయవి అయినప్పటికీ అతని స్వరూపానికి ఏవిధమైన పరిణామాది వికారము లేకుండా అనేక విధాలైన సృష్టి జరుగుతోంది. ఈ విషయంలో వచ్చిన వాదనలో దోషం ఉన్నది. ప్రకృతి అవయవి, నిరవయవి అనే వాదం లేపి శంక వెలిబుచ్చడంలోనే దోషాలున్నాయంటున్నాడు మహర్షి.
వివరణ:-ఈదోషం సాంఖ్యులు చెప్పే మతంలోకూడా ఉన్నది. సాంఖ్యులు ప్రధానాన్ని అంటే ప్రకృతిని జగత్కారణంగా చెబుతారు. ఆ ప్రధానం కూడా నిరవయం అపరిఛిన్నము. అది సావయవము, పరిచ్చిన్నము అయినా జగత్తుకు కారణం అవుతోంది. ఒకే దోషం అన్ని మతాలలోను ఉంది. కాబట్టి దానిని లెక్కించనవసరం లేదు. ఈజగత్తుకు బ్రహ్మ ఉపాదాన కారణమే. జగత్తువలన బ్రహ్మ పరిపూర్ణతకు బాధ్యత లేదు. సాంఖ్యులు. వైశేషుకులు మొదలైన ప్రతివాదుల పక్షాలలో కూడా దోషాలున్నాయి. కనుక బ్రహ్మవాదిని ఆక్షేపించవలసిన పనిలేదు. సాంఖ్యులు ప్రధానం నిరవయవం అనే సిద్ధాంతాన్ని అంగీకరించడం లేదు కదా! ప్రధానంలో సత్వ రజస్తమో గుణాలు అనే 3 గుణాలున్నాయి. వాటి సామ్యావస్థయే ప్రధానం. ఆ అవయవాలచేత ప్రధానం సావయవమే కదా ! అనేది ప్రశ్న. ఈ విధమైన సావయత్వం చేత ప్రాకృతమైన దోషం నివారించడం శక్యంకాదు. ఎందువలనా అనగా సత్వ రజస్తమో గుణాలలో ఒక్కొక్కటి నిరవయవం అనే విషయం సమానమే కదా! మిగిలిన రెండు గుణాలచేత అనుగ్రహింపబడిన ఒక్కొక్క గుణం తనకు సజాతీయమైన ప్రపంచానికి ఉపాదానం అని వాళ్ళు అంగీకరిస్తారు.ఈ విధంగా నిరవయత్వాన్ని సాధించే తర్కం నిలవదు.కనుక గుణాలు సావయవాలే అని అంగీకరిస్తే అప్పుడు గుణాలు ప్రధానము కూడా నిత్యం అని చెప్పవలసి వస్తుంది. అట్లు గాక కార్యవైచిత్ర్యన్ని బట్టి వివిధ శక్తులున్నాయి అని ఊహిస్తాము. ఆ ఒక్కటే అవయవాలు అని చెప్పబడుతున్నాయి. కానీ నిజానికి అవయవాలు అంటూ ఏమి లేవు. ఉన్నట్లయితే అలాంటి శక్తులు బ్రహ్మలో కూడా అనేకం ఉన్నాయి. దానిచేత వివిధ కార్యోత్పత్తి జరుగుతోంది. వాస్తవంలో బ్రహ్మ నిరవయవమే అని బ్రహ్మ వాది అంగీకరిస్తాడు.
సర్వోపేతాధికరణం ..( 2, 1, 30 )
సూత్రం 164 ..
సర్వపేతాచ తద్దర్శనాత్
చ..అంతేకాక, తద్దర్శనాత్.. అనేక శక్తిమంతం అని వర్ణించే మంత్రాల వల్ల, సర్వపేతా ..బ్రహ్మానికి అనేక శక్తులున్నాయని తెలుస్తోంది.
భావం.. అనేకమంత్రాల వలన బ్రహ్మానికి అనేక శక్తులున్నాయని తెలుస్తోంది.
వివరణ .. గురువుగారూ! బ్రహ్మ విచిత్రమైన కార్యశక్తి గలది అని చెప్పారు కదా, ఆ విషయం ఎలా తెలుస్తుంది అని అడిగాడు కృష్ణశర్మ. దానికి సమాధానం చెబుతున్నాడు. వేదాలలో పరదేవతా శక్తి సంపన్నమైనది అని చెప్పబడింది. ఛాందోగ్యోపనిషత్తు..పరమాత్మ స్థూల, సూక్ష్మ రూపాలు లేనివాడు. చైతన్య స్వరూపుడు. సత్య సంకల్పుడు. సర్వవ్యాపి, సమస్త కర్మలు స్వరూపంగా కలవాడు. సర్వకాముడు, సమస్త గంధములు, రసములుగలవాడు. జగత్తును వ్యాపించి ఉండేవాడు అని చెప్పబడింది.
బృహదారణ్యకం ..యాజ్వవల్కుడు గార్గికి సమాధానం చెబుతూ బ్రహ్మ యొక్క శాసనం వలెనే సూర్యచంద్రులు తమ యొక్క స్థానాలలో ఉన్నారు అని చెప్పాడు.
ముండకోపనిషత్తు:- పరబ్రహ్మ స్వయం ప్రకాశి, నిరాకారుడు, బాహ్యాంతరాలలో ఉండేవాడు. పుట్టుక, ప్రాణము లేనివాడు అని చెప్పబడింది.కాబట్టి బ్రహ్మకు విచిత్రమైన కార్య శక్తి ఉన్నది. పరదేవత సమస్త శక్తులతో ఉన్నట్లు శృతిలో చెప్పబయినది. మాయాశక్తిగల బ్రహ్మ నుండి జగత్తు పుట్టినది అని చెప్పే సమన్వయానికి శరీరం లేనివానికి మాయ సంబంధం ఉండదు అనే న్యాయంతో విరోధం ఉందా లేదా అనే సందేహం .పూర్వ పక్షంలో విరోధం ఉందని చెప్పారు. బ్రహ్మ ఒక్కటే అయినా దానిలో విచిత్రమైన శక్తులు ఉండటం వలన విచిత్రమైన కార్యప్రపంచాన్ని సృష్టించడం ఉపపన్నమే అని చెప్పబడింది. అయితే బ్రహ్మ విచిత్రమైన శక్తి గలది అని ఎలా తెలుస్తుంది. ఆ పరదేవత సర్వ శక్తి యుక్తమైనది. వాగీన్ద్రియము లేనిది, కోరికలు లేనిది, ఈ విధమైన శృతి బ్రహ్మకు సర్వ విధ శక్తులతో సంబంధాన్ని చూపుతున్నది.
సూత్రం :- 165
'వికరణత్వాన్నేతి చేత్త దుక్తం '
వికారణత్వాత్ :- ఇంద్రియాదులు లేకపోయినా బ్రహ్మం గొప్ప శక్తిమంత మైనవాడు, నీతిచెత్ :- బ్రహ్మం జగత్కారణం కాదనే వాళ్లకు, తుదుక్తం :-ఇది వరకే సమాధానం చెప్పారు.(2, 1,7 )
భావం :- ఇంద్రియాలు లేకపోయినా బ్రహ్మం గొప్ప శక్తి మంతుడైనవాడు. బ్రహ్మ జగత్కారణం కాదనే వాళ్లకు ఇది వరకే సమాధానం చెప్పబడింది.
వివరణ:- బ్రహ్మకు ఇంద్రియాలు లేవు. నిరాకారుడు నిరవయవుడు అని చెప్పబడింది. అలంటి బ్రహ్మ జగత్తును ఏ విధంగా ఉత్పత్తి చేస్తాడు అనేదే వారి ప్రశ్న. బ్రహ్మ నిరాకారుడే అన్న మాట నిజమే. అవయవాలు లేనివాడు. అయినప్పటికీ సర్వజ్ఞుడు. సర్వ శక్తిమంతుడు.
ముండకోపనిషత్తు :- పరబ్రహ్మ స్వయంప్రకాశి. నిరాకారుడు బాహ్యఅంతరాల్లో ఉండేవాడు. పుట్టుక, ప్రాణము లేనివాడు. బ్రహ్మకు ఇంద్రియాలు లేవు. నిరాకారుడు, నిరవయవుడు అని చెప్పబడింది. అలాంటి బ్రహ్మ జగత్తును ఏవిధముగా ఉత్పత్తి చేస్తాడు. అని వారి ప్రశ్న. బ్రహ్మ నిరాకారుడనే మాట వాస్తవమే. అవయవాలు లేని వాడు. అయినా సర్వజ్ఞుడు సర్వ శక్తిమంతుడు. చేతనులైన దేవాదులు సర్వశక్తులు ఉన్నవారైనా కూడా దేహేంద్రియాలతో కూడి ఉండి మాత్రమే ఆయా కార్యాలు సాధించడానికి సమర్ధులై ఉన్నారని తెలుస్తోంది. అతి గంభీరమైన ఈ బ్రహ్మ శ్రుతి సహాయంతో తెలియదగినదే కానీ, తర్కం చేత తెలియదగినది కాదు. ఒకని సామర్ధ్యం ఎలా ఉందో, ఇతరుల సామర్ధ్యం కూడా అలాగే ఉండాలని నియమం ఏమి లేదు. దేహేంద్రియాలు లేకపోయినా బ్రహ్మకు సర్వ సామర్ధ్యాలు ఉన్నాయి అని చెప్పబడింది. కాబట్టి బ్రహ్మకు విచిత్రమైన కార్యశక్తి ఉన్నది. బృహదారణ్యకంలో యాజ్ఞవల్కుడు గార్గికి సమాధాం చెబుతూ బ్రహ్మ యొక్క శాసనం వలెనే సూర్యచంద్రులు తమ స్థానాలలో ఉన్నారు అని చెప్పాడు.
ప్రయోజనవత్త్వా ధికరణం :- ( 2,1,32 )
సూత్రం :- 166 :
"న ప్రయోజనవత్వాత్ "
ప్రయోజన వత్వాత్ :- చేతన ప్రవృత్తికి ప్రయోజనం ఉంటుంది. కనుక, న :- బ్రహ్మ జగత్కారణం కాదు.
భావం :- చేతనమైన ప్రవృత్తికి ప్రయోజనం ఉంటుంది. బ్రహ్మకు సృష్టి చెయ్యడంలో ప్రయోజనం ఏముంటుంది? అందుకే బ్రహ్మ జగత్కారణం కాదు అని వారి వాదన.
వివరణ :- ప్రవృత్తి అనేది ప్రయోజనాన్ని ఆశించి ఉంటుంది. పరబ్రహ్మ నిత్యతృప్తుడు. అందుచేత ప్రయోజనం ఉండదు. అంటే ఈజగమంతా బ్రహ్మచేతనే సృష్టింపబడుతోంది. ఎవరు ఏపని చేసినా కొంత ప్రయోజనం ఉంటుంది. బృహదారణ్యకంలో యాజ్ఞవల్కుడు మైత్రేయికి ఈవిషయమే చెబుతాడు. ప్రయోజనం లేనిదే ఎవరు ఏ పని చెయ్యరు. మరి బ్రహ్మ ఏ ప్రయోజనం ఆహించి ఈసృష్టి చేశాడు? అన్నదే ప్రశ్న లోకంలో ప్రాణుల ప్రవృత్తికి ఒక ప్రయోజనం ఉంటుంది. మందబుద్ధి ఉన్నవాడు కూడా ప్రయోజనం లేనిపని చెయ్యడు. ఆలోచించి కార్యం చేసే వాడి ప్రవృత్తి ఎన్నడూ నిష్ప్రయోజనం కాదు. ప్రాణి ప్రవృత్తి వలన కలిగే ప్రయోజనం తనకైనా పరులకైనా సంబంధించి ఉంటుంది. పరమాత్మకు స్వప్రయోజనం ఉందనడానికి వీలు లేదు. పరబ్రహ్మ నిత్యతృప్తం, ఆనందస్వరూపం పరిపూర్ణం. ఆయనకు కావలసిన ప్రయోజనం ఏమిటి? బ్రహ్మంలో జగద్రచన ప్రవృత్తి పరప్రయోజనం కొరకు అని అనడం కూడా పొసగడం లేదా? పరుల కోసం అన్నప్పుడు, సృష్టికి పూర్వం పరులు ఎవరుంటారు? పరులను అనుగ్రహించడం కోసమే అయితే ఈ సృష్టి ఇంత దుఃఖమయంగా ఎందుకు ఉన్నది, అందుకే జగద్రచన అనుగ్రహ కారణం కాదు. అందువల్ల జగజ్జన్మాదులకు కారణం బ్రహ్మం అనడం సమంజసం కాదు అనేదే పూర్వ పక్ష వాదన .
సూత్రం :- 167
"లోకవత్తు లీలా కైవల్యం"
తు :- అది సరి కాదు. లోకవత్ :- ఈ లోకంలో మనం చూస్తున్నట్లుగా, లీల కైవల్యం :- ఇది కేవలం ఆయన లీల మాత్రమే.
భావం :- జగత్తు చేతనమైన బ్రహ్మచే సృష్టించబడలేదు. ఆయన జగద్రష్ట కాదు అనే సంశయం సరియైనది కాదు. ఈ సృష్టి అంతా ఆయన లీల మాత్రమే.
వివరణ :- ఈ లోకంలో రాజులు, ధనికులు ఏ ప్రయోజనం లేకపోయినా విలాసార్థం నృత్యం, గానం లాంటి కళలను ఏర్పాటు చేస్తారు. అలాగే నిత్యతృప్తం ఆనందమయమైన బ్రహ్మం స్వప్రయోజనం లేకపోయినా విలాసార్ధంగా జగజ్జన్మాదులకు నిమిత్తం అవుతున్నాడు. ఇక్కడ ఒక సందేహం కలుగుతుంది. జగత్ సృష్టి విలాసార్థం ఎలా అవుతుంది? ఈలోకంలో కొందరు సుఖాన్ని, కొందరు ఎంతో దుఃఖాన్ని, మరికొందరు సుఖదుఃఖాలు రెండింటిని అనుభవిస్తుంటారు. ఇలా సుఖదుఃఖా లను అనుభవించేటట్లు జగత్తును రచించిన బ్రహ్మప్రవృత్తి విలాసార్థం ఎలాఅవుతుంది ? లోకంలో ఒకరి ప్రవృత్తి వల్ల వేరే వాళ్లకు సుఖదుఃఖాలు కలిగితే అలాంటి వాడి ప్రవృత్తి రాగద్వేషాలతో కూడుకొని ఉంటుంది. అలాగే బ్రహ్మం ప్రవృత్తి వలన ప్రాణులకూ విషయరూపంలో సుఖదుఃఖాలు కలుగుతున్నాయి. కనుక ఆప్రవృత్తి వైషమ్యానికి, నిర్దయకు చెందినదై దోషయుక్త మవుతుంది. బ్రహ్మంలో రాగద్వేషాలు ఉన్నాయనడం ఉచితంగా లేదు. అందుచేత జగత్ కారణమైన బ్రహ్మం విలాసార్ధం అనడం సమంజసం కాదు. లోకంలో అన్ని కోరికలు తీరిన రాజుగానీ, అమాత్యుడుగానీ, ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా క్రీడావిహారాలలో కేవలం లీలారూపంగా ప్రవర్తిస్తారో, బాహ్యమైన ప్రయోజనాన్ని దేనిని ఆపేక్షించకుండా ఉచ్చ్వాసనిశ్వాసలు స్వభావం చేత ఏవిధంగా జరుగుతాయో, అదే విధంగా ఈశ్వరుడు కూడా ప్రయోజనాన్ని ఆపేక్షించ కుండా స్వభావం చేతనే కేవలం లీలారూపము నందు ప్రయోజనం ఏది కల్పించడం కుదరదు కదా! ఈ జగ్దబింబ నిర్మాణం మనకు చాల గొప్ప సంరంభం నిర్వహించవలసినట్లు కనబడినా, అపరిమిత శక్తికల పరమేశ్వరునికి ఇది లీల మాత్రమే. లోకంలో రాజులకు ప్రయోజనం ఉంటుందేమో గానీ, పరమాత్మ విషయంలో కొంచెం కూడా ప్రయోజనం ఉండదు. పరమేశ్వరుడు సత్య కాముడు, సర్వజ్ఞుడు ఏ అపేక్ష లేకుండానే ఈ సృష్టి చేస్తున్నాడు.ఈ జగత్తంతా ఈశ్వరుని లీల.
వైషమ్య నైర్ఘృణ్యాధికరణం ( 2,1,34 )
సూత్రం :- 168
'వైషమ్య నైర్ ఘృణ్యేన సాపేక్షత్వాత్ తథా హి దర్శయతి"
వైషమ్య :-అసమత్వం, నైర్ ఘృణ్యే :- నిర్దయత, ఈ రెండు సాపేక్షత్వాత్.. సాపేక్షికలు కావడం వలన, ఇవి న :- జగత్ కర్త అయినా బ్రహ్మానికి అంటవు. తథాహి దర్శయతి :- అని శబ్దం ప్రతిపాదిస్తున్నది.
భావం :- అసమత్వం, నిర్దయత సాపేక్షికాలు కావడం వలన ఇవి బ్రహ్మానికి అంటవు.
వివరణ :- గురువుగారు ! పరమాత్మ ప్రాణులను వారివారి కర్మలను బట్టి సృష్టిస్తున్నాడా లేదా? కర్మలను బట్టి సృష్టిస్తే సృష్టి కర్మాధీనమౌతుంది. అలాకాకుండా అంటే కర్మలను పరిగణించకుండా సృష్టిస్తున్నాడు అంటే బ్రహ్మకు పక్షపాతం అంటుకుంటుంది. ఎందుకంటే పశువులు, పక్షులుగా పుట్టిన ప్రాణులు హింసింపబడుతున్నాయి. దేవతలు విలాసవంతులు, ఈవిషయాన్నీ వివరించండి అన్నాడు నారాయణభట్టు. సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. పరమేశ్వరునికి పక్షపాతం, నిర్దయత్వం అనే లక్షణాలు దోషాలు లేవు. జీవులను కర్మానుసారమే సృష్టిస్తాడు. ఇలా చెయ్యడం వలన సృష్టి కర్మాధీనమౌతుంది. అనీశ్వరత్వం కలుగుతుంది. అనే మాట తప్పు. పరబ్రహ్మ జీవుల ధర్మాధర్మాలను అనుసరించి సాపేక్షమై ఈ విషమసృష్టి నిర్మాణం చేస్తున్నాడు. పరమేశ్వరుడు మేఘం వంటివాడు. అన్ని పంటలకు వర్షాన్నిస్తాడు. ధాన్యంలో ఉండే తేడా ఆ విత్తనలోనే ఉంది. భగవద్గీతలో చెప్పినట్లుగా పరమేశ్వరుని ఎవరు ఏ విధంగా సేవిస్తారో వారికీ ఆ విధమైన ఫలమే వస్తుంది. బృహదారణ్యకోపనిషత్తు :- ( 3,2,13) జీవులు తాము చేసే కర్మలకు తగ్గట్టుగా సుఖదుఃఖాలను అనుభవించడానికి శరీరాన్ని పొందుతారు. ఈశ్వరుడు చేసిన జగన్నిర్మాణంలో జీవులు కర్మలు చెయ్యాలని ఆక్షేపిస్తే ఆయన ఐశ్వర్యానికి ఏ లోటు కలుగదు. జీవులు చేసే పుణ్యపాపాలకు తగిన ఫలాన్ని, తగిన కాలంలో అనుభవించేటట్లు చేయడం వలన ఆయన స్వామిత్వానికి ఏభంగము వాటిల్లదు. రాజు రాజ్యపాలన చేస్తూ దోషుల్ని దండిస్తూ మంచివాళ్లను అనుగ్రహిస్తాడు. అలాగే బ్రహ్మం కర్మానుగుణంగా జగన్నిర్మాణం చేస్తాడు. విషమం, విచిత్రం అయిన ఈ జగత్తును బ్రహ్మం విలాసంగా నిర్మించడు. జగన్నిర్మాణం సాపేక్షమే కానీ నిరపేక్షణం కాదు. ఈశ్వరుడు జగత్తును ప్రాణుల కర్మ ఫలాలను అనుగుణంగా నిర్మిస్తాడు. ప్రాణులుచేసే కర్మలు, పుణ్యాలు, పాపాలు వీటికి ఫలితాలు, సుఖదుఃఖాలు. వీటిని అనుభవించడానికి ఈజగన్నిర్మాణం. అందువలన వైషమ్య నైర్ ఘృణ్యాలు ఆయనకు అంటవు. జీవులు అనుభవించే సుఖదుఃఖాలకు కారణం వాళ్ళు చేసిన కర్మలే. బ్రహ్మం కాదు. బ్రహ్మానికి ఏ దోషాలతో సంబంధం లేదు.
సూత్రం :- 169
'న కర్మ విభాగాదితి చేన్నా నాదిత్వాత్'
అవిభాగాత్ :- బ్రహ్మంలో జీవులు అవిభాగరూపంలో ఉన్నందువలన, న ఇతి చేతి:- సృష్టికి పూర్వం ప్రాణి కర్మలు ఉండవు అనడం, న :- సరి అయినది కాదు. ఎందుకంటే అనాదిత్వాత్ :- జగత్తు లాగా ప్రాణి కర్మలకు ఆది అనేది లేదు.
భావం :- బ్రహ్మంలో జీవులు అవిభాగ రూపంలో ఉన్నందు వలన సృష్టికి పూర్వం ప్రాణికి కర్మలు ఉండవు అనడం సరి అయినది కాదు.
వివరణ :- సృష్టికి పూర్వం ఏ విధమైన భేదము లేదు. కాబట్టి కర్మ అనేది లేదు. అలాంటప్పుడు ఈ విషమ సృష్టి ఎలా జరిగింది అనేదే ప్రశ్న. దీనికి సమాధానం సంసారమనేది అనాది అయినది. బీజాంకురముల లాగా సృష్టి కర్మలకు కార్యాకారణ భావం ఉంది. అందుచేత కర్మను అనుసరించే సృష్టి జరిగింది. ప్రళయం జరిగినప్పుడు కర్మ పరిపక్వం కాని జీవులు తమ కర్మను తమతో మూటకట్టుకొని, పరమేశ్వరునిలో లీనమైనవి. మళ్ళీ సృష్టి జరిగినప్పుడు తమ కర్మానుసారం జన్మిస్తాయి.
ఐతరేయోపనిషత్తు :- (1,1) ప్రళయ కాలంలో బ్రహ్మం తప్ప వేరే ఏమి ఉండదు. భోక్తృ, భోగ్య రూపమైన జగత్తంతా బ్రహ్మంలో అవిభక్తమై ఉంటుంది. అందువల్ల ప్రాణులు, ప్రాణుల కర్మలు ఇవి వేరుగా ఉండవు. కనుక ఈ జగత్తంత ప్రాణి కర్మలు అనాదులే. ప్రళయం కాలంలో ప్రాణులు చేష్టలు లేకుండా ఉంటాయి. వాళ్ళని ఆశ్రయించిన కర్మలు అలాగే ఉంటాయి. సూక్ష్మ రూపంలో ఉన్న కర్మలకు అనుగుణంగానే బ్రహ్మ ఈ జగత్తును సృష్టిస్తాడు. అందుచేత కర్మాపేక్షమైన జగన్నిర్మాణంలో దోషం లేదు. కాగా కర్మ అనేది జన్యం కాదా! అది అనాది ఎలా అవుతుంది? కర్మ అనేది అనాది అని ఎక్కడ ఉంది అన్నారు. కర్మ చేస్తేనే శరీరాది విభాగం ఏర్పడుతుంది. విభాగం కంటే పూర్వం నిమిత్తమైన కర్మ లేదు కనుక మొట్ట మొదట సృష్టి ఈ వైషమ్యాలు లేకుండా ఒకే విధంగా ఉండాలి అన్నట్లయితే ఏ దోషం లేదు. ఎందువలననగా ఈ సంసారం అనాది, సంసారానికి ఆది అనేది ఉండి ఉంటే ఈ దోషం ఉండేది. కానీ అనాది అయిన సంసారం లో కర్మ, సృష్టి వైషమ్యం కూడా బీజాంకురాల వలె మరో జన్మకు కారణమౌతాయి. విత్తు ముందా చెట్టు ముందా అనే సమస్య వలెనే కర్మ ముందా సంసారం ముందా అంటే చెప్పలేం. హేతువైన కర్మ, హేతువు వలన ఏర్పడిన సంసారం కూడా అనాదిగా వస్తున్నాయి అని అర్ధం.
సూత్రం :- 170 '
" ఉప పద్యతే చాప్యుపలభ్యతే చ"
చ :- కాగా, ఉపపద్యతే :- కర్మ అనాది అనడం హేతుభద్ధమే, అపి ఉపలభ్యతే చ :- కర్మ అనాది అని శాస్త్రల్లో చెప్పారు కదా!
భావం :- కర్మ అనాది అనీ, హేతుబద్ధమనీ శాస్త్రల్లో చెప్పారు కదా!
వివరణ :- సృష్టి అనేది చాలా కాలం నుంచి జరుగుతున్నది. చెట్టు లేనిదే విత్తు లేదు. విత్తు లేనిదే చెట్టు లేదు. అలాగే కర్మ లేనిదే జన్మ లేదు. జన్మ లేనిదే కర్మ లేదు. ఈ రెండు ఒకదాని కొకటి ఆశ్రయించుకొని ఉంటాయి.
ప్రశ్నపనిషత్తు :- ప్రజాపతి సంతానాన్ని పొందాలనే కోరిక గలవాడై తప్పస్సు చేశాడు. ఇక్కడ తపస్సు అంటే పూర్వ కాలంలో తాను చేసిన సృష్టిని ధ్యానించడం. కాబట్టి సృష్టి వెనుకటి కల్పంలో లాగానే జరిగింది. ఈ సృష్టిలో బ్రహ్మకు ఏ విధమైన పక్షపాతము లేదు. జీవులన్నీ తమ కర్మానుసారమే ఉద్భవిస్తాయి. కర్మ అనేది అనాది కాని పక్షంలో ప్రపంచం నిర్వేతుకం, ఆకస్మికం అవుతుంది. జగత్తులోని వైచిత్య్రానికి బ్రహ్మ కారణం అనుకుంటే, బ్రహ్మానికి వైషమ్య, నైర్ఘృణ్యదోషాలు కలుగుతాయి. ఇవి ఒకవేళ నిర్వేతుకం అనుకుంటే నేరం చెయ్యకుండానే దండన లభించినట్లు అవుతుంది. అందువలన జగత్తు సృష్టికి కర్మ హేతువు. దానితో కర్మ అనాది అని సిద్ధమవుతున్నది. ప్రకృతి ,జీవుడు, ఈశ్వరుడు ఈ మూడు తత్త్వా లు స్వరూపంలో అనాదులు. కర్మ , జగత్తు ఈ రెండూ ప్రవాహరూపంలో ఆనాదులు.
సాంఖ్యశాస్త్రము:-(6, 41) కర్మ వైచిత్య్రం వల్లే సృష్టి వైచిత్య్రం అని సాంఖ్య స్మృతి. జీవునితో బాటు కర్మలు, జగత్తు అనాదులే. ఈ విచిత్రజగద్రచనకు ఒక్క కర్మనే బ్రహ్మం ఆపేక్షిస్తుందా? మరి ధర్మాధర్మలు వాటి వాసనల మాట ఏమిటి? ఇవి జీవ ధర్మాలు కావా? అవి కూడా అనాదేనా? అని సందేహం. దీనికి సమాధానం తరువాత సూత్రంలో చెప్పబడింది. ఈ సంసారం అనాది అని ఎలా తెలుస్తుంది. సంసారానికి ప్రారంభం ఉంటే అది ఎప్పుడో ఒకనాడు అకస్మాత్తుగా పుట్టిందని చెప్పాలి. అలాగైతే ముక్తులు కూడా మళ్ళీ సంసారంలో పుట్టడం జరుగుతుంది. సుఖదుఃఖాల వైషమ్యానికి నిమిత్తం ఏది లేకపోవడం చేత ఏమి చేయకుండానే ఫలం కలగడం అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా జ్ఞానకాండ, కర్మకాండ వ్యర్థమౌతాయని భావం. సుఖ దుఃఖాది వైషమ్యానికి ఈశ్వరుదే హేతువు అనడం యుక్తం కాదు. అవిద్యా కారణం కాదు. ఎందుకంటే అవిద్య అందరి విషయంలో ఒకేలా ఉంటుంది. రాగద్వేషాలు, మోహం, వాసనల చేత చేయబడిన కర్మలకు అవిద్య వైషమ్యాన్ని కలిగించ వచ్చును. కర్మ లేకుండా శరీరం ఉండదు. శరీరం లేకుండా కర్మ సంభవించదు. శరీరం ఉంటే సంసారబంధం తప్పదు. సంసారం అనాది అని స్మృతులలో చెప్పబడింది. సృష్టి ప్రారంభంలో శరీరంతో సంబంధించిన ఆత్మకు ప్రాణధారణ కోసం పరబ్రహ్మ జీవుడిలో ప్రవేశిస్తాడు. ప్రాణాలు, ప్రాణధారణం చేసే జీవాత్మ కూడా అనాదులే.
సర్వ ధర్మోప పత్త్యధికరణం ( 2,1,37)
సూత్రం :- 171
' సర్వ ధర్మోపపత్తేః చ '
చ :- అలాగే, సర్వ ధర్మ :- జీవాత్మకు సంబంధించిన ధర్మాలన్నింటిలో, ఉపపత్తేః :- అనాదిత్వం సిద్ధిస్తుంది.
భావం :- కర్మ అనాది అని శాస్త్రల్లో చెప్పినట్లుగానే జీవాత్మకు సంబంధించిన ధర్మాలన్నింటిలో అనాదిత్వం సిద్ధిస్తుంది.
వివరణ:- ప్రవాహరూపంలో కర్మ ఎలాగ అనాదో జగద్రచనకు వాసనలు సైతం జీవుడి ధర్మాలే. ఇవన్నీ జగద్రచనకు సహకార కారణాలు. కార్యం అయిన జగత్తు ప్రవాహం రూపంలో అనాది అయినప్పుడు, కార్యరచనకు కావలసిన కారణములు అనాదే. కార్యకారణములు ఒకే కాలంలో ఉండాలి. సర్వశక్తిమంతుడైన పరబ్రహ్మం జగత్తును సృష్టించడానికి కావలసిన కర్మాది సాధనాలు కర్మ, జీవ ధర్మాలు, వాసనలు కారణమౌతాయి. ఈపాదంలో బ్రహ్మ జగత్ కారణమని అని అనడంలో ఏర్పడే స్మృతివిరోధాన్ని, తర్కవిరోధాన్ని వ్యాసుడు పరిహారించాడు. జగత్తును సృష్టించడానికి కావలసిన సర్వజ్ఞత్వము, జగత్ కారణత్వము, సర్వశక్తిత్వం అనే సమస్త ధర్మాలు పరబ్రహ్మకున్నాయి. కాబట్టి ఈ జగత్తును సృష్టించడానికి కారణం ఆ బ్రహ్మ తప్ప వేరేవారు కాదు. బ్రహ్మ నిర్గుణమే అయినా దానికి ఉపాదానకారణానికి ఉండవలసిన ధర్మాలన్నీ ఉన్నాయి. చేతనమైన బ్రహ్మ జగత్తుకు కారణం. అదే ప్రకృతి కూడా జగత్తుకు కారణమని చెప్పబడిన వేదార్ధం విషయంలో ఇతరులు చూపిన దోషాలను ఆచార్యుడు పరిహరించాడు.
రచనాను పత్త్యధికరణం :- ( 2, 2, 1)
సూత్రం :- 172
"రచనానుప పత్తేశ్చ నానుమానమ్ "
రచన అనుపపాత్తేః :- జగత్ రచన సాధ్యం కానందున వలన, చ :-అలాగే, అనుమానం :- అనుమాన ప్రమాణం వలన తెలిసే ప్రధానం అంటే ప్రకృతి, న :- స్వతంత్రంగా జగద్రచనకు కారణం కానేరదు.
భావం :- ప్రధానమే ( ప్రకృతే ) జగద్రచనకు సాధ్యం కానందు వలన స్వతంత్రంగా సృష్టి రచన చెయ్యలేదు.
వివరణ :- జగజ్జన్మాదులకు ప్రకృతే స్వతంత్ర కారణం అని కొందరి వాదన. బ్రహ్మనికే జగత్తును సృష్టించే స్వభావం ఉందని ప్రకృతికి లేదని చెప్పడానికి ఏదైనా విశేష కారణం ఉందా? లేని పక్షంలో ప్రకృతి జగన్నిర్మాణానికి స్వతంత్ర కారణం కాదని ఎందుకు అనాలి? అని వీళ్ళ అభిప్రాయం. ప్రకృతికి ప్రధానం అని పేరు కూడా ఉంది. సృష్టి సమయంలో జగత్తును సృష్టించడం, ప్రళయకాలంలో జగత్తును ప్రకృతి తనలో లీనం చేసుకుంటుంది. కనుక ప్రకృతిని ప్రధానం అన్నారు. అందువలన ప్రకృతే తన స్వభావాన్ని అనుసరించి జగత్తును నిర్మిస్తుందని బ్రహ్మం జగత్కారణం కాదని వారి వాదన. ఇది సరిఅయినది కాదు. ప్రకృతి చేతనం కాదు. రచన అంటే ఒక్కానొక ప్రయోజనాన్ని ఉద్దేశించి చేసే విన్యాసం నిర్మాణం. ఈఉద్దేశ్యం జడపదార్ధం ధర్మం కాదు. అది చేతనధర్మం. జడమైన ప్రకృతి ప్రయోజన పూర్వకంగా పదార్ధాలను తీర్చిదిద్దలేదు. అది చేతనత్వం ఉంటేనే సాధ్యమౌతుంది. అందువలన ప్రధానం చేతనాధిష్టితమై జగద్రచనకు ఉపాదాన కారణం అవుతోంది. బ్రహ్మకు చేతనత్వం నిరతిశయమైన జ్ఞాన, క్రియాశక్తి ఉన్నందునే జగద్రచనకు స్వతంత్ర కారణమవుతోంది. పురుషుడు తామరాకు మీద నీటి బొట్టులా ఉంటాడు. జగత్తుకు కారణం ప్రధానం. పురుషునికి భోగ వస్తువులను సమకుర్చడానికే ప్రధానం అనేక రూపాలలో సృష్టించబడింది. ఈజగత్తు సుఖము, దుఃఖం, మోహములతో కూడి ఉంది. సుఖం సత్వగుణం, దుఃఖం రజోగుణం, మోహం తమోగుణం, వీటినే త్రిగుణములు అంటారు. ఈజగత్తు త్రిగుణాత్మకమైనదని సాంఖ్యుల అభిప్రాయం. ఈ అనుమానప్రమాణం తోనే జగత్తుకు ప్రధానం ఉపాదాన కారణమని సాంఖ్యుల వాదన. ఇక్కడ ఈవాదన ఖండించబడుతోంది. ఈలోకంలో చేతనుడైన కుమ్మరి తన అధీనంలో ఉండే మట్టిని నానా విధములైన పాత్రలను తయారుచెయ్యడానికి ఉపయోగిస్తాడు. మట్టి లాగానే ప్రధానం కూడా స్వతంత్ర కారణం కానేరదు. రచనాశక్తి స్వాభావికంగా కానీ, నిమిత్తం వల్ల కానీ ప్రధానంగా ఉందనడానికి ప్రమాణాలేవి లేవు. ప్రధానం అచేతనము, జడము దానికి సృష్టించే శక్తి లేదు. అందువలన జగత్తు సృష్టికి కారణం పరబ్రహ్మమే కానీ ప్రధానం కాదు .
సూత్రం :- 173
" ప్రవృత్తే శ్చ "
చ :- అంతే కాక, ప్రవృత్తేః :- ప్రధానానికి ఏ ప్రవృత్తి లేదు.
భావం :- ప్రధానానికి ఏ ప్రవృత్తి లేదు. కనుక అది స్వతంత్ర కారణం కాదు.
వివరణ :- ఏదైనా కార్యాన్ని నిర్వహించడం కోసం చేసే క్రియను ప్రవృత్తి అంటారు. అలాంటి ప్రవృత్తి లేని ప్రధానం జగత్తును ఎలా రచిస్తుంది? జడపదార్ధానికి సంబంధం వల్లే ప్రవృత్తి కలుగుతుంది. స్వతంత్రంగా కలుగదు. చేతనపదార్ధనికే క్రియా ప్రవృత్తి ఉంటుంది. అచేతనానికి తెలివి, వేదన ఉండవు. అందువలన దానికి కార్యాకారణ విచారణ, ప్రవర్తన లేవు. శరీరంలో ఉండే చేతనానికి రధాన్ని ఎక్కాలనే ప్రవృత్తి ఉంటుంది. చేతనరహితమైన శవంలో అలాంటి ప్రవృత్తి ఉండదు. ప్రవృత్తి ఆచరణ వలన కూడా ప్రధానమనేది ఈ జగత్తుకు కారణం కాదు. ఎందుకంటే ఈ ప్రవృత్తి అనేది లోకంలో చేతనమైన వాటికే ఉంటుంది. అచేతనాలకు ప్రవృత్తి ఉండదు. ఒకవేళ ఈ జగత్తు కనుక అచేతనమైన ప్రధానం వలన సృష్టింపబడి ఉంటే మట్టిలో తయారైన కుండాలాగా, వస్త్రంలాగా ఏరకమైన చైతన్యం లేకుండా అలాగే పడి ఉండాలి. ప్రధానంలో సత్వరజస్తమో గుణాలుంటాయి. అవి సమంగా ఉన్నప్పుడే దానికి ప్రధానం అని పేరు. అప్పుడు సృష్టి ఉండదు. ఆగుణాల సామ్యావస్థ తొలగి వాటిలో ఒక గుణం అంగీ గాను, మిగిలినవి అంగాలు గాను ఏర్పడినప్పుడు విశిష్టమైన కార్యాన్ని పుట్టించడానికి అభిముఖమైన ప్రవృత్తి ప్రధానంలో కలుగుతుంది. కానీ ప్రధానం అచేతనం కనుక ఇలాంటి ప్రవృత్తి కలుగదు. అది కలిగితేనే జగద్రచన సాధ్యం. ఏ అచేతనంలో ప్రవృత్తి కనబడుచున్నదో, ఆ ప్రవృత్తి దానిదే కావచ్చును. అయితే అది చేతనం వలెనే జరుగుతుందని వారి భావన. కాల్చడం, ప్రకాశించడం మొదలైన వికారాలు కర్రలో ఉన్నాయి. కేవలం అగ్నిలో కనబడటం లేదు. అయినా కూడా అది అగ్ని వల్లనే కలుగుతున్నది. అది లేనప్పుడు కలగదు. వారి మతం ప్రకారం దేహదులతో కలసిన ఆత్మ కూడా కేవలం విజ్ఞానస్వరూపంగా మాత్రమే ఉంటుంది. అంత కంటే వేరు ప్రవృత్తి ఏమి ఉండదు. ప్రవృత్తి శూన్యమైన ఆత్మ కూడా అయస్కాంతం వలె ఇతరమైనవాటిని ప్రవర్తింపజేస్తుంది. అయస్కాంత మణి ఏ విధంగా తాను ఏ ప్రవృత్తి లేనిదైనా, ఇనుమును ప్రవర్తింపజేస్తుందో, అట్లే సర్వగతుడు, సర్వాత్మ, సర్వజనుడు సర్వశక్తి అయినా ఈశ్వరుడు కూడా తాను ఏ ప్రవృత్తి లేనివాడై నా సమస్తాన్ని ప్రవర్తింపాజేస్తాడు.
సూత్రం :- 174
" పయోంబు వచ్చేత్ తత్రాపి"
" పయః అంబువత్ :- పాలు నీళ్లలాగా, చేత్ :- ప్రధానానికి ప్రవృత్తి కలుగుతుందంటారా? తత్రాపి :- అక్కడ కూడా చేతన సంబంధం వల్లే ప్రవృత్తి కలుగుతుంది కదా!
భావం :- పాలు, నీరు వలె అచేతనమైన ప్రధానానికి ప్రవృత్తి కలుగుతుందంటారా? అన్నట్లయితే అక్కడ కూడా చేతన ప్రేరణ ఉన్నది.
వివరణ :- గురువు గారు! అచేతనాల్లో కూడా ప్రవృత్తి కనిపిస్తుంది కదా! పాలు అచేతనం, అవి దూడను పోషిస్తున్నాయి. అలాగే నీరు అందరికి ఉపయోగిస్తుంది. అలాగే జడమైన ప్రధానం పురుషునికి భోగవస్తువు కదా! అని అడిగాడు కృష్ణ శర్మ. ఆ మాటలు విన్న రత్నకరుడు సమాధానం చెబుతున్నాడు. దూడ కోసం పాలు, లోకం కోసం నీరు లాగానే పురుషుని కోసం ప్రకృతి రూపుదాలుస్తా యన్నది నిజం కాదు. జడ ప్రకృతి కూడా జగద్రచనకు ప్రవక్తమౌతుందని భావించడం సరి అయినది కాదు. దీనికి కారణం ఆవుకు దూడ మీద ఉన్న ప్రేమ. దానితో స్వయంగా పాలను తన స్థనాలనుంచి స్రవించేటట్లు చేస్తుంది. ఇక్కడ ఉన్నది చేతనసంబంధం. ఈ కారణం వలన పాలలో స్రవణ క్రియ జరుగుతోంది. అంతే కానీ పాలు స్వయంగా ప్రవహించి దూడకు చేరవు. అలా అయితే ఏదైనా పాత్రలో ఉన్న పాలు స్వయంగా ప్రవహించి, దూడ నోటికి చేరాలి. ఇక్కడ ఆవు ప్రవృత్తే దీనికి కారణం.
బృహదారణ్యకోపనిషత్తు :-(3,8,9):- అక్షరమైన ఈ బ్రహ్మశాసనం వలెనే నదులు ప్రవహిస్తున్నాయి. పాత్రలో ఉన్న నీరు స్వయంగా దాహర్తి నోటిలో పడవు. దీనికి చేతనాపూర్వకమైన కర్మ అవసరం. అందువలన ఈ ఉదాహరణల మూలంగా జడమైన ప్రకృతికి ప్రవృత్తి ఉందనడం హేతుబద్ధం కాదు. బృహదారణ్యకంలో యాజ్ఞవల్కుడు చెబుతాడు, అతడు వాయువులో ఉంటాడు. వాయువు అతన్నెరుగదు. వాయువే అతని శరీరం. వాయువులో ఉంటూనే వాయువును నియంత్రిస్తాడు. అతడే అంతర్యామి అయిన ఆత్మ జలంలో ఉంటాడు. దూడకు పాలు ఇచ్చే ఆవు చేతనమే. పాలు త్రాగే దూడ చేతనమే. అలాగే పల్లానికి ప్రవహించడమనేది నీటి ప్రవృత్తి. ఇదంతా బ్రహ్మచైతన్యం వలననే జరుగుతోంది. ప్రతి అచేతన వస్తువు యొక్క ప్రవృత్తి కూడా చేతనాధిష్టితం అని సాధించవలసి ఉంది. ఇందుకు తగిన యుక్తులు కూడా చూపబడ్డాయి. అందుచేత వాటిని దృష్టాంతంగా చూపి అచేతనం చేతనాధిష్టితం కాకుండానే ప్రవర్తిస్తుంది అని చెప్పడం యుక్తం కాదు.
సూత్రం :- 175
"వ్యతిరేకానవస్థితే శ్చాన పేక్షత్వాత్ "
చ :- అంతే కాక, అనపేక్షత్వాత్ :- చేతన ప్రమేయం లేకుండా ప్రధానం ప్రళయానికి స్వతంత్ర కారణం అని ఒప్పుకుంటే, వ్యతిరేక అనవస్థితేః :- ప్రళయ వ్యవస్థ కలుగదు.
భావం :- చేతన ప్రమేయం లేకుండా ప్రధానం ప్రళయానికి స్వతంత్ర కారణం అని ఒప్పుకుంటే, ప్రళయ వ్యవస్థ కలుగదు.
వివరణ :- ప్రధానానికి వ్యతిరేకమైన అప్రధానం ఏది లేదు. కాబట్టి అచేతనమైన ప్రధానం జగత్ కారణం కాదు. సాంఖ్యమతం ప్రకారం త్రిగుణముల సమూహమే ప్రధానం. దీనికి మించినది మరొకటి లేదు. దాని కంటే వేరుగా ప్రధానాన్ని ప్రవర్తింపజేసేది, కానీ నివర్తింపజేసేది కానీ, ఆపేక్షిచదగినది కానీ ఏది లేదు. పురుషుడు ప్రవర్తకుడు కాదు. నివర్తకుడు కాదు. కేవలం ఉదాసీనుడు. ఏమి పట్టనివాడు. అందుచేత ప్రధానం అనపేక్షం. సాంఖ్య మతం కన్నా ఇతర మతాలలో ఈశ్వరుడు చేతనుడు, సర్వజ్ణుడు, సర్వ శక్తిమంతుడు. తన ఇష్ట ప్రకారం ప్రవృత్తి, నివృత్తిలలో పాల్గొంటాడు. ప్రధానం జగద్రచనకు గాని, ప్రళయానికి గాని, స్వతంత్ర కారణం కాదు. సరూప పరిణామం అంటే సృష్టి. విరూప పరిణామం అంటే ప్రళయం. వ్యవస్థ అంటే మర్యాద, అవధి, నిర్ణయం. విరూప పరిణామంలో ఇంత కాలం ఉండాలి తరువాత సరూప పరిణామంలో ఇంత కాలం ఉండాలి అనే నియమమే మర్యాద వ్యవస్థ కూడా. ఈ సృష్టి, ప్రళయం కూడా ఒక దాని తరువాత మరొకటి మళ్ళీ మళ్ళీ వస్తాయి. ఈ వ్యవస్థ చేతన ధర్మం వలన ఏర్పడుతుంది. అచేతన గుణం వలన కాదు. ఈ స్వభావం ప్రధానానికి లేదు. సృష్టి, ప్రళయం విరుద్ద ధర్మాలు ఒకే వస్తువుకి ఉండవు. అలా ఉంటే దాన్ని స్వభావం అనరు. ప్రకృతికి సరూప పరిణామం స్వభావం ఉంటే నిరంతరంగా సృష్టి జరుగుతూనే ఉంటుంది. ఇక ప్రళయం ఏర్పడదు. విరూప పరిణామ స్వభావం ఉంటే సృష్టి ఏర్పడదు. సరూప విరూప పరిణామాలు కర్మ వల్ల అనడం కూడా సాధ్యపడదు. ప్రధానం లాగా కర్మ కూడా జడానికి వ్యవస్థను ఏర్పరచే గుణం లేదు. అందువలన బ్రహ్మమే జగజ్జన్మాదులకు స్వాతంత్ర కారణం అవుతుంది.
సూత్రం :- 176
"అన్యత్రాభా వాచ్చ న తృణాదివత్ "
చ - అంతే కాక, తృణాదివత్ - తృణాదులు, అన్యత్ర - ఎద్దులో, అభావాత్ - పాలరూపంలో పరిణమించక పోవడం వలన, న :- ప్రధానం సృష్టి, ప్రళయ రూపాలలో స్వతంత్రంగా పరిణమించదు.
భావం :- తృణాదులుతిన్న ఎద్దులో పాలరూపంలో పరిణమించక పోయినట్లే, ప్రధానం సృష్టి, ప్రళయ రూపాలలో స్వతంత్రంగా పరిణమించదు.
వివరణ :- ఆవులు మేస్తున్న గడ్డి స్వయంగా పాలరూపంలో పరిణమిస్తోంది. అలాగే ప్రళయకాలంలో ప్రధానం కొంతకాలం తరువాత పరిణమించక పోవచ్చుకదా! ఈవాదన సరి అయినది కాదు. అలా అయితే ఆవు తింటున్న గడ్డి ఏ నియమం లేకుండానే క్షీరంగా మారే స్వభావం కలిగిఉన్నట్లయితే, ఎద్దులో కూడా గడ్డి ఆవులోవలె పాలుగా మారవచ్చు కదా! అలా అవడం లేదు. కాబట్టి వేరే కారణాల ప్రసక్తి లేకుండా ప్రధాన నియత సమయంలో ప్రళయరూపంలో పరిణమిస్తుంది అనడం యుక్తం కాదు. ఈ పరిణామనికి బ్రహ్మమే కారణం. గడ్డి క్రమంగా పరిణామం చెంది, పశువులకు ఆహరమై, చివరకు పాలుగా మారుతుంది. ఈ విధంగా ప్రధానానికి స్వాభావిక పరిణామం ఉండదు. గడ్డికి పాలుగా మారటం స్వభావిక లక్షణం కాదు. ఆవులు, గేదెలు తిన్న గడ్డి మాత్రమే పాలుగా మారుతుంది. ఎద్దులు, దున్నలు తిన్న గడ్డి పాలుగా మారదు. అంటే గడ్డి పాలుగా మారడానికి ప్రత్యేకమైన వేరే కారణం ఉంటుంది. అయినా గడ్డి పాలుగా మారటమనేది గడ్డి యొక్క స్వభావం కాదు. ఎందుకంటే ఒకవేళ అలా మారితే ఆవు గేదెలతో పని లేదు. కాబట్టి ప్రధానం యొక్క పరిణామం గడ్డి మొదలైన వాటిలాగా స్వాభావికం అనడానికి వీలు లేదు. గడ్డి, చిగుళ్ళు, నీరు మొదలైన మరొక నిమిత్తం యొక్క ఆపేక్ష ఏమి లేకుండా స్వభావం చేతనే ఏ విధంగా క్షీరాది రూపంలో పరిణామం చెందుతున్నాయో, అట్లే ప్రధానం కూడా మహదాది రూపంలో పరిణామం చెందుతుంది. తృణాదులకు మరొక నిమిత్తం ఏది కనబడటం లేదు కదా! మరొక నిమిత్తం ఏదైనా ఉన్నట్లు మనకు కనబడితే, కావలసినప్పుడల్లా తృణాదులను సoగ్రహించి, క్షీరం సంపాదించవచ్చును. అలా సంపాదించడం లేదు. అందువలన తృణాదుల పరిణామం స్వాభావికమైనది. కొన్నింటిని దైవమే సంపాదించగలుగుతుంది. చాలా క్షీరం కావాలనుకున్నవాళ్లు దేనువుకు అధికంగా పచ్చగడ్డి పెట్టి అధికంగా పాలను పొందగలుగుతారు. అందువల్ల ప్రధానం యొక్క పరిణామం తృణాదుల పరిణామం వలె స్వాభావికం కాదు.
సూత్రం :- 177
" అభ్యుపగమే ప్యర్దా భావాత్ "
అభి ఉపగమే అపి :- పోనీ, కొంతసేపు ఇలా అవుతుందని ఒప్పుకున్నా, అర్ధ అభావాత్ :- ప్రయోజనం లేనందువలన,
భావం :- ప్రధానానికి స్వాభావికమైన ప్రవృత్తి ఉన్నదని అంగీకరించినా కూడా ప్రవృత్తికి ప్రయోజనం లేదు కదా! ప్రధానం సృష్టి, ప్రళయ రూపంలో స్వయంగా పరిణమిస్తుందని అనడం యుక్తం కావడం లేదు.
వివరణ :- ప్రధానానికి స్వాభావికమైన ప్రవృత్తి ఉన్నది అనుకుందాం. ఆ ప్రవృత్తికి తగిన ప్రయోజనం లేదు. అందువలన దోషం కలుగుతుంది. అంటే ప్రధానానికి ఇతర ప్రయోజనం ఏది లేదు అన్నట్లయితే ఈప్రధానమనేది పురుషునికి భోగాన్నిస్తుందని అందుకే ప్రవృత మౌతున్నదని చెప్పడం సాంఖ్యులకు కష్టమే అవుతుంది. సాంఖ్య మతంలో పురుషుడు నిర్మలుడు, ఉదాసీనుడు, అన్ని విశేషాలు ఉన్నవాడు. అటువంటి పురుషునికి ప్రధానం భోగాన్ని ఇవ్వలేదు. అందుచేత ప్రధానం పురుష ప్రయోజనం కోసం కాదు. ప్రధాన ప్రవృత్తికి ప్రయోజనం ఏమిటి? భోగమా? మోక్షమా? రెండునా? అని వివరించి చెప్పవలసిన ఉంటుంది. భోగం ఉన్నట్లయితే ఎట్టి అతిశయాన్ని సమాకుర్చడానికి శక్యం కానీ పురుషునికి ఇలాంటి భోగం సంభవమౌతుంది. నిజంగా వానికి ఎల్లప్పుడూ భోగం ఉంటుంది. అందువలన మోక్షం కుదరదు. ప్రయోజనం భోగం కోసం కాదు. అపవర్గమే ప్రయోజనం అన్నట్లయితే ప్రధానం ప్రవర్తించడానికి పూర్వం కూడా ముక్త పురుషునికి సహజంగానే ఉంది. దాని కోసం ప్రధానం ప్రవర్తించవలసిన అవరం లేదు. లోకంలో జనులు ఔత్సుకం తీర్చుకోవడం కోసం కొన్ని పనులలో ఏ విధంగా ప్రవర్తిస్తారో, అదే విధంగా ప్రధానం తన ఔత్సుకాన్ని తీర్చుకోవడం కోసం పురుషునికి మోక్షం ఇవ్వడానికి ప్రవర్తిస్తుంది అని సాంఖ్యులు అంటారు. ఔత్సుకం అనగా ఏదో ఒక పని చెయ్యాలనే తహ తహ, ఒక విధమైన కోరిక, దానిని ఖండిస్తున్నారు. ఔత్సుకాన్ని నివర్తింపజేయడం కోసం ప్రధానం ప్రవర్తిస్తుంది. అని చెప్పడం యుక్తం కాదు. అచేతనమైన ప్రధానానికి ఔత్సుకం కుదరదు కదా! నిర్మలుడు, నిష్కలుడు అయిన పురుషునికి కూడా ఔత్సుకం కుదరదు. అందుచేత ప్రధానం యొక్క ఔత్సుకం నివర్తించుకోవడం కోసం కాదు, పురుషుని ఔత్సుకం నివర్తింపజేయడం కోసం అని కూడా చెప్పడానికి వీలు కాదని అర్ధం. పురుషునిలో తెలుసుకునే శక్తి ఉంది. ప్రధానంలో సృష్టించే శక్తి ఉంది. ఈ రెండు శక్తులు వ్యర్థం కాకుండా ఉండాలంటే సృష్టి జరగాలి. సృష్టి లేకపోతే పురుషుడు దేనిని చూస్తాడు. చూసే వాడు లేకపోతే సృష్టి చేసి ఏమి లాభం. అందుచేత ప్రధానం సృజస్తోంది అనే సాంఖ్య వాదానికి సమాధానం చెబుతున్నాడు. దృశ్యక్తి (తెలుసుకునే శక్తి) సర్గశక్తి (సృష్టించే శక్తి) వ్యర్ధమైపోతాయనే భయంచేత ప్రవృత్తిని అంగీకరించే పక్షంలో పురుషుని దృశక్తి ఏ విధంగా నిత్యమో అదే విధంగా ప్రధానం యొక్క సర్గశక్తి కూడా నిత్యమే. కనుక సంసారం అనంతంగా కొనసాగుతూనే ఉంటుంది. అప్పుడు మోక్షమే లేకుండా పోతుంది. అందుచేత ప్రధానం యొక్క ప్రవృత్తి పురుషుని కోసం జరుగుతుందనటం యుక్తం కాదు. లోకంలో అందరూ తమ ప్రయోజనం కోసం కాని, పరుల కోసం కాని, ఒక వస్తువును తయారుచేయడం కాని, ధ్వంసం చేయడం కాని చేస్తారు. ఇలా ప్రయోజనాన్ని మనస్సులో ఉంచుకొని చేయడం చేతన లక్షణం. జడమైన ప్రధానానికి ప్రయోజనం అంటే ఏమిటో తెలియనప్పుడు ప్రయోజనం ఉన్నా సృష్టి, ప్రళయాలకు ప్రధానం స్వతంత్ర కారణం ఎలా అవుతుంది.
సూత్రం :- 178
"పురుషా శ్మ వదితి చేత్ తధాపి "
పురుష అశ్మవత్ :- ప్రయోజనం సాధించడానికి అయస్కాంతం స్వయంగానే లోహ వస్తువులను ఆకర్షిస్తుంది కదా! అలాగే ప్రధానం సృష్టి, ప్రళయాలను చేయగలదు. ఇతి చేత్ :- అని అంటారా? తధా అపి :- ఆ రకంగా కూడా ప్రధానం సృష్టి, ప్రళయాలను చేయలేదు.
భావం:-ప్రయోజనం సాధించడానికి అయస్కాంతం స్వయంగా లోహవస్తువులను ఆకర్శించినట్లు ప్రధానం సృష్టి, ప్రళయలను చేయలేదు.
వివరణ :- కాలిలో ముల్లు గుచ్చుకుంటే దానిని తీయడానికి సూదిని ఉపయోగిస్తారు. అది దూరంగా ఉంటే అయస్కాంతాన్ని ప్రయోగిస్తాము. ఇక్కడ కాలిలో ముల్లు దిగిన ప్రయోజనం కోసం అయస్కాంతం వేరే సాధనాన్ని కోరకుండా దూరంగా ఉన్న సూదిని ఆకర్షిస్తుంది. అలాగే ప్రధానం కూడా ఇతర కారణాలను ఆపేక్షించకుండా జీవుల భోగ, అపవర్గ ప్రయోజనాల కోసం సృష్టి, ప్రళయ రూపాల్లో పరిణమించవచ్చు కదా! అలా అనడం సరిఅయినది కాదు. అయస్కాంతంలో ఆకర్షణ శక్తి ఎప్పుడు ఒక్కలాగానే ఉంటుంది. ఒకసారి ఉండటం, ఒకసారి పోవడం ఉండదు. ప్రధానం వలన కూడా సృష్టి పరిణామంలో మార్పు ఉండకూడదు. ప్రళయం రాకూడదు. లేదా సృష్టి అయినా జరగకూడదు. రెండు శక్తులు ఒకే సమయంలో ఉండకూడదు. అందువలన ప్రధానం (ప్రకృతి) స్వతంత్రంగా పురుష ప్రయోజనం నిమిత్తం జగజ్జన్మాదులకు కారణం అని చెప్పడం పొసగదు. గురువుగారు! ప్రధానం పురుష ప్రయోజనం కోసం కాదు అన్నారు కదా! పురుషుడే ప్రధానాన్ని ప్రవృతం చేయవచ్చు కదా! గ్రుడ్డివాడు దేనిని చూడలేడు. ఒంటరిగా ఎక్కడికి పోలేడు. అలాగే కుంటివాడు చక చకా నడచి పోలేడు. ఇప్పుడు కళ్లున్న కుంటివాడు, కాళ్ళు ఉన్న గుడ్డి వాడి భుజాలపై కూర్చుని వెడుతున్నాడు కదా! అయస్కాంతం తాను కదలకుండా ఇనుప ముక్కలను ఆకర్షస్తోంది కదా! అదే విధంగా పురుషుడు ప్రధానాన్ని ప్రవృతం చేయవచ్చు కదా! అని అడిగాడు కృష్ణ శర్మ. ఆ మాటలు విన్న రత్నాకరుడు, నువ్వు చెప్పినది నిజమే, కుంటివాడి సాయంతో నడిపించబడే గుడ్డివాడు ఆస్వతంత్రుడు. అలాగే ఇనుప ముక్క కి కూడా స్వతంత్రం లేదు. ఇక్కడ మూడు దోషాలున్నాయి.
1. పురుషుని ప్రేరణ వలన ప్రవృత మయ్యే ప్రధానం అస్వతంత్రమౌతోంది.
2. అంతే కాకుండా ఉదాసీనుడు, వివేకరహితుడు అయిన పురుషుడు ప్రేరకుడు కావడం 2వ దోషం. కుంటివాడు, గుడ్డివాడు, ఇనుపముక్క అయస్కాంతాల సాన్నిద్యం నిత్యం కాదు.
3. కానీ ప్రధానం పురుషుల సాన్నిద్యం నిత్యం.
ఎప్పుడు ఆ ప్రవృత్తి ఉంటూనే ఉంటుంది. కనుక ప్రధానం ప్రవృతమవుతోందనడం దోషం. అవిద్య అయిన ప్రధానాన్ని చేతన మైన పురుషుని కలిపే తత్వం ఇంకొకటి లేదు.
సూత్రం :- 179
"అంగిత్వానుపపత్తేశ్చ "
చ - ఇంతే కాక, అంగిత్వ అనుపపత్తేశ్చ :- స్వామిత్వం సిద్ధించక పోవడం వలన.
భావం :- స్వామిత్వం సిద్ధించక పోవడం వలన ప్రధానం స్వయంగా సృష్టి, ప్రళయాలలో పరిణమిస్తుందనడం సరిఅయినది కాదు.
వివరణ :- ప్రధానం పరిణామశక్తికి స్వామి కాదు. స్వామిత్వం జ్ఞానిలోనే ఉంటుంది. అజ్ఞాని స్వామి కాలేడు. ప్రధానంలో జ్ఞానం, స్వామిత్వం లేవు. కాలవిజ్ఞానం లేని ప్రకృతి సృష్టి, ప్రళయల వ్యవస్థ ఎలా చేస్తుంది. నియతసమయంలో సృష్టి, ప్రళయాలు జరగడానికి సమయజ్నుడైన వ్యవస్థాపకుడు కావాలి. అందువల్ల ప్రధానం నిరపేక్షంగా సృష్టి ప్రళయాలలో పరిణమిస్తుందనడం హేతుబద్ధం కాదు. అంతే కాకుండా గుణాలకు సంబంధించిన అంగాంగి భావం కూడా కుదరదు. సత్వ రజస్థమోగుణాలు మూడు సామ్యావస్థను పొందిన స్థితినే ప్రధానం అంటారు. కాబట్టి మూడింటిలో ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ కాదు. సామ్యావస్థలో ప్రధానానికి ప్రవృత్తి ఉండదు. ప్రవృత్తి కలగాలంటే సామ్యావస్థలో వికారం, కదలిక కలగాలి. ఆ రకమైన కదలిక కలిగించే పదార్ధామేది లేదు. కాబట్టి ప్రధానానికి జగదుత్పాదక శక్తి లేదు. ప్రళయకాలంలో మూడు గుణాలు ఒకదాని ఆపేక్ష మరొక దానికి లేకుండా తమ తమ రూపాలలో ఉంటాయి. అదే ప్రధానావస్థ. ప్రళయానంతరం సృష్టి ప్రారంభం కావాలంటే ఈ గుణాలలో వైషమ్యం రావాలి. అలా వస్తే అంతవరకు ఉన్న వాటి స్వరూపమే మారిపోతుంది. అందుచేత అవి అలాంటి అంగాంగీ భావాన్ని పొందవు. అప్పుడు సృష్టి ఉండదు. అందుకే ప్రధానికి జగదుత్పాదక శక్తి ఉండదు.
సూత్రం :- 180
"అన్యధా సుమితౌ చ జ్ఞ శక్తి వియోగాత్ "
చ :- అలాగే, అన్యధా అనుమితౌ :- కాలాన్ని వ్యవస్థాపకుడిగా ఉహించినా, జ్ఞ శక్తి వినియోగాత్ :- దానికి జ్ఞాతృత్వ శక్తి లేదు.
భావం :- కాలాన్ని వ్యవస్థాపకుడిగా ఉహించినా దానికి జ్ఞాన శక్తి లేదు. అందువల్ల నిరపేక్షంగా ప్రధానం సృష్టి ప్రళయ రూపంలో పరిణమిస్తుందనడం అసమంజసం.
వివరణ:- ఈలోకంలో వివిధ ఋతువులలో నియమంగా చెట్లు అన్ని చిగురించి పూలు, పళ్ళు ఇస్తున్నాయి. మరల నియత కాలంలో నశించడం కూడా జరుగుతుంది. అదే విధంగా ప్రధానం సమయానికి తగ్గట్టు సృష్టి, ప్రళయాలను పరిణమించవచ్చు కదా! దీనికి తగిన వ్యవస్థ కాలంవల్లే జరుగుతుంది. బ్రహ్మాన్నే ఎందుకు వ్యవస్థాపకుడిగా ఎందుకు ఎన్నుకోవాలి? అని వాదిస్తారు. ఈ వాదన తప్పు. కాలం జడమైనది. జ్ఞానశూన్యం. జ్ఞానం లేకుండా వ్యవస్థ లేదు. పరమేశ్వరాధీనమై ఆయా ఋతువులలో చెట్లు, లతలు పత్ర పుష్పములతో, పండ్లతో విరాజిల్లుతున్నాయి. దీనికి కాలం స్వతంత్ర కారణం కాదు.
శ్వేతాశ్వరోపనిషత్తు:-(6-16) ఈశ్వరుడు కాలానికి కాలం. సర్వవేత్త. కనుక స్వతంత్రంగా ప్రధానం జగజ్జన్మాదులకు కారణం అనడం యుక్తంకాదు. ప్రధానంలో జ్ఞానశక్తి లేనందువలన జగన్నిర్మాణం జరగదు. జ్ఞానశక్తి లేని ప్రధానం జగత్తును నిర్మించలేదు. ఒకవేళ సాంఖ్యులు కనుక ప్రధానానికి జ్ఞానశక్తి ఉన్నదని ఒప్పుకుంటే చేతనమైన పదార్ధమే జగదుత్పత్తికి ఉపాదానకారణమౌతుంది. అంటే బ్రహ్మమే జగన్నిర్మాణానికి కారణమని ఒప్పుకున్నట్లు అవుతుంది. అంతే కాకుండా సామ్యావస్థలో కూడా నిమిత్తం లేకుండానే త్రిగుణములు మార్పు చెండుతాయి. అవి ఎప్పుడు మార్పు చెందుతూ ఉంటే జగత్తు నిత్యమౌతుంది. మోక్షమనేది ఉండదు. గుణాల స్వభావం చంచలమైనదని అంగీకారం కూడా ఉంది. అందువల్ల సామ్యావస్థలో గుణాలు వైషమ్యం పొందడానికి యోగ్యంగా ఉంటాయి అని చెప్పిన కూడా ప్రధానానికి జ్ఞానశక్తి లేదు కనుక రచనానుపపత్తి మొదలైన దోషాలు అలాగే ఉంటాయి.
సూత్రం :- 181
“ విప్రతి షేధా చ్చాసమంజసం "
చ :- అంతే కాక, విప్రతి షేదాత్ :- శ్రుతుల్లో నిషేధించినందు వలన, అసమంజసం :- ప్రధానం స్వతంత్ర కారణమవడం అసమంజసం. శ్రుతి, స్మృతులలో నాస్తిక్యాన్ని నిషేదించారు.
భావం :- ప్రధానం స్వతంత్ర కారణమవడం అసమంజసం. దీనినే శ్రుతి, స్మృతులలో నిషేదించారు. జగన్నిర్మాత పరబ్రహ్మం కాదన్నారు. అందువలన ప్రకృతి స్వతంత్రంగా జగజ్జన్మాదులకు కారణమవడం అసమంజసం.
వివరణ:- సాంఖ్యమతంలో పరస్పర విభేదాలున్నాయి. ఈశ్వరుడు జగత్కారణమే అన్న మాట సాంఖ్యమతం ఒప్పుకోదు. వీరు మహాత్తు నుంచి తన్మాత్రలు వచ్చాయని ఒకసారి, అహంకారంనుంచి తన్మాత్రలు వచ్చాయని ఒకసారి చెప్పారు. అలాగే కర్మేంద్రియాలు 7 (చర్మం, మనస్సు కలిపి) అంటారు. ఇంకొక చోట ఐదే అంటారు. ఒకసారి ఇంద్రియలు మొత్తం 11అంటారు. అంతఃకరణ అంటే మనస్సు బుద్ధి, అహంకారం అంటారు. ఇంకో చోట బుద్ధి ఒక్కటే అంటారు. ఈ రకంగా వారి వాదనలో పొంతన అనేది లేదు. కాబట్టి సాంఖ్యులు చెప్పే ప్రధానం జగత్కారణం కాదు. ఇక్కడ సాంఖ్యులు ఇలా అంటున్నారు. తప్యుడు (పీడింపబడే జీవుడు), తాపకం (పీడించే సంసారం), రెండు వేరువేరు జాతికి చెందినవని అంగీకరించరు. తప్య, తాపకాలు ఒక్కటే యైన ఆత్మ విశేషాలైతే, ఆ ఆత్మ వాటి నుండి విడుదల పొందజాలదు. అ తాపం శాంతించడం కోసం శాస్త్రం చెప్పిన ఉపదేశం వ్యర్థమౌతుంది. దీపానికి ఉష్ణత్వం, ప్రకాశం అనే ధర్మాలు ఉన్నాయి. దీపం ఆ రెండిoటి నుంచి విముక్తం కాదు కదా! సముద్రానికి సంబంధించిన జలం, దాని తరంగాలు, అలలు, నురుగు, బుడగలు మొదలైన విశేషాలు కనబడుతున్నప్పుడు, అవి నిత్యాలే కనుక సముద్రానికి వాటి నుండి విడుదల ఉండదు. అక్కడ ఆ రెండు ఒక్కటే. అదే విధంగా తప్యానికి, తాపానికి జాత్యంతర భావం ఉండదని సాంఖ్యుల అభిప్రాయం. అదేట్లనగా, ఆర్ధి (ఒక వస్తువు కావాలని కోరుకునే వాడు), అర్ధం(కోరబడే వస్తువు) పరస్పర భిన్నములుగా కనబడుతున్నాయి. స్వతహాగ అర్ధం(వస్తువు) ఆర్ధి (కోరుకునే మనిషి)కంటే భిన్నం కాకపోతే, ఏవస్తువును కోరుకుంటే అది వానికి నిత్యమే అవుతుంది. అవి రెండు ఒక్కటే అయితే ఆర్ధి దానిని గురించి కోరడం ఉండదు. రెండిటికి భేదం ఉంటేనే కొరతాడు. కోరేవాడు, కోరబడేది అని భేదం ఉంటేనే కోరేవాడు ఆర్ధిఅనీ కోరబడేది అర్ధంఅనీ చెప్పడానికి వీలవుతుంది. ఈరెండు ఒక్కటే అయితే అర్ధం తనని తాను కోరుకుంటోంది అని చెప్పవలసిన వస్తోంది. అది లోక విరుద్దాం కదా! అర్ధం, ఆర్ధి రెండు సంబంధం ఉన్న శబ్దాలు. రెండు వేరైనవే. ఒకే పురుషుడు రెండిoటిలో పర్యాయం చేత సంబంధం కలిగి ఉంటాడు. అతడినే తవ్యుడు అంటారు. వీటిలో అర్ధం చాలా అల్పంగా ఉంటుంది. దాని వలన వచ్చే అనర్ధాలు అధికంగా ఉంటాయి. అందుచేత రెండు కూడా అనర్ధంగానే పరిగణిం పబడతాయి. కాబట్టి అది తాపకం అని చెప్పబడుతుంది. ఈ తప్యతాపకాలు రెండు ఒక్కటే అయితే మోక్షం రాదు. అవి భిన్నమైనవైతేనే దుఃఖానికి కారణమైన హేతువును తొలగిస్తే మోక్షానికి అవకాశం వస్తుంది. ఆఅవివేకాన్ని తొలగిస్తే పురుషుడు నిత్యముక్తుడౌతాడు. మోక్షం వస్తుంది. నిజానికి బంధ మోక్షాలు పురుషుని కంటే అత్యంత భిన్నమైన బుద్ధికి సంబంధించినవే. వాటిని తనమీద ఆరోపించుకుంటాడు. తప్యమైన బుద్ధితో సంయోగానికి హేతువైన అవివేకం తొలగిపోతే ఆ పురుషుడు మోక్షం పొందవచ్చునెమో కానీ తప్యతాపకాలకు అభేదాన్ని అంగీకరిస్తే సాంఖ్య మతంలో మోక్షం కుదరదు.
మహద్దీర్ఘాధికరణం :- ( 2, 2, 11 )
సూత్రం :- 182
"మహద్దీర్ఘ వత్ వా హ్రస్వ పరిమండలాభ్యామ్"
హ్రస్వ పరి మండలాభ్యం :-ధ్వ్యణుకు వల్ల పరమాణువుల వల్ల, మహత్ దీర్ఘవత్ వా :- స్వతంత్రంగా త్య్రణుకం ద్వ్యణుకం ఎలా ఉత్పన్నం కావో, అలాగే స్వతంత్రంగా ప్రధానం వల్ల జగత్తు ఉత్పన్నం కానేరదు.
భావం:-ద్వ్యణుకం పరమాణువుల వల్ల స్వతంత్రంగా త్య్రణుకం ద్వ్యణుకం ఎలా ఉత్పన్నం కావో, అలాగే స్వతంత్రముగా ప్రధానం వల్ల జగత్తు ఉత్పన్నం కానేరదు.
వివరణ:-ప్రకృతి స్వతంత్రంగా జగజ్జన్మాదులకు కారణం అని కొందరు ఎలా చెబుతారో, అలాగే పరమాణువులు సైతం స్వతంత్రంగా జగత్కారణం అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈరెండు పక్షాల సిద్ధాంతలలో తేడా ఏమి లేదు. వాళ్ళు చెప్పే జగత్ నిర్మాణంలో కొంత భేదం ఉంది. ఇప్పటివరకు సాంఖ్యమతాన్ని చెప్పి ఇప్పుడు వైశేషికమతాన్ని ఖండిస్తున్నారు. వైశేషిక మతాన్ననుసరించి కారణం పదార్ధాలకుండే గుణాలలోనే కార్యలు పుడతాయి. అంతే కానీ వేరే గుణాలు కలవి పుట్టవు. ఎర్ర రంగు నూలుతో తయారైనా వస్త్రం ఎర్రగానే ఉంటుంది. కానీ తెల్లగా ఉండదు. ఈ సిద్ధాంతం ప్రకారం చేతనమైన బ్రహ్మం నుంచి పుట్టిన జగత్తు అచేతనం కావడానికి వీలు లేదు. అది కూడా చేతనమే కావాలి. కానీ అలా కాలేదు. దానికి జగదుత్పత్తికి కారణం బ్రహ్మ కాదు అని వైశేషికుల వాదన. దీనిని ఖండిస్తున్నారు. వీరు స్వతంత్ర పరమాణువులు జగత్కారణం అంటారు. ఇది కేవలం పరమాణువాదం. పరమాణువులు నిరవయవాలు. రెండు పరమాణువులు కలిస్తే ద్వ్యణుకం అవుతాయి. ద్వ్యణుకం సంయోగం చెందితే త్య్రణుకములౌతాయి. అలాగే చతురణుకం, పంచాణుకం, క్రమంగా స్తూల జగత్తు. ఈ రకంగా అణువుల నుండి కొండలు, నదులు, పర్వతాలు మొదలైన సృష్టి ఏర్పడింది. ప్రళయసమయంలో పరమాణువులు విడివిడిగా నభోమండలంలో ఉంటాయి. సృష్టి సమయంలో సంయుక్తంగా చేరి ద్వ్యణుకాది క్రమంలో స్థూలజగత్తును సృష్టిస్తాయి. జీవులు వ్యాపకులు. శరీరంలో మాత్రం జీవులు మనసుతో కూడి పదార్ధాలకు చైతన్యం కలిగిస్తారు. మిధ్యా జ్ఞానం వలన జీవులకు మనసుతో సంబంధం ఏర్పడుతుంది. ఈ మిధ్యా జ్ఞానం ఉన్నంతవరకు తాము చేసే కర్మలకు అనుగుణంగా సుఖదుఃఖములనుభవిస్తుంటారు. తత్వజ్ఞానం కలిగిన తరువాత, మిధ్యాజ్ఞానం తొలగిపోయి జీవులు ముక్తి పొందుతారు. తత్వజ్ఞానాన్ని ప్రయత్నంతో సాధించవచ్చును. దీనికి ఇతర సహకారం అవసరం లేదు. ఇక్కడ ఈశ్వరప్రసక్తి లేదు. పరమాణువులే జగత్తుకు స్వతంత్రకారణం. ఈప్రక్రియ శ్రుతి సమ్మతం కాదు. ఎందుకంటే పరమణువులు జడాలు. స్వయంగా సంయుక్తం కాలేవు. వీటిని కలపడానికి విడదీయడానికి ఒక చేతన శక్తి కావాలి. అది పరబ్రహ్మం నుంచే వస్తుంది.
పరమాణు జగదకారణత్వాధికరణం ( 2, 2, 12)
సూత్రం :- 183
"ఉభయ దాపి కర్మాతస్తదభావః"
ఉభయధా అపి:- రెండు విధాల, కర్మ:- పరస్పరం పరమాణువులను సంయుక్తం చేసే కర్మ, న :- సిద్ధించడం లేదా? అతః :- అందువల్ల, తత్ అభావః :- స్వతంత్రంగా ధ్వ్యణుకాదుల ఉత్పత్తి కలగజాలదు.
భావం :- రెండు విధాలుగా పరస్పరం పరమాణువులను సంయుక్తం చేసే కర్మ సిద్ధించనందున జగదుత్పత్తి కలగదు.
వివరణ :- పరమాణువులు ఒకదానితో మరొకటి కలిసి ద్వ్యణుకం మొదలైనవి ఏర్పడతాయంటారు. సంయోగం అంటే కార్యం. ఉత్పన్నం అయ్యేది. దాన్ని ఉత్పన్నం చేసేది కర్మ. ఆసంయోగం కలుగజేసే కర్మకు ప్రయత్నం కావాలి. ఈ ప్రయత్నమే చేతనధర్మం. పరమాణువులకు అధిష్టానంగా ఒక చేతనధర్మం ఉంటుందని స్వతంత్ర పరమాణువాదులు ఒప్పుకోరు. అణువుల కలయిక వల్లే ఈసృష్టి జరుగుతోందని, ఇక్కడ కర్మ ఏది లేదని వారి వాదన. దారపుపోగులు వాటంతట అవి వస్త్రంగా తయారు కావు. వాటిని కలిపి వస్త్రంగా చెయ్యడానికి ఒకరు దానికి కర్మ అంటే పని చెయ్యాలి. అప్పుడే వస్త్రం తయారవుతుంది. కానీ వైషషికులు ఈకర్మ అవసరం లేదని వాదిస్తారు. వైశేషికులమతంలో మొత్తం తొమ్మిది ద్రవ్యాలుంటాయి.వీటిలో పృథవి, జలము, అగ్ని, వాయువు, అనే నాలుగు నిత్యములు, ఆకాశం, కాలం, దిక్కు, ఆత్మ, మనస్సు అనే 5 అనిత్యాలు. పరమాణువులు ఒకదానితో ఒకటి కలియడం వలన ఘటపటాది(వస్త్రాలు) రూపాల్లో సృష్టి జరుగుతుంది. ఇక ప్రళయం ఏవిధంగా జరుగుతుందంటే, కొన్ని అణువులు కలసి ఒక వస్తువు ఏర్పడింది. మళ్ళీ ఆ అణువులు విడిపోయి ఆ వస్తువు ఉండదు. ఈ విధంగా అణువులు విడిపోవడమే ప్రళయం. చేతనాలు జీవులని అంగీకరిస్తే జీవులకు ప్రళయంలో శరీరసంబంధం, మనోసంబంధం ఉండదు. అప్పుడు జీవుల్లో ఉండే ప్రయత్నం పరమాణువుల్లో కర్మను జనింపలేదు. ప్రళయంలో సృష్టి ఉత్పత్తికి పూర్వం పరమాణువుల్ని సంయుక్తం చెయ్యడానికి కావలసిన కర్మ పరామణువుల్లో స్వంతంగా ఏర్పడదు. అలాంటి కర్మసంబంధం కానప్పుడు ద్వ్యణుకాది క్రమంలో జగత్తు ఉత్పత్తి కాదు. ఎందుకంటే పరమాణువులకు చేతన ధర్మం లేదు. ఈధర్మం కేవలం ఈశ్వరునికే ఉంది. కనుక స్వతంత్ర పరమణువాదం హేతుబద్ధం కాదు అని తెలుస్తోంది. అయితే వారు చెప్పే క్రమాన్ని పరిశీలిస్తే అణువులు పర్వతంగానో, కొండగానో, తయారవ డానికి ఏ అవసరం లేదు. కానీ మట్టి కుండగా తయారవడానికి కర్మ అవసరం అవుతుంది. కానీ వారి వాదనలో కర్మ అనేది లేదు. అందుచేత వైశేషికుల వాదం సరి అయినది కాదు.
సూత్రం :- 184
"సమవాయాభ్యుపగమాచ్చ సామ్యాత్ అనవస్థితే "
సమవాయ అభి ఉపగమాత్:- అదృష్టానికి, జీవులకు సమవాయ సంబంధం ఉన్నది. చ :- అంతే కాక, సామ్యాత్ :- అదృష్టంతో సంబంధం ఉన్న జీవులతో సంబంధం పరామాణువులకు సృష్టి, ప్రళయాల్లో సమానంగా ఉంటుంది. అనవస్థి తే :- అనవస్థ కలుగుతుంది.
భావం :- అదృష్టానికి, జీవులకు సమవాయ సంబంధం ఉంది. అదృష్టంతో ఉన్న జీవులతో సంబంధం పరమాణువులకు సృష్టి ప్రళయాల్లో సమానంగా ఉంటుంది.
వివరణ :- జీవులు అదృష్టాన్ని ఒప్పుకుంటారు. ఇక్కడ అదృష్టం అంటే fate కాదు. యాద్రుచ్చికం (accidental). అదృష్టమే లేకపోతే సృష్టి వైచిత్య్రం ఉండదు. అదృష్టం జీవాత్మకు సంబంధించినది కనుక జీవులే పరమాణువులలో కర్మను ఉత్పన్నం చెయ్యాలి. పరమాణువులు కర్మను స్వతంత్రంగా చెయ్యలేవు. కనుక అదృష్టం కర్మజనకం కాదు. కార్యమునకు కారణము నకు సంబంధం ఉంది. తంతువులు అంటే నూలు దారాలు కారణం, వాటిని వస్త్రంగా నేయడం కార్యము. కారణం నుంచి కార్యం పుడుతుంది. సృష్టి అంటే సంయోగం మాత్రమే కాదు వియోగం కూడా, ఎప్పుడు సృష్టి జరగదు కదా! ప్రళయం కూడా వస్తుంది. అది పరమాణుసంయోగం వల్ల రాదు. దీని వలన స్వతంత్రపరమాణువాదం అసమజసం. పరమాణువులకు కొన్ని దోషాలున్నాయి. అవి రెండు కలిసినప్పుడు పరమాణువుల లక్షణాలు వదలి వేరే లక్షణాలు సంతరించు కుంటున్నాయి. దీని వలన అనవస్థదోషం కలుగుతుంది. అందువలన వీరి వాదన సరిఅయినది కాదు. సమవాయాన్ని అంగీకరించడం వలన కూడా అణుకారణవాదం కుదరదు అని అర్ధం. సమవాయం:-వస్తువు గుణాల మధ్య ఉండే అవినాభావ సంబంధమే సమవాయం. ఒక వస్తువు, దాని గుణాలు వేరు కావు. వస్తువు లేకుండా గుణాలు ఉండవు. గుణాలు లేకుండా వస్తువు ఉండదు. అలాగే అవయవి-అవయవాలు, చలనం-చలించే వస్తువు, కారణం-కార్యం, ఒకదానితో ఒకటి విడదీయ రానిదిగా ఉండటమే సమవాయం. ఒక వస్తువును అంతకంతకు చిన్న భాగాలుగా చేస్తూ పోతే చివరకు విభజన సాధ్యం కాని స్థితి వస్తుంది. ఆ స్థితిలో మిగిలే సూక్ష్మతి సూక్ష్మ వస్తువే అణువు. అది నిరవయవి. అంటే దానిలో భాగాలూ ఉండవు. కిటికీ సందులో నుండి గదిలోకి వచ్చే సూర్యరశ్మిలో సూక్ష్మమైన నలకలు తేలుతూ చలిస్తూ ఉంటాయి. వాటిని త్రసరేణువు అంటారు. ప్రతి త్రసరేణువు త్ర్యణుకం. అంటే అది మూడు ద్వ్యణుకాలతో ఏర్పడుతుంది. అణువు కంటే సూక్ష్మ వస్తువు లేదు. అణువుల సంయోగం వలన ప్రపంచం ఏర్పడింది. అవి శాశ్వతమైనవి. సంయోగం :- ఒక వస్తువు మరొక వస్తువుతో కలిసి ఉంటుంది. అంటే దానికి, దీనికి ఏదో సంబంధం ఉందని అర్ధం. కారణమైన పటం కార్యమైన తంతువులలో ఉంటుంది. వాటి సంబంధం విడదీయరానిది. ఈ తంతువులకు, వస్త్రానికి మధ్య సమవాయ సంబంధం ఉంది. సంయోగం గుణం కాబట్టి మరొక సంబంధాన్ని ఆపేక్షిస్తుంది. సమవాయం గుణం కాదు. దానికి మరొక సంబంధం యొక్క ఆపేక్ష లేదు. అని చెప్పడం యుక్తం కాదు. సృష్టి అంటే సంయోగం మాత్రమే కాదు. వియోగం కూడా. ఎప్పడూ సృష్టి జరుగుతూనే ఉండదు కదా , ప్రళయం కూడా వస్తుంది. అది పరమాణు సంయోగం వలన కాదు. దీని వలన స్వతంత్ర పరమాణువాదం అసమంజసం.
సూత్రం :- 185
" నిత్యమేవ చ భావాత్ "
చ:- అంతేకాని, నిత్యం ఏవ భావాత్ :- పరమాణువుల్లో కర్మ స్వాభావికం అనుకుంటే, ఎప్పుడు కర్మ ఉత్పన్నం అవుతూనే ఉంటుంది.
భావం :-పరమాణువుల్లో కర్మ స్వాభావికం అనుకుంటే, ఎప్పుడూ కర్మ ఉత్పన్నం అవుతూనే ఉంటుంది. కర్మ జన్య సంయోగం వల్ల ద్వ్యణుకాది సృష్టి సదా ఏర్పడుతూనే ఉంటుంది. ప్రళయవ్యవస్థ సంభవం కాదు.
వివరణ :- ఒకవేళ పరమాణువులకు కర్మ స్వభావం ఉంటే? దాని వల్ల పరమాణువులలో సంయోగం కలుగుతుంది కదా! ద్వ్యణుకాది సృష్టి ఉత్పన్నం సంభవం అని అనుకుంటే అది కూడా సిద్ధించడని అంటున్నారు. కర్మ నిత్యమా? పరమాణువు నిత్యమా? అనేది సందేహం. కర్మ 5 విధాలుగా ఉంటుంది. కర్మ అంటే ఇక్కడ చలనము అని అర్ధం. అవి 1.ఉత్ క్షేపణం (పైకి పోవడం) 2. అవ క్షేపణం(కిందికి పోవడం) 3. ఆకుంచనం(ముడుచుకొనడం) 4. ప్రసారణం(వ్యాకోచించడం) 5. గమనం ( వెళ్లడం). పరామణువులు నిత్యం, వాటికీ కర్మ సహజం అనుకుంటే కర్మ కూడా నిత్యం అవుతుంది. స్వభావం ఎన్నటికీ నిత్యం కాదు. పరమాణువాదంలో స్వభావం రెండు రకాలు.1. ప్రవృత్తి స్వభావం :- అంటే ఈ స్వభావంలో మార్పు ఉండదు. కాబట్టి సృష్టి ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. 2. నివృత్తి స్వభావం :- అంటే అణువులు నాశనమైపోతోంటాయి. అందుకే సృష్టి జరగదు. ఈ విధంగా చూస్తే సృష్టి గాని, ప్రళయం గాని ఈ రెండిటిలో ఏదో ఒకటి మాత్రమే జరుగుతుంది. కర్మ నిత్యమైతే సృష్టి, ప్రళయ వ్యవస్థలు కలగవు. సృష్టికి, ప్రళయానికి రెండింటికి కర్మ కారణం కావడం వలన ఒక కర్మతో ద్వ్యణుకం ఏర్పడిన వెంటనే వాటి వియోగం కలుగుతుంది. ఇలా సంయోగ ,వియోగాలు కర్మ జన్యాలై వెంట వెంటనే కలుగుతుంటే సృష్టి కాని, ప్రళయం కాని ఏర్పడదు. కర్మ నిత్యమైతే అప్పుడు పరామణువులు సంయుక్తం అవుతూనే ఉంటాయి. ప్రళయం కలగదు. పైగా సృష్టి ప్రళయలకు తగిన కర్మని నియమించే వారు ఎవరు? కనుక ఈ వాదం సరి అయినది కాదు.ఉభయ స్వభావత్వం సమంజసం కాదు. పరమాణువులు నిత్యమైతే కర్మ కూడా నిత్యమే అవుతుంది. పరమాణువులు జడం కనుక వాటికి చేతన ధర్మం కలిగించేది ఈశ్వరుడేనని వైశేషికులు ఒప్పుకోరు. వారి వాదం సమంజసం కాదు.
సూత్రం :- 186
"రూపాది మత్త్వాచ్చ విపర్యయో దర్శనాత్ "
చ :- అంతే కాక, దర్శనాత్ :- లోక దర్శనాన్ని బట్టి, రూపాది మత్త్వాత్ :- పరమాణువులకు రూపరసాది గుణాలుండటం వలన, విపర్యయం :- అనిత్యాలు కావలసి వస్తుంది.
భావం :- లోక దర్శనాన్ని బట్టి పరామణువులకు రూపరసాది గుణాలుండటం వలన అనిత్యాలు కావలసి వస్తోంది.
వివరణ:-వైశేషికులు పరమాణువులకు రూపం మొదలైనవి ఉన్నాయంటారు. కాని నిజస్థితిలో వీరి వాదనలో తేడా కనిపిస్తుంది. పృథవి, జలం, అగ్ని, వాయువు వీటికి సంబంధించిన అణువులు నిత్యములు, నిరవయవములు, కుండ వస్త్రములలో కూడా ఈ లక్షణాలు ఉన్నాయంటారు. కాని లోకంలో నూలుపోగులతో తయారైనా వస్త్రం, ఆ పోగుల కన్నా స్థూలంగా ఉంటుంది. అలాగే మట్టితో తయారైన కుండ కూడా. ఇవి నిత్యము, నిరవయవము, అని చెప్పేది స్థూలము. కాబట్టి వీరి వాదన సరిఅయినది కాదు. 1.వాయువులో-స్పర్శ, 2. అగ్నిలో స్పర్శ, రూపము, 3. జలములో స్పర్శ, రూపం, రసం, 4.భూమిలో స్పర్శ, రూపం, రసం, గంధం ఉన్నాయి. వాటి వల్లనే ఈ సృష్టి జరుగుతోంది. ఇవి ఒకదానికొకటి స్ధూలమైనవి. వీటి వల్ల జగన్నిర్మాణం జరగదు. లోకంలో వ్యక్త పదార్ధాలాన్నీ రూపరసాది గుణాలు ఉంటాయి. ఈ గుణాలు అనిత్యాలు. ఈ వ్యక్తపదార్ధములకు కారణములైన పరమాణువులకు కూడా రూపరసాదులుంటే అవి కూడా అనిత్యాలు కావాలి. కాగా పరామణువులు నిత్యం కదా! అందుచేత స్వతంత్రం పరమాణు కారణవాదం సమంజసం కాదు. అవయవాలు ఉన్న ద్రవ్యాలకు ఏ అవయవానికి ఆ అవయవం విడగొట్టగా, చివరకి విడగొట్టడానికి వీలు కాకుండా ఏది మిగులుతుందో అలాంటి రూపాలున్న పరామణువులు, రూపాదులున్న పంచభూతాలను, పంచభూతాల వల్ల పుట్టే వాటికీ, ఆరంభకాలు వాటిని పుట్టించేవి కూడా నిత్యములని వైశేషికుల అభిప్రాయం. ఇది ఆధారరహితమైనది. ఎందువల్లననగా అణువులకు రూపములు ఉండటం వలన నిత్యత్వానికి విరుద్దం ఏర్పడుతుంది. తంతువుల వలన వస్త్రం ఏ విధంగా స్టూలమో, అనిత్యమో, తంతువులు కూడా స్థూలములుగా, అనిత్యములుగా ఉంటాయో, అట్లే ఏ పరమాణువులు రూపాదులు కలవి కనుక, అవి కూడా స్థూలమైనవి, అనిత్యమైనవి అని చెప్పవలసిన ఉంటుంది. పరమాణువులకు రూపాలుండటం వలన వైశేషికులు అనుకున్న దానికి విరుద్దమైనది ఏర్పడుతుంది. అందువలన పరమాణువాదం ఉపపన్నము. తంతువులు వస్త్రానికి, మట్టి ఘటానికి సమవాయ కారణం వలన కొత్త వస్తువులు పుడతాయి. తంతువులు వేరు, పటం వేరు. మట్టి వేరు, కుండ, మూకుళ్ళు వేరు. కార్యం, కారణం కంటే భిన్నంగా ఉంటుంది. కార్యం కొత్త వస్తువులను పుట్టిస్తుంది. ఈ కార్యం నశించాలంటే దాని అవయవాలు( తంతువులు )విడిపోవడం గాని, అవి నశించడం గాని కారణం. ఈ రెండు తప్ప మూడవ కారణం లేదు. ఇది వైశేషికుల అభిప్రాయం. వాస్తవంలో కార్యం కంటే కారణం భిన్నంకాదు. కార్యం నశించడం అంటే కారణరూపంలోకి మారడమే. పరమాణువులు నశించాలంటే కారణవిభాగమైన ఉండాలి. కారణాలు నాశనమైన జరగాలి. అవి నిత్యములు అని చెప్పడం యుక్తం కాదు. కుండా మట్టిలోనూ, కుండలాలు బంగారం లోను లీనం అయినట్లే, పరమాణువులు పరమ కారణమైన బ్రహ్మలో లీనమై పోతాయి. అందుచేత అవి నిత్యములని అంగీకరించడం యుక్తం కాదు.
సూత్రం :- 187
" ఉభయధా చ దోషాత్ "
చ :- అంతే కాక, ఉభయధా దోషాత్ :- లోక దృష్టిని అంగీకరించినా, ఒప్పుకోక పోయినా స్వతంత్ర పరమాణు వాదం దోషయుక్తం.
భావం :- పంచభూతలైన ప్రధివి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం ఒకదాని కన్నా ఒకటి స్థూల సూక్ష్మాలని తారతమ్యం చెప్పినా, తారతమ్యం లేదని చెప్పినా రెండు విధాలుగా దోషమే ఉన్నది. కాబట్టి పరమాణు వాదం సరి కాదు.
వివరణ :- పృధివ్యాదులు ఒకదాని కన్నా మరొకటి సూక్ష్మం, సూక్ష్మ తరం, సూక్ష్మ తమం, గుణాల్లో హెచ్చుతగ్గుల వలన ఇలాంటి స్థూల ,సూక్ష్మ భేదాలు కలుగుతాయి. పరమా ణువులు సూక్ష్మాలు. అవి తనంతట తాము స్ఠూలాలు కాలేవు. స్వతంత్ర పరిణామం హేతుబద్ధం కాదు. పృధివికి గంధ, రస, రూప, స్పర్శ, గుణాలు ఉన్నందున స్థూల మైనది. జలమునకు రూప, రస, స్పర్శ, గుణముల వలన స్థూలమైనది. భూమి కన్నా సూక్ష్మమైనది. రూప, స్పర్శ గుణాలు ఉన్న తేజస్సు అంటే అగ్ని సూక్ష్మతరమైనది. స్పర్శ గుణం గల వాయువు సూక్ష్మ తమమైనది. ఈ విధంగా హేచ్చుతగ్గులలో ఉన్న గుణాలు గల ఈ నాలుగు భూతాలు తారతమ్యం లో స్థూల, సూక్ష్మ, సూక్ష్మతర ,సూక్ష్మ తమములుగా లోకంలో కనబడుతున్నాయి. వీటిలో తేడాలు ఉండటం వలన వీటికి కారణమైన పరమాణువులలో కూడా తేడాలు ఉండి ఉంటాయి. పరమాణువులు కూడా ఎక్కువ గుణాలున్నవి గాను, తక్కువ గుణాలున్నవి గాను కల్పించబడతాయా? కల్పించబడవా? రెండు విధాలుగా కూడా దోషమున్నది. ఒకవేళ భూమిలో గంధం, జలంలో రసం, అగ్నిలో రూపం, వాయువులో స్పర్శ మాత్రమే ఉన్నాయి. వీటి మధ్య తారతమ్యాలు లేవు అని అంటే అదీ దోషమే. పరమాణువులలో సమత్వాన్ని తీసుకొని రావడం కోసం అన్ని పరమణువులలో ఒక్కొక్క గుణమే ఉంటుందని కల్పించే పక్షంలో తేజస్సులో స్పర్శ యొక్క జ్ఞానం కలగదు. ఉదకంలో రూప, స్పర్శ, లబ్ది ఉండదు. పృదివిలో రస, రూప, స్పర్శ ల జ్ఞానం ఉండదు. ఎందువలననగా కార్యంలోని గుణాలు, కారణంలోని గుణాలను బట్టి ఉంటాయి. అని కల్పిస్తే అప్పుడు నీళ్ళల్లో గంధం, తేజస్సులో గంధ,రసాలు, వాయువులో గంధ, రూప, రసాలు కనబడాలి. కాని అలా కనబడటం లేదు. ఆ కారణం వల్ల కూడా పరమాణు కారణాలు వాదం సమంజసం కాదు.
సూత్రం :- 188
" అపరిగ్రహా చ్చాత్యంత మనపేక్షా "
చ :- ఇంకా చూస్తే, అపరిగ్రహాత్ :- శిష్టులు ఏ స్వతంత్ర పరిణామ వాదాన్ని స్వీకరించక పోవడం వలన, అత్యంత అనపేక్ష :- ఈ వాదాన్ని ఆపేక్షించడం తగదు.
భావం:- ఈ స్వతంత్రప్రకృతి పరిణామవాదాన్ని శిష్టులు అంగీకరించరు. ఇది శ్రుతి, స్మృతికి విరుద్ధం. ఇప్పుడు బాదరాయణుడు విజ్ఞానవాదాన్ని నిరసిస్తున్నాడు.
వివరణ:-పరమాణువాదాన్ని మనువు, మొదలైన శిస్టులు ఎవరూ అంగీకరించలేదు. ఇది యుక్తిసమ్మతం కాదు. అందుచేత దీనిని అంగీకరించవలసిన అవసరం లేదు. వైశేషికులు పదార్ధాలు 6 రకములని చెప్పారు. వీటికి అభావం కలిపితే 7 అవుతాయి. అవి 1. ద్రవ్య, 2. గుణ, 3. కర్మ, 4. సామాన్య,5. విశేష, 6. సమవాయ, 7. అభావం.
1. ద్రవ్యం :- ఇది 9 విధాలు. పృథ్వి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, కాలం, దిక్కు, ఆత్మ, మనస్సు.
2.గుణాలు :-ఇవి 24. రూపం, రసం, గంధం, స్పర్శ, సంఖ్య, పరిమాణం, పృథక్యం ( వేరుగా ఉండటం ), సంయోగం, విభాగం, పరత్వం, అపరత్వం, గురుత్వం, ద్రవత్వం, స్నేహం, శబ్దం, బుద్ధి, సుఖం, దుహఖం, ఇచ్ఛ, ద్వేషం, ప్రయత్నం, ధర్మం, అధర్మం, సంస్కారం.ఇవి స్వతంత్రంగా ఉండలేవు. ద్రవ్యాన్ని అంటి పెట్టుకొని ఉంటుంది. వీటికి లఘుత్వం చేరిస్తే మొత్తం 25 గుణాలు.
3.కర్మ:- ఇది 5 విధాలు. కర్మ అంటే చలనం అని అర్ధం. అవి 1.ఉత్ క్షేపణం(పైకి పోవడం) 2. అవక్షేపణం:-(క్రిందికి పోవడం) 3.ఆకుంచనం(ముడుచుకోవడం ), 4. ప్రసారణం(వ్యాకోచించడం), 5. గమనం( వెళ్లడం). ద్రవ్యం లేనిదే కర్మ లేదు.
4. సామాన్యం :- అనేక వస్తువులలో ఒక సామాన్యలక్షణం ఉండటమే సామాన్యం. ఇది ద్రవ్య, గుణ, కర్మలతో శాశ్వతంగా ఉంటుంది. ఒక చోట అనేక గోవులను చూస్తాము. గోత్వం వాటి సామాన్య లక్షణం. గోవు అంటే గోజాతి అంతా స్ఫరిస్తుంది. అలాగే వృక్షత్వం, ఘటత్వం, ఇత్యాది సామాన్యం అనేది ఊహాకల్పితం కాదు. అది యదార్ధంగా వస్తువులలో ఉంటుంది.
5. విశేషాలు :- సామాన్యానికి వ్యతిరేకమైనది విశేషం. దీని ద్వారా వస్తువుల మధ్య భేదాన్ని గుర్తిస్తాము. ఇది కూడా యదార్ధ పదార్ధమే. ఉహాత్మాకమైనది కాదు.
6. సమవాయ :- వస్తువుల గుణాల మధ్య ఉండే అవినాభావ సంబంధమే సమవాయం. ఒక వస్తువు దాని గుణాలు వేరు కావు. వస్తువు లేకుండా గుణాలు లేవు. గుణాలు లేకుండా వస్తువు ఉండదు. అవయవి - అవయవాలు, చలనం - చలించే వస్తువు, గుణం - గుణి, మొదలైన వాటి మధ్య సమవాయ సంబంధం ఉంటుంది. ఇది విడదీయరాని సంబంధం.
7. అభావం :- ప్రాగభావం, ప్రధ్వoసౌ భావం, అత్యంతా భావం, అన్యోన్య భావం, అని 4 విధాలున్నాయి.
ఈ విధంగా 7 పదార్ధాలకూ వైశేషికులు వేరు వేరు లక్షణాలు ప్రతిపాదించారు. దీని బట్టి ఇవన్నీ ఒకదానితో మరొకటి సంబంధం లేని వస్తువుల వలె స్వతంత్రంగా కనబడుతున్నవి. కాని చివరకు 5 కూడా ద్రవ్యం మీద ఆధారపడి ఉంటాయని వాళ్ళు అంగీకరించరు. గుణాదులు ద్రవ్యంతోనే ఉంటాయి. కాని ద్రవ్యాన్ని విడిచి స్వతంత్రంగా ఉండజాలవు. అని అర్థం. చలనాది కర్మాదులలో కూడా చలనత్వాది జాతులున్న ఆ చలనాదులు ద్రవ్యంలోనే ఉంటాయి. ద్రవ్యాన్ని విడిచి స్వతంత్రంగా ఉండవు. ద్రవ్యగుణాలు ఆయుతసిద్ధాలు కనుక గుణాలు ద్రవ్యాధీనాలు అని వైశేషికులు అంటున్నారు. ఆయుత సిద్ధత్వం అంటే ఒకటి తాను నశించినంత వరకు మరొక దానిని ఆశ్రయించి ఉంటుందో ఆ రెండు ఆయుత సిద్ధాలు. చెట్టు తానున్నంతవరకు అవయవాలను(కొమ్మలు) ఆశ్రయించే ఉంటుంది. అవయవాలు లేకపోతే తాను పోతుంది. గుణం తాను ఉన్నంతవరకు పటాన్ని(వస్త్రాన్ని) ఆశ్రయించుకునే ఉంటుంది. వస్త్రం నశించినా, లేదా మరొక రంగు వేసినా తాను నశిస్తుంది. ద్రవ్యాలు మరొక ద్రవ్యాన్ని ఆరంభిస్తాయి. గుణాలు మరొక గుణాన్ని ఆరంభిస్తాయని వైశేషుకులు అభిప్రాయం. కారణ ద్రవ్యాలైన తంతువులు కార్యద్రవ్యమైన పటాన్ని ప్రారంభిస్తాయి. తంతువులలో ఉన్న శుక్లగుణాలు కార్యద్రవ్యమైన పటంలో మరొక శుక్లగుణాన్ని ప్రారంభిస్తాయి అని వాళ్ళు అంగీకరించరు.
1.వాయువులో ఉన్న స్పర్శ అనే గుణం ఉన్నట్లు చర్మాన్ని స్పర్శించినప్పుడు తెలుస్తుంది.
2.అగ్నిలో ఉన్న స్పర్శ, రూపము అనే గుణాలు ఆ అగ్ని స్పర్శ తగిలినప్పుడు కాలడం అగ్ని లక్షణమని, మండే అగ్నికి ఒకరూపం ఉంటుందని కళ్ళకి తెలుస్తుంది.
3. జలంలో స్పర్శ, రూపం, రసం గుణాలున్నాయి. జలాన్ని చేతితో స్పర్శించవచ్చును. ఏ పాత్రలో పోస్తే ఆ ఆకారాలతో వివిధ రూపాలు ఉంటాయని తెలుస్తుంది. ఆజలానికి రుచివుంటుంది. అదే రసం. ప్రకృతిలో ద్రవ పదార్ధాలాన్ని దీనికి సంబంధించిన రసములే.
4.పృధివికి స్పర్శ, రూపం, రసం, గంధం అనే గుణాలున్నాయి. నేలను స్పర్శించినప్పుడు మట్టి తగులుతుంది. భూమి కొండలు, లోయలు, పర్వతాలు, అనేక రూపాలలో దర్శనమిస్తుంది. రుచివుంటుంది మట్టికి వాసన ఉంటుందని వేసవి కాలంలో హఠాత్తుగా వర్షం పడినప్పుడు తెలుస్తుంది.
ఈ పంచభూతాల వలెనే సృష్టి జరిగిందనే వైషషికుల అభిప్రాయం సమంజసం కాదు. అణువులలో చైతన్యం కలగడానికి పరబ్రహ్మమే కారణమని గ్రహించాలి.
సముదాయాధికరణం ( 2, 2, 18 )
సూత్రం :-189
"సముదాయ ఉభయహేతుకేపి తదప్రాప్తిః "
ఉభయ హేతుకే అపి సముదాయం :- పరమాణు హేతుకం, స్కంద హేతుకం అనే రెండు విధాలైన సముదాయం, తత్ అప్రాప్తిహి :- సిద్ధించడం లేదు.
భావం :- పరమాణు హేతుకమైన బాహ్య సముదాయాలు, స్కంద హేతుకమైన అధ్యాత్మ సముదాయంలో కూడా తమంతట తాముగా సిద్ధించడం లేదు.
వివరణ:- ఇంకో వాదంఉంది. అది పరమాణువుల వలన ధ్వ్యణుకాది కార్యపదార్ధాలు ఉత్పన్నం కావని, పరమాణువుల సముదాయాలే ఈజగత్తులోఉండే పదార్ధాలని అనడం, వీళ్ళదృష్టిలో పరామణువులు పృధివ్యాదిపరమాణు సముదాయాలు, వాటిని అనుభవించే జీవులు క్షణికాలే. జీవుడంటే విజ్ఞానం, బుద్ధి, చిత్తం ఇవన్నీ ఒక్కటేనని వీరి వాదం. ఇప్పటి వరకు అణుసిద్ధాంతాన్ని నిరాకరించిన వ్యాసభగవానుడు ఇప్పుడు బౌద్ధమతాన్ని ఖండిస్తున్నాడు. బుద్ధుని ఉపదేశాలను ఆధారం చేసుకొన్న శిష్యులు నాలుగు శాఖలుగా చీలిపోయారు. వారు 1.వైభాషికులు, 2.సౌత్రాంత్రికులు, 3. విజ్ఞానవాదులు, 4.సర్వ శూన్యవాదులు. వీటిలో ముందుగా మొదటిఇద్దరి వాదాన్ని ఖండిస్తున్నారు. లోకంలోని పదార్ధమంతా బాహ్యము, అభ్యంతరము అని 2 విధాలు. బాహ్యపదార్ధం మరల 2 రకాలు. భూతము, భౌతికము. 1. భూతము :- భూమి, జలము, అగ్ని, వాయువు. 2. భౌతికము:- స్పర్శ, రూప, రస, గంధం వీటిలో ఆకాశం దాని లక్షణమైన శబ్దము స్పర్శ లేవు. భౌతిక పదార్ధాలన్ని ఈనాలుగు భూతాలకు సంబంధించినవే. భూమికి సంబంధించిన పరమాణువులు కఠినస్వభావం కలవి. జలానికి సంబంధినవి స్నేహభావం కలవి. అగ్నికి సంబంధించినవి ఉష్ణస్వభావం కలవి. వాయువుకు సంబంధించిన అణువులు చలనస్వభావం కలవి. 1.పరమాణుహేతుకవాదం:- సముదాయవాదులు ఈ జగత్తును భోకృ, భోగ్య రూపాలుగా విభజిస్తారు. భూత భౌతికాత్మక బాహ్య జగత్తు భోగ్యం. చిత్త చేతనాత్మకం భోకరు సముదాయం. బాహ్య సముదాయానికి గంధ, రస, రూప, స్పర్శ పరమాణువులు కారణం. ఇవి స్వయంగా సముదాయాలై పృధి వ్యాపస్తేజోవాయువులవుతాయి. ఇవి ఓషదులు మొదలైన రూపాల్లో భోగ్యాలు అవుతాయి. పరమాణువులు క్షణికాలే కనుక వీటి వలన ఏర్పడిన పృద్ధివ్యాదులు కూడా క్షణికాలే. 2. స్కంద హేతువాదం :- రూప స్కందం, విజ్ఞాన స్కందం, వేదనా స్కందం, సంజ్ఞా స్కందం, సంస్కార స్కందం, అనే 5 స్కందాలు అధ్యాత్మ సముదాయానికి హేతువులు. శరీరంతో బాటే ఉండేది రూప స్కందం. ఇదే భోగసాధనం. ఆయా విషయాలను గ్రహించే నేను అనే అభిమాన విజ్ఞానం విజ్ఞాన స్కందం. దీనినే భోక్త అంటారు. ప్రియం, అప్రియం వీటితో కలిగే సుఖ దుఃఖాలు ఊపేక్ష వంటి విషయాలతో కూడిన చిత్తావస్థ వేదనా స్కందం. వీడు, వాడు తెలుపు, ఎరుపు, అనే సంజ్ఞ ల సంబంధం వలన తెలిపే ప్రవృత్తి విజ్ఞానం. సంజ్ఞ స్కందం ఇదే భోగం. రాగాది క్లేశాలు, మద మోహాలు, ధర్మాధర్మాలు, సంస్కార స్కందం. ఇది భోగానికి నిమిత్తం. విజ్ఞాన స్కందాన్ని చిత్తం అంటారు. మిగతా నాలుగింటిని చైత్తాలు అంటారు. లోక వ్యవహారమంతా ఈ స్కందాన్ని ఆశ్రయించి ఉంటుంది. ఇదే సముదాయ వాదం. ఈవాదం సరిఅయినది కాదు. సముదాయలుగా ఏర్పడే పరామణువులు క్షణికాలు. కనుక సముదాయలు ఏర్పడలేవు. అలాగే స్కందాలు క్షణికాలే. కనుక సముదాయలు అవి ఏర్పడక ముందే నశిస్తాయి. అందువలన క్షణిక పరామణువులు క్షణిక సముదాయాన్ని ఏర్పారుస్తాయనడం హాస్యాస్పదంగా ఉంటుంది. సముదాయవాదులు ప్రళయీన్ని అంగీకరిస్తారు. క్షణికాలకు ప్రళయం ఏముంటుంది? ఈ వాదం అయుక్తం. పరామణు హేతువు, స్కంద హేతువు అచేతనాలే. ఈ రెండు అచేతనాలను ఒకచోట చేర్చే సంధాన కర్త ఒకరుండాలి. అటువంటి వాడు ఉన్నాడని బౌద్ధులు అంగీకరించరు.
సూత్రం :- 190
"ఇతరేతర ప్రత్యయ త్వాదితి చేన్న ఉత్పత్తి మాత్ర నిమిత్త్వాత్
ఇతరేతర ప్రత్యయత్వాత్ :- తరువాత సిద్ధించే పదార్ధాలను పూర్వ పదార్ధాలు కారణములు కనుక, పూర్వ పదార్ధములు క్షణికములైనా, సముదాయములు ఏర్పడతాయి. ఇతి చేత్ :- అని అంటారా? ఉత్పత్తి మాత్ర నిమిత్తత్వాత్ :- క్షణికాలు క్షణికాలనే ఉత్పత్తి చేస్తాయి. కనుక న :- సముదాయ సిద్ధి కలగనేరదు.
భావం :- ప్రతి పదార్ధం పుట్టడానికి దాని పూర్వ పదార్ధమే కారణమని, పూర్వ పదార్ధములు క్షణికములైన మరొక క్షణికమైన పదార్ధములను ఉత్పత్తి చేస్తాయి. కాని సముదాయ సిద్ధి కలగదు.
వివరణ :- అవిద్యాదులు ఒకదానికొకటి కారణమైనంత మాత్రాన చేతనుడు లేకపోయినప్పటికి ఉత్పత్తి జరుగుతుందని వారు అంటారు. అది నిజం కాదు. మట్టి, దండం, చక్రం లాంటి అచేతన సాధనలు ఉన్నప్పటికీ, చేతనుడైన కుమ్మరి లేకపోతే కుండ తయారు కాదు. పూర్వ క్షణికాలు, ఉత్తర క్షణికాలను చెయ్యడానికి కారకాలే గాని సముదాయ ఉత్పత్తికి హేతువులు కావు. క్షణికాలు తమకంటే తరువాత క్షణికాలను ఉత్పత్తిచేస్తే అవి ధ్వంసం అవుతాయి. అప్పుడు సముదాయం ఎలా కలుగుతుంది? దానికి ఆ జ్ఞానం ఎలా కలుగుతుంది? అందువల్ల దేనికైనా చేతన నిమిత్తం కారణం అవసరం. అవిద్యాదులు కేవలం ఉత్పత్తికి మాత్రమే హేతువులు కాని సముదాయ భావం, లోకయాత్ర కుదరదు. భోక్త అంటే నేను అనే అహం ఉన్న జీవుడు అవిద్య, సంస్కారం, విజ్ఞానం, నామరూపం, స్పర్శ, వేదన, తృష్ణ, ఉపాదానం, భవం, జాతి, జర, మరణం, శోకం, పరివేదన, దుహఖం, మొదలైనవి అనుభవిస్తూ లోకయాత్ర సాగిస్తాడు. వీటిని సౌగతుల సిద్ధాంతంలో కొన్ని చోట్ల విస్తృతంగా, కొన్నిచోట్ల సంక్షిప్తంగా వివరించారు. వీటిని అందరూ దార్శనికులు అంగీకరించాలి. వీటిని వ్యాక్యానించవలసిన అవసరం లేదు. ఈ అవిద్యాదులన్నీ ఒకదానికొకటి కారణం అవుతూ ఘటి యంత్రం వలె మోటు బావిలో నీరు తోడటానికి పెద్ద చక్రానికి చుట్టూ ఘటాలు కట్టి ఏర్పారచిన యంత్రం వలె నిరంతరం తిరుగుతున్నప్పుడు ఉత్పత్తి మాత్రానికే నిమిత్తాలు. కాని సంఘాతం పుట్టడానికి కారణం కావు. అనిత్యాలు, అశుభాలు, క్షణికాలు అయిన శరీరకంగా పరిణమించిన అనాత్మ భూతాల విషయంలో ఇవినిత్యాలు. ఆత్మఅనే బుద్ధి, అవిద్య వలన శరీరము నందు రాగం, అనుకూలంగా లేకపోతే ద్వేషం, ఇహికము ఆముష్మికము అయిన పనులు చెయ్యడం, జన్మంతరానికి సంబంధించిన అవిద్యా సంస్కారాల చేత తల్లి గర్భంలో పిండరూపంలో వేదన అనుభవించి, దుఃఖం విడనాడాలనే తృష్ణతో దానికి తగిన ఉపాదానకారణమైన గర్భం నుండి బయటకు రావడం, శోకం, కోరికలు, పరివేదన అనుభవించి, చివరకు మరణం సంభవించడం, లోకాన్తరప్రాప్తి, మళ్ళీ పునర్జన్మ ఇవన్నీ అవిద్యతో ఉన్న జీవుడికి నిత్యాలే. ప్రతీత్యసముతపాదాన్ని గురించి బుద్ధ సూత్రాలు :- ఈ సూత్రాలకు కల్పతరువులో అర్ధం చెప్పబడింది. మరొక హేతువు గురించి వెళ్ళేది గాన ప్రత్యయం అని పేరు. అనగా ఇతర సహకారము లతో కలసి మరొక హేతువు దగ్గరకు వెళ్ళేది ప్రత్యయం. ఈ కార్యం కారణముయొక్క సముదాయ ఫలమే గాని చేరడం యొక్క ఫలం కాదు. 1.హేతుప నిబంధన :-బీజం నుండి అంకురం పుడుతుంది. అంకురం నుండి ఆకు, ఆకు నుండి కాండం, కాండం నుంచి నాలం, నాళం నుండి గర్భం, గర్భం నుండి శూకం(వెన్ను) శూకం నుండి పుష్పం, పుష్పం నుండి ఫలం ఉద్భవిస్తాయి. అంకురాన్ని పుట్టించాననే జ్ఞానం బీజానికి ఉండదు. నన్ను బీజం పుట్టించిందనే జ్ఞానం అంకురానికి ఉండదు. ఈ విధంగా చివరి వరకు వెళ్లగా నేను ఫలాన్ని పుట్టిస్తున్నాను అనే జ్ఞానం పుష్పనికి ఉండదు. ఈ విధంగా చైతన్యం లేకపోయినా బీజాలకు మరొక అధిష్టానం దేవత లేకపోయినా కార్యకారణ భావ నియమం కనబడుతున్నది. 2.ప్రత్యయోప నిబంధన:-ప్రత్యయం అనగా అనేక హేతువుల సముదాయం. బీజం కారణంగా గల అంకురం ఆరు ధాతువుల సముదాయం. పృద్వి ధాతువు బీజాన్ని సంగ్రహిస్తుంది. దాని వలన అంకురం కఠినం ఔతుంది. జలధాతువు బీజంలో తేమ పుట్టిస్తుంది. తేజోధాతువు బీజాన్ని పక్వం చేస్తుంది. వాయుధాతువు బీజాన్ని కొడుతుంది. అంకురం బయటకు వస్తుంది. ఆకాశ ధాతువు బీజానికి అనావరణం కల్పిస్తుంది. ఋతువు బీజంలో పరిణామం తెస్తుంది. పృద్విధాతువు బీజాన్ని సంగ్రహించాను అనుకోదు. ఇలా చివరివరకు నేను బీజంలో పరిణామం చేస్తున్నాని ఋతువు అనుకోదు. ఈ విధంగా చైతన్యం లేకపోయినా అధిష్టాన దేవత ప్రేరణ లేకపోయినా కార్యకారణ సంబంధం ఉంటుందని వారి అభిప్రాయం. ఇది సమంజసం కాదు. ప్రతి చర్య వెనుక పరబ్రహ్మం యొక్క ప్రేరణ ఉంటుంది.
సూత్రం :- 191
"ఉత్పరోత్పాదే చ పూర్వ నిరోధాత్ "
చ :- అంతే కాదు, ఉత్పర ఉత్పాదే :- ఉత్తర క్షణఉత్పత్తి సమయంలో, పూర్వ విరోధాత్ :- పూర్వ క్షణం నశించడం వలన, పూర్వ క్షణం ఉత్తర క్షణం ఉత్పత్తి కారణం అనడం కూడా తగదు.
భావం :- ఉత్తర క్షణం ఉత్పత్తి సమయంలో పూర్వ క్షణం నశించడం వలన, పూర్వ క్షణం, ఉత్తర క్షణ ఉత్పత్తి కారణం అనడం తగదు.
వివరణ :- వీరి మతంలో ఉత్తర కార్యోత్పత్తి జరిగే సమయానికి, పూర్వ జ్ఞానం నశిస్తోంది. కాబట్టి హేతువుకు అధీనమైన కార్యోత్పత్తి కూడా జరగదు. వీరి మతానుసారం అవిద్య, సంస్కారం, విజ్ఞానం, నామము, రూపము, మొదలైన వాటిలో అవిద్య వలన సంస్కారం పుడుతుంది. సంస్కారం పుట్టగానే అవిద్య నశిస్తుంది. సంస్కారం నుంచి జ్ఞానం పుడుతుంది. విజ్ఞానం పుట్టగానే సంస్కారం నశిస్తుంది. విజ్ఞానం నుంచి నామం పుడుతుంది. నామం పుట్టగానే విజ్ఞానం నశిస్తుంది. ఈ రకంగా ఉత్తరకార్యాలు పుట్టినప్పుడు పూర్వకార్యాలు నశిస్తాయి. నశించిన వస్తువు ఇక ఉండదు. లేనిది కారణం కాదు కదా! కాబట్టి కారణాన్ని అనుసరించి కార్యోత్పత్తి జరగదు. ఇది ఒక దోషమే. అవిద్య ఉండటం వలన జీవుడు ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకునే సంస్కారం అలవడుతుంది. అవిద్య అనే కారణం వలన సంస్కారం అనే ఉత్తర కార్యం పుడుతోంది. దానివలన పూర్వజ్ఞానం నశిస్తోంది. అంటే అవిద్య నాశనమౌతుంది. అవిద్య అనే హేతువుకు తగినట్లుగా కార్యం జరగలేదు. అవిద్యకు భిన్నమైన సంస్కారం పుట్టింది. కాబట్టి హేతువుకు అధీనమైన కార్యోత్పత్తి కూడా జరగదు. పూర్వ క్షణికం, ఉత్తర క్షణికం పరమాణువులు రెండు ఒకే క్షణంలో జరిగితే పూర్వోత్తర భావం ఉండదు. కార్యకారణములలో కారణం పూర్వం. కార్యం ఉత్తరం. కార్యానికి పూర్వం నియామంగా ఉండేది కారణం. వీళ్ళ మతం ప్రకారం ఘటం, పటం మొదలైన స్థిరమైన పదార్ధాలు ఏమి లేవు. ఈ క్షణంలో ఉన్న ఘటం నుండి మరొక ఘటం పుడుతుంది. మళ్ళీ ఆఘటం మరొక ఘటాన్ని పుట్టిస్తుంది. ఈ విధంగా జగత్తులో ప్రతి వస్తువు కూడా క్షణికమే. కనబడేది ఘటం కాదు. ఘట ప్రవాహం. అది నశించేది. అవిద్యాదులు కూడా క్షణికలే. క్షణికాలైన అవిద్య నుండి సంస్కారాదులు పుట్టడం కూడా కుదరదని చెప్పడం కోసం ఈ విచారణ చేయబడుతోంది. పూర్వ క్షణం నిమిత్తం. ఉత్తర క్షణం ఫలం, అనే హేతువుల భావన శక్యం కాదు. పూర్వ క్షణం అభావం చేత లేనిదైపోవడం వలన అది ఉత్తర క్షణానికి హేతువు కాదు. విత్తనం నుంచి అంకురం వచ్చినప్పుడు విత్తనం యొక్క హేతువు అంకురం లో కనబడుదు. కనుక పూర్వ క్షణం ఉత్తర క్షణానికి హేతువు అని చెప్పడం కుదరదు. హేతువు యొక్క రూపం, లేదా స్వభావం కొంతవరకు ఫలంలో సంక్రమిస్తేనే అది హేతువు అవుతుంది. అలా సంక్రమించక పోతే అది హేతువు కాదు. ఇది ఫలం కాదు అని బౌద్ధులు పూర్వ క్షణం, ఉత్తర క్షణం ఉత్పత్తికి కారణం కాదని వారి అభిప్రాయం.
సూత్రం :- 192
"అసతి ప్రతిజ్ఞో పరోధో యోగ పద్యం అన్యధా వా "
అసతి :- పూర్వ క్షణిక పరమాణువు లేకపోయినా, ఉత్తర క్షణ కార్యం అవుతుందని ఒప్పుకుంటే, ప్రతిజ్ఞా ఉపరోధః :- పూర్వ క్షణికం వల్ల ఉత్తర క్షణికం ఉత్పన్నమౌతుంది. వా :- అలాకాక, అన్యధా :-పూర్వ పక్షం నశిస్తుందని ఒప్పుకోకుంటే, యోగ పద్యం :- పూర్వ, ఉత్తర క్షణికాలు రెండు ఒకే క్షణంలో ఉన్నట్లు అంగీకరించాలి.
భావం :- పూర్వ క్షణిక పరామణువు లేకపోయినా, ఉత్తర క్షణ కార్యం అవుతుందని ఒప్పుకుంటే, పూర్వ క్షణికం వలన ఉత్తర క్షణికం ఉత్పన్నమౌతుందని మీరు అన్న మాటకు భంగం వాటిల్లుతుంది. పూర్వ, ఉత్తర క్షణికాలు రెండు ఒకే క్షణంలో ఉన్నట్లు అంగీకరిస్తే క్షణికత్వానికి హాని కలుగుతుంది.
వివరణ :- పూర్వ క్షణం అంటే కారణం. ఉత్తర క్షణం అంటే కార్యం. కారణం లేకుండా కార్యం జరుగుతుందని బౌద్ధులు చెప్పిన దానికి భంగం కలుగుతుంది. మట్టి లేకుండా కుండ ఎలా తయారవుతుంది. అలా కాకుండా కార్యం కలిగేంత వరకు కారణం ఉంటుంది అన్నా వారు చెప్పిన దానికి భంగం కలుగుతుంది. బౌద్ధమతంలో ఇది ఎరుపు, ఇది నలుపు అనే జ్ఞానరూపకమైన కార్యం పుట్టాలి అంటే పూర్వజ్ఞానం, చక్షసు, ఆలోకం(చూచుట) విషయము అనే నాలుగు హేతువులు ఉండాలి. కాబట్టి కారణం లేకుండా కార్యం పుడుతుందని అంగీకరిస్తే వారి వాదనకు భంగం కలుగుతుంది. అలాగే కారణం ఉన్నప్పుడు కార్యం ఉంటుంది. అని అంగీకరించినా వారి వాదనకు భంగం కలుగుతుంది. ఎందుకంటే కార్యాకారణములు ఒకే కాలంలో ఉంటాయి. కాబట్టి సర్వం క్షణికం అనే మాటకు భంగం వాటిల్లుతుంది. ఈరకంగా బౌద్ధుల వాదన తప్పు అవుతోంది. చిత్త చైత్యాలు నాలుగు విధాలైన హేతువులను చేరి పుడతాయి అనే వారి ప్రతిజ్ఞ భంగం అవుతుంది. చిత్తం అంటే జ్ఞానం, చైత్తము అంటే సుఖాదులు. చిత్త చైత్తలు 4 హేతువులతో పుడతాయని బౌద్ధులు అంటారు. సహకారి, సమంతర ప్రత్యయం, ఆలంబనం లను పొంది చిత్త చై త్తలు పుడతాయి. ఈ నాలుగు హేతువులలో ఆలంభనం ఒకటి. ఘట జ్ఞానానికి ఘటం ఆలంభనం. ఇది ఘటమని, గ్రహించినప్పుడు ఆ ఘటం వర్తమానకాలంలో సంబంధించినట్లు గ్రహీంపబడుచున్నది. అందుచేత అది వర్తమాన కాలంలో ఉండాలి. ఈజ్ఞానానికి హేతువు అయినా ఆలంబనంగా పూర్వపక్షంలో కూడా ఉండేది. ఈ విధంగా ఆ ఘటం కనీసం రెండుక్షణాలు ఉన్నట్లు చెప్పాలి. అది క్షణభంగవాదానికి విరుద్దం. అలాకాక పూర్వపక్షం ఉత్తరపక్షం పుట్టేవరకు ఉంటుంది అని అంగీకరిస్తే అప్పుడు హేతువు ఫలము రెండు కూడా ఒకే సమయంలో ఉన్నాయని చెప్పవలసిన వస్తుంది. అప్పుడు క్షణభంగవాదానికి భంగం కలుగుతుంది. అలా చెప్పినప్పుడు సంస్కారాలన్ని క్షణికాలు అనే ప్రతిజ్ఞకు అవరోధం కలుగు తుంది. బౌద్ధమతం ప్రకారం సంస్కారం అంటే వాసన అని అర్ధం. సంస్కరింపబడుతున్నది కనుక సంస్కారం. కార్యం కూడా సంస్కారమే. కార్యకారణాత్మకమైన సమస్త భావ పదార్ధాలు కూడా క్షణికాలే అని అర్ధం.
సూత్రం :- 193
"ప్రతి సంఖ్యా ప్రతి సంఖ్యా నిరోధా ప్రాప్తి ర విచ్చేదాత్
"అవిచ్చేదాత్ :- భావ పదార్ధం ఉనికి నశించడం వలన, ప్రతి సంఖ్యా, అప్రతి సంఖ్యా నిరోదాత్ :- ప్రతి సంఖ్యా నిరోధం, అప్రతి సంఖ్యా నిరోధం సిద్ధించవు. భావం :- భావ పదార్ధం లేకుండా నశించడం వలన, అంటే భావ విచ్ఛేదనం కానందు వలన, ప్రతి సంఖ్యా నిరోధం, అప్రతి సంఖ్యా నిరోధం సిద్ధించవు.
వివరణ:-ఈసూత్రంలో 2 పదాలున్నాయి. 1. ప్రతి సంఖ్యా నిరోధం, 2 . అప్రతి సంఖ్యా నిరోధం ప్రతి సంఖ్యా నిరోధం అంటే బుద్ధి పూర్వకమైన నాశనం, ఇదే స్థూలనాశనం. అప్రతిసంఖ్యానిరోధనం అంటే బుద్ధి పూర్వకము కాని వినాశనం. ఇది సహజంగా జరిగే వినాశనం. ఈ రెండు వినాశనాలు బౌద్ధులు కల్పించుకున్నవే. వీరి భాషలో భావాలు అంటే కుండ, వస్త్రం మొదలైనవి. ఇవి ప్రతి క్షణం నశించిపోతూనే ఉంటాయి. అంటే వాటంతట అవే నశిస్తాయి. అలాంటప్పుడు బుద్ధిపూర్వకమైన నాశనానికి అవకాశం లేదు. వీరి మతం ప్రకారం ప్రతి క్షణం నశించడం అంటే కుండ వాటి మూల పదార్ధమైన మట్టి నాశనం అయ్యేవరకు నశిస్తుంది అనాలి. నశించిన కుండ మళ్ళీ పుట్టింది అనాలి. అలాకాకుండా ఇంకొక కుండ వచ్చింది అంటే వెనుకటి కుండ, ఇప్పటి కుండ ఒక్కటే అని అనిపించదు. జాగ్రత్తగా పరిశీలిస్తే కుండ, వస్త్రం మొదలైన వస్తువులలో మట్టి, దారాలయొక్క అనుబంధం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి బుద్ధిపూర్వకము కాని నాశనం జరగడం లేదు. అందువలన వారి వాదన తప్పు. బౌద్ధుల సిద్ధాంతం ప్రకారం భావ పదార్ధాలన్ని క్షణికాలే. ఒక వృక్షం ఆ క్షణంలో ఉంటుంది. మరొక చెట్టు పుట్టించి అది మరు క్షణంలో నశిస్తుంది. ఈ విధంగా క్షణక్షణానికి క్రొత్త క్రొత్త వృక్షాన్ని పుట్టిస్తూ, వెనుకటి క్షణంలో ఉన్న వృక్షం నశిస్తుంది. ఈ విధంగా చెట్టుయొక్క అవిచ్చిన్నమైన ధార మాత్రమే కనిపిస్తుంది. అదే సంతానం. వృక్షసంతానంలో ఉన్న వృక్షాలు సంతానులు. ఈ ప్రతిసంఖ్యా, అప్రతిసంఖ్యా నిరోధాలు సంతానానికి సంబంధించినవా? కాదా? అనేది ప్రశ్న. సంతానానికి సంబంధించిన ప్రతిసంఖ్య, అప్రతి సంఖ్యా నిరోధాలు సంభవించవు. ఎందువలనంటే అన్ని సంతానాలలోనూ అవిచ్చిన్నమైన హేతువుల భావం ఉంటుంది. గాన సంతాన విచ్చేదం సంభవం కాదు. నిరన్వయం అనగా ఏ వస్తువు కూడా అనున్యూతంగా ఉందని అర్ధం. ఘటం నాశనమైతే అది పెంకులు, చూర్ణం మొదలైన అవస్థలు మారినా కూడా అన్ని అవస్థలలోనూ మట్టి అనున్యూతంగా వస్తున్నట్లు కనిపిస్తుంది. ఆమట్టియే ఇది అని ప్రత్యభిజ్ఞానం ద్వారా తెలుస్తుంది. ఒక వస్తువు పూర్తిగా నశించడం అనేది ఉండదు అని చెప్పడానికి ప్రత్యేభిజ్ఞానం వలన తెలుస్తుంది. అయితే బాగా కాలిన రాయి మీద పడిన నీటి చుక్క పూర్తిగా నశిస్తుంది కదా! అది నిరన్వయమా? నిరుపాఖ్యమా? అని సందేహం రావచ్చును. నిరుపాఖ్యం అంటే నామరుపాలు లేకుండా పూర్తిస్వరూపమే నశించడం. అక్కడ కూడా ఆ నీటిని తేజస్సు మేఘంగా మార్చడం కోసం మార్తాండ మండలం లోకి తీసుకొని పోవుచున్నదని ఊహించాలి. ఉదకబిందువులోని ఉదకత్వానికి, సముద్రంలో ఉన్న ఉదకత్వానికి భేదంలేదు. అక్కడ బిందువు కనబడకపోయినా, దానికి సముద్రజలాన్వయం ఉంది అని ప్రత్యక్షప్రమాణం చేత చెప్ప వచ్చును. సత్ రూపం, అసత్ రూపం అవుతుందని ప్రతి సంఖ్య, అసత్ సత్ అవుతుందని అప్రతి సంఖ్య.. రెండు తప్పే. భావ పదార్ధాలకు అన్వయవిచ్చేదం ఉంటుంది. కాని నిరన్వయ విచ్చేదం ఉండదు. అందువలన భావం, అభావం ఎన్నటికీ కాదు. బౌద్ధుల దృష్టిలో భావం అంటే కుండ, వస్త్రం మొదలైనవి.
సూత్రం :- 194
" ఉభయధా చ దోషాత్ "
చ :- అంతే కాక, ఉభయధా చ :- సముదాయ వాదం సహేతుకం, నిర్వేతూకం రెండు కానందువల్ల, దోషాత్ :- దోష భూయిష్టమైనందువల్ల సిద్ధించడం లేదు.
భావం :- సముదాయ వాదం సహేతుకం, నిర్వేతుకం రెండూ కానందు వలన దోషభూయిష్టమైనందు వలన సిద్ధించడం లేదు.
వివరణ:-పూర్వక్షణ పరమాణువు, ఉత్తరక్షణ పరమాణువుకు కారణం అనడం సమంజసం కాదు. సర్వం ఆత్మ రహితం అనడం నిర్వేతుకం. ఈ రెండు రకలైన దోష ప్రసక్తి వస్తున్నది కనుక సముదాయవాదుల ఉభయవిధ నిరోధాలు సిద్ధించడం లేదు. అవిద్య అనేది జ్ఞానంవలన నశిస్తుందా? లేక తనంతటా తానే నశిస్తుందా? క్షణికములైన వాటిని శాశ్వతమని భావించడమే అవిద్య. యమనియమాలతో కూడిన మార్గం అవిద్యను నిరోదిస్తుంది అని బౌద్ధులవాదన. జ్ఞానం వలెనే అవిద్య నిరోదింపబడుతున్నది. అంటే అన్ని వస్తువులకు నాశనం ఏర్పడుతుందనే వాదన తప్పుతుంది. అలా కాకుండా దానంతట అదే అవిద్య నశించిపోతుంటే, సర్వం క్షణికం అన్న బుద్ధుని బోధనలు తప్పుతాయి. ఏరకంగా చూసినా వీరి వాదనకు బలం లేదు. ప్రతిసంఖ్యా నిరోధంలో అంతర్గతమై కల్పించబడిన అవిరోధానిరోధనం అనే సాధనంతో కూడిన సమ్యక్ జ్ఞానం వలన కలుగుతుందా? లేదా తనంతటా తానే కలుగుతుందా? మొదటిపక్షంలో వినాశనం నిర్వేతుకంగా జరుగుతుంది అనే అంగీకారానికి విరోధం, రెండవ పక్షంలో మార్గోపదేశం వలన దోషం కలుగుతుంది. మార్గోపదేశం అంటే సర్వం దుఃఖం, సర్వం క్షణికం, అనే భావన చేయడం వలన అవిద్య నశిస్తుంది. అని ఉపదేశించిన మోక్షమార్గం వ్యర్థం అవుతుంది. వాటి వినాశనం స్వయంగానే జరిగినప్పుడు ఈ మార్గం ఎందుకు? ఈ విధంగా రెండు విధాల కూడా దోషం ప్రసక్తం అవుతున్నది. కనుక ఈ దర్శనం అసమంజసమైనది. బ్రహ్మవిద్యాభరణంలో ఈభాష్యానికి భావం ఈవిధంగా వివరించబడింది. నేను ఘటాన్ని తెలుసుకొనుచున్నాను అనే సవికల్ప జ్ఞానమే అవిద్య. అలాంటి సవికల్ప జ్ఞానం నశించ, నిర్వికల్ప ఆలయ విజ్ఞానం మిగలడమే మోక్షం. ఆలయ విజ్ఞానం సహజంగా నిర్వికల్పమే. వాసనలు మొదలైన ఉపాధుల వలన సవికల్పత్వం కలుగుతోంది. దానిని తొలగించుకోవడానికి ఆలయ విజ్ఞానం ఉత్పన్నం కావడమే సమ్యక్ జ్ఞానం అని వారి సిద్ధాంతం. అవిద్యానిరోధం అంటే ప్రతిసంఖ్యానిరోధం అంటే బుద్ధి పూర్వకమైన నాశనం అని బౌద్ధులు అంగీకరించారు. ముముక్షువుడైన సాధకుడు కూడా క్షణికుడే. అందుచేత మోక్షావస్థలో ఆసాధకుడండడు. కనుక సాధన విషయంలో దానికి ప్రవృత్తి ఉండదు. అందుచేత వారు అవిద్య యొక్క ప్రతి సంఖ్యా నిరోధం కూడా హేతువు లేని నిరోధమేనని వారు అంగీకరించాలి.
సూత్రం :- 195
" ఆకాశే చావిశేషాత్ "
ఆకాశేచ :- ఆకాశంలో కూడా, అవిశేషాత్ :- సమానంగా వస్తు ప్రతిపత్తి ఉన్నందున, అది అభావం అనడం సరికాదు.
భావం :- ఆకాశం కూడా పృధి వ్యాదుల వలె వస్తు ప్రతిపత్తి ఉన్నందున అది అభావం అనడం సరి అయినది కాదు.
వివరణ :- ఆకాశం అనేది ఒక వస్తువు కాదంటారు బౌద్ధులు. బౌద్ధ మతంలో ఆకాశం అంటే ఆవరణం లేకపోవడం అని అర్ధం చెప్పారు. పృథివ్యాదుల వలె ఆకాశం కూడా ఒక వస్తువేనని వారు భావించడం లేదు. పృధివికి గంధం మొదలైన గుణాలు ఉన్నట్లే, ఆకాశం కూడా శబ్దగుణానికి ఆశ్రయం. ఆకాశం అంటే అవకాశం కల్పించేది. నేల మీద కుండను ఉంచినప్పుడు ఆ కుండకు భూమి ఆధారంగా ఉన్నదనే భావన కలుగుతోంది. ఆకాశంలో పక్షులు గానీ, విమానాలు గాని ఎగురుతున్నప్పుడు వాటికీ ఆధారంగా నిలిచేది ఆకాశమే. ఈ విధంగా ఆకాశం కూడా ఒక వస్తువే. తైత్తరీయెపనిషత్తులో పరబ్రహ్మం నుండి ఆకాశం పుట్టిందని, అందువలన ఆకాశంకూడా ఒకవస్తువేనని చెప్పబడింది. శ్రుతి ప్రమాణాన్ని అంగీకరించని వాళ్ళు ఆకాశాన్ని ఒక వస్తువుగా గ్రహించరు. అనుమానప్రమాణం చేత గ్రహించాలి. ఎందువలననగా పృథవి మొదలైన వస్తువులకు గంధం అనే గుణం ఉన్నట్లే, శబ్దంఅనే గుణం ఆకాశాన్నిఆశ్రయించి ఉందని, అందువలన ఆకాశం కూడా ఒక వస్తువేనని అనుమాన ప్రమాణం వలన తెలుస్తోంది. మరొక విషయం ఏమిటంటే ఆకాశం అనగా ఆవరణ లేకపోవడం మాత్రమే కాదు అని అంగీకరిస్తే, ఆకాశంలోకి ఒకపక్షి ఎగిరినచో అక్కడ ఆవరణం ఏర్పడటం చేత పైకి ఎగురుదాం అనుకునే మరొక పక్షికి అవకాశం ఉండదు. ఎక్కడైతే ఆవరణం లేదో అక్కడ ఆ రెండవపక్షి ఎగురుతుంది అన్నట్లయితే "యత్రావరణాభవ" అని దేనిచేతనైతే నువ్వు ఆవరణాభావాన్నీ విశ్వాసిస్తున్నావో, అది వస్తువే అయిన ఆకాశం అవుతుంది. కాని ఆవరణాభావం మాత్రం కాదు. ఈ భూతలం మీద ఘటం లేదు అన్నప్పుడు ఘటం లేదని ఏ భూతలాన్ని చూపుతున్నావో, ఆ భూతలం ఒక వస్తువే అయినట్లు, పక్షుల భావానికి స్థానమైన ఆకాశం కూడా ఒక వస్తువే కావాలి, అసత్ పదార్ధం కాకూడదు. భూమి పృథ వ్యాదులు చివర ఆశ్రయించుకున్నట్లే, వాయువు ఆకాశాన్ని ఆశ్రయించుకొని ఉన్నది. ఆకాశం వస్తువు కాకపోతే అసత్ అయితే ఈసమాధానం సమంజసం కాదని చెప్పవలసిన వస్తోంది. ప్రతిసంఖ్యానిరోధం, అప్రతిసంఖ్యానిరోధం, ఆకాశం ఈ మూడు కూడా నిరుపాఖ్యాలు. అవస్తువులు(వస్తువులు కానివి) అయితే నిత్యమైనవి అని చెప్పడం పరస్పర విరుద్ధమైన మాట.
సూత్రం :- 196
" అను స్పృతే శ్చ "
చ :- అంతే కాక, అను స్పృతే పి :- ఉనికికి గుర్తింపు ఉన్నందుకు వలన, భావాలను క్షణికం అనడం యుక్తం కాదు.
భావం :- భావాల ఉనికికి గుర్తింపు ఉన్నందు వలన భావాలను క్షణికం అనడం యుక్తం కాదు.
వివరణ:- బౌద్ధుల వాదన ప్రకారం సర్వము క్షణికమే. అంటే ఆత్మ కూడా క్షణికమే అంటున్నారు. కాని అది నిజంకాదు. ఆత్మ శాశ్వతమైనది. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఉండేది ఆత్మయే. ఆత్మ నిత్యం, సత్యమైనది. ఈ విషయం ఉపనిషత్తులలో స్పష్టంగా అనేక సార్లు చెప్పబడింది. కాబట్టి ఆత్మ క్షణికమైనది అని చెప్పే బౌద్ధుల వాదన తప్పు. సముదాయవాదుల దృష్టిలో భావపదార్ధాలన్ని క్షణికాలు. భావాలు అంటే సత్వపదార్ధాలు. సత్వం క్షణికమనీ, అది అర్ధక్రియలను చేస్తుందని క్షణిక వాదులంటారు. అది సరి అయినది కాదు. భావాలన్నీ క్షణికాలు అంటున్నారు. అప్పుడు ఒకక్షణం ఉండి, మరొక క్షణం లేని పదార్ధాలను గుర్తించడం శక్యం కాదు. కాని ఇందుకు విరుద్ధంగా లోకాల్ని ఫలాన పదార్ధాలు అని మనం గుర్తిస్తున్నాము. భావపదార్ధాలన్ని ప్రత్యభిజ్ఞకు విషయాలు. కనుక అవి క్షణికాలుకావని ఋజువు అవుతోంది. నేను ఇదివరకు చూసినదాన్నే ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను. ఇదివరకు స్పృశించినదాని స్పర్శ ఇప్పుడు కలుగుతోంది అనేది ప్రత్యభిజ్ఞ. ఘటం కొంతకాలం ఉంది నశిస్తే అది ఉదాహరణంగా ఎలా పనికివస్తుంది? వస్త్రం క్షణం కాలమే ఉండి నశిస్తే, దానిని ఎలా ధరిస్తాము? కనుక భావాలు క్షణికాలు కావు. అనుభవాన్ని అనుసరించి స్మృతి కలగడం వలన ఆత్మ అస్థిరం కాదు. వస్తువులన్నీ క్షణికాలే. వైనాశికుడు జ్ఞాత అయిన ఆత్మ కూడా క్షణికత్వాన్ని అంగీకరిస్తున్నాడు. కాని అది కుదరదు. అనుస్మృతి ఉండటం వలన జ్ఞానాన్ని అనుసరించి పుట్టే స్మరణమే అనుస్మృతి. జ్ఞానానికి ఎవడు కర్తో, అనుభవానికి కూడా అతడే కర్త అయితేనే అనుస్మృతి కుదురుతుంది. ఒక పురుషుడు ఒక వస్తువుపై జ్ఞానం కలిగి ఉండి, వేరొక పురుషుడు దానిని స్మరించడం, చూడటం జరిగితే ఆవస్తువు పట్ల జ్ఞానం ఎలా కలుగుతుంది. ఇంత క్రితం ఆ వస్తువును చూసిన నేను, ఇప్పుడు అదే వస్తువును చూస్తున్నాను. అనే ప్రత్యభిజ్ఞ ఉండటం వలన ఆత్మ స్థిరమైనది అని అంగీకరించాలి. ఇప్పుడు దేనిని స్పృశిస్తున్నానో, దానినే చూచి ఉన్నాను. ఇప్పుడు చూస్తున్నాను అని దర్శన, స్మరణాలు రెండింటికి కర్త అయిన ఒకే పురుషుని విషయంలో ప్రత్యభిజ్ఞ రూపమైన జ్ఞానం సకల జనులకు ప్రసిద్దమే. నేను స్మరిస్తున్నాను. మరొకడు చూచాడు అని ఎవరు అనుకోరు. క్షణికజ్ఞానంతోనే సాదృశ్యజ్ఞానం కలగవచ్చును. గాన స్థిరమైన ఆత్మ అవసరం లేదు అని వారి అభిప్రాయం. సాదృశ్యం అంటే పోలిక. ఇది రెండు విధాలు.1.అనుయోగి, 2. ప్రతియోగి. అనుయోగి అంటే ఒకదానిని మరొక దానితో పోలిక చెప్పినప్పుడు దేనికి సాదృశ్యం చెప్పబడుతుందో అది అనుయోగి. దేనితో చెప్పబడుతుందో అది ప్రతియోగి. ఉదా:-ముఖాన్ని చంద్రబింబంతో పోల్చినప్పుడు ముఖం అనుయోగి, చంద్రబింబం ప్రతియోగి. అనుయోగికి జ్ఞానం ఉంటుంది. తరువాత జ్ఞానంలో సాదృశ్యం ఉంటుంది. అనుయోగి జ్ఞానం తరువాత క్షణికజ్ఞానం వలన పుట్టిన క్షణికజ్ఞానంతో ప్రతియోగి సాదృశ్యం ఉంటుంది. అనుభవాన్ని అనుసరించి స్మృతి కలగడం వలన ఆత్మ అధికం కాదు. వస్తువులన్నీ క్షణికాలే. బౌద్దులు జ్ఞాత అయిన ఆత్మ కూడా క్షణికమే అని అంగీకారిస్తున్నారు. కాని అది కుదరదు.
సూత్రం :- 197
" నా సతో దృష్ట త్వాత్ "
అదృష్టత్వాత్ :- కనిపించని, అసతః..అభావం నుంచి, న :- భావోత్పత్తి కాదు.
భావం :- కనిపించని అభావం నుంచి భావోత్పత్తి కలగదు.
వివరణ:-అసత్తు అభావం నుండి పుట్టదు. బౌద్ధమతంలో స్థిరమైనది ఏది లేదు. సర్వమూ క్షణికమే. విత్తనం నుండి మొలక పుడుతుంది. అంటే విత్తనం తన రూపాన్ని కోల్పోయి అభావం పొందుతుంది. తరువాత అంకురం వస్తుంది. కాబట్టి బీజం యొక్క అభావభావం నుండి అంటే లేకపోయిన దానినుండి వస్తువు పుడుతోంది అని వారి వాదం. అభావం నుండి భావం ఎప్పుడు పుట్టదు. లేని వస్తువు నుండి ఉన్న వస్తువు ఎలా పుడుతుంది? అభావానికి కారణమయ్యే శక్తి ఉండదు. కుందేటి కొమ్ము నుండి ఏమి పుట్టదు. బీజం నశించినప్పుడు కూడా అందులోని బీజవాయువులే అంకురానికి కారణమౌతాయి. అంతేకాని పప్పుబద్దల్లగా ఉండే బీజదళాల నాశనాన్ని చూసి అంతా నశించిపోయిందని అనుకోవడం తప్పు. భావ పదార్ధాలన్ని భావాల నుంచి జనిస్తాయి. ఇది మన నిత్యానుభవం. అభావం నుంచి భావం ఏర్పడుతుందనే సిద్ధాంతం అంగీకారం కాదు. శూన్యం నుంచి ఏ పదార్ధం ఉత్పత్తి కాదు. బౌద్ధులు అభావం నుండి భావం పుడుతుందని స్పష్టం చేశారు. మట్టిని నశింపజేసి నప్పుడే ఘటం పుడుతుంది. నశించిన బీజం నుండి అంకురం వస్తుంది. నశించిన క్షీరం నుండి పెరుగు వస్తుంది.కనుక భావం అభావం నుండి పుడుతుందని సౌగతులు భావిస్తున్నారు.ఏ కూటస్థ వస్తువు (నశించకుండ ఉండి నిత్యమైన) స్వరూప వినాశనం లేకుండా కారణం కాజాలదు. కాబట్టి అభావం నుండి భావం పుడుతుంది అని ఏది చెప్పబడిందో, అది అసమంజసం. ఎందువలననగా స్థిరమైన స్వభావం గల సువర్ణాదుల నుండి సత్పదార్ధాలు పుట్టడం కనబడుచున్నది. అసత్యపదార్ధాల నుంచి సత్పదార్ధాలు పుట్టడం కనబడటం లేదు. గాన అభావం నుంచి భావం పుట్టడం జరగదు. మరొక విషయమేమంటే, నాలుగు భూతాల చేత చిత్త, చైత్తాలు పుడతాయని పరమాణువుల నుండి భూత భౌతిక రూపమైన సముదాయం పుడుతుందని అంగీకరించి, మళ్ళీ అభావం నుంచి భావం పుడుతుందని కల్పించి తాము అంగీకరించిన విషయాన్నే కప్పిపుచ్చుచున్న వైనాశికుల వాాదన సమంజసం కాదు.
సూత్రం :- 198
" ఉదాసీనానా మపి ఛైవం సిద్ధః "
ఏవంచ :- అభావం నుండి భావం వస్తుందని, ఒప్పుకుంటే, ఉదాసీనానామ్ అపి :- ఏ ప్రయతం చెయ్యకుండా ఊపేక్ష వహించేవాడికి కూడా, సిద్దః :- కార్యసిద్ధి కలగాలి కదా!
భావం :- అభావం నుంచి భావం వస్తుందని ఒప్పుకుంటే, ఏ ప్రయత్నం చెయ్యకుండా ఊపేక్ష వహించేవాడికి కూడా కార్యసిద్ధి కలగాలి కదా!
వివరణ :- అభావం నుంచి భావం పుడుతుందనేది అబద్ధం. ఈ మాటే కనుక నిజమైతే వ్యవసాయం చెయ్యవలసిన అవసరం లేదు. పొలం దున్నడం, విత్తనాలు నాటడం, మొదలైన పనులు చెయ్యకుండానే పంటలు పండాలి, ఫలితాలు లభించాలి. ఇంట్లో కూర్చుని కోరుకుంటే చాలు కోరికలు నెరవేరాలి. ఈరకంగా కష్టపడకుండా కోరికలు తీరితే కర్మ చెయ్యవలసిన పనే ఉండదు. స్వర్గనరకాలు ఉండవు. అందువలన అభావం నుంచి భావోత్పత్తి కలుగుతుందనడం యుక్తం కాదు. కారణ నాశనం అంటే అభావం వల్ల భావోత్పత్తి అని అర్ధం కాదు. కారణ అభావం కాదు. అభావం వలన కార్యం ఉత్పత్తి కాదు. కారణం అభావం అయితే కార్యం జనించదు. విత్తు నుంచి మొలకెత్తడం అనే క్రియ అంటే అభావం వలన భావోత్పత్తి అని అర్ధం కాదు. అలా అయితే వేపవిత్తనం నశించి వేప మొలక, మామిడి విత్తనం నశించి మామిడి మొక్క ఉద్భవించవు. విత్తనాలలో తేడా ఉన్నది కాని వాటి నాశనంలో తేడా లేదు కదా! నాశనం అభావం అయితే ఆ భావంలో భేదం ఉండదు. భావాలకు విశేషణాలు ఉంటాయి. నీలంరాయి, ఎరుపురాయి.. ఇలాగ అభావానికి విశేషణాలు ఉండవు. విత్తనాలు నశించి మొలకత్తడం అంటే రూపాంతరం చెందడం అని గ్రహించాలి. కనుక అభావం నుంచి భావం జన్మిస్తుండనేది సమాంజసం కాదు.
అభావాధికరణం ( 2, 2, 28 )
సూత్రం :- 199
" నాభావ ఉపలబ్ధే "
ఉప లబ్ధే :- ప్రమాణమలున్నందు వలన, అభావహ :- ఉనికి లేదు అనడం, న :- చెల్లదు,
భావం :- ప్రత్యక్షది ప్రమాణాల వలన పదార్ధములు గొచరిస్తున్నాయి. అందుచేత స్వయంగా సిద్ధించే పదార్ధాలు అభావం అనడం తగదు.
వివరణ:-ఈఅధికరణంలోయోగాచారుల(బౌద్ధుడు) మతాన్ని ఖండిస్తున్నారు. యోగాచారులమతం ప్రకారం బాహ్య పదార్ధాలేవి లేవు. విజ్ఞాన మనేది ఒక్కటే ఉన్నది. క్షణిక విజ్ఞానమే పరమార్ధం అని అంటారు. ఆ విజ్ఞానమే అనాది వాసనల వలన బాహ్య ఆకారములలోభాసిస్తుంది. తప్ప బయట పదార్ధాలు లేవు అని అంటారు. మనకు కనిపించే ఎరుపు, తెలుపు, నీలము రంగున్ని విజ్ఞానం యొక్క ఆకార వికారాలే. ఈ విధంగా సర్వత్రా విజ్ఞానమే బాహ్య ఆకారాన్ని పొందుతున్నదని వీరి వాదన. ప్రత్యక్షాది ప్రమాణముల వలన బాహ్య వస్తువులు లభిస్తుండగా విజ్ఞానాన్ని మించి మరొకటి లేదనడం, యుక్తం కాదు. బాహ్యర్ధాలు లేని పక్షంలో ప్రమాణాల వలన అది లభించకూడదు. ప్రమాణాలు కూడా విజ్ఞానమే అంటారా? అప్పుడు విజ్ఞానానికి లభించే బాహ్యపదార్ధాలను ఎలా కాదంటారు? ఫలానా వస్తువుల లబ్ది నాకు కలుగుతోంది అంటారు. కాని విజ్ఞానం కలుగుతోందని ఎవరు అనరు. కనుక బాహ్యర్ధాలు లేవు. కేవలం విజ్ఞానమే పరమార్ధం అనడం యుక్తం కాదని తెలుస్తోంది. విజ్ఞానం కన్నా ఇతర పదార్ధాలేవి లేవనేది నిజం కాదు. బాహ్య పదార్ధాలు గోడ, కుండ, వస్త్రం లాంటివి కంటికి కనిపిస్తాయి. అలాంటప్పుడు విజ్ఞానం తప్ప ఇతర వస్తువులు లేవనడం సరికాదు. ఏ విజ్ఞానవాదంలో ప్రమాణం, ప్రమేయం, ఫలం అనే సమస్త వ్యవహారము కూడా బుద్ధిని అధిష్టించిన రూపంలో లోపలనే ఉన్నట్లుగా కుదురుతుంది. బాహ్యఅర్ధం ఉంది అని అంగీకరించినా కూడా అది బుద్ధిలో ప్రవేశిస్తే తప్ప ప్రమాణాది వ్యవహారం జరగదు కదా! ఘటం మొదలైన వస్తువుల జ్ఞానం కలిగినప్పుడు నాలుగు అంశాలు ఉంటాయి. ప్రమాత, ప్రమేయం, జ్ఞానం, ఫలం. ప్రమాత:- గ్రహించేవాడు, ప్రమాణం:-చక్షురాదికం, జ్ఞానం: చక్షురాదులకు పదార్ధంతో కలిగినప్పుడు కలిగేది. ఆ వస్తువు తెలియడం, నైయాదికాదులు సాధారణంగా ఏదైనా విషయాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఉదాహరణగా ఘటం, పటం మొదలైనవి చూపుతారు. బౌద్ధులు నీలం, పీఠం ఇత్యాదులు చూపుతారు. నీలం అనగా నల్లని వస్తువు. పీతం అనగా పచ్చని వస్తువు. విజ్ఞానవాదుల ప్రకారం నీలం పీతం మొదలైన రంగులతో కూడినదే ప్రమేయం అంటే కళ్ళతో చూడబడినది అవుతుంది. అది జ్ఞానానికి ఫలం. విజ్ఞానంలోని శక్తికి గ్రహించేవాడు ప్రమాత. ఇవన్నీ విజ్ఞానంలో కల్పించిన బేధాలు. వాస్తవంలో విజ్ఞానం తప్ప పదార్ధంగాని, ప్రమాణం గాని దానిని తెలుసుకొనడం గాని, తెలుసుకునేవాడు గాని, ఇవేమి లేవు. భేదకల్పన చేత వ్యవహారం అంతా జరుగుతుంది. అనుభవం జ్ఞానం, అనుభవం అంటే ఒక విషయాన్నీ తెలుసుకోవడం, ఆయా వస్తవులు వేరయినా వాటి జ్ఞానం మాత్రం సాధారణమైనదే. ఆజ్ఞానం శుద్ధజ్ఞానరూపంలో కలుగదు. దానిలో ఏదో విషయం భాసిస్తూనే ఉంటుంది. స్తంభ జ్ఞానం, ఘటజ్ఞానం, మొదలైన వాటిలో జ్ఞానమే విషయం రూపంలో కప్పి ఉన్నట్లుగ కనిపిస్తుంది. అంటే విషయం జ్ఞానంలో ఉందని అర్ధంఔతుంది. అలాంటప్పుడు విషయం వెలుపల ఉందని కల్పించడం అనవసరం. జ్ఞానమే విషయాకారంలో కనిపిస్తుందని అర్ధం. జ్ఞానము, జ్ఞయము రెండు కలిసే ఉంటాయి. వీటిలో ఒకటి తెలియబడనప్పుడు మరొకటి తెలియబడదు. జ్ఞయము అంటే తెలుసుకోద గినది. ఈ రెండు వేరు వేరు వస్తువులైతే ఈ విధమైన అవినాభావం యుక్తం కాదు. ఎందువలనంటే క్షణికమైన జ్ఞానానికి విషయంలో సంబంధం కలగడానికి హేతువేది లేదు. అందువల్ల కూడా బాహ్య పదార్ధం లేదు. ఇది స్వప్నదుల వంటిదని చుచుకోవాలి. స్వప్నము, మాయ, ఎండమావులలో నీరు, గంధర్వ నగరం (ఆకాశం మీద ఏదో పెద్ద నగరం ఉన్నట్లు ఇంద్రజాలాల చేత చూడబడే నగరం. ఈ జ్ఞానాలు బాహ్యమైన వస్తువు ఏది లేకపోయినా కూడా గ్రాహ్యం గాను (తెలియబడేది) గాను, గ్రహనం (తెలుసుకునేది) గాను ఏ విధంగా ఉంటున్నాయో (స్వప్నధులలో జ్ఞానం తప్ప బాహ్యపదార్ధాలేవి ఏ విధంగా ఉండవో), జాగ్రదావస్థకు చెందిన స్తంబాది జ్ఞానాలు కూడా ఈ విధంగానే ఉంటాయని తెలుస్తుంది. అదిజ్ఞానమే, ఇదీజ్ఞానమే. బాహ్యఅర్ధం లేకపోతే జ్ఞానాలలో వైచిత్య్రం (వైవిద్యం ) ఎలా కలుగుతుంది. ఈ విధంగా బాహ్యార్ధం లేదని నిర్ణయించడం శక్యం కాదు.
సూత్రం :-200
" వైదర్మ్యా శ్చ న స్వప్నదివత్ "
భావం :- వై ధర్మ్యత్ :- విరుద్ద ధర్మాలుండటం చేత, స్వప్నాదివత్ చ :- స్వప్నంలో ఉండే, పదార్ధాల లాగా, బాహ్య పదార్ధాలు కూడా అభావం అనడం, న :-సరిఅయినది కాదు.
భావం :- స్వప్నంలో అర్ధాలు లేకపోయినా ఆయా వాసనా జ్ఞానమే ఆరు పదార్ధాల ఆకారాలు పొంది మనకు లభిస్తున్నట్లు గాని, జాగ్రదావస్థలో కూడా ఘట, పటాది వస్తువులు బయట లేకపోయినా ఆయా పదార్ధాల వాసనా జ్ఞానమే ఆయా వస్తు రూపంలో భాసిస్తోంది. కనుక విజ్ఞానాన్ని మించి బాహ్య పదార్ధాలు ఏవి లేవని తెలుతోంది కదా! అంటే విరుద్ద ధర్మాలుండటం చేత స్వప్నంలో ఉండే పదార్ధాలా లాగా బాహ్య పదార్ధాలు కూడా అభావం అనడం సరిఅయినది కాదు.
వివరణ :- స్వప్నావస్థకు, జాగ్రదావస్థ కు భేదం లేదు. స్వప్నంలో కనిపించిన వస్తువుల్లాగా జాగ్రదావస్థలో కూడా విజ్ఞానం తప్ప ఇతర పదార్ధాలేవి లేవు అనే వాదన తప్పు. యోగాచార్యులు జాగ్రదావస్టలో ఉన్నవేవి కూడా విజ్ఞానం కన్నా భిన్నమైనవి తెలుసుకోదగినవి కావు. జాగ్రదావస్థ... స్వప్నావస్థలోని విజ్ఞానం లాంటిదే అన్నారు. స్వప్నానికి జాగ్రదావస్థకు పోలిక లేదు. కలలో కనిపించే వస్తువు మెలకువ రాగానే కరిగిపోతుంది. కాని జాగ్రదావస్థలో అలాకాదు. ఈ వస్తువులు అలాగే ఉంటాయి. అందరికి ఉన్నట్లుగానే కనిపిస్తాయి. స్వప్నంలో మన ఒక్కరికే కనిపిస్తాయి. కలలో కనిపించినదానికి, అనుభవానికి కారణం ఆసంఘటనలు గుర్తు ఉండటం. కాని జాగ్రదావస్థలో ప్రత్యక్షంగా అనుభవం ఉంటుంది. వస్తువులను చూస్తున్నాం, తాకుతున్నాం, అందరికి చూపిస్తున్నాం. మరొకరికి ఇస్తున్నాం. ఈ రకంగా జాగ్రదావస్థ, స్వప్నావస్థలలో తేడా ఉంది. స్వప్నావస్థ లాంటిదే జాగ్రదావస్థ అనడం తప్పు. మాయాదులలో కూడా ఈవిధంగానే తగు బాధ కలగడం కనబడుతుంది. అయితే జాగ్రదావస్థలో కలిగే దర్శనం అనుభవం. వస్తువు దూరంగా ఉండటం, దగ్గరగా ఉండటం, అనే స్మృతికి ప్రత్యక్షజ్ఞానానికి ఉన్న భేదం స్వయంగానే తెలుస్తుంది. ఇప్పుడైనా పుత్రున్ని స్మరిస్తున్నాను. వానిని చూడటం లేదు. అతను కనబటం లేదు. కాని చూడాలని కోరుకుంటున్నాను అని స్మరించేవాడు అనుకుంటాడు. అలాంటప్పుడు ఈ రెండింటికి ఉన్న భేదాన్ని గుర్తించిన వాడు, జాగ్రదావస్థలో జరిగేది సత్యం. స్వప్నంలో జరిగేది అసత్యం అని గ్రహించాలి. జాగ్రదావస్థలో విషయములైన బాహ్య పదార్ధాలేవి లేకుండానే కలుగుతాయి అని చెబితే అనుభవానికి విరుద్ధంగా ఉంటుందని శంకించి, అలా చెప్పడానికే స్వప్నప్రత్యయాలతో సామ్యం చూపించి అలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. వీటిలో వైరుధ్యం చూపినంత మాత్రాన వేడిగా ప్రత్యక్షంగా కనబడుతున్న అగ్ని చల్లగా ఉండదు కదా..అందువలన విరుద్ధ ధర్మాలుండటం చేత స్వప్నంలో ఉండే పదార్ధాల వలె బాహ్యపదార్ధాలు అభావం అనడం సరియైనది కాదు.
అభావాధికరణం ( 2, 2, 30 )
సూత్రం :- 201
" నా భావో నుప లబ్దిహ్ "
అనుపలబ్ధేః :- సిద్ధం కాకపోవడం చేత, భావః :- భావం, న :- అస్తిత్వం లేనిది అని అనడం తగదు.
భావం :- పదార్ధాలు ఉన్నప్పుడు వాటి వలన జ్ఞానం కలుగుతుంది. ఆజ్ఞానం వలన వాసనలు, సంస్కారాలు ఏర్పడతాయి. అది లేకపోవడం వలన స్వప్నగత పదార్ధాలు వెంటనే నశిస్తాయి. ఇది భావ పదార్ధాలకు వర్తించదు. ఈ కారణముల వలన భావ పదార్ధాలకు అస్తిత్వం లేదనడం వాస్తవ విరుద్దం.
వివరణ :- యోగాచారుల ప్రకారం బాహ్య పదార్ధాలు లేవు. కాబట్టి వాటి వచ్చే వాసనలు కూడా ఉండవు అంటారు. వీరి మతానుసారం బాహ్య పదార్ధాలు లేవు. కాబట్టి వాసనలు, సంస్కారాలు, కూడా జనించవు. వాటి అనుభవం కూడా ఉండదు. అనుభవం ఉంటేనే గాని వాసనలు, సంస్కారాలు, జనించవు. కాబట్టి వాసనా వైచిత్య్రం వలన జ్ఞాన వైచిత్య్రం కలుగుతుంది అనడం సరిఅయినది కాదు. వాసన లేనప్పుడు దాని వలన జ్ఞానం కలగడం అసంభవం. అర్ధాల ( వస్తువుల ) జ్ఞానాన్ని నిమిత్తంగా చేసుకొని ప్రతి వస్తువు విషయంలోనూ అనేక విధాలైన వాసనలు కలుగుతుంటాయి. ఆ వస్తువులే తెలియకపోతే విచిత్రమైన వాసనలు దేనిని నిమిత్తంగా చేసుకొని బయలుదేరాతాయి? అనాదిత్వం ఉన్న కూడా అంధ పరంపర న్యాయం చేత ప్రతిష్ట లేని, వ్యవహారానికి లోపం కలిగించే వ్యవస్థ ఏర్పడుతుంది. కాని వారు అనుకున్నది సిద్ధించదు. అంధ పరంపర న్యాయం అంటే ఒక గ్రుడ్డివాడు మరొక గ్రుడ్డివాడి మీద ఆధారపడడు. దాని వలన వారి వాదానికి బలం చేకూరదు. వాసనలు లేకపోయినా లోకంలో ఆయా అర్ధాల (వస్తువుల) జ్ఞానం కలుగుతుంది. అర్ధం యొక్క జ్ఞానం లేకుండా వాసనలు పుడతాయాని అంగీకరించడం కుదరదు. వాసనలు అనగా ఒక విధమైన సంస్కారాలు. ఆశ్రయం లేకుండా సంస్కారాలు ఉండవు. వారి వాదన ప్రకారం వాసనలకు ఆశ్రయమైన వాడు లేడు. బాహ్య పదార్ధాలు లేవు. అందుకే వాసనలకు ఉనికి లేదు.
సూత్రం :-202
" క్షణికత్వాచ్చ "
చ :- అంతే కాక, క్షణి కత్వాత్ :- క్షణిక విజ్ఞాన వాదం సిద్ధించడం లేదు.
భావం :- ఇది ఘటం, ఇది పటం అనే జ్ఞానం ప్రవృత్తి విజ్ఞానం, నేను, నేను అనే జ్ఞానం ఆలయ విజ్ఞానం. మొదటిది వాసనకు కారణం అని, రెండవది వాసనకు ఆశ్రయమని క్షణికవాదులంటారు. వస్తువే లేనప్పుడు వాసనకు ఆశ్రయం కాజాలదు. క్షణికం అయినప్పుడు కారణం కాలేదు. ఆయా వాసనలు ఉండే విజ్ఞానమే పదార్ధాల ఆకారంలో కనిపిస్తోందని, వేరుగా పదార్ధాలు ఏమి లేవని చెప్పడం యుక్తం కాదు.
వివరణ :- ఆలయ విజ్ఞానం కూడా క్షణికం అన్నారు కాబట్టి అది కూడా వాసనలకు ఆశ్రయం కాలేదు. ఆలయ విజ్ఞానం అంటే ఈ మతంలో నేను నేను అంటే అహం, ఇహం అందరికి ఎప్పుడూ అన్వయించే జ్ఞాన పరంపర. ఇటువంటి ఆలయ విజ్ఞానమే వాసనాలకు ఆశ్రయం అని శూన్యవాదులంటారు. వీరు నేను అనే జ్ఞానం కూడా క్షణికమే అంటారు. అహం ఇహం ఆలయ విజ్ఞానం, నీల పీతాది విజ్ఞానం ప్రవృత్తి విజ్ఞానం. మూడు కాలాలకు సంబంధించి కార్యాలాన్నింటిలోకి అన్వయించే ఒక వస్తువు లేకపోతే, లేదా సకల పదార్ధాలను చూడగలిగే ఒక కూటష్టమైన వస్తువు లేకపోతే దేశాన్ని కాలాన్ని, ఇతర నిమిత్తలను ఆపేక్షించే వాసనలు పుట్టించడం, స్మృతి, ప్రత్యభిజ్ఞ మొదలైన వ్యవహారం సంభవించదు. శూన్యవాదంలో ఉండే దోషాలు :- బ్రహ్మ విద్యా భరణకారులు ఈ విధంగా సూచిస్తున్నారు. శూన్య తత్వం అన్నప్పుడు శూన్యం అనేదానికి సకల ప్రపంచాతీతమైన ఒక భావ రూప పదార్ధం అని అర్ధమా? లేక అభావ రూపమనియా? మొదటిది కుదరదు. భావరూపమని అంగీకరిస్తే వేరు మాటలతో బ్రహ్మవాదాన్ని అంగీకరించినట్లు అవుతుంది. రెండవ పక్షం అభావరూపం ప్రమాణ విరుద్ధం కనుక యుక్తం కాదు. సకల ప్రమాణాల చేత ప్రపంచం ఉన్నట్లుగా తెలుస్తుంటే దానిని అభావమని ఎలా చెబుతారు. ప్రపంచ జ్ఞానం భ్రాంతి అనడం కుదరదు. ప్రపoచజ్ఞానం భ్రాంతి అన్నప్పుడు దానికి అధిష్టానమైన దానిని సత్యమని చూపించాలి. అదేది లేదంటున్నారు. అలాంటప్పుడు భ్రాంతి అనడం ఎలా కుదురుతుంది? అభావమే అధిష్టానం అనడం కుదరదు. అభావానికి ప్రతియోగి, అనుయోగిల ఆపేక్ష ఉంటుంది. ఘటం అభావం అన్నప్పుడు ఆ అభావానికి భూతలం అనుయోగి, ఘటం ప్రతి యోగి. అనుయోగి అంటే ఒక దానిని మరొక దానితో పోలిక చెప్పినప్పుడు దేనికి పోలిక చెప్పబడుతుందో అది అనుయోగి, దేనితో చెప్పబడుతుందో అది అనుయోగి. ఉదా:-ముఖాన్ని చంద్రబింబంతో పోల్చినప్పుడు, ముఖం అనుయోగి, చంద్రబింబం ప్రతియోగి. ఆ విధంగా ఈఅనుభవానికి అనుయోగి ఏది? అందుచేత వేదాంతులు బ్రహ్మను సర్వనిషేధములకు అధిష్టానంగా గ్రహించినట్లు శూన్యవాది కూడా ఏదైనా ఒక నిత్యమైన, సత్యమైన తత్వాన్ని చూపగలిగితే అది యుక్తంగా ఉంటుంది. అలా చూపలేదు. కనుక ఇది ప్రమాణ విరుద్ధం. బౌద్ధమతంలో నాలుగు వాదాలున్నాయి. వైభాషికులు, సౌత్రాంతికులు, యోగాచారులు, మాధ్యమికులు(శూన్యవాదులు) అనే నలుగురు నాలుగు వాదాలు అంగీకరించారు. వారిలో వైభాషికులు బాహ్యవస్తువులు ఉన్నాయి. అవి క్షణికలు. వాటిని ప్రత్యక్షప్రమాణాల చేత తెలుసుకోవచ్చును అని అంగీకరిస్తారు. సౌత్రంతికులు కూడా క్షణికాలైన బాహ్యపదార్ధాలను అంగీకారిస్తారు. కాని అవి ప్రత్యక్షములు కావు. అనుమానం చేత తెలియబడతాయంటారు. ఇంద్రియలకు విషయాలకు సంబంధం ఏర్పడినప్పుడు విషయం పుట్టే జ్ఞానంతో బాహ్యవస్తువులు ఉన్నాయని అనుమానం చేత తెలియబడుతుంది. అంతే కాని చక్షురాదులు బాహ్యార్ధాలను గ్రహించవు. వీరిద్దరూ బాహ్య వస్తువులు ఉన్నాయని అంగీకరించడంలో మత భేదం లేదు. యోగాచారుల ప్రకారం బాహ్యపదార్ధాలులేవు. వాటి వలన వచ్చే వాసనలు, సంస్కారాలు,అనుభవాలు ఏమి ఉండవు. బాహ్యపదార్ధాలు లేకపోయినా వాసనావైచిత్ర్యం వలన జ్జాన వైచిత్ర్యం కలుగుతుందని అంటారు. వీరందరి వాదనలు సమంజసం కావని , బ్రహ్మ చైతన్యంతోనే సృష్టి జరుగుతుందని వ్యాసమహర్షి వారి వాదనలను తీవ్రంగా నిరసించారు.
సూత్రం :-203
" సర్వథా నుపపత్తేశ్చ "
సర్వథా:-అన్నిరకాలుగా, అనునుపత్తేః చ:- హేతుబద్ధం కానందు వలన కూడా క్షణికవిజ్ఞానవాదం అంగీకరించదగినది కాదు.
భావం:- ప్రత్యక్షంగా బాహ్యపదార్ధాలు కనిపిస్తున్నాయి కదా! వాటిని ఎలా లేవంటారు? అందుకే అన్ని రకాలుగా హేతుబద్ధం కానందువలన కూడా క్షణికవిజ్ఞానవాదం అంగీకరించదగినది కాదు.
వివరణ:-ఏవిధంగా చూసినా బౌద్ధదర్శనం ఆమోదం యోగ్యం కాదు. వీళ్లు చెప్పిన బాహ్యర్ధవాదం, విజ్ఞానవాదం, శూన్య వాదం ఇవి యుక్తం కావు. అవి పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. కనుక ఈమతం అంగీకారం కాదు. జ్ఞానానికి విషయాలు అర్ధాలే అంటే వస్తువులే. వస్తువులు లేకపోతే విజ్ఞానమేలా కలుగుతుంది? కనబడుతున్న ప్రతి జ్ఞానంలోనూ స్థంభం, గోడ, కుండ, వస్త్రం అన్ని బాహ్యంగా కళ్ళకు కనిపిస్తుంటే, బాహ్యర్ధం లేదని నిర్ణయించడం శక్యం కాదు. కనబడుచున్న దానితో అభావం ఉండదు కదా! దానిని లేదనడం యుక్తం కాదు. భోజనం చేస్తున్న ఒకడు, భోజనం వలన కలిగిన తృప్తిని స్వయంగా అనుభవిస్తూనే నేను తినడం లేదు, తృష్ణ పొందడం లేదు, అని అంటే ఎలా ఉంటుందో, ఇంద్రియ సంబంధం చేత బాహ్యర్ధాన్ని స్వయంగా తెలుసుకుంటూనే నాకు బాహ్యర్ధం ఏది తెలియడం లేదు. అది అసలు లేనే లేదు అని అనడం కూడా అలాగే ఉంటుంది. అన్ని విధాలా కుదరక పోవడం వలన కూడా ఆదరణీయం కాదు. వైనాశిక విషయంలో ఏమైనా కారణం ఉన్నాదా అని అన్ని విధాలా పరీక్షించిన కొలది అన్ని విధాలా ఇసుక నెలమీద నుయ్యి ఒక ప్రక్క నుండి త్రవ్వితే, మరొక ప్రక్క నుండి కూలిపోయినట్లు కూలిపోతూనే ఉంటుంది. దీనిలో ఏ మాత్రం ఉపపత్తి అంటే కారణం కనబడటం లేదు. అందువల్ల కూడా వైనాశిక వ్యవహారం అసంగత మైనది.
నైకస్మిన్నసంభవాధికరణం ( 2, 2, 33 )
సూత్రం :- 204
"నైక స్మిన్న సంభవాత్ "
క్షణికవాదమైన బౌద్ధమతాన్ని నిరాకరించిన మహర్షి ఇప్పుడు జైనమతం "అనేకాంతవాదాన్ని" తిరస్కరిస్తున్నారు. అసంభవాత్:-అసంభవం కనుక, ఏకస్మిన్:- ఒకే పదార్ధంలో, న:-పరస్పర విరుద్ధమైన అస్తిత్వం, నాస్తిత్వలక్షణాలు ఉండనేరవు.
భావం :- ఒకే పదార్ధంలో పరస్పర విరుద్ధమైన అస్తిత్వం, నాస్తిత్వం లక్షణాలు ఉండవు.
వివరణ :- ఒకే వస్తువులో ఒకే సమయంలో విరుద్ధమైన రూపాలు, ధర్మాలు ఉండవు. ఉన్న పదార్థాన్ని లేదనడానికి, లేని పదార్ధాన్ని ఉందనడానికి ఎలా వీలవుతుంది. విషయాన్ని చెప్పేటప్పుడు ఫలానా అని నిర్ధారణ చెయ్యకపోతే అది ప్రమాణం కాదు. జైనమతం ఏవిషయాన్ని ఖచ్చితంగా చెప్పదు. ఘటంలో ఘటత్వం, ఉంటే అఘటత్వం ఉండదు. ప్రవృత్తి, నివృత్తి ఒకే కాలంలో ఉండవు. కనుక అనేకాంతవాదం అసంగతం. ఈశ్వరుడి ప్రసక్తిలేకుండా పరమాణువులు మూలంగా పృధివ్యాదులు ఏర్పడతాయని సముదాయవాదులు అంటున్నారు. అలాగే క్రియాశక్తివంతాలైన పరమాణువుల వలన జగదుత్పత్తి కలుగుతుందని అనేకాంతవాదులు అంగీకరిస్తారు.ఇద్దరి మతంలోనూ సంఘాతమే ఉత్పత్తి. అనేకాంతవాదులు జగత్తులో ఉన్న పదార్ధాలను రెండు రకాలుగా విభజించారు.
1. జీవులు:- వీరు శుభ, అశుభ కర్మలను ఆచరించి, వాటి ఫలితాలను సుఖ, దుఖ రూపంలో అనుభవిస్తారు. శరీరాన్ని అనుసరించి పరిణామంచెందే స్వభావం ఉన్నవాడు కనుక శరీరపరిమాణం ఉన్నవాడు జీవుడు. జ్ఞానాది కర్మలను ఆచరించే భిన్నుడు, అభిన్నుడు కూడా జీవుడే.
2. అజీవులు :- అలాంటి జీవుల భోగానికి తగిన పదార్ధాలాన్ని అజీవులే.
ఇలా రెండు విధాలైన ఈ పదార్ధాలను కొందరు 5 రకాలుగా విభజిస్తారు. అవి 1. జీవాస్తి కాయం, 2. పుద్గలాస్తి కాయం,
3. ధర్మాస్తి కాయం, 4.అధర్మాస్తి కాయం, 5. ఆకాశాస్తి కాయం.
1. జీవాస్తి కాయం :- ఇది 3 విధాలు,
1. బద్ధుడు :- ఒక జన్మ నుంచి మరొక జన్మ పొందుతూ ఉండేవాడు సంసార బద్ధుడు,
2. ముక్తుడు :- తపస్సు చేసి ముక్తిని పొందేవాడు ముక్తుడు.
3.నిత్య సిద్ధుడు :- నిత్య యోగి సిద్ధుడే, అతడే ఈశ్వరుడు.
2. పుద్గలాస్తి కాయం :- రూప, రస, గంధ, స్పర్శ గుణాలున్న సంఘాతం, సముదాయం గల స్వరూపమున్నదే పుద్గలాస్తి కాయం. ఇవి పృద్వి, జలం, అగ్ని, వాయువు, స్థావరం (చెట్ల వంటివి), జంగమం (చేతన శరీరలు)అని ఆరు రకాలు. ఈ పుద్గలాస్తి కాయాన్నే ద్రవ్యవిభాగ సమయంలో స్కంధమం అంటారు. ద్రవ్యపదార్ధాలు స్కంధాలు, పరమాణువులు అని రెండు రకాలు, ఇవి జీవుల భోగాలకు యోగ్యాలు.
3. ధర్మాస్తికాయం:- ఇది చక్కటి శాస్త్రియ బాహ్య ప్రవృత్తితో ఊహించ గలిగేది. ఉత్తమ బాహ్య ప్రవృత్తి గుండా లోపల ఉండే ధర్మాన్ని ఉహిస్తాం కదా! ఊర్ధ్వగమనాశీలుడే జీవుడు.
4. అధర్మాస్తికాయం:- ఈశరీరంలో ఉండటాన్ని బట్టి, ధర్మాధర్మాలు జీవుడి గతిని అడ్డగిస్తాయి. వీటి వలన జీవుడు శరీరంలో ఉంటాడు. లేని పక్షంలో అతనికి ఊర్ధ్వగతి కలుగుతుంది.
5. ఆకాశాస్తి కాయం:- ఇది 2 రకాలు. 1.లోకాకాశం: పైపైన ఉండే లోకాల్లో ఉండేది.
2. ఆలోకాకాశం: ఆ లోకాలన్నింటి కన్నాపైన ఉండేది ఆలోకాకాశం. అందులో లోకాలు ఉండవు.
ఈ పదార్ధాలన్నీ మోక్షానికి ఉపయోగపడతాయని కొందరు వీటిని 7 విధాలుగా వ్యవహారిస్తారు. అవి జీవం, అజీవం, ఆస్రవం, సంవరం, నిర్జరం, బంధం, మోక్షం, కొందరు ధర్మం, అధర్మం కలిపి 9 తత్త్వాలని అంటారు.
షడ్దర్శన సమచ్చయం 47) :- హరిభద్ర సూరి దీనిని వివరించాడు. వీటిలో జీవ, అజీవ ( పుణ్య, పాప ) ధర్మ, అధర్మాలు. విషయాల పట్ల కరిగే ఇంద్రియ ప్రవృత్తే ఆస్రవం. ఇది పురుషున్ని స్రవించేటట్లు చేస్తుంది. ఇంద్రియాల గుండా విషయాన్ని స్పృశించి రూపాదిజ్ఞానరూపంలో పరిణమిస్తుంది.దీనినే మిధ్యాప్రవృత్తి అంటారు. ఈమిధ్యా ప్రవృత్తిని నిరోధించే యమ నియమాది సమ్యక్ ప్రవృత్తే సంవరం. ఇది పురుషజ్యోతి స్రవించే మార్గన్ని మూసి ఉంచుతుంది. అనాదికాలం నుండి సంక్రమించే కల్మషాన్ని, పుణ్యపాపాలను నాశనం చేసే తపస్సు, జపం, ధ్యానం లాంటి వాటిని నిర్జరం అంటారు. ఇది పాపకర్మలను నాశనం చేస్తుంది.
బంధం:- జ్ఞానావరణం, దర్శనావరణం, మోహనీయం, ఆంతర్యం అనేవి నాలుగు ఘాత కర్మలు, వేదనీయం, నాయికం, గోత్రికం, ఆయుష్కం అనేవి నాలుగు అఘాత కర్మలు. ఇవి పురుషున్నీ బంధిస్తాయి. కనుక వీటిని బంధం అంటారు.
జ్ఞానావరణం అంటే సమ్యక్ దర్శనం మోక్ష హేతువు కాదు. దాని వల్ల వస్తువు సిద్ధించదు అనే విపరీత జ్ఞానమే జ్ఞానావరణం.
దర్శనావరణం:- నిత్య సిద్ధులు వ్రాసిన శాస్త్రాలను అభ్యసించడం వలన మోక్షం కలుగదు అనే జ్ఞానం దర్శనావరణం.
మోహనీయం:- పెద్దలు ఉపదేశించిన మోక్ష మార్గాల్లో విశ్వాసం లేకపోవడం.
ఆంతర్యం :- మోక్షమార్గంలో ప్రవర్తించే వాళ్లకు ఆటంకాలు కలిగించే జ్ఞానం.
ఇవన్నీ శ్రేయో మార్గానికి విఘాతం కలిగిస్తాయి. కనుక ఇవి ఘాత కర్మలు.
వేదనీయం :- నాకిది తెలియవలసినదే అనే అభిమానం.
నామికం :- నా పేరు ఇది అనే అభిమానం.
గోత్రకం :- నేను ఇతని శిష్య పరంపరలో చేరాను అనేది గోత్రకం.
ఆయుష్కం :- శరీర యాత్ర కోసం చేసే కర్మ.
ఈ 4 సమ్యక్ దర్శనాలకి విఘాతం కలిగించవు.వీటిని అఘాతి కర్మలు అంటారు.
జీవుడిలో అన్ని క్లేశాలు, వాటి వాసనలు నశించి నప్పుడు సమ్యక్ దర్శనం చేత ఆత్మ ఆలోకకాశం చేరడమే మోక్షం అని కొందరు అంటారు. సదా ఊర్వగమన శీలం ఉన్న ధర్మ, అధర్మాస్తి కాయంతో బద్ధుడైన జీవాత్మను సమ్యక్ దర్శనం ద్వారా విడుదల ఏర్పడి, ఆలోకకాశంలో కలిగే నిరంతర ఊర్ధ్వ గమనమే మోక్షం అని మరికొందరు అంటారు. ఇతర లోకాలకు వెళ్లిన వాళ్ళు తిరిగి వస్తారు కాని ఆలోకకాశం చేరిన వారు తిరిగి రారు. ఈఅనేకాంత వాదులు అన్ని పదార్ధాల విషయంలో సప్తభంగీనయం అనే న్యాయన్ని ప్రవర్తింపజేస్తారు.
1. స్వాధస్తి :- ఘటం ఉనికి సంభవం కావచ్చును,
2. స్యాన్నాస్తి :- లేకపోవడం కూడా సంభవమే,
3.స్యాదస్తి చ నాస్తి చ :- ఉనికి ఉండటం, లేకపోవడం కూడా సంభవమే, కాని
4. స్యాద వక్త వ్యః :- అవ్యక్తం కావచ్చును,
5. స్యాద స్తి చ వక్త వ్యశ్చ :- ఘటం ఉండవచ్చు, లేదా అవ్యక్తం కావచ్చును.
6. స్యాన్నాస్తి చ వక్త వ్యశ్చ :- అది లేకపోవచ్చు లేదా అవ్యక్తం కావచ్చును.
7. స్యాదస్తి చ నాస్తి చ వక్త వ్యశ్చ :- ఉండవచ్చు, లేకపోవచ్చు, అవ్యక్తం కావచ్చు.
ఉనికి ఉంది అనుకుంటే అస్తిత్వం, లేదనుకుంటే నాస్తిత్వం. చెప్పలేము అనుకుంటే అవ్యక్తం, ఇలా 7 విభజనలు చేశారు. పదార్ధం అస్తిత్వం అయితే అన్నిచోట్ల ఉంటుంది. ఒకచోట ఉండటం, ఉండకపోవడం జరగదు. పదార్ధం కేవలం ఉన్నదని కాని, కేవలం లేదని చెప్పలేము. ఇలా ప్రవృత్తులను, నివృత్తులను లోకంలో చూస్తున్నాం అనేది అనేకాంతవాదం. ఒకే పదార్ధంలో అస్తిత్వ, నాస్తిత్వ ధర్మాలు రెండు ఉండవు. ఉన్న పదార్ధాన్ని లేదని, లేని పదార్ధాన్ని ఉందని ఎలా అంటాం? ఒక పదార్ధానికి ఒకే సమయంలో 2 రూపాలండలేవు. ఘటంలో అఘటత్వం కాని, ఘటత్వం కాని ఉండవు. ఒక వస్తువు కావాలనుకుంటే అది ప్రవృత్తి. వద్దనుకుంటే నివృత్తి. రెండు ఒకేసారి ఎలా ఉంటాయి? లేని వస్తువు పట్ల ప్రవృత్తి నివృత్తులు ఉంటాయా, లేదా? ఒకడికి ఒక వస్తువు దొరికినప్పుడు అది లేదని అర్ధమా? వేరే వాళ్లకు అది లభిస్తుందా? కుందేటి కొమ్ము ను ఎవరైనా చూశారా? చెప్పడానికి వీలులేదు అనడం అసంగతం. బొత్తిగా లేని వస్తువులకే అవ్యక్తం అంటాం. అందువలన అనేకాంతవాదం యుక్తి యుక్తం కాదు.
సూత్రం :- 205
" ఏ వం చాత్మా కార్ త్యం "
చ :- అంతేకాక, ఏవం :- అదే విధంగా, ఆత్మ కార్త్త్స్న్మ్.. జీవాత్మకు శరీర పరిమాణం ఉంటే కనుక, దానికి పూర్ణత్వం ఉండదు.
భావం :- జీవాత్మకు శరీరపరిమాణం ఉంటే కనుక దానికి పూర్ణత్వం ఉండదు. ప్రాణుల శరీరాల్లో ఉండే జీవులకు శరీర పరిమాణం ఉంటుందని అనేకాంతవాదులు అంటారు.
వివరణ:- జైనమతంలో ఆత్మకు పరిచ్ఛిన్నం అనే దోషం కలుగుతోంది. కాబట్టి ఆత్మకూడా మిగిలిన వస్తువుల వలెనే అనిత్యమౌతుంది. జైనమతం ప్రకారం శరీరపరిమాణం ఎంతఉంటుందో, ఆత్మపరిమాణం కూడా అంతే ఉంటుంది. ఇలా అనడం వలన ఆత్మకు శాశ్వతత్వం పోయి శరీరం లాగానే చెప్పబడుతుంది. అంటే ఆత్మఅనిత్యమౌతుంది. ఇది ఈ మతంలోని దోషం. ఆత్మ శరీరమంత పరిమాణం కలిగి ఉంటుంది అనడం తప్పు. ఎందుకంటే ఒకజీవి శరీరం పెద్దది ఇంకొక జీవి శరీరం చిన్నది ఉంటుంది. అలా అయినప్పుడు పెద్దడైనా ఏనుగు శరీరంలో అంత పెద్దఆత్మ చిన్నదైన చీమ శరీరం లో చిన్నఆత్మ ఉండాలి. ఒకవేళ ఆత్మ ఒకే పరిమాణం ఉంటే పెద్ద చిన్న శరీరాలలో అది ఇమడటానికి ఇబ్బంది పడాలి. జీవులకు కూడా వేరువేరు పరిమాణాలుంటాయా? మరు జన్మలో ఏనుగుగా పుడితే, లేదా చీమగా పుడితే, జీవుడికి ఆయా పరిమాణాలు ఉంటాయా? ఏనుగు శరీరంలో ఉన్న జీవుడు కర్మ వశాన చీమ శరీరం పొందితే అతనా శరీరంలో ఎలా ఇముడుతాడు? అల్పశరీరంలో పెద్ద పరిమాణంలో ఉన్న జీవుడు ఎలా సంపూర్ణంగా ప్రవేశిస్తాడు? కనుక జీవులకు శరీర పరిమాణం ఉంటుందని భావించడం తర్కబద్ధం కాదు. శరీరపరిమాణం ఎంత ఉంటుందో, జీవుడి పరిమాణం అంతే ఉంటుందని జైనులంటారు. ఆత్మ శరీరపరిమాణం అయితే ఆత్మ సర్వగతుడు కాదు పరిచ్చిన్నుడని అందువలన ఘటపటాదుల వలె అనిత్యుడని గ్రహించాలి. మనుష్యజీవుడు తన శరీర పరిమాణంతో ఉండి తిరిగి ఏ ఏనుగుజన్మో వస్తే, ఏనుగు శరీరమంతా వ్యాపింపజాలక పోతాడు. చిన్న ఈగ లోనఇమడలేకపోతాడు. ఒక్క జన్మ లోనే కౌమార, యవ్వన, వార్ధక్యాదులందు శరీర పరిమాణం మారిపోతూ ఉంటుంది. అనంతమైన ఈ జీవావయవాలు ఒకే ప్రదేశంలో ఉండటానికి అడ్డం ఏర్పడుతుందా? ఏర్పడదా? అవయవాలు పరిమితమైతే దేహంలో ఇమడవు. ఇమడక పోతే పైకి పోతాయని అర్ధం. వాటికీ అడ్డు తగలదు అని అంటే అన్ని అవయవాలు ఒక్క చోటే ఇమిడిపోవచ్చును. కనుక పరిమాణం పెరగడం కుదరదు. కనుక జీవుడు అనుప్రమాణం కలవడానికి చెప్పవలసిన వస్తుంది. శరీరమెంతో పరిమాణం అంతే అనడం ఊహించడానికి కూడా శక్యం కాదు.
సూత్రం :- 206
" న చ పర్యాయాదప్య విరోధో వికారాది భ్యః "
వికారాదిభ్యః:- కార్యత్వం , అనిత్యత్వం లాంటి దోషాలు కలుగుతాయి. కనుక, పర్యాయాత్ :- సంకోచ, వికాస శక్తులు జీవుడికి ఉంటాయనడంలో, అవిరోధః :- దోషం ఉండదని చెప్పడం, అపినచ :- సరియైనది కాదు.
భావం :- కార్యత్వం, అనిత్యత్వం, లాంటి దోషాలు, సంకోచ, వికారాది దోషాలు ఉంటాయని చెప్పడం సరియైనది కాదు.
వివరణ:- జీవుల శరీరం పరిమాణం ఉన్నవాళ్ళే. ఎందుకంటే వాటికి ఆయా శరీరాలలో ప్రవేశించడానికి తగినట్లుగా సంకోచ, వికాసాలు కలుగుతాయి. దీపకాంతి పెద్దదిగాను, చిన్నదిగాను, వ్యాపిస్తుంది కదా! అలాగే ఏనుగు పరిమాణం ఉన్న జీవుడు కర్మాధీనుడై, చీమ శరీరంలో ప్రవేశించినప్పుడు ఆశరీరానికి తగినట్లు తన పరిమాణాన్ని సంకోచించేటట్లు చేసుకుంటాడు. అని వాదించడం హేతుబద్ధం కాదు. జీవికి క్రమంగా అవయవాలు వస్తాయి. ఆత్మకూడా శరీరమంతా ఉంటుంది. కనుక దీనికి కూడా ఈ దోషాలు(అవయవాలు)వస్తాయి. ఆత్మ అనిత్యం అంటున్నారు. కాబట్టి మోక్షం లేదు. వికారం చెందటం జీవుడికి ఉన్నది కనుక అనిత్యమౌతుంది. గత జన్మలో పశువు, ఈ జన్మలో మనిషి. మరి పశువుగా ఉన్నప్పటికీ అవయవాలు కృశించి, ఇప్పుడు మనిషి అవయవాలు వస్తాయా? ఆత్మకు నాశనం ఉందా? ఆత్మ నాశనమైతే మోక్షం మాట ఏమిటి? అనే ప్రశ్నలకు జైనమతంలో సమాధానాలు లేవు. జైనమతంలో మోక్షం పొందే సమయానికి ఉండే జీవుని శరీరపరిమాణమే నిత్యం అంటారు. అనిత్యుడైన జీవుడు 8 విధాలైన కర్మల చేత చుట్టబడి, తాళ్ళతో నీళ్లలోకి ఏదో ఒక రాయికి కట్టబడిన ఆనపకాయబుర్ర వలె, సంసారసముద్రంలో మునిగి ఉన్న జీవుడు బంధనం తొలగిపోవడం వలన, పైపైకి వెళ్లిపోతుఉంటాడు అని వారు చెప్పిన బంధం నుండి మోక్షం బాధింపబడుతుంది. మరొక విషయం ఏమిటంటే అవయవాలు వచ్చి చేరుతూ, తొలగిపోతు రావడం, పోవడం అనే ధర్మాలు ఉండటం వలన శరీరాదుల వలె ఆత్మ భిన్నములు అని చెప్పవలసిన వస్తుంది. అప్పుడు నిలకడగా ఉన్న అవయవం ఆత్మ అని చెప్పవలసిన వస్తుంది. అయితే ఆఅవయవం ఏదో చెప్పడానికి శక్యం కాదు. మరొక విషయం: వచ్చే జీవావయవాలు ఎక్కడ పుడుతున్నాయో, పోయేవి ఎక్కడ లీనం అవుతున్నాయో, చెప్పవలసిన ఉంటుంది. భూతలనుండి పుట్టి భూతాలలో లీనం అవుతున్నాయో చెప్పవలసిన ఉంటుంది. అలా అనడానికి వీలు లేదు. జీవుడు భూతాలనుండి పుట్టిన వాడు కాదుకదా! జీవుల అవయవాలు సాధారణము, అసాధారణము అయిన మరొక ఆధారం ఏది చూపడం కుదరదు. అలాంటి ప్రమాణం లేదు. మరొక విషయం:- వస్తూ పోతూ ఉండే అవయవాల పరిమాణం తెలియకపోవడం చేత ఆత్మస్వరూపం ఇలా ఉంటుందని నిర్ణయించడానికి వీలుఉండదు. పర్యాయం చేత కూడా ఆత్మకు అవయవాలు వచ్చి చేరడం, తొలగిపోవడం అనే దానిని ఆశ్రయించడం శక్యం కాదు.
సూత్రం :- 207
" అన్త్యావ స్థితే శ్యో భయ నిత్య త్వాద విశేషః "
అన్త్యఅవస్థితేః చ :- మోక్షంలో ఉండే పరిమాణం నిత్యం అని అంగీకరిస్తే, ఉభయ నిత్యత్వాత్ :- రెండింటిలోనూ నిత్యం కావలసి వస్తుంది. కనుక అవిశేషః :- మోక్షంలో విశేషం లేదు.
భావం:-చివరిదైన ఆత్మ పరిమాణం నిత్యంగా ఉండటం వలన మొదటిది, మధ్యలో వచ్చినది అయిన రెండు, ఆత్మ పరిమాణం కూడా నిత్యం అవడం వలన ఆమూడింటి ప్రమాణంలోనూ భేదం ఉండదు.
వివరణ:- మోక్షావస్థలో పరిమాణం నిత్యం అయితే, ముందు ఉన్నది కూడా నిత్యమే కావాలి. ఆది, మద్యం, అంతం అన్ని సమానంగానే ఉండాలి. కాని ఒకటి నిత్యము, ఇంకొకటి అనిత్యము కావు. అందుకే ఈమతం అప్రమాణం. ఆమోదయోగ్యం కాదు. సంసార అవస్థలో జీవుడు కర్మఫలాలను అనుభవించదానికి వేర్వేరు శరీరాలు దరిస్తాడు. కనుక ఆ అవస్థలో జీవుడికి శరీర పరిమాణం ఉంటుంది. అంతం అంటే మోక్షం. అంత్యావస్థ అంటే మోక్షావస్థ. ఈ అవస్థ తరువాత జీవుడికి మరో శరీరంలో ప్రవేశించవలసిన అవసరం ఉండదు. కనుక మోక్షావస్థలో ఏపరిమాణం జీవుడికి ఉంటుందో అది నిత్యం అని అనేకాంతవాదన. మోక్షావస్థలో ఉండే చివరి జీవపరిమాణం నిత్యమని జైనులు అంగీకరిస్తారు. దాని వలనే పూర్వం ఉన్న మొదటిది, మధ్యమము, అయిన జీవపరిమాణాలు కూడా నిత్యములే అని చెప్పవలసిఉంటుంది. అందుచేత ఒక్క శరీరానికి ఎంత పరిమాణం ఉంటుందో అంతే జీవునకు కూడా ఉంటుందని చెప్పాలి. శరీరపరిమాణం మధ్యమాలు అనిత్యాలు. నిరవయవం అయిన సూక్ష్మపరిమాణమే నిత్యం. ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండేదే నిత్యం. మోక్ష పూర్వవస్థలలో శరీరపరిమాణం పెరగడం, తరగడం వలన నిత్యత్వానికి భంగం వస్తుంది. అందుచేత ఎల్లప్పుడూ పెరిగి, తరిగే శరీరాలలోకి ఆ ఆత్మ వెళ్లడం కుదరదు. అనగా మోక్షావస్థలో నిత్యమైన ఏ పరిమాణం ఉంటుందో ఆపరిమాణం గల శరీరంలో మాత్రమే ఆ ఆత్మ మోక్షానికి ముందు ఉంటుంది. దాని కంటే పెరగడంగాని తరగడంకాని ఉంటే శరీరం లోకి వెళ్ళదు అని చెప్పవలసిన వస్తుంది. చివరిదైన జీవపరిమాణం నిత్యం కనుక పూర్వవస్థలోకూడా జీవుని పరిమాణం అంతే ఉంటుందని అంగీకరించాలి. నిత్యమైనది అణువైనా కావాలి, మహాత్ప్రమాణమైన కావాలి. అందుచేత జీవుడు అనుప్రమాణుడని గాని, మహాత్ప్రమానుడని అంగీకరించాలి. కాని శరీరంతో సమానమైన పరిమాణం కలవాడు అని చెప్పడం కుదరదు. అందుచేత వీరి మతం అసంగతమే కాక ఉపేక్షించదగినది.
ప్రత్యధికరణం ( 2, 2, 37 )
సూత్రం :- 208
" పత్యుః అసామంజస్వాత్ "
పత్యుః :- ప్రకృతి, జీవులకు ఈశ్వరుడైన వాడికి శరీరం ఉందని అంగీకరించడం, అసామంజస్యాత్ :- సమంజసం కాదు.
భావం :- ప్రకృతి, జీవులకు ఈశ్వరునికి శరీరం ఉందని అంగీకరించడం సమంజసం కాదు. ఈ అధికరణంలో సాంఖ్య, పతంజలి, తార్కిక మతాలను ఖండిస్తున్నారు.
వివరణ:- లోకంలో అనేక వస్తువుల్ని నిర్మించే వ్యక్తులను శరీరాలు ఉండటం చూస్తున్నాం. అలాగే జగత్తుకి రచయిత అయిన ఈశ్వరుడికే శరీరం ఉంటుందని కొందరు అంటారు. శరీరాలున్న ప్రాణుల్లో ముఖ్యంగా మానవులకు ప్రపంచంలో ఉండే పదార్ధాల సహాయంతో అనేక చిత్ర విచిత్ర వస్తువులు తయారు చేసే సామర్ధ్యం ఉన్నది. కాగా శరీరధారుల శక్తులు పరిమితం. అనల్పపదార్ధాల రచన వారి తరం కాదు. సృష్టిరచయిత అయిన ఈశ్వరుడికి సైతం ఒక శరీరం ఉందని అంగీకరిస్తే ఆయన శక్తి కూడా పరిమితం అవుతుంది. అప్పుడు ఆయనకు అపరిమిత ప్రపంచరచన వీలుకాదు. అందువలన ఈశ్వరుడు శరీరధారి కాడు. గురువు గారు! పరమాత్మ ప్రధానతత్వానికి, పురుషతత్వానికి ప్రేరకుడు. ఈపరమాత్మ ప్రపంచానికి నిమిత్తకారకుడే తప్ప ఉపాదానకారకుడు కాదు అని మహేశ్వరులు అంటున్నారు. మరి వారి మాట ఏమిటి? అని అడిగాడు కృష్ణశర్మ. ఆ మాటలు విన్న రత్నకరుడు చెప్పడం ప్రారంభించాడు. మహేశ్వరులు అంటే శివుణ్ణి ఆరాధించే వాళ్ళు. వీరు శైవులు, పాశుపతులు, కాపాలికులు, కారుణికసిద్ధాంతులు అని నాలుగు రకాలుగా ఉన్నారు. పరమేశ్వరుడు ప్రకృతి మొదలైన వాటన్నింటికీ ప్రేరకుడు కాబట్టి కేవలం నిమిత్తకారకుడు అంటారు. అది తప్పు. అలా అంటే అతని యందు రాగద్వేషాలు అపాదించబడతాయి. పశుపతులు అనుమానప్రమాణంతో పరమేశ్వరుడు ఉన్నాడని అతడు ప్రకృతిని, పురుషున్నీ అంటే ఆత్మని ప్రేరేపిస్తున్నాడని ఆ కారణంగానే సృష్టి జరుగుతోంది అని, పరమేశ్వరుడే నిమిత్తంకారణం అంటారు. అది సరియైనది కాదు. ఇలా జరిగితే కొంతమందిని దుఃఖితులుగా, చెడ్డవారుగా సృష్టిస్తాడు అనాలి. అలా అయితే అతనికి రాగద్వేషాలు ఉన్నట్లు అవుతుంది. అది వేదవిరుద్దం. కాబట్టి ఈవాదన సరియైనది కాదు. ఇప్పుడు కేవలం అధిష్టానమైన ఈశ్వరుడు జగత్తుకు కారణం అనే వాదం నిరకరింపబడుచున్నది. ఈశ్వరుడు ప్రకృతి కాదు. కేవలం అధిష్టాతయే. నిమిత్తకారణం మాత్రమే అని చెబితే బ్రహ్మత్వానికి విరుద్ధమౌతుంది. కనుక అది నిరాకరించ బడింది. సాంఖ్యయోగ మంత్రాలు ఆశ్రయించిన కొందరు ప్రధాన పురుషుల అధిస్థాత అయిన ఈశ్వరుడు కేవలం నిమిత్తమాత్రమే ప్రధాన, పురుష, ఈశ్వరుడు పరస్పరం వేరు అని అంటారు. మహేశ్వరులైతే కార్యం(మహాదాధికం ), కారణం(ప్రధానం, ఈశ్వరుడు), యోగం(సమాధి), విధి(త్రిషవణ స్నానాదికం), దుఃఖాంతం(మోక్షం) అనే 5 పదార్ధాలు పశుపతి అయిన ఈశ్వరునిచేత పశువుల(జీవుల), పాశాల (బంధాలు) మోక్షం కొరకు ఉపదేశించబడ్డాయి. పశుపతి అయిన ఈశ్వరుడు నిమిత్తంకారణం అని వర్ణిస్తారు. వైశేషికులు కొంతమంది ఈశ్వరుడు నిమిత్తంకారణం అని వర్ణించారు. అద్వితీయమైన బ్రహ్మ జగత్తును ప్రకృతి, నిమిత్తకారణము కూడా అని చెప్పే వేదాంత సమన్వయానికి ఈశ్వరుడు కర్తయేకాని ప్రకృతి కాదు అని చెప్పే మతాలలో విరోధం ఉందా? లేదా? అనేది సందేహం. అవి ప్రమాణికములే గాన విరోధం ఉందని పూర్వపక్షం, అప్రమాణములు కనుక విరోధం లేదని ఉత్తరపక్షం.
సూత్రం :- 209
" సంబంధానుపపత్తేశ్చ "
చ:-అంతేకాక, సంబంధ అనుపపత్తేః:-ఆశ్రయ, ఆశ్రయీ భావసంబంధం సిద్ధించనందు వలన, ఈశ్వరునికి శరీరం ఉంటుందని చెప్పడం సరియైనది కాదు.
భావం :- ప్రకృతి, జీవుడు, ఈశ్వరుడు మధ్య ఆశ్రయ, ఆశ్రయీ సంబంధం ఉంటుందనడం సరియైనది కాదు.
వివరణ:- ప్రకృతి, జీవులు ఈశ్వరునిలో ఉన్నందున వాటికీ తనలో ఆశ్రయం ఇచ్చాడు. ఆశ్రయం ఇచ్చిన ఈశ్వరుడు ఆశ్రయీ అవుతాడు. జీవప్రకృతులకు ఈశ్వరుడే ఆధారం. ఈబ్రహ్మాండానికి ఆశ్రయీ అయిన ఈశ్వరుడికి శరీరం ఎలా ఉంటుంది? శరీరం ఉంటే ఈశ్వరుడు పరిచ్చినుడు అవుతాడు. అప్పుడు జీవుడి లాగానే ఆయనకు కూడా అల్పమైన శక్తులు ఉంటాయి. ఆశ్రయించే వస్తువు కన్నా ఆశ్రయం ఇచ్చే వస్తువు ఎప్పుడు అధికమే. బ్రహ్మాండానికి ఆశ్రయమైన ఈశ్వరుడు శరీరధారి అయితే ఈ ఆశ్రయ, ఆశ్రయీ భావ సంబంధం పొసగదు. ప్రేరేపించే ప్రకృతికి, ప్రేరకుడైన ఈశ్వరునికి సంబంధం లేదు. కాబట్టి ఈమతం సరియైనది కాదు. పరమేశ్వరుడు ప్రకృతికి, పురుషునికి ప్రేరకుడు అన్నారు. మరి ప్రేరకునికి, ప్రేరేపించేవాడికి సంబంధం ఏమిటి? సంబంధం లేకపోతే అతను ప్రేరకుడు కాదు. వారి మతం ప్రకారం ప్రకృతి, పురుషుడు, పరమేశ్వరుడు నిరవయవాలు, సర్వ వ్యాపకాలు. వీటికి సంయోగం ఉన్నదంటారు. ఇది సంభవం కాదు. అవయవాలు ఉంటేనే సంయోగం ఉంటుంది. లేకపోతే సంబంధం లేదు. కనుక ఈ వాదన సరి కాదు. ప్రధానము, పురుషుడు, ఈశ్వరుడు కూడా సర్వగతాలు (అంతటా వ్యాపించి ఉన్నవి) అవయవాలు లేనివి, అందుచేత సంయోగ రూపమైన సంబంధం కుదరదు. ఈశ్వరునుకి, ప్రధానపురుషునకు మధ్య ఆశ్రయ ఆశ్రయీ భావం కనబడటం లేదు. ఘటం ఆశ్రయం, దానిలో సమవాయ సంబంధంలో ఉన్న గుణాధికం ఆశ్రయీ అవుతుంది. వస్తువుల గుణాల మధ్య ఉండే అవినాభావ సంబంధమే సమవాయం. ఒక వస్తువు, దాని గుణాలు వేరు కావు. గుణాలు లేకుండా వస్తువు ఉండదు. వస్తువు లేకుండా గుణం ఉండదు. కుండ లేకుండా మట్టి ఉండదు. మట్టి లేకుండా కుండ ఉండదు. కుండలోనూ, మట్టి లోను ఒకే గుణాలు ఉంటాయి. అదే సమవాయ సంబంధం. ఈశ్వరునుకి, ప్రధాన పురుషునకు సమవాయ సంబంధం కుదరదు. కార్యాన్ని బట్టి మరొక సంబంధం కల్పించడానికి వీలు లేదు. ఇప్పటికీ వాటి మధ్య కార్యాకరణ సంబంధమే లేదు. ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది. కార్యం కొత్తగా పుట్టుకు వస్తుంది. కార్యంలో కనబడే లక్షణాలు కారణంలో కనబడవు. విత్తనం పగలుకొట్టి చూస్తే సూక్ష్మ రూపంలో చెట్టు కనిపిస్తుందా? అలాగే ఈశ్వరుని లక్షణాలు ప్రధానపురుషునిలో కనిపించవు. ఈశ్వరునికి శరీరం ఉంటుందని చెప్పడం సరియైనది కాదు. వారి మధ్య ఆశ్రయ, ఆశ్రయీ భావం సిద్ధించదు.
సూత్రం :- 210
" అధిష్టానానుపపత్తేశ్చ "
చ :- అంతేకాక, అధిష్ఠాన అనుపపత్తే :- శరీర ధారణ సిద్ధించడం లేదు.
భావం :- అధిష్ఠానం అంటే శరీరం. సృష్టికి పూర్వం శరీరం ఏర్పడదు. సృష్టి సమయంలోనూ ఏర్పడటానికి వీలు లేదు. అందుకే శరీర ధారణ సిద్ధించడం లేదు.
వివరణ :- తార్కికులు కల్పించిన ఈశ్వరుడు కుంభకారుడు, మట్టి మొదలైన వాటితో తన సంపూర్ణజ్ఞానాన్ని ఉపయోగించి వివిధరకాల పాత్రలను వివిధరీతులలో చేసినట్లుగా, ప్రధానాదులను అధిష్టించి ప్రవర్తింపజేస్తాడంటున్నారు. కాని అలా చెయ్యడం కుదరదు. ప్రధానం, మృత్తిక కన్నా విలక్షణమైనది. ప్రత్యక్షంకానిది, రూపాదులు లేనిది అయిన ప్రధానాన్ని ఈశ్వరుడు అధిష్టించడం సంభవించదు. రూపంలేని ప్రకృతికి ప్రేరకుడు కానందువలన ఈశ్వరుడు నిమిత్తకారకుడు కాదు. ప్రకృతి రూపం లేనటువంటిది. రూపరహితమైన ప్రకృతిని ప్రేరేపించి ఈశ్వరుడు సృష్టి చేస్తున్నాడని చెప్పడం సమంజసం కాదు. శరీరం నిరవయవం కాదు. సావయవం అనుకుంటే సృష్టికి పూర్వం అవయవాలు ఎక్కడ ఉన్నాయి? ఏ విధంగా చూసినా ఈశ్వరుడుకి దేహం ఉండటం హేతుబద్ధం కాదు.
సూత్రం :- 211
"కరణ వచ్చేన్న భోగాదిభ్యః "
కరుణవత్ చేత్:- ఈశ్వరుడికి కరచరణాదుల్తో కూడిన శరీరం ఉందని అంగీకరిస్తే, భోగాదిభ్యః :- సుఖ దుఃఖాలను భవించ వలసివస్తుంది. న :- శరీరం ఉందని ఒప్పుకోవడానికి వీలు లేదు.
భావం:- ఈశ్వరుడికి కరచరణాదులతో కూడిన శరీరం ఉందని అంగీకరిస్తే, సుఖ దుఃఖములు అనుభవించవలసి వస్తుంది. వాటికి కారణములైన వాసనలుంటాయి. కనుక శరీరం ఉందని ఒప్పుకోవడానికి వీలు లేదు.
వివరణ:-ఇంద్రియాలు జీవునిచేత ప్రేరేపించబడి పనిచేస్తున్నాయి. అలాగే ప్రకృతిని ఈశ్వరుడు ప్రేరేపిస్తున్నాడు అని చెప్పరాదు. కరణములు అంటే ఇంద్రియములు. ఈ ఇంద్రియములకు ఆశ్రయం శరీరం. వాటి వలన భోగాలు, వాసనలు ఉంటాయి. అప్పుడు ఈశ్వరుడు జీవుడి వలేనే భోగి అవుతాడు. భోగం అంటే సుఖదుఃఖములనుభవించడం కదా! జీవుడు శుభ, అశుభ కర్మలను చేస్తే సుఖదుఃఖములు కలుగుతాయి. అవి అవిద్యాది క్లేశాల వలన కలుగుతాయి. కాబట్టి ఈశ్వరుడు శరీరధారి అయితే ఆయన సుఖదుఃఖ అనుభూతులు పొందినవాడవుతాడు. అప్పుడు ఆయనకు అవిద్యాదిక్లేశాలు ఉన్నట్లు ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటే ఆయన ఈశ్వరుడు కానేరడు. భోగాదులు కనబడటం వలన జీవుడు ఇంద్రియ సముదాయాన్ని అధిష్టించినట్లు తెలుస్తుంది.ఇంద్రియ సముదాయంతో పోలికను అంగీకరిస్తే ఈశ్వరుడికి భోగాదులు ప్రసక్తం అవుతాయి. తార్కికులచేత కల్పించబడినఈశ్వరుడు సాధిష్టానుడై, శరీరంతో కూడిన రాజులా కనిపిస్తున్నాడు. కాని శరీరం లేనివాడు ఈశ్వరునిగా కనబడటం లేదు. అధిష్టాన శబ్దానికి శరీరం అని అర్ధం. అందువలన ఆ దృస్థాంతం చేత ఈశ్వరునికి కూడా ఇంద్రియలకు స్థానమైన ఒకానొక శరీరం ఉంటుందని చెప్పవలసి ఉంటుంది. అలా చెప్పడం కుదరదు. శరీరం సృష్టి తరువాత ఏర్పడుతుంది. కాని సృష్టికి పూర్వం అది కుదరదు. ఈశ్వరుడు సశరీరుడైతే సంసారి వలె భోగాలు అనుభవించాలి. అప్పుడు అతను ఈశ్వరుడు కాదని గ్రహించాలి.
సూత్రం :- 212
" అంత వత్వమ సర్వజ్ఞతా "
వా :- ఇంతే కాక, ఈశ్వరుడు శరీర దారి అయితే, అంత వత్యం :- నాశనం కావడం, అసర్వజ్ఞత్వం :- సర్వజ్ఞత్వం లేకపోవడం అనే దోషాలు ఆయనకు కలుగుతాయి.
భావం :- ఈశ్వరునికి శరీరం ఉంటే నాశనం అవడం, సర్వజ్ఞత్వం లేకపోవడం వంటి దోషాలు కలుగుతాయి.
వివరణ:-ఈశ్వరుడికి జీవుడిలా శరీరంఉంటే ఆయనకు వినాశనం కలుగుతుంది. ఈశ్వరత్వానికి భంగంకలుగుతుంది. అలాగే శరీరధారులు అల్పజ్ఞులు అవుతారు. ఆయనకు శరీరంఉంటే సర్వజ్జుడు కాలేదు. ఈశ్వరుడు ప్రకృతిది, తనది, పురుషుడిది అయిన సంఖ్యాపరిమాణాన్ని నిశ్చయిస్తాడా? నిశ్చయించడా? ఇక్కడ నిశ్చయిస్తే పరిచ్చినదోషం, నిశ్చయించకపోతే అసర్వజ్ఞత్వదోషం. ఈశ్వరుడు సర్వజ్జుడు, అనంత స్వరూపుడు, అతడు ప్రధాన పురుషుల తన యొక్క పరిమితిని గుర్తిస్తాడా? లేదా? గుర్తిస్తున్నాడు అంటే అతనికి అంతముంటుంది. గుర్తించకపోతే సర్వజ్జుడు కాదు. అందుచేత వీరి వాదం అసమంజసం. తార్కికులు ఈశ్వరుడు సర్వజ్జుడని, అనంతుడని, అంగీకారిస్తారు. అనంత మైన ప్రధానం, అనంతమైన పురుషులుకూడా పరస్పరం వేరైన వాళ్ళుగా అంగీకరింపబడుతున్నారు. సర్వజ్జుడైనా ఈశ్వరుడు ప్రధానంయొక్క, పురుషుల యొక్క, తన యొక్క ఇయత్త (ఇంత సంఖ్య, ఇంత పరిమాణం అనే కొలతలు) ను పరిచ్చేదం చేస్తాడా? చెయ్యడా? రెండువిధాలా దోషం ఏర్పడుతుంది. మొదటివికల్పంలో ప్రధానపురుషేశ్వరులు ఇయ్యత్త(ఇంత పని) చేత పరిచ్చిన్నమవడం చేత అంటే కొలబడటం చేత తప్పక వాటికి నాశనం కలుగుతుంది. కొలత, పరిమాణం ఉన్న ఘటము, వస్త్రం కొంతకాలం తరువాత నాశనమౌతాయి. ప్రధానం, పురుషులలోఉన్నస్వరూపపరిమాణం ఈశ్వరుని చేత (పరిచ్చిన్నం) కొలవ బడుతుంది. ఏసంసారులు సంసారంనుండి ముక్తులౌతారో వాళ్ళ సంసారం అంతమై పోతుంది. వాళ్ళ సంసారిత్వం కూడా అంతమౌతుంది. అదే విధంగా ఇతరులుకూడా ముక్తులైతే, ఆసంసారులు, సంసారిత్వం అంతమౌతాయి. ఈశ్వరుచేత అధిష్టించబడిన వికారాలతో కూడిన ప్రధానమే సంసారం అని చెప్పబడింది. ఆపురుషులు లేకపోతే ఈశ్వరుడు దేనిని అధిష్టిస్తాడు? ఈశ్వర సర్వజ్ఞత్వం, తత్వాలు దేనికి సంబంధించి ఉంటాయి. అందుచేత మూడింటికి అంతం ఉండాలి. ఇక రెండవ వికల్పం ఈశ్వరుడు ప్రధానం యొక్క, పురుషుని యొక్క తన యొక్క ఇయత్త (ఇంత పని)ను పరిచ్చేదించకపోతే, ఈశ్వరుని యొక్క సర్వజ్ఞత్వానికి హాని కలుగుతుంది. కనుక తార్కికులు అంగీకరించిన ఈశ్వరకారణ వాదం అసంగతమే.
ఉత్పత్త్యధికరణం ( 2, 2, 42 )
సూత్రం :- 213
" ఉత్పత్త్య సంభవాత్ "
ఉత్పత్తి :- ఈశ్వరుడు జీవులను ఉత్పత్తి చెయ్యడం, అసంభవాత్ :- సంభవం కాదు,
భావం :- జీవోత్పత్తిని అంగీకరించే కొందరు ఈశ్వరుడి నుంచే జీవులు ఉత్పన్నం అవుతారని అంటారు. పరమేశ్వరుడి వల్ల జీవులు ఉత్పన్నం అవుతారని, కాని వారు నశించరు అని చెబుతారు. ఈ మతం అంగీకారం కాదు.
వివరణ:- ఈ అధికరణంలో పాంచ రాత్రులమతాన్ని ఖండిస్తున్నారు. ఈ మతాన్నే భాగవతమతం అని కూడా అంటారు. ఈ మతంలో భగవంతుడు వాసుదేవుడు నిర్వికారుడు, జ్ఞానస్వరూపుడు, ఇతడే ఈజగత్తుకు ఉపాదాన, నిమిత్తకారణం. ఈశ్వరుడి నుంచి జీవులు ఉత్పన్నం అవడం అంటే ఏమిటి? మట్టినుంచి కుండ పరిణామం చెందినట్లుగా జరిగితే, ఈశ్వరుడు పరిణామి అవుతాడు. సావయవి, అనిత్యుడు అవుతాడు. కుమ్మరికి మట్టి ఉపాదానమైనట్లుగా ఈశ్వరుడుకి ఉపాదాన వస్తువు ఏది? అతను మట్టిని ఉపాదానంగా చేసుకొని అనేక రకాల మట్టి పాత్రలు తయారు చేస్తాడు. ఈశ్వరుడు సర్వ శక్తి మంతుడు. కనుక సంకల్ప మాత్రం చేత జీవుల్ని ఉత్పత్తి చేస్తాడు అనడం కూడా సరియైనది కాదు. సంకల్పానికి ఆశ్రయం ఉన్నట్లుగా విషయంకూడా ఉండాలి. విషయంలేని సంకల్పం ఉండదు. జీవుడు విషయమైతే సంకల్పనికి పూర్వమే ఉండాలి. ఉత్పత్తికి పూర్వం ఉన్న వస్తువు నిత్యమే అవుతుంది. కనుక ఈశ్వరుడి వలన జీవుడు ఉత్పన్నం కాదని తేలుతోంది. భాగవతులు ఇలా అనుకుంటారు: నిర్మలజ్ఞానస్వరూపుడైన భగవంతుడు ఒక్క వాసుదేవుడే పరమార్ధతత్వం. ఆ వాసుదేవుడి నుండి సంకర్షణుడు (జీవుడు), అతని నుండి ప్రద్యుమ్నడు(మనస్సు), అతనినుండి అనిరుద్ధుడు (అహంకారం), పుడుతున్నారు. భక్తులు భగవంతుణ్ణి పరిపరి విధాల ఆరాధించి చివరకు పరమపదం చేరుతారు. వీరికి, వైదికమతానికి పెద్దగా తేడా ఏమి లేదు. ఒక్కటే తేడా, వాసుదేవుడి నుంచి జీవుడు ఉద్భవించడం సమంజసం కాదు. వాసుదేవుడనగా పరమాత్మ. సంకర్షుణుడు అనగా జీవుడు, ప్రద్యుమ్నడు అనగా మనస్సు, అనిరుద్ధుడు అనగా అహంకారం, ఆవ్యూహలలో వాసుదేవుడు పర ప్రకృతి, మిగిలిన సంకర్షణాది వ్యూహాలు కార్యం. ఇలాంటి భగవంతుడైన పరమేశ్వరుణ్ణి అభిగమన, ఉపాదాన, ఇజ్యా, స్వాధ్యాయ, యోగాల చేత నూరు సంవత్సరాలు పూజించి, క్లాలాన్ని క్షేనించగా భక్తుడు భగవంతుని చేరతాడు. అభిగమనం అంటే మనోవాక్కయాలను సావధానంగా ఉంచుకొని, దేవతానుగ్రహానికి వెళ్లడం, ఉపాదానం అంటే పూజాద్రావ్యాలు సంపాదించుకోవడం, ఇజ్యా అంటే పూజ, స్వాధ్యాయం అంటే అష్టాక్షరీ మంత్ర జపం, యోగం అంటే ధ్యానం. వాసుదేవుడనే పరమాత్మ నుండి సంకర్షుణుడనే జీవుని ఉత్పత్తి సంభవం కాదు. అలా అంగీకరిస్తే జీవునికి అనిత్యత్వం మొదలైన దోషాలు కనిపిస్తాయి. అప్పుడు జీవుడు భగవంతుని పొందటం మోక్షం కాజాలదు. కార్యం కారణాన్ని పొందినప్పుడు మట్టిలో చేరిన కుండ వలె భగవంతునిలో లీనం అయిపోతున్నాడు కదా! ఆచార్యుడు జీవునకు ఉత్పత్తి నిషేదిస్తున్నాడు. అందువలన ఈశ్వరుడు జీవుల్ని ఉత్పత్తి చెయ్యడం సంభవం కాదు.
సూత్రం :- 214
" న చ కర్తుః కరణమ్
" కర్తుః :- శుభ, అశుభ కర్మలు చేసే జీవునికి, కరణం :- అంతఃకరణం లేదనడం, న చ :- యుక్తం కాదు,
భావం :- శుభ, అశుభ కర్మలు చేసే జీవునికి అంతఃకరణం లేదనడం యుక్తం కాదు. జీవునకు మనస్సు ఉంటుందనేది హేతుబద్ధం. చక్షురాది బాహేంద్రియలతో బాటు అంతః కరణం కూడా జీవునకు ఉన్నది.
వివరణ :- కర్త నుండి సాధనం పుట్టదు. ఇక్కడ కర్త సంకర్షుణుడు అనే జీవుడు. అతని నుండి మనస్సు, అతని నుండి అహంకారం పుట్టవు. ఈ ప్రక్రియకు వేద ప్రమాణం లేదు. కర్త నుంచి కరణం పుట్టదు అని సూత్రానికి అర్ధం. ఈ కరణం వలన ఈ కల్పన అసంగతమైనది. ఎందువననగా లోకంలో ఎక్కడా కర్త అయిన దేవదత్తుని నుండి కరణమైన పరశువు గండ్రగొడ్డలి మొదలైనవి పుడుతున్నట్లుచూడబడడం లేదు. జీవుని నుండి ప్రద్యుమ్నడు అనే మనస్సు పుడుతుందని, కర్త నుండి పుట్టిన ఆమనస్సు నుండి అనిరుద్ధుడనే అహంకారం పుడుతుందని భాగవతులు వర్ణిస్తారు. దీనిని ఏదైనా దృష్టాంతం చూపితే గాని అర్ధం చేసుకోలేము. ఇలాంటి శ్రుతి కూడా ఏదీ కనబడటం లేదు. సర్వాత్మ స్వరూపుడైన పరమాత్మ ఒకడుగా ఉంటాడు. ముగ్గురిగా అవుతాడు. లేదా అనేక రూపాలతో ఉంటాడని శ్రుతుల వలన తెలుస్తోంది. ఏకగ్రచిత్తంతో అభిగమ నాదుల చేత భగవంతుని ఆరాధించడం, ఈశ్వర ధ్యానం, సేవాధికం శ్రుతి, స్మృతులలో ప్రసిద్ధమే. కాని వాసుదేవుని నుండి జీవుడు, అతని నుండి మనస్సు పుట్టడం జరగదు.
సూత్రం :- 215
" విజ్ఞా నాది భావేవా తద ప్రతి షేధహా "
వా:- కాగా, విజ్ఞానాది భావే :- జ్ఞానం కలుగుతుండగా, తత్ అప్రతి షేధః :- మనస్సుని అంగీకరించక పోవడం సిద్ధించడం లేదు.
భావం :- బాహ్యజ్ఞానానికి చక్షురాదుల వలె, సుఖదుఃఖ విషయం జ్ఞానం కలగడానికి మనస్సు, అంతఃకరణం కావాలి. కనుక మనస్సనేది లేదనడం పొరబాటు.
వివరణ:- బాహ్యవిషయజ్ఞానం, అంతరంగికవిషయజ్ఞానం ఉన్నాయి. కళ్ళలాంటి బాహ్యఇంద్రియాలు లేకపోతే, బాహ్య విషయాలైన ఘటపటాదుల జ్ఞానం కలుగదు. సుఖదుఃఖాలు ఆంతరాంగిక విషయాలు. ఆ సుఖదుఃఖములను గ్రహించ డానికి మనస్సు కావాలి. సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధులు వాసుదేవుని లాగానే ఐశ్వర్యం, బలము, గలవారే అని చెప్పినట్లయితే ఒకే ఈశ్వరునితో సృష్టి కార్యం జరిగేటప్పుడు నలుగురు ఈశ్వరులు అనవసరం. వీరందరిని సమానంగా ఒప్పుకుంటే వాసుదేవుడొక్కడే పరతత్వం అనేమాట అబద్దమౌతుంది. వాసుదేవాదులైన ఈ నలుగురు పరస్పర భిన్నులైన తుల్యధర్మాలు గల ఈశ్వరులే. వీళ్లకు ఏకస్వరూపత్వం లేదు అని వారి అభిప్రాయమైతే, అప్పుడు ఒక ఈశ్వరునితో పని జరుగుతున్నప్పుడు అనేక ఈశ్వరులను కల్పించడం వ్యర్థం. భగవంతుడైన వాసుదేవుదొక్కడే పరమార్ధతత్వం అని వారు అంగీకరించడం వలన వారి సిద్ధాంతానికి భంగం కలుగుతుంది. అలాకాక ఏనాలుగు వ్యూహలు కూడా ఒకే భగవంతుని నాలుగు సమాన ధర్మాలు గల వ్యూహలు అని అభిప్రాయమైతే అప్పుడు ఉత్పత్త్యసంభవ దోషం (ఈశ్వరుడు జీవుణ్ణి ఉత్పత్తి చెయ్యడం) అలాగే ఉంది. వాసుదేవుడి నుంచి సంకర్షునుని ఉత్పత్తి, సంకర్షునుని నుండి ప్రద్యుమ్నని ఉత్పత్తి, ప్రద్యుమ్నని నుండి అనిరుద్ధుని ఉత్పత్తి కుదరదుకదా! మృద్ఘటాలలో కొంచెం అతిశయం, ( విశేషం) ఉన్నట్లు కార్యకారణముల మధ్య ఏదో ఒక విశేషం ఉండాలి కదా! అలాంటి విశేషం లేకపోతే ఒకటి కారణమని, మరొకటి కార్యమనీ చెప్పడం కుదరదు కదా! వాసుదేవాదులలో ఒక్కొక్కరిలో గాని, అందరిలోగాని జ్ఞానఐశ్వర్యాదుల తారతమ్యం ఉందని పాంచరాత్ర సిద్ధాంతుల చేత అంగీకరించబడటం లేదు కదా! ఈ వ్యూహలన్నీ వాసుదేవులేనని అంగీకరించబడుతున్నాయి. మరొక విషయం ఈ నాలుగు వ్యూహలతో ఆగిపోవు. ఎందువలనంటే బ్రహ్మదేవుడు మొదలు చిన్న గడ్డిపురుగు వరకు సమస్త జగత్తు కూడా భగవంతుని వ్యూహమే. మూర్తియే శరీరం అని తెలుస్తోంది కదా!
సూత్రం :- 216
"విప్రతి షే ధాత్ చ "
చ - అంతే కాక, విప్రతిషే ధాత్ :- వివేక పూర్వకంగా చూస్తే జీవ ఉత్పత్తి వాదం అసంగతం అని తెలుస్తోంది.
భావం :- చెప్పిన విషయంలో పరస్పరవిరోధము, వేదవిరోధము ఉండటం వలన, వివేక పూర్వకంగా చూస్తే జీవ ఉత్పత్తి వాదం అసంగతం.
వివరణ :- కఠోపనిషత్తులో జీవుడికి పుట్టుక, నాశము లేవు. జీవుడు ఉత్పన్నం కాదు.
బృహదారణ్యకోపనిషత్తు:-మనసేక్కడో ఉంటుంది. దానిని చూడలేము. మనస్సు మరొకmచోట ఉంది. కనుక వినలేక పోయాము. దీన్ని బట్టి జీవుడి కన్నా వేరేగా సర్వజ్ఞానసాధనం అయిన మనస్సున్నదని తెలుస్తోంది. జీవోత్పత్తి నిషేధం. మనస్సు ఉండటాన్ని శాస్త్రం ప్రత్తిపాదించింది. కనుక జీవుడికి పుట్టుక ఉందనడం, అంతకరణం లేదనడం సమంజసం కాదు. ఒకే వస్తువు గుణమని, గుణి అని చెప్పడం పరస్పర విరోధం అని శాస్త్రంలో కనబడుతోంది. ఎందువలననగా జ్ఞాన, ఐశ్వర్య, శక్తి, బల, వీర్య, తేజస్సులు గుణాలు, ఇవన్నీ భగవంతుడైన వాసుదేవుడైన ఆత్మలే. జ్ఞానాదులు గుణాలని చెప్పి అవే వాసుదేవులు అనగా ఆగుణాలన్ని గుణులు అని చెప్పడం పరస్పర విరుద్దము. ఇది పాంచరాత్రగమంలో కనబడుచున్నది. అందువలన ఈ శాస్త్రంలో చెప్పిన కల్పన అసంగతమైనది.
వియదధికరణం ( 2, 3, 1)
సూత్రం :- 217
" న వియదశ్రుతేః "
అశ్రుతే :- ఉపనిషత్తులు చెప్పగా వినకపోవడం వలన, వియత్ :- ఆకాశాన్ని, న :- బ్రహ్మం ఉత్పత్తి చేసినట్లు చెప్పలేము.
భావం :- ఆకాశం పుట్టడం, దాని పుట్టుక శ్రుతిలో వినబడకపోవడం వలన ఆకాశాన్ని బ్రహ్మ ఉత్పత్తి చేసినట్లు చెప్పలేము.
వివరణ :- గురువుగారు! పంచభూతాలలో ఆకాశం మొదటిది. మరి ఆ ఆకాశానికి అసలు ఉత్పత్తి ఉన్నదా? శ్రుతులలో కూడా దీనిమీద భిన్న వాదనలున్నాయి. దయచేసి దానిని గురించి వివరించండి. అన్నాడు కృష్ణశర్మ. రత్నాకరుడు చెప్పడం ప్రారంభించాడు. ఆకాశం దాని పుట్టుక గురించి శ్రుతులలో చెప్పలేదు. కనుక ఆకాశానికి ఉత్పత్తి లేదు అని కొందరి వాదన. ఎందుకంటే, ఛాందోగ్యోపనిషత్తులో ఉద్దాలకుడు తనకుమారుడైన శ్వేతకేతువునకు ఆత్మజ్ఞానం బోధిస్తూ, శ్వేతాకేతూ! సృష్టికి పూర్వం ఈప్రపంచం నామరుపాలతో కూడిలేదు. అప్పుడు కేవలం అద్వితీయమైన సత్త్ మాత్రమే ఉండేది. నామరుపాలు, పదార్ధాలు ఏమిలేవు. సత్ అంటే ఉనికి, సత్యం అని అర్ధం. అన్నింటికన్నా పూర్వమైనది. రెండు కానిది. మొదటిగా ఉన్నది ఏకైక పరబ్రహ్మ. ఆతత్వం అనేక మంది కావాలనుకుంది. రకరకాల రూపాలలో వస్తువులుగా జీవించాలనుకుంది. జీవులుగా రూపుదాల్చింది. ఘన ద్రవ వాయు పదార్ధాలుగా మార్పు చెంది, అనేక రూపాలతో సృష్టి ఆకారం పొందింది. తాను అనేకం కావాలనుకున్న సత్ ముందుగా అగ్నిని సృష్టించింది. అగ్ని నుండి జలము, జలము నుండి పృథవి వచ్చాయి. వీటి వల్లనే అన్నం పుట్టింది. ఈరకంగా పంచభూతాలలో అగ్ని, జలము, భూమి మూడింటినే చెప్పారు. ఆకాశాన్ని గురించి చెప్పలేదు. కాబట్టి ఆకాశం లేదు అని వాదన. ఆకాశం, వాయువు, జీవునీ విషయంలో కొన్ని శ్రుతులు ఉత్పత్తి ఉన్నాయనీ, కొన్ని లేవని చెపుతున్నాయి. ఆకాశం పుట్టదు. ఎందువలన? ఉత్పత్తి ప్రకరణంలో ఆకాశం పుట్టినట్లు వినబడడంలేదు. చాందోగ్యంలో బ్రహ్మను ప్రస్థావించి అది చూసింది. అది తేజస్సును సృష్టించింది అని పంచ భూతాలలో మధ్యదైన తేజస్సుతో ప్రారంభించి తేజోబన్నాలు మూడింటి యొక్క ఉత్పత్తి చెప్పబడుతోంది. ఇంద్రియాలకు అందని విషయాలను తెలుసుకోవడానికి మనకు ప్రమాణం శ్రుతియే. ఇక్కడ ఆకాశం పుట్టింది అనే శ్రుతి లేదు. అందుచేత దీనికి ఉత్పత్తి లేదు. ఆకాశానికి వాయువును ఉత్పత్తి జరిగినట్లు తైత్తరీయెపనిషత్తు లో చెప్పబడింది. చాందోగ్యంలో చెప్పలేదు. జీవుడు, ప్రాణాలు ఆత్మ నుండి ఆవిర్భవించినట్లు బృహదారణ్యకంలో చెప్పబడింది. కొన్ని చోట్ల సృష్టి ఆకాశంలో ప్రారంభించినట్లు చెప్పబడింది. కొన్నిచోట్ల అగ్నితో ప్రారంభించినట్లు చెప్పబడింది. కొన్ని చోట్ల ప్రాణాలు ఏడనీ, కొన్ని చోట్ల ఎనిమిదని చెప్పబడింది.
సూత్రం :- 218
" అస్తితు "
తు :-అలా అనడం సరి కాదు. అస్తి :- ఆకాశం కూడా బ్రహ్మం వలన ఉత్పన్నం అయినట్లు వేదాంత వాక్యం ఉన్నది.
భావం :- ఆకాశానికి కూడా బ్రహ్మవలన ఉత్పత్తి ఉన్నది.
వివరణ :- వేదాలలో ఆకాశానికి ఉత్పత్తి ఉన్నది అని చెప్పబడింది.
తైత్తరీయోపనిషత్తు(2,1):-బ్రహ్మం, సత్యం, జ్ఞానం, అనంతం అని ప్రారంభించి ఆ బ్రహ్మం నుంచి ఆకాశం, వాయువు, జనించాయి అని వర్ణించారు. బ్రహ్మను గురించి తెలుసుకున్నవాడు మోక్షాన్ని పొందుతాడు. అంటే తానే పరబ్రహ్మ అవుతాడు. "సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ" దహరాకాశంలో ఉన్న పరబ్రహ్మను తెలుసుకున్నవాడికి బ్రహ్మజ్ఞానంతో బాటు ఇష్టకామ్యార్ధసిద్ధి కలుగుతుంది. సృష్టికి మూలం బ్రహ్మ, దానినుంచే ఆకాశం పుట్టింది. అంటే ఆకాశం కూడా బ్రహ్మమే. బ్రహ్మం నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి భూమి ఈరకంగా పంచ భూతాలు ఉద్భవించాయి. కొన్ని చోట్ల సృష్టి తేజస్సుతో ప్రారంభమైనట్లు చెప్పబడింది. కొన్ని చోట్ల ఆకాశంతో ప్రారంభమైనట్లు చెప్పబడింది. కనుక ఈరెండు శ్రుతులకు విరోధం. ఈరెండు శ్రుతులకు ఏకవాక్యత్వం అంటే పరస్పర సమన్వయం చేసి విరోధం లేకుండా అర్ధం చెప్పడం ద్వారా ఒకేవాక్యంగా చెయ్యడం యుక్తం కదా! నిజమే, అది తెలుసు కోవడానికి ఏకవాక్యత్వం కల్పించడం శక్యం కాదు. ఎందువల్ల? ఒకేసారి వినబడుతున్న సృష్టికర్తకు సృజింపదగిన రెండు కర్మలలో తేజ ఆకాశాలలో అది తేజస్సును సృష్టించింది. అది ఆకాశాన్ని సృష్టించింది. అని చెప్పడం కుదరదు కదా! పప్పు వండి అన్నం వండుతున్నాను. ఇక్కడ ఒకేకర్త రెండు కర్మలలో అన్వయం కనబడుతోంది. తైత్తరీయంలో ఆకాశం ముందుగా పుట్టినట్లు చెప్పబడింది. రెండూ ముందుగా పుట్టడం కుదరదు. ఒక కర్త రెండు కర్మలలో అన్వయించదు. ఆకాశం పుట్టింది. దానినుండి తేజస్సు పుట్టింది. అని చాందోగ్యంలో చెప్పబడింది. తైత్తరీయంలో వాయువు నుండి అగ్ని పుట్టిందని వేరుగా చెప్పబడింది.
సూత్రం :- 219
"గౌణ్య సంభవాత్ "
అసంభవాత్ :- ముఖ్యమైన అర్ధం సంభవం కానందు వలన, గౌణ :- అముఖ్యమని ఎందుకు అనుకోకూడదు? ఆకాశం వ్యాపకం అని వర్ణించాడు కదా!
భావం :- ఆకాశానికి ఉత్పత్తి లేదనే వాడు, ఆకాశానికి పుట్టుక అసంభవం గాన క్షణికమైనది అని అర్ధం.
వివరణ :- ఆకాశం నిత్యమనే వారి వాదన ఈవిధంగా ఉంటుంది. ఆకాశం సర్వవ్యాపకమైనది. అది నిత్యమైనది. కాబట్టి ఆకాశం ఉత్పత్తి లేదు. వైశేషికులు, కణాదులు ఆకాశం విభువు, వ్యాపకం అని వర్ణించారు కదా! వ్యాపకమైన వస్తువు నిరవయవి. సావయవం, వ్యాపకం కానేరదు. సావయవం ఉత్పత్తి అవుతుంది. నిరవయవానికి ఉత్పత్తి లేదు. అది నిత్యం. కనుక ఆకాశం ఉత్పత్తి అయిందని అంగీకరించడం వీలు కాదు. కారణ సామాగ్రి లేనందున ఆకాశం ఉత్పత్తి జరగదు అంటారు. భూమి అగ్ని మొదలైన వాటి విషయాల్లో వీటి ముందు స్థితికి, తరువాత స్థితికి తేడా ఉంది. కాని ఆకాశం విషయంలో ఆ తేడా కనిపించదు. మట్టి కుండగా మారితే చాలా తేడా కనిపిస్తుంది. కాని ఆకాశం చిన్నది కావడం, పెద్దది కావడం, ఛిద్రం అవడం లాంటివి ఏవి కనిపించవు. కాబట్టి ఆకాశం గగనం శూన్యం. ఆకాశం అంటే శూన్యం తప్ప ఏమి లేదు.ఆకాశానికి ఉత్పత్తి చేసే మరొక శ్రుతి ఏది ఉదాహరించబడిందో అది గౌణిలా క్షణికం అనడమే యుక్తం. ఎందువలన? అసంభవం వలన, శ్రీమత్ కణాదుని మతాన్ని అనుసరించే వాళ్ళు జీవించి ఉండగా ఆకాశానికి ఉత్పత్తి ఊహించడానికి కూడా శక్యం కాదు కదా! ఆకాశానికి కారణసామాగ్రి లేదు కనుక దాని ఉత్పత్తిని వాళ్ళు నివారిస్తున్నారు. పుట్టే ప్రతి వస్తువు కూడా సమవాయి, అసమవాయి, నిమిత్తకారణముల వలననే పుడుతుంది. ద్రవ్యానికి ఒకే జాతికి చెందినది, అనేకము అయిన ద్రవ్యం పటానికి తంతుల వలె సమవాయికారణం అవుతుంది. ఆకాశాన్ని పుట్టించడానికి ఏకజాతీయము అయిన ద్రవ్యము ఏదీ లేదు. అలాంటి సమవాయికారణం ఏదైనా ఉంటే తంతువులు కలిసినట్లు అనేక ద్రవ్యాలు కలసి అసమవాయి కారణంగా అయితే ఆకాశం పుట్టడానికి వీలుఉండేది. ఆ రెండు లేనప్పుడు వాటి అనుగ్రహం చేతనే అంటే అవి ఉన్నప్పుడు మాత్రమే ప్రవర్తించే నిమిత్తకారణం ఆకాశానికి అసలే కుదరదు. పృథవ్యాదుల వలె కాక ఆకాశం అంతటా వ్యాపించి ఉండే లక్షణం పుట్టుక లేకపోవడం సిద్ధిస్తుంది. ఘటాకాశం, కరకాకాశం, గృహాకాశం, ఈ మొదలైన భేదాన్ని తెలిపే గౌణ ప్రయోగాలు ఆకాశం ఒక్కటే అయినా కూడా ఎలా వేరువేరుగా కనబడుతున్నాయో, వేదంలో కూడా ఆకాశేషు అని బహువచన శబ్దం కనబడుతున్నది. ఉత్పత్తి శృతి కూడా గౌణి అని గ్రహించాలి.
సూత్రం :- 220
"శబ్దాచ్చ"
చ - అంతే కాక, శబ్దాత్ :- వేదాంతవాక్యాల వలన ఆకాశోత్పత్తి గౌణం అనడం యుక్తం.
భావం :- వేదాంత వాక్యాల వలన ఆకాశోత్పత్తి గౌణం అంటే ముఖ్యం కానిది అనడం యుక్తం.
వివరణ:- శ్రుతివలన కూడా ఆకాశం ఉత్పత్తి చేయబడలేదు. బృహధారణ్యకంలో పంచభూతాలలో పృథవి, జలము, అగ్ని ఈ మూడు మూర్తములు, స్థూలమైనవి, స్థావరమైనవి, నాశనమైపోయేవి. ఇవి చక్షురాది ఇంద్రియాలకు గోచరిస్తాయి. వీటిని నిర్వచించడానికి వీలవుతుంది. పంచభూతాలలో మిగిలిన రెండు వాయువు, ఆకాశం అమూర్తములు, నాశనం లేనివి, నిర్వహించదానికి వీలుకానివి. అమృతములు. చావు పుట్టుక లేనివి. అలాగే తైత్తరీయంలో బ్రహ్మ నుంచి ఆకాశం ఉద్భవించింది. అంటే ఆకాశం కూడా బ్రహ్మమే అని చెప్పబడింది.
తైత్తరీయోపనిషత్తు:-మొదట ఆకాశం, తర్వాత వాయువు ఉత్పత్తి అయ్యాయి. ఆకాశఉత్పత్తి గౌణం అయితే వాయువు కూడా గౌణమే అని చెప్పవలసిన వస్తుంది. కనుక రెండింటికి ఉత్పత్తి ముఖ్యమే. వాయువు, అంతరిక్షం ఈ రెండు అమృతములు అని, ఆకాశానికి పుట్టుక లేదని చెబుతున్నది. అమృతమైన దానికి ఉత్పత్తి ఉండదు కదా! సర్వగతత్వం, నిత్యత్వం అనే ధర్మాల చేత బ్రహ్మను ఆకాశంతో పోలుస్తూ శబ్దం ఆకాశానికి కూడా ఆధర్మాలు ఉన్నాయని సూచిస్తోంది. ఆకాశం ఏ విధంగా అనంతమో అదే విధంగా ఈ ఆత్మ కూడా అనంతమని గ్రహించదగినది. ఆకాశం శరీరం బ్రహ్మ, ఆకాశం బ్రహ్మ యొక్క రూపం అని శ్రుతులలో చెప్పబడింది.
సూత్రం :- 221
" స్వా చ్చై కస్య బ్రహ్మశబ్దవత్ "
ఏ కస్య చ :- ఒక శబ్దానికి, బ్రహ్మశబ్దవత్ :- బ్రహ్మ శబ్దానికి ఉన్నట్లు, స్యాత్ :- రెండర్ధాలుఉండవచ్చుకదా!
భావం:- బ్రహ్మశబ్దానికి వలె ఒకే సంభూత శబ్దానికి ముఖ్యత్వము, గౌణత్వము కూడా ఉండవచ్చును.
వివరణ:-ఒకే ప్రకరణంలో విషయభేదం వలన అన్నం బ్రహ్మ అన్నప్పుడు బ్రహ్మశబ్దం ప్రధానం. ఆనందోబ్రహ్మ, అన్నప్పుడు బ్రహ్మశబ్దం ముఖ్యం అవుతుంది. అలాగే పరబ్రహ్మ నుంచి ఆకాశం పుట్టింది. అన్నప్పుడు ఆకాశం అప్రధానం. ఆకాశం నుండి వాయువు పుట్టింది. అన్నప్పుడు ఆకాశం ప్రధానార్ధంలో చెప్పబడింది.
తైత్తరీయోపనిషత్తు:-"తపసా బ్రహ్మ విజ్ఞాసస్య తపోబ్రహ్మేతి" తపస్సులో బ్రహ్మాన్ని తెలుసుకో. బ్రహ్మమే తపస్సు. బ్రహ్మ అంటే పరబ్రహ్మం అని ముఖ్యార్ధం. తపస్సని గౌణార్ధం కదా! అలాగే సంభూతం అనే పదానికి రెండు అర్ధాలు ఉండవచ్చును. ఆపరమాత్మ తపస్సుచేసి సర్వాన్ని సృజంచాడు. ఇందులో సర్వం సృష్టించాడని ఉన్నది. సర్వంలో ఆకాశం కూడా ఉన్నది. అప్పుడు ఆకాశత్పత్తి ముఖ్యార్ధమే. కనుక సంభూతకు గౌణార్ధం యుక్తం కాదు. ఆకాశం సంభూతః అన్నప్పుడు గౌణార్ధం చెప్పి అది నిజంగా పుట్టకపోయినా పుట్టినట్లున్నది అని చెప్పడం యుక్తం కాదు కదా! ఒకే శబ్దం ఒకచోట ముఖ్యార్ధాన్ని మరొక దానిలో సంబంధించి గౌణార్ధాన్ని ఎలా బోధిస్తుంది అని అర్ధం. ఆకాశానికి ఉత్పత్తి లేకపోతే బ్రహ్మతప్ప మరేది లేదు అనే ప్రతిజ్ఞ ఎలా సమర్థించబడుతుంది. ఎందువలననగా రెండవది అయిన ఆకాశం ఉండటం చేత బ్రహ్మ సద్వితీయం. దీనితోబాటు రెండవ వస్తువు కూడా ఉన్నచో అట్టిదే అవుతుంది. బ్రహ్మ తెలియబడితే సర్వము తెలియబడుతుంది అని చెప్పినది ఎలా కుదురుతుంది. ఒకడు వెనుకటి రోజున కుమ్మరి ఇంట్లో మట్టి, కర్ర, చక్రం మొదలైన వాటిని చూసి, మరునాడు అక్కడ తయారైన వివిధ పాత్రలను చూసి, నిన్న కేవలం మట్టి మాత్రమే ఉంది అని అంటాడో, వెనుకటి రోజున ఆ పాత్రలు లేవని మాత్రమే అభిప్రాయం ఉన్నవాడవుతాడు. కాని దండచక్రాదులు కూడా లేవని అనడు. అట్లే, ఏకము, అద్వితీయం అయిన బ్రహ్మ అన్నప్పుడు పూర్వావస్థలో ఒక్కటిగానే ఉంది అనగా తన కార్యాలేవి లేక బ్రహ్మ ఒక్కటే ఉంది అని అర్ధం. కాని తాను తప్ప మారేది లేదనే అర్ధం కాదు. అందుచేత బ్రహ్మంతోబాటు ఆకాశం ఉన్నదని ఏకత్వానికి భంగం లేదని భావం. పాత్రలకు ప్రకృతి అయిన మట్టికి కుంభకారుడు అధిష్ఠాత్తగా ఉన్నట్లు జగద్ప్రకృతి యైన బ్రహ్మకు అధిష్ఠాత ఎవరు లేరు అని శృతిలో చెప్పబడింది.ఆకాశానికి రెండవదిగా ఉండటం చేత బ్రహ్మకు సద్వితీయతత్వం కూడా ప్రాప్తించదు. భేదం అనేది లక్షణముల భేదాన్ని బట్టి ఏర్పడుతుంది. ఉత్పత్తికి పూర్వం వ్యాప్తత్వం, అమూర్తిత్వము అంటే రూపాదులు లేకపోవడం మొదలైనా ధర్మాల సామ్యం చేత పాలు నీళ్లు వలె కలిసిపోయిన బ్రహ్మాకాశాలను వేరువేరు లక్షణాలు లేవు కదా! సృష్టి సమయంలో బ్రహ్మ జగత్తును పుట్టించడానికి ప్రయత్నిస్తుంటే రెండవది ఊరికే కదలకుండ ఉంటుంది. అది బ్రహ్మ కన్నా వేరైనది అని నిశ్చయింపబడుతుంది. అందుచేతనే ఆకాశశరీరం బ్రహ్మ. ఇత్యాది శ్రుతులలో బ్రహ్మకు ఆకాశానికి అభేదం కల్పించబడింది. పుట్టిన ప్రతి వస్తువు ఆకాశం ఏదేశంలో ఏకాలంలో ఉంటుందో, ఆ దేశకాలాలలోనే పుడుతుంది. బ్రహ్మ యొక్క దేశకాలాల కంటే భిన్నం కాని దేశకాలములలోనే ఆకాశం ఉంటుంది. బ్రహ్మకు సంబంధించిన దేశకాలాల కంటే వేరుగా ఆకాశానికి దేశాకాలాలు లేవు. అందుచేత బ్రహ్మ దాని కార్యం తెలిస్తే ఆకాశం కూడా తెలియబడుతుంది.
సూత్రం :- 222
ప్రతిజ్ఞాహాని రవ్యతిరేకాచ్చభ్దేభ్యః
శబ్దేభ్యః :- శబ్ద ప్రమాణం వలన, అవ్యతిరేకాత్ :- వ్యతిరేకంగా కాకపోవడం చేత, ప్రతిజ్ఞ అహానిః :- ఆకాశం నిత్యమై, ఉత్పత్తి లేనిదైనా గౌణమని చెప్పిన ప్రతిజ్జకు ఏ హాని లేదు.
భావం :- శ్రుతి వాక్యాల వలన కార్యకారణములకు భేదం లేకపోవడం వల్లనే హాని, అహాని లభిస్తుందని సూత్రార్ధం.
వివరణ :- ఆకాశం వ్యాపకం, దానికి ఉత్పత్తి ఉన్నా మిగతా పదార్ధాలలో అన్వయం ఉన్నది. వ్యాపకం కానీ పదార్ధాలలాగా కొన్నింటిలో అన్వయం, మరికొన్నింటిలో అన్వయం లేకపోవడం ఉండదు.
బృహదారణ్యకోపనిషత్తు:- పృథివ్యాది సమస్త పదార్ధాలు ఆకాశంలో ఓత ప్రోతమై ఉన్నందున ఆకాశం వాటికి వ్యతిరేకం కాదు. కనుక అది నిత్యమై ఉత్పన్నం కానంతమాత్రాన సర్వం ఉత్పన్నం అవుతుందని చెప్పిన వాక్యానికి ఏ హాని లేదు. కనుక ఆకాశోత్పత్తికి సుంభూత అనే పదం గౌణంగా చెప్పినదే. ఉపనిషత్తులు ప్రతిపాదించిన బ్రహ్మము కన్నా ఏది భిన్నము కాదు. అందుచేత ఏ విషయాన్ని గురించి తెలుసుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుస్తాయో, దానిగురించి తెలుసుకోవాలి అనే మాట నిజమౌతుంది. బ్రహ్మం నుండి ఆకాశం పుట్టింది అని తైత్తరీయెపనిషత్తు లో చెప్పబడింది.
చాందోగ్యోపనిషత్తు:-ఉద్దాలకుడు శ్వేతకేతువునకు ఏవిషయాన్నిగురించి తెలుసుకుంటే అన్నివిషయాలు తెలుస్తాయో దాన్ని గురించి తెలుసుకోవాలి అని చెబుతాడు. అంటే సర్వానికి ఆధారమైనటువంటి పరబ్రహ్మ ఆత్మవిద్యకు మించినది ఏది లేదు.
ప్రశ్నోపనిషత్తు:-పిప్పలాదమహర్షి మహాజ్ఞాని. బ్రహ్మవేత్త. ఆయన దగ్గరకు సత్యకాముడు, గార్గ్యుడు మొదలైన ఆరుగురు శిష్యులు వచ్చారు. ఆత్మవిద్యకు మించినది ఏది లేదు. అదే మోక్ష విద్య. అది నేర్చుకోవడానికి పిప్పలాదమహర్షి దగ్గరకు వచ్చారు. ఆకాశం కూడా బ్రహ్మమే. బ్రహ్మ నుండి ఆకాశం పుట్టింది. కాబట్టి బ్రహ్మను గురించి తెలుసుకుంటే ఆకాశం గురించి తెలుస్తుంది. చాందోగ్యంలో ఆకాశంగురించి చెప్పలేదు. కాని ఖండించనులేదు. కాబట్టి ఆకాశాన్ని అంగీకరించినట్లే. పంచ భూతాలు ఏరకంగా ఉత్పత్తి అయినాయంటే తైత్తరీయంలో చెప్పినట్లుగా ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి భూమి ఉత్పత్తి అయినవి.
సూత్రం :- 223
“ యావద్వికారం తు విభాగో లోకవత్ "
తు:-ఈవాదం సరియైనది కాదు. లోకవత్:- ఈలోకంలో కనిపించే ఘటపటాదుల్లాగ, యావద్వీకారం :- కార్య పదార్ధాలన్నిటికి, విభాగః :- అవయవ విభాగాలున్నాయి.
భావం :- ఈ లోకంలో కనిపించే ఘట పటాదుల్లాగా కార్య పదార్ధాలాన్నిటికీ అవయవ విభాగాలు ఉన్నాయి.
వివరణ:- ఆకాశానికి ఉత్పత్తి ఉన్నదనే విషయం అనుమానంతో(logical inference)సాధిస్తున్నారు. బ్రహ్మ యందు విభాగం లేదు. అన్ని అందులోనుంచే ఉద్భవించాయి. పంచభుతాలు బ్రహ్మనుంచే వచ్చాయి. కాబట్టి ఆకాశానికి ఉత్పత్తి ఉన్నది. ఛాందోగ్యంలో చెప్పకపోయినా ఆకాశం ఉత్పత్తిని అందులో కాదనలేదు. మిగిలిన ఉపనిషత్తులలో బ్రహ్మనుండి ఆకాశం ఉత్పత్తి అయినదని చెప్పబడింది. కాబట్టి ఆకాశ ఉత్పత్తిఉన్నది. అవయవ విభాగాలున్న వస్తువును వికారం అంటారు. వికారాన్ని విభజించవచ్చును. వికారం సావయవం. కనుక ఘటపటాదులన్నీ సావయవాలు, వికారాలు. అలాగే ఆకాశమూ సావయవమే. వికారమే. పృధివ్యాది ద్రవ్యాల్లో ఒకటైన సూక్ష్మద్రవ్యం పైకి కనిపించదు. బుద్ధికి మాత్రమే గోచరిస్తుంది. పంచభూతాలలో ఒకటైన ఆకాశం వాయ్వాది స్థూలపదార్ధములతో మాత్రమే అన్వయిస్తుంది. కానీ జీవేశ్వరులతో అన్వయించదు. కనుక ఆకాశం వికారం, సావయవం, ఉత్పన్నం అయ్యేది కూడా! ఆకాశాన్ని అమృతం అన్నప్పుడు అది ఇతర పదార్ధాల కన్నా చిరస్థాయి అని సూచించడానికే. అంతే కాని నిత్యం అని చెప్పడానికి కాదు. కాబట్టి ఆకాశం బ్రహ్మం వల్ల ఉత్పనమైనది, ముఖ్యమైనది, కాని గౌణమనడం లేదు. సూత్రంలో తు అనే శబ్దం ఆకాశానికి ఉత్పత్తి అసంభవం అనే శంకను తొలగించడానికే. ఆకాశంపుట్టడం విషయంలో అది అసంభవం. మన కంటికి కనబడే వస్తువులు అన్ని కార్య సముదాయములే. ఉదా:- ఘటం, కటకం, సూది, ఖడ్గం. వికారం చెందనిదే వేరువేరు పదార్ధాలుగా కనబడదు. ఆకాశానికి పృథవ్యాదుల కంటే వేరుగా కనబడుతుంది. అవి వేరువేరుగా కనబడుతున్నాయి కనుక అవి కార్యములే. ఆత్మ స్వయం ప్రకాశం అవడం చేత పుట్టుక(కార్యం)కలది కాదు. కాని ఘటపటాదులే కార్యాలు. ఆత్మ స్వయంసిద్ధం. సత్ విషయంలో స్ఫూర్తివిషయంలో(ప్రకాశించడంలో)గాని పరాధీనం కాదు. అది స్వయంగానే ప్రకాశిసిస్తుంది. ఆకాశానికి సమానమైన కారణ ద్రవ్యం లేదు. సమాన జాతీయమైన కారణమే కార్యాన్ని పుట్టిస్తుంది. సంయోగం సహాయంతో ఒక ద్రవ్యం మరొక ద్రవ్యాన్ని పుట్టిస్తుంది. మృత్తుబీజం అంకురాది రూపంలో పరిణామం చెందినట్లు అనేక ద్రవ్యాలు పరిణామం చెందుతాయి. క్షీరాధికం పెరుగు మొదలైన రూపాలలో పరిణామం చెందినట్లు ఒకే వస్తువు పరిణామం చెందుతుంది. శ్రుతి వలన ఒకే బ్రహ్మం నుంచి ఆకాశాది మహా భూతాలు ఉత్పత్తి క్రమంలో జగత్తు పుట్టిందని నిశ్చయింపబడింది.
మాతరిశ్వాధికరణం ( 2, 3, 8 )
సూత్రం : 224
"ఏతేన మాత రిశ్వా వ్యాఖ్యాతః "
ఏతేన:- బ్రహ్మంవలన ఆకాశం ఉత్పన్నం అయిందని వ్యాఖ్యానించిన వేదాంతవాక్యాల వలన, మాతరిశ్వా:- వాయువు కూడా, వ్యాఖ్యాతః :- బ్రహ్మవలన ఉత్పన్నమైనదని తెలుస్తోంది.
భావం:- బ్రహ్మ వలన ఆకాశం ఉత్పన్నం అయిందని వ్యాఖ్యానించిన వేదాంత వాక్యాల వలన వాయువు కూడా బ్రహ్మ వలన ఉత్పన్నమైనదని తెలుస్తోంది.
వివరణ:-ఈఅధికరణంలో వాయువు ఆకాశం నుండి ఉత్పత్తి అయినదని తెలియజేస్తోంది. ఇదొక సందేహ సూత్రం. చాందోగ్యం లో ఆకాశం, వాయువులను చెప్పలేదు. తేజస్సును మాత్రమే చెప్పడం జరిగింది. అందుచేత వాయువుకు ఉత్పత్తి లేదు అంటారు. ఆకాశానికి ఉత్పత్తి ఉన్నదని చెప్పడం వలన వాయువుకు కూడా ఉత్పత్తి చెప్పినట్లే గ్రహించాలి. తైత్తరీయంలో బ్రహ్మనుండి ఆకాశం, ఆకాశంనుండి వాయువు ఉద్భవిస్తుందని అన్నారు కదా! అలాగే బ్రహ్మకు కూడా వేరొక బ్రహ్మతో ఉత్పత్తి చెప్పకూడదా? అని అడిగాడు కృష్ణశర్మ. సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు.ఈ ఆకాశవ్యాఖ్యానం చేత ఆకాశం ఆశ్రయంగా గల వాయువు కూడా వ్యాఖ్యనింపబడుతుంది. చాందోగ్యంలో ఉత్పత్త్యధికరణంలో చెప్పకపోవడం వలన వాయువుకు ఉత్పత్తి లేదని ఒక పక్షం, తైత్తరీయుల ఉత్పత్తి ప్రకరణంలో ఆకాశాద్వాయుః అంటే వాయువుకు ఉత్పత్తి ఉన్న దని మరొకపక్షం, పిమ్మట రెండుశ్రుతులకు విరోధం ఏర్పడినప్పుడు వాయువుకు ఉత్పత్తి చేసే శ్రుతి గౌణి అంటే ప్రాముఖ్యం లేదని మరొక అభిప్రాయం. మిగిలిన పదార్ధాల దృష్ట్యా వాయువు వినాశనం లేకుండా చాలాకాలం ఉంటుంది. వాయువుకు అస్తమయం లేదు. వాయువు ఉపాశించదగిన వాడని, సంవర్గ విద్యాదులలో వాయువుకు మహాభాగత్వం వినబడటం వల్ల, వాయువుకు అస్తమయం మొదలైనవి లేవని చెప్పడం వలన ఎవ్వనికైనా వాయువు నిత్యము అనే అశంక కలగవచ్చును. బృహదారణ్యకంలో వాయువే సర్వాత్మ అని చెప్పబడింది.అట్లే సంవర్గవిద్యలో వాయువే అగ్న్యాదులను తనలో లీనం చేసు కుంటుందనీ చెప్పబడింది. బ్రహ్మవలనే ఆకాశం ఉత్పన్నం అయినట్లుగానే వాయువుకూడా ఉత్పన్నమైనదని తెలుస్తోంది.
అసంభవాధికరణం ( 2, 3, 9 )
సూత్రం :-225
“ అసంభవస్తు సతోనుపపత్తేః "
తు:- కాగా, అనుపపత్తేః:- వికారి అని సిద్ధం కానందు వలన, సతః :- సత్ పదవాచ్యుడైన బ్రహ్మానికి ఉత్పత్తి అనేది, అసంభవః :- సంభవం కాదు.
భావం :- ఉపపత్తి లేకపోవడం వలన సత్ అయిన బ్రహ్మకైతే ఉత్పత్తి లేదు.
వివరణ:- ఆకాశానికి ఉత్పత్తి అసంభవం అన్నారు. మరి ఆ అసంభవమైన ఆకాశం నుండి వాయువు ఉద్భవిస్తుంది అన్నారు కదా! అలాగే బ్రహ్మకు వేరొక బ్రహ్మతో ఉత్పత్తి చెప్పకూడదా? అనేది సందేహం.
ఛాందోగ్యోపనిషత్తు:-సృష్టి పూర్వం సత్తే ఉండేది. దీని ప్రకారం బ్రహ్మం సత్ పదార్ధం. ఆకాశాది సృష్టికి మూలం. వికారి అయిన వస్తువులకే ఉత్పత్తి ఉంటుంది. ఆకాశం సావయవి. దానికి ఉత్పత్తి ఉన్నది. సత్పద వాచ్యమైన బ్రహ్మం వికారి కాదు. సావయవి కాదు.
శ్వేతాశ్వరోపనిషత్తు:- నిష్కళం, అవయవరహితం, నిరవయం ఉత్పన్నం కాదు. బ్రహ్మ మూలకారణం, అది అన్నిటికన్నా అధికం. దానికి కారణం లేదు. కనుక ఉత్పత్తిలేదు అని ప్రమాణం. కాబట్టి నిత్యమని చెప్పినంత మాత్రాన బ్రహ్మం ఆకాశం లాగ ఉత్పన్నం అయినదని చెప్పడం యుక్తం కాదు. సృష్టికి మూలం సత్ ఉండేది. సత్ అంటే బ్రహ్మ. అదే నిత్యమైనది, శాశ్వతమైనది, జరామరణములు లేనటువంటిది. ఆధ్యంతములు లేనటువంటిది. జన్మమృత్యువులు లేనటువంటిది. శాశ్వతమైన బ్రహ్మకు ఉత్పత్తి ఎక్కడుంటుంది? అన్నిటికి అనాదిఅయిన బ్రహ్మ ఇంకొక బ్రహ్మనుంచి పుట్టదు. ఊహించ డానికి శక్యం కాని ఉత్పత్తి గల ఆకాశం, వాయువులకు ఉత్పత్తి ఉన్నట్లే, బ్రహ్మకు కూడా ఏదో ఒక కారణం నుండి ఉత్పత్తి ఉండవచ్చునని ఎవరినికైనా అభిప్రాయం కలగవచ్చును. సద్రూపమైన బ్రహ్మకు కూడా మరొకదాని నుండి దేనినుండో ఉత్పత్తి జరిగినదని ఆశించకూడదు. ఎందువలనంటే అనుపపత్తి వలన. బ్రహ్మ కేవలం సద్రూపం. ఉనికియే స్వభావం కలది. దానికి సన్మాత్రం నుండియే ఉత్పత్తి సంభవం కాదు. సన్మాత్రమైన బ్రహ్మ మరొక సన్మాత్రం నుండి పుట్టదు. సామాన్యమైన మృత్తు నుండి ఘటాదులైన విశేషాలు పుడుతున్నాయి. కాని విశేషం నుండి సామాన్యం పుట్టడం లేదు. అసత్తు నుండి బ్రహ్మ పుట్టదు. అసత్తు స్వరూప రహితమైనది. అసత్తు నుండి సత్తు ఎలా పుడుతుంది. బ్రహ్మను పుట్టించిన కారణం ఏదీ లేదని చెబుతున్నది. ఆకాశపవనాలకు ఉత్పత్తిఉన్నట్లు చూపబడినది. బ్రహ్మవిషయంలో అలాంటిది ఏదీ లేదు. అందుచేత ఈరెండింటికి వైషమ్యం ఉంది. కార్యాలైన వాటినుండి మాత్రమే కార్యాలు పుడుతున్నాయి. బ్రహ్మకార్యమే అయి ఉండడం తగదు. ఏది మూల కారణం లేని మూల ప్రకృతి అని అంగీకారిస్తారో అదే బ్రహ్మ అని గ్రహించాలి.
తేజోధికరణం ( 2, 3, 10 )
సూత్రం :- 226
" తేజో తస్త ధా హ్యావా "
అతః :- ఆవాయువు నుంచి, తేజః :- అగ్ని ఉత్పన్నమవుతుంది. హి :- అని, తధా అహ :- వేదాంత వాక్యం వర్ణించింది.
భావం :- వాయువు అగ్ని నుంచి ఉత్పన్నమౌతుందని వేదాంత వాక్యం వర్ణించింది.
వివరణ:-తేజస్సు అంటే అగ్ని. అది వాయువు నుండి పుట్టింది. అంతే కాని బ్రహ్మనుంచి పుట్టలేదు. ఛాందోగ్యంలో చెప్పినట్లు బ్రహ్మనుండి ఆకాశం పుట్టింది. అంటే ఆకాశం బ్రహ్మమే. ఆకాశం నుంచి వాయువు పుట్టింది. వాయుబ్రహ్మం నుంచి అగ్ని పుట్టింది. అంటే అగ్నికూడా బ్రహ్మమే. ఈరకంగా పంచభూతాలు పరబ్రహ్మ స్వరూపాలే. ఇక్కడ బ్రహ్మనుంచి అగ్ని పుట్టింది. అంటే వాయు బ్రహ్మ నుంచి అగ్ని పుట్టింది అని అర్ధం.
చాందోగ్యోపనిషత్తు :- బ్రహ్మం సృష్టికి పూర్వమే ఉన్నది అని ప్రారంభించి, ఆ బ్రహ్మ తేజస్సును సృష్టించింది. అయితే వాయువు నుంచి అగ్ని ఉత్పత్తి అయినదని అన్నారు కదా!
తైత్తరీయోపనిషత్తు:-బ్రహ్మం వలన ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్నిని బ్రహ్మం సృష్టించాడని తెలుసుకోవాలి. సర్వము బ్రహ్మ నుండి పుట్టిన్నదని అంగీకరిస్తే సర్వవిజ్ఞాన ప్రతిజ్ఞ కుదురుతుంది. పుట్టుకకు అపాదానమైన ఆత్మ పంచమీవిభక్తిలో నిర్దేశించబడినది. దేని నుండి మరొకటి పుట్టినదని చెప్పబడిందో ఆది అపాదానం. బ్రహ్మనుండి ఆకాశం పుట్టినదని అన్నప్పుడు బ్రహ్మ అపాదానం. దానికి పంచమీవిభక్తి చేర్చబడుతుంది. ఆకాశాన్ని, వాయువుని సృష్టించి వాయుస్వరూపాన్ని పొందిఉన్న బ్రహ్మతేజస్సును సృష్టించాడు అని చెప్పినా కూడా తేజస్సు బ్రహ్మనుండి పుట్టినదాని చెప్పడంలో విరోధం లేదు కదా! ఆవు యొక్క కాచిన పాలు, ఆవు యొక్క పెరుగు, ఆవు యొక్క అమిక్ష అని అంటారు. అమిక్ష అంటే పాలు, పెరుగు కలిపి తోడు పెట్టినప్పుడు, ఆపాలు విరిగి, కొంతభాగం గట్టిగాను, కొంత భాగం నీళ్లలాగా ఏర్పడుతుంది. గట్టిగ ఏర్పడిన భాగం అమిక్ష అవుతుంది. ప్రత్యక్షంగా లభించినవి పాలు మాత్రమే. పాలనుండి పెరుగు, పెరుగునుండి అమిక్ష తయారయ్యాయి. అయినా ఆపెరుగు అమిక్ష నుండి కాకుండా ఆవునుండి పుట్టినట్లు పారంపర్యేనా ఎలా చెప్పబడుతుందో, అదే విధంగా తేజస్సుకు వాయువు కారణమని భావించినా, తేజస్సుకు బ్రహ్మయే కారణమని పారంపర్యంగా చెప్పుకున్న విరోధం లేదు. బ్రహ్మ తన వేరువేరు రూపాలలో తన కార్యాలను నిర్వహిస్తున్నట్లుగా చూపుతున్నది. భగవద్గీతలో భూతాలకు నానుండీయే వేర్వేరు భావాలు కలుగుతున్నాయి అని చెప్పబడింది. బుద్ధి మొదలైనవి తమతమ కారణములనుండి పుడుతున్నట్లు ప్రత్యక్షంగా కనబడుతున్నాకూడా సమస్తవస్తువులు కూడా సాక్షాత్తుగా కాని, పరంపరగా కాని ఈశ్వరుని వంశానికి చెందినవే. అందుచేత అన్ని తన నుంచే పుట్టుచున్నాయని శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీత లో చెప్పాడు.
అబధి కరణం ( 2, 3, 11 )
సూత్రం :- 227
" అపః "
ఆ అగ్ని నుండి జలం పుట్టింది. అగ్నేః ఆపః :- అగ్ని నుండి జలం జన్మించాలి.
భావం :- ఈ అధికరణంలో అగ్ని నుండి జలం పుట్టినట్లుగా చెప్పబడింది.
వివరణ:- గురువు గారు! ఛాందోగ్యంలో బ్రహ్మ నుంచి జలం పుట్టినట్లుగా చెప్పబడింది. బ్రహ్మం సృష్టికి ముందే ఉన్నదని, ఆ బ్రహ్మ తేజస్సును, వాయువును, జలమును సృష్టించిందని స్పష్టంగాఉన్నది. బ్రహ్మ తేజస్సు నుంచి జలమును సృజించా డని తెలుస్తోంది. తైత్తరీయోపనిషత్తులో అగ్ని నుండి జలం పుట్టిందన్నారు కదా! మరి జలానికి ఉపాదాన కారణం ఏది? అని అడిగాడు కృష్ణశర్మ. ఇంతకు ముందు వాయువు నుంచి ఆకాశం పుట్టినట్లుగానే అగ్నినుంచి జలం పుట్టింది. వాయుబ్రహ్మ నుంచి అగ్ని పుట్టింది. పంచభూతాలు పరబ్రహ్మస్వరూపమైనందున తేజోబ్రహ్మ నుంచి జలం పుట్టినట్లుగా అర్ధం చేసుకోవాలి. ఇక్కడ శ్రుతివాక్యం ఉన్నందుకు వలన సంశయానికి తావు లేదు. తేజస్సును సృష్టించిన తరువాత పృద్వియొక్క సృష్టిని ప్రతిపాదిస్తూ, మధ్యలో ఉదకం గురించి చెప్పాలనే ఉద్దేశ్యంతో ఆచార్యులు "అపః" అని సూత్రం చెప్పారు. బ్రహ్మ ఉదకాన్ని సృష్టించాడని చెప్పే శ్రుతికి, అగ్ని నుండి ఉదకం ఉద్భవించిందని చెప్పే విరోధం ఉందని పూర్వపక్షం అభిప్రాయం. ఉదకం అగ్ని చేత దహిస్తుంది కనుక జలం నుండి అగ్ని పుట్టడం అసంభవం అని అధికమైన శంక. బ్రహ్మ జలాన్ని సృష్టించాడన్నా, అగ్ని నుంచి జలం పుట్టిందన్నా విరోధం లేదని భావం.
పృధి వ్యధికారాధికరణం ( 2, 3, 12 )
సూత్రం :- 228
"పృధి వ్యధికా రూప శబ్దాంతరేభ్యః
పృధివి:- జలం నుంచి పృథివి ఉత్పన్నమైనది. అధికార రూప శబ్దాంత రేభ్యః :- చాందోగ్యప్రకరణం వలన, రూపం వలన, వర్ణనల వలన, శబ్ద ప్రమాణం వలన, ఛాందోగ్యం లో వర్ణించిన అన్నం అంటే పృధివి అనే గ్రహించాలి.
భావం :- జలం నుంచి పృధివి ఉత్పన్నమైనది. రూపం వలన, వర్ణనల వలన, శబ్ద ప్రమాణం వలన చాందోగ్యంలో వర్ణించిన అన్నం అంటే పృధివి అని గ్రహించాలి.
వివరణ :- జలం నుంచి భూమి ఉద్భవించింది. జలం బ్రహ్మమే కనుక జల బ్రహ్మ నుంచి పృధ్వి బ్రహ్మ ఉద్భవించింది.
ఛాందోగ్యోపనిషత్తు:-(6,2,4):-ఆజలం అన్నాన్ని సృష్టించింది. అన్నవాక్యంలో అన్నంఅనే పదానికి అర్ధం పృథివి అని తెలుసు కోవాలి. ఎలాగంటే, అగ్ని జలం అనే భూత సృష్టి చేశాడు. ఇదే ప్రకరణంలో ఆజలం అన్నాన్ని సృష్టించింది అని చెప్పబడింది. పంచభూతాల వర్ణనలో అన్నం అంటే భూమి వరుస అని అర్ధం చేసుకోవాలి. అన్నానికి నలుపు రంగు ఉన్నది. భూమి వర్ణం నలుపు కదా! కనుక రూపం చూసినా అన్నమంటే పృధివి అని తేలుతుంది.
తైత్తరీయోపనిషత్తు:-నీటి వలన పృధివి ఉద్భవించింది. ఈ కారణముల చేత చాందోగ్యంలో ఉన్న అన్న శబ్దం పృధివి వాచకం. కనుక జలం నుంచి పృధివి ఉత్పన్నమైనదని సిద్ధాంతం. అనేక రూపాలుగా మారి అనేక రసాదులను సృష్టించాలని ఆ జలం అనుకున్నది. అలాతలచి అవి అన్నం సృజించాయని శృతిలో వినబడుతుంది. అక్కడ ఈ అన్నశబ్దం చేత వరిధాన్యం, యవలు, మొదలైనవి చెప్పబడుతున్నాయా? తినదగిన వరిఅన్నం మొదలైనవి చెప్పబడుచున్నాయా? లేక పృధివి చెప్ప బడుతోందా? అనే సందేహం కలుగుతుంది. ఏప్రాంతంలో వర్షాలు బాగా పడితే అక్కడ పంటలు బాగా పండతాయి. వర్షం వలన పంటలు అధికమౌతాయి, కాని భూమివలన కాదు. ఉదకం నుండి పుట్టేది పృథవియే. అధికారంవలన, రూపంవలన, శబ్దంవలన భూమిని అన్నశబ్దంతో చెప్పబడుతోంది కాని పంచభూతాలలో ఒకటైన పృధివిని కాదని వ్రీహ్యాదులను గ్రహించడం న్యాయంకాదు. పృధివికి కృష్ణరూపం ఉన్నట్లుగానే అదేరూపం అన్నానికి కనబడుతుంది. భూమి నల్లగా ఉంటుందనే నియమం లేదు కదా! శ్వేతరోహిత వర్షాలు అధికంగా ఉండవు కదా.. రాత్రి పూట భూమి యొక్క ఛాయ నల్లగానే ఉంటుంది. అందుచేత పృథవి రూపం నల్లనిది అని చెప్పడం యుక్తంగా ఉంటుంది. బృహదారణ్యాకోపనిషత్తులో చెప్పినట్లుగా నీళ్ళల్లో మట్టి వంటి పదార్ధం భూమి అయింది.
తదభిధ్యానాధికరణం ( 2, 3, 13 )
సూత్రం :- 229
" తదభి ధ్యానా దేవ తు తల్లింగాత్ సః "
తు :- ఎలా అంటే, తత్ అభిధ్యానాత్ :- సంకల్పంతో కూడిన ఈ క్షణం వలన, తత్ లింగాత్ :- కర్త్వత్వ లక్షణం వలన, స ఏవ:- బ్రహ్మకు పృధివ్యాది భూత సృష్టికి కారణం,
భావం :- బ్రహ్మం వల్ల ఆకాశం జనించిందని అంటున్నారు. మరి ఆకాశం నుంచి ఈ వాయువు మొదలైనవి ఉద్భవించాయి కదా! వాటి ఉత్పత్తికి బ్రహ్మంఎలా కారణం అవుతుంది? ఎలాఅంటే, సంకల్పంతో కూడిన ఈక్షణం వలన కర్త్వత్వ లక్షణం వలన బ్రహ్మ పృధివ్యాది భూత సృష్టికి కారణం అవుతున్నాడు.
వివరణ:- గురువుగారు! ఆకాశం మొదలైన పంచభూతాలు సృష్టించబడ్డాయి. అయితే జగత్తులోని నదులు, సముద్రాలు, కొండలు, పర్వతాలు, అడవులు, వీటన్నింటిని పంచభూతాల సృష్టిస్తున్నాయా? లేక పరబ్రహ్మ వాటిని సృష్టిస్తున్నాడా? అని అనుమానం వ్యక్తం చేశాడు కృష్ణశర్మ. ఆమాటలు విన్న రత్నకారుడు చెప్పడం ప్రారంభించాడు. సర్వకార్యాలకు కర్త పరమేశ్వరుడే తప్ప పంచభూతాలు కావు. అసలు ఈభూతలకు ఆశక్తి కూడా లేదు. ఈవస్తువులను సృష్టించాలనే పరమేశ్వరుని కోరిక వల్లనే ఈ సృష్టి జరుగుతోంది.
బృహదారణ్యకోపనిషత్తు:- యాజ్ఞవల్కుడు చెబుతాడు, అగ్నిలో ఉంటాడు. అగ్ని అతన్ని ఎరుగదు. అగ్ని అతని శరీరం. అగ్నిలో ఉంటూ అగ్నిని నియంత్రయిస్తాడు. అతడే సర్వాంతర్యామి అయిన ఆత్మ. ఈ విధంగా అతడు పంచభూతాలలోనూ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఒకటేమిటి అన్నిచోట్ల ఉంటూ అన్నింటిని నియంత్రిస్తాడు. కాబట్టి సృష్టి అంతా పరమేశ్వర కృతమే. బ్రహ్మ నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, జలం నుంచి పృద్వి.. ఇది పరంపర. కాని బ్రహ్మ పరంపరాకారణం కాదు. కుమ్మరి కుండలని నిర్మిస్తూ, వాటికీ ఎలా సాక్షాత్కారణం, కర్త అవుతున్నాడో అలాగే బ్రహ్మ కూడా సకలానికి కర్త, పృధివ్యాదులకు స్రష్ట అవుతున్నాడు. స్వయంగా ఆయనే ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి ఇత్యాదుల రచయిత. కుమ్మరి ముందు మట్టితో గుండ్రటి ఆకారాన్ని తయారుచేసి, వాటి మూలంగా ఘటాన్ని తయారుచేస్తాడు. అలాగే బ్రహ్మ ముందు ఆకాశాన్ని రచించి, దాన్నుండి వాయువును, దాని మూలంగా అగ్ని మొదలైనవాటిని స్వయంగా రచించాడు. కాబట్టి పరంపరాకారణం అనడం తగదు. ఈక్షణం అంటే ఛాందోగ్యంలో బ్రహ్మ సృష్టిరచనను సంకల్పించాడని తెలుస్తోంది. బ్రహ్మయే సర్వాత్మ. ఉదకం, తేజస్సు, ఈక్షణం చేసినట్లు ఏది వినబడుచున్నదో, అది పరమేశ్వరుని వశంచేతనే అని భావించాలి. శ్రుతిలో సత్ అంటే బ్రహ్మయే, ఈక్షిత ప్రకృతమైనది కదా! అందుచేత అవి తేజస్సులు ఈక్షించినవి అని చెప్పినప్పుడు కూడా ఆ ఈక్షిత అప్ తేజోరూపంలో ఉన్న బ్రహ్మయే అని అర్ధం.
విపర్యయాధికరణం ( 2, 3, 14 )
సూత్రం :-230
"విపర్యయేణ తు క్రమోత ఉపపద్యతే చ "
అతః:- భూత ఉత్పత్తిక్రమానికి, విపర్యయేణ:-విపరీతంగా, క్రమః :- ప్రళయ క్రమం ఉంటుందని, ఉప పద్యతే చ :- తెలుసుకోవడం యుక్తం కూడా.
భావం:- పరబ్రహ్మ సమస్త జగత్తును రచిస్తాడు. ఈ భూతఉత్పత్తికి ప్రళయ కాలం ఉంటుందని, ఈ జగత్తు అంతా ఆయనలోనే లీనమైపోతుందని తెలుసుకోవాలి.
వివరణ:- కారణంలోనే కార్యం లయం అవుతుంది. కాబట్టి సృష్టిజరిగిన విధానానికి లయం జరుగుతుంది. లయం అంటే లయం జరిగేటప్పుడు మొదటగా భూమి జలంలో, జలం అగ్నిలో, అగ్ని వాయువులో, వాయువు ఆకాశంలో, ఆకాశం పరబ్రహ్మలో లీనమైపోతుంది. ఇదే వ్యతిరేక దశ. ఈదశగానే లయం జరుగుతుంది.
తైత్తరీయోపనిషత్తు:-(3,1):-బ్రహ్మం ఆకాశాన్ని ముందుసృష్టించి తరువాత వాయువు, అగ్ని, జలం, పృథవి లాంటి భూతాలను సృజించాడని, పూర్వం అనుకున్నాము. ప్రళయక్రమం దీనికి విపరీతంగా ఉంటుంది. పృథవి జలంలో, జలం అగ్నిలో, అగ్ని వాయువులో, వాయువు ఆకాశంలోను క్రమంగా లీనమౌతాయి. ఆఆకాశం లీనమై ఈశ్వరునిలో నిలుస్తుంది. కార్యం కారణ రూపం పొందడమే ప్రళయం. ఘటం ప్రళయమై మట్టిలో లీనమౌతుంది. కుండలాది భూషణాలు నశించి బంగారంలో లీనమౌతాయి. కనుక ఉత్పత్తిక్రమానికి ప్రళయక్రమం విపరీతమని స్పష్టమౌతోంది. ఉత్పత్తిక్రమం చేతనే జరుగుతోందా? లేదా దానికి విపరీతమైన క్రమంచేత జరుగుతోందా? భూతాల ఉత్పత్తి, స్థితి, ప్రళయాలు మూడు కూడా బ్రహ్మ మీదనే ఆధారపడి ఉన్నాయి. విశేషం ఏదీ లేదు. ఈక్రమంలో నియమం ఏమి లేదు. ప్రళయక్రమం ఉత్పత్తిక్రమానికి విపరీతంగా జరగడం యుక్తం. ఎందువలనంటే ఏ క్రమంలో మెట్లు ఎక్కుతామో దానికి విపరీతమైన క్రమం చేతనే దిగుతాము. అంతే కాకుండా మట్టికుండ పుట్టిన ఘటాదులు వినాశకాలంలో మట్టిగా మారిపోతాయి. జలంనుంచి పుట్టిన మంచు, వడగళ్లు, మొదలైనవి నీరుగా మారిపోతాయి. అందువలన ఉదకంనుండి పుట్టిన భూమి లయకాలంలో ఉదకంలో లీనమవ్వడం, తేజస్సునుండి ఉదకం తేజస్సులో లీనమవ్వడం, ఈవిధంగా సూక్ష్మం సూక్ష్మతరం అయిన సమస్త కార్య సముదాయం కూడా క్రమంగా తన తరువాతది, దాని తరువాత అయిన కారణంలో ప్రవేశించి చివరకు పరమకారణము పరమసూక్ష్మం దగ్గర తన కారణానికి కారణమైన దానిలో లీనం అవడం న్యాయం కదా! ఏ కార్యమైన ముందుగా తన కారణంలో లీనం కావాలి. ఆకారణం తన కారణంలో లీనం కావాలి. ఉత్పత్తిక్రమంలో చెప్పబడిన ఉత్పత్తిక్రమం ప్రళయంలో ఉండడం కుదరదు. కార్యం నిలిచి ఉండగా కారణం నశించడం యుక్తం కాదు కదా! కారణంనశించిన తరువాత కార్యం ఉండజాలదు. కార్యం నశిస్తే మాత్రం కారణం ఉండటం యుక్తమే. మృదాదుల విషయంలో ఇలా కనబడుతున్నది కదా! ఘటం (కార్యం ) నశిస్తే మట్టి (కారణం )మాత్రమే ఉంటుంది.
అంతరా విజ్ఞానాధికరణం ( 2, 3, 15 )
సూత్రం :- 231
" అంతరావిజ్ఞానమనసీ క్రమేణ తల్లింగాదితి చేన్నావిశేషాత్
అంతరా:- బ్రహ్మానికి, ఆకాశానికిమధ్య, విజ్ఞానమనసీ :- విజ్ఞానం మనస్సులను, క్రమేణా :- క్రమంగా, అవిశేషాత్ :- ఏ మంత విశేషం లేనందు వల్ల, సవిస్తారంగా, తత్ లింగాత్ ఇతి చేత్ న :- ఆకాశాదుల్లాగా, వాటి ఉత్పత్తి క్రమాన్ని వేరేగా వర్ణించలేదు.
భావం:- బ్రహ్మానికి ఆకాశానికి మధ్య విజ్ఞానం మనస్సులను ఏమంత విశేషం లేనందువలన ఆకాశాదుల్లాగ వాటి ఉత్పత్తి క్రమాన్ని వర్ణించలేదు.
వివరణ:-ఈసూత్రంలో విజ్ఞానంఅంటే మహత్తు, అహంకారంఅంటే సూక్ష్మభూతాలు, మనస్సుఅంటే జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు. ఈప్రక్రియ ఇదివరలోనే చెప్పినందువల్ల మళ్ళీ విశేషంగా వర్ణించలేదని సూత్రానికి అర్ధం. ఆత్మకి, భూతాలకు మధ్య వరుసగా విజ్ఞానము, ఇంద్రియము, మనస్సు అనేవి ఉన్నాయి. ఇంద్రియాలకు, భూతాలకు పెద్దగా తేడా ఏమి లేదు. విజ్ఞానం అంటే బుద్ధి , ఇంద్రియాలే ప్రాణాలు. మనస్సు అంటే సంకల్ప వికల్పలకు నిలయమైనది.
కఠోపనిషత్తు:- ఇంద్రియాలు గుర్రాలు, మనస్సు సారధి, మంచి సారధి చేతిలోని ఉత్తమాశ్వాసాలుగా ఇంద్రియాలు మన అధీనంలో ఉండాలి. భూతాలయొక్క ఉత్పత్తి వల్లనే భౌతికమైన ఇంద్రియల ఉత్పత్తి కూడా తెలుస్తోంది. అందుచేత వేరుగా చెప్పలేదు. భూతాల స్వరూపాలే ఇంద్రియాలు.
ఐతరేయోపనిషత్తు:-సృష్టిని గురించి చెబుతూ, పరమాత్మ విరాటస్వరూపాన్ని దృష్టిలో ఉంచుకొని తీవ్రమైన ఆలోచన చేశారు. అదే తపస్సు. దానిఫలితంగా ఆస్వరూపానికి నోరు వచ్చింది. వాక్కుకు అభిమానదేవత అగ్ని అంటూ ఇంద్రియలకు అభిమాన దేవతలను వివరించారు. నోరు-అగ్ని, ముక్కు-వాయువు, కన్ను-సూర్యుడు, చెవులు-దిక్కులు, మనస్సు - చంద్రుడు, జననేంద్రియములు - జలం,(వీర్యము), ఈరకంగా భూతాలు, ఇంద్రియాలు, ఒకటే కాబట్టి ఇంద్రియాల గురించి వేరుగా చెప్పలేదు . ఈమనోబుద్ధులు కూడా ఎక్కడో ఒకచోట మధ్యలో పుట్టాయని ప్రళయం పొందుతాయని అంగీకరించాలి. ఎందుకంటే సకలవస్తువులు బ్రహ్మం నుండి పుట్టాయని అంగీకరించాలి. అధర్వణంలో ఉత్పత్తిప్రకరణంలో భూతాలకు, ఆత్మకు మధ్య కరణాలు అంటే అవయవాలు గురించి చెప్పబడింది. ఆత్మనుండి భూతాలకంటే ముందుగా ప్రాణము, మనస్సు, ఇంద్రియాలు పుట్టినట్లు ఈ వాక్యంలో చెప్పబడటం చేత భూతల వెనుక చెప్పిన ప్రళయ క్రమానికి భంగం కలగదు. కరణాలు అంటే (అవయవాలు) భౌతికాలే. భూతాలనుండి జన్మించినవే. భూతల ఉత్పత్తిప్రళయ కాలం వీటికి కూడా వర్తిస్తుంది. కరణాలకు, భూతాలను కలిపి చెప్పడం జరిగింది. కాని వాటి ఉత్పత్తిక్రమం ఏదీ చెప్పబడలేదు. అందుచేతనే మరొక శ్రుతిలో భూతోత్పత్తి క్రమానికి భంగం లేదు అని చెప్పబడింది.
చరాచర వ్యపాశ్రయాధికరణం ( 2, 3, 16 )
సూత్రం :- 232
" చరాచర వ్యపాశ్రయస్తు తద్వ్యపదేశో భాక్తి స్తద్భావ భావి తత్వాత్ "
తు :- జీవాత్మకు జనన మరణాలు వర్తించవు. తత్ వ్యపదేశః :- ఉత్పత్తి, వినాశనాలు, చరాచర వ్యపాశ్రయః :- చరాచర శరీరాలకు సంబంధించినవి, తు :- కాగా, తత్ భావభావి తత్వాత్ :- శరీరాలు ఉన్నప్పుడు ఈ జనన మరణాలు సంభవించడం చేత, భాక్తేః :- జీవత్మా పట్ల గౌణంగా వ్యవహారిస్తున్నారు.
భావం :- జీవాత్మకు జననమరణాలు వర్తించవు. ఉత్పత్తి, వినాశనాలు చరాచర శరీరాలకు సంబంధించినది. శరీరాలు ఉన్నప్పుడు ఈ జనన మరణాలు సంభవించడం చేత జీవాత్మ పట్ల గౌణంగా వ్యవహారిస్తున్నారు.
వివరణ:-ఈ అధికరణంలో జీవుని ఉత్పత్తి, లయం నిజం కాదు అని తెలియజేస్తోంది. గురువుగారు! ఇంత వరకు భూతాలు, ఇంద్రియాలు వాటి పుట్టుక, లయం గురించి చెప్పారు. మరి జీవుని మాటేమిటి? జీవుడికి చావు పుట్టుకలు ఉన్నాయా? లోకంలో రాముడు పుట్టాడు. కృష్ణుడుమరణించాడు అని వ్యవహారంలోఉంది. అంటే జీవి పుట్టింది. మరణించింది అంటున్నాముకదా! అన్నాడు కృష్ణశర్మ. ఆమాటలు విన్న రత్నాకరుడు శిష్యుని సందేహం తీరుస్తున్నాడు. జీవునికి జనన మరణాలు లేవు. కాని అవి ఉన్నాయని చెప్పడం కేవలం అతని శరీరాన్ని బట్టి చెబుతారు. వీటితో జీవుడికి సంబంధం లేదు. జీవుడు శరీరంలో ప్రవేసిస్తే అతను పుట్టాడు అంటాము. ఆశరీరం వదలి పెడితే మరణించాడు అంటాము. ఇది ఇలా ఎందుకు జరుగుతోంది? కర్మఫలితం అనుభవించడానికి, కర్మఫలితం అనుభవించగానే మాసిన వస్త్రం వదలి ఏ విధంగా మనం క్రొత్త వస్త్రం ధరిస్తామో, అలాగే జీర్ణమైన ఈదేహాన్ని వదలి ఈజీవి ఇంకొక దేహంలో ప్రవేశిస్తుంది.. జీవుడు వేరు. బ్రహ్మ వేరు కాదు. ఇద్దరూ ఒక్కటే. అయినా అజ్ఞానంతో తాను, బ్రహ్మ వేరు అనుకుంటుంది.
ముండకోపనిషత్తు:-ఒకే వృక్షంమీద రెండుపక్షులు కూర్చుని ఉన్నాయి. అందులో ఒకటి తన కర్మలవలన వచ్చిన ఫలితాలను అనుభవిస్తున్నది. రెండవదినిర్వికారంగా చూస్తోంది. వీటిలో మొదటిది జీవాత్మ. రెండవది పరమాత్మ. వారిద్దరికీ భేదం లేదు. అజ్ఞానము తొలగిపోతే జీవాత్మ పరమాత్మలో లీనమైపోతుంది. కాబట్టి జీవుడికి చావుపుట్టుకలు లేవు.
ఐతరేయోపనిషత్తు:-ఈజీవరాశిని సృష్టించిన తరువాత పరమేశ్వరుడు తాను కూడా ఇందులో ప్రవేశించాలని అనుకున్నాడు. శరీరంలో ప్రవేశించాడు. కాబట్టి జీవుడికి చావుపుట్టుకలు లేవు అన్నాడు రత్నాకరుడు. జీవునకు ఉత్పత్తి, ప్రళయాలు లేవు. జీవుడు శరీరంతోబాటు నశిస్తే మరొకశరీరానికి సంబంధించిన ఇష్టాన్ని పొందడానికి అనిష్టాన్ని పరిహరించడానికి చెప్పబడిన విధి, ప్రతిషేధాలు వ్యర్థం అవుతాయి. ఈశరీరం జీవుణ్ణి మినహాయించి మరణిస్తుంది. జీవుడు మరణించాడు అంటారు. ఈ జన్మమరణశబ్దాలు స్థావరజంగమశరీరాలకు సంబంధించినవి. స్థావరజంగమాలైన భూతాలు పుడుతుంటాయి. నశిస్తుం టాయి. అందుచేత ఈ జన్మమరణ శబ్దాలు వాటి విషయంలో ముఖ్యమైనవి. ఆశరీరాలలో ఉన్న జీవునియందు ఆరోపించ బడుతున్నాయి. శరీరఉత్పత్తి, వినాశనం జరిగినప్పుడే ఈ జన్మమరణ శబ్దాలు ప్రయోగింపబడుతున్నాయి. కాని అవి లేనప్పుడు ప్రయోగించబడడం లేదుకదా! జన్మమరణ శబ్దాలకు నిమిత్తం శరీరసంయోగ వియోగాలే అని శ్రుతి చెబుతున్నదీ.
సూత్రం :- 233
" నాత్మా శృతేః నిత్యత్వాచ్చ తాభ్యః "
ఆత్మ:- జీవాత్మ కు, న :- చావు పుట్టుకలు లేవు. అశ్రుతేహ్ :- ఉపనిషత్తులు జనన మరణాలను ధ్రువీకరించవు. తాభ్యః :- శృతులు ఘోషించడం వలన, నిత్యత్వాత్ చ :- నిత్యమైనందు వలన,
భావం :- జీవాత్మకు చావు పుట్టుకలు లేవు. ఉపనిషత్తులు జనన మరణాలను ధ్రువీకరించవు. శ్రుతులు ఘోషించడం వలన జీవునికి జనన మరణాలు లేవు.
వివరణ :- జీవుడు పుట్టడం అనేది లేదు. అతను నిత్యుడు.
చాందోగ్యోపనిషత్తు:-(6.11.3):-జీవుడు నిష్క్రమించడం తోటే జీవుడి శరీరం మరణిస్తుంది అంటారు. జీవుడికి మాత్రం మరణం లేదు.
బృహదారణ్యకోపనిషత్తు:-(4.5.14):-యాజ్ఞవల్కుడు మైత్రియికి బ్రహ్మోపదేశం చేస్తూ, తడిసినకట్టెను నిప్పులో వేసినట్లయితే, రకరకాల పొగలు వస్తాయి. తరువాత రవ్వలు వస్తాయి. ఈరవ్వలు అగ్నికన్నా వేరైనవి కావు. అలాగే వేదాలు, ఉపనిషత్తు లు, పురాణాలు, మంత్రాలు, కళలు, సూత్రాలు ఇవన్నీ పరమాత్మయొక్క స్వరూపాలు. రవ్వలు జ్వాలలు రావడానికి ముందు అంతా అగ్నిమయమే. అలాగే నామ రూపాత్మక స్థితికి ముందు జగత్తంతా ప్రజ్ఞానఘనుని స్వరూపమే అంటారు. నిప్పుకట్టే నుండి రవ్వలు ఏ రకంగా పుడుతున్నాయో, అదే విధంగా పరమాత్మ నుంచి జీవాత్మలు వచ్చి మళ్ళీ అందులోనే కలిసిపోతాయి. ఆత్మకు నాశన ధర్మం లేదు. జనన మరణాలు ఆత్మ ధర్మాలు కావు.
కఠోపనిషత్తు :- ఆత్మకు చావు లేదు. ఆత్మ స్వయంభువు. నాశరహితమైనది. శరీరం మరణించినా ఆత్మ మరణించదు. ఆత్మ చంపేది, చంపబడేది కాదు. సూక్ష్మ మైన వాటికన్నా సూక్ష్మ మైనది. పెద్దవైనా వాటి కన్నా పెద్దది.
ఐతరేయోపనిషత్తు:- మానవశరీరాన్ని సృష్టించిన తరువాత అందులో బ్రహ్మం ప్రవేశించాలనుకున్నాడు. బ్రహ్మ రంద్రం ద్వారా మానవ శరీరంలో పరమాత్మ ప్రవేశించాడు అని చెప్పబడింది.
ముండకోపనిషత్తు:- శౌనకునకు అంగీరసుడు బ్రహ్మతత్వాన్ని వివరిస్తూ, శౌనకా! ప్రజ్వరిల్లిన అగ్నినుండి అదే విధమైన ఆకారం, గుణము గల వేలకొలది నిప్పు రవ్వలు విలువడుతున్నట్లే, పరబ్రహ్మనుండి అనేకమైన శరీరాలు రూపాలు మొదలై, మళ్ళీ అందులోనే లీనమౌతాయి. అంటే ఆత్మకు చావు పుట్టుకలు ఉన్నాయని కాదు. ఆత్మ శాశ్వతమైనది. ఇది పరమేశ్వర స్వరూపం. జీవాత్మ పరమాత్మ వేరు కాదు. ఒక్కటే. పరమేశ్వరుడు మానవుణ్ణి సృష్టించి బ్రహ్మరంద్రం ద్వారా మానవ దేహంలో ప్రవేశించాడు. కాబట్టి అందరిలో ఉన్నవాడు పరమేశ్వరుడే. జీవాత్మ పుట్టదు. ఎందువలన? చాలా ప్రదేశాలలో ఉత్పత్తిప్రకరణంలో ఇది వినబడటం లేదుకదా! కొన్ని చోట్ల శ్రుతిలో వినబడటం, కొన్ని చోట్ల వినబడిన దానిని నివారింప జాలదని చెప్పడం వలన జీవాత్మకు ఉత్పత్తి కుదరదని చెప్పారు. "సవా.... శ్రోత్రమయం " ఇత్యాది శాస్త్రం బ్రహ్మ ఏ వికారము చెందకుండానే అనేక బుద్ధ్యాదిమయంగా కనబడుచున్నది. విజ్ఞానమయం అనగా బుద్ధిమయం, మనోమయం, ప్రాణమయం, చక్షుమయం, శ్రోత్రమయం అయిన ఈఆత్మయే బ్రహ్మ అని ఈశ్రుతి వాక్యానికి అర్ధం. ఇక్కడ విజ్ఞానమయంగా ఉండటం అంటే ఆబుద్ధ్యాదుల కంటే భిన్నంగా తన స్వరూపం కనబడకుండా వాటితో కలసిపోయిన స్వరూపం కలిగి ఉండటం అని అర్ధం. కొన్ని చోట్ల వినబడుచున్న జీవుని ఉత్పత్తి కూడా ఈ ఉపాదులతో సంబంధం వల్ల ఏర్పడినది అని అర్ధం చెప్పుకోవాలి. ఇది ఉపాధి యొక్క ప్రళయమే కాని ఆత్మకు విలయం లేదు. ఈ ఆత్మకు విషయాలతో సంబంధం లేకపోవడం మాత్రమే జరుగుతుంది. సమస్త సంసార ధర్మాలను నివారించడం ద్వారా పరమాత్మ స్వరూపం ప్రతిపాదించబడుతుంది. అందువలన ఆత్మ పుట్టదు. ప్రళయం పొందదు.
ఆత్మాధికరణం ( 2, 3, 18 )
సూత్రం :- 234
" జ్యోత ఏవ "
అత ఏవ :- నిత్యం కావడం వలన, జీవాత్మకు జ్ఞః :- జ్ఞాన స్వరూపం ఉన్నది.
భావం :- జీవుడు నిత్యం కావడం వలన జీవాత్మకు జ్ఞాన స్వరూపం ఉన్నది.
వివరణ:-గురువుగారు! ఆత్మ నిత్యము, సత్యము అన్నారు కదా! నిద్రించే స్థితిలో ఆత్మచేతనంగా ఉండటం లేదు. అలాంటప్పుడు ఆత్మ చేతనమా? లేక అచేతనమా? వివరించండి అన్నాడు, నారాయణభట్టు. రత్నాకరుడు చెప్పడం ప్రారంభించాడు. జీవుడు నిత్యుడు కాబట్టే చైతన్యస్వరూపుడు. జీవికి పుట్టుక లేదు. పరమాత్మస్వరూపమే జీవుడు. నిత్య జ్ఞాన స్వరూపుడు. శరీరంతో సంబంధం ఏర్పడటం వలన అజ్ఞానిగా కనిపిస్తున్నాడు. అతను నిద్రించడు. సర్వత్రా వ్యాపించి ఉంటాడు. ఈదేహానికి అధ్యక్షుడైన జీవుడు నిత్యుడు అంటారు. ఇప్పుడు జీవుడు జ్ఞానాశ్రయుడా? జ్ఞాన స్వరూపుడా? కొన్ని ఉపనిషత్తులలో జీవుడు జ్ఞానస్వరూపుడని, కొన్ని ఉపనిషత్తులలో జ్ఞానాశ్రయుడని వర్ణించారు.
ఛాందోగ్యోపనిషత్తు:-జీవాత్మకు దర్శనం, స్పర్శ, శ్రవణం ఉన్నాయని అన్నారు. ఈసూత్రంలో జ్ఞ కూడా కర్త్రత్వాన్ని సూచిస్తుంది. కనుక జీవాత్మను జ్ఞానకర్త అని, జ్ఞానాశ్రయుడని భావించవచ్చు కదా! ఈ భావం సరి అయినది కాదు. జ్ఞానానికి ఆశ్రయుడైతే ఆజ్ఞానం నిత్యమా అనిత్యమా? అనే సందేహం వస్తుంది. అనిత్యం అయితే జ్ఞానం కొంతకాలం ఆత్మలో ఉండి తరువాత నశిస్తుందని అనుకోవాలి. జ్ఞానం లేకపోతే నేను ఉన్నానా? లేదా? అని కాని నేను లేను అనే విపరీత జ్ఞానం కలగాలి. జ్ఞానం ఆత్మను ఆశ్రయించి అనిత్యం అయితే, ఆత్మకూడా ఉత్పత్తివినాశాలకు లోనుకావలసి వచ్చి అది అనిత్య మౌతుంది. జ్ఞానం నిత్యం అంటే దాన్ని గుణం అనలేము. సదా ఆశ్రయించినా, కొంతకాలం వేరేగా ఉన్నా జ్ఞానం గుణం కానేరదు. గుణానికి స్వతంత్రమైన ఉనికి ఉంటుంది. గుణం గుణి ని వదలి ఉండలేదు. కాబట్టి ఎప్పుడూ జ్ఞానం జీవాత్మను అంటిపెట్టుకొని ఉంటుందని చెప్పాలి. అప్పుడే అది స్వరూపమో, స్వభావమో అవుతుంది. కనుకనే జ్ఞానం జీవుడికి స్వరూపం. మరి జీవాత్మ జ్ఞానాశ్రయమని ఉపనిషత్తులు అన్నాయి కదా? అని సందేహం. ఇక్కడ జ్ఞానం అంటే వృత్తిజ్ఞానం. స్పర్శ, దర్శనం లాంటి ఇంద్రియ జ్ఞానాలకు జీవాత్మ ఆశ్రయం.
సాంఖ్యశాస్త్రం:-జీవాత్మ చిద్రూపుడు, ప్రకాశరూపుడు. చిద్రూపుడు అంటే జ్ఞానస్వరూపుడు. కాబట్టి జీవాత్మ జ్ఞాన స్వరూప్పుడే గాని, జ్ఞానాశ్రయుడు కాదని చెప్పబడింది.
బృహదారణ్యకోపనిషత్తు:- యాజ్ఞవల్కుడు ఉద్దాలకునికి అంతర్యామి అయిన ఆత్మను గురించి వివరిస్తూ, అగ్నిలో ఉంటాడు. అగ్ని అతన్నెరుగదు. అగ్నే అతని శరీరం. అగ్నిలో ఉంటూ అగ్నిని నియంత్రిస్తాడు. అతడే అంతర్యామి అయిన నీ ఆత్మ అని చెప్పి ఆత్మయొక్క సర్వవ్యాపకత్వాన్ని వివరిస్తాడు. " విజ్ఞాన మానందం బ్రహ్మ ", సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ", అనస్తరో బ్రహ్మ, ఇత్యాది శ్రుతులు పరబ్రహ్మ చైతన్య రూపమైనదని చెప్పబడింది. ఆ బ్రహ్మయే జీవుడైనప్పుడు అగ్నికి ఉష్ణత్వం వలె, జీవునకు నిత్యచైతన్య స్వభావం ఉంటుందని తెలుస్తున్నది. విజ్ఞానమయప్రక్రియలో తాను నిద్రించకుండా నిద్రిస్తూనే ఇంద్రియాలను చూస్తున్నాడు. నిద్రలో ఆ పురుషుడు స్వయంప్రకాశకుడిగా ఉంటాడు. సమస్త ఇంద్రియాలనే ద్వారాల చేత దీనిని తెలుసుకుంటున్నాడు అని విజ్ఞానం చేత అనుసంధానం చేయడం వలన కూడా ఆత్మ జ్ఞాన స్వరూపం సిద్ధిస్తుంది.
ఉత్క్రాంతి గత్యధికరణం ( 2, 3, 19 )
సూత్రం :- 235
" ఉత్క్రాన్తి గత్యా గతీనామ్ "
ఉత్ క్రాంతి :- శరీరం నుండి బయట పడటం, గతి :- లోకాన్తర గమనం, అగతి :- అక్కడ నుంచి మళ్ళీ రావడం,
భావం:- జీవుడు శరీరంనుండి బయట పడటం, లోకాంతర గమనం, అక్కడ నుంచి మళ్ళీ రావడం ఇలా మూడు గతులు న్నాయని ఉపనిషత్తులు అంటున్నాయి.
వివరణ:-జీవాత్మ అణుస్వరూపుడు, సత్ చిత్ స్వరూపుడైన జీవుడు అణువా? విభువా? జగత్తులో ఉన్న భోగ్యపదార్ధాలన్నీ జీవులకున్న అదృష్టం వల్లనే ఉత్పన్నా లవుతున్నాయి. కనుకనే ప్రతి కార్యానికి ఉండే కారణాల్లో అదృష్టంకూడా ఒకటిగా లెక్కిస్తారు. భోగ్యవస్తువులు దూరంగా ఉంటాయి. వాటితో అదృష్టసంబంధం ఏర్పడాలంటే జీవాత్మ విభువే కావాలి. అణువు కాజాలదు కదా! ఈవాదం సరి అయినది కాదు. జీవాత్మకు ఉత్క్రాంతి లాంటివి ఉన్నాయని ఉపనిషత్తులు చెబుతున్నాయి. కాని విభువు అనడం తగదు. జీవాత్మ అణుస్వరూపుడే. మరణకాలంలో జీవియొక్క ప్రాణాలు శరీరంనుండి ఉత్క్రమిస్తాయి. కాబట్టి జీవుడు అణుపరిమాణుడు. మరణకాలం ఆసన్నమైనప్పుడు ముందుగా మానవుడి కర్మేంద్రియాలు పని చెయ్యటం మనివేస్తాయి. ఆతరువాత జ్ఞానేంద్రియాలు పనిచెయ్యవు. ఇవన్నీ మనస్సుని ఆశ్రయిస్తాయి. ఆమనస్సు జీవిని ఆశ్రయిస్తుంది. అప్పుడు మానవుడి శరీరంలో జీవుడు ప్రయాణనికి సిద్ధం అవుతాడు. శరీరంలో 72000 నాడీ మండలం అతని ప్రయాణానికి మార్గములే. ఈ నాడిమండలం అంతా శరీరంలోని నవరంద్రాలలోనూ, ఏదో ఒక రంద్రం గుండా బయటకు పోతాయి. దీనినే ఉత్క్రమణ అంటారు. అయితే సాధకుని ప్రాణాలు ఉత్క్రమించవు. అవి బ్రహ్మరంద్రం గుండా బయటకు పోయి పరమాత్మలో లీనం అవుతాయి.
బృహదారణ్యకోపనిషత్తు:-(4,4,2):- కళ్ళనుంచో, కాళ్ళనుంచో, ఇతర అంగాలనుంచో జీవాత్మ నిష్క్రమిస్తాడు. ఇలా ఉత్క్రాంతిని వర్ణించారు. ఆలోకాల నుండి కర్మనిమిత్తం ఈలోకానికి మళ్ళీవస్తాడు. ఇంద్రియలతో కూడి నట్టి, అవిద్యాజన్యమైనట్టి ఈ దేహం వృద్ధాప్యం కారణంగా కృశించిపోతుంది. అప్పుడు చెట్టునుంచి పండు రాలినట్లుగా శరీరంలోని పురుషుడు, ఈ అవయవాలను వదిలించుకొని, కర్మానుసారం మరొక యోనిలో జన్మించడంకోసం వెళ్ళిపోతాడు. ప్రాణము, అవయవాలు ఉంటేనే గాని కర్మఫలాన్ని అనుభవించలేరు. అందుకోసం ఇంకొకశరీరం చేరతాడు. వేరొకశరీరాన్ని పొందడానికి వచ్చే ఆత్మని చూసి సమస్తభూతాలు ఇదిగో' పరమాత్మ వస్తున్నాడు' అంటూ సభాస్తలి చేరే రాజు గారి కోసం ఎదురు చూసే సేవకుల్లాగా ఎదురుచూస్తుంటాయి. ఎగశ్వాస ప్రారంభం కాగానే చివరిదశలో ప్రాణాలు, ఇంద్రియాలు, ఆత్మకు ముందుగా నడుస్తుంటాయి. కాబట్టి జీవుడు అణుపరిమాణుడు. జీవుడు అణుపరిమాణం కలవాడా? మధ్యమపరిమాణం కలవాడా? మహాపరిమాణం కలవాడా? ఏ పరిమాణం కలవాడని విచారణ చేయబడుతుంది. ఆత్మకు ఉత్పత్తిలేదు. నిత్యచైతన్యస్వరూపుడు అని చెప్పబడింది. దీనిని బట్టి పరమాత్మయే అనంతమని చెప్పబడింది. అలాంటప్పుడు జీవుని పరిమణాన్ని గురించి విచారించ డానికి అవసరం ఏముంది? ఉత్క్రాంతి గత్యాగత్య శృతులను బట్టి జీవునకు పరిచ్చేదం అంటే నియమితమైన అల్ప పరిమాణం ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల జీవుడు అణు పరిమాణుడని చెప్పబడుచున్నది. జీవుడు ఈ శరీరం నుండి ఎప్పుడు పైకి లేచిపోతాడో అప్పుడు ఇంద్రియాలన్నింటితో కలసి లేచిపోతాడు అని ఉత్క్రాంతి. ఈ లోకం నుండి వెళ్లిన వాళ్ళందరూ చంద్రలోకానికి వెడతారు. ఆ లోకం నుండి కర్మ చెయ్యడానికి మళ్ళీ ఈ లోకానికి వస్తారు. ఈ విధంగా ఉత్క్రాంతి గత్యాగతులు వినబడడం చేత జీవుడు పరిచ్చిన్న ప్రమాణం కలవాడు అని తెలుస్తున్నది.
సూత్రం :- 236
" స్వాత్మనా చోత్తరయోః "
ఉత్తరయోః :- గమన, ఆగమనాలను, స్వ ఆత్మనా చ :- ఆత్మతో సంబంధం ఉండటం వలన, జీవాత్మ ఆణువే.
భావం :- ఉత్క్రమణ జరిగిన తరువాత జరిగే గమనం, ఆగమనం అనేవి జీవాత్మ తో సంబంధం కలిగి ఉన్నందున జీవుడు అణు పరిమాణం కలవాడు.
వివరణ :- గమన, ఆగమనాలను ఆత్మతో సంబంధం ఉండటం వలన జీవాత్మ అణువే. ఇవి గమన కర్తలో ఉండే క్రియలు. చలనక్రియలో నిగూఢంగా ఉంటాయి. కనుక ఆత్మ అణుస్వరూపం. జీవాత్మ వ్యాపకమైతే అందులో చలనక్రియ కలుగ జాలదు. ఇప్పటి వరకు చెప్పిన ఉత్క్రమణ, గమనము, ఆగమనము అనేవి పరిమితమైన పరిమాణం గలవాడికి మాత్రమే ఉంటాయి. అందుకే జీవుడు అణుస్వరూపుడు.గత్యాగతులకు కర్తతో సంబంధం ఉండటం వలన కూడా జీవునకు అణు పరిమాణత్వం కలుగుతుంది. గతి అంటే లోకాంతర గమనము, అగతి అంటే అక్కడ నుంచి మళ్ళీ రావడం. కదలకుండా ఉన్నవాడికి కూడా ఉత్క్రాంతి సంభవించవచ్చును. ఉత్క్రాంతి అంటే శరీరం నుండి బయట పడటం. తరువాత చెప్పిన గత్యాగతులు కదలకుండా ఉన్నవాడికి సంభవించవు. గమనం అనేది కర్తలో ఉన్న క్రియ. కనుక కర్తతో సంబంధం ఉంటుంది. గత్యాగతులు అణు పరిమాణం ఉంటేనే కుదురుతాయి. గత్యాగతులు ఉంటాయన్న తరువాత ఉత్క్రాంతి కూడా దేహం విడిచి వెళ్లిపోవడమే అని తెలుస్తుంది. దేహం విడిచి వెళ్ళడానికి గత్యాగతులు కుదరవు కదా! నేత్రం నుండి కాని, శిరస్సు నుండి కాని ఇతర శరీర ప్రదేశాల నుండి జీవుడు బైటకు వెళ్ళిపోతాడు శరీరం ఒక చోటు నుండి మరొక చోటుకు గమనాగమనాలు జరుగుతాయి. అందువల్ల జీవునకు అణుత్వం సిద్ధిస్తుంది.
సూత్రం :- 237
"నాణు రతచ్ఛ్రుతేరితి చేన్నేతరాధికారాత్ "
అతః శ్రుతేః :- బృహదారణ్యకంలో ఆత్మను విభువు అన్నారు కదా! కనుక, అణుః న :- అణువు కానేరదు. ఇతి చేత్ :- అని అనడం, న :- సరి అయినది కాదు. ఇత అధికారాత్ :- ఉపనిషద్వాక్యం పరమాత్మను సూచిస్తోంది.
భావం :- బృహదారణ్యకంలో ఆత్మను విభువు అన్నారు కదా! ఆత్మ అణుపరిమాణం కాజాలదు. ఉపనిషత్తు వాక్యం పరమాత్మను సూచిస్తుంది.
వివరణ :- జీవుడు సర్వవ్యాపి కాబట్టి అణుపరిమాణుడు కాదు అని వారి వాదన. అది నిజం కాదు. ప్రాణాల్లో ఉన్న విజ్ఞాన మయుడే మహత్పరిమాణం గల అజుడై న ఆత్మ. కాబట్టి జీవుడు అణుపరిమాణుడే.
బృహదారణ్యకోపనిషత్తు:-(4,4,22):-ఆఆత్మ మహాన్, విభువు, పుట్టుక లేనిది అనే వాక్యంలో విభువు అన్నది పరమాత్మనే కాని జీవాత్మని కాదు. అందువలన జీవాత్మ అణువు, పరమాత్మ విభువు అని గ్రహించాలి. అణుత్వం కంటే భిన్నమైన మహాపరిమాణం వినబడటం వలన జీవుడు అణుపరిమాణం కలవాడు కాదు. ఎందువలనంటే అక్కడ పరమేశ్వరుని ప్రస్తావన ఉంది అని అర్ధం. "సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ", ఆకాశవత్సర్వగతశ్చ నిత్యం", శ్రుతుల వలన సత్యమైనది, జ్ఞానమైనది, అనంతమైనది, ఆకాశం కంటే మహాపరిమాణం కలది, దోషాలు లేనివాడు, అయిన పరమాత్మ యొక్క ప్రసంగమే వేదాలలో ప్రధానంగా చెప్పబడినది. శాస్త్రానుసారం జీవుడు, పరమాత్మ భిన్నుడనే దృష్టి చేత చెప్పబడినట్లు గ్రహించాలి. అందువలన మరొక పరిమాణం ప్రాజ్జనకు అంటే బ్రహ్మకు సంబంధించినది గాన జీవుని అణుత్వానికి విరోధం లేదు.
సూత్రం :- 238
" స్వ శబ్దోన్మానాభ్యాం చ "
చ :- అంతే కాక, స్వ శబ్ద ఉన్మానాభ్యాం :- అణు శబ్ద ప్రయోగం వలన, సూక్ష్మ పరిమాణం వలన ఆత్మ అణువే కాని విభువు కాదు.
భావం :- అణు శబ్ద ప్రయోగం వలన, సూక్ష్మ పరిమాణం వలన ఆత్మ అణువే కాని విభువు కాదు.
వివరణ :- జీవుడికి అణుత్వం చెప్పే వాక్యాల వలన పరిమాణ నిర్దేశం చేత కూడా జీవుడు అణు పరిమాణుడే.
ముండకోపనిషత్తు:- ఆత్మ సూక్ష్మరూపంలో మన శరీరంలో ఉన్నది. ఆత్మ సాక్షాత్కారానికి చిత్త శుద్ధి అవసరం. విశుద్ధమైన అంతఃకరణ గల ఆత్మజ్ఞాని కోరుకున్నవి పొందగలుగుతాడు. వారికీ జన్మ ఉండదు. (3,19):- ఏఆత్మ యందు ప్రాణం 5 విధాలుగా చేరి ఉన్నదో అట్టి ఈఅణుపరిమాణం గల ఆత్మ తేజస్సుచేత తెలియదగినవాడు అనుశ్రుతిలో వినబడుచున్నది. ప్రాణసంబంధాన్ని బట్టి ఇక్కడ చెప్పిన అణుప్రమాణం కలది జీవాత్మయే అని తెలుస్తున్నది." వాలాగ్ర..విజ్జేయః" తోక చివర నూరవబాగాన్ని మళ్ళీ నూరుబాగాలుగాచేస్తే ఎంతభాగం ఏర్పడుతుందో అదిజీవుడిగాఅంటే జీవుని పరిమాణంగా గ్రహించాలి జీవుడు కొరడాచివర వాటికి ఉన్న చిన్న ఇనుపముల్లంత ఉంటాడు. ఇంకా చిన్నగా కూడా ఉంటాడు అని మరొక కొలత.
శ్వేతాశ్వరోపనిషత్తు :- ( 5, 9 ):- ఒక లేత వెంట్రుక చివరి బాగాన్ని పదివేలుగా విభజిస్తే అందులో ఒక భాగమంత సూక్ష్మంగా జీవాత్మ ఉంటాడు. కనుక జీవాత్మ అణువే. ఉన్మానం అంటే ఉద్దృతమైన మానం. ఎంతో అల్పపరిమాణం గల జీవాత్మ అణువని ఉపనిషత్తు వాక్యం చెబుతోంది.
సూత్రం :- 239
"అవిరోధః చందనవత్ "
చందనవత్ :- చందనపు తిలకం పెట్టుకోవడం వలన శరీరమంతా చల్లదనం ఏర్పడినా, అవిరోధః :-జీవాత్మ అణువు అనడంలో ఏ విరోధము లేదు.
భావం :- చల్లని గంగా జలంలో స్నానం చేసినప్పుడు జీవుడు తన శరీరమంతటా చల్లదనం అనుభవిస్తాడు. కనుక జీవుడు అణువు అని ఎలా అంటారు? చందన తిలకం పెట్టుకోవడం వలన శరీర మంతా చల్లదనం ఏర్పడినా జీవాత్మ అణువు అని అనడంలో ఏ విరోధం లేదు.
వివరణ :- జీవుడు అణుపరిమాణంలో శరీరంలో ఎక్కడో ఉంటే చల్లదనం గాని, వేడి గాని, ఆ ప్రాంతానికే తగలాలి. అంతే కాని శరీరం అంతా ఏ విధంగా వ్యాపిస్తుంది? అని వీరి వాదన. అది సరి అయినది కాదు. ఎందుచేతనంటే మంచి గంధపు చుక్క శరీరానికి ఎక్కడ రాసుకున్నా శరీరం అంతా సుగంధం వ్యాపిస్తుంది. నొసట చందనం బొట్టు పెట్టుకుంటే దాని చల్లదనం శరీరం అంతా వ్యాపిస్తుంది కదా! కాగా జీవాత్మ అణుత్వానికి ఏ భంగము కలుగదు. అలాగే జీవుడు అణురూపంలో శరీరంలో ఎక్కడ ఉన్నప్పటికీ శరీరంఅంతా వ్యాపించే ఉంటాడు. జీవుడు ఒక చోటనే ఉన్నప్పటికీ శరీరంఅంతా వ్యాపించి సుఖదుఃఖాలు అనుభవిస్తుంటాడు. మంచి గంధపు చుక్క శరీరంలోని ఒక ప్రదేశం మీద ఉన్నా కూడా ఏ విధంగా సకల దేహాన్ని వ్యాపించే ఆహ్లాదాన్ని కలిగిస్తుందో అదే విధంగా దేహంలో ఒక ప్రదేశంలో ఉన్నా కూడా ఆత్మ దేహం అంతటా వ్యాపించే జ్ఞానాన్ని కలిగిస్తాడు. దీనికి త్వగింద్రియంతో సంబంధం ఉంటుంది. కనుక వేదన శరీరం అంతటా వ్యాపించడంలో విరోధం లేదు. త్వగింద్రియాత్మల సంబంధం సమస్తమైన త్వక్కు మీద ఉన్నది. ఆ త్వక్కు మొత్తం శరీరన్నంతటిని వ్యాపించి ఉంది. అందుచేత మొత్తం శరీరం మీద తాపాదికం కలగవచ్చును అని భావం.
సూత్రం :- 240
" అవస్థితి వైశేష్యాదితి చేన్నాభ్యుపగమాత్ హృది హి
అవస్థితి వైశేష్యాత్ :- స్థితి భేదం ఉండటం వలన, చందనపు చల్లదనం శరీరం అంతా వ్యాపించవచ్చును. ఇతి చేత్ :- అని అనడం, న :- సరి అయినది కాదు. హి :- ఎందుకంటే, జీవాత్మ, హృది :- హృదయంలో, అభి ఉపగమాత్ :- ఉండటం వలన ఏ విరోధం లేదు.
భావం:- స్థితి భేదం ఉండటం వలన చందనపు చల్లదనం శరీరం అంతా వ్యాపించవచ్చును. కాని, జీవాత్మ అలా కాదు. ఎందుకంటే జీవాత్మ హృదయంలో ఉండటం వలన ఏ విరోధం లేదు.
వివరణ:-గంధపుచుక్క శరీరానికి రాసుకున్నప్పుడు అది ఎక్కడో ఒకచోట కనిపిస్తుంది. అలా జీవుణ్ణి శరీరంలో ఎక్కడా చూడటం లేదు కదా! అని సందేహం వ్యక్తం చేశాడు కృష్ణశర్మ, రత్నాకరుడు సమాధానం చెబుతున్నాడు. జీవుడు శరీరంలో ఫలానా చోట ఉన్నాడని చెప్పడానికి వీలు లేదు. కాబట్టి జీవుడు అణురూపుడు కాదు అనడం సరి కాదు. ఈ ఆత్మ హృదయ స్థానంలో ఉన్నది.
బృహదారణ్యకోపనిషత్తు(4,3,7):- కతమఆత్మీతియోయం విజ్ఞానమయః, ప్రాణేషు హృదిఅంతరజ్యోతిః పురుషః" పై రెండు వాక్యాల్లో అణుస్వరూపుడైన జీవాత్మ హృదయంలో ఉంటుందన్నారు. కనుక జీవాత్మ అణువే, అయితే చందనం సావయవం. జీవాత్మ నిరవయవం. చందనం లాగా అది శరీరంలో ఇతర బాగాలలో ఎలా వ్యాపించింది. హృదయంలో ఉండే జీవాత్మకు ఇతర అవయవాల జ్ఞానం ఎలా కలుగుతుంది?(సమాధానం తరువాత సూత్రంలో ). చందనపు బిందువు యొక్క స్థితిలో విశేషం వలన అక్కడ కుదురుతుంది కాని ఆత్మ విషయంలో కుదరదు అని అనడం సరి కాదు. శ్రుతిలో అంగీకరించడం వలన ఆత్మహృదయంలో ఉన్నదికదా! ఆత్మ దేహంయొక్క ఒక ప్రదేశంలో ఉన్నదనే విషయం సిద్ధమైతే చందన దృష్టాంతం కుదురుతుంది. చందనం ఒకప్రదేశంలో ఉన్నా, సకలదేహానికి ఆహ్లాదం కలిగిస్తుందని స్పష్టంగా తెలుస్తుంది. ఆత్మ విషయంలో శీతస్పర్శతాపాదులు దేహంఅంతా కనబడటం ప్రత్యక్షమేకాని ఆత్మ ఏకదేశంలో ఉండటం మాత్రం ప్రత్యక్షం కాదు. ఎందువలనంటే ఆత్మ త్వగింద్రియం వలె సకల దేహాన్ని వ్యాపించి ఉండటం చేత శరీరమంతా వేదన తెలుస్తుంది. ఈ ఆత్మ హృదయంలో ఉన్నా సర్వవ్యాపి కనుక సర్వవ్యాపిజ్ఞానం కలుగుతుంది.
సూత్రం :- 241
"గుణాద్వా లోకవత్ "
వా :- ఇకపోతే, లోకవత్ :- లోకంలో మనం చూస్తున్నట్లు, గుణాత్ :- తనకు సహకారిగా ఉన్న బుద్ధిసత్వం వలన ఆత్మకు జ్ఞానం కలుగుతుంది.
భావం :- లోకము నందు మనం చూస్తున్నట్లు చైతన్యగుణం వల్ల జీవుడు శరీరమంతా వ్యాపించి ఉంటాడు.
వివరణ :- రాజు రాజవీధిలో ఉన్నప్పటికీ తనకు సహకారులైన మంత్రుల ద్వారా రాజ్యవ్యవహారాలన్నీ తెలుసుకుంటాడు. అలాగే హృదయంలో ఉండే అణువైన జీవుడు బుద్ధిద్వారా శరీరానికి కలిగే శీతోష్ణాదుల జ్ఞానం పొందుతాడు. జీవుడు అల్ప పరిమాణం కలవాడు. కాని చైతన్యం కలవాడు. కాబట్టి శరీరమంతా వ్యాపించి ఉంటాడు. దీపం గూట్లో ఉన్నప్పటికీ ఇల్లంతా కాంతి ప్రసరిస్తుంది. అలాగే ఆత్మ అణురూపంలో ఉన్నప్పటికీ శరీరమంతా వ్యాపించి ఉంటుంది. ఈ మాటలు విన్న నారాయణభట్టు గుణిని విడిచి గుణము వ్యాపించుట సంభవము కాదు కదా! అని అన్నాడు. రత్నాకరుడు చెబుతున్నాడు. జీవుడు అణువే అయినా కూడా చైతన్యం అనే గుణం వ్యాపించడం చేత సకల దేహాన్ని వ్యాపించే కార్యం జరగడంలో విరోధం లేదు. లోకంలో గదిలోని ఒకమూల ఉన్నాకూడా మణులు దీపం మొదలైన వాటి కాంతి గదిఅంతా వ్యాపిస్తూ ఆగదిలో కార్యం ఎలా చేస్తుందో ఇది కూడా అట్లే. చందనం సావయవం కనుక దాని సూక్ష్మమైన అవయవాలు వ్యాపించడం చేత సకల దేహానికి ఆనందం కలిగిస్తుంది. కాని అణువైన జీవునికి అవయవాలు లేవు కనుక వీటితో సకల దేహాన్ని వ్యాపింపజాలడు అని సందేహం కలగవచ్చును. అందుకే గుణాద్వా లోకవత్ అని చెప్పబడింది. జ్ఞానం పొందడానికి బుద్ధి సాధనం అయితే బుద్ధి ఆత్మకన్నా భిన్నమా? ఆత్మ శరీరంలో ఉండి ఏం చేస్తుంది? బుద్ధి ద్వారా విషయజ్ఞానం పొందడమే కదా! అప్పుడు బుద్ధి కూడా చైతన్యమా! లేదా, బుద్ధిసత్వం ఆత్మ ఒక్కటేనా? వేరే అయితే బుద్ధిసత్వం ఆత్మతో తాదాత్మ్యం మూలంగా ఆత్మ ఛాయతో, చేతనత్వంతో, జ్ఞానంతో కార్యాలు నిర్వర్తిస్తుందా? బుద్ధిసత్వానికి వస్తుజ్ఞానం కలిగే సామర్ధ్యం ఉన్నదా? బుద్ధి చైతన్యస్వరూపం ఎందుకు కాదు? ఈ ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నాడు వ్యాసుడు.
సూత్రం :- 242
" వ్యతిరేకో గంధవత్ "
గంధవత్ :- పృథవి కన్నా గంధం ఎలాగ వేరైనదో, అలాగే ఆత్మ కన్నా బుద్ధి సత్వం, వ్యతిరేకం :-భిన్నమే,
భావం :- పృథవి కన్నా గంధం ఎలాగ వేరైనదో అలాగే ఆత్మ కన్నా బుద్ధి సత్వం భిన్నమే.
వివరణ:- వస్త్రానికి ఉన్న ఎరుపు, తెలుపు రంగులు ఆవస్త్రాన్ని వదలి ఇంకొక చోట ఉండవు. అలాగే దేహంలో ఒక చోట ఉండే ఆత్మ శరీరమంతా వ్యాపించడం సంభవం కాదు అని కొందరి వాదన. కాని వాసన అనేది పువ్వు యొక్క గుణము. ఆ వాసన పువ్వు వరకే కాకుండా ఇతర పువ్వులకు కూడా ఏవిధంగా వ్యాపిస్తుందో, అలాగే ఆత్మ కూడా ఉన్న చోటనే కాకుండా దేహమంతా వ్యాపించి ఉంటుంది. గుణం గుణిని విడిచి మరొక చోట ఎలా ఉంటుంది? పటం యొక్క శుక్లగుణం పటాన్ని విడిచి మరొకచోట ఉంటున్నట్లు కనబడటం లేదు కదా! గంధానికి వలె ఆశ్రయం నుంచి వేరు పడటం కుదురుతుంది అని సూత్రానికి అర్ధం. సువాసనగల పుష్పాదుల దగ్గరకు వెళ్లకపోయినా ఆపుష్పాల గంధం తెలుస్తుంది. అందుచేత గుణమే అయినా గంధం గంధాశ్రయమైన ద్రవ్యానికి దూరంగా ఉండటం జరుగుతుంది. ఇదే విధంగా జీవుడు అణువే అయినా కూడా చైతన్యగుణం వానికి దూరంగా ఉంటుంది. గంధం, స్పర్శ లాంటి గుణాలు వాటికి ఆశ్రయాలైన పృధివి మొదలైన ద్రవ్యాల కన్నా వేరే అయినా తాదాత్మ్యం వలన అవి పృధివ్యాది వస్తువుల కన్నా భిన్నం అని సామాన్య దృష్టికి బోధపడదు. అలాగే బుద్ధి ఆత్మ ఒక్కటే అని సామాన్యులు భావిస్తారు. కాలిన ఇనుపముక్కను చూసిన విజ్ణుడికి అగ్ని, ఇనుము వేరే అని తెలుస్తుంది. ఆత్మ, బుద్ధిసత్వం అతిసూక్ష్మాలు కనుక వాటి భేదం సామాన్యులకు తెలియదు. బుద్ధి ఇంద్రియల ద్వారా ఆయా విషయ ఆకారాన్ని పొందినప్పుడు జ్ఞానం, ఇచ్ఛా ఏర్పడతాయి. ఇవి బుద్ధిసత్వ పరిణామాలు. ఆత్మకు పరిణామం లేదు. బుద్ధిసత్వం ఆత్మకు జ్ఞానసాధనం. బుద్ధిసత్వం జడమైనది, పరిణామం చెందేది. ఆత్మ చైతన్యమైనది, పరిణామం లేనిది.
సూత్రం :- 243
“ తధా చ దర్శయతి "
తధా చ :- అలాగే అని, దర్శయతి: శాస్త్రాలు అంటున్నాయి.
భావం:- అణుపరిమాణుడైనా జీవుడు తన చైతన్యగుణం వలన దేహమంతా వ్యాపించి ఉన్నాడని శాస్త్రాలు అంటున్నాయి. వివరణ:- ఆత్మ హృదయంలో ఉంటుంది. అది అణుపరిమాణం కలది. ఆ ఆత్మయే చైతన్యగుణం చేత సమస్త శరీరాన్ని వ్యాపించినట్లు శ్రుతులు చెబుతున్నాయి.
కౌషీతకీ బ్రాహ్మణం:-(3,6):- "ప్రజ్ఞయా శరీరం సమారుహ్య సుఖ దుఃఖే ఆప్నోతి " జీవుడు శరీరంలో ఉండి బుద్ధి మూలంగా సుఖదుఃఖాలను పొందుతున్నాడు. జీవుడు శ్రవణాది ఇంద్రియ మూలంగా బాహ్యపదార్ధాలను తెలుసుకుంటున్నట్లుగా.. బుద్ధిసత్వం ద్వారా సుఖదుఃఖాలను పొందుతున్నాడు. దీని వలన జీవాత్మకన్నా బుద్ధిసత్వం వేరే అనీ తెలుస్తోంది.
ముండకోపనిషత్తు:-ఆత్మ సూక్ష్మరూపంలో మన శరీరంలో ఉన్నది. ఆత్మసాక్షాత్కారానికి చిత్తశుద్ధి అవసరం. పరిశుద్ధమైన అంతఃకరణ గల ఆత్మజ్ఞాని కోరుకున్నది పొందగలుగుతాడు. వారికి జన్మ ఉండదు. స్పర్శ, శబ్ద, రూప, రస, గంధాలు అని మనిషికి ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలతో కలసి మనస్సు అధీనంలో పనిచేస్తుంటాయి. ఈఇంద్రియాలన్నీ బాహ్యప్రపంచంలో అనుబంధం కలిగి విషయాలను మనస్సుకు అందిస్తుంటాయి. వీటికి తమ స్వంత ఆలోచనలు, కోరికలు ఉండవు. కేవలం మనస్సు చెప్పినట్లుగా స్పందిస్తుంటాయి. చెవుల ద్వారా అతి సున్నితమైన శబ్దాలను వినడం, కనుల ద్వారా ప్రకృతి అందాలను చూడటం, ముక్కు ద్వారా సువాసనలను గ్రహించడం, నాలుక ద్వారా రుచులను గ్రహించడం, చర్మం ద్వారా స్పర్శజ్ఞానం గ్రహిస్తుంటుంది. ఇలా మనస్సు జ్ఞానేంద్రియాల ద్వారా పొందిన విషయాన్ని అతిగా వాడుకొని కష్టాలు కొని తెచ్చుకుంటుంది. మనస్సుయొక్క ఈ విచిత్రతత్త్వమే సూక్ష్మశరీరం నుండి స్థూలశరీరం వరకు విస్తరింప జేస్తుంది. ఈఇంద్రియీల జ్ఞానశక్తి బుద్ధిసత్వం ద్వారా ప్రేరేపించబడి, జీవుడు సుఖదుఃఖములు అనుభవిస్తున్నాడు. దీనివలన జీవాత్మ కన్నా బుద్ధిసత్వం వేరు అనీ తెలుస్తోంది.
సూత్రం :- 244
" పృథ గుపదేశాత్ "
పృథక్ :- బుద్ధి ఆత్మ కన్నా వేరు అనీ, ఉపదేశాత్ :- ఉపనిషత్తులు ఉపదేశిస్తున్నాయి.
భావం :- బుద్ధి ఆత్మ కన్నా వేరు అని ఉపనిషత్తులు ఉపదేశిస్తున్నాయి.
వివరణ :- జీవుడు వేరు, అతని చైతన్య గుణం వేరు అనీ శ్రతులు చెబుతున్నాయి. అందువలన జీవుడు అణు పరిమాణుడు అని అనడంలో తప్పు లేదు. కాని అణురూపుడైన జీవుడు సమస్త శరీరాన్ని వ్యాపించి ఉన్నాడు. కాబట్టి జీవునికి సర్వ వ్యాపకత్వం చెప్పనవసరం లేదు అంటారు.
కఠోపనిషత్తు:-(3,3):- "ఆత్మానం రధినం విద్ధి శరీరం రధ మేవతు, బుద్ధింతు సారధిం విద్ధి "శరీరం ఒక రధం. జీవుడు రధికుడు, రధసారధి బుద్ధి. అనీ తెలుసుకోవాలి. ధర్మాధర్మ వివేకము బుద్ధిదే. ఈశరీరమే రధం, సారధి బుద్ధి, ఇంద్రియాలే గుర్రాలు. సార అంటే సారవంతమైన, ధి అంటే బుద్ధి. వివేకమే సారధి. ఏదీ హితమో, ఏదీ అహితమో, ఉచితమో-అను చితమో, కృతమో-అకృతమో, ధర్మమో-అధర్మమో, వివేకంతో చెప్పగలిగేది బుద్ధి. మనస్సు లౌకికవ్యవహారాలలో వస్తువుల వెంట పరుగెడుతూంటుంది. ఇంద్రియాలు కళ్లెంలేని గుర్రాల్ల దౌడుతీస్తుంటే వాటిని నియంత్రించేది బుద్ధి. గురువు తన వాక్కుతో శిష్యులందరిని నియంత్రించి తనవైపు ఆకర్షించినట్లు, సమాహారం చేయగలిగే శక్తి బుద్ధికే ఉంది. లోకంలో పశు పక్ష్యాదులకులేని బుద్ధి మనిషికే ఇచ్చాడు భగవంతుడు. అందుకే బుద్ధిని బ్రతుకు పరమార్ధం కోసం, మోక్షమార్గాన్ని అన్వేషిస్తూ, ఆత్మజ్ఞానాన్ని పొందడమే జీవితపరమార్ధం అనీ గ్రహించాలి. జగద్గురువులు శ్రీఆదిశంకరులు, శ్రీకృష్ణ భగవానుడు, జీవుడు ఎన్ని జన్మలు ఎత్తినా, చిట్టచివరి జన్మ మోక్షమే అని, ధర్మం మోక్షాన్ని ఇవ్వదని, జ్ఞానం మాత్రమే మోక్షసాధనమని లోకానికి తెలియజేశారు. బుద్ధి రధసారధిగా ఉన్నవాడు మనస్సుని వశంలో ఉంచుకోవాలి. ఈవాక్యాల వలన బుద్ధి జీవుడికన్నా భిన్నమే అనీ సిద్ధిస్తోంది. "అంగుష్ట మాత్రో రవితుల్యరూపః" జీవాత్మ అంగుష్టమాత్రుడని శ్వేతాశ్వరోపనిషత్తు చెబుతున్నది. అయితే జీవాత్మ అణుస్వరూపమని ఎలా అంటారు? "ప్రజ్ఞయా శరీరం సమారుహ్య " ప్రజ్ఞ చేత, జ్ఞానం చేత శరీరాన్ని అధిష్టించి , ఆత్మను ప్రజ్ఞను కర్తృ కరణ భావన చేత అంటే ఆత్మ శరీరాన్ని అధిష్టించడంలో కర్త అని ఈక్రియలోనే ప్రజ్ఞ కరణం, సాధనం అని వేరువేరుగా చెప్పడం చేత ఆత్మ చైతన్యగుణం చేతనే శరీరాన్ని వ్యాపించినట్లు తెలుస్తుంది. ఈ ఇంద్రియ జ్ఞానశక్తి, చైతన్యశక్తి చేత గ్రహించి కర్త అయిన శరీరుని కంటే వేరుగా విజ్ఞానాన్ని చెప్పడం ఈ అభిప్రాయాన్నే బలపరుస్తుంది. అందువలన జీవుడు అణుప్రమాణుడు.
సూత్రం :- 245
" తద్గుణ సారత్వాత్తు తద్వ్యపదేశాత్ "
తత్ గుణ సారస్వాత్ తు :- బుద్ధి గుణమైన పరిమాణాన్ని ప్రధానంగా గ్రహించడం వలన, ప్రాజ్ఞవత్ :- పరబ్రహ్మ, హృదయ పరిమాణమైన అంగుష్ట మాత్రుడని చెప్పినట్లే, తత్ వ్యపదేశం :- జీవాత్మను కూడా అంగుష్ట మాత్రుడని అన్నారు.
భావం :- బుద్ధి గుణమైన పరిమాణాన్ని బట్టి పరబ్రహ్మ వలెనే జీవాత్మ కూడా అల్పపరిమాణం కలవాడని చెబుతారు.
వివరణ:-పరబ్రహ్మకు కర్త్తృత్వం, భోకృత్వం లేవు. కాని బుద్ధి గుణాల వలన కర్త్రత్వ, భోకృత్వాలు చెప్పబడుతున్నాయి. జీవాత్మకు పరమాత్మకు తేడా లేదు. రెండు ఒక్కటే. పరమాత్మ స్వరూపమెంత ఉంటుందో, ఆత్మ స్వరూపం అంతే ఉంటుంది.
శ్వేతాశ్వరోపనిషత్తు(5,8):- "సంకల్పాహంకార సమన్వితోయః, బుద్ధిర్గునే నాత్మ గుణేనఛైవ ఆరాగమాత్రో హ్యపరోపిదృష్టః" ముల్లుకర్ర, సన్నటి కొన లాగ జీవాత్మ సంకల్పం, అహంకారం లాంటి బుద్ధి గుణాలతో కూడి అంగుష్టమాత్రుడిగా ఉంటాడు. "వాలాగ్ర శత భాగస్య " కూడా జీవాత్మ సూక్ష్మపరిమాణాన్ని వర్ణించింది. అంగుష్టపరిమాణం ఉన్నవాడు అంటే అది జీవుడి స్వరూపాన్ని బోధించదు. బుద్ధి తాదాత్మ్యంవలన బుద్ధిపరిమాణంతో ఉన్నవాడని వర్ణించడం మాత్రమే. ఉపనిషత్ వాక్యంలో "అంగుష్టమాత్రో రవితుల్యం " అంగుష్టమాత్రం అన్నప్పుడు అంగుష్టపరిమాణం అనుకోకూడదు. పరిమాణం బుద్ధికి సంబంధించినది. జీవాత్మ, బుద్ధి ఈ రెండు హృదయంలో ఉంటాయి. ఇనుము బాగా కాలినప్పుడు అగ్ని, లోహం తదాత్మ్యం చెందుతాయి. అలాగే బుద్ధి తాదాత్మ్యంతో జీవుణ్ణి అంగుష్ట పరిమాణం ఉన్నవాటిని వర్ణించారు. కాని, వాస్తవానికి జీవుడు అణుపరిమాణం ఉన్నవాడే. బుద్ధికూడా హృదయంలో ఉంటుంది. మానవ హృదయానికి అంగుష్ట పరిమాణం ఉన్నది. కనుక సర్వవ్యాపకమైన బ్రహ్మనికి కూడా ఒక్కొక్కసారి హృదయ పరిమాణం ఉన్నదని వర్ణించారు. అందువలన జీవుడు కాని బుద్ధి కాని అంగుష్టపరిమాణులని చెప్పడం కేవలం ఔపచారికమే కాని స్వరూపవర్ణన కాదు. బుద్ధిసత్వం ప్రకృతి నుంచి ఉత్పనమైనది. అందువలన అది శరీరంలాగా అనిత్యమై, నశిస్తుంది. జీవుడికి పదార్ధజ్ఞానం కలిగించడానికి బుద్ధి ఒక సాధనంగా ఉపయోగ పడుతుంది. ఆబుద్ధి నశిస్తే జీవుడికి శరీరంతో అన్ని బంధాలు తొలగిపోయి సంసారం నుంచి నివృత్తి కలుగుతుంది. అప్పుడు మోక్షాన్ని బోధించే శాస్త్రాలన్నీ వ్యర్థమే కదా! దీనికి సమాధానం తరువాత సూత్రంలో చెప్పబడింది.
సూత్రం :- 246
" యావదాత్మ భావిత్వాచ్చ న దోషః తద్దర్షనాత్ "
చ :- పైగా, బుద్ధి సత్వం, యావత్ ఆత్మ భావిత్వాత్ :- సంసార బంధనంలో జీవాత్మ ఉన్నంత కాలం ఉండటంలో, న దోషః :- ఏ దోషము లేదు. తత్ దర్శనాత్ :- శాస్త్రాలలో వర్ణించారు.
భావం :- బుద్ధి సత్వం సంసార బంధనంలో జీవాత్మ ఉన్నంత కాలం ఉంటుందని చెప్పడంలో ఏ దోషము లేదని శాస్త్రాల్లో వర్ణించారు.
వివరణ :- బుద్ధి సంయోగమనేది ఆత్మజ్ఞానం వలన సంసారనివృత్తి జరిగే వరకు ఉంటుంది. శరీర వియోగం జరిగిన తరువాత కూడా బుద్ధిసంయోగం ఉంటుందని శ్రుతులు చెబుతున్నాయి.
ముండకోపనిషత్తు:- బ్రహ్మ సాక్షాత్కారం పొందిన జీవుడు ప్రకృతి. దాని కార్యాలైన బుద్ధి సత్వాలను విడిచి పెట్టి, పరాత్పరుణ్ణి పొందుతాడు. కనుక బ్రహ్మసాక్షాత్కారం బుద్ది వినాశనానికి హేతువు. అంత దాకా జీవాత్మతో బుద్ధిసత్వానికి సంబంధం ఉంటుంది. బుద్ధిసత్వం ప్రకృతి జన్యం కనుక అది నశిస్తుంది. ప్రకృతి వలన జనించిన పదార్ధాలు వాటి నాశనానికి తగిన కారణములు ఏర్పడినప్పుడు నశిస్తాయి. అంతకు ముందు నశించవు. అదే విధంగా బుద్ధిసత్వం జీవుడికి బ్రహ్మ సాక్షాత్కారం కలిగినప్పుడు నశిస్తుంది. దాని నాశనానికి హేతువు కాక ముందు నశించదు. అప్పటి వరకు లోక వ్యవహార సాధనంగా ఉంటుంది. బ్రహ్మసాక్షాత్కారం కలిగినప్పుడు జీవుడు బుద్ధి నుండి ముక్తుడై, శుద్ధుడై, మోక్షానందాన్ని అనుభవిస్తాడు. అంతవరకు అతనికి సంసారంతో సంబంధం ఉంటుంది. ఆసంసార బంధం నుండి ముక్తికి కావలసిన సాధనా సంపత్తి సమకూరే వరకు బుద్ధిసత్వం జీవుడికి సాధనంగా ఉంటుంది. జీవుని జీవత్మము, సంసారిత్వం కూడా ఈ బుద్ధ్యుపాది సంబంధం ఉన్నంత వరకే. వాస్తవంలో బుద్ధ్యుపాది సంబంధం చేత కల్పించబడిన స్వరూపం కంటే భిన్నంగా జీవుడనే లేడు. తత్త్వమసి, అహం బ్రహ్మాష్మి ఈ శ్రుతుల ననుసరించి నిత్యముక్తస్వరూపుడు, సర్వజ్జుడు, అయిన ఈశ్వరుని కంటే వేరుగా చేతనమైన మరొక ధాతువు ఏదీ వేదాంతంలో కనబడదు. బుద్ధి సంయోగం యావదాత్మ భావి అనీ ఎట్లు తెలుస్తుంది? దాని గురించి శ్రుతిలో చెప్పబడింది. అక్కడ విజ్ఞనమయః-శ్రోత్ర మయః అంటే విజ్ఞానమయుడు, మనో మయుడు, ప్రాణమయుడు, చక్షుమయుడు, శ్రోత్రమయుడు అని విజ్ఞానమయుణ్ణి మనోమయాదులతో కలసి పఠించడం . బుద్ధి మయుడు అనగా బుద్ధి యొక్క గుణాలు సారంగా కలిగినవాడు అనీ అర్ధం. ఆ ఆత్మ రెండు లోకాలలోనూ సంచరిస్తోంది. లోకాంతరానికి వెళ్ళినప్పుడు కూడా బుద్ధితో కలసి ఉన్నట్లు చూపుతున్నది. ఆత్మ స్వయంగా ధ్యానం చెయ్యదు. చలించదు. బుద్ధి ధ్యానిస్తుంటే ధ్యానిస్తున్నట్లు ఉంటుంది. బుద్ధి చలిస్తుంటే చలిస్తున్నట్లు కనబడుతుంది. ఆత్మకు బుద్ధ్యుపాదులతో ఏర్పడిన ఈ సంబంధానికి కారణం మిధ్యాజ్ఞానం. సమ్యక్ జ్ఞానం కలిగితే కాని మిధ్య జ్ఞానం తొలగిపోదు. అందువల్ల ఆత్మ జ్ఞానం కలిగే వరకు ఈ బుద్ధ్యుపాదులతో సంబంధం కలిగివుంటుంది.
సూత్రం :- 247
" పుంస్త్వాది వత్త్వ స్య సతోభివ్యక్త యోగాత్ "
అస్య:- ఈబుద్ధి సత్వం, సతః :- ప్రళయంలోను, సూక్ష్మరూపంలోనూ ఉండటం వలన, పుంస్త్వాది వత్ :- పుంస్త్వం, గ్రహణ సామర్ధ్యం, ఊహశక్తి, లాంటివి యౌవనంలో అంకురించి, వృద్ధి చెందేటట్లుగా, అభివ్యక్తియోగాత్:- ప్రళయాంతరంలో ప్రకటం కావటం వలన, బుద్ధి సత్వం జీవాత్మకు మోక్షం సిద్ధించే దాకా ఉంటుంది.
భావం :- బుద్ధి సత్వం ప్రళయం లోనూ, సూక్ష్మ రూపంలోనూ, ఉండటం వల్ల, పుంస్త్వం, గ్రహణం సామర్ధ్యం, ఊహశక్తి లాంటివి యౌవనంలో అంకురించి వృద్ధి చెందేటట్లుగా ప్రళయాంతంలో ప్రకటం కావటం వలన బుద్ధి సత్వం జీవాత్మకు మోక్షం సిద్ధించే వరకు ఉంటుంది.
వివరణ:-బాల్యంలో కూడా ఉండే పుంసాదులు, యౌవనంలో మాత్రమే బహిర్గతమవుతున్నట్లుగా, సూక్ష్మరూపంలో ఉండే ఈ బుద్ధిసంయోగం జాగ్రదావస్థలలో పైకి కనిపిస్తుంది. పూర్వం లేనిది కొత్తగా ఉద్భవించదు కదా! బాల్యంలో పుంస్త్వం (పుట్టించే శక్తి) లాంటి గుణాలు పురుషుడిలోఉన్నా ఆదశలో కార్యరూపంలో పైకి కనబడవు. లేనట్లే భావించబడుతుంది. కాని బీజరూపంలో ఉన్నవి అయినా పుంస్త్వం మొదలైనవి లోకంలో యౌవనంలో కనబడతాయి. అంతే కాని అసలే లేవని కాదు. అదే విధంగా ఈబుద్ధి సంబంధం కూడా సుషుప్తి వలయాలలో శక్తిరూపంలో ఉన్నదే, మేల్కొన్నప్పుడు మళ్ళీ సృష్టి జరిగి నప్పుడు ఆవిర్భవిస్తుంది. ఏదీ హఠాత్తుగా పుట్టదు. అలా జరిగితే అతిప్రసంగం ఏర్పడుతుంది. అనగా అన్ని వేళలా పుట్టవలసి వస్తుంది. సుషుప్తినుంచి లేవడం అవిద్యారూపమైన బీజం ఉండటం వలన జరుగుతుంది. బుద్ధ్యుపాదులతో సంబంధం ఆత్మఉన్నంత వరకు ఉంటుందని గ్రహించాలి. ప్రళయంలో బుద్ధిసత్వం కార్యసాధనకు తోడ్పడదు. సూక్ష్మ రూపంలో అలాగే ఉంటుంది. పూర్తిగా నశించదు. ప్రళయంలో ప్రాకృతిక పదార్ధాలన్ని తమ రూపాన్ని విడిచి సూక్ష్మ రూపంలో ఉంటాయి. తమ ఉనికిని పోగొట్టుకోవు. సృష్టిఆరంభంలో మళ్ళీ స్వస్వరూపాన్ని పొంది బుద్ధిసత్వం జీవాత్మకు జ్ఞాన సాధనంగా వర్తిస్తుంది.
సూత్రం :- 248
" నిత్యోపలబ్ధ్య నుపలబ్ధి ప్రసంగో న్యతర నియమో వాన్యధా "
అన్యధా:-జీవాత్మ కంటే వేరేగా బుద్ధి సత్వం ఉన్నదని ఒప్పుకోని పక్షంలో, నిత్యనుపలబ్ధి, అనుప లబ్ధి ప్రసంగః :- బాహ్య విషయాన్ని గ్రహించడమో, బొత్తిగా గ్రహించలేక పోవడమో జరుగుతుంది. వా:- లేదా, అన్యతరనియమః:- ఈరెండిటిలో ఒకటి నియమంగానైనా ఏర్పడుతుంది.
భావం:-జీవాత్మ కంటే బుద్ధి సత్వం వేరేగా ఉన్నదని ఒప్పుకోని పక్షంలో బాహ్య విషయాన్ని గ్రహించడమో, బొత్తిగా గ్రహించ లేకపోవడమో జరుగుతుంది.
వివరణ:- బుద్ధి లేక అంతఃకరణ మనేది ఆత్మకు ఉపాధి. దానికి అస్థిత్వం ఉన్నదని అంగీకరించాలి. లేకపోతే నిత్యోపలబ్ధి ప్రసంగం లేదా నిత్యానుపలబ్ధి ప్రసంగం ఏర్పడుతుంది. ఉపలబ్ధి అంటే సాక్షాత్కారం. ఆత్మ ఇంద్రియవిషయాలు అనే వీటి సాన్నిధ్యమే జ్ఞానసాక్షాత్కారానికి సాధనాలు. ఇవి ఉన్నప్పటికీ ఒక్కొక్కప్పుడు జ్ఞానోపలబ్ధి కలగవచ్చును. కలగక పోవచ్చును. జీవాత్మ కంటే బుద్ధి సత్వం వేరేగా ఉన్నదని ఒప్పుకోకపోతే జీవాత్మ అణుపరిమాణం అని నిరూపించలేము. జీవాత్మకు తన నేత్రాల వలన బాహ్యపదార్ధాల జ్ఞానం కలుగుతుంది. జీవాత్మ అణువు కాక విభువు అనుకుంటే అతనికి బాహ్యంద్రియలతో ఎల్లప్పుడూ సంబంధం ఉంటుంది. సర్వేంద్రియాలతో సర్వవస్తుజ్ఞానం కలగాలి. అలా జరగడం లేదు కదా! ఒకే సమయంలో జ్ఞానం కలగడం, కలగక పోవడం ఉండదు. ఒకే సమయంలో శబ్ద, స్పర్శ, రూప, రస గంధాల జ్ఞానం కలగడం, కలగకపోవడం ఎక్కడా చూడలేము. ఒకనిముషంలో ఒకఇంద్రియంతో ఒక వస్తువును గురించి తెలుసుకుంటాము. ఆక్షణంలో ఆవస్తువును గురించి తెలుసుకోకపోవడం జరగదు. తెలుసుకోవడం, తెలుసుకొకపోవడం పరస్పర విరుద్దములు. జ్ఞానం కలగడమే స్వభావం అనుకుంటే ఎప్పుడు ఏఇంద్రియంతో జ్ఞానం కలగకుండా ఉండాలి. కాని లోకంలో వస్తువుల జ్ఞానం కలగడం చూస్తున్నాము. కనుక ఆత్మకు, బాహ్యేంద్రియాలకు మధ్య అంతకరణం ఉంటుంది. ఆత్మకు ఉపాధి అయిన అంతఃకరణం మనస్సు, బుద్ధి, జ్ఞానం, చిత్తం అని అనేక విధాలుగా చెప్పబడుతోంది. వృత్తుల విభాగాన్ని బట్టి సంశయాది వృత్తులు కలది మనస్సనీ, నిశ్చయాది వృత్తులు కలది బుద్ధి అనీ, కొన్ని చోట్ల చెప్పబడింది. ఈ అంతఃకరణం ఉన్నదనీ, దానిలో మనస్సనేది ఉన్నదని అంగీకరించాలి. నిత్యజ్ఞానం, నిత్యఅజ్ఞానం అనే దోషాల ప్రసక్తి ఉండదు. జీవాత్మతో సంబంధం పెట్టుకున్న బుద్ధి సత్వమే ఇంద్రియాల మూలంగా ఏవిషయంలో ఆసక్తి చూపుతుందో, ఆ విషయ జ్ఞానమే ఆ క్షణంలో జీవుడుకి కలుగుతుంది. జీవుడికి మనస్సుతో సంబంధం ఉన్నట్లు ఉపనిషత్తులు చెబుతున్నాయి.
బృహదారణ్యకోపనిషత్తు(1,5,3):-నామనస్సు మరొక చోట ఉంది. అందువలన చూడలేదు. నేను వినలేదు కూడా. ఇలా ఆత్మకన్నా భిన్నంగా మనస్సు, బుద్ధి ఉన్నాయనడం నిశ్చితం అవుతుంది. కనుక జీవుడు విభువు కాదు. అణువే. మరి జీవాత్మ అణువైతే కర్త ఎలా అవుతాడు.
కర్తృధికరణం ( 2, 3, 33 )
సూత్రం :- 249
" కర్తా శాస్త్రార్ధవత్వాత్ "
శాస్త్రార్ధ వత్వాత్ :- వేదాది శాస్త్రాల ప్రాముఖ్యం వలన, కర్తా :- అణు పరిమాణం ఉన్న జీవాత్మ కర్త అని సిద్ధమౌతోంది.
భావం:-వేదాది శాస్త్రాల ప్రాముఖ్యం వలన అణుపరిమాణం ఉన్న జీవుడే కర్త తెలుస్తోంది. ఈఅధికరణంలో జీవుడే కర్త అని చెప్పబడింది.
వివరణ:- గురువు గారు! శ్రుతులలో ఆత్మకు కోరికలు ఉండవనీ, పక్షపాతం ఉండదనీ, కర్మలు చేయదని, కర్మఫలం కూడా ఉండదని చెప్పబడింది. కాని కర్మలు చెయ్యాలి. అంటే యాగాలు, హోమాలు, క్రతువులు చెయ్యాలి అనీ చెప్పబడింది. ఈ వైరుద్యం ఏమిటి? అన్నాడు నారాయణభట్టు. ఆమాటలు విన్న రత్నాకరుడు వివరిస్తున్నాడు. శాస్త్రం అర్ధవంతం కావాలంటే జీవుడు కర్త అనే చెప్పాలి. కర్త అనేవాడు లేకపోతే కర్మ చేసేవాడు ఉండడు. కర్త లేకపోతే కర్మను ఎవరికీ ఉపదేశించాలి? అందుచేత కర్త అనేవాడు ఉండి తీరాలి. మరి ఆ కర్తఎవరు? అంటే ఆత్మయేకర్త. బుద్ధి కర్తకాదు. అన్ని ఆత్మయే నిర్వహిస్తుంది. చూసేది, వినేది, ఆలోచించేది అన్నిఆత్మయే. అందుకే కనులకు చూసే శక్తిని, చెవులకు వినికిడి శక్తిని, మనస్సుకు ఆలోచనా శక్తిని ప్రసాదించేది ఆత్మ. యజర్వేదం(13-43):-గోవులను హింసించకూడదు. ఋగ్వేదం(7,8,5,16):- పాచికలతో జూదం ఆడకూడదు. తైత్తరీయెపనిషత్తు (1,11):-స్వాధ్యాయాన్ని మరచిపోకూడదు. ఇవి శాస్త్రనిషేధాలు. చేయకూడని పనులు. జీవులకు కర్త్తృత్వం, కర్మలు చేసే స్వాతంత్మ్యం లేకపోతే, పై విధి నిషేధాలు విధించారు. శాస్త్రాలు కర్తకే ఉపదేశిస్తాయి. కర్త లేని పక్షంలో అతడు చేసిన పనులకు కర్మఫలం ఎలా అనుభవిస్తాడు? కనుక జీవుడే కర్త. కొన్ని శ్రుతులు ఆత్మ అసంగం అని చెబుతున్నాయి. కొన్ని శ్రుతులు ఆయా కర్మలను విధిస్తున్నాయి. శ్రుతులలో విరోధం ఉండటం వలన ఆత్మకు కర్తృత్వం ఉన్నదా, లేదా అనే సందేహం కలుగుతుంది. కర్తృత్వం లేదని పూర్వపక్షం వాదన. కాని కర్తృత్వం ఉన్నదని ఈ అధికరణంలో చెప్పబడింది.
సూత్రం :- 250
" విహారోపదేశాత్ "
విహారః :- తన ఇచ్చానుసారం వర్తిస్తాడని, ఉపదేశాత్ :- శాస్త్రాలు ఉపదేశిస్తున్నాయి.
భావం :- జీవుడికి ఉద్దేశించిన చేయదగిన ధర్మాలు, చేయకూడని నిషిద్ద ధర్మాలు విధించినందున వాటిని తన ఇచ్చానుసారం చెయ్యడానికి సంకల్పిస్తాడని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి.
వివరణ :- జీవుడు కర్త అని చెప్పారు. అతనికి విహారం ఉన్నందున తన ఇష్టం వచ్చిన చోటుకి వెడతాడు. శరీరంతో స్వేచ్ఛగా విహరిస్తాడు.
బృహదారణ్యకోపనిషత్తు(2,1,18):-"స్వశరీరే యధా కామం పరివర్తతే" జీవుడు తన శరీరంతో ఇష్టం వచ్చినట్లు వర్తిస్తాడు. కర్త కాని వాడు స్వతంత్రుడు కానేరడు. కర్తకు క్రియలో స్వతంత్రం ఉంది. అష్టధ్యాయి(1,4,54):-స్వతంత్రః కర్తా:- కర్త స్వతంత్రుడని పాణిని అన్నాడు. జీవుడు విహరిస్తాడు అని చెప్పడం వలన అతనికి కర్తృత్వం ఉందని గ్రహించాలి. స్వప్నావస్థలో ఆ జీవుడు ఏ స్వప్నంలో స్వేచ్ఛగా విహారిస్తున్నాడో అని జీవునికి విహారం ఉపదేశీస్తుంది. అంటే జీవుడు తన శరీరంతో సంచరిస్తాడు. భగవద్గీతలో కర్మలు ఐదు రకములని చెప్పారు.
1. విహిత కర్మలు :- వేదములలో శాస్త్రములలో పూజ కర్మలు ఇష్టం ఉన్నా లేకపోయినా విధిగా పాటించాలి.
2. నిషిద్ద కర్మలు :- శాస్త్రములు నిషేధించిన కర్మలు మనకు ఇష్టం ఉన్నా చెయ్యకూడదు.
3. కామ్య కర్మలు :- ఏదో ఒక కోరికతో ఫలాన్ని ఆశించి కర్మ చెయ్యడం,
4. ప్రాయశ్చిత్త కర్మలు :- తెలియకుండా చేసే పాపాలకు దోషాలకు ప్రాయశ్చిత్తం చేసుకొనే కర్మలు,
5. నిత్యనైమిత్తికకర్మలు:- చేయవలసిన సంధ్య వందనం, అగ్ని హోత్రం, మొదలైనవి, ఉపనయనం, వివాహం, పర్వదినాలలో చేయవలసిన కర్మలు. నిత్య నైమిత్తిక కర్మలు తప్ప మిగిలిన కర్మలు చేయకుండా ఉండటం సన్యాసం అంటారు.
జీవుడు తన ఇచ్ఛానుసారం ఈ కర్మలన్నీ స్వతంత్రంగా నిర్వహించగలడు.
సూత్రం :- 251
" ఉపదానాత్ "
ఉపదానాత్:- తీసుకోవడం, స్వీకరించడం, పొందడం. వీటి వలన జీవాత్మకు కర్తృత్వం ఉన్నది. గ్రహణం వలన జీవుడు కర్త అవుతున్నాడు.
భావం :- దేనినైనా తీసుకోవడం, స్వీకరించడం, పొందడం వలన జీవాత్మకు కర్తృత్వం ఉన్నది.
వివరణ :- గ్రహించడం వలన కూడా జీవుడే కర్త అని చెప్పాలి. ఇంద్రియాల ద్వారా గ్రహించేవాడు జీవుడు.
బృహదారణ్యకోపనిషత్తు:-(2,1,17) జీవుడు బుద్ధిమూలంగా ఇంద్రియాల విషయగ్రహణం శక్తిని గ్రహించి హృదయకాశంలో శయనిస్తాడు. దీనిని బట్టి జీవుడు కర్తకాని పక్షంలో ఇంద్రియాలకుఉండే విషయాన్ని తాను గ్రహించలేడు కదా! కనుక జీవుడు కర్తే. ఆత్మపురుషుడు బుద్ధిద్వారా ఇంద్రియాది సాధనాల శక్తిని గ్రహిస్తాడు అని చెప్పబడింది. దీని వలన కూడా జీవునకి కర్తృత్వం ఉన్నది. ఎందువలననగా జీవక్రియలోనే "తదేషా.ఆదాయ". (ప్రాణాలతో జ్ఞానంచేత అనగా బుద్ధిచేత ఇంద్రియ సముదాయాన్ని గ్రహించి) అనీ "ప్రాణాన్ గృహిత్వా" అనీ జీవుడు కరణాలను (ఇంద్రియలను) గ్రహించినట్లు అవుతుంది. జీవుడు ఏదైనా కర్మ చేసేటప్పుడు మూడు విధాలైన ఫలితాలు వస్తాయి. 1.సుఖం, 2.దుఖం, 3.రెండింటి కలయిక, కొంచెం సుఖం, కొంచెం దుఖం. ఈఫలితములు బ్రతికిఉండగా కాని, మరణానంతరం గాని అనుభవించాలి. ప్రవృత్తి మార్గంలో ప్రాపంచిక విషయాలు, విషయవాంఛలు, ధనం, ఆస్తిమీద ఆసక్తి, సంసారంలో మునిగిపోవడం మొదలైన కర్మలను జీవుడు బుద్ధిమూలంగా ఇంద్రియలద్వారా తెలుసుకుంటాడు. నివృత్తిమార్గంలో బుద్ధి సాత్వికమై, ప్రాపంచిక విషయాలపై ఆసక్తిలేకుండా, సంసారంతో ఎక్కువ అనుబంధంలేకుండా పరమాత్మ గురించి ఆలోచించడం, చెయ్యకూడని పనుల జోలికి పోకపోవడం మొదలైన కర్మలలో బుద్ధి మనస్సుని నియంత్రిస్తుంది. ఈబుద్దే జీవుడికి ధర్మాధర్మవిచక్షణ తెలుసుకొని సకల ప్రాణులలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడనే జ్ఞానం కలిగిస్తుంది. జీవుడు తన ఇంద్రియ సాధనాల ద్వారా అన్ని వ్యవహారాలు చేస్తాడు కనుక జీవుడికి కర్తృత్వం ఉన్నదని తెలుస్తుంది.
సూత్రం :- 252
" వ్యప దేశాచ్చ క్రియాయాం న చేత్ నిర్దేశ విపర్యయః "
క్రియాయం :- లౌకిక, వైదిక కర్మల్లో, వ్యపదేశాత్ చ :- ఆత్మను కర్తగా చెప్పడం వలన, జీవాత్మ కర్త అవుతాడు. న చేత్ :- అలా కాని పక్షంలో, నిర్దేశ విపర్యయః :- శాస్త్ర నిర్దేశానికి వ్యతిరేకం అవుతుంది.
భావం:- లౌకిక, వైదిక కర్మల్లో ఆత్మను కర్తగా చెప్పడం వలన జీవాత్మ కర్త అవుతాడు. అలా కానీ పక్షంలో బుద్ధినే కర్తగా భావిస్తే శాస్త్రనిర్దేశానికి వ్యతిరేకం అవుతుంది.
వివరణ :- లౌకిక, వైదిక క్రియల యందు జీవుడు కర్తగా చెప్పబడ్డాడు. జీవునకు కర్తృత్వం ఉంది కనుక జీవుడే కర్త.
తైత్తరీయెపనిషత్తు:-(2,5):- జీవాత్మ వైదికకర్మను, లౌకికకర్మలను విధిని అనుసరించి చేస్తాడు. ఇక్కడ ఆత్మ ప్రధమా విభక్తిలో ఉన్నందున తాను చేసే కర్మలకు అతనే కర్త. విజ్ఞానంఅంటే జీవాత్మకాదు. బుద్ధి అనీ అనుకుంటే విజ్ఞానేన అనే తృతీయావిభక్తి ప్రయోగం ఉండేది.
బృహదారణ్యకోపనిషత్తు:-(2,1,17)"తదేషాం ప్రాణానం, విజ్ఞానేన విజ్ఞానంఆదాయ" ఇక్కడ విజ్ఞానంతో బుద్ధితో అనీ తృతీయా విభక్తితో బుద్ధివాచక విజ్ఞానాన్ని ప్రయోగించారు. కనుక ప్రధమావిభక్తితో ఉన్నా విజ్ఞానపదం జీవాత్మనే సూచిస్తుంది. కాని బుద్ధిని కాదు. అందువలన జీవాత్మ కర్త అని సూత్రాభిప్రాయం. ఇక్కడ విజ్ఞానం అంటే జీవాత్మ. జీవాత్మ కర్త అయినప్పుడు, అతని కర్తృత్వం నిత్యమా? అనిత్యమా? అనీ సందేహం వస్తుంది. ఆత్మకు జ్ఞానం ఎలా నిత్యమో, కర్తృత్వం కూడా నిత్యమే కావాలి కదా! లౌకికక్రియలయందు, వైదికక్రియల యందు కూడా జీవునకు కర్తృత్వం ఉన్నట్లు శాస్త్రం చెబుతున్నది. " విజ్ఞానాం... తమ తే పిచ" జీవుడే యజ్ఞం చేస్తున్నాడు. ఇతర కర్మలు కూడా చేస్తున్నాడు. అని ఈ వాక్యానికి అర్ధం. విజ్ఞాన శబ్దానికి బుద్ధిఅనీ అర్ధమని గ్రహించబడింది కదా! దీని చేత జీవునికి కర్తృత్వం ఉన్నట్లు ఎలా తెలుస్తుంది? దీనికి సమాధానం. ఇది జీవుని నిర్దేశమే కాని బుద్ధియొక్క నిర్దేశంకాదు. బుద్ధికంటే భిన్నుడైన ఆత్మకే కర్తృత్వం చెప్పబడుచున్నట్లు సూచింపబడుతోంది. కనుక దోషం లేదు.
సూత్రం :- 253
" ఉపలబ్ధివత్ అనియమః "
ఉపలబ్ధివత్ :- జ్ఞానం లాగా, అనియమః :- కర్తృత్వం నిత్యం కావాలి అనే నియమం లేదు.
భావం :- జ్ఞానం లాగా కర్తృత్వం నిత్యం కావాలి అనే నియమం లేదు. ఆత్మకు జ్ఞాన స్వరూపం ఉంది. కనుక జ్ఞానం నిత్యం.
వివరణ:- జీవుడు తన కర్తవ్యాన్ని బుద్ధిసత్వ సంబంధంతో చెయ్యగలుగుతాడు. కర్తృత్వం అంటే కృతికి ఆశ్రయం. కర్తృత్వం ఇచ్ఛ వలన కలుగుతుంది. జీవాత్మ కూటస్థనిత్యం. అలాంటి జీవాత్మ ప్రయత్నానికి ఆశ్రయం కాదు. బుద్ధిసత్వ సంబంధం తోనే తన కార్యాలను నెరవేరుస్తాడు. జ్ఞానం లాగా కర్తృత్వం మౌలికంగా జీవాత్మకు నిత్యం కానేరదు. బుద్ధి కంటే భిన్నుడైన జీవుడు కర్త అయినట్లయితే అతను స్వతంత్రుడై ఉండి, తనకు ఏదీ హితమో, ఏదీ ప్రియమో దానిని సంపాదించాలి. అంతే కాని విపరీతమైన దానిని సంపాదించకూడదు. అయితే విపరీతమైనదాన్ని కూడా సంపాదిస్తున్నట్లు కనబడుచున్నాడు. స్వతంత్రుడైన ఆత్మ నియమం లేకుండా ఈవిధంగా ప్రవర్తించడం యుక్తం కాదు. ఈఆత్మ ఉపలబ్ధి (అంటే ఏదైనా ఒక విషయాన్నితెలుసుకోవడం గురించి) స్వతంత్రడే అయినా, నియమం లేకుండా ఇష్టమైనదానిని, అయిష్టమైనదానిని కూడా ఏవిధంగా తెలుకుంటాడో, అలాగే వాటిని ఇష్టంతోనో , అయిష్టంతోనో సంపాదిస్తాడు. జీవునికి ఉపలబ్దియందు స్వతంత్రం లేదు. ఎందుకంటే ఏదైనా ఒకవిషయం తెలుసుకోవాలంటే కేవలం మనిషి ఉంటే సరిపోదు. తెలుసుకునే సాధనాలు కూడా సేకరించుకోవాలి. అందుచేత జీవునకు స్వతంత్రంలేదు అనడం యుక్తం కాదు. వస్తువును తెలుసుకోవడం, ఏర్పాటు చేసుకోవడం వరకే ఉపలబ్ది ప్రయోజనం ఉంటుంది. ఆత్మ చైతన్యం కలది. కనుక దానికి మరొక ఆపేక్ష లేదు. విషయజ్ఞానం విషయంలో జీవునకు స్వతంత్రం ఉన్నదని గ్రహించాలి. ఉపలబ్ది కోసం సాధనాలను సేకరిస్తేనే స్వాతంత్రం ఉన్నట్లయితే, అసలు ఏ పని చెయ్యడానికి స్వాతంత్రం ఉండదు. ఆత్మకు ఏ పని చెయ్యడంలో స్వతంత్రం లేదు. ఎందువలనంటే ఏ పని చెయ్యాలన్నా దేశం, కాలం, నిమిత్తం మొదలైన విశేషాల ఆపేక్ష ఉంటుంది. సహాయాన్ని ఆపేక్షించినంత మాత్రాన కర్త యొక్క కర్తృత్వం పోదు. వంటవాడు కట్టెలు, నీరు మొదలైనవి కోరుకున్నంత మాత్రాన అతని పాకక్రియ కర్తృత్వానికి భంగం కలగదు. సాధనావైచిత్య్రాన్ని బట్టి ఆత్మ ఆపేక్ష లేకపోయినా, నియమంలేకుండా ఇష్టమైన, అయిష్టమైన పనులను నిర్వహిస్తుంది.
సూత్రం :- 254
" శక్తి విపర్యయాత్ "
శక్తి విపర్యయాత్ :- క్రియా శక్తి వ్యతిక్రమం వలన, కర్తృత్వం ఉప లబ్ధి లాగా నిత్యం అని అనలేము.
భావం :- క్రియాశక్తి వ్యతిక్రమం వలన, కర్తృత్వం ఉపలబ్ది లాగా నిత్యం అనలేము.
వివరణ- శక్తి యందలి వ్యత్యాసంవలన కూడా జీవుడే కర్త అవుతాడు. ఇది కేవలం పేరుతో ఉన్నా నినాదమే తప్ప వస్తువులో ఉన్నది కాదు. క్రియాశక్తి అంటే పనిచేసే శక్తి. క్రియ అంటే చర్య. ఏదైనా పని పూర్తి కావాలంటే 3 శక్తుల సమన్వయంతో ఉండాలి. ఇది మూడు రకములు. 1.ఇచ్చాశక్తి: ఒక పూల తోటను పెంచాలంటే ముందుగా ఆకోరిక కలిగి ఉండాలి. అదే ఇచ్చాశక్తి. 2.జ్ఞానశక్తి:- ఆతోటను సృష్టించడానికి అవసరమైన జ్ఞానం కలిగిఉండడం జ్ఞానశక్తి. 3.క్రియాశక్తి:- తోటను పెంచడానికి శారీరిక సామర్ధ్యం, కొన్ని సాధనాలు అవసరమౌతాయి. అదే క్రియా శక్తి. జ్ఞాన శక్తితో కలిపి క్రియాశక్తి ఒక వ్యక్తికి పురోగతిని సృష్టించ గల శక్తిని ఇస్తుంది. క్రియ జరగకపోయినా ప్రయత్నం ఉంటుంది కదా! అంటే అప్పుడు క్రియాశక్తి నిత్యం కాదు. ముక్తిలో క్రియాశక్తి ఉండదు. ఆత్మఉంటుంది. క్రియాశక్తి ఉంటే కార్యంఉండాలి. కార్యమే వస్తువు శాంతిని తెలుపు తుంది. ముక్తదశలో జీవాత్మ ఏకార్యము చెయ్యడు. కనుక అక్కడ క్రియాశక్తి లేదు. ఆత్మస్వరూపమైన జ్ఞానం ముక్తిలో ఉంటుంది. జీవాత్మకు ఉండే స్వరూపజ్ఞానం లాగా కర్తృత్వం కూడా నిత్యం కాదు. విజ్ఞానం కంటే భిన్నుడైన జీవుడు కర్తగా అవడం యుక్తం. విజ్ఞానం అని చెప్పబడే బుద్దే కర్త అన్నట్లయితే, బుద్ధికి కరణ శక్తి తొలగిపోయి, కర్తృశక్తి(కర్తృత్వం) వస్తుంది. లోకంలో అన్నీ వ్యవహారాలు శక్తి మీద ఆధారపడి జరుగుతుంటాయి. ఆశక్తి అనేక రూపాలలో అంటే ఒకప్పుడు కర్తగా, ఒకప్పుడు కర్మగా, ఒకప్పుడు కరణంగా పనిచేస్తుంది. బుద్ధి కర్తృశక్తి ఉన్నట్లయితే, నేను వడుతున్నాను, నేను తింటున్నాను, నేను చూస్తున్నాను అని అహంకార పూర్వకంగా చెబుతున్నట్లు కనబడుతుంది. అంతే కాకుండా ఆ పనులు చెయ్యడానికి మరొక సాధనం కూడా అవసరమవుతుంది. కర్త ఎంత సమర్థుడైనా కరణాన్ని(సాధనాన్ని) స్వీకరించకుండా ఏ క్రియ చెయ్యలేడు. ఈవిధంగా కరణం కంటే భిన్నమైన దానిని కర్త అంటారు. ఇక్కడ పేరులోనే భేదం కాని వస్తువులో భేదం లేదు.ఆత్మ కర్త, బుద్ధి కరణం అని కొందరంటారు. బుద్దే కర్త అంటే దానికి ఒక కరణం చూపాలి. కర్త అని దేనిని భావిస్తామో అదే ఆత్మ అని భావించాలి.
సూత్రం :- 255
" సమాధ్యభావాచ్ఛ "
సమాధి అభావత్ చ :- సమాధిలో కర్తృత్వం ఉండనందు వలన అది జ్ఞానం లాగా నిత్యం కానేరదు.
భావం :- సమాధి అవస్థలో కర్తృత్వం ఉండదు కనుక అది జ్ఞానం లా నిత్యం కాదు.
వివరణ:- ఆత్మధ్యానం అంటే సమాధి అసంభవమౌతుంది. కాబట్టి జీవుడే కర్త. లోకంలో ఉన్నదంతా ఆత్మయే. ఈ ఆత్మ అందరిలో సమానంగా ఉంటుంది. సకల చరాచర సృష్టి ఆత్మ నుండే ఉద్భవించింది. చివరకు ఆత్మలోనే లయమౌతుంది అని బృహదారణ్యకం లో చెప్పబడింది. కాబట్టి జీవుడే కర్త కాని వేరేవరు కాదు. సమాధిపదంలో సమ అంటే సమానత్వం, ఆధి అంటే మొదలు. ప్రాపంచికవిషయాల్లోను, ఆధ్యాత్మికవిషయాలలోనూ సమానత్వాన్ని పొందడం, ఎవరైతే ఈయావత్ బ్రహ్మాండాన్ని సృజించారో, ఆ సృష్టి కర్తతో మమేకత్వ స్థితి పొందడమే సమాధిస్థితి. దీనిని పరమహంస యోగనంద "శ్వాస లేని స్థితిలో శబ్దంలేని స్థితి" అని వర్ణించారు. ముక్తి అంటే సంసార జీవితం లోని బాధలను అంతమోదించడానికి, జీవుడికి జన్మరాహిత్యం కలిగించడానికి ప్రధానమైనది. ముక్తిని శాస్త్రాల్లో వర్ణించారు. లౌకికంగా దానిని చూడలేము. ముక్తిలో కర్తృత్వం ఉంటుందో, ఉండదో తెలుసుకోవడం అసాధ్యం. సమాధిస్థితిలో పరమవైరాగ్యం వలన, దాని వలన కలిగే సంస్కారం వలన, చిత్తవృత్తులు, సంస్కారాలన్నీ తొలగిపోతాయి. వృత్తిలన్నూ నశించి పోవడం వలన స్వరూపాన్ని కోల్పోయి, చిత్తం ప్రకృతిలో లీనమౌతుంది. అప్పుడు జీవుడు ధ్యానస్థితిలో పరమాత్మతో ఏకత్వ అనుభూతి పొందుతాడు. ఈ స్థితినే యోగులు సమాధి అంటారు. ఈసమాధిలో జీవుడికి జ్ఞానం ఉంటుంది. కాని కర్తృత్వం ఉండదు. క్రియను కలిగించే క్రియా శక్తి ఉండదు. యోగులకు ఇది అనుభవం లోకి వస్తుంది. కనుక జ్ఞానం లాగా కర్తృత్వం నిత్యం కాదు.
తక్షాధికరణం ( 2, 3, 40 )
సూత్రం :- 256
" యధాచ తక్షోభయధా "
చ :- అలాగే, యధా :- ఎలాగ, తక్ష్ :- వడ్రంగి, ఉభయధా :- ఉలి, రంపం లాంటి సాధనాల సంబంధం తో,
భావం:- వడ్రంగి ఉలి, రంపం మొదలైన సాధనలతో చేధించడం అనే క్రియకు కర్త, వాటి సంబంధం లేనప్పుడు ఎలా అకర్త అవుతాడో, అలాగే జీవాత్మ కూడా బుద్ధి సంబంధం ఉన్నప్పుడు కర్త, బుద్ధి సంబంధం లేనప్పుడు అకర్త అవుతాడు.
వివరణ:- గురువుగారు! జీవుడే కర్త అనీ చెప్పారు కదా! మరి ఈకర్తృత్వం అనేది జీవునికి స్వాభావికమా? లేక ఉపాధిని బట్టి వచ్చిందా? అని అడిగాడు నారాయణభట్టు. సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. వడ్రంగి లాగా జీవుడు కర్త, అకర్త అవుతున్నాడు. వడ్రంగివాడు, తన సామాను తీసుకొని కర్తగా తన పని చేస్తున్నప్పుడు దుఃఖితుడౌతున్నాడు. ఆ పని మానివేసి సాధనాలన్ని వదలి వేసినప్పుడు అకర్త అవుతాడు. అలాగే ఆత్మకూడా అజ్ఞానంతో వచ్చిన మనస్సు ఇంద్రియాలతో కూడినప్పుడు కర్తగా సంసారికదుఖం అనుభవిస్తున్నాడు. అవిద్యాసాధనలన్నీ వదలి వేసినప్పుడు అకర్తయి సుఖిస్తున్నాడు. కాబట్టి ఆత్మయొక్క కర్తృత్వం ఉపాధికి సంబంధించినవే. జీవుడుకూడా బుద్ధిసత్వంతో సంబంధం ఉన్నప్పుడు లౌకిక, వైదికకర్మలు చేస్తూ కర్త అవుతాడు. సమాధి, సుషుప్తి మోక్షాల్లో బుద్ధి సంబంధం లేనందువలన జీవుడు అకర్త. వడ్రంగి, జీవాత్మ స్వరూపంలో కర్తలుకారు. సాధనసంపత్తితో ఉన్నప్పుడే కర్తలు. వాటితో సంబంధం లేనప్పుడు అకర్తలు. జీవాత్మకు జ్ఞానంలాగా కర్తృత్వం నిత్యం కాదు. అయితే జీవాత్మ కర్మలన్ని స్వయంగా చేస్తాడా? లేక పరమాత్మ ప్రేరణతో చేస్తాడా? ఈశ్వరప్రేరణతో కర్మలు చేస్తే కనక పరతంత్రుడు అవుతాడు కదా! స్వతంత్రుడు కాలేదు కదా! స్వతంత్రుడు కాకపోతే జీవుడు కర్త ఎలాఅవుతాడు? జీవుడి చేత కర్మలు చేయించడానికి రాగద్వేషాది లక్షణాలు ప్రేరేపిస్తాయి. రాగద్వేషాల ప్రేరణ వలన జీవుడు తనకి ఇష్టమైన, అయిష్టమైన కర్మలను ఆచరిస్తాడు.అప్పుడు ఈశ్వరుని ప్రేరణ ఎందుకు కల్పిస్తున్నారు? రైతుకు వ్యవసాయం చెయ్యడానికి ఎద్దులు, నాగలి అవసరం. అలా కర్మలు కావాలని ఏమిటి ఋజువు? ఋజువు లేకుండా కర్మలు చెయ్యకూడదు. ఆత్మకు కర్తృత్వం స్వాభావికం అయితే మోక్షం రావడానికి అవకాశం ఉండదు. కనుక అది స్వాభావికం కాదు. కర్తృత్వం అనేది దుఃఖరూపం గాన కర్తృత్వం నుండి విడుదల లేనివారికి పురుషార్ధసిద్ధి కలగదు. అగ్నికి దహన శక్తి ఉన్నా కూడా కర్రలు లేకపోవడం చేత దహన కార్యం ఏ విధంగా ఉండదో, అట్లే కర్తృత్వ శక్తి ఉన్నా సాధించవలసిన కార్యం లేకపోతే పురుషార్ధం సిద్ధించదు. అది యుక్తం కాదు. కర్తృత్వ శక్తి ఉంటుందని ఎప్పుడు చెప్పారో అప్పుడు కార్యం యొక్క నిమిత్తాలు కూడా శక్తి రూపంలో ఉంటాయి. కొన్ని కర్మలు చెయ్యడం వలన మానవుడు దేవత్వన్ని పొందుతాడని శాస్త్రం చెబుతుంది. మోక్షం సాధించడానికి కొన్ని సాధనలు ఆచరిస్తే మోక్షం కలుగుతుంది. ఆ శాస్త్రం చేతనే కర్తృత్వం తొలగి మోక్షం రావచ్చును కదా! అనీ కొందరి అభిప్రాయం. అది యుక్తంకాదు. ఎందువలనంటే సాధనలతో సంపాదించినది అనిత్యం అవుతుంది. నిత్యము, శుద్దము, జ్జాన స్వరూపం ముక్తం అయిన ఆత్మను ప్రతిపాదించడం వలన అనగా ఆత్మ ఇలాంటిది అని చెప్పడం వలన మోక్షసిద్ధి అంగీకరించబడింది. పరమాత్మకంటే అన్యుడైన కర్త, బుద్ధ్యాది సముదాయం కంటే భిన్నుడు, చైతన్యవంతుడు అయిన జీవుడు లేకపోతే అప్పుడు పరమాత్మయే సంసారి అనీ, కర్త అనీ, భోక్త అనీ చెప్పవలసిన వస్తుంది. కర్తృత్వ, భోకృత్వాలు విద్యావ్యవస్థలో నిషేదిస్తుంది. ఆత్మకు స్వప్న, జాగ్రదావస్థలలో ఉపాధిసంపర్కం చేత శ్రమ కలుగుతుంది అనిచెప్పి, సుషుప్తిలో పరమాత్మతో కలిసిన ఆఆత్మకు శ్రమలేనట్లు చెప్పబడు తుంది. అట్లే ముక్తవ్యవస్థలో కూడా విద్యాదీపంచేత అవిద్యాంధకారాన్ని తొలగించుకొని, కేవలం ఆత్మస్వరూపుడై, విశ్రాంతుడై సుఖంగా ఉంటాడు. తన వ్యాపారాలు చెయ్యవలసిన వచ్చినప్పుడు అవసరమైన సాధనలను తీసుకొని కర్త అవుతాడు. ఆసాధనలు లేనప్పుడు, ఏపని చెయ్యనప్పుడు అకర్త అవుతాడు. శాస్త్రం ఆత్మకు కర్తృత్వం ఉంది అని ప్రతిపాదించదు. జీవుడు బ్రహ్మస్వరూపుడు అని ఉపదేశించడం వలన వీనికి స్వాభావికంగా కర్తృత్వం లేదు అనీ చెప్పారు. అందుచేత అవిద్య చేత ప్రాప్తించిన కర్తృత్వాన్ని దృష్టిలో ఉంచుకొని విధి శాస్త్రం ప్రవర్తిస్తుంది. అవిద్య చేత ఏ విధమైన కర్తృత్వం ఆత్మకు ఉంటుందో దానిని మాత్రమే అనువర్తిస్తుంది.
సూత్రం :- 257
" పరాత్తు తచ్ఛృతేః "
తు :- అయితే, శ్రుతేః :- వేద వాక్యాల వలన, తత్ :- కర్తృత్వం, పరాత్ :- ఈశ్వరుడి ప్రేరణతో కలుగుతుందని తెలిస్తోంది. ఈ అధికరణం జీవుడి కర్తృత్వం పరమేశ్వరాధీనం అని తెలియజేస్తోంది.
భావం:- ఉపాధివలన జీవుడు కర్త అవుతున్నాడు. అయితే వేద వాక్యాల వలన కర్తృత్వం ఈశ్వరుడి ప్రేరణతో కలుగుతుందని తెలుస్తోంది.
వివరణ:- గురువు గారు! జీవుడికి ఈ కర్తృత్వం ఈశ్వరుని వలన లభిస్తోందా? లేక ఈశ్వరుని ప్రమేయం లేకుండా లభిస్తోందా? అని అడిగాడు కృష్ణశర్మ. సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. జీవుడికి కర్తృత్వం ఈశ్వరుడి వలెనే కలుగుతుంది. జీవుడు అవిద్యతో కూడి ఉన్నంత వరకు కర్తృత్వ, భోకృత్వ లక్షణాలు గల సంసారం లభిస్తోంది. అతడికి జ్ఞానం కలగగానే మోక్షం వస్తుంది. కాబట్టి జీవునికి కర్తృత్వం ఈశ్వరుని వలెనే లభిస్తుంది. ఋగ్వేదం(8,7,3,3) "య ఈశే అస్య ద్విపదః చతుష్పదః" చరాచరమైన ఈ జగత్తుకు పరమాత్మే ఈశుడు. ఆయన అదీనంలో ఈసమస్త జగత్తు ఉన్నది. ఈశ్వరుడి ప్రేరణ వలనే అచేతనాలైన సూర్యాదులు సైతం ప్రకాశిస్తున్నాయి. అలాంటప్పుడు జీవుడు నియంత అయిన పరమేశ్వరుని ప్రేరణ వలన ప్రేరితుడై, కర్మలను ఆచారిస్తాడనడం లో సందేహం లేదు. జీవుడు కర్మలను ఆచరించడంలో స్వతoత్రుడు కాకపోతే అతనికి కర్తృత్వం ఉండదా? అని సందేహం కలగవచ్చును. కర్త స్వతంత్రడే. స్వతంత్రం అంటే క్రియలను ఆచరించడంలో ప్రాధాన్యం ఉండటం. ఈప్రాధాన్యత లేకపోతే జీవుడు అకర్త, అస్వతంత్రుడు అవుతాడు. పరమేశ్వరుని ప్రేరణతతో కర్మలు ఆచరించినంత మాత్రాన జీవుడు అస్వతంత్రుడు కాడు. అతని కర్తృత్వానికి భంగం రాదు. రాగద్వేషాది విషయంలో రైతు - ఎద్దుల ఉదాహరణ పొసగదు. రైతుకు ఎద్దులు, నాగలి ఉన్నంత మాత్రాన పొలం దున్నలేడు. ఆ పని చెయ్యడానికి ఈశ్వరుని ప్రేరణ ఉండాలి. ఎద్దులు నాగలి సాధనలే కాని ప్రేరకాలు కావు. రాగద్వేషాది లక్షణాలు దోషాలు అవి ఈశ్వరునిలో లేవు. కనుక జీవుడు ఈశ్వరుడి ప్రేరణతో కర్మలు ఆచరిస్తాడు. అలాంటప్పుడు జీవుడికి విధి, నిషేధాలు విధించే శాస్త్రాలు ఎందుకు? జీవుడు కేవలం పుణ్య కర్మలే చెయ్యాలి కదా? పాప కర్మలు ఎందుకు చేస్తున్నాడు? ఈశ్వరుడు క్షేశ రూపమైన కర్తృత్వం ప్రాణులకు కలుగ జేసినట్లయితే వానికి నైర్ఘృణ్యం అంటే జాలి లేకపోవడం అనే దోషం కనిపిస్తుంది. జీవులకు విషమం ఫలాలు (మంచిచెడు ఫలితాలు ఇచ్చే) కర్తృత్వాన్ని కల్పించే ఈశ్వరునికి వైషమ్యం అనే పక్షపాత దోషం ఏర్పడుతుంది. "వైషమ్య నైర్ఘృణ్యే నసాపేక్షిత్వాన్ " ఈశ్వరనికి సాపేక్షిత్వం అనేది కుదరాలి కదా! ప్రాణులన్నింటికి ధర్మాధర్మలు ఉంటే సాపేక్షిత్వం కుదురుతుంది. జీవునికి కర్తృత్వం ఉంటే ధర్మాధర్మలు సిద్ధిస్తాయి. అప్పుడు ఈశ్వరుడు వాళ్ళ చేత కర్మలు చేయిస్తాడు. కర్మాపేక్ష లేకుండా ఈశ్వరుడు జీవుడిచేత కర్మలు చేయిస్తే, తాను చెయ్యని కర్మలకు, కర్మ ఫలాన్ని అనుభవించవలసి వస్తుంది. అందుచేత జీవుడికి కర్తృత్వం స్వయంగానే ఉంటుంది అని చెప్పాలి. అవిద్యా వ్యవస్థలో శరీరేంద్రియ సముదాయం అంటే తాను వేరైనవాడు అని తెలుసుకొనక, అవిద్య అనే తిమిరం చేత అంధుడై ఉన్న జీవునకు కర్మాధ్యక్షుడు, సకల భూతాలలో నివసించేవాడు, సాక్షి, చైతన్య స్వరూపుడు అయిన ఈశ్వరుని వలన అతని అనుజ్ఞ చేత కర్తృత్వం, భోకృత్వం లక్షణాలుగా గల సంసారం సిద్ధిస్తుంది. ఈశ్వరుని అనుగ్రహం చేతనే కలిగిన విజ్ఞానం చేత మోక్ష సిద్ధి కూడా కలుగుతుంది. అన్నీ వ్యవహారాలలో ఈశ్వరుడే ప్రేరణకర్త అని శ్రుతి వలన తెలుస్తోంది. ఎవరిని లోకంలో పైకి తీసుకొని వెళ్లాలనుకుంటాడో, వారి చేత మంచి కర్మలు చేయిస్తాడు.
సూత్రం :- 258
" కృత ప్రయత్నాపేక్షస్తు విహిత ప్రతిషిద్దా వైయర్ధాదిభ్యః "
తు :- పైగా, విహిత ప్రతిషిద్దా వైయర్ధాదిభ్యః :- వేద విహితమైన విధి, నిషేదాల ప్రామణ్యం వలన, జగత్ వైచిత్ర్యం లాంటి హేతువుల వలన, కృత ప్రయత్న అపక్ష :- విహిత కర్మలతోను, నిషిద్ద కర్మలతోను జీవుడు చేసిన ప్రయత్నాన్ని ఆపేక్షించి ఈశ్వరుడు ప్రేరణ చేస్తాడు.
భావం :- వేదవిహితమైన కర్మలు వ్యర్థం కాకుండా ఉండడానికి పరమేశ్వరుడు జీవుడి చేత కర్మలు చేయిస్తాడు.
వివరణ:- వేదాలలో చేయవలసిన విధులు, చేయకూడని పనులు, కూడా చెప్పబడ్డాయి. యాగాలు, హోమాలు, దానాలు చెయ్యాలి. సురపానం చెయ్యకూడదు. అబద్ధమాడకూడదు. ఇవి నిషేధాలు. ఈశ్వరుడు జీవుడి చేత తన ఇష్టం వచ్చినట్లు పాపపుణ్యాలు చేయించడం లేదు. శ్రుతులలో చెప్పిన కర్మలను మాత్రమే చేయిస్తున్నాడు. ఆ కర్మల ఫలితాన్ని జీవుడు మరు జన్మలో అనుభవిస్తున్నాడు. ఈ రకంగా జీవుని యొక్క కర్తృత్వం పరమేశ్వరాదీనమే అని గ్రహించాలి. రాగద్వేషాలతో జీవుడు లౌకిక, వైదిక కర్మలు చేయడానికి ప్రయత్నించినప్పుడు హృదయంలో ఉండే ఈశ్వరుడు దయతో నీవు చేసే పని చేయదగినది, చేయదగనిది అని ఎన్నో సార్లు బోధిస్తాడు. దీనినే భగవత్ ప్రేరణ అంటారు. ఇది చాలా మందికి అనుభవం లోకి వస్తుంటుంది. మంచి పని చెయ్యడానికి, చెడు పని చేయకుండా ఉండటానికి ఈశ్వరుడి బలవంతం ఏమి ఉండదు. అలా చేస్తే కర్మలు చేయడానికి జీవుడికి స్వాతంత్రం ఉండదు.భగవత్ ప్రేరణ కేవలం ఆయన ఇష్టాన్ని సూచిస్తుంది.
మనుస్మృతి:-(8,92):- యమో వైవస్వతో దేవో. గంగామ్ మాకురూన్ గమః " నీవు చేయవలసిన కార్యాన్ని నీ హృదయంలో ఉన్న కరుణామయుడైన దేవుడు అంగీకరిస్తే దాన్ని కర్తవ్యమని, అంగీకరించకపోతే అది నిషిద్దమని తెలుసుకో! ఒక రాజ్యం లో రాజు నిబంధనలను పాటిస్తూ ప్రజలు స్వతంత్రంగా కర్మలు చేస్తూ ఉంటారు. అదే విధంగా పరమాత్మ నియంత్రణలో ఉన్నా జీవుడు పరమాత్మ ప్రేరేపితుడైనా, స్వతంత్రుడైన లౌకిక వైదిక కర్మలు చేస్తూ, వాటి వలన వచ్చే కర్మ ఫలాలను సుఖదుఃఖరూపంలో అనుభవిస్తాడు. జీవుడు కర్మలు చెయ్యడంలో స్వతంత్రుడు. వాటి ఫలం అనుభవించడంలో పరతంత్రుడు. కనుకనే విధినిషేధ శాస్త్రాలు ఉన్నాయి. ఇదే జగత్ వైచిత్యం. భగవంతునికి పక్షపాతాది దోషాలు అంటవు. ఈ దోషలన్ని కర్మానుష్టానంలో జీవుడు పరతంత్రుడైనప్పుడు మాత్రమే సంభవిస్తాయి.
కౌశీతకి బ్రాహ్మణం:-(3,8):-పరమేశ్వర ప్రేరణానుకూలంగా కర్మలు చేసేవాడు ఊర్ధ్వలోకాలు పొందుతాడు. ప్రేరణకు విరుద్ధం గా అసాధుకర్మలు చేసేవాడు అధో లోకాలకుపోతాడు. దీని వలన జీవుడు కర్మలు చెయ్యడంలో స్వతంత్రుడు, వాటి ఫలాలు అనుభవించడంలో పరతంత్రుడు అయినప్పటికీ జీవుడి కర్మానుష్టాన స్వతంత్రానికి ఎలాంటి హాని కలుగదు.
ఋగ్వేదం:- (1,5,6,24):-"తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్యధీమహి, ధీయోయోనః ప్రచోదయాత్" భక్తుడు ఈ విధంగా గాయత్రీ మంత్రంతో భగవంతుని ప్రార్ధిస్తాడు. ఆ అనుగ్రహం వలన పాపాలు తొలగిపోతాయి. ఈశ్వరుడు కర్మానుష్టానంలో జీవుడికి ప్రేరణ కలిగిస్తాడు. ఈశ్వరుడు మేఘం వలె కేవలం నిమిత్త మాత్రంగా ఉండి జీవుడు చేసిన ధర్మాధర్మాల వైషమ్యాన్ని ఆధారంగా చేసుకొని ఆయా ఫలాలను విషమంగా విభజిస్తాడు. లోకంలో తమ తమ బీజాల నుండి పుట్టే నానావిధాలైన గుచ్చాలు, పొదలు, యవలు, మొదలైన వాటికీ కూడా మేఘం అన్నింటిని సమమైన దృష్టితో వర్షిస్తుందో, అదే విధంగా ఈశ్వరుడు జీవుడు చేసిన ప్రయత్నాన్ని ఆపేక్షించి వాళ్లకు శుభాశుభాలు సమకురుస్తాడు అని చెప్పడం సమంజసంగా ఉంటుంది. వాటికీ సంబంధించిన బీజాలు లేకపోయినా, మేఘం లేకపోయినా వాటి ఆకులు, పుష్పాలు, రసం లో వైషమ్యం ఉండదు కదా! జీవుని కర్తృత్వం ఈశ్వరుని మీద ఆధారపడి ఉంటే జీవుడు చేసిన ప్రయత్నాన్ని ఆపేక్షించడం అనేది కుదరదు కదా! అని సందేహం. కర్తృత్వం ఇతరుని మీద ఆధారపడి ఉన్నా కూడా, జీవుడు కర్మలు చేస్తూనే ఉన్నాడు కదా! చేస్తున్న ఆ జీవుని చేత ఈశ్వరుడు చేయిస్తున్నాడు.జీవుడు పూర్వం చేసిన ప్రయత్నాన్ని ఆపేక్షించి ఇప్పుడు చేయిస్తున్నాడు. అంతకు ముందు చేసిన ప్రయత్నాన్ని ఆపేక్షించి పూర్వంచేయించాడు .
అంశాధికరణం ( 2, 3, 43 )
సూత్రం :- 259
" అంశో నానావ్యపాదేశా ధన్యధా చాపి దాశకితవాదిత్వ మధీయత ఏకే "
నానా వ్యపదేశాత్ :- అనేక రకాలుగా ఉపదేశించడం వలన, అంశః :- జీవాత్మ బ్రహ్మనికి అంశం. అన్యధా అపిచ :- వేరే విధంగా కూడా చెప్పడం వలన, దాశ కితవాదిత్వం :- స్త్రీ పురుషాది భావం ఉన్నాదని, ఏ కే :- కొందరు, అదీయత్ :- తలపోస్తారు.
భావం :- అనేక రకాలుగా ఉపదేశించడం వలన, జీవాత్మ బ్రహ్మనికి అంశం. వేరే విధంగా చెప్పడం వలన స్త్రీ పురుషాది భావం ఉన్నదని కొందరు తలపోస్తారు.
వివరణ:-ఈఅధికరణంలో బ్రహ్మతో జీవికి గల సంబంధం గురించి చెప్పబడింది. తండ్రి కొడుకులకు అంశ, అంశీ భావం ఉన్నది. కుమారుడు అంశం అయితే, తండ్రి అంశీ అవుతాడు. అలాగే జీవబ్రహ్మల సంబంధం ఉన్నదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఋగ్వేదం:-(6,7,21,11):- "త్వంహి నః పితావసో యోనః పితా జనితాయో విధాతో " నీవే మా జనకుడివి, భర్తవు, వీటి వలన జీవులకు ఈశ్వరుడు పిత అనీ తెలుస్తోంది. ఆయన మనకు తండ్రి లాంటి వాడని భావం. జీవికి ఈశ్వరుడికి భేదం చెప్పినా, చెప్పకపోయినా కూడా జీవుడు ఈశ్వరుని అంశమే. వేదాలలో కొన్ని చోట్ల వీరి సంబంధం అగ్నికి, నిప్పు రవ్వలకు ఉండే సంబంధంగా చెప్పాయి. ఛాందోగ్యోపనిషత్తు:-ఉద్దాలకుడు ఆత్మజ్ఞానాన్ని తన కుమారుడైన శ్వేతకేతువునకు బోధిస్తూ, జీవులు వాటి రూపాలు, నామాలు పోగొట్టుకుంటాయి. అవిఅన్నీ ఏతత్వంతో కలసిపోతాయో అదే బ్రహ్మ, అది అద్వితీయ మైనది. సూక్షమైనది, సర్వవ్యాపకమైనది. కాబట్టి ఆత్మ, పరమేశ్వరుడు రెండు ఒక్కటే. ఐతరేయపనిషత్తు :- పరమేశ్వరుడు ఇంద్రియాలతో కూడిన మానవ శరీరంలో బ్రహ్మరంద్రం గుండా ప్రవేశ్నించాడు అని చెప్పబడింది. కనుక పరమాత్మయే జీవాత్మరూపంలో ఉన్నది. ఈరకంగా భేదం చెప్పడం వలన ఉపాధి వలన కలిగిన భేదం కలవాడై జీవాత్మ పరమాత్మ యొక్క అంశం లాగా ఉన్నాడు. అంశ -అంశీ భావంలో జీవుడు ఈశ్వరుడిలో ఒక భాగం అనుకోకూడదు. ఈశ్వరుడిలో బాగాలు లేవు. ఆయన అఖండం. ఇక్కడ అంశ అంటే సముదాయాలలో ఒకటి. కాగా, అనేక జీవసముదాయం ఈశ్వరుడు కాదు. అలా అన్నట్లయితే జీవుడికి దుఃఖాలన్నీ ఉంటాయని చెప్పవలసిన వస్తుంది. అవిభక్తంగా సజాతీయంగా ఉండటమే అంశ. చైతన్యమే ఇద్దరికీ సజాతి లక్షణం. జీవేశ్వరులిద్దరూ చేతనాలు. ప్రళయకాలంలో జీవుడు ఈశ్వరుడిలో అవిభక్తంగా ఉంటాడు. ఇదే అంశ-అంశీ భావం. లోకంలో తండ్రి కొడుకులది కూడా అంశాంశీ భావమే. కొడుకు మాతృగర్భం చేరక ముందు తండ్రితో అవిభక్తుడై ఉంటాడు. తరువాత తల్లి గర్భం చేరి వేరేవుతాడు. ఇదే భేద-అభేద వాదం. జీవేశ్వరుల మధ్య ఉపకార్యోపకారక భావం అంటే జీవుడు ఉపకార్యుడు. ఈశ్వరుడు ఉపకారం చేసేవాడు అని చెప్పబడింది. లోకంలో స్వామిభ్రత్యులు, అగ్ని విస్పులింగాల వలె కలసిఉన్నవాటికే ఉపకార్యోపకార భావం కనబడుచున్నది. జీవేశ్వరుల బంధం స్వామి భ్రత్యు సంబంధమా? లేక అగ్నివిస్పులింగాల సంబంధమా? అని సందేహం వస్తే ఏదైనా చెప్పవచ్చును. స్వామి భృత్యుల సంబంధంలో ఈశిత్రీశితవ్య భావం అంటే అధికారం చేసేవాడు, అధికారానికి లొంగి ఉండేవాడు అనే సంబంధం కనిపిస్తుంది. కనుక ఈసంబంధం అలాంటిదే కావాలి. అందువల్ల అంశః అని అంటున్నారు. విస్ఫలింగం అగ్ని యొక్క అంశమైనట్లు, జీవుడు ఈశ్వరుడి అంశంగా ఉండటమే తగిఉంటుంది. ఇక్కడ అంశం అనగా అంశం వంటిది అనీ అర్ధం. అవయవరహితమైన ఈశ్వరునికి అంశం అంటూ ఉండదు కదా! ఈశ్వరుడు అవయవరహితుడవడం చేత జీవుడే ఈశ్వరుడు ఎందుకు కాకూడదు? నానావ్యపదేశం అనగా భేదం చెప్పడం వలన. ఈ అంశాంశీ భావంలో కంటే స్వామిభ్రత్యు సాదృశ్యం లో బాగా కుదురుతుంది కదా! అనే సందేహం. దానికి సమాధానం చెబుతున్నారు. "అన్యధా చాపీతి " కేవలం నానా వ్యపదేశాన్ని మాత్రమే కారణంగా తీసుకొని అంశత్వం తెలిబడటం లేదు. మరొక విధంగా కూడా వ్యపదేశం ఉంది. బ్రహ్మదాసులు, కైవర్ణులు (చేపలు పటేవారు), జూదరులు, అందరు కూడా బ్రహ్మయే. బ్రహ్మయే సమస్త రూపాలను విస్తరించి, పేర్లను కల్పించి వ్యవహారిస్తోంది. ఆ బ్రహ్మను తెలుసుకున్నవాడు విద్వాoసుడు అనీ చెప్పబడింది. జీవేశ్వరుల మధ్య భేదం, అభేదం కూడా తెలియబడుచున్నాయి. కనుక జీవుడు ఈశ్వరుని అంశ అనీ తెలుస్తోంది.
సూత్రం :- 260
" మంత్రం వర్ణాచ్ఛ "
చ :- పైగా, మంత్రవర్ణాచ్ఛ :- వేదమంత్రాలు జీవుడు బ్రహ్మనికి అంశం అంటున్నాయి.
భావం :- వేద మంత్రాల వలన జీవుడికి బ్రహ్మ యొక్క అంశత్వం ఉన్నదని తెలుస్తోంది.
వివరణ:- జీవుడికి ఈశ్వరుడి అంశత్వం ఉన్నదని మంత్రంవలన తెలుస్తుంది. ఋగ్వేదం (8,14,17,3) :- చరాచరాత్మక మైన ఈజగత్తంతా ఈశ్వరుడికి ఒక పాదం. అంశం భాగం కాగా, బ్రహ్మ నిరంశం. ఈ అంశం వ్యవహారం గౌణమే. ప్రధానమైన అర్ధం కాదు. బ్రహ్మలో భాగాలు ఉండవు. కనుక జీవుడు అంశంలాంటి వాడే కాని భాగం కాదు. చాందోగ్యోపనిషత్తు:- గాయత్రీ ద్వారా బ్రహ్మోపాసన తెలియజేస్తూ, పృధివిరూపమైన గాయత్రీ, శరీరంలో ఉండే పంచభూతాలు, ఇంద్రియసమూహాలు అన్నీ ఒక్కటే. పురుషుని శరీరకమైన గాయత్రీ, పురుషుని హృదయకమలంలో ఉండే పురుషుడు ఒక్కటే. ఆపురుషునిలోనే అంటే గాయత్రీలోనే ప్రాణాలు ప్రతిష్టితమై ఉన్నాయి. శుద్ధ బ్రహ్మ, కార్యక్రమం బ్రహ్మ కన్నా గొప్పది, పాంచభౌతికమైన జగత్తంతా శుద్ధబ్రహ్మ యొక్క ఒకపాదమే. మిగిలిన మూడుపాదాలు ఆ పరబ్రహ్మలోనే ఉన్నాయి. గాయత్రీ ద్వారా ప్రతిపాదించబడి, మూడు పాదాలు గల అమృత స్వరూపమైన బ్రహ్మము ఇదే. ఈ మంత్రం జీవుని యొక్క అంశత్వాన్ని తెలియజేస్తుంది. "గయాన్ త్రాయతే ఇతి గాయత్రి" అని ఆదిశంకరులవారు తన భాష్యంలో వివరించారు. గయలు అనగా ప్రాణాలు, త్రాయతే అనగా రక్షించడం. గాయత్రీ మంత్ర జపం వలన జీవుడు చేసే పాపాలను నాశనం చేసి, దీర్ఘాయువును కలిగిస్తుంది. జన్మ మరణ బంధముల నుండి విముక్తి కలిగించి, ముక్తిని పొందడానికి, బ్రహ్మను సాక్షాత్కరింప జేసుకోవడానికి మూల కారణమౌతుంది. సద్భుద్ది నీచ్చే మంత్రం, కామరుచి నుంచి తప్పించి రామరుచి వైపు నడిపించే మంత్రం. పవిత్రమైన ఆత్మయే పరిశుద్ధమైన శరీరమును నిర్మించగలదు. భర్గః అంటే శుద్ధ స్వరూపుడు, పాప రహితుడు హృదయంలో ఉండే ఆత్మతో ఎక్కమయ్యేది బ్రహ్మమే. " తావా నస్య. దీవి " అనే మంత్రం కూడా ఈ విషయాన్నే చెప్పు చున్నది. ఇక్కడ భూత శబ్దం జీవుడు ప్రధానంగా గల స్థావర జంగమాలను నిర్దేశిస్తుంది. కాని పంచ భూతాలను కాదు.
అంశాధికరణం ( 2, 3, 45 )
సూత్రం :- 261
" అపిచ స్మర్యతే "
స్మర్యతే :- స్మృతులు, చ :- కూడా, అపి,:- అలాగే అంటున్నాయి.
భావం:- జీవేశ్వరుల మధ్య అంశాంశీ భావం ఉంటుందని స్మృతి అంటున్నాయి. అయితే జీవుడికి ఉండే క్లేశాలు ఈశ్వరుడికి కలుగుతాయా?
వివరణ:-భగవద్గీతలో "మమైన. సనాతనః" సనాతనమైన నాఅంశమే జీవలోకంలో జీవుడిగా అయినదని, జీవుడు ఈశ్వరాంశ 00000000అనే విషయం చెప్పబడింది. ఈశిత్రీశితవ్యభావం (అధికారం చేసేవాడు, అధికారికి లొంగిఉండేవాడు) స్వామి భృత్యాదులలోనే ప్రసిద్ధంగాఉంది అని చెప్పబడింది. లోకంలో ఈప్రసిద్ధిఉన్నా కూడా ఇక్కడ శాస్త్రాన్ని బట్టి అంశాంశిత్వం, ఈశిత్రీశిత స్వభావం కూడా ఉన్నట్లు నిశ్చయింబడింది. అంశాంశీ భావం (అంశ అంటే జీవాత్మ, అంశీ అంటే పరమేశ్వరుడు), ఈశిత్ర-ఈశితవ్య భావం (ఈశ్వరుడు అధికారం చేసేవాడు, జీవుడు ఈశ్వరుడికి లొంగి వుండేవాడు) రెండు కూడా ఉన్నట్లు శాస్త్రం లో చెప్పబడింది. అంశాంశీభావం ఉన్నా కూడా మాయచేత, అవిద్యచేత హీనమైన ఉపాధితో కూడిన జీవులను ఈశ్వరుడు శాసిస్తున్నాడని చెప్పడంలో విరోధం లేదు. జీవుడికి ఉండే క్లేశాలు ఈశ్వరునికి అంటవు.
సూత్రం :- 262
"ప్రకాశాది వన్నైవం పరః "
ప్రకాశాదివత్ :- ఇంద్రియాలకు హాని కలిగినా, సూర్యాదులకు ఎలాంటి ఇబ్బంది లేనట్టుగా, ఏవం :- జీవుడికి క్లేశం, కర్మలు ఉన్నా, పరః:- పరబ్రహ్మకు, న:- ఎలాంటి క్లేశాలు ఉండవు.
భావం:- ఇంద్రియాలకు హానికలిగినా, సూర్యాదులకు ఎలాంటి ఇబ్బంది లేనట్లుగానే, జీవుడికి క్లేశం, కర్మలు ఉన్నా పరబ్రహ్మకు ఎలాంటిక్లేశాలు ఉండవు.
వివరణ :- జీవాత్మ అనుభవించే సుఖదుఃఖాలు పరమేశ్వరుడికి కూడా కలుగుతాయా? అనే సందేహం వస్తుంది. అయితే జీవాత్మ దుఃఖం అనుభవించినట్లుగా పరమాత్మ అనుభవించడు. సూర్యుని వెలుతురుకు చెయ్యి అడ్డుపెడితే సూర్యకాంతి వంకరగా పడుతుంది. అంతే తప్ప వంగదు. అలాగే ఖాళీ కుండలో ఆకాశం ఉంది. ఆకుండని ఒక చోటు నుంచి మరొక చోటుకి తీసుకు వేడితే కుండతో బాటు ఆకాశాన్ని తీసుకుపోనవసరం లేదు. కంటికి అలా కనబడుతుంది. అంతే కాని నిజంగా ఆకాశం తీసుకుపోబడదు. అలాగే జీవుడు పరమేశ్వరుని అంశ అయినప్పటికీ జీవుని సుఖదుఃఖాలు పరమేశ్వరునికి అంటవు. ఎందుకంటే జీవుడికి దుఃఖం కూడా ఉపాధికి సంబంధించినదే. జీవుడు ఏవిధంగా సంసారదుఃఖాన్ని అనుభవిస్తాడో, ఆవిధంగా ఈశ్వరుడు అనుభవించడు. జీవుడు అజ్ఞానంతో దేహాదులే ఆత్మ అనే భావం పొందుతూ, వాటికి కలిగిన దుఃఖం తనకే కలిగిందనుకుంటూ, అవిధ్యాకృతమైన దుఃఖాన్ని తన మీద పెట్టుకుంటాడు. జీవుడికి నామరూపాలచేత ఏర్పడిన దేహేంద్రియ మనోబుద్ధులు వేరు అని తెలియక పోవడం చేత దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. అది బ్రహ్మ చేత ఏర్పడినదే కాని పారమార్ధికం కాదు. దేహానికి సంబంధించిన బాధలు కాలడం, చేధించడం మొదలైన వాటి వలన కలిగే దుఃఖం ఎలా అనుభవిస్తున్నాడో, పుత్ర మిత్రాదులకు కలిగిన దుఃఖానికి వాళ్ళ యందు అభిమానమనే భ్రాంతి చేతనే నేనే పుత్రుణ్ణి, నేనే స్నేహితుడను అని వారిపై అభిమానం పెంచుకొని, ఆదుఃఖాలనుకూడా తానే అనుభవిస్తున్నాడు. అందువలన దుఃఖభావం మిత్రాభిమాన భ్రమచేత ఏర్పడినందని స్పష్టంగా తెలుస్తోంది. వ్యతిరేకం కనబడటం అంటే అభిమానం లేనప్పుడు దుఃఖం కలగకపోవడం వలన కూడా, కొంతమంది పరివ్రాజకులకు దుఃఖం కలగదు. పుత్రమిత్రాదులతో సంబంధం, అభిమానం ఉన్నా కొంతమంది ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు, ఫలానా పుత్రుడు మరణించాడు, ఫలానా మిత్రుడు మరణించాడు అని ఎవరో వచ్చి చెప్పినప్పుడు వారితో సంబంధం ఉన్నవాళ్లకి దుఃఖం కలుగుతుంది. అలాంటి అభిమానం లేని పరివ్రాజకులకు ఎటువంటి దుఃఖం కలగదు. అందుచేత లౌకికుడైన పురుషునికి సమ్యక్ దర్శనం కనబడుతుంది. అలాంటప్పుడు ఏవిషయంలోనూ సంబంధం లేని స్వస్వరూపం కంటే భిన్నమైన మరొక వస్తువును చూడని నిత్య చైతన్య స్వరూపుడైనా పరమేశ్వరునికి ఈక్లేశాదులన్నీఅంటవు. అందుకే ప్రకాశాదివత్ అనీ నిదర్శనం చూపబడింది. సూర్యుడు అంశ-కన్ను అంశం, ఆకాశం అంశి- చెవి అంశం, వాయువు అంశి- చర్మం అంశం. కళ్ళు మొదలైన ఇంద్రియలకు సంభవించే దోషాలు సూర్యాదులకు అంటవు. అలాగే అంశం అయిన జీవుడికి ఉండే క్లేశాదులు అంశ అయినా ఈశ్వరునికి అంటవు. అందుకే ఈశ్వరుడు దుఃఖించడు. తత్వమసి మొదలైన వేదాంతాలు జీవునకు అవిద్యచేత ఏర్పడిన జీవత్వాన్ని తొలగించి బ్రహ్మత్వాన్ని ప్రతిపాదిస్తాయి. అందువలన జీవునకు సంబంధించిన దుఃఖం చేత ఈశ్వరునకు దుఃఖం కలిగే ప్రసక్తి లేదు.
సూత్రం :- 263
" స్మరంతి చ "
చ :- అనేక శాస్త్రలు, స్మరంతి :- కూడా అంటున్నాయి.
భావం :- జీవగుణ దోషాలు ఈశ్వరునికి వర్తించవు అనీ అనేక శాస్త్రాలు అంటున్నాయి.
వివరణ :- జీవుని దుఃఖం వలన పరమాత్మ దుఃఖితుడు కాదు. పరమాత్మ నిత్యుడు, నిర్గుణుడు. కర్మలను అనుభవించే జీవుడు తిరిగి తిరిగి జన్మలు ఎత్తుతూ ఉంటాడు.
యోగ దర్శనం :- "క్లేశ కర్మ విపాకాశై రపరామృష్టః పురుషః విశేషః ఈశ్వరః " క్లేశం, కర్మలు, కర్మ ఫలాలు వీటితో బంధితుడు కాని విశేష పురుషుడే ఈశ్వరుడు.
కఠోపనిషత్తు:-(5-11):-సర్వలోకానికి నేత్రమైన సూర్యుడు లోకుల నేత్రదోషాలతో సంబద్ధుడు కాడు. అలాగే సర్వ భూతాంత రాత్మ అయిన ఈశ్వరుడు ప్రాణుల దుఃఖాలతో లిప్తుడు కాక, స్వస్వరూపంతో ప్రకాశిస్తూ ఉంటాడు. కనుక జీవేశ్వరులకు అంశాంశీభావ సంబంధం ఉన్నా జీవుల సుఖ దుఃఖలతో ఈశ్వరుడికి ఎలాంటి సంబంధం ఉండదు. కాగా అంశాంశీ సారూప్యం ఉన్నప్పుడు విధినిషేధాలు జీవునికి ఎందుకున్నాయి? ఆ ఇద్దరిలో పరమాత్మ నిత్యుడు, నిర్గుణుడు, ఉదకం చేత తామరాకు వలె ఫలములచేత కూడా లిప్తుడుకాడు. రెండవవాడు జీవుడు మాత్రం కర్మప్రధానుడు, మోక్షంతోను, బంధాలతోను సంబంధించి ఉంటాడు. ఐదు జ్ఞానేoద్రియలు, ఐదు కర్మేంద్రియాలు ,ఐదు ప్రాణాలు, మనస్సు, బుద్ధి అనే 17 తో కూడి ఉంటాడు. ప్రకాశింపజేయుబడుచున్న పదార్ధాల దోషాల చేత సూర్యుడు ఏవిధంగా లిప్తుడు కాడో, అట్లే సర్వ భూతాంతరాత్మయైన పరమేశ్వరుడు సంగరహితుడై లోకం యొక్క దుఃఖం చేత లిప్తుడు కాడు.
సూత్రం :- 264
" అనుజ్ఞా పరిహారౌ దేహ సంబంధాత్ జ్యోతిరాదివత్"
"జ్యోతిరాదివత్:- అగ్ని, జలానికి ఉన్నట్లుగా, అనుజ్ఞాపరిహారౌ:- విధినిషేధాలు, దేహసంబంధాత్ :- జీవుడికి దేహ సంబంధం ఉన్నందు వలన, అతనికి వర్తిస్తాయి.
భావం:-అగ్ని, జలం మొదలైన వాటివలె జీవుడు దేహంతో తాదాత్మ్యం చెందటం వలన విధినిషేధాలు సంభవమౌతున్నాయి.
వివరణ:- వేదం చదవండి, అగ్నిహోత్రం చెయ్యండి లాంటి విధులు, గోవులను, గొర్రెలను హింసించకండి లాంటి నిషేధాలు, దేహసంబంధం ఉండటంవలన జీవుడికి శాస్త్రాలు విధించాయి. అగ్ని, జలం లాంటి విషయంలో ఇలాంటి నిషేధాలు ఉన్నాయి. మంచిగృహస్థు ఇంటి నుంచి నిప్పు తెచ్చుకోవాలి. శ్మశానం నుంచి తేరాదు. ప్రవహిస్తున్న నది నుంచి నీటిని తెచ్చుకోవాలి. నిలవనీటిని, కలుషితజలాన్ని వాడరాదు. జీవుడికి సత్తా, చైతన్యం లాంటి గుణాల వలన ఈశ్వరుడితో పోలిక ఉన్నా, అతనికి శరీర సంబంధం ఉన్నందువలన విధినిషేధాలు ఉన్నాయి. ఈశ్వరుడికి లేవు. ఈశ్వరుడు ఒక్కడే అయినా దేహసంబంధం వలన అనేక రూపాలు పొందుతున్నాడు. జ్యోతిస్సు వలె దేహధ్యాహ్నం వలన అనుజ్ఞా పరిహారాలు కుదురుతాయని సూత్రానికి అర్ధం. ఋతుకాలంలో భార్యను పొందవచ్చును అని అనుజ్ఞ. గురుభార్యను పొందకూడదు అని పరిహారం. అగ్ని, సోమయాగానికి సంబంధించిన, సోమదేవత కొరకు పశువును చంపవచ్చును అని అనుజ్ఞ. ఏ ప్రాణిని హింసించకూడదు అని పరిహారం. ఇట్లే లోకంలో మిత్రుని చేరవచ్చును అనీ అనుజ్ఞ. శత్రువుకు దూరంగా ఉండాలి అని పరిహారం. ఆత్మ ఏకమే అయినా కూడా ఈవిధమైన అనుజ్ఞా పరిహారాలు ఆత్మకు దేహసంబంధం ఉండటం వలన కుదురుతాయి. దేహసంబంధం అంటే ఏమిటి? ఈదేహమే నేను అనే ఆత్మ విషయంలో విపరీతజ్ఞానమే దేహసంబంధం. నేను వెడుతున్నాను, నేను వస్తున్నాను, నేను అంధుడను కాను, నేను మూఢుడను. ఈమాటలు ప్రాణులందరిలో వినబడతాయి. దీనిని నివారింపదగినది సమ్యక్ దర్శనం తప్ప మరేది కాదు. అవిద్యతో కూడిన దేహాద్యుపాధులతో సంబంధం చేత ఆత్మ, జీవుడు ఒక్కటేనని అంగీకరించినా కూడా అనుజ్ఞా పరిహారాలు కుదురుతాయి. సమ్యక్ దర్శనం ఉన్నవానికి తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించే ప్రసక్తి లేదు. అన్ని వృత్తులకు మూల కారణం దేహభిమానం. అది సమ్యక్ దర్శికి లేదు. అందువలన జ్యోతిరాదుల విషయంలో వలె జీవునకు దేహ సంబంధం వల్లనే అనుజ్ఞా పరిహారాలు ఏర్పడతాయి. జ్యోతిస్సు ఒక్కటే అయినా మాంసం తినే అగ్ని(శ్మశానాగ్ని) ఏవిధంగా పరిహారించబడుతుందో ఇతరమైన అగ్ని పరిహారించబడదో, ఒకే సూర్యుని ప్రకాశం అమేధ్యం పై ఏవిధంగా పరిహారించ బడుతుందో, పరిశుభ్రమైన ప్రదేశంలో ఉన్నది పరిహరించబడదో, భూమియొక్క ప్రదేశాలే అయినా వజ్రవైడూర్యాలు ఏవిధంగా గ్రహీంపబడతాయో, భూమికి సంబంధించినవే అయినా కూడా నరకళేబరాలు పరిహారించబడతాయో, గోమూత్రం, గోమయం ఏ విధంగా పవిత్రమని గ్రహింపబడతుందో, ఇతర జాతికి సంబంధించినవి పరిహారంపబడతాయి.
సూత్రం :- 265
"అసంతతే శ్చా వ్యతిరేకః "
అసంతతే :- జీవుడు అవికారి కావడం వలన, అవ్యతికరః :- అవికారి అయిన బ్రహ్మానికి అంశమే.
భావం :- దేహ సంబంధం జీవుడికి వికారం కలిగించదు. జీవుడు అవికారి అయినా బ్రహ్మానికి అంశమే.
వివరణ:- జీవాత్మకు అన్ని శరీరాలతో సంబంధం ఉండదు. కాబట్టి కర్మఫల సంకరం ఉండదు. ఒక శరీరంలోని జీవాత్మకు వేరొక శరీరంలోని జీవాత్మకు సంబంధం లేదు. అందుచేత చేసే కర్మలు, వాటి ఫలితములలో కూడా సంబంధం ఉండదు. ఒకరి ఫలాన్ని ఇంకొకరు అనుభవించడం కుదరదు. జీవుడు కూటస్థుడు, నిత్యుడు, అవికారి. శరీర సంబంధం జీవుడికి నైమిత్తికం, స్వాభావికం కాదు. మిధ్యా జ్ఞానం వలన జీవుడికి ప్రాకృతిక పదార్ధాలతో సంబంధం ఏర్పడుతోంది. ఈశ్వరుడికి అలాంటి సంబంధం లేదు. జీవుడికి సుఖదుఖాలు ఉంటాయి. నిర్వికారి కావడం వలన జీవేశ్వరులకు అంశాంశీ భావం ఉన్నది. వేరువేరు స్థూల దేహాలనే ఉపాధులను బట్టి జీవులు వేరవడం చేత అనుజ్ఞా పరిహారం కుదిరినా, ఆ స్థూల దేహాలు నశించిన తరువాత అనుభవించవలసిన పుణ్య పాపాల విషయంలో సాంకర్యం కలుగుతుంది కదా! ఒక జీవుని కర్మ ఫలం మరొకనికి లేదా మొత్తం అన్ని ఫలాలు ఒక్కటే అని చెప్పబడే ఆత్మకు చెందవలసి వస్తాయి కదా! అని పృచ్చకుని అభిప్రాయం. స్థూల దేహాలు నశించినా బుద్ధి రూపమైన ఉపాధి మోక్షం కలిగే వరకు వెన్నంటుతూనే ఉంటుంది. జీవ భేదం కొనసాగుతూనే ఉంటుంది. కనుక సాంకర్యం లేదని భావం.
సూత్రం :- 266
" ఆభాస ఏవచ "
ఆభాస :- జీవాత్మకు కలిగే సుఖ దుఃఖలు, ఏ వచ :- కేవలం ఆభాసే.
భావం :- జీవుడికి కలిగే సుఖ దుఃఖాలు కేవలం ఆభాసే.
వివరణ:- జీవుడికి కలిగే సుఖదుఃఖాలు కేవలం ఆభాసే. సుఖదుఃఖాలు బుద్ధికి సంబంధించినవి. బుద్ధితో భాసించి, తాదాత్మ్యం పొందటం వలన జీవుడుకి కలుగుతాయి. ఇవి జీవుడికి స్వాభావికం కాదు. కేవలం ఆభాస మాత్రమే.( వాస్తవంగా అది కనబకపోయినా అదిగా కనబడేది ఆభాసే ). జీవుడు పరమేశ్వరుని ప్రతిబింబం. ఆకాశంలో కనిపించే సూర్యుడు, భూమి మీద నీటిలో కనిపించే సూర్యుని ప్రతి బింబం ఒకటి కాదు. రెండు వేరు వేరు. పది కుండలలో నీరు ఉన్నప్పుడు, అన్నింటిలో సూర్యుని ప్రతిబింబం కనిపిస్తూనే ఉంటుంది. వీటిలో ఒక కుండను కదిపినట్లయితే అందులోని ప్రతిబింబం మాత్రమే కదులుతుంది. అన్ని కుండ లలోని ప్రతి బింబం కదలదు. అలాగే ఒక జీవి చేసిన కర్మకు అతడే అనుభవించాలి. అంతే కాని వేరొక శరీరంలో ఉన్న జీవి అనుభవించడు. జలంలో ప్రతిబింబించిన సూర్యుని వలె ఈ జీవుడు పరమాత్మ యొక్క ఆభాస మాత్రమేనని గ్రహించాలి. అంతే కాని సాక్షాత్తు పరమేశ్వరుడే కాదు. పరమేశ్వరుని కన్నా భిన్నమైన మరొక వస్తువు లేదు. ఒక కుండలోని సూర్య ప్రతిబింబం కదులుతు వేరొక దానిలో కదలనట్లుగా, జీవునకు కర్మ ఫలంతో సంబంధం ఉన్నా కూడా మరొక జీవుని కర్మఫలంతో సంబంధం ఉండదు. అభాస (జీవుడికి కలిగే సుఖదుఃఖాలు) అవిద్యాకల్పితమే గాన దానికి ఆశ్రయమైన సంసారం కూడా ఆవిధ్యాకృతమే. ఆ ఆభాసరూపాన్ని నిరాకరించి, పారామార్థికమైన బ్రహ్మభావాన్నీ ఉపదేశించడం కూడా ఉపపన్నం అవుతుంది. ఎవరి మతంలో ఆత్మలు అనేకములో, అంతటా వ్యాపించి ఉన్నాయో వాళ్ళ మతంలోనే ఈవ్యతిరేకం ప్రాప్తిస్తుంది. సాంఖ్యమతం:- ఆత్మలు అసంఖ్యకములు. విభువులు అంటే సర్వవ్యాప్తములు, చైతన్య స్వరూపములు, నిర్గుణములు, నిరతిశయములు, (ఏ విధమైన విశేషాలు లేనిది). ఆఆత్మలన్నింటికి సాధారణమైనది ప్రధానం. అణుప్రమాణం గల అచేతనాలైన మనస్సులు ఆఆత్మలకు సాధనలుగా ఉంటాయి. ఈ ఆత్మద్రవ్యాలు, మనో ద్రవ్యాలు కలవడం చేత ఇచ్చ మొదలైన తొమ్మిది గుణాలు ఆత్మలో పుడతాయి. ఆ గుణాలు వ్యతిరేకం లేకుండా ఏ ఆత్మకు సంబంధించినవి ఆఆత్మతో సమవాయసంబంధం కలిగి ఉంటాయి. అదే సంసారం. ఈ తొమ్మిది గుణాలు తొలగిపోతేనే మోక్షం అనీ కాణాదులు అంటారు. సాంఖ్యులమతంలో అన్నీ ఆత్మలు చైతన్యరూపాలే గాన ఒకే దేహంలో అన్నీ ఆత్మలు సంవిహితాలై ఉంటాయి. ఒక ఆత్మకు సుఖదుఃఖ సంబంధం కలిగినప్పుడు అన్నింటికీ సుఖదుఃఖ సంబంధం కలగవలసి ఉంటుంది. కాణాదులమతం ప్రకారం కూడా మనస్సు ఒక ఆత్మతో సంయుక్తం అయినప్పుడు మిగిలిన ఆత్మలు కూడా అక్కడనే ఉంటాయి. కనుక వీటిలో సంయోగం కలుగుతుంది. ఒక ఆత్మకు సుఖదుఃఖ సంబంధం కలిగితే అన్ని ఆత్మలకి కూడా సమంగానే సుఖదుఃఖాలు కలగవలసి వస్తుంది. కాని అది యుక్తం కాదు. ఒక జీవి చేసిన కర్మను అతడే అనుభవించాలి. అంతే కాని వేరొక శరీరంలో ఉన్నా జీవి అనుభవించడు.
సూత్రం :- 267
" అదృష్టా నియమాత్ "
అదృష్ట :- ఆకస్మికతతో, అనియమాత్ :- నియమం లేనందువలన, జీవుడు విభువు కాదు. అణువే.
భావం :- అదృష్టాన్ని బట్టి నియమం ఏర్పడుతుంది. అదృష్టానికి నియమం లేనందువలన జీవుడు విభువు కాదు, అణువే.
వివరణ :- అదృష్ట నియమం లేని సాంఖ్య, కణాదుకు మాత్రమే ఈ దోషం సంభవిస్తుంది. అంతే కాని వేదాంత మతానికి కాదు. సాంఖ్యమతం:- వీరి మతం ప్రకారం ఆత్మలు అనేకం ఉన్నాయి. అవి చైతన్యస్వరూపాలు, నిర్గుణాలు, అంతటా వ్యాపించి ఉన్నాయి. ప్రధానం వలెనే ఆత్మలన్నింటికి భోగాలు లభిస్తున్నాయి. అన్ని ఆత్మలకు సుఖదుఃఖ సంబంధం కలుగుతుంది. ఇది దోషం. కాణాదులమతం:- వీరు కూడా ఆత్మలు అనేకం ఉన్నాయని, అవి అచేతనాలని, వాటికీ అచేతనాలైన మనుషులు ఉపకారకాలు అనీ చెప్పారు. దేహేంద్రియ మనోబుద్ధుల ప్రభావం ఆత్మలందు చేరటం వలన సంసారం ఏర్పడు తుంది. ఇచ్చ మొదలైన గుణాలు పుట్టకుండా ఉంటే మోక్షం వస్తుంది. వీరి మతంలో ఒక ఆత్మకు, మనస్సుకు సంయోగం కలిగితే మిగిలిన వాటికి కూడా కలగాలి. ఏదైనా ఆత్మకు, మనస్సుకు సంయోగం పొందే అదృష్టం లేదు. కనుక వాటికి సాంకర్యదోషం వస్తుంది. ఆకాశం వలె సర్వత్రా వ్యాపించి ఉన్న అనేకమైన ఆత్మలు ప్రతి శరీరంలో లోపల బైట అనే విశేషం లేకుండా సoవితాలై ఉండగా మనోవాక్కాయములచే ధర్మాధర్మ లక్షణమైన అదృష్టం కలుగుతుంది. సాంఖ్యులకైతే అవి ఆత్మతో సమవాయ సంబంధం ఉండదు. ప్రధానంతో సంబంధం ఉంటుంది. ప్రధానం అన్నీ ఆత్మలకు సమానమే. అది ఒక్కొక్క ఆత్మకి సుఖదుఃఖలను కలిగించదు. జీవులు అనేకులు కనుక జీవులంతా వ్వాపకులైతే వాళ్ళకు కలిగే సుఖదుఃఖాలకు ఏ వ్యవస్థ ఉండదు. జీవులకు కలిగే సుఖదుఃఖాలు ఆకస్మికాలు కావు. జీవుడు విభువైతే అందరూ ఒకే సమయంలో దుఃఖితులు కావాలి. అప్పుడు సుఖదుఃఖాలకో వ్యవస్థ ఉండదు. కనుక జీవులు వ్యాపకులు, విభువులు కారు. అణువులే.
సూత్రం :- 268
" అభి సంధ్యాది ష్యపి ఛైవమ్ "
చ ఏవం :- అలాగే, అభిసంధి ఆదిషు :- రాగ ద్వేషాదు లతో కూడిన సంకల్పమే అభిసంధి.
భావం :- రాగ ద్వేషాదులతో కూడిన సంకల్పమే అభిసంధి. సంకల్పం, ప్రయత్నాలతో అదృష్టంతో నియమం ఉండే వీలుంది. కనుక సుఖ దుఃఖలతో వ్యవస్థ ఏర్పడదు.
వివరణ:- ఆత్మలన్నీ వ్యాపకాలైతే అదృష్టంతో అన్ని ఆత్మలకు సానిధ్యం ఉంటుంది. అదృష్టం అంటే ఆకస్మికంగా మనస్సులో కలిగే నిర్ణయాలు. అప్పుడు ఈఅదృష్టం ఈఆత్మది, ఆఆత్మది కాదు, అని నిశ్చయించే వీలుండదు. అలాగే అదృష్టానికి కారణాలైన సంకల్ప ప్రయత్నాలకు అన్ని ఆత్మలతో సంబంధం ఉండి, అదృష్టాన్ని కలిగించే సామర్ధ్యం ఉండదు. కనుక ఆత్మలు విభువులు అని అంగీకరిస్తే సుఖదుఃఖ వ్యవస్థ ఏర్పడదు. నేను ఈఫలం పొందుదునుగాక, నేను దీనిని పరహరించెదను, నేను ఈపని ఈవిధంగా ప్రయత్నం చేస్తాను. ఈవిధమైన అభిసంధి అంటే మానసికాభిప్రాయం ప్రతి ఆత్మలోనూ ఉంటుంది. అది అదృష్టానికి ఆత్మలకు మధ్య నున్న స్వస్వామిభావాన్ని నియమిస్తాయి. ఈ అదృష్టం ఈ ఆత్మది, అది ఆఆత్మది కాదు అనే భేదాన్ని చెప్పవచ్చు కదా! అని సందేహించారు. అది కాదంటున్నాడు.అలాగే అదృష్టానికి కారణములైన సంకల్ప ప్రయత్నాలకు అన్ని ఆత్మలతో సంబంధం ఉండి ,అదృష్టాన్పి కలిగించే సామర్థ్యం ఉండదు.కనుక ఆత్మలు విభువులు అని అంగీకరిస్తే సుఖదుఃఖవ్యవస్థ ఏర్పడదు. అభిసంధి మొదలైనవాటిలో కూడా అదే దోషం కనబడుతుంది. సర్వాత్మ సాధారణమైన ఆత్మ, మనస్సు సంయోగం చేత సమస్త ఆత్మల సంవిధిలో చేయబడుచున్న అభిసంధి ( మానసికభిప్రాయం ) మొదలైనవి కూడా నియమ హేతువులు అనడం కుదరదు. అన్ని మనస్సులు ఒకే చోట ఉండటం వలన ఏ ఆత్మకు ఏ మనస్సులో సంయోగం ఉంటుందో చెప్పలేము. ఈ ఆత్మకు సంబంధించిన నిశ్చయాలు ఇవి చెప్పడానికి వీలులేదు. కాబట్టి నిశ్చయాదులకు సాంకర్య దోషం తప్పదు.
సూత్రం :- 269
" ప్రదేశా దితి చే న్నాంతర్భావాత్ "
ప్రదేశాత్ ఇతి చేత్ :- శరీర దేశ సంబంధం వలన సుఖ దుఃఖాలు ఏర్పడితే కనుక, అంతర్భావాత్ :- జీవులందరికి వేర్వేరు దేహాలు ఉండటం వలన, న :- సుఖ దుఃఖ వ్యవస్థ ఏర్పడదు.
భావం :- శరీర ప్రదేశంలో ఆత్మ మనస్సు, సంయోగం కలగడం వలన దోషం లేదు అన్నట్లయితే, కాదు. అన్ని ఆత్మలు కూడా ఒక్క శరీరంలోనే ఉంటాయి కదా! అని సూత్రానికి అర్ధం.
వివరణ :- ఆత్మ విభువే అయినా కూడా శరీరంలో ఉన్నా, మనస్సుతో సంయోగం శరీరంలో ఇమిడి ఉన్న ఆత్మ యొక్క ప్రదేశంలోనే జరుగుతుంది. సంకల్పం, ప్రయత్నం మనస్సు సంయోగం వలనే కలుగుతాయి. ఆమనస్సు ఆత్మతో బాటే శరీరంలో ఉంటుంది. అన్ని జీవాత్మలకు వేర్వేరు శరీరాలు ఉంటాయి. సంకల్పాలు వాటి మూలంగా ఏర్పడే అదృష్టాలు వేర్వేరుగా ఉంటాయి. అప్పుడు సుఖదుఃఖాదులతో వ్యవస్థ ఏర్పడుతుంది. జీవులు వ్యాపకులైతే అన్ని శరీరాలలో ఉన్నా అన్ని మనసులలో వాటికీ సంబంధం ఉంటుంది. అప్పుడు సంకల్పాల్లో ఏ నియమం ఉండదు. దానితో సుఖదుఃఖ వ్యవస్థ ఏర్పడదు. అందువలన జీవులు అణువులే కాని విభువులు కారని తెలుస్తోంది. ఆత్మలు సర్వ వ్యాపకాలు, అన్ని శరీరాలలో ఉంటాయి. కాబట్టి ఒక శరీరంలో చేరిన ఆత్మ మనస్సుతో సంయోగం చెందుతుంది అని చెప్పడానికి కూడా వీలు లేదు. అందుచేత బింబ ప్రతిబింబ వాదం ప్రకారం సుఖ దుఃఖావస్థకు సాంకర్య దోషం లేదు. అంటే పది కుండలలో కనిపించిన ప్రతిబింబం ఒక కుండను కదిపితే అన్ని కుండలలోని ప్రతిబింబం కదలదు. అన్ని ఆత్మల సంవిధిలో పుడుతున్న శరీరం కూడా, ఇది ఈ ఆత్మకే సంబంధించినది ఇతర ఆత్మలకు సంబంధించినది కాదు. ప్రదేశ విశేషాన్ని అంగీకరించినా కూడా సమానమైన సుఖదుఃఖాలను అనుభవించవలసి ఉన్న రెండుఆత్మలు ఒకే శరీరంచేత సుఖదుఃఖాలను కూడా అనుభవించ వచ్చును. ఎందువలనంటే రెండు ఆత్మల అదృష్టం ఒకే ప్రదేశానికి సంబంధించి ఉండవచ్చును కదా! అదేట్లనగా దేవదత్తుడు ఏ ప్రదేశంలో సుఖదుఃఖాలను అనుభవించాడో ఆ ప్రదేశం నుండి వాని శరీరం తొలగిపోగానే, ఆ ప్రదేశానికి యజ్ఞదత్తుని శరీరం చేరినప్పుడు వానికి కూడా దేవదత్తునికి ఏవిధమైన సుఖదుఃఖాల అనుభవం కలిగిందో, అలాంటి అనుభవమే కలుగు తుంటుంది. దేవదత్త, యజ్ఞదత్తులకు ఒకే ప్రదేశంలో సుఖదుఃఖాలు కలిగించే అదృష్టం లేకపోతే అలాంటి సుఖ దుఃఖానుభావం కలిగిండేది కాదు. అనేకమైన ఆత్మలు సర్వగతాలు అని చెప్పడం యుక్తం కాదు. ఎందుకు తగిన దృష్టాంతం ఏదీ లేదు. ఒకే ప్రదేశంలో అనేక వస్తువులు ఏవి ఉన్నాయి? రూపాదుల దృష్టాంతం అయితే అది యుక్తం కాదు. ఎందుకంటే దర్శిని బట్టి వాటికీ బేధం లేదు. వాటి లక్షణాలు వేర్వేరుగా ఉంటాయి. అనేక పదార్ధాలు ఒకే చోట ఉండటానికి ద్రుష్టాంతం అన్నటలయితే అది యుక్తం కాదు. దర్శిని బట్టి వాటికీ భేదం లేదు. వాటి లక్షణాలు వేరు వేరుగా ఉంటాయి. అనేక పదార్ధాలు ఒకే చోట ఉండటానికి దృష్టాంతంగా రూపాదులను చూపవచ్చును. ఒకే ఘటంలో రూప రస గంధాలు న్నాయి కదా! అని వైశేషికులు చెప్పవచ్చును. అది యుక్తం కాదు. రూపం, తేజస్సు అనే దర్శి కి చెందినది. రసం జలానికి, గంధం పృథ్వికి సంబంధించినది. తేజో రస గంధాదుల కంటే భిన్నంగా ఘటం లేదు. అందుచేత రూపాదులకు దర్శి అయిన ఘటానికి భేదం లేదు. అదే విధంగా రూప లక్షణం వేరు. గంధం లక్షణం వేరు. అందుచేత ఇవన్నీ ఒక ఘటంలో కలసి ఉన్నట్లు కనబడడానికి అవకాశం ఉంది. ఆత్మలకు లక్షణ భేదం లేదు. అందుచేత వేర్వేరు ఆత్మలని చెప్పడం కుదరదు.
ద్వితీయాధ్యాయంలో తృతీయపాదం సమాప్తం.
ప్రాణోత్పత్యధికరణం ( 2, 4, 1 )
సూత్రం :- 270
"తథా ప్రాణః "
తధా :-ఆకాశాది మహా భూతాలు బ్రహ్మం వలన ఉత్పన్నం అయినట్లే, ప్రాణః :- ఇంద్రియాలు కూడా జనించాయి.
భావం :- ఆకాశాది మహా భూతాలు బ్రహ్మం వలన ఉత్పన్నం అయినట్లే ఇంద్రియాలు కూడా జనించాయి. అయితే ఇంద్రియాలకు పుట్టుక ఉన్నదా! లేక జీవాత్మ లాగా వాటికీ పుట్టుక లేదా?
వివరణ :- ఇంతవరకు జీవుడి గురించి విచారణ జరిగింది. అతనికి సాధనాలైన ఇంద్రియాల గురించి ఈ పాదంలో వివరణ ఉన్నది. గురువు గారు! ప్రాణాల ఉత్పత్తి గురించి అన్ని ఉపనిషత్తులలోనూ చెప్పలేదు. కొన్ని చోట్ల సృష్టికి పూర్వమే ప్రాణం ఉన్నట్లు చెప్పారు. కాబట్టి ప్రాణాలను గురించి వివరించండి. అన్నాడు నారాయణభట్టు. సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. ఆకాశం మొదలైన వాటిలాగా ప్రాణాలకు కూడా ఉత్పత్తి ఉన్నది. ప్రాణాలు అంటే ఇంద్రియాలు అని అర్ధం.
ముండకోపనిషత్తు(2,1,8):- ఆ పరమాత్మ వలన సప్త ఇంద్రియాలు జనించాయి. ఆయన వలననే ప్రాణం, మనస్సు, అన్నీ ఇంద్రియాలు జనించాయి. కళ్ళు 2, ముక్కు 2, చెవులు 2, నోరు 1 మొత్తం 7 పుట్టినవి.
తైత్తరీయోపనిషత్తు(2,1):- ఆకాశాదిభూతాలు పుట్టినట్లు వర్ణించారు. కాని ఇంద్రియాల ఉత్పన్నం అయినట్లు చెప్పలేదు కదా! అంటే వాటికీ ఉత్పత్తి ఉందనే వాక్యాలు సైతం వేరుగా ఉన్నాయి. పృదివి నుంచి ఓషధులు, వాటి నుంచి అన్నం, ఆ అన్నం నుంచి రేతస్సు, దాన్నుంచి శరీరం ఉత్పన్నం అవుతాయి. ఇంద్రియలులేని శరీరం ఎలా సిద్ధిస్తుంది? కనుక ఇంద్రియాలకు పుట్టుక ఉందనడంలో ఏ సందేహం లేదు. శరీరం ఇంద్రియాలకు ఆశ్రయం.
ప్రశ్నపనిషత్తు:-ఆపురుషుడు ఈశరీరం నుండి ఎవరు వెడితే నేను వెడతాను. ఎవరు ఉంటే నేను ఉంటాను. అని ఆలోచించిన వాడై, ముందుగా అవసరమైన ప్రాణాన్ని సృష్టించాడు. తరువాత దాని నుండి శ్రద్ధ, ఆకాశం, వాయువు, అగ్ని, జలము, భూమి, ఇంద్రియాలు, మనస్సు, అన్నం సృష్టించాడు అని చెప్పబడింది. వీటిని బట్టి చూస్తే ప్రాణాలు బ్రహ్మ యొక్క వికారాలు అని తెలుస్తోంది. ఉత్పత్తిప్రకరణంలో ప్రాణాల ఉత్పత్తి చెప్పబడలేదు. కొన్ని చోట్ల అవి ఉత్పన్నములు కానట్లే చెప్పబడింది. అవిద్యాఋషయః" అనే చోట్ల సృష్టికి పూర్వం ప్రాణాలు ఉన్నట్లు వినబడుచున్నది. సృష్టికి పూర్వం ఇదంతా అసత్తుగానే ఉండేది. ఆ అసత్తుగా ఉన్నది ఋషులే అన్నారు. ఆ ఋషులు ఎవరో కాదు, ప్రాణాలే అని అన్నారు. ఈ విధంగా శ్రుతుల మధ్య విరోధం ఉండటం వలన ఎలా నిర్ధారణ చెయ్యాలో తెలియక సందేహం కలుగుతుంది. లోకాదులు ఏ విధంగా పరమాత్మ నుండి పుడుతున్నాయో అట్లే ప్రాణాలు కూడా పుడుతున్నాయి. ఆకాశాదుల వలె ప్రాణాలకు కూడా ఉత్పత్తి ఉన్నదని తెలుసుకోవాలి. ప్రాణాలు కూడా పరబ్రహ్మ వికారాలేనని అన్వయించుకోవాలి.
సూత్రం :- 271
" గౌణ్య సంభవాత్ "
గౌణం కావడం , అసంభవాత్ :- సంభవం కాదు.
భావం :- ఇంద్రియాలకు నాశనం ఉన్నది. ఇది ప్రత్యక్షంగా చూస్తున్నాము. కనుక నాశనం ఉన్నా ఇంద్రియాలకు జన్మం ఉంటుంది. అందువలన ఇంద్రియాల ఉత్పత్తిని చెప్పిన ఉపనిషద్వాక్యం గౌణం ( అప్రధానం ) కాదు.
వివరణ :- ప్రాణోత్పత్తి విషయం గౌణం అనడం సంభవం కాదు.
ముండకోపనిషత్తు:- శౌనకుడు, గురువర్యా! అంగీరసమహర్షి, దేన్ని గురించి తెలుసుకుంటే సర్వము తెలుస్తాయో దానిని గురించి వివరించండి, అన్నాడు. ఆ ఒక్క విషయం తెలుసుకుంటే అన్నీ విషయాలు తెలుస్తాయి. పరబ్రహ్మ నుండి సమస్త ప్రాణాలు పుడుతున్నాయి. ఇక్కడ ప్రాణోత్పత్తి కూడా చెప్పబడింది. కనుక ఇది గౌణం కాదు. "ఏతస్మాత్..ప్రాణః" ప్రాణాధికమైన సమస్తజగత్తు బ్రహ్మవికారం అయితేనే ప్రకృతికంటే వేరుగా వికారం ఉండదు. ప్రాణాల ఉత్పత్తి శృతి గౌణి అయిన పక్షంలో ఈప్రతిష్టకు భంగం కలుగుతుంది. సృష్టికి పూర్వం ప్రాణాలున్నట్లు వినబడుచున్నది కదా! ఎట్లనగా ఇది మూలప్రకృతిని అంటే మూలకారణమైన బ్రహ్మను గురించి చెప్పినది కాదు."అప్రాణో నరః" అని, మూలప్రకృతిలో(బ్రహ్మలో) ప్రాణాదివిశేషాలేవి లేవని నిశ్చయింపబడింది కదా! అందుచేత సృష్టికి పూర్వం ప్రాణాలున్నట్లు చెప్పడం తన వికారాల దృష్ట్యా అవాంతర ప్రకృతినిగూర్చి చెప్పినదని గ్రహించాలి. వ్యాకృతమైన వాటికి సంబంధించిన అనేకఅవస్థలను కూడా శ్రుతులలోను, స్మృతులలోను ప్రకృతి వికారభావంతో చెప్పడం జరిగింది. మూలకారణం బ్రహ్మ, వానినుండి ఒకదాని తరువాత ఒకటిగా అనేక వస్తువులు సృజించబడ్డాయి. ఈ వస్తువులన్నీ రావడానికి ప్రకృతి కారణం అవుతుంది. మూడవడానికి రెండవది ప్రకృతి(కారణం), నాలుగవడానికి మూడవది ప్రకృతి అవుతుంది. ఈవిధంగా ఒక వస్తువును దాని కార్యాన్ని దృష్టిలోఉంచుకొని ప్రకృతిఅని చెప్పడం శ్రుతి, స్మృతులలో ఉన్నది. అందుచేత ఉత్పత్తికిపూర్వం ప్రాణాలున్నా యనగా ప్రాణాల కార్యం ఉత్పత్తికిముందు ప్రాణాలున్నాయని అర్ధమేగాని, ప్రాణాలు మూలకారణంగా ఉన్నాయని కాదు. అవ్యాకృతావస్థ(సూక్ష్మఅవస్థ)నుండి వ్యాకృతావస్థలోకి వచ్చిన పదార్ధాలలో కూడా ప్రకృతి వికృతి భావం చెప్పడం ఉంది.
సూత్రం :- 272
" తత్ ప్రాక్ శృతేశ్చ "
తత్ ప్రాక్ :- ఆకాశాదుల కన్నా ముందే, ఇంద్రియాలు జనిస్తాయని, శృతేః :- శృతులు, చ :- స్మృతులు అంటున్నాయి.
భావం :- ఆకాశాదుల కన్నా ముందే ఇంద్రియలు జన్మించాయని శృతులు, స్మృతులు చెబుతున్నాయి.
వివరణ :- ఉత్పత్తి సూచించే పదం జాయతే. ఇది ఆకాశం మొదలైన వాటి కన్నా ముందుగా పుడుతున్నాయి అని శృతులు చెబుతున్నాయి. కాబట్టి ప్రాణోత్పత్తి నిజం. అంటే ప్రాణం ఉత్పత్తి చెందింది.
ముండకోపనిషత్తు :- ( 2, 1, 3 ) :- ప్రాణం, మనస్సు, అన్ని ఇంద్రియాలు, ఆకాశం, గాలి, అగ్ని, జలం, పృదివి అనే ఇవన్నీ ఈశ్వరుడి వల్లే జనించాయి. ఈ క్రమంలో ఇంద్రియాలు ఆకాశం కన్నా పూర్వమే ఉన్నాయి.
సాంఖ్య దర్శనం:-(1,61):- సత్వ, రజస్, తమస్సుల సామ్యావస్థనే ప్రకృతి అంటారు. ప్రకృతినుంచి మహత్తు జనిస్తుంది. మహాత్తునుంచి అహంకారం పుడుతుంది. అహంకారంనుంచి పంచతన్మాత్రలు ఉద్భవించాయి. వాటి నుంచి పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచప్రాణాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, స్థూలభూతాలు, పురుషుడు-- ఈక్రమంలో ఇవి 25 అవుతాయి. ఈ సాంఖ్యసూత్రంలో ఆకాశాదులకన్నా ముందే అహంకారం నుంచి జ్ఞాన కర్మేంద్రియాలు ఉత్పన్నం అయినట్లుఉన్నది. కనుక ఇంద్రియాలు స్థూలభూతాల కంటే ముందుగానే ఉత్పన్నం అవుతాయి. శ్రుతి, స్మృతుల వలన సిద్దమౌతోంది. ఆకాశాదులవలె ప్రాణాదులకు కూడా జన్మశ్రవణం ముఖ్యమే. ఎందువలననగా "ఏ కస్మా జ్యాయతే ప్రాణః " అనే చోట జన్మను బోధించే జాయత్ అను పదం ప్రాణాలవిషయంలో ముందు వినబడనిదై తరువాత వచ్చిన ఆకాశాదులలోకి అనువర్తిస్తుంది.ఆకాశాదుల విషయంలో వలెనే ప్రాణాల విషయంలో కూడా జన్మ ముఖ్యమే అనడం యుక్తం. ఆకాశాదుల విషయంలో వలేనే ప్రాణ విషయంలో కూడా జన్మ ముఖ్యమే అనడం యుక్తం. ఒకే ప్రకరణంలో ఒకే వాక్యంలో ఒక్కసారి ప్రయోగించబడి, ఒకచోట ముఖ్యార్థం బోధిస్తుందని, మరొక చోట గౌణార్ధం బోధిస్తుందని నిర్ణయించడానికి శక్యంకాదు కదా! ఒకే శబ్దనికి రెండు విధాల అర్ధం చెబితే దాని స్వరూపాన్ని తారుమారు చేసినట్లువుతుంది.
సూత్రం :- 273
" తత్ పూర్వకత్వాత్ వాచః "
వాచః :- వాక్ ఇంద్రియాన్ని, తత్ పూర్వకత్వాత్ :- తేజస్సు కారణంగా తేజోమయం అని చెప్పవచ్చు.
భావం :- ఆకాశాదుల కన్నా ముందే ఇంద్రియాలు పుట్టి ఉంటే తేజోమయి వాక్ అని ఎందుకు అన్నారు. తేజోమయం అంటే అగ్ని నుండి ఉత్పన్నమైనదని అర్ధం కదా! అంటే వాక్ ఇంద్రియం తేజస్సు కారణంగా తేజోమయం అని అనవచ్చును.
వివరణ:-వాక్కు, మనస్సు, ప్రాణం అనేవి భూతాలన్నింటి కన్నా ముందుగా పుడుతున్నాయి అని శ్రుతులు చెబుతు న్నాయి. కాబట్టి ప్రాణోత్పత్తి నిజం. అంటే ప్రాణం ఉత్పత్తి చెందింది.
చాందోగ్యోపనిషత్తు:-(6,5,4)"తేజోమయివాక్" తేజస్సు శబ్దోచ్చారణ శక్తిని ప్రకటంచేస్తుంది. కనుక వాగింద్రియం తేజోమయం. ఈఅభిప్రాయం తోనే వాగింద్రియాన్ని తేజోమయమని అన్నారు. అలాగే అన్నమయం మనస్సని, ఆపో మయం ప్రాణమని ఉపనిషత్తులు వర్ణించాయి. తేజస్సు, జలం, పృధివి అనే మూడు భూతాల ఉత్పత్తి మాత్రమే వినబడటం వలన, ప్రాణాల ఉత్పత్తి పఠింపబడక పోయినా, వాక్ ప్రాణ మనస్సులు బ్రహ్మ నుండి పుట్టిన తేజోబన్నాలు పూర్వమే ఉన్నవని చెప్పడం వలన వాటి వలె సమస్తమైన ప్రాణాలు కూడా బ్రహ్మ నుండి పుట్టినట్లు సిద్ధిస్తుంది. " అన్నమయం హి సోమ్య మనః అపోమయః ప్రాణస్తేజోమయి వాక్ " అని వాక్ ప్రాణ మనస్సులు తేజోబన్న పూర్వకములని చెప్పబడుచున్నది. ఇవన్నీ అన్నాదుల నుండి పుట్టాయి అన్నట్లయితే, అవన్నీ బ్రహ్మనుండి తేజోబన్నాదుల రూపంలో పుట్టాయన్న మాట ఉంది. అన్నాదుల నుండి పుట్టడం అప్రధానం అని అంగీకరించినా, పృధివ్యాదుల నుండి పుట్టలేదు అన్నా, ఇవి జన్మించినట్లు ఇతర శ్రుతులు చెప్పినట్లుగా తేజోబన్నాలు అన్నమయాలని చెప్పడం, ఇవన్నీ బ్రహ్మ యొక్క కార్యములని వివరించడానికే అని తెలుస్తోంది. కనుక ప్రాణాలు బ్రహ్మ యొక్క కార్యములే అని చెప్పబడింది.
సప్తగత్యధికరణం ( 2, 4, 5 )
సూత్రం :- 274
" సప్త గతేః విశేషితత్వాచ్ఛ "
ఇంతకీ ఇంద్రియల సంఖ్య ఎంత? గతేః :- ఉత్క్రాంతి వలన, విశేషిత త్వాత్ చ :- విశేషణం వలన,
భావం :- ఉత్క్రాంతి వలన విశేషణం వలన ఇంద్రియాల సంఖ్య ఏడు.
వివరణ :- ఇంద్రియాలు ఏడని, పదకొండని శృతి వాక్యాల్లో సంఖ్యా భేదం కనిపిస్తోంది. అందుకే పూర్వ పక్షం వారికీ సందేహం కలిగింది.
ముండకోపనిషత్తు:-(2,1,8):- సప్తాప్రాణాః ప్రభవంతి తస్మాత్ " త్వక్, వాక్, చక్షువు, ఘ్రాణం, శ్రవణం, జిహ్వా, మనస్సు అనేవి సప్తేంద్రియాలు. సప్తప్రాణాలన్నారు కదా! కనుక సర్వేంద్రియాలు అంటే సప్త ఇంద్రియలు. అందరికి భోజనం పెట్టండి. అంటే వచ్చిన వాళ్లందరికీ అని అర్ధం. అలాగే శరీరాంతరగమనం వర్ణించిన చోట జీవుడి వెంట సప్తేంద్రి యాలు వాడారు. వాటినే సర్వ ప్రాణాలు అని అన్నారు. ఆపరబ్రహ్మ నుండి సప్తప్రాణాలు ఉద్భభావించాయి. అవి కళ్ళు-2, ముక్కులు-2, చెవులు-2, నోరు -1, మొత్తం ఏడు.
బృహదారణ్య కోపనిషత్తు:-(3,2,1):- "అష్టోగ్రహః అష్టావత్ గ్రహః" నాసిక, జిహ్వా, వాక్కు, నేత్రం, శ్రోత్రం, మనస్సు, హస్తం, త్వక్ అనీ ఎనిమిది ఇంద్రియలు వర్ణించారు. (3,9,7):- పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు మనస్సు అనీ 11 ఇంద్రియాలు అని ఉన్నది. జీవుడి ఉత్క్రాంతివర్ణించే సమయంలో జీవుడి వెంట సర్వేంద్రియాలు బయలుదేరతాయని ఉన్నది ఈ వాక్యంలో సర్వప్రాణాలు అంటే అన్నిఇంద్రియాలు అనీ అర్ధం.
బృహదారణ్యకోపనిషత్తు:-(4,4,1):- జీవుడు శరీరాన్ని విడిచి వెళ్ళేటప్పుడు చక్షురాది ఇంద్రియాలను ఉపసంహరంచు కుంటాడు. బుద్ధి ఇంద్రియంలో ఏకమవుతుంది. అందువలన మరణానికి పూర్వమే కళ్ళు చూడవు. చెవులు వినవు. వాసన తెలియదు. రుచిగ్రహించలేడుమాటలురావు. స్పర్శతెలియదు. ఆలోచించలేడు. ఇలా సప్తఇంద్రియాలు పనిచెయ్యకపోవడం వలన ఇంద్రియలు ఏడు అనీ తెలుస్తోంది. విజ్ఞానం కలిపితే 8 అవుతాయి. మనస్సు, బుద్ధి, విజ్ఞానం ఒక్కటే కనుక ఇంద్రియాలు ఏడు అనీ పూర్వపక్ష వాదన. ఋతుభాగుని కుమారుడు ఆర్తభాగుడు యజ్ఞవల్కుని అడుగుతున్నాడు- గ్రహాలు ఎన్ని? అతిగ్రహాలు ఎన్ని? దానికి యాజ్ఞవల్కుడు సమాధానం చెబుతున్నాడు. గ్రహము అంటే గ్రహించేది. ఇంద్రియాలు విషయాలను గ్రహిoచేవి కాబట్టి గ్రహాలు. అతిగ్రహం అంటే అంతకన్నా పెద్దది గొప్పది కాబట్టి విషయాలు అతి గ్రహాలు.
గ్రహాలు ఎనిమిది అతిగ్రహాలు 8
1. ప్రాణం గ్రహం వాసన అతి గ్రహం
2, వాగింద్రియం నామము
3. నాలుక రుచి
4. కన్ను రంగు, రూపము
5. చెవి శబ్దము
6. మనస్సు కోరిక
7. చేతులు కర్మ
8. చర్మము స్పర్శ
ఈ రకంగా ప్రాణాలు 7, 8, 10, 11, 12, అని అనేక చోట్ల చెప్పడం జరిగింది. అందువలన ప్రాణాల సంఖ్య ఎంత అనీ సందేహం వచ్చింది. శృతులలో కూడా అభిప్రాయం భేదాలు ఉన్నాయి. ఏదో ఒక సంఖ్యను తీసుకోవడం యుక్తం కనుక సప్త సంఖ్యనే గ్రహించాలి. ఇతర సంఖ్యలు ఆ ఏడు ప్రాణాల వృత్తి భేదాన్ని బట్టి చెప్పబడినవని వాళ్ళు అభిప్రాయం పడుతున్నారు.
సూత్రం :- 275
" హస్తా దయస్త స్థితే తోనైవం "
స్థితే :- శరీరం నుంచి జీవుడు నిష్క్రమించేటప్పుడు ప్రాణ సంఖ్య తెలుస్తున్నది. అతః :- అందువల్ల, హస్తా దయః :- హస్త పాదాది ఇంద్రియాలు, ఏవం న :- ఏడే కాజాలవు.
భావం :- శరీరం నుంచి జీవుడు నిష్క్రమించేటప్పుడు ప్రాణ సంఖ్య తెలుస్తుంది. హస్త పాదాది ఇంద్రియాలు ఏడే కాజాలవు.
వివరణ :- చేతులు మొదలైన ఇంద్రియాలు అధికంగా ఉండటం వలన, ప్రాణాలు ఏడు అని అనకూడదు. యుక్తిబలం చేత వచన ప్రాబల్యం చేత ఇంద్రియలు 11 అంటున్నారు. అవి దర్శన, శ్రవణ, ఆఘ్రాణ, ఆస్పాదన స్పర్శన, వదన (మాట్లాడుట) ఆదాన (స్వీకరించుట), గమన, ఆనంద, విసర్గ, ధ్యానం, అనేవి బృహదారణ్యకంలో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, ప్రాణి యొక్క కర్మ పని సమాప్తమైనప్పుడు వీరు శరీరంనుంచి నిష్క్రమిస్తారు. ఈరకంగా శరీరం వదలి బంధువులకు దుఃఖాన్ని కలిగిస్తారు.అవి రుద్రశబ్దం చేత పిలువబడటం చేత వాటిని ఏకాదశ రుద్రులు అని పిలువ బడతాయి. ఈ రకంగా ప్రాణములు ఏడు కావు అని తెలియజేశారు.
బృహదారణ్యకోపనిషత్తు(3,9,4):-ఈశరీరం నుంచి ఆత్మతోబాటు పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పదకొండవదైన మనస్సు వెళ్ళిపోతాయి. బంధువులను ఏడిపిస్తాయి. అనే వాక్యంలో 11 ఇంద్రియలు నిష్క్రమిస్తాయని చెప్పారు. అందరికి అన్నం పెట్టండి. అనే వాక్యం అర్ధం ప్రపంచంలో అందరికి కాదు. భోజనానికి ఆహ్వానించిన వాళ్లకు అని భావం. కనుక ఉత్క్రాంతి ప్రకరణంలో సర్వ శబ్దం అర్ధం 11 అనే. ఒక వాక్యంలో 11 అన్నప్పుడు మరొక వాక్యంలో 11 అనే అన్వయించుకోవాలి.అక్కడ సప్తేంద్రియాలు అని అర్ధం చేసుకోవడం పొరబాటు. హస్తం- గ్రహం. ఇది అతి గ్రహమైన కర్మతో అనగా గ్రహించడం అనే కర్మతో సంబంధించి ఉంటుంది. కర్మ హస్తాలతో చేస్తారు కదా! ఈ శ్రుతులలో ఇంద్రియాలు ఏడు కంటే అధికంగా చెప్పబడ్డాయి. ఏడు కన్నా అధికంగా ఉంటే సప్తత్వాన్ని అంతర్భావం చెయ్యడంవలన సరిపెట్టవచ్చును. తక్కువ సంఖ్యయా? ఎక్కువ సంఖ్యయా అని సందేహం వచ్చినప్పుడు అధికసంఖ్యనే గ్రహించాలి. ఎందుకంటే దీనిలో అల్పసంఖ్య ఇమిడి ఉంది. అల్ప సంఖ్యలో అధిక సంఖ్య ఇమిడి ఉండదు. అందుచేత చిన్న సంఖ్యను కల్పించడం ద్వారా ప్రాణాలు ఏడే అని చెప్పడం యుక్తం కాదు. "దశమే - ఏకాదశి " అనీ శ్రుతిలో ఉదాహరింపబడింది. ఇది ఇంద్రియాల గురించి చెప్పిన ప్రకరణం వలన ఇక్కడ ఆత్మ శబ్దం చేత అంతః కారణాన్ని గ్రహించాలి. పదకొండు, పన్నెండు, పదమూడు ఇంద్రియాలని ఉదాహరించారు కదా! పదకొండు పనుల కన్నా అధికంగా ఇతరమైన పనులు లేవు. అధికంగా ఉంటే కరణాలను కల్పించడానికి అవసరం ఉండేది. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు విషయాలుగాగల ఐదు బుద్ధి భేదాలున్నాయి. వాటి కోసం ఐదు బుద్దేంద్రియాలు ఉన్నాయి. వచన, ఆదాన, విహరణ, ఉత్పత్తి, ఆనందా అనే 5 రకాల కర్మలున్నాయి. వాటికోసం ఐదు కర్మేంద్రియాలు అన్నింటిని గ్రహించేది. మూడు కాలలలోనూ ఉండేది మనస్సు ఒక్కటే. వృత్తులభేదాన్ని బట్టి ఆ మనస్సే కొన్ని చోట్ల వేరుగా ఉన్నట్లుగా మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని నిర్దేశింప బడింది. శిరస్సులో ఉండే నాలుగు ప్రాణాలు ఏడుగా లెక్కింపబడ్డాయి. ఇతర ప్రాణాలు ఈనాలుగింటి వృత్తి భేదాలని అనడానికి వీలు లేదు. ఎందుకంటే హస్తాలు చేసే పనులు విలక్షణమైనవి. కొన్ని చోట్ల కొన్ని ప్రాణాలు ఉపాసన కోసం చెప్పబడ్డాయి. కొన్ని చోట్ల కొన్ని ప్రాణాలు ప్రదర్శన కోసం చెప్పబడుతుంటాయి. ఈ విధంగా ప్రాణాల సంఖ్యను గురించి విచిత్రంగా ఉన్నప్పుడు, ఎక్కడ దేనిని ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని చేయబడిందో పరిశీలించాలి. ప్రాణాలు ఏడుమాత్రమే ఎందువలనంటే జీవుడు ఉత్క్ర మిస్తుండగా వానిని అనుసరించి ప్రాణం ఉత్క్రమిస్తుంది. ఆ ప్రాణాన్ని అనుసరించి ఏడు ప్రాణాలు ఉత్క్రమిస్తాయని చెప్పబడింది.
ప్రాణాణుత్వాధికరణం ( 2, 4, 7 )
సూత్రం ..276
" అణ వశ్చ "
భావం :-బ్రహ్మవలన ఆకాశాది మహా భూతాల కన్నా పూర్వం ఎలా ఇంద్రియలు ఉత్పన్నం అవుతున్నాయో, అలాగే సూక్ష్మ భూతాలైన పంచతన్మాత్రాలు కూడా ముందే ఉత్పన్నం అవుతున్నాయి.
వివరణ:- గురువర్యా! ఇంద్రియాల పరిమాణం ఎంత? అని అడిగాడు కృష్ణశర్మ. సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. ఇంద్రియాలు అణుస్వరూపాలు. ఇవి సర్వగతాలు కావు. శరీరమంతటా పని చేస్తాయి. మరణం సమయంలో చప్పుడు చెయ్యకుండా శరీరాన్ని వదలి బయటకు వెళ్ళిపోతాయి. ప్రక్కన ఉన్న వారికి కూడా కనబడవు. కాబట్టి ఇవి విభజింపబడినాయనీ, అణురూపాలని అనుకోవాలి. అణువు అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనది అని అర్ధం. ఇవి సర్వ వ్యాపకాలు కావు. ఒకవేళ అంతటా వ్యాపించి ఉంటే లోకంలో జరిగే అన్నీ విషయాలు వీటికి తెలియాలి. అలా తెలియదు కనుక ఇంద్రియపరిమాణం సూక్ష్మతి సూక్ష్మం అని తెలుస్తోంది.
ప్రశ్నోపనిషత్తు(4,8):- కార్యంకన్నా కారణం ముందు ఉంటుంది. కనుక ఆకాశాది భూతలకన్నా వాటికి కారణాలైన శబ్ద, వాయు, రూప, రస, గంధ తన్మాత్రలు 5 ముందే వచ్చాయి. ప్రాణాలు అణువులుకూడా. ఇప్పుడు ప్రాణాలకు సంబంధించి మరొక స్వభావాన్ని చెబుతున్నాడు. ప్రకృతములైన ఈప్రాణాలు అణువులు అని గ్రహించాలి. ఇవి సూక్ష్మంగా ఉండటం వలన బాహ్యేంద్రియాలకు కనబడక పోవడం, పరిచ్చేదము సర్వవ్యాపులు కాక, అణు పరిమాణంలో ఉండటం మాత్రమే కాని పరమాణువుల వలె ఉండటం కాదు.ఈ ప్రాణాలు స్థూలములైతే మరణకాలంలో శరీరం నుండి బయటకు వెళ్ళేటప్పుడు ప్రక్కన ఉన్నవాళ్లు చూడగలిగి ఉండేవారు. ప్రాణాలు సర్వగతాలయితే ప్రాణాలు శరీరం నుండి పైకి లేచిపోతాయి, మరొక చోటికి వెడతాయి. తిరిగి వస్తాయి అని చెప్పే శృతులకు విరుద్ధం కలుగుతుంది. ప్రాణాలు సర్వగతాలు అని చెప్పినప్పుడు వాటి వృత్తి మాత్రం శరీర ప్రదేశంలో మాత్రమే కలుగుతుందని చెప్పవచ్చును కదా అని సందేహం. వృత్తి మాత్రమే కరణం అని చెప్పవచ్చు కదా! ప్రాణాదులు వృత్తి అన్నా, మరొకటి అన్నా ఏది ఉపలబ్దికి సాధనమో అదే కరణం. కేవలం పేరులో మాత్రమే వివాదం. అందుచేత ప్రాణాదులు సర్వవ్యాపకములు అని కల్పించడం వ్యర్థం. ప్రాణాలు సూక్ష్మతమములు, పరిచ్ఛిన్నములు అని నిశ్చయించారు.
ప్రాణ శ్రేష్ఠధికరణం ( 2, 4, 8 )
సూత్రం :- 277
" శ్రేష్ఠశ్చ "
శ్రేష్ఠ :- ముఖ్య ప్రాణం, చ :- కూడా పంచభూతాలకు ముందు వాటికి కారణాలైన తన్మాత్రాలు, ఇంద్రియాలు, ఉత్పన్నమైనట్లు, ముఖ్య ప్రాణం ( శ్రేష్ఠః )కూడా జనిస్తుంది.
భావం:- పంచభూతాలకు ముందు వాటికి కారణమైన తన్మాత్రలు, ఇంద్రియాలు ఉత్పన్నం అయినట్లు ముఖ్య ప్రాణం కూడా జనిస్తుంది.
వివరణ:- ముఖ్యప్రాణం కూడా బ్రహ్మమే. బ్రహ్మనుండే ప్రాణం పుడుతుంది.
చాందోగ్యోపనిషత్తు(5,5,1) ప్రాణోవావ జ్యేష్ఠశ్చ శ్రేష్ఠశ్చ" శ్రేష్టం అంటే ముఖ్య ప్రాణం. చాందోగ్యంలో ప్రాణం జ్యేష్టం, శ్రేష్టం అని చెప్పబడింది.
బృహదారణ్యకోపనిషత్తు:- ప్రాణమే శ్రేష్టం, జ్యేష్టం అని తెలుసుకున్నవాడు తన వారిలో జ్యేష్ఠుడు, శ్రేష్టుడు అవుతాడు. కాబట్టి ప్రాణం శ్రేష్ఠమైనది. ముఖ్య ప్రాణం బ్రహ్మమే.
ఋగ్వేదం:-ప్రళయకాలస్థితిని తెలిపే మంత్రం ఒకటి ఉంది. మృత్యువు, జీవనం, రాత్రింబవళ్ళు, ఇవి ఏవిలేని ప్రళయకాలంలో ప్రాణవ్యాపారం ఉండేది. అందువలన ప్రళయంలో ఉన్నా ప్రాణం మళ్ళీ ఉత్పన్నమైనది అనడం సరి అయినది కాదు. ఆన ప్రాణవే ప్రాణికి ధాతూ పాఠం. ప్రాణం అనే ప్రాణ వ్యాపారం (ఆసీత్)ఉన్నదని తెలుస్తోంది. ప్రళయకాలంలో ప్రాణమే లేకపోతే దాని వ్యాపారం ఎలా ఉంటుంది. ప్రాణం ఉన్నప్పుడు దాని సృష్టి జరిగింది అనడం యుక్తంకాదు. ప్రాణం బ్రహ్మం వలన ఇంద్రియాల్లాగా ఆకాశాదులు, ఇంద్రియాలు, మనస్సులాగా ముఖ్యప్రాణం సైతం ఉత్పన్నం అవుతుందని ఉపనిషత్తు చెబుతోంది.
ముండకోపనిషత్తు(2,1,3) "ఏతస్మాత్ జాయతే ప్రాణో మనః సర్వేంద్రియాణిచ" ఈశ్వరుడి వల్ల ప్రాణం, మనస్సు, ఇంద్రియాలు జనిస్తున్నాయి. కనుక ముఖ్యప్రాణం ఆకాశాదుల్లా బ్రహ్మం వలెనే ఉత్పన్నం అయినది. ఆసీత్ అనే పదం బ్రహ్మ సత్ ను బోధిస్తుంది. కాని ప్రాణవ్యాపారాన్ని కాదు. ప్రళయకాలంలో జగత్తు గర్భంలో ఉండే ప్రకృతిలో బ్రహ్మ మాత్రమే చైతన్యం లో ఉంది. మృత్యువు లాంటివి అప్పుడు లేవు. కనుక శ్రేష్టం ముఖ్య ప్రాణం ఆకాశాదుల వలె బ్రహ్మం వలన ఉత్పన్నం అవుతుందనడం యుక్తం. ఇంద్రియాలతో కూడిన మనస్సుకు కాకుండా ప్రాణానికి కూడా ఉత్పత్తి వినబడుచున్నది. కనుక సర్వప్రాణాలు బ్రహ్మవికారాలే అని చెప్పబడింది. ఈఅతిదేశం ఎందుకు అని ప్రశ్న. దానికి సమాధానం చెబుతున్నారు. ఏఅధికమైన శంకను తొలగించడంకోసం ప్రధానంగా బ్రహ్మను గురించి చెప్పే నాస దాసీయసూక్తం లో "న మృత్యుః ఆస " అని ఒక మంత్రం ఉంది. ఆ ప్రళయకాలంలో మృత్యువు గల కార్యం లేదు. అమృతం లేదు. రాత్రికి చిహ్నమైన చంద్రుడు, పగటికి చిహ్నమైన సూర్యుడు లేడు. వాయువు కూడా లేకుండా మాయతో కూడిన బ్రహ్మ మాత్రమే ఉంది. అది తప్ప మరేమి లేదు అనీ మంత్రానికి అర్ధం. ఉత్పత్తికి పూర్వం ప్రాణం ఉన్నట్లు సూచిస్తున్నది. అందువల్ల ప్రాణం అజం అంటే పుట్టుక లేనిది అని ఎవరికైనా అభిప్రాయం కలగవచ్చును. ఆశీత్ అనే శబ్దం కూడా ఉత్పత్తికి పూర్వం ప్రాణం ఉన్నట్లు సూచించడం లేదు. మూల ప్రకృతిలో బ్రహ్మలో ప్రాణాది విశేషాలేవి లేవని చూపబడింది. శృతిలో ప్రాణం శ్రేష్టమని, జ్యేష్టమని, నిర్దేశించబడినది. ఈ ప్రాణం లేకుండా ఇతర ప్రాణాలేవి జీవింప జాలవు కనుక శృతిని అనుసరించి ఎక్కువ గుణాలు ఉండటం వలన ప్రాణం శ్రేష్టం అనీ చెప్పబడింది. శుక్ర నిషేషకం జరిగిన సమయంలో ప్రాణ వృత్తి వలన ప్రాణం జ్యేష్టం అనీ చెప్పబడింది.
వాయు క్రియాధికరణం ( 2, 4, 9 )
సూత్రం :- 278
" న వాయు క్రియే పృథ గుపదేశాత్ "
పృథక్ ఉపదేశాత్ :- ప్రాణం, వాయువు వేర్వేరుగా చెప్పడం వలన, అది వాయు :- వాయువు కాని, క్రియే :- దాని వికారం కాని, న :- కాదు.
భావం :- ప్రాణం వాయువు వేరువేరుగా చెప్పడం వలన వాయువు కాని, క్రియ గాని ముఖ్య ప్రాణం కాదు.
వివరణ :- ఈ అధికరణంలో ముఖ్య ప్రాణం వాయువు కన్నా వేరైనదని చెప్పబడింది. ప్రాణం అంటే వాయువు కాదు. వాయువు యొక్క క్రియలను ప్రాణం కన్నా వేరుగా నిర్దేశించి చెప్పారు. సామాన్యంగా ముఖమున ఉండే వాయువునే ప్రాణం అంటారు. అది నిజం కాదు. ప్రాణమనేది మనోమయబ్రహ్మ యొక్క చతుర్ధ పాదం. వీటిని బట్టి ప్రాణమనేది వాయువు కన్నా వేరైనది. అయితే ప్రాణం స్వజీవునిలా స్వతంత్రమైనదా అని అనుమానం.
ముండకోపనిషత్తు :- ( 2,1,3 ) ఉపనిషద్ వాక్యం వాయువుని, ప్రాణాన్ని వేరుగా చెప్పారు. ఖం వాయు జ్యోతి రాపః " ఈశ్వరుడి వలన ప్రాణం, మనస్సు అన్ని ఇంద్రియాలు, ఆకాశం, వాయువు, అగ్ని, జలం జనిస్తున్నాయి. ఇక్కడ ప్రాణం వాయువు వేరువేరుగా చెప్పారు. కనుక ప్రాణం వాయువు కాదు. వాయువికారము కాదు. అయితే ప్రాణం ఆత్మలా స్వాతంత్రమా? ఆ ముఖ్య ప్రాణం ఏ విధమైన స్వరూపం గలది అనే విషయం ఇప్పుడు తెలియజేయబడుచున్నది. ప్రాణామనేది వాయువే. ఆవాయువు ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం సమానం అని 5 విధాలని శృతిలో వినబడుతున్నది. కనుక ప్రాణం వాయువు అని, సమస్త మైన ఇంద్రియ వృత్తియే ప్రాణం అని ప్రాప్తించింది.
సాంఖ్యమతం :- మనోబుద్ధ్యంహంకారములు సామాన్యమైన వృత్తి అయిన ప్రాణాది వాయువులు ఐదు అని చెపుతున్నారు. ప్రాణం వాయువు కాదు. కరణముల అంటే మనోబుద్ధ్య హంకారములు కాదు. ఎందుకంటే వాయువు కన్నా భిన్నంగా "ప్రాణ.. తపతి చ " అని ప్రాణం చెప్పబడుచున్నది. మనోరూప బ్రహ్మకు వాక్కు, ప్రాణం, చక్షువు, శ్రోత్రము అని నాలుగు పాదాలని వాటిలో ప్రాణం అధిదైవికమని వాయువు చేత ప్రకాశిస్తోందని శృతిలో చెప్పబడింది. అట్లే కారణముల సంఖ్య కంటే వేరుగా ప్రాణం చెప్పబడింది. వాయువు కంటే, కరణముల వేరుగా ప్రాణాన్ని చెప్పిన వాక్యాలు గ్రహించాలి. ఇది పంజర బాలన్యాయం చేత జరుగుతుంది. ఒక పంజరంలో ఉన్న 11 పక్షులు ప్రతి ఒక్కటి పనిచేస్తూ కలసి ఏ విధంగా పంజరాన్ని కదుపుతాయో అట్లే ఒక శరీరంలో ఉన్నా 11 ప్రాణాలు ప్రతి ఒక్కటి తన పని తాను చేస్తూ కలిపి ప్రాణం అనే వృత్తిని పొందుతాయి అని చెప్పడం సమంజసం కాదు. పంజారాన్ని కదపడానికి అనుకూలమైన, ఒక్కొక్క పక్షిలో ఉన్నా అవాంతర వ్యాపారాలతో కూడిన పక్షులు కలసి పంజారాన్ని కదుపుతున్నప్పుడు అవి ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. కనుక యుక్తమే. శరీరంలో ఉన్న ప్రాణాలన్నీ కలసి చేష్టలు చేస్తాయని చెప్పడానికి తగిన ప్రమాణం లేదు. కనుక అలా చెప్పడం యుక్తం కాదు. ప్రాణాదులు శ్రవణాదుల కంటే చాలా విలక్షణమైనది. వాయువే శరీరంలో ప్రవేశించి ఐదువ్యూహలుగా ఏర్పడి విశేష రూపంలో ఉంటూ ప్రాణం అని చెప్పబడుతోంది.
సూత్రం :- 279
" చక్షురాదివత్తు తత్సహశిష్ట్యాది భ్యః "
చక్షు రాదివత్ :- చక్షువు లాంటి ఇంద్రియలను ఆత్మకు ఉపకరణములని చెప్పినట్లు, శ్రేష్ఠ ప్రాణం కూడా జీవాత్మకు సాధనమే. అది స్వతంత్ర పదార్ధం కాదు.తు :- ఎందుకంటే, తత్ సహశిష్ట్యాదిభ్యః :- ఆ ప్రాణాలను చక్షురాది ఇంద్రియాలతో పాటే అని శిష్టులు ఉపదేశించారు.
భావం :- చక్షువు లాంటి ఇంద్రియాలను ఆత్మకు ఉపకారణమూలైనట్లే శ్రేష్ఠ ప్రాణం కూడా జీవాత్మకు సాధనమే.
వివరణ :- ప్రాణం కూడా చక్షురాది ఇంద్రియాల వంటిదే తప్ప వేరే కాదు. కాబట్టి ప్రాణం జీవునిలా స్వతంత్రమైనది కాదు. ఛాందోగ్యంలోనూ, బృహదారణ్యకం లోను కూడా ఇంద్రియాలన్నీ తమలో ఎవరు గొప్ప అనీ వాదించుకున్నాయి. అప్పుడు ఇంద్రియలతో బాటు ప్రాణం కూడా చెప్పబడింది. దేహానికి జీవుడు రాజు, ప్రాణం మంత్రి, ఇంద్రియాలు ప్రకృతి వర్గం. కాబట్టి ప్రాణం స్వతంత్రం కాదు. అది జీవుని అధీనంలో ఉంటూ ఉపకరణంలా సహకరిస్తుంది. అనేక ఉపనిషద్ వాక్యాల్లో ప్రాణాలను నేత్రాది ఇంద్రియలతో ఉపదేశించారు. జీవుడు చక్షురాదిఇంద్రియాలను సాధనలుగా ఉపయోగించుకొని కర్తృత్వన్ని సాధిస్తాడు. అలాగే ప్రాణంసైతం సర్వార్ధ సాధనమైన జీవుడికి ఉపకరిస్తుంది. కనుక ప్రాణం స్వతంత్ర పదార్ధం కాదు. రూపాదులను గ్రహించడానికి జీవుడికి నేత్రాలు సహకరిస్తాయి. నేత్రాలకు రూపాదులు విషయాలు. ప్రాణానికి అలాంటి విషయం ప్రత్యేకంగా ఏమి లేదు. అలాంటప్పుడు ప్రాణం జీవుడికి ఎలా ఉపకరణం అవుతుందో తరువాత సూత్రంలో చెప్పబడింది. ప్రాణం శ్రేష్టం కనుక, వాగింద్రియాలు అప్రధానత్వాన్ని పొందడం చేత ఇది కూడా జీవుని శరీరంలో స్వాతంత్ర్యాన్ని పొందుతుంది. వాగింద్రియాలు నిద్రపోతున్నప్పుడు ఒక్క ప్రాణమే మేల్కొని ఉంటుంది. మృత్యువు దరి జేరనిది ప్రాణం ఒక్కటే. తల్లి తన పిల్లలను రక్షించినట్లు, ప్రాణం ఇతర ప్రాణాలను రక్షిస్తుంది. ప్రాణానికి అనేక విభూతులు ఉన్నట్లుగా వినబడుచున్నది. అందువలన ప్రాణానికి కూడా జీవుని వలేనే స్వాతంత్రం ఉండే అవకాశం ఏర్పడుతుంది. దానిని పరిహరిస్తున్నాడు. తు శబ్దం ప్రాణానికి స్వతంత్రతను నిరకరిస్తుంది. అమాత్యులందరు రాజుకు సహాయపడతారే కాని స్వతంత్రులు కారు. అట్లే చక్షురాదులు జీవునికి కర్త్రత్వం, భోకృత్వం విషయంలో ఉపకరణములుగా ఉన్నప్పటికీ అవి స్వాతంత్రం గా ఉండవు.సమాన ధర్మం ఉన్నవాటినే కలిపి చెప్పడం యుక్తం. ముఖ్య ప్రాణం ఇతర ప్రాణాలతో సమాన ధర్మం కాబట్టి వాటితో కలసి చెప్పబడుచున్నదని అర్ధం.
సూత్రం :- 280
" అకరణత్వాచ్చ న దోషః తధా హి దర్శయతి
అకరణత్వాత్ :- విషయాన్ని గ్రహించే సాధనం కానందువల్ల, తధా హి న దోషః :- ప్రాణం ఇంద్రియం కాదని చెప్పడంలో ఏ దోషము లేదు అని దర్శయతి :- శాస్త్రలంటున్నాయి.
భావం :- ప్రాణం విషయాన్ని గ్రహించే సాధనం కానందువలన అది ఇంద్రియం కాదని శాస్త్రాలంటున్నాయి.
వివరణ :- ముఖ్య ప్రాణం చక్షురాది ఇంద్రియాల వలె ఇంద్రియం కానందువలన దోషం ఏమి లేదు. ఇంద్రియాలన్నీ జీవుడికి లోబడి ఉంటాయి. కాబట్టి అవి స్వతంత్రములు కావు. అలాగే ప్రాణం కూడా జీవుడికి లోబడి ఉంటుంది. అవి స్వతంత్రములు.
ప్రశ్నపనిషత్తు ( 2, 3 ):- అత్యంత ఉత్తమమైన ప్రాణం ఇంద్రియాలను ఉద్దేశించి ఇలా అన్నది. "మోహాన్ని పొందకండి. నేనే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన రూపాల్లో ఐదురకాల విభాగాలుగా పొంది, ఈ శరీరాన్ని నిలబెట్టి ధరిస్తున్నాను. కార్యకారిగా చేస్తున్నాను. దీనిని బట్టి ప్రాణం శరీర ఇంద్రియధారణకు సాధనంగా జీవాత్మకు తోడ్పడుతుందని తెలుస్తుంది. కనుక ఇంద్రియాల లాగా ఏదో ఒక విషయాన్ని గ్రహించే కరణంగా ప్రాణం జీవుడికి ఉపయోగించకున్నా ఏ దోషమూ లేదని సూత్రార్ధం. ప్రాణం ఇంద్రియం లాగా కరణం అయినట్లయితే, ఏదో ఒక విషయాన్ని గ్రహిస్తుందని చెప్పేవాళ్ళు. అయితే ప్రాణం కరణం కాదు. అందువలన ప్రాణం ఒక విషయాన్ని గ్రహిస్తుందని చెప్పవలసిన ఆగత్యం లేదు. చక్షురాదులకు రూపాదులు విషయాలు. ప్రాణానికి అలాంటి విషయం విషయం ఏమి లేదు. శరీరాన్ని ఇంద్రియలను ధరించడమే ముఖ్య ప్రాణ కార్యం. అది విషయాన్ని గ్రహించే సాధనం కాదు. ప్రాణానికి కూడా కార్యం ఉన్నదని శ్రుతులు చెబుతున్నాయి. ప్రాణ సంవాదం మొదలైన ఘట్టాలలో ఇతరప్రాణాలతో ఊహించడానికి శక్యంకాని ఒక విశిష్టకార్యం ముఖ్యప్రాణానికి ఉన్నట్లు చెప్పబడుతోంది. "యస్మిన్ శ్రేష్ఠః" ఏ ప్రాణం లేచిపోతే ఈశరీరం పూర్తిగా చెడిపోయినట్లు అవుతుందో అది శ్రేష్ఠమైనది. శ్రేష్ఠ ప్రాణం లేచిపోదామని అనుకుంటుండగానే వాగాదులు శిధిలమై పోయినట్లు శరీరం పడిపోవడానికి సిద్ధమైనట్లు, శరీరంలోని ఇంద్రియాలన్నీ ముఖ్యప్రాణం మీద ఆధారపడినట్లు శృతులలో వినబడుచున్నది. ప్రాణం చేతనే శరీరం రక్షింపబడు చున్నదని, ఏ అవయవం నుంచి ప్రాణం లేచిపోతే, ఆఅవయవం ఎండిపోతుందని, జీవుడు ఆప్రాణం చేతనే ఏది తింటున్నాడో, ఏది త్రాగుతున్నాడో, దానిచేత ఇతర ప్రాణాలను రక్షిస్తున్నాడు. "కస్మిన్ ప్రతిష్టస్యామి" అని నప్రాణ మసృజత" అని జీవుని ఉత్క్రాంతి (శరీరం విడిచి వెళ్లిపోవడం ) గాని ప్రతిష్ట గాని ప్రాణం వల్లనే జరుగుతాయని చెప్పబడింది.
సూత్రం :- 281
" పంచ వృత్తిః మనోవత్ వ్యపదిశ్యతే "
మనోవత్ :- మనస్సుని, అంతఃకరణని, బుద్ధి, జ్ఞానశక్తి అని వ్యవహరించినట్లుగానే, పంచ వృత్తిః :- ముఖ్య ప్రాణానికి ఐదు వృత్తులున్నాయని, వ్యపదిశ్యతే :- వ్యవహారిస్తారు.
భావం :- మనస్సుని, అంతః కరణని, బుద్ధిని జ్ఞానశక్తి అని వ్యవహరించినట్లుగానే, ముఖ్య ప్రాణానికి ఐదు వృత్తులున్నాయని వ్యవహారిస్తారు.
వివరణ:-ఈశ్వరుడి సంకల్పం వలన ప్రకృతి నుంచి మహాత్తత్త్వం ఉదయిస్తుంది. మహత్తుకు రెండు శక్తులుంటాయి. జ్ఞాన శక్తి, క్రియ శక్తి. జ్ఞానశక్తితో ఉన్న మహత్తును బుద్ధి, మనస్సు, చిత్తం అంటారు. అలాగే క్రియాశక్తి తో ఉన్న మహత్తును ముఖ్య ప్రాణం అంటారు. అంతఃకరణం జ్ఞానవ్యాపారాలతో కూడుకున్నది. దానికే మనస్సు, బుద్ధి అని పేరు. క్రియావ్యాపారంతో కూడిన ఆ అంతఃకరణమే ముఖ్య ప్రాణం. క్రియాశక్తి ముఖ్య ప్రాణంగా ఉన్న అంతఃకరణపు వ్యాపార విశేషమే ముఖ్య ప్రాణం.
ఛాందోగ్యోపనిషత్తు:-(5,1,15) వాక్కు, చక్షు, శ్రోత, మనస్సులని ముఖ్యప్రాణం అన్నారు. ఇది శరీరంలో ఉండే వాయువుతో క్రియను కలిగిస్తుంది. ఈ ముఖ్యప్రాణము వలననే జీవనం కొనసాగుతుంది.
సాంఖ్య దర్శనం:-(2,31) ప్రాణాది పంచవాయువులు అంతఃకరణ వ్యాపారం, అంతఃకరణకు జ్ఞానశక్తి ప్రధానం. దాని కార్య భేదం వలన మనో బుద్ధి చిత్త అహంకారాలని అంటారు. అలాగే క్రియాశక్తి ప్రధానం అయినప్పుడు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానాలని 5 భేదాలతో ఉంటుంది.
బృహదారణ్య కోపనిషత్తు(1,5,3) "ప్రాణోపాన వ్యాన ఉదాన సమానో స ఇత్యేతత్ సర్వం ప్రాణ ఏ వ "
ప్రాణం :- ఇది ఉచ్వాస నిశ్శ్వాస క్రియలకు హేతువు. నాసికాగ్రం నుంచి హృదయం వరకు ఉంటుంది.
అపానం:-ఇది నాభినుండి పాదంవరకు వ్యాపించి ఉంటుంది.మూత్రం, మలం, గర్భం, లాంటి వాటిని బయటకు పంపడానికి హేతువు.
వ్యానం :- ఇది శరీర మంతా వ్యాపించి ఉంటుంది. శరీరం బలుపుకు హేతువు.
ఉదానం :- ఇది ముక్కు చివర నుండి శిరస్సు వరకు ఉంటుంది. చూపుకి హేతువు.
సమానం:-ఇది హృదయంనుంచి నాభివరకు ఉంటుంది. తిన్న, తాగిన పదార్ధాలాన్ని రసంగా మార్చి శరీరం ఆయా స్థానాలకు చేర్చడంలో తోడ్పడుతుంది.
మనస్సుకు నేత్రాది ఇంద్రియాల వలన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు వచ్చినట్లే, ముఖ్య ప్రాణానికి కూడా ప్రాణ,అపాన, వ్యాన, ఉదాన, సమానములనే ఐదు వ్యాపారాలు కలుగుతున్నాయి.
శ్రేష్ఠాణుత్వాధికరణం ( 2, 4, 13 )
సూత్రం :- 282
" అణు శ్చ "
అణుః :- సూక్ష్మ దేహం, చ :- కూడా ఉత్పన్నం అవుతుంది.
భావం:- బ్రహ్మంవలన ఆకాశాది పంచభూతాలను, తన్మాత్రాది పంచ భూతాలు, చక్షురాది ఇంద్రియాలు ఉత్పన్నం అయినట్లే, సూక్ష్మదేహం కూడా ఉత్పన్నం అవుతుంది.
వివరణ:- ఈఅధికరణంలో ముఖ్యప్రాణం అణుపరిమాణం కలది అని చెప్పబడింది. మిగిలిన ఇంద్రియాల వలె అతి సూక్ష్మ మైనది. శరీరం నుంచి నిష్క్రమించేటప్పుడు మిగిలిన ఇంద్రియాల వలె ఇది కూడా కనిపించదు. సూక్ష్మదేహం అంటే పంచ సూక్ష్మభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనస్సు, అహంకారయుతమైన బుద్ధి అనే 17 తత్వాల సముదాయమే. ఈ ఇంద్రియాలకు అగ్ని మొదలైన దేవతల అధిష్టానం ఉన్నది కదా! అనుగ్రహించేది అధిష్టానం. అనుగ్రహం పొందేది అనుగ్రహకం. అధిష్టానదేవతల అనుగ్రహం వలన ఇంద్రియాలు తమతమ స్థానాలలో ఉండి వాటి పనులను చేస్తున్నాయి. వాటికి దేవతాధిష్టానం ఉన్నదని చెప్పడానికి ప్రమాణం ఏమిటి? కంటిలో సూర్యుడు అధిష్టానదేవత అని ప్రత్యక్షంగా కనిపిస్తోంది కదా! అలాగే మిగిలిన ఇంద్రియాలు కూడా పనిచేస్తున్నాయని ఊహించవచ్చును కదా! ఈ ఊహ సరిఅయినది కాదు అని శంక. మానవనేత్రం పగటి పూట సూర్యకాంతి వెలుగులో అన్ని చూడగలుగుతోంది. రాత్రి పూట దోమలు, జంతువులు, కీటకాలు సూర్యకాంతి సహాయం లేకుండానే చూడగలుగుతున్నాయి కదా! అందువలన ఇంద్రియాలకు అధిస్థానదేవతలు ఉన్నారని చెప్పడం సరైంది కాదు అని సందేహం. ఈముఖ్య ప్రాణం కూడా ఇతర ప్రాణాల వలెనే అణువుగా గ్రహింపబడినది. ఇక్కడ అణుత్వం అంటే సూక్ష్మత్వం, అల్పపరిమాణత్వం అని గ్రహించాలి. అది అణు పరిమాణంలో ఉండటం కాదు. ముఖ్యప్రాణం 5 వృత్తులలో శరీరన్నంతటిని వ్యాపించి ఉంటుంది కదా! శరీరం వదలి వెళ్ళేటప్పుడు దీనిని ప్రక్కవాళ్లు కూడా చూడటం లేదు. కనుక అది సూక్ష్మం. పైకి వెళ్లిపోవడం, ప్రయాణం చెయ్యడం, తిరిగి రావడం అనేవి శృతులను బట్టి అది అల్పపరిమాణం కలది అని తెలుస్తోంది. ( ప్రశ్న )"సమః.. సర్పేణ " ఇత్యాది శృతులలో ప్రాణం విభువు అని కూడా చెప్పబడుచున్నది కదా! ఒక చిన్న పురుగులోనో, ఏనుగులోనో, దోమలోనో, ఈ మూడు లోకాలలోనూ సమానమైనది అని ఈ వాక్యానికి అర్ధం. (సమాధానం ) సమిష్టిరూపమైన హిరణ్యగర్భనకు (విరాట్ కు) సంబంధించిన అధిదైవికమైన ప్రాణస్వరూపాన్ని దీనికి విభత్వం చెప్పబడుతోంది. అంతే కాని ఆధ్యాత్మికమైన (శరీరంలో ఉండే ) స్వరూపాన్ని బట్టి కాదు. చతుర్ధశ భువనాత్మకమైన సమిష్టి రూపానికి హిరణ్యగర్భడని పేరు. ఆహిరణ్య గర్భునకు సంబంధించినంత వరకు ప్రాణం విభువు. ప్రతి ప్రాణి లోను ఉన్న ప్రాణానికి పరిమితమైన పరిమాణం చూపబడుచున్నది.
జ్యోతిరాధ్యదికరణం ( 2, 4, 14 )
సూత్రం :- 283
"జ్యోతిరాధ్యధి స్థానం తు తదామనతాత్ "
జ్యోతిః ఆది అధిష్టానం తు:-వాగాది ఇంద్రియాల్లో అగ్ని మొదలైన దేవతల అధిష్టానం ఉన్నది. అని తదామన నాత్ :- ఉపనిషత్ వాక్యాల వలన తెలుస్తోంది.
భావం :- వాగాది ఇంద్రియాలలో అగ్ని మొదలైన దేవతల అధిష్టానం ఉన్నదని ఉపనిషత్ వాక్యాల వలన తెలుస్తోంది.
వివరణ:- అగ్ని మొదలైన అధి దేవతలచే ఇంద్రియాలు ప్రేరేపింపబడుతున్నాయి. పరమాత్మ విరాటస్వరూపాన్ని దృష్టిలో ఉంచుకొని తీవ్రమైన ఆలోచన చేశాడు. అదే తపస్సు. దాని ఫలితంగానే విరాటస్వరూపానికి నోరు వచ్చింది. ఆ నోటి నుండి మాట, దాని అభిమాన దేవత అయిన అగ్ని ఉత్పన్నమయ్యాయి. ఆ తరువాత ముక్కు, దాని నుండి ప్రాణశక్తి, దాని నుండి వాయువు పుట్టాయి. నేత్రాలు - అభిమాన దేవత సూర్యుడు, చెవులు - అభిమాన దేవత దిక్కులు, హృదయం - దాని నుండి మనస్సు, అభిమాన దేవతచంద్రుడు, నాభి :- దాని నుండి అపానం, దాని నుండి మృత్యువు. జననేంద్రియలు :- దాని నుండి వీర్యం, అభిమాన దేవత జలం. ఈరకంగా ఇంద్రియలు, వాటి అభిమాన దేవతలు ఉద్భవించాయి. ఇక్కడ దేవతలచే అధిష్టింపబడి ఇంద్రియాలు పనిచేస్తున్నాయి.
ఇతరేయపనిషత్తు:-(1,2,4):- అగ్ని వాగింద్రియానికి సహకారియై ముఖంలో ప్రవేశించింది. వాయువు ఘ్రాణమై, ఆదిత్యుడు నేత్రాన్ని, దిక్కులు చెవులను ప్రవేశ్నించాయి. అగ్ని మొదలైన భూతల సహకారంతో వాక్కు మొదలైన ఇంద్రియాలు తమ తమ పనులు చేస్తున్నాయి.
అధర్వణ వేదం :-(5,2,9,7) :- సూర్యో మే చక్షుః వాతః ప్రాణః. సూర్యుడు నా చక్షువు. వాయువు నాసిక అంటున్నది. మానవ నేత్రాలు సూర్యకాంతి లేనిదే వస్తువుల్ని చూడలేవు. మరి కీటకాలు, కొన్ని జంతువులు రాత్రిపూట చూస్తున్నాయి కదా! అంటే రాత్రిపూట ఉండే వెలుతురు వాటికీ సరిపోతుంది. మన నెత్రానికి ఎక్కువ సూర్య కాంతి కావాలి. కనుక ఇంద్రియాలకు అధిష్టానదేవతలు ఉన్నారని ఒప్పుకోవాలి. ప్రాణాదులకు స్వకార్యశక్తి ఉండటం వలన తామే తమ మహిమచేతనే ప్రవర్తిస్తాయి అని చెప్పడం యుక్తం కాదు. బళ్ళు మొదలైనవి శక్తివంతములైనా ఎద్దులు మొదలైనవి అధిష్టించినప్పుడే అంటే సహాయం చేసినప్పుడే పనిజరుగుతుంది కదా! అదే విధంగా ఇంద్రియాలు కూడా అధిష్టానదేవతల చేత అధిష్టింపబడినప్పుడే అవి పనిచేస్తాయని నిశ్చయింపబడింది.
సూత్రం :- 284
" ప్రాణవతా శబ్దాత్ "
ప్రాణవతా :- ఇంద్రియాలు వాటికి స్వామి అయిన జీవాత్మకు సంబంధించినవి. బ్రహ్మనికి కాదు అని, శబ్దాత్ :- శృతి వచనల వలన తెలుస్తోంది.
భావం :- ఇంద్రియాలు వాటికి స్వామి అయిన జీవాత్మకు సంబంధించినవి. కాని బ్రహ్మనికి సంబంధించినవి కావు.
వివరణ :- శ్రుతులలో చెప్పిన దాన్ని బట్టి ఇంద్రియాలకు జీవునితోనే సంబంధం ఉంది. ఇంద్రియాలకు అధిష్టాన దేవతలు ఉన్నప్పటికీ వాటి సంబంధం జీవునితోనే ప్రత్యక్షంగా ఉంటుంది. చాక్షుప పురుషుడు. అతను చూడటానికి ఈ చక్షువు. అతను వినడానికి చెవులు. అతను వాసన చూడటానికి ఈ ముక్కు. ఈ రకంగా ఇంద్రియాలన్నీ జీవుని కోసమే. జీవునితోనే ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నాయి. ఇంద్రియ అభిమాన దేవతలు వేరుగా ఉన్నప్పటికీ వారికి భోక్తవ్యం ఉండదు. కర్మ ఫల సంబంధం ఉండదు. ఇంద్రియాలు భోగాపురం సాధనాలు. భోక్త అయిన జీవత్మతోటే వాటికీ సంబంధం. బ్రహ్మం భోక్త కాదు. అందువలన బ్రహ్మనికి ఇంద్రియలు భోగాపురం సాధనలు కావు.
ఋగ్వేదం (2,3,17,20) తయో రన్యః పిప్పలం స్వాద్వ త్తి అనశ్నన్ అనోభిచాక శీతి " జీవేశ్వరులలో జీవుడే సుఖ దుఃఖాలు అనుభవిస్తాడు. ఈశ్వరుడు అలా కాక అంతటా ప్రకాశస్తాడు అని ప్రమాణం. దీని వల్ల జీవుడే భోక్త కాని పరమేశ్వరుడు కాదని తెలుస్తోంది. అందుచేత భోగాపురం సాధనాలైన ఇంద్రియాలతో బ్రహ్మనికి సంబంధం లేదు. ప్రాణాలకు అధిష్టాన దేవతలున్నా కూడా ప్రాణాలకు సంబంధం ప్రాణవంతుడితోనే. " అధి-ఘ్రాణం" ఇత్యాది శ్రుతులు ప్రాణాలకు శరీరం తోనే సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఎవని భోగంకోసం చక్షస్సు ఆకాశాన్ని (నేత్రగోళ్ళాన్ని) ప్రవేశించిందో ఆ పురుషుడు చాక్షుసుడు. అతడు చూడటం కొరకే చక్షస్సు ఉపయోగిస్తుంది. నేను దీనిని వాసనచూస్తున్నాను అని ఎవడు తెలుసుకుంటాడో అతడు ఆత్మ అంటే జీవుడు. ఒక్కొక్క కరణానికి ఒక్కొక్క అధిష్టాతయైన దేవత ఉండటం చేత ఆ దేవతలందరికి ఈ శరీరంతో భోకృత్వం కుదరదు. ఈ శరీరంతో భోక్త అయిన శారీరుడు ఒక్కడే అని తెలుస్తుంది.
సూత్రం - 285
" తస్య చ నిత్యత్వాత్ "
చ :- ఇంకా, తస్య :- ఆ జీవుడే నిత్యుడు కావడం వలన, నిత్య త్వాత్ :- ఈ శరీరంలో నిత్యుడు గా ఉండటం వలన, ప్రాణులకు వాటితోనే సంబంధం.
భావం :- జీవుడు ఈ శరీరంలో నిత్యుడు కావడం వలన అతనికి ఇంద్రియాలతో సంబంధం ఉంటుంది.
వివరణ:- కర్మ సంబంధం వలన జీవుడికి ఇంద్రియాలతో సంబంధం ఏర్పడుతుంది. బ్రహ్మ నిత్యం, చేతనం కనుక అలాంటి సంబంధం బ్రహ్మకులేదు. లౌకిక ప్రపంచంలో జీవుడికి అనేక కర్మలు నిర్వహిస్తుండటంతో పుణ్య పాప సంబంధం, సుఖ దుఃఖాల భోగమూ సంభవిస్తుంది. అందువలన ఈశరీరంలో జీవుడే భోక్తగా నిత్యుడు. అంతే కాని దేవతలకు ఈశరీరంతో నిత్యత్వం ఉండదు. ఉత్తమైన స్థానాలలో ఉన్నా, దేవతలు హీనమైన ఈ శరీరంలో నిత్యత్వం లేదు. బోక్తృత్వాన్ని పొందడానికి తగరు.
బృహదారణ్యకోపనిషత్తు:- శరీరంలో ఇంద్రియాది దేవతలకు భోక్తృత్వం లేదు. భోక్త రూపంలో జీవుడే నిత్యుడు. ఈ శరీరం జీవుని కర్మ వలన ఏర్పడింది. అందుచేత జీవుడే భోక్త. అతనికే పుణ్య పాప సంబంధం ఉంటుంది. సుఖము, దుఃఖం, భోగము జీవునికే ఉంటాయి. దేవతలు అంటే విశిష్ట కర్మఫలం దైవత్వం పొందినవారు. వీరికి పుణ్యఫలమే కాని పాపఫలం అంటదు. వారికీ మానవశరీరంలో భోగం కూడా ఉండదు. జీవాత్మ శరీరం నుండి బయటకు పోవడానికి మార్గం కనిపిస్తుంది. ఆస్థితిలో శిరస్సు ద్వారా గాని, మిగిలిన అవయవాల ద్వారా గాని బయటకు పోతుంది. దానితో బాటే ప్రాణం కూడా పోతుంది. కాబట్టి అధిష్టానదేవతలకు భోక్తృత్వం లేదు. జీవుడికే భోకృత్వం "పుణ్య.. గచ్చతి " దేవతలకు పుణ్యమే చేరుతుంది కాని పాపం అంటదు. ఉత్క్రాంతిలో కూడా ప్రాణాలు జీవుణ్ణే అనుసరించి ఉంటాయి కనుక ప్రాణాలకు జీవుడితోనే నిత్యమైన సంబంధం ఉంటుంది అని శ్రుతులు చెబుతున్నాయి. అందువలన ప్రాణాలను నియంత్రించే దేవతలు ఉన్నా కూడా శారీరునికి భోకృత్వం లేకుండా ఉండదు. దేవతలు కరణాలు పనిచేసేటట్లు చూస్తారు కాని వారికీ భోకృత్వం ఉండదు.
ఇంద్రియాధికరణం ( 2, 4, 17 )
సూత్రం :-286
" త ఇంద్రియాణి తద్వ్య ప దేశాత్ అన్యత్ర శ్రేష్టాత్ "
తే :- ఆ, శ్రేష్ఠాత్ అన్యత్ర :- శ్రేష్ఠ ప్రాణం తప్ప మిగిలిన ప్రాణాలకు, ఇంద్రియాణి :- ఇంద్రియాలు అంటారని, తత్ వ్యపదేశాత్ :- శ్రుతుల్లో వ్యవహారిస్తారు. ఇంద్రస్య :- ఆత్మకు భోగ సాధనం అయ్యేది ఇంద్రియం.
భావం :- ఆ శ్రేష్ఠ ప్రాణం తప్ప మిగిలిన ప్రాణాలను ఇంద్రియాలంటారని శ్రుతులలో వ్యవహారిస్తారు.
వివరణ:- ఉపనిషత్తులలో ఇంద్రియాలను ప్రాణశబ్దంతో వ్యవహరించారు. ఇంద్రియాలు రూప, రస, గంధాది విషయాన్ని గ్రహించేటట్లు చేస్తాయి. తద్వారా జీవాత్మకు సుఖదుఃఖాలు కలుగుతాయి. ఒక ముఖ్యప్రాణం ఇతరమైన 11 ప్రాణాలు చెప్పబడ్డాయి. ఇతర ప్రాణాలన్ని ముఖ్యప్రాణం యొక్క వృత్తి భేదాలా? లేక వేరు పదార్ధాలా? అనే వాటి విషయంలోనే ఇప్పుడు సందేహం. ఇతర ప్రాణాలన్నీ ముఖ్య ప్రాణ రూపాలే అని ప్రాప్తించింది. ఎందువలన? శృతి వలన. ముఖ్య ప్రాణాలను, ఇతర ప్రాణాలను ఒక చోట చేర్చి ఇతర ప్రాణాలన్ని ముఖ్యప్రాణ రూపాలని చెప్పుచున్నది. వీటన్నిoటికి ప్రాణ అనే పేరు ఉండటం వలన కూడా ఇవన్నీ ఒక్కటే అని నిర్ణయం.అలా కాకపోతే ఒకే ప్రాణానికి వేరు వేరు అర్ధాలు చెప్పవలసిన వస్తుంది. అది అన్యాయం. ఈపదం ఒకచోట ముఖ్యార్ధం భోదిస్తుందని మరొక చోట లాక్షణికమైన అర్ధం భోదిస్తుందని చెప్పవలసిన వస్తుంది. అందువల్ల ఒకే ప్రాణానికి ప్రాణం మొదలైన 5 వృత్తులు ఉన్నాయో, అలాగే వాక్కు మొదలైన 11 కూడా దీని వృత్తులే." మనః సర్వేంద్రియాణి చ "అని మనస్సుని, ఇంద్రియాలను వేరు వేరుగా చెప్పడం వలన మనస్సు కూడా ప్రాణం వలెనే ఇంద్రియం కాదని చెప్పవలసి వస్తోంది కదా! అని సందేహం. "ఇంద్రియాణి దశైకం చ పంచేంద్రియ గోచరా " అనే స్మృతి లో ఇంద్రియలు 11, అని చెప్పి మనస్సు కూడా శ్రోత్రాదుల వలె ఇంద్రియంగా గ్రహించబడుతుంది. ప్రాణం ఇంద్రియం అని శృతిలో గాని, స్మృతి లో గాని ప్రసిద్ధంగా కనబడటం లేదు. వేదమందు వేరుగా చెప్పబడటం వలన ముఖ్య ప్రాణం కన్నా వేరైనట్టి వాగాదులన్నీ ఇంద్రియాలు అనే శబ్దంతో చెప్పబడుచున్నాయి. ముండకోపనిషత్తులో పరమాత్మ నుంచి ప్రాణాలు, మనస్సు, సమస్త ఇంద్రియాలు పుడుతున్నాయి. ఇక్కడ ప్రాణాలు, ఇంద్రియాలు వేరు వేరు అని చెప్పారు. కాబట్టి ప్రాణాలు ఇంద్రియాలు కావు. మనస్సు ఆరవ ఇంద్రియం.
సూత్రం :-287
" భేద శ్రుతేః "
భేద :- వాగాది ఇంద్రియాల కన్నా శ్రేష్ఠ ప్రాణం వేరని, శృతేః :- శాస్త్రాలు అంటున్నాయి.
భావం :- వాగాది ఇంద్రియాల కన్నా శ్రేష్ఠ ప్రాణం వేరని శాస్త్రాలు అంటున్నాయి.
వివరణ :- వేదంలో ప్రాణాలను వేరుగా చూపడం వలన వాగాదులు ముఖ్య ప్రాణం కన్నా భిన్న తత్వాలే.
బృహదారణ్యకోపనిషత్తు:- దేవదానవుల యుద్ధంలో దేవతలు ఓడిపోయి ఉద్గీతోపాసనతో అసురుల మీద విజయాన్ని సాధించాలనుకున్నారు. ముందుగా వాగీంద్రియాన్ని ఆశ్రయించి తమ కోసం ఉద్గీతోపాసన చెయ్యమన్నారు అని చెబుతూ చివరకు ముఖ్య ప్రాణంతో అసురులను జయించారు అని చెప్పబడింది. అంటే ఇంద్రియాలు ప్రాణం వేరు వేరు అని తెలుస్తోంది.
ప్రశ్నపనిషత్తు ( 2, 4 ) :-"వాక్, మనః, చక్షుః, శ్రోతః, చ తే ప్రీతాః ప్రాణం స్తున్వంతి " వాక్కు, మనస్సు, నేత్రం, చెవి అనే ఈ ఇంద్రియాలు ప్రీతితో ముఖ్య ప్రాణాన్ని స్తుతిస్తాయి అనే వాక్యంలో వాగాది ఇంద్రియాలను ముఖ్యప్రాణం కన్నా వేరే అని నిర్ధేసించారు. శాస్త్రీయ మైన ఇంద్రియ మనోవృత్తులే దేవతలు. పాప వృత్తులు అసురులు. ఉద్గీరం చెయ్యడానికి ప్రారంభించిన వాక్కుతో దేవతలు, నువ్వు అసురులు నశించేటట్లు ఉద్గానం చెయ్యి అని కోరాయి. సరేనని ఉద్గానం చేస్తున్న వాక్కును అసురులు అనృతం అంటే అసత్యం పలకడం మొదలైన దోషంతో నశింపజేసాయి. అదే విధంగా వరుసగా అన్ని ఇంద్రియాలు పాపగ్రస్తాలయ్యాయి. దీనిని బట్టి ఇంద్రియలు వేరు, ముఖ్య ప్రాణం వేరు అని తెలుస్తోంది. ప్రజాపతి మనస్సును, వాక్కును, ప్రాణాన్ని, తన కొరకు నిర్మించుకున్నాడట. అందువల్ల కూడా ముఖ్య ప్రాణం కంటే ఇతర ప్రాణలు భిన్నమైన తత్వాలు.
సూత్రం :-:288
" వై లక్షణ్యాచ్చ "
చ :- పైగా, వై లక్షణ్యాత్ :-వాగాది ఇంద్రియాల కన్నా శ్రేష్ఠ ప్రాణానికి ధర్మంలో భేదం ఉంది.
భావం :- వాగాది ఇంద్రియాల కన్నా శ్రేష్ఠ ప్రాణానికి విలక్షణ ధర్మం ఉంది.
వివరణ:-గాఢనిద్రలో వాగాదిఇంద్రియాలు మనస్సుతో కలసి సుఖంగా నిద్రిస్తాయి. కాని ముఖ్య ప్రాణం మాత్రం జాగ్రదావస్థలో ఉంటుంది.
ప్రశ్నపనిషత్తు(4,3) :- సూర్యుడు అస్తమించేటప్పుడు కిరణాలు ఒక్కటై తేజోమండలంలో ఉండి పోయి, మళ్ళీ ఉదయం దిక్కుల్లో ప్రసారించేటట్లు, వాగాది ఇంద్రియాలు సుషుప్తిలో సూక్ష్మమనస్సులో ఏకమై ఉంటాయి. కాబట్టి జీవాత్మ అప్పుడు వినడు, చూడడు, వాసన పీల్చడు, రుచి చూడడు, తాకడు, మాట్లాడడు, పట్టుకోడు, విడువడు, సంతోషించడు. అప్పుడు తట్టి నిద్రిస్తున్నాడు అంటారు. ప్రాణంమాత్రం అప్పుడు జాగ్రదావస్థలో ఉంటుంది. ఇలా వాగాదిఇంద్రియాలకు ముఖ్య ప్రాణానికి ధర్మభేదం ఉంది. ముఖ్య ప్రాణం కన్నా ఇతర ఇంద్రియాలకు భేదం ఉండటం వలన ప్రాణం, ఇంద్రియాలు వేర్వేరు అని చెప్పవచ్చును.
బృహదారణ్యకోపనిషత్తు :- మరణ కాలంలో వాక్కు మనస్సులో లీనమౌతుంది. మనస్సు ప్రాణంలో లీనమౌతుంది. చివరకు అది పరమశక్తిలో కలసిపోతుంది. కాబట్టి ఇంద్రియాలు ప్రాణం వేరు వేరు అని చెప్పబడింది. ముఖ్య ప్రాణానికి ఇతర ప్రాణాలకి వేరు వేరు లక్షణాలు ఉన్నాయి. వాగాదులు నిద్రిస్తున్నప్పుడు ఒక్క ముఖ్యప్రాణమే మేల్కొని ఉంటుంది. అది మృత్యువు చేత ఆక్రమించబడదు. ఇతరమైనవి ఆక్రమించబడ్డాయి. ముఖ్యప్రాణమే స్థితిచేత పైకి లేచిపోవడం చేత దేహం యొక్క పతనానికి హేతువు. ఇంద్రియాలు హేతువు కావు. ఇంద్రియాలు విషయాలను గ్రహించడానికి హేతువులు. ప్రాణం కాదు. ఈ విధమైన అత్యధిక లక్షణ భేదం ప్రాణ, ఇంద్రియాల మధ్య ఉన్నది. వాగాదులు మృత్యువు చేత ఆక్రమించబడి, ప్రాణాన్ని వేరుగా పేర్కొన్నారు. "అయం శ్రేష్ఠః" ఇది మనలో శ్రేష్ఠమైనది. దానికి శ్రేష్ఠత్వాన్ని నిర్ధారణ చేస్తున్నారు. అందుచేత దీనికంతకీ విరుద్ధంగా ఉండాలంటే వాగాదులు ప్రాణంతో విరోధం లేకుండా ఆ ప్రాణం మీదనే ఆధారపడి స్పందనాన్ని పొందడమే కాని, ప్రాణంతో తాదాత్మ్యం చెందటం కాదు. అందుచేత ప్రాణ శబ్దం ఇంద్రియాలు అనే అర్ధంతో ప్రయోగించడం కుదురుతుంది. ఆ ప్రాణాలన్ని ముఖ్య ప్రాణం యొక్క రూపాలయ్యాయి. అందుచేతనే ఇవి ప్రాణాలని చెప్పబడుతున్నాయి. శృతిని అనుసరించి ప్రాణ శబ్దం ముఖ్యంగా ముఖ్య ప్రాణాన్ని బోధిస్తుందని, ఇంద్రియాలను లక్షణావృత్తి చేత బోధిస్తుందని చూపుచున్నది. అందువలన ఇంద్రియలు ప్రాణం కంటే భిన్నమైన తత్వాలు.
సంజ్ఞా మూర్తి క్ల ప్త్యధి కరణం ( 2, 4, 20 )
సూత్రం :- 289
" సంజ్ఞ మూర్తి క్లుప్తిస్తు త్రివృత్ కుర్వత ఉపదేశాత్ "
సంజ్ఞా మూర్తి క్లుప్తిః తు :- పేరు, ఆకారం అనే ఈ రెండింటిని ఏర్పరచడం, నిర్మించడం, త్రివృత్ కుర్వతః :- మూడు దేవతలను సృష్టించిన బ్రహ్మం వలననే జరుగుతాయని, ఉపదేశాత్ :- ఉపనిషత్తులు అంటున్నాయి.
భావం :- పేరు, రూపం, నిర్మించడం అగ్ని, నీరు, భూమి దేవతలను సృష్టించిన బ్రహ్మ వలననే సాధ్యమవుతుందని ఉపనిషత్తులు చెబుతున్నాయి.
వివరణ:- నామరూప నిర్మాణమైతే పరమేశ్వరుని యొక్క పని అని శృతిలో చెప్పబడింది. అగ్ని, నీరు, భూమి ఈ మూడు దేవతలను సృష్టించినట్లు ఛాందోగ్యంలో సృష్టి ప్రకరణంలో చెప్పబడింది.
ఛాందోగ్యోపనిషత్తు:-(6,3,2) నేనే మూడుదేవతల్లో ఈజీవాత్మతో బాటు ప్రవేశించి, నామరూపాలు రచిస్తాను. అన్ని పదార్ధాలలో అంతర్యామిగా ఉండేవాడు ఈశ్వరుడు... పరదేవత ఆయన ఇలా సంకల్పించాడు. " నేను ఇదివరకే పుట్టించిన అగ్ని, జల, పృధివి దేవతల్లో అశుభ, శుభ కర్మలు చేస్తూ, వాటి ఫలాలైన సుఖ దుఃఖాలు అనుభవించే జీవుడితో బాటు ప్రవేశించి, ఈ దేవతల ద్వారా ఏర్పడే వస్తువులకు, నామాన్ని, రూపాన్ని, ఆకృతిని ఏర్పరుస్తారు. ఇలా లోకంలో ఉండే పదార్ధాల నామ రూప నిర్మాణం ఎవరు చేస్తారు. ఈశ్వరుడే నామ రూప కర్త. జీవుడు కర్త కానేరడు. పరబ్రహ్మయే సూర్య, చంద్ర, నక్షత్ర, పర్వత, సముద్రాలకు పేరు రూపం ఇచ్చేవాడు. జీవుడు ఈ ప్రపంచంలో ఘటపటాదులను సృష్టించి వాటికీ పేర్లు పెడుతున్నాడు కదా! కనుక అతడే నిర్మాత అని ఎందుకు అనకూడదు? జీవుడు పంచభూతాత్మకమైన వస్తువులు లభించినప్పుడు తనకు అనుకూలంగా ఘట పటాదులను నిర్మించుకోగలడే కాని దేన్నీ సృష్టించలేడు. ఇక సూర్యుడు, జలం, పృథవి ఇలాంటి వాటిని ఏమి సృష్టిస్తాడు?
ఛాందోగ్యోపనిషత్తు(8,14,1) "ఆకాశావై నామరూప యోర్నిర్వహితా" ఆకాశాదిభూతాలను నిర్మించి నిర్వహించేవాడు పరమాత్మ. కనుక బ్రహ్మమే. జీవులకు కావలసిన శరీరాది పదార్ధాలను నిర్మించి వాటికీ నామాలను కూడా ఏర్పరచాడు. కనుక స్తూల శరీరాదుల నిర్మాణానికి ఆయనే కర్త. ఈ నామరూప వ్యాకరణం జీవుడు చేసినదా? పరమేశ్వరుడు చేసినదా? అని సంశయం. "అనేక జీవత్మనా"(ఈ జీవస్వరూపంలో ప్రవేశించి) అని విశేషించి చెప్పబడింది. రాజు తన గూఢచారుల ద్వారా శత్రుసైన్యంలో ప్రవేశించి పరిశీలిస్తాడు. ఇక్కడ రాజుకంటే వేరుగా గూఢచారి ఉన్నపటికీ, ప్రేరకుడు రాజు కాని గూఢచారి కాదు.' 'సంకలయాని 'అని అని ఉత్తమపురుషుడు ప్రయోగం చేసి తన మీద ఆరోపించుకుంటాడో అదే విధంగా ఉత్తమపురుషుడైన పరమేశ్వరుడు ప్రేరక కర్తగా తన మీద ఆరోపించుకుంటాడు. ఘటాలు, పటాలు మొదలైన రూపాల విషయంలో జీవుడే కర్త అని చూపుచున్నది. సంజ్ఞమూర్తి క్లప్తిస్తు అనగా నామరూపవ్యాకరణం అని అర్ధం. త్రివృత్యరణం (పరమేశ్వరుణ్ణి బోధిస్తుంది) విషయంలో పరమేశ్వరుడే కర్త అని నిశ్శంశయంగా చెప్పబడింది. ఆదిత్యుడు, చంద్రుడు, విద్యుత్తు అని ఏ సంజ్ఞ క్లప్తి ( నామ విధానం ) మూర్తి క్లప్తి ( రూప విధానం ) ఉన్నాయో, అట్లే కుశలు, రెల్లు గడ్డి, ఫలాసం, గిరి, నది, సముద్రాలు, ప్రతి జీవికి ప్రతి వ్యక్తికి సంబంధించిన అనేక విధాలైన ఏనామరూప విధానం ఉన్నదో అది తేజస్సును, జలాన్ని, పృథవిని సృష్టించిన పరమేశ్వరుడు చేసిన పనే అయిఉండాలి. ఎందువలన? ఉపదేశం వలన. ఉత్తమ పురుష ప్రయోగంచేత పరబ్రహ్మయే వ్యాకర్త అని చెప్పబడు చున్నది. పరమేశ్వరుడి కంటే భిన్నుడుగా జీవుడనే వాడు లేదు కదా! జీవత్వం కేవలం ఉపాధిని బట్టి మాత్రమే ఏర్పడింది. అందుచేత జీవుడు చేసిన నామరూప వ్యాకరణం కూడా పరమేశ్వర కృతమే అవుతుంది. నామ రూపాలను వికసింపజేయట మనేది ఈశ్వరుని పనే. పరమేశ్వరుడు ముందుగా తేజస్సును, ఆ తరువాత జలము, అన్నము, సృష్టించి నేను వీటిలో ప్రవేశించి, నామ రూపాలను విస్తరింపజేస్తాను అనుకున్నాడు. కాబట్టి నామరూప కర్త ఈశ్వరుడే కాని వేరేవారు కాదు.
సూత్రం :- 290
“ మాంసాది భౌమం యధా శబ్ద మిత రయోశ్చ "
మాంసాది భౌమం :- మాంసాది నిర్మాణం భూమి పని, ఇతరయో చ :- ఇతర పనులు , జలం, అగ్ని కార్యాలు అని యధా శబ్దం :- ఉపనిషత్తులంటున్నాయి.
భావం :- మన శరీరంలో మాంసం లాంటివి భూమి కార్యం, రక్తం లాంటివి జలం కార్యం, ఎముకల్లాంటివి అగ్ని కార్యం అని ఉపనిషత్తులు అంటున్నాయి.
వివరణ:- మాంసపురీషాలు అన్నాత్మక మైన భూమియొక్క కార్యాలు. అన్నాన్ని పురుషుడు భుజిస్తున్నాడు. అతను భుజించిన ఆహరం నుండి మాంసాది కార్యం తయారవుతుంది. తిన్న అన్నం మూడు విధాలవుతుంది. స్థూల భాగం, మధ్య భాగం, సూక్ష్మభాగం. స్థూల మైన ధాతువు పూరీషం, మధ్య రకం ధాతువు మాంసం, సూక్ష్మధాతువు మనస్సు అవుతుంది. జీవుడు ధాన్యాది రూపంలో పృధివినే భుజిస్తున్నాడు. అదే విధంగా మనం త్రాగిన నీరు మూత్రం, రక్తం, ప్రాణంగా మారుతోంది. అలాగే మనం భుజించే తేజస్సు యొక్క పదార్ధాలు నూనె, నెయ్యి మొదలైనవి ఎముకలు, మజ్జ, వాక్కుగా మారుతోంది. దీనినే త్రివృత్కరణం అంటారు.అనగా మూడు భాగాలూ కలిపి ఒక భూతంగా అవడం, శరీరంలో ఈ భూతాలు త్రివృత్కరణం ఒక్కొక్క భూతం మూడేసి కార్యాలు పుట్టిస్తుంది.
ఛాందోగ్యోపనిషత్తు:-(6,5,11)తిన్న అన్నం మూడు రకాలవుతుంది. దానిలో స్థూలం మలం, మధ్యమం మాంసం, సూక్ష్మ తరం మనస్సు అవుతాయి. భూమిని ధాన్యాదిరాశుల రూపంలో జంతుజాలం భక్షిస్తుంది. ఆహరం స్వీకరించడం వలన మనస్సుతో పట్టుత్వం వస్తుంది. ఉపవాసంనాడు బలహీనంగా ఉండటం తెలిసిందే కదా! అంటే కార్య జనక శక్తి ప్రకటమౌతుంది. నెయ్యి లాంటి తేజో ద్రవ్యాల వలన వాక్ పట్టుత్వం వస్తుంది. దీని వలన తేలినదేమిటి? శరీరాలు పృధివ్యాధి పాంచ భౌతిక కార్యాలు అని తెలుస్తోంది.
సూత్రం :- 291
" వైశేష్యాత్తు తద్వాదః తద్వాదః "
వైశేష్యాత్ తు :- పార్ధివ భాగం ఎక్కువగా ఉండటం వలన, తద్వాదః :- దాన్ని మట్టి శరీరం, పార్ధివ దేహం అని అంటారు.
భావం :- ఈ శరీరం పాంచభౌతికమైనా, అందులో భూమి పాలు ఎక్కువగా ఉన్నందున దాన్ని పార్ధివ దేహం అంటారు.
వివరణ:-త్రివృత్కరణం (మూడు భూతాల మూడు భాగాలూ కలసి ఒక భూతంగా అవడం, ఒక్కొక్క భూతం మూడు కార్యాలు నిర్వహించడం) జరిగినా ఏదో ఒక మూలభూతం యొక్క ఆధిక్యత కనిపిస్తుంది. అగ్నిలో తేజస్సు యొక్క ఆధిక్యం, జలం లో జలం యొక్క ఆధిక్యం, పృధివిలో అన్నం యొక్క ఆధిక్యంవలె, ఈ త్రివృకృత మనేది లోక వ్యవహారం కోసం చెప్పబడింది. ఈ రకంగా నామరూపవ్యక్తీకరణ ఈశ్వర్ కృతమే గాని, జీవకృతంకాదు. త్రివృత్కరణం జరిగి ఉండటం చేత పృథవి లో నీరు, అగ్ని కూడా ఉన్నాయి. అట్లే ఇతరమైన రెండింటిలోను కూడా అందుచేత పృథివి అనే దానికి అగ్ని అని, జలం అని కూడా అనవచ్చును కదా! అని అర్ధం. అగ్నిలో తేజస్సు పాలు ఎక్కువగా ఉండటం, పృథవిలో అన్నం(భూమి) పాలు ఎక్కువగా ఉండటం, ఈవిధంగా ఒకదానిలో ఒకధాతువు అధికంగా కనబడుతుంది. మూడుపేటలు పేనిన తాడు ఒక్కటే అని వ్యవహరించినట్లు లోకంలో వేరువేరుగా మూడు భూతాలకు సంబంధించిన వ్యవహారం ప్రసిద్ధం కాదు. అనగా ఒక్కొక్క భూతంలో మూడు భూతాలు ఉన్నా కూడా అవి కలిపి ఏకం ఐయిపోవడం చేత ఎక్కువగా ఉన్నదానిని బట్టి లోక వ్యవహారం జరుగుతుంది. తద్వాదః అని ఒక పదాన్ని రెండు సార్లు ఆవృత్తి చెయ్యడం అధ్యాయం పూర్తి అయినదని సూచిస్తుంది.
( రెండవ అధ్యాయం సమాప్తం )
తృతీయాధ్యాయం
ఈ అధ్యాయంలో జీవుడికి సంసారగతి ఏ విధంగా సంభవిస్తోంది? వాటి అవస్థలు ఏమిటి? మోక్షం ఎలా సిద్ధిస్తుంది? మొదటి పాదంలో వైరాగ్యసిద్ధి కోసం పంచాగ్ని విద్యను బోధించి, తద్వారా వైరాగ్యం కలిగించే మార్గం గురించి వివరించారు. లోకంలో మూడు రకాలైన మనుషున్నారు. 1.పాపాత్ములు, 2.కర్మాధికారులు, 3.బ్రహ్మవిద్యోపాసకులు. 1.పాపాత్ములు లౌకిక వ్యవహారలలో మునిగిపోయి, వారి ఆలోచనా ధోరణి పాపచింతనతో నిండి, అన్యాయాలు, అక్రమాలు, మోసాలు చేస్తూ, జీవితం గడుపుతారు. వీరు మరణించిన తరువాత నరకానికి చేరుతారు. 2 కర్మాచారపరాయణులు ప్రాతఃకాలం, సంధ్యాకాలం లో హోమం చెయ్యడం, యజ్ఞయాగాలు నిర్వహించడం ద్వారా శరీరం విడిచిన తరువాత, స్వర్గ లోకం చేరి, అక్కడ భోగాలు అనుభవించి, చేసిన పుణ్యం ఖర్చు అయిపోయిన తరువాత, కర్మఫలితంగా భూలోకంలో మళ్ళీ జన్మిస్తారు. 3. బ్రహ్మ విద్యో పాసకులు పురాణాలూ, శాస్త్రాలు, భగవద్గీత పఠిస్తూ, సగుణోపాసన చేస్తూ, ఆతరువాత నిర్గుణోపాసన చేసి, మోక్షాన్ని పొందడానికి, శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత అర్చిరాదిమార్గం అంటే వెలుగుమార్గం ద్వారా ఒక్కొక్క లోకం దాటి, బ్రహ్మలోకం చేరి, బ్రహ్మతోబాటు పరమాత్మలో లీనంఅవుతారు. ఈ 3వఅధ్యయం మొదటి పాదంలో కర్మాచార పరాయణులు యజ్ఞయాగాదులు చేసినవారు శరీరాన్ని విడిచిన తరువాత ఏ రకంగా ప్రయాణం చేస్తారు? ఏ భోగాలు అనుభవిస్తారు? మరల ఈ లోకంలో శరీర ధారణ ఎలా చేస్తారు అనే విషయాలను గురించి తెలియజేసారు.
తదంతర ప్రతి పత్యధికరణం ( 3, 1, 1 )
సూత్రం :- 292
" తదంతర ప్రతి పత్తో రంహతి సంపరి ష్వక్తః ప్రశ్న నిరూపణాభ్యం "
తదంతర ప్రతి పత్తౌః :- జీవాత్మ తన శరీరాన్ని వదలి, సంపరిష్వక్తః :- సూక్ష్మ దేహంతో, రాంహాతి :- వెడతాడు అని తెలుస్తోంది.
భావం :- జీవుడు తన శరీరాన్ని వదలి ఇంకొక శరీరాన్ని పొందడానికి భూత సూక్ష్మలతో కలసి వెడుతున్నాడు.
వివరణ :- జీవుడు సూక్ష్మభూతాలతో కలసి దేహాన్నివిడిచి, ప్రాణం, ఇంద్రియాలు, మనస్సు, అవిద్య, బుద్ధి తీసుకొని పరుగెడుతున్నాడు. సూక్ష్మ దేహం ఎంత వేగంగానైనా పరుగెడుతుంది. అంత వేగంగా స్థూల దేహం అలా వెళ్ళలేదు.
ఛాందోగ్యోపనిషత్తు :- పూర్వం పాంచాల దేశాన్ని ప్రవాహణుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతను మహాజ్ఞాని. గౌతమ మహర్షి తన కుమారుడైన శ్వేతకేతువుకు తన విద్యలన్నీ బోధించడంతో కుమారునిలో విద్యా గర్వం వచ్చింది. ప్రవాహనుడు తాను యజ్ఞాన్ని చేయాలని నిశ్చయించి, అనేకమంది రాజులను, సామంత రాజులను ఆహ్వానించాడు. ఒక్కొక్క రోజు పండిత సభ నిర్వహించి చర్చలు జరిపాడు. ప్రవాహణుడు శ్వేత కేతువును విద్యాభ్యాసం పూర్తి అయిందా? అని అడుగుతాడు. రాజా! మా తండ్రి అన్ని విద్యలు బోధించాడు, అని సమాధానం చెప్పాడు. ఓశ్వేతకేతూ! నేను నిన్ను ఐదు ప్రశ్నలు అడుగుతాను. వాటికీ సమాధానం చెప్పగలిగితే నువ్వు అన్నీ విద్యలలో ఆరితేరిన వాడివవుతావు అని 5 ప్రశ్నలు అడిగాడు.
1. కర్మాధికారులైన మానవులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెడుతున్నారు?
2. ఏ లోకం విడిచి వెళ్లిన వారు తిరిగి ఈ లోకానికి ఎలా వస్తున్నారు?
3.దేవయాన మార్గం, పితృయాన మార్గం అంటే ఏమిటి?
4. ఈ లోకంలో పుణ్య కర్మలు చేసి స్వర్గానికి వెడుతున్నారు కదా! ఆ లోకాలు ఏమిటి?
5.ప్రకృతి పరిమాణంలో పురుషాహంకారం ఎలా ఏర్పడుతుంది. అని అడిగాడు.
శ్వేతకేతువుకు దీనిలో ఒక్కటి కూడా తెలియలేదు. ఈముఖ్యాంశాల మీద నీకు జ్ఞానం లేదా అని అడిగేసరికి అతనికున్న విద్యాగర్వం తొలగిపోయి, తన తండ్రి దగ్గరకు వెళ్లి ఈప్రశ్నలకు సమాధానం అడుగుతాడు. తండ్రి తనకు కూడా వాటికి సమాధానాలు తెలియవని, ఇద్దరూ రాజు దగ్గరకు వచ్చారు. మీకు ఏమి కావాలి? గోవులా? భూమూలా? అని అడిగాడు రాజు. మాకేమి వద్దు, ఈప్రశ్నకు సమాధానం చెప్పగలిగే జ్ఞానం ప్రసాదించమని కోరారు. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా! ఇంతవరకు ఈ పంచాగ్నివిద్య క్షత్రియులకు, యమధర్మరాజుకు మాత్రమే తెలుసును. బ్రాహ్మణులకు తెలియదు. ఇప్పుడు నీవలన బ్రాహ్మణులకు కూడా తెలుస్తుంది. ఈపంచాగ్ని విద్యలో 5 అగ్నులు ఉన్నాయి. 1.ద్యులోకం(స్వర్గలోకం, చంద్రలోకం) 2.పర్జన్యం( మేఘాలు,) 3. పృధివి( భూమి ) 4. పురుషుడు ( మానవులు ) 5. శక్తి ( స్త్రీ ) వీటికి 5 ఆహుతులు ఇవ్వాలి 1. శ్రద్ధ, హోమం, వర్షం, అన్నం, రేతస్సు, శ్రద్ధ అనే ఆహతి ద్యులోకంలో, హోమం అనే అహుతిని పర్జన్యం లోను, వర్షం అనే ఆహుతిని పృథవిలోను, అన్నంఅనే అహుతిని పురుషుడిలోను, రేతస్సు అనే అగ్నిని స్త్రీలోనూ వెయ్యాలి. 1.శ్రద్ధ అనే అగ్నిని ద్యులోకం అనే అగ్నిలో అహుతి చేస్తే అది హోమ రూపమైన జలంగా మారుతుంది. 2. ఈ హోమరూపమైన జలాన్ని మేఘం రూపంలో వర్షాధి దేవత పర్జన్యుడు రెండవ అగ్నిగా వర్షం రూపంలో కురిపిస్తాడు. 3.వర్షం అనే ఆహతి 3వ అగ్ని అయిన పృథవిలో వేస్తాడు. మొక్కలు మొలకెత్తి పువ్వులు, పండ్లు వచ్చి, పంటలు పండుతాయి. 4.అక్కడ నుండి అన్నమైన అగ్ని రూపమైన జలాన్ని పురుషుడు అనే అగ్నిలో వేస్తాడు. అన్నం తిన్న పురుషుడు రేతస్సు వీర్య రూపంలో మారిపోతుంది. వీర్యజలం స్త్రీయోనిలో ప్రవేశపెట్టబడుతుంది. 5.శిశువుగా తయారై పురుషరూపం వస్తుంది. ప్రవాహణుడు, శ్వేతకేతువు యొక్క ప్రశ్నోత్తరాల వలన జలం భూత సూక్ష్మలతో కూడి జీవుడు ప్రయాణం చేస్తాడని మనకు తెలుస్తుంది. ఇదే పంచాగ్ని విద్య, వైరాగ్యం పొంది తద్వారా మోక్షం సాధించేందుకు శ్వేతకేతువు ద్వారా లోకానికి వెల్లడైనది. పూర్వపక్షం అంటే విమర్శించే వారి వాదన ప్రకారం భూత సూక్ష్మాలు అంతటా ఉంటాయి కదా? మరి వెంట తీసుకొని వెళ్లడం దేనికి, ఒక్కడే ఒంటరిగా పోతాడు కదా అని సందేహం. దీనిని నివృత్తి చెయ్యడానికి ఏడుసూత్రాలతో మొదటి అధికరణం చెప్పబడింది. దానికి సమాధానం చెప్పబడింది. సూక్ష్మ భూతాలు అంతటా ఉన్నాయి. జీవుడు తాను పొందబోయే క్రొత్త దేహానికి కావలసిన బీజాలు జీవుడికి సంబంధినవి అంతటా ఉండవు కదా! అందుకే ఈ బీజాలు తీసుకొని వెడుతున్నాడు. ఆ కర్మ ఫలాలు అనే బీజాలకు రక్షణ, పోషణ ఈ సూక్ష్మ భూతాల వలెనే సిద్ధిస్తుంది.మరొక సందేహం, గడ్డి పురుగు ఒక ఆకు నుండి కదలి వేరొక ఆకును పొందుతుంది కదా! కొత్త దేహాన్ని పట్టుకొని పాత దేహాన్ని వదులుతుంది కదా! దానికి సమాధానం, జీవుడు పాత దేహాన్ని వదలి కొత్త దేహాన్ని పట్టుకుంటాడు. పాత దేహంలో ఉన్నకర్మ ఫలాలు, వాసనలు అన్ని పుణ్యాలు తీసుకొని వెళ్లి అక్కడ భోగాలు అనుభవించి ఆ పుణ్యాలు ఖర్చు చేసి, కర్మశేషం తో వచ్చి ఈ భూమి మీద మరొక గర్భంలో ప్రవేశిస్తాడు. పాత దేహంలో ఉన్నా వాటిని సాగదీసి అంటే వాటిని పోషించుకుంటూ వచ్చి, కొత్త దేహాన్ని ఏ రకమైన దేహం వస్తుందో ఆ భావాన్ని పొంది, అప్పుడు పాత దేహాన్ని వదులుతాడు. భావాన్ని బట్టి భావాన్ని వదలడం కాని, దేహాన్ని బట్టి దేహాన్ని వదలడం కాదు. రాబోయే జన్మ జీవుడు చేసిన కర్మ ఫలాలను అనుసరించి ఉంటుంది. వాటిని పోషించుకుంటూ ఆ మార్గంలో ప్రయాణం చెయ్యాలి. నేను ఈ దేహాన్ని తయారు చేసుకుంటున్నాను అని పాత భావాలు పోయి క్రొత్త భావాలు వస్తాయి. పంచాగ్ని విద్యలో చెప్పిన దానిని బట్టి జీవుడు భూత సూక్ష్మాలతో కూడా కలసి వెడతాడు అని తెలుస్తోంది. ఛాందోగ్యం లో చెప్పినట్లు ద్యులోకం, పర్జన్యుడు, పృథవి, పురుషుడు, స్త్రీ ఈ 5ని అగ్నులు గా భావించి ఉపాసాన చెయ్యాలి. (శ్రీ దేవిశెట్టి చలపతిరావుగారు 3, 4 అధ్యాయాలకు వ్యాఖ్యానం చెప్పియన్నారు. ఆయన చెప్పిన దానిలో కొన్ని ముఖ్యాంశాలు సేకరించి వ్రాయడమైనది.)
సూత్రం :- 293
"త్ర్యా త్మ కత్వాత్ తు భూయ స్త్వాత్ "
త్రి ఆత్మ కత్వాత్ :- సూక్ష్మ భూతాలు, బాహ్య అభ్యంతర కరణాలు అనే మూడు తత్వాలతో సూక్ష్మ శరీరం ఏర్పడుతుంది. తు :- అలాగే, భూయస్త్వాత్ :- వాటిలో సూక్ష్మ భూతాలు ఆశ్రయించి ఉంటాయి.
భావం:-బాహ్యఅభ్యంతర కరణాలు అనే మూడుతత్వాలతో సూక్ష్మశరీరం ఏర్పడుతుంది. వాటిలో సూక్ష్మభూతాలు ఆశ్రయించి ఉంటాయి.
వివరణ :- స్థూలదేహంలో అస్థి, స్నాయువులు, మజ్జ, త్వక్కు, మాంసం, రక్తం అనే ఆరు పదార్ధాలు ఉంటాయి. అలాగే సూక్ష్మ శరీరం 17 తత్వాలతో కూడినదై, అంతఃకరణ మైన మనోబుద్ధులు ఒక వర్గంగా, జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు ఒక వర్గం గా, సూక్ష్మ భూతాలు ఒక వర్గంగా మొత్తం 3 వర్గాలుగా భావించి త్య్రాత్మకం అని వ్యవహారించారు. ప్రవాహణుడికి, శ్వేత కేతువుకి మధ్య సంభాషణ జరిగింది. శ్వేతకేతువు ఇలా అన్నాడు, ఈలోకంలో అగ్ని కార్యాలు, యాగాలు, హోమాలు, నిర్వహించి మరణించిన తరువాత జలంతో కూడుకొని స్వర్గ లోకానికి వెడతాడు అని చెప్పారు. జలంతో కలసి వెడతాడని చెప్పారు కదా! మరి సూక్ష్మ భూతాలతో కలసి వెడతాడని చెప్పారు, ఇది ఎలా సాధ్యం అని అడిగాడు. దానికి రాజు సమాధానం చెబుతున్నాడు. పృథవి, జలం, అగ్ని ఈ మూడింటి రూపం అన్నింటిలో ఉంది. ఈ మూడింటి లోను, ప్రతి దానిలో అన్నీ ఉన్నాయి. యజ్ఞం చేసేటప్పుడు పాలు, నెయ్యి, మధుర పదార్ధాలు సమిధలు ఆహుతులుగా అగ్నిలో శ్రద్దగా వెయ్యాలి. వీటిలో ద్రవరూపంలో ఉండే జలం అపూర్వ (అంటే ఒక శక్తి, మనం చేసే పుణ్య, పాప కర్మల రూపంలో ఉండే శక్తి )ద్వారా యజమానితో బాటు స్వర్గ లోకానికి చేరుకుంటుంది. యజ్ఞ యాగాదులు ఎవరైతే శ్రద్దగా చేస్తారో, జల రూపంలో ఉండే ఆహుతులు అపూర్వ ద్వారా దేహాన్ని విడిచి పెట్టిన జీవుడితో బాటు ద్యులోకానికి వెడుతుంది. జలంలో మూడు భూతాలు పృథవి, వాయువు, అగ్ని కలుస్తాయి. జీవుడు జలంతో పరివేస్థితుడై వెడుతున్నాడు అంటే భూత సూక్ష్మలతో వెడుతున్నట్లే. విశ్వంలో జలం ఎక్కువ. దేహంలో జలం ఎక్కువ. పూర్వ పక్షం (విమర్శకుల వాదన) జీవుడు దేహాన్ని విడిచి వెళ్ళేటప్పుడు జలపరివేష్టితుడై వెడుతున్నాడు, అంటే భూత సూక్ష్మాలతో వెడుతున్నాడని చెప్పలేదు కదా! జీవుడు ఉదకాలతో చుట్టబడిన వాడై, వెడుతున్నాడు. అంటే యాజ్ఞ ఫలమైన సోమరసం మేఘం దాక వెళ్లి వర్షంగా కురుస్తుంది. ఆవర్షం వల్ల పంటలు పండుతాయి. ఈ వర్షమే ఆ ఉదకం. అయితే జీవుడు ఉదకంతో కలసి వెడుతున్నాడు అంటే మిగిలిన సూక్ష్మ భూతాలతో కలసి వెళ్లడం లేదు కదా ఉదకం, తేజస్సు, పృథవి, వాయువు రూపమే పంచ తన్మాత్ర లలో 5 తన్మాత్రలు. పంచభూతాలు పంచీకరణ చెంది, జలం సగ భాగమును 4 గా విభజించి, ఆకాశంలో ఒక భాగం, వాయువులో ఒక భాగం, అగ్నిలో ఒక భాగం, పృధివిలో ఒక భాగం కలిసాయి. ఇలా ప్రతి పంచభూతం మిగిలిన నాలుగుతో కలుస్తాయి. జలంతో కూడి వెడుతున్నాడు అంటే భూత సూక్ష్మాలతో కలసి వెడుతున్నాడు అని అర్ధం. సూక్ష్మ శరీరం అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం మొత్తం 19. పంచ తన్మాత్రల నుంచి స్థూల శరీరం వదలి సూక్ష్మ శరీరం తో వెడుతుంటే భూత సూక్ష్మాలతో వెడుతునట్లే భావించాలి. యాజ్ఞ యాగాదులు, పుణ్య కార్యాలు చేసిన వారు స్వర్గానికి వెళ్లి, అక్కడ భోగాలు అనుభవించడానికి , సూక్ష్మ భూతాలతో కూడి ఇంద్రియాలు, బుద్ధి, జ్ఞానం, అజ్ఞానం, తీసుకొనే వెడతాడు అని గ్రహించాలి.
సూత్రం :- 294
" ప్రాణ గతేశ్చ "
చ :- అంతే కాక, ప్రాణ గతే :- జీవాత్మతో బాటుగా ప్రాణాల గమనం వర్ణించారు.
భావం :- ప్రాణోత్క్రమణం వలన జీవుడు లింగ దేహంతో కూడి మరొక దేహానికి వెడతాడని తెలుస్తోంది.
వివరణ :- ప్రాణం అంటే ఇంద్రియాలు. శ్రుతి ప్రకారం జీవుడు ఇంద్రియాలతో బాటు భూత సూక్ష్మాలతో వెడుతున్నాడు. ఇంద్రియం అంటే జ్ఞానేంద్రియం, అంతరేంద్రియం, కర్మేంద్రియం, పంచ ప్రాణాలు మొత్తం కలిపి ఇంద్రియాలు అంటారు. పంచ భూతాల యొక్కపంచ తన్మాత్రల యొక్క సాత్వికాంశాల నుండి 5 జ్ఞానేంద్రియాలు, పంచ భూతల యొక్క సమిష్టి సాత్వికాoశాల నుండి నాలుగు అంతః కరణాలు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం వచ్చాయి. పంచ భూతల యొక్క తన్మాత్రాల యొక్క రాజశాంశాల నుండి 5 కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు వచ్చాయి. వేదాలను అనుసరించి జీవునితో పాటుగా ఇంద్రియాలు కూడా వెడుతున్నాయి. కాబట్టి జీవుడు సూక్ష్మ భూతాలతో పరివేష్టితుడై ఉన్నాడని తెలుస్తోంది.
బృహదారణ్యకోపనిషత్తు(4,4,12):- జీవుడు ఈ దేహాన్ని విడిచి వెళ్ళేటప్పుడు వాగాది ఇంద్రియాలు (ప్రాణాలు) అన్నీ అతణ్ణి అనుసరించి వెడతాయి. ఈవాక్యంలో ప్రాణోత్క్రమణం గురించి చెప్పారు. జీవుడు సూక్ష్మదేహంతో వెళ్ళని పక్షంలో అలా చెప్పరు. కాబట్టి లింగదేహంతో ఉత్క్రమిస్తాడని తెలుస్తోంది. యాజ్ఞవల్కుడు జనక మహారాజుకు ఆత్మ గురించి వివరిస్తూ," అంత్యకాలంలో జీవాత్మ శరీరం నుంచి బయటకు పోవడానికి మార్గం కనిపిస్తుంది. ఆ స్థితిలో ఆత్మ శిరస్సు ద్వారా కాని, నవ రంధ్రాల ద్వారా కాని బయటకు పోతుంది. దానితో బాటే ప్రాణం కూడా బయటకు పోతుంది. ప్రాణం శరీరం నుండి బయటకు రాగానే ఇంద్రియాలన్నీ శక్తి హీనమౌతాయి. ఆ స్థితిలో జీవుడు మంచి విజ్ఞాన వంతుడిగా ఉంటాడు. విజ్ఞానంతో కూడిన ప్రదేశానికి వెడతాడు. అతనితో బాటు అతని జ్ఞానం, అతను చేసిన కర్మ, పూర్వ జన్మ సంస్కారం అతని వెంట వెడతాయి. దీనిని బట్టి ఆశ్రయం లేకుండా ఇంద్రియాలు ఉండలేవు. ఎక్కడికి పోలేవు. కాబట్టి వాటికి ఆధారంగా, ఆశ్రయంగా సూక్ష్మ భూతాలు ఉండాలి. ఈ విధంగా సూక్ష్మ భూతాలు కూడా వెడతాయి. ప్రాణాలకు గతి చెప్పడం వలన కూడా ప్రతి జీవుడు భూత సూక్ష్మాలతోనే పయనిస్తాడు అని తెలుస్తోంది. జీవుడు దేహాంతరం పొందే సందర్భంలో ప్రాణాలకు గతి ఉంటుందని ఆధారం లేకుండా ప్రాణాలు వెళ్లడం కుదరదు. ప్రాణ గతిని బట్టి వాటికీ ఆశ్రయమైన ఇతర భూతాలతో కూడిన ఉదకం కూడా వెడుతుందని తెలుస్తోంది. జీవించి ఉండగా అలాంటిది ఏది కనబడటం లేదు కదా! అంటే దేహంలో ఉన్నప్పుడు ఆ దేహంలో ప్రాణాలు ఉంటాయి కాని దూరంగా ఉండవు కదా!
సూత్రం :- 295
" అగ్న్యాది గతి శృతే రీతి చేన్న భాక్తత్వాత్ "
అగ్ని ఆది గతి శృతేః :- అగ్ని, వాయువు లాంటి వాటిలో ఇంద్రియాల గతి ( గమనం ) వింటున్నాం. ఇతి చేత్ :- అని భావించడం, న:- సరి అయినది కాదు. భాక్తత్వాత్ :- అగ్న్యాదుల్లో గతి గౌణమే.
భావం :- అగ్ని, వాయువు, లాంటి వాటిలో ఇంద్రియాల గతి వింటున్నాం. కనుక జీవుడితో బాటు ఇంద్రియాలు వెళ్లవు అని భావించడం సరిఅయినది కాదు. ఎందుకంటే అగ్ని మొదలైన ఇంద్రియాల గమనం గౌణమే (అప్రధానమే ).
వివరణ:-మానవుడు చనిపోయినతరువాత వాక్కుమొదలైన ఇంద్రియాలు వాటివాటి అభిమాన దేవతలలో లీనమౌతాయని వేదంలో చెప్పబడింది. కాబట్టి ప్రాణాలు జీవుని అనుసరించవు అనే వాదన నిజం కాదు.
బృహదారణ్యకోపనిషత్తు(3,2,13):-ఆర్త భాగుడు యాజ్ఞవల్కుడిని అడుగుతాడు, పురుషుడు మరణించిన తరువాత, అతని యొక్క 1. వాక్కు-అగ్నిలో లీనం అవుతుంది. 2.ప్రాణం-వాయువులో లీనం అవుతుంది 3.నేత్రాలు-ఆదిత్యునిలో లీనమౌతాయి. 4. శ్రోత్రాలు - దిక్కుల యందు లీనమౌతాయి. 5. మనస్సు - చంద్రునిలో లీనమౌతుంది. 6. శరీరం - భూమిలో లీనమౌతుంది. 7. హృదయాకాశం - భూతాకాశంలో లీనమౌతుంది. 8. కేశాలు :-వనస్పతులలో లీనమౌతాయి. 9. శుక్ర శ్రోణితాలు :-జలంలో కలసిపోతాయి. అంటే ఇంద్రియాలన్ని వాటి వాటి కారణాలలో లీనమైపోగా, మిగిలిన పురుషుడు ఏ మౌతాడు? దేని ఆధారంగా అతను మళ్ళీ శరీరం ధరిస్తాడు? రోమాలు ఓషధులను చేరతాయి. కేశాలు వృక్షాలను చేరతాయి అని చెప్పబడింది, రోమాలు, కేశాలు ఎగిరి వెళ్లి ఓషధులను, వృక్షాలను చేరతాయి అని చెప్పడం అసంభవం కదా! ప్రాణంలేకపోతే జీవునకు గమనమే కుదరదు. అందుచేత అధి ఔపచారికమే. అంటే గౌణమే. ముఖ్యం కానిది అని చెప్పాలి. జీవించి ఉన్నంత వరకు అగ్ని మొదలైన దేవతలు ఇంద్రియాలకు ఉపచారం చేసి, మరణంలో విరమిస్తాయి అనే అర్ధం అంతే కాని వాగాది ఇంద్రియాలు అగ్న్యాదులలో లయం కావు. జీవుడు ప్రాణంతో ఉన్నప్పుడు అధిష్టాన దేవతలు అవయవాలకు శక్తినిచ్చి, పనిచేయిస్తూ ఉంటాయి. దేహాన్ని వదలి పోయినప్పుడు సహకరించవు. శక్తి హీనులౌతాయి. ఏ పని చెయ్యవు. అందుకే ఇంద్రియాలు పని చెయ్యవు. వాటంతట అవి ప్రయాణం చెయ్యలేవు. అధిష్టాన దేవతలు సహకరించక పోవుటచే సూక్ష్మ భూతాలను అనుసరించి వెడతాయి.
సూత్రం :- 296
" ప్రథమే శ్రావణాదితి చేన్న తా ఏవ హ్యుప పత్తేః "
ప్రథమే:- చాందోగ్యప్రకరణంలో ద్యులోకం అనే అగ్నిలో, అ శ్రవణాత్ :- లింగ దేహాన్ని సూచించే, ఆపః :- జలం హోమ ద్రవ్యంగా చెప్పలేదు కదా! ఇతి చేత్ :- అని అనడం సరి అయినది కాదు. హి :- ఎందుకంటే, ఉపపత్తేః :- ప్రశ్నత్తరాలలో ఏకవాక్యత ఉన్నందు వలన, తా ఏ వ :- జలాన్ని అక్కడ హోమ, ద్రవ్య రూపంలో శ్రద్ధ అనే పదం తో చెప్పారు.
భావం :- ద్యులోకం అనే అగ్నిలో లింగదేహాన్ని సూచించే జలం హోమ ద్రవ్యంగా చెప్పలేదు కదా! ఎందుకంటే ప్రశ్నత్తరాలలో ఏక వాక్యత ఉన్నందువలన జలాన్ని అక్కడ హోమ ద్రవ్య రూపంగా ఉపయోగించినట్లు చెప్పినా, శ్రద్ధ పదం అంటే జలమే. ఈ వాక్య ప్రయోగంలో వైరుద్యం ఏమి లేదు.
వివరణ:-ద్యులోకం మొదలు ఆయా అగ్నులయందు ఉదకాలు ఆహుతిఅవటం నిరూపించగలిగితే, ఐదవ ఆహుతి పురుషుడు ఎలా అయ్యాడో నిరూపించవచ్చును. కాని మొదటి ఆహుతి శ్రద్ధ అన్నారు. ఉదకం చెప్పలేదు. ద్యులోకమే అగ్ని. ఈఅగ్నితోనే దేవతలు శ్రద్ధను ఆహుతిగా ఇస్తున్నారు అని బృహదారణ్యాకంలో చెప్పబడింది. మిగిలిన నాలుగు ఆహుతులు సోమము, సృష్టి, అన్నము, రేతస్సు వీటికి జల సంబంధం ఉన్నది. అయితే శ్రద్ధ అనేది కేవలం జ్ఞానమే తప్ప జలం ఎలా అవుతుంది.? మొదటి ఆహుతే అప్రాణమైనప్పుడు మిగిలినవి కూడా అంతే అవుతాయి కదా! అని వారి వాదన. మొదటి ఆహుతిలో జలం చెప్పబడలేదు. కాబట్టి జీవులు జలాన్ని తీసుకుపోరు అనేది నిజం కాదు. యజ్ఞయాగాదులు చేసేవారు స్వర్గలోకానికి వెడతారు. శ్రద్ధ అనేది మనోవృత్తి కాబట్టి శ్రద్ధను మనసు నుండి వేరు చేసి హోమం చెయ్యడం జరగదు. ఉదకాలను హోమం చెయ్యగలం. తైత్తరీయసంహితలో యజమాని చేసే పుణ్య కర్మ కోసం జలం శ్రద్ధను పుట్టిస్తుంది. కాబట్టి శ్రద్ధ అంటే ఉదకం అని అర్ధం.
తైత్తరీయోపనిషత్తు(3,2,4):-"శ్రద్దావా ఆపః " శ్రద్దేజలం అన్నారు కనుక శ్రద్ధ అంటే జలమే. అందువలన జీవుడు లింగభేదం తో దేహంతరగమనం చేస్తాడనండంలో ఏ మాత్రం సందేహం లేదు. "శ్రద్ధావా ఆపః " అని వైదిక ప్రయోగం ఉండటం చేత శ్రద్దా శబ్దం ఉదకం అనే అర్ధంతో ఉపపన్నంగా ఉంటుంది. దేహ బీజాలైన జలం సూక్ష్మత్వాన్ని పొందడం చేత శ్రద్ధతో సామ్యాన్ని (మనస్సులోని శ్రద్ధ ఏవిధంగా ఇతరులకు ఇంద్రియగ్రాహ్యం కాదో అట్లే ఇవికూడా ఇంద్రియ గ్రాహ్యములు కానంత సూక్ష్మంగా ఉంటాయి. మజ్ఞాకోశాంతి (మంచాలు ఏడుస్తున్నాయి ) ఇత్యాదులలో మజ్జ శబ్దం పురుషులతో సంబంధాన్ని బట్టి పురుషుల విషయంలో శ్రద్దాశబ్దం యుక్తమే. " ఆపో కర్మణి " ఉదకం యజమానికి పుణ్య కర్మ చెయ్యడానికి శ్రద్ధను పుట్టిస్తుంది అనే శృతిలో ఉదకం శ్రద్దా హేతువే. బ్రహ్మవిద్యను పొందడానికి కర్మ కూడా అవసరమా? కర్మాచరణ కావాలా? అని పూర్వ పక్షం వారి వాదన. కర్మ ఫలం అవసరమేనని చెబుతున్నారు. పుణ్య కర్మలు చేస్తేనే బ్రహ్మ విద్యోపాసన కు అర్హత సాధించగలరు.
సూత్రం :- 297
" అశ్రు తత్వ దితి చే న్న ష్టా ది కారిణాం ప్రతీతేః "
అశ్రు తత్త్వాత్ :- ఆపః శబ్ద ప్రయోగం మూలంగా లింగ దేహానికి గతి ఉందని చెప్పినా, ఇతి చేత్ :- అని అనడం, న :- తగ దు. ఇష్టాది కారిణాం :- ఇష్టం మొదలైన కర్మలను అనుసరించే వాళ్ళు, ప్రతీతేః :- ప్రసక్తి శాస్త్రంలో ఉంది.
భావం:-లింగదేహానికి గతి ఉందని చెప్పినా, దానితో బాటు జీవాత్మ వెడుతుందని సూచించే జీవాత్మ పదం వినలేదు కదా! కనుక జీవుడు లింగదేహంతో బాటు వెడతాడనేది యుక్తం కాదు అని అనడం తగదు. ఎందుకంటే ఇష్టాది కర్మలు అనుసరించే వాళ్ల ప్రసక్తి శాస్త్రంలో ఉంది.
వివరణ:-జలాన్ని వర్ణించినట్లుగా జీవులను వర్ణించలేదు. కాబట్టి జీవులు ఉదకంతో కూడి ప్రయాణించడం లేదు అని వారి వాదన. అది నిజం కాదు. ఎందుకంటే యజ్ఞయాగాదులు చేసిన వారు అలాగే వెడుతున్నారని నమ్మకం. యాగకర్మలు ఆచరించేవారు, జలపరివేస్థితులై స్వర్గ లోకానికి వెడతారు. అయితే ఇష్టాధికారులు కర్మ ఫలాన్ని అనుభవించడానికి చంద్రలోకం వెడుతున్నారనడం నిజం కాదు. ఎందుకంటే వారు చంద్రుణ్ణి చేరి అక్కడ అన్నం అవుతున్నారని, దేవతలు వారిని భక్షిస్తున్నారని, వారు కర్మ ఫలం అనుభవించడానికి వెళ్లడం లేదని వారి వాదన.
ఛాందోగ్యోపపనిషత్తు(5,10,3):-"పితృలోకాదాకాశం, ఆకాశాచ్చాంద్రమసం ఏషసోమోరాజా" గృహస్థాశ్రమం లో ఇష్టాపూర్తాలు, దానం లాంటి కర్మలు చేసిన వాళ్ళు ధూమమార్గం ద్వారా చంద్రుణ్ణి చేరి, అక్కడ దివ్యశరీరాలు ధరించి చంద్రుడిలా ప్రకాశి స్తారు. ఇలాంటి వాక్యాల్లో జీవోత్క్రమణం స్పష్టంగా ఉంది. కనుక ఈప్రకరణంలో గమనం కేవలం లింగదేహానికి లేదు. దానితో బాటు జీవుడికి కూడా చెప్పినట్లు తెలుస్తోంది. (5,10,4):-"ఏ ష సోమోరాజా తద్దేవానాం అన్నందేవా భక్షయంతి" చంద్రలోకం చేరి దివ్య దేహదారి అయిన జీవుణ్ణి సోముడు అంటారు. అతడు దేవతలకు అన్నం అవుతాడు. దేవతలు అతనిని భక్షిస్తారు. అని చెప్పారు. అది యుక్తంకాదు, మరి జీవుడు లింగశరీరంతో కర్మ ఫలాన్ని అనుభవించడానికి వెడతాడని అనడం యుక్తమే. యాగకర్మలు ఆచరించిన వారు, జలపరివేష్టితులై స్వర్గ లోకానికి వెడతారు. శృతిలో ఇష్టాధికారుల ప్రతీతి ఉన్నది. ఏగృహస్థులు ఇష్టం(యజ్ఞాధికం), పూర్ణం(వాపీకూపతటాకాది నిర్మాణం), దత్తం(దానం) అని చెప్తుంటారో, వాళ్లు ధూమాన్ని చేరుతారు. ధూమంగా అవుతారు. ధూమమార్గం ద్వారా పితృయాన మార్గంలో, ఆకాశం చేరి, అక్కడనుండి చంద్రుణ్ణి చేరతారు. ఈ చంద్రుడే సోమరాజు, సోమయాజులు అని వ్యవహారిస్తారు. సోమరాజా అనేది ఈ శృతి వాక్యంలో కూడా సమానంగా ఉండటం చేత సోమరాజుగా అయ్యేవాడు. ఇష్టాధికారులు యజ్ఞయాగాది క్రతువులలో పెరుగు, పాలు మొదలైన ద్రవ్యాలు ఉపయోగించడం ప్రత్యక్షంగా కనబడుతున్నాయి. హోమం చేయబడిన ఆజలమే సూక్ష్మమైన ఆహుతులుగా అపూర్వరూపంలో ఉండి, ఆఇష్టాదికారులను ఆశ్రయించడానికి ఉంటాయి. వాళ్ళు మరణించినప్పుడు వాళ్ళ శరీరాన్ని ప్రేత విధానాన్ని అనుసరించి ఋత్విక్కులు "అసౌ స్వర్గాయ లోకాయ స్వాహ " అని హోమం చేస్తారు. తరువాత శ్రద్దాపూర్వకంగా ఆచరించిన కర్మతో సంబంధించిన ఆహుతులైన అప్ లు అపూర్వ రూపంలో ఉండి, ఆజీవులకు ఫలం ఇవ్వడానికి, పరలోకానికి తీసుకొని వెడతాయి. అందుకే జీవులు ఆహుతి మయమైన అప్ లతో కలసి మంచి కర్మ ఫలాన్ని అనుభవించడానికి పయనిస్తారు అని చెప్పడమే సమంజసం.
సూత్రం :- 298
" భాక్తాం వా నాత్మా విత్వా త్త హి దర్శయతి "
అనాత్మ విత్వాత్:- ఆత్మవిదులు కాకపోవడం వలన, ఇష్టా పూర్తాది కామ్యకర్మలు చేయడం వలన, భాక్తాం :- వాళ్ళు దేవతలకు అన్నం అవుతారని గౌణం గా చెప్పారు. తధా హి దర్శయతి :- ఉపనిషత్ వాక్యాలు అంటున్నాయి. అగ్నిహోత్రాది కర్మలు చేయడాన్ని ఇష్టం అంటారు.
భావం:- ఆత్మ విదులు కాకపోవడం వలన, ఇష్టా పూర్తాది అంటే అగ్ని హోత్రాది కర్మలు చేయడం వలన వాళ్ళు దేవతలకు అన్నం అవుతారని గౌణంగా( అప్రధానంగా చెప్పారని ఉపనిషద్వాక్యాలు అంటున్నాయి.
వివరణ:- ఇష్టం అంటే అగ్నిహోత్రాది కర్మలు చెయ్యడం, బావులు, చెరువులు త్రవ్వించడం, విద్యా సంస్థలను నెలకొల్పడం, పేదలకు అన్న వస్త్రాలు (దత్తాలు) సమకూర్చడం, మొదలైన పనులు ఎంతో ఆసక్తితో, శ్రద్ధతో చేసే వాళ్ళు, వాటికీ తగిన ఫలాన్ని ఆయా లోకాలలో అనుభవిస్తారు. వీరు మోక్షానికి అర్హులు కారు. మోక్ష అర్హత ఆత్మవిదులకే. కామ్య కర్మలు చేసే వాళ్ళు, సోమాది లోకాలు చేరి, అక్కడ పుణ్య ఫలం అనుభవించి, మరల మానవ లోకంలో జన్మిస్తారు.
ఛాందోగ్యోపనిషత్తు:-(8,1,6):- అందువల్ల వాళ్ళు దేవతలకు అన్నం అవుతారనీ, దేవతలు వారిని భక్షిస్తారని గౌణం గా (అప్రధానంగా) చెప్పారు. అందుకే మరొక చోట దేవతలు తినరు, త్రాగరు అని స్పష్టంగా చెప్పారు. గౌణం గా చెప్పిన వాటిని ప్రధానంగా స్వీకరించకూడదు. కనుక జీవులు కర్మ ఫలాలను అనుభవించడానికి పర లోకాలకు వెడతారు. ఇష్టాదికారులు దేవతలకు అన్నం అవుతారని, భోగపదార్ధాలు అవుతారని అంటే భోగసాధనాలై వారికి సంతోషం కలిగిస్తారని చెప్పారు.ఇష్టాది కారులు దేవతలకు అన్నం అవుతారని చెప్పడం ప్రధానమైన విషయం కాదు. దేవతలకు అన్నం అవుతున్నారంటే ఉప భోగసాధనాలై సంతోషం కలిగిస్తారు. వీరంతా ఆత్మజ్ఞానం లేని వారు. అందుచేత వీరు దేవతలకు ఆనందాన్ని కలిగిస్తారు. ఎవరైతే నేను వేరు, దేవత వేరు అని భావిస్తాడో, వాడు పశుప్రాయుడు. మానవులకు పశువు భోగ సాధనం. అలాగే ఇతడు కూడా పశువై, దేవతలకు భోగసాధనం అవుతాడు. మానవులు ఫల భోగం కోసం చంద్రలోకానికి సూక్ష్మ భూత పరివేస్థితులై వెడతారు.
సూత్రం :- 299
" కృతాత్య యేనుశయవాన్ దృష్ట స్మృతి భ్యాం యదేతి మనేవం చ "
కృతత్యయే:-పరలోక ప్రాప్తికి సాధనాలైన ఇష్టాది కర్మలు అనుభవించడం వలన, నాశనం చెందిన తరువాత, అనుశయ వాన్ :- సంచితకర్మలతో మరల భూమి మీదకు వస్తాడు. యధా ఏ తం :- ఎలా వెళ్ళాడో, అలాగే, అనేవం చ :- అదే దారిలో మళ్ళీ వస్తాడని, దృష్ట స్మృతి భ్యాం :- శ్రుతి, స్మృతుల వలన తెలుస్తోంది.
భావం :- పరలోక ప్రాప్తికి సాధనాలైన ఇష్టాది కర్మలు అనుభవించిన తరువాత, సంచిత కర్మలతో మళ్ళీ భూమి మీదకు వస్తాడని శ్రుతి, స్మృతుల వలన తెలుస్తోంది.
వివరణ:-జగత్తులోని జీవరాశి అంతా కర్మలు చేస్తాయి. ఆకర్మఫలాన్ని అనుభవించి, స్వర్గం నుండి తిరిగి వచ్చేటప్పుడు, ఎన్నో కోట్ల జన్మల నుంచి వస్తున్న కర్మ శేషం వారిని అంటే ఉంటుంది. ఆ కర్మ శేషమే నూతన జన్మను నిర్ణయిస్తుంది.
ఛాందోగ్యోపనిషత్తు(5,10,5) :- చంద్రలోకాల్లో కర్మఫలం అనుభవించ వలసి నంతకాలం ఉండి, అది అనుభవించిన తరువాత, ముందు చెప్పిన మార్గంలోనే మళ్ళీ తిరిగి వస్తాడు. అలా తిరిగి వచ్చేటప్పుడు సంచిత కర్మ వాసనాలతో పాటు జీవులు తిరిగి వచ్చేస్తారు.(5,10,17):-చంద్రాదిలోకాల నుండి వచ్చే జీవులు పుణ్యకర్మవాసనలు ఉన్నా పక్షంలో ఇక్కడ శోభనమైన శరీరాన్ని ధరిస్తారు. అలాకాక పాప కర్మ వాసనలు ఉంటే పాప యోనుల్లో ప్రవేశిస్తాడు.
సాంఖ్య దర్శనం ( 6, 56 ) :- సంచింత కర్మల వాసన వలన చంద్రాది లోకాలనుంచి తిరిగి వస్తారు.
ఛాందోగ్యోపనిషత్తు:- ప్రవాహణుడు అనే రాజు ఉద్దాలకుడికి పంచాగ్ని విద్య బోధిస్తూ, మహర్షి! మానవుడు నాలుగు భూతాల మిశ్రమస్వరూపుడు. మరణానంతరం ఈనాలుగుభూతాలు, ఆభూతలలో కలసిపోతాయి. మానవుని యోగ్యత అనేది అతడు చేసిన కర్మలమీద ఆధారపడి ఉంటుంది. అతడికి ఆత్మానుభావం కలిగితే దేవయానమార్గంలో ప్రయాణం చేసి మోక్షాన్ని పొందుతాడు. వానికి మరల జన్మ ఉండదు. అలా కాకుండా ఐహిక మైన కోరికలు తీర్చుకోవడానికి జీవిస్తూ పుణ్య కర్మలు ఆచరిస్తూ, జీవితం సాగించే వారు పితృ యాన మార్గం ద్వారా స్వర్గం చేరుతారు. అక్కడ వారు పుణ్యఫలం అనుభవించి మళ్ళీ ఈలోకంలో జన్మిస్తారు. పాపాలు చేసినవాడు అమృతత్వాన్ని, స్వర్గాన్ని పోగొట్టుకొని, నీచమైన జన్మలు ఎత్తుతాడు. సంస్కారవంతులు, సదాచార సంపన్నులు ఉత్తమయోని పొందుతారు. పాపాత్ములు అనేక జన్మలు ఎత్తుతూ, పుడుతూ, శీఘ్రంగా నీచమైన జన్మఎత్తి, చస్తూ ఉంటారు. బ్రాహ్మణుల సొమ్ము దొంగతనం చేసేవారు, మధిరపానం చేసే బ్రాహ్మణుడు, గురుపత్నితో సంగమించేవాడు, బ్రహ్మ హత్య చేసేవాడు, ఈ నలుగురు పతితులు. ఇలాంటి వారితో సహవాసం చేసే వాడు కూడా పతితుడే. ఇంత కన్నా నీచమైన పనులు చేసే వారు క్రిమికీటకాలుగా పుడతారు. గురువర్యా! మానవుడు స్వర్గం పొందటానికి అవసరమైన దాని కన్నా ఎక్కువ కర్మచేస్తాడా? కర్మలో కొంత భాగమే అనుభవిస్తాడా? లేక కర్మ శేషం లేకుండానే తిరిగి వస్తాడా? వివరించండి, అన్నాడు కృష్ణశర్మ. దానికి సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. మానవుడు స్వర్గ సుఖాల కోసం కర్మలు చేస్తాడు. వాటి పుణ్యఫలం అనుభవించిన తరువాత, మిగిలిన కర్మలతో తిరిగి ఈ లోకానికి వస్తున్నాడు. ఈవిషయం శ్రుతులు, స్మృతులుకూడా చెబుతున్నాయి. స్వర్గ సుఖాలు అనుభవించి వచ్చిన సంస్కారవంతులు, సదాచార సంపన్నులు ఉత్తమ యోనులందు జన్మిస్తారు. అంటే బ్రహ్మ, క్షత్రియ, వైశ్య యోనులు పొందుతారు. సంస్కారం లేని వారు కుక్కలు, పందులు, ఛండాలురుగా నీచ యోనులందు జన్మిస్తారు అని ఛాందోగ్యం లో చెప్పబడింది. అంటే స్వర్గంలో కర్మఫలం పూర్తిగా అనుభవించిన తరువాత భూలోకానికి వస్తారు. మానవులు చేసిన కర్మలకు ఫలితం స్వర్గం, నరకంలో అనుభవించి, మళ్ళీ ఆకర్మలను అనుసరించి ఉత్తమ జన్మలు ఎత్తాలి. తిరిగి వచ్చేటప్పుడు ఏ మార్గం గుండా వస్తారు? వెళ్లిన మార్గం ద్వారానా? ఇంకొక మార్గం ద్వారానా? అని సందేహం వస్తుంది. తిరిగి వచ్చేటప్పుడు ఏ మార్గం ద్వారానైనా రావచ్చును. వెళ్లిన మార్గం ద్వారా రావాలనే నియమం ఏమి లేదు.
సూత్రం :- 300
" చరణాదితి చేన్నో పలక్షణార్ధేతి కార్ష్ణాజినిః "
చరణాత్ :- అనుభవించడం వలన, ఇతి చేత్ :- జీవుడు తిరిగి వస్తాడు అనడం, న:- సరి అయినది కాదు. అంటే ఉప లక్షార్ధా ఇతి :- చరణ అనే శబ్దం శేష కర్మలు తెలియజేస్తుంది. అని కార్ష్ణా జినః:- కార్ష్ణాజినీ అనే ఆచార్యుడు అంటున్నాడు.
భావం:- కర్మలు అనుభవించడంవలన జీవుడు తిరిగి వస్తాడు అనడం సరి అయినది కాదు. చరణం అనేది శేషకర్మలు తెలియజేస్తుంది అని కార్ష్ణాజినీ అనే ఆచార్యుడు తెలియజేస్తున్నాడు.
వివరణ:- శ్రుతిలో ఆచరణం, శీలంవలన జన్మ వస్తుందని అంటున్నారు. అలాంటప్పుడు ఇష్టాదికారులు కర్మతో ద్యులోకం నుండి దిగివస్తున్నారని అనడానికి అవకాశం లేదు. అంటున్నాడు. కాని అదినిజం కాదు. ఎందుకంటే ఆచరణమనేది కర్మలోని భాగమే. కార్ష్ణాజినీ అనే మహర్షి ఈసూత్రం చెప్పాడు. చరణం అంటే ఆచరణ అని అర్ధం. అది చంద్రాదిలోకాల్లో మిగిలిన సంచిత కర్మవాసనలను ఎలా బోధిస్తుంది? కనుక కర్మశయాలతో తిరిగి వస్తారనడం సరి అయినది కాదనే వాదనను కార్ష్ణాజినీ అనే ఆచార్యుడు నిరాకరిస్తున్నాడు. ఆ ఆచార్యుడి అభిప్రాయంలో చరణ శబ్దం కర్మాశయానికి ఉప లక్షణం. కనుక అది కర్మాశయమే. జీవాత్మ శేషకర్మ సంస్కారములతో పాటు తిరిగి వస్తాడనడంలో ఎలాంటి వైపరీత్యం లేదు.అనుశయం ఉన్నదని చెప్పే " తధ్య.. చరణా " అణు ఏ శ్రుతి ఉదహరించబడిందో అది చరణం వలనే జన్మ లభిస్తుందని చెప్పుచున్నది గాన అనుశయం వలన కాదు.. చరణం వేరు, అనుశయం వేరు. చరణం చారిత్రం, ఆచారం, శీలం, ఇవన్నీ సమానార్ధాలు, ఫలం అనుభవించిన కర్మ కంటే భిన్నమైన కర్మ అనుశయం అంగీకరించబడినది. ఎలాంటి కర్మ చేస్తాడో, ఏ ఆచారం చేస్తాడో, ఆ విధంగా అవుతాడు. అందువల్ల చరణం వలన జన్మ లభిస్తుంది అని వినబడటం చేత అనుశయం సిద్ధించదు. అన్నట్లయితే ఈదోషం లేదు. జన్మకు కారణం ఆచరణా? కర్మశేషమా? రెండు ఒక్కటే అని చెబుతున్నారు.ఆచరణం, శీలం జన్మలకు కారణం అవుతుంది. ఆచరణ, శీలం, కర్మ పర్యాయ పదాలు. యజ్ఞ యాగాదులు చేసేవారిని మహాత్ములని, కర్మాచరణ చేస్తున్నారని అంటారు. కర్మ, ఆచరణ అనే మాటలకూ భేదం లేదు. మంచి కార్యాలు చేస్తే మంచి కర్మాచరణ అంటారు. కర్మను బట్టి, ఆచరణను బట్టి జన్మ వస్తుంది. ఈకర్మ ఫలం అనుభవించాక ఏ కర్మలు తీసుకు వస్తారో, దానికి అనుగుణంగా జన్మ వస్తుంది. మంచి కర్మలు అయితే మంచి జన్మలు, పాప కర్మలు అయితే నీచ జన్మలు వస్తాయి.
కృత్యాత్యధికరణం ( 3, 1, 10 )
సూత్రం :- 301
" నర్ధక్య మితి చేన్న తదపేక్షత్వాత్ "
ఆనర్ధక్యం:- చరణశబ్దం సూచించే కర్మాశయం వలన జీవుడికి మంచి చెడు శరీరాలు లభించే పక్షంలో చరణ శబ్దానికి సార్ధకత లేదు. ఇతిచేత్ :- అని అనడం, న:- సరి అయినది కాదు. తత్ ఆపేక్షత్వాత్ :- కర్మాశయంలో ఆచరణ అనేది ఆవశ్యకం. అనుశయం :- పుణ్యాపుణ్య కర్మాశయం వల్లనే మంచి చెడు శరీరాలు లభించే పక్షంలో ఆచరణ ఎందుకు?
భావం:-చరణ శబ్దం సూచించే కర్మాశయం వలన జీవుడికి మంచి చెడు శరీరాలు లభించే పక్షంలో చరణశబ్దానికి సార్ధకత లేదు అని అనడం సరి అయినది కాదు. కర్మాశయంలో ఆచరణ ఆవశ్యకమైనది. పుణ్యాపుణ్య కర్మాశయం వలనే మంచి చెడు శరీరాలు లభించే పక్షంలో ఆచరణ ఎందుకు అంటారా? కర్మాశయానికి ఆచరణ లేకుంటే వ్యర్థమే.
వివరణ:-పుణ్యకర్మలే జన్మహేతువులైనప్పుడు ఆచారమనేది అర్ధం లేనిది అని, జన్మకు కారణం కర్మ శేషమని పూర్వపక్షం వారి వాదన. లోకానికి మేలు చేసే యజ్ఞాలు, యాగాలు మొదలైనవి ఆచారవంతులు చేసినప్పుడు మాత్రమే సత్ఫలితాలు ఇస్తాయి. ఆచారం లేకపోతే కర్మ ఫలప్రదం కాదు. ఆచారహీనుడైనవాడిని వేదాలుకాని, వేదోక్తకర్మలుగాని పవిత్రుణ్ణి చెయ్యలేవు. శిష్టాచార సాంప్రదాయలు పాటించేవారు, గురుస్మరణ చేస్తూ, గురువు చెప్పినట్లు చెయ్యడం, సాంప్రదాయ కర్మలు ఆచరించేటప్పుడు ఆచారం ఉండాలి. ఆచారాన్ని ఆపేక్షించాలి. కర్మ ఆచరణతో కూడిఉంటుంది. సదాచార సంపన్నులు ఆచరంతో కూడి పూజలు, వ్రతాలు, దానధర్మాలు, యజ్ఞాలు, యాగాలు ఏమి చేసినా, శ్రద్ధ చాలా అవసరం. స్నానాదులవలె ఆచారంకూడా పురుషార్ధం అనగా పురుషుని సంస్కారంకొరకే అనిఅంగీకరించాలి. ఇష్టాదికర్మ సముదాయ ఫలాన్ని ఆరంభిస్తున్నప్పుడు దానికి ఆధారమైనా ఆచారం కొంత అతిశయం పుట్టిస్తుంది. కర్మయే సర్వార్ధాలను సాధిస్తుంది. అని శ్రుతిలో చెప్పబడింది అని కారష్ణాజిని మతం. కర్మ ఉండగా శీలం వలన యోని కలగడం యుక్తం కాదు. పాదాలతో పరుగెత్తినవాడు, మోకాళ్ళతో పాకడం తగదుకదా! మనుస్మృతి(1-109) ఆచారయుక్తమైన కర్మాశయమే శోభనా శోభనమైన శరీరప్రాప్తికి హేతువు. సదాశయంతో, ఆచార సాంప్రదాయాలతో, కర్మలను ఆచరిస్తే మంచి జన్మకు హేతువు అవుతుంది. మానవుని ఉత్తమ జన్మకు కర్మలే కారణం కాని ఆచారం, శీలం కారణం కావు.
సూత్రం :- 302
" సుకృత దుష్కృతే ఏ వేతి తు బాదరిః "
సుకృతదుష్కృతఏవ:- చరణ శబ్దం ముఖ్యంగా పుణ్యపాపాల్ని సూచిస్తుంది. ఇత తు బాదరిః :- అని బాదరి ఆచార్యుడి మతం.
భావం :- చరణ శబ్దం ముఖ్యంగా పాప పుణ్యాలను సూచిస్తుందని బాదరి ఆచార్యుడి మతం.
వివరణ:- చరణం అనే పదానికి ఆచారం, అనుష్టానం, కర్మ అని అర్ధం. అయితే చరణ అనే పదానికి కొంత మంది ఆచారం అని అర్ధం చెప్పినప్పటికీ ఆచారమనేది కర్మలోనిభాగమే. చరణం అంటే కర్మఅనే అర్ధం చెప్పాలి. కాబట్టి చరణంఅంటే పాపపుణ్యాలే అని బాదరి మహర్షి అభిప్రాయం. అందుచేత స్వర్గ సుఖాలు అనుభవించిన వ్యక్తికి తిరిగి వచ్చేటప్పుడు కర్మశేషంతో వస్తాడు. చరణం అంటే ఆచారం అనే అర్ధం ఎలా ఉందో, అలాగే పుణ్యపాపకర్మలు అనే అర్ధం కూడా ఉంది. దీని వలన జీవుడు సంచిత కర్మాశయాలతో కూడా తిరిగి వస్తాడు అని చెప్పడంలో సందేహం లేదు. చరణం, ఆచారం, అనుష్టానం, కర్మ అన్నీ ఒకే అర్ధం వచ్చే పదాలే. ఆచారం కూడా ధర్మంలో ఒక విశేషమే. ఇష్టాది విహిత కర్మలు చేసేవారు, కర్మాచరణ చక్కని ఆచరంతో యజ్ఞ యాగాది క్రతువులు, దాన ధర్మాలవంటి సత్కార్యాలు చేస్తూ, ధర్మాన్ని ఆచరిస్తే, వారికీ స్వర్గ లోక ప్రాప్తి లభిస్తుంది. అక్కడ స్వర్గ సుఖాలు అనుభవించిన తరువాత కర్మ శేషంతో తిరిగి భూలోకంలో మరల జన్మిస్తారు. పుణ్య కర్మలు చెయ్యని వాళ్ళు చంద్రలోకం వెడతారా? అనేది తరువాత సూత్రంలో చెప్పబడింది.
అనిష్టాది కార్యాధికరణం ( 3, 1, 12 )
సూత్రం :- 303
" అనిష్టాది కారిణా మపి చ శ్రుతమ్ "
అనిష్టాదికారిణాం అపిచ:-ఇష్టా పూర్తాద విహితకర్మలు చెయ్యనివాళ్ళు కూడా, శ్రుతం:- చంద్రలోకానికి వెడతారని ఉపనిషద్వాక్యాల వలన వింటున్నాం.
భావం:- ఇష్టా పూర్తాది విహిత కర్మలు చెయ్యని వాళ్ళు కూడా చంద్రలోకానికి వెడ తారని ఉపనిషద్వాక్యం వలన తెలుస్తోంది.
వివరణ - గురువర్యా! ఇష్టా పూర్తది కర్మలు చేసిన వారు చంద్రలోకానికి వెడతారు. మరి ఇష్టాపూర్తములు అనబడే కర్మలు చెయ్యని వాళ్ళకి చంద్రలోకప్రాప్తి ఉన్నదా? అని అడిగాడు కృష్ణ శర్మ. డానికి సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. యజ్ఞయాగాది క్రతువులు చేసిన వారే కాదు, నిషిద్దకర్మలు చేసిన వారు కూడా చంద్రలోకానికి వెడతారు.
కౌషీతకి బ్రాహ్మణం(1,2):-ఈలోకంలో మరణించిన వాళ్ళు అందరూ చంద్రలోకానికి వెడతారు. "ఈవాక్యాన్ని బట్టి ఇష్టాది పుణ్యకర్మలు ఆచరించిన వాళ్ళే కాక, అవిహితకర్మలు చేసే వాళ్ళు కూడా చంద్రలోకానికి వెడతారు." అని చెప్పబడింది. మరల పుట్టవలసిన వాళ్లకి చంద్రుణ్ణి చేరితే తప్ప దేహారంభం కుదరదు. అందుచేత అందరు చంద్రమండలం వెడతారు ఇష్టాధికారులకు, ఇతరులకు కూడా ఒకే విధమైన గతి ఉండటం యుక్తం కదా! అన్నట్లయితే అది సరి కాదు. ఇతరులకు చంద్రలోకంలో భోగం ఉండదు. పుణ్య కర్మలు, పాప కర్మలు చేసిన వాళ్ళు అందరు చంద్రలోకం చేరతారని పూర్వ పక్ష వాదన. శ్రుతి లో "సర్వే" అనే పదం ఉంది కదా! అందరికీ అంటే పుణ్య కార్యాలు చేసిన అందరికీ అని అర్ధం. పాపాత్ములు కూడా అప్పుడప్పుడు పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు. పాప, పుణ్యాలలో ఏది తక్కువగా ఉంటే అది ముందుగా అనుభవిస్తారు. పుణ్యం తక్కువైతే ముందుగా స్వర్గలోకం, పాపం తక్కువగా ఉంటే ముందుగా నరకలోకం వెడతారు. చేసిన పుణ్య కర్మల వలన స్వర్గంలో భోగాలు అనుభవించి, పుణ్యం ఖర్చు అయిపోగానే భూలోకంలో మరల జన్మిస్తారు. అన్నీ పాప కర్మలు చేసిన వాళ్లకి స్వర్గలోక ప్రాప్తి ఉండదు. పాపాత్ములు కూడా కొన్ని సార్లు యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించడం, దాన ధర్మాలు చెయ్యడంలాంటి సత్కార్యాలు చేస్తూఉంటారు. అందుకే వారు చంద్రలోకం చేరి, అక్కడ సుఖాలు అనుభవిస్తుంటారు. పాప పుణ్యాలు తక్కువ, ఎక్కువ గురించి వ్యాస మహర్షి మహా భారతం లో స్వర్గారోహణ పర్వంలో వివరిస్తాడు. కురుక్షేత్ర యుద్ధం తరువాత ధర్మరాజు 37 సం. రాజ్యాన్ని పరిపాలించిన తరువాత పరీక్షిత్తుకి పట్టాభిషేకం చేశాడు. మహాప్రస్థానంలో భాగంగా, 25 సం. భూప్రదక్షిణ చేసి, హిమాలయాలకు వచ్చేసరికి ముందుగా ద్రౌపది నిర్యాణం చెందుతుంది. ఆతరువాత నకుల సహదేవులు, అర్జునుడు, భీముడు, పడిపోతారు. చివరగా ధర్మరాజు స్వర్గానికి చేరతాడు. అక్కడ దుర్యోధనుడు పెద్ద సింహాసనం మీద కూర్చుని సకల భోగాలు అనుభవిస్తూడటం చూసి, ఆశ్చర్యపోయాడు. అతను అన్నీ పాపాలే చేశాడు, ఆస్తిలో వాటా ఇవ్వకుండా అనేక రకాలుగా హింస పెట్టి చoపాలని ప్రయత్నించాడు. అలాంటి వాడు స్వర్గానికి ఎలా వచ్చాడు అనుకున్నాడట. దుర్యోధనుడు అన్నీ పాపలే చేసినా, జీవిత చరమాంకంలో యుద్ధంలో వీరమరణం పొందటం వలన, ఆ పుణ్యంవలన స్వర్గలోకప్రాప్తి వచ్చింది. ధర్మరాజు కురుక్షేత్రయుద్ధంలో 'అశ్వత్ధామహతః కుంజరః" అని అబద్ధం చెప్పినందుకు ఒకసారి నరకాన్ని చూసి, ఆతరువాత స్వర్గానికి వచ్చాడు. చేసిన కర్మ పుణ్యమైన, పాపమైన తప్పనిసరిగా అనుభవించి తీరాలి. పాపత్ములు కూడా కొన్ని పుణ్య కార్యాలు చేస్తేనే చంద్ర లోక ప్రాప్తి లభిస్తుంది.
సూత్రం :- 304
" సంయమనే త్వనుభూ యేతరేషా మారోహావరోహౌ తద్గతి దర్శనాత్ "
తు:- ది ఇలా ఉండగా, సంయమనే :- మార్గమధ్యంలో, ఇతరేషాం :- పుణ్య కర్మలు చెయ్యని వారు, అనుభూయ:- రకరకాల యాతనలు అనుభవిస్తూ, ఆరోహ అవరోహౌ :- ఎక్కుతూ, దిగుతూ అనుభవిస్తూ ఉంటారని, తద్గతి దర్శనాత్ :- శాస్త్రల్లో వాళ్ళ ప్రయాణం వర్ణించారు.
భావం:- పుణ్యకర్మలు చెయ్యని వాళ్ళు మార్గ మధ్యంలో రకరకాల యాతనలు అనుభవిస్తుంటారనీ, శాస్త్రాల్లో వాళ్ళ ప్రయాణం గురించి వర్ణించారు.
వివరణ:- ఇష్టాపూర్తకర్మలు చెయ్యనివాళ్ళు యమలోకానికి పోయి, కష్టాలు అనుభవించి తిరిగి ఈలోకంలో జన్మిస్తారు. వారికి చంద్రలోక ప్రాప్తి లేదు. పుణ్యకార్యాలు చేసిన వారు మాత్రమే చంద్రలోక ప్రాప్తికి అర్హులు. పాపులకు అక్కడ స్థానం లేదు.
కఠోపనిషత్తు:-యముడు నచకేతుడితో చెబుతాడు "వేదాలలో చెప్పిన పాపకర్మలు వదలి పెట్టని వాళ్ళు, ఇంద్రియ లోలుడు, ఏకాగ్రత లేని వాడు, మనశ్శాంతి లేనివాడు, బ్రహ్మ జ్ఞానాన్ని పొందలేడు. బాలుడికి, డబ్బు మీద వ్యామోహం కలవాడికి, మూఢునుకి, పరలోక సాధనాలు లేవు. వారంతా నావశం అవుతారు. అంటే పాపాలు చేసిన వారు యమలోకానికి పోతారు. చంద్రలోకం భోగం కోసమే కాని ఏ ప్రయోజనం లేకుండా కాదు. కేవలం దిగి రావడం కోసమే కాదు. ఒకడు పుష్ప, ఫలాదులు తీసుకోవడం కోసం వృక్షం ఎక్కుతాడు. కాని ఏ ప్రయోజనం లేకుండా ఎక్కడు. కేవలం అక్కడ నుంచి పడటానికి ఎక్కడు. అట్లే ఇక్కడ కూడా ఇష్టాదులు చెయ్యని వాళ్లకు చంద్రలోకంలో భోగం లేదని చెప్పబడింది. వాళ్లయితే సంయమనంలో అనగా యమలోకంలో ప్రవేశించి తమ పాపాలకు తగిన యమ యాతనలు అనుభవించి మరల ఈ లోకానికి వస్తారు. ధనమోహం చేత మూఢుడై పొరబాటు పడుతుంటే తెలివి తక్కువతనానికి పరలోకానికి సుఖంగా వెళ్లే ఉపాయం తోచదు.
కఠోపనిషత్తు:- ఐశ్వర్యబలంతోటి, అజ్ఞానంతో, అధికారం చేసేవారికి చంద్రలోకంలో అర్హత లేదు. పోయిన తరువాత మనం చూశామా? మమ్మల్ని ఎవరూ ఏమి చెయ్యలేరు, శాస్త్రాలు మాకు తెలుసును అని అహంకారంతో వితండ వాదన చేసేవాళ్ళు, దేవుడు ఉన్నాడా? నరకలోకం ఉందా? అని నాస్తిక వాదాన్ని సమర్ధించే వాళ్ళకు, పరోపకారం గురించి తెలియని వాళ్లకు, నరకలోక ప్రాప్తి తప్పక సిద్ధిస్తుంది. చేసిన పాపాలకు శిక్ష అనుభవించిన తరువాత, మరల భూమి మీద జంతువులుగా, క్రిమికీటకాలుగా, ఛండాలురుగా జన్మిస్తారు. నరకానికి, భూమికి మధ్యలో తిరుగుతూ, జన్మలు ఎత్తుతూనే ఉంటారు. నవ్వుతు చేసిన కార్యాలు ఏడుస్తూ అనుభవిస్తారు. ఎవరికీ తెలియకుండా, అంటే మూడవ కంటికి తెలియకుండా పాపాలు చేస్తున్నాం కదా! అని అనుకుంటే పొరబాటే. చేసిన ప్రతిపాపాన్ని చిత్రగుప్తుడు వ్రాస్తూ, లెక్క కడుతూనే ఉంటాడు. చేస్తున్న పాపపుణ్యలను విచక్షణా జ్ఞానంతో అలోచించి, సత్కర్మలు ఆచరిస్తేనే స్వర్గ లోకప్రాప్తి లభిస్తుంది. సత్కర్మలు చెయ్యని వాళ్ళు మార్గమధ్యంలోనే అనేక యాతనలు అనుభవించి, ఎగుడు దిగుడు మార్గాలలో ఊర్డలోకానికి వెడతారు. అక్కడ కర్మ ఫలం అనుభవించి, మళ్ళీ తిరిగి వస్తారు. ఈ వేదనలు యజ్ఞయాగాది క్రతువులు చేసిన వాళ్లకు ఉండవు.
సూత్రం :- 305
" స్మరంతి చ "
చ :- కాగా, స్మరంతి :- మాంసాహార, సురాపాన, పరస్త్రీ సంగమాలు చేసే వాళ్ళకు ఈ యాతనలు కలుగుతాయని శాస్త్రాలు అంటున్నాయి.
భావం:- మాంసాహారం, సురాపానం చేసే వాళ్లకు, పరస్త్రీలతో సంగమించే వాళ్లకు నరకయాతలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
వివరణ:-వ్యాసుడు,మనువు మొదలైన వారు పాప కర్మలు చేస్తే యమలోకానికి వెళ్లి శిక్షలు అనుభవిస్తారని చెబుతున్నారు.
కఠోపనిషత్తు(2,6):- ధనమోహంతో మూఢుడై, సూరాపానాది కర్మలు చేస్తూ, మధ్యమాంసాది స్త్రీ జనం తప్ప మరొక లోకం లేదనుకునే వాళ్లకు ఉత్తమ లోకాలు లభించవు. పైగా వీళ్ళు మార్గమధ్యంలో అనేక వేదనకు గురి అవుతారు. దుష్ట కర్మలు ఆచరించే వారు యమునికి వశమై పోతారని, ఆయన చేతులలో శిక్ష అనుభవిస్తారని, నచికేతోపాఖ్యానం లో చెప్పబడింది. పరాశరుడు, యాజ్ఞవల్కుడు, వ్యాసుడు వారి స్మృతులలో పాపాలు చేసిన వారు, నిషిద్ద కర్మలు ఆచరించే వారు, యమలోకంలో తగిన శిక్ష విధిస్తారని చెప్పబడింది. శ్రుతులు, స్మృతులు కూడా ఇదే విషయాన్ని వ్యాఖ్యనించాయి.
సూత్రం :- 306
" అపి చ సప్త "
అపి చ :- బాగా పరిశీలిస్తే ఈ వేదనలు, యాతనలు, అనుభవించే స్థలం, సప్త :- సప్త ఋషులుండే చోటు, యమలోకం, నరక లోకం.
భావం :- జీవుడు చేసిన పాప కర్మలకు శిక్ష అనుభవించే స్థలం యమలోకం. నరకలోకం.
వివరణ :-సప్తఋషులు ఉండే చోటు, సప్త ఋషులు అంటే సప్తప్రాణాలు అని అర్ధం. రౌరవాది నరకాలు ఏడు ఉన్నాయని అక్కడ పాపులకు శిక్షలు విధిస్తారని చెప్పబడింది. గురువుగారు! రౌరవాదినరకాల్లో చిత్రగుప్తుడు మొదలైనవారు ఉన్నారని, వారే పాపులకు శిక్ష వేస్తారని, ఉన్నది కదా! మరి యముడే పాపఫలాన్ని అనుభవింప జేస్తాడని ఎలా చెప్పగలరు? అని సందేహం వెలిబుచ్చాడు నారాయణభట్టు. సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. రౌరవం మొదలైన ఏడు నరకాలు పాపఫలాన్ని అనుభవించ వలసిన లోకాలుగా పౌరాణికుల చేత చెప్పబడ్డాయి. ఇష్ట కార్యాలు చెయ్యని వారు ఆ నరకాలకు వెడతారు.
శతపధబ్రాహ్మణం (6,1,1,1):- ప్రాణావా ఋషయః " ప్రాణాలే ఋషులు ". శరీరంలో ఉండే ప్రాణాలే ఋషులు.
యజర్వేదం ( 34, 55 ) :- చక్షురాది ఇంద్రియాలు శరీరంలో ఆయా స్థానాలలో ఉండి, సదా ఈ శరీరాన్ని రక్షిస్తాయి. జీవాత్మ నిద్రిస్తున్నప్పుడు ఇంద్రియాలు, అతనితో బాటు హృదయాకాశంలో ఉన్నప్పుడు ప్రాణ, అపానాలు రెండు పనిచేస్తుంటాయి. జీవాత్మ హృదయప్రవేశంలో ఈశ్వరుడు ఉండి, జీవుడికి హితాహిత జ్ఞానం కలిగిస్తూ ఉంటాడు. ఆయన ప్రేరణను గ్రహించలేని మూఢులు నిషిద్దకర్మలు ఆచరించి ఈలోకంలోనే యాతనాలకు గురి అవుతారు. మరణించేటప్పుడు కూడా వాళ్లకు సుఖం ఉండదు. అలా వేదనలను ఈశరీరంలోనే అనుభవించి పిదప పరలోకానికి వెడతారు. కనుక యమలోకం, నరకలోకం ఎక్కడో లేవు. ఈశరీరమే యాతనల నిలయం. నరక లోకాలు అంటే రౌరవాది నరకాలు ముఖ్యంగా ఏడు అని చెప్పబడ్డాయి. ఇక్కడ యమధర్మరాజు సర్వాధికారి. చిత్రగుప్తుడు జీవులు చేసిన పాపాలను లెక్కించి, వాటికీ తగిన శిక్షలు వేస్తాడు. వాటిని యముడు అమలుపరుస్తాడు. ప్రతి నరకలోకానికి ఒక అధికారి ఉంటాడు. అతడు పాపులను శిక్షిస్తాడు .
1.రౌరవ :- అన్నింటి కన్నా తక్కువ శిక్ష ఇక్కడ వేస్తారు. ఇతరుల పట్ల ఎక్కువగా అసూయ ,ద్వేషాలు చెందేవారిని క్రూరమైన పాముల వంటి రూపాలు వారిని హింసిస్తాయి.
2.మహారౌరవ:- ఇతరుల ఆస్తులను అన్యాయంగా స్వాదీనం చేసుకున్న పాపులను విషపూరితమైన పాములు హింసిస్తాయి.
3.వహ్నిజ్వాలా:- వేటగాళ్లు, గొర్రెల కాపరులు ఇక్కడ శిక్షింప బడతారు.
4.వైతరిణి - ఈ నది భూమికి, నరకానికి మధ్యలో ఉంటుంది. ఇది చీము, నెత్తురు, రక్తం, గోర్లు, ఎముకలతో నిండి ఉంటుంది. జీవుడి సూక్ష్మ శరీరం ఈ నది నుండి దాటేటప్పుడు ఆ నీటిలోని జీవులు అతని మాంసాన్ని తినేస్తూ ఉంటాయి.
5.కుంభీపాక:- జంతువులను, పక్షులను సజీవంగా ఉడికించే వ్యక్తిని ఇక్కడ, మరుగుతున్న నూనెలో వేసి ఉడికించి, శిక్షిస్తారు.
6.అసిపత్రవన:- అడవిలో చెట్లఆకులు కత్తులవలె ఉంటాయి. జీవుడి సూక్ష్మశరీరాన్ని ఆ ఆకుల మధ్యలో నుండి యమదూతలు లాగుతూ ఉంటారు.
7.అంధకూప:- ఇతరులకు, కీటకాలకు హాని కలిగించే వ్యక్తిని ఇక్కడ శిక్షిస్తారు.
యమధర్మరాజు నచికేతోపాఖ్యానంలో పాపాత్ములు మళ్ళీమళ్ళీ తన దగ్గరకు వస్తుంటారనీ, వారిని శిక్షిస్తాడని శ్రుతిలో చెప్పబడింది కదా! మరి అధికారులు శిక్షిస్తారని ఎలా చెప్పారు అని పూర్వపక్షం వారి సందేహం. యమధర్మరాజు అన్ని లోకాలకు సర్వధికారి. మిగిలిన అధికారులు చిత్రగుప్తుడు విధించిన శిక్షలు అమలుజేస్తూ, యమధర్మరాజుకు లోబడి పనిచేస్తుంటారు. జీవుడికి లౌకికంగా శరీరం ఉంటుంది కనుక బాధ తెలుస్తుంది. కాని యమలోకంలో శరీరం ఉండదు కనుక మనస్సు తోనే ఆ బాధలు అనుభవిస్తాడు. జీవుడికి కలలో బాధలు, కష్టాలు, ప్రమాదాలు, ఎన్నో వస్తుంటాయి. శరీరం మీద ఎటువంటి గాయాలు ఉండవు. అయినా ఆ బాధలన్నీ అనుభవిస్తాడు. అంటే మనస్సు బాధపడుతుంటుంది. అదే విధంగా యమలోకంలో ఒక్కొక్క శిక్ష కొన్ని లక్షల సం. అనుభవించిన తరువాత, మరల భూమి మీద జన్మించ వలసి వస్తుంది.
సూత్రం :- 307
" తత్రాపి చ తత్ వ్యాపారాత్ అవిరోధః "
తత్రా పి చ:- చంద్రాదిలోకాల్లోనూ, తత్ వ్యాపారత్ :- విశ్వనియంత అయిన ఈశ్వరుడి కార్య కలాపాలు కొనసాగుతాయి. అవిరోధః :- ఏ సందేహానికి తావు లేదు.
భావం :- చంద్రాది లోకాలలో ఈశ్వరుడి కార్యకలాపాలు కొనసాగుతాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు.
వివరణ:- భగవంతుడు హృదస్థుడంటారు. ఆయన ఈ శరీరంలో వుండి విశ్వాన్ని ఎలా నియమిస్తాడు. ఒక చోట ఉండే వ్యక్తి మరొకచోట నియమించే సమర్ధుడు కాలేడు కదా! ఈ సందేహం నివృత్తి చెయ్యడానికే వ్యాసుడు ఈసూత్రాన్ని చెప్పాడు. ఆయన జీవుడిలా పరిచ్చినుడు, అణుప్రమాణుడు ఉన్నవాడు కాదు. ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు. ఈ కారణం వలన అన్ని లోకాలలో ఉంటూ జీవులకు కర్మ ఫలాలు ప్రసాదిస్తాడు.
యజర్వేదం(40-5):- "తదంతరస్య సర్వస్య, తదుసర్వస్యాస్య బాహ్యతః " ఇలాంటి మంత్రాల్లో భగవంతుడు సర్వ వ్యాపకుడని, జగత్తు లోపలా వెలుపలా నిండి ఉన్నాడని వర్ణించారు. కాబట్టి ఈశ్వరుడి జగన్ నియంత్రత్వానికి ఎలాంటి అడ్డంకి లేదు.
కఠోపనిషత్తు:- ఈ నరకాలన్నింటికి యముడే అధిపతి. యముడు కర్మఫలం వల్ల లభించేది అనిత్యం, ఆత్మనిత్యం అని తెలిసి కూడా అగ్నిచయనం చేశాడని, ఫలితంగా మృత్యుదేవత అయ్యాడు. కాబట్టి యముడే మృత్యుదేవత నరకాలకు అధిపతి. చిత్రగుప్తాదులందరూ యమునిచే నియోగింపబడి, ఆయనకు వశులై ఉంటారు. చిత్రగుప్తుడు ఫలానా సమయంలో, ఫలానా పాపం చేశాడు అని ఖచ్చితంగా వ్రాసిన దానిలో ఎలాంటి పొరబాటు ఉండదు. రౌరవాది నరక లోకాలలో పాపాత్ములు శిక్షలు అనుభవించిన తరువాత, భూలోకంలో నీచ జన్మలైనా శునకం, సూకరం, క్రిమినల్ కీట కాదులు, ఛండాలురుగా జన్మిస్తారు. యముడికి గాని, చిత్ర గుప్తునికి, ఇతర అధికారులెవరికి శరీరాలు ఉండవు. అందరు సూక్ష్మ దేహాలతో ఉంటారు. జీవుడు కూడా సూక్ష్మ దేహంతోనే శిక్షలు అనుభవిస్తాడు.
సూత్రం :- 308
" విద్యా కర్మణోః ఇతి తు ప్రకృతత్వాత్ "
విద్యా :- ఉపాసన, కర్మ ణోః :- యజ్ఞ యాగాది కర్మల వలన, తు :- మాత్రమే, ఇత :- దేవయానం లో బ్రహ్మ గమనము, పితృ యానం లో చంద్రలోక గమనం, కలుగుతాయని, ప్రకృతత్వాత్ :- ఛాందోగ్యం లో వివరించారు.
భావం :- యజ్ఞయాగాది కర్మల వలన మాత్రమే దేవయానంలో బ్రహ్మలోక గమనం, పితృయానంలో చంద్రలోక గమనం కలుగుతాయాని చాందోగ్య ప్రకరణం లో తెలియజేశారు.
వివరణ:-వేదాలలో దేవయాన, పితృయాన మార్గాలు రెండు చెప్పబడ్డాయి. ఉపాసాన చేసేవారు దేవయాన మార్గం, సత్కర్మలు చేసే వారు పితృయాన మార్గం లో ప్రయాణం చేస్తారు. సంస్కారవంతులు, సదాచార సంపన్నులు, ఉత్తమ యోని పొందుతారు. సంస్కారహీనులు నీచ జన్మలు పొంది, మూడవ మార్గమైన జననమరణ మార్గంలో ప్రయాణిస్తారు. వీరికి చంద్రలోకానికి వెళ్లే అర్హత ఉండదు. ఉపాసనాదులను ఆచరించేవారు దేవయాన మార్గంలో బ్రహ్మలోకాన్ని, ఇష్టాపూర్తాది కర్మలు చేసేవారు పితృ యాన మార్గంలో చంద్రలోకం చేరతారనిచెప్పబడింది.
చాందోగ్యోపనిషత్తు :- ( 5, 10, 1):- విద్యావంతులైన ఉపాసకులు దేవయానంలో క్రమ క్రమంగా బ్రహ్మాన్ని పొందుతారు. ఇష్టా పూర్తాది కర్మల్ని ఆచరించే వారు పితృయానం లో చంద్రాది లోకాల్ని చేరి అక్కడ కర్మ ఫలాన్ని అనుభవిస్తారు. ఇకపోతే ఈ రెండు మార్గాలను విడిచి క్షుద్ర కర్మలు ఆచరించే వారు మాటి మాటికీ ఇక్కడే పుట్టి మరణిస్తారు. చంద్ర లోక ప్రాప్తి ఉండదు. (5,10,8):-అరణ్యంలో శ్రద్ధ, తపస్సులతో ఉపాసనచెయ్యకుండా గ్రామంలో యజ్ఞయాగాదులు చెయ్యకుండా సురాపానాదులు చేసే వాళ్ళు దేవయాన, పితృయాన మార్గాలలో కాక, మూడో మార్గన్ని అనుసరిస్తారు. జనన మరణాలే ఈ మూడో మార్గం.
కౌషీతకీ బ్రాహ్మణం ( 1, 2):- పుణ్య కర్మలు చేసే వాళ్ళు చంద్రలోక గమనం చేసి కర్మ ఫలం అనుభవించి తిరిగి వస్తారు. విద్యాకర్మలు అంటే ప్రకృతమైనవి. అందువలన దేవయాన, పితృ యాన మార్గాలను పొందడానికి విద్యాకర్మలు ప్రకృత మైనవి. విద్యఅనే సాధనంతో దేవయాన మార్గంలో వెళ్ళడానికి ఎవరికీ అధికారం లేదో, కర్మ అనే సాధనంతో పితృ యాన మార్గంలో వెళ్ళడానికి ఎవరికీ అధికారం లేదో మాటి మాటికీ తిరుగుతూ ఉండే క్షుద్ర జంతు రూపమైన మూడవ మార్గం లభిస్తుంది. మరణించిన వారంతా చంద్రలోకం చేరుకుంటే వీళ్ళతో ఆ లోకం నిండిపోయేది కదా! అనే ప్రశ్నకు విరుద్ధమైన సమాధానం ఇచ్చారు. వారు వెళ్లడం యుక్తం కాదు. వెళ్లి, తిరిగిరావడం అనేది శ్రుతిలో కూడా లేదు.
సూత్రం :- 309
" న తృతీయే తదో ప లబ్ది "
తృతీయే:- మూడోమార్గంలో ( దేవయాన, పితృయాన మార్గాలు కాక ) నడిచే వాళ్లకు, న :- దేహాంతరం మొదలు పెట్టడానికి ఆహుతుల సంఖ్య పట్ల ఏ నియమం లేదు. తధా ఉప లబ్ది :- తెలుస్తోంది.
భావం :- మూడో మార్గం లో ప్రయాణం చేసే వాళ్లకు దేహాంతరం మొదలు పెట్టడానికి ఆహుతుల సంఖ్య పట్ల నియమం లేదని తెలుస్తోంది.
వివరణ:- దేవయాన, పితృయాన మార్గాలు విడిచి జనన మరణ రూపమైన మూడో మార్గాన్ని అనుసరించే వాళ్లకు శరీర ఆరంభం కోసం పంచాహుతి నియమం లేదు. అంటే చంద్రలోక గమనం లేదు. నూతన దేహం పొందడానికి ఐదు ఆహుతులు పూర్తి కావాలని ఛాందోగ్యోపనిషత్తులో ప్రవహణుడు పంచాగ్ని విద్యలో చెప్పాడు. కాని మూడో మార్గంలో వెళ్లే వాళ్లకు ఆ నియమం లేదు. అది లేకుండా మరొక జన్మ కలుగుతుంది. విద్యా కర్మలు ఆచరించిన వారందరు చంద్రలోకానికి వెళ్లరు. ఆ లోకం ఎందుచేత జీవుల చేత నింపబడలేదో శ్రుతిలో పంచాగ్ని విద్యలో చెప్పబడింది. దేవయాన, పితృయానమార్గాలలో కాక మూడో మార్గంలో జననానికి, మరణానికి మధ్యలోనే ప్రయాణించే వారికీ పంచమాహుతులు ఆచరింప వలసిన అవసరం లేదు. మనుష్య శరీరానికి మాత్రమే ఆహుతుల సంఖ్య హేతువుగా చెప్పబడింది. పురుగులు, మిడతలు,క్రిమి కీటకాలు మొదలైన వాటికీ హేతువుగా చెప్పలేదు. ఎందుకంటే పురుష శబ్దం మనుష్య జాతిని చెబుతుంది. మరియు పంచమాహుతిలో ఉదకానికి పురుష వాచకమే చెప్పబడింది. భూమి మీద పుట్టిన వారంతా అలా చంద్ర లోకం నుంచీ వచ్చిన వారే కదా! వారు పాపాత్ములు కారని కదా! అని సందేహం ఉంది. పుణ్యం చేసిన వారంతా చంద్రలోకం వెడతారు. పాపాత్ములు కూడా సత్కార్యాలు యజ్ఞయాగాదులు చేస్తే స్వర్గ లోకం చేరి, అక్కడ భోగాలు అనుభవించి, కర్మ శేషంతో తిరిగి భూమి మీద జన్మిస్తారు. పూర్తిగా పాప కర్మలు చేసిన వారు మాత్రం మూడో మార్గంలో ప్రయాణిస్తారు కాని స్వర్గ లోకం ప్రవేశించరు.
సూత్రం :- 310
" స్మర్యతే పి చ లోకే "
చ:- ఇంతే కాక, లోకే :-దర్శన శాస్త్రలలో, అపి :-కూడా, స్మర్యతే:- ఆహుతి నియమం లేకుండానే శరీర ఉత్పత్తి జరుగుతుందని అన్నారు.
భావం :- ఆహుతి నియమం లేకుండా శరీర ఉత్పత్తి జరుగుతుందని దర్శన శాస్త్రలలో చెప్పి ఉన్నారు.
వివరణ:- లోకంలో చెప్పబడుచున్నది కూడా! అయోనిజులకు అంటే స్త్రీ పురుష సంయోగం లేకుండానే జన్మించే వారికీ ఈ నియమం లేదు. పురాణాలలో చెప్పిన సీత, ద్రౌపది, ద్రోణచార్యులు, దృష్టద్యుమనుడు, మొదలైన వారు ఈ కోవకు చెందిన వారే! అలాగే క్రిమి కీటకాలకు కూడా సంఖ్యా నియమం లేదు.
వైషేషికదర్శనం :- ( 4, 2, 11 ) :- అయోనిజ శరీరాలు ఉన్నాయి. అయోనిజ శరీరారంభం కొరకు కనీసం స్త్రీ పురుష రూపంలో రెండు ఆహుతులు అవసరం కూడా లేదు. అలాంటప్పుడు పంచమాహుతి నియమం ఉండదు కదా! వారిలో ద్రోణాదులకు స్త్రీ విషయమైన ఒక ఆహుతి లేదు. దృష్టద్యుమ్నునకు స్త్రీ పురుష నియామకలైన రెండు ఆహుతులు కూడా లేవు. వాళ్ళ విషయంలో ఏవిధంగా ఆహుతి సంఖ్యా నియమం లేదో ఇతరుల విషయంలో అలాగే కావచ్చును. కొంగ కూడా రేతః సేకరణ లేకుండా గర్భం ధరిస్తుందని లోక ప్రసిద్ధి. లోకాలలో ఆహుతి నియమం లేదని స్మృతి చెబుతోంది. స్త్రీ పురుష సంయోగం లేకుండా అలాంటి వారికీ జన్మ వస్తుందని ఇతిహాసలు, పురాణాలలో చెప్పబడింది. కృపాచార్యుడు, కృపి, దృష్ట ద్యుమ్నుడు, ద్రౌపది, సీత వీరు అయోనిజులుగా జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ద్రోణాచార్యుని తండ్రి భరద్వాజ మహర్షి ఒకరోజు గంగా నదిలో స్నానం చేస్తుండగా అప్సర అనే యువతీని చూసి మోహితుడై నియంత్రణ కోల్పోయాడు. హఠాత్తుగా వీర్యస్కలనం జరగడం, దానిని ఒక కుండలో భద్రపరచి ఆశ్రమానికి తీసుకు వచ్చారు. దాని నుండి పుట్టిన వాడే ద్రోణచార్యులు. కుండ నుండి పుట్టిన వాడు కనుక కుంభ సంభవుడు అని పేరు వచ్చింది. కృపాచార్యులు తండ్రి వీర్యం కలుపు మొక్కలపై పడటం, వాటి నుండి కృపుడు, కృపి జన్మించారు. వారిని శంతనుడు రాజ భవనానికి తీసుకు వెళ్లి పెంచుకున్నాడు. దృష్టద్యుమ్నుడు, ద్రౌపది హోమకుండం నుంచి పుట్టిన వారే. సీత అయోనిజగానే వ్యవసాయ క్షేత్రంలో దొరకడం, జనక మహారాజు ఆమెను పెంచి, శ్రీరామునికిచ్చి కళ్యాణం జరిపించాడు.
సూత్రం :- 311
" దర్శనాత్ చ "
చ :- అంతే కాక, స్త్రీ పురుష సంబంధం లేకుండానే, అనేక జీవులకు శరీరం ఏర్పడుతుందని, దర్శనాత్ :- శాస్త్రాల్లో వర్ణించారు.
భావం :- స్త్రీ, పురుష సంబంధం లేకుండానే అనేక జీవులకు శరీరాలు ఏర్పడుతున్నాయని శాస్త్రాల్లో వర్ణించారు.
వివరణ :- ఆహుతి సంఖ్యా నియమం లేకుండా, స్త్రీ, పురుష సంబంధం లేకుండా, కొన్ని జీవులకు శరీరం ఏర్పడటం లోకంలో చూడబడుతున్నాయి. అంతే కాక జరాయుజాలు, అండజాలు, స్వేదజాలు,ఉద్భిజాలు మొదలైన వాటికి పంచమాహుతి నియమం లేదు.
ఐతరేయ బ్రాహ్మణం ( 3, 3 ) :- జరాయుజాలు, అండజాలు, స్వేదజాలు, ఉద్భిజాలు లాంటివి ఎన్నో ఉత్పత్తి అవుతున్నాయి. అందువలన అందరి శరీరారంభం కోసం పంచమాహుతి నియమం లేదు. అందుకే అందరు చంద్రలోక గమనం చేయరు. నాలుగు విధాలైన ప్రాణి సముదాయాలు ఉన్నాయి.
1. అండజములు :- గ్రుడ్డు నుండి పుట్టినవి. పక్షి, చేప, పాము, తొండ .
2. జరాయుజాలు :- శరీరం నుండి పుట్టినవి.ఉదా :-ఏక కణ జీవి అమీబా.
3.ఉద్భిజములు:- విత్తనం నుంచి పుట్టినవి. విత్తనములు భూమిలో పడినప్పుడు అవి నీటితో తడిసి, భూమిని చీలుకొని మొక్క పైకి వస్తుంది.
4. స్వేదజములు :- చెమట నుండి, మురికి నుంచి పుట్టినవి. నల్లులు,దోమలు. దోమలు, సూక్ష్మ జీవులు మురికి నీటిలోనే పుడతాయి.
వీటి విషయంలో స్త్రీ పురుష సంగమం లేకుండానే పుట్టడం కనబడుతుంది. కనుక ఆహుతి సంఖ్యను పట్టించుకోవలసిన పని లేదు. కొన్ని ఇతర ప్రాణుల విషయంలో కూడా అలాగే ఉండవచ్చును.
అనిష్ఠాది కార్యధికరణం :- ( 3, 1, 21 )
సూత్రం :- 312
" త్రుతీయ శబ్దావరోధః సంశోక జస్య "
సంశోక జస్య :- చెమట వల్ల జనించే ప్రాణి వర్గాన్ని, తృతీయ శబ్ద అవరోధః :- మూడోదైన ఉద్భిజాలలో చేర్చారు.
భావం :- చెమట వలన జనించే ప్రాణి వర్గాన్ని మూడోదైనా ఉద్భిజాలలో చేర్చారని సూత్రానికి అర్ధం.
వివరణ :- జరాయుజాలు, అండజాలు, స్వేదజాలు అని లోకంలో నాలుగు రకాలైన ప్రాణాలున్నాయి.
ఛాందోగ్యోపనిషత్తు ( 6, 3,1) :- అండం నుంచి పుట్టేవి, జరాయువు నుంచి వెలువడేవి, భూమిని పెకలించుకొని బయట పడేవి అని మూడు విధాలే వర్ణించారు కదా! ఈ వైరుధ్యం ఎందుకు? ఈ స్వేదజాన్ని ఉద్భిజం లోనే గ్రహించాలి. ఉద్భిజం అంటే భూమిని ఛేదించుకొని పుట్టేది. స్వేదజం జలాన్ని ఛేదించుకొని పుట్టడమనేవి ఏ రెండింటికి సమానమే. కాబట్టి ఇష్టా పూర్త కర్మలు చెయ్యని వారికి చంద్రలోక ప్రాప్తి లేదు. పూర్వ పక్షి సందేహం -ఛాందోగ్యంలో అండజం, జీవజం , ఉద్భిజం మూడు మాత్రమే వివరించ బడ్డాయి కదా! మరి స్వేదజం గురించి ఎందుకు చెప్పారు? స్వేదజానికి మూడవ దైన ఉద్భిజ శబ్దం చేత గ్రహణం అని అర్ధం. ఉద్భిజం చేత స్వేదజాల ఉపసంగ్రహం చేయబడినట్లు గ్రహించాలి. స్వేదజం, ఉద్భిజం రెండింటిలోనూ ఉద్భిజం భూమిని చీల్చుకొని పైకి వస్తుంది. రెండవదైన స్వేదజం జలాన్ని చీల్చుకొని బయటకు వస్తుంది. స్వేదజం, ఉద్భిజం రెండు ఒక్కటే కనుక దానిని ఉద్భిజం గానీ గ్రహించాలి.ఈ విధంగా ఉద్భిజత్వం రెండింటికి సమానమే, రెండు వేరు వేరుగా చెప్పబడిన విరోధం లేదు.
సాభావ్యాపత్త్యధికరణం ( 3, 1, 22)
సూత్రం :- 313
" సాభా వ్యా పత్తి రుప పత్తేః "
సాభావ్య ఆ పత్తిః :- ఆకాశం లాంటి తత్త్వాల సాదృశ్యం తో తిరిగి వస్తారని, ఉప పత్తేః :- ఉపనిషత్తు వలన సిద్ధిస్తోంది.
భావం :- కర్మ ఫల భోగం కోసం చంద్రాది లోకాలకు వెళ్లిన జీవులు స్వర్గ సుఖాలు అనుభవించిన తరువాత ఆకాశం, వాయువు మొదలైన తత్వాలా సాదృశ్యం తో తిరిగి భూమి మీదకు వస్తారు.
వివరణ :- గురువు గారు! ఇష్టా పూర్తి కర్మలు ఆచరించే వారు చంద్రలోకాన్ని పొందుతారని,అక్కడ భోగాలు అనుభవించి తిరిగి భూలోకానికి తిరిగి వస్తారని చెప్పబడింది. వీరు చంద్రలోకం నుంచి వెళ్లిపోతున్నననే దుఃఖంతో వెళ్లిన మార్గం గుండానే తిరిగి వస్తారు. ఆకాశాన్ని, ఆకాశం నుండి వాయువును, వాయువు నుండి ధూమమై, ఆ ధూమం అభ్రకమై, అభ్రం మేఘమై వర్షిస్తుంది. ఇలా తిరిగి వచ్చేవాడు ఆకాశం, వాయువు, ధూమం, అభ్రం, మేఘం అవుతాడని చెప్పబడింది. నిజంగా ఆకాశం గా మారిపోతాడా? లేక ఆయా భావాలను పొందుతాడా? వివరించండి అన్నాడు కృష్ణ శర్మ. సమాధానం చెబుతున్నాడు రత్నాకారుడు. ఎవరికైనా సరే ఒకరి పోలికను పొందగలరే కాని ఆ రూపాన్ని పొందలేరు. చంద్రలోకంలో భోగాలు అనుభవించి, భూలోకంలో మరల జన్మించాలనే దుఃఖంతో ఆకాశంతో సాదృశ్యం ఏర్పడి, ఆకాశంతో సంబంధం పెట్టుకుంటాడు. అదే విధంగా వాయువుతో, ధూమంతో, అభ్రం తో ( నీళ్లు ఉన్న మేఘం ), వర్షించే మేఘంతో సంబంధం కలిగి, సాదృశ్యం ఏర్పడి, అటు ఇటు కదులుతూ, వర్షపు బిందువును ఆశ్రయించి భూమి మీదకు వస్తాడు. వర్షంగా భూమి మీదకు దిగి, వ్రీహియ (ధాన్యం, గోధుమలు, యవలు, పప్పు దినుసులు )వాది రూపుడుగా అవుతాడు. ఇక్కడ దిగుతున్న వాళ్ళు ఆకాశం, వాయువు, ధూమం, మొదలైన వాటి రూపం పొందు తారా? లేక వాటితో సమత్వం పొందు తారా?అనేది సందేహం. పాలు పెరుగుగా మారినట్లు గానే, జీవుడి సూక్ష్మ శరీరం వాటి స్వరూపాన్ని పొందుతాడు అని చెప్పడమే యుక్తం. కాని లక్షణాలను స్వీకరించి సాదృశ్యాన్ని పొందుతాడని చెప్పడం యుక్తం కాదు.
ఛాందోగ్యోపనిషత్తు ( 5, 10, 5 ) :- ఇష్టాది కర్మలు చేసిన వాళ్ళు చంద్రాది లోకాలకు వెళ్లిన మార్గాన్ని అనుసరించే తిరిగి వస్తారు. ఆకాశం నుండి వాయువు, మేఘం వర్షం లాంటి వాటి సాదృశ్యాన్ని పొందుతూ, భూమిని చేరి పంటలు, ధాన్యం మూలంగా మొదటి పురుష శరీరాన్ని చేరి తరువాత వీర్యం ద్వారా స్త్రీ గర్భన్ని చేరి మళ్ళీ పుడతాడు. ఒక వస్తువు ఇంకొక వస్తువుగా మారడం ఉపపన్నం కాదు. అది ఆకాశ స్వరూపంగా మారిపోతే తరువాత కర్మ ఫలం అనుభవించడానికి సూక్ష్మ శరీరం ఉండదు కదా! ఆ తరువాత వాయువు, ధూమం మొదలైన వాటితో క్రమంగా దిగడం కుదరదు. కనుక ఆకాశాది భావం పొందినట్లుగా భావించాలి.
నాతి చిరాధికరణం ( 3, 1, 23 )
సూత్రం :- 314
" నాతి చరేణ విశేషాత్ "
విశేషాత్ :- జీవులకు ఆకాశాదుల సాదృశ్యం, న అతి చరేణ :- ఎంతో కాలం ఉండదు.
భావం :- ఛాందోగ్యంలో చెప్పినట్లుగా అంతరిక్షం నుండి భూమి మీదకు చేరే జీవులకు ఆకాశదులతో సామ్యం కలగడానికి, వాటి నుంచి విడివడడానికి చాలా కాలం పట్టదు. కొద్దికాలం లోనే భూమికి చేరతారు.
వివరణ :- చంద్ర లోకం నుంచి వచ్చే జీవి యాతనా శరీరంతో దాన్య రూపం పొందడానికి పూర్వం సాదృశ్యంతో ఎంత కాలం ఉంటాడు అని అడిగాడు నారాయణ భట్టు. సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు.
ఛాందోగ్యోపనిషత్తు :- (5, 10, 6) :- వ్రీహ్యాది సమరూపాన్ని పొంది రేతస్సు ద్వారా స్త్రీ గర్భాన్ని చేరి, జనించడంలో కొంత కాలం పడుతుంది. ( 5, 10, 10 ):- జీవులు వ్రీహ్యాది రూపమైన వడ్లు, యవలు, ఓషధులు, వనస్పతులు, నువ్వులు, మినుగులుగా జనిస్తారు. వీళ్లకు వ్రీహ్యాది ధర్మాలుంటాయా? జీవుడు సూక్ష్మ శరీరంతో శీ ఘ్రంగా మేఘాది సాదృశ్యాన్ని పొందుతాడు. ఆకాశం, వాయువు, ధూమం, మేఘం లో సాదృశ్యం పొంది, వ్రీహ్యాది సామ్యాన్ని పొంది, అతి తక్కువ కాలంలోనే వర్షరూపంలో భూమికి వస్తాడు. అవరోహణ క్రమంలో ఆలస్యం ఉండదు. త్వరలోనే జరుగుతుంది. శాస్త్రం ఏది లేకపోవడం వలన సుదీర్ఘ కాలమని, అల్ప కాలమని, నియమం లేదు. జీవుడు కొంత కాలమే ఆకాశాది భావంతో ఉండి, వర్షధారలతో కూడా ఈ భూమి మీద పడతారు. అలా వ్రీహ్యాది భావం నుండి బయటకు రావడం చాలా కష్టం. కాలం అల్పం కనుక బయటకు రావడం దుఃఖమైనది. ఆ అవధిలోనే శరీరం నిష్పన్నం కాలేదు కనుక సుఖ భోగం కాని దుఃఖ భోగం గాని ఉండదు. అందువలన వ్రీహ్యాది భావం పొందడానికి ముందు అవరోహణ అల్ప కాలంలోనే జరుగుతుంది.
అన్యాధిష్ఠితాధికరణం ( 3, 1, 24 )
సూత్రం :- 315
" అన్యాధిష్ఠి తేషు పూర్వ వదభిలాపాత్ "
అన్య అధిష్ఠి తేషు :- అన్య జీవులకు, వ్రీహ్యాదులకు భోజ్య, భోక్తృ భావ సంబంధం ఉండటం వలన చంద్రలోకం నుంచి వచ్చే జీవులు, పూర్వవత్ అభిలాపాత్ :- ఆకాశాదుల్లగా వ్రీహ్యాది సాదృశ్యాన్ని పొందు తారు.
భావం :- భోజ్య, భోక్తృ భావ సంబంధాన్ని అధిష్టానం అంటారు. వ్రీహ్యాదులు, భోజ్యాలు తినే వాళ్ళు భోక్తలు. అన్య జీవులకు, వ్రీహ్యాదులకు భోజ్య, భోక్తృ భావ సంబంధం ఉండటం వలన చంద్రలోకం నుంచి వచ్చే జీవులు ఆకాశదుల్లగా, వ్రీహ్యాదుల్లగా జన్మిస్తారు.
వివరణ :- గురువు గారు! చంద్రలోకం నుంచి దిగి వచ్చే వారు వర్ష రూపంలో నేల మీదకు వచ్చిన తరువాత ధాన్యం, యవలు, ఓషధులు, నువ్వులు, మినుగులు మొదలైన రూపాల్లో జన్మిస్తారు అని చెబుతున్నారు కదా! మరి ఇష్టాపూర్త కర్మలు చేసి, చంద్రలోక సుఖాలు అనుభవించి, తిరిగి వచ్చేవారు కూడా పాపాత్ములులాగా ఇలాంటి రూపాలు పొంద వలసిందేనా? అని అడిగాడు కృష్ణ శర్మ. సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. యజ్ఞ యాగాలు మొదలైన సత్కర్మలు చేసిన పుణ్యాత్ములు మరణానంతరం చంద్రలోకంలో భోగాలు అనుభవించి, తిరిగి భూమి మీద ధాన్యాలుగా జన్మిస్తారు. పాపత్ములు వృక్షాలుగా, పశుపక్ష్యాదులుగా, క్రిమికీట కాలుగా జన్మిస్తారు. పుణ్యాత్ములు వర్షం రూపంలో భూమి మీద పడి, ధాన్యపు గింజలతో కలసినప్పుడు వారికీ కర్మ ఫల భోగమనేది ఉండదు. వీరు ఆకాశ వాయు రూపల్లో ఉన్నప్పుడు ఏ రకంగా కర్మ ఫల భోగం లేదో ఇప్పుడు అంతే. కాబట్టి ధాన్యం దంచడం, ఉడికించడం, చెట్లు నరకడం, వలన వచ్చే బాధలు వీరికి ఉండవు. త్రోవలో వీటితో కొంతసేపు కలసి ఉండి, తరువాత జన్మకై వెళ్ళిపోతారు. కాబట్టి కర్మ శేషం గలవారికి ధాన్యపు గింజలు భోగాపురం స్థానాలు కావు. పొలంలో చెట్టుని గొడ్డలితో నరికి నప్పుడు దానిపై ఉన్న పక్షులు ఎగిరిపోతాయి. వాటికి ఏ దెబ్బలు తగలవు. చెట్టుకే అన్నీ దెబ్బలు తగులుతాయి. అదే విధంగా పాపాత్ములు చెట్లుగా పుట్టి, బాధలన్నీ అనుభవిస్తారు. పుణ్యాత్ములు పక్షుల వలె చెట్లను ఆశ్రయించుకొని మాత్రమే ఉంటారు. వారికీ మూల బాధలు ఏవి ఉండవు.
సూత్రం :- 316
" అశుద్ధ మితి చేన్న శబ్దాత్ "
జీవులు వ్రీ హ్యాది సాధర్మ్యం పొందుతారని అంటున్నారు. వ్రీహ్యాదులు దంచి బియ్యంగా చేసినప్పుడు, వంట చేసినప్పుడు, వ్రీహ్యాదులతో బాటు జీవులు కూడా హింసకు లోనవుతారు కదా! కనుక అశుద్ధ :- అశుద్ధం అయి తినడానికి యోగ్యం కాదు కదా! ఇతి చేత్ :- అని అనడం, న :- సరి అయినది కాదు. ఎందుకంటే శబ్దాత్ :- వ్రీహ్యాలు భోజ్యమనే వేదాలు చెబుతున్నాయి.
భావం :- వ్రీహ్యదులు దంచి బియ్యంగా చేసినప్పుడు, వాటితోబాటు జీవులు కూడా హింసకు గురి అవుతారు. కనుక అవి తినడానికి యోగ్యం కాదు అని అనడం సరిఅయినది కాదు. వ్రీహ్యాలు భోజ్యమనే వేదాలు చెబుతున్నాయి.
వివరణ :- యజ్ఞ కర్మలు పరిశుద్ధమైనవి కావు అని అనకూడదు. వేదం విధిరూపంలో చేస్తున్న హింస ధర్మమనే చెబుతున్నది. ధర్మాదర్మాల నిర్ణయం శాస్త్రాల వలన జరుగుతోంది. ఏ ప్రాణి ని హింసించకూడదు. దేవతల ప్రీతీ కోసం పశువును సంహరించాలి. ఇది దేశ కాల మాన పరిస్థితులను బట్టి ఒకప్పటి ధర్మం. అందుచేత యజ్ఞ యాగాదులలో జరిగే హింస అశుద్ధమైనది కాదు.
అధర్వ వేదం ( 4, 2, 7, 3 ) :- " రస మోషధీనామ్ " వ్రీహ్యాదులు మానవులకు భోజ్యాలని తెలుస్తోంది. వేదహిత భోజనం హింసాయుతము, దుష్టము కానేరదు. వ్రీహ్యాదుల సమభావం జీవులకు స్త్రీ గర్భంలో చేరడానికి ఉపయుక్తం. దంచడం, వండటం వలన దుఃఖం కలుగదు. ఇంద్రియాల వలెనే జీవుల శరీరాలకు సుఖ దుఃఖాలు కలుగుతాయి. వ్రీహ్యాదులు అలాంటి శరీరాలు కావు. అవి స్త్రీ గర్భంలో చేరడానికి సాధనలు. వాటి వల్ల హింస కలుగదు. కనుక తండుల భోజనం దుష్టం, అశుద్ధం కాదు. కొందరు ఇక్కడ యజ్ఞలలో పశుహింస ప్రసక్తి వచ్చి, శాస్త్రీయ హింస దోషం కాదని సమర్ధించారు. వాస్తవానికి ఈ సూత్రంలో యజ్ఞ ప్రసక్తి లేదు. ధర్మా ధర్మా నిర్ణయం చెయ్యడానికి ప్రమాణం శాస్త్రమే కదా! ఎందుకంటే ఇవి ఇంద్రియలకు గోచరించనివి. అంతే కాదు. దేశ కాల నిమిత్తాలు కలవి. ఏ దేశంలో, ఏ కాలంలో, ఏ నిమిత్తాన్ని పునస్కరించుకొని ఏ ధర్మం అనుష్టింపబడిందో, మరొక దేశంలో మరొక కాలంలో మరొక నిమిత్తం అధర్మం అవుతుంది. అందుచేత శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి. శాస్త్రం లేకుండా ధర్మా ధర్మలను గురించిన విజ్ఞానం ఎవరికీ లేదు.
సూత్రం :- 317
" రేతః సిగ్యో గోధ "
అధ :- వ్రీహ్యాది సాభావ్యం ఏర్పడిన తరువాత, రేతః సిగ్ యోగః :- రేతస్సు విడుదల చేసే కర్తతో సంబంధం కలుగుతుంది.
భావం :- చంద్రలోకం నుంచి తిరిగి వచ్చిన కర్మాశయంతో కూడా జీవులు వ్రీహి, యవాదుల గుండా రేతస్సును విడుదల చేసే కర్తతో సంబంధం కలుగుతుంది.
వివరణ :- వ్రీహ్యాది భావం పొంది, రేతస్సును విడిచి పెట్టే పురుషుని యొక్క భావం కలుగుతుంది. అంటే కర్మశేషం తో చంద్రలోకం నుంచి వచ్చేవారు ధాన్యభావం తరువాత రేతస్సును విడుదల చేసే యువకుల భావం పొందుతారు. అందువలన జీవులు వ్రీహ్యాదులతో సంబంధం పొందడమే తప్ప ఆయా ధాన్యాలుగా పుట్టడం లేదు అని తెలుస్తోంది. ఎవడెవడు అన్నం తిన్నాడో, ఎవరైతే రేతః సేకం చేస్తాడో, అతడు రేతః సిక్కుగానే అవుతాడు అని చెప్పబడుతోంది. అయితే ఇక్కడ ముఖ్యమైన రేతః సిగ్భావం రేతః సేచకుడవడం కుదరదు. చాలా కాలం క్రితం పుట్టి యవ్వనం పొందిన వాడే రేతః సిక్ అవుతాడు కదా! శృతి వాక్యం ప్రకారం వ్రీహ్యావ్యన్నం తిని ఎవడైతే రేతః సేకం చేస్తాడో వాడు అనుశయ అవుతాడు. అనుశయ రేతః సేకం చేసేవాడు అవడం అసంభవం. అన్నాన్ని తిన్న ప్రతి వ్యక్తి రేతస్సును విడుదల చెయ్యలేడు. రేతః సేకం చెయ్యాలంటే వాడు జన్మించి యవ్వనం పొందాలి. అందుచేత ఇక్కడ రేతః సేకం చేసేవాడు వ్రీహ్యాదులతో సంబంధం పెట్టుకుంటాడు.
సూత్రం :- 318
" యోనేః శరీరం "
యోనేః :- స్త్రీ యోనిని చేరి, శరీరం :- క్రమంగా శరీరాన్ని పొందు తున్నాడు.
భావం :- ఇలా వ్రీహి, యవాదుల మూలంగా పురుషుని శరీరాన్ని చేరిన జీవుడు ఆ పురుషుడి ద్వారా ఋతుకాలంలో రేతస్సుతో బాటు స్త్రీ యోనిని చేరి, క్రమంగా శరీరాన్ని పొందుతున్నాడు.
వివరణ :- వ్రీహ్యాదులైన ధాన్యం, గోధుమలు, వనస్పతులు, మొదలైన వాటిని పురుషుడు తినడడం వలన అతనిలో వీర్యం తయారవుతుంది. చంద్రలోకం నుండి కర్మ ఫల శేషంతో తిరిగి వచ్చే జీవుడు పురుషునిలో వీర్యంగా మారడు. వీర్యంలో అనేక శుక్ర కణాలున్నప్పటికీ జీవుడు ఒక్క శుక్ర కణాన్ని మాత్రమే ఆశ్రయిస్తాడు. స్త్రీ పురుష సంయోగంతో పురుషునిలోని జీవుడు ఆశ్రయించిన శుక్ర కణం స్త్రీ యోనిలో ప్రవేశించి, అక్కడ అండాశయంలో సంయోగం చెంది, తొమ్మిది నెలలు గర్భంలో పెరిగి, శిశువుగా మారతాడు. అప్పుడే కర్మ ఫలం అనుభవించడానికి శరీరధారణ జరుగుతుంది. కొంత మంది దంపతులు సంతానం కలగలేదని బాధ పడటం, వారికి పిల్లలు లేరని కొంతమంది అవహేళన చెయ్యడం జరుగుతుంటుంది. ప్రారబ్ద కర్మ లేకపోతే పిల్లలు కలగరని గ్రహించాలి. ఏ జీవుడు ఏ యోనిలో ప్రవేశించాలో పరమాత్మయే నిర్ణయిస్తాడు. ఛాందోగ్యంలో సంస్కారవంతులు, సదాచార సంపన్నులు ఉత్తమయోని పొందు తారు. అంటే బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, యోనులు పొందు తారు. సంస్కారహీనులు కుక్కలు, పందులు ఛండాలురుగా జన్మిస్తారు. ఇంకా పాపాత్ములు క్రిమి కీటకాలుగా జన్మిస్తారు అని చెప్పబడింది. కాబట్టి కర్మ శేషంతో భూమిని చేరే జీవికి ధాన్యపు గింజలతో సంబంధం మాత్రమే ఉంటుంది.
సూత్రం :- 319
" సంధ్యే సృష్టి రాహ హి "
మొదటి పాదంలో జీవుడి పరలోక గమనం, ఆగమనం గురించి వివరించారు. ఈ పాదంలో విరక్తుడైన పురుషుడికి ఈశ్వరుడి విషయంలో కలిగే భక్తిని నిరూపిస్తున్నారు. భక్తి అనేది ఉపాసనకు అంగం. మంచి విషయాల మీదకు మనస్సు నిలవక, చిత్తంలోని అన్నయత్తం కావడాన్ని విక్షేపం అంటారు. విక్షేపం అంటే మాలిన్యం. దానిని నిర్మూలించి ఉపాసన చెయ్యడం ద్వారా బ్రహ్మ సాక్షాత్కారానికి సుగమం అవుతుంది. జీవాత్మ కన్నా విలక్షనుడు, అపూర్వం, మహిమాన్వితుడైనా భగవంతుని అంగీకరించని వాడు ఎంత విరక్తుడైనా భక్తి యుక్తుడు కాలేడు. జీవుడుకి ఉన్న అవస్థా భేదాన్ని వ్యాసుల వారు ఇక్కడ నిరూపిస్తున్నారు. ఈశ్వరుడికి అలాంటి అవస్థ భేదాలు లేవని కూడా నిరూపిస్తున్నారు. జాగ్రదావస్థ విడిచి,స్వప్నవస్థ గురించి వివరిస్తున్నారు. స్వప్నావస్థలో జీవుని స్థితిని వివరిస్తున్నారు.
సంధ్యే :- స్వప్నంలో, సృష్టిహి :- సృష్టి కలుగుతుంది. హి :- ఎందుకంటే, ఆహ :- ఉపనిషత్తు వాక్యాలు చెబుతున్నాయి.
భావం :- స్వప్నవస్థ లో సృష్టి కలుగుతుందని ఉపనిషత్ వాక్యాలు చెబుతున్నాయి.
వివరణ :- కర్మ ఫలమే జీవుడి సుఖ దుఃఖలకు, జనన మరణాలకు కారణం. వాటి యందు విరక్తి కలిగి, పరమాత్మ యందు భక్తి జ్ఞానం కలగాలని ఈ పాదంలో వివరిస్తున్నారు.
బృహదారణ్యకోపనిషత్తు :- ( 4, 3, 9 ) అతడు నిద్రించిన చోట అని మొదలుపెట్టి, స్వప్నంలో రధాలు గాని, గుర్రాలు గాని, మార్గాలు కాని ఉండవు. కాని వాటిని సృష్టిస్తాడు అని వర్ణించారు. అందువల్ల జీవుడు జాగ్రదావస్థలో రధాదులను సృష్టించ్చేటట్లు, స్వప్నంలో కూడా సృష్టిస్తాడా? లేక రధాదులకు సంబంధించిన విపరీత జ్ఞానం కలుగుతుందా. స్వప్నంలో జీవుడు రధాదులను సృష్టిస్తాడని బృహరణ్యకం లో చెప్పబడింది. సంధ్య అంటే స్వప్నం. జాగ్రత్, సుషుప్తిలకు మధ్య స్థానం. స్వప్నంలో ఉంటూ మిగిలిన రెండు చూస్తాడు. ఆత్మ పురుషుడు సమస్త లోకాలలోని అనుభవాలను తీసుకొని స్తూల శరీరాన్ని వదలి, స్వప్న శరీరంలో ప్రవేశించి, ఆత్మ జ్యోతి స్వరూపంతో స్వప్నం చూస్తాడు. ఈ స్థితిని స్వప్న దృష్ట అయిన పురుషుడు తైజసుడు అని పిలువబడతాడు.
బృహధారణ్యాకోపనిషత్తు :- స్వప్నావస్థలో రధాలు, వాటికీ కట్టే గుర్రాలు, అవి నడిచే మార్గాలు ఏవి ఉండవు. అన్నింటిని స్వప్న పురుషుడే రచించుచుకుంటాడు. అప్పుడు ఆనందం, ప్రమోదం, మోదం ఏమి ఉండవు. అయినా వాటిని తానే కల్పించుకుంటాడు. స్వప్నంలో ఈ స్థితి యదార్ధమా? లేక మిద్యా అనేది సందేహం.కర్మ ఫలమే జన్మకు కారణమని తెలుసుకొని, జనన మరణ చక్రం నుండి బయటపడి, వైరాగ్యం కలిగి, జన్మ రాహిత్యం కోసం పరమాత్మ గురించి తెలుసుకొని, ఆత్మ జ్ఞానం పొందడం ద్వారా మోక్షాన్ని సాధించవచ్చును. నేను జీవుణ్ణి అనుకోవడం అజ్ఞానమే, జీవాత్మ పరమాత్మ ఒక్కటే అని ఎవరు తెలుసుకోగలరో వారికే మోక్ష ప్రాప్తి కలుగుతుంది. జాగ్రదావస్థ, స్వప్నవస్థ, సుషుప్తి అవస్థల గురించి ఎందుకు తెలుసుకోవాలి? ఈ మూడు అవస్థలలో జీవుడు ఎలా ఉన్నాడో తెలుసుకోవాలి. జాగ్రదావస్థలో జీవుడు లౌకిక ప్రపంచంతో తాదాత్మ్యం చెంది, అదే శాశ్వతమని, విషయ వాసనతో సుఖ దుఃఖాలను అనుభవిస్తుంటాడు. స్వప్నావస్థలో ఎన్నో దృశ్యాలు చూస్తుంటాడు. తెల్లవారగానే అవన్నీ మిధ్యే నని తెలుసుకుంటాడు. ఆధ్యాత్మిక చింతన ఉన్నవాడికి జాగ్రదావస్థ కూడా మిధ్యే నని, చివరకు ఈ ప్రపంచమే అశాశ్వత మని మిధ్య అనీ, పరమాత్మయే సత్యమనే జ్ఞానం కలుగుతుంది . స్వప్నవస్థ కు సంధ్య అని పేరు. స్వప్నంలో పురుషుడే అన్నీ కల్పించుకొని ఆనందం పొందుతాడు. అవన్నీ మిధ్యే. జాగ్రదావస్థలో అజ్ఞానం వలన చూస్తున్నవన్నీ నిజమే అనుకుంటాడు. ఆత్మజ్ఞానం కలిగినవాడికి అంత మిధ్యే నని, అహం బ్రహ్మాస్మి అనుకుంటాడు.
సూత్రం :- 320
" నిర్మాతారమ్ చైకే పుత్రాదయశ్చ "
చ :- అంతే కాక, ఏ కే :- కఠ శాఖను అధ్యయనం చేసే కొందరు, నిర్మాతారం :- పురుషుణ్ణి స్వప్నంలో పదార్ధాలన్నీ నిర్మించే వాడుగా భావిస్తారు. పుత్రాదయః :- పైగా నిర్మించే పదార్ధాలను సంతానం అని తలపోస్తారు.
భావం :- కఠ శాఖను అధ్యయనం చేసే కొందరు పురుషుడే స్వప్నంలోని పదార్ధాలను నిర్మిస్తాడని, ఆ పదార్ధలే సంతానం అని తెలియజేశారు.
వివరణ :- కొంతమంది స్వప్న పదార్ధాలను నిర్మించేవాడు పరమేశ్వరుడే అంటారు. అతను నిర్మించే కామ విషయాలు పుత్రాదులు, ఇంద్రియాలన్ని నిద్రించిన తరువాత పురుషుడు తాను కోరిన పదార్ధాలను సృష్టిస్తూ మేల్కొంటాడు. అందుకే అతనిని కామ నిర్మాత్తగా చెబుతారు.
కఠోపనిషత్తు ( 5, 8 ) :- "య ఏష సుప్తేషు జాగ్రర్తి కామం కామం పురుషో నిర్మిమాణః " ఇంద్రియాలు నిద్రిస్తున్నప్పుడు పురుషుడు కామాలను నిర్మిస్తాడు. దీనిని బట్టి జీవుడు స్వప్నావస్థలో పదార్ధాలను నిర్మిస్తాడని తెలుస్తోంది. ఇక్కడ కామం అంటే కోరిక. పదార్ధ రచన. కామ్య పదార్ధ నిర్మాణం. ( 1, 14 ) :- కామానం త్వా కామభాజం కరోమి " కామించాల్సిన పుత్రాది పదార్ధాలు నిన్ను కోరుకునేలా చేస్తాయి. ఇక్కడ కామపదం పుత్రాది కామ్య పదార్ధాలకు వాచకంగా వాడారు. కాబట్టి జీవుడు స్వప్నంలో రధాది వస్తువులను సృష్టిస్తాడని చెప్పడమే యుక్తం అని పూర్వ పక్ష వాదన. "కామానం కరోమి " యముడు నచకేతునితో వంద సంవత్సరాల ఆయువు గల పుత్రులను, పౌత్రులను, కోరుకో, రాజ్యం కోరుకో, భోగభాగ్యలు కోరుకో. భూలోకంలో ఏమి దొరుకుతాయో అవన్నీ కోరుకో అని అంటాడు. ఇక్కడ కామ అంటే పుత్రుడు అనే అర్ధం కాబట్టి స్వప్నంలో పుత్రాదులను సృష్టించేది పరమాత్మ. జాగ్రదావస్థ లో వలె స్వప్నవస్థ లో కూడా అతడే సృష్టి కర్త. అందుచేతనే ఈ స్వప్న జగత్తు కూడా సత్యమైనదే అని వారి వాదన. పరమేశ్వరుడు సృష్టించిన జాగ్రదావస్థకు సంబంధించి సృష్టి సత్యమైనదిగా కనబడుతున్నది గాన స్వప్నాశ్రయమైన సృష్టి కూడా సత్యమవడానికి తగి యున్నది. జాగ్రదావస్థలో ఏమేమి చూస్తాడో నిదరించి కూడా వాటినే చూస్తాడు అని శ్రుతి స్వప్న జాగరిత స్థానాలు సమానరూపాలని చెప్పుచున్నది.
సూత్రం :- 321
"మాయా మాత్రం తు కార్త్స్న్యేనా నభి వ్యక్త స్వరూపత్వాత్ "
మాయ అంటే ప్రజ్ఞానం, మాయా మాత్రం :- విపర్యయ జ్ఞానం, మిధ్యా జ్ఞానం, కారేత్ స్న్యే నా అంటే పదార్ధ నిర్మాణానికి కావలసిన దేశకాల నిమిత్తలు అన్నీ, కార్త్స్యేన వానభివక్త స్వరూపాత్ :- దేశ కాలాది సమస్త కారణ పదార్ధాలు లేకుండా కార్యం ఉత్పత్తి కానందువలన.
భావం :- పదార్ధ నిర్మాణానికి కావలసిన దేశ కాల నిమిత్తాలు లేకుండా కార్యం ఉత్పత్తి కానందు వలన స్వప్నంలో కలిగేది పదార్ధాల విపర్యయ జ్ఞానమే గాని మరొకటి కాదు.
వివరణ :- స్వప్నసృష్టి అనేది కేవలం మాయా మాత్రమైనదే. పూర్తిగా అభివ్యక్తం కాని స్వరూపం కలది. అది దేశ కాలాది సమస్త ధర్మాలతో కనిపించదు. స్వప్నసృష్టికి రూపం లేదు. అది యదార్ధం కాదు. అది కలగనే వాడికి మాత్రమే కనిపిస్తుంది. ఇతరులకు కనిపించదు. అంతా మిధ్యే. స్వప్నంలో రధాలు, గుర్రాలు, మార్గాలు అన్నీ కనిపిస్తాయి. ఆ కల కరిగిపోగానే ఏమి కనిపించదు. ఇంత తక్కువ కాలంలో వీటిని సృష్టించేది ఎవరు? స్వప్నావస్థలో జీవుడు దేహంతో తన ఇష్టం వచ్చినట్లు విహరిస్తున్నాడు. ఈ మాయాస్వరూపాన్ని సృష్టించేది జీవుడే కాని ఈశ్వరుడుకాదు. సంధ్యలోని సృష్టి మాయయే కాని వానిలో పరమార్ధ గంధం కూడా లేదు. ఎందువల్ల? స్వప్నం పూర్తిగా అభివ్యక్తస్వరూపం కాబట్టి. దేశకాల నిమిత్తాలు, బాధ లేకపోవడం, నిషేదింప బడకపోవడం, ఇవి స్వప్నంలో సంభావ్యములు కావు. ఇరుకైన దేహంలో రధాదులను అవకాశం ఉండదు కదా! దూరంలో ఉన్నా వస్తువులను చూస్తున్నాడు అంటే దేహం నుండి బయటకు వచ్చి స్వప్నం చూస్తున్నాడు. జీవుడు బయట సంచరిస్తూ కామం (భోగ్యపదార్ధ జాతం) ఎక్కడ ఉన్నదో అక్కడికి వెడతాడని, దేహం బయటనే స్వప్నం చూస్తాడని శ్రుతి చెబుతున్నది. జీవుడు శరీరం నుండి బైటకు రాకపోతే నిలబడినట్లు, నడుస్తున్నట్లు ఎలా భావిస్తున్నాడు? దానికి సమాధానం చెప్పబడింది. అది యుక్తం కాదు. నిద్ర పోతున్న వాడు క్షణం కాలంలో నూరు యోజనాల దూరం ఉన్న ప్రదేశానికి వెళ్ళడానికి, తిరిగి రావడానికి సామర్ధ్యం ఉండదు కదా! నేను కురుదేశంలో నిదురించి, పాంచాలదేశంలో మేల్కొన్నాను అని స్వప్నం గురించి చెబుతాడు. అతను దేహం నుండి బయటకు వెళ్లినట్లయితే పాంచాల దేశంలో మేలుకోనాలి. అలా జరగదు కదా! తన ఇష్టానుసారం విహరిస్తూ అనేక దృశ్యాలు, అనుభవాలు పొందుతాడు. కొన్ని సార్లు ఇష్టం లేని దుస్వప్నాలు కూడా చూస్తుంటాడు. అందుకే స్వప్న పదార్ధాలు అన్నీ మాయే. నిజంగా లేకపోయినా ఉన్నట్లుగా కనిపిస్తాయి.
సూత్రం :- 322
" సూచకశ్య హి శ్రుతే రాచక్షతే చ తద్విదః "
స్వప్నం విపర్యయ జ్ఞానమే. హి :- ఎందుకంటే, సూచనః :- కలలు రాబోయే శుభ, అశుభాల్ని సూచిస్తాయని, తద్విదః :- కలల్ని విశ్లేషంచిన వాళ్ళు, శ్రుతేః :- ఉపనిషద్వాక్యాలు ఆధారంగా, ఆచక్షతే చ :- చెబుతున్నారు కూడా!
భావం :- కలలు రాబోయే శుభ, అశుభ ఫలితాలను సూచిస్తాయని కలలను విశ్లేశించిన వారు ఉపనిషద్వాక్యాల ఆధారంగా చెబుతున్నారు.
వివరణ :- స్వప్నశాస్త్రం తెలిసిన వారు స్వప్నం శుభాశుభాలను సూచిస్తుందని చెబుతున్నారు.
ఛాందోగ్యోపనిషత్తు(5,2,9):-కామ్యకర్మలు చేసేటప్పుడు స్వప్నంలో స్త్రీని దర్శిస్తే ఆ కర్మల యందు సమృద్ధి కలుగుతుంది. నల్లనిపళ్ళు ఉన్న నల్లనిమనిషిని చూస్తే అతడు చంపేస్తాడు అని కలగురించి చెప్పారు. అలాగే స్వప్నం గురించి పరిశోధనలు చేసిన వారు ఏనుగు ఎక్కినట్లుగా కల రావడం శుభ సూచకమని, ఉష్ట్రపక్షులు, గాడిద ఎక్కినట్లు కల వస్తే అశుభ సూచకమని అంటారు. ఇలా రాబోయే శుభ అశుభాలను స్వప్నాలు సూచిస్తాయనడంలో కలల్లో పదార్ధాల అభాసయే కాని, వాస్తవానికి పదార్ధాలు అక్కడ ఉండవని స్పష్ట మౌతోంది. స్వప్నంలో వీర్య స్కలనం కావడానికి కారణం స్త్రీ ఆభాసే కాని స్త్రీ ఉండదు కదా! అందుకే స్వప్నంలో కలిగే జ్ఞానం యదార్ధం కాదని వెల్లడి అవుతోంది. రామాయణంలో త్రిజట స్వప్న వృత్తాంతం ప్రసిద్ధి చెందింది. కాబట్టి స్వప్నం మాయ, మిధ్య అని ఎలా అనగలము అనే వారి వాదన సరి అయినది కాదు. స్వప్నం వలన కలిగే శుభాశుభాలు, లాభ నష్టాలు నిజం కావచ్చును. కానీ స్వప్నం మాత్రం మిధ్యే. మేలుకోగానే కల కరిగిపోతుంది. కాబట్టి అది అబద్ధం. ఈ స్వప్నాలను జీవుడే సృష్టిస్తున్నాడు. స్వప్నాధ్యాయం అంటే స్వప్న పరిశీలన చేసే గ్రంధంలో మంత్రం విశేష, దేవతా విశేష, ద్రవ్య విశేషాలను బట్టి కొన్ని స్వప్నాలు సత్యమేనని అభిప్రాయం పడుతున్నారు. అప్పుడు కూడా సూచింపబడే వస్తువు సత్యమైతే కావచ్చును. కాని దానిలో కలిగే జ్ఞానం యదార్ధం కాదు. కనుక స్వప్నం మాయమాత్రం అనడం యుక్తమే.
సూత్రం :- 323
" పరాభి ధ్యానాత్తు తిరోహితం తతో హ్యస్య బంధ విపర్యయో "
తు :- కాగా, పర అభిధ్యానాత్ :- రధాది ఇతర పదార్ధాలను గురించి ఆలోచించడం వలన, తిరోహితం :- బుద్ధి సత్వం అచ్చాధితం అవుతుంది. తతః :- అందువలన, హ :- నిశ్చయంగా, అస్య :- నిద్రలో ఉన్న జీవాత్మకు, బంధ విపర్యయో :- బంధమోక్షాలు భాసిస్తాయి.
భావం :- రధాది ఇతర పదార్ధాలను గురించి ఆలోచించడం వలన బుద్ధి సత్వం ఆచ్చాధితం అవుతుంది. అందువలన నిద్రలో ఉన్న జీవాత్మకు బంధ మోక్షాలు భాసిస్తాయి.
వివరణ:-గురువుగారు! ఈశ్వరుడు, జీవుడు ఇద్దరూఒక్కటే. ఈశ్వరుడు సంకల్పమాత్రం చేతనే స్వప్నజగత్తును సృష్టిస్తున్నాడు. అలాంటప్పుడు స్వప్నజగత్తు మిధ్య ఎలాఅవుతుంది? అని అడిగాడు కృష్ణశర్మ. సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. జీవుడు, ఈశ్వరుడు ఒక్కటే. జీవుడు అవిద్య, అజ్ఞానం చేత ఆవరించబడి ఉంటాడు. అందుచేత జీవుడుకి ఈశ్వరుడుకి ఉన్నంత శక్తి లేదు. జీవుడిలో ఉన్న అజ్ఞానపు పొరలు తొలగిపోగానే తాను, పరబ్రహ్మ ఇద్దరూ ఒకటే నని తెలుస్తుంది. మరుక్షణమే తాను పరబ్రహ్మలో లీనం అయిపోతాడు. జీవుడిలో ఎప్పుడైతే పరబ్రహ్మ కన్నా తానువేరు అనే భేద భావం నశించి పోతుందో అప్పుడు అద్వైత భావం పొందతాడు. కాబట్టి జీవుడు సృష్టించే స్వప్నం నిజం కాదు. ప్రత్యక్ష ప్రమాణాల వలన జాగ్రదావస్థలో పదార్ధాల జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానసంబంధమైన సంస్కారాలు బుద్ధి సత్వంతో ఏర్పడతాయి. ఎన్నో సార్లు పదార్ధాలని గురించి ఆలోచించడం వలన ఆ సంస్కారాలు దృఢపడి బుద్ధిసత్వాన్ని కప్పేస్తాయి. శాస్త్రాల్లో బోధించిన బంధ మోక్షాలకు కారణాలను తెలుసుకొని, జాగ్రదావస్థ లో వాటిని ఆచరిస్తే మోక్ష ప్రాప్తి కలుగుతుంది. అగ్నికి విస్ఫులింగం వలె, జీవుడు పరమాత్ముని ఒక అంశ. అందుచేత అగ్నిలోనూ, విస్ఫులింగం లోను దహన శక్తి, ప్రకాశ శక్తి ఏ విధంగా సమంగా ఉంటాయో, అదే విధంగా జీవే శ్వరులలో జ్ఞానైశ్వర్య శక్తులు సమంగా ఉంటాయి. అందుచేత స్వప్నంలో సంకల్పంచేత రదాధి సృష్టి జరుగుతుందని అశంక కలుగుతుంది. దానికి సమాధానం చెప్పబడు చున్నది. జీవేశ్వరులకు అంశాశిభావం ఉన్నా కూడా జీవునిలో, ఈశ్వరునిలో ఉన్న ధర్మాల కంటే విపరీత ధర్మాలు ఉన్నాయనేది ప్రత్యక్షమే. జీవేశ్వరులకు సమాన ధర్మత్వం లేదా అంటే, లేకపోవడం లేదు. కాని అది అవిద్య వలన కప్పబడి ఉన్నది. నిత్యం పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ, తదేకంగా ధ్యానిస్తూ, ప్రయత్నించగా తమస్సు తొలగి పోయి, ఆ ఒక్కనికే ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. ఈశ్వర స్వరూపం తెలియక పోవడం వలన బంధం కలుగుతోంది. అది తెలుసుకుంటే మోక్షం కలుగుతుంది. "బ్రహ్త్మెవాహమ్ "అని ధ్యానిస్తుండే వానికి అవిద్యాది సర్వ పాపాలు నశించిపోయి క్లేశాలు తొలగి పోగానే జన్మ మృత్యువులు నశిస్తాయి. జాగ్రదావస్థ లోనే వాటిని ఆచరించేటప్పుడు వాస్తవంగా బంధ మోక్షాలు లభిస్తాయి.
సూత్రం :- 324
" దేహ యోగాద్వా సోపి "
కలలు ఎందుకు వస్తాయి? సః అపి :- ఆ స్వప్నం కూడా, దేహ యోగాత్ వా :- ఒక్కో సారి దేహ సంబంధం వలన, మరొక సారి ధర్మం వలన, ఇంకో సారి అధర్మం వలన, వస్తుంది.
భావం :- స్వప్నాలు దేహ సంబంధం వలన, ధర్మం వలన, అధర్మం వలన వస్తాయి.
వివరణ :- జీవుడి కుండే ఐశ్వర్య తిరోభావం దేహాది సంబంధం వలన కలుగుతుంది. దేహము, ఇంద్రియాలు, బుద్ధి, మనస్సు, వీటి సంయోగం వలన జీవుడికి సహజంగా ఉండవలసిన జ్ఞానం, ఈశత్వం తిరోభావం చెందుతాయి. ఆయా పదార్ధాలకు సంబంధించిన సంస్కారాలు స్వప్నానికి సాధారణ కారణం. దేహాది సంబంధాలు విశేషకారణం. అప్పుడప్పుడు వాతాది ప్రకోపాలు కలగడం వలన శరీరంలో మార్పు వస్తుంది. అలాంటప్పుడు ఆకాశంలో విహరించడం లాంటి కలలు వస్తాయి. ధర్మాధర్మ సంస్కార సంబంధం వలన కలిగే కలలు శుభాశుభ సూచకాలు. స్వప్నం అనేది పూర్వనుభావం వలన ఏర్పడే సంస్కారాల వలన కలుగుతుంది. ఏదీ యదార్ధం కాదు. విపర్యయ జ్ఞానమే.
ఛాందోగ్యోపనిషత్తు:- ఉద్ధలకుడు శ్వేతకేతువుకు ఆత్మతత్వాన్ని వివరిస్తూ జగత్తులోని నామరూపాలన్నీ దేనిలో లీనమై పోతున్నాయో అదే బ్రహ్మ. అదే నీవు అంటాడు. అంటే జీవాత్మ, పరమాత్మ రెండుఒక్కటే. అయినప్పటికీ అవిద్యతో కూడినది జీవాత్మ. అటువంటప్పుడు జీవుడు చేసే సృష్టి శాశ్వత మైనది కాదు. అందుకే స్వప్నం అంతా మాయే. జీవుడు పరమాత్మ అంశం అయి ఉన్నా కూడా ఎందువల్ల అతని జ్ఞానైశ్వర్యాలు తిరస్కృతులవుతున్నాయి? జీవుని జ్ఞానైశ్వర్య తిరోభావం కూడా దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, విషయాలు, వేదన, మొదలైన వాటితో సంబంధం వలన కలుగుతుంది. అగ్నిలో దహన ప్రకాశనాలు ఉన్నా కూడా ఆరణిలోఉన్నా అగ్నియొక్క దహన ప్రకాశం ఏవిధంగా తిరోహితముగా ఉంటుందో, భస్మం చేత కప్పబడిన అగ్నియొక్క దహన ప్రకాశనాలు ఏవిధంగా తిరోహితములౌతాయో, అట్లే జీవుని జ్ఞానైశ్వర్యాలు తిరోభావం కూడా అవిద్య చేత ఏర్పడిన నామరుపాల చేత చేయబడిన దేహాద్యుపాదులతో సంబంధం వలన వాటి నుండి వివేకం లేకపోవడం వల్ల కలిగించబడింది. జీవేశ్వరులు వేరు వేరు అను అశంకను నివారించడనికే వా శబ్దం ప్రయోగింపబడింది. జీవుడే పరమాత్మని ఆత్మ అని చెప్పబడ్డాడు. అందుచేత జీవుడు ఈశ్వరుని కంటే అభిన్నుడై ఉండి, దేహసంబంధం వలన తిరోహితములైన జ్ఞానైశ్వర్యాలు కలవడావుతున్నాడు. అందుకే స్వప్నంలో రధాది సృష్టి జీవుడి సంకల్పకృతమే.
తదభావాధికరణం ( 3, 2, 7 )
సూత్రం :-325
"తద భావో నాడీషు తచ్రుతే రాత్మని చ "
తత్ అబావః:- సుషుప్తి ( గాఢ నిద్ర ), నాడీషు :- హిత నాడులోనూ, పూరీతత నాడి లోను, ఆత్మని చ :- పరమాత్మలోనూ, జీవుడు ఉన్నప్పుడు కలుగుతాయి. తత్ శ్రుతేః :- జీవుడు సుషుప్తిలో ఆ నాడుల్లో, ఆత్మలో ఉంటాడని ఉపనిషత్వాక్యాల వలన తెలుస్తోంది.
భావం :- సుషుప్తి హితనాడుల్లోను, పురీతత నాడి లోను పరమాత్మలోనూ జీవుడు ఉంటాదని ఉపనిషద్వాక్యాల వలన తెలుస్తోంది.
వివరణ:- గురువు గారు! ఇప్పటి వరకు స్వప్నవస్థ గురించి చెప్పారు. మరి సుషుప్తి అంటే ఏమిటి? సుషుప్తావస్థ అనేది నాడులా? పూరీతతా? దహరాకాశమైన పరమాత్మా? ఈమూడు కలసినది ఏదైనా ఉందా? ఎందుచేత నంటే సుషుప్తిని గురించి ఉపనిషత్తులలో రక రకాలుగా వివరించారు.అని అడిగాడు నారాయణ బట్టు.
ఛాందోగ్యోపనిషత్తు:-(6,6,3):-జీవుడు నిద్రిస్తున్నప్పుడు కలలుకనడు. సుషుప్తి సమయంలో ప్రసన్నుడై ఉంటాడు. అప్పుడు హృదయ నాడుల్లో నిద్రిస్తాడు. (6,8,10) :- జీవుడు స్వపితి నిద్రిస్తాడు. అప్పుడతడు బ్రహ్మతో కలసి ఉంటాడు.
బృహదారణ్యకోపనిషత్తు (4,3,21):- పరమాత్మను ఆలింగనం చేసుకొని బయటా లోపలా అనేది తెలియకుండా ఉంటాడు. ఈ ఉపనిషద్వాక్యాన్ని బట్టి జీవుడు సుషుప్తిలో ఉన్నప్పుడు హృదయంలో ఉండే పూరీతత నాడుల ద్వారా పరమాత్మను చేరి అభివ్యక్త రూపంలో ఉంటాడు. ఆ సమయంలో మనస్సు కూడా పనిచేయదు.
ఛాందోగ్యోపనిషత్తు(2,1,19) జీవుడికి నిద్రిస్తున్నప్పుడు ఏమితెలియదు. హృదయం నుండి 72000 నాడులు వెలువడు తున్నాయి. వాటిని హితనాడులు అంటారు. అవన్నీ పురీతత నాడికి అభిముఖంగా ఉంటాయి. జీవుడు ఆ నాడుల్లో జరిగి పురీతత నాడిలో నిద్రిస్తాడు.
బృహదారణ్యాకోపనిషత్తు(4,3,21):- పరమాత్మను ఆలింగనం చేసుకొని బయట లోపల అనేది తెలియకుండా ఉంటాడు. ఉపనిషద్వాక్యాన్ని బట్టి జీవుడు సుషుప్తిలో ఉన్నప్పుడు హృదయంలో ఉండే పురీతత నాడుల ద్వారా పరమాత్మను చేరి, సుఖిస్తాడని తెలుస్తోంది. అప్పుడు జీవాత్మ పరమాత్మలో చేరి అవిభక్త రూపంలో ఉంటాడు. ఆ సమయంలో మనసు కూడా పనిచేయదు. హృదయంలో పద్మంఆకారంలో ఉండే నాడీసమూహాన్ని పురీతత్ అంటారు. నాడులు, పురీతత్తు, బ్రహ్మ అనేవి జీవుడికి సుషుప్తి స్థానాలు. ఈ నాడుల గుండా పురీతత్తు లో ప్రవేశించి అక్కడ బ్రహ్మ నిద్రపోవాలి. స్వప్నావస్థలో మనస్సు మాత్రమే పనిచేస్తుంది. మనస్సు కూడా లీనమైనప్పుడు అది సుషుప్తి.
సూత్రం :- 326
" అతః ప్రబోధోస్మాత్ "
అతః :- సుషుప్తికి పరమాత్మయే స్థానం కావడం వలన, అస్మాత్ :- ఆ పరమాత్మ నుంచే, ప్రబోదః :- జీవుడుకి ప్రభోదం కలుగుతుంది.
భావం :-సుషుప్తికి పరమాత్మయే స్థానం కనుక ఆ పరమాత్మ నుంచే ప్రబోధం కలుగుతుంది.
వివరణ :- జీవుడు ఆత్మలో నిద్రించి ఉన్నాడు. కాబట్టి ఆత్మ నుంచే మేలుకొంటాడు. నాడుల ద్వారా పురీతత్తులో ప్రవేశించి హృదయాకాశంలో నిద్రిస్తాడు. అది పరమాత్మ స్థానం కనుక జీవుడు పరమాత్మతో ఐక్యం పొంది, గాఢనిద్రలో ఆనందాన్ని అనుభవించి, ఉదయం ఆ ఆత్మస్థానం నుండే మేల్కొంటాడు. ఆ స్థితిలో అతడిని ప్రాజ్ఞుడు అంటారు. ఆసుషుప్తిలో అన్ని అనుభవాలు ఏకమై పోతాయి. కేవలం గ్రహణ శక్తి మాత్రం నిలిచిపోతుంది. పరస్పర విరుద్ద భావాలు స్పురించవు. ఆ స్థితిలో ప్రాజ్ఞుడు ఆనందాన్ని అనుభవిస్తాడు. ఇది తమోగుణ ప్రధానమైన అవస్థ. ఇతడే అన్నింటికీ ప్రభువు. ఈశ్వరుడు. సర్వము తెలిసినవాడు. అంతర్యామి. అక్కడ నుండే జీవుడు నూతనఉదయం ఉత్సాహంతో మేలుకొంటాడు. సుషుప్తిలో పరమాత్మ తో ఐక్యం అయ్యామనే విషయం గ్రహించలేకపోవడం వలన బ్రహ్మానికి దూరం అవుతున్నాడు. తెల్లవారగానే అతనిలో ఉన్న "నేను" అనే అహం నిద్ర లేచి, సమస్త ఇంద్రియ వ్యాపారాలతో సంబంధం ఏర్పరచుకొని బ్రహ్మాన్ని గుర్తించ లేకపోతున్నాడు.
బృహదారణ్యాకోపనిషత్తు(2,1,16):- జీవులు మేల్కొన్నప్పుడు అతను ఎక్కడనుంచి వచ్చాడు. అని ప్రశ్న. (2,1,20):- అగ్ని గురించి నిప్పు కణాలు ఎలా విలువడుతాయో, అలాగే ఈశ్వరుడి నుంచి అన్ని ప్రాణాలు, లోకాలు, దేవతలు భూతాలన్నీ వెలువడుతాయి అని జవాబు. దీనిలో జీవుడు పరమాత్మతోనే నిద్రించి, అతని నుంచే మేల్కొంటాడని సిద్ధిస్తోంది. కాగా జీవుడు నిద్రిస్తున్నప్పుడు పరమాత్మతో ఏకం అవుతాడంటున్నారు కదా! అలా అయితే మేల్కొనే జీవుడు అతడేనా? లేక ఇంకొకడా? అని సందేహం. అది ఎక్కడ నుంచి వచ్చింది అనే ప్రశ్నకు సమాధానం చెప్పే సందర్భంలో " యధా ప్రాణాః ", " సత్.. ఆగచ్చా మహే " అని చెప్పబడింది. సుషుప్తి స్థానాల విషయంలో వికల్పం ఉండే పక్షంలో ఒకప్పుడు నాడుల నుంచి మేల్కొంటారు. ఒకప్పుడు పురీతత్తు నుంచి మేల్కొంటారు. ఒకప్పుడు ఆత్మ నుంచి మేల్కొంటారు అని చెప్పబడేది. ఆ కారణాల వలన కూడా సుషుప్తి స్థానం ఆత్మయే.
కర్మాను స్మృతి శబ్ద విద్యధికరణం ( 3, 2, 9 )
సూత్రం :- 327
" స ఏవ తు కర్మాను స్మృతి శబ్ద విధి భ్యః "
కర్మ :- మిగిలిన కర్మలను అనుష్టించడం వలన, అను స్మృతి :- స్మృతుల వలన, శబ్ద :- శృతి వాక్యాల వలన, విధిభ్యః :- విధుల వలన, స ఏవతు :- నిద్రించిన జీవుడే మేల్కొంటాడు.
భావం :- జీవుడు హృదయస్థానంలో ఉన్న బ్రహ్మలో నిద్ర పోతున్నాడు. మళ్ళీ అందులోనుండే మేల్కొంటాడు. నిద్రించిన జీవుడే మళ్ళీ మేల్కొంటాడు.
వివరణ:-సుషుప్తి పొందిన జీవుడే మళ్ళీ మేల్కొంటున్నాడు అని అనడానికి నిదర్శనం ఏముంది? నిద్రించేది ఒకడు. మేల్కొనేవాడు మరొకడు కావడానికి వీలు లేదు. నిద్రించడానికి పూర్వం ప్రారంభించిన పనిని, మేల్కొన్న తరువాత మళ్ళీ ప్రారంభిస్తాడు. నిన్న నేను దానిని చూసి ఉన్నాను అని పూర్వం అనుభవించిన దానిని తరువాత స్మరించడం, ఇతరుడు లేచినట్లయితే ఉపపన్నం కాదు. ఒకడు చూచిన దానిని మరొకడు స్మరింపజాలడు కదా! అదే విధంగా ఆ వ్యక్తియే నేను అని తనను గూర్చిన స్మరణంకూడా మరొక ఆత్మ లేచిన పక్షంలో కుదరదు. శ్రుతుల వలన కూడా అతడే లేస్తున్నట్లు తెలుస్తోంది. ఈజీవులందరూ ప్రతిరోజు ఈ బ్రహ్మలోకాన్ని పొందుతున్నా కూడా అజ్ఞానం వలన పూర్తిగా పొందలేక పోతున్నారు. ఆ జీవులు పెద్దపులి అయినా, సింహామైనా, తోడేలైనా, వరాహమైన, పురుగైనా, పూర్వం మేల్కొన్నప్పుడు ఏవిగా ఉండేవో అవి గానే మళ్ళీ మేల్కొన్నప్పుడు అవుతాయి. కర్మవిధుల వలన, విద్యావిధుల వలన ఇట్లే తెలుస్తుంది. అట్లు కాని పక్షంలో కర్మ, విద్యావిధులు వ్యర్థములౌతాయి. మరొకడు లేచే పక్షంలో నిద్రిస్తే చాలు, ప్రతి ఒక్కడు ముక్తుడై పోతాడని చెప్ప వలసి వస్తుంది. పెద్దదైన సముద్రంలో చిన్న నీటి బొట్టు వేస్తె అది అందులో కలసి పోతుంది. మళ్ళీ బయటకు తీసినప్పుడు ఆ బొట్టే రావాలని నియమం ఏముంది? అలాగే పరమాత్మలో అనేక జీవులు కలసి పోతాయి. అసంఖ్యాక మైన జీవులకు సుషుప్తి స్థానంగా ఉండి పరమాత్మ నుండి ఆ జీవులే మేల్కొంటాయాని ఎలా చెప్పగలం? ఇంకా ఇతరమైనవి కావచ్చును కదా! అన్నాడు నారాయణ భట్టు. దానికి సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు.
ముగ్ధేర్ధ సంపత్యధికరణం ( 3, 2, 10 )
సూత్రం :- 328
" ముగ్ధేర్ధ సంపత్తిః పరిశేషాత్ "
ముగ్ధేః :- మూర్చ కలిగినప్పుడు, పరిశేషాత్ :- ప్రత్యేకంగా, అర్ధ సంపత్తిః :- సగం సుషుప్తి ఉంటుంది.
భావం :- మూర్చ కలిగినప్పుడు ప్రత్యేకంగా సగం సుషుప్తి ఉంటుంది.
వివరణ :- స్వప్న, జాగ్రత్, సుషుప్తి, అవస్థలే కాక జీవుడికి మూర్చావస్థ ఒకటి ఉన్నది. మూడు అవస్థల కన్నా దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది. కలలో, జాగ్రత్ అవస్థలలో విషయజ్ఞానం ఉంటుంది. మూర్చలో అలాంటి జ్ఞానం ఉండదు. మూర్చ మరణం కాదు. మూర్చస్థితి సగంసుషుప్తి సగంమరణ ధర్మంతో కూడి ఉంటుంది అని పరిశేషన్యాయం. అంటే జాగ్రద్, స్వప్నా, సుషుప్తి, మరణావస్థలలో దేనిలోనూ చేరకుండా ఉండే స్థితి. వేదాలలో ఎక్కడ ఐయిదవ స్థితి ప్రస్థావన లేదు. కాబట్టి మూర్చ అనేది దేనికి చెందదు. దేనిలోనూ అంతర్భూతం కాదు. ప్రత్యేక అవస్థ కాదు. మేలుకొని ఉన్నవాడిలాగా మూర్చ పోయిన వాడికి బాహ్య జ్ఞానం ఉండదు. అంతర జ్ఞానం ఉండదు. అతని శరీరం అదుపులో ఉండదు. తూలిపోతు ఉంటుంది. స్వప్నాలు చూడలేడు. మనోవ్యాపారాలు ఉండవు. మరణం కాదు. శరీరంలో వేడి, శ్వాసక్రియలు ఉంటాయి. గాఢ నిద్ర ఉండదు. అందుకే ఇది ఏ అవస్థాకాదు. పరిశేష న్యాయం చేత జాగ్రదావస్థ, స్వప్నావస్థ, కూడాకాదు. కావున ముగ్దుని యందు సగం సత్సంపత్తి ఉంటుంది. లోకంలో ఇతనికి మూర్చితుడని పేరు. సగం సుషుప్తి ఉన్నట్లుగా చెబుతారు. సుషుప్తిలో ఉన్నవానికి విశేష జ్ఞానం ఏది లేనట్లుగానే ముగ్దునికి కూడా విశేష జ్ఞానం ఉండదు. సుషుప్తి నుంచి లేచిన వానికి ఆ నిద్రించిన వాడను నేనే అని ప్రత్యభిజ్ఞ ఉన్నట్లు దీనికి కూడా ఉంటుంది. ముగ్ధుడు జాగ్రదావస్థ లో ఉన్నవాడు కావడానికి వీలు లేదు. ఇతడు ఇంద్రియాలతో విషయాలను చూడటం లేదు కదా! ముగ్ధుడు ఇషుకార న్యాయం (బాణాలు తయారుచేసేవాని పోలికలో) ఉంటాడు అని పూర్వ పక్షి వాదన. ఇషుకారుడు మేల్కొని ఉన్నా, బాణాల మీద ఏకాగ్ర చిత్తం కలవాడై ఇతర విషయాలను మీదకు మనస్సు పోకుండా ఉంటాడో, అట్లే ముగ్ధుడు రోకలి తలమీద పడటం చేత దుఃఖాన్ని అనుభవిస్తూ, మేల్కొని వున్నా కూడా ఇతర విషయాలను చూడడు. అది యుక్తం కాదు. బాణం చేయడంలో తన్మయుడైన మనస్సు కల ఇషుకారుడు ఇంతసేపు నా మనస్సు బాణం మీదనే ఉంది అని అంటాడు. తిరిగి స్పృహ లోకి వచ్చిన ముగ్ధుడు అయితే ఇంతసేపు నేను అంధ మనస్సుతో ఉన్నాను. నాకేమి జరిగిందో తెలియదు అంటాడు. అతని దేహము నేల మీద పడిపోతుంది.ముఖంలో వికాశం ఉండదు. కాళ్ళుచేతులు కొట్టుకుంటాయి. అతను స్వప్నాలు చూడడు. మరణించనూ మరణించడు. అతని ముక్కు దగ్గర శ్వాస ఉందా లేదా? శరీరంలో వేడి ఉందా లేదా అని పరీక్షస్తారు. అలా లేకపోతే అతను మరణించాడని దహన సంస్కారాలు నిర్వహిస్తారు. శ్వాస ఉంటే స్పృహ రావడం కోసం చికిత్స చేయిస్తారు. అదే ఇషుకారుడు అయితే ఒకే విషయం మీద ఏకాగ్ర చిత్తమైనప్పటికి అతని శరీరం నిలబడుతుంది. బాహ్య స్పృహ ఉంటుంది. అందువలన ఇద్దరికీ పోలిక ఉండదు. ఈమూర్చ అవస్థాత్రయంలో ఉండదు.
ఉభయ లింగాధికరణం ( 3, 2, 11 )
సూత్రం :- 329
" న స్థానతో పి పర స్వో భయ లింగం సర్వత్ర హి "
పరస్వ:- జీవులు ప్రకృతి కన్నా సూక్ష్మ మైన పరమాత్మకు, స్థానతః అపి :- స్వతహాగా కాని, స్థాన నిమిత్తం వలన గాని, న :- స్వప్నాది అవస్థలు ఉండవు. హి :- ఎందుకంటే, సర్వత్ర :- అన్ని శాస్త్రాల్లోను ఉభయలింగం :- జీవ, ప్రకృతుల లక్షణాల కంటే, ప్రత్యేకంగా దివ్య గుణాలతో ఆయన్ని అభివర్ణించారు.
భావం :- జీవులు, ప్రకృతి కన్నా సూక్ష్మ మైన పరమాత్మకు స్వతహాగా కానీ, స్థాన నిమిత్తం వలన గాని, స్వప్నాది అవస్థలు ఉండవు.
వివరణ:- గురువుగారూ! బ్రహ్మను గురించి వేదాలు రకరకాలుగా చెబుతున్నాయి. కొన్ని సార్లు బ్రహ్మ సాకారుడు అన్నాయి. కొన్నిసార్లు నిరాకారుడు అన్నాయి. మరి బ్రహ్మ సాకారుడా? నిరకారుడా? లేక సాకార, నిరాకార రూపాలలో ఉంటాడా? వివరించండి? అన్నాడు కృష్ణశర్మ. సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. వేదాలు బ్రహ్మ నిర్గుణమే అని చెబుతున్నాయి. ఉపాధి వలన బ్రహ్మకు ఉభయత్వం లేదు. పరబ్రహ్మ స్వరూపం సాకారము, నిరకారము అని రెండుగా ఎప్పుడు చెప్పలేదు. ఉన్నది ఒక్కటే. అదే నిర్గుణ పరబ్రహ్మ. ఉపాధి వలన కూడా రెండుగా కనబడ రాదు. నీళ్లను నిప్పుల మీద వేస్తే అవి వేడెక్కుతాయి. నీళ్ల స్వభావం వేడి కాదు. ఇలా వేడెక్కడం వలన నిప్పు స్వభావం లోను మార్పు ఉండదు. ఆత్మ స్వయంభువు. నాశ రహితమైనది. శాశ్వతమైనది. జీవుడికి స్వప్నాది అవస్థలు ఉన్నట్లు గానే పరమాత్మకు కూడా ఉన్నాయా? అనే విషయం చర్చించబడింది. ఈశ్వరుడు జీవులకన్నా దాని కార్యాలైన మహత్ తత్త్వాది పదార్ధాల కన్నా సూక్ష్మ మైన వాడు. ఆయన జీవ ప్రకృతులలో లోపల, బయట అనే తేడా లేకుండా అంతటా ఉంటాడు. సర్వంతర్యామి గా ఉంటూ శుభాశుభ కర్మలు చేసేటప్పుడు జీవులకు ప్రేరణ కలిగిస్తాడు. జీవుడు జగజ్ఙన్మాదులకు కారణం. జీవుడు అణు పరిమాణం కలవాడు. పరిచ్చినుడు. కనుక శరీరంలో ఉంటాడు. శరీరం బయట ఉండడు. అతనికి శరీర ఉపాధుల వలన స్వప్నాది అవస్థలు కలుగుతాయి. బ్రహ్మానికి ఈధర్మాలు వర్తించవు. అద్దంలో ముఖం ప్రతిబింబం కనిపిస్తుంది. అద్ధం బయట కనబడదు. కాగా అద్దంలో ఉండే మాలిన్యాలు ప్రతిబింబానికి కూడా సంక్రమిస్తాయి. ఈ ఉపాధి సంబంధం బ్రహ్మానికి లేదు. శ్రుతులను బట్టి బ్రహ్మ ఉభయలింగమని గ్రహించాలా? లేదా ఏదో ఒక లింగం కలదని గ్రహించాలా? ఏదో ఒక లింగం గ్రహించాలి అన్నప్పుడు, విశేషలింగం గ్రహించాలా? నిర్విశేషలింగం గ్రహించాలా? అని విచారణ చేయబడుచున్నది. ఉభయలింగాలను ప్రతిపాదించే శ్రుతులను బట్టి బ్రహ్మ ఉభయలింగమని గ్రహించాలని పూర్వ పక్షి వాదన. పరబ్రహ్మకు ఉభయ లింగత్వం కుదరదు. ఉపాధి సంబంధం ఉన్నా కూడా ఒకే విధంగా ఉన్న వస్తువు యొక్క స్వభావం మరొక విధమైనదిగా అయిపోదు కదా! ఉపాధులు అవిద్య చేత సమకూర్చబడినవి. ఏదో ఒక లింగాన్ని గ్రహించినా కూడా బ్రహ్మ విశేష రహితమని, నిర్వికల్పమని, మాత్రమే గ్రహించాలి. ఎందుకు విపరీతంగా గ్రహించకూడదు.
సూత్రం :- 330
" న భేదాదితి చేన్న ప్రత్యేక మత ద్వ చనాత్ "
భేదాత్:- స్థానం వలన, ఈశ్వరుడు భిన్నుడు కావడం వలన, న :- స్వప్నాది అవస్థలు ఆయనకు ఏర్పడవు. అని చెప్పడం సరి అయినదికాదు. ఇతిచేత్:- అని అనడం, వ:- తగదు. ప్రత్యేకం:- ప్రతిస్థానంలోను, అతత్ వచనాత్ :- అభిన్నంగా చెప్పారు.
భావం :- స్థాన సంబంధం వలన, బ్రహ్మాన్ని ప్రతి అవస్థ లోను, ప్రతి స్థానంలోనూ అభిన్నంగా చెప్పారు. అలా చెప్పడం సరి అయినది కాదు.
వివరణ:-ఆకాశం వ్యాపకం. అంతటా ఉంటుంది. అయినా ఘటంలో ఉండేది ఘటాకాశామని, మఠంలో ఉండేది మఠాకాశమని, వ్యవహారిస్తారు. స్థానభేద సంబంధంవలన భిన్నభిన్న నామరుపాలు కలుగుతాయికదా! మరి స్వప్నాది అవస్థలు బ్రహ్మానికి ఎందుకు ఉండవు అంటే స్థాన భేదాన్ని బట్టి బ్రహ్మం భిన్నంకాదు. బ్రహ్మం సర్వవ్యాపకం. అన్ని వేదాంత వాక్యాలలోనూ నిర్గుణ పరబ్రహ్మమే చెప్పబడలేదు. బ్రహ్మకు నాలుగు పాదాలున్నాయని వారి వాదన. మొదటి పాదం :- వాక్కు. రెండవ పాదం :- ప్రాణం. మూడవ పాదం :- నేత్రం. నాలుగవ పాదం :- శ్రోత్రం. బ్రహ్మకు షోఢశ కళా ప్రపూర్ణుడు అని పేరు ఉన్నది.
ఛాందోగ్యోపనిషత్తు:- నాలుగు దిక్కులు పరమేశ్వరుని మొదటి పాదం, భూమి, ఆకాశం, సముద్రాలు రెండవ పాదం, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, విద్యుల్లతలు మూడవ పాదం, ప్రాణం, సృష్టి, శ్రోత్రం నాలుగవ పాదం. ఉపకోశలుడికి అగ్నులు బ్రహ్మోపదేశం చేస్తూ, ఆకాశంలో సూర్యునిలో ఏతత్వమున్నదో అదే నీలోనూ ఉన్నది. దిక్కులు, నక్షత్రాలు, నీరు, నింగి అన్నింటిలో ఉన్న తత్వంఒక్కటే. అదే పరబ్రహ్మ అని చెప్పబడింది.
మాండుక్యోపనిషత్తు:- ఆత్మకు నాలుగు పాదాలున్నాయి. అదే జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయం అని శాస్త్రం చెప్పబడింది. అందువలన బ్రహ్మకు ఆకారం ఉన్నదని వారి వాదన. అది సరియైనది కాదు. అలా అనడానికి వీలులేదు. పరమేశ్వరుడికి ఆకారం లేదు. అన్ని వస్తువులయందు ఉన్నాడు. జీవులన్నీ తమతమ నామరుపాలు కోల్పోయి ఏపురుషుడిలో కలసిపోతాయో, అతడే ఆత్మ అదే నీవు అని ఛాందోగ్యం లో చెప్పబడింది.
బృహదారణ్యకోపనిషత్తు:- యాజ్ఞవల్కుడు చెబుతున్నాడు లోకంలో ఉన్నదంతా ఆత్మ. ఆత్మ అందరిలో ఉన్నది. ఆత్మ నుండే అన్ని పుట్టాయి. అందులోనే లయమవుతున్నాయి. ఆ పరమేశ్వరుడు సర్వంతర్యామి. చైతన్య మూర్తి అని చెబుతూ, వాయువులో వుండి వాయువును నియంత్రిస్తున్నాడు. వాయువు అతని శరీరం. కాని వాయువు అతన్ని ఎరుగదు. అతడే నీలో ఉన్న ఆత్మ. బ్రహ్మ నిర్వికల్పం, దీనికి స్వంతంగా గాని, స్థానం వలన గాని ఉభయ లింగత్వం లేదు అని చెప్పినది ఉపపన్నం కాదు. ఎందువలనంటే ప్రతి విద్యలోనూ బ్రహ్మ యొక్క వేర్వేరు ఆకారాలు ఉపదేశించ బడ్డాయి. అన్ని వేదాంత వాక్యాలలో బ్రహ్మ నిర్గుణ స్వరూపమే చెప్పారు అనడం తప్పు. ఉపాధుల వలన కలిగిన రూపాలను గురించి చెబుతూ బ్రహ్మకు నాలుగు పాదాలున్నాయని,షోడశ కళలున్నాయని, చెప్పబడింది. బ్రహ్మ అసలు స్వరూపాన్ని చెప్పే శ్రుతులు లేవు. ఈ భూమండలం మీద సూక్ష్మతి సూక్ష్మమైన రూపం, తేజోమయుడు, అమృత మయుడు అయిన బ్రహ్మమే జీవుడి శరీరంలోను ఉన్నాడు. అతడే ఆత్మ. ఆ ఇద్దరూ ఒకే ఆత్మ అని, శ్రుతి వాక్యానికి అర్ధం.
సూత్రం :- 331
" అపి ఛైవ మేకే "
అపిచ :- హేతుబలం తో స్వప్నాది అవస్థలు ఈశ్వరునికి ఉండవనీ, చెప్పడమే కాక, ఏవం ఏక :- కొందరు అధర్వవేదులు అలంకారికంగా వర్ణించినా ఆయనకు ఈ అవస్థాసంబంధాన్ని నిరకరించారు.
భావం :- కొందరు అధర్వ వేదులు ఈశ్వరునికి స్వప్నాది అవస్థలు ఉన్నాయని అలంకారికంగా వర్ణించినా ఆయనకు ఈ అవస్థ సంబంధాన్ని నిరకరించారు.
వివరణ:- బ్రహ్మకు భేదం కేవలం ఉపాసనకోసమే చెప్పారు. పరబ్రహ్మస్వరూపాన్ని మనసులోనే పొందాలి. దానిని తెలుసు కున్న తరువాత ఇంక భేదం ఉండదు. బ్రహ్మలో భేదాన్ని చూసేవాడు జననమరణ వలయంలో చిక్కుకు పోతాడు. అంతే కాదు. అనుభవించే వాడు, అనుభవించ బడేది ప్రేరేపించేవాడు ఈ మూడు భాగాలూ ఉన్నదే బ్రహ్మ. ఒక శాఖకు చెందిన వారు అభేద దర్శనాన్ని పఠిస్తున్నారు. భోక్త, భోగ్యం ఈ రెండింటిని ప్రేరేపించే వాడు ఈశ్వరుడు.
మాండుక్యోపనిషత్తు :- ఈశ్వరుడికి జీవుడి లాగా స్వప్నాది అవస్థలని అలంకారికంగా సంబంధం ఉన్నట్లు వర్ణించి, తరువాత స్వప్నావస్థకు సంబంధం ఉండదు. జాగ్రదావస్థ, మూర్చావస్థ కు సంబంధం ఉండదని అవస్థల సంబంధాన్ని నిరాకరించారు. అలంకారిక వర్ణన స్వభావాన్ని బోధించదు. కనుక ఈశ్వరుడికి స్థానం భేదం వలన స్వప్నాది అవస్థల సంబంధం ఉంటుందనడం పొసగడం లేదు.
సూత్రం :- 332
" అరూపవదేవ హి తత్ ప్రధాన త్వాత్ "
హి :- కారణం ఏమిటంటే, తత్ :- ఆ బ్రహ్మం, ప్రధానత్వాత్ :- ప్రధాన తత్వం, అరూప దేవ :- రూపం ఉన్నది కాదు.
భావం :- స్థాన భేదం వలన బ్రహ్మానికి స్వప్నాది అవస్థలతో సంబంధం ఉందనడానికి కారణం ఏమిటంటే ఆ బ్రహ్మం ప్రధాన తత్వం రూపం ఉన్నది కాదు.
వివరణ:- గురువుగారు! కొన్ని చోట్ల వేదంలో బ్రహ్మ సాకారుడని, కొన్నిచోట్ల నిరాకారుడని, చెప్పారుకదా! మరి అలాంటప్పుడు బ్రహ్మ నిరాకారుడని ఎలా చెబుతారు? అని అడిగాడు కృష్ణ శర్మ. దానికి సమాధానం చెబుతున్నాడు రత్నా కరుడు. రూపం, గుణం, అలంకారం లేనట్టి బ్రహ్మన్నే గ్రహించాలి. వేదంలో అలాంటి బ్రహ్మాన్నే చెప్పారు.
బృహదారణ్యకోపనిషత్తు:- యాజ్ఞవల్కుడు చెబుతున్నాడు, నీఆత్మయే బ్రహ్మ, నోటితోను, ముక్కుతోను పీల్చే విజ్ఞాన మయుడైన ఆత్మయే సర్వంతర్యామి. అపానక్రియ, వ్యానక్రియ, ఉదానక్రియ ఆచరించేవాడే సర్వంతర్యామి అయిన నీ ఆత్మయే. అట్టి ఆత్మ బ్రహ్మము స్థూలముకాదు. సూక్ష్మముకాదు. పొడవు కాదు, పొట్టి కాదు. శబ్ద, స్పర్శ, రూప, రసాదులు లేనటువంటిది. నాశరహితమైనటువంటిది.
ముండకోపనిషత్తు :- ఆ బ్రహ్మ కారణం లేనివాడు. ఆకారం లేని వాడు అని చెప్పబడింది.
శ్వేతాశ్వరోపనిషత్తు(3,19):- దేహంలోనూ, శబ్ద స్పర్శ గుణాలతోను పాణి పాదాది ఇంద్రియాలతో సంబంధం లేని నిరాకారి అని భావం. కనుక ఆయనకు ఏఅవస్థలు లేవు. ఈ సూత్రంలో ప్రధానం అంటే బ్రహ్మం. ఈశ్వరుడు. ప్రకృతి పురుషులకు స్వామి. ఆయనకు రూపం, ఆకారం, శరీరం ఉన్న పక్షాన ఈశ్వరుడు కానేరడు. శరీరం ఉంటే శుభాశుభ కర్మ ఫలాన్ని అనుభవించాల్సి వస్తుంది. భోగాయతనం శరీరం భోగాలకు నిలయం అన్నారు. సుఖ దుఃఖాలే కర్మ ఫలాలు. అలాంటి కర్మలను ఆచరించే వాడు జీవుడే. ఈశ్వరుడికి శరీర సంబంధం ఉండదు. కనుక కర్మ ఫలాలు అనుభవించడు. ఈశావాశ్యంలో ఆత్మ దూరంగా ఉంది. దగ్గరగా ఉంది. లోపల ఉంది. బయట ఉంది. సృష్టికి అంతీతమైనది.
తైత్తరీయోపనిషత్తు:- ఆకాశం బ్రహ్మ, వాయువు బ్రహ్మ, అగ్ని బ్రహ్మ, ఈ రకంగా పంచభూతాలు, తన్మాత్రలు బ్రహ్మమని చెప్పబడింది. ఈరకంగా బ్రహ్మ ఆకారంలేనివాడు. సర్వత్రా వ్యాపించి వున్నాడని చెప్పబడింది. బ్రహ్మ ఆకాశంలాగ నామ రూపాలాన్నింటిలో సూక్ష్మ రూపంలో ఉంటాడు. ఆకాశానికి శబ్దం ఉంది. పరమాత్మకు శబ్దం లేదు. ఇంద్రియాల ద్వారా, మనస్సు, బుద్ధి ద్వారా బ్రహ్మాన్ని గ్రహించలేము. జ్ఞాన నేత్రం ద్వారానే సర్వ వ్యాపకమైన పరమాత్మను దర్శించగలము.
సూత్రం :- 333
" ప్రకాశవ చ్చా వైయర్ధ్వాత్ "
చ :- అయితే, అవైయర్ధ్వాత్ :- రూపవంతుడిగా వర్ణించిన వాక్యాలు వ్యర్థం ఏమి కావు. ప్రకాశ వత్ :- ప్రకాశవంతుడని అర్ధం చేసుకోవాలి.
భావం :- ఈశ్వరుడికి రూపం లేదంటున్నారు. ఆయన్ని రూపవంతుడిగా వర్ణించిన వాక్యాలు ఉన్నాయి కదా! అంటే రూపవంతుడిగా వర్ణించిన వాక్యాలు వ్యర్థం ఏమి కావు. వాటి వలన ఆయన ప్రకాశవంతుడు అని అర్ధం చేసుకోవాలి.
వివరణ:-ఆకాశవతైన బ్రహ్మకు చెప్పే శ్రుతులకు గతి ఏమిటి? ఇందుకు సమాధానం చెబుతున్నారు. సూర్య చంద్రాది ప్రకాశం వలె సాకార బ్రహ్మ శ్రుతులకు వ్యర్థం లేదు అని సూత్రానికి అర్ధం. సూర్యరశ్మి వంకరగా రాదు. సరాసరి వస్తుంది. అలాంటి సూర్యరశ్మికి చెయ్యి అడ్డుపెట్టినట్లయితే, అది వంకరగా వస్తున్నట్లు కనిపిస్తుంది. ఆకాశాన్ని వ్యాపించిఉన్న సూర్య ప్రకాశాన్ని గాని, చంద్రప్రకాశాన్నిగాని, వేళ్ళు మొదలైన ఉపాధుల సంబంధం వలన ఋజుత్వం, వక్రత్వం మొదలైన ఆకారాలు పొందినప్పుడు, ఋజుత్వ వక్రత్వాదులను పొందుతున్నట్లు ఎలాఉంటుందో, అలాగే ఉపాధిభేదం వలన పరమాత్మ సాకారంగా దర్శనం ఇస్తాడు. ఇది కేవలం ఉపాసన కోసమే చెప్పబడింది. దీనిని బట్టి ఉపాసన కోసం బ్రహ్మకు ఆకార విశేషం ఉన్నట్లు చేసిన ఉపదేశం విరుద్ధం కాదు. ఆకారం గల బ్రహ్మకు చెప్పే వాక్యాలకు కూడా ఈ విధంగా సార్ధకత్వం లభిస్తుంది. వేదవాక్యాలు అన్నీ ప్రమాణములే అయి ఉన్నప్పుడు కొన్నింటికి ప్రయోజం ఉన్నదని, కొన్నింటికి లేదని చెప్పడం యుక్తం కాదా! బ్రహ్మకున్న ఉపాధి సంబంధాన్ని బట్టి కూడా దానికి ఉభయ లింగత్వం లేదని వెనుక చెప్పిన దానికి, ఇక్కడ చెప్పిన దానికి విరోధం కదా? అని సందేహం. విరోధం లేదనే చెప్పాలి. ఉపాధిని బట్టి ఏర్పడినది వస్తువు యొక్క ధర్మం కాజాలదు. ఎందువలననగా ఉపాదులు అవిద్య చేత ఏర్పరచబడినవి. సహజమైన ఈ అవిద్య ఉన్నప్పుడే లౌకిక వ్యవహారాలు, వైదిక వ్యవహారాలు జరుగుతాయి అని అక్కడక్కడ చెప్పివున్నాయి.
శ్వేతాశ్వరోపనిషత్తు( 3, 16 ):- పరమాత్మకు అనేక అవయవాలు ఉన్నట్లు చెప్పారు. మరి ఇవి నిజం కావా? అంటే పరమాత్మ సూర్యచంద్రాదుల వెలుగు లాగా జగత్తులో ఉండే పదార్ధాలన్నింటిలో వ్యాపించి ఉన్నాడని వీటి తాత్పర్యం. కాగా ప్రకాశం ప్రతి పదార్ధం లోపల బయట ఉండదా? కాని ఈశ్వరుడు అలా కాక ప్రతి వస్తువు లోపల, బయటా ఓత ప్రోతంలా ఉంటాడని వేద వాజ్మమయం ఘోషస్తున్నది. కనుక బ్రహ్మ రూపవంతం సశరీరం కాదు. బ్రహ్మం వ్యాపకత్వాన్ని తెలపడంతో ఈవాక్యాలు సార్ధకమౌతున్నాయి.
సూత్రం :- 334
" ఆహచ తన్మాత్రయే "
చ :- పైగా, తన్మాత్రయే :- పరబ్రహ్మం ప్రకాశ మాత్రమని, ఆహ :- శ్రుతులు అంటున్నాయి.
భావం :- బ్రహ్మ ప్రకాశవంతమని శ్రుతులు అంటున్నాయి.
వివరణ :- బ్రహ్మ యొక్క యదార్ధ స్వరూపం ఏమిటో ఈ సూత్రంలో తెలియజేస్తున్నారు. శ్రుతి వాక్యాలు అన్నీ బ్రహ్మ గురించి చెప్పాయి.
ఋగ్వేదం( 4, 5, 11, 5 ):- "ధ్రువం జ్యోతిర్నిహితం " బ్రహ్మ తేజోమయం అని, బ్రహ్మాన్ని ప్రకాశతుల్యం గా చెప్పారు. ఈ సామ్యం ఆయన తత్త్వం బోధ పడడానికే.
బృహదారణ్యకోపనిషత్తు:- యాజ్ఞవల్కుడు ఓమైత్రేయి! నీళ్ళల్లో వేస్తె ఉప్పు కరుగుతుంది. ఆఉప్పు నీరంతా వ్యాపించి ఉంటుంది. అదే విధంగా అద్భుతమైన శక్తి గల పరమాత్మ ఆనంతుడు, అవ్యయుడు, విజ్ఞాన ఘనుడు. అతను ఉపాధులతో కలసి అది నాశన మైనప్పుడు, తాను కూడా నాశనం అయినట్లు కనిపిస్తాడు. అంటే పరమాత్మ లోపలా, బయటా అంతటా వ్యాపించి ఉన్న రస స్వరూపం. బ్రహ్మ కేవలం చైతన్య స్వరూపమని శ్రుతి చెబుతోంది. ఉప్పుకణం లోపల, బయట లవణమే తప్ప మరేది వ్యాపించి ఉండదు. అట్లే, ఈ ఆత్మ లోపల, బయట అంతటా కూడా చైతన్య స్వరూపమే అని, విలక్షణమైన ఇతర రూపాలు ఏవిఉండవనీ, ఎట్టివిశేషాలు లేనిదని చెప్పుచున్నది. నిరంతర చైతన్యమే దీని స్వరూపం. పరమాత్మను తెలుసు కోవడానికి జ్ఞానం ఉండాలి. అది బుద్ధి వలననే సాధ్యం అవుతుంది. బుద్ధి ఒక్కోసారి తెలివిగా పనిచేస్తుంది. ఒక్కోసారి పని చేయదు. అందుకే అది సంపూర్ణమైన తెలివి కాదు. ప్రజ్ఞానం బ్రహ్మ, జ్ఞానమే బ్రహ్మ, అదే చైతన్యరసస్వరూపం. నిర్విశేషం, నిరాకారం, నిర్గుణం అయిన బ్రహ్మను తెలుసుకోవడానికి సద్గురువును ఆశ్రయించి ఆత్మ జ్ఞానాన్ని శిష్యుడు పొందగలగాలి.
సూత్రం :- 335
" దర్శయతి చాదో అపి స్మర్యతే "
చ :- అంతే కాక, అధ :- బ్రహ్మం ప్రకాశ వంతం అని, స్మర్యతే :- స్మృతులు, శాస్త్రాలు, అపి :- కూడా, దర్శయతి :- అంటున్నాయి.
భావం :- బ్రహ్మం ప్రకాశవంతమని ఉపనిషత్తులు, స్మృతులు వర్ణిస్తున్నాయి.
వివరణ :- వేదం బ్రహ్మకు అనేక రూపాలు లేవని, రూపం లేని బ్రహ్మ గురించే వర్ణించాయి. పరమాత్మ గురించి తెలుసునా? అని అడిగితే తెలియదు అంటాము. తెలియదా? అని అడిగితే తెలుసును అంటాము. సాధారణంగా బ్రహ్మ అందరికీ తెలుసును. కాని బ్రహ్మను గురించి విశేషంగా ఎవరికీ తెలియదు.అందుకే ఎవరికైతే తెలియదో వారికీ తెలుసును అని కేనొపనిషత్తు తెలియజేస్తోంది. ఈ విధంగానే వేదాలలోనూ, స్మృతులలోనూ చెప్పబడింది. దేవిభాగవతం, (సప్తమ స్కందం, 31వ అధ్యాయం):- దేవతలందరూ తారకాసురుని బాధలు పడలేక హిమాలయాల్లో తపస్సు చేశారు. వివిధ రకాల అర్చనలు, ఆరాధనలు, పూజలు, యాగాలు చేశారు. చైత్రశుద్ధనవమి రోజున దేవి దర్శనం అయింది. అప్పుడు వారి ఎదుట వేదసమ్మతమైన పరంజ్యోతి ప్రత్యక్షమైనది. కోట్లకొలది సూర్య కాంతులతో ప్రకాశిస్తున్నది. ఆరూపం కొన్ని చోట్ల మెరుపు మెరిసినట్లు ఉన్నది. స్త్రీ, పురుష, నపుంసక భేదాలు లేవు. ఆకాంతిని చూడలేక దేవతలు కనులు మూసుకున్నారు. అప్పుడే ఆ దివ్య తేజస్సు ఒక స్త్రీ రూపం దాల్చింది. ఆమెయే పరమేశ్వరి. పరమేశ్వరుని అసలు రూపం నిరాకారమే. కాని ఉపాసన కోసం రూపం దాల్చబడింది. కొన్ని చోట్ల వివరించడానికి వీలు లేక, వ్యతిరేక నిషేధ భావాలతో చెప్పబడింది. ఇతర వస్తువులను నిషేధించి తద్వారా మాత్రమే ఆత్మ స్వరూపం ఉపదేశించబడుతోంది.
బృహదారణ్యకోపనిషత్తు:- నామరూపాలతో ఉన్న ఈ ప్రపంచంలో అన్నింటిని నిషేధించడం ద్వారా నిర్గుణమైన, నిరాకారమైన బ్రహ్మాన్ని తెలుసుకోవచ్చును. అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ అజ్ఞానంతో ఉన్నవారికి నామ రూపాలతో కనిపిస్తాడు. కనిపించే ప్రపంచాన్ని తొలగిస్తే కనబడేది బ్రహ్మమే. గుణములు ఉంటే వర్ణించవచ్చును. కాని నిర్గుణుడైన పరమాత్మను జ్ఞానసాధనతో అజ్ఞానమాయమైన ప్రపంచాన్ని తొలగిస్తే కాని బ్రహ్మన్ని చూడలేరు.
కేనోపనిషత్తు:- తెలియనిదాని కన్నా అధికమైనది, తెలిసినదానికన్నా వేరైనది బ్రహ్మ. తెలియడం, తెలియకపోవడం బుద్ధికి సంబంధించినది. ఈదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు చూస్తుంటారు. వాటి వలన కలిగే అనుభవాలు, వాటి గురించిన సమాచారం స్మృతిలో ఉంటుంది. మరొక ఖండంలో ఉన్న ప్రాంతం గురించి అడిగితే తెలియదు అంటారు. ఆ తెలియనిది ఏదో అదే బ్రహ్మ. బుద్ధిలోఉన్న సమాచారాన్ని బట్టి పరమాత్మను తెలుసుకోలేము. బుద్ధికి అతీతమైన వాడు పరమాత్మ. బుద్ధి ద్వారా ఉపనిషత్తులు, పురాణాలూ అన్నీ చదివి పరమాత్మ గురించి తెలుసుకుంటారు. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్నీ ప్రాపంచిక వ్యవహారాలతో తాదాత్మ్యం చెందడం వలన పరమాత్మను అపవిత్రం చేస్తున్నారు. ఇంద్రియాలు,మనస్సు, వాక్కు అన్నీ బ్రహ్మ దగ్గరగా వెళ్లి, తిరిగి వెనక్కు వచ్చేస్తాయి. బ్రహ్మాన్ని మనస్సు భావించడం లేదు. వాక్కు స్మరించడం లేదు. అందుకోలేనిది ఏదో అదే బ్రహ్మం. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అన్నీ వాటి వృత్తులు అంతమైనప్పుడు మాత్రమే బ్రహ్మలో ఐక్యత ఏర్పడుతుంది. ఏది తెలుసుకుంటే అమృతత్వం పొందుతారో, మోక్షం వస్తుందో అదే బ్రహ్మ. అదే అనాది, అగోచరం, అద్వితీయం, నిరాకారం, సూక్ష్మాతి సూక్ష్మ మైన, నిర్గుణమైన ఆనంద స్వరూపం. ఆ నిరాకార రూపం బుద్ధికి గోచరం కానందున అది సత్ అని చెప్పబడింది. గురువు జ్ఞానబోధ ద్వారా ఆత్మజ్ఞానం పొంది, పరమాత్మను తెలుసు కోవాలి. ఒకప్పుడు నారాయణుడు నారాదునితో, నారదా! సమస్త భూతములు గంధాది గుణాలతో కూడిన వానినిగా నన్ను చూస్తున్నారు కదా! ఇదంతా నా చేత సృజంపబడిన మాయ మాత్రమే. నన్ను నీవు ఈ విధంగా ద్వైత ప్రపంచం తో కూడిన వానినిగా తెలుసుకొనడానికి తగవు అని అన్నట్లుగా శృతిలో చెప్పబడింది. ఈమాయను ఆత్మజ్ఞానం వలన ఛేదించినప్పుడు మాత్రమే బ్రహ్మ తత్త్వాన్ని తెలుసుకోగలరు.
సూత్రం :- 336
" అత ఏవ చోపమా సూర్యకాదివత్ "
అత ఏవ చ :- అందువలనే ( బ్రహ్మం ప్రకాశ స్వరూపం కావటం వలెనే, సూర్య కాదివత్ :- సూర్యుడు, అగ్నితో, ఉపమా :- బ్రహ్మాన్ని వేద వాజ్మమయంతో పోల్చారు.
భావం :- బ్రహ్మ ప్రకాశ స్వరూపం కావటం సూర్యున్ని అగ్నితో, బ్రహ్మాన్ని వేద వాజ్మమయం తో పోల్చారు.
వివరణ:- ఆత్మ చైతన్యరూపమైనది. నిర్విశేషం, వాక్కు మనస్సులకు అతీతమైనది. ఇతర వస్తువులను నిషేధించడం ద్వారా చెప్పదగినది. ఇదికాదు, ఇదికాదు అని అంటూ చెప్పదగినదే కాని ఇది ఇలా ఉంటుంది అని చెప్పడానికి వీలుకాదు. అందుచేతనే దీనికిఉన్న విశేషాలన్నీ కేవలం ఉపాధిసంబంధంచేతనే ఏర్పడినవని, పారమార్థికములు కావని అంగీకరించారు.
కఠోపనిషత్తు(4,13) :- ఆదిత్యవర్ణుడు, జ్యోతి, అగ్ని లాగా పోల్చారు. ఇది ఆయన ప్రకాశ, జ్ఞాన స్వరూపుడని తెలుపుతుంది. ఈఉపమ వలన బ్రహ్మం ప్రకాశ స్వరూపుడని స్పష్టమౌతోంది. బ్రహ్మాన్ని సూర్యాదులతో పోల్చారు కదా! సూర్యుడు ఒకే చోట ఉండి లోకంలో ఉన్న వస్తువులకు వెలుగునిస్తాడు. బ్రహ్మం అంతేనా? ఈ సూత్రంలో బ్రహ్మాన్ని సూర్యుని ప్రతిబింబం ఉపమానంగా చెప్పారు. తేజోమాయుడైన సూర్యుడు ఒక్కడే అయిన కూడా వేరు వేరు కుండలలో ప్రకాశస్తుంటాడు. జన్మ రహితమైన పరమాత్మ ఉపాధి భేదాలను బట్టి అనేక విధాలుగా, సమస్త జీవులలో కనిపిస్తాడు. పరమాత్మ సర్వంతర్యామి అన్నారు కదా! మరి ఇన్ని దేహలుగా ఎలా కనిపిస్తున్నాడు అని సందేహం. పరమాత్మ అంతటా వ్యాపించి ఉండే సర్వంతర్యామి. కనుక అన్ని జీవరాసులలో, ప్రకృతిలో ఉండే ప్రతి అణువు లో కనిపిస్తాడు. స్వచ్ఛమైన నీటిలో సూర్యుడు ప్రతిబింబిస్తే స్వచ్ఛంగానే కనిపిస్తాడు. బురద నీటిలోనూ, కదులుతున్న నీటిలోనూ సూర్యబింబం స్వచ్చంగా కనిపించదు. సూర్యుడు ఒక్కడే. కుండలు, నీరు అనే ఉపాధులను బట్టి సూర్యబింబం కదులుతూ ఉంటుంది. ఈ సూర్యుడు తానోక్కడే అయినా వేరు వేరుగా ఉన్న ఉదకాలను అనుకరిస్తూ అనేకంగా చేయబడతాడో, అట్లే నిత్యుడైన ఈ ఆత్మ కూడా శరీరాలలో ఉపాధి అయిన మాయ చేత వేరువేరు రూపాలు కలవాడుగా కనబడతాడు. కాని ఏ ఆకారము లేని నిరాకారుడు, నిర్గుణ స్వరూపుడు అయిన పరమాత్మ ఉపాధులను బట్టి వేరు వేరు రూపాలలో కనిపిస్తున్నాడు. పరమాత్మ అందరిలో ఉంటే అందరు ఒకేలా ఉండాలి కదా! అని మరొక సందేహం. దీపాలలో ఉన్న నూనె వత్తులు ఒకేలా ఉన్నప్పటికీ, చిన్న ప్రమీదలో కాంతి తక్కువగా ఉంటుంది. పెద్ద దీపంలో కాంతి ఎక్కువగా ఉంటుంది. భగవంతుడు అందరిలో ఉన్నప్పటికీ ఉపాధుల వలన భేదాలు కనిపిస్తున్నాయి.
సూత్రం :- 337
" అంబువ దగ్రహణాత్తు న తధాత్వం "
అంబువత్ :- నీటిలో లాగా, అగ్రహానాత్ :- బ్రహ్మం ప్రతిబింబం కనిపించదు. కనుక న తధాత్వం :- సూర్యాదుల లాగా బ్రహ్మం పరిచ్చిన్నం, ఏక దేశం కాదు.
భావం :- సూర్యాదుల వలె బ్రహ్మం ఏక దేశం కాదు. నీటిలోసూర్యుని ప్రతి బింబం కనిపించినట్లు పరమాత్మ ప్రతిబింబం కనబడదు.
వివరణ:- బ్రహ్మ విషయంలో ఉదకం లాంటి పదార్ధం ఏది లేనందున, బ్రహ్మానికి సూర్యుని ఉపమానంగా చెప్పడం సరిపోదు. ఏసూత్రంలో ప్రతిపక్షి ఎదురు ప్రశ్న వేస్తున్నాడు. జలం వలె దూరంగా గ్రహించక పోవడం వలన జల సూర్యక సాదృశ్యం కుదరదు. ఆకారం గల సూర్యాదుల కంటే వేరుగా దూర ప్రదేశంలో ఉన్న జలం గ్రహింపబడుచున్నది. కనుక అక్కడ సూర్య బింబం కనబడటం యుక్తమే. ఆత్మ మూర్తము కాదు. దీని కన్నా వేరుగా దూరంగా ఏమి లేవు. అందువలన దృష్టాంతం యుక్తంగా లేదు. గురువర్యా! ప్రతిబింబం పడాలంటే ముందు బింబం ఉండాలి. దానికి ఒక రూపం ఉండాలి. అది ఉపాధికి దూరంగా ఉండాలి. సూర్యుని గురించి చెప్పినప్పుడు, దూరంగా నీరున్నది. అందుకనే బింబం ఫలిస్తోంది. కాని ఆత్మ అనేది రూపం గల పదార్ధం కాదు. అది అన్నింటి యందు వ్యాపించి ఉంది. దాని కన్నా వేరైనది లేదు, కాబట్టి మీరు చెప్పిన ఉదాహరణ సరిపోదు అన్నాడు నారాయణ భట్టు. దానికి సమాధానం తరువాత సూత్రంలో రత్నాకరుడు చెబుతున్నాడు.
సూత్రం :- 338
" వృద్ధి హాస భాక్త్వా మంతర్భావా దుభయ సామాంజస్య దేవమ్ "
అంతర్భావాత్ :- బ్రహ్మం అన్ని భూతాల్లో వర్తిస్తున్నందు వలన, వృద్ధి హాస్ర భాక్త్యాం :- వృద్ధి క్షయాలు అంటూ అనడం సరి అయినది కాదు. ఎందుకంటే ఉభయ సమంజస్యాత్ ఏవం :- పదార్ధాల గుణ దోషాలు ఆ పదార్ధం తో సంబంధం ఉన్న వాటికే ప్రాప్తిస్తాయి.
భావం :- బ్రహ్మం అన్ని భూతాల్లో వర్తించడం వలన వృద్ధి క్షయాలు ఉన్నాయనడం సరి కాదు. పదార్ధాల గుణ దోషాలు ఆ పదార్ధం తో సంబంధం ఉన్న వాటికే ప్రాప్తిస్తాయి.
వివరణ:- సర్వవ్యాపకమైన బ్రహ్మం వేటిలో అంతర్యామిగా ఉన్నాడో, ఆ వస్తువుల్లో వృద్ధి క్షయాలు కలుగుతుంటాయి కదా! వాటితో బాటు అంతర్యామి అయిన బ్రహ్మానికి కూడా వృద్ధి క్షయాలు కలగాలి కదా! వృద్ధి క్షయాలు వికారాలు, బ్రహ్మం నిర్వికారి అంటున్నారు. ఇదెలా సాధ్యం అని సందేహం. ఒక వస్తువులో మరొక వస్తువు ఉన్నంత మాత్రాన దాని గుణ దోషాలు ఇది పుణికి పుచ్చుకోదు. సంపర్కం ఉన్న పదార్ధానికే గుణదోషాలు అంటుకుంటాయి. సంపర్కం వలెనే గుణదోషాలు సంక్రమిస్తాయి. ఆకాశం అన్ని పదార్ధాలలో ఉన్నప్పటికీ, ఆయా పదార్ధాలకు కలిగే వృద్ధి క్షయాలు ఆకాశానికి కలగవు. ఆకాశానికి సంగం ఆసక్తి లేనందున పదార్ధాలు పెరిగినా తరిగినా ఆకాశంలో ఏమి మార్పు ఉండదు. అలాగే బ్రహ్మం సర్వ వ్యాపకం కావడం వలన అన్ని వస్తువుల లోపలా బయటా ఒకటిగానే ఉంటుంది. వస్తు వికారాలు బ్రహ్మానికి అంటవు. కనుక బ్రహ్మ అవిచ్చిన్నం, నిర్వకారం. సూర్యుడు జలంలో ప్రతిబింబిస్తున్నాడు. కాబట్టి వృద్ధి క్షయము పొందుతున్నాడు. అదే విధంగా పరబ్రహ్మ ఉపాధిని పొందడం వలెనే వృద్ధి క్షయాలు పొందుతాడు. కుండ, మూకుడు, బాన మొదలైన వాటిలో పోసిన నీటివలన సూర్యబింబం చిన్నదిగానో, పెద్దదిగానో కనిపిస్తుంది. ప్రతిబింబంలో మార్పు ఉంటుంది కాని సూర్య బింబంలో ఏమార్పు ఉండదు. అలాగే బ్రహ్మ కూడా ఉపాధిభేదంతో పెరగడం, తగ్గడం, చలించడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. జలసూర్యకాదిదృస్థాంతం యొక్క ప్రయోజనం మాత్రమే శాస్త్రంలో చెప్పబడింది. ఇక్కడ చెప్పదలచిన సాదృశ్యం జలం పెరిగితే సూర్యబింబం పెరుగుతుంది. జలం తగ్గితే బింబం తగ్గుతుంది. జలం కదిలితే కదులుతుంది. జలం వేరుగా ఉంటే బింబం వేరుగా ఉంటుంది. ఏ విధంగా జల ధర్మాన్ని అనుసరించి సూర్య బింబం ఉంటుంది కాని సూర్యునికి వాస్తవం లో అదేమీ లేదు. మనస్సు, అంతః కరణం లో పరమాత్మ వేరు వేరుగా కనబడటానికి ఉపాదులే కారణం. అర్ధం కాని విషయాన్ని అర్ధం చేసుకోవడానికి, ఏదో ఒక విషయాన్ని పోల్చి చెప్పడానికే ఉపమానం చెబుతారు. అది అన్ని విషయాలలో విశ్లేషణ చెయ్యకూడదు. దేని గురించి చెప్పారో దానినే స్వీకరించాలి. అమ్మాయి ముఖం చంద్రబింబం లా ఉంది అంటే ముఖం చాలా ప్రకాశవంతంగా, ప్రసన్నంగా ఉందని అర్ధం. చంద్రబింబంలో కళ్ళు, ముక్కు నోరు లేవు కదా!ఎలా పోల్చారు అని అనుకో కూడదు. వృద్ధి క్షయాలు పరమాత్మకు ఉండవు. జీవులలో ఉండే ఉపాధి భేదాల వలన పరమాత్మ లో ఉపాధి ధర్మాలైన వృద్ధి క్షయాలు ఉన్నట్లుగా కనిపిస్తుంది.
సూత్రం :- 339
" దర్శనాచ్ఛ "
చ :- పైగా, దర్శనాత్ :- ఉపనిషద్వాక్యాలు కూడా బ్రహ్మనికి ఏ వికారాలు, దోషాలు, దుఃఖాలు, వృద్ధి క్షయాలు ఉండవని చెబుతున్నాయి.
భావం :- బ్రహ్మానికి ఏ వికారాలు, దోషాలు, వృద్ధి క్షయాలు దుఃఖాలు ఉండవని చెబుతున్నాయి.
వివరణ:- సూర్యుడు జలంలో కనిపించినట్లుగా ఆత్మ ఈ దేహము మొదలైన వాటిలో కనిపించడం లేదు కదా! అని కృష్ణ శర్మ సందేహం. దానికి సమాధానం చెబుతున్నాడు రత్నా కరుడు. ప్రతిబింబ రూపంలో పరమాత్మ దేహంలో ప్రవేశిస్తాడని వేదంలో చెప్పబడింది. పరమేశ్వరుడు రకరకాల ఆకారాలతో 84 లక్షల జీవరాశులను సృష్టించాడు. ఇంద్రియాలు గల మానవులను సృష్టించి, బ్రహ్మ రంద్రం ద్వారా వారిలో ప్రవేశ్నించాడు అని ఐతరేయో పనిషత్తులో చెప్పబడింది. ఉపాసన కోసమే బ్రహ్మకు సాకారం చెప్పబడింది కాని, బ్రహ్మకు నిజంగా వృద్ధి క్షయాలు లేవు.
కఠోపనిషత్తు( 5, 11):- సూర్యుడు లోకాలకు నేత్రం అయినా నేత్ర దోషాలు ఆయనకు అంటవు. అలాగే బ్రహ్మం కూడా అన్ని భూతాలకు అంతరాత్మ అయినా, ప్రాణాల దుఃఖాలు ఆయనకు అంటవు. ఆయన దుఃఖాలకు బాహ్యుడు.
బృహదారణ్యకోపనిషత్తు( 4, 4, 22 ):- సర్వాన్ని వశంలో ఉంచుకొని, సర్వానికి ఈశుడై సర్వాధిపతి అయిన పరమేశ్వరునికి ప్రాణుల కర్మ దోషాలు అంటవు. ఈవాక్యాల వలన బ్రహ్మం ఎలాంటి వికారాలకు లోనుకాడని తెలుస్తోంది. పరబ్రహ్మయే దేహాద్యుపాధులలో ప్రవేశించినట్లు చూపుచున్నది. బ్రహ్మ ఒక నిర్వికల్ప లింగము కలదే గాని ఉభయలింగం లేదా విపరీత లింగం అనగా సవిశేష లింగం కాదు. కొందరు ఇక్కడ రెండు అధికరణాలు కల్పిస్తున్నారు. మొదటి దానిలో బ్రహ్మ సమస్త మైన ప్రపంచము అస్తమించగా, ఏకాకారంగా ఉన్నదా! లేక ప్రపంచంతో కూడినదై అనేక ఆకారములతో ఉన్నదా! అన్నది విచారణ చేయబడుతుంది. ఇంద్రియాలు రాక ముందే పరమాత్మ పక్షి వలె అంటే సూక్ష్మ శరీరం ధరించి అన్నీ దేహలలో ప్రవేశిస్తున్నాడు. కనుక వృద్ధిక్షయాలు ఉండవు. వృద్ధిక్షయాలు ఉన్నట్లుగా కనిపిస్తాడు కాని అవి ఉండవు. దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ప్రాణాలు ఏమి లేనివాడు, కోపం, దుఃఖం, శమము లేనివాడు పరమాత్మ. ఆకారం గల బ్రహ్మను, నిరాకారమైన బ్రహ్మను ప్రత్తిపాదిస్తే శ్రుతులు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. అనాకారమైన బ్రహ్మను అంగీకరించినప్పుడు ఇతర శృతులకు గతి చూపించడం కోసం "ప్రకాశవచ్చ " అనే సూత్రం చెబితే సార్ధకత లభిస్తుంది. అంటే ఈశ్వరుడు ప్రకాశవంతుడని అర్ధం చేసుకోవాలి. పరమాత్మ సూర్య చంద్రుల వెలుగు లాగా, జగత్తులో ఉండే పదార్ధాలన్నింటిలోనూ ప్రకాశవంతంగా వ్యాపించిఉన్నాడని తెలుసుకోవాలి.
ప్రకృతైతా పత్త్యాధికరణం ( 3, 2, 22 )
సూత్రం :- 340
" ప్రకృతై తావత్వం హి ప్రతిషేధతి తతో బ్రవీతి చ భూయాం "
ప్రకృతై తావత్త్యoహి :- ప్రాసంగికంగా చెప్పిన, ప్రతిషేధతి :- నిషేదిస్తుంది, తతః :- తరువాతి వాక్యం లో, భూయాః బ్రవీతి :- మళ్ళీ మూర్త అమూర్తముల కన్నా వేరేగా బ్రహ్మాన్ని ప్రతిపా దిస్తుంది.
భావం :- నేతి నేతి అనే ఉపనిషద్వాక్యం ప్రాసంగికంగా చెప్పిన, మూర్త, అమూర్త లక్షణాలలో ఉన్న రూపాన్నే అంటే బ్రహ్మం తాదాత్మ్యకతను మాత్రమే నిషేదిస్తుంది. కాని బ్రహ్మ ఉనికిని నిషేదించదు. మళ్ళీ మూర్త, అమూర్తలకన్నా వేరేగా బ్రహ్మాన్ని ప్రతిపాదించింది.
వివరణ:- గురువు గారు! బృహదారణ్యకోపనిషత్తులో మూర్త, అమూర్త బ్రాహ్మణం అనే ప్రకరణం ఉన్నది. దానిలో పృధివి, జలం, అగ్ని ఈ మూడు మూర్తములు స్థూలములనీ, ఆకాశం, వాయువు అమూర్తములు సూక్ష్మములని వివరిస్తూ, పండితులు బ్రహ్మదర్శనం కోసం నేతి నేతి ఇది కాదు, ఇది కాదు అంటూ శోధన చేసినట్లు చెప్పబడింది. ఇక్కడ నేతి శబ్దం రెండు సార్లు చెప్పబడింది. ఒకటి మూర్తమూర్తాన్ని, రెండవది బ్రహ్మను నిషేదించడానికి చెప్పారు. అందుచేత శ్రుతి వాక్యం బ్రహ్మను నిషేదిస్తుంది కదా! అని అడిగాడు కృష్ణ శర్మ. దానికి సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. ఒక నేతి మూర్తాన్ని , రెండవ నేతి అమూర్తాన్ని నిషేదిస్తుంది. కాని బ్రహ్మను నిషేదించదు. ఈరకంగా అన్నింటిని నిషేదించగా మిగిలేది బ్రహ్మం. అదే సత్యం, నిత్యం, శాశ్వతమైనది.
బృహదారణ్యకోపనిషత్తు ( 2, 3, 1 ):- బ్రహ్మానికి మూర్త, అమూర్తం అని రెండు రూపాలున్నాయి. "అధాత ఆ దేశో నేతి నేతి " ఈ వాక్యంలో లేదు అని ఎవరిని అంటున్నారు? బ్రహ్మమే లేదనా? బ్రహ్మనికి మూర్తమూర్త రూపములు లేవనా? ఈ రెండు రూపములు బ్రహ్మనికే వర్తిస్తాయి కాని బ్రహ్మం ఉనికికి కాదు. బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి ఉపాయంగా లింగ శరీరంతో అంతమయ్యే సూక్ష్మ ప్రకృతిని ఆధ్యాత్మికంగాను, మహాత్ తత్త్వంతో అంతమయ్యే పృద్ధివ్యాది సమస్తజగత్తును అధి దైవంగాను, మూర్త, అమూర్త భేదాల్లో రెండుగా విభజించి దాన్ని బ్రహ్మనికి రూపంగా వివరించారు. ఇంద్రియ గోచరం అయిన ఈ ప్రపంచం తన జన్మ స్థితి లయాలకు కారణంగా బ్రహ్మాన్ని తెలుపుతుంది. అందువలన ప్రపంచాన్ని బ్రహ్మ రూపంగా వర్ణించి చెప్పారు. ప్రపంచం బ్రహ్మ రూపం కనుక నేతి వాక్యం ప్రపంచాన్ని నిషేదిస్తుంది కాని బ్రహ్మం యొక్క ఉనికిని కాదు.
తైత్తరీయో పనిషత్తు ( 2, 6 ) :- బ్రహ్మం లేదనే వాడు తానే లేదనేవాడు అవుతాడు.
కఠోపనిషత్తు ( 6, 13 ) :- బ్రహ్మం ఉందని భావిస్తు బ్రహ్మాన్ని పొందాలి.
బృహదారణ్య కోపనిషత్తు ( 2, 3, 6 ) :- ఇంతకంటే మించినది మరొకటి లేదని అనుకోకూడదు. అది సత్యానికి సత్యం. దాని పేరే సత్యం. అంటే ఏమిటి? మూర్తమూర్త రూపములకు మించిన తత్త్వం మరొకటి ఉన్నది. అదే బ్రహ్మం. ఆయన సత్యం అని బ్రహ్మ ఉనికిని స్పష్టంగా చెబుతోంది. ఒక వస్తువు కనబడింది. దానిని నిషేదిస్తున్నాం. అప్పుడు ఆ వస్తువు లేదని అర్ధమైంది. అయితే అక్కడ ఏదో ఒక వస్తువు కనబడింది కదా! కనబడని దానిని లేదంటున్నాం. కనుక అక్కడ ఉన్నది ఒకటి, కనబడినది మరొకటి అని చెప్పి తీరాలి. ఉదా :- కనబడిన సర్పాన్ని నిషేధించినప్పుడు అది దేని మీద కనబడిందో ఆ తాడు ఉన్నట్లుగా అంగీకరించాలి. ఆ తాడును అంగీకరించకపోతే, ఏదైతే కనబడిందో ఆ సర్పమే నిజమైనట్లు చెప్పవలసిన వస్తుంది. దానిని నిషేధించడం కుదరదు. అదే విధంగా ప్రపంచాన్ని నిషేధించినప్పుడు దానికి ఆధారమైన బ్రహ్మమే అని చెప్పాలి. అది ప్రపంచంగా కనబడింది అని చెప్పకపోతే ప్రపంచాన్ని నిషేధించడం కుదరదు. బ్రహ్మను నిషేధించడం కుదరదు. బ్రహ్మను గురించి చెబుతూ, చివరకు బ్రహ్మే లేదు అని చెప్పడం అసంగతం కదా! ఆ విధంగా నిషేధించడం బ్రహ్మ లేదు అనేవాడు లేనివాడవుతాడు. తనని తాను నిరాకరించుకున్నవాడు అవుతాడు. బ్రహ్మ ఉన్నది అని మాత్రమే అంగీకరించాలి.
సూత్రం :- 341
" త ద వ్యక్తి మాహ హి "
తత్ :- ఆ బ్రహ్మం, అవ్యక్తం :- ఇంద్రియాలకు గోచరం కాదు. అని హి :- నిశ్చయిస్తూ, ఆహ :- ఉపనిషత్ చెబుతోంది.
భావం :- ఆ బ్రహ్మం ఇంద్రియాలకు గోచరం కాని అవ్యక్త రూపమని ఉపనిషత్తు చెబుతోంది.
వివరణ:- బ్రహ్మ అత్యంతసూక్ష్మం, వాక్కు, మనస్సు, ఇంద్రియాలకు వ్యక్తం కాడు. వ్యక్తము, అవ్యక్తము కానటువంటిది, కనులతో దానిని చూడలేనిది, చెవులతో వినలేనిది. మాటలలో చెప్పలేనిదే బ్రహ్మమని చెప్పారు.
కఠోపనిషత్తు(6, 12 ):- వాక్కు, నేత్రాలు మనస్సు లాంటి వాటికి బ్రహ్మాన్ని గ్రహించడం శక్యం కాదు.
ముండ కోపనిషత్తు( 3, 1, 8):- బ్రహ్మం కన్నా వాక్కు లాంటి ఇంద్రియాలకు, తపస్సుకు, కర్మకు అందడు. అయితే బ్రహ్మం అవ్యక్తం అంటున్నారు కదా!
యజర్వేదం(31, 18):-ఆయన్ని సాక్షాత్కారం చేసుకుంటేనే మృత్యువును తరిస్తాం అని ఉంది కదా! ఇంద్రియాలకు తెలియని బ్రహ్మాన్ని ఎలా సాక్షాత్కరించు కోవాలి? నేతినేతి అని అన్నింటిని నిషేధించినా, ఆఆత్మ గ్రహించడానికి వీలుకాదు. ఆత్మ తెలియరానిది. ఇంద్రియాలకు గోచరంకానిది అని గీతలో చెప్పబడింది. నిషేధించబడిన ప్రపంచసముదాయంకంటే భిన్నమైన ఏపరబ్రహ్మ ఉన్నదో, అది నిజంగాఉంటే ఎందుకు గ్రహింపబడలేదు? ఇంద్రియాలచేత గ్రహింపయోగ్యం కాదు. అది సమస్తమైన దృశ్య వస్తువులకు సాక్షి కదా! ఈ విధంగా అదృశ్యం, అగ్రాహ్యం అయిన బ్రహ్మ, నేత్రం చేత గ్రహింపబడదు. ఇతర దేవతల చేత గ్రహింపబడదు. వాక్కు చేత గ్రహింపబడదు.వాక్కు, మనస్సు, ఇంద్రియాలకు వ్యక్తం కానంత మాత్రాన, బ్రహ్మం లేడని అభిప్రాయం సరియైనది కాదు.
సూత్రం :- 342
" అపిచ సంరాధనే ప్రత్యక్షానుమానాభ్యామ్ "
అపిచ :- ఈ రకంగా అవ్యక్తంగా ఉండే బ్రహ్మం కూడా, సంరాధనే :- శ్రవణ, మననాది సాధన సంపత్తి మూలంగా, ఆరాధన ద్వారా ప్రత్యక్షం కాగలడు. ప్రత్యక్ష అనుమానాభ్యామ్ :- ఉపనిషత్తుల వలన స్మృతుల వలన తెలుస్తోంది.
భావం :- అవ్యక్తంగా ఉన్నా బ్రహ్మాన్ని శ్రవణ, మనన సాధనా సంపత్తి మూలంగా, ఆరాధనా ద్వారా పరమాత్మ ప్రత్యక్షం కాగలడని ఉపనిషత్తులు, స్మృతుల వలన తెలుస్తోంది.
వివరణ:-ముముక్షువులైన యోగులు శ్రవణ, మనన, భక్త్యారాధనాది సాధన సంపత్తిలో ఎంతోకాలం ప్రయత్నించి, నిర్వికల్ప సమాధిలో స్వయంగా బ్రహ్మసాక్షాత్కారం చేసుకుంటారు. భగవంతుని కృపకు పాత్రులైనవారికి లభించనిది ఏది ఉండదు.
కఠోపనిషత్తు(2, 23):-పరమాత్మని వరించేవాడే ఆయన్ని పొందుతాడు. అతనికే ఈశ్వరుడు తనస్వరూపాన్ని అవగతం చేస్తాడు.
మనుస్మృతి(6, 65):- యోగంద్వారా పరమాత్ముడి సూక్ష్మత తెలుస్తోంది. ముముక్షువులకు బ్రహ్మసాక్షాత్కారం కావాలంటే సంరాధన సరిపోతుందా? ఇంకాఏమైనా కావాలా? యోగులు మొదలైనవారు సమాధిస్థితిలో ఆత్మదర్శనం చేసుకుంటారని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి. ఆత్మఅనేది కనులతో చూడబడదు. చెవులకు వినబడదు. నోటితో మాట్లాడబడదు. నేతినేతి అని లౌకిక ప్రపంచంలో అన్నింటిని నిషేధించినప్పటికీ ఆఆత్మ గ్రహించడానికి వీలుకాదు. ఆత్మ తెలియరానిది. అవ్యక్తమైన ఆఆత్మను యోగులు సంరాధన కాలమునందు చూస్తారు. భక్తి జ్ఞానం మొదలైన వాటి అనుష్టానానికి సంరాధనం అని పేరు. సంరాధన కాలంలో ఎలా తెలుస్తుందంటే, ప్రత్యక్ష , అనుమాన ప్రమాణాల చేత, అంటే శ్రుతి, స్మృతుల చేత అని అర్ధం. మానవ జన్మ వచ్చిన ప్రతి వారు ఆత్మ సాక్షాత్కారం పొందే అవకాశం ఉన్నప్పటికీ, జీవులు కళ్ళకు కనిపించే దృశ్య ప్రపంచాన్నే చూస్తారు కాని వారి హృదయంలో ఉన్న అంతరాత్మని చూడలేరు. మోక్షాన్ని పొందాలనే బుద్ధిమంతుడైన యోగి అంతర్ముఖుడై, జ్ఞానం నిర్మలమై, అటు పిమ్మట ధ్యానం చేస్తూ, అఖండమైన పరమాత్మను చూడగలుగుతాడు. ప్రత్యక్షప్రమాణం అంటే దృష్టి రిధిలో ఉంటూ, కనులతో చూస్తూ, ఏదైనా ఇంద్రియఅవయవం ద్వారా గుర్తించగలగడం. దీనిని ఎవరూ కాదనలేరు. అనుమాన ప్రమాణం అంటే శబ్ద/ఆప్త వాక్యప్రమాణంద్వారా తాను నమ్మే ప్రమాణగ్రంధంలో ఉన్నందువలన గాని, తాను విశ్వసించే వారెవరైనా చెప్పినందువలన గాని, అంగీకరించడం. మంటను కళ్ళతో చూస్తుంటే అది ప్రత్యక్షప్రమాణం. దూరంగా వస్తున్న పొగను చూసి, అక్కడ నిప్పు ఉందని ఉహించి చెప్పడం అనుమానప్రమాణం. యోగులు అవ్యక్తమైన బ్రహ్మన్ని సమాధి, అభ్యాసాలలో ప్రత్యక్ష, అనుమాన ప్రమాణాల చేత బ్రహ్మాన్ని తెలుసుకుంటారు. అలసత్వం లేనివారు, శ్వాసను జయించినవారు, ఇంద్రియాలను నిగ్రహించువారు, సంతుష్టాంతరంగులు అయిన యుంజానులు (యోగాభ్యాసం చేస్తున్న యోగులు) మాత్రమే ఆ భగవంతుణ్ణి చూస్తారని స్మృతి చెబుతున్నది.
సూత్రం :- 343
" ప్రకాశాది వచ్చా వైశేష్యం ప్రకాశశ్చ కర్మణ్యభ్యాసాత్ "
ప్రకాశాదివత్ :- అగ్ని, జలం మొదలైన వాటిలాగా, అవై శేష్యం :- అవిభాగత ఉంటుంది. చ :- అంతే కాక, ప్రకాశః చ :- ఈ అవిభాగత కూడా, కర్మణి :- ఆరాధన విషయంలో, అభ్యాసాత్ :- ఎన్నో సార్లు అభ్యాసనం వలన కలుగుతుంది.
భావం:- అగ్ని, జలం మొదలైన వాటికి అవిభాగత ఉంటుంది. ఆరాధన విషయంలో ఎన్నోసార్లు అభ్యాసనం వలన అవిభాగత కలుగుతుంది.
వివరణ:- జీవాత్మ, పరమాత్మలు భేదం లేదు. ఆరెండు ఒక్కటే. కేవలం వస్తురూపం పొందటం వలన భేద భావం కనిపిస్తుంది. అగ్నికి వేడి-ప్రకాశం, జలానికి చల్లదనం వీటికి విడదీయరాని అవిభాగత ఉంటుంది. అలాగే శుద్ధమైన జీవాత్మకు పరమాత్మలో అవిభక్తతత ఏర్పడుతుంది. ఇది నిత్యం. ముముక్షువులు నిర్వికల్ప సమాధిలో, చిత్తవృత్తులు నశించి, స్వయంగా శుద్ధ స్వరూపులై, అభ్యాసం వలన అవిభక్త భావన కలిగి, పరమాత్మలో చేరతారు.
సాంఖ్య దర్శనం(5, 116):- "సమాధి, సుషుప్తి, మోక్షేషు బ్రహ్మరూపత్ " సమాధిలోనూ, సుషుప్తిలోనూ, మోక్షంలోను జీవులకు బ్రహ్మరూపత కలుగుతుంది... అందువలన బ్రహ్మదర్శనం కోసం ఆరాధన ఎంత అవసరమో నిత్యఅభ్యాసం కూడా అంతే అవసరం. దానితో బ్రహ్మసామ్యం కలుగుతుందని సూత్రాభిప్రాయం. ఆత్మ ఉపాధి వలన భిన్నంగా కనబడుతుంది. కాని వాస్తవంలో విశేషం లేదు. వేదాంతంలో జీవబ్రహ్మభేదం అనేక పర్యాయములు చెప్పడం వలన జీవుడు, ఈశ్వరుడు వేరుగా కనిపిస్తున్నారు. ఉపాధుల వలన సూర్యప్రకాశం వేరువేరుగా కనబడుతున్నా సూర్యుడు ఒక్కడే. ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు నీటికుండలలో ప్రతిబింబాలు వేర్వేరుగా కనిపిస్తాయి. నీరు స్వచంగా ఉంటే బింబం ప్రకాశ వంతంగా ఉంటుంది. నీరు కదిలితే బింబం కూడా కదులుతుంది. దేహము కుండ, మనస్సు నీరు, పరమాత్మ సూర్యుడు అనుకుంటే మనస్సు స్వచ్చంగా ఉంటే వానిలో పరమాత్మ జ్ఞానం కలిగి ఇంద్రియాలు వాటి ఉపాధులను పరమాత్మ వదిలేస్తే, జీవాత్మ నశించి అక్కడ చైతన్యరూపమైన పరమాత్మయే ఉంటాడు. తాను జీవుడిని అని అనుకోవడమే భ్రమ, అసత్యం. స్వప్నపురుషుడు స్వప్నంలో అనేక దృశ్యాలు, అనుభవాలుచూసి అవన్నీ యదార్ధమేనని భ్రమపడుతుంటాడు. మేల్కొన్న తరువాత అవన్నీ మాయేనని తెలుసుకుంటాడు. జాగ్రదావస్థలో చూస్తున్న దృశ్యప్రపంచం, ఉపాధులు అన్నీ మాయేనని యదార్ధంగా అంతా పరమాత్మేనని గ్రహించాలి. ఈ ఆత్మ భేదం ఉపాధుల వలన ఏర్పడినదే. స్వతః అయితే ఏకాత్మ తత్వమే. అందువల్లనే వేదాంతాలలో అభ్యాసం చేత అనేక పర్యాయములు జీవ ప్రాణులకు అభేదం ప్రతిపాదించబడింది.
సూత్రం :- 344
" అతో నంతేన తధాహి లింగమ్ "
అతః:- ఆ అవిభాగత వల్ల, అనంతేన :- అపరిచ్చిన రూపంతో, వ్యాపక రూపంతో బ్రహ్మ దర్శనం కలుగుతుంది. తధాహి :- అని, లింగమ్ :- శాస్త్రాలంటున్నాయి.
భావం :- జీవేశ్వరుల మధ్య అవిభాగత వలన అపరిచ్చిన్న రూపంతో, వ్యాపక రూపంతో బ్రహ్మ దర్శనం కలుగుతుంది.
వివరణ:- జీవాత్మకు, పరమాత్మకు మధ్య ఉపాధుల, అజ్ఞానం వలన భేదం వచ్చింది. ఉపాధులు నివృత్తి చెందగానే వారి మధ్య అభేదం కలుగుతుంది. అప్పుడే జీవుడు కూడా ఆనందమయమైన, అనంతమైన బ్రహ్మ అవుతాడు. జీవేశ్వరుల మధ్య భేదాభేదాలు రెండు ఉంటాయి. పారమార్దికంగా వారి మధ్య తేడా లేదు. మోక్షం పొందనంతవరకు ఇద్దరి మధ్య భేద భావంతో, జీవుడు తాను పరమాత్మ కన్నా భిన్నమనే అనుకుంటాడు. సాధనలో, సమాధిస్థితిలో తాను అనేవాడు లేడని , ఆత్మదర్శనం చేసుకొని, ఉన్నదాంతా ఈశ్వరుడేనని అభేద స్థితికి వస్తాడు అని పూర్వ పక్షం వారి ఆక్షేపణ.
ఋగ్వేదం (1, 2, 7, 20):- ఆత్మవిదులు పరమాత్మను అంతటా చూస్తారు. ఆకాశంలో సూర్యుడు తన ప్రకాశంలో వ్యాపకుడై ఉన్నట్లుగానే వ్యాపకుడైన పరమాత్మను వీక్షిస్తారు. జీవుడు పరమాత్మలో ఐక్యం పొందుతాడు అని శ్రుతి రూపమైన లింగం ఉన్నది కదా! జీవుడు తనలో ఉన్న అజ్ఞానాన్ని జ్ఞానంచేత పోగొట్టుకుని, శ్రవణమననాదులను నిరంతరం అభ్యసించడం వలన శుద్ధుడైన జీవుడికి సమాధి అవస్థలో సర్వవ్యాపకుడైన ఈశ్వరుడి సాక్షాత్కారం లభిస్తుంది. అనంతుడైన ఈశ్వరునితో ముమక్షువులు ఏకత్వాన్ని పొందుతారు. ఆవిధంగానే ఎవడైతే ఆపరబ్రహ్మను తెలుసుకుంటాడో, అతను బ్రహ్మగానే అవుతాడు. ఎల్లప్పుడూ బ్రహ్మగానే ఉన్న జీవుడు బ్రహ్మను పొందుతాడు.
సూత్రం :- 345
" ఉభయ వ్యపదేశాత్ అహి కుండలవత్ "
ఉభయ వ్యపదేశాత్ :- రెండు రకాలుగా చెప్పారు కనుక, అహి కుండలవత్ :- కుండలాకారంగా ఉన్న సర్పం లాగా బ్రహ్మాన్ని అంగీకరించాలి.
భావం :- రెండు రకాలుగా చెప్పారు కనుక కుండలాకారంగా ఉన్న సర్పం లాగా బ్రహ్మాన్ని అంగీకరించాలి.
వివరణ:- జీవుడికి, ఈశ్వరుడికి మధ్య భేదం లేదు. పాము చుట్ట చుట్టుకొని పడుకుంటుంది.అప్పుడు దానిని కుండల సర్పం, సర్పకుండలం అని రెండురకాలుగా వ్యవహరిస్తారు. ఉన్నది ఒక్కటే సర్పం. చుట్టచుట్టుకొని పడుకున్న పాముకు, నిలువుగా ఉన్న పాముకుఉన్న తేడా ఎంతో, జీవాత్మ పరమాత్మల మధ్యతేడా కూడా అంతే. బారుగా ఉన్న పాముకు, పాముచుట్టకు తేడాలేదు. అలాగే జీవుడు, పరమేశ్వరుడు ఒక్కటే. అలాగే బ్రహ్మాన్నికూడా జ్ఞానస్వరూపం, జ్ఞానాశ్రయం అని రెండు రకాలుగా సంభోదించడంలో ఏదోషంలేదు. నిర్వికారుడైన పరమేశ్వరుని ధ్యానిస్తున్న వాడే జీవుడు. పరాత్పరుడైన ఆ దివ్యపురుషుణ్ణి జీవుడు పొందుతున్నాడు. ఇదే వీరి మధ్య భేదం. మూర్తామూర్త రూపకమైన జగత్తు కన్నా భిన్నం బ్రహ్మ అన్నారు. జగత్కారణం బ్రహ్మ అన్నారు. అయితే బ్రహ్మ స్వరూపం ఎలాంటిది? బ్రహ్మం జ్ఞానానికి ఆశ్రయమా? లేక జ్ఞాన స్వరూపమా? జ్ఞానానికి ఆశ్రయమైతే ప్రజ్ఞానం బ్రహ్మ.
ఐతరేయోపనిషత్తు( 3, 3 ):- ప్రజ్ఞానమే బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని జ్ఞాన స్వరూపంగా ఎందుకు వర్ణిస్తారు? పోనీ జ్ఞాన స్వరూపమైతే, యః సర్వజ్ఞ సర్వవిత్.
ముండకోపనిషత్తు( 1, 1, 5 ):-ఆయన సర్వజ్ణుడు. అంతా తెలిసినవాడు అని ఎందుకన్నారు? ఇలా జ్ఞానస్వరూపం, జ్ఞానానికి ఆశ్రయం అని రెండు రకాలుగా ఒప్పుకోవాలి? దానికి సమాధానం ఈ సూత్రంలో చెప్పారు.
బృహదారణ్యకోపనిషత్తు:-ఎవరు లోపలఉంటూ, అన్నింటిని నియమిస్తున్నాడో అతడే ఆత్మ అని చెప్పారు. ఇక్కడ నియమిస్తున్న వాడు, నియమింపబడేవాడు ఇద్దరూ ఒక్కటే. మహావాక్యాలు కూడా ఈ మాటే చెబుతాయి. తత్త్వమసి - నీవే ఆత్మవు, అహం బ్రహ్మాస్మి-నేనే పరబ్రహ్మను, కాబట్టి జీవాత్మ, పరమాత్మ రెండుఒకటే, వేరుకాదు. ధ్యానించేవాడు - ధ్యానింప బడేది, అనే సంబంధం చేత చూచేవాడు-చూడదగిన వాడు, అనే సంబంధం చేత నియమించేవాడు-నియమింపబడేవాడు అనే సంబంధం చేత కొన్ని చోట్ల జీవునకు ప్రాజ్ఞనకు భేదం చెప్పబడుచున్నది. కొన్ని చోట్ల తత్వమసి జీవేశ్వరులకు అభేదం చెప్పబడుచున్నది. ఈ విధంగా భేదాభేదాల రెండింటి వ్యపదేశం ఉన్నప్పుడు కేవలం అభేదమే గ్రహింపడినట్లయితే భేద వ్యపదేశానికి ఆధారం లేకుండా పోతుంది. అందుచేత ఉభయవ్యపదేశం కనబడుచున్నది. ఇక్కడ తత్వం అహి కుండల వలె ఉంటుంది. ఒక జంతువును చూసి ఇది సర్పం అంటే అది అభేదం. దానిని గూర్చి కుండలం ( పాము చుట్ట ) దాని శరీరం పొడవు, ఇత్యాది విధంగా చెప్పినట్లయితే ఎలా భేదం ఉండదో, అట్లే బ్రహ్మాన్ని కూడా జ్ఞానస్వరూపంగా, జ్ఞానాశ్రయంగా వ్యవహారించారు.
సూత్రం :- 346
" ప్రకాశాశ్రయవత్ వా తేజస్త్వాత్ "
వా :- లేదా, తేజ స్వాత్ :- తేజస్సు అనే గుణం వలన, ప్రకాశాశ్రయావత్ :- ప్రకాశానికి ఆశ్రయమైన ( కారణమైన తేజస్సులాగా, బ్రహ్మం జ్ఞాన స్వరూపమని, జ్ఞానాశ్రయమని తెలుసుకోవాలి.
భావం :- తేజస్సు అనే గుణం వలన ప్రకాశానికి ఆశ్రయమైన బ్రహ్మం జ్ఞాన స్వరూపమని, జ్ఞానాశ్రయమని తెలుసుకోవాలి.
వివరణ :- సూర్యునికి సంబంధమైన ప్రకాశం, దానికి ఆశ్రయ మైన సూర్యుడు ఈ రెండు కూడా తేజస్సులే. ఆ రెండు ఏ విధంగా అభిన్నములో, అట్లే జ్ఞాన స్వరూపమైన బ్రహ్మం , జ్ఞానశ్రయమైన బ్రహ్మ రెండు ఒక్కటే.
యజుర్వేదం(22, 1) :- " తేజోసి శుక్రం అమృతమ్ " బ్రహ్మ తేజస్సు, శుక్రం, అమృతం " అగ్ని విద్యుత్తు లాంటి పదార్ధాలు ప్రకాశ స్వరూపాలు, ఇతర పదార్ధాలు ప్రకాశించేటట్లు కూడా చేస్తాయి. అవి ప్రకాశాలు, ప్రకాశానికి ఆశ్రయాలు కూడా. అలాగే బ్రహ్మం జ్ఞాన స్వరూపం, జ్ఞేయం కూడా. అందువలన జ్ఞానానికి ఆశ్రయం. కాబట్టి బ్రహ్మాన్ని జ్ఞాన స్వరూపం, జ్ఞానాశ్రయమని వర్ణించారు. ప్రకాశానికి, ప్రకాశానికి ఆశ్రయమైన సూర్యునికి భేదం లేదు. సూర్యుని ప్రకాశమైన వెలుగు, ఎండను సూర్యుని నుండి వేరుగా ఉన్నాయని, వాటిమధ్య భేదం ఉన్నట్లుగా భావిస్తారు. యదార్ధంగా వాటిమధ్య భేదం లేదు. జీవుడు, పరమేశ్వరుడు మధ్య ఉన్న భేదం, అభేదం రెండు ఒక్కటేనని అంగీకరించాలి. జీవేశ్వరుల మధ్య భేదాన్ని అంగీకరిస్తే జీవుడు ఎప్పటికి ఈశ్వరుడు కాలేడు. ఇద్దరి మధ్య అభేదాన్ని అంగీకరిస్తే యదార్ధంగా ఉన్నది పరమాత్మయే నని, జీవుడనే వాడు లేడని తెలుస్తుంది.
సూత్రం :- 347
" పూర్వవత్ వా "
పూర్వవత్ పూర్వం ( 2, 3, 43 ) లో చెప్పినట్లుగా, వా :- జీవాత్మ లాగా బ్రహ్మాన్ని కూడా నిర్ధారించవచ్చును.
భావం :- పూర్వం చెప్పినట్లుగానే బ్రహ్మాన్ని కూడా నిర్ధారించవచ్చును.
వివరణ:-(2, 3, 43)సూత్రంలో బ్రహ్మతో జీవికిగల సంబంధాన్ని వివరించారు. జీవాత్మ బ్రహ్మానికి అంశమని, తండ్రి కొడుకులకు అంశ, అంశి భావం ఉన్నట్లే, జీవబ్రహ్మల సంబంధం ఉన్నదని శాస్త్రాలు చెబుతున్నాయి. అంశం అంటే కుమారుడు, అంశి అంటే తండ్రి అలాగే బ్రహ్ - అంశి, జీవుడు - అంశ. బ్రహ్మ జీవులందరికి తండ్రిలాంటి వాడని భావం. జీవుడికి ఈశ్వరుడికి భేదం చెప్పిన, చెప్పక పోయినా కూడా జీవుడు ఈశ్వరుని అంశమే. ఈ భేదం ఉపాధి వలన వచ్చింది. అంటే అవిద్య అజ్ఞానం వలన వచ్చింది. అవిద్య నశిస్తే ఈ భేద భావం నశిస్తుంది.
ప్రశ్నపనిషత్తు( 4, 9 :- ఏష హి ద్రష్టా, స్రష్టా, శ్రోతా, ఘ్రాతా, రసయితా, మంతా, బోద్ధా, కర్తా, విజ్ఞానాత్మ, పురుషః " జీవుడు జ్ఞానంతో బాటు దర్శక, స్పర్శ, శ్రవణాది, జ్ఞానాలకు ఆశ్రయుడు. అలాగే పరమాత్మకూడా జ్ఞానస్వరూపుడైన జ్ఞానాశ్రయుడని చెప్పవచ్చును. అవిద్యతో ఏర్పడిన బంధాన్ని తొలగించాలంటే ఆత్మ జ్ఞానంతో మోక్షాన్ని సాధించాలి. అలాకాక అహి కుండల న్యాయం చేత అంటే పాము యొక్క చుట్ట వలె పరమాత్మ యొక్క ఒక అవయవంగా ఉన్న ఒక ఆత్మ నిజంగానే బద్ధుడు అవుతాడు అని అంగీకరిస్తే అప్పుడు పారమార్దిక మైన బంధాన్ని తిరస్కరించడం శక్యం కాదు. కనుక మోక్ష శాస్త్రము వ్యర్థం అయిపోతుంది. ఇక్కడ శ్రుతి భేదాభేదాలను రెండింటిని ఒకే విధంగా నిర్దేశించడం లేదు. ఆభేదాన్ని ప్రధానంగా ప్రతిపాదింపదగినదిగా నిర్దేశిస్తూ, మరొక విషయం చెప్పాలని అభిప్రాయంతో ప్రత్యక్షాదుల ద్వారా 'ప్రకాశాది వచ్చా వైశేష్యం ' అని చెప్పడం జరిగింది.
సూత్రం :- 348
" ప్రతి షే ధాత్ చ "
చ :- అంతే కాక, ప్రతిషేధాత్ :- గుణ గుణి భావాల నిషేధం వలన కూడా బ్రహ్మాన్ని జ్ఞాన స్వరూపం అని చెప్పవచ్చును.
భావం :- గుణ గుణి భావాల నిషేధం వలన కూడా బ్రహ్మాన్ని జ్ఞాన స్వరూపం అని చెప్పవచ్చును.
వివరణ:-జ్ఞానమనేది గుణం. ఆ గుణం గుణి కన్నా వేరు కాదు. గుణస్వరూపం కానేరదు. ఇలా జ్ఞానతత్త్వాన్ని, జ్ఞానం ఉన్న వాడిని వేరుచేయలేము. ఈ గుణగుణిభావం బ్రహ్మానికి వర్తించదు. పరమాత్మకన్నా భిన్నమైన మరొక చైతన్యాన్ని నిషేదిస్తోంది. బ్రహ్మ కంటే వేరైనా ప్రపంచం, జీవుడు లేరు. జీవుడు అని అనుకోవడం నిజం కాదు. నేను పరమాత్మను అనేదే నిజం. ప్రకృతిలో కనిపిస్తున్న వృక్షాలు, జంతువులు, పక్షులు అన్నీ పరమాత్మ. పరమాత్మ కన్నా వేరైనా ద్రష్ట ఎవరు లేరు. బ్రహ్మకారణ రహితుడు, కార్యరహితుడు బ్రహ్మకన్నా భిన్నమైనది ఏది లేదు. నీతి అనే పదం బ్రహ్మను నిరోధించదు.
పరాధికరణం ( 3, 2, 31 )
సూత్రం :- 349
" పరమతః సేతూన్మాన సంబంధ భేద వ్యపదేశాభ్యః "
ఇది పూర్వ పక్ష సూత్రం. అతః :- బ్రహ్మం కన్నా, పరం :- సూక్ష్మమైనది. సేతువు :- వంతెన, ఉన్మానం :- కొలత, సంబంధం :- ఆత్మతో బ్రహ్మ కున్న సంబంధం, భేదం :- చూసే వాడికి, చూడబడే వాడికి భేదం
భావం:- దృశ్యమాన ప్రపంచంకన్నా సూక్ష్మమైనది బ్రహ్మం అని అన్నారు. మరి బ్రహ్మం కన్నా పరం ఇంకొకటి లేదా? సేతువు, ఉన్మానం, సంబంధం, భేదం అని ఉపనిషత్తులలో వర్ణాలు ఉన్నాయి కదా! అందువలన బ్రహ్మం కన్నా పరమైనవి ఎందుకు ఉండ రాదు? అని పూర్వ పక్ష వాదన.
వివరణ:- ఇంతవరకు బ్రహ్మకన్నా పరమైనది ఏదిలేదు అని అన్నారు. కాని వేదంలో కొన్ని చోట్ల సేతువు అంటూ భేదాన్ని చెప్పడం వలన బ్రహ్మ కన్నా వేరైన వస్తువు ఏదైనా ఉన్నదా? అని అడిగాడు నారాయణ భట్టు. సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. సేతువు, ఉన్మానం, సంబంధం, భేదములను చెప్పడం వలన బ్రహ్మంకన్నా వేరైనా వస్తువు ఉన్నదని తెలుస్తోంది అంటున్నారు. సేతువు :- నదులు, కాలవల పైన దాటడానికి కట్టిన నిర్మాణం, ఛాందోగ్యంలో పరమేశ్వరుడు ఈ జగత్తును దాటించే సేతువు అని చెప్పారు. ఉన్మానం :- ఇంత పొడవు, బరువు, పరిమితి అని కొలత తూకము చెప్పబడింది. ఛాందోగ్యం లో బ్రహ్మకు నాలుగు పాదాలున్నాయి.అని చెప్పబడింది. సంబంధం:- ఆత్మతో బ్రహ్మకున్న సంబంధం. సుషుప్తిలో జీవుడు బ్రహ్మతో కలుస్తున్నాడు అని ఛాందోగ్యంలో చెప్పారు. భేదం :- చూసే వాడికి, చూడబడేవాడికి భేదం. పరమాత్మ చూడదగిన వాడు. తెలుకోదగిన వాడు అన్నారు. అంటే చూసేవాని కన్నా తెలుసుకునే దాని కన్నా భిన్నమైన వాడు. దీని వలన ఈశ్వరుని కన్నా వేరైనా వాడు ఇంకొకడు ఉన్నాడు అని తెలుస్తోంది. అని వారి వాదం.
ఛాందోగ్యోపనిషత్తు ( 8, 4, 1 ):- ఇక్కడ బ్రహ్మాన్ని సేతువుతో పోల్చారు. సేతువుకు అవతల ఏమి లేకుండా ఉండదు కదా! సేతువుకు అవతల ఏదైనా ప్రదేశం ఉంటుంది. దీని వలన బ్రహ్మనికి పరంగా ఏదో ఉంటుందని తెలుస్తోంది కదా!
ఋగ్వేదం (8, 4, 17, 3) :-" పాదో న్య విశ్వా భూతాని " సమస్త భూతాలు బ్రహ్మనికి ఒక కొలత ఏర్పడుతుంది. బ్రహ్మనికి నాలుగు పాదాలు అన్నారు. కనుక బ్రహ్మం పరిమితమై అంత కన్నా పరమైనది ఇంకొకటి ఉన్నదని తెలుతోంది కదా! అలాగే సంబంధం వ్యపదేశాల వల్ల బ్రహ్మానికి పరతత్వం మరొకటి ఉంటుందని అనుకోవాలి
ఛాందోగ్యోపనిషత్తు( 8, 12, 3 ) :- జీవుడు పరం జ్యోతి అయిన పరబ్రహ్మను పొంది, స్వస్వరూపంతో ఉంటాడు. జీవుడు పొందే వాడు. జీవుడికి బ్రహ్మ పొందదగినది.ఇలా జీవబ్రహ్మాలకు ప్రాప్తి, ప్రాప్తవ్యభావం ఏర్పడుతుంది. జీవుడికి బ్రహ్మం ప్రాప్తవ్యమైనట్లు, మరో ప్రాప్తవ్యం బ్రహ్మనికి పరంగా ఉండవచ్చు కదా! బ్రహ్మసాక్షాత్కారం కలిగిన తరువాత ముముక్షువులు పొందే చోటు బ్రహ్మం కాక బ్రహ్మ పదం అన్నారు.
కఠోపనిషత్తు(3, 8 ):- ముక్త జీవుడు మళ్ళీ పుట్టుక లేని బ్రహ్మ పదాన్ని పొందుతాడు. దీని వలన బ్రహ్మ పదం, బ్రహ్మ కన్నా వేరు అని తెలుస్తోంది. బ్రహ్మకన్నా పరతత్వం మరొకటి ఉందని తెలుస్తోంది. ఇలా శ్రుతులలో కొన్ని వాక్యాలు కనబడటం వలన బ్రహ్మకన్నా ఉత్కృష్టమైన మరొక తత్త్వం ఉందని పూర్వపక్ష వాదన. సేతువ్యపదేశం వలన ఆత్మశబ్దం చేత చెప్పబడిన బ్రహ్మ సేతువు అని చెప్పబడుచున్నది. జలప్రవాహాన్ని అడ్డుకునే మట్టి కర్రలు మొదలైన వాటి సముదాయాన్ని సేతువు అని పేరు. ఇక్కడ సేతు శబ్దం ఆత్మ విషయంలో ప్రయోగించబడింది. లౌకిక మైన సేతువు దాటి సేతువు కంటే భిన్నమైన అనాత్మ వస్తువును పొందుతాడు అని తెలుస్తోంది. మనుషులకు నగరాలతో సంబంధం ఉన్నట్లు మిత్రులకు మిత్రులతో సంబంధం ఉన్నట్లు, జీవులకు సుషుప్తిలో బ్రహ్మతో సంబంధం ఉంటుందని చెబుతున్నది. అందువలన బ్రహ్మ కన్నా పరమైనది ఏదో ఉన్నదని తెలుస్తోంది. భేద వ్యపదేశం కూడా ఈ విషయాన్ని సూచిస్తోంది. బ్రహ్మ బంగారు రంగుతో ప్రకాశిస్తున్న జ్యోతి స్వరూపుడు. ఈశ్వరునికి ఆదిత్యుడు ఆధారమని చెప్పి, అక్షి పురుషుడు, సూర్య మండలం లోని బ్రహ్మ వేరు అని పూర్వ పక్షం అభిప్రాయం. దీనిని మహర్షి నాలుగు సూత్రాలలో సమాధానం చెప్పారు.
సూత్రం :- 350
" సామాన్యాత్ "
సామాన్యాత్ :- సామాన్యమైన పోలిక వలన, తు :- మాత్రమే
భావం :- సామాన్యమైన పోలిక వలన మాత్రమే బ్రహ్మాన్ని సేతువుతో పోల్చారు.
వివరణ :- బ్రహ్మ సేతువు వంటి వాడు అనడం కన్నా బ్రహ్మం కన్నా వేరైన వస్తువు ఇంకొకటి ఉన్నదని కాదు. సేతువు నీటిని అడ్డగించి ప్రవాహాన్ని ఆపుతుంది. నదీజలం వల్ల త్రోవకు అడ్డురాకుండా ఉంటుంది. అలాగే బ్రహ్మం జగత్తును ధరించి ఉన్నది. ఇలాంటి ధారణ అనే పోలికతో బ్రహ్మాన్ని సేతువు అన్నారు. కాని మరొకటి కాదు. ఇతర విషయాల్లో బ్రహ్మాన్ని సేతువుతో పోల్చరాదు. సేతువు నీటిప్రవాహన్ని నిలబెట్టినట్లుగా జగత్తును, దాని కట్టుబాట్లను నిలపడమే ఆత్మకు సేతువుతో ఉన్న పోలిక. ఇక్కడ సేతువు అంటే సేతువును దాటి బ్రహ్మాన్ని పొందాలి. సేతువును రాయి తోనే, చెక్కతోనో చేస్తారు. అంత మాత్రాన బ్రహ్మం దారు పాషాణ మయం అవుతుందా? కనుక ఈ పోలికతో బ్రహ్మనికి మరొక తత్వం ఉందని అనుకోవడం పొరబాటు. బ్రహ్మం కన్నా భిన్నమైన వేరొక వస్తువు ఉండటానికి వీలు లేదు. అందుకు ప్రమాణం ఏది లేదు. ఆత్మ సేతువు అని మాత్రమే చెప్పింది కాని ఆత్మ కంటే పరమైనది ఉన్నదని చెప్పలేదు కదా! సేతువుకు మరొక వస్తువు లేకపోతే సేతుత్వం కుదరదు. కనుక మరొక వస్తువును కల్పించాలి అన్నట్లయితే న్యాయం కాదు. ఇది బ్రహ్మనికి అజత్వాన్ని (జన్మ రాహిత్యం) బోధించే శృతికి విరుద్ధం కదా! విషయాన్ని అర్ధం చేసుకోవడానికి, లోపల ఉన్న సమస్త ధర్మములతో బంధిస్తాడు. ఎవరైతే జ్ఞానం కలిగి ఆధ్యాత్మిక సాధనలో మోక్షార్థులై ఉంటారో సంసార సాగరాన్ని దాటడానికి బ్రహ్మ సేతువుగా ఉపయోగపడతాడు. సేతువుకు ఆవల ఒడ్డు ఉంటుంది కాని బ్రహ్మనికి ఒడ్డు లేదు. అతడు వ్యాకరణం దాటాడు అన్నప్పుడు వ్యాకరణశాస్త్రాన్ని పొందాడు అని మాత్రమే అర్ధం కాని దానిని దాటినవాడు అనే అర్ధం కాదు. అట్లే ఆత్మ సేతువును దాటుతోందని కాదు. పొందడం అనే అర్ధాన్ని అది బోధిస్తుంది. పుట్టిన ప్రతి వస్తువు యొక్క సముదాయం జన్మాదికం వల్లనే జరుగుతుందనీ, కార్యం కారణం కంటే భిన్నం కాదని నిర్ధారణ చేయబడింది.
పరాధికరణం ( 3, 2, 33 )
సూత్రం :- 351
" బుద్ధ్యర్థః పాదావత్ "
పాదావత్ :- లోకంలో పాద వ్యవహారం లాగా, బుద్ధి అర్ధః :- ఈ వర్ణన బ్రహ్మాన్ని అర్ధం చేసుకోవడానికి చేశారని గ్రహించాలి.
భావం :- లోకంలో పాద వ్యవహారంలా ఈ వర్ణన బ్రహ్మాన్ని అర్ధం చేసుకోవడానికి చేశారని గ్రహించాలి.
వివణ :- బ్రహ్మకు నాలుగు పాదాలున్నాయని కేవలం ఉపాసన కోసం బ్రహ్మకు పరిమితి, కొలత చెప్పబడ్డాయి. ఒక వస్తువు పరిమాణం తెలియడానికి కొలతలు ఉపయోగిస్తాము. అలాగే కొలత, కొలిచిన వస్తువు వేరే అని తెలుపదు. పరమాత్మకు ప్రపంచమంతా ఒక పాదం అయినప్పుడు అది పరమాత్మ ఆధిక్యాన్ని తెలుపుతుంది. ముముక్షువులకు బ్రహ్మాన్ని గురించి స్పష్టంగా తెలియజేయడానికే ఈవర్ణన చెప్పబడింది. తేలికగా ఉండటం కోసమే బంగారాన్ని పావలాఎత్తు, తులం అని చెప్పినట్లుగానే, బ్రహ్మాన్ని ఉపాసన చెయ్యడం కోసమే ఈ పాదవ్యపదేశం చెప్పబడింది కాని బ్రహ్మాన్నిమించి మరొకటి ఉందని కాదు. ఉన్మానం చెప్పడం వలన బ్రహ్మకంటే పరమైనది ఏది చెప్పబడిందో, దాని విషయంలో చెప్పబడుచున్నది. ఉన్మాన వ్యపదేశం వలన కూడా బ్రహ్మ కన్నా వేరైనా వస్తువు ఉన్నదని చెప్పడానికి కాదు. బుద్ధి కోసం చెప్పబడింది. అంటే ఉపాసన కోసం చెప్పబడింది అని అర్ధం. బ్రహ్మ యందు బుద్ధి స్థిరంగా నిలపడం కోసమే బ్రహ్మను చతుష్పాదని, అష్ట గిట్టలని , షోడశకళలని, వికారాలద్వారా ఉన్మాన కల్పన చేయబడుచున్నది. పురుషులలో ఉత్తమబుద్ధులు, మధ్యమబుద్ధులు, మందబుద్ధులు కూడా ఉంటారు. అందరు అవికారము, అనంతం అయిన బ్రహ్మయందు బుద్ధిని నిలుపజాలరు కదా! ఆధ్యాత్మికంగా బ్రహ్మకు ప్రతీకంగా చెప్పబడిన మనస్సు అధిదైవతంగా బ్రహ్మకు ప్రతీకగా చెప్పబడిన ఆకాశం, వీటిలో వాగాదులు వాక్కు, ప్రాణం, చక్షస్సు, శ్రోత్రాలు మనస్సు యొక్క పాదాలని, అగ్ని, వాయువు ఆదిత్య, దిక్కులు ఆకాశం యొక్క పాదాలను ధ్యానం కోసమే కల్పించబడ్డాయి. ధ్యానం చెయ్యాలంటే సులభమైన పద్ధతి ఉండి, బుద్ధి నిలకడగా ఉంటేనే సాధ్యమౌతుంది. సాధకుకలైనవారికి, ఆత్మజ్ఞానం పొందిన వారికీ ఆత్మయందు బుద్ధి స్థిరముగా ఉంటుంది. ఈజగత్తు మొత్తాన్ని ఒక అంశగా, ఒక పాదంగా భావిస్తున్నాను అన్నాడు పరమాత్మ. దూరదృష్టితో ఆలోచిస్తే పరమాత్మలేని స్థితి లేదు. ఎన్నో సూర్య కుటుంబాలు, ఎన్నో నక్షత్ర మండలాలతో ఉన్న అనంతమైన జగత్తును చూడటం, కొలతలు చెప్పడం అసాధ్యం. అనంతమైన జగత్తుకు కనిపించే జగత్తు ఒకపాదం మాత్రమే. జీవుడిది అణుత్వం, ఈశ్వడిది మహతత్త్వం. జీవుడిది అంతఃకరణ, ఈశ్వరుడిది మాయ. ఆయనకు లోబడే అన్నీ ఉంటాయి కాని ఆయన ఎవరికీ లోబడి ఉండదు. ఉపాధులతో తాదాత్మ్యం చెందిన జీవుడు ఆ ఉపాధులు అసత్యమని, అంతా పరమేశ్వరుడి మాయేనని గ్రహిస్తే, జీవుడు మిధ్య అని, ఉన్నదంతా పరమాత్మయేననే విషయం బోధపడుతుంది. దూరంగా పెద్ద దీపం వెలుగులో మన నీడ గోడ మీద పడుతుంది. వెలుగు సత్యమని నీడ నిజం కాదు అని, నీడలాంటి జీవుడు అసత్యమని, చైతన్య రూపమైన పరమాత్మ సత్యం, జ్ఞానం అనంతం బ్రహ్మ అని అవగతమౌతుంది.
సూత్రం :- 352
" స్థాన విశేషాత్ ప్రకాశాదివత్ "
ప్రకాశాదివత్ :- ప్రకాశం, ఆకాశం లాంటి వాటి లాగా, స్థాన విశేషాత్ :- స్థాన విశేష సంబంధం వలన.
భావం :- ప్రకాశం, ఆకాశం వలె స్థాన విశేష సంబంధం వలన నిజానికి కొలతలు లేని బ్రహ్మాన్ని మన అవగాహన కోసం కొలతలను సూచించే పదాలతో బోధించడం యోగ్యమైనదే.
వివరణ:- ప్రకాశంవలెనే ఉపాధి యోగం వల్ల బ్రహ్మమందు సంబంధం చెప్పారు. సూర్య ప్రకాశానికి కొలత ఏమి ఉండదు. కాని కిటికీగుండా ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు దాన్ని వాతాయన(కిటికీ) ప్రకాశం అంటారు. అలాగే ఘటములో ఉంటే ఘటాకాశమని, మఠంలోఉంటే మఠాకాశం అని ఆకాశాన్ని వ్యవహారిస్తారు. ఈఉపాదులు ఏమిలేకపోతే అది మహదాకాశామే. ఈవ్యవహారం స్థాన భేదం వలన కలిగింది. ఈ విధంగానే బ్రహ్మం కొలతకు లోబడకపోయినా భూమ్యాది స్థాన సంబంధం వలన బ్రహ్మకు నాలుగు పాదాలున్నాయని చెప్పడంలో తప్పేమి లేదు. సంబంధం, భేదం ఈ రెండు బ్రహ్మ కన్నా వేరైనా వస్తువు ఉన్నదని చెప్పలేదు. బ్రహ్మ ఒక్కడే అయినప్పటికీ బుద్ధి మొదలైన ఉపాధుల సంబంధం వలన జీవుడు, ఈశ్వరుడు వేరు అనే భేదం కలుగుతోంది. సుషుప్తిలో జీవుడు తన ఉపాధులన్నింటిని వదలి, తాను ఒక్కడే సుషుప్తిలో ప్రవేశించి బ్రహ్మంలో విశ్రమిస్తున్నాడు. ఆఉపాధులు తొలగిపోతేనే జీవబ్రహ్మైక్య సిద్ధి లభిస్తుంది. సుషుప్తిలో ఉపాధి భేదం నశిస్తుంది. ఘటాకాశం మహదాకాశంలో కలసి పోయినట్లుగా జీవుడు ఈశ్వరుడిలో ఏకమౌతాడు. సూర్యునికి అడ్డుగా చేతివేళ్ళు అడ్డుపెడితే సూర్య కాంతి వంకరగా పడుతుంది. వేళ్ళు తొలగిస్తే సూర్య రశ్మి సవ్యంగా పడుతుంది. అలాగే ఉపాధి భేదం పోయి, అవిద్య నశిస్తే జీవుడికి, ఈశ్వరుడికి మద్యభేదం ఉండదు. స్థానవిశేషాన్ని బట్టి ఒకేవస్తువునకు రెండు వ్యపదేశాలు కుదురుతాయి. ఆత్మకు బుద్ధి మొదలైన స్థానవిశేషాలతో సంబంధం ఉన్నప్పుడు విశేషంజ్ఞానం కలుగుతుంది. ఆఉపాధులు ఉపశమించగానే ఆ జ్ఞానం శాంతిస్తుంది. సుషుప్తిలో ఆ విశేష జ్ఞానమే జీవునకు పరమాత్మలో కలిగిన సంబంధం. అంతే కాని పరిమితత్వాన్ని బట్టి కాదు. పరిమితమైన జీవుడు పరమాత్మతో కలవడం చేత కాదు. అదే విధంగా భేద వ్యపదేశం వలన కూడా బ్రహ్మకు కలిగిన ఉపాధి కల్పిత భేదాన్ని బట్టి మాత్రమే ఉపచారం చేత చెప్పబడుచున్నది. అంతే కాని బ్రహ్మకు ఈ సంబంధము, భేదములు చెప్పడం వలన బ్రహ్మకన్నా వేరే తత్వం ఉన్నదని కాదు.
సూత్రం :- 353
" ఉపపత్తేశ్చ "
ఉపపత్తేః :- ఇది సిద్దిస్తుంది. చ :- కూడా.
భావం:- బ్రహ్మం పొందదగినది, పొందే వాడు జీవుడు. ఈ సంబంధం జీవాత్మ పరమాత్మలకు సిద్ధిస్తుంది.
వివరణ:- శృతివాక్యాల వలన సంబంధ భేదాలు చెప్పడం ముఖ్యం కాదు. పొందదగినది బ్రహ్మం, పొందేవాడు జీవుడు అన్నప్పుడు బ్రహ్మానికి మించిన పరతత్వం మరొకటి ఉందని ఎలా సూచిస్తుంది? రెండు తత్వాల మధ్య ఉండే సంబంధం ఆ రెండు పదార్ధాలే బోధిస్తుంది కాని, మూడోతత్వం ఎక్కడ నుండి వస్తుంది? జీవుడు బ్రహ్మపదం చేరుకుంటాడు అంటే బ్రహ్మ, పదం రెండు ఒకటే. విష్ణు పదం అంటే విష్ణువు విశ్వరూపం అని అర్ధం. ఆత్మ చైతన్యం అన్నప్పుడు ఆత్మ వేరు, చైతన్యం వేరు అని భావం కాదు. చైతన్య స్వరూపమైన ఆత్మ అనే అర్ధాన్నే గ్రహించాలి. కనుక బ్రహ్మానికి పరంగా మరొక తత్త్వం ఉంటుందని వాదించడం సరి అయినది కాదు. ఇది స్వరూపంతో సంబంధమే అని చెబుతున్నారు. స్వరూపం ఎన్నటికీ దూరం అవడం ఉండదు. కనుక ఈ సంబంధం తనని తాను పొందడమే. నర నగర న్యాయం :- ఈ విషయంలో నర నగర న్యాయం కుదరదు. వేర్వేరు వస్తువులైన నరుడు, నగరము దూరంగా ఉండవచ్చును. నరుడు నగరంలో ప్రవేశిస్తే ఆనగరాలతో నరుడికి సంబంధం కలిగింది అని చెప్పడం యుక్తం. నరుడు, నగరము రెండు ఒకటి కాదు. జీవునికి తన స్వరూపమైన ఆత్మ నుండి విడిపోవడం అనేది లేనప్పుడు జీవుడు వచ్చి ఆత్మలో కలవడం అసలు లేనే లేదు. ఉపాధి చేత జీవుడిగా అతని స్వరూపం కప్పబడిపోవడం చేత, ఉపాధి కృతభేదం వలన వేరుగా ఉన్నట్లు కనబడుతున్నాడు. ఆఉపాధి తొలగిపోగానే జీవభావం పోయి, ముక్తుడైన జీవుడు ఆత్మగా మిగిలిపోతాడు. ఛాందోగ్యంలో సుషుప్తిలో జీవుడు తన రూపాన్ని పొందుతాడు అని చెప్పబడింది. ప్రతిబింబం లాంటి జీవభావం పోయి మిగిలేది ఆత్మభావం. ఒక్కటే ఉపాధివలన వచ్చినరూపం మాయమైపోగా నిజం స్థితి తెలుస్తుంది. ఆకాశం ఒక్కటే అయినా దానికి స్థానాల చేత ఏర్పడిన భేద వ్యపదేశాన్ని పురుషుని బైట ఉన్న ఆకాశం, పురుషుని లోపల ఉన్న ఆకాశం, పురుషుని హృదయంలో ఉన్న ఆకాశం అని తెలియజేస్తుంది.
సూత్రం :- 354
" తధా న్య ప్రతిషేదాత్ "
తధా :- ఆ విధంగా, అన్య ప్రతి షేదాత్ :- బ్రహ్మం కన్నా మించి వేరే పదార్ధం ఏది లేదని నిషేదించారు.
భావం:- బ్రహ్మకన్నా భిన్నమైన దానిని నిషేధించడం వలన కూడా బ్రహ్మ కంటే భిన్నమైన పదార్ధం ఏది లేదని నిషేదించారు.
వివరణ:- ఇతర వస్తువులన్నింటిని నిషేధించడం వలన పరమాత్మకన్నా భిన్నమైనది ఏది లేదని తెలుస్తుంది. ఏ సమస్తము బ్రహ్మయే. ఆత్మయే. ఈ బ్రహ్మంలో నానాత్వం ఏమి లేదని ఛాందోగ్యం, బృహదారణ్యకోపషత్తు చెబుతున్నాయి.
శ్వేతాశ్వరోపనిషత్తు( 3, 9) :- యస్మాత్ పరం నాపరం అస్తి కించిత్, ఈవాక్యాన్ని బట్టి బ్రహ్మంకన్నా పరతత్త్వం మరొకటి ఉందనడం సంగతం కాదు. బ్రహ్మకన్నా వేరొకటి లేదు. కాబట్టి బ్రహ్మ అద్వితీయం. ఆత్మ అన్నింటి కంటే లోపల ఉన్నది అని చెప్పే శృతిని బట్టి కూడా పరమాత్మ కంటే వేరుగా మరొక అంతరాత్మ లేదని నిశ్చయింపబడుతుంది.ఇతరమైన దానిని నిషేధించడం వలన కూడా బ్రహ్మం కంటే పరమైన వస్తువు లేదని తెలుస్తుంది. నేనే క్రింద కూడా, ఆత్మయే క్రింద కూడా. శృతి వాక్యాలు ఆత్మకంటే వేరుగా ఉన్న వస్తువును నివారిస్తున్నాయి. ఉన్నదాంతా సర్వవ్యాపకమైన పరమాత్మయే అయినప్పటికీ, జీవుడి అజ్ఞానం వలన అది ప్రపంచంలా కనిపిస్తున్నది. జీవుడంటే జడాత్మాకమైన శరీరం మాత్రమే కాదని, సచ్చిదానంద స్వరూపం, జ్ఞాన స్వరూపమని, బుద్ధి స్వరూపమని, ముక్త స్వరూపమని, సర్వం ఖల్విదం బ్రహ్మ ఉన్నదాంతా బ్రహ్మమేనని శ్రుతులు బోదిస్తున్నాయి.
సూత్రం :- 355
" అనేన సర్వగతత్వే మాయామాది శబ్యేభ్యః "
మాయమ శబ్ద దిభ్యః అని కొన్ని చోట్ల ఉన్నది. అనేన :- బ్రహ్మ కన్నా పరమైనది, మరొకటి లేదనడం వలన, అయమాది శబ్దే భ్యః :- ఆయాము, విభుత్వం వ్యాప్తి లాంటి శబ్ద ప్రయోగాల వలన, సర్వ గతత్వం :- బ్రహ్మ అన్ని పదార్ధాలలోనూ లోపల, బయట నిండి ఉంటుందని తెలుసుకోవాలి.
భావం:- బ్రహ్మకన్నా పరమైనది, మరొకటి లేదనడం వలన, ఆయమాది శబ్ద ప్రయోగాల వలన, అన్ని పదార్ధాలలోనూ లోపల, బయట నిండి ఉంటుందని తెలుసుకోవాలి.
వివరణ:- బ్రహ్మకన్నా భిన్నమైనది ఏది లేదని చెప్పడం చేత ఆత్మ యొక్క సర్వగతత్వం కూడా సిద్ధిస్తుంది. అట్లు కాకపోతే సిద్ధించదు. శ్రుతి, ఉపనిషత్వాక్యాల్లో బ్రహ్మం విభువు, వ్యాపకం, గొప్పది అని అనేక చోట్ల స్పష్టంగా వర్ణించారు.
ఋగ్వేదం (8, 4, 17, 3) :- బ్రహ్మం ఎంతో గొప్ప తత్వం.
ఛాందోగ్యోపనిషత్తు (3, 14, 3) :- పృధివి, అంతరిక్షం, దివం, లోకాలు వీటన్నింటి కన్నా బ్రహ్మం గొప్పది.
యజుర్వేదం(3, 2, 8) :- ఆబ్రహ్మ ఓతప్రోతం. ప్రాణుల్లో విభువు. బ్రహ్మం ఈ ప్రపంచానికి లోపలా, వెలుపలా ఉన్నది. బ్రహ్మకు సర్వగతత్వాది ధర్మాలు ఉండటంవలెనే ఈ ప్రపంచాన్ని సృష్టించడానికి, పోషించడానికి, లయం చెయ్యడానికి సమర్థుడైనాడు. కనుక బ్రహ్మయే అన్నింటి కన్నా మించిన పరతత్వమని సూత్రానికి అర్ధం. సేత్వాదులు (పరిచ్చినమైనవి) నిరాకరించడం వలన ఇతరమైన వాటి నిషేధాన్ని ఆశ్రయించడం బ్రహ్మకు భిన్నమైనది ఏదిలేదని చెప్పడం వలన ఆత్మయొక్క సర్వగతత్వం సిద్ధిస్తుంది. బ్రహ్మ కన్నా భిన్నమైన వస్తువులను నిషేదించక పోతే ఒక వస్తువు మరొక వస్తువు కంటే భిన్నం అవుతుంది. గాన ఘటం, పటం కంటే భిన్నమైనట్లు బ్రహ్మ యదార్ధమే అయినా ఇతర వస్తువుల కంటే భిన్నమని చెప్పాలి కదా! ఘటం ఉన్నా చోట పటం ఉండదు. పటం ఉన్న చోట ఘటం ఉండదు. అట్లే ఆత్మ కన్నా భిన్నమైన వస్తువులున్నాయి అని అంటే ఆ వస్తువులు ఉన్నచోట ఆత్మ ఉండదు. కనుక ఆత్మ సర్వ తత్వం కుదరదు. ఆత్మ సర్వగతమని ఆయామ శబ్దాల వలన తెలుస్తుంది. ఆయమ అంటే వ్యాప్తి, సర్వ వ్యాపకం అని అర్ధం. ఆ ఆత్మ అంతటా వ్యాపించినది. స్థిరమైనది. కదలనిది, అతి ప్రాచీనమైనది, సర్వదా ఉండేది. బ్రహ్మ ఎట్లు సత్యమో, జగత్తు కూడా సత్యమైతే జగత్తు ఉన్న చోట ఆత్మ ఉండటానికి వీలులేదు. ఆత్మ ఒక్కటే సత్యం. జగత్తు దాని మీద ఆరోపించబడింది. ఆత్మయే జగత్తుగా భాసిస్తోందని చెబితే ఆత్మకు సర్వ గతత్వం కుదురుతుంది. తాడు మీద పాము ఉన్నప్పుడు, ఆ పాము ఉన్న చోటు అంతటా తాడు ఉన్నట్లుగా, జగత్తుఉన్న స్థానంలో బ్రహ్మ ఉంది అని చెప్పవచ్చును. కనుక బ్రహ్మ సర్వగతానికి భంగం లేదు. స్తంభం, చెట్టు, గుట్టలు, జీవాత్మ, పంచభూతాలు అన్నీ స్థూలమూలే, వాటికి శబ్ద స్పర్శ రూప రస గంధాలు కలిస్తేనే అవి స్థూల పదార్ధములయ్యాయి. కనుక వాటికీ సర్వవ్యాపకత్వం కుదరదు. సూక్ష్మాతి సూక్ష్మమైన బ్రహ్మకి సర్వంతర్యామిగా, అపరిచ్చిన్నంగా, సర్వగతత్వం ఉంటుందని శ్రుతి వాక్యాల వలన నిర్ధారణ చేయబడింది. స్వర్గ లోకం కన్నా పెద్దది ఆత్మ. శ్రుతి ఉపనిషత్ వాక్యాల్లో బ్రహ్మం విభువు, వ్యాపకం, గొప్పది అని వర్ణించారు.
సూత్రం :- 356
" ఫల మత ఉపపత్తేః "
అతః - అన్నింటి కన్నా ఎంతో సూక్ష్మం అని బ్రహ్మాన్ని వర్ణించడం వలన, ఫలం :- ఆ బ్రహ్మమే జీవులు చేసే శుభ, అశుభ ఫలం ఇస్తాడని, ఉప పత్తేః :- సిద్ధిస్తోంది.
భావం :- అన్నింటి కన్నా సూక్ష్మం అని బ్రహ్మాన్ని వర్ణించడం వలన, ఆ బ్రహ్మమే జీవులకు శుభాశుభ ఫలాలు ఇస్తాడని సిద్ధిస్తోంది.
వివరణ:- గురుదేవా "మానవులు ఇష్టము, అనిష్ఠము, మిశ్రమము అని మూడు రకాల కర్మ ఫలాలను అనుభవిస్తున్నారు. ఈ కర్మఫలాలను ఇచ్చేవారు ఎవరు? అని కృష్ణశర్మ అడిగాడు. దానికి రత్నకరుడు సమాధానం చెబుతున్నాడు. ఉపపత్తి వలన కర్మ అనేది సర్వాధికారి, సర్వజ్ణుడు అయిన ఈశ్వరుడే సృష్టి , స్థితి, లయ కార్యములను చేస్తూ, దేశకాలవిశేషాలు తెలిసిన వాడవడం వలన కర్మలు చేసే వాళ్లకు వాళ్ళు చేసిన కర్మలకు ఫలితం ఇస్తాడు. జగజ్జన్మాది కారణమైన బ్రహ్మం వల్లనే జీవులు ఆచరించే శుభాశుభ కర్మలకు సుఖ దుఃఖ రూపాలైన ఫలాలు లభిస్తాయి. జీవులు నానా విధాలైన కర్మల్ని, నానాప్రదేశాల్లో, వివిధ కాలాలలో, వివిధ లోకాల్లో చేస్తారు. వాటన్నింటిని వాస్తవరూపంలో తెలిసిన వాడే వాటికి తగిన ఫలితాన్ని ఈయగలడు. అలాంటి శక్తి సామర్ధ్యలు ఉన్నవాడు ఈశ్వరుడే. ఆయన సర్వజ్ణుడు, సర్వంతర్యామి. కర్మయే ఫలాన్ని ఇస్తుందనే వాదన సరి అయినది కాదు. క్షణంలో నశించే కర్మ వలన కాలాంతరంలో ఉండే ఫలం లభిస్తుందని చెప్పడం ఉపపన్నం కాదు. అభావం వలన భావ వస్తువు పుట్టదుకదా! కర్మ నశిస్తూ దాని సమయంలోనే తనకు తగిన ఫలాన్ని ఇస్తూ నశిస్తుంది. దాని ఫలాన్నే కాలంతరంలో కర్త అనుభవిస్తాడు కదా! అనే సందేహం ఉంది. దానికి సమాధానం చెప్పబడింది. భోక్తతో సంబంధించడానికి పూర్వం అది ఫలం కాజాలదు. ఏ సుఖం, లేదా ఏ దుఃఖం ఏ కాలంలో ఆత్మ చేత అనుభవించ బడుతుందో అదే ఫలం అని లోకంలో ప్రసిద్ధంగా ఉంది. ఆత్మకు సంబంధించని సుఖాన్ని గాని, దుఃఖాన్ని గాని ఫలం అని లౌకిలులు ఎవరు భావించారు కదా! కర్మ చేసిన వెంటనే ఫలోత్పత్తి కలగక పోవచ్చును. కర్మకు కార్యమైన( కర్మ వలన పుట్టిన ) అపూర్వం వలన ఫలం పుడుతుంది అని శంక. కర్మ వలన పుట్టిన అపూర్వం వలన ఫలితం వస్తుందనడం యుక్తం కాదు. అచేతనమైన అపూర్వం ఒకటుందని చెప్పడానికి ప్రమాణం లేదు. అర్ధాపత్తి ప్రమాణం అన్నా సరికాదు. ఈశ్వర సిద్ధి చేతనే అర్ధాపత్తి క్షేణిస్తుంది. ఏదో ఒక యాగం చేస్తే స్వర్గం లభిస్తుందని శ్రుతి చెబుతుంది. శ్రుతి చెప్పినది అసత్యం కాదు. అనిత్యమైన కర్మ స్థిరమైన అపూర్వాన్ని పుట్టిస్తుంది. అది యాగం చేసిన వాని ఆత్మతో కలసి ఉండి తగిన దేశకాలాలలో ఫలితం ఇస్తుంది. అది అర్ధాపత్తి. కర్మ అనిత్యమైన దాని ఫలాన్ని ఈశ్వరుడు తగిన సమయంలో ఇస్తాడని అంగీకరించినా అర్ధాపత్తి సరిపోతుంది. ఈ అర్ధాపత్తి చేత ఈశ్వరుడు సిద్ధిస్తున్నాడు కనుక ఇది అపూర్వాన్ని సాధింప జాలదు. కర్మ ఫలం పరమేశ్వరుని వలననే కలుగుతుందని చెప్పడమే సమంజసంగా ఉంటుంది. ఈశిత అంటే అధికారం నెరపేవాడు, ఈశితవ్యుడు అంటే అధికారానికి లోబడి ఉండవలసినవాడు అనే వ్యావహారిక అవస్థలో బ్రహ్మనికే అధికారం ఉన్నట్లు వర్ణించబడింది.
సూత్రం :- 357
" శ్రుతత్వాచ్చ "
చ :- పైగా, శ్రుతత్వాత్ :- బ్రహ్మయే కర్మ ఫలదాత అని శ్రుతులు అంటున్నాయి.
భావం :- బ్రహ్మయే కర్మ ఫల ప్రధాత అని శ్రుతులు అంటున్నాయి.
వివరణ :- కర్మ ఫలాన్ని ఈశ్వరుడే ఇస్తాడని శ్రుతులు చెబుతున్నాయి. ఈశ్వరుడే ప్రాణులకు అన్నం ఇచ్చేది, ధనం ఇచ్చేది, భోగాన్ని ఇచ్చేది, కర్మ ఫలాన్ని ఇచ్చేది,
ఋగ్వేదం(1, 2, 2, 6):- ఓప్రకాశ స్వరూపా! నీవు దాతకు మేలు కలిగిస్తావు. ( 8, 1, 5, 1 ) :- నేను దాతకు భోజనం ప్రసాదిస్తాను, ఇలాంటి వేదం వాక్యాలు ఈశ్వరుడే కర్మ ఫల దాత అని ప్రత్తిపాదిస్తున్నాయి. అన్నం అంటే కర్మ ఫలం. ఇంద్రియాలకు విషయాలు అన్నం, దృశ్యం అన్నమే, ముక్కుకు వాసన ఇచ్చేది అన్నమే. ఈశ్వరుడే కర్మాధ్యక్షుడు, కర్మఫల ప్రదాత. ఏసభకైనా అధ్యక్షుడే కీలక పాత్ర పోషిస్తాడు. కర్మకు అధ్యక్షుడైన ఈశ్వరుడు జీవులు చేసుకున్న కర్మలను బట్టి స్వర్గ భోగాలు, నరకయాతనలు, మరల మరల జన్మలు సంభవించేలా చేస్తుంటాడు. జైమిని మహర్షి కర్మ ఫల ప్రదాత ఈశ్వరుడేనని అంగీకరించకుండా కర్మయే ఫలితాన్ని ఇస్తుందని చెప్పాడు. కర్మ నశిస్తుంది కదా! ఫలితం ఎలా వస్తుంది? నశించిన కర్మ ఎప్పుడో ఫలితం ఇవ్వడమేమిటి? అనే సందేహానికి సమాధానంగా అపూర్వ గురించి చెప్పాడు. యజ్ఞ యాగాదులు చేసేటప్పుడు హోమాగ్నిలో నెయ్యి, సమిధలు అన్నీ సమర్పించిన కర్త దేహన్ని విడిచిపెట్టిన తరువాత ఈ అపూర్వ(సూక్ష్మ శక్తి) అతనిని స్వర్గానికి తీసుకోనిపోతుంది. కర్మ ఇవ్వక పోయినా దాని వలన వచ్చిన అపూర్వ ఫలితాన్ని ఇస్తుందని జైమిని అభిప్రాయం.
సూత్రం :- 358
" ధర్మం జైమినిః అత ఏవ "
ఇది పూర్వ పక్ష సూత్రం. జైమినిః :- జైమిని మహర్షి, ధర్మం :- ధర్మాధర్మ శబ్దాలు సూచించే శుభాశుభ కర్మలు చేయడం వలన కలిగే సంస్కారాలు ఫలాన్ని ఇవ్వడం, అత ఏవ :- సరి అయినది అంటున్నాడు.
భావం :- పూర్వపక్షం వారి వాదన ప్రకారం జైమిని మహర్షి ధర్మాధర్మాలు సూచించే శుభాశుభ కర్మలు చెయ్యడం వలన కలిగే సంస్కారాలు ఫలితాన్ని ఇస్తాయనడం సరి అయినదే.
వివరణ:- జైమినిమహర్షి పూర్వ మీమాంస, వ్యాస మహర్షి ఉత్తర మీమాంస వ్రాశారు. జైమిని పూర్వ మీమాంసలో ఈశ్వరుణ్ణి అంగీకరించరు. ఈశ్వరుడు కాని, యాగాది క్రతువులు గాని ఫలాన్ని ఇవ్వరని కర్మల వలన కలిగిన అపూర్వం అనే సూక్ష్మ శక్తి ఫలితాన్ని ఇస్తుంది. యాగాది రూపమైన ధర్మమే ఫలితాన్ని ఇస్తుందని, కర్మ ఫలితాన్ని ఇవ్వదనే మాట వీరు కూడా అంగీకరిస్తున్నారు. బ్రహ్మం జీవుడు కర్మ చేయాలనుకొని ఫలం ఇస్తాడా? కర్మలను చేయకూడదని ఫలం ఇస్తాడా? కర్మల్ని చెయ్యకూడదనుకుంటే బ్రహ్మం స్వయంగా తన ఇష్ట ప్రకారం ఒకడికి సుఖం, మరొకడికి దుఃఖం, ఒకడికి తక్కువ, ఇంకొకడికి ఎక్కువ ఇచ్చినట్లు అవుతుంది కదా! ఇవి బ్రహ్మనికి పక్షపాతం, రాగ ద్వేషాలు ఆపాదిస్తాయి కదా! ఒకడికి తాను చేసిన కర్మలకు ఫలితాలు లభిస్తాయి కదా! ఇక బ్రహ్మం ఇందులో చేసే దేముంది? అందువలన బ్రహ్మ కర్మ ఫల ప్రదాత ఎలా అవుతాడు? ఆచార్యుడైన జైమిని ధర్మమే ఫలం ఇస్తుందని తలచుచున్నాడు."స్వర్గ కామోయ జేత "స్వర్గం మీద కోరిక ఉన్నవాడే యజ్ఞం చెయ్యాలి. యజ్ఞం చేసిన వారికి కర్మఫలం వలన స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది. అలా జరగకపోతే, యాగాన్ని అనుష్టించేవారు ఉండరు. అప్పుడు ఈ వ్యపదేశం వ్యర్థం అవుతుంది. క్షణ కాలంలో నశించే కర్మ వలన ఫలం కలగడం ఉపపన్నం కాదు అని వారి వాదన. సూర్యుడు స్వయంగా ప్రకాశిస్తూ, భూమిని ఆకర్షిస్తున్నాడు. భూమి సూర్యుని చుట్టూ తిరగడం వలన ఋతువులు ఏర్పడటం, పంటలు పండటం, ప్రాణులు తినడానికి వీలుగా తయారవుతున్నాయి. సకాలానికి దున్నడం వలన సరియైన సమయంలో పంటలు పండుతున్నాయి. దీనిలో బ్రహ్మ ప్రమేయం ఏమి లేదు కదా! కర్మ అనేది ఫలం లభించే సమయంలో ఉండక పోయినా ఆ కర్మ సంస్కారం ధర్మం, అధర్మ ఫలం లభించేంత వరకు ఉంటాయి కదా! కనుక కర్మలే ఫలాన్ని ఇస్తాయనడంలో తప్పేముంది అని పూర్వ పక్ష వాదన. దానిని వ్యాసుడు ఖండిస్తూ, సమాధానం చెబుతున్నాడు.
సూత్రం :- 359
" పూర్వంతు బాదరాయణో హేతు వ్యపదేశాత్ "
తు:- ఈవాదం సరియైనది కాదు. బాదరాయణః :- గ్రంథ కర్త అయిన వ్యాసుడు, హేతు వ్యపదేశాత్ :- దీనికి కారణం బ్రహ్మయే.
భావం:- కర్మలే ఫలితాన్ని ఇస్తాయనే వాదం సరైనదికాదు. గ్రంథకర్త అయిన వ్యాసుడు దీనికి కారణం బ్రహ్మ అని చెబుతున్నాడు.
వివరణ :- చేసిన కర్మలకు ఫలితాన్ని ఇచ్చేది ఈశ్వరుడే అంటారు బాదరాయణుడు. కర్మఫల ప్రదాత అన్నింటికీ కారణమైన బ్రహ్మమే కాని ఇతరమైనవి కావు.
సాంఖ్య దర్శనం ( 3, 56 ):- "స హి సర్వ విత్ సర్వ కర్తా " ఏ వాక్యాలు బ్రహ్మమే సర్వనికి కారణంగా కర్తగా నిర్దేశిస్తున్నాయి. అలాంటి బ్రహ్మం కర్మఫల రూప కార్యానికి కారణం ఎందుకు కాదు. బ్రహ్మం లోకాలను శాసించేవాడు. ఆయన శాసనాలను ఉల్లంఘించడం, చేతనాలకు గాని, అచేత నాలకు గాని శక్యం కాదు.
బృహదారణ్యకోపనిషత్తు(5, 6, 1):- బ్రహ్మం సర్వానికి అధిపతి. సర్వం శాసించే వాడు. సూర్య చంద్రులు ఆయన శాసనానికి విరుద్ధంగా ఓషధులు జనించవు. పంటలు పండవు. బ్రహ్మం వైషమ్య పక్షపాతాది దోషాలు లేనివాడు. జీవులు సత్కర్మలే చేయాలని తలపోస్తాడు. తదనుగుణంగా ఫలాలు ఇస్తాడు. ( 2, 5, 15 ) :- సర్వ భూతాధిపతి, అన్నీ భూతాలకు రాజైన పరబ్రహ్మమే కర్మఫల ప్రదాత. మరొకటి కాదని వైదిక సిద్ధాంతం. కర్మ స్వయంగా కాని, అపూర్వంగా కాని కర్మ ఫలానికి కారణం కాదు. ఈ రకంగా అన్ని కర్మలకు ఫలాన్ని ఇచ్చేవాడు బ్రహ్మ. కౌషీతకి ఉపనిషత్తులో ఆ పరమేశ్వరుడు ఎవరిని ఈ లోకంలో ఉద్ధరించాలనుకుంటాడో వారితో మంచి పనులు చేయిస్తాడు అని చెప్పబడింది. హేతు వ్యపదేశం వలన ధర్మాధర్మాలలో కూడా హేతువుగా ధర్మాన్ని, అధర్మాన్ని చేయించే హేతువు ఈశ్వరుడే.
భగవద్గీత:- ఏ యే భక్తుడు నా ఏయే స్వరూపాన్ని శ్రద్ధ తో పూజించడానికి కోరతాడో, ఆ యా భక్తునికి నిశ్చలమైన అలాంటి శ్రద్ధనే ఇస్తాను. అతడు ఆశ్రద్ధతో ఆస్వరూపాన్ని ఆరాధించడానికి కోరతాడు. దాని వలన నేనే సమకూర్చిన ఆయా కామాలను పొందుతాడు అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. సృష్టికి హేతువు ఈశ్వరుడే నని ఫలానికి హేతువు అనగా ప్రజలను వాళ్ళ వాళ్ళ కర్మలకు అపురూపంగా సృష్టిస్తాడు అని పూర్వ పక్షి వాదన సరియైనది కాదు. ఎందువలననగా ఈశ్వరుడు ఆ యా మానవులు చేసిన ప్రయత్నాన్ని బట్టి ఫలం ఇస్తాడు. పాపాత్ములు సుఖాలు అనుభవించడానికి, పుణ్యాత్ములు కష్టాలు అనుభవించడానికి కారణం పూర్వ జన్మలలో వాళ్లు చేసుకున్న పాప, పుణ్య కర్మల ఫలితములే. ఏ దేవతను ఆరాధిస్తే, ఆ దేవత కర్మలకు ఫలితం ఇస్తారని భావిస్తారు. పరమాత్మ సంకల్పంతోనే దేవతలు అనుగ్రస్తారనేది సత్యం.
తృతీయపాదం
సర్వ వేదాంత ప్రత్యయాధికరణం ( 3,3,1)
సూత్రం :- 360
" సర్వ వేదాంత ప్రత్యయం చోదనా ద్యవిశేషాత్ "
చోదనాది అవిశేషాత్ :- విధి మొదలైన వాటిలో ఏ భేదం లేనందు వలన, సర్వవేదంత ప్రత్యయం :- ఉపనిషత్తులన్నింటిలో పేర్కొన్న బ్రహ్మోపాసనలలో తేడా ఏమి లేదు.
భావం:-విధి మొదలైన వాటిలో ఏ భేదం లేనందువలన ఉపనిషత్తులన్నింటిలో పేర్కొన్న బ్రహ్మోపాసనలలో తేడా ఏమి లేదు.
వివరణ:- ఈ తృతీయధ్యాయంలో ఉపాసనల గురించి వివరించారు. కర్మలాగా ఉపాసన సైతం జ్ఞాన సాధనమే. వేదాంతంలో దహరోపాసన, శాండిల్యోపాసన, వైశ్వానరోపాసన లాంటి అనేక ఉపాసనలను వివరించారు. అవి ఒకదానికన్నా మరొకటి శ్రేష్ఠమా? లేక సమానమా? అనే విషయంతో బాటు బ్రహ్మోపాసన కూడా ఈ అధ్యయంలో మహర్షి వివరించారు. ఉపనిషత్తు లలో పేర్కొన్న బ్రహ్మోపాసనలలో తేడా ఏమి లేదు. వేదాంతాలు అంటే ఉపనిషత్తులు ఈశ, కేశ, కఠాది పది ఉపనిషత్తులలో వేదానుకూలాలు, ప్రమాణాలు. వీటిలో దహరం లాంటి పేర్లతో బ్రహ్మో పాసన విధించారు. వీటిలో తేడా ఏమి లేదు. చోదన అంటే విధి. ఈ విధిని ఉపాసీత(ఉపాసించాలి) ధ్యాయిత(ధ్యానించాలి), వేద(తెలుసుకోవాలి) అనే పదాలతో ఉపనిషత్తులలో బ్రహ్మోపాసన విధించారు. ఉపాసనలలోగాని, వాటివలన లభించే ఫలాలలోగాని భేదముండదు. ఛాందోగ్య, బృహదారణ్యకాల లో చెప్పిన ముఖ్యప్రాణోపాసన ఒక్కటే. రెండిటిలో ప్రాణం శ్రేష్టమే. జ్యేష్టం అని చెప్పబడింది. అటువంటి ప్రాణాలను గురించి తెలుసుకున్న వాడు జేష్టుడు, శ్రేష్ఠుడు అని చెప్పబడింది. అలాగే పంచాగ్ని విద్య, శాండిల్య విద్య, వైశ్వానర విద్యలు చెప్పబడ్డాయి. ఛాందోగులు దహరోపాసనకు గాని, శాండిల్య విద్యోపాసనకు గాని, వైశ్వానరోపాసనకు గాని, ఏఫలం వస్తుందో, అదే ఫలం కలుగుతుందని వాజసనేయ శాఖీయులు చెప్పారు. బ్రహ్మోపాసనకు ఫలం బ్రష్మ సాక్షాత్కారమే. గురువర్యా! అన్ని ఉపనిషత్తులలో చెప్పబడిన ఉపాసనలు ఒకటేనా? వేరు వేరా? అని అడిగాడు కృష్ణ శర్మ. సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. ఉపాసనలో ఉప అంటే సమీపంలో, ఆసన అంటే కూర్చుండుట. ఉపాసనలు రెండు రకాలు. సగుణోపాసన, నిర్గుణోపాసన.
సగుణోపాసన:- దేహభిమానం వలన కలిగి ఉన్నవానికి అవ్యక్తమైన నిర్గుణ పరబ్రహ్మం లభించడం కష్టం. పరమేశ్వరుడు అంతటా ఉన్నప్పటికీ ఆయన స్వరూపాన్ని ఎదురుగా చూస్తూ ఏకాగ్ర చిత్తంతో ఆరాదిస్తూ, మనస్సుని నిత్యం భగవంతునిపై నిలపడమే సగుణోపాసన.
నిర్గుణోపాసన:- నిరాకారుడు, నిర్గుణుడు సర్వవ్యాపి అయిన భగవంతుని యదార్ధ తత్వాన్ని తెలుసుకోవడానికి ముందుగా సగుణోపాసన చేస్తే చిత్త స్థైర్యం ఏర్పడుతుంది. ఆ తరువాత నిర్గుణో పాసనతో ఆత్మవిచారణ చేసి, ఆత్మజ్ఞానం పొంది ఆత్మగా మిగిలిపోవడమే మోక్షం. ఉపాసన విధానాలను బట్టి, వాటి ఫలితాలను రెండు రకాలుగా తెలియజేశారు. 1. దృష్ట ఫలితం, 2. అదృష్ట ఫలితం. ఇహలోకసౌఖ్యాలు దృష్ట ఫలితం.( కంటికి కనిపించేవి) ఏదైనా ఒక వృత్తి చేసినప్పుడు జీతం వస్తుంది. అది దృష్ట ఫలితం. ఆత్మ జ్ఞానం గురించి గురువుల ద్వారా శ్రవణం చేస్తారు. మననం చేస్తారు. దాని ఫలితం కనిపించదు.అది అదృష్ట ఫలితం. ఎపుడో అది గొప్పఫలితాన్ని ఇస్తుంది. వేదాంతశాస్త్రపఠనం అంత సులభమైన విషయం కాదు. చదవాలనే కోరిక ఉండాలి. చెప్పేవారుండాలి. చెప్పే గురువులు ఉన్నా వినాలనే మనసుండాలి. జీవుడు దైనందిన జీవితంలో ఎన్నో కర్మలుచేస్తూనే ఉంటాడు. అవన్నీ వదలిపెట్టి పోయే కర్మలే. వాటికొరకు జీవితాంతం శ్రమిస్తూ, సుఖదుఃఖాలకు లోనవుతారు. కాని మనతో వచ్చే కర్మలను కోసం ఎవరూ ఆలోచించరు. మానవుడు మాధవుడిగా, జీవుడు దేవుడిగా తెలియజేసే ఆత్మ జ్ఞానం ఎంతో గొప్పది. అవి పొంద లేనప్పుడు ఎంత తెలితేటలున్నా, శూన్యహస్తలతోనే ఈ లోకాన్ని విడిచిపెడతారు.
సూత్రం :- 361
" భేదాన్నేతి చేన్నైక స్యామపి "
భేదాత్ :- వేదాంత భేదం వలన, న ఇతి చేత్ :- అన్ని వేదాంతాల్లో విధించిన బ్రహ్మోపాసనల్లో భేదం లేదనడం పొరబాటు అంటారా? న :- అది సరియైనది కాదు. ఎందుకంటే ఏకస్యామ్ అపి :- ప్రతి ఉపనిషత్తులోనూ బ్రహ్మోపాసనలో తేడా లేదని ప్రతిపాదించారు. వేద :- తెలుసుకో, ధ్యాయిత :- ధ్యానం చెయ్యి అనే విధి వాక్యాల్లో తేడా లేనందుకు వలన, ఉపనిషత్తులలో ప్రతిపాదించిన బ్రహ్మోపాసనలో భేదం ఉండదా? ఉండదని అర్ధం.
భావం:-అన్ని వేదాంతాల్లో విధించిన బ్రహ్మోపాసనల్లో భేదం లేదనడం పొరబాటు అంటారా? అది సరియైనదికాదు. ప్రతి ఉపనిషత్తులో ప్రతిపాదించిన బ్రహ్మోపాసనలో తేడా లేదని ప్రతిపదించారు. తెలుసుకో, ధ్యానం చెయ్యి అని విధి వాక్యాల్లో తేడా లేనందువలన ఉపనిషత్తులలో ప్రతిపాదించిన బ్రహ్మోపాసనలో భేదం ఉండదా? అంటే ఉండడనే సిద్ధాంతం. ఒకే అర్ధాన్ని అనేక వాక్యాలు తెలియజేస్తాయి. కాని భిన్నార్దాలు తెలుపవు.
వివరణ:- ఇక్కడకూడా ఒక విశేషాన్ని అశంకించి పరిహరిస్తున్నారు. గుణ భేదం ఉండటం వలన విజ్ఞానాలకు భేదం ఉన్నది అన్నట్లయితే సరికాదు. ఒకే విద్యలో గుణభేదం కుదురుతుంది. ద్రవ్యభేదం, దేవతా భేదాలను బట్టి యాగంలో భేదం వస్తుంది. అలాగే వేద్యుడు, ఉపాసదేవత, విద్య వీటి వలనకూడా భేదం ఉంటుందనేది సరికాదు. విజ్ఞానాలతో గుణభేదం కనబడుచున్నది గాన వాటికి సర్వవేదాంత ప్రయత్నం కుదరదు. పంచాగ్ని విద్యలో బృహదారణ్యకంలో ఆరుఅగ్నులు ఆత్మ బోధ చెయ్యగా, ఛాందోగ్యంలో ఐదుఅగ్నులే చెప్పాయి. అందుచేత ఉపాసన భేదం, విధానంలో నానాత్వం వస్తున్నాయని వారి వాదన. ఇది నిజం కాదు. రూపభేదం, గుణభేదం కొద్దిగా ఉండవచ్చును. ఈ తేడాలు అంత ముఖ్యమైనవి కావు. అందువలన నానాత్వం సిద్ధించదు. గుణోపసంహారాన్ని గ్రహించడానికి కూడా వీలు లేదు. ఎందుచేతననగా 5 అనే సంఖ్యకు విరోధం వస్తుంది. గుణోపసంహారం అనగా ఒకే విద్యను (ఈ ఘట్టంలో విద్య, విజ్ఞానం, ఉపాసన, సమానార్ధకాలు) రెండు, మూడు శాఖలలో చెప్పినప్పుడు ఏదైనా ఒక శాఖలో అధికంగా చెప్పిన గుణాలను ఇతర శాఖలలోని విద్యలోనికి తెచ్చి, అన్వయించుకొనడం. ఇక్కడ ఛాందోగ్యులు 5 సంఖ్యతో ముగించిన తరువాత ఆరవ దానిని చేర్చి గుణోపసంహారం చెయ్యడం కుదరదని భావం. అట్లే ప్రాణ సంవాదంలో ఛాందోగులు శ్రేష్ఠ ప్రాణం కంటే భిన్నమైన వాక్కు, చక్షువు, మనస్సు అనే నాలుగు ప్రాణాలను పఠిస్తున్నారు. వాజసనేయులు అయితే రేతస్సును పఠిస్తున్నారు. ఆవాస, ఉద్వాస భేదాన్ని బట్టి వేద్యం భిన్నం అవుతుంది. ఆవాసం అనగా క్రొత్త దానిని చేర్చడం, ఉద్వాసం అనగా ఉన్నదానిని తీసివేయడం. ఒకే విద్యలో కూడా ఈ విధమైన గుణ భేదం ఉపపన్నమే. ఆరవదైన అగ్నిని ఉపసంహరించడం కుదరకపోయినా ద్యులోకం మొదలైన అగ్నులు కూడా రెండింటిలో గుర్తింప బడుతున్నాయి. కనుక విద్యా భేదం అనడానికి వీలు లేదు. ఛాందోగులకు, వాజస నేయులకు ఇద్దరికీ కూడా ఆరు అగ్నుల ఉపాసన ఉన్నదని చెప్పవచ్చును.
సూత్రం :- 362
" స్వాధ్యాయస్య తధా త్వేన హి సమాచారేధికారాచ్చ సవవచ్చ తన్నియమః "
స్వాధ్యాయస్య :- ముండకోపనిషత్తు అధ్యయనం చేయడానికి శిరోవ్రత ధారణ చెయ్యాలి. హి :- ఎందుకంటే, సమాచారే తధా త్వేన :- ఆ శాస్త్రాధ్యయన అనుష్టానానికి శిరోవ్రతం ధర్మం అని ప్రసిద్ధి ఉన్నది. అధికారాత్ :- శిరోవ్రతం ముండకోపనిషత్తు అధ్యాయానికి సంబంధించినది. చ :- అంతే కాక, సవత్ :- యజ్ఞంలో మంత్రం ఎలాగో, తత్ నియమః :- స్వాధ్యాయానికి శిరోవ్రతం నియమం.
భావం :- ముండకోపనిషత్తు అధ్యాయం చెయ్యడానికి శిరోవ్రత ధారణ చెయ్యాలి. ఎందుకంటే ఆ శాస్త్ర అధ్యయనానికి శిరోవ్రతం ధర్మం అని ప్రసిద్ధి ఉన్నది. అంతేకాక యజ్ఞం లో మంత్రం ఎలాగో, స్వాధ్యాయానికి శిరోవ్రతం నియమం.
వివరణ:- ఉపనిషత్తులు ఎన్నో ధర్మలను వర్ణించాయి. దీని వలన బ్రహ్మోపాసన భిన్నం కావచ్చును కదా! ముండనం అంటే శిరస్సుపై జుట్టును తొలగించుట అని అర్ధం. ముండనం చేయించుకోవడం ద్వారా అన్నీ కోరికలను పరిత్యజించి మోక్ష ప్రాప్తికి ప్రయత్నం ప్రారంభించడం, దానికొరకు సన్యాసం స్వీకరించడం జరుగుతుంది. అటువంటి మోక్షేచ్ఛ కలవారికి ఉపదేశాన్ని అందించే ఉపనిషత్తు ముండకోపనిషత్తు. ముండకోపనిషత్తులో బ్రహ్మవిద్యకు శిరోవ్రతం ధర్మంగా ఉపదేశించారు. శిరోవ్రతం బ్రహ్మ చర్యాది అనుష్టానాలలో ఒకటి. దానిని ముండకోపనిషత్తులో అధ్యయన ధర్మంగా చెప్పారు.
ముండకోపనిషత్తు(3,2,10):- విధిపూర్వకంగా శిరోవ్రతాన్ని చేసుకున్న వాళ్లకు ఈ బ్రహ్మవిద్యను బోధించాలి. అధర్వణికులు ఈవ్రతం చెబితే, వాజసనేయులు, ఛాందోగులు ఈధర్మం విధించలేదు. బ్రహ్మోపాసనలో తేడా లేకపోతే ప్రతి వేదాంతంలో వేరు వేరు ధర్మాలు ఎందుకు చెబుతారు? (3, 2, 11):- శిరోవ్రతం ఆచరించనివాడు ముండకోపనిషత్తును అధ్యయనం చెయ్యడు. ఈవాక్యం వలన శిరోవ్రతం అధ్యయనధర్మం అని తెలుస్తోంది. కనుక ఈవ్రతం బ్రహ్మవిద్యాధర్మం కాదు. స్వాధ్యాయనానికి సంబంధించినది. అలాగే యజ్ఞాలలో దేవతాస్మరణ నియామంగా చెయ్యాలి. అదే విధంగా ముండకోపనిషత్తు అధ్యాయానికి శిరోవ్రతం ఆచరించాలి. ఈధర్మం ఇతర ఉపనిషత్తులు చదవడానికి వర్తించదు. కనుక ఈవ్రతం అధ్యయన ధర్మమే కాని బ్రహ్మవిద్యాధర్మం కాదు. దేవి భాగవతం వంటి వాటిలో శిరోవ్రతం అనే ఉపాసన ఉన్నది. అది ముండకోపనిషత్తులో మాత్రమే చెప్పబడింది. ఇంకే ఉపనిషత్తులో చెప్పలేదు. కనుక ఉపాసనలో భేదం ఉందనడం సరికాదు. ఈ బ్రహ్మవిద్యను శిరో వ్రతం ఆచరించిన వాళ్ళకే చెప్పాలి. స్వాధ్యాయ ధర్మంగా ( ఒకరి స్వీయ అధ్యయన ధర్మంగా ) వేదం వ్రతాలను ఉపదేశించే ఒక గ్రంధంలో అధర్వణికులు ఇది కూడా వేదవ్రతంగా వ్యాఖ్యనించారు. శిరో వ్రతం ఆచరించని వారు దీనిని అధ్యయనం చేయలేరు. బ్రహ్మ విద్యను స్వీకరించలేరు. బ్రహ్మ విద్యను బోధించే గ్రంథమే ప్రకృతం గాన, ఈధర్మం గ్రంథవిశేషంతో మాత్రమే సంబంధిస్తుంది. ఇతర వేదాలలో చెప్పబడిన త్రేతాగ్నితో సంబంధించినది కాకపోవడం చేతను, ఇది అధర్వణికులకు మాత్రమే అని ఏ విధంగా నియమించడబడుచున్నదో అట్లే ఈ ధర్మం కూడా స్వాధ్యాయ విశేషంతో సంబంధం ఉండటం వలన, ఇది విద్యకు సంబంధించిన విషయం కాదు. విద్యా భేద హేతువు కాదు.
సూత్రం :- 363
" దర్శయతి చ "
చ :- అంతే కాక, దర్శయతి :- ప్రతి వేదంతంలోనూ, ఒకే బ్రహ్మం ఉపాస్యమని, బ్రహ్మోపాసనలో భేదం లేదని చెప్పారు.
భావం :- ప్రతి వేదాంతంలోను ఒకే బ్రహ్మం ఉపాస్యమని, బ్రహ్మోపాసనలో భేదం లేదని చెప్పారు.
వివరణ:-వేదాలలోకూడా వేద్యుడు అంటే తెలుసుకొనదగినవాడు. ఉపాసన ఒకటే అని చెప్పబడింది. వేదాలు, ఉపనిషత్తులు అన్నీ ఒకే బ్రహ్మోపాసనను ఉపదేశిస్తున్నాయి. అందుకే బ్రహ్మోపాసన అభిన్నమని గ్రహించాలి.కాబట్టి ఉపనిషత్తులలో రకరకాల ఉపాసనలు చేసినప్పటికి వాటిలో ఏకరూపత్వమున్నది.
ఋగ్వేదం(4, 4, 24, 1):- మహామహిమాన్వితుడు, సమస్త లోకాలు ధరించే వాడు, సకల జ్ఞాన ప్రకాశకుడు, అన్నింటి కన్నా గొప్ప తత్త్వమైన పరమాత్మిక జ్ఞానులు మనసుతో ధ్యానిస్తున్నారు. బుద్ధి వికసితం చేసుకుంటారు.
కఠోపనిషత్తు(5, 12 ):- సర్వ ప్రాణులకు అంతరాత్మ యై, అన్నింటిని వశంలో ఉంచుకునే వాడు ఒక్కడే.
శ్వేతాశ్వరోపనిషత్తు(6, 11):- సమస్త భూతాలలోనూ గూఢంగా ఉండే దేవుడొక్కడే. అన్ని వేదాల్లోను, ఉపనిషత్తులలోనూ ఒకే బ్రహ్మం ఉపాస్యం అని ఉపదేశించాయి. అందువలన ఉపనిషత్తులలో బోధించిన ఉపాసనా విద్యలు భిన్నం కావు. వాటి ప్రయోజనం ఒక్కటే. సమస్తవేదాలు ఏస్థానాన్ని నిర్గుణబ్రహ్మను బోదిస్తున్నాయో, అవే విద్యైకత్వాన్ని స్పష్టంగా ప్రతిపాది స్తున్నాయి. సర్వవేదాలలో నిర్గుణమైన, సగుణమైన తెలుకోదగినది ఒక్కటే బ్రహ్మం. ఒక శాఖలోని విషయం మరొకశాఖ లోనికి అన్వయించుకోవాలని సూచించారు. బ్రాహ్మణులు గొప్పదైన ఉక్థంలో శాస్త్రంలో ముఖ్యభాగంలో, అధ్వర్యువులు అగ్ని యందు, ఛాందోగులు మహావ్రతంలో చర్చిస్తున్నారు అని సర్వవేదాలలో వేద్యమైనది. "పరమేశ్వరుడు తల మీదకు ఎత్తబడిన భయంకరమైన వజ్రం "అని కారకంలో చెప్పబడిన ఈశ్వరగుణం భయహేతుకమై, నరుడు ఎప్పుడైతే ఈ అద్వితీయ బ్రహ్మయందు ఈషన్మాత్రం భేదంకూడా చూస్తాడో అప్పుడు వానికి భయం కలుగుతుందని తైతరీయంలో భేదాన్ని నిందించడానికి పరామర్శించడం మైనది. అట్లే వాజసనేయంలో ప్రాదేసికమాత్రంగా చెప్పబడిన వైశ్వానరుణ్ణి సిద్ధవత్తుగా అంగీకరించి పరామర్శించడం కనబడుతుంది. అట్లే సర్వవేదాంత ప్రత్యయములుగా ఒక శాఖలో విధించబడిన ఉక్థాదులను మరొక చోట ఉపాసనాదుల నిమిత్తం గ్రహించబడినది. ఉపనిషత్తులలో రకరకాల ఉపాసనలు చేసినప్పటికి వాటిలో ఏకరూపత్వం ఉన్నది.
ఉప సంహారాధికారణం ( 3, 3, 5 )
సూత్రం :- 364
" ఉప సంహారోర్ధా భేదాత్ విధి శేషవత్ సమానే చ "
సమానేచ :- అన్ని వేదాంతాలలో ఉపదేశించిన బ్రహ్మోపాసన ఒక్కటే. అర్ధ అభేదాత్ :- ప్రయోజనంలో కూడా భేదం లేదు. విధి శేషవత్ :- విధులైన అగ్ని హోత్రాది కర్మల్ని వేర్వేరు చోట్ల ఉపదేశించినా ఒక చోట సమన్వయం చేసుకోవాలి. ఉపసంహారం :- వివిధ శాఖలలో చెప్పిన గుణాలు ఒకే సంబంధం ఉన్నవని గుర్తించాలి.
భావం :- అన్ని వేదాంతాలలో ఉపదేశించిన బ్రహ్మోపాసన ఒక్కటే. ప్రయోజనం లో కూడా భేదం లేదు. విధులైన అగ్నిహోత్రాది కర్మల్ని వేర్వేరు చోట్ల ఉపదేశించినా ఒక చోట సమన్వయం చేసుకోవాలి. వివిధ శాఖలలో చెప్పిన గుణాలు ఒకే సంబంధం ఉన్నవని గ్రహించాలి.
వివరణ:- ఈఅధికరణంలో ఒక శాఖలోని గుణాలను వేరొక శాఖలోనికి అన్వయించడం గురించి తెలియజేశారు. విభిన్న ఉపనిషత్తులలో వివరించిన గుణాల్లో పరస్పర సంబంధం ఉంది. వివిధ శాఖలోని గుణాలను మనము సమన్వయం చేసుకోవాలి. వాటి ప్రయోజనాలలో తేడా ఏమి లేదు. అవన్నీ ఉపాసనకు ఉపకరిస్తాయి. ఉపసంహారం అంటే ఒక చోట చెప్పిన గుణాల్ని, ధర్మాన్ని ఇంకొక చోట అన్వయింపజెయ్యాలి. విభిన్న బ్రాహ్మణ శాఖల్లో వర్ణించిన అగ్నిహోత్రాది కర్మలన్నీ సమానమే. అలాగే ఉపాసనలో కూడా గుణోపసంహారం జరగాలి. ఉపాసనలో భేదం ఉండదు. ఒక శాఖలో కొన్ని ధర్మాలు చెబితే ఇంకొక శాఖలో ఉపసంహారం చేయవచ్చును. అంటే ఉపాసకుడు అన్నిశాఖలలోని గుణాలను నేర్చుకొని అన్వయింప జేయవచ్చును. ఇందులో దోషంలేదు. వేదాంతశాఖలలో భేదం లేనప్పుడు సమానమైన విద్యలో చెప్పబడిన గుణాలు ఆ శ్రుతికి మాత్రమే సంబంధించి ఉంటాయా? లేక ఒక చోటలేని వాటికి ఇతర శాఖల నుండి ఉపసంహరించాలా? అని సందేహం. బ్రహ్మ విద్యకు అక్కడ చెప్పిన గుణాలతో ఉపకారం సిద్ధిస్తున్నప్పుడు ఇతర శాఖలనుండి ఉపసంహారం అనావశ్యకం అని పూర్వపక్షవాదన. అలాంటప్పుడు వెనుక చేసిన విద్యైకత్వ విమర్శ అనావశ్యకం అని ఉపసంహారం చెయ్యాలని సిద్ధాంతం. ఇది గుణోపహారం వల్ల లభించే ప్రయోజనాన్ని చెప్పే సూత్రం. ఏ విధంగా సర్వవిజ్ఞానలు సర్వ వేదాంత ప్రత్యయాలు అనే విషయం నిశ్చితం. ఒక చోట చెప్పిన విజ్ఞాన గుణాలను సమానమైన మరొక విజ్ఞానంతో కూడా ఉప సంహారం జరుగుతుంది. ఈ రెండు విజ్ఞానాలలో భేదం లేదు. ఉపాసన లో వాటి ప్రయోజం ఒక్కటే. ఒక చోట విజ్ఞానానికి ఉపకారకమైన ఆ గుణాలు ఏ ప్రయోజనం ఉన్నదో, అదే రెండవచోట కూడా ఉన్నది. రెండుచోట్ల అదే ఉపాసన కదా! అగ్నిహోత్రాది విధికి అంగాలుగా ఉన్న ధర్మాలను అగ్నిహోత్రాది కర్మలు అభిన్నములవడం చేత అన్ని చోట్ల ఉపసంహరించడం ఎట్లో ఇక్కడ కూడా అంతే. అగ్ని హోత్రం అనే కర్మ ఒక్కటే. అయితే విజ్ఞానా భేదం ఉంటే మాత్రం ఆ గుణాలు మరొక విజ్ఞానంతో సంబంధించినవి అవడం చేత ప్రకృతి, వికృతి భావం లేకపోవడం చేత ఉపసంహారం ఉండదు. విజ్ఞానం ఒక్కటే అయితే ఉప సంహారం ఉంటుంది. కొన్ని యాగాలకు కావలసిన అంగాలన్నీ చెప్పబడతాయి. ఆ యాగాలకు ప్రకృతి యాగాలని పేరు. కొన్ని యాగాలకు కొన్ని అంగాలు మాత్రమే చెప్పబడతాయి. వీటికి వికృతి యాగాలు అని పేరు. ఇలా కొన్ని అంగాలు మాత్రమే చెప్పిన వికృతి యాగాన్ని ప్రకృతి యాగంలా చెయ్యాలి. అనగా వికృతి యాగానికి చెప్పకుండా విడిచిపెట్టిన అంగాలను ప్రకృతి నుండి గ్రహించాలి. రెండు విజ్ఞానాలు ఒక్కటే అయినప్పుడు వాటి మద్య ప్రకృతి వికృతి భావం లేదు. వివిధ శాఖలలో చెప్పిన గుణాలను మనం సమన్వయం చేసుకోవాలి.
అన్యధాత్వాధికరణం ( 3, 3, 6 )
సూత్రం :- 365
" అన్యధాత్వం శబ్దాదితి చేన్నా విశేషాత్ "
శబ్దాత్ :- ఉపాసనను విధించే శ్రుతి వాక్యం వలన, అన్య ధాత్వం :- ఒక శాఖలో చెప్పిన గుణాలు మరొక శాఖలో గ్రహించకూడదు, ఇతి చేత్ :- అని అనడం, న :- సరియైనది కాదు, అవిశేషాత్ :- బ్రహ్మనికి, ఆయన గుణాలకు భేదం లేదు.
భావం: ఉపాసనను విధించే శ్రుతి వాక్యం వలన ఒక శాఖలో చెప్పిన గుణాలు మరొక శాఖలో గ్రహించకూడదు అని అనడం సరియైనది కాదు. బ్రహ్మనికి, ఆయన గుణాలు భిన్నం కావు.
వివరణ:- ఛాందోగ్యం, బృహదారణ్యకం లో చెప్పిన ప్రాణవిద్యలు రెండు వేర్వేరు కాదు. వీటిలో ఇతరమైన అంశం ఏమి లేదు. ఉద్గీతను గురించి చెబుతూ ఛాందోగ్యంలో ఓంకారాన్ని ఉద్గీత దృష్టితో ఉపాశించాలి అని చెప్పారు. ఇక్కడ ఉద్గీత కర్మగా చెప్పబడింది. అదే బృహదారణ్యాకంలో ముఖ్యప్రాణాన్ని ఉద్గీత కర్తగా చెప్పబడింది. దేవతల కోసం ముఖ్య ప్రాణం ఉద్గానం చేసింది. ఉద్గీథ ఒక చోట కర్తగా, మరొక చోట కర్మగా చెప్పబడింది. కాబట్టి ఉద్గీథ విద్యలు భిన్నమైనవి అనే వారి వాదన సరియైనది కాదు. ఉద్గీథ లో ఉత్ అంటే ప్రాణం, గీత్ అంటే వాక్కు. ఇది ప్రణవ మంత్రం. ఆ ప్రాణం మూలంగానే ఈ జగత్తంతా స్థిరమై నిలబడి ఉంది. పరమాత్మను గానం చేసే గీతను ఓంకార అనే మంత్రరూపంలో జపించడమే ఉద్గీథం. ఉద్గోపాసన అంటే ఓంకారానుస్థానం. దేవతలకు దానవులకు యుద్ధం జరిగినప్పుడు దేవతలకు పరాజయం కలిగింది. ముక్కు ద్వారా సుగంధ దుర్గంధాల మిశ్రమ కర్మలకు ఫలితం కలిగిందే తప్ప అసురులను జయించే శక్తి పొందలేక పోయారు. దేవతలందరు వాక్కు, కళ్ళు, చెవులు, మనస్సు ద్వారా ఉద్గీతోపాసన చేయగా, అసురులు వాటన్నింటిని పాపాలతో తిప్పి కొట్టారు. అదెలాగంటే వాక్కు సత్యాన్ని, అసత్యాన్ని పలుకుతుంది. కళ్ళు అందమైన రూపాన్ని, పాపమైన కురూపాన్ని చూస్తుంది. చెవులు మంచిమాటలు, చెడుమాటలను వింటుంది. మనస్సు పాపాన్ని, పుణ్యాన్ని కూడా భావిస్తుంది. అందుకే దేవతలు అసురులను ఏమి చెయ్యలేక పోయారు. చివరగా దేవతలు ముఖ్యప్రాణాన్ని ఆధారంగా చేసుకొని ఉద్గీథోపాసన చేయగా, అసురులు దేవతలను ఏమి చెయ్యలేక వారే నశించిపోయారు. ఈ విధంగా ముఖ్య ప్రాణం గురించి జ్ఞానాన్ని సమృద్దిగా పొందిన వారికి ఎలాంటి పాపం అంటదు. అటువంటి వారికీ అపకారం చేయతలపెట్టినవాడు రాతి మీద కొట్టిన మట్టి ముద్దలా నాశనమై పోతాడు. ప్రణవోపాసన ఇంద్రియాల ద్వారా జరగలేదు. దేహంలోని ముఖ్య శక్తి అయిన ప్రాణాన్ని ఆధారంగా చేసుకొని ప్రణవోపాసన జరిగిందని స్పష్టంగా చెప్పబడింది.
ప్రాణ విద్య:- ఒకసారి ఇంద్రియాలన్నీ నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకున్నాయి. అన్నింటికన్నా మనస్సు నేనే ప్రధానమైన దానను అని తీర్పు కోసం బ్రహ్మ దగ్గరుకు వెళ్ళింది. బ్రహ్మ నేను తీర్పు చెప్పను. పాంచభౌతిక శరీరం నుండి ఒక్కొక్కటే బయటకు వెళ్ళండి. ఎవరు వీడితే చైతన్యం పోతుందో, శక్తి హీనులోతారో వారే గొప్పవారు అన్నాడట. ముందుగా వాక్కు బయటకు పోయి, ఏడాది తరువాత తిరిగి వచ్చి చూస్తే మిగతా అవయవాలన్నీ సక్రమంగానే పనిచేస్తున్నాయని, జీవక్రియలు జరగటంలోఎలాంటి ఇబ్బందులు లేవని గ్రహించింది. ఆ తరువాత పంచేంద్రియాలు ఒక్కొక్కటే శరీరాన్ని విడిచిపెట్టినా, యధాతధంగా మిగిలిన అవయవాలు పనిచేస్తూనే ఉన్నాయనీ, తాము గొప్పవారం కామని అర్ధం చేసుకున్నాయి. చివరిగా ప్రాణం వెళ్ళిపోయింది. శరీరం నిర్వీర్యం అయిపోయి, ఇంద్రియాలన్నీ అచేతనమయ్యాయి. దీనిని బట్టి ప్రాణం శ్రేష్ఠమైనది. ప్రాణమే బ్రహ్మం అని ఇంద్రియలాన్నీ అంగీకరించాయి. ప్రాణోపాసనలో ప్రాణంతో పరమాత్మను ఉపాసించడం. కౌషీతకి బ్రాహ్మణం లో ప్రాణ విద్యను గురించి వివరించారు.
శాండిల్య విద్య:- శాండిల్య విద్యను శాండిల్య మహర్షి చే బోధించబడింది. దీనిలో జగత్తునే పరమాత్మగా ఉపాసన చెయ్యడం. సర్వం ఖల్విదం బ్రహ్మ, కనిపించే జగత్తంతా పరమాత్మగానే ఉపాసన చెయ్యడం. జగత్తు పరమాత్మ నుంచి వచ్చింది, తిరిగి ఆయనలోనే కలసి పోతోంది. ఈ జగత్తు అశాశ్వతం కదా! అని సందేహం కలగవచ్చును. మనలో ఉన్న అజ్ఞానం వలన అది జగత్తుగా కనిపిస్తోంది, యదార్ధంగా అది పరమాత్మయే. ఇంద్రియాలను జయించి, నిశ్చలబుద్ధితో శాస్త్ర జ్ఞానంతో ఉపాసన చేస్తే సత్యం బోధపడుతుంది. రాయిని పరమాత్మగా చూసినట్లే జగత్తును పరమాత్మగా భావించి ఉపాసించాలి.
సత్యవిద్య:- వాజసనేయులు శతపధబ్రాహ్మణంలో సత్యమే బ్రహ్మమని తలచి ఉపాసన చేయాలనీ చెప్పారు. జ్ఞానం, ఆనందం లాంటి గుణాలు బ్రహ్మ స్వరూపమే. అయితే ఆయన నిర్గుణుడు అనడానికి కారణం సత్వరజస్థమో గుణాలులేని పరబ్రహ్మమే సత్య స్వరూపం.
సూత్రం :- 366
" న వా ప్రకరణ భేదాత్ పరోవరీయస్త్వాదివత్ "
ప్రకరణ భేదాత్ :- రెండు విధాలుగా వర్ణించడం వలన, న అన్య ధాత్వం :- గుణాల్ని గ్రహించడమే అని అనడం తగదు. అవిశేషాత్ :- ఉపాశించవలసిన తత్వంలో భేదం లేనందుకు వలన, పర అనరీయ స్త్వాదివత్ :- బ్రహ్మం అన్నింటి కన్నా గొప్పది అనే విషయంలో ఏవివాదం లేనందుకు వలన గుణగ్రహణం చేయవచ్చును. దీనికి పై సూత్రం నుంచి అన్యథాత్వం, అవిశేషాత్ అనేవి అనువృత్తులు.
భావం :- రెండు విధాలుగా వర్ణించడం వలన గుణాలను గ్రహించడమే అని అనడం తగదు. ఉపాసించవలసిన తత్త్వంలో భేదం లేనందు వలన బ్రహ్మం అన్నింటి కన్నా గొప్పది అనే విషయంలో వివాదం లేనందున గుణ గ్రహణం చేయవచ్చును.
వివరణ:- కొన్ని విద్యలు ఒకటిగా కనిపించినా అవి భిన్నములేనని ఈప్రకరణంలో తెలియజేశారు. రెండు విధాలుగా వర్ణించడం వలన గుణాలను గ్రహించలేము అని అనడం సరి కాదు. బ్రహ్మం అన్నింటి కన్నా గొప్పది అని విషయంలో ఏ వివాదం లేనందున, ఉపాసించవలసిన తత్త్వం లో భేదం లేనందున గుణ గ్రహణం చేయవచ్చును.
ఛాందోగ్యోపనిషత్తు ( 1, 6, 6 ):- ఉద్గీథ ఉపాసన రెండు రకాలుగా చెప్పడం జరిగింది.
1.హిరణ్యశ్మశ్రువు, హిరణ్యకేశుడై బ్రహ్మాన్ని ఉపాసించడం ఉద్గీత. 2.పరోవరీయాది (అంటే అన్నింటికన్నా గొప్పది) గుణాలతో కూడిన ఉద్గీథ ఉపాసన చెప్పారు. ఉపాసన ఒకే శాఖకు చెందిన ప్రకరణ భేదాన్ని బట్టి కొంచెం భేదం ఉన్నట్లు కనిపిస్తుంది. హిరణ్యశ్మశ్రుత్వాది గుణ విశిష్ట ఉపాసన ఒకటి, పరోవరీయస్త్వాది గుణవిశిష్ట ఉపాసన మరొకటి. ప్రకరణభేదం వలన, గుణ భేదం వలన ఉపాసనల్లో భేదం ఉన్నట్లు కనిపిస్తుంది. కాని వీటిలో బ్రహ్మ ఒక్కటే ఉపాస్య దైవం. ఛాందోగులు సృష్టి, స్థితి, లయలకు కర్తగా బ్రహ్మాన్ని సర్వం ఖల్విదం బ్రహ్మగా ఉపసించాలన్నారు. వాజసనేయులు శతపధబ్రాహ్మణంలో "సత్యం బ్రహ్మేతి ఉపాసీత " సత్య రూపంలో బ్రహ్మ ఉపాస్యుడన్నారు.
ఛాందొగ్యోపనిషత్తు(1, 2, 5 :- ప్రాణముద్గీతథ ముపాసాం చక్రిరే " ప్రాణం అంటే బ్రహ్మం. ఈ ఉపాసన ప్రాణం అనే నామంతో చేస్తారు. కనుక దీనిని ఉద్గీథం అన్నారు.(ఓం అనే అక్షరాన్ని ఉద్ గీథాన్ని అనగా ఉద్గీథంలో ఒక అవయవమైన ఓం అనే అక్షరాన్ని ఉపాసించాలి.)
బృహదారణ్యకం 1, 3, 1 నుంచి 24 వరకు ఉన్న ప్రసంగంలో ఉండే ప్రాణప్రదం బ్రహ్మ బోధకం. ఆ ప్రాణమే ఉద్గీంథం. ఉత్ అంటే ప్రాణం, గీథ్ అంటే వాక్కు ఆప్రాణం మూలంగా ఈజగత్తంతా స్థిరమై నిలిచివుంది. ఉద్గీథావయవమైన ఓంకారం ఉపాసించ దగినది అని ప్రస్తావించి దాని యందు రసతమం మొదలైన గుణాలను చెప్పి పృదవ్యాధి రసాలలో ఓంకారం రసవత్తరమైనది. ఇదియే ఆర్తి, సమృద్ధి అని ఓంకార గుణాలను చెప్పడం జరిగింది. ఈ విశ్వాశాన్ని ధరించే ప్రాణమే బ్రహ్మం. ఆయన్ని "ఓం " అనే వాక్కుతో గానం చెయ్యాలి. ఓం పదంతో ఉపాసించి బ్రహ్మాన్ని పొందడమే ఉద్గీథ విద్య.ఈ విద్యను ఛాందోగ్యం లో, బృహదారణ్యకం లో సమానంగా వర్ణించారు. వీటిలో చెప్పిన ఉపాసనల్లో ఎటువంటి తేడా కనిపించడం లేదు. ఉపనిషత్తులలో వర్ణించిన బ్రహ్మోపాసనలలో భేదం లేదు. అందువలన ఒకచోట వర్ణించిన గుణాలు మరొక చోట సంగ్రహించడంలో దోషం లేదు.
సూత్రం :- 367
" సంజ్ఞాతశ్చేత్త దుక్త మస్తి తు తదపి "
సంజ్ఞాతః :- అనేక సంజ్ఞల వలన, అన్వధాత్వం :- గుణాలను గ్రహించడం వీలు కాదని అనడం, న :- సరియైనది కాదు. తత్ ఉక్తం :- సమన్వయం చేసుకోవాలని ముందే చెప్పాము. అస్తి తు తదపి :- సంజ్ఞల ఐక్యత ప్రతి వేదాంతంలో ఉంది.
భావం :- అనేక సంజ్ఞల వలన గుణాలను గ్రహించడం వీలు కాదని అనడం సరియైనది కాదు. సంజ్ఞల ఐక్యత ప్రతి వేదాంతంలో ఉంది. దానిని సమన్వయం చేసుకోవాలి.
వివరణ :- ఉద్ గీథ, ఉపాసన ఒక్కటే అయినా అనేక నామాలతో విభిన్న ఉపాసనలు చెప్పారు కదా! అ ఉపాసనలు వేర్వేరు కదా! వేర్వేరు కాకపోతే వేర్వేరు నామాలు ఎందుకున్నాయి? అంటే ఉపాసనలను అనుసరించి ఉపాస్య దైవాన్ని వేర్వేరు పేర్లతో పిలుస్తారు. ఒకచోట బ్రహ్మం, ఇంకొక చోట వైశ్వానరుడు, మరొక చోట అక్షరం, అలాగే దహరం, జ్యోతి, ప్రాణం, భూమి, ఆకాశం అని అనేక నామాలతో ఉపాస్య దైవాన్ని ఆయా ఉపాసనలలో వ్యవహరిస్తారు. కాని ఉపాస్య దైవం ఒక్కరే. అయితే అది అనేకోపాసన అవుతుంది. లోకంలో ఒక వస్తువుకు అనేక పేర్లు ఉండవచ్చును. ఒక వ్యక్తిని మనిషి, బ్రాహ్మణుడు, వదాన్యుడు అని పిస్తున్నారు కదా! అలాగే జగజ్జన్మాది కారణం అయిన ఈశ్వరుడికి వైశ్వానరాది అనేక నామాలున్నాయి. " సర్వత్ర ప్రసిద్దోపదేశాత్ " (1, 2, 1)లో చెప్పినట్లు ఉపాసనా ప్రకరణంలో అంతటా ప్రసిద్ధమైన బ్రహ్మాన్నే ఉపాస్య దైవంగా ఉపదేసించడం వలన బ్రహ్మం అంటే పరబ్రహ్మం అనీ, పరమేశ్వరుడు అనీ గ్రహించాలి. వస్తువు గుణ కర్మ స్వరూప సంబంధాన్ని బట్టి అనేక సంఖ్యలుండటంతో భేదం లేదు. ఇలా ఉపాస్యం లో భేదం లేకపోవడం వలన ఉపాసన లో కూడా భేదం ఉండదు. సంజ్ఞకత్వం భిన్న విద్యలకు కూడా ఉన్నది. ఒకే సంజ్ఞ ఉండటం చేత విద్యైకత్వం న్యాయమైనది. రెండు చోట్ల కూడా ఉద్గీతవిద్య అని ఒకే సంజ్ఞ ఉన్నది కదా! అని అన్నట్లయితే అది కూడా ఉపపన్నం కాదు. వేర్వేరు విద్యలుగా నిశ్చితములైన పరోవరీయస్త్వాద్యుపాసనలలో ఉద్గీత విద్య అని ఒకే సంజ్ఞ కనబడుచున్నది. ఒకే పేరు ఉండటం చేత ఒకే ఒకే విద్య అనీ చెప్పవలసిన పని లేదు. సంజ్ఞ, ఉపాసన విద్య వేర్వేరు అయినప్పటికీ, ఒకే పేరుతో రెండు విద్యలలోభేదం ఉన్నప్పటికీ, ఉపాస్య దైవం బ్రహ్మం ఒక్కరే అనీ గ్రహించాలి.
వ్యాప్త్యధికరణం ( 3, 3, 9 )
సూత్రం :- 368
" వ్యాప్తేశ్చ సమంజసం "
చ :- అలా కాదు, వ్యాప్తేః :- బ్రహ్మ వ్యాపకం కనుక, సమంజసం :- అన్ని స్థానాలోనూ బ్రహ్మోపాసన తగినదే.
భావం :- బ్రహ్మ వ్యాపకం కనుక అన్ని స్థానాల్లోనూ బ్రహ్మోపాసన తగినదే.
వివరణ:-ఉపాసించవలసిన తత్త్వంలో భేదం లేనందున బ్రహ్మం అన్నిటికన్నా గొప్పదే. అన్ని స్థానాలలో బ్రహ్మోపాసన తగినదే. గురువుగారు! ఓంకారమనేది ఋగ్వేదం, యజర్వేదం, సామవేదాలు మూడింటిలో వ్యాప్తమై ఉన్నది కదా! కాబట్టి ఓంకారాన్ని ఏ వేదంలోని ప్రణవంగా గ్రహించాలి? అని అడిగాడు నారాయణ భట్టు. సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. ఉద్గీత అనేది ఓంకారానికి విశేషణం. అందుచేత సామవేదం లోని ప్రణవంగా గ్రహించాలి. ఓంకారం అన్ని వేదాలలో ప్రతి ఋక్కకు, ప్రతి అనువాకానికి ముందు, చివర కూడా ఉంటుంది. అయితే ఉద్గీతాన్ని ఓంకారానికి విశేషంగా చెప్పారు. కాబట్టి సామవేద అవయవంగా దీనిని ఉపాసించాలి. సంఖ్యా భేదం వలన బ్రహ్మోపాసనలో భేదం లేదంటున్నారు. కాని, ఆ బ్రహ్మోపాసన ఒకసారి హృదయంలో, మరొక చోట ఆదిత్యునిలో, ఇంకొక చోట అక్షిలో వేరే చోట అంతటా విధించారు. స్థాన భేదాన్ని బట్టి స్థానిక భేదం ఉంటుంది కదా! అయితే ఉపాస్యంలో భేదం, భిన్నత ఎందుకుండదు? దానికి సమాధానం చెప్పబడింది. మోక్షాన్ని ఆపేక్షించే వ్యక్తులకు విభిన్న రుచులు, భిన్న శక్తి యుక్తులు ఉంటాయి. కొందరికి హృదయంలో, మరికొందరికి ఆదిత్యునిలో, ఇంకొందరికి అక్షిలో, అన్యులకు సర్వత్రా బ్రహ్మాన్ని ఉపాసించడం రుచికరం కావచ్చును. యోగ్యతను అనుసరించి వాళ్ళు ఎక్కడ ఉపాసించినా దోషం లేదు. బ్రహ్మ సర్వ వ్యాపకం కదా! " ఓమిత్యే తదక్షర ముద్గీథ ముపాసీత " అనునప్పుడు అక్షరానికీ, ఉద్గీథానికీ ( అక్షరమే ఉద్ గీథమని) సమానార్ధం వినబడుచున్నది. దీనిని బట్టి అధ్యాసను గ్రహించాలా? అపవాదం గ్రహించాలా? ఏకత్వం గ్రహించాలా? విశేషత్వం గ్రహించాలా? అని నాలుగు పక్షాలు భాసించడం వలన ఏ పక్షం న్యాయమైనది అని విచారణ చేయబడినది. అధ్యాస అనగా రెండు వస్తువులను రెండు వస్తువులుగా గ్రహిస్తూనే, వాటిలో ఒకదాని యందు మరొకటి అనే బుద్ధి అభ్యసించబడుతుంది. చీకటిలో త్రాడును చూసి పాము అనుకుంటారు. త్రాటి యందు పాము అధ్యస్తము అంటే ఆరోపించబడుతోంది. ఒక వస్తువు నందు మరొక వస్తువును ఆరోపించుతే అధ్యాస. ఆకాశంలో చంద్రుడు ఒక్కడే ఉన్నా దృష్టిదోషం చేత రెండుగా కనిపిస్తుంది. ఎడారిలో నీరు లేకపోయినా ఎండమావులు కనిపిస్తాయి. అట్టి మిధ్యారోపమే అధ్యాస. విష్ణువు ప్రతిమ నందు విష్ణుత్వాన్ని ఆరోపించినా, అది ప్రతిమ అనే బుద్ధి కూడా ఆనువర్తిస్తూనే ఉంటుంది. అట్లే ఉద్గీథ మీద అక్షరబుద్ధి అభ్యసించబడుతుంది. లేదా అక్షరం మీద ఉద్ గీథ బుద్ధి అభ్యసించ బడుతుంది. అపవాదం అనగా ఒకవస్తువు మీద మిధ్యాబుద్ధి నిశ్చితంగా కలిగి తరువాత యదార్ధ బుద్ధి కలిగి పూర్వం ఏర్పడిన మిధ్యా బుద్ధి నశిస్తుంది. దేహేంద్రియసంఘాతం చేత జీవుడు తాను పరమాత్మ కన్నా వేరుగా ఉన్నాను అనే మిధ్యా బుద్ధి నశించి, తత్త్వమసి నేను నీవై ఉన్నాను అంటే జీవుడు, దేవుడు ఒక్కటే అనే యదార్ధ బుద్ధి కలుగడమే అపవాదం. ఆత్మయందు ఆత్మ బుద్ధి కలుగగా ముందు కలిగిన తరువాత మిద్యా బుద్ధి తొలగించ బడుతుంది. ఇక్కడ అక్షర బుద్ధి, ఉద్గీథ బుద్ధి ఒకదాని చేత మరొకటి నివర్తింప జేస్తుంది. సర్వత్రా బ్రహ్మం ఉండటం వలన యోగ్యతను అనుసరించి వారు ఎక్కడ ఉపాసించినా దోషం లేదు.
సర్వాది భేదాధికరణం ( 3, 3, 10 )
సూత్రం :- 369
" సర్వ భేదా దన్య త్రేమ్ "
సర్వఅభేదాత్ :- అన్ని వేదాంతాలలోనూ, బ్రహ్మోపాసన భిన్నం కానందువలన, ఇమే :- మున్ముందు వర్ణించబోయే బ్రహ్మం గుణాలు, అన్యత్ర :- ఇది వరకు వేరే స్థలాలలో వర్ణించిన గుణాల సారాంశం ఒక్కటే.
భావం:-అన్ని వేదాంతాలలో బ్రహ్మోపాసన భిన్నం కానందున మున్ముందు వర్ణించబోయే గుణాలు, ఇది వరకు వేరే స్థలాలలో వర్ణించిన గుణాల సారంశం ఒక్కటే.
వివరణ:- అన్నివేదాంతాలలో బ్రహ్మోపాసన ఒకచోట నిర్దేశించని గుణాలు, వేరేచోట నిర్దేశించినప్పుడు వాటిని బ్రహ్మోపాసనకు ఉపకరించే లాగా గ్రహించి స్వీకరించాలి. గురువుగారు! ప్రాణవిద్య అనేది బృహదారణ్యక, ఛాందోగ్యాలలో ఒక్కటే. అక్కడ ప్రాణమే శ్రేష్టమూ, జ్యేష్ఠమూ అని చెప్పబడినది. ఈ ఉపనిషత్తులలో ఇంద్రియాలకు కూడా వశిష్టాత్వాది గుణాలు చెప్పబడ్డాయి. అంటే
వాక్కుకు - సుస్థిరత్వం
చక్షువుకు - ప్రతిష్ఠాత్వం( చక్కగా నిలిచే శక్తి
శ్రోత్రానికి - సంపత్త్వం (ఇతరుల అభిప్రాయం తెలుకునే శక్తి )
మనస్సుకు - అవయవత్వం ( అన్ని ఇంద్రియాలకు ఆధారం )
రేతస్సుకు - జనిత్వం ( ఉత్పత్తి కారకం )
కౌశితకీ ఉపనిషత్తులో శ్రేష్ఠత్వం మాత్రమే చెప్పారు. కాని వశిస్థాది గుణాలు చెప్పలేదు. నేను వశిష్టుడనై ఉండటం అనేది ఏది కలదో, అందుచేత నువ్వు వశిష్టుడవైన్నావు, ఇత్యాది వాక్యాల చేత ప్రాణాన్ని తిరిగి ఇచ్చివేయబడినట్లు చెప్పబడింది.వాగ్మి సుఖంగా ఉంటాడు. వాక్కుకు సుస్థిరత్వం అనే గుణం, వశిష్టత్వం అనే గుణం ఉన్నాయి. కళ్ళు చక్కగా కలవాడు పాదాలను నిలుపుగలడు. అందుచేత చక్షువులో ప్రతిస్థాన అనే గుణం ఉంది. వినడం ద్వారా సమస్త ప్రయోజనాలు పొందవచ్చును. ఇతరుల అభిప్రాయాలను తెలుసుకోవచ్చును. అందుచేత శ్రోత్రంలో సంపత్ అనే గుణం ఉంది. మనస్సు అన్ని ఇంద్రియాలకు ఆధారం, సమస్త భోగాలకు ఆశ్రయం. అందువలన మనస్సుకు అవయవత్వము అనే గుణం ఉంది. ప్రాణం శ్రేష్టమని తలచిన వాగాదులన్నీ ఈ గుణాలను ప్రాణానికి అర్పించినట్లుగా రెండు శాఖలలోనూ వివరించాయి. ప్రాణ సంవాదం లో ప్రాణానికి శ్రేష్ఠత్వం చెప్పబడింది. కాని వశిష్టాది గుణాలు చెప్పబడలేదు. ఈ గుణాలను ఇతర స్థలాలలో చేర్చాలా? అక్కర లేదా? అనేది సంశయం. "ఏవం" అని ఉండటం చేత చేర్చవలసిన పని లేదని చెప్పబడింది. ఏవం అంటే 'దీనిని తెలుసుకొని' అని అర్ధం. ఇది వేద్యమైన వస్తువును, ప్రకృతి విద్యలో ఉన్న గుణాలను, దగ్గరగా ఉన్న వస్తువును మాత్రమే తెలుపడానికి సమర్ధంకాని ఇతరశాఖలలో ఇతరవిద్యలలో ఉన్న గుణసముదాయాన్ని చెప్పే సమర్ధత లేదు. అందుచేత శాఖాంతరాలలో ఉన్న వాటిని గ్రహించవలసిన పని లేదు. దేవదత్తుడు మరొక దేశం వెళ్ళినప్పుడు ఆగుణాలున్నవాడుగా అక్కడి వాళ్ల చేత గుర్తింప బడకపోయినా, ఆ గుణాలు లేనివాడైపోడు. కొంత పరిచయం ఏర్పడిన తరువాత ఆ దేశంలో కూడా ఏ విధంగా అతని గుణాలు గుర్తింపబడతాయో, అట్లే సంబంధాన్నిబట్టి ఒకశాఖలో ఉపాసించదగినవిగా చెప్పబడినవి మరొక శాఖలో చేర్చబడతాయి. అందువలన ప్రధానమైన ఒకే విజ్ఞానానికి సంబంధించిన ధర్మాలు ఒకే చోట చెప్పబడుకున్నా కూడా వాటిని అన్నీ ఉపసంహరించుకోరు.
ఆనందాధ్యధికరణం ( 3, 3, 11)
సూత్రం :- 370
" ఆనందాదయః ప్రధానస్య "
ప్రధానస్య:-చిదచిదాత్మకమైన సకలజగత్తుకు ముఖ్యడైన బ్రహ్మానికి, ఆనందాదయం:- ఆనందం, జ్ఞానంలాంటి గుణాలున్నాయి.
భావం :- చిదచిదాత్మకమైన సకల జగత్తుకు ముఖ్యడైన బ్రహ్మానికి ఆనందం, జ్ఞానం లాంటి లక్షణాలున్నాయి.
వివరణ:- బ్రహ్మస్వరూపం ప్రతిపాదించే శ్రుతులలో ఆనంద రూపత్వం, విజ్ఞాన రూపత్వం, సర్వగతత్వం మొదలైన కొన్ని బ్రహ్మకుసంబంధించిన ధర్మాలు కొన్నిచోట్ల వివరించబడుతున్నాయి. ఈఆనందాది ధర్మాలలో ఏవి ఎక్కడ వినబడు తున్నాయో వాటిని అక్కడ మాత్రమే గ్రహించాలా? లేక అన్నింటిని అన్ని చోట్ల గ్రహించాలా? అని సంశయం. ఈ సూత్రంలో ప్రధానం అంటే బ్రహ్మ. ఆరి అనే పదంతో జ్ఞానం, వ్యాపకత, సత్యం లాంటి గుణాలను గ్రహించాలి. ఈ గుణాలన్నీ బ్రహ్మ స్వరూపాన్ని బోధించేవే. ప్రధానమైన బ్రహ్మ యొక్క ఆనందం మొదలైన ధర్మాలన్నీ అన్ని స్థలాలలో గ్రహించాలి. వీటన్నిటిని తైత్తరీయంలో బాగా వివరించారు. ఈ గుణాలను సర్వత్రా గ్రహించడం వలన ఉపాసన ఫలజనకం అవుతుంది కనుక ఆనందత్వం మొదలైన ధర్మాలను సర్వత్ర అన్వయించుకోవచ్చును. ఉపనిషత్తులలో పరబ్రహ్మ నిర్గుణుడు, ఆనంద స్వరూపుడు, విజ్ఞాన రూపుడు, సద్రూపుడు, పూర్ణుడు అని చెప్పడం జరిగింది. వీటిలో కొన్ని ధర్మాలు కొన్ని చోట్ల చెప్పబడ్డాయి. అయినప్పటికీ ఉపనిషత్తులలో చెప్పదలచినది నిర్గుణ బ్రహ్మను గురించే కాబట్టి ఆ ధర్మాలు ఎక్కడ అవసరమైతే అక్కడ వాటిని చెప్పవచ్చును.
సూత్రం :- 371
" ప్రియశిరస్త్వాద్య ప్రాప్తి రుపచయా పచయోహి భేదే "
ప్రియ శిరః తు ఆది అప్రాప్తిః :- బ్రహ్మోపాసన లో ప్రియం, శిరస్సు మొదలైన వాటిని గ్రహించరు. హి :- ఎందుకంటే, ఉపచయ అపచయే :- వృద్ధి క్షయాలు, భేదే :- నానాత్మక భిన్న వస్తువులలో సంభవిస్తాయి.
భావం :- బ్రహ్మోపాసనలో ప్రియం, శిరస్సు మొదలైన వాటిని గ్రహించరు. ఎందుకంటే వృద్ధి క్షయాలు నానాత్మక భిన్న వస్తువులలో సంభవిస్తాయి.
వివరణ:- తైత్తరీయంలో ఆనందాది గుణాలను వర్ణించిన చోట ప్రియం, శిరస్సు లాంటి పదాల ప్రసక్తి ఉంది కదా? వాటిని కూడా బ్రహ్మోపాసనలో గ్రహించాలా? అనే ప్రశ్నకు వ్యాసుడు ఈ సూత్రంలో బదులిస్తున్నాడు.
తైత్తరీయెపనిషత్తు ( 2, 5 ):- బ్రహ్మకు ప్రియం శిరస్సు, మోదం దక్షిణ పక్షం, ప్రమోదం ఉత్తర పక్షం, ఆనందం ఆత్మ అన్నారు. బ్రహ్మోపాసనలో ఆనందాది గుణాలను గ్రహిస్తున్నాం కదా! ప్రియం, మోదం లాంటి వాటిని కూడా గ్రహించాలా? కొన్నింటిని గ్రహించి, మరికొన్నిటిని విడదీయడం సబబేనా? అని సందేహం. దానికి సమాధానం చెప్పబడింది. బ్రహ్మకు శిరస్సు పక్షం లాంటిది. వికల్పించారు. వాటికీ సంబంధించిన గుణాలకు వృద్ధిక్షయాలు ఉంటాయి. ప్రియం కన్నా మోదప్రమోదాలు ఎక్కువ. ప్రమోదం కన్నా ప్రియమోదాలు తక్కువ అవుతూ ఉంటాయి. కనుక ప్రియ మోదాలు జ్ఞానానందాల్లాగా బ్రహ్మ గుణాలు కానేరవు. శిరస్సు, పక్షం లాంటివి బ్రహ్మనికి కల్పితాలే కాని స్వాభావికాలు కాదు. ఇవి బ్రహ్మనికి స్వాభావిక గుణాలు కావు.
ప్రియము :- తన వారిని చూసినప్పుడు కలిగే ఆనందం,
మోదము :- కోరుకున్నది లభించినప్పుడు కలిగే సంతోషం.
ప్రమోదము :- మోదం ఎక్కువైనప్పుడు కలిగేది.
ఆనందం :- అన్నింటిని మించిన సంతోషం.
ప్రియము, మోదము, ప్రమోదం అనేవి సంతోషంలో హెచ్చుతగ్గులు, ఈధర్మాలను ప్రతి చోట చెప్పటానికి లేదు. ఇవి శోక ధర్మాలు మాత్రమేనని ప్రతిపాదించి యున్నారు. పరబ్రహ్మం మీద చిత్తం నిలపడంకోసం ఉపాయాలుగా మాత్రమే ఈ ధర్మాలు చెప్పబడ్డాయి. కాని వీటిని ఉపాసించాలి అనే ఉద్దేశ్యంతో చెప్పబడలేదు. ఈదృష్టితో చూస్తే కూడా ప్రియశిరస్త్వాదులు ఏవిధంగాను కూడా ఇతర స్థలాలలో ప్రాప్తించవు. అయితే ప్రియ శిరస్త్వాదులు బ్రహ్మ ధర్మాలు అని కల్పించుకొని ఆచార్యుడు ప్రియశిరస్త్వాద్యప్రాప్తి అని ఈన్యాయం చూపాడు. నిజానికి ఇవి బ్రహ్మ ధర్మాలు కావు. ఉపాస్య దైవం బ్రహ్మ ఒక్కయే అయినా కూడా ఉపసనా భేదాలు ఉండటం చేత ఒక చోట ఉన్న ధర్మాలు మరొక చోట ప్రాప్తించవు. ఒక స్త్రీ ఛత్రం చేత, మరొక స్త్రీ చామరం చేత ఇద్దరూ స్త్రీలు ఒకే రాజును ఉపాసించినప్పుడు ఉపాస్యుడు ఒకడే అయినా కూడా ఉపాసనలో భేదాలు, ధర్మాల వ్యవస్థ ఏ విధంగా ఉంటాయో, అట్లే ఇక్కడ కూడా సగుణబ్రహ్మ విషయంలో భేద వ్యవహారం ఉన్నప్పుడు గుణాలలో హెచ్చుతగ్గులు ఉండటానికి అవకాశం ఉంటుంది. కాని నిర్గుణపరబ్రహ్మ విషయంలో ఉండదు. అందువలన ఒక చోట వినబడుతున్న సత్య కామత్వాది ధర్మలకు మరొకచోట ప్రాప్తి లేదు.
సూత్రం :- 372
" ఇతరే త్వర్ధ సామాన్యాత్ "
ఇతరేతు :- ప్రియశిరస్త్వా దులు గాని, ఇతర ఆనందాది గుణాలు, అర్ధ సామాన్యాత్ :- బ్రహ్మ సామాన్యం కావటం వలన, అన్ని బ్రహ్మోపాసనలలో గ్రహిస్తారు.
భావం :- ప్రియశిరస్త్వాదులు గాని, ఇతర ఆనందాది గుణాలు గాని బ్రహ్మ సామాన్యం కావటం వలన అన్ని బ్రహ్మోపాసనలలో గ్రహిస్తారు.
వివరణ:- బ్రహ్మమనేది సర్వత్రా ఉండేదే. కాబట్టి ఆనందాది ధర్మాలు సర్వత్రా అన్వయింపవలసినదే. ఇలా అన్వయింపకపోతే బ్రహ్మతత్త్వాన్ని బోధించే మహావాక్యాల అర్ధం తెలియదు. అందుకనే ఆనందం, సత్యం లాంటి గుణాలను సర్వత్రా అన్వ యించుకోవాలి. బ్రహ్మ స్వరూపాన్ని ప్రతిపాదించడం కోసం మాత్రమే చెప్పబడుచున్న ఇతరములైన ఆనందాది ధర్మాలైతే, ప్రతిపాదింపదగిన బ్రహ్మ ఒకటే అవడం చేత అవన్ని కూడా అన్న చోట్ల తెలియ బడతాయి. ఆనందాదులు బ్రహ్మ స్వరూప బోధకాలు. బ్రహ్మానుబంధాలు. బ్రహ్మంతో బాటు గ్రహించవలసినవి. బ్రహ్మ సాక్షాత్కారం కలిగినప్పుడు ఆయన స్వరూపాలైన ఆనందాదిగుణాలు కూడా ప్రత్యక్షం అవుతాయి. కనుక వాటిని బ్రహ్మోపాసనలన్నిటిలోనూ గ్రహిస్తారు. వాటి ప్రయోజనం బ్రహ్మాన్ని తెలుసుకోవడం మాత్రమే.
అధ్యానాధికరణం ( 3, 3, 14 )
సూత్రం :- 373
" అధ్యానాయ ప్రజోజనాభావత్ "
అధ్యానాయ :- చింతన కొరకు బ్రహ్మాన్ని సకల పదార్ధ పరం అని చెప్పాడు. కాగా, ప్రయోజన అభావాత్ :- ప్రయోజనం లేనందువలన ఇంద్రియార్ధాదులలోని పరత్వాన్ని చెప్పలేదు.
భావం:- చింతన కొరకు బ్రహ్మాన్ని సకల పదార్ధపరం అని చెప్పాడు. ప్రయోజనం లేనందువలన ఇంద్రియార్ధాదులలోని పరత్వాన్ని చెప్పలేదు.
వివరణ:- ధ్యానపూర్వకమైన సాక్షాత్కారం కొరకు పురుషుడే పరుడుగా చెప్పబడుచున్నాడు. ఇంద్రియాదుల పరత్వం చెప్పబడటం లేదు. ఎందువలనంటే దాని వలన జ్ఞానప్రయోజనం లేదు. బ్రహ్మాన్ని ప్రాకృతిక పదార్ధాలన్నిటికన్నా పరం, ఉత్కృష్టం అని చెప్పారు. ఇది ఉపాసన కొరకే. మిగిలిన పదార్ధాలు ఇంద్రియాదులు వాటిలో ఉండే పరత్వం ఉపాసనకు లక్ష్యం కాదు. అందువలన వాటి పరత్వం ఆనందాదులలాగా ఉపాసనకు లక్ష్యం కాదు.
కఠోపనిషత్తు (3, 10, 11):- ఇంద్రియాల కన్నా శబ్ద స్పర్శాదులు సూక్ష్మాలు. వాటి కన్నా మనస్సు, దాని కన్నా అహంకారం, అంత కన్నా మహాత్తు, దాని కన్నా ప్రకృతిసూక్ష్మం. బ్రహ్మాన్ని మించిన సూక్ష్మం మరొకటి లేదు. బ్రహ్మం సూక్ష్మ తత్వాన్ని గ్రహించడానికి అనువుగా ఈక్రమం వివరించారు. బ్రహ్మోపాసనతో ఆనందాది గుణాల్లాగా సకలపదార్ధ పరత్వాన్ని గ్రహించాలా? అంటే ఇంద్రియాదిపదార్ధాల పరత్వం బ్రహ్మోపాసనలో ప్రయోజనకారి కాదు. కనుక ఆయా పదార్ధాల సూక్ష్మత్వం బ్రహ్మోపాసన సమయంలో గ్రహించవలసిన అవసరం లేదు. పదార్ధ పరతత్వ చింతన వలన కలిగే ప్రయోజనం వేరు. బ్రహ్మోపాసన వేరు. బ్రహ్మోపాసన ప్రయోజనం ముక్తి. పదార్ధ పరత్వ చింతన వలన ముక్తి కలుగదు. ఇక్కడ ఇంద్రియల కన్నా వాటి లక్షణాలు, వాటి కన్నా మనస్సు, మనస్సు కన్నా బుద్ధి, ఇలా ఒకదాని కన్నా ఒకటి ఎక్కువ చెప్పడం కాదు. ఇవి ఒకదాని కన్నా మరొకటి శ్రేష్ఠమైనవి అని చెప్పి పరమపురుష సాక్షాత్కారం పొందడమే ఇక్కడ లక్ష్యం. అన్నింటి కన్నా ఉత్కృష్టమైనవారు పురుషుడు. అతన్ని తెలుసుకున్న మరు క్షణమే ముక్తి కలుగుతుంది. జ్ఞాన పూర్వక సమ్యక్ జ్ఞానం కోసమే పురుషత్వం ఇక్కడ చెప్పబడింది. అంతే కాని మిగిలినవన్ని ఒకదాని కన్నా మరొకటి గొప్పది అనీ చెప్పడానికి కాదు. అలా చెప్పడం వలన ప్రయోజనం ఏమి లేదు. సకలానర్ధ సముదయాలకు అతీతుడైన పురుషుడు ఇంద్రియల కంటే పరుడుగా తెలియబడినట్లయితే మాత్రం మోక్షసిద్ధి రూపమైన ప్రయోజనం కనబడుచున్నది. ఆయా వస్తువులు పరమైనవి అని ధ్యానించడం సమ్యక్ దర్శనం కోసం చెప్పబడుచున్నది.
సూత్రం :- 374
" ఆత్మ శబ్దాచ్చ "
చ :- అంతే కాక, ఆత్మ శబ్దాచ్చ :- ఆత్మ శబ్ద ప్రయోగం వల్ల పరమాత్మ గూఢతను ప్రతిపాదించే కఠోపనిషత్తు వాక్యం వలన, ఉపాసనా స్థలాలలో బ్రహ్మ పరత్వాన్నే గ్రహించాలి.
భావం :- ఆత్మ శబ్ద ప్రయోగం వలన పరమాత్మ గూఢతను ప్రతిపాదించే కఠోపనిషత్తు వాక్యం వలన ఉపాసనా స్థలాలలో బ్రహ్మ పరత్వాన్ని గ్రహించాలి.
వివరణ:-ఇక్కడ ఆత్మశబ్దం ఉండటం వలనకూడా పురుషుడే తెలియదగినవాడు. కేవలం పురుషుణ్ణి ప్రతిపాదించడం కోసమే.
కఠోపనిషత్తు(3, 12):- ఆత్మ శబ్దవాచ్యు డైన ఆ పరమేశ్వరుడు సర్వభూతాలలో గూఢంగా ఉంటాడు. ఆయన్ని తెలుకోలేము అని ఆయన సూక్ష్మతను బోధించారు. బ్రహ్మ పరత్వమే ఇక్కడ సంగతం. ఇతర పదార్ధాల పరత్వం కాదు. బ్రహ్మ పరత్వమే ఉపాషనలో గ్రాహ్యం. ప్రకృత్వాదుల పరత్వం కాదు. ఉపనిషత్వాక్యంలో ఉన్న ఆత్మ శబ్ద ప్రయోగం ఇదే బోధిస్తుంది. కాగా గూఢాత్మలో ఆత్మ అంటే పరమాత్మ! జీవత్మా! తరువాత వాక్యం(3, 13) లో జీవాత్మ ప్రసక్తి వచ్చింది కదా! కఠోపనిషత్తులో చెప్పినట్లుగా ఆత్మ అనేది సూక్ష్మమైన బుద్ధితో మాత్రమే గ్రహింపబడుతుంది. ఈఆత్మ సర్వవస్తు జలమందు ఉన్నది. కాని పైకి కనిపించదు. సూక్ష్మ బుద్ధి కలవారు మాత్రమే దీనిని గుర్తించగలుగుతారు. వివేకవంతుడు ఇంద్రియాలను - మనస్సులో లీనం చెయ్యాలి. మనస్సును - బుద్ధిలో లీనం చెయ్యాలి. బుద్ధిని - మహాతత్త్వంలో లీనం చెయ్యాలి. మహతత్త్వాన్ని - ఆత్మలో లీనం చెయ్యాలి. ఇవన్నీ ఆత్మ జ్ఞానం కోసం చెప్పబడ్డాయి. కాని ఒకదానిని మించి ఒకటి గొప్పదని చెప్పడానికి కాదు. ఈ రకంగా పరుడైనవాడు పరమాత్మ. ప్రకృతుడైన పురుషుడు ఆత్మ అని చెప్పుచున్నది. దీనిని బట్టి మిగిలినవన్ని అనాత్మ పదార్ధాలని తెలుస్తున్నది. ఆ ఆత్మ తెలుసుకోవడం చాలా కష్టమని, సూక్ష్మ బుద్ధి కలవారికి మాత్రమే ఆత్మ తెలియదగినదని చెప్పుచున్నది. ఆ విషయమే సూత్రాలలో తెలియజేయబడింది. శ్రుతి యొక్క అనేక అభిప్రాయాలు పురుషుని యొక్క విషయంలోనే కాని ఇతరుల విషయం లో తెలియడం లేదు.
ఆత్మగృహీత్యధికరణము ( 3 , 3 , 16 )
సూత్రం 375
" ఆత్మ గృహితి రితర వదుక్తరాత్ "
ఆత్మ గృహితః :- ఆత్మ అనే శబ్ద ప్రయోగం, ఇతర వదత్ :- ఇతర వేదాంత వాక్యాల లాగా, ఉత్తరాత్ :- కఠోపనిషత్తులో తరువాత వచ్చిన వాక్యాన్ని బట్టి పరమాత్మకు వర్తిస్తుందని తెలుసుకోవాలి.
భావం :- ఆత్మ అనే శబ్ద ప్రయోగం ఇతర వేదాంత వాక్యాల లాగా కఠోపనిషత్తులో తరువాత వచ్చిన వాక్యాన్ని బట్టి పరమాత్మకు వర్తిస్తుందని తెలుసుకోవాలి.
వివరణ:- వేదాలయందు ఆత్మశబ్దానికి పరమాత్మ అని అర్ధం. అలాగే ఇక్కడ కూడా చెప్పాలి. సృష్టిరచన చెయ్యడం పరమాత్మ లక్షణం. అది పరమాత్మ ధర్మం కనుక ఆత్మ శబ్దానికి అర్ధం పరమాత్మయే. తైత్తరీయంలో ఆత్మ నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, మొదలైన భూతాలు పుట్టాయి అని చెప్పబడింది." గుడోత్మాన ప్రకాశవత్" అనే వాక్యంలో ఆత్మ పదం పరమాత్మ వాచకం. జీవాత్మకు సూచించదు.
కఠోపనిషత్తు(3, 13) :- ప్రాజ్ణుడు వాక్కును మనస్సుతో నియంత్రించాలి. ఆ మనస్సును జ్ఞానఆత్మలో నిరోధించాలి. జ్ఞాన ఆత్మను మహత్ ఆత్మలో నియమించాలి. ఆ మహాత్ ఆత్మను శాంత ఆత్మలో నియమించాలి. ఇక్కడ వాక్కు అన్నప్పుడు మిగతా జ్ఞానేంద్రియలని గ్రహించాలి. ఇంద్రియాలు బాహ్య ప్రపంచంలో తాము గ్రహించే విషయాలను మనస్సుకు అర్పిస్తాయి. అందువలన సాధకుడు ఇంద్రియలను మనస్సుతో నియంత్రించాలి. ఆమనస్సును అహంకారంతో, అహంకారాన్ని బుద్ధి తోను, నియంత్రించాలని చెప్పబడింది. ఇలా చిత్తవృత్తిలన్నింటిని నిరోధించి, శుద్ధమైన బుద్ధిని పరమాత్మలోలగ్నం చేసి, ప్రాజ్నుడు బ్రహ్మ సాక్షాత్కారం చేసుకుంటాడు. జీవుడు అంతర్యామి అయిన ఈశ్వరుణ్ణి తెలుసుకొనే స్థితిని ఇక్కడ బోధించారు. అలాంటి వాడినే ఆత్మదర్శి అంటారు.
అధర్వవేదం(10, 8, 44):- ధీరుడు, అజిరుడు, సర్వ శక్తిమంతుడు, సర్వజ్ణుడు, సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుణ్ణి ఎరిగిన వాడు మృత్యు రూప సంసార భయం నుండి తరిస్తాడు.
తైత్తరీయోపనిషత్తు(2, 1) :- ఆ ఈశ్వరుడి వలన ఆకాశాది భూతజాతం ఏర్పడింది. ప్రారంభంలో ఇదంతా ఒక్క ఆత్మ మాత్రమే ఉండేది. మరొకటి ఏది చలించలేదు. నేను ఈ లోకాలను సృష్టిస్తాను అని ఆలోచించి, స్వర్గాన్ని, అంతరిక్ష లోకాన్ని, మర్త్యలోకాన్ని, పాతాళ లోకాన్ని, భూలోకాన్ని సృజించాడు. లోకాల సృష్టి చెప్పడం చేత పరమాత్మ సృష్టి కర్త అని చెబితే, ముందుగా మహా భూత సృష్టి చెప్పాలి. కాని ఇక్కడ లోకాల సృష్టి చెప్పబడుతోంది. ఈలోకాలను నరాకారంలో ఉన్న హిరణ్య గర్భుని చేత చేయబడుచున్నదని శ్రుతులలో, స్మృతులలో చెప్పబడుచున్నది. అతడే పురుషుడని చెప్పబడుచున్నాడు. అతడే లోకాలను సృజంచిన బ్రహ్మ దేవుడని, దేవతల సృష్టి కర్త ప్రజాపతి అని, ఆత్మ శబ్దం కూడా ఈ ప్రజాపతి విషయంలో ప్రయోగింపబడింది.
సూత్రం :- 376
" అన్వయాదితి చేత్ స్యాదవధారయాత్ "
అన్వయాత్ :- అర్ధం పట్టి అన్వయం చేస్తే ఆత్మ శబ్దం బ్రహ్మం కాక జీవాత్మ అని గ్రహించవచ్చును. ఇతి చేత్ :- అంటారా! అది కాదు. అవధారణాత్ :- పూర్వపద ప్రసంగాన్ని బట్టి నిర్ధారిస్తే ఆత్మ శబ్దం, స్యాత్ :- పరమాత్మ బోధకం అవుతుంది.
భావం :- అర్ధాన్ని బట్టి అన్వయం చేస్తే ఆత్మ శబ్దం బ్రహ్మం కాక జీవాత్మ అని గ్రహించవచ్చును అంటారా? అది కాదు. పూర్వపద ప్రసంగాన్ని బట్టి నిర్ధారిస్తే ఆత్మ శబ్దం పరమాత్మ బోధకం అవుతుంది.
వివరణ:-లోకాలను సృష్టించడం పరమాత్మ పని కాదు, అది హిరణ్య గర్భుని పని అని కొందరి వాదన. అందుకనే హిరణ్య గర్భడు అని అర్ధం చెబితేనే బాగుంటుంది అని వారంటారు. ఇది తప్పు. సృష్టికి పూర్వం ఉన్నది పరమాత్మయే కాబట్టి ఇక్కడ ఆత్మఅంటే పరమాత్మ అనే అర్ధం చెప్పాలి. ఐతరేయంలో కూడా ఆత్మ అంటే పరమాత్మ అనే అర్ధం చెప్పారు. ఆత్మశబ్దానికి ఆత్ అనే ధాతువు, సాతత్యగమనం అని అర్ధం. ఆత్ ధాతువుకాక , ఆప్ + ఆ +దా, అద్ అనే ధాతువులు కూడా ఉన్నాయి. ఆప్ అంటే సర్వత్రా వ్యాపించడం. ఆ + దా అంటే అన్నింటిని గ్రహించడం. అన్నింటిని నియంత్రించడం. అద్ అంటే కారణ ప్రకృతిలో స్టూలప్రపంచాన్ని లయం చెయ్యడం అనే అర్ధాలు ఉన్నాయి. ఇవన్నీ పరమాత్మకే వర్తిస్తాయి. అత్ - సాతత్య గమనే అంటే నిరంతరంగా అంతటా ప్రాప్తంకావడం. ఇది పరమాత్మలక్షణం. ఆత్మఅంటే జీవాత్మ అనే అర్ధం ఉన్నా, పూర్వాపర ప్రసంగాన్ని బట్టి అన్వయం చేసుకోవాలి. వాక్యసమన్వయాన్ని ఆత్మశబ్దానికి హిరణ్యగర్భుడా? లేక పరమాత్మా అనే సందేహం కలుగుతుంది. హిరణ్యగర్భుణ్ణే గ్రహించాలి అనడం యుక్తం కాదు. ఉత్పత్తికి పూర్వం ఏకత్వాన్ని నిర్ధారించడం పరమాత్మను గ్రహిస్తేనే కుదురుతుంది. ఇక్కడ చెప్పిన లోక సృష్టిని ఇతర శ్రుతులలో ప్రసిద్ధమైన మహాభూత సృష్టి తరువాత జరిగిన దానినిగా అన్వయిస్తారు. అనగా పరమాత్మ ప్రప్రథమంగా లోకాలను సృష్టించాడు అని కాకుండా ప్రప్రథమంగా మహాభూతాలను సృష్టించి తరువాత లోకాలను సృష్టించాడు అని అన్వయిస్తాయి అని అర్ధం. ఒక శ్రుతిలో చెప్పిన విశేషాలను మరొక శ్రుతిలో ఉపసంహరించ వలసి ఉంటుంది. స్రష్ట పరమేశ్వరుడే. ముందు మహా భూతలను సృష్టించి, తరువాత లోకాలను సృజించి, నేను లేకుండా ఈ శరీరం ఎలా ఉంటుంది అని ఆలోచించి, ఈ శరీరంలో బ్రహ్మ రంద్రం ద్వారా సూక్ష్మ శరీరంతో ప్రవేశించాడు.
కఠోపనిషత్తు(1, 3, 13):- మంత్రంలో శాంత ఆత్మని అన్నచోట పరమాత్మ అర్ధ ప్రయోగమే అనే గ్రహించాలి. చివర్లో అశబ్దం, అస్పర్శం, అరూపం(3, 15)లో సందర్బాన్ని బట్టి చూస్తే అవి పరమాత్మని బోధించే గుణాలే. ఇలా బ్రహ్మస్వరూపాన్ని తెలిపే గుణాలు విభిన్నాలైనా, ఉపాసనల్లో వర్ణించడం వలన ఉపాసనల్లో ఏకత్వం సిద్ధిస్తుంది. ఉపాస్య తత్వం కూడా ఒక్క బ్రహ్మయే అని నిర్ణయమౌతుంది.ఎక్కడ ఏ అర్ధం ప్రయోగించాలో ప్రసంగపు పూర్వపరాల్ని విచారించి తెలుసుకోవాలి.
కార్యాఖ్యానాధికరణం ( 3, 3, 18 )
సూత్రం :- 377
" కార్యాఖ్యానా దపూర్వమ్ "
కార్యా ఆఖ్యానాత్ :- ఈ జగత్తంతా బ్రహ్మ కార్యంగా చెప్పారు కనుక, అపూర్వం :- బ్రహ్మ కారణ రహితం.
భావం:- ఈ జగత్తంతా బ్రహ్మ కార్యంగా చెప్పారు. కనుక బ్రహ్మ కారణ రహితం. ఈ దృశ్య మాన జగత్తంతా బ్రహ్మ నిర్మిత కార్యంగా ఎన్నో చోట్ల వ్యాఖ్యనించారు.
వివరణ:- అన్ని అనుష్టానాల శుద్ధికోసం ఆచమనాన్ని నిత్యకృత్యంగా వేదంలోను, పురాణాలలోనూ కూడా చెప్పబడింది. అందుకే ఉదకాన్ని వస్త్రంగా భావించడం విధేయం. అంతేతప్ప ఆచమనం కాదు. అన్నాన్ని ఉదకంతో కప్పడమనేది అపూర్వ మైన విషయం. కనుక అపూర్వమైన వస్త్రంగా భావించారు. అన్నాన్ని నగ్నంగా లేకుండా చేయటం అంటే కప్పటం అనే అపూర్వమైన ధ్యానం విధేయం.
మాండూక్య ఉపనిషత్తు ( 1,1,7 ) :- బ్రహ్మం సర్వానికి కారణం. అక్షర బ్రహ్మం వలన సృష్టి కాలంలో ఈ విశ్వం జనిస్తుంది.
శ్వేతాశ్వరోపనిషత్తు(6,16):-"సవిశ్వకృత్" ఆపరమేశ్వరుడే అన్నిటినీ ఉత్పన్నంచేసేవాడు. ఈవేదాంతవాక్యాలన్నీ ప్రపంచాన్ని బ్రహ్మకార్యంగా వర్ణిస్తున్నాయి. బ్రహ్మమే అన్నింటికీ కారణం కాని కార్యం కాదు. బ్రహ్మనికి మరొక కారణం లేదు. బ్రహ్మం అపూర్వం, కారణ రహితం. కనుక ఉపాసనల్లో బ్రహ్మ స్వరూప బోధకాలైన జ్ఞాన, ఆనందాది గుణాలనే కాక, అపూర్వత్వగుణాలను కూడా గ్రహీంచాలి.
బృహదారణ్యకోపనిషత్తు (2, 5, 19):- "తదే దద్ బ్రహ్మ అపూర్వ మన పర మనంతరం "అనే వాక్యంలో బ్రహ్మ అపూర్వం అనీ స్పష్టంగా తెలియజేశారు. ఛాందోగులు, వాజసనేయులు ప్రాణసంవాదంలో ప్రాణానికి అన్నంగా చెప్పడానికే ఉదకాన్ని వస్త్రంగా చెప్పారు. నాకు అన్నం ఏది? వస్త్రం ఏది? అని ప్రాణం వాగాదులను అడిగినప్పుడు శునకములు, క్రిముల వరకు సర్వప్రాణుల చేత భుజంపబడే అన్నం, ఉదకం, వస్త్రం అని చెప్పాయి. అందువలన ఛాందోగులు, వాజసనేయులు విద్వాంసు లైన శ్రోత్రియులు భుజించడానికి ముందు, భుజించిన తరువాత కూడా ఆచమనం చేస్తారు. ఆప్రాణాన్ని నగ్నం కానిదానిగా చేస్తున్నట్లు భావిస్తున్నారు. ఇక్కడ ఆచమనం, అనగ్నతా చింతనము తెలియబడుచున్నవి. ఈ అనగ్నతావాదం ఆచమన స్థితి కోసం చేయబడుచున్నది. ఆచమనం పవిత్రత్వం కొరకు చేసే మరొక క్రియ అని అంగీకరించబడింది. అయితే ఆచమనానికి ఉపయోగించిన జలాన్ని ప్రాణం ధరించడం కొరకు ఉపయోగించే వస్త్రంగా సంకల్పించడం అనే మరొక క్రియ అంగీకరించ బడుచున్నది.
సమానాధికరణము ( 3, 3, 19 )
సూత్రం :- 378
" సమాన ఏవం చాభేదాత్ "
చ:- అంతే కాక, ఏవం :- అపూర్వత్వం గుణం లాగే, అభేదాత్ :- ఉపాస్యం లో భేదం లేనందువలన, సమానః :- అపూర్వత్వానికి సమానమైన అనపరత్వాదుల్ని సైతం గ్రహించాలి.
భావం:- అపూర్వత్వం గుణంవలె ఉపాస్యం లో భేదం లేనందువలన, అపూర్వత్వానికి సమానమైన అన పరత్వాదుల్ని సైతం గ్రహించాలి.
వివరణ:- గురువర్యా! వాజసనేయ శాఖలోని శతపధ బ్రాహ్మణంలో, బృహదారణ్యకంలో శాండిల్య విద్య గురించి చెప్పారు. ఈ రెండు ఒక్కటేనా? వేరు వేరా? వివరించండి, అన్నాడు కృష్ణ శర్మ. వివరిస్తున్నాడు రత్నాకరుడు. రెండింటిలో చెప్పిన విద్య ఒక్కటే. ఉపాస్య వస్తువు ఒక్కటే. విద్యా భేదం లేదు. శతపథ బ్రాహ్మణంలో అనేక గుణాలు చెప్పబడ్డాయి. కాబట్టి అది ఉత్పత్తి విధి. ఆ విద్య విధి విహితము. బృహదారణ్యకంలో గుణ విధి. రెండు విద్యలు సమానమే.
బృహదారణ్యకోపనిషత్తు(2,5,19):- కార్యం లేనిది అనపరం. మట్టికి ఘటం కార్యం. అలా బ్రహ్మం కార్యంగామారదు. అంతరాళంలో దేనికి మధ్యలో విభజించని వస్తువు ఉండదో అది అనంతరం. బ్రహ్మం మధ్యలో ఖాళీ ఉండదు. బ్రహ్మం అఖండం, అవిభజ్యం. బ్రహ్మానికి వెలుపల ఏవస్తువు లేదు. బ్రహ్మం పూర్ణం. కనుక ఆయనకు బయటా, లోపలా అనే వ్యవహారం ఉండదు. సర్వాన్ని ఎరిగిన వాడు. అందువలన అపూర్వత్వం లాగా, అనపరాత్వాదుల్ని కూడా బ్రహ్మోపాసన విద్యలో సర్వత్రా గ్రహించాలి. ఆ గుణానికి సమానమైన అనపరత్వం గుణాలు కూడా గ్రహించాలి. అవి కూడా బ్రహ్మం గుణాలే. బ్రహ్మనికి మనోమయుడు, ప్రాణ శరీరుడు,కాంతి రూపుడు, అనే గుణాలు కలిగిన ఆత్మను ఉపాసించాలి. బృహదా రణ్యకంలో మనోమయుడు, కాంతి రూపుడు, సత్యమైన వాడు, హృదయంలో వ్రీహి వలె యవ వలె వున్నవాడు, సర్వానికి ఈశుడు అని వర్ణించారు. రెండు శాఖలు వేరైనప్పుడు అధ్యయనం చేసేవారు, వేరుగా ఉంటారు. ఒక శాఖలో చెప్పిన విద్యను మరొక శాఖలో చెప్పకపోతే ఆ శాఖ చదవని వారికి తెలియదు. అందుకే పునరుక్తవ్య దోషం లేదని గ్రహించాలి. ప్రాణ సంవాదంలో ఒక చోట అధికంగా ఉన్న గుణాలు మరొక చోట ఉపసంహరింపబడతాయి. విద్య ఒక్కటే అయితే పౌనరుక్య దోషాన్ని పరిహరించడం శక్యం కాదు. రెండింటిలో సమానంగా ఉన్న మనోమయత్వం లాంటి గుణాలు పఠించబడతాయి.
సంబంధాధికరణం ( 3, 3, 20 )
సూత్రం :- 379
" సంబంధా దేవ మన్య త్రాపి "
సంబంధాత్ :- గుణ, గుణి సంబంధం వలన, ఏవం :- వేదాంత వాక్యాల్లో అక్కడక్కడ వర్ణించిన గుణాలను బ్రహ్మోపాసనలో గ్రహిస్తున్నాం కదా! అలాగే, అన్యత్ర అపి :- వేదాంతాల కన్నా భిన్నమైన గ్రంధాల్లో ఉండే సాకారాత్వం లాంటి గుణాలను సైతం గ్రహించవచ్చా? అని శంక.
భావం :- గుణి గుణ సంబంధం వలన వేదాంత వాక్యాల్లో అక్కడక్కడ వర్ణించిన గుణాలను బ్రహ్మోపాసనలో గ్రహిస్తున్నాం కదా! అలాగే వేదాంతాల కన్నా భిన్నమైన గ్రంధాల్లో ఉండే సాకారత్వం లాంటి గుణాలను సైతం గ్రహించవచ్చా? అని శంక.
వివరణ:-ఇదొక సందేహసూత్రం. గురువర్యా! బృహదారణ్యకంలో సత్యబ్రహ్మోపాసన గురించి చెప్పారు. సత్యం అంటే పరబ్రహ్మ. సత్యం అనే మాటలో మూడు అక్షరాలు ఉన్నాయి. 1. స, 2. త్, 3. యం మొదటి, చివరి అక్షరాలు సత్యం. మధ్యలో అక్షరం అసత్యం, మృత్యువు. ఈ మూడింటిలో సత్యం బరువు ఎక్కువై, అసత్యం తేలిపోతుంది. ఈ విధంగా సత్యబ్రహ్మోపాసన చేసిన వానికి మృత్యువు అంటదు. సత్యం అంటే ఆదిత్యుడు. ఆదిత్య మండలంలోని పురుషుడే దక్షిణనేత్రంలో ఉన్న ఆదిత్యడు. తన కిరణాలతో కాంతిని ఇస్తున్న ఆదిత్యుడు కళ్ళ లోనే ఉన్నాడు. అలాగే కళ్ళలోని పురుషుడు ప్రాణాల ద్వారా ఉపకారం చేస్తూ, ఆదిత్య పురుషునిలో లీనమై ఉన్నాడు. ఆదిత్య మండలోని సూర్యుడు, నేత్రంలో ఉండే ఆదిత్యుడు ఒక్కరే. మరణ కాలంలో ఆదిత్యుడు తన కిరణాలను ఉపసం హరించుకోవడం వలన కళ్ళు తమ శక్తిని కోల్పోతాయి. ఆదిత్య మండలంలోని పురుషునికి వ్యాహృతులు, భూః - అనేది శిరస్సు, భువః-అనేది భుజాలు, సువః - అనేది పాదాలు. సత్య బ్రహ్మకు అహః అనేది రహస్య నామం. బ్రహ్మను ఈ విధంగా వ్యాహృతుల రూపంలో తెలుసుకొని ఉపాసన చేసి, పాపాలను వదలి వేసేవారు. ఆధ్యాత్మికానికి రెండు రహస్య నామాలు చెప్పబడ్డాయి. అధి దైవతం లో అహః, ఆధ్యాత్మికంలో అహం, అది అక్షి పురుషుని పేరు. సత్యవిద్యలో నామవ్యవస్థను బట్టి ధ్యానం చెయ్యాలా? ఈరెండు పేర్లను ఆదిత్య, అక్షిపురుషులిద్దరికీ అన్వ యింప వచ్చునా? అని సంశయం. శతపధ బ్రాహ్మణం, శాండిల్య విద్య ఒకే శాఖకు సంబంధించినవి. ఒకే ఉపాసనకు సంబంధించినవి. ఈ రెండు విద్యలకు గుణోపసంహారం చెప్పబడింది. అలాగే సత్య విద్యలో చెప్పిన రెండు పేర్లు అహః, అహం ఉపసంహారం చేయ వచ్చునని వారి వాదన. సత్యపద వాచ్యుడైన ఆ హిరణ్యగర్భుడు ఉదకం నుండి పుట్టినట్లు చెప్పి, దానికి అంగంగా సత్యం అనే అక్షరాలు ఉపాసన చెప్పబడింది. ఆ సత్యమే ఆదిత్య మండలోని పురుషుడు, అక్షి స్థానం లోను ఉన్నదని చెప్పి, మళ్ళీ ఆదిత్య స్థాన గతి పురుషుణ్ణి ముందుకు తీసుకు వచ్చి భూర్బువవస్సువరో రూపమైన మూడు వ్యాహృతులు మూడు అంగాలుగా "అహం" అనే పేరు చెప్పబడింది. ఈ విధంగా అహః అనేది అధి దైవత నామం, అహం అనేది ఆధ్యాత్మ నామం. ఈ రెండు ఒకే విద్యతో సంబంధం ఉండటం వలన, రెండు ఉపనిషత్తులను రెండు చోట్ల పటించవచ్చును.
సూత్రం :- 380
" న వా విశేషాత్ "
వా :- అది సరియైనది కాదు. విశేషాత్ :- వేదాంత వాక్యాలు విశిష్టమైనవి. కనుక, న :- వేదాంతాలు కాని ఆధునిక గ్రంధాల్లో బ్రహ్మానికి ఆపాదించిన సాకరత్వాది గుణాలు ఉపాసన విద్యలో గ్రహించడం ఉచితం కాదు.
భావం :- వేదాంతాలు కాని ఆధునిక గ్రంధాల్లో ఆపాదించిన సాకరత్వాది గుణాలను ఉపాసన విద్యలో గ్రహించడం ఉచితం కాదు.
వివరణ:-వేదవేదాంగాలు బ్రహ్మాన్ని, ఆయన గుణాలను, యధాతధంగా వర్ణించడంలో సామర్ధ్యం ఉన్నవి. వేదాలు ఈశ్వరీయాలు. వేదాంగాలు ప్రధాన ఉపనిషత్తులు, ఋషి నిర్మితాలు. అవి వేదానుకూలాలు. అందులో వర్ణించిన బ్రహ్మం గుణాలు ప్రామాణికాలు. ఉపాసనలో గ్రాహ్యలు. బ్రహ్మానికి ఆకారం ఉన్నదని, బ్రహ్మం ఒక చోట ఉంటాడని, వర్ణించే వాక్యాలు స్వీకరణీయం కాదు. విద్యలకు రెండు స్థలాల్లో ప్రాప్తి లేదు.ఉపాసన వలన స్థాన విశేషాలను బట్టి రెండు చోట్ల ప్రాప్తి లేదు. అధి దైవికపురుషుణ్ణి ప్రస్థావించి వానికి ఉపనిషత్తు 'అహః' అనీ, ఆధ్యాత్మికపురుషుణ్ణి ప్రస్థావించి వానికి "అహం" అనీ ఉపనిషత్తు చెబుతున్నది. ఈ రెండు, స్థానాలను బట్టి చెబుతున్నవి. అలాంటప్పుడు రెండుచోట్ల ఎలా ప్రాప్తిస్తాయి? అనేది శంక. సత్యమైన బ్రహ్మకు రెండుస్థానాలు చెప్పడం చేత అధి దైవత పురుషుడు, ఆధ్యాత్మిక పురుషుడు కూడా ఒక్కరే. అవస్థావిశేషాన్ని బట్టి ఆపురుషుణ్ణి ఆఅవస్థలో ఉన్నప్పుడు మాత్రమే వర్ణించడం యుక్తంగా ఉంటుంది. ఆచార్యస్వరూపంలో మార్పులేకపోయినా ఆచార్యుడు కూర్చునిఉన్నప్పుడు ఏవిధమైన అనువర్తనం చెప్పబడిందో, అతను నిలబడి ఉన్నప్పుడు ఉండదు. నిలబడిఉన్నప్పుడు చెప్పిన అనువర్తనం కూర్చునిఉన్నప్పుడు ఉండదు. కనుక, అతని స్వరూపంలో భేదం ఉండదు. అతని స్వరూపానికి సంబంధించిన ధర్మానికి గ్రామాన్ని బట్టి, అరణ్యాన్ని బట్టి విశేషం ఉండదు. రెండు చోట్ల ధర్మం తుల్యంగానే ఉండవచ్చును. అందువలన రెండు ఉపనిషత్తులకు వ్యవస్థ ఉంటుంది. బ్రహ్మనికి ఆకారం ఉందని, ఒకే చోట ఉంటాడని వర్ణించే వాక్యాలు స్వీకరణీయం కావు. జన్మ, జరాది వికారాలుంటాయని చెప్పే అవాస్తవిక వర్ణనలు గ్రాహ్యం కావు. గుణి, గుణ సంబంధం వలన సాకారత్వాది గుణాలు ఉపాసనలో గ్రహించలనడం తగదు. ఏదైనా విషయంలో వైరుధ్యం వచ్చినప్పుడు వేదవేదంగాలను ప్రమాణంగా తీసుకోవాలి. అవైదిక గ్రంధాలను కాదు.
సూత్రం :- 381
" దర్శయతి చ "
చ :- పైగా, దర్శయతి :- బ్రహ్మం, బ్రహ్మం గుణాలు యధాతధంగా వర్ణించడంలో వేదవేదాంత వాక్యాలకు విశిష్టత ఉన్నది.
భావం :- బ్రహ్మం, బ్రహ్మం గుణాలు యధా తధంగా వర్ణించడంలో వేద, వేదాంత వాక్యాలకు విశిష్టత ఉన్నది.
వివరణ:- ఛాందోగ్యంలో ఆదిత్యాంతర్గత పురుషుని రూపం, కంటిలోని పురుషుని రూపం ఒక్కటిగా వర్ణించబడ్డాయి. అతని పేరే ఇతని పేరు అని ఆదిత్యపురుషుని లక్షణాలను, అక్షిపురుషునిలో ఆరోపించి చెప్పారు. ఈ విధమైన ఆరోపణ లేనిదే పరస్పర గుణ సంహారం కుదరదు. కాబట్టి ఇక్కడ ఇద్దరి పురుషులకు రెండు పేర్లకు ఉప సంహారం లేదు.
తైత్తరీయ బ్రాహ్మణం ( 3, 12, 9 ) :- వేదం తెలియని వాడు, స్వరూప స్వభావాల్లో గొప్ప దైన బ్రహ్మాన్ని తెలుసుకోలేడు. దీన్ని బట్టి వేదమే బ్రహ్మం. ఆయన గుణాలను బాగా బోధిస్తుందని తెలుస్తోంది.
ముండకోపనిషత్తు( 3, 2, 6) :- ఉపనిషత్తులలో వర్ణించిన పురుషుడి గురించి అడుగుతున్నాను. ఉపనిషత్తుల విజ్ఞానం మూలంగా బ్రహ్మస్వరూపాన్ని బాగా తెలిసినవాళ్ళుఅని, యాజ్ఞవల్కుడు లాంటి మహర్షులు చెప్పడం వలన, వేదవేదాంతా లలో బ్రహ్మస్వరూపాన్ని ప్రతిపాదించడంలో నిశ్చితంగా సమర్ధాలు. ఇతర గ్రంధాలు కానేరవు అని స్పష్టమౌతోంది. అయితే పురుషుడు ఒక్కడే అయినా స్థానాలువేరు కాబట్టి ఒకస్థానంలో ఉన్న పురుషుడికి చెప్పిన ధర్మాలు, మరొక స్థానంలో ఉన్న పురుషునకు వర్తించుననే అభిప్రాయం చేతనే వీని రూపాదులే వాని రూపాదులు, వాని రూపాదులే వీని రూపాదులు అని అతిదేశం చేయవలసి వచ్చింది. దీనిని బట్టి ఇలాంటి అతిదేశం లేకపోతే అవి పరస్పరం వర్తించవు అని సూచింపబడు తున్నది.
సంభృత్యధికరణం ( 3, 3, 23 )
సూత్రం :- 382
" సంభృతి ద్యు వ్యా ప్త్యపి చాతః "
చ :- కాగా, అతః :- ఉపాస్య భేదం లేనందువలన, సంభృతి ద్యువ్యాప్తి, అపి :- సంభృతి, ద్యువ్యాప్తి అనే గుణాలు కూడా బ్రహ్మోపాసనలో గ్రహించాలి.
భావం :- ఉపాస్య భేదం లేనందు వలన సంభృతి, ద్యు వ్యాప్తి అనే గుణాలు కూడా బ్రహ్మోపాసనలో గ్రహించాలి.
వివరణ:- సంభృతిఅంటే జగన్నిర్మాణం, రక్షణ, ఉపసంహారంలాంటి సమస్తశక్తులు ఉండటం, ద్యువ్యాప్తి అంటే లోకాలన్నిటిలో వ్యాపించడం, ఈరెండు గుణాలుకూడా అపూర్వత్వాది గుణాలవలె బ్రహ్మోపాసనలో గ్రాహ్యములే. పంచభూతాలను సృష్టించి నది బ్రహ్మే. అవి బ్రహ్మయొక్క శక్తి రూపాలు. కాబట్టి బ్రహ్మ మిక్కిలి శ్రేష్ఠమైనది. బ్రహ్మను ఎవరూ అతిక్రమించలేరు అని రాయణీయ శాఖ, ఛాందోగ్య శాఖ లోని భిలకాండ లో ఒక చోట బ్రహ్మం యొక్క వీర్యం సమృద్ధి, స్వర్గ వ్యాప్తి చెప్పబడింది. ఈ గుణలన్నీ ఈశాఖకు సంబంధించిన ఉపనిషత్తులందే చెప్పబడింది. ఇవి శాండిల్య విద్యలో అన్వయిస్తాయా? ఇవి, ఉపనిషత్తులలో చెప్పబడిన విద్యలు ఒకటేనా? అని సందేహం. స్థానబేధం వలన నామభేదం వచ్చినట్లుగా స్థానంభేదం వలెనే సంభృత్యాదులు శాండిల్య విద్య యందు ఉపసంహరించ బడవు. ఛాందోగ్యంలో నాఆత్మ హృదయంలో ఉన్నది అన్నారు. ఇంకొక చోట దాహరాకాశంలో ఉన్నది అన్నారు. ఉపకోశలవిద్యలో కంటి యందు కనిపించే పురుషుడు అని చెప్పారు. ఈ రకంగా వేరువేరు స్థానాలు చెప్పబడినా, సంభృత్యాది గుణాలు చెప్పబడ లేదు. కాబట్టి ఈ గుణాలకు పై విద్యాలలో ఉపసంహారం లేదు. రాణీయ శాఖ లోని బ్రహ్మగుణాలు ప్రత్యక్షోపాసనకు చెందినవి.
అధర్వణ వేదం:- (19, 3, 22, 21):- బ్రహ్మనికి జగదుత్పత్తి, స్థితి, లయలు చేసే శక్తులున్నాయి. పృథవి మొదలు కొని దివం వరకు ఉన్న సమస్తలోకాలలోనూ బ్రహ్మం వ్యాపించి ఉన్నాడు. ఇలా వేదాల్లో జగత్తుని పుట్టించి లయం చేసే అన్ని శక్తులు న్నాయని అన్ని లోకాలలోనూ వ్యాపించే సంభృతి, ద్యు వ్యాప్తి అనే గుణాలు వర్ణించారు. ఈ గుణలన్ని వర్ణించారు. ఈ గుణాలన్ని కూడా అపూర్వత్వాది గుణాల లాగా ఉపాసనల్లో గ్రహించాలి. రాణాయశాఖ వారి భిల గ్రంధంలో బ్రహ్మ కారణంగా గల ఆకాశోత్పాదనం, దేవాదుల ఉత్పత్తి, వీర్య సంభృతి, ద్యునివేశం మొదలైన విభూతులు పఠించబడుతున్నాయి. ఆ విద్యలలోనికి బ్రహ్మయొక్క విభూతులు, బ్రహ్మసంబంధం వలన ఉపసంహారం చేయవచ్చును. సంభృతి, ద్యువ్యాప్తి మొదలైన విభూతులు శాండిల్య విద్యలో ఉపసంహరించ కూడదు. అవి అధిదైవికమైనవి. అవి ఈ విద్యలో ఎలా ప్రాప్తిస్తాయి? అని సందేహం. అయతన విశేషాలు ఏమి లేని షోడశకళలు మొదలైన ఇతరమైన బ్రహ్మవిద్యలున్నాయి. ఇది నిజమే. ఇక్కడ సంభృత్యాదులను ఉపసంహరించక పోవడానికి ఒక విశేషం ఉంది. దూరంగా ఉన్న విద్యలు సమానమైన గుణాలను చెప్పడం వలన ఉపస్థాపితము లైనప్పుడు దూరంగా ఉన్న గుణాలు కూడా ఉప సంహరించబడతాయి. బ్రహ్మసంబంధం ఉండటం వలన ఇతర ప్రదేశాలలో ఉన్న విద్యలకు సంబంధం ఉండవచ్చును. బ్రహ్మ ఒకటే అయినా కూడా వేరు వేరు విభూతులను బట్టి వేరు వేరు విధాలుగా ఉపాసించబడుతుంది.
పురుష విద్యాధికరణం ( 3, 3, 24 )
సూత్రం :- 383
" పురుష విద్యాయా మివ చేత రేషా మనామ్నానాత్ "
పురుషవిద్యాయాం ఇవ:- పరమపురుషుడి ఉపాసనలో లాగా, ఇతరేషాం:- ఒకచోట వర్ణించిన గుణాలు కాక ఇతర గుణాలను, అనామ్నానాత్ :- మరొక చోట వర్ణించక పోయినా క్రోడీకరించి, సమన్వయం చేసుకొని, ప్రతి బ్రహ్మోపాసన లోను గ్రహించాలి.
భావం :- పరమ పురుషుడి ఉపాసానలో లాగా ఒకచోట వర్ణించిన గుణాలు కాక, ఇతర గుణాలను మరొక చోట వర్ణించక పోయినా క్రోడీకరించి, సమన్వయం చేసుకొని, ప్రతి బ్రహ్మోపాసనలో గ్రహించాలి.
వివరణ:- పురుషవిద్య అంటే పురుష ఉపాసన, విద్య అంటే ఉపాసన, పురుషుడు అంటే ఈశ్వరుడు, పరమ పురుషుడు, పరమాత్మ. "సహస్ర శీర్షాః పురుషః సాహస్రాక్షః " ఈ మంత్రంలో పురుషోపాసన ఉన్నది. ఈశ్వరుడి వ్యాపకత్వం గురించి వర్ణించింది. దీనిలో ఆనందాది గుణాల వర్ణన లేదు. అక్కడా, ఇక్కడా చెప్పిన గుణాలను సంగ్రహించుకొని ఉపాసించాలి. అలా ఇతరస్థలాలనుంచి గుణాలను గ్రహించడం వలన బ్రహ్మస్వరూపం సంపూర్ణంగా బోధపడుతుంది. పురుషయజ్ఞం మీద భిన్నాభిప్రాయాలున్నాయి. ఛాందోగ్యంలో, తాండినాయక, పైంగిరహస్యబ్రాహ్మణాల్లో పురుషయజ్ఞం గురించి చెప్పి, పురుషుడికి యజ్ఞ రూపం కల్పించారు.
ఛాందోగ్యోపనిషత్తు :- పురుష విద్య ఈ విధంగా చెప్పబడింది. పురుషుడే యజ్ఞం. అతని ఆయుర్ధాయం లో మొదటి 24 సం – ప్రాతత్సవనం, తరువాత 44 సం - మాధ్యందిన సవనం, చివరి 48 సం - తృతీయ సవనం. సవనం అంటే యజ్ఞంలో ఇచ్చే బలి. ఈ విద్యను ఎవరైతే తెలుసుకుంటారో వారు 116 సం. జీవిస్తారు. అతనికి ఆకలిదప్పికలు లేకపోవడం, ఇష్టమైన వస్తువులను తీసుకోకపోవడమే దీక్ష అని వివరించారు.
తైత్తరీయోపనిషత్తు:- యజమానే యజ్ఞం, భార్య - శ్రద్ధ, శరీరం - కట్టె, రొమ్ము - యజ్ఞ వేదిక, వక్ష స్థలం - వేడి, రోమాలు -బర్హిస్సు, శిఖ - వేదం ( దర్భాల కట్ట ), హృదయం - యూప స్థంభం, కామం - ఆజ్యం, కోపం - పశువు, తపస్సు - అగ్ని, శాంతింప జేసే దమం - దక్షిణ, వాక్కు - ఋత్విక్కు, ప్రాణం - ఉద్గీథ, చక్షుస్సు - అధ్వర్యువు, మనస్సు - బ్రహ్మ, శ్రోత్రం - అగ్నీత్, ఎంతవరకు జీవిస్తాడో అధి దీక్ష, తిన్నది హవిస్సు, త్రాగేది - సోమపానం, రమించడం - ఉపసరం, సంచరిస్తాడు, కూర్చుంటాడు, నిలబడతాడు, ఇది ప్రవర్గ్యం. తపోదానదికం చేస్తాడు. అది దక్షిణ రోగాదులు వచ్చినప్పుడు వసు రుద్రాదులను ప్రార్ధిస్తాడు. ఇది ఆశీర్వాదం. దీనిలో మంత్రాల ప్రయోగం చేయబడుతుంది. ముఖం ఆహవనీయాగ్ని, మాట్లాడటం - ఆహుతి, వీని విజ్ఞానం హోమం, సాయంకాలం, ప్రాతః కాలాలలో తింటాడు, అది సమిధలు, ప్రాతః, మధ్యాహ్న కాలాలు పవనాలు, అహోరాత్రాలు దర్శ పూర్ణ మాసాలు. అర్ధ మాసాలు, మాసాలు,చాతుర్మాశ్యలు, ఋతువులు, ఇవి పశు బంధాలు, సంవత్సరాలు - పరివత్సరాలు, ఇవి అహర్గణాలు. ఇది సర్వవేదనమైన యజ్ఞం. మరణమే - అవభృథ స్నానం.ఈ యజ్ఞానికి ఫలం 116 సం. జీవితం. తైత్తరీయం లో, ఛాందోగ్యం, తాండి నాయక శాఖలో చెప్పినవి పురుష విద్యలే. వీటిలో మరణమే అనుభృతం వంటి సమాన ధర్మాలు ఉన్నప్పటికీ తేడాలే ఎక్కువగా వున్నాయి. ఈ రెండు ఒక్కటి కాదు. ఒక శాఖలోని ధర్మాలు రెండవ దానిలో అన్వయించరాదు.
వేధాద్యధికరణం ( 3, 3, 25 )
సూత్రం :- 384
" వేధాద్యర్ధ భేదాత్ "
అర్ధ భేదాత్ :- ఏ ప్రయోజనం లేనందువలన, వేధాది :- భేదించడం, నాశనం చేయడం, లాంటి గుణాలను బ్రహ్మోపాసనలో గ్రహించరాదు.
భావం :- ఏ ప్రయోజనం లేనందుకు వలన భేదించడం, నాశనం చేయడం లాంటి గుణాలను బ్రహ్మోపాసనలో గ్రహించరాదు.
వివరణ:- గురుదేవా! ఉపనిషత్తులు ప్రారంభించేటప్పుడు అధర్వశాఖవారు ఓదేవతా! నా శత్రువుయొక్క సమస్త అవయవా లను ఛేదించు, హృదయాన్నిఛేదించు అంటూ శత్రుసంహార మంత్రాలను చదువుతారు. మిగిలిన ఏ శాఖలోనూ భగవంతుణ్ణి స్తుతిచేస్తూ, మనకు వరుణుడు, మిత్రుడు సుఖాలిచ్చు గాక! వంటి మంత్రాలు చదువుతారు. మరి వీటన్నింటిలో విద్యలో ఉపశమహరించు కోవచ్చునా? అని సందేహం వెలిబుచ్చాడు నారాయణభట్టు. సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. హృదయాన్ని ఛేదించు మొదలైన అభిచారిక మంత్రాలు, వీటి అర్ధంలో తేడా ఉన్నది. కాబట్టి వీటికి విద్యలోనూ, ఉపాసనలోనూ ఉపసంహారం లేదు.
ఋగ్వేదం(10, 87, 4):- ఓ తేజస్వరూప బ్రహ్మమా! మా యజ్ఞ ఉపాసనాదుల వలన నీవు ప్రసన్నుడివై, నీ బాణాల్ని వజ్ర సమానం చేసి, వాటితో రాక్షసుల హృదయాలను చేధించు, విరోధుల భుజాలను ఖండించు. (10, 87, 5):- ఓఅగ్నీ! రాక్షసుల చర్మం వలిచెయ్యి. నీవజ్రం వాళ్ళని చంపాలి గాక! తోడేళ్ల వంటివి వాళ్ళ మాంసఖండాలను ఎత్తుకు పోవుగాక! ఇలాంటి మంత్రాల్లో బ్రహ్మం దుష్టులను దండించే వైనం కనిపిస్తుంది. ఈ దుష్టహృదయ ఖేదన, దుష్టనాశ గుణాలను, బ్రహ్మోపాసనలో ఆనందవ్యాపకత్వాదిగుణాల్లా గ్రహించాలా? గ్రహించకూడదా? అనీ సందేహంవస్తే, వేదాంతదర్శకకర్త వ్యాసుడు గ్రహించరాదని చెబుతున్నాడు. బ్రహ్మోపాసనకు ఫలంముక్తి. శతృ సంహారం, దుష్టనాశనం కాదు. ముముక్షువులకు సౌమ్యభావం ఉండాలి. అప్పుడే ఆనందాది గుణాలతో కూడిన బ్రహ్మాన్ని ఉపాసిస్తూ ధ్యానిస్తాడు. కనుక వేధాది గుణాలను గ్రహించరాదు. అగ్ని ష్టోమ బ్రాహ్మణంలో అగ్నిష్టోమమే బ్రహ్మ. అగ్నిష్టోమం చేసే దివసం బ్రహ్మ. అందుచేత ఈ దివసంలో సాధించవలసిన కర్మను ఎవరు చేస్తారో వాళ్ళు ఆబ్రహ్మ అనే సాధనం చేత బ్రహ్మనే పొందుతారు. క్రమంగా మోక్షం పొందుతారు. ఛాందోగ్యంలో పుత్రునికి దీర్ఘాయువు కొరకు త్రిలోకాలను ఒక కోశంగా ఉపాసన చెప్పబడింది. "భూః ప్రపద్యే " తండ్రి పఠించే ప్రార్ధన మంత్రం. పుత్రుని పేరు మూడుసార్లు చెప్పబడుతుంది. ఈ ఫలానాపుత్రునితో కలసి ఈ భూలోకాన్ని, పరలోకాన్ని కూడా పొందుదురు గాక! అని దీని అర్ధం. అందువలన ఉపాసనా విద్యలలో కూడా మంత్రాలు అంగాలుగా ఉండటం కనబడుచున్నది. ఏ మంత్రం ఏ కర్మ యందు వినియోగించాలి. ఏది దేనికి అంగము అని నిర్ణయించడానికి శ్రుతి, లింగం, ప్రకరణం, స్థానం, సమాఖ్య అనేవి ఉపయోగిస్తాయి.
హాన్యాధికరణం ( 3, 3, 26 )
సూత్రం :- 385
" హానౌ తూపాయన శబ్ద శేషత్వాత్ కుశాచ్ఛంద్ర స్తుత్యుప గానవత్ తదుక్తం "
హానౌ :- త్యాగం, విడిచిపెట్టడం, ఉపాయన శబ్ద :- ఉపాదానం, శేషత్వాత్ :- సాన్నిద్యం, కుశా :- ఛందస్తుతి, ఉప గానవత్ :- కుశ, ఛంద స్తుతి, ఉపగాన శబ్దాలకు ఔందు బర్యాది శబ్దాల సామీప్యం వలన అర్ధాన్ని గ్రహించాలి. తదుక్తం :- పూర్వ మీమాంస అంటున్నది.
భావం :- త్యాగం, విడిచిపెట్టడం, సాన్నిధ్యం, ఛందస్తుతి, ఉపగాన శబ్దాలకు ఔందు బర్యాది శబ్దాల సామీప్యం వలన అర్ధాన్ని గ్రహించాలని పూర్వ మీమాంస అంటున్నది.
వివరణ:- ఇది కఠిన మైన సూత్రం. జాగ్రత్తగా చదివి అర్ధం చేసుకోవాలి.
ఛాందోగ్యోపనిషత్తు(8, 13, 1):- "అశ్వ ఇవ రోమాణి విధూయ పాపం చంద్ర ఇవరాహోః ముఖాత్ ప్రముచ్య, ధూత్వా శరీర మకృతం కృతాత్వా బ్రహ్మలోక మభిసంభవామి"" అశ్వం శిధిలమైన వెంట్రుకలను విదిలించుకున్నట్లు పాపాన్ని విడిచిపెట్టి, చంద్రుడు రాహువు నుండి విడుదలై ప్రకాశవంతుడైనట్లుగా, నేను నా శరీరాన్ని విడిచిపెట్టి, పరమాత్మ సాక్షాత్కారంతో కృత కృత్యుడనై, బ్రహ్మాన్ని చేరతాను. విధూనవ శబ్దనికి త్యాగమని అర్ధం. గుర్రం తన శరీరాన్ని శుద్ధం చేసుకుంటుంది కదా! అలాగే ఆత్మజ్ఞాని బ్రహ్మోపాసనతో పాపాలను విదిలించుకుంటాడని అర్ధం కదా! బ్రహ్మోపాసనకు ఫలం ప్రయోజనం, పాప పుణ్య సమస్త వాసనల పరిత్యాగం - నాశం తద్వారా మోక్ష ప్రాప్తి కలుగుతుంది. వాసనలున్నప్పుడు మోక్ష ప్రాప్తి కలుగదు. కనుక ఉపాసనకు అర్ధం ఫలం. పాప నాశనం, పాప త్యాగం. ఛాందోగ్యంలో విధూయ శబ్దానికి అర్ధం ఇదే. ఈ వాక్యంలో " రాహాః ముఖాత్ ముచ్య " రాహువు ముఖం నుండి విడివడ్డ అని అర్ధం. కౌషీతకి బ్రాహ్మణంలో ఈ విధూవన శబ్దం తో బాటు ఉపాయన శబ్దం కూడా ఉంది. ఉపాయనం అంటే గ్రహించడం అనీ అర్ధం.
కౌషీతకీఉపనిషత్తు (1, 4):- తత్ సుకృత దుష్కృతే ధూనుతే తస్య ప్రియాజ్ఞాతయః సుకృతం ఉపయంతి అప్రియా దుష్కృతం "ఆత్మజ్ఞాని సుకృత, దుష్కృతాలను త్యజిస్తాడు. ధూనుతే అంటే అతని ప్రియులు సుకృతాన్ని, ఉపయంతి అంటే అప్రియులు దుష్కృతాన్ని గ్రహిస్తారు. బ్రహ్మజ్ఞాని సుకృత దుష్కృతాలను విడిచి పెడతాడని భావం. అతడు విడిస్తేనే కదా వేరే వాళ్ళు గ్రహిస్తారు. ఉపయంతి అంటే దగ్గరలో ఉండటం వలన విధూవన శబ్దానికి విడుపు అనే అర్ధం గ్రహించడం సమంజసం. కౌషీతకిలో బ్రహ్మజ్ఞానిని ప్రేమించే వాళ్ళు పుణ్యాలు చేస్తారని, అతణ్ణి ద్వేషించే వాళ్ళు పాపాలు చేస్తారని గ్రహించాలి అని పూర్వమీమాంస లో జైమిని తెలియజేశాడు. పూర్వమీమాంస దర్శనం ( 10, 8, 15 ) :-"అపి తు వాక్య శేషః స్యాత్ " ఒకచోట చెప్పిన అర్ధం, వేరే చోట చెప్పిన విషయానికి సంబంధించిన అర్ధానికి శేషం అంగం అవుతుంది. కనుక ఛాందోగ్యంలో, కౌషీతకీలో వున్నా విధూవన శబ్దాలు సమానార్ధకలు. రెండిటిలో అర్ధం పరిత్యాగమే. ఇలాగే ఒకచోట పఠించినది మరొకచోట అంగం అవుతుంది. అందుకు కుశీ, ఛందస్తుతి, ఉపగానం పదాలను దృష్టాంతలుగా వ్యాస మహర్షి సూత్రంలో చూపించారు. కుశ" వనస్పతిలో నిర్మించిన కుశలు నిన్ను రక్షించుగాక యజ్ఞంలో ఉద్గాత తాను చేసిన స్తోత్రాన్ని లెక్కించడానికి పుల్లలను ఉపయోగిస్తాడు. వాటిని "కుశ" అంటారు. ఇది ఏవనస్పతితో నిర్దేశించలేదు. శాట్యాయనులశాఖలో కుశః అంటే ఉదుంబరం అంటే బూరుగుచెట్టు అని చెప్పారు. ఇలాసమాన విషయాల్లో పఠించిన వాక్యానికి, వేరే శాఖలో పఠించిన వాక్యం శేషం, అంగం అవుతుంది.
ఛంద స్తుతి :- ఒక శాఖలో 'చందోభిః స్తువతే 'చందస్సులలో స్తుతి చేస్తారు. ఇది సామాన్య వాక్యం. ఛందస్సు లో దేవ, అసుర అని రెండు రకాలున్నాయి. ఈ రెండింటిలో ఏది ముందు స్తుతించాలో, ఏది తరువాత స్తుతించాలో విశేచించి చెప్పలేదు. పైంగిక శాఖలో దేవ ఛందస్సులను ముందుగా ప్రయోగించాలని చెప్పారు. అసుర ఛందస్సు తరువాత స్తుతి చెయ్యాలని చెప్పారు. అసురాలలో ఒక్కో చరణంలో తొమ్మిది వర్ణాలు ఉంటాయి.
ఉపగానం :- ఒక శాఖలో ఋత్విక్కులు ఉపగానం చేస్తారని ఉన్నది. ఋత్విక్కులలో బ్రహ్మ లాంటివారు చాలా మంది ఉంటారు. వీరిలో ఎవరు ఉపగానం చేస్తారో తెలియ జేయలేదు. తైత్తరీయశాఖలో అధర్వుడు ఉపగానం చేయరాదని, మిగిలినవారు చేయవచ్చునని నిర్ణయించారు. ఈ ఉదాహరణ ను బట్టి కౌషీతకం లో పఠించిన వాక్యం, ఛాందోగ్యం లో ఉన్నా దానిని వాక్య శేషం అంగం అవుతుంది.
సాంపరాయాధికరణం ( 3, 3, 27 )
సూత్రం :- 386
" సాంపరాయే తర్త వ్యాభావాత్ తధాహ్యన్యే "
సాంపరాయే :- మోక్షంలో, తర్త వ్యాభావత్ :- భోగించడానికి, తరించడానికి ఏమి ఉండదు. తధాహి అన్యే ..అని ఇతర శాఖల వాళ్ళు అంగీకరిస్తున్నారు.
భావం :- మోక్షంలో భోగించడానికి తరించడానికి ఏమి ఉండద ని ఇతర శాఖల వాళ్ళు అంగీకరిస్తారు.
వివరణ:- యోగి తానుపొందిన జ్ఞానంవలన దేహాన్నివదిలే సమయంలో సుకృత, దుష్కృతాలను వదలివేస్తాడు. విద్వాంసుడు మరణం సమయంలో, ప్రాణాలు బయటకు పోయేటప్పుడు శరీరంతో బాటే పాప పుణ్యాలు కూడా వదిలేస్తాడు, అంతే కాని అతని మరణానంతరం అతనితో బాటు వెళ్లవు. ఛాందోగ్యంలో చెప్పినట్లుగా గుర్రం తన శరీరాన్ని విదిలించి మట్టిని వదలి వేసినట్లుగా జ్ఞాని పాపపుణ్యాలను ఇక్కడే వదిలివేస్తాడు. అతను మరణించిన తరువాత అతని ఆస్తులను అతని వారసులు పొందుతారు. స్నేహితులు పుణ్య కర్మలను, విరోధులు పాప కర్మలను పొందుతారని చెప్పబడింది.
శ్వేతాశ్వరోపనిషత్తు(1, 10):- బ్రహ్మఉపాసన వలన తత్త్వజ్ఞానం, ఆత్మదర్శనం పొంది, సమస్త సాంసారిక భావన నుంచి విముక్తుడౌతాడు. జీవుడు పుణ్య పాపాలన్నింటిని అనుభవించి విశ్వాన్ని విడుస్తాడు.
ముండకోపనిషత్తు(3, 1, 3):- బ్రహ్మ జ్ఞాని పుణ్య పాపాలను విడిచి నిర్దోషియై పరమపదాన్ని పొందుతాడు.
కౌషీతకి బ్రాహ్మణం(1, 4):- అప్పుడు పుణ్యపాపాలను త్యజిస్తాడు. అనేకచోట్ల పుణ్యపాపాలను రెండింటిని త్యజిస్తాడని ఉన్నది. ఉపాసన వలన బ్రహ్మసాక్షాత్కారం కలుగుతుంది. అప్పుడు ఉపాసకుడికి మోక్ష ప్రాప్తికి మించి అనుభవించి, తరించడానికి ఏమి ఉండదు. కనుక బ్రహ్మ సాక్షాత్కారం వలన పుణ్య పాపాలు రెండు నశిస్తాయి.
సూత్రం :- 387
" ఛందత ఉభయా విరోధాత్ "
ఉభయ విరోధాత్ :- రెండు విధాలైన ఉపనిషత్వాక్యాల్లోనూ ఏ విరోధమూ లేదు అని, ఛందతః :- జ్ఞానులైన వక్తల అభిప్రాయం.
భావం :- రెండు విధాలైన ఉపనిషత్వాక్యాలలోనూ ఏ విరోధం లేదు అని జ్ఞానులైన వక్తల అభిప్రాయం.
వివరణ:-జీవించిఉండగానే యమనియమాలతో కాలం వెళ్ళబుచ్చుతున్నాడు. అతను నియమనిష్టలతో జీవితం సాగిస్తాడు కనుక కర్మ క్షయం అయిపోవచ్చును. యమ అంటే నియంత్రణ. మౌలిక ఆధ్యాత్మిక జీవన సూత్రాల మీద ఆధిపత్యం కలిగి ఉండటం. పతంజలి మహర్షి 5 యమాలను గురించి ప్రవచించారు.
1. సత్యం :- ఎప్పుడు సత్యాన్నే పలకడం.
2. అహింస :- హింసాత్మక చర్యలను పూర్తిగా విసర్జించడం.
3. బ్రహ్మచర్యం :- ఎప్పుడు మధ్యే మార్గాన్ని అనుసరించడం.
4. ఆస్థేయ :- ఇతరుల ఆస్థి పట్ల అసూయ ఉండక పోవడం,
5.అపరిగ్రహం .అవసరం కానిది ఇతరులు ఇచ్చినా తీసుకోకపోవడం.
నియమం:-అంటే తప్పనిసరి దైనందిన కార్యకలాపాలు మన ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో కొన్ని కార్యకలాపాలు తప్పనిసరి. ఇవి 5 నియమాలు.
1.శౌచం :- శరీరాన్ని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం,
2. సంతోషం :- మనస్సును ఎప్పుడు ఉల్లాసంగా ఉంచుకోవడం,
3. స్వాధ్యాయం :- చక్కని ఆధ్యాత్మిక గ్రంధాలను సదా చదువుతూ ఉండటం,
4. తపస్సు :- నిద్రాహారాదులను క్రమక్రమంగా తగ్గిస్తూ ఉండటం,
5. ఈశ్వర ప్రణీదానం :- అంతా ఈశ్వరమయమే అన్న భావనతో సదా ఉండటం.
ఇవి సాధ్యం అవాలంటే నిత్యఅనునిత్యయోగం, ఆధ్యాత్మికజ్ఞానం తప్ప వేరే శరణ్యం లేదు. ఈ యమ, నియమాలను అనుసరించే వారికి జీవించి ఉండగానే కర్మ క్షయం అవుతుంది. మరణాత్పూర్వమే సాధనావస్థ లోనే ప్రయత్నం చేయడం కుదురుతుంది. ఆప్రయత్నాన్ని బట్టి సుకృత, దుష్కృత కర్మలు తొలగిపోతాయి. బ్రహ్మ ప్రాప్తి మాత్రం దేహాన్ని వదలిన తరువాత జరుగుతుంది.
గతేరర్థ వత్వాధికరణము (3, 3, 29)
సూత్రం 388
"గతేరర్ధ వత్వా ముభయధా న్యధాహి విరోధః
ఉభయధా :- రెండు విధాలని అంగీకరించాలి. గతేః :- బ్రహ్మోపాసకుడుకి దేవయాన గతి ఉన్నది అనే మాటను, అర్ధ వత్వం :- సార్ధకత ఉన్నది. హి :- ఎందుకంటే, అన్యధా :- అలాకాని పక్షంలో, విరోధః :- చెప్పిన వాక్యాల్లో విరోధం ఉంటుంది కదా!
భావం :- రెండు విధాలను అంగీకరించాలి. బ్రహ్మోపాసకుడికి దేవయాన గతి ఉన్నది అనే మాటకు సార్ధకత ఉన్నది. ఎందుకంటే అలా కాని పక్షంలో చెప్పిన వాక్యల్లో విరోధం ఉంటుంది.
వివరణ:-గురువర్యా! పాపపుణ్యాలను వదలి పెట్టే సందర్భంలో కొన్ని చోట్ల దేవయానం చెప్పారు. కొన్ని చోట్ల ఏమి చెప్పలేదు. పాప పుణ్యాలను వదలి పెట్టిన తరువాత జ్ఞానులందరు దేవయాన మార్గం ద్వారానే వెడతారా? అని అడిగాడు కృష్ణ శర్మ. సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. బ్రహ్మోపాసన రెండు రకాలు. ఒక దానికి గతి ఉన్నది. మరొక దానికి లేదు. ఉపాసనాపద్ధతి, నిర్గుణవిద్యాపద్ధతి అని రెండుపద్ధతులున్నాయి. వీటిలో ఉపాసనాపద్దతిలోమాత్రమే దేవయానమార్గ మున్నది. నిర్గుణోపాసన సందర్భంలో దేవయానమార్గంలేదు. అజ్ఞానం పోయిన తరువాత పాపపుణ్యలను వదలి, నిర్మలుడై పరబ్రహ్మను చేరతాడు అని ముండకోపనిషత్తు చెబుతున్నది. ఉపాసకుడికి బ్రహ్మప్రాప్తి కలగడానికి ముందు ఏదైనా అడ్డంకి కలిగితే ఈ శరీరం విడిచి మరొక శరీరం పొందే గతి కలుగుతుంది. దీనిని దేవాయనగతి అంటారు. నిరంతరం బ్రహ్మాన్ని ఉపాసించి, పుణ్య పాపాలన్నిటిని త్యజించి, ఎలాంటి అభ్యంతరాలు లేని బ్రహ్మ జ్ఞాని ఈ శరీరాన్ని విడిచి, ఇక్కడే బ్రహ్మాన్ని పొందుతాడు. అతడికి గతి ఉండదు. గతి అనేది ఉపాసనకు ఫలం. పుణ్య పాపలకు కాదు. బ్రహ్మో పాసనకు దేవయాన గతి ఉందనడం నిరర్ధకం కాదు. ఇలా గతి ఉండడం, లేకపోవడం రెండూ ఉన్నాయి.
బృహదారణ్యాకోపనిషత్తు(1,3):- ఇక్కడే బ్రహ్మాన్ని పొందుతాడు అంటూ గతి చెప్పలేదు. ఈవాక్యాల్లో విరోధం ఉందని అనుకోకూడదు. ఆటంకం కలిగినప్పుడు శరీరపాతం కాగానే ఉపాసకుడు దేవాయన మార్గంలో వేరేశరీరంలో ప్రవేశించి, అడ్డంకి తొలగిపోగానే బ్రహ్మాన్ని పొందుతాడు. పూర్ణ బ్రహ్మజ్ఞానికి ఏగతి లేదు. అందువలన గతి ఉన్నదనడము, గతి లేదనడము రెండూ సార్ధకమే. నిరర్ధకం కావు అనీ గ్రహించాలి.
గతీరర్ధ వత్వాధికరణం ( 3, 3, 30 )
సూత్రం :- 389
" ఉపపన్నః తల్లక్షణార్ధోప లబ్దిఃలోకవత్ "
ఈత్ లక్షణ అర్ధ ఉపలబ్ధేః :- గతి, కారణం, ప్రాప్తి ఉండటం, ఉపపన్నః :- సహెతుకమే.
భావం :- బ్రహ్మసాక్షాత్కారం కాని ఉపాసకుడికి కూడా గతి ఉంటుందని ఎలా అంటున్నారు? ఆ గతికి ఫల ప్రాప్తి లేదు కదా! అంటే ఈ లోకంలో మనం చూస్తున్నట్లుగా గతి, కారణం ప్రాప్తి ఉండటం సహేతుకమే.
వివరణ:- సగుణోపాసకుడికి సగుణబ్రహ్మ ప్రాప్తి, నిర్గుణ బ్రహ్మోపాసకుడికి నిర్గుణ పరబ్రహ్మ ప్రాప్తి లభిస్తాయి. లోకంలో ఒకడు ఏదో సాధించాలని వేరే దేశానికి వెళ్ళడానికి ఏదో ఒక మార్గం కావాలి. అలాగే ఉపాసకుడు వెళ్ళడంలో విడ్డూరం ఏముంది? దేశాంతరగమనం వలన ప్రయోజనం ఉన్నట్లే, లోకాంతర గతికి విశేష ఫల ప్రాప్తి ఉంటుంది. లోకాంతరగతి ఉపాసకుడికి హేతువు. ఈ ఉపాసనకు ఫలితం బ్రహ్మ సాక్షాత్కారం. అది ఇక్కడే లభించ వచ్చును. ఒక చోట అనే నిర్భంధం ఏమి లేదు. సగుణబ్రహ్మను పొందటానికి దేవయాన మార్గం అవసరం. ఈ మార్గం ద్వారా వెళ్లిన వాళ్ళకి ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి. సకల భోగాలు దక్కుతాయి. నిర్గుణోపాసకుడు నిర్గుణ స్వరూపం పొందటానికి మార్గం అంటూ ఏది అవసరం లేదు. నిర్గుణ విద్యలో దేవయాన ప్రసక్తి లేదు.
ప్రశ్నోపనిషత్తు(5, 5):- ఓంకార యుక్తంగా చేసిన ఉపాసన ఉపాసకుణ్ణి బ్రహ్మలోకానికి తీసుకువెడుతుంది. జీవాత్మల భోగం కొరకు భూమి మీద మొదలైన లోకలోకాంతరాల సృష్టి జరుగుతుంది. వాటి కంటే సూక్ష్మం జీవాత్మ తత్త్వం. అలాంటి పరతత్త్వాన్ని ఉపాసకుడు చేరతాడు. "పాప్మనా వినిర్ముకతః "పాప పుణ్యాల నుంచి విముక్తుడై, ఈ దేహంతో గాని, అన్య దేహంతో గాని బ్రహ్మాన్ని పొందుతాడు. కనుక బ్రహ్మోపాసనకు గతి ఉన్నదని స్పష్టమౌతోంది.
అనియమాధికరణం ( 3, 3, 31 )
సూత్రం :- 390
" అనియమః సర్వేషా మవిరోధః శబ్దాను మానాభ్యాయం "
సర్వేషాం:-దేవయానమార్గంలో బ్రహ్మ లోకం చేరిన బ్రహ్మోపాసకులకందరికి, అనియమః :- బ్రహ్మ ప్రాప్తి కలగాలనే నియమం ఏమి లేదు. అవిరోధః :- ఈ విషయంలో ఏ వైరుధ్యం లేదు అని శబ్ద అనుమానాభ్యామ్ :- శ్రుతి, స్మృతుల వలన తెలుస్తోంది.
భావం :- దేవయాన మార్గంలో బ్రహ్మ లోకం చేరిన బ్రహ్మోపాసకులందరికి బ్రహ్మ ప్రాప్తి కలగాలనే నియమం లేదని శ్రుతి, స్మృతుల వలన తెలుస్తోంది.
వివరణ :- ఉపాసనలను బట్టి దేవయాన మార్గం ద్వారా బ్రహ్మ లోకాన్ని పొందే బ్రహ్మోపాసకులందరికి బ్రహ్మోపాసన ఫలంగా బ్రహ్మసాక్షాత్కారం కలుగుతుందా అనే ప్రశ్నకు ఈ సూత్రంలో సమాధానం చెప్పబడింది. గురువు గారు! సగుణోపాసనలో దేవయానం తప్ప నిర్గుణోపాసనలో దీని ప్రసక్తి లేదు. సగుణోపాసనలో కూడా కొన్ని చోట్ల దేవయానం చెప్పబడింది. కొన్ని చోట్ల చెప్పబడలేదు. ఉదా:- పంచాగ్నివిద్య, ఉపకోశలవిద్యలలో దేవయానం చెప్పబడింది. మధు విద్య, శాండిల్య విద్య, వైశ్వానర విద్య లలో ఇది చెప్పబడలేదు. ఈవిద్యలలో దేవయానం అన్వయింపవచ్చునా? అని అడిగాడు కృష్ణశర్మ. సమాధానం చెబుతున్నాడు రత్నకరుడు. సగుణోపాసన లన్నింటిలో దేవయానం చెప్పడంలో తప్పు లేదు. ఛాందోగ్యంలో పంచాగ్నివిద్య తెలుసుకున్న వారు, శ్రద్ధ, తపస్సు మొదలైన ధర్మాలతో ఉపాసన చేసిన వారు అర్చిరాది మార్గాన్ని పొందుతారు. అంటే నిర్గుణ బ్రహ్మోపాసన చేసిన వారు అర్చిరాది మార్గం ద్వారా బ్రహ్మ లోకం చేరతారు. రకరకాల ఉపాసనలు చేస్తూ ఉపాసకులు దేవాయన గతిలో బ్రహ్మలోకం చేరతారు. అందరికీ బ్రహ్మ సాక్షాత్కారం అవుతుందనే నియమం లేదు. పరిపూర్ణమైన సాధనాసంపత్తి ఉన్నవాళ్ళకే బ్రహ్మసాక్షాత్కారం లభిస్తుంది. ఉపాసనలో ఏదైనా అనివార్య బాధ కలిగినప్పుడు, బ్రహ్మసాక్షాత్కారం లభించదు. అలాంటి వాళ్లకు వాళ్ళు చేసిన ఉపాసనలకు ఫలితంగా ఐశ్వర్యాదులు అనుభవించడానికి అనువైన విశిష్ట దేహ సంబంధం ఈ లోకంలో లభిస్తుంది. బ్రహ్మ సాక్షాత్కారం కలిగిన వాళ్ళు ముక్తులౌతారు.
ఛాందోగ్యోపనిషత్తు(4, 15, 6):-"ఏతేన ప్రతిపద్యమానా ఇమంమానవమావర్తం నావర్తంతే " దేవయాన మార్గంలో బ్రహ్మలోకం చేరిన వాళ్లకు బ్రహ్మసాక్షాత్కారం కలిగిన తరువాత ఈ మానవచక్రంలోకి రారు. ఈ వాక్యంలో వైరుద్యం లేదు. కనుక బ్రహ్మలోకం చేరిన తరువాత వాళ్లందరికీ బ్రహ్మ సాక్షాత్కారం కలగాలనే నియమం లేదు. అది అనుష్టాన సాధనసంపత్తి, సమగ్రత పై ఆధారపడి ఉంటుంది. కనుక బ్రహ్మసాక్షాత్కారం కలగడం, కలగక పోవడం రెండూ సంభవమే. ఉపనిషత్తులలో పేర్కొన్న ఉపాసనల్లో కొన్నింటిలో ఛాందోగ్యంలో పంచాగ్నివిద్య, ఉపకోసల విద్యలలో దేవయాన మార్గం ఉన్నది. మధు విద్య, శాండిల్య విద్య, వైశ్వానర విద్యలలో ఇది కనిపించదు. కాబట్టి ఏ విద్యల్లో దేవయానం ఉన్నదో ఆ విద్య వలన జీవుడికి దేవయాన గతి వర్తిస్తుంది. అందువలన దేవయాన గతి అన్యత్రా గ్రహించకూడదు. ఇది ఒక విద్యకే పరిమితం కాదు. అన్ని ఉపాసనల్లో ఇది ఫలిస్తుంది. దీనికి ప్రమాణాలు అనేకం ఉన్నాయి. కర్మ మార్గం అనుసరించే వాళ్లకు పితృ యానం, జ్ఞాన మార్గులకు దేవయానం అని రెండు గతులు నిర్దేశించారు. కర్మానుస్థాన ఫలం పితృయానం, బ్రహ్మోపాసన ఫలం దేవయానం అని చెప్పబడింది.
బృహదారణ్యకం(6, 2, 15/ 16):- కొన్ని ఉపాసనల్లో దేవాయన గతిని పేర్కొనక పోయినా అన్ని ఉపసనా ఫలాలు సమానమే. ప్రతి ఉపాసన ప్రతిఫలం బ్రహ్మ సాక్షాత్కారమే కానక్కరలేదు. మిగతా వాటికి ఐశ్వర్య ప్రాప్తి ఫలాలు తప్పక ఉంటాయి. ఈ దేవయానమార్గంలో శ్రద్ధ, తపస్సులు గలవారు మాత్రమే చెప్పబడ్డారు. విద్యా బలం లేకుండా కేవలం శ్రద్ధ, తపస్సు చేత ఈ గతి లభించదు. ఏ బ్రహ్మలోకంలో కామాలు, కామక్రోధాదులు మరలిపోతాయో అట్టి బ్రహ్మలోకస్థానంలో విద్యచేత ప్రవేశిస్తారు.
యావదధికరణం ( 3, 3, 32 )
సూత్రం :- 391
" యావదధికార మనస్థితి రాధికారికాణామ్ "
అధికారికాణామ్ :- అధికారం ఉన్నవాళ్లకు, యావదధికారాం :- ఆ అధికారం ఉన్నంత వరకు, అవస్తితిః :- ఉనికి ఉంటుంది.
భావం :- బ్రహ్మ సాక్షాత్కారం వలన మోక్షధికారం లభించిన వాళ్లు ఆ అధికారం ఉన్నంత వరకు బ్రహ్మలోకంలో ఉనికి ఉంటుంది.
వివరణ:-ఈ అధికరణంలో ముక్తులైన వారు ధర్మరక్షణ కోసం మళ్ళీ జన్మించవచ్చునని తెలియజేశారు. గురువు గారు! జ్ఞాని ఆదేహాన్ని వదలిన తరువాత అతనికి ఇంకొక శరీరం ఉంటుందా? ముక్తి అనేది నియమమా? అనివార్యమా? లేక పాక్షికమా? బ్రహ్మవేత్తలుకూడా మళ్ళీ జన్మించినట్లుగా పురాణాలలో చెప్పబడింది. వేదాచార్యుడైన అపాంతరతముడే మళ్ళీ కృష్ణద్వైపాయణుడుగా పుట్టాడు. సనత్కుమారుడే ఈశ్వరాజ్ఞతో కుమారస్వామిగా పుట్టాడు. నారదుడు వశిష్ఠుడుగా మళ్ళీ జనించినట్లుగా చెప్పబడింది. కాబట్టి ఈ దేహము విడిచిన తరువాత జ్ఞానికి ముక్తి లభిస్తుందనే నియమం ఏది లేదనిపిస్తోంది కదా! అన్నాడు నారాయణభట్టు. సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. అపాంతరతముడు మొదలైన వారు లోకం కోసం ఈశ్వరునిచే అధికారంలో నియమించబడ్డారు. వీరు ఆ అధికారి సంపాదాకమైన కర్మ క్షయం అయ్యేవరకు అలాగే ఉంటారు. ఈమహానుభావులు మరల శరీరం ధరించడానికి ఏ కర్మలు చేశారో అవి క్షయం అయ్యేవరకు ఆ అధికారంలోనే ఉంటారు. శరీర ధారణ చేస్తారు. వీరికి దేహ సంబంధమైన లింగ శరీరం నుండి విముక్తి కలగగానే మోక్షం వస్తుంది. ఆధ్యాత్మ శాస్త్రాల్లో జీవుడి మోక్ష దశను వర్ణించిన చోట వాస్తవికత తెలిపే కొన్ని సంకేతాలు లభిస్తాయి. వాటిని పరిశీలిస్తే మోక్ష దశలో ముక్తుడు ఎంతకాలం ఉంటాడో తెలుస్తుంది.
ఛాందోగ్యోపనిషత్తు(4, 15, 6 ):-" ఏతేన ప్రతిపద్యమానా ఇమంమానవ మావర్తం నా \వార్తంతే " దేవయాన మార్గంలో బ్రహ్మాన్ని పొందిన జ్ఞానులు ఈ మానవఆవర్తనానికి తిరిగి రారు. దీనిఅర్ధం ఏమిటంటే ఏ మానవఆవర్తనంలో ముక్తులయ్యారో ఆ మానవ ఆవర్తనంలోనికి తిరిగి రారు. మరో మానవ ఆవర్తనంలోనికి వస్తారని భావం. ఇక్కడ ఆవర్తనం అంటే కల్పం.
ఛాందొగ్యో పనిషత్తు(8, 15, 1):- బ్రహ్మజ్ఞానం పొంది ముక్త దశలో ఎంత కాలం ఉండాలో అంత కాలం బ్రహ్మ లోకంలో ఉంటాడు. మధ్యలో తిరిగి రారు.
బృహదారణ్యకోపనిషత్తు(6, 2, 15):- " తేషు బ్రహ్మ లోకేషు పరాం పరావతో వసంతి "ముక్తులు చాలా కాలం బ్రహ్మలోకంలో వసిస్తారు. వీటిని బట్టి ముక్తులు అనంత కాలం బ్రహ్మంలో ఉంటారనడం పొసగడం లేదు. ముక్తులకు పునరావృత్తి లేదంటే అర్ధం వాళ్ళు మోక్షానందం అనుభవించే సమయంలో తిరిగి రారు అనే. కనుక ముక్తాత్మలు తమకు అధికారం ఉన్నంత వరకు బ్రహ్మానందాన్ని అనుభవిస్తారని, పిదప మళ్ళీ జన్మిస్తారని తెలుస్తోంది.
అక్షరధ్యధికరణం ( 3, 3, 33 )
సూత్రం :- 392
" అక్షరధియాం త్వవరోధః సామాన్య తద్భావాభ్యామ్ ఔప సదవత్ తదుక్తమ్ "
సామాన్య తత్ భావాభ్యామ్ :- ఉపాస్య దైవం సమానం అయినందు వలన, అస్థూలత్వాదులు బ్రహ్మ ధర్మాలు కావడం వలన, అక్షరధియాం:- అక్షరవిద్యతో పేర్కొన్న గుణాలను, అవరోధః:-ఉపాసనలలో గ్రహించాలి. ఔపసదవత్ :- ఉపసద్ ఆహుతుల్ని ఉదాహరణగా తీసుకోవాలని, తదుక్తం :- మీ మాంస శాస్త్రము చెబుతోంది.
భావం :- సామాన్య ఉపాస్య దైవం సమానం అయినందువలన అస్థూలత్వాదులు బ్రహ్మ ధర్మం కావడం వలన అక్షర విద్యలో పేర్కొన్న గుణాలను ఉపాసనలలో గ్రహించాలి. ఉపసద్ ఆహుతుల్ని ఉదాహరణంగా తీసుకోవాలని మీమాంస శాస్త్రము చెబుతోంది.
వివరణ:-ఈ అధికరణంలో అక్షరానికీ సంబంధించిన నిషేధ భావాలకు ఉపసంహారం ఉంది. గురువర్యా! బ్రహ్మాన్ని గురించి చెప్పేటప్పుడు అవ్యయుడు లేనివాడు అనే నిషేధ వాక్యాలలో చెప్పారు. ఉదా. ఆకారం లేని వాడు, గుణం లేని వాడు, ఇంద్రి యాల చేత గ్రహింపబడని వాడు. ఈరకంగా కొన్ని చోట్ల చెప్పారు. కొన్ని చోట్ల చెప్పలేదు. ఈ రకంగా చెప్పని చోట, చెప్పిన చోటునుంచి అన్వయింప వచ్చునా? అని ప్రశ్నించాడు నారాయణ భట్టు. సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. ఉపాస్య దైవం సమానం అయినందువలన వస్తు భేదం లేనందువలన బ్రహ్మకు సంబంధించిన నిషేధర్ధక భావాలు ఉపసంహరించాలి. ఈ నిషేధ వాక్యాల ద్వారా బ్రహ్మ మొక్కటేనని తెలుస్తుంది. బ్రహ్మకు సంబంధించిన నిషేధ వాక్యాలకు ఉప సంహారం ఉన్నది.
ముండకోపనిషత్తు(1, 1, 5/6):- బ్రహ్మానికి స్థూలత్వాది ధర్మాలు లేనట్లుగా చెబుతూ, బ్రహ్మస్వరూపాన్ని తెలిసేటట్లు చేయాలనీ యత్నించారు. ఈ అస్థూలత, అనణుత్వం, అహస్వత్రం లాంటి గుణాలను బ్రహ్మోపాసన ల్లో సర్వత్రా గ్రహించాలా? వద్దా? అంటే గ్రహించాలనే మహర్షి చెబుతున్నారు. అక్షరబ్రహ్మవిద్యలో వివరించిన బ్రహ్మధర్మాలు సర్వత్రా గ్రహించాలి. అన్ని ఉపాసనలలో ఉపాస్యుడైన బ్రహ్మం ఒక్కటే. గుణాలు కూడా ప్రాచుర్యం వహించినవే. కనుక ఒక చోట గ్రహించిన గుణాలు వేరే చోట బ్రహ్మ స్వరూపాన్ని గ్రహించడానికి తోడ్పడతాయి. ఇక్కడ మహర్షి ఒక ఉదాహరణ ఇచ్చాడు. "ఔప సదనత్ " నాలుగు రోజులలో పూర్తి అయ్యే చతూరాత్రం అనే అహీనయజ్ఞం ఒకటున్నది. అందులో అధర్వుడు పురోడాశం అనే ద్రవ్యం గల ఏక కపాలం మొదలు ద్వాదశకపాలం వరకు కొన్ని ఆహుతులిస్తాడు. పురోడాశం అంటే బియ్యం పిండితో చేసే రొట్టె వంటి హోమద్రవ్యం. ఆ ఆహుతుల్ని ఉపసద్ అంటారు. ఈ ఆహుతుల్ని తాండ్య బ్రాహ్మణంలో ఉన్న అగ్నేర్ వే హోత్రం వేరే ధ్వరం " లాంటి మంత్రాలలో ఇస్తారు. ఈ బ్రాహ్మణం సామవేదానికి చెందినది. ఈమంత్రాన్ని ఉద్గాథ ఉచ్చరించాలి. అధ్వర్యుడు పఠించకూడదు. కాని చతూరాత్రంలో పురోడాశం ఇవ్వడమే ముఖ్యం. ఈ కార్యాన్ని అధ్వర్యుడే చెయ్యాలని నియమం. కాబట్టి మంత్రోచ్చారణ పురోడాశానికి అంగం కావడం వలన అధ్వర్యుడే చేస్తాడు. ఇక్కడ పురోడాశం ఇచ్చే ఆధ్వర్యుడికి, ఉద్గాథ ఉచ్చరించే మంత్రాలకు సంబంధం ఉంది. అలాగే విభిన్న శాఖలలో పటించే అస్థూలత్వాది గుణాలు సైతం సర్వత్రా ఉపాస్య బ్రహ్మంతో సంబంధించి ఉంటాయని సమాన్వయం చేసుకోవాలి పూర్వమీమాంస (3, 3, 9) :- "గుణ ముఖ్య వ్యతిక్రమే తదర్ధ త్వాన్ము ఖ్యనవేద సంయోగం" గుణముఖ్యాల్లో తేడా వచ్చినప్పుడు మంత్ర సంబంధం ముఖ్యంతో ఉంటుంది. ఈగుణం ముఖ్యాన్ని సంపన్నం చేయడానికే. దీనిని బట్టి ముఖ్యమైన ఉపాస్య బ్రహ్మంతో అన్ని ఉపాసనల్లో గుణాలకు సంబంధం ఉంటుందని స్పష్టమౌతోంది.
ఇయదధికరణం ( 3, 3, 34 )
సూత్రం :- 393
" ఇయదామననాత్ "
ఆమనయాత్ :- శాస్త్రాల్లో చెప్పిన, ఇయత్ :- అన్ను గుణాలను గ్రహించాలి.
భావం :- శాస్త్రాల్లో ఎన్ని గుణాలు పఠించారో, అన్ని గుణాలను గ్రహించాలి.
వివరణ:- ఈ అధికరణంలో ద్వాసుపర్ణా, ఋతంబిబన్తౌలలో చెప్పిన విద్య ఒక్కటేనని చెప్పబడినది. జగజ్జన్మాదులకు కారణం అచింత్యశక్తి యుక్తమైన బ్రహ్మం గుణాలకు అవధి లేదు. అయిన ముముక్షువులు ఉపాసనకు ఉపకరించే శాస్త్రాల్లో వర్ణించిన గుణాలను ఒక ఉపాస్యవిద్య నుంచి మరోదానిలో సంగ్రహించాలని ఋషులు చెబుతున్నారు. అల్పజ్నుడైన జీవుడు సర్వ గుణ సంపన్నుడైనా బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి సమర్ధుడు కాడు. జగత్ కర్త్తృత్వం లాంటివి విధి రూపకంగా, అస్థూలత్వం లాంటి వాటిని నిషేధ రూపకంగా, గ్రాహ్య గుణాలుగా వర్ణించారు. 3-1-11నుంచి 3-3-33వరకు చెప్పిన సూత్రాలోని బ్రహ్మ స్వరూప గ్రాహక గుణాలను గ్రహించాలి. ఈ రెండింటి యందలి విద్య ఒక్కటే. తెలుసుకోవలసిన రూపాన్ని రెండు చోట్ల ఒకటిగా చెప్పారు. కాబట్టి విద్యలలో ఐక్యం ఉన్నది. కనుక రెండింటిలోను చెప్పదలచిన విద్య ఒక్కటే. అధర్వణికులు, శ్వేతాశ్వతరులు కూడా ఆధ్యాత్మ ప్రకరణంలో "ద్వాసు పర్ణ, అభిచాభి శీతి " అనే మంత్రాన్ని పఠిస్తున్నారు.అట్లే నరులు కూడా "యితం - త్రినాచికేతాః " అను మంత్రం పఠిస్తున్నారు. ఇక్కడ విద్యలకు ఏకత్వమా? భేదమా? అని సంశయం. ద్వాసుపర్ణ అనే మంత్రంలో ఒకరికి భోకృత్వం, మరొకరికి అభోకృత్వం కనబడుచున్నవి. వేద్యం వేరైనప్పుడు విద్యలు వేరేవుతాయి కదా! వేద్యమైన అక్షరం ఒకటే గాన విద్య కూడా ఏకమే అవడం చేత అక్షరధీలకు ఉపసంహారం ఉంటే ఉండవచ్చును. కాని ఇక్కడ వేద్య భేదం చేత విద్య కూడా భిన్నమే గాన ఉపసంహారం ఉండదు. ఈ రెండు మంత్రాలూ జీవుడు రెండవవాడుగా గల జీవేశ్వరులను ప్రతిపాదిస్తున్నాయి. కాని మరొక అర్ధాన్ని ప్రతిపాదించలేదు.
అంతరాత్వాధికరణం ( 3, 3, 35 )
సూత్రం :- 394
" అంతరా భూత గ్రామవత్ స్వాత్మనః "
దీనికి ఆమననాత్ అనేది పూర్వ సూత్రం నుంచి అనువృత్తి. భూత గ్రామవత్ :- తన దేహము లోని తన ఆత్మలాగా, స్వాత్మనః :- తన ఆత్మ, అంతరా :- మధ్యలో బ్రహ్మాన్ని ఉపాసించాలి. అమననాత్ :- శాస్త్రాల్లో చెప్పారు.
భావం :- తన దేహంలోని తన ఆత్మ లాగా, తన ఆత్మ మధ్యలో బ్రహ్మాన్ని ఉపాసించాలని శాస్త్రాల్లో చెప్పారు.
వివరణ:-రెండూచోట్ల సర్వాంతరత్వాన్ని చెప్పారు. శ్వేతాశ్వరోపనిషత్తులో చెప్పినట్లుగా సమస్త భూతాలయందు సర్వాంత రత్వం అయిన ఆత్మ ఒక్కటే. జీవుడు తనని తాను తన దేహ మధ్యంలో ఉన్నట్లు ఎలా తెలుసుకుంటాడో, ఉపాసకుడు పరమేశ్వరుణ్ణి తనఆత్మ మధ్యలో ఉపాసించాలి. ఈశ్వరుడు అన్నిభూతాల్లో అంతటా వ్యాపించి ఉన్నట్లుగా తన లోను వ్యాపించి ఉన్నాడు. కనుక తనలోనే ఉపాసించి సాక్షాత్కారం చేసుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. స్వాత్మకు అంతరామ్ననం లో భేదం లేదు కనుక విద్వైకత్వమే. రెండూ చోట్ల కూడా భేదం లేకుండా సర్వాన్తరమైన (అన్నింటికన్నా లోపల ఉన్న) ఆత్మను గురించి ప్రశ్నించడం, సమాధానం చెప్పడం జరిగింది. ఒకే దేహంలో రెండూ ఆత్మలు సర్వన్తరాలుగా ఉండవు కదా! అప్పుడు ఒక ఆత్మకు సరియైన సర్వాన్తరత్వం చెప్పవలసిన ఉంటుంది. మరొక దానికి భూత గ్రామానికి వలె సర్వాంతరత్వం ఉండదు. అట్లే ఇక్కడ కూడా ముఖ్యమైన సర్వాంతరత్వం (ఒకదానికే గాని అన్నింటికీ) ఉండదు. అట్లే ఇక్కడ కూడా. భూత గ్రామవత్ అనేది మరొక శ్రుతిని నిర్దేశిస్తుంది. సమస్త భూత సముదాయంలో ఒకే ఆత్మ సర్వాంతరం అని ఏ విధంగా చెప్పబడిందో అట్లే ఈ బ్రాహ్మణాలలో కూడా అని అర్ధం. కఠోపనిషత్తు, శత పధబ్రాహ్మణంలో తన ఆత్మ లో వ్యాపించి ఉన్నట్లు అక్కడే దానిని గ్రహించాలన్నట్లు స్పష్టంగా వివరించారు. కనుక హృదయ స్థితమైన ఆత్మలోనే బ్రహ్మాన్ని ఉపసించాలని సిద్ధాంతం. శాస్త్రాన్ని అనుసరించి స్వాత్మ లోనే పరబ్రహ్మోపాసన చేయాలనీ అంటున్నారు.
అంతరత్వదికరణం ( 3, 3, 36 )
సూత్రం :- 395
" అన్యధా భేదానుపపత్తి రితి చేన్నోప దేశాంతర వత్ "
అన్యధా :- వేర్వేరుగా చెప్పిన, భేద అనుపపత్తిః :- ఉపాసనా భేదాలు సిద్ధించవు కదా! ఇతి చేత్ :- అని అనడం, న :- సరియైనది కాదు. ఉపదేశ అంతరవత్ :- ఇది వరకే చెప్పిన కర్మోపదేశం లాగా అదీ సిద్ధిస్తుంది. స్వాత్మనః :- కనుక పరబ్రహ్మోపాసన తన ఆత్మలోనే చెయ్యాలి.
భావం :- వేర్వేరుగా చెప్పిన ఉపసనా భేదాలు సిద్ధించవు కదా అనీ చెప్పడం సరియైనది కాదు. ఇదివరకే చెప్పిన కర్మోపదేశం లాగా అదీ సిద్ధిస్తుంది. కనుక పరబ్రహ్మోపాసన తన ఆత్మలోనే చెయ్యాలి. ఇక్కడ అంతరా, స్వాత్మనః అనేవి అనువృత్తులు.
వివరణ:-విద్యాభేదం అంగీకరించకపోతే శ్రుతిభేదం ఉపపన్నంకాదు అని చెప్పడం సరియైనదికాదు అనిచెప్పడం సమంజసం కాదు. ఛాందోగ్యంలో తత్త్వమసి అన్నదానిని 9సార్లు చేసినప్పటికి విద్యాభేదం కలగలేదు. అది అభ్యాసం కొరకు చెప్పబడింది. అలాగే ఇక్కడ కూడా. విద్యలో భేదం లేకపోతే ఒకే మాట లేదా విషయం రెండూ సార్లు చెప్పబడవు అనీ పూర్వ పక్ష వాదన. తత్త్వమసి 9 సార్లు చెప్పినా విద్యలో భేదం రాలేదు. పునరుక్తి దోషం కలుగలేదు. కాబట్టి ఉషుస్తీ, కహాళ బ్రాహ్మణలలో చెప్పిన విద్య ఒక్కటే.
ఛాందొగ్యోపనిషత్తు ( 5, 18, 1 ) :- ఇందులో ఆదిత్యాదుల్లో బ్రహ్మోపాసన చేయరాదని, ద్యులోకం నుంచి పృధివి దాకా ఉన్న సమస్త విశ్వంలో వ్యాపించి ఉన్న విరాట్ బ్రహ్మ స్వరూపాన్ని ఉపాసన చేయాలనీ విధించారు.
అధర్వణ వేదం(10, 7, 32):- హృదయంలో ఉన్న స్వాత్మలోనే బ్రహ్మోపాసన అంటున్నారు కదా! మరి పైన వివరించిన సమస్త విశ్వవ్యాప్త విరాట్ స్వరూపఉపాసన ఎలా సిద్ధిస్తుంది? స్వాత్మ కన్నా విశ్వం వేరే కదా! అంటే ఇదివరలో అధికార భేదం వలన కర్మోపదేశంలో తేడా కలుగుతుందని చెప్పాము. అలాగే ఉపాసనల్లో ఉపదేశ భేదం ఉన్నది. కాని ఉపదేశాలలో భేదంఉన్నా సమస్తబ్రహ్మోపాసన ఆత్మలోనే సంభవం అని సూత్రాభిప్రాయం. బ్రహ్మచారులు, గృహస్తులు, వానప్రస్థులు,అగ్ని హోత్రాన్ని ద్రవ్యాహుతుల్ని, ఇచ్చి బయట భూమి మీదో, వేదిక పైనో చేస్తారు. దీన్ని విరక్తుడైనా వైశ్వానర ఉపాసకుడు ఆధ్యాత్మిక అగ్ని హోత్రం చేస్తారు.
ఛాందోగ్యం (5, 18, 2):- వక్షస్థలం వేదిక, రోమాలు బర్వి, హృదయం గర్హ పత్య అగ్ని, మనస్సు అన్వాహార్య పచనం, ముఖం ఆహవనీయం. (5, 24, 2, 3):- "యఏతదేవం విరిత్వాగ్నిహోత్రం జూహాతి" ఈ వాక్యాల్లో దీన్ని అగ్నిహోత్రం అన్నారు. విరక్తులు ఈ విధంగా అగ్నిహోత్రాన్ని తమ శరీరల్లోనే చేస్తారు. బయట భౌతికంగా చెయ్యరని భావం. ఇలా అధికార భేదం వలన కర్మభేదం సిద్ధిస్తుంది. ఐశ్వర్యప్రాప్తి లాంటి ఫలాన్ని ఆశించకుండా ఆనందనుభావం కోరే బ్రహ్మ జ్ఞానీ తన ఆత్మలోనే బ్రహ్మాన్ని ఉపాసిస్తాడు. అయితే ఈ ఉపాసన ఫలించిందని ఎలా తెలుస్తుంది. దీనికి అవధి ఉందా?
వ్యతిహారాధికరణం ( 3, 3, 37 )
సూత్రం :- 396
" వ్యతిహారో విశింషంతి హీతరవత్ "
వ్యతి హారః :- ఉపాస్య, ఉపాసకుల్లో పరస్పరం ఏకరూపత బోధ పడడమే ఉపాసనకు అవధి అని తెలుసుకోవాలి. హి :- ఎందుకంటే, ఇతరవత్ :- ఇతర శాస్త్రాలు, విశింషంతి :- విశేషంగా వర్ణిస్తున్నాయి.
భావం :- ఉపాస్య, ఉపాసకుల్లో పరస్పరం ఏకరూపత బోధ పడడమే ఉపాసనకు అవధి అని తెలుసుకోవాలి. ఎందుకంటే ఇతర శాస్త్రాలు విశేషంగా వర్ణిస్తున్నాయి.
వివరణ:- ఉపాసకుడు ఉపాసన చేస్తూ, క్రమంగా ఉపాస్య బ్రహ్మంతో తనకు సారూప్యం ఏర్పడినట్లుగా అనుభవం పొందడం ప్రారంభిస్తాడు. ఈఅవస్థే ఉపాసనకు పరామవధి. ఇదే బ్రహ్మసాక్షాత్కారం. ఏకరూపత అంటే ఉపాసకుడు బ్రహ్మానందం అనుభవించడం. ఉపాసన పరాకాష్ట చెందినప్పుడు ఉపాసకుడు బ్రహ్మంతో తనకు ఏకరూపత కలిగినట్లు భావిస్తాడు. ఏకరూపతా భావం ఉన్నంత మాత్రాన జీవుడు, పరమేశ్వరుడు ఒక్కటే అని అనుకోకూడదు. అది ఉపాసకుడు బ్రహ్మానందం అనుభవించేస్థితి మాత్రమే. బ్రహ్మం ఆనందస్వరూపం. ఉపాసన పరామావధికి చేరినప్పుడు బ్రహ్మ తన స్వరూపాన్ని ఉపాసకుడుకి వెల్లడి చేస్తాడు.
ముండకోపనిషత్తు( 3, 3, 4):- ఉపాసనకు పరమావధి, వ్యతిహారం, ఉపాస్య, ఉపాసకుల ఏకరూపత జరుగుతుంది. ఇతర విషయాలలో లాగా జీవుడేబ్రహ్మ, బ్రహ్మేజీవుడు. ఉపాసకుడే సూర్యమండలం లోని పురుషుడు. ఆ పురుషుడే ఉపాసకుడు అని పఠిస్తున్నారు. ఈరకంగా రెండూ రూపాలను ఉపాసన చెయ్యాలా? లేక ఒకే విధమైన ఉపాసన చెయ్యాలా? అని సందేహం. ఒకే విషయాన్ని ఒకసారి అటు, ఒకసారి ఇటు చెప్పడం వ్యతిహారం. ఇక్కడ జీవేశ్వరుల పరస్పర విశేషణ విశేష్య భావం వ్యతిహారం. నేనే నువ్వు అన్నప్పుడు ఈశ్వరుడు విశేషణం. నేను అనే జీవుడు విశేష్యం. ఏకరూపమైన మతి చెయ్యాలని అంటున్నారు. ఇక్కడ జీవాత్మకు పరమాత్మతో ఏకాత్వన్ని ప్రతిపాదించడం తప్ప చెప్పవలసినది మరొకటి ఏమి లేదు. వ్యతిహారం చెప్పడం ఎందుకంటే ఏకత్వాన్ని దృఢం చెయ్యడం కొరకు నువ్వే నేను, నేనే నువ్వు అని చెప్పడంలో ఏకత్వాన్ని గట్టిగ నొక్కి చెప్పినట్లు అవుతుంది. ఆదిత్య మండలంలోని పరమాత్మ, కంటిలో ఉన్న అక్షి పురుషుడు ఒక్కరే.
సత్యాద్యధికరణం ( 3, 3, 38 )
సూత్రం :- 397
" సైవ హి సత్యాదయః "
హి :- ఏ కారణంతో, స ఏవ :- ఛాందోగ్యంలో చెప్పిన శాండిల్య విద్యనే బృహదారణ్యకంలో చెప్పారో, అదే కారణం వలన, సత్యాదయః :- ఛాందోగ్యం లో వర్ణించిన సత్య, సంకల్పాదులు,
భావం :- ఏ కారణంతో ఛాందోగ్యంలో చెప్పిన శాండిల్య విద్యనే బృహదారణ్యకంలో కూడా చెప్పారో, అదే కారణం వలన ఛాందోగ్యం లో వర్ణించిన సర్వేశానత్వాది గుణాలు పరస్పరం ఒక ఉపాసన నుంచి మరొక ఉపాసనలో గ్రహించాలి.
వివరణ:-గురువర్యా! బృహదారణ్యకంలో అహర్నాసమైన బ్రహ్మాన్ని ఈవిధంగా వ్యాహృతుల రూపంలో తెలుసుకొని ఉపాసన చేసేవాడు పాపాలను వదలివేస్తాడు. ఆ సత్యమే ఆదిత్యుడు. ఆదిత్యమండలం లోని పురుషుడే దక్షిణ నేత్రంలో ఉన్న పురుషుడు అని చెప్పబడింది. మరి ఈరెండు సత్యవిద్యలు ఒక్కటేనా? వేరువేరా? అని అడిగాడు కృష్ణశర్మ. దానికి సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. బృహదారణ్యకంలో చెప్పిన సత్యవిద్యలు రెండూ ఒక్కటే. ఈ రెండింటిలోనూ ఉపాస్యుడు హిరణ్యగర్భుడే.
ఛాందోగ్యోపనిషత్తు(3, 14, 1/2/3):- సర్వం ఖల్విధం బ్రహ్మ. " జ్యాయా నేభ్యో లోకేభ్యః " ఈ వాక్యంలో శాండిల్య విద్యను వర్ణించారు. బృహదారణ్యకంలో ( 5, 61 )లో చెప్పిన విద్య రెండూ ఒక్కటే.
శత పధ బ్రాహ్మణం(10, 6,3,2,):-"సఆత్మనా ముపాసీత మనోమయం ప్రాణ శరీరం భారూపమ్" లో ఉన్న శాండిల్య ఉపాసన, ఛాందోగ్యం లో వర్ణించిన దానితో సమానమే. పై ఉపాసనలన్ని ఒక్కటే. ఈ విద్యను శాండిల్యుడు ప్రారంభించాడు. మిగిలిన ఆచార్యులు దీన్నే వర్ణించారు. ఒక చోట ఉన్న విద్యను సర్వత్రా గ్రహించాలని సూత్రాభిప్రాయం. వాజసనేయంలో హృదయం అనే హిరణ్యగర్భుణ్ణి ప్రస్తావించి, సత్యవిద్య పఠించ బడింది. సర్వ వ్యాపకం, పూజ్యం, భౌతికము లన్నింటి కంటే ముందుగా పుట్టినది అయిన ఈ హిరణ్యగర్భుడనే బ్రహ్మను సత్యం బ్రహ్మ అని ఎవరు ఉపాసిస్తారో అతడు ఈ లోకాలను జయిస్తాడు. హిరణ్యగర్భుడనే పేరు గల బ్రహ్మమే సత్యం. సత్యమ్ మూడు అకారాలు గల పదం. స, త్, యమ్. 1, 3 అక్షరాలు సత్యమైనవి. మధ్యనున్నది అసత్యం. రెండూ ప్రక్కలా సత్యం చేత పరివృతమైనందున మధ్య నున్న అసత్యం కూడా సత్యమే అవుతుంది. హిరణ్యగర్భుడనే నామధేయం గల ఏ సత్యమున్నదో అదే ఆదిత్య మండలం లోని పురుషుడు. ఆ సత్యమే కుడి కంటిలో ఉన్న పురుషుడు. శాండిల్య విద్య, సత్య విద్యలలో పేర్కొన్న సత్య సంకల్పాదులు, గుణాలు ఒక ఉపాసన నుండి మరొక ఉపాసనలో గ్రహించాలి.
కామ్యాధికరణం ( 3, 3, 39 )
సూత్రం :- 398
" కామాది తరత్ర తత్ర చాయ తనాది భ్యః "
ఇతరత్ర :- బృహదారణ్యకం లో వర్ణించిన, కామాది :- సత్య కామం లాంటి గుణాలను, తత్ర చ :- ఛాందోగ్యంలో పేర్కొన్న దహర విద్యలో కూడా గ్రహించాలి. ఆయతనాదిభ్యః :- హృదయం ఆయతనాది సమాన ధర్మం వలన రెండు స్థలాలలో చెప్పిన విద్య ఒక్కటే.
భావం :- బృహదారణ్యాకంలో వర్ణించిన సత్య కామం లాంటి గుణాలను, ఛాందోగ్యంలో పేర్కొన్న దహర విద్యలో కూడా గ్రహించాలి. హృదయం ఆయతనాది సమాన ధర్మం వలన రెండు స్థలాలలో చెప్పిన విద్య ఒక్కటే.
వివరణ:- గురుదేవా! ఈ శరీరాన్ని బ్రహ్మపురం అంటారు. రాజ్యానికి అధికారులు, సేవకులు ఉన్నట్లే, శరీరానికి ఇంద్రియాలు, మనస్సు ఉన్నాయి. హృదయస్థానంలో ఒక పద్మం ఉన్నది. దాన్నే హృత్పద్మం అంటారు. అతడు ధర్మాధర్మ రహితుడు. జరా మృత్యువులు లేనివాడు. శోకరహితుడు. పాప రహితుడు. జరా మృత్యువులు లేనివాడు. కోరికలను వెంటనే పొందే శక్తి కలవాడు అని ఛాందోగ్యం లో చెప్పబడింది. బృహదారణ్యకంలో ఆత్మ గొప్పది. పుట్టుక లేనిది. అది ప్రాణమునందు, ఇంద్రియాలలో ఉంటుంది. విజ్ఞాన రూపమైనది. స్వయం జ్యోతి. దహరాకాశం లోనే ఈ పురుషుడు శయనిస్తాడు.అందరిని వశం చేసుకోగలుగుతాడు. ఛాందోగ్యంలోని విద్య సగుణము అని, బృహదారణ్యకం లోని విద్య నిర్గుణం అని అంటారు. కాబట్టి ఈ రెండింటికి భేదం ఉన్నదా? లేదా? వివరించండి అన్నాడు కృష్ణ శర్మ. సత్య కామత్వం మొదలైన గుణాలు బృహదారణ్యకం లోకి, బృహదారణ్యకం లోని సర్వ వశిత్వాది గుణాలు ఛాందోగ్యంలోకి ఉపసంహరించుకోవచ్చును. రెండింటి యందు హృదయమే ఆయతనం. బ్రహ్మమేఉపాస్యం. కాబట్టి ఇక్కడ సగుణ, నిర్గుణ భేదం ఉన్నప్పటికీ విద్యా స్తుతి కోసం ఉపసంహరించు కోవచ్చును.
ఛాందోగ్యోపనిషత్తు (8, 1, 1) ( 8, 1, 5 ):- హృదయంలో దహరాకాశం ఉన్నట్లు దహరోపాసన ప్రారంభించి సత్య కామాది గుణాలను వర్ణించారు. అలాగే బృహదారణ్యకం లో కూడా ( 4, 4, 22 ) ఆ పరమాత్మ ఈ హృదయంలో ఉన్న ఆకాశంలో ఉన్నాడు అన్ని చెప్పి హృదయాకాశంలో ఉన్న బ్రహ్మానికి వశత్వం లాంటి గుణాలున్నాయని వివరించారు. ఇలా రెండూ చోట్ల వర్ణించిన ఈ రెండూ విద్యలు ఒకటేనా? వేరా? ఛాందోగ్యంలో దహరాకాశం ఉపాస్యం అన్నారు. బృహదారణ్యకం లో హృదయాకాశం లో ఉన్న ఆత్మ ఉపాస్యం అంటున్నారు. ఎందుకీ స్వరూప భేదం? ఉపాసనల్లో తేడా ఉన్నదా? అంటే రెండూ చోట్ల హృదయ రూపమైన ఆశ్రయం ఒక్కటే. ఉపాసనకు ఆశ్రయం రెండూ చోట్ల హృదయమే. ఛాందోగ్యంలో చెప్పిన ఆకాశం అంటే బ్రహ్మమే ఆకాశం బ్రహ్మ వాచకమని ఇది వరకే చెప్పారు. రెండూ చోట్ల చెప్పిన దహరోపాసన ఒక్కటే. ఛాందోగ్యంలో వర్ణించిన గుణాలు బృహదారణ్యకోపాసనలోను, బృహదారణ్యకంలో వర్ణించిన గుణాలు ఛాందోగ్యంలో గ్రహించాలి. ఆ గుణయుక్త బ్రహ్మమే ఉభయత్రా ఉపాస్యమని గ్రహించాలి.
దహర విద్య :- బ్రహ్మ రంధ్రమునందు చిన్న కమలము, ఆ కమల మధ్యమున సూక్ష్మ మైన శూన్య స్థానం, ఆ శూన్యమే దహరాకాశం అనబడును. దీనిని తెలుసుకున్న వాడు బ్రహ్మను తెలుసుకొనును. ఈ తెలుసుకునే విద్యనే దహర విద్య లేక ప్రాణ విద్య అంటారు.
ఆదరాధికరణం ( 3, 3, 40 )
సూత్రం :- 399
" ఆదరాద లోపః "
ఆదరాత్ :- బ్రహ్మోపాసన అత్యంత ఆదరంతో చెయ్యాలి. అప్పుడే అలోపః :- అది ఏ లోపం లేకుండా ఉండి సఫలీ కృతం అవుతుంది.
భావం :- బ్రహ్మోపాసన అత్యంత ఆదరంతో చెయ్యాలి. అప్పుడే అది ఏ లోపం లేకుండా ఉండి సఫలీకృతం అవుతుంది.
వివరణ:-గురువర్యా! వైశ్వానరుడు భోజనసమయంలో ముందుగావడ్డించిన అన్నాన్ని హవనంచెయ్యాలి అంటే ప్రాణాహుతు లివ్వాలి. మొదటి ఆహుతి 'ప్రాణాయ స్వాహాః ' అంటే ప్రాణం తృప్తి పడుతుంది. దీని వలన నేత్రం, ఆదిత్యుడు, ద్యులోకం దేవతలు తృప్తి పడతారు. అందుకే వలన భోక్త సంతానం, పశువులు, తేజస్సు, బ్రహ్మ వర్చస్సు పొందుతాడు. రెండవ ప్రాణాహుతి ' వ్యానాయ స్వాహః ' దీని వలన వ్యాన వాయువు తృప్తి చెందుతుంది. అందువలన శ్రోత్రం, చంద్రుడు, దిక్కులు, అధిష్టాన దేవతలు తృప్తి పొందుతారు. అంటూ ప్రాణాహుతుల వలన ఫలితం చెప్పబడింది. ఒకవేళ ఎప్పుడైనా భోజనం చెయ్యక పోతే అంటే భోజనం లోపం కలిగినప్పుడు ప్రాణాగ్ని హోత్రానికి లోపం కలుగుతుందా? అన్ని ప్రశ్నించాడు కృష్ణ శర్మ. భోజనం లోపం కలిగినప్పటికి అగ్నిహోత్ర లోపం ఉండదు. అతిధుల వలన ముందు భోజనం చెయ్యాలి అని జాబాల శ్రుతి చెబుతున్నది. కాబట్టి ఒక వేళ భోజన లోపం కలిగినా ప్రాణాగ్ని హోత్రానికి లోపం కలుగదు. యోగ దర్శనంలో చెప్పినట్లుగా బ్రహ్మోపాసన దీర్ఘ కాలం, నిరంతరం, సత్కార బుద్ధితో, శ్రద్ధతో చేసినప్పుడే ఫలవంతమౌతుంది. ముముక్షువులు సంసారిక సుఖలన్నింటిని విడిచి బ్రహ్మోపాసనకు పూనుకుంటాడు.
కఠోపనిషత్తు ( 3, 14 ) :- సదా సచేతనుడై నిరంతరం అభ్యాస శీలుడై ఉండే వాడే ఈ దుర్గమ మార్గాన్ని తరించగలడు.
బృహదారణ్యకోపనిషత్తు ( 6, 2, 15 ) :- శ్రద్ధతో, తపస్సుతో, ఏకాంతంలో సత్య బ్రహ్మాన్ని ఉపాసిస్తారు. అప్పుడే బ్రహ్మ ప్రాప్తి కలుగుతుంది అని రెండింటిలో వర్ణించారు. ఇలా ఉపాసనతో ఆదరం ఉండాలని ప్రకటించారు. అలా చేసినప్పుడు ఉపాసన లోపించకుండా ఫలిస్తుంది. భోజనలోపం కలిగినప్పుడు మరొక ద్రవ్యాన్ని గాని ప్రతినిధి రూపంలో ఉపయోగించి ప్రాణాన్ని హోత్రం చెయ్యాలి. నిర్గుణ బ్రహ్మ విషయంలో ఉపాసన లేకపోయినా స్తుతి కోసం గుణాల లోపం ఉండకుండా బ్రహ్మోపాసన అత్యంత శ్రద్ధతో చేసినప్పుడే ఫలవంతమౌతుంది.
సూత్రం :- 400
" ఉపస్థితే త స్తద్వచనాత్ "
తత్ వచనాత్ :- ఛాందోగ్య వచనం చెప్పినట్లు, అతః :- ఈ బ్రహ్మోపాసన వలన, ఉపస్థితే :- బ్రహ్మ జ్ఞానం కలిగి మోక్షం వస్తుంది.
భావం :- ఛాందోగ్య వచనం చెప్పినట్లు ఈ బ్రహ్మోపాసన వలన బ్రహ్మ జ్ఞానం కలిగి మోక్షం వస్తుంది.
వివరణ:- దీర్ఘ కాలం నిరంతరం సత్కార బుద్ధితో బ్రహ్మాన్ని ఉపాసించినప్పుడే బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది. అదే మోక్షం. ఆదరాతిశయంతో ఉపాసించనివాడికి మోక్షం లభించదని భావం. భోజనం ద్రవ్యం దగ్గరగా ఉన్నప్పుడు ముందుగా లభించి నట్టి పదార్ధంతోనే ప్రాణాన్ని హోత్రం చెయ్యాలి. భోజనం లేకపోతే ప్రాణాహుతులుండవు. అంటే భోజనం దొరకనప్పుడు ప్రాణాగ్నిహోత్రానికి లోపమే. భోజనలోపం కలిగినప్పుడు మరొక ద్రవ్యాన్ని ఎలా ప్రతినిధిగా చేర్చగలం? సిద్ధంగా తినడానికి వచ్చిన అన్నాన్ని ఆశ్రయించి విధించబడిన ఆహుతులు కూడా అలాృటీ అన్నం లోపించినప్పుడు లోపిస్తాయి కాని మరొక ద్రవ్యం ఉదకం లాంటివి ప్రతినిధిగా కల్పించబడవు. ముఖ్యాగ్ని హోత్రంలో స్టండిలమే ( తేనే వంటి ప్రదేశం ) కాని వేరే లేదు. భోజనానికి ఏ కాలమో ఆ కాలంలోనే ఈ ప్రాణాగ్ని చేయబడాలి. ముఖ్యాగ్ని హోత్రానికి సంబంధించిన కొన్ని ఉపస్థనాది ధర్మాలు కూడా ఏదో విధంగా ఈ అగ్నిహోత్రం లో కుదరవు. అతిధులు భోజనం చేసిన తరువాత గృహ స్వామి భోజనం చెయ్యాలి అన్ని శాస్త్రము ఉండగా, అతిధుల కంటే ముందుగా ఎలా భోజనం చేస్తాడు అనే శంకకు అవకాశం లేదు. అనగా ఈ వాక్యం వైశ్వానర విద్యోపాసన చేసేవారికి వర్తిస్తుంది. అయితే ఈ వాక్యం చేత ప్రాణాగ్ని హోత్రం నిత్యమని చెప్పడానికి శక్యం కాదు. అందువలన భోజనానికి లోపం కలిగితే ప్రాణాగ్ని హోత్రానికి లోపమే.
తన్నిర్ధారణాధికరణం ( 3, 3, 42 )
సూత్రం :- 401
" తన్నిర్ధారణా నియమ స్తధ్రుష్టేః పృథక్ హ్య ప్రతి బంధం ఫలమే "
తత్ నిర్ధారణ అనియమః:-అలాంటి నియమం లేదు. తత్ దృష్టేః :- అది బ్రహ్మ దర్శనం కన్నా, పృథక్ :- వేరు, హి :- ఎందుకంటే, అప్రతి బంధః :- ప్రతిబంధం లేకపోవడమే దానికి ఫలం.
భావం :- అలాంటి నియమం లేదు. అది బ్రహ్మ దర్శనం కన్నా వేరు. ఎందుకంటే ప్రతిబంధం లేకపోవడమే దానికి ఫలం.
వివరణ:- ప్రతిబంధనాశనం, బ్రహ్మదర్శనం ఈ రెండూ బ్రహ్మోపాసనకు ఫలితాలే. ఉపాసనకు ప్రతి బంధకాలు నశించడం ఫలమనీ, ఆస్థితే బ్రహ్మజ్ఞానమనీ, దానికి మించిన బ్రహ్మజ్ఞానం మరొకటి లేదనీ అనుకోకూడదు. ఉపాసనవలన ప్రతి బంధకాలు నశించకుండానే బ్రహ్మజ్ఞానం కలుగుతుందనికూడా భావించకూడదు. బ్రహ్మదర్శనం, ప్రతిబంధకాలు లేకపోవడం వేరే. ఉపాసన వలన అడ్డంకులు తొలగిపోతాయి. కాని బ్రహ్మజ్ఞానం కలుగుతుందని నిర్ణయించడానికి వీలుకాదు. బ్రహ్మ విద్యకై సద్గురువును ఆశ్రయించి, దీర్ఘకాలం నిరంతర శ్రద్ధతో చేసిన బ్రహ్మోపాసన వలన బ్రహ్మజ్ఞానం కలగడానికి ప్రతిబంధకమైన చిత్తవిక్షేపాదులు సమూలంగా నశిస్తాయి. అంతఃకరణ శుద్ధం అయిన తరువాత చేసిన ఉపాసన వలన బ్రహ్మజ్ఞానం జనిస్తుంది. ఆత్మలోకి అంతర్ముఖత చెందడం వలన ఆత్మసాక్షాత్కారం పొందిన తరువాతే మోక్ష సిద్ధి లభిస్తుంది. బ్రహ్మదర్శనం, ప్రతిబంధకాలు నశించడం వేర్వేరు ఫలితాలిస్తాయని మహర్షి చెబుతున్నారు.
ముండకోపనిషత్తు ( 3, 1, 9 ) :- సూక్ష్మ వ్యాపక తత్త్వమైన పరమాత్మను చిత్త శుద్ధితో తెలుసుకోవాలి.
యోగ దర్శనం(1, 29) :- ఆత్మ చేతన జ్ఞానం. అంతరాయల భావం కలుగుతుంది. చేతనాచేతనాల వివేక సాక్షాత్కారమే ఆత్మ జ్ఞానం. ఆత్మసాక్షాత్కారం కలిగితే బ్రహ్మసాక్షాత్కారం సునాయాసంగా కలుగుతుంది. ఉపాసనల వలన ప్రతిబంధనాల నివారణ జరిగి, బ్రహ్మసాక్షాత్కారం కలుగుతుంది. కనుక ఉపాసనలు రెండూ ఫలాలే. ఉపాసనల వలన చిత్త విక్షేపాది ప్రతి బంధకాలు, చిత్తవ్యాపారాలు నశించి చిత్తం ప్రసన్నమౌతుంది. అప్పుడు ఋతంభరాప్రజ్ఞ ఏర్పడుతుంది. ఋతం అంటే సత్యం, భరా అంటే పూర్తి, సత్యంతో నిండిన ఆకాంక్షను ఋతంభరా అంటారు. శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మల మధ్య సమతౌల్యాన్ని తీసుకు వచ్చి, ఏకాగ్రత, సామర్ధ్యం, నిబద్ధత కలిగిస్తుంది. ఈ ప్రజ్ఞను సాధించ గలిగితే ఆ వ్యక్తి సాధువు, ఋషి, మహర్షి, రాజర్షి, దేవర్షి ఏమైనా కాగలడు. కొన్ని ఉపాసనలు కర్మాంగాలను ఆశ్రయించి ఉంటాయే కాని అవి కర్మంగాలు కావు. ఉపాసనలకు, కర్మలకు నిత్య సంబంధం లేదు అని వేదం చెబుతోంది. కర్మలకు, ఉపాసనలకు ఫలం వేరుగా చెప్పబడింది. కర్మ ఫలం వేరు. ఉపాసన ఫలం వేరు. కాబట్టి కర్మ ఫలం అనుభవించడానికి ఉపాసనలు ప్రతిబంధకాలు.
ప్రధానాధికరణం ( 3, 3, 43 )
సూత్రం :- 402
" ప్రదానవ దేవ తదుక్తమ్ "
ప్రదానం :- దానం యజ్ఞం లోపాన్ని తొలగిస్తుంది. ఏవ :- అలాగే, తత్ :- ఉపాసన ప్రతి బంధకాలను తొలగించి జ్ఞానానికి సాధనం అవుతుంది. ఉక్తం :- పూర్వ మీమాంస దర్శనం లో అన్నారు.
భావం :- దానం యజ్ఞ లోపాన్ని తొలగిస్తుంది. అలాగే ఉపాసన ప్రతి బంధకాలను తొలగించి జ్ఞానానికి సాధనం అవుతుందని పూర్వమీమాంస దర్శనంలో అన్నారు.
వివరణ:-యజ్ఞనిర్వహణలో యజ్ఞవేదికపై కూర్చుని, యజ్ఞాన్ని అనుష్టించే ఋత్విక్కులకు, యజ్ఞం ముగిసిన తరువాత ఇచ్చే వస్త్ర, ధనాదులను దక్షిణగా ఇస్తారు. విద్వాంసులైన బ్రాహ్మణులకు వస్త్రాలు, ధనం, బంగారం లాంటివి దానం చేస్తారు. దానినే యజ్ఞదక్షిణ అంటారు. ఆదక్షిణ ఇవ్వకపోతే యజ్ఞం సంపూర్ణం కాదు. అధి విశిష్ట దానం. కనుక దానిని ప్రదానం అంటారు. ఈప్రదానమే యజ్ఞలోపాన్ని తొలగించినట్లే, బ్రహ్మోపాసన కూడా చిత్త విక్షేపాది ప్రతి బంధకాన్ని తొలగిస్తూ బ్రహ్మ జ్ఞానానికి సాధనం అవుతుందని పూర్వ మీమాంసా దర్శనంలో చెప్పబడింది.
పూర్వ మీమాంస(3, 7, 11) :- యజ్ఞకర్మకు దీక్ష, దక్షిణ అనేవి ప్రధాన అంగాలు. ఎంతో దీక్షతో యజ్ఞం చేసి, బ్రాహ్మణులకు దక్షిణ ఇస్తేనే యజ్ఞఫలం దక్కుతుంది. అలాగే ఉపాసనకూడా అడ్డంకులన్నింటిని తొలగించి బ్రహ్మజ్ఞానం కలిగించడానికి సాధనం అవుతుంది. ఛాందోగ్యంలో సంవర్గ విద్యలో శరీరాన్ని ఉద్దేశించి ప్రాణాన్ని, దేవతలను ఉద్దేశించి వాయుధ్యానం సూచించబడింది. ఇప్పుడు చాలా గ్రంధాలు ప్రాణం, వాయువు ఒక్కటే నని ప్రకటించాయి. ఇక్కడ వాయువు, ప్రాణాన్ని విడి విడిగా భావించాలి. వాయువు వేరు ప్రాణం వేరు అన్ని శ్రుతులు చెబుతున్నాయి. ఇంద్రుడు ఒక్కడే అయినప్పటికీ అతని సామర్ధ్యల ప్రకారం రాజు, చక్రవర్తి, సార్వభౌముడు అన్ని విడి విడిగా అర్పణలు ఇచ్చినట్లు గుణ భేదాల చేత వేరేవుతున్నారు. అట్లే వాయుప్రాణాలను స్వభావంలో తేడా లేనప్పటికి వాటిని వేరుగా ఉంచాలి. ఎందుకంటే వారి వేరు వేరు నివాసాల కారణంగా వారి విధులు భిన్నంగా ఉంటాయి. వాయు తత్వం లో భేదం లేకపోయినా ఆధ్యాత్మ, అధి దైవత స్థానాలను బట్టి వాయువు, ప్రాణం అనే వాటి ఉపాసనలు వేరు వేరుగానే ఉన్నాయని జైమినిమహర్షి పూర్వ మీమాంస లో తెలియజేశారు.
లింగభూయస్త్వాధికరణం ( 3, 3, 44 )
సూత్రం :- 403
" లింగ భూయస్త్వాత్తద్ధి బలీయస్త దపి "
లింగ భూయస్త్వాత్ :- బహుళమైన ప్రమాణాల వలన, తత్ హి :- ఆ బ్రహ్మ జ్ఞానమే, బలీయం :- బలీయమైన సాధనం, అని, తత్ అపి :- శాస్త్రాల్లో చెప్పి యున్నారు.
భావం :- బహుళ ప్రమాణాల వలన ఆ బ్రహ్మ జ్ఞానమే బలీయ మైన సాధనం అన్ని శాస్త్రాల్లో చెప్పి యున్నారు.
వివరణ:- మనసుచేత చింతింపబడిన దానిని మనశ్చిత్తం అంటారు. శతపధబ్రాహ్మణంలో మనస్సు చేత చింతింపబడినట్టి, వాక్కుచేత సంపాదింపబడినట్టి, ప్రాణం, చక్షవులు, శ్రోత్రము, మొదలైన వాటి చేత సంపాదించబడిన వాటి వాటి వృత్తి రూపమైన ముప్పై ఆరువేల అగ్నులను చూసింది అన్ని చెప్పబడింది. మనోవృత్తులు అసంఖ్యాకములైనా కూడా మానవుని ఆయుర్దాయం 100 సం. 100×360= 36000 అహోరాత్రులలో కలిగే మనో వృత్తులు 36000 అని చెప్పబడింది. వీటిని అగ్నిగా, సూర్యునిగా, ఆత్మస్వరూపులుగా భావించి ధ్యానించ వచ్చును.ఇవి మనస్సుచేత సంపాదించబడిన మనశ్చితాలు. ఈ విధంగా మనస్సు మొదలైన వాటి చేత చింతింప బడినవిగా చెప్పబడినటువంటి అగ్నులు కర్మలకు సంబంధించినవా? లేక ఉపాసనకోసం చెప్పా బడినవా? అని శంక. ఈ అగ్నులన్నీ స్వతంత్రములు. ఈ భూతములు, ప్రాణులు మనస్సులో ఏమి సంకల్పించినా అవన్నీ ఈ అగ్నులే చేస్తాయి. ఉపాసకుడు నిద్రపోతున్నా మేల్కొని ఉన్నా అతని కోసం ఈ సమస్త భూతాలు ఎల్లవేళలా ఈ అగ్నుల్ని సంపాదిస్తూనే ఉంటాయి. కనుక ఇవన్నీ స్వతంత్రములే. వీటిని మనోమయం, మనోరూపాలు అంటారు. అట్లే వాక్కు, ప్రాణం మొదలైనవి కూడా తమ తమ వృత్తిలే రూపాలుగా గల వృత్తులను చూచాయి.
ఛాందోగ్యోపనిషత్తు(7, 1, 3):-తరతిశోక మాత్మవిత్ బ్రహ్మాన్ని ఎరిగిన వాడు బ్రహ్మరూప మోక్షపదాన్ని పొందుతాడు. బ్రహ్మ జ్ఞాని మోక్షాన్ని పొందుతాడు. వ్యాపకుడైన పరమాత్మను ఎరిగినవాడు దుఃఖాన్ని తరించి ఆనందరూప మోక్షాన్ని పొందుతాడు. బ్రహ్మ జ్ఞానమే మోక్షసాధనమని బోధించారు.
సాంఖ్య దర్శనం ( 3, 23 ) :- బ్రహ్మ జ్ఞానమే ముక్తికి మార్గం.
యజుర్వేదం ( 30, 18 ) :- ఈశ్వరుణ్ణి తెలుసుకొని మృత్యువును తరిస్తాడు. కనుక బ్రహ్మజ్ఞానమే ముక్తి సాధనం అన్ని సిద్ధాతం. బ్రహ్మజ్జానమే మోక్షానికి బలీయమైన సాధనమని ఆధ్యాత్మ శాస్త్రాల్లో చెప్పియున్నారు.
లింగ భూయస్త్వాధికారణము ( 3, 3, 45 )
సూత్రం :- 404
" పూర్వ వికల్పః ప్రకారణాత్ స్యాత్ క్రియా మానసవత్ "
ప్రకారణాత్ :- మోక్షానికి జ్ఞానం, కర్మ రెండూ సాధనలని చెప్పారు. పూర్వ వికల్పః స్యాత్ :- వైకల్పికంగా జ్ఞానం లాగా కర్మ కూడా సాధనం. క్రియా మానసవత్ :- బాహ్య క్రియ అయిన అగ్ని హోత్రానికి, మానసిక క్రియ వికల్పం కదా!
భావం :- ఇది పూర్వ పక్ష సూత్రం. మోక్షానికి కర్మ, జ్ఞానం రెండూ సాధానాలని చెప్పారు కనుక వైకల్పికంగా జ్ఞానం లాగా కర్మ కూడా సాధనమౌతుంది. బాహ్య క్రియ అయిన అగ్ని హోత్రానికి మానసిక క్రియ వికల్పం కదా!
వివరణ:- మోక్షానికి జ్ఞానం, కర్మ రెండూ సాధనలే కదా! అందువలన కేవలం జ్ఞానమే సాధనం అనడం ఎలా పొసగుతుంది? బాహ్య క్రియ అయిన అగ్ని హోత్రానికి మానసిక క్రియ వికల్పం కదా! అన్ని పూర్వ పక్ష వాదన.
కౌషీతకీ బ్రాహ్మణం(2, 4, 5):- ఏతా ఆజ్యాహుతేర్జుహాతి వాచంతే మయి జుహా మ్యసౌ స్వాహా " అన్ని మొదటి వాక్కు ప్రాణం లాంటి వాటి బాహ్య కర్మలు చెప్పి, తరువాత దాన్నే మానసకర్మ రూపంలో వర్ణించారు. ( 2, 4, 6 ) :- ఇక్కడ మానసిక అగ్నిహోత్రాన్ని వర్ణిస్తున్నారు. మనిషి మాట్లాడినంత సమయం ప్రాణాన్ని గ్రహించలేదు. శ్వాసించ లేదు. అప్పుడు వాక్కుతో ప్రాణాన్ని ఆహుతి చేస్తాడు. అలాగే శ్వాస తీసుకునేటప్పుడు మాట్లాడలేడు. అప్పుడు శ్వాసతో వాక్కును ఆహుతి చేస్తాడు. అవి అమృతాహుతులు. వీటికి అంతం లేదు. ఇవి అనంతాలు. జాగ్రదావస్థలోను, నిద్రలోనూ ఎప్పుడు ఈ అగ్నిహోత్రం జరుగుతూనే ఉంటుంది. ఇతర బాహ్య ఆహుతులు అల్పమైనవి. వాటికి అంతం ఉంది. పూర్వ విద్వాంసులు ఈ హోమం చేసే వారుకాదు. ఈశావాస్యంలో కూడా మోక్షాన్ని కర్మద్వారా కాని, జ్ఞానంద్వారా కాని పొందవచ్చును. జ్ఞానమొక్కటే సాధనమని అనడం తగదు. అందువలన కర్మ, జ్ఞానాలు వైకల్పికాలు అన్ని తెలుస్తోంది కదా! యావజ్జీవితం కర్మలు చేయాలని విధించారు. తరువాత ఆత్మ జ్ఞానాన్ని ఉపదేశించి జ్ఞానంతో అమృత ప్రాప్తి కలుగుతుందన్నారు. ఒకే ప్రకరణం లో కర్మ, జ్ఞానం గురించి చెప్పారు. దీని వలన ఒకప్పుడు కర్మ వలన, మరొకప్పుడు జ్ఞానం వలన మోక్షం లభిస్తుందని తెలుతోంది. కనుక కర్మ, జ్ఞానం రెండూ వైకల్పిక సాధనా లవుతున్నాయి.అప్పుడు కేవలం జ్ఞానం మాత్రమే సాధనం అనడం పోసగడం లేదు.
సూత్రం :- 405
" అతి దేశాచ్చ "
చ :- పైగా, అతిదేశాత్ :- ఒక దాని ధర్మం మరో దానిలో ప్రాప్తించడం వలన, వికల్పం అనడం సబబే.
భావం :- ఒక దాని ధర్మం మరో దానిలో ప్రాప్తించడం వలన వికల్పం అనడం సబబే అన్ని స్పష్టమౌతోంది.
వివరణ:- ఒక ధర్మాన్ని ఇంకొక దాని యందు ఆరోపించడాన్ని అతిదేశం అంటారు. ఈ అతి దేశం వలన కూడా ఈ అగ్నులు క్రియాంగాలే అన్ని పూర్వ పక్షం వారి వాదన.
ఈశావాస్యోపనిషత్తు(14, 11) :- మృత్యువును తరించడం, అమృతాన్ని పొందడం, రెండూ ఒక్కటే. మొదటిది కర్మ ఫలం, రెండవది జ్ఞానఫలం కార్యం. ఇలా ఒక సాధనా కార్యాన్ని, ఇంకొక సాధన కార్యంగా చెప్పారు. కనుక మోక్షానికి జ్ఞాన కర్మలు, వైకల్పిక సాధనాలు కదా! అగ్ని కర్రలను ఏ విధంగా దహనం చేస్తుందో అలాగే జ్ఞానం కర్మలను భస్మం చేస్తుంది. జ్ఞానాన్ని మించినది లేదు. కర్మయోగసిద్ధిని పొందిన వాడు జ్ఞానాన్ని తనలోనే తెలుసుకుంటాడు. జ్ఞానం అంటే స్వస్వరూప జ్ఞానం. నీ యొక్క అసలు రూపమే సచ్చిదానంద స్వరూపం. ఈ శరీరం నీది కాదు. నువ్వు ఆత్మవు అన్ని తెలుసుకోవడం. ఈశ్వరార్పితంగా కర్మలు చేస్తూ, సద్గురువులను వినయంతో సేవించి, ప్రార్ధించి జ్ఞానాన్ని గ్రహిస్తే సర్వభయాలనుండి, బంధాల నుండి, సంచిత కర్మలను నుండి విముక్తి పొందడమే ముక్తి. అదే మోక్షం. ఈ జ్ఞానం వలన జ్ఞానాగ్ని పుడుతుంది. దీనిలో సర్వ కర్మలు నశించిపోతాయి. దానితో మృత్యువు నుండి తరించడం, అమృతత్వాన్ని పొందడం జరుగుతుంది.కర్మ ఫలం ద్వారా జ్ఞాన ఫలాన్ని సాధించవచ్చునని తెలియ జేశారు.
సూత్రం :- 406
" విద్వైవ తు నిర్ధారణాత్ "
తు :- ఈ వాదన సరియైనది కాదు. నిర్ధారణాత్ :- జ్ఞాన కర్మలను వేర్వేరుగా నిర్ధారించారు. కనుక విద్య ఏవ :- జ్ఞానమే మోక్ష సాధనం.
భావం :- ఈ వాదన సరియైనది కాదు. జ్ఞాన కర్మలను వేరువేరుగా నిర్ధారించారు. కనుక జ్ఞానమే మోక్ష సాధనం అని చెప్పియున్నారు.
వివరణ:- ముందు సూత్రంలో చెప్పినట్లుగా మోక్షసాధనానికి జ్ఞాన, కర్మలు వైకల్పిక సాధనలు అన్ని చెప్పడం సరియైనది కాదు. ఉపనిషత్తులో బ్రహ్మజ్ఞానమే మోక్షసాధనంగా చెప్పారు. బ్రహ్మసాక్షాత్కారం తప్ప మరొకటి మోక్షసాధనం కాదని నిర్ధారించారు. జ్ఞానమే మోక్ష సాధనమని, కర్మ జ్ఞానానికి సాధనమని చెప్పియున్నారు.
ఈశావాస్యోపనిషత్తు:- నిష్కామ కర్మ చిత్తంలోని విక్షేపాది ప్రతి బంధకాలను తొలగించి, జ్ఞానోదయానికి సాధనం అవుతుంది. అందువలన వికల్పానికి తావు లేదు. నిష్కామకర్మ లో ఇంద్రియ నిగ్రహం కలిగి, బుద్ధి యందు సర్వేంద్రియీలు నిక్షిప్తం చేసి, సదా ఆ అంతరంగిక యజ్ఞము నందు నిమగ్నడై ఆత్మనుభూతి చెందుతాడు. సామాన్య వ్యవహారంలో సుఖ దుఃఖాసక్తి పొందక ఇంద్రియ వ్యాపారముల యందు నిమగ్నం కాక, ఆత్మానందం పొందిన వాళ్లే జ్ఞానులు. అంటే కర్మ ఫలాలు జ్ఞానాన్ని కలిగిస్తాయి కాని మోక్షాన్ని ఇవ్వవు. జీవితంలో ఒక రోజులో పుట్టే ఆలోచనలన్నీ ఒక మనోవృత్తి అనుకుంటే జీవితంలో ముప్పై ఆరు వేల మనోవృత్తులంటాయి. ఇవి మనస్చితాలు. ఈ విధంగా మనస్సు చేత చింతింపబడినవిగా చెప్పబడిన ఈ అగ్నులు కర్మంగాలు కావు. ఈ మనస్చిదాగ్నులు స్వతంత్రమైన విద్యాత్మకాలు. ఇది తెలుసుకున్న ఉపాసకుడు వీటిని అగ్నిగా, సూర్యునిగా, ఆత్మ స్వరూపులుగా భావించి ధ్యానించి, సంపాదించ గలుగుచున్నాడు.
సూత్రం :- 407
" దర్శనాచ్చ "
దర్శనాత్ చ :- ప్రమాణాలైన దర్శనాల వలన కూడా జ్ఞానమే మోక్ష సాధనమని నిర్ణయించాలి.
భావం :- ప్రమాణాలైన దర్శనాల వలన కూడా జ్ఞానమే మోక్ష సాధనమని నిర్ణయించాలి.
వివరణ :- (3, 3, 44) సూత్రంలో చెప్పిన ఉదాహరణలను సమన్వయం చేసుకోవాలి. వాటి వలన జ్ఞానమే మోక్ష సాధనం అని తెలుస్తోంది. ఇందుకు లింగం కనబడటం వలన కూడా ఇవి విద్యలే. ఇవి స్వతంత్రమైనవి అని చెప్పడానికి లింగం కూడా కనబడుచున్నది. వాక్చితాగ్ని, ప్రాణ చితాగ్ని, ఘ్రాణ చితాగ్ని, చక్షు చితాగ్ని, కర్మ చితాగ్ని అంటే హస్త కర్మేంద్రియాల చేత చితమైన అగ్ని, ఇవన్నీ అగ్నిచయన ప్రకరణం. సమస్త భూతాలు మనస్సు చేత దేనినైనా సంకల్పిస్తే అది ఈ అగ్నుల పనియే అని తెలుస్తోంది. ఈ విధంగా తెలుసుకున్న వాడు మెలకువగా ఉన్నా, నిద్రిస్తున్నా, సమస్త భూతాలు వాని కోసం అగ్ని చయనం చేస్తుంటాయి. ఎవరైతే నిష్కామకర్మ చేస్తారో తనలోనే స్వస్వ రూపాన్ని చూస్తాడో, ఆ ఉపాసకుడు ఆత్మానందం పొందే జ్ఞానం సంపాదిస్తాడు. ఆ జ్ఞానమే మోక్షానికి సాధనమని తెలుస్తోంది.
సూత్రం :- 408
" శ్రుత్యాది బలీయ స్త్వాచ్చ న బాధః "
శ్రుతి అది బలీయ స్త్వాత్ చ :- శ్రుతి వాక్యాలకే ఎక్కువ బలం ఉంది. కనుక, న బాధః :- మిగతా వాక్యాలలో భేదం లేదు.
భావం :- శ్రుతి వాక్యాలకు ఎక్కువ బలం ఉంది, కనుక మిగతా వాక్యాలలో భేదం లేదు.
వివరణ :- శ్రుతి, లింగ వాక్యాలు ప్రకరణ కన్నా బలమైనవి. కాబట్టి ఈ అగ్నులు స్వతంత్రములు అనడానికి సంశయం లేదు. ఈ విషయం తెలుసుకున్న ఉపాసకుడు నిద్రిస్తున్నా, మేల్కొన్నా అతని కోసం ఈ భూతాలన్నీ అగ్ని రచన చేస్తూనే ఉన్నాయి. ఇలాంటి శ్రుతి వాక్యాల వలన అగ్నులు కర్మాంగాలు కావు.
మీమాంస దర్శనం(3, 3, 14 ) :- శ్రుతి, లింగం, వాక్యం, ప్రకరణం, స్థానం, సమాఖ్య అనే ఈ ఆరింటిలో తేడా ఉంటే, తరువాత దాని కన్నా ముందు పదమే బలీయం అవుతుంది. శ్రుతి అన్నింటి కన్నా బలీయమైనది. ప్రకరణాల కన్నా వేద వాక్యాలకే బలం ఎక్కువ. ఇతర వాక్యాలు వాటిని బాధించవు. కనుక జ్ఞానమే మోక్ష సాధనం. ఏ మంత్రాన్ని ఏ కర్మ యందు వినియోగించాలి? ఏది దేనికి అంగం అని నిర్ధరించడానికి శ్రుతి, లింగమ్, వాక్యం, ప్రకరణం, స్థానం, సమాఖ్య అనేవి ఉపయోగపడతాయి. శ్రుతి మిగతా వాటి కన్నా బలీయమైనది. లింగం తరువాత నాలుగింటి కన్నా బలీయమైనది . వాక్యం... ప్రకరణం, స్థానం, సమాఖ్య కన్నా బలీయమైనది.
1.శ్రుతి :- ఇతరాపేక్ష లేకుండా ప్రత్యక్షంగా ఒక విషయం లో విధించే శబ్దం. " కదాచన స్తరీరసి" ఇది ఇంద్రుణ్ణి స్తుతించే మంత్రం. (ఇది లింగం ) అయితే ఐన్ద్ర్యా గార్హ పత్య ముపతిష్ఠతే " (ఇది శ్రుతి ) ఈ ఇంద్రదేవతాకమైన మంత్రం చేత గర్హ పత్య అగ్నిని స్తుతించాలి. ఈ శ్రుతి లింగం కన్నా బలీయం కనుక దీని చేత ఇంద్రుణ్ణి స్తుతించాలి. 2. లింగం :- దర్శ పూర్ణమాస ప్రకరణంలో పురోడాశాన్ని ( అగ్నికి ఇచ్చే ఆహుతి ) " స్యోనం తే సదనం కరోమి, ఘృతస్య ధారయా సుశేవం కల్పయామి తస్మిన్ సీదామృత్ ప్రతితిష్ట వ్రీహీణాం మేధ సుమన్య మానః " ఓ! పురోడాశమా! నీకు మంచి కల్పిస్తున్నాను. ఆ స్థానంలో కూర్చో! స్యోనం కల్పయామి దీని అర్ధాన్ని బట్టి ఈ మంత్రం సదనానికి, స్థానం ఏర్పరచడానికి అంగం అని తెలుస్తోంది. తరువాత వాక్యం కలిపితే కూర్చోబెట్టగల అనే అర్ధం వస్తుంది. మొదటి లింగాన్ని బట్టి ఈ పూర్వార్ధం సదనానికి అంగమని గ్రహించాలి. ఈవిదంగా వాక్యంకన్నా లింగం బలీయమైనది. 3.వాక్యం:-"ఇంద్రాగ్నులు దర్శయాగ దేవతలు " ఇంద్రాగ్ని ఇదం హవిరజుషేతాం మహాజ్యుయో క్రాతామ్ " అనే సూత్రంలో ఇంద్రాగ్ని అనే లింగం ఉండటం చేత అది దర్శాంగం అని తెలుస్తోంది. 'ఇదం హవిః 'వాక్యం ఇంద్రాగ్నిలో అన్వయిస్తుంది. ప్రకరణం కంటే వాక్యం బలేయమైనది. 4.ప్రకరణం :- అంటే పరస్పరాకాంక్ష. దీనిలో రెండూ విషయాలు చెప్పబడ్డాయి. 1. ఏమి చెయ్యాలి? అనే ఆకాంక్ష. 2. ఇది చేసి దేనిని సంపాదించాలి? అనే ఆకాంక్ష ఉంటుంది. అప్పుడు రెండూ కలిపి అన్వయించుకుంటే ఎలా చెయ్యాలో, ఏమి చెయ్యాలో తెలుస్తుంది. 5.స్థానం :- ఒకే ప్రదేశంలో చెప్పడం, లేదా చెయ్యడం. పాఠం కాని, అనుష్టానం కాని ఒకే ప్రదేశంలో చెయ్యడం. 6. సమాఖ్య :- యోగార్ధం చెప్పడానికి వీలున్నప్పుడు శబ్దం." హోతృ చమనః " హోత యొక్క చమనం అని అర్ధం. ఈ అర్ధాన్ని బట్టి హోత అనే ఋత్విక్కు చమన భక్షణానికి అంగం అని తెలుస్తోంది. స్థానం అనేది మిగిలిన ఐదింటి కన్నా దుర్భలం.
సూత్రం :- 409
" అనుబంధా దిభ్యః ప్రజ్ఞాన్తర పృధ క్త్వవద్ దృష్ట వచ్చ తదుక్తం
" ప్రజ్ఞాంతర పృధక్త్వవత్ :- ఉపాసకులు ఫలాన్ని బట్టి వేరే అయినట్లుగా, అనుబంధాదిభ్యః దృష్ట వత్ :- కర్మలకు వేరే ఫలాన్ని చూస్తున్నాం, చ :-అందువలన, కర్మకు జ్ఞానం తో వికల్పం లేదు. తదుక్తం :- శాస్త్రాల్లో చెప్పారు.
భావం :- ఉపాసకులు ఫలాన్ని బట్టి వేరే అయినట్లుగా, కర్మలకు వేరే ఫలాన్ని చూస్తున్నాం. అందువలన కర్మకు జ్ఞానంతో వికల్పం లేదు.
వివరణ:- అనుబంధం మొదలైన వాటి వలన కూడా మనస్చిదాదులకు కర్మాంగత్వం లేదు. ఇవి స్వతంత్రాలు. అవేష్టి అనే క్రతువును రాజసూయం నుండి పైకి తీసినట్లుగా మనస్చితాదులను కర్మ ప్రకరణం నుండి విడదీయాలి. అవి కర్మంగాలు కావు. ఉపాసన గాని, కర్మానుస్థానం గాని ఏదో ఒక విశేష ఫలం కోసం గాని చేస్తారు. కనుక ఫలభేదం వలన ఉపాసనల్లో భేదం ఉంది. అంతే కాని ఒకానొక ఫల ప్రాప్తి కోసం ఉపాసనల్లో వికల్పం కల్పించలేము. అలాగే జ్ఞాన కర్మల ఫలాలు కూడా భిన్నంగా ఉంటాయి. మోక్షం, మృత్యు తరణం, ప్రతి బంధకాలు తొలగిపోవడం లాంటి ఫలాలు. ఇంతే కాక వీటి సాధనలోను అనుష్టానాలోనూ తేడాలుంటాయి. ఉపాసన కోసం చేసే సాధనానుష్ఠానాలు వేరు, కర్మ కోసం చేసే సాధనానుష్ఠానాలు వేరు. కనుక వీటిలో వికల్పం లేదు. ఒకదాని ఫలం మరొకటి సాధించదు. ఇదివరలో ఈశావాస్యోపనిషత్తు మంత్రాల్లో జ్ఞాన కర్మల ఫలభేదాలు చెప్పబడ్డాయి.
మనుస్మృతి(12,104):-విప్రుడికి తపస్సు, కర్మ, విద్య, జ్ఞానం, మోక్ష ప్రదాయకాలు. ఇందులో తపస్సు పాపాలను తుడిచివేస్తుంది. జ్ఞానంతో అమృతత్వం పొందుతారు. ఇలా కర్మకుఫలం భిన్నంగా నిశ్చయించినప్పుడు అది జ్ఞానానికి వికల్పం ఎన్నడూ కానేరదు. మోక్షం కోసం జ్ఞాన కర్మతో వికల్పం లేదంటున్నారు. ఉపాసనలన్నింటికి సమాన ఫలమే. వాటి అనుష్ఠానంలో వికల్పం అంగీకరించాలి. ఒకలక్ష్యాన్ని చేరుకోవడానికి అనేకమార్గాలు ఉన్నప్పుడు, ప్రతివ్యక్తి ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొని లక్ష్యాన్ని చేరతాడు. ఉపాసనలన్నింటికి లక్ష్యం బ్రహ్మ ప్రాప్తి. కనుక ఏదో ఒక ఉపాసన అనుష్ఠించి ముముక్షువులు బ్రహ్మప్రాప్తిని పొందుతారు. అందువలన ఉపాసనల అనుష్ఠానంలో వికల్పం ఉన్నది. యజ్ఞ ఫలాలు భిన్నంగా ఉంటాయి. విభిన్న ఫలాలు కోరుకునే వ్యక్తి విభిన్న యజ్ఞ కర్మలు చెయ్యాలి. అక్కడ సమచ్చయమే కాని, వికల్పం పనికి రాదు.
సూత్రం :- 410
" న సామాన్యాద ప్యులబ్ది ర్మృుత్యు వన్నహి లోకాపత్తిః "
సామాన్యాదపి :- సామాన్యంగా పరిశీలించి చూస్తే కూడా, న :- జ్ఞానానికి, ఉపాసనతో వికల్పం లేదు. ఎందుకంటే, ఉపలబ్ధే :- ఫలాలు వేరు వేరుగా లభిస్తాయి. మృత్యు వత్ :- మృత్యు పదం, నహి లోకా పత్తిః :- లోక సంహారం చేయలేదు కదా!
భావం :- సామాన్యంగా పరిశీలించి చూస్తే కూడా, జ్ఞానానికి ఉపాసనతో వికల్పం లేదు. ఎందుకంటే ఫలాలు వేరు వేరుగా సాధనలు లభిస్తాయి. మత్యు పదం లోక సంహారం చేయలేదు కదా!
వివరణ:- మృత్యు శబ్దం లాగా మనశ్చితాది అగ్నులకు మానసత్వ సాదృశ్యం ఉన్నప్పటికీ అవి క్రియంగాలు కావని శ్రుతుల వలన తెలుస్తోంది. ఫలాలు వేరుగా లభించడం వలన జ్ఞాననామంతో సామ్యంఉన్నా, జ్ఞానానికి,ఉపాసనతో వికల్పం కలుగదు. జ్ఞానానికి విద్య, లేక ప్రజ్ఞ అంటారు. ఉపాసనను కూడా విద్య అంటారు. ఉపాసన కూడా ఒక రకంగా జ్ఞాన రూపమే. కాని ఇవి మోక్షానికి వైకల్పిక సాధనలు కావు. ఎందుకంటే జ్ఞానానికి, ఉపాసనకు భిన్న ఫలాలు ఉన్నాయి. అగ్నికి, పరమేశ్వరుడికి మృత్యువు అనే పేరుంది.
బృహదారణ్యకోపనిషత్తు ( 3, 2, 10 ):- అగ్నే మృత్యువు. అది వస్తువులను నాశనం చేస్తుంది.
శతపధబ్రాహ్మణం ( 10, 5, 23 ) :- సమస్త విశ్వ లోక సంహారకుడైన పురుషుడే మృత్యువు అని ఈశ్వరుడికి మృత్యువు అని పేరు. మృత్యువు అనే పేరు, నాశనం - అగ్నికి, ఈశ్వరుడికి సమానం కాగా, అగ్ని ఈశ్వరుడిలా సర్వ సంహారకుడు కానేరడు కదా! అగ్ని ఈశ్వరుడికి వికల్పం కాలేడు. జ్ఞానానికి ఫలం మోక్షం. ఉపాసనకు ఫలం చిత్తశుద్ధి. కనుక జ్ఞానానికి ఉపాసన విద్య వికల్పసాధనం కాదు. పురుషుడే మృత్యువు, అగ్నియే మృత్యువు అను వాక్యాల చేత అగ్న్యాదిత్య పురుషుల విషయంలో మృత్యుశబ్దం సమంగానే ప్రయోగించబడినా కూడా రెండింటికి పూర్తి స్వామ్యం ఏ విధంగా లేదో అట్లే ఇక్కడ కూడా. ఓగౌతమా! ఈ లోకమే అగ్ని, ఆదిత్యుడే సమిధి. అనే చోట సమిధులు మొదలైన వాటితో సామ్యం చెప్పినంత మాత్రాన లోకం అగ్నిత్వాన్ని పొందదు. జ్ఞాన విద్యకు, ఉపాసన విద్యకు అనుష్టానం ఒకటే అయినప్పటికీ వాటి ఫలాలు వేరుగా ఉంటాయి. జ్ఞానానికి, వికల్పంతో వికల్పం కలుగదు.
సూత్రం :- 411
" పరేణ చ శబ్దస్య తాద్విధ్యం భూయస్త్వాత్త్యనుబంధః "
చ :- పైగా, పరేణ :- జ్ఞానం వలన మోక్షం కలుగుతుందనేది నిశ్చయం. శబ్దస్య తాద్విధ్యం :- ఇది ఇలాగ అని శాస్ట్రాల్లో విధించారు. భూయస్త్వాత్ :- అలాంటి శాస్త్ర నిర్ణయం వలన, అనుబంధః :- జ్ఞానానికి మోక్షం తో సంబంధం ఉందని తేలుతోంది.
భావం :- పైగా జ్ఞానం వలన మోక్షం కలుగుతుందనేది నిశ్చయం. ఇది ఇలాగ అని శాస్త్రాల్లో వివరించబడింది.. అలాంటి శాస్త్ర నిర్ణయం వలన జ్ఞానానికి మోక్షంతో సంబంధం ఉందని తెలుస్తోంది.
వివరణ:- జ్ఞానానికి మోక్షంతో సంబంధం ఉందని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. పూర్వం అంటే కర్మ, పరం అంటే జ్ఞానం. పర శబ్దం ఇక్కడ జ్ఞానార్ధకం. ఆధ్యాత్మికశాస్త్రాల్లో ఎన్నోచోట్ల జ్ఞానం వలనే మోక్షం లభిస్తుందనే విషయం తెలియబడింది. ఉపాసకుడు ఎవరు? ఉపాసన దేహంతో చేస్తాం కదా! దేహం నశిస్తుంది కదా! దేహానికి అతిరిక్తంగా ఉపాసన ఉన్నదా? మోక్షం ఎవరికీ లభిస్తుంది? అని సందేహాలున్న సూత్రం ఉత్తరబ్రాహ్మణాన్ని, పూర్వబ్రాహ్మణాన్ని బట్టి మనశ్చిదాదులను చెప్పే ఈ బ్రాహ్మణంకూడా అటువంటిదే. కేవలం విద్యావిధిత్వం కలిగినటువంటిది. మానసికాగ్ని విద్యలో సంపాదింపదగిన కర్మంగాలు అనేకం ఉన్నాయి. కాబట్టి ఈ మానసికాగ్ని స్వతంత్రమైన పురుషార్ధ హేతువు అని, ఈ అగ్నులు ఉపాసనాత్మకాలు కాని కర్మంగాలు కావు. భగవంతుడు మానవజన్మ ఇవ్వడానికి కారణం మోక్షాన్ని సాధించడానికే. మోక్షం అంటే ఆత్మ యొక్క స్వస్వరూపమే గాని మరొకటి కాదు. ఆరోగ్యం అనేది జీవుడి యొక్క స్వరూపం. కాని వేడిమి, చల్లదనం వలన వాత, పిత్త, కఫాలు ఎక్కువకావడం వలన శారీరిక వ్యాధి కలిగి, దాని నివారణకు ఔషధాలు సేవిస్తారు. వ్యాధి రాక ముందు ఆరోగ్యంగానే ఉన్నారు. అదే విధంగా మోక్షం అనేది మనయొక్క స్వరూపం. దానిలో బంధనం అనే భ్రమ ఏదైతే కలిగిందో, దానిని దూరం చేసుకోవడానికి బ్రహ్మ జ్ఞానం అవసరం. బ్రహ్మ జ్ఞానం పొందడానికి ప్రతిరూపాలైన శాస్త్రాలలోని సాధనలన్నీ ఉపాసకుడు శ్రవణ, మనన, నిధి ధ్యాసలతో జీవితాంతం ఉపాసన చేసి, తానే పరమాత్మ అనే స్థితిని దర్శించాలి. దేహం అశాశ్వత మైనప్పటికి, శాశ్వతమైన ఆత్మ చైతన్యంతో నిర్గుణ బ్రహ్మాన్ని ఉపాసిస్తే బ్రహ్మ సాక్షాత్కారం లభిస్తుంది.
శరీర వ్యతిరేకాధికరణం ( 3, 3, 53 )
సూత్రం :- 412
" ఏక ఆత్మనః శరీరే భావత్ "
ఆత్మనః :- జీవాత్మ, శరీరే :- శరీరంలో, భావత్ :- ఉంటుంది. ఏకే :- కొందరు, జ్ఞానం తో మోక్షం వస్తుందని అంగీకరించరు.
భావం :- జీవాత్మ శరీరంలో ఉంటుంది. శరీరం లేకుండా ఉండదు. కనుక కొందరు జ్ఞానం వలన మోక్షం వస్తుందని అంగీకరించరు.
వివరణ:- ఈఅధికరణంలో ఆత్మ దేహం కన్నా భిన్నమైనదని తెలియజేస్తున్నారు. శరీరమనేది ఉన్నప్పుడే ఆత్మ యొక్క ధర్మాలకు అస్తిత్వం ఉన్నది. కాబట్టి దేహం కన్నా వేరైనటువంటి ఆత్మ అనేది ఏది లేదు అని చార్వాకుల అభిప్రాయం. ప్రాణం, చైతన్యం మొదలైన ధర్మాలు శరీరం ఉంటేనే కనిపిస్తాయి. శరీరం లేకపోతే ఉండవు. కాబట్టి శరీరం కన్నా వేరైన ఆత్మ లేదని వారి వాదన. దేహాన్ని విడిచి ఆత్మ కనిపించదు. కాలంతరంలో అసమర్ధమై శరీరం నశిస్తుంది. పంచతత్త్వాలతో దేహం ఏర్పడి, దానిలో చైతన్యం ఉత్పన్నం అవుతుంది. మట్టి ఘటంగా మారిన తరువాత నీటిని తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ఘటంగా మారక ముందు మట్టితో నీటిని తీసుకురాలేము. అలాగే పంచ తత్త్వాలు విడిగా ఉన్నప్పుడు వాటిలో చేతనత్వం కనబడుతున్న దేహంతో బాటు జీవాత్మ ఏర్పడుతుంది. దేహాన్ని మించి జీవాత్మ అనేది వేరుగా లేదు. ఉపాసన అనుష్ఠానం దేహంతోనే చేస్తాము. కనుక ఉపాసన ముందుగా జ్ఞానం వలన వస్తుందనేది సరియైనది కాదు అని వారి వాదన. దేహమే ఆత్మ అని, దేహం కంటే భిన్నమైన ఆత్మ లేదని అంటారు. బాహ్యమైన పృథి వ్యాదుల్లో చైతన్యం కనబడక పోయినా, శరీరాకారంలో పరిణమించిన భూతాల్లో చైతన్యం ఉండవచ్చునని, ఆ శరీరమే పురుషుడు అని, స్వర్గానికి వెళ్ళడానికి గాని, మోక్షం పొందడానికి గాని శరీరం కంటే వేరుగా ఆత్మ లేదని చార్వాకుల వాదన. ఆత్మ యొక్క అస్తిత్వాన్ని గురించి సూత్రం లేదు. ఇక్కడైతే బాదరాయణుడిచేత స్వయంగా ఆత్మ అస్థిత్వాన్ని ముందుగా ఆక్షేపించి అది స్థాపించబడింది. నాస్తికత్వాన్ని నివారించడం కోసమే ఆత్మ స్థిత్వాన్ని యుక్తి చేత ప్రతిపాదించాడు. ఆత్మ యొక్క అసలు రూపం వేదాంతలను సేవిస్తే తెలుస్తుంది. బంధం, మోక్షాధికారం సిద్ధించడానికై ఇక్కడ దేహం కంటే భిన్నమైన ఆత్మ యొక్క ఉనికి సాధించ బడుచున్నది. దేహం కంటే భిన్నమైన ఆత్మ లేకపోతే పరలోకంలో ఫలంగా గల విధులు ఉపపన్నములు కావు. శాస్త్ర ప్రారంభం లోనే శాస్త్ర ఫలాన్ని అనుభవించడానికి యోగ్యమైన దేహానికి భిన్నమైన ఆత్మ యొక్క అస్తిత్వo చెప్పబడింది.
సూత్రం :- 413
" వ్యతిరేక స్తద్ భావాభావిత్వ న్నతూపలబ్ది వత్ "
వ్యతిరేకః :- శరీరం కన్నా ఆత్మ భిన్నం. తత్ భావాభావిత్వాత్ :- శరీరం ఉన్నప్పుడు కూడా చనిపోయినప్పుడు అందులో ఆత్మ లేకపోవచ్చును. న :- ఆత్మ అనేది దేహం కాదు. తు :- ఎలాగంటే, ఉప లబ్దివత్ :- జ్ఞానం, విషయం కన్నా భిన్నం అయినట్లుగా,
భావం :- శరీరం కన్నా ఆత్మ భిన్నం. శరీరం ఉన్నా చనిపోయిన తరువాత అందులో ఆత్మ లేకపోవచ్చును. కనుక ఆత్మ అనేది దేహం కాదు. ఎలాగంటే, జ్ఞానం విషయం కన్నా భిన్నం అయినట్లుగా, విషయం ఉన్నా అందులో జ్ఞానం లేకపోవచ్చును కదా!
వివరణ:- ఆత్మ అనేది దేహం కన్నా వేరైనది. మృతునికి శరీరం ఉన్నప్పటికీ చైతన్యం ఉండదు. ఒక్కోసారి శరీరం ఉన్నా చైతన్యం ఉండదు. రూపాదులు శరీర ధర్మాలు. దేహధర్మలైనా రూపాదులు దేహం ఉన్నంత వరకు ఉంటున్నాయి. ప్రాణం, చేష్టలు మొదలైనవైతే మృతావస్థలో దేహం ఉన్నా కూడా ఉండటం లేదు. దేహధర్మాలైన రూపాదులను ఇతరులు ప్రత్యక్షంగా చూడగలుగుతున్నారు. కాని ఆత్మధర్మాలైన చైతన్య స్మృత్యాదులను ఇతరులు గ్రహింపజాలరు. జీవించి ఉన్న అవస్థలో వీటి ఉనికిని నిశ్చయింపవచ్చును. కాని దేహం లేనప్పుడు ఇవి లేవని నిశ్చయంగా చెప్పడానికి శక్యం కాదు. ఈ దేహం పతనమైన తరువాత కూడా ఆత్మధర్మాలు, దేహంతరం లోనికి సంచరించడం చేత ఒకవేళ అనువర్తింప వచ్చు కదా! దేహం లేనప్పుడు చైతన్యస్మృత్యాదులు ఉండవనీ నిశ్చితంగా చెప్పడానికి శక్యం కాదు కనుక ఉండవచ్చునేమో అనే సంశయానికి తావు లేకపోలేదు. సంశయం మాత్రం చేత కూడా పరపక్షం నిషేధింపబడుతుంది. చైతన్యం అలా కాదు. అది శరీరం కన్నా భిన్నం. అదేఆత్మ. ఆత్మయే ఉపాసనాది కార్యాలు చేస్తుంది. అవి చేయడానికి శరీరం ఆత్మకు సాధనం మాత్రమే. ఆత్మ దేహంతో బ్రహ్మ సాక్షాత్కారం అయ్యేంత వరకు కార్యాలు చేస్తుంది. ఆ తరువాత జ్ఞానంతో మోక్షాన్ని పొందుతుంది. కాబట్టి శరీరానికి చైతన్యాది ధర్మాలుంటాయనడం సరి కాదు. సమాధి స్థితిలో శరీరం ఉంటుంది. కాని దానిలో చైతన్యం కనిపించదు. కనుక శరీరం ఆత్మ కాదు. ఆత్మ శరీరం కన్నా వేరైనది.
అంగావబద్దాధికరణం ( 3, 3, 55 )
సూత్రం :- 414
" అంగావ బద్ధాస్తు న శాఖాసు హి ప్రతి వేదమ్ "
అంగావ బద్దాః తు :- జ్యోతిష్టోమాది కర్మాంగాలైన ఉద్గీథాదుల్లో చెప్పిన ఉపసనా విధులు, ప్రతి వేదం :- ప్రతి శాఖలోనూ గ్రహించాలి. శాఖాసు హి :- అవి అన్ని శాఖలలో ఉండాలనే నియమం, న :- ఏమి లేదు.
భావం :- జ్యోతిష్టోమాది కర్మాంగాలైన ఉద్గీథాదుల్లో చెప్పిన ఉపాసనా విధులు ప్రతి శాఖలోనూ గ్రహించాలి. అవి అన్ని శాఖలలో ఉండాలనే నియమం లేదు.
వివరణ:-ఓంకారాన్ని ఉద్గీథంగా ఉపాసించాలి అని ఛాందోగ్యంలోచెప్పారు. ఇలా ప్రతివేదంలోనూ, ప్రతిశాఖలోనూ చెప్ప బడ్డాయి. కాబట్టి ప్రతిశాఖలోనూ ఉద్గీథాన్ని ఉపాసనావిధులను ఆశాఖలో మాత్రమే గ్రహించాలా? లేక అన్ని శాఖలకు సంబంధించినవా? అని ప్రశ్నించాడు కృష్ణశర్మ. కర్మాంగాలైన ఈఉపాసనా విధులు ఈశాఖయందే అని లేదు అని ప్రతి వేదంలో, ప్రతి శాఖలో చెప్పబడ్డాయి. ఉపాసనా విధులు ఏ శాఖలో ఉన్నా ప్రతి చోటా గ్రహించాలి. జ్యోతిష్టోమాది కర్మలు వాటికి అంగలైన ఉద్గీథాది ఉపాసనా విధులకు సంబంధించిన వర్ణనలు వివిధ శాఖలలో కనిపిస్తాయి. కొన్ని శాఖలలో కనిపించవు. అయినా వీటిని అన్ని శాఖలలో అనువర్తించుకొని అనుష్టించాలి.
ఛాందోగ్యోపనిషత్తు(1, 1, 1):- "ఓం ఇత్యేత అక్షరముద్గీథ ముపాసీత" ఈ ఉద్గీథఉపాసన సామాన్య విధి. దీనిని ఏదో ఒక శాఖాకు చెందిన కర్మాంగంలోనే అనుష్టించాలనే వ్యవస్థ ఎక్కడా లేదు. కనుక అన్ని శాఖలలోనూ జ్యోతిష్టోమ ప్రసంగం ఉన్న చోట దీన్ని గ్రహించవచ్చు. ఇలాగే ఇతర ఉపాసనల విషయాల్లో కూడా అన్వయించుకోవాలని సూత్రాభిప్రాయం. ఉద్గీత అనేది ప్రణవ మాత్రం. ఉత్ అంటే ప్రాణం, గీత్ అంటే వాక్కు, ఓంకారాన్ని ఓం అని దీర్ఘoగా గానంచేస్తూ ఉపాసించాలి. దీనినే ఓంకారానుష్టానం అంటారు. ఉద్గీథాది కర్మావయవాలకు సంబంధించిన ఏ ప్రత్యయాలు ప్రతివేదంలోనూ శాఖాభేదాలలో విధిoపబడియున్నాయో అవి ఆయా శాఖలలో ఉండే ఉద్గీథాదులలో ఉంటాయా అని సంశయం. ఉద్గీతావయవమైన ఓం కారం మీద ప్రాణ దృష్టి, హింకారమే పృథవి, ప్రస్థావం, అగ్ని, ఉద్గీతం, అంతరిక్షం, ప్రతీహారం, ఆదిత్యుడు, నిధనం, ద్యులోకం. ఈ విధంగా హింకారాది పంచ రసాయనమందు పృథ వ్యాది లోక దృష్టి, ఉక్తం అనే శాస్త్రము మీద పృథవి దృష్టి, ఇష్టకాచితమైన అగ్ని మీదలోక దృష్టి, ఈ కర్మాంగాలను ఆశ్రయించిన ఉపాసనలు చెప్పబడ్డాయి. వీటి విషయంలో సంశయం. ప్రతిశాఖలోను స్వరాదుల భేదం చేత ఉద్గీథాదులు కూడా భిన్నములౌతాయి. కనుక ఈ సంశయం ఏర్పడింది. ఇవి తమ శాఖలో ఉన్న ఉద్గీథాదుల విషయంలోనే విధింపబడాలి. "ఉద్గీథ ముపాసీత" (ఉద్గీథాన్ని ఉపాసించాలి). అని సామాన్యంగా విధించబడినప్పుడు ఏఉద్గీథాన్ని అని ఆకాంక్ష కలిగినప్పుడు దగ్గరగా స్వశాఖలో ఉన్న దానిచేతనే ఆకాంక్షలు తీరిపోతాయి. గాన ఈఉపాసన ఏ శాఖలో ఉన్నదో, ఆ శాఖలోనే ఉన్న విధంగా ఉపాసన చెయ్యాలి. ఆకాంక్ష తీరిన తరువాత దానిని కాదని మరొక శాఖలో విధించిన విశేషాన్ని గ్రహించడానికి తగిన కారణం లేదు. అందుచేత శాఖా భేదాన్ని బట్టి ఉపాసన వ్యవస్థ చేసుకోవాలి. దేహాత్మలు భిన్నమైనవి కనుక ఆత్మధర్మాలు దేహంలో ఎలా సంభవించవో, అట్లే ఆయా వేదాలలో ఉన్న ఉద్గీథాదులు వేరువేరు కనుక ఒక వేదంలో విధించిన ఉద్గీథాద్యుపాసనలు వేదాంతరంలో ఉన్న ఉద్గీథాద్యుపాసనలలో సంభవించవు అని పూర్వ పక్షం వారి వాదన. ప్రతి వేదంలోను తమ శాఖలోనే వ్యవస్థితములు కాకూడదు. అన్ని శాఖలలోనూ అనువర్తించాలి. ఉద్గీథాన్ని ఉపాసించాలి అని సామాన్య రూపంలో చెప్పినప్పుడు ఉద్గీథం అనేది ఏ శాఖలో ఉన్నా దాని ఉపాసన ప్రత్యక్షంగా శ్రుతి అనే ప్రమాణం చేత చెప్పినట్లుగా భావించాలి.
సూత్రం :- 415
" మంత్రాది వద్వా విరోధః "
మంత్రాది వత్ వా :- మంత్రాలు, లేక ద్రవ్యం లాంటి వాటి లాగా, అవిరోధః :- అలా గ్రహించడంలో ఏ వైరుద్యం ఉండదు.
భావం :- ఒక శాఖలో విధించిన ఉపాసనలను మరొక శాఖలో గ్రహిస్తే వాటిలోని మంత్రాలూ, లేక ద్రవ్యం లాంటి వాటి లాగా ఏ మాత్రం వైరుద్యం ఉండదు.
వివరణ :- ఒక శాఖ యందు చెప్పిన ఉద్గీథాదులను ఇతర శాఖల యందు చెప్పినప్పటికి ఇబ్బంది లేదు. ఒక వేదంలో ఉండే మంత్రాలను మరో వేదంలో ప్రతిపాదించే కర్మల్లో కూడా పఠిస్తారు. కాబట్టి ఒక శాఖలో చెప్పిన ఉపాసనను ఇతర శాఖలలో అన్వయం చేసుకోవడంలో దోషం లేదు. ఉద్గీథాదులు అన్ని శాఖలకు సంబంధించినవే.
తైత్తరీయ సంహిత (7, 5, 5, 2) :- అద్వర్వవేసజనీయం శస్యం " అధ్వర్వుడు చేసే కర్మలో సజనీయ సూక్తాన్ని పఠించాలి అని ఉంది. యజుర్వేదం అధ్వర్యుడికి సంబంధించినదే కనుక అతను చేసే కర్మలలో యజుర్వేద మంత్రాలు ప్రయోగించాలి. కాని ఈ తైత్తరీయసంహిత సజనీయసూక్తాన్ని పఠించాలని అంటున్నది. సజనాస ఇంద్రః అనే ఈ సజనీయసూక్తం ఋగ్వేదంలో (2, 6, 7, 1 ) లో ఉన్నది. ఇలా పఠించడంలో దోషమేమున్నది? కనుక ఒక శాఖలో చెప్పిన కర్మలు, గుణాలు మరొక శాఖలో గ్రహించవచ్చును. ఇక ప్రతి కర్మలోనూ వాటి అంగాలైన ఉపాసలుంటాయి. వైశ్వానరోపాసన విషయంలో ఏమి చెయ్యాలి? అందులో వ్యష్టి, సమిష్టి అని రెండూ రకాల ఉపాసనలను వర్ణించారు. ఆ రెండింటిలో దేన్ని గ్రహించాలి? ఉద్గీథాదులు అన్ని శాఖలకు సంబందించినవే.
భూమ జ్యాయస్త్వాధికరణం ( 3, 3, 57 )
సూత్రం :- 416
" భూమ్నః క్రతువ జ్ఞాయస్త్వం తథా హి దర్శయతి "
క్రతువత్ :- దర్శ పూర్ణ మాసం లాంటి యాగాలలో లాగా, జాయస్త్యం :- ప్రధానంగా, భూమ్నః :- సమిష్టి ఉపాసనే గ్రహించాలి. తథాహి దర్శయతి :- శాస్త్రాలు అంటున్నాయి.
భావం :- దర్శ పూర్ణమాసం లాంటి యాగాలలో వలె ప్రధానంగా సమిష్టి ఉపాసనే గ్రహించాలి.
వివరణ :- ఛాందోగ్యంలో వైశ్వానరోపాసన గురించి వివరించారు.
ఛాందోగ్యోపనిషత్తు(5, 10, 1):- దానిలో దివం లాంటి ఒక్కో అంగంలో వ్యష్టి రూపంలోనూ వైశ్వానరోపాసన ఉన్నది. తరువాత "సర్వేషు లోకేషు సర్వేషు భూతేషు" అని సమిష్టి ఉపాసన నిర్దేశించారు. కనుక ఈ రెండు ఉపాసనలను గ్రహించాలా? లేదా ఏదో ఒక దాన్నా అని సందేహం కలుగుతుంది. వైశ్వానర సమష్టి ఉపాసన భూమకు అంగి. అదే ప్రధానం, ప్రామాణికమని వ్యాసమహర్షి చెప్పారు. శాస్త్రము ఆ సమష్టిఉపాసనే నిర్ధారించింది. దర్శపూర్ణమాసయాగాలలో ప్రయాజాదిఅంగాలతో కూడిన ప్రధాన ప్రయోగాన్నే అనుష్టించాలి. ప్రయాజాది అంగాలను వేర్వేరుగా అనుష్టించరు. కనుక వ్యష్టి ఉపాసన ప్రస్తావన వచ్చినప్పుడు దేనిని నిరసించారు. ప్రాచీనశీలుడు మరికొందరు జిజ్ఞాసువులు కేకయదేశ రాజైన అశ్వపతి మహారాజు వద్దకు వెళ్లి, వైశ్వానర విద్యను వివరించమని అడుగుతారు. రాజు ప్రాచీన శీలుణ్ణి" నువ్వు వైశ్వానరాత్మను ఏ విధంగా ఉపాసన చేస్తున్నావు? అని అడుగుతాడు. దానికి ప్రాచీనశీలుడు, రాజా! నేను ద్యులోకాన్ని వైశ్వానరాత్మగా భావిస్తున్నాను అంటాడు. దానికి మహారాజు, నువ్వు ఉపాసించేది "సుతేజ" అనే పేరుతో ప్రసిద్ధి చెందిన వైశ్వానరాత్మ. ఈ ఉపాసన వల్లనే నీ కులం వారు తరతరాలుగా కర్మనిష్టా పరతంత్రులౌతారు. సుతేజమనే ఈఆత్మ వైశ్వానరాత్మలో నాలుగవ భాగం మాత్రమే. అది వైశ్వానరాత్మకు శిరోభాగం వంటిది. విశ్వరూపుడు అతనికి నేత్రం, వాయువే అతని ప్రాణం, ఆకాశం అతని శరీరం, జలం పొత్తి కడుపు, పృథవి పాదాలు. వారు చేసే ఉపాసన గురించి చెప్పాడు. అశ్వపతిమహారాజు వ్యష్టి ఉపాసన నిరకరిస్తూ, సమిష్టిఉపాసన వర్ణించి అది చేయమని ఉపదేసిస్తాడు. కనుక వైశ్వానర సమిష్టి ఉపాసన ప్రధానం. అనుస్టేయం కూడా. వ్యస్టి ఉపాసనకు అనుస్టేయత లేదు. పరమాత్మ ఉత్క్రుష్ఠుడని, ఆయన మొదట సృష్టి, సమిష్టి రూపమైన హిరణ్య గర్భుడు, ప్రజాపతి లేక ఈశ్వరుడు. ఆయనే ఈవ్యష్టిరూపమైన సృష్టి చేశాడని, ఆయనే ప్రాణంగా అన్నింటిలో ఉంటున్నాడని పిప్పలాద మహర్షి పశ్నోపనిషత్తులో తెలియజేశాడు. అందువలన సమిష్టిరూపమైన హిరణ్యగర్భుని, ప్రజాపతిని ఉపాసించాలని గ్రహించాలి.
శబ్దాది భేదాధికరణం ( 3, 3, 58 )
సూత్రం :- 417
" నానా శబ్దాది భేదాత్ "
శబ్దాది భేదాత్ :- పేర్లలో, విధానంలో భేదాలు ఉండటం వలన, నానా :- ఉపాసనలు అనేక రకాలు. ఒక్కటి కావు.
భావం :- పేర్లలో, విధానంలో భేదాలు ఉండటం వలన ఉపాసనలు అనేక రకాలు.
వివరణ:-ఛాందోగ్యంలోని శాండిల్యవిద్య, దహరవిద్య, మధువిద్య, వైశ్వానరవిద్య లాంటి ఉపాసనలు విభిన్న ఉపనిషత్తులలో కనిపిస్తాయి. వీటన్నింటికి ఉపాస్య దైవం బ్రహ్మం ఒక్కటే. అయినా ఉపాసనలన్నీ ఒక్కటి కావు. వేద, ఉపాసీత, ధ్యాయిత, క్రతుం, కుర్వీత లాంటి శబ్దాలు భిన్నములైనవి. గుణాలలోనూ, అనుష్టాన విధానాలలోనూ తేడాలున్నందున ఉపాసనలు కూడా భిన్నంగా ఉంటాయి.వేద్యం అంటే తెలిదుకొనదగినది ఒకటే. దహర, శాండిల్య, వైశ్వానర విద్యలలో గుణ భేదం ఉన్నది కాబట్టి ఈ విద్యలన్నీ వేర్వేరుగా ఉంటాయి. యాగానికి ద్రవ్య, దేవతల వలె విద్యకు వేద్యమే రూపం. శ్రుతిలో వేరుగా కనబడుతున్నా కూడా "మనోమయః ప్రాణశరీరం ", కం బ్రహ్మ ఖం బ్రహ్మ, " సత్య కామః సత్య సంకల్పః ఇత్యాదులలో వేద్యుడైన ఈశ్వరుడొక్కడే. అట్లే వేద్యమైన ప్రాణం ఒక్కటే. వేద్యం ఒక్కటైనప్పుడు విద్య కూడా ఒక్కటే అని చెప్పబడింది. ఈ పక్షంలో వేర్వేరు గుణాలను చెప్పడమే అభిప్రాయం కాబట్టి శ్రుతులలో భేదం ఉన్నా అవి వ్యర్థం కావు. అందుచేత విద్యకు పరిపూర్ణనత్వం రావాలంటే ఒకే వేద్యానికి సంబంధించిన స్వపరశాఖలలో విధించబడిన గుణసముదాయాన్ని ఉపసంహ రించాలి. అక్కడక్కడ ఉపాస్యమైన ప్రాణం ఒక్కటే అయినా భేదం లేకపోయినా ఒకచోట ఒక విధమైన గుణం ఉపాసించాలి. మరొక చోట మరొక విధమైన గుణం ఉపాసించాలి. కనుక ప్రాణాలతో బాటు చెప్పిన గుణాల భేదాన్ని బట్టి వేద్యం భిన్నం అవడం చేత విద్యా భేదం తెలియబడుచున్నది.
వికల్పాధి కరణం ( 3, 3, 59 )
సూత్రం :- 418
" వికల్పో అవిశిష్ట ఫలత్వాత్ "
అవిశిష్ట ఫలత్వాత్ :- అన్ని ఉపాసనలకు సమాన ఫలమే కనుక, వికల్పః :- ఉపాసనలను అనుష్టించడంలో వికల్పం ఉన్నది.
భావం :- అన్ని ఉపాసనలకు సమాన ఫలమే కనుక ఉపాసనలను అనుష్టించడంలో వికల్పం ఉన్నది.
వివరణ :- ఉపాసనలు అనేకం అయితే వాటి అనుస్థానంలో వికల్పం అంగీకరించాలా? సముచయాన్ని అంగీకరించాలా? అనేది సందేహం వచ్చినప్పుడు వికల్పాన్నే అంగీకరించాలి. సగుణోపాసన చేసేటప్పుడు వేర్వేరు విద్యలనే ఉపసించాలి. ఎందుకంటే అక్కడ వేద్యం అంటే తెలుకోదగిన వస్తువు వేరు. సాక్షాత్కరించే దేవత వేరు. ఉపసనా ఫలం వేరు. శాండిల్యాది విద్యలలో నిర్గుణో పాసన నిర్వహించాలి. దీనిలో ఆత్మసాక్షాత్కారం జరుగుతుంది. వేద్యం తనని తాను తెలుసుకోవడం. ఫలితం మోక్షం. ఉపాసకుడు ఐహిక బంధాలు తెంచుకొని జ్ఞానియై పరమాత్మలో లీనం అవడమే ముక్తి. ఒక లక్ష్యం చేరడానికి అనేక మార్గాలు ఉన్నప్పుడు లక్ష్యాన్ని చేరుకోవాలనుకునే వ్యక్తి ప్రతి మార్గాన్ని అనుసరించాలనే నియమం లేదు. ఏదో ఒక మార్గాన్ని అనుసరించినా, అతను లక్ష్యాన్ని చేరతాడు. ఈ ఉపాసనలన్నింటికి లక్ష్యం ఒక్క బ్రహ్మ ప్రాప్తి మాత్రమే. అందుకే ముముక్షువులు ఏదో ఒక ఉపాసన అనుష్టించి బ్రహ్మ ప్రాప్తిని పొందవచ్చును. అందువలన ఉపాసనల అనుష్టానంలో వికల్పం ఉంది. సముచ్చయం కాదు. యజ్ఞాలు అనేక రకాలుగా ఉండటం వలన, విభిన్న ఫలాలు కోరుకునే వారు విభిన్నములైన యజ్ఞ కర్మలు చెయ్యాలి. ఆ విషయంలో సముచ్చయమే కాని వికల్పం ఉండదు.
కామ్యాధికరణం ( 3, 3, 60 )
సూత్రం :- 419
" కామ్యాస్తు యధాకామం సముచ్చీయేరన్ నవా పూర్వహే త్వ బావాత్ "
కామ్యః తు :- సకామ ఉపాసనలను, అనుష్టానాలను మాత్రం, యధా కామం :- తమ తమ కోరికలను బట్టి, సమ్ముచ్చీ యెరన్ :- కలిపి అనుష్టించాలి. వా :- అలా కాక, న :-సముచ్చయం కాక, విడి విడిగా చేస్తే, వాటిలో పూర్వ హేతు అభావాత్ :- ముందు చెప్పినట్లుగా, ఫలాలు లభించడం లో సమానత్వం ఉండదు.
భావం :- సకామ ఉపాసనలను, అనుష్టానాలను తమ తమ కోరికలను బట్టి అనుష్టించాలి. అలా కాక, సముచ్చయం కాక విడివిడిగా చేస్తే వాటిలో ముందు చెప్పినట్లుగా ఫలాలు లభించడంలో సమానత్వం ఉండదు.
వివరణ:-గురువర్యా! బ్రహ్మోపాసన ఒకటిగానే అనుష్టించాలి. మరి కామ్యోపాసన అంటే ఏమిటి? వీటిని విడివిడిగా ఉపాసిం చాలా? సమిష్టిగా ఉపాసించలా? అని అడిగాడు కృష్ణశర్మ. కామ్యవిద్యలు రెండు రకాలు. 1.దైవ సాక్షాత్కారం, 2. భోగ ప్రాప్తి. 1. మొదటి వానిలో కొంత కాలం ఉపాసన చేస్తాడు. తరువాత ఇంకొక ఉపాసన చేస్తాడు. ఆ తరువాత ఇంకొకటి చేస్తే సాధకుడుకి దేని మీద ఏకాగ్రత కుదరక గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. ఉపాసకుడు తదాత్మ్యం చెందితే తానే పరమాత్మ అవుతాడు. కాబట్టి ఇలాంటి ఉపాసనలు చేసేటప్పుడు ఒకే రకమైన ఉపాసన చెయ్యాలి. రెండది భోగ ప్రాప్తి :- ఇందులో సాధకుడు కోరినది పొందుతాడు. అతడికి సుఖము, భోగము లభిస్తాయి. ఇక్కడ ఉపాసన మార్చవలసిన పని లేదు. కామ్యో పాసనలను మన ఇష్ట ప్రకారం ఉపాసించవచ్చును. బ్రహ్మ సాక్షాత్కారం కాక, ఇతర ఐశ్వర్యాది ఫలాన్ని ఆశించి చేసే వాటిని కామ్య ఉపాసనలు అంటారు. అలాంటి వాటిని అనుష్టించే వాళ్ళ కోరికలను బట్టి అనుష్టానాలు ఉంటాయి. ఏదో చిన్న ఫలం ఆశించే వాళ్ళు అది లభించడానికి అనువైన ఉపాసన అనుష్టిస్తారు. అదే ఫలాలు కోరుకునే వాళ్ళు అనేక ఉపాసనలు చేస్తారు. అందువలన కామ్యోపాసనలలో వికల్పం, సముచ్చయం లాంటివి ఉండవు.ఈ ఉపాసనలో ఫలాలను ఆశించేవారు స్వతంత్రులు.
యధాశ్రయ భావాధికరణం ( 3, 3, 61 )
సూత్రం :- 420
" అంగేషు యధా శ్రయ భావః "
అంగేషు :- కర్మ అంగ ఉపాసనల్లో, యధా ఆశ్రయ భావః :- ఆశ్రయానుసారం విధానం జరుగుతుంది.
భావం :- కర్మాంగ ఉపాసనల్లో ఆశ్రయానుసారం విధానం జరుగుందని పూర్వ పక్ష వాదన.
వివరణ:- అంగోపాసన విషయంలో వికల్ప, సముచ్చయ వ్యవస్థల గురించి నాలుగు పూర్వపక్షసూత్రాలు చెప్పబడ్డాయి. గురుదేవా! లౌకికఉపాసనలు ఇష్టం వచ్చిన విధంగా ఆచరించ వచ్చును. మరి కర్మాంగాలైనట్టి ఉద్గీథాదులను కలిపి అనుష్టించాలా? విడివిడిగా అనుష్టించాలా? అని అడిగాడు నారాయణభట్టు. కర్మంగాలైనటువంటి ఆశ్రతఉపాసనల్లో సమచ్చయం వలన అనుష్టాననియమం ఉంది. అంటే కర్మాంగాలకు, వాటిని ఆశ్రయించిన అంగాలుగా చెప్పబడ్డ ఉపాసనలకు ఒకే నియమం వర్తిస్తుంది. అంటే ఉపాసనలను ఉద్గీథాల్లాగా సముచ్చయంగా అనుష్టించాలి. కామ్యోపాసనంలో వలె, కర్మకు అంగాలైన ఉద్గీథాది అంగ ఉపాసనల్లో కూడా నియమం ఉంటుంది. కనుక సమచ్ఛయాన్ని అంగీకరించాలి. ఎందుకంటే ఆశ్రయాన్ని అనుసరించి అంగానుస్థానం జరగాలి. అంగోపాసనకు ఆశ్రయం కర్మ. అన్ని అంగాలు కలిపి ప్రధాన కర్మను సంపన్నం చేస్తాయి. ఇదే కర్మానుష్టానం ప్రకారం ప్రయాజ, అనుయాజాది పేర్లున్న అంగాలాన్ని కలిపి తమ ప్రధాన అంగోపాసనను సంపన్నం చెయ్యాలి. అందువలన అంగోపాసన అనుష్టానంలో సమచ్ఛయాన్ని ఒప్పుకోవాలని పూర్వ పక్ష వాదన. కర్మాంగలైన ఉద్గీథాదుల యందు వాటిని ఆశ్రయాలైన స్తోత్రాదులు ఏ విధంగా కలసి జరుగుతాయో అట్లే ప్రత్యయాలు కూడా చేయబడతాయి. ఎందువలననగా ప్రత్యయాలు అంటే భావనలు ఆశ్రయాల మీద ఆధారపడతాయి.
యధాశ్రయ భావాధికరణం ( 3, 3, 62 )
సూత్రం :- 421
" శిష్టేశ్చ "
శిష్టేః చ :- శిష్టులు, శాస్త్రము చెప్పిన విధానాల వలన కూడా, అంగోపాసన అనుష్టించడంలో సముచ్చయాన్ని అంగీకరించాలి.
భావం :- శిష్టులు, శాస్త్రము చెప్పినట్లుగా అంగోపాసన అనుస్థానంలో సముచ్చయాన్ని అంగీకరించాలి.
వివరణ:- ఇదికూడా పూర్వపక్ష సూత్రమే. కర్మాంగాలైన ఉద్గీథ లాంటి ఉపాసనలను శాస్త్రము ఎలా చెప్పిందో అలాగే అంగాశ్రితాలైనా ఉపాసనల విధానం కూడా ఉన్నది. కర్మాంగాలకు వాటిని ఆశ్రయించిన ఉపాసనలను వేదాలు విధాన భేదాన్ని ఉపదేశించవు. కర్మాంగాల వలేనే ఉపాసనలను సముచ్చయంగానే అనుష్టించాలి.
ఛాందోగ్యోపనిషత్తు (1, 1, 1) :- ఓ! మిత్యేత దక్షర ముద్గీథం ఉపాసీత " ఓం అనే అక్షర ఉద్గీథాన్ని ఉపాసించాలి అని విధానం. ఆశ్రయంతో సమానవిధానం ఉన్నప్పుడు అనుష్టానంకూడా దానితో సమానంగాఉండాలి. కనుక అంగోపాసనలలో సముచ్చయం, ఉపాసనలన్నీ అనుష్టించాలనే నియమం ఉంది. ఆశ్రయాలైన స్తోత్రాదులు మూడు వేదాలలోనూ ఏ విధంగా విధించబడ్డాయో వాటిని ఆశ్రయించిన ప్రత్యయాలకు ( భావనలు ) కూడా ఆ విధంగానే విధించ బడ్డాయి. అంగాలకు వాటిని ఆశ్రయించిన ప్రత్యయాలకు ఉపదేశాన్ని బట్టి కూడా విశేషం ఏమి లేదు.
యధాశ్రయ భావాధికరణం ( 3, 3, 63 )
సూత్రం :- 422
" సమాహారాత్ "
సమాహారాత్ :- కర్మ లోపాన్ని ( కొరతను ) పూర్తి చెయ్యడం వలన, అంగోపాసనల్లో యధాశ్రయ భావం ఉందని తెలుస్తోంది.
భావం :- ఇది పూర్వ పక్ష సూత్రమే. కర్మ లోపాన్ని పూర్తి చెయ్యడం వలన అంగోపాసనల్లో యధాశ్రయ భావం ఉన్నదని తెలుస్తోంది.
వివరణ:- సమాహారం వలన ఋగ్వేదులకు సంబంధించిన ప్రణవం అంటే ఓంకారానికి, సామవేదానికి సంబంధించిన ఉద్గీతానికీ ఐక్యత చెప్పబడింది.
ఛాందోగ్యోపనిషత్తు(1, 5, 5) :- ఉద్గీథమే ప్రణవం, ప్రణవమే ఉద్గీథం అని ఏకత్వోపాసన విధించి, తరువాత దాని ఫలం గురించి కూడా చెప్పారు. ఋగ్వేదుల ప్రణవం, సామవేదుల ఉద్గీథం-వీటి ఏకత తెలిసిన ఉద్గాత (వేదమంత్రాలు చదివేవాడు) సామగానం లోని అశుద్ధిని హోత (ఆహతికి పూర్వం మంత్రాన్ని పఠించి దేవతలను యజ్ఞభూమికి తీసుకు వస్తాడు) కూర్చున్న స్థానం నుంచి సరిచేసి, కర్మలోపాన్ని పూర్తి చేస్తాడు. దీనితో ఉద్గాతకు ప్రతి అంగోపాసనలో ఆశ్రయాన్ని అనుసరించి సముచ్చయాన్ని అంగీకరించి తీరాలి. హోత్ర కర్మ ద్వారా ఉద్గీథంలోని లోపాలను సరిచేస్తాడు. ఉద్గాత తన కర్మలో కలిగిన లోపాన్ని హోత్ర కర్మచేత సరిదిద్దుకుంటాడు. ఋగ్వేదంలో చెప్ప బడిన ప్రణవము సామ వేదంలో చెప్పబడిన ఉద్గీథము ఒక్కటే అని ఛాందోగ్యోపనిషత్తులో " యఉద్గీతః న ప్రణవః, య ప్రణవః న ఉద్గీథః " అని చెప్పబడింది. దీని చేత ఉద్గీథావయవమైన ప్రణవాన్ని హోత్ర ప్రణవాన్ని అభిన్నములుగా ఉద్గాథ అనుసంధానం చెయ్యాలని విధించబడు చున్నది. ఇలా చెయ్యడం వలన ఉద్గీథం లో అంగలోపాదుల చేత ఏమైనా దోషాలున్నా, నిర్ధుష్టంగా చేసిన హోత్ర కర్మ చేత సరి దిద్దు కొనవచ్చును. దీని వలన సామవేదంలో విధించ బడిన ఈ ఉపాసనకు ఋగ్వేదంలోని ప్రణవంతో సంబంధం తప్పని సరియైనది. ఈ విధంగా అంగాశ్రీతోపాసన లకు సమూచ్చయం చెయ్యాలి అని సూచించారు.
సూత్రం :- 423
" గుణ సాధారణ్య శ్రుతేశ్చ "
చ :- పైగా, గుణ సాధారణ్య శ్రుతేః :- గుణం సాధారణం అని చెప్పే శ్రుతి వలన,
భావం :- గుణం సాధారణం అని చెప్పే శ్రుతి వలన అంగోపాసానానుస్థానాలలో సముచ్చయం ఒప్పుకోవాలి.
వివరణ:-ఇది ప్రతిపక్షసూత్రం. ఉపాసనలకు ఆశ్రయమైన ప్రణవం అన్ని వేదాలకు సాధారణమే. కాబట్టి దానిని ఆశ్రయించిన ఉపాసనలకు కూడా సముచ్చయానుస్థానం సిద్ధిస్తోంది. గుణ కర్మాంగమైన ఉపాసనాహితమైన ఓం సర్వ సర్వ కర్మలలోనూ సమానంగా ఉంటుందని ఉపనిషత్తు అంటున్నది.
ఛాందోగ్యోపనిషత్తు(1, 1, 9):- ఓం తో ఋగ్వేదం, యజుర్వేదం, సామ వేదాలు ప్రవృత్తమవుతున్నాయి. అధ్వర్యుడు 'ఓం' ను ఉచ్చరించి మంత్రాన్ని పఠిస్తాడు. హోత ఓం ను ఉచ్చరించి స్తుతిస్తాడు. ఉద్గాత 'ఓం' అంటూ గానం చేస్తాడు. ఇక్కడ త్రయీ విద్యతో ఓం కు సమాన సంబంధం ఉంది. ఇది కర్మకు అంగాలైన ఉద్గీథం లాంటి ఉపాసనల అనుష్టానంలో సముచ్చయాన్ని సూచిస్తుంది. ఇక్కడ గుణం అంటే కర్మకు అంగాలైన ఉపాసనలకు ఆశ్రయమైన 'ఓం' ను అన్ని వేదాంతలతో సంబంధం చెప్పారు. దేనిని బట్టి' ఓం' ను ఆశ్రయించి ఉండే ఉపాసనల అనుష్టానంలో సముచ్చయ నియమం ఉండాలని తెలుస్తోంది. ఉద్గీథానికీ కర్మతో సముచ్చయం ఉంటుంది. ఉద్గీథం ఒక గానం, కర్మకు అంగం. ఉద్గీథం అన్నా, ప్రణవం అన్నా ఒక్కటే. ఉద్ గీతం ఏకర్మకు అంగమో, ఆకర్మ ఉద్గీథాన్ని ప్రయోగించకుండా పూర్తి కాదు. ఉద్గీథానికీ కర్మ ఆశ్రయమైనట్లు, ఉద్గీథోపాసనకు ఉద్గీథం ఆశ్రయం. ఇలా కర్మతో ఉద్గీథానికీ సముచ్చయం ఉన్నప్పుడు ఉద్గీథంతో ఉపాసనకు సముచ్చయం తప్పక ఉండాలి. కర్మతో ఉద్గీత గానం, ఉపాసన అవసరం. ఇలా కర్మతో ఉపాసనకు తప్పనిసరిగా సముచ్చయం ఏర్పడుతుంది. ఈ ప్రతి పక్ష సూత్రాలన్నింటికి వ్యాస మహర్షి రెండూ సూత్రాలలో సమాధానం చెబుతున్నారు.
సూత్రం :- 424
" న వా తత్ సహభావా శ్రుతేః "
తత్ సహభావ అశ్రుతేః :- కర్మకు, ఉపాసనకు సహభావాన్ని బోధించే శ్రుతి లేనందు వలన, న వా :- అంగోపాసనల్లో ఆశ్రయ భావం అనుసరించి నియమం విధించడానికి వీలు లేదు.
భావం :- కర్మకు, ఉపాసనకు సహ భావాన్ని బోధించే శ్రుతి లేనందు వలన, అంగో పాసనల్లో ఆశ్రయ భావాన్ని అనుసరించి, నియమం విధించడానికి వీలు లేదు.
వివరణ:-కర్మకు, ఉపాసనకు సముచ్చయంలేదని సూత్రానికి అర్ధం. మూడు వేదాలలోను విహితమైన అంగాలకు స్తోత్రాలకు సమాధానం ఉన్నదని శ్రుతి చెబుతున్నది. కాని ఆశ్రయాలకు, ఆశ్రితాలకు సహభావం లేదు. కాని ఉపాసన అనుష్టించవచ్చును. లేదా మాన వచ్చును.
ఛాందోగ్యోపనిషత్తు(1, 1, 10):- కర్మ, ఉపాసన ఈ రెండూ భిన్నమైనవి. ఉపాసన లేకుండా కూడా కర్మానుష్టానం చేయ వచ్చును. ఉపాసనతో బాటుగా కర్మచేస్తే అధిక ఫలం లభిస్తుంది. దీనితో కర్మతో ఉపాసనకు సముచ్చయ నియమం లేదని తెలుస్తోంది. శాస్త్రాల్లో కర్మాంగాలకు, ఉపాసనాలకు వేర్వేరుగా ఫలాన్ని చెప్పారు. ఏ ఉపాసన ఎవరికీ రుచిస్తుందో, అతను దానిని అనుష్టిస్తాడు. క్రతువు పూర్తి కావడానికి అంగానుష్టానం చెయ్యాలి. కనుక అంగానుష్టానానికి, క్రతువుకి సంబంధం ఉన్నది. కాగా, ఉపాసన పురుషుడికి సంబంధించినది. అది పురుషార్ధం సిద్ధించేటట్లు చేస్తుంది. కర్మకు, ఉపాసనకు సముచ్చయం లేదు. కర్మతో దాని అంగకర్మలకు సహభావం శాస్త్రంలో స్పష్టంగా చెప్పారు. కాని ఉపాసనకు సహభావం చెప్పలేదు.ఇంతకు ముందు కర్మ ఫలం వేరు, ఉపసనాఫలం వేరు అని అని నిర్ణయించారు. కర్మ ఫలాన్ని పొందటానికి దాని అంగకర్మలను అనుష్టిస్తే చాలు. ఉపాసనల అనుష్టానంతో పని లేదు. కనుక కర్మతో ఉపాసనకు నియమంగా సహభావం అవసరం లేదని తెలుస్తోంది. ఉపాసనలు ఇష్ట ప్రకారమే చేయ బడతాయి. కాని వాటికి సహ భావం, సముచ్చయం తప్పక ఉండాలి అనే నియమం లేదు.
సూత్రం :- 425
" దర్శ నాచ్చ "
చ :- ఇంతే కాక, దర్శనాత్ :- శాస్త్రాల వలన ఈ విషయం బలపడుతోంది.
భావం :- శాస్త్రాల వలన ఈ విషయం బలపడుతోంది.
వివరణ :- శ్రుతులు చెప్పినట్లుగా ఉపాసనలకు సహభావం లేదు. శ్రుతులు ఆ విధంగా చెప్పడం వలన ఉపాసనలకు సహభావం లేదు. వాటిని ఇష్టం వచ్చినట్లుగా అంటే విడి విడిగానో, కలసో అనుష్టించవచ్చును.
ఛాందోగ్యోపనిషత్తు(4, 17, 10) :- ఇలా తెలిసిన బ్రహ్మ యజ్ఞాన్ని, యజమానిని, అందరూ ఋత్విక్కులను రక్షిస్తాడు. ఇక్కడ బ్రహ్మ తన జ్ఞానంతో ఋత్విక్కులందరిని రక్షిస్తాడన్నారు. ఉపాసనకర్మల్లో అంతటా అంగాలతో పాటు సమానంగా అనుష్టించే టట్లయితే, ఋత్విక్కులందరికి అది తెలిసి ఉండాలి. అప్పుడు తెలిసిన బ్రహ్మ వాళ్ళని రక్షిస్తాడని చెప్పే అవసరం ఉండదు. కర్మనుష్టానం తో ఋత్విక్కులందరికి కర్మలు, వాటి అంశాలు బాగా తెలుసును. ఉపాసనలతో కూడా కర్మతో అంగాలకులాగా నియత సముచ్చయం ఉన్న పక్షంలో ఋత్విక్కులందరికి వాటి జ్ఞానం ఉండటం తప్పని సరి అవుతుంది. అప్పుడు బ్రహ్మ తన జ్ఞానంతో ఇతర ఋత్విజుల్ని రక్షిస్తాడని చెప్పడం వ్యర్థమే కదా! కనుక కర్మలతో ఉపాసనలను నియతంగా సముచ్చయం అనుష్టానం చేయవచ్చని మహర్షి అభిప్రాయం.
పురుషార్ధాధికరణం ( 3, 4, 1 )
సూత్రం :- 426
" పురుషార్ధోతః శబ్దాదితి బాదరాయణః "
అతః :- ఇది వరకే చెప్పినట్లు, పురుషార్ధః :- మోక్షం సిద్దిస్తుందని, శబ్దాత్ :- వేద, ఉపనిషత్ వాక్యాల వలన తెలుస్తుందని, బాధరాయనః :- వ్యాసుడు అంగీకరిస్తున్నారు.
భావం :- బ్రహ్మజ్ఞానం పురుషార్ధ సాధనమని, దాని వలనే మోక్షం సిద్ధిస్తుందని వేద, ఉపనిషత్ వాక్యాల వలన తెలుస్తుందని వ్యాసుడు అంగీకరిస్తున్నారు.
వివరణ:- ఇప్పటి వరకు జ్ఞానసాధనలైన ఉపాసనల గురించి తెలియజేశారు. మోక్షమే పరమ పురుషార్ధమని మోక్ష ప్రాప్తికి బ్రహ్మజ్ఞానమే సాధనమని, అది ఇతరసాధనలను ఆపేక్షించదని ఈ పాదంలో మహర్షి తెలియజేస్తున్నారు. గురువుగారు! ఉపనిషత్తులలో చెప్పబడిన ఆత్మజ్ఞానం కర్మలతో కలసి మోక్షానికి సాధకమౌతుందా? అని అనుమానం వ్యక్తం చేశాడు కృష్ణ శర్మ. సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. పూర్వపాదంలో వర్ణించినట్లుగానే ఉపాసనవల్ల జనించిన జ్ఞానం బ్రహ్మానందప్రాప్తి లక్షణమైన మోక్షానికి స్వతంత్రసాధనమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఛాంగ్యోపనిషత్తులో ఉద్దాలకుడు శ్వేతకేతువుకు ఆత్మజ్ఞానాన్ని వివరిస్తూ, ఆత్మ అనేది ఎక్కడో ఆకాశంలో లేదు. నిన్ను నువ్వు తెలుసుకోవడమే ఆత్మ జ్ఞానం. ఆత్మజ్ఞాని మోక్షాన్ని పొందుతాడు అని చెప్పాడు. ముండకోపనిషత్తులో మనోమయుడు ఈ అన్నమయ శరీరంలోనే ఉన్నాడు. ఈ విషయం తెలిసిన వాడు ఆత్మతత్త్వాన్ని సాక్షాత్కరింపజేసుకోగలుగుతాడని చెప్పబడింది. బృహదారణ్యకంలో బ్రహ్మజ్ఞాని కూడా బ్రహ్మమే అవుతాడు అని చెప్పబడింది. ఈ విధంగా గురువు ఆదేశానుసారం, ఆత్మ జ్ఞానం తెలుసుకొని, పరబ్రహ్మను శోధించి తెలుసుకున్నవాడు మోక్షం పొందుతాడు. జ్ఞానం మోక్షానికి సాక్షాత్ సాధనం. దీనికి వేరే సాధనం అవసరం లేదు. మరోదానికి అంగం కానేరదు.
పురుషార్ధాధికరణం ( 3, 4, 2 )
సూత్రం :- 427
" శేషత్వాత్ పురుషార్ధవాదో యధాన్వేష్వితి జైమినిః "
పురుషార్ధ వాదః :- ఉపాసన జనిత జ్ఞానం వలన పరమ పురుషార్థమైన మోక్షం సిద్ధిస్తుందనడం, అర్ధ వాదః :- కేవలం అర్ధ వాదం మాత్రమే. ఎందుకంటే యధా అన్వేషు :- ద్రవ్య సంస్కార కర్మాంగాల్లా, శేషత్వాత్ :- ఇది కూడా కర్మాంగమే.
భావం :- మొదటి పూర్వపక్ష సూత్రం. ఉపాసన జనితమైన జ్ఞానం వలన పరమ పురుషార్ధ మైన మోక్షం సిద్ధిస్తుందనడం అర్ధవాదం మాత్రమే. ద్రవ్య సంస్కార కర్మాంగాల్లా ఇది కూడా కర్మాoగమే అని జైమిని మహర్షి అంటున్నాడు.
వివరణ:-2 నుంచి 7వ సూత్రం వరకు పూర్వపక్షం వారి వాదన తెలియజేయబడినది. వాటిని ఖండిస్తూ వ్యాసమహర్షి 8 నుండి 13వ సూత్రం వరకు సమాధానం చెప్పారు. కర్తృరూపంలో ఆత్మఅనేది కర్మకు అంగమే. అంటే ఆత్మ, ఆత్మను గూర్చిన జ్ఞానం ఈరెండూ కర్మాంగాలే అని జైమిని అభిప్రాయం. పార లౌకిక కర్మల్లో ప్రవృత్తి కలగడానికి దేహం కన్నా ఆత్మ వేరే అని తెలుసుకోవడం అవసరం. ఆ కర్మలకు ఫలం దేహాన్ని విడిచిన తరువాత పరలోకంలో లభిస్తుంది. ఆత్మ దేహం కన్నా భిన్నం అని ఎరిగిన వాడికే ఇది సంభవం. యజ్ఞకర్మల్లో కర్తగా ఉండేవాడిని ఆత్మ తత్త్వజ్ఞానం కలిగించడమే ఆధ్యాత్మిక విద్య ప్రయోజనం. కర్త అయిన ఆత్మకు కర్మ అంగం. ఆత్మ జ్ఞానం వలన ఫలం లభిస్తుంద నేది అర్ధ వాదం మాత్రమే. కర్మకు ఉన్న ఇతర అంగాల ఫల నిర్దేశనం అర్ధవాదం అయినట్లుగానే ఆత్మ జ్ఞాన ఫలం కూడా అర్ధ వాదమే.
తైత్తరీయసంహిత (3, 5, 7, 2 ) :- యజ్ఞం లో ఉపయోగించే పాత్రలో జూహు అనేది ఒకటున్నది. దానిని మోదుగ కట్టేతో చేస్తే యజ్ఞకర్త అపకీర్తి పొందడు అని నిర్దేశించారు. ఇక్కడ ఈ యజ్ఞఫలం అర్ధవాదం మాత్రమే. జూహును ఫలాశయంతో చేయాలనీ మాత్రమే దీని భావం. యజ్ఞం చేసేటప్పుడు యజమాని కంటికి అంజనం పెడతారు. దీని ఫలంగా శత్రువు చూపును విచ్చిన్నం చేస్తుంది. అన్నారు. ఏ ఫల నిర్దేశం కూడా అర్ధ వాదమే.
తైత్తరీయ సంహిత ( 6, 1, 1, 5 ):- సంస్కారం కోసం యజమాని కంటికి అంజనం పెట్టుకోవాలి. ఇలాగే "తరతి శోక మాత్మ విత్ " ఆత్మజ్ఞాని తరిస్తాడు అని చెప్పిన ఫల నిర్దేశనం కూడా అర్ధ వాదమే. కర్తలో కర్త రూపంగా ఉండేవాడికి అనుష్ఠానానికి పూర్వం దేహం కన్నా ఆత్మ వేరే అని తెలుసుకోవడం తప్పనిసరి అని ఈ వాక్య భావం. కాబట్టి మోక్షానికి జ్ఞానం స్వతంత్ర కారణం అనడం ప్రామాణికం కాదని, ఆత్మ జ్ఞాన విచారణ మోక్షానికి సాధనాలుఅనిచెప్పే వాక్యాలు ప్రశంస కోసమేనని జైమిని వాదన.
సూత్రం :- 428
" ఆచార దర్శనాత్ "
ఆచారః :- జ్ఞానులు కర్మలు అనుష్ఠిస్తూ ఉంటారు అని, దర్శనాత్ :- శాస్త్రాలు చెబుతున్నాయి.
భావం :- జ్ఞానులు కర్మలు అనుష్ఠిస్తూ ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి.
వివరణ:- పూర్వ పక్షం వారి రెండవ సూత్రం. ఆచారం కనబడటం వలన కూడా జ్ఞానమనేది స్వతంత్రంగా జ్ఞాన సాధనం కాదు. విదేహాధిపతి అయిన జనకమహారాజు గొప్పగొప్ప దక్షిణలిచ్చి యజ్ఞాలు చేశాడు. ఆయన ఆత్మజ్ఞాన సంపన్నుడు, జన్మ రాహిత్యం పొందినవాడు. మహాత్ములకు జ్ఞానం వచ్చాక కూడా గొప్ప దక్షిణలిచ్చి యజ్ఞయాగాలు చేశారంటే కర్మ చేసినట్లే కదా! బ్రహ్మజ్ఞానం కూడా కర్మజ్ఞానం కలిగిఉన్నది కదా! అష్టావక్రుడు లాంటి ఆత్మజ్ఞానం పొందినవారు కూడా వ్యయ ప్రయాసలతో యజ్ఞయాగాదులు ఎందుకు చేస్తున్నారు? కర్మఫలం వలనే మోక్షం వస్తుంది అనేది జైమిని మహర్షి అభిప్రాయం.
ఛాందోగ్యోపనిషత్తు ( 5, 11, 5 ) :- మహానుభావులారా! నేను యజ్ఞం చేసేవాడిని అని అశ్వపతి తన దగ్గరకు వచ్చిన బ్రహ్మ జ్ఞానార్దులైన మహాశీలుడు లాంటి శ్రోత్రియులైన విద్వాంసులను ఉద్దేశించి అంటాడు.
బృహరణ్యకోపనిషత్తు ( 3, 1, 1) :- విదేహరాజైన బ్రహ్మ వేత్త జనకుడు బహు దక్షిణలతో కూడిన యజ్ఞం చేసినట్లు ఉన్నది. జ్ఞానులైన శిష్ట జనాలు యజ్ఞాలు చేయడాన్ని బట్టి చూస్తే, జ్ఞానానికి స్వతంత్ర ఫలం లేదని, అది కర్మకు అంగమని, కర్మానుష్టానం వల్ల ఫలం లభిస్తుందని స్పష్టమౌతోంది.
సూత్రం :- 429
" తత్ శ్రుతేః "
తత్ :- జ్ఞానం కర్మకు అంగమని, శ్రుతేః :- శాస్త్ర ప్రమాణాలంటు న్నాయి.
భావం :- జ్ఞానం కర్మకు అంగమని శాస్త్ర ప్రమాణాలంటున్నాయి.
వివరణ:- ఇది మూడవ పూర్వ పక్ష సూత్రం. విద్య అనేది కర్మ శేషం. అంటే జ్ఞానం కర్మలకు అంగం.
ఛాందోగ్యోపనిషత్తు(1, 1, 10):- "యదేవ విద్యయా కరోతి, తదేవ వీర్యవత్తరంభవతి "విద్య-జ్ఞానంతో చేసిన కర్మ శక్తివంత మైనది. ఇక్కడ విద్యయా - విద్యతో అని కరణర్ధంతో తృతీయ విభక్తిని ప్రయోగించడం వలన విద్య కర్మాంగం, సాధనం అని తెలుస్తోంది. కర్మసంపన్నం కావడానికి ఇతరసాధనాలు దాని అంగాలైనట్లుగా, జ్ఞానం కూడా కర్మకు అంగమని తాత్పర్యం. విద్య, శ్రద్ధ, యోగం అనే ఈమూడింటితో కలసి చేసిన కర్మ శక్తివంతమైనది. జ్ఞానంతో కూడిన కర్మ శక్తివంతమైనదని, జ్ఞానం కూడా కర్మాంగమేనని, అవి విడి విడిగా ఉండవనీ జైమిని అభిప్రాయం.
సూత్రం :- 430
" సమన్వారంభణాత్ "
సమన్వ ఆరంభణాత్ :- జ్ఞానం, కర్మల సమాన అనుగమనం వలన జ్ఞానం కర్మకు అంగం.
భావం :- జ్ఞానం, కర్మలను సమాన అనుగమనం వలన జ్ఞానం కర్మకు అంగం.
వివరణ:- ఇది ఐదవ పూర్వ పక్ష సూత్రం. విద్య, కర్మ రెండింటి సమచ్చయం కనబడటం వలన విద్య కూడా కర్మాంగమే అని తెలుస్తోంది. జీవుడు చనిపోయిన తరువాత అతని విద్య, కర్మ రెండూ కూడా అతని వెంట వెడతాయి. వాటి వలన అతడు కర్మ ఫలితం పొందుతాడు. ఈ రెండూ ఫలితాన్నివ్వటంలో ఒకదానికొకటి సహాయ పడతాయి. అందుచేత విద్య అనేది స్వాతంత్రం కాదు. కర్మాంగమే అని వారి వాదన.
బృహదారణ్యకోపనిషత్తు ( 4, 4, 2 ) :- పరలోకానికి వెళ్లే జీవాత్మకు జ్ఞాన కర్మలు అనుసరిస్తాయి అని చెప్పటం వలన జ్ఞానం ఫలాన్నివ్వడంలో స్వతంత్రం కారణం కాదని, కర్మకు అంగమై ఉపకరిస్తుందని తెలుస్తోంది. విద్యాకర్మలు ఫలాన్ని ఇవ్వడం వలన విద్య కర్మాంగమే. విద్యాకర్మలు పరలోకానికి వెడుతున్న వానిని వెంబడిస్తాయి. విద్యాకర్మలు ఫలం ఇవ్వడంలో పరస్పర సహకారులుగా ఉంటాయి. కనుక విద్యకు స్వతంతం లేదని వారి వాదన.
సూత్రం :- 431
" తద్వతో విధానాత్ "
తద్వతః :- జ్ఞానం ఉన్నవాడికి, కర్మ విధించడం వలన,
భావం :- జ్ఞానం ఉన్నవాడికి కర్మ విధించడం వలన జ్ఞానం కర్మాంగమే అవుతుంది.
వివరణ :- ఇది ఐదవ పూర్వ పక్ష సూత్రం. శ్రుతిని బట్టి అన్ని వేదాల అర్ధాన్ని తెలుసుకున్నవారికి కూడా కర్మను విధించడం కనిపిస్తోంది. కాబట్టి విద్య కర్మాంగమే అని వారి వాదన.
ఛాందోగ్యోపనిషత్తు:- నియమానుసారం గురువును సేవించి, శుశ్రుాషలు చేసి, వేదాధ్యయనం పూర్తి చేసి, సమావర్తనం చెంది, గృహస్థాశ్రమం స్వీకరించి, స్వాధ్యాయం చేస్తూ, విద్యార్థులకు విద్య బోధిస్తూ, ఈ రకంగా కర్మలు చేస్తూ, బ్రహ్మ విద్య సాధన చెయ్యాలి. ఇలా ఇతరములైన నిత్య కర్మలు చేస్తూ బ్రహ్మలోకం చేరతాడు. ఈ విధమైన శ్రుతి సమస్త వేదార్ధ జ్ఞానం ఉన్నవానికే కర్మాధికారం అని చెబుతున్నది. అందువలన కూడా విజ్ఞానం స్వతంత్రంగా ఫల హేతువు కాజాలదు. కనుక విద్య కర్మాంగమే అని వీరి వాదన.
సూత్రం :- 432
" నియమాత్ చ "
చ :- పైగా, నియమాత్ :- నియమం వలన కూడా జ్ఞానం కర్మకు అంగమే.
భావం :- కర్మ వలనే కాకుండా నియమం వలన కూడా జ్ఞానం కర్మకు అంగమని తెలుస్తోంది. నియమం అంటే శాస్త్ర విధి.
వివరణ:- ఇది ఆరవ పూర్వపక్ష సూత్రం. జీవించి ఉన్నంత వరకు కర్మ చెయ్యాలని వేదం చెబుతోంది. కర్మ చేస్తూనే వంద సంవత్సరాలు బ్రతకాలని కోరుకోవాలి. అలా చెయ్యడం వలన అశుభ కర్మ నీకు అంటదు అని చెప్పబడింది.
యజర్వేదం (40, 2):- కర్మలు చేస్తూనే ఇక్కడ నూరేండ్లు బ్రతకాలని కోరుకో, అని జ్ఞానికి యావజ్జీవం కర్మనుష్ఠాన నియమం విధించారు. కనుక కర్మ వలన ఫలం లభిస్తుందని గోచరిస్తోంది కదా!
శత పధ బ్రాహ్మణం ( 12, 4, 1, 1 ):- అగ్ని హోత్రం జరామరణ పర్యంతం చేయతగ్గ సత్రం. ముసలితనమో, మృత్యువో వచ్చి నప్పుడు మాత్రమే ఈ కర్మ మనల్ని విడిచి పెడుతుంది. అని అనటం వలన ఆయువు ఉన్నంత కాలం కర్మ అనుష్టించడంలో జ్ఞానం కర్మకు అంగమని స్పష్టమౌతోంది. కనుక సుదీర్ఘమైన పూర్వ పక్ష వాదన తరువాత వ్యాస మహర్షి పై ఆరు సూత్రాలను సమాధానం చెబుతూ సూత్రీకరించారు.
సూత్రం :- 433
" అధికోపదేశాత్తు బాదరాయణ స్త్వెవం తద్దర్శనాత్ "
తు :- ఈ వాదం సరియైనది కాదు. అధిక ఉపదేశాత్ :- జ్ఞానాన్ని కర్మాంగంగా ప్రకటించడం ఉచితం కాదని బాదరాయణస్య :- వ్యాసుడు, ఏవం :- ( 3, 4, 1 లో ) ఇది వరకే చెప్పి ఉన్నారు. తత్ దర్శనాత్ అధిక ఉపదేశాత్ :- వేద, ఉపనిషత్తులలో దీని విషయంలో అధికంగా ఉపదేశించారు.
భావం:- ఈవాదం సరియైనది కాదు. జ్ఞానాన్ని కర్మాంగంగా ప్రకటించడం ఉచితం కాదని వ్యాసుడు ఇది వరకే చెప్పియున్నారు. వేదాలలోనూ, ఉపనిషత్తులలోనూ దీని విషయంలో అధికంగా ఉపదేశించారు. కనుక జ్ఞానమే మోక్షానికి కారణం, అది కర్మాంగం కాదు.
వివరణ:- ఇది (3, 4, 2) సూత్రానికి సమాధానం. విద్య అనేది కర్మ శేషం కాదు. జ్ఞానమనేది స్వతంత్రంగానే మోక్ష సాధనమని వ్యాస భగవానుడు అంటారు. ఎందుకంటే వేదాంతంలో కర్మిష్టి గురించి కర్మ శేషుడైన వాని గురించి, సంసారి గురించి చెప్పిన దానికన్నా అసంసారి చిన్మాత్రుడైన పరమేశ్వరుని గురించే ఎక్కువగా చెప్పబడింది. ఈశ్వరుడు సర్వజ్ణుడు, సర్వవేత్త అంటూ ఈశ్వరుణ్ణి గురించి ఎక్కువగా ఉపనిషత్తులలో చెప్పడం వలన ఆత్మ జ్ఞానం కర్మాంగం కాదని తెలుస్తోంది. కర్మిష్టి ఆత్మజ్ఞానం పొందినవాడుగా గుర్తింపబడ్డాడు. పరమాత్మను పొందాలంటే ఆత్మ జ్ఞానం ద్వారా పొందిన జ్ఞానమే సాధనమని, కర్మ కాదని తెలియజేశారు. కర్మకు ఎంత జ్ఞానం కావాలో అంతే జైమిని మహర్షి ఉపదేశించాడు. కర్మలు చేయడానికి శరీరం కన్నా ఆత్మ వేరు అని తెలిస్తే చాలు. అది శబ్ద అనుమాన ప్రమాణాల వలన కలుగుతుంది. ఆ జ్ఞానం కర్మకు అంగం అనవచ్చును. కాని వేదాంతశాస్త్ర రూపంలో చేసిన ఉపదేశం దీనికి మించినది. అది ఆత్మ, పరమాత్మల సాక్షాత్కారానికి యుక్తమైనది. శరీరాదుల నుంచి ప్రకృతి వరకు ఉన్న సమస్త జడ తత్త్వాల కన్నా ఆత్మ చేతనత్వం ఎంతో భిన్నం. సర్వజ్ఞం, సర్వ శక్తి మంతం అయిన పరమాత్మ చేతన, అచేతనాలన్నిటికి అధిష్టాత. జగజ్జన్మాదులకు మూలకారణం. బాదరాయణుడి దర్శనంలో ఈ ఉపదేశ్యమే ఉన్నది. ఇలాంటి జ్ఞానం వలన కర్మ సమూహం నశిస్తుంది.
ముండకోపనిషత్తు(2, 2, 7):- నిరంతరం అభ్యాసం చేసే ఉపాసకుడు ఆత్మజ్ఞానంతో ఆనందరూప బ్రహ్మసాక్షాత్కారం చేసుకుంటాడు. ఆత్మ, పరమాత్మలను తెలుసుకునేది పర విద్య. ఈ జ్ఞానం కర్మ సమూహాన్ని నాశనం చేస్తుంది. కనుక అది కర్మాంగం ఎన్నటికీ కాదు. దీనిని బట్టి ఆచార్యులలో మత భేదం ఉన్నదని అనుకోకూడదు. ఈ తేడా అధికార భేదాన్ని బట్టి వస్తుంది. అపరా విద్యలో అంతర్గతమైన ఆత్మ జ్ఞానం కర్మకు అంగం కావచ్చును. పరా విద్య బోధిత బ్రహ్మ జ్ఞానం మోక్ష సాధనం. అది కర్మాంగం కాదని అభిప్రాయం.
సూత్రం :- 434
" తుల్యంతు దర్శనమ్ "
తు :- జ్ఞానం కర్మకు అంగం కానేరాదు. దర్శనం :- శిష్ఠాచార దర్శనం లాగా, తుల్యమ్ :- శాస్త్రంలో కర్మనుష్ఠానం శిష్టాచారమైనట్లు, కర్మ త్యాగం కూడా శిష్టాచారంగా భావించాలి.
భావం :- జ్ఞానం కర్మకు అంగం కానేరాదు. శిష్ఠాచార దర్శనం లాగా శాస్త్రంలో కర్మనుష్ఠానం శిష్టాచారమైనట్లు, కర్మ త్యాగం కూడా శిష్ఠాచారంగా భావించాలి. ఇది 3, 4, 3 కు సమాధానం.
వివరణ:- తత్త్వజ్ఞానం కర్మలకు అంగం కాదు అనే మాటకు వేద ప్రమాణం ఉంది. కావషేయమానులు, బ్రహ్మజ్ఞానులు వారు "మనం వేదాధ్యయనం చెయ్యటంఎందుకు యజ్ఞయాగాదులు చెయ్యటంఎందుకు? అనిఅడిగారు. దానికి బృహదారణ్యకంలో నేనే పరమాత్మను అని తెలుసుకొని, బ్రాహ్మణులైనవారు పుత్రులు, ధనం, మొదలైన ఐహికవాంఛలను వదలి, భిక్షాటన చేస్తూ ఉంటారు అని చెప్పబడింది. అంటే బ్రహ్మజ్ఞానులు కర్మలు చెయ్యరు. కర్మచేసినా, చేయకపోయినా వారికి ఒక్కటే. కాబట్టి విద్య కర్మాంగం కాదు.
బృహదారణ్యకోపనిషత్తు(4, 4, 22):- బ్రహ్మ ప్రాప్తి కోరే సన్యాసులు సర్వం త్యజిస్తారు. శ్రేష్ఠ విద్వాంసులు సంతానం లాంటి వాటిని కూడా కోరుకోరు. ఈలోకం, ఆత్మ మనదే అయినప్పుడు ఈ సంతానం మనం ఏమి చేసుకుంటాం? ఈ కారణాల వలన ఆత్మ జిజ్ఞాసువులు సంతానం, ధనం, కీర్తి అన్నింటిని వదిలేసి జీవన యాత్ర కొరకు భిక్షాటనం చేస్తారు. కర్మానుష్ఠానం గృహస్థాది ఆశ్రమాల్లో చేస్తారు. ఆత్మ జిజ్ఞాసువులు కర్మలను త్యజిస్తారు. (2, 4, 15):- యాజ్ఞవల్క్యుడు సన్యసిస్తూ తన భార్య అయిన మైత్రేయికి బ్రహ్మజ్ఞానం అమృతత్వానికి సాధనమని అంటాడు. తాను సర్వంత్యజిస్తాడు. ఇలా కర్మనుష్ఠానం శాస్త్ర దృష్టిలో సమానం కావడం వలన జ్ఞానం కర్మకు అంగం అనడం ప్రామాణికం కాదు. కర్మానుష్ఠానాన్ని చిత్తశుద్ధి కోసం శాస్త్రాలు నిర్దేశించాయి. జనకమహారాజు యజ్ఞ యాగాదులు సమాజశ్రేయస్సు కోసమే నిర్వహించాడు. యధారాజా తధాప్రజా అన్నట్లు రాజు యజ్ఞయాగాదులు నిర్వహిస్తే ప్రజలు కూడా నిర్వహిస్తారు. రాజు అవినీతి పరుడైతే ప్రజలు కూడా అవినీతి మార్గాన్నే అనుసరిస్తారు. జనకుడికి కర్మతో పని లేదు. లాభం లేదు. సాధారణ ప్రజలు, మోక్షాన్ని పొందాలనుకునే వారు విధిగా క్రతువులు నిర్వహించాలి. లోకకళ్యాణం కొరకు మాత్రమే మహారాజు యజ్ఞయాగాదులు చేశాడు కనుక జ్ఞానమే మోక్షానికి సాధనమని, కర్మ సాధనం కాదని వ్యాస మహర్షి తెలియజేశారు.
సూత్రం :- 435
" అసార్వత్రికీ "
అసార్వత్రికీ :- యదేవ విద్యయా అనే ఈ వాక్యం సర్వ విద్యా విషయకం కాదు.
భావం :- ఈ సూత్రం ( 3, 4, 4 ) కి సమాధానం. యదేవ విద్యయా అనే ఈ వాక్యం సర్వవిద్య విషయకం కాదు.
వివరణ:- ఛాందోగ్యం(1, 1, 10)లో విద్యాయుక్తుడై శ్రద్ధతో, యోగంతో, చేసిన కర్మ మిగతా వాటి కన్నా ప్రబలంగా ఉంటుందని చెప్పబడింది. ఉద్గీత, ఉపాసన విద్యకు సంబంధించినదే కాని సర్వఉపాసనలకు చెందినది కాదని నిశ్చితంగా తెలుస్తోంది. యదేవ విద్యయా కరోతి అనే శ్రుతి అన్ని విద్యలకు సంబంధించినది కాదు. ఎందువలననగా అది ప్రకృతమైన విద్యకు సంబంధించినది. విద్య, శ్రద్ధ, యోగం తో కలసి చేసిన కర్మ శక్తివంత మౌతుంది. కర్మద్వారా జ్ఞానం పొందవచ్చును కాని మోక్షాన్ని పొందలేరు. పరమాత్మ జ్ఞానస్వరూపుడు కనుక ఆత్మజ్ఞానం తప్పనిసరిగా పొందాలి. వారే మోక్షాన్ని పొందగలరు.
సూత్రం :- 436
" విభాగః శతవత్ "
శతవత్ :- నూరు నాణాల లాగా, విభాగః :- విద్యా విభాగాన్ని కూడా తెలుసుకోవాలి.
భావం :- రూపాయికి నూరు నాణేల లాగా విద్యా విభాగాన్ని కూడా తెలుసుకోవాలి.
వివరణ:-ఇది (3, 4, 5)కి సమాధానం. ఒకరూపాయికి అనేక చోట్ల వాడుకలో నూరు భాగాలుగా విభజించారు. పది రూపాయి లను ఇద్దరికీ పంచి ఇవ్వాలంటే చెరొక ఐదురూపాయిలు ఇస్తారు. అలాగే విద్య, కర్మ ఈరెండూ పరలోకం వెళ్లేవాళ్ళను అనుసరిస్తాయి. సాధకులకు విద్యను, కర్మను విభయించే ఇవ్వాలి. ఇక్కడ విద్య జ్ఞానిని అనుసరిస్తే, కర్మ సంసారిని అనుసరిస్తుంది.
బృహదారణ్యకోపనిషత్తు(4, 4, 2):- తం విద్యా కర్మణీ సమన్వార భేతే " విద్య అంటే అపర విద్య. పరా విద్య కాదు. ఎందుకంటే ఈప్రకరణం కామించే వాడికి సంబంధించినది. అపరా విద్యకు చెందిన ప్రసంగం. ఇక్కడ విద్య, కర్మ అనే విభాగాన్ని నాణేల విభాగంలాగా తెలుసుకోవాలి. ఒకడి నుంచి భూమిని, మరొక వ్యక్తి నుంచి ఎద్దుల్ని తీసుకొని వాళ్ళిద్దరికీ తన దగ్గర ఉన్న సొమ్మును విభజించి చెల్లిస్తారు. అలాగే పరలోక యాత్రకుడికి విద్య, కర్మ రెండూ ఉపయోగపడతాయి. జ్ఞానికి విద్య, కర్మిష్టికి కర్మ సహాయకాలు. కనుక విద్య అనేది కర్మకు అంగంగా ఎన్నటికీ సిద్ధించదు. (4, 4, 6):- " ఇతి ను కామాయ మానః " అని తరువాత అన్నారు. దాని తరువాత కామించని వాడి గురించి " అధా కామాయ మానః " అని చెప్పారు. ఈ విధంగా బ్రహ్మ జిజ్ఞాస ప్రకరణాన్ని వేరే చేశారు. పరావిద్య వలన బ్రహ్మ జ్ఞానం సిద్ధిస్తుంది. కనుక అది కామనకు క్షేత్రం కాదు. కామనకు చెందిన ప్రకరణంలో చెప్పిన కధనం పరా విద్యాంతర్గతం కాదు. కర్మ, జ్ఞానం రెండూ కలసి ఉండవు. రెండూ వేర్వేరు గానే ఉంటాయి. పాప పుణ్యాలు, జ్ఞానం జీవుడు మరణించిన తరువాత వెంట వెడతాయి. ఎవరైతే మోక్షార్థులై జ్ఞాన మార్గంలో ఉంటూ శ్రవణ, మనన, నిధి ధ్యాసలతో ఆత్మ జ్ఞానం పొందుతారో వారి వెంట జ్ఞానం వెడుతుంది. ఈ కారణం చేత జ్ఞానం, కర్మ వేరు. పాప పుణ్యాలు రెండింటిలో చేసిన పాపాలకు శిక్ష అనుభవించక తప్పదు. సత్కర్మలు చేస్తే సద్గతులు కలగవచ్చును. మంచి జన్మ రావచ్చును. జ్ఞాని మాత్రం పాపపుణ్యలను ఇక్కడే వదలివేస్తాడు. అతనిని దూషించిన వారికీ పాప కర్మల ఫలితం , అతనిని సేవించి, పూజించిన వారికి పుణ్యకర్మ ఫలితం చేరతాయి.
సూత్రం :- 437
" అధ్యయన మాత్రవతః "
అధ్యయన మాత్రవతః :- వేదాధ్యయనం చేసే వాడికి మాత్రమే కర్మానుష్ఠాన విధానం చెప్పారు కాని బ్రహ్మ జ్ఞానికి కాదు.
భావం :- వేదాధ్యయనం చేసే వాడికి మాత్రమే కర్మానుష్ఠాన విధానం చెప్పారు కాని బ్రహ్మ జ్ఞానికి కాదు.
వివరణ:- ఇది (3, 4, 6)కు సమాధానం. వేదాధ్యయనం చెయ్యాలి. శిష్యులకు బోధించాలి అనేది వేదాధ్యయనం చేసే వారికీ చెప్పారు కాని బ్రహ్మజ్ఞానులకు కాదు. ఛాందోగ్యంలో చెప్పిన గురువుకు శుశ్రుష చేసి విద్యను అభ్యసించాలి అనే విధులు కర్మాధికారం కోసం చెప్పినదే కాని జ్ఞాని కోసం కాదు. జ్ఞాని అయినవాడికి వేదాధ్యయనం, కర్మానుష్ఠానం అవసరం లేదు.
ఛాందోగ్యోపనిషత్తు(8, 15, 1):- ఆచార్య కులాత్ వేద మధీత్య అనే వాక్యంలో వేదార్ధ జ్ఞాతకు కర్మానుష్ఠానం విధిస్తుంది. వేదం అధీత్య అంటే వేదాన్ని అధ్యయనంచేసి అని అర్ధం. అధ్యయనం అంటే ఆచార్యుడి వలన వేద పదాల అర్ధం తెలుసుకోవడం. అలాంటి వాడికే కర్మనుష్టానం. బ్రహ్మజ్ఞానికి కాదు. కాబట్టి జ్ఞానం కర్మకు అంగం కానేరదు. వేదాధ్యయనం చేసే వారి కోసం కర్మలు నిర్దేశించబడ్డాయి.వేదం అభ్యసించి దేవాలయాలలో అర్చకస్వాములుగా ఉండటం, వేదపాఠశాలలో విద్యార్థులకు వేద విద్య బోధించడం, యజ్ఞయాగాదులు నిర్వహించడం మొదలైన కర్మలు నిర్వహించడానికి ఉపనిషత్తులలోని మంత్రాలు తెలుసుకోవాలి. కర్మలుచేసే వాడికే విద్య బోధిస్తారు. తనని తాను తెలుసుకున్న బ్రహ్మ జ్ఞానికి యజ్ఞ యాగాది క్రతువులు అవసరం లేదు. నిష్కామ కర్మలు చేస్తూ జ్ఞానాన్ని సంపాదించడానికి కర్మలు చెయ్యాలి కాని జ్ఞానం పొందిన తరువాత కర్మానుష్టానంతో అవసరం లేదు. కేవలం ఆత్మ జ్ఞానం వలనే మోక్షం సిద్ధిస్తుందని మహర్షి అభిప్రాయం.
సూత్రం :- 438
" నా విశేషాత్ "
అవిశేషాత్ :- విశేషించి చెప్పడం వలన, న :- బ్రహ్మ జ్ఞానం కర్మకు అంగం కాదు.
భావం :- విశేషించి చెప్పడం వలన బ్రహ్మ జ్ఞానం కర్మకు అంగం కాదు.
వివరణ:-ఇది(3, 4, 7)కు సమాధానం. లోకంలో అగ్నిహోత్రాది కర్మలుచేస్తూ వందసంవత్సరాలు బ్రతకాలని చెప్పినది కర్మిష్ఠులకే కాని బ్రహ్మజ్ఞానులకు కాదు. ఆయుఃపర్యంతం కర్మలు చేయాల్సిన వాడు జ్ఞానా? అజ్ఞానా? వీరిలో ఎవరు చేయాలో విశేషించి చెప్పలేదు. ఇది సామాన్యవచనం. బ్రహ్మజ్ఞాని సంపత్తి కోసం నిష్కామకర్మానుష్ఠానం చెయ్యాలి. ఇది బ్రహ్మజ్ఞాని కానివాడికి కావాలి. ఇలాంటివాడే ఆయుః పర్యంతం కర్మలను చేస్తాడు. జ్ఞాని అయిన వాడు కర్మలు చేయడం, చేయకపోవడంలో స్వతంత్రుడు. బ్రహ్మజ్ఞాని కాని వాడికి కర్మానుష్ఠానం తప్పనిసరి. ఇలాంటి నియమం ఉండటం వలన జ్ఞానం కర్మకు అంగం అనడం సిద్ధించడం లేదు. ఆత్మజ్ఞానం పొందాలనుకునే వారు మనోబుద్ధుల్లో దోషం లేకుండా ఉండాలి. ఈ జగత్తంతా వ్యాపించినది సర్వంతర్యామి అయిన పరమాత్మయే అనే భావన మనస్సులో రావాలి. కర్మలు చేస్తూ ఉంటే మనస్సుకు కళంకం అంటదు. జ్ఞానం పొందే వరకు నిష్కామ కర్మలు చెయ్యాలి. నామరూపగుణాలకు సంబంధించిన కర్మలన్నింటిని త్యాగం చేస్తేనే జ్ఞానం కలిగి, తద్వారా మోక్షం వస్తుంది.
సూత్రం :- 439
" స్తుతయే నుమతిర్వా "
వా :- లేదా, స్తుతయే :- కర్మను ప్రశంసించడానికి, అనుమతిః :- జీవిత పర్యంతం కర్మానుష్టా నాన్ని అనుమతించవచ్చును.
భావం :- కర్మను ప్రశంసించడానికి జీవిత పర్యంతం కర్మానుష్ఠానాన్ని అనుమతించ వచ్చును.
వివరణ:- తత్త్వజ్ఞానికి కర్మానుష్టానం కేవలం స్తుతి కోసమే. జీవిత పర్యంతం కర్మ చెయ్యనప్పటికీ తత్త్వవేత్త యందు విద్యా సామర్ధ్యం వలన కర్మ లోపం ఉండదు. జ్ఞానాన్ని కలిగించడానికి కర్మలు ఎంతో ఉపకరిస్తాయి. అందువలన అవి స్తుతికి యోగ్యమైనవి. యజ్ఞయాగాది క్రతువులు ఘనంగా నిర్వహించినప్పుడు చూసిన వారందరు ప్రశంసిస్తారు. అందుచేత అలాంటి ఉపకరించే కర్మలను త్యజించడం జ్ఞానికి ఉచితం కాదు. శిష్టాచారాన్ని పాలించడానికో, లోక వ్యవహారానికో జ్ఞాని సైతం జీవితపర్యంతం కర్మలను అనుష్ఠించవచ్చును. దానినే " కుర్వ న్నేహ " లాంటి శాస్త్ర వచనాలు అనుమతిస్తాయి. కనుక, ఇది కర్మను స్తుతించడానికే కాని జ్ఞానం కర్మాంగం అని చెప్పడానికి కాదు. లేదా "ఈశావాస్యమిదం" అనే ప్రకరణం బ్రహ్మ జ్ఞానానికి సంబంధించినదని అనవచ్చును. అప్పుడు జ్ఞాని కర్మలు చేస్తూ కూడా వాటితో ప్రభావితుడు కాడు. ఆత్మ జ్ఞాని కేవలం సాక్షిగా మాత్రమే చూస్తాడు. ఆకర్మలన్నిటికీ అతడు కర్త కాదు. కర్మలు జ్ఞానిని లోబరచుకోవు. దీనినే " న కర్మ లిప్యతే నరే " జ్ఞానికి కర్మలు అంటవు.
సూత్రం :- 440
" కామ కారేణ చైకే "
చ :- అది కాక, ఏకే :- కొందరు, కామ కారేణ :- జ్ఞానులు ఇష్టానుసారంగా అగ్ని హోత్రాదులు చేయవచ్చును. లేదా విడువ వచ్చును.
భావం :- జ్ఞానులు ఇష్టానుసారం అగ్ని హోత్రాది కర్మలు చేయవచ్చును. లేదా విడువ వచ్చును.
వివరణ:-కౌషీతకీ, వాజసనేయశాఖలకు సంబంధించినవాళ్ళు, జ్ఞానిఅయినవాళ్ళు, తమ ఇష్టప్రకారం కర్మలను పరిత్యజించ వచ్చును. వాజసనేయశాఖవారు కొందరు గృహస్థాశ్రమాన్ని త్యాగం చెయ్యాలని చెబుతున్నారు. అంటే జ్ఞానులైన వారు, సంసారబంధాలు విడిచి పెట్టినవారు, విరాగులు ఈ సంతానకర్మల వలన ప్రయోజనం లేదు. మనకు ఆత్మలోకం కావాలి అని భావించే వారు కర్మలకు ప్రాధాన్యం ఇవ్వరు.
కౌషీతకీబ్రాహ్మణం(2, 5):-అంతంఉన్న ఇతర ఆహుతులు కర్మ మయాలు అవుతున్నాయి. అందువల్ల పూర్వ విద్వాంసులు అలాంటి ఆహుతులతో హోమం చెయ్యరు.
బృహదారణ్యకోపనిషత్తు(4, 4, 22):-ఉత్తమజ్ఞానులు సంతతి కోరుకోరు. బహుకర్మలుండే గృహస్థాదిఆశ్రమాల్లో ప్రవేసించా లనుకోరు. సంతతివలన తమకు ఏమి ప్రయోజనం? అంటారు. వాళ్లకు ధనం, సంతతి, ప్రతిష్టలతో ప్రయోజనం లేదు. వాళ్లకు సర్వం బ్రహ్మమయమే. అందువలన వాళ్ళు అన్ని విడిచి పెట్టి భిక్షాటన తోనే జీవనం గడుపుతారు. ఇలాంటి ప్రసంగాన్ని బట్టి జ్ఞానులు కర్మలను కోరి త్యజిస్తారని, స్పష్టమౌతోంది. కనుక జ్ఞానం కర్మాంగంకాదు. కొందరు స్వేచ్ఛగా కర్మలను పరిత్యజిస్తారు. కొందరు విద్వాంసులు విద్యాఫలాన్ని ప్రత్యక్షం చేసుకున్నవారై, ఆ విద్య యొక్క అవస్టంభం అంటే దాని బలం చూసుకొని ఇతర ఫలాలకు సాధనలైన సంతానాదులు నిష్ప్రయోజనాలని, నిస్సంశయంగా చెబుతున్నారు. ప్రాచీనులైన విద్వాంసులు సంతానం కోరుకోవడం లేదు. మనకు ఆత్మ అనే లోకంఉండగా సంతానంతో పని ఏమి? అని వాజసనేయ శ్రుతి చెబుతున్నది. విద్యాఫలం వెంటనే అనుభవానికి వస్తుంది. కర్మఫలం వలె కాలాంతరంలో లభించేది కాదు అని అనేక పర్యాయములు చెప్పియున్నారు. ఆత్మజ్ఞానం ఎంతగొప్పదో, ఎంత అపురూపమైనదో, తెలుసుకుంటేనే ఆత్మజ్ఞానం ప్రాధాన్యత తెలుస్తుంది. జ్ఞానం స్వతంత్రమైనదని, జ్ఞానమే మోక్షానికి సాధనమని చెప్పబడింది. కర్మల వలన మోక్షం రాదని తెలుస్తోంది.
సూత్రం :- 441
" ఉప మర్ధం చ "
ఇక్కడ ఏకే అనేది అనువృత్తి. చ :- కాగా, ఉపమర్దం :- కొన్ని శాఖల వాళ్ళు జ్ఞానం వలన కర్మలు నశిస్తాయని అంటున్నారు.
భావం :- కొన్ని శాఖల వాళ్ళు జ్ఞానం వలన కర్మలు నశిస్తాయని అంటున్నారు. కనుక జ్ఞానం కర్మకు అంగం కానేరదు.
వివరణ:- కొందరు విద్వాంసులు వైరాగ్యం గురించి చెబుతున్నారు. విద్యావేత్తకు సర్వము ఆత్మ స్వరూపంగా కనిపిస్తుంది. అతడికి కర్త అనే భావం ఉండదు. కర్మ జరగాలంటే కర్త, కర్మ రెండూ ఉండాలి. అన్ని వ్యవహారాలనుంచి విడుదలైన తరువాత బ్రహ్మవేత్తకు సర్వము ఆత్మ అయినప్పుడు ఉన్నదంతా ఒక్కటే అయినప్పుడు చేసేది - చేయబడేది, చూసేది - చూడబడేది ఏమి ఉండదు. ఆ రెండూ ఒక్కటైన ఆత్మజ్ఞానికి కర్త, కర్మ, క్రియ ఉండవు. అటువంటి కర్మ అవసరం లేదు. విద్యాఫలం అంటే ఆత్మసాక్షాత్కారం స్వస్వరూప జ్ఞానంలో కర్మ చేయాలంటే అవకాశం ఉండదు. కర్మలు అవసరం లేదు. జ్ఞానం స్వతoత్రం. కాబట్టి విద్య కర్మాంగం కాదు.
ముండకోపనిషత్తు(2, 2, 8):-ఆపరబ్రహ్మ సాక్షాత్కారంతో అతడి కథలు క్షీణిస్తాయి. అంటే అతను చేసిన కర్మలు ఫలోత్పాదన శక్తిని కోల్పోతాయని భావం. దీనిని బట్టి జ్ఞానం కర్మకు అంగమైన పక్షంలో జ్ఞానం వలన కర్మలు నశిస్తాయి అనడం పోసగదు కదా! కనుక జ్ఞానం కర్మకు అంగం కాదు.
సూత్రం :- 442
" ఊర్ధ్వ రేతస్సు చ శబ్దే హి "
ఊర్ధ్వ రేతస్సు :- ఊర్ధ్వ రేతస్సులో కర్మానుష్టానం ఉండదు. హి :- కదా, చ :- పైగా, శబ్దే :- శాస్త్రాల్లో ఊర్ధ్వ రేతస్కు లున్నట్లు ప్రమాణాలున్నాయి.
భావం :- ఊర్ధ్వరేతస్సులో కర్మానుష్ఠానం ఉండదు కదా! పైగా శాస్త్రాల్లో ఊర్ధ్వరేతస్కులున్నట్లు ప్రమాణాలున్నాయి.
వివరణ:- నైష్ఠిక బ్రహ్మచర్యం పాటిస్తూ, బ్రహ్మజ్ఞానం కొరకు ప్రయత్నించే త్యాగుల్ని ఊర్ధ్వరేతస్కులు అంటారు. వీరికి బ్రహ్మ చర్యం, సన్యాసం అనే రెండు ఆశ్రమాలలోనే సంబంధం ఉంటుంది. వీళ్ళ ఆశ్రమాల్లో బ్రహ్మజ్ఞాన నిష్ఠ శాస్త్రవిహితం. కాగా వీరికి అగ్నిహోత్రాదికర్మలు ఆచరించడం తప్పని సరికాదు. బ్రహ్మవిద్య కేవలం సన్యాశ్రమంలోనే వినిపిస్తుంది. ఇంకెక్కడా వినిపించదు. కాబట్టి విద్య కర్మాంగంకాదు. యతులకు అగ్నిహోత్రాది కర్మలులేవు. వారి దృష్టిలో విద్య అంటే బ్రహ్మజ్ఞానం. ఆత్మలోకం కోరే సన్యాసులు కర్మలు త్యజిస్తారు. వారు కర్మలు చెయ్యరు. కర్మ చేసినా, చెయ్యక పోయిన వారికీ ఫలితం ఒక్కటే. కాబట్టి బ్రహ్మవిద్య స్వతంత్రంగానే మోక్ష సాధనం అని చెప్పబడింది.
ఛాందోగ్యం(5, 10, 1):- వీళ్ళు అరణ్యంలో శ్రద్ధతో తపస్సుచేస్తూ, ఉపాసిస్తుంటారు. (2, 23, 1):- ధర్మస్కందాలు మూడు. యజ్ఞం, ధ్యానం, అధ్యయనం. మొదటిదైన యజ్ఞాన్ని ఆచరించే వాళ్ళు పుణ్య ఫలాలైన సుఖాలను పొందుతారు. రెండవది తపస్సు. మూడవది గురుకుల వాసం, బ్రహ్మ చర్యం. ఇలా బ్రహ్మ చర్యాది తపస్సులు శ్రద్ధతో చేసి బ్రహ్మజ్ఞానం ఉన్న వాళ్ళు మోక్షానికి అర్హులౌతారు. ఇలాంటి ఊర్ధ్వరేతస్కులకు శాస్త్రాల్లో జ్ఞాన నిష్ఠను విధించారని పై వాక్యాల వలన తెలుస్తోంది. జ్ఞానం కర్మాంగం ఎన్నటికీ కాదని, జ్ఞానమే మోక్షానికి స్వతంత్ర కరణం అని చెప్పారు.
ముండకోపనిషత్తు (1, 2, 11):- శాంతులు, బ్రహ్మ జిజ్ఞాసువులు బిక్షాటనం చేస్తారు. శ్రద్ధతో తపస్సు చేస్తూ ఉపాసిస్తారు.
బృహదారణ్యకోపనిషత్తు(4, 4, 22):- బ్రహ్మప్రాప్తికోరి, విరక్తులైన వాళ్ళు సన్యాసులౌతారు. .ఊర్ధ్వరేతస్కులైనవారు శ్రద్దా తపో నిష్ఠులై అరణ్యంలో నివసిస్తూ, ఆత్మరూపమైన లోకాన్ని కోరుకుంటూ ఉపాసిస్తారు. గార్హస్థ్యం గ్రహించినా, గ్రహించక పోయినా ఋషిఋణం, దేవఋణం, పితృఋణం అనే మూడు ఋణాలను తీర్చుకున్నా, తీర్చుకొనక పోయినా ఊర్ధ్వరేతస్త్వం శ్రుతి, స్మృతులలో ప్రసిద్ధంగా ఉంది. అందువలన విద్య స్వతంత్రమైనది.
పరామర్శధికరణం ( 3, 4, 18 )
సూత్రం :- 443
" పరామర్శం జైమిని రచోదనా చాపవదతి హి
జైమినిః:- జైమినిమహర్షి ప్రకారం, శబ్ద :- పూర్వ సూత్రంలో చెప్పిన ఛాందోగ్య వాక్యంలో ఉండే సన్యాస ఆశ్రమం కేవలం ఔపచారికం. విధి కానేరాదు. హి :- ఎందుకంటే, ఆచోదనా :- అందులో విధిని సూచించే పదాల ప్రయోగం లేదు. చ :- పైగా, అపవదతి :- నిషేదిస్తోంది కూడా.
భావం :- ఇది పూర్వపక్ష సూత్రం. జైమినిమహర్షి ప్రకారం పూర్వసూత్రంలో చెప్పిన ఛాందోగ్యవాక్యంలో ఉండే సన్యాస ఆశ్రమం కేవలం ఔపచారికమే. విధికానేరదు. ఎందుకంటే దానిలో విధిని సూచించే పదాల ప్రయోగం లేదు. పైగా నిషేదిస్తోంది కూడా.
వివరణ:- గురువు గారు! బ్రహ్మ విద్య ద్వారానే మోక్షం వస్తుంది అన్నారు. సన్యాసాశ్రమంలో దీనికి కర్మ అనేది లేదన్నారు. అయితే అసలు సన్యాసాశ్రమం అనేది ఉన్నదా? ఉంటే దానిని ఆచరించవచ్చునా? లేదా? అని అడిగాడు నారాయణ భట్టు. సన్యాసాశ్రమంగురించి చెప్పడంలో విధాయకమైన గుణాలు ఏమిలేవు. కొన్ని శ్రుతులు దీనిని నిషేధించాయి. అయినప్పటికీ శాస్త్రాలు సన్యాసాశ్రమాన్ని అంధపరంపరన్యాయంగా చెప్పాయి అని జైమిని అభిప్రాయం. అంధపరంపరన్యాయం అంటే ఒక గ్రుడ్డివాని చెయ్యిపట్టుకొని మరొక గ్రుడ్డివాడు అలానడచి వెడుతుంటాడు. త్రోవలో ఏమున్నదో ముందు నడిచేవాడికి తెలియదు. వెనుక నడిచే వాడికి తెలియదు. అదేవిధంగా ఒక శాస్త్రంలో చెప్పారు కాబట్టి ఇంకొక శాస్త్రంలో సన్యాసాశ్రమం గురించి వ్రాశారు. అసలు ఆశ్రమాలు మూడేనని అని జైమిని మహర్షి అభిప్రాయం.
1. బ్రహ్మ చర్యం :- గురుకుల వాసంలో గడిపేది.
2. గృహస్థాశ్రమం :- యజ్ఞం, వేదాధ్యయనం, దానాలు చేసేది.
3.వానప్రస్థం :- తపస్సు చేయుట
ఈ రకంగా మూడు ఆశ్రమాలే చెప్పబడ్డాయి. వాటిలో సన్యాసాశ్రమం లేదు అని జైమిని అంటాడు.
తైత్తరీయసంహిత(1, 5, 2, 1):-దేవసంబంధమైన అగ్నిని త్యజించినవాడు వీరఘాతకుడౌతాడు. కనుక అగ్నిహోత్రాది కర్మలను విడిచి పెట్టినవాడు నిందాపాత్రుడన్నమాట. అలాగే శాస్త్రము గృహస్థాశ్రమాన్ని ప్రశంసిస్తోంది.
తైత్తరీయాసంహిత(1,11):-ఆచార్యునికి కావలసిన ధనాన్ని తెచ్చిఇచ్చి, సంతతిక్రమాన్ని విచ్చేధనంచెయ్యకు అని స్నాతకు డైన శిష్యునికి ఉపదేశం. స్నాతకుడివై, గృహస్థా శ్రమాన్ని స్వీకరించి సంతానాన్ని వృద్ధి చెయ్యి అని అర్ధం. ఎందుకంటే సంతాన హీనుడు లోకంలో సుఖపడడు.
ఐతరేయబ్రాహ్మణం(7, 13, 12) :-ఈ శాస్త్రవచనాలు గృహస్థాశ్రమ త్యాగాన్ని నిషేదిస్తున్నాయి. కర్మత్యాగం చేసే ఆశ్రమాన్ని ఇలా శాస్త్రాలు అంగీకరించడం లేదు కదా! కాషాయవస్త్రాలు ధరించిన వారు మాత్రమే సన్యాసులు కారు. సం - న్యాసం పూర్తిగా కర్మలను సన్యసించినవారు సన్యాసులు. అలాంటి వారికే బ్రహ్మవిద్యాధికారం వస్తుంది. గురువు శుష్రూష చేసి అత్యంత శ్రద్ధాభక్తులతో గురువు దగ్గర విద్య నేర్చుకొని, శ్రవణం, మననం చేస్తూ, కర్మలను పూర్తిగా విడిచిన వారికే బ్రహ్మవిద్యాప్రాప్తి లభించి, తద్వారా మోక్షాన్ని పొందగలరు.
సూత్రం :- 444
"అనుష్టేయం బాదరాయణః సామ్యశ్రుతేః "
సామ్యశ్రుతేః:-మూడుఆశ్రమాలసామ్యాన్ని బోధించే శాస్త్రాలు ఉన్నాయి. అనుష్టేయం:- పరివ్రాజకఆశ్రమం అనుష్టించాల్సినదే. బాదరాయణః :- బాదరాయణుడి మతం.
భావం :- మూడు ఆశ్రమాల సామ్యాన్ని బోధించే శాస్త్రాలు ఉన్నాయి. పరివ్రాజక ఆశ్రమం అనుష్టించ వలసినదేనని బాదరాయణుడి మతం.
వివరణ:-ఈ అధికరణంలో సన్యాసాశ్రమం గురించి వేదాలలో చెప్పబడినట్లు తెలుస్తోంది. సన్యాసాశ్రమం అనుష్ఠించదగినదని వ్యాసుడు అంటారు. వేదంలో గృహస్థాశ్రమంతో బాటే సన్యాసాశ్రమం కూడా ఉందని చెప్పారు. ముందు చెప్పిన మూడు ఆశ్రమాల వలన పుణ్య లోకాలు ప్రాప్తిస్తాయని చెప్పారు. నాల్గవది అయిన సన్యాసాశ్రమం దీనికి భిన్న మైనది. ఇది మోక్ష ప్రాప్తి సిద్ధించడానికి ఉపయోగపడుతుంది. అందుకే దీనిని అనుష్ఠించాలి.
ఛాందోగ్యోపనిషత్తు(2, 23, 1):-"త్రయోధర్మస్కంధాః బ్రహ్మసంస్ధోమృతత్వ మేతి " ఇందులో ఆశ్రమాలన్నింటిని సమానంగా వర్ణించారు. ధర్మానికి మూడుఆధారాలు. అవి యజ్ఞం, అధ్యయనం, దానం, అనేవి గృహస్థాశ్రమంలో మొదటిస్కందం. తపస్సు ప్రధానంగాఉన్న వానప్రస్థ రెండోస్కందం. ఆచార్యకులంలో బ్రహ్మ చర్యాన్ని పాటిస్తూ, నిర్వహించే బ్రహ్మచర్య ఆశ్రమం మూడవస్కంధం. ఈమూడు ఆశ్రమాల్లో కర్మనుష్ఠానం సమానమే. ఈ ఆశ్రమధర్మాలను పాటించినవారికి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. దాని తరువాత నాల్గవ ఆశ్రమం సన్యాసం. కామ్యకర్మలను త్యజించి, నిరంతర శ్రద్ధతో, ఉపాసన ద్వారా బ్రహ్మ సాక్షాత్కారం చేసుకునే వాణ్ణి బ్రహ్మ సంస్థ అంటారు. సన్యాశ్రమం కర్మ త్యాగ భరితం. జ్ఞానప్రదమైనది కూడా.ఛాందోగ్యం లో ఆశ్రమాలన్నిటిని సమానం అన్నారు. ఒక దాన్ని చెప్పి, మరో దానిని విడిచి పెట్టలేదు. అందువలన కర్మ ప్రధానమైన ఆశ్రమమే వేద విహితం అనకూడదు.
జాబాలి ఉపనిషత్తు:- బ్రహ్మ చర్యాన్ని పూర్తి చేసిన తరువాత గృహస్థు కావాలి. ఆ తరువాత వానప్రస్థం, తరువాత సన్యాసం స్వీకరించాలి. ఎప్పుడు విరక్తి కలిగితే అప్పుడే సన్యసించాలి. ఇక్కడ ఇతర ఆశ్రమలతో బాటు సన్యాశ్రమానికి కూడా విధి స్పష్టంగా ఉంది. అందువలన సన్యాసాశ్రమం శాస్త్ర విహితమే.గృహస్థాశ్రమంలో అగ్ని హోత్రం తప్పనిసరిగా చెయ్యాలి. దానిని నిషేధిస్తే పుత్ర ఘాతకుడు అవుతాడు. అగ్ని హోత్రాన్ని విడిస్తే సన్యాసి అవుతాడు. ఇది గృహస్థులకు మాత్రమే చెప్పినది కాని పరివ్రాజకులకు, సన్యాసులకు అగ్నిహోత్రం, యజ్ఞయాగాది కర్మలు చెప్పలేదు. అందుకే సన్యాసాశ్రమం అమృతత్వమని శ్రుతి సమ్మతమని చెప్పారు.అతను గృహస్టు అయిన,వాన ప్రస్థుడైనా సన్యాసాశ్రమం స్వీకరించవచ్చును.
సూత్రం :- 445
" విధిర్వా ధారణవత్ "
వా :- లేదా, ధారణ వత్ :- తైత్తరీయ సంహిత లో 'ధారయతి ' అనే శబ్ద ప్రయోగం లాగా, విధిః :- ప్రవ్రజంతి అనేది కూడా విధే అవుతుంది.
భావం :- తైత్తరీయ సంహిత లో ధారాయతి అనే శబ్ద ప్రయోగం లాగా ప్రవ్ర జంతి కూడా విధే.
వివరణ:- తైత్తరీయ సంహితలో మహా పితృయజ్ఞం లో ప్రేతాగ్ని హోత్రం ప్రసంగం ఒకటి ఉన్నది. సమిధను క్రింద ఉండేటట్లు పట్టుకొని తీసుకొనివెళ్ళాలి. దైవ హోమంలో దేవతల కోసం స్రుక్ దండానికి పై భాగంలో సమిధను పట్టుకొని ధరించాలి అని చెప్పడానికి ధారాయతి అనే విధివాక్యాన్ని ప్రయోగించారు. అలాగే ప్రవ్రజంతి(సన్యాస విధి)అనే విధివాక్యంకూడా చెప్పబడింది. ధారయతి అనే స్థలంలో ధారణ అని వాడారు. ఇలా వాడటాన్ని అపూర్వం అంటారు.
మీమాంసదర్శనం(3, 4, 3):- విధిస్తు ధారణే పూర్వత్వాత్ స్యాత్ అన్న విధి వాక్యాల వలన ప్రాప్తించని కారణంగా ధారయతి అంటే ధారణ విధి అని గ్రహించాలి. ఈ న్యాయమే ప్రవ్రజంతి అనే చోట కూడా వర్తిస్తుంది. కనుక సన్యాసాశ్రమం శాస్త్ర విహితమే. ప్రవ్రజంతి అంటే సన్యాసవిధి అని అంటున్నారు. అది బ్రహ్మలోకాన్ని ప్రశంసించే పదం ఎందుకు కాకూడదు? విధిలో చెప్పక పోయినప్పటికి సన్యాసావస్థ ఉంది. మొదటి మూడుఆశ్రమలలోనూ ఫలితం పుణ్య లోకాలు. సన్యాసాశ్రమానికి మోక్షం అని వేదాలలో చెప్పబడింది. సన్యాసమే బ్రహ్మ. బ్రహ్మశ్రేష్టుడు కదా! అందుచేత బ్రహ్మ అని చెప్పబడిన సన్యాసం కూడా పరమే. ఆతపస్సులన్నీ తక్కువ తరగతికి చెందినవే. సన్యాసమే అన్నింటి కన్నా గొప్పది. 'సన్యాసం చేత పరిశుద్ధమైన అంతఃకరణ గల యతులు', 'వేదాంత విజ్ఞానం చేత సునిచితమైన విషయంగలవాడు' మొదలైన శ్రుతులు బ్రహ్మ సంస్థునికి కర్మలు లేవని చూపుచున్నాయి. అందువలన పరివ్రాజకునికి ఆశ్రమం వలనే అమృతత్వం లభిస్తుంది. "బ్రహ్మచర్యం - వానద్వా " అనే శ్రుతి ద్వారా బ్రహ్మచర్యం నుంచి గృహస్టు, ఆ తరువాత వానప్రస్థుడుగా కావాలి. ఈ శ్రుతి కర్మ ఫలాపేక్ష లేని వాడిని దృష్టిలో ఉంచుకొని చెప్పినదని చెప్పడానికి శక్యం కాదు.. గోదానాది వేద వ్రతాలు చేసిన చేయక పోయిన, స్నాతకుడైనా, కాకపోయినా ఎవరైనా సన్యసించవచ్చును. అందువలన కర్మాచరణ చేయని ఊర్ధ్వరేతస్కులకు సన్యాసాశ్రమాలు విధించడం వలన విద్య స్వతంత్రమే అని, కర్మాంగం కాదని తెలుస్తోంది.
స్తుతి మాత్రాధికరణం ( 3, 4, 21 )
సూత్రం :- 446
" స్తుతి మాత్ర ముపాదానా దితి చేన్నా పూర్వత్వాత్ "
ఇక్కడ:- విధి, ధారణవత్ అనే రెండూ పదాలు అనువృత్తిగా వస్తాయి. ఉపదానాత్ :- బృహదారణ్యకంలో లోక మిచ్చంతః అని ఉన్నది. ప్రవ్రజంతి అనే పదం బ్రహ్మ లోకాన్ని ప్రశంసించడానికి మాత్రమే. ఇతి చేత్ :- అని అనడం, న :- సరి యైనది కాదు.
భావం:- విధి, ధారణ అనే రెండు పదాలు అనువృత్తిగా వస్తాయి. బృహదారణ్యకం(4, 4, 22)లో లోకమిచ్చంతః అనే పదం ఉన్నది. స్తుతి మాత్రం - ప్రవ్రజంతి అనే పదం బ్రహ్మలోకాన్ని ప్రశంసించడానికి మాత్రమే అని అనడం సరియైనది కాదు. ఎందుకంటే అపూర్వత్వాత్ విధి ధారణవత్ అంటే ధారణ లాగా ప్రవ్రజంతి కూడా విధి మాత్రమే అవుతుంది. బృహదారణ్యకం లో ప్రవ్రజంతి అనే పదం సన్యాసాన్ని విధించదు. బ్రహ్మలోకాన్ని మాత్రమే స్తుతిస్తుంది. 'లోకమిచ్చంతః' బ్రహ్మ లోకాన్ని కోరే వాళ్ళు అన్నింటిని త్యజిస్తారు అనడంలో ప్రధానంగా బ్రహ్మ లోకం గొప్పదనం అవగతమవుతుంది. లోకం గొప్పదనం, త్యాగానికి కారణం కనుక ఇక్కడ సన్యాసం గౌణం(అప్రధానం). అందువలన ప్రవ్రజంతి విధి వాచకం కావడం లేదు కదా! అంటే సన్యాసాన్ని విధిoచే మరో వాక్యం లేదు. అందుకే మీమాంస దర్శనంలో ధారాయతి అన్నారు. అలాగే సన్యాస విధి అపూర్వం కనుక ప్రవ్రజంతి విధాయకపదమే కాని స్తుతిమాత్ర పదం కాదు. ఉద్గీథం అన్నింటి కన్నా శ్రేష్ఠమైనది. అది పరమ రూపమైనందున సర్వోత్తమమైనది. అయితే వేదాలలో వాటి శ్రేష్ఠతను స్తుతించడం జరిగినది. ఈకీర్తనం ఉద్గీథాన్ని స్తుతిం చడానికా? లేక ఉపాసన కోసమా? అని సందేహం. ఉద్గీథాది శ్రుతులు కర్మాంగాలుగా గ్రహించబడ్డాయి. అందుచేత అది స్తుతి కోసమే అనడం సరియైనది కాదు. ఉద్గీథాదులు శ్రేష్ఠమైన గుణాలతో కూడుకొని ఉంటాయనే విషయం గాని, వాటి ఉపాసన కాని ఏ ప్రమాణం చేత ప్రతిపాదించబడలేదు. అవి అపూర్వములు. అందుచేతనే శ్రేష్ఠమైన గుణాలతో కూడిన ఉద్గీథోపాసనమే ఈ వాక్యాలలో చెప్పబడింది.
సూత్రం :- 447
" భావ శబ్దాచ్చ "
చ :- పైగా, భావ శబ్దాత్ :- భావం, క్రియకు ప్రవ్రజ్య అనేది సూచించడం వలన ప్రవ్రజంతి విధి వాచకమే.
భావం :- పైగా భావం, క్రియకు ప్రవ్రజ్య అనేది సూచించడం వలన ప్రవ్ర జంతి విధి వాచకమే.
వివరణ:- ప్రవ్రజంతి విధివాచకమే. కాని స్తుతివాచకం కాదు. బృహదారణ్యకం లో ( 4, 5, 1 ) లో యాజ్ఞ వల్క్యుడు సన్యాస ప్రకారణాన్ని ప్రారంభించి అంతలో బృహధారణ్యాకోపనిషత్తు(4, 5, 25) మైత్రేయి! ఇదే అమృతత్వప్రాప్తికి మార్గం అని చెప్పి సన్యసిస్తాడు. యాజ్ఞవల్క్యఋషి , తన ఇద్దరు భార్యలలో ఒకరైన మైత్రయిని పిలిచి, మైత్రేయీ ! నేను గృహస్థాశ్రమం వదలి సన్యాసం తీసుకోదలచాను. దానికై నీఅనుమతి కోరుచున్నాను. నీకు, కాత్యాయనికి నా సంపద విభజించి ఇస్తాను అన్నాడు. ఈధనంతో నాకు ముక్తిలభిస్తుందా? మోక్షం రాదుకదా! మోక్షాన్నిఇవ్వలేని ధనం వ్యర్థంకదా! నీవు దేనిని ముక్తికి సాధనంగా తెలుసుకున్నావో దానిని నాకుకూడా ప్రసాదించు అన్నదిమైత్రేయి. అప్పుడుఆమెకు బ్రహ్మవిద్యను బోధించాడు. ప్రవ్రజంతి ని ప్రవవ్రాజ అని సన్యాసవిధిని తెలిపారు. కాబట్టి ప్రవవ్రాజ పదం ప్రవ్రజంతి విధిని స్పష్టంగా తెలియజేస్తాయి. కనుక ఇది విధి వాచకం. ఉద్గీతముపాసీత, సామోపాసీత లాంటివిధులు ప్రత్యక్షంగాఉన్నాయి. ఈవాక్యాలన్నీ ఉపాసనావిధులనే బోధిస్తాయి.
పారిప్లవాధికరణం ( 3, 4, 23 )
సూత్రం :- 448
" పారిప్లవార్ధా ఇతి చేన్న విశేషిత్వాత్ "
పారి ప్లవార్ధః :- కధలు పారిప్లవం కోసమే. ఇతి చేత్ :- అని అనడం, న :- సరియైనది కాదు. విశేషిత్వాత్ :- అందులో విశేష ప్రతిపాదన ఉన్నది.
భావం :- కధలు పారిప్లవం కోసమే అనడం సరియైనది కాదు. అందులో విశేష ప్రత్తిపాదన ఉన్నది.
వివరణ:-పారిప్లవకర్మ అంటే అశ్వమేధయాగంలో రాత్రిపూట యజమానిని సకుటుంబంగా కూర్చోపెట్టి, అధ్వర్యుడు వేదాలలో ఉన్న కధలు చెప్పడం. బృహదారణ్యకంలో మైత్రేయి కథ ఈరకంగా చెప్పినదే కదా! లేక విద్యను స్తుతించడం కోసం చెప్పినదా? అని అడిగాడు నారాయణభట్టు. ఇక్కడ పారిప్లవం అనే మాట ఉన్నందువలన మైత్రేయికథ పారిప్లవం అనకూడదు. వేదాలలో కొన్నికధలు మాత్రమే అలా చెప్పబడ్డాయి. కాబట్టి ఉపనిషత్తులలో కథలన్నీ విద్యావిశేషాలు తప్ప కర్మశేషాలు కావు అని చెప్పాడు రత్నాకరుడు. అశ్వమేధం లాంటి చాలా కాలం చేసే యాగాలలో యజమానికి తగిన సమయంలో వినిపించే కధలను పారిప్లవం అంటారు.
ఆశ్వలాయనశ్రౌతసూత్రం(10, 6, 10):- దీనిలో పారిప్లవాన్ని చెప్పాలి అనే విధి ఉన్నది. ఇలాంటి కధలు మనోరంజకం కోసమే చెబుతారు. వీటికి స్వరూపప్రాముఖ్యం లేదు. మైత్రేయి-యాజ్ఞవల్క్య, ప్రతర్ధన-దైవోదాసి, భృగు - వరుణ, శ్వేత కేతు - వరుణ మొదలైన కథలన్నీ మనోరంజకంకోసం చెప్పినవే. ఈకథల వలన విషయం ఇంపుగా అర్ధం అవుతుంది. వీటిలోని ఘటనలు వాస్తవాలు కాదు. కనుక యజ్ఞవల్క్యుడు సన్యాసగ్రహణం విధిపూర్వకం అని సిద్ధించడం లేదు కదా! అంటే పారిప్లవంలో చెప్పిన కధలు కల్పనలు కావు. విశిష్టరూపాలు. శతపధబ్రాహ్మణంలో పారిప్లవకథలున్నాయి. అశ్వమేధ యాగం సంవత్సర కాలం పడుతుంది. 36 దశాహాల్లో పూర్తి అవుతుంది. ఈదశాహాల్లో రోజుకు ఒకటి చొప్పున ఒక విశిష్టమైన కథ చెప్పాలని నిర్దేశించారు. మొదటి రోజు కథ "మనూర్ వైవస్వతో రాజా " అని ఉంది. ఇలా పది రోజులకు పది విశిష్ట కధలు చెప్పాలి. ప్రతి దశహంలో మొదటి దశాహంలో చెప్పిన కథలను అదే క్రమంలో చెబుతారు. అందుకే వీటిని పారిప్లవాలు అంటారు. పారిప్లవం అంటే ప్రవాహం అని శతపధబ్రాహ్మణంలో నిర్వచించారు. ఇవి విశేషరూపంలో ఉండటం వలన వీటి ప్రయోజనం మనోరంజకం కాదు. ఇవి బ్రహ్మవిద్య కోసం ప్రతిపాదించినవి. ఈ కథలవలన కఠినమైన విషయాలను సరళంగా తెలుసుకుంటాడు. అందుకే మహర్షుల జీవితంలోని సంఘటనలను గ్రహించి, వాటి ఆధారంగా తత్త్వబోధ చేశారు. ఇవి ప్రామాణిక మైనవి. 'యాజ్ఞ వల్క్యుడు ప్రవ్రజించాడు' అనేది సన్యాస విధానం గురించి తెలుపుతుంది. సన్యాసాశ్రమం లో జ్ఞాన ప్రాప్తి ఉండటం వలన జ్ఞానం కర్మకు అంగం కాదు.
సూత్రం :- 449
" తధా చైక వాక్యతోపబంధాత్ "
చ :- ఇలాగ, తధా :- జ్ఞానం కర్మాంగం అని సిద్ధించక పోవడం వలన, ఏక వాక్యత ఉపబంధాత్ :- మోక్ష ప్రాప్తి సాధించే విషయాన్ని తెలిపే వాక్యాలలో ఏక వాక్యత ఉండటం వలన మోక్షానికి జ్ఞానం స్వతంత్ర కారణం.
భావం :- జ్ఞానం కర్మాంగం అని సిద్ధించక పోవడం వలన మోక్ష ప్రాప్తి సాధించే విషయాన్ని తెలిపే వాక్యాలలో ఏక వాక్యత ఉండటం వలన మోక్షానికి జ్ఞానం ప్రధాన స్వతంత్ర కారణం అని సిద్ధిస్తోంది.
వివరణ:- ఈ పారిప్లవ కధలు విద్య కోసం చెప్పినవి. ఈ కథలన్నీ ఆయా చోట్ల ఉన్న విద్యలలో ఏకవాక్యతను కలిగి ఉన్నాయి. కథల వలన ఉపాసనకు ఫలం ఏమి లేదు. శిష్యులకు విద్య యందు అభిలాష కలిగించడానికి, ఆ విద్యను సులభంగా బోధించడానికి ఇటువంటి కధలు చెప్పబడ్డాయి. అంతే కాని ఈకధలు క్రతు కర్మంగాలు కావు.
ఋగ్వేదం(1-164- 23) :- బ్రహ్మాన్ని ఎరిగినవాళ్ళు అమృతత్వాన్ని పొందుతారు. బ్రహ్మజ్ఞానం పొందిన వాడు ఎంతో గొప్ప స్థితిని పొందు తాడని, బ్రహ్మమును తెలుసుకోవడం అంటే జనన మరణం చక్రం నుండి విముక్తి పొందడం.
తైత్త రీయోపనిషత్తు(2, 1) :- బ్రహ్మవేత్త పరమ శ్రేయస్సును పొందుతాడు. బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలంటే మనస్సు బ్రహ్మలో లీనంకావాలి. తపస్సే బ్రహ్మం. తపస్సు అంటే మనస్సు, ఇంద్రియాలను ఆత్మమీదనే కేంద్రకరించడం, మంచి మాటలతో మంగళకరమైన పనులు చేస్తున్నప్పుడు ఆమాటలు, పనుల రూపంలో భగవంతుడు అభివ్యక్తమౌతాడు. ఇలాంటి శ్రుతి ఉపనిషత్వాక్యల్లో ఏకవాక్యత ఉన్నది. కనుక పరమ పురుషార్థమైన మోక్షానికి జ్ఞానం స్వతంత్ర కారణం.
అగ్నీంధనాద్యధికరణం ( 3, 4, 25 )
సూత్రం :- 450
" అత ఏవ చాగ్నీం ధనాద్యనపేక్షా "
అత ఏవ చ :- అందువల్లే, అగ్ని ఇంధనాది అనపేక్ష :- అగ్ని హోత్ర, దర్శ పూర్ణ మసాది కర్మలు అపేక్షితాలు కావు.
భావం :- మోక్షానికి జ్ఞానం ప్రధాన కారణం అందువల్లే అగ్ని హోత్ర, దర్శ పూర్ణ మాసాది కర్మలు అపేక్షితాలు కావు.
వివరణ:-గురుదేవా! బ్రహ్మవిద్య పురుషార్ధాన్ని కలిగించడంలో కర్మను ఆపేక్షిస్తుందా? అని అడిగాడు కృష్ణ శర్మ. సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. బ్రాహ్మణులు వేదాధ్యయనం చేత, యజ్ఞం చేత, దానం చేత, పర బ్రహ్మను తెలుసుకుంటారని కొన్ని చోట్ల చెప్పబడింది. అందువలనే జ్ఞానానికి కర్మ సాధనమని, మోక్షానికి కర్మ సహాయం కూడా అవసరమని కొందరు వాదిస్తారు. మోక్షం అనేది చతుర్విధ పురుషార్ధలలో నాలుగవది. ఆమోక్షం సాధించడానికి అగ్ని, ఇంధనాలు, జ్ఞాన సముపా ర్జనకు అవసరం లేదు. విద్య స్వతంత్రంగానే పురుషార్ధహేతువు. కాబట్టి దానికి కట్టెలు, అగ్నిహోత్రం అవసరంలేదు. బ్రహ్మ విద్య మోక్షాన్ని కలిగించడంలో అగ్నిహోత్రాది కర్మల్ని ఆపేక్షించదు.కనుక బ్రహ్మజ్ఞానం మోక్షప్రాప్తికి సాధనమని తెలుస్తోంది.
సర్వాపేక్షాధికరణం ( 3, 4, 26 )
సూత్రం :- 451
సర్వాపేక్షా చ యజ్ఞాది శ్రుతేరశ్వవత్ "
అశ్వవత్ :- గుర్రం లాగే, యజ్ఞాది శ్రుతేః :- జ్ఞాన ప్రత్తిపాదనలు అని శాస్త్రాలు అనడం వలన, సర్వాపేక్షా చ :- జ్ఞానోత్పత్తికి అన్ని కర్మలన అపేక్ష ఉంటుంది.
భావం :- గుర్రం లాగే యజ్ఞాదులు, జ్ఞాన ప్రతిపాదనలు అని శాస్త్రాలు అనడం వలన, జ్ఞానోత్పత్తికి అన్ని కర్మలను అపేక్ష ఉంటుంది.
వివరణ:-జ్ఞానోత్పత్తికి విహితకర్మలు ఉపయోగిస్తాయా అంటే ఉపయోగిస్తాయనే చెప్పాలి. విద్యకు అన్ని ఆశ్రమాలలోనూ కర్మలు అవసరమే. యజ్ఞయాగాదులు జ్ఞానోత్పత్తికి హేతువులు. గుర్రం పొలందున్నడానికి ఉపయోగపడకపోయినా రధం లాగడానికి పనికివస్తుంది. అలాగే కర్మలు మోక్షాన్ని ఇవ్వకపోయినా జ్ఞానోత్పత్తికి సాధనమౌతాయి. కర్మలను విధించే శాస్త్రాలు నిరర్ధకం కావు. విద్యను పొందడంలో ప్రతిబంధకాలు ఉన్నప్పుడు ఇంద్రియ జ్ఞానం కలగదు. ఆటంకాలన్నీ తొలగిపోయిన తరువాత ఇంద్రియాల వలన జ్ఞానం కలుగుతుంది. రాగ ద్వేషాలు, విక్షేపాలు ఉన్నంత వరకు, అంతః కరణంలో ఉండే మాలిన్యాలు ప్రతిబంధకాలు అవుతూనే ఉంటాయి. ఈ అడ్డంకులు పోవడానికి నిష్కామ కర్మానుష్టానం ఉపకరిస్తుంది. కాబట్టి నిష్కామ వైదిక కర్మలు అంతః కారణాన్ని శుద్ధి చేసి జ్ఞానోత్పత్తికి సహాయ పడతాయి.
బృహదారాణ్యకోపనిషత్తు(4,4,22):- బ్రహ్మజిజ్ఞాసువులు పరమాత్మను వేదాధ్యయనం, యజ్ఞం, దానం తపస్సులతో తెలుసుకోవాలనుకుంటారు. బ్రహ్మజిజ్ఞాస యజ్ఞాదిఅనుష్టానంతో కలుగుతుంది. అంటే జ్ఞానోత్పత్తికి కర్మానుష్ఠానం అవసర మని శాస్త్రం చెబుతోంది. మోక్షప్రాప్తికి జ్ఞానం స్వతంత్రకారణం కాగా, జ్ఞానోత్పత్తికి కర్మానుష్ఠానం కావాలి. సర్వే వేదాః బ్రవీమి సమస్త వేదాలు ఏ అత్యుత్తమస్థానాన్ని బోధిస్తున్నాయో, సమస్తమైన తపస్సులు దేనిని చూపుచున్నాయో, దేనిని కోరుచూ బ్రహ్మచర్యం ఆచారిస్తున్నారో, ఆపదాన్ని గూర్చి నీకు సoగ్రహంగా చెబుతున్నాను". ఇత్యాది శ్రుతి ఆశ్రమకర్మలు విద్యాసాధనములనే విషయాన్నీ తెలియజేస్తున్నాయి. కర్మల చేత పాపకర్మల వలన కలిగే పాపాలు పక్వములౌతాయి. జ్ఞానం అత్యుత్తమ గతి. కర్మఫలాలు పక్వమైన తరువాత జ్ఞానం ప్రవహిస్తుంది. అశ్వవత్ అనేది యోగ్యత విషయంలో నిదర్శనం. యోగ్యతను అనుసరించి అశ్వం నాగలి లాగడానికి ఏ విధంగాను కట్టబడదు. రధం లాగడానికి మాత్రమే ఉపయోగిస్తారు. అట్లే ఆశ్రమధర్మాలు విద్య చేత ఫలసిద్ధి కొరకు ఆపేక్షించజాలవు. జ్ఞానోత్పత్తికి ఆపేక్షించ బడతాయి. గుర్రానికి తన వలన సిద్ధించే వేరే ఏ ప్రయోజనాన్ని కోరుకున్నా, తన ఉత్పత్తికి,దాని తల్లిదండ్రుల సంయోగం కావాలి కదా! శత్రువులను చంపడానికి గుర్రం అవసరం లేదు. కాని శత్రువును సమీపించడానికి గుర్రం కావాలి. అలాగే మోక్షం లభించడానికి జ్ఞానానికి కర్మలు అవసరం లేకపోయినా, జ్ఞానోత్పత్తికి ఆటంకములైన రాగ ద్వేషాదులను తొలగించడానికి కర్మనుష్టానం కావాలి.
సూత్రం :- 452
“శమదమాద్యుపేతః స్యాత్ తథాపి తు తద్విధేః "
తథా అపితా :- సర్వ కర్మ అపేక్ష ఉన్నప్పటికీ, శమదమాది ఉపేతః :- ముమక్షువుకి శమదమాది సాధనా సంపత్తి కావాలి. తత్ విధేః :- అని విధించారు. తత్ అంగతయా :- జ్ఞాన సాధన రూపంలో, తేషాం :- శమదమాదుల్ని, అవస్య అనుష్టే యత్వాత్ :- తప్పక అనుష్టించాలి.
భావం :- సర్వ కర్మ అపేక్ష ఉన్నప్పటికీ, ముముక్షువుకి శమదమాది సాధనా సంపత్తి కావాలి అని విధించారు. జ్ఞాన సాధన రూపంలో శమదమాదులను తప్పక అనుష్ఠించాలి.
వివరణ:-మోక్షగామికి అంతఃకరణశుద్ధి, బాహ్యశుద్ధి కూడా అవసరం. అగ్నిహోత్రాది కర్మానుష్ఠానం వలన అంతఃకరణాన్ని శుద్ధి చేయవచ్చును. అది జ్ఞానోత్పత్తికి సంపూర్ణ సాధనాలు కావు. అందుకే విద్య స్వతంత్రం మైనదే కాని మోక్షగామి షట్ సంపత్తి అయిన అంతరంగ సాధనాలు శమం, దమం, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం అలవరచుకోవాలి.
బృహదారణ్యకోపనిషత్తు(4,4,23):-ఈ షట్సంపత్తి ఉన్నవాడు తనలో పరమాత్మను తెలుసుకుంటాడు. ఈ శమదమాదులు జ్ఞానానికి సహాయపడతాయి. ఆధ్యాత్మశాస్త్రాల్లో బ్రహ్మ జ్ఞానానికి సాధనా చతుష్టయం అవసరం అని చెప్పారు. ఆత్మనాత్మ వివేకం, వైరాగ్యం, షట్సంపత్తి, ముముక్షుత్వం అనే నాల్గింటిని సాధనాచతుష్టయం అంటారు. వీటితో బాటు నిరంతరం ప్రణవధ్యానం చేయుటవలన బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. ఆనందానుభూతి కలిగి, బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది. అదే జీవన్ముక్తవస్థ స్థితి అంటారు. యజ్ఞాదికర్మలతో అంతఃకరణ శుద్ధి, శమదమాదులతో ప్రణవధ్యానం చేసినప్పుడు బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది.
సర్వాన్నాను మత్యధికరణం ( 3, 4, 28 )
సూత్రం :- 453
" సర్వాన్నాను మతిశ్చ ప్రాణాత్యమే తద్దర్శనాత్ "
చ:-అంతేకాక, సర్వాన్నానుమతిః:-ఛాందోగ్య, బృహదారణ్యకాలలో అన్నిటిని తినవచ్చు అని చెప్పినవాక్యాన్ని, ప్రాణాత్య యే:- ప్రాణాలమీదకి వచ్చినప్పుడు మాత్రమే అనిగ్రహించాలి. తత్ దర్శనాత్:- అని అట్టిపరిస్థితులలోనే ఊటంకించారు.
భావం:- ఛాందోగ్యం, బృహదారణ్యకాలలో అన్నింటిని తినవచ్చును అని చెప్పిన వాక్యాన్ని ప్రాణాల మీదకు వచ్చినప్పుడు మాత్రమే అని గ్రహించాలని అట్టి పరిస్థితులలోనే ఉటంకించారు.
వివరణ:- ఉపాసకుడు అన్నిఅవస్థలలో అన్ని తినవచ్చునా? జీవించడానికి అన్నంకానిది ఏదిఉండదు. అన్ని తినవచ్చును అని ఛాందోగ్యంలో చెప్పబడింది.
మనుస్మృతి(5-28):- జీవించడానికి అన్ని తినవలసినదే. ఉపాసకుడు ప్రాణసంకటం వచ్చినప్పుడు మాత్రమే ఏమైనా తినవచ్చును. ఆపద్ధార్మంగా అన్ని తినదగినవే అని వ్యాసుడు తెలియజేశాడు.
ఛాందోగ్యోపనిషత్తు(1,10,1):- దీనిలో ఒకకధనం ఉన్నది. ఒకప్పుడు కురుదేశంలో మిడతల దండు పంటలను తినేసింది. చక్రుడి మనవడు ఉషస్తి అనే ఋషి తన భార్యతో తినడానికి ఏమిలేని పరిస్థితులలో, ఆకలి దప్పులతో అలమటిస్తూ, ఇభ్య అనే గ్రామం చేరుకున్నాడు. ఆఊళ్ళో మావటివాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఉషస్తి అక్కడ ఒక మావటివాడు అలసందులు (బొబ్బర్లు) తింటుండగా చూసి, ఆకలితట్టుకోలేక, తనకికూడా కొంచెం పెట్టమని అడిగాడు. మావటివాడు తన దగ్గర ఎంగిలి చేసినవి తప్ప ఏమిలేవని చెప్పాడు. ఉషస్తి అవే పెట్టమన్నాడు. మావటివాడు మిగిలినవి ఇచ్చేశాడు. అతనువాటిని తీసుకొని కొన్ని భార్యకు పెట్టి, తాను కొన్ని తిని, మిగిలినవి మరునాటికి దాచుకున్నాడు. మావటివాడు త్రాగడానికి నీళ్లు కావాలా? అనిఅడిగాడు. ఉషస్తి మావటివాడి ఇంటి జలాన్ని గ్రహించలేను అన్నాడు. ఎందువలన? అని అతను అశ్చర్య పోయి, ఎంగిలి అలసందులు తిన్నారుకదా! నీళ్లు ఎందుకు త్రాగడానికి నిరాకరిస్తున్నారు? అని అడిగాడు. ప్రాణం నిలబడిన తరువాత అభక్ష్యభక్షణం చేయకూడదు అన్నాడు.
ఛాందోగ్యోపనిషత్తు(1,10,4):- ఉషస్తి ఇలా చెబుతున్నాడు. వీటిని తినకపోతే ప్రాణం పోయేది. నీటి విషయంలో అలాకాదు. దీనినిబట్టి ప్రాణరక్షణకోసం దొరికిన ఆహారాన్ని ఉపయోగించుకోవచ్చును. నీరు వద్దంటే అది నిషిద్దాహారం అని తెలుస్తోంది. అందువలన ఉపాసకుడు శుద్ధసాత్వికాహారాన్ని మాత్రమే స్వీకరించాలి. భక్ష్యాభక్ష్య విచక్షణ విడిచి అన్ని తినమని ఏశాస్త్రాలు చెప్పవు. ఈ విషయంలో ఉపాసకుడు ఎంతో సావధానంగా వర్తించాలి. విషయాల మీద ఆకర్షణ పెరిగితే ఉపాసకుడు పదభ్రష్ఠుడౌతాడు. కుక్కలు, పిల్లులు, పక్షులు మొదలైన జంతువుల ఆహరమే నీకు ఆహారం కాబట్టి ప్రాణాపాయ స్థితిలో ఏరకమైన ఆహారాన్నైనా స్వీకరించవచ్చని బృహదారణ్యకంలో కూడా చెప్పబడింది.
సూత్రం :- 454
" అబాధాచ్చ "
చ :- అంతే కాక, అబాధాత్ :- శ్రుతి విరోధం లేనందుకు వలన, ఆపత్ సమయంలో తినవచ్చును.
భావం:- అంతే కాక శ్రుతి విరోధం లేనందుకు వలన ఆపత్సమయంలో తినవచ్చును.
వివరణ:-ప్రాణాపాయస్థితిలో దేనినైనా తినవచ్చునని ఛాందోగ్య, బృహదారణ్యకాలలో చెప్పబడింది. అంతేకాక శ్రుతిలో కూడా విరోధం లేనందువలన ప్రాణాలుపోయే స్థితిలో ఏఆహరం దొరికినా తినవచ్చును. కాగా జ్ఞానార్ధికి ఆహారశుద్ధి ఉండాలి.
ఛాందోగ్యోపనిషత్తు(7,26,2):- ఆహారశుద్ధి వలన అంతఃకరణ శుద్ధమౌతుంది. తద్వారా జ్ఞానం సిద్ధిస్తుంది. ఈవాక్యం ప్రాణ సంకట సమయంలో అన్ని తినవచ్చుననే కధనాన్ని సార్ధకం చేస్తుంది. అన్నిదశలలో అన్నింటిని తింటే ఆహారశుద్ధి ఉండదు. భక్ష్యాభక్ష్యనిర్ణయశాస్త్రం ఈ విధంగా చెప్పింది. కాబట్టి ఆచరణీయమే. వేదంలో ఆహరం నిర్మలంగా పరిశుద్ధంగా ఉంటేనే మనస్సుకూడా పరిశుద్ధంగా ఉంటుందని చెప్పబడింది. అందుకే ఇదితినవచ్చును, ఇదితినకూడదు అని నిర్ణయించబడింది. ఇలాచెప్పడం శాస్త్రవిరుద్దం కాదు. ఉపాసకుడు కేవలం ప్రాణాలు రక్షించుకోవడం కోసమే ఆ సమయంలో అన్ని తినవచ్చును అని చెప్పడం జరిగింది.
సూత్రం :- 455
" అపి చ స్మర్యతే "
చ :- రాగా, స్మర్యతే అపి :- స్మృతి కూడా ప్రాణాపాయ స్థితిలో నిషిద్ద భోజనానికి అనుమతి ఇస్తున్నది.
భావం :- స్మృతి కూడా ప్రాణాపాయ స్థితిలో నిషిద్ద భోజనానికి అనుమతి ఇస్తున్నది.
వివరణ:-స్మృతులలోకూడా ఈవిషయం చెప్పబడింది. ప్రాణంపోయే స్థితిలో ఇది తినవచ్చునా? తినకూడదా? అని విచారణ చెయ్యవలసిన అవసరం లేదు.
మనుస్మృతి(10, 104) :- ప్రాణ సంకటం ఏర్పడినప్పుడు ఏది తిన్నా పాపం అంటుకోదు. ఆకాశానికి బురద అంటదు కదా! అభక్ష్య ఆహారగ్రహణం ఆపద్ధర్మమేకాని, ఇతర సమయాల్లో తగదని భావం. ఆపత్కాలంలో విద్వాంసునికి, అవిద్వాంసునికి కూడా భేదం ఏమి లేకుండా సర్వాన్న భక్షణం ప్రాణ సంకటం పొందినప్పుడు ఎక్కడ లభించినదైనా, అన్నం తిన్నవానికి తామరకుమీద నీరు అంటనట్లుగా పాపం అంటుకోదు అని స్మృతిలో చెప్పబడింది. అట్లే 'మద్యంనిత్యబ్రాహ్మణః' బ్రాహ్మణుడు పూర్తిగా మధ్యాన్నినిషేదించాలి. సురత్రాగిన బ్రాహ్మణుని నోటిలో సలసల మరుగుతున్న సురను అతను మరణించే వరకు నింపాలి. సుర త్రాగినవాళ్ళు వందజన్మలు పురుగులుగాపుడతారు. అభక్ష్యభక్షణం వలనకూడా పురుగు జన్మ వస్తుందని, అభక్ష్యాన్ని తినకూడదని స్మృతిలో చెప్పబడింది.
సూత్రం :- 456
" శబ్దశ్చాతో కామకారే "
అతః :- అందువలన, శబ్దః చ :- వేదం కూడా, అకామకారే :- ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకూడదు.
భావం :- అందువలన వేదం కూడా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించకూడదు అంటున్నది.
వివరణ:-ఆహారవిషయంలో స్వేచ్ఛ పనికిరాదు. శాస్త్రంలో అంగీకరించిన వాటినే తిని, నిషేధించిన వాటిని వదలివేయాలి. ఋగ్వేదం(7, 5, 33, 6):- క్రాంతదర్శులైన ఋషులు సప్తమర్యాదలను స్థాపించారు. దొంగతనం, పరస్త్రీగమనం, బ్రహ్మహత్య, భ్రూణహత్య, సురాపానం, పాపాచరణం, పాపాల్నిదాచడానికి అసత్యంచెప్పడం, ఇవి 7మర్యాదలు. వీటిలో ఒకదానిని చేసినా పాపిఅవుతాడు. అన్నపానాదులలో ఇష్టంవచ్చినట్లు ప్రవర్తించేవాడు, సురాపానం లాంటి వాటిల్లో తగులుకుంటారు. ఈమర్యాదలు ఉల్లంఘించి పాపిఅవుతాడు. ఈఆచారాన్ని ఛాందోగ్యంలోను, మనుస్మృతిలోనూ వివరించారు. దూరాచారు లతో సాంగత్యంకూడా పాపమే. అందువల్ల ఉపాసకుడు ఆహారవిహారాల్లో కామకారి కాకూడదు. మనుస్మృతి ( 11, 95) :- దివ్యాహారంతినే బ్రాహ్మణుడు నిషిద్ధమైన, యక్ష, రాక్షస, పిశాచాలు తినే అన్నం తినకూడదు. మధ్యమాంస, సురాసేవనం చేయకూడదు అని చెప్పడంవలన బ్రహ్మజిజ్ఞాసువు ఆహారవిషయంలో కామకారి కాకూడదు అని తెలుస్తోంది. వేదాధ్యయనంచేస్తూ, విషయాలుతెలుసుకుంటూ, మోక్షం కోరేవాడు బ్రాహ్మణుడు, బ్రహ్మ జ్ఞాని అయినవాడు ప్రాణం పోయే పరిస్థితులలోకూడా మద్యం సేవించరాదు. భోజనంసమయంలో స్వేచ్ఛ లేదని, నిషిద్దాహారాన్ని వదలివేయాలని శ్రుతి వాక్యం ఉన్నది.
ఆశ్రమ కర్మాధికరణం ( 3, 4, 32 )
సూత్రం :- 457
" విహితత్వా చ్చాశ్రమ కర్మాపి "
చ :- అంతే కాక, విహితత్వాత్ :- శాస్త్ర విహితం కావడం వలన, ఆశ్రమ కర్మల అపి :- ఆశ్రమ కర్మలు కూడా పాటించాలి.
భావం :- ఉపాసకుడు భోజన సమయంలో కామకారిగా ఉండకూడదనే నియమం ఉన్నది. అంతే కాక శాస్త్ర విహితం కావడం వలన ఆశ్రమ కర్మలు పాటించాలి.
వివరణ:-బ్రహ్మజ్ఞానం కోసం ప్రయత్నించే మానవుడు శుద్ధహారం ఎలా గ్రహించాలో అలాగే ఆశ్రమకర్మలు అనుష్టిoచాలి. మోక్షాపేక్ష లేనివారు, విద్యాసిద్ధి అవసరం లేనివాడు నిత్యకర్మలు చెయ్యాలా? అవసరం లేదా? ఒక వేళ కర్మ చేస్తే జ్ఞానం కోసం ఒకసారి, నిత్యసిద్ధి కోసం ఒకసారి మొత్తం రెండుసార్లు చెయ్యాలా అని సందేహం. ముముక్షవు కానివాడు కూడా ఆశ్రమవిహిత కర్మలు చెయ్యాలని వేదాలు చెబుతున్నాయి. నిత్యసిద్ధి కోసం ఒకసారి, జ్ఞానంకోసం ఒకసారి, ఇలారెండు సార్లు చెయ్యనవసరం లేదు. ఒక్కసారి చేస్తే చాలు.
ప్రశ్నపనిషత్తు(1,10):-తపస్సు, బ్రహ్మచర్యం, శ్రద్ధ, ఉపాసన వీటిద్వారా ఆత్మను తెలుసుకొని ఆదిత్యమార్గాన్ని జయిస్తారు.
మనుస్మృతి(4,14):-ఈశాస్త్రవచనాలవలన ఉపాసకుడుకూడా ఆశ్రమధర్మాలను అనుష్ఠించవలసినదే. కర్మలకోసం ఒకసారి, జ్ఞానంకోసం ఒకసారి కర్మలను ఆచరించాలని పూర్వపక్షవాదన. సర్వాపేక్ష ఇత్యాది శ్రుతివలన ఆశ్రమధర్మాలు కూడా విద్యాసాధనములని నిశ్చయింపబడింది. 'యావజ్జీవన మగ్నిహోత్రం జుహాతి' ఈశ్రుతిని అనుసరించి జీవించి ఉన్నంత కాలం నిత్యకర్మయైన అగ్నిహోత్రం నిర్వహించాలి. ముముక్షవు కానివాడికి కూడా ఆశ్రమంలో ఉన్నందున నిత్యకర్మలు అనుష్ఠించాలి.ఏకర్మఫలం ఆశించకూడా చిత్తశుద్ధితో కర్మలుచేస్తూ ఉంటే జ్ఞానంవస్తుంది. ఫలితం ఆశించకుండా చేయాల్సిన కర్మలు చేస్తూఉంటే రావలసినకాలంలో ఫలితం అదేవస్తుంది. ఈసత్కర్మలు అన్నీ పాపక్షయం చేసి, జ్ఞానానికి సహకరిం చేలా చేస్తాయి. బ్రహ్మజ్ఞానంకోసం ప్రయత్నించేవాడు శుద్ధాహారం ఎలాగ్రహించాలో, అలాగే ఆశ్రమకర్మలు అనుష్టిం చాలి.
ఆశ్రమ కర్మాధికరణం ( 3, 4, 33 )
సూత్రం :- 458
" సహకారి త్వేన చ "
చ :- పైగా, సహకారి త్వే న :- ఆశ్రమ ధర్మాలు జ్ఞానోత్పత్తికి సహకరిస్తాయి.
భావం :- ఆశ్రమ ధర్మాలు జ్ఞానోత్పత్తికి సహకరిస్తాయి. కనుక ఉపాసకుడు ఆశ్రమ కర్మలను ఆచరించవలసినదే.
వివరణ:-జ్ఞానం జనించడానికి సంహరించే కర్మలు, ఆశ్రమకర్మలు రెండూ వేరు కాదు. విద్యోత్పత్తిలో యాగాది కర్మలు సహకారిరూపంలో అనుష్ఠించదగినవి. ఇవి రెండూ పరస్పర సహకారం కలవి కాబట్టి రెండు సార్లు చెయ్యవలసిన అవసరం లేదు. ఈ నిత్యకర్మలే జ్ఞానం కోసం తోడ్పడతాయి. ఈ రెండింటి ప్రయోజనాలు వేరు కాదు. యావజ్జీవితం అగ్నిహోత్రం చెయ్యాలి కనుక ఈనిత్యకర్మలే జ్ఞానసిద్ధిని కలిగిస్తాయి. యజ్ఞం చేసేటప్పుడు చండ్రకర్ర యూపస్థంభంగాను ఉపయో గిస్తుంది. లౌకికంగాను ఉపయోగిస్తుంది. అదేవిధంగా నిత్యకర్మలు రెండువిధాలుగాను ఉపయోగిస్తాయి. అశ్వమేధ యాగంచేసేటప్పుడు యాగశాలలో 21యూపస్థంబాలను పాతేవారు. అవి మారేడు, మోదుగ, చండ్ర, దేవదారు, శ్లేష్మాతకకర్రలతో చేసేవారు. దానిలో ఒక స్థంబానికి యజ్ఞాశ్వాన్ని కట్టేవారు.
సూత్రం :- 459
" సర్వధా పి త ఏవోభయలింగాత్ "
అభయ లింగాత్ :- శ్రుతి, స్మృతి ప్రమాణాల వలన, సర్వధా అపి తయేవ :- అన్ని విధాలా అవి ఒకటే.
భావం :- శ్రుతి స్మృతి ప్రమాణాల వలన అన్ని విధాలా ఆ కర్మలు ఒక్కటే.
వివరణ:-ఉపాసనలో ఏకర్మలు అనుష్ఠించాలని చెప్పారో అవేకర్మలు ఆశ్రమకర్మల రూపంలో విధించారు. అవే జ్ఞానం సిద్ధించడానికి సహకరిస్తాయి. విద్యాసహకారికర్మలు, ఆశ్రమకర్మలు వేరేకావు. యాగాది కర్మలు ఆశ్రమత్వ పక్షంలోనూ, విద్యాసహకారిత్వపక్షంలో కూడా అనుష్ఠింపదగినవే. ఎవరూ ఫలితం ఆశించకుండా నిష్కామకర్మలు చేస్తారో అతనికి మోక్షం లభిస్తుంది. వైదికకర్మలను చేత సంస్కరంపబడిన వారికే విద్యోత్పత్తి కలుగుతుంది. "యస్యైతేష్టా చత్వారిం శత్ "ఎవరికైతే ఈ నలభైఎనిమిది సంస్కారాలుంటాయో, వాటిలో యజ్ఞ యాగాదులు కూడా ఉన్నాయి. గౌతమీ ధర్మశాస్త్రంలో యజ్ఞాలు కూడా సంస్కారాలని అవి చిత్త శుద్ధి కలిగిస్తాయని చెప్పబడింది.
ఋగ్వేదం ( 10, 90, 16 ) :- విద్వాంసులు యజ్ఞంతో పరమాత్మను ఉపాసిస్తారు. ఆ ధర్మాలు శ్రేష్ఠమైనవి.
మనుస్మృతి(2, 28):- వేదధ్యయనం, వ్రత నియమాలు, హోమాలు, వేదప్రాతిత కర్మలు, జ్ఞానం, ఉపాసన, దర్శపూర్ణ మాసాది ఇష్టులు, చక్కటి సంతానం, పంచమహాయజ్ఞలు, అగ్నిష్ఠోమాది కర్మలు అన్ని దేహంలో ఉండే ఆత్మను బ్రహ్మ ప్రాప్తికి యోగ్యుడుగా చేస్తాయి. విద్యకు సహకరించే కర్మలే ఆశ్రమకర్మలు కూడా. అందుకే బ్రహ్మోపాసనతో పాటు ఆశ్రమ కర్మల్ని కూడా ఆచరించాలి.
సూత్రం :- 460
" అనభి భవం చ దర్శయతి "
దర్శయతి చ :- ఉపనిషత్తు కూడా, అనభి భవం :- ఆదరాన్ని ఈ విషయంలో చూపిస్తుంది.
భావం :- ఉపనిషత్తు కూడా ఈ విషయంలో ఆదరాన్ని చూపిస్తుంది.
వివరణ:-అభిభవం అంటే తిరస్కారం, అనభిభవం అంటే సత్కారం, ఆదర్శం. ఉపనిషత్ వాక్యాలు కూడా ఆశ్రమకర్మ విషయలో ఆదరాన్నిప్రకటిస్తూ, ఆశ్రమకర్మలను అనుష్ఠించవలసినదే అని చెబుతున్నది.'ఏష... అను విందతే ' ఏ ఆత్మ బ్రహ్మచర్యం వలన పొందుతాడో అది ఏనాటికి వానికి దూరంకాదు. బ్రహ్మచర్యాది సాధనాసంపన్నుడైన వాడు పొందిన ఆత్మజ్ఞానం, రాగక్లేశాలవలన నాశనం పొందదు. అందువలన యజ్ఞాదులు ఆశ్రమకర్మలుగా ఉంటాయి. అవి ఆత్మజ్ఞానా నికి సహకారులుగా ఉంటాయి. ఆశ్రమాలకు సంబంధించిన కర్మలుకూడా సాధకునిలోని అవిద్య, రాగము, ద్వేషము మొదలైన క్లేశాలను పోగొట్టి జ్ఞానానికి సహాయకారులౌతాయి. ఆశ్రమధర్మాలు నిర్వహించేవారి జ్ఞానసాధనకు సహకరించేవి నాలుగువిషయాలు. యజ్ఞం, దానం, తపస్సు, స్వాధ్యాయం. ఇవి రోజుచెయ్యాలా? అని సందేహం రావచ్చును. అవకాశం వచ్చినప్పుడు యజ్ఞయాగాదులు నిర్వహించడం, దానం చెయ్యడం, నిరంతరం భగవంతుని స్మరిస్తూ, తపించడం, అదే తపస్సు, గురువు ద్వారా విన్న భగవంతుని లీలలను స్వాధ్యాయం చెయ్యగలిగితే బ్రహ్మ విద్యా ప్రాప్తి కలుగుతుంది. దీని వలన బుద్ధిసూక్ష్మం చెంది, చిత్తశుద్ధి కలిగి ఆత్మజ్ఞానం లభిస్తుంది. ఒకవేళ సత్గ్రంధాలను శ్రవణం చేసి, ఆగిపోతే రాగక్లేశాలు నాశనం కావు. బ్రహ్మజ్ఞానం కలుగదు. కాబట్టి మోక్షాపేక్ష లేనివారు కూడా ఆశ్రమకర్మలు అనుష్ఠించవలసినదే.
విధురాధికరణం ( 3, 4, 36 )
సూత్రం :- 461
" అంతరాచాపి తు తద్దృష్టేః "
అంతరఅపిచ:-ఆశ్రమకర్మానుష్టానం లేకుండా జ్ఞానం ఉత్పన్నం అవుతుందని, తత్ దృష్టేః :- ఎన్నో చోట్ల చూడవచ్చును.
భావం :- ఆశ్రమ కర్మానుస్థానం లేకుండా జ్ఞానం ఉత్పన్నం అవుతుందని ఎన్నో చోట్ల చూడవచ్చును.
వివరణ:- యజ్ఞాది ఆశ్రమకర్మల్ని జ్ఞానోత్పత్తికి తప్పక అనుష్ఠించాలా? వద్దా? శాస్త్రాల్లోచెప్పిన కర్మలను అనుష్ఠించక పోయిన, ఆశ్రమరహితులకుకూడా బ్రహ్మవిద్యాధికారం ఉన్నదా? అన్న సంశయం కలగవచ్చును. విధురులు(మృత పత్నీకులు), ద్రవ్యాదిసంపదలు లేనివాళ్లకు, ఏదోఒక ఆశ్రమం స్వీకరించకుండా మధ్యలో ఉన్నవాళ్లకు బ్రహ్మవిద్యాధికారం ఉన్నదా? లేదా అని సంశయం కలుగగా ఉన్నది అనే సమాధానంచెప్పారు. వేదాలలో ఆశ్రమరహితులైన వారికికూడా బ్రహ్మవిద్యాధికారం ఉన్నదని చెప్పబడింది. ఆశ్రమరహితులు అంటే భార్య మరణించినవారు, ధనంలేకపోవడం వలన గృహస్థాశ్రమ ధర్మాలు నిర్వహించలేని వారు కూడా బ్రహ్మ విద్యను పొందవచ్చును. వీరికి ఆశ్రమ కర్మలేవి ఉండటానికి అవకాశం లేదు. రైక్వుడు మహాజ్ఞాని, అతను ఎలాంటి ఆశ్రమకర్మలు చేయలేదు. వాచక్నవీ, గార్గిలాంటి జ్ఞానులు అంతే. రైక్వుడు జానశ్రుతికి బ్రహ్మవిద్య ఉపదేశించాడు. గార్గి జనకుడిసభలో విద్వాంసులు ఎదురుగా యాజ్ఞవల్క్యునితో వాదించిన విధుషీమణి. వీరు బ్రహ్మవేత్తలుగా చెప్పబడ్డారు. శాస్త్రాల్లో ఆశ్రమకర్మలను పాటించని విదురుడు కూడా గొప్ప జ్ఞాని. కనుక శమదమాదుల్లాగా ముముక్షవులకు యజ్ఞాదికర్మలు తప్పక అనుష్ఠించవలసినదే. ఆశ్రమధర్మాలు పాటించని వారికీ కూడా బ్రహ్మవిద్యాధికారం ఉన్నదని చెప్పబడింది .
సూత్రం :- 462
" అపిచ స్మర్యతే "
అపిచ :- అంతే కాక, స్మర్యతే :- ఆశ్రమ కర్మానుష్ఠానం లేకుండానే జ్ఞానం కలగుతుందని స్మృతులు చెబుతున్నాయి.
భావం :- ఆశ్రమ కర్మనుష్టానం లేకుండానే జ్ఞానం కలుగుతుందని స్మృతులు చెబుతున్నాయి.
వివరణ:-జ్ఞానానికి సహకరించే కర్మల్ని రకరకాల ఆశ్రమాల్లో చేస్తుంటారు. ఆశ్రమకర్మలు నిర్వహిస్తూ బ్రహ్మవిద్యను పొంది, తద్వారా మోక్షాన్నిసాధించవచ్చును. కానిఆశ్రమకర్మానుష్టానం లేకుండానే జ్ఞానం కలుగుతుందని స్మృతులు చెబుతున్నాయి.
మనుస్మృతి(2, 87):-జపంవల్లనే బ్రాహ్మణుడు సిద్ధిపొందుతాడు. ఇందులో సంశయంలేదు. ఇతర యాగాదికర్మలు చేసినా, చేయకపోయినా అతను ప్రణవజపంతోనే పరమాత్మకు ప్రియమైన బ్రాహ్మణుడు అవుతాడు. అందువలన బ్రహ్మజ్ఞానికి శమదమాదుల్లాగా ఆశ్రమకర్మలు యజ్ఞాదులు అనుష్ఠించవలసిన అవసరంలేదు. ఇతిహాసాలలో ఏఆశ్రమం లేనట్టి సంవర్తనుడు మొదలైన వాళ్ళు దిగంబరులుగా సంచరించడం, ఏఆశ్రమదర్మాలు నిర్వహించకుండానే ప్రణవజపంతోనే మహాయోగులైనట్లు చెప్పబడింది. కాబట్టి ఆశ్రమ రహితులకు కూడా బ్రహ్మ విద్యాధికారం ఉన్నది.
సూత్రం :- 463
" విశేషానుగ్రహాచ్చ "
విశేషానుగ్రహాచ్చ :- ఆశ్రమ కర్మలు పాటించని వాళ్లపై కూడా పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది.
భావం :- ఆశ్రమ కర్మలు పాటించని వారికి కూడా పరమేశ్వరుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది.
వివరణ:-ఈశ్రుతి, స్మృతులలో రైక్వాదులు జ్ఞానులు అని తెలుస్తున్నదని, వాళ్లకు విద్య లభించడానికి కారణం ఏమిటో చెప్పబడుచున్నది. వారికి ఏఆశ్రమం లేకపోయినా, ఆశ్రమకర్మలు యజ్ఞాదులు అనుష్ఠించకపోయినా, జపం, తపం, ఉపవాసం, దేవతారాధన, సర్వభూతదయ కలిగిఉండటం, మొదలైన ధర్మవిశేషాలచేత ఉపాసనవలన బ్రాహ్మణుడికి బ్రహ్మ జ్ఞానం లభిస్తుంది. అనేక జన్మల పుణ్యఫలం వలన మోక్షం పొందుతారని స్మ్మతి చెబుతోంది.
కఠోపనిషత్తు(2, 23):-అన్యసాధనాలు, సఫలం అయినా, కాకపోయినా పరమేశ్వరుడు ప్రసన్నుడైన ఉపాసకుడికి బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఆయన అనుగ్రహం వలన జ్ఞాన ప్రాప్తి కలిగినప్పుడు బ్రాహ్మణుడు జపం ద్వారానే మోక్షాన్ని పొందవచ్చును. కర్మనుష్ఠానం తప్పనిసరి కాదు. 'అనేక... గతిమ్' అను స్మృతివలన జన్మాంతరాలలో సంచితమైన సంస్కారవిశేషాలు కూడా విద్యను అనుగ్రహిస్తాయి అని చెప్పబడింది. అనేకజన్మల ద్వారా సిద్ధుడై తరువాత ఉత్తమ గతిని పొందుతాడు అని భగవద్గీతా వాక్యానికి అర్ధం. అందువలన విధురాదులకు కూడా విద్యయందు అధికారం ఉండటం విరుద్దం కాదు.
సూత్రం :- 464
" అతస్త్వితర జ్జ్యాయో లింగాచ్చ "
అతః:- ఆశ్రమ కర్మల కన్నా, ఇతరత్ తు :- శమదమాదులే, జ్యాయః :- మేలైనవి. లింగాత్ చ :- శాస్త్రాలు అంటున్నాయి.
భావం:-ఆశ్రమకర్మలకన్నా శమదమాదులే మేలైనవి. గొప్ప అంతరంగసాదనాలు. కనుక వాటిని పాటించాలని శాస్త్రాలు అంటున్నాయి.
వివరణ:-ఏఆశ్రమం లేకపోవడంకన్నా, ఆశ్రమం కలిగిఉండటమే శీఘ్రమైన విద్యావ్యాప్తికి సాధనం. ఏఆశ్రమంలో లేకపోయినా విద్యాధికారం ఉన్నప్పుడు ఆశ్రమధర్మాలు ఎందుకు నిర్వహించాలి అనే సందేహం వస్తుంది. ఏఆశ్రమం లేకుండా ఉండే కన్నా ఏదో ఒక ఆశ్రమాన్ని ఆశ్రయించడం శ్రేయస్కరం. ఆశ్రమం లేకుండా బ్రాహ్మణుడు ఒక్క రోజు కూడా ఉండకూడదు. ఒకసంవత్సరం దూరంగాఉంటే ప్రాయిశ్చిత్తం కూడా చేసుకోవాలి. 'తేనైతి-తైజసశ్చ'పుణ్యం చేసిన బ్రహ్మ వేత్త శుద్ధ సత్వం కలవాడై బ్రహ్మ మార్గం చేత బ్రహ్మను పొందుతాడు అని శ్రుతి చెబుతోంది.
బృహదారణ్యకోపనిషత్తు(4, 4, 23):-ముముక్షువులు శమదమాదుల్ని తప్పక పాటించాలి. యజ్ఞాదిక ఆశ్రమకర్మలను అవకాశం ఉంటే అనుష్ఠించవచ్చును. అవకాశంలేకపోతే దోషంలేదు. అధికారం ఉన్నప్పుడు మాత్రం తప్పక అనుష్టించాలి. బ్రహ్మచారులు, వానప్రస్థులు, సన్యాసులు వీళ్ళని ఊర్ధ్వరేతస్కులంటారు. బ్రహ్మచర్యం నుండి వానప్రస్థం, సన్యాసానికి వెళ్లడం, గృహస్థాశ్రమంనుంచి వానప్రస్థం, సన్యాసాశ్రమానికి క్రమంగా పోవడం దీనిని ఆరోహణ విధానం అంటారు. జ్ఞానానికి యజ్ఞయాగాదికర్మలు బహిరంగ సాధనలు. శమదమాదులు ముఖ్య అంతరంగసాధనలు. బహిరంగంకన్నా అంతరంగం మేలైనది. ఆశ్రమకర్మల కన్నా ఉపవాసాదులు ఎక్కువ సహకరిస్తాయి.
తద్భుతాధికరణం ( 3, 4, 40 )
సూత్రం :- 465
" తద్ భూతస్య తు నాతద్భావో జైమినే రపి నియమాత్ర ద్రూపాభావేభ్యః "
తత్ భూతస్య :- నైష్ఠిక బ్రహ్మచారి, వాన ప్రస్థ, సన్యాసి అయిన వాడికి, న అతత్ భావః :- ఉన్న ఆశ్రమం నుంచి అవరోహణం జరగ కూడదు, జైమినేః అపి :- జైమిని, వ్యాసుడు వీళ్ళ మతం. నియమాత్ అతత్ రూప అభావేభ్యః :- అలాంటి నియమం, ఆచారం లేదు.
భావం :- నైష్ఠిక బ్రహ్మచారి వానప్రాస్థ, సన్యాసి అయిన వాడికి ఉన్న ఆశ్రమం నుంచి అవరోహణ జరగకూడదని జైమిని, వ్యాసుడు అలాంటి నియమం, ఆచారం లేదని చెప్పినారు.
వివరణ:-గురువుగారు! సన్యాసాశ్రమం స్వీకరించిన వాడు ఐహికవాంఛలతో, ఇంద్రియలాలసత్వంతో, ఇతరకారణముల చేత, తిరిగి గృహస్థాశ్రమాన్ని స్వీకరించవచ్చునా? అని అడిగాడు కృష్ణశర్మ. సన్యాసాశ్రమంలో ఉన్నవాడు తిరిగి వచ్చి గృహస్థాశ్రమం స్వీకరించరాదు. ఆశ్రమభ్రంశం పనికి రాదు. గురువు ఆజ్ఞానుసారం నాలుగు ఆశ్రమాలలో ఏదో ఒక దానిని గ్రహించి మరణకాలం వరకు ధర్మపరుడై ఆఆశ్రమంలోనే ఉండాలి. బ్రహ్మచారి గృహస్థాశ్రమానికి రావాలని కొన్ని శ్రుతులు, బ్రహ్మచర్యం నుంచి ఒక్కసారిగా సన్యాసాశ్రమం స్వీకరించాలని కొన్ని శ్రుతులు చెబుతున్నాయి. ఊర్ధ్వరేతస్కులు ఉన్నత ఆశ్రమంచేరి, మళ్ళీ ఏదో కారణంచేత పూర్వాశ్రమానికి చేరవచ్చునని శాస్త్రాల్లో ఎక్కడా చెప్పబడ లేదు. శిష్ఠులైన వారెవరూ అలా చెయ్యలేదు. సన్యాసాశ్రమాన్ని అంగీకరించని జైమిని కూడా ఇందుకు ఒప్పుకోలేదు. బ్రహ్మచారి వివాహం చేసుకొని, కోరికలన్నీ తీరిన తరువాతనే సన్యాసం స్వీకరించాలి.
ఛాందోగ్యోపనిషత్తు(2, 28, 1):-నైష్ఠికబ్రహ్మచారి జీవన పర్యంతం ఆచార్యకులంలో నియమాలతో, తపస్సుతో జీవితం గడపాలి. అతను గృహస్థాశ్రమం స్వీకరిస్తే నైష్ఠిక పతనం జరుగుతుంది.
మనుస్మృతి(6, 34):-బ్రహ్మచర్యంనుంచి గృహస్థాశ్రమం స్వీకరించి అగ్నిహోత్రాదులు చేసి, జితేంద్రీయుడై, భిక్ష, బలిదానాలు చిరకాలంచేస్తూ, చివరకు సన్యాసం స్వీకరించాలి. ఆశ్రమధర్మలను పాటించి మరణించిన తరువాత పరలోకంలో ఉన్నతిని పొందుతాడు. ఇక్కడ ఆశ్రమలకు ఆరోహణే కాని అవరోహణ లేదు.
జాబాలోపనిషత్తు:-ఆచార్యులు ఇద్దరూ ఉత్తరాశ్రమంనుంచి పూర్వశ్రమానికి వెళ్లడం శిష్టాచారం కాదని అభిప్రాయం పడ్డారు. ఒకవేళ సన్యాసి గనుగ పతనమైతే, అధోగతి పాలవుతాడని ఈశావాశ్యోపనిషత్తులో చెప్పబడింది.
సూత్రం :- 466
" న చాధికారిక మపి పతనాను మానాత్ తదయోగాత్ "
అధికారికం అపిన :- ఎలాంటి అధికారిక ప్రాయిశ్చిత్తం లేదు. పతన అనుమానాత్ :- అతణ్ణి పతితుడని శిష్ఠులు అనుమానిస్తారు. కనుక తత్ అయోగాత్ :- అతడికి ప్రాయిశ్చిత్త యోగం లేదు.
భావం :- అలా పూర్వశ్రమానికి వెడితే ప్రాయిశ్చిత్తం ఉన్నదా? ఎలాంటి అధికారిక ప్రాయిశ్చిత్తం లేదు. అతణ్ణి పతితుడని శిస్టులు అనుమానిస్తారు. అతడికి ప్రాయిశ్చిత్త యోగం లేదు.
వివరణ:-నైష్టికబ్రహ్మచారి కనుక పతనంఅయితే అతనికి ప్రాయిశ్చిత్తంలేదు. అలాంటి ప్రాయిశ్చిత్తం అనేది ఉంటే అది మాములు బ్రహ్మచారికే కాని సన్యాసికి కాదు.
పూర్వమీమాంసాదర్శనం(6, 8, 21):- పతితుడైన ఊర్ధ్వ రేతస్కుడికి ప్రాయిశ్చిత్తం లేదు. పతనం నిశ్చయమైన వాడికి ఇక ప్రాయిశ్చిత్తం ఏముంటుంది? కాగా అపకీర్ణబ్రహ్మచారికి సంబంధించినది, ఊర్ధ్వరేతస్కుడైన నైష్ఠికునికి సంబంధించినది కాదు. వాళ్ళు మళ్ళీ పూర్వమార్గంలో నడుస్తారని ఆశించలేము.
సూత్రం :- 467
" ఉప పూర్వ, మపి త్వేకే, భావ మశనవ త్తదుక్తం "
ఏ కేతు :- కొందరు ఆచార్యులు మాత్రం, ఉప పూర్వం అపి :- ఈ పతనానికి, భావం :- ప్రాయిశ్చిత్తం ఉందంటున్నారు, అశనవత్ :- తినకూడనివి తిన్నప్పుడు, తదుక్తం :- ప్రాయిశ్చిత్తం ఉన్నది కదా!
భావం :- కొందరు ఆచార్యులు మాత్రం ఈ పతనానికి ప్రాయిశ్చిత్తం ఉన్నదని అంటున్నారు. తినకూడనివి తిన్నప్పుడు ప్రాయిశ్చిత్తం ఉన్నది కదా!
వివరణ:-నైష్ఠికబ్రహ్మచారికి ప్రాయిశ్చిత్తం లేదని పూర్వపక్షవాదన. నైష్ఠికబ్రహ్మచారికి ప్రాయిశ్చిత్తం ఉన్నదని శ్రుతి వాక్యం చెబుతోంది. ఒకవేళ సంభోగిస్తే దానికి ప్రాయిశ్చిత్తం ఉన్నది. గురుభార్య యందు మహాపాతకంగా చెప్పబడింది. దానికి ప్రాయిశ్చిత్తంలేదు. ప్రాయిశ్చిత్తంజరిగినా సత్పురుషులు వారిని వెలివేస్తారు. వానప్రస్థ, పరివ్రాజకులకు కూడా ప్రాయిశ్చిత్తం ఉన్నదని జైమిని అంటాడు. దీక్షలోపం వచ్చినప్పుడు వారు 12రోజులు కృచ్చవ్రతం ఆచరించాలి. అంటే సోమలత మినహా మిగిలిన చెట్లు, పొదలు, తృణకాష్టాదులను, గడ్డిమొక్కలకు నీరుపోసి పెంచాలి. శాస్త్రవిహితమైన ప్రాణాయామాదులు కూడా చెయ్యాలి.
మనుస్మృతి(11, 160):-ఆత్మశుద్ధిని కోరుకునే వాళ్ళు నిషిద్దభోజనం చెయ్యకూడదు. ప్రమాదవశాత్తు ఎప్పుడైనా తినడం జరిగితే వెంటనే వమనాదులతో శుద్ధి చేసుకోవాలని అభక్ష్యభక్షానికి ప్రాయిశ్చిత్తం ఉన్నది. అలాకాక బుద్ధిపూర్వకంగా తిన్నా ప్రాయిశ్చిత్తం ఉన్నది. (11, 45):- అభక్ష్యభక్ష్యానికి ప్రాయిశ్చిత్తం ఉన్నట్లే, ఊర్ధ్వరేతస్కుడు పతితుడైనప్పుడు ఆ పతనాన్ని చిన్నపాపంగా భావించి ప్రాయిశ్చిత్తం ఉన్నదని కొందరు అంటున్నారు. తైత్తరీయసంహితలో వాతరశనుడు మొదలైన ఋషులు దోషరహితులం కావాలంటే ఏమిచెయ్యాలని అడిగారు. భ్రూణహత్య మహాపాతకం, దాని కన్నా స్వల్పమైనది ఉపపాతకం. దానినుంచి విముక్తుడౌతాడు. నైష్ఠికబ్రహ్మచారి ఊర్ధ్వరేతస్సు నుండి పతనం కావడం ఉప పాతకమని, అది మహాపతకం కాదని, దానికి ప్రాయిశ్చిత్తాన్ని ఒప్పుకోవాలని కొందరు ఆచార్యులంటున్నారు. శాస్త్ర ప్రకారం ప్రాయిశ్చిత్తం ఉన్నది. ప్రాయిశ్చిత్తంలేదనే స్మృతి వాక్యం బ్రహ్మచర్యం కాపాడుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చెయ్యాలి అని చెప్పడం కోసమే వ్యాఖ్యనించారు.
బహిరధికరణం ( 3, 4, 43 )
సూత్రం :- 468
" బహిస్తూభయ థాపి స్మృతే రాచారా చ్చ "
ఉభయథా అపి తు :- ప్రాయిశ్చిత్తం ఉన్నా, లేకపోయినా, బహిః :- అతణ్ణి బహిష్కరించాలి. ఎందుకంటే స్మృతేః ఆచారాత్ చ :- స్మృతులు, ఆచారాలు అలా అంటున్నాయని వేదవ్యాసుని అభిప్రాయం.
భావం :- నైష్ఠికుడు పతనమైనప్పుడు ప్రాయిశ్చిత్తం ఉన్నా, లేకపోయినా అతణ్ణి బహిష్కరించాలని స్మృతులు, ఆచారాలు అలా అంటున్నాయని వేదవ్యాసుని అభిప్రాయం.
వివరణ:-ఊర్ధ్వరేతస్కులు పతనం జరిగితే రెండు రకాల పాతకాలు కలుగుతాయి. 1. ఉపపాతకం, 2. మహా పాతకం. కాని వారు ఏరకంగా పతనమైనప్పటికి వారు బహిష్కరింపదగినవారే. శిష్ఠులు వారిని బహిస్కరించాలి. ప్రాయిశ్చిత్తం చేసి నప్పటికి అతని మనస్సు చెడ్డవృత్తులనుంచి మరలడం సంభవం కాదు.
మనుస్మృతి(11,190):బాలహంతకులు, కృతఘ్నులు శరణుజొచ్చిన వారిని చంపేవారు, స్త్రీహంతకులు, వీళ్ళు ప్రాయిశ్చిత్తంచేసుకున్నా, వారితో సహవాసంచేయకూడదు. సంఘంలోఉంచరాదని స్మృతులు, ఆచారాలు చెబుతున్నాయి. ' ఆరుడో..స ఆత్మహా ', ఆరూడ.. చరేత్ ' అరూడపతితుడు అంటే పైఆశ్రమానికి వెళ్లి పతితుడైనవాడు, ఉరి తీయబడినవాడు, సర్పాదులు కరిచిన వాడు, పరజాతితో కలిసిన వాడు, అయిన బ్రాహ్మణుణ్ణి స్పృశిస్తే చాంద్రాయణ వ్రతం చెయ్యాలి. శిష్ఠులు అలాంటి వారితో యజ్ఞ, అధ్యయన, వివాహాదులు చేసికొనరు కదా! అలాంటి వారికి రెండు రకాల పాపాలు కలుగుతాయి.1.ఈ లోకంలో అశుద్ధి, 2. పరలోకంలో అశుద్ధి. వీరు చాంద్రయణ వ్రతం చేసినందున పరలోకశుద్ధి చేసుకుంటే రెండవ దోషం పోతుంది. నరకాదికం రాదు. కాని మొదటిది పోదు. ఐహికశుద్ధి తొలగించుకుంటే శిష్ఠులతో వ్యవహారం పెట్టుకోవచ్చును. కాని, ఈప్రాయిశ్చిత్తాల వలన పారలౌకికశుద్ధి తొలగి పోయినా, ఐహిక శుద్ధి మాత్రం తొలగదు. అలాంటి ప్రాయిశ్చిత్తంలేదు. చంద్రాయణవ్రతం:-చంద్రుడి అయినాన్ని బట్టి ఆహారనియమాలతో పాపపరిహారార్ధం చేసే వ్రతం. ఇది శుక్ల పాడ్యమి రోజంతా ఉపవాసం చేసి, ఆ రాత్రి ఒక్క గోధుమ పిండి ముద్దను తినాలి. విదియ నాడు 2, తదియ నాడు 3 ముద్దలు చొప్పున పెంచుకుంటూ తినాలి. పౌర్ణమినాడు 15 ముద్దలు తినాలి. మర్నాడు పాడ్యమి రోజున 14 ముద్దలు, విదియ 13 ముద్దలు, అలా రోజు ఒకముద్ద తగ్గించుకుంటూ తినాలి. అమావాస్య రోజు ఉపవాసం చెయ్యాలి. ఇలా నెల రోజులు చేసి ప్రాయిశ్చిత్తం చేసుకోవాలి. వానప్రస్థులు 12 రోజులు కృచ్ఛవ్రతం చేయాలి. సన్యాసులు కృచ్ఛవ్రతం చేసి, సోమతల తప్ప మిగతా వృక్షాలకు నీరు పోసి, ప్రాణాయామం చెయ్యాలి.
స్యామ్యధికరణం ( 3, 4, 44 )
సూత్రం :- 469
" స్వామినః ఫలశ్రుతే రిత్యాత్రేయః "
ఫలశ్రుతే :- ఉపాసకుడికి ఫలశ్రుతి ఉన్నది, స్వామినః :- యజమానే ఉపాసనాంగ కర్మలను అనుష్ఠించాలి. ఆత్రేయః :- ఆత్రేయముని అభిప్రాయం.
భావం :- ఉపాసకుడికి ఫలశ్రుతి ఉన్నది. అందువలన యజమానే ఉపాసనాంగ కర్మలను అనుష్ఠించాలి అని ఆత్రేయ ముని అభిప్రాయం. కర్మ ఫలం యజమానికే లభిస్తుంది కదా!
వివరణ:-గురువర్యా! కర్మాంగ ఉపాసనలను ఆచరించవలసినది ఋత్విక్కా? లేక యజమానా? అని సందేహం వ్యక్తం చేశాడు నారాయణభట్టు. రత్నకరుడు సమాధానం చెబుతున్నాడు. కర్మాంగోపాసనల కర్త యజమానే అని ఆత్రేయ ముని అభిప్రాయం. ఉపనిషత్తులలో చెప్పిన దానిని బట్టి కర్తకే ఫలం లభిస్తుంది. కాబట్టి ఉపాసకులకు కూడా కర్త యజమానే అని వారి వాదన.
ఛాందోగ్యోపనిషత్తు(2, 3, 2):-అతడి కోసమే వర్షిస్తుంది. నిశ్చయంగా అతడే వర్షించే టట్లు చేసుకుంటాడు. ఇది తెలుసుకొని, అతడి దృష్టిలో పంచవిధసామ్యాన్ని ఉపాసిస్తాడు. ఇక్కడ యజమానికి ఫలప్రాప్తి చెప్పారు. ఉపాసనఫలానికి అతడే అధికారి. అదే ఉచితం. దాన్ని అనుష్ఠించినది అతనేకదా! కనుక యజమానే అనుష్ఠానంచెయ్యాలని ఆత్రేయముని అభిప్రాయం. యజ్ఞాన్ని నిర్వహించేవాడు ఋత్విక్కే. కాని యజ్ఞాన్ని నిర్వహించడానికి అన్ని సమకూర్చుకొని చేయించేవాడు, దాని ఫలాన్ని కోరుకునే వాడు యజమాని. కర్త యజమానే కనుక కర్తృత్వం కూడా ఆయనదే అని పూర్వపక్షవాదన.
సూత్రం :- 470
" ఆర్త్వి జ్యమి త్యౌడులోమి స్తస్మై హి పరిక్రీయతే "
ఆర్త్విజ్యం :- అంగోపాసన ఋత్విజుడిది. ఇతి :- అని, ఔడు లోమిః :- ఔడులోమి ఆచార్యుడి మతం. హి :- ఎందుకంటే, తస్మై :- ఆ అంగానుష్టానం కోసం, పరిక్రీయతే :- ఋత్విక్కుకు ధనం ఇస్తాం కదా!
భావం:-అంగోపాసన ఋత్విజుడిదేనని ఔడులోమి ఆచార్యుని మతం. ఎందుకంటే ఆ అంగానుష్ఠానం కోసం ఋత్విక్కుకు ధనం ఇస్తాం కదా!
వివరణ:-ఈ ఉపాసనలకు కర్త యజమానే అని ఔడులోమి అనే ఆచార్యుడు అంటున్నాడు. యజమానికి ఫలం సంపాదించి పెట్టడం కోసం దక్షిణఇచ్చి ఋత్విక్కును కొన్నాడు. అక్కడ చేసేది ఋత్విక్కే. కాని ఆఫలితాన్ని అతడు యజమానికి సంక్రమింపజేస్తాడు అని ఔడులోమి అంటాడు. అంగాలైనఉపాసనల్ని అనుష్ఠించడానికి యజమాని ఋత్విజుల్ని నియమించుకుంటాడు. వారిని అంగోపాసన కోసం ఎన్నుకొని అనుష్ఠానం తరువాత వాళ్లకి శ్రమకు తగ్గ ఫలం యజమాని ఇస్తాడు. అప్పుడు వాళ్ళని కొన్నట్లేలెక్క. అంగోపాసన సంపన్నం చెయ్యడం ఋత్విజుల కర్తవ్యం. యజమానుడిది కాదు.
ఛాందోగ్యోపనిషత్తు(1, 10, 11):- దీనిలో ఉపాస్థి కధనం తెలుసుకోవాలి. అక్కడ యజమాని శుల్కo ఇచ్చి యజ్ఞానుష్ఠానం కోసం ఉపస్థిని ఋత్విజుడిగా ఎన్నుకుంటారు. కనుక అంగానుష్ఠానం ఋత్విజుడే చెయ్యాలని ఔడులోమి అభిప్రాయం.
సామ్యధికరణం ( 3, 4, 46 )
సూత్రం :- 471
" శ్రుతే శ్చ "
చ :- పైగా, శ్రుతి వాక్యాల వలన యజ్ఞ కర్మ ఋత్విజులదే అని తెలుస్తోంది.
భావం :- శ్రుతి వాక్యాల వలన యజ్ఞకర్మ ఋత్విజులదేనని తెలుస్తోంది. అయినా ఫలం యజమానికి లభిస్తుంది.
వివరణ:- శ్రుతులలో ఋత్విక్కు చేసిన ఉపాసనాఫలం యజమానికి చెందడం గురించి ఈ సూత్రంలో చెప్పబడింది. యజ్ఞంలో ఋత్విక్కులు ఏ కోరికను కోరతారో దానిని యజమాని కొరకే కోరతారు.
శతపధబ్రాహ్మణం(1, 3, 1, 6):- యజ్ఞంలో ఋత్విజులు ఇచ్చే ఆశీర్వాదం యజమానికి దక్కుతుంది. దీనిని బట్టి ఆశీర్వాదం లాగా ఋత్విజులు అనుష్ఠించే ఉపాసనాంగాల ఫలం కూడా యజమానికే లభిస్తుంది. ' తస్మాత్ ఆ గాయని ' ఇట్లు తెలుసుకున్న ఉద్గాథ నీకొరకు ఏకోరికను గానం ద్వారా సాధించాలి అని అడగాలి. ఈ శ్రుతి ఋత్విక్కులు కర్తగా గల చేసిన యజ్ఞఫలం యజమానుని చేరుతుంది. యజ్ఞం చేసేటప్పుడు ఋత్విక్కు కోరే కోరికలన్ని యజమాని కోసమే. కాని దాని వలన వచ్చే ఫలంమాత్రం యజమానిదే. వారు ఇచ్చే ఆశీర్వాదన యజమానికే లభిస్తుంది. దీనిని బట్టి ఆశీర్వాదం లాగా ఋత్విజులు అనుష్టించే ఉపాసనాంగాల నుండి కూడా ఫలం యజమానికే లభిస్తుంది. అందువలన ఉపాసనలకు కర్త ఋత్విక్కులే.
సహకార్యాంతర విద్యధికరణం ( 3, 4, 47 )
సూత్రం :- 472
" సహ కార్యాంతర విధిః పక్షేణ తృతీయం తద్వతో విధ్యాదివత్ "
సహకరిఅంతరనిధిః :- బృహదారణ్యకంలో మరోసాధనం గురించి చెప్పారు. తృతీయం:- అది మూడోసాధనం. తద్వతః :- బ్రహ్మ జ్ఞానం ఉన్నవాళ్లకు, విధి ఆదివత్ :- విధినిషేధాల్లాగా, పక్షేణ :- ఇది వైకల్పికంగా అనుష్ఠించ వలసిన సాధనం.
భావం :- బృహదారణ్యకంలో మరొకటి, మూడో సాధనం గురించి చెప్పారు. అది బ్రహ్మ జ్ఞానం ఉన్న వాళ్ళు విధి నిషేధాల్లాగా వైకల్పికంగా అనుష్ఠించ వలసిన సాధనం.
వివరణ:-బృహదారణ్యాకంలో మూడోసాధనం గురించి చెప్పారు. మొదటిది - యజ్ఞాది కర్మలు, రెండవది - బహిరంగ సాధనలు, శమదమాదులు, అంతరంగం సాధనలు, మూడవది - మౌనం. పరబ్రహ్మను తెలుసుకున్నవాడు పరమ సుఖాన్ని బ్రహ్మభావాన్ని పొందుతాడు. బ్రాహ్మణుడైన వాడు, బ్రహ్మను గురించి తెలుసుకోవాలనుకునే వాడు మొదటిగా శాస్త్ర పరిజ్ఞానం సంపాదించాలి. తరువాత దానిని దృఢపరచుకోవడానికి మననంచెయ్యాలి. అప్పుడు బ్రహ్మవేత్త అవుతాడు. ఇక్కడ శాస్త్రపరిజ్ఞానంతో బాటు మౌనంకూడా చెప్పబడింది. విద్యకు సహకరి మౌనం. మూడవ విధి అయిన ధ్యానం మౌనంగానే జరగాలి.
బృహదారణ్యాకోపనిషత్తు, కహాల బ్రాహ్మణం (3, 5, 1):- బ్రహ్మజ్ఞాని కావాలనుకున్న వ్యక్తి - పాండిత్యం, శాస్త్రాధ్యయనం, శాస్త్రశ్రవణం, బాగా సంపాదించి శక్తిమంతుడై ఉండాలి. శ్రవణానికి మననం బలం. మననం చేయనిదే ధృడత్వం రాదు. బ్రహ్మజ్ఞానం విషయంలో శ్రవణం అయిన తరువాత గంభీరంగా మననం చెయ్యాలి. ఇలా శ్రవణ మననాలు చేసి ముని కావాలి. మౌనంగా ఉండే వాడే ముని. ఇతర వ్యవహారాలన్నింటికి దూరంగా ఉండి, ధ్యాననిమగ్నుడు కావాలి. ఇలా శ్రవణ మనన ధ్యానాలు చేసి సంపన్నుడైన వాడే బ్రాహ్మణుడు. జ్ఞాని అయిన తరువాత శ్రవణమననాదులను ఐచ్చికంగా అనుష్టించవచ్చును. బ్రహ్మజ్ఞానికి పాపకర్మలు అంటవు. ఈదశలో బ్రహ్మజ్ఞాని శ్రవణ మననాదులు చేసిన చేయక పోయినా లాభం, నష్టం ఉండవు. దీనినే వికల్పం అంటారు. అతడు స్వతంత్రడు. అయిన నిషిద్దాచరణ చేయరాదు.
ముండకోపనిషత్తు(3, 1, 4) :- ఆత్మలో చరించే వాడు, బాహ్య వ్యాపారన్ని విడిచిపెట్టిన వాడు, జ్ఞాన ధ్యానాది పుణ్య కర్మల్లో నిష్ఠుడైన వాడు, బ్రహ్మవిధుల్లో శ్రేష్టుడు, బ్రహ్మ జ్ఞాని స్వాతంత్రుడైనా లోక క్షేమం కోసం విహిత కార్యలే ఆచరిస్తాడు. నిషిద్ద కార్యాలను త్యజిస్తాడు. అంటే విధి, నిషేధ్ధాల్లో స్వతంత్రం ఉండదు.
సూత్రం :- 473
" కృత్స్న భావాత్తు గృహిణోప సంహారః "
తు :- అయితే, కృత్స్న భావాత్ :- సంపూర్ణ జ్ఞాన సాధనాలు గృహస్థాశ్రమ వాసులకు లభ్యమౌతున్నాయి. గృహిణా :- గృహస్తుడు కూడా, ఉప సంహారః :- బ్రహ్మ విద్యను గ్రహించ వచ్చును.
భావం:- సంపూర్ణజ్ఞానసాధనాలు గృహస్థాశ్రమవాసులకు సైతం లభ్యమౌతున్నాయి. అందువలన గృహస్థు బ్రహ్మ విద్యను గ్రహించవచ్చును. గృహస్థాశ్రమంలోకూడా జ్ఞానసాధనాలన్నీ లభిస్తాయి. కాబట్టి గృహస్థుకూడా విద్యను ప్రాప్తించుకో వచ్చును.
వివరణ:-గృహస్థాశ్రమం శ్రేష్టమని చెప్పబడింది. అలాగని సన్యాసాశ్రమం లేదని కాదు. గృహస్టు స్వర్గ సుఖాలు కోరుకుంటే, యజ్ఞయాగాదులు చేసి వాటిని పొందవచ్చును. వారికి శమదమాదులు కూడా అవసరమే. మోక్షం కావాలనుకుంటే బ్రహ్మజ్ఞానసిద్ధి పొందవచ్చును. అందుకే గృహస్థాశ్రమం శ్రేష్టం అని చెప్పారు.
ఛాందోగ్యోపనిషత్తు(8, 15, 1):-గురుసేవ చేసినతరువాత, మిగతా సమయంలో అధ్యయనం పూర్తి చేసి, స్నాతకుడై, గృహస్టుడై, కుటుంబంలోఉండి, పవిత్రస్థానంలో ఆత్మచింతనచేస్తూ, ఇంద్రియాలను తనవశంలో ఉంచుకొని, ఏప్రాణిని హింసించకుండా యావజ్జీవం నడచుకునే వాడు బ్రహ్మలోకాన్ని పొందుతాడు. ఇలా గృహస్థాశ్రమంలోనూ, బ్రహ్మలోక ప్రాప్తి విద్యను గురించి చెప్పారు. ఉపాసకుడికి శమదమాదులతో పాటు యజ్ఞాదికర్మలు నిర్వహించడానికి ఎన్నో సాధనాలు కావాలి. అవి గృహస్థాశ్రమంలో సులభంగా లభిస్తాయి. బ్రహ్మజిజ్ఞాసువు విషయాసక్తి నుంచి ఇతర వ్యాపారాల నుంచి విరక్తుడు కావాలి. ఇవి సాధ్యపడిన గృహస్థుడికి బ్రహ్మవిద్య ప్రాప్తి యుక్తమే.
సూత్రం :- 474
" మౌనవ దితిరేషా మప్యుపదేశాత్ "
మౌనవత్ :- నిధి ధ్యాసనం లాగా, ఇతరేషా అపి :- ఇతర సాధనాంతరాలను కూడా, ఉపదేశాత్ :- శాస్త్రం ఉపదేశిస్తోంది.
భావం :- జ్ఞాన సాధనలన్నింటిలో నిధి ధ్యాసనం ఒక్కటే ఆచరణీయమా? అంటే నిధి ధ్యాసనం లాగా ఇతర సాధనాంతరాలను కూడా శాస్త్రం ఉపదేశిస్తోంది.
వివరణ:-గృహస్టుకు సన్యాసాశ్రమాలు శ్రుతిసమ్మతాలు. అలాగే వానప్రస్థ, సన్యాసాశ్రమాలు కూడా సమ్మతాలే. ఈ నాలుగుఆశ్రమాలలోని ధర్మాలను అనుష్ఠించాలి. ఈరకంగా పాండిత్య బాల్యలతో బాటు మౌనం కూడా విధేనని గ్రహించాలి. బాల్యం అంటే రాగద్వేషాలు లేని నిర్మలభావం. శాస్త్రం నిధిధ్యాసలతో బాటు శమ, దమ వివేకాదుల్ని జ్ఞానసాధనాలుగా నిర్దేశించినది. జ్ఞానప్రాప్తికోసం శాస్త్రం సూచించిన సాధనలన్నీ అనుష్ఠించదగినవే. ఏదోఒక సాధనంవలన మోక్షంరాదు. జ్ఞానసాధనకు ఊర్ద్వరేతస్కులకు ఆశ్రమం ఉపయుక్తమైన అన్యగృహఆశ్రమాల సహకారం లేనిదే బ్రహ్మవిద్య సిద్ధించదు. బ్రహ్మచర్యo మొదలైన ఆశ్రమాలు పాటించడం అవసరం. సాధనాలన్ని అనుష్టేయాలే. ఆశ్రమాలను కూడా ఉపేక్షించరాదు. అందువలన నిధి ధ్యాసనం ఒక్కటే ముఖ్య సాధనమని అనుకోకూడదు.
అనావిష్కారాధికరణం ( 3, 4, 50 )
సూత్రం :- 475
" అనావిష్కు ర్వన్న న్వయాత్ "
అన్వయాత్:-సాధనసంపదతో సంబంధం ఉండటంవలన, అనావిష్కుర్వన్:- గురువు ఉపదేశించిన సాధనాలను ప్రకటం చేయకుండా ఆచరణలో తత్పురుషుడు కావాలి.
భావం :- సాధనా సంపదతో సంబంధం ఉండటం వలన గురువు ఉపదేశించిన సాధనలను ప్రకటం చేయకుండా ఆచరణలో తత్పురుషుడు కావాలి.
వివరణ:- బాల్యం అంటే రాగద్వేషాలు లేని నిర్మలభావం అని భావించాలి. గురువు గారు! బాల్యం అంటే చిన్నతనం అనా? చిన్నపిల్లలు చేసే పనులు అనా? దంభం, దర్పం తెలియనిస్థితా? వీటిలో ఏ అర్ధాన్ని గ్రహించాలి? అని అడిగాడు కృష్ణశర్మ. సమాధానం చెబుతున్నాడు రత్నకరుడు. బాల్యం అంటే తన జ్ఞానాదులను ఇతరులకు వ్యక్తం చెయ్యకుండా కేవలం పవిత్ర భావం కలిగి ఉండటం. బాలుడు అంటే ఇంద్రియప్రాబల్యం లేనివాడు, దంభం, దర్పం లేకుండా నిర్మల స్వభావం కలవాడు. ఇక్కడ యతులు అనుష్ఠించదగినది జ్ఞానాభ్యాసం. బాలలుచేసే సకలచర్యలు అంగీకరిస్తే జ్ఞానాభ్యాసం కుదరదు. అందుచేత బాలునిలోని భావవిశేషము, అప్రరూడెంద్రీయాత్వాధికము (ఇంద్రియాల గట్టిదనం) గ్రహింపబడుతోంది.
మనుస్మృతి(2, 110):- జ్ఞానియై కూడా తెలియనివాడి లాగా మెలగడమే బుద్ధిమంతుల లక్షణమని మనువు అంటాడు. అనుష్ఠానాదిసాధనాలు ఈజన్మలోనే జ్ఞానోత్పత్తిని కలిగిస్తాయి. వివేకవైరాగ్యలు, యమనియమాదులు, శమదమ తితిక్షాదులు, శ్రవణమననాదులు ఇవన్నీ జ్ఞానసాధనలు. గురువు బోధించి నట్లుగా వీటిని నిరంతరం అభ్యసించడం వలన జ్ఞానప్రాప్తి కలుగుతుంది. ఫలప్రాప్తి కలగనంత వరకు తన ప్రవృత్తిని ప్రకటించకూడదు. ముందుగానే ప్రకటిస్తే సాధకుడికి విఘ్నాలు కలగవచ్చును. అభిమానాదులు ఏర్పడవచ్చును. జ్ఞానం, అధ్యయనం, ధార్మికత్వం, మొదలైన వాటి చేత తాను విఖ్యాతుడిగా చేసికొనకుండా, దంభదర్పాది రహిత్తుడై ఉండాలి. అప్రరూడేంద్రియుడవడం చేత బాలుడే విధంగా పరుల ఎదుట తనని తాను ప్రకటించుకోవడానికి అభిలషించడో, అట్లే ఉపాసకుడు కూడా ప్రవర్తించాలి. రహస్య ధర్మాన్ని అవలంభించిన వాడై, విద్వాంసుడై యుండి, ఎవరికీ తెలియని పద్ధతిలో ప్రవర్తించాలి.
ఐహికాధికరణం ( 3, 4, 51 )
సూత్రం :- 476
" ఐహికమ ప్యప్రస్తుత ప్రతిబంధే తద్దర్శనాత్ "
అప్రస్తుత ప్రతిబంధే అపిః :- అడ్డంకులు కలగకపోయినట్లయితే, ఐహికం :- ఈ జన్మలోనే జ్ఞానం కలుగుతుంది. అని తద్దర్శనాత్ :- కొన్ని నిదర్శనాలు కనిపిస్తున్నాయి.
భావం :- అడ్డంకులు కలగక పోయినట్లయితే ఈ జన్మలోనే జ్ఞానం కలుగుతుందని కొన్ని నిదర్శనలు కనిపిస్తున్నాయి.
వివరణ:-ఈఅధికరణంలో జ్ఞానోత్పత్తి ఈజన్మలోనే కలుగుతుందని చెప్పబడింది. శ్రవణమననాది సాధనలకు కర్మశేషం అడ్డం కానప్పుడు ఈ జన్మలోనే జ్ఞానోత్పత్తి కలుగుతుంది. ఒకవేళ కర్మ ప్రతిబంధకం ఏవైనా ఉంటే మరుజన్మలో జ్ఞానం కలుగుతుంది. జ్ఞానసాధనలన్ని సమకూరి, ఆచరించినప్పుడు బలీయమైన పూర్వ కర్మలు అడ్డు పడకపోతే, ఈ జన్మలోనే జ్ఞానప్రాప్తి కలుగుతుంది. లేదా మరుజన్మలో లభిస్తుంది. వామదేవుడు, కపిలుడు, శుకుడు, మొదలైన వాళ్ళు తమ బాల్యంలోనే జ్ఞానులుగా ఉండటాన్ని నిరూపించే శబ్దప్రమాణాలున్నాయి. కాగా జనకుడు, రైక్వుడు, లాంటివాళ్ళు ఈ జన్మలోనే జ్ఞానులుకావడం ప్రసిద్దమే. వాయుదేవుడికి గర్భంలో ఉండగానే జన్మాంతరశ్రవణం వలన జ్ఞానం కలుగుతుంది. ఒక కర్మఫలాన్ని ఇవ్వడానికి ప్రారంభించడం అనేది దేశం, కాలం, నిమిత్తాల కలయిక వలన జరుగుతుంది. కర్మలు కొన్ని విరుద్దఫలాన్నిచ్చేవిగా ఉంటాయి. ఇతర కర్మల ఫలం ఇవ్వకుండా అడ్డు తగిలితే తమ ఫలం ఇచ్చివేయవచ్చును. వాటి బలాబలాల మీద ఆధారపడి ఉంటుంది. కృష్ణా! చేస్తున్న యోగానికి సిద్ధిని పొందని వాడు ఏ గతిని పొందుతాడు అని భగవద్గీతలో అర్జునుడు శ్రీ కృష్ణుని అడిగాడు. నాయనా! మంచి పని చేసే వాడు ఎవడూ కూడా దుర్గతిని పొందడు కదా! అనేకజన్మల యందు సంసిద్దుడై ఉత్తమగతిని పొందుతాడని చెప్పాడు. ఈజన్మలో కలిగినా, పరలోకంలో కలిగినా విద్యాహక్కు ప్రతిబంధ క్షయాన్ని బట్టి మాత్రమే ఉంటుంది.
ముక్తి ఫలాధికరణం ( 3, 4, 52 )
సూత్రం :- 477
" ఏవం ముక్తిఫలానియమ స్తదవస్థాధృతేః తదవస్థాధృతేః "
ఏవం :- జ్ఞానం లాగా, ముక్తి ఫలానియమం :- జ్ఞాన ఫలమైన ముక్తిలో ఐహిక, ఆముష్మిక భేదాలు లేవు. తత్ అవస్థ ధృతేః :- జ్ఞానావస్థలో ముక్తి లభించడం నిశ్చయం.
భావం :- జ్ఞానం లాగా జ్ఞాన ఫలమైన ముక్తిలో ఐహిక, ఆముష్మిక భేదాలు లేవు. జ్ఞానావస్థలో ముక్తి లభించడం నిశ్చయం.
వివరణ:-గురువుగారు! జ్ఞానానికి ఫలితం ముక్తి కదా! మరి ఆముక్తి అందరికీ కలుగుతుందా? లేక అందులో తారతమ్యం ఉందా? అని అడిగాడు కృష్ణశర్మ. సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. బ్రహ్మ సాక్షాత్కారంలాగానే ముక్తి ఫలంలో కూడా తారతమ్యం లేదని అన్ని ఉపనిషత్తులలో మోక్షంఒక్కటేనని చెప్పబడింది. ముండకోపనిషత్తులో బ్రహ్మవేత్త సాక్షాత్తు బ్రహ్మమే అవుతాడని చెప్పబడింది. నిరాకారుడు, నిర్గుణుడు, భేదరహితుడు అయిన పరమేశ్వరుడే ముక్తికి స్వరూపమని చెప్పబడింది. కనుక ముక్తిలో భేదాలుండవు. బ్రహ్మసాక్షాత్కార రూపమైన జ్ఞానప్రాప్తి కలగడంతోటే మోక్షం లభిస్తుంది. ఈ దశలో జ్ఞానం కలగడం, ముక్తి లభించక పోవడం జరగదు.
ముండకోపనిషత్తు(3,1,3):-జగత్కర్తఅయిన ఈశ్వరుడి సాక్షాత్కారం కలగగానే జ్ఞాని పుణ్యపాపకామనలన్నీ విడిచేసి పరబ్రహ్మ ప్రాప్తి పొందుతాడు. బ్రహ్మప్రాప్తే ముక్తి. కనుక ఐహిక ఆముష్మిక నియమం లేదు. శ్రవణ, మనన, నిధిధ్యాసలను పట్టుదలతో చేస్తే సూక్ష్మాతిసూక్ష్మ మైన ఆత్మచైతన్యం నేనే అనే స్థితికి చేరుకుంటారు. చివర తదవస్థాధృతే అని రెండు సార్లు ప్రయోగించడం అధ్యాయ సమాప్తిని సూచిస్తుంది.
చతుర్ధాధ్యాయము, మొదటిపాదం
ఆవృత్త్యధికరణం ( 4, 1, 1 )
సూత్రం :- 478
" ఆవృత్తి రసకృదుపదేశాత్ "
అసకృత్ :- శాస్త్రాల్లో అనేక మార్లు ఉపదేశించినట్లుగా, ఆవృత్తిః :- నిరంతర అభ్యాసం చెయ్యాలి.
భావం :- శాస్త్రాల్లో అనేక మార్లు ఉపదేశించినట్లుగా నిరంతర అభ్యాసం చెయ్యాలి.
వివరణ:-ఈఅధ్యాయంలో బ్రహ్మజ్ఞానఫలాన్ని, దానికి అంతరంగసాధనం అయిన నిధిధ్యాస అభ్యాసాన్ని ఉపదేశిస్తున్నాడు వ్యాసుడు. వెనుకటి అధ్యాయంలో విద్యాసాధనాలు నిరూపించి, ఈఅధ్యయంలో ఫలం నిరూపించబడుతోంది. మొదటి పాదంలో జీవన్ముక్తి, రెండవ పాదంలో ఉత్క్రాంతి, మూడవ పాదంలో అర్చిరాది మార్గం, నాల్గవ పాదంలో జ్ఞానోపాసనలు, ఫల నిర్ణయం గురించి చర్చించడమైనది. శాస్త్రాల్లో అనేకపర్యాయములు నిర్దేశించినట్లు సాధనల్లో ముఖ్యమైన నిధి ధ్యాసనాన్ని జ్ఞానప్రాప్తి కలిగే వరకు నిరంతరం అభ్యాసం చెయ్యాలి. బ్రహ్మసాక్షాత్కారానికి శ్రవణమననాదులు చేసి, విన్నదానిని మననం ఎన్నిసార్లు చెయ్యాలనే సందేహం వస్తుంది. జ్ఞానాన్ని ఆవృత్తి చెయ్యాలి. విన్నదానిని మరచిపోతాం కనుక అదే విషయం మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉండాలి. జీవభావం పూర్తిగా నశించే వరకు, జ్ఞానప్రాప్తి కలిగే వరకు, సమాధి స్థితి ఏర్పడే వరకు, ఆత్మసాక్షాత్కారం అయ్యేవరకు ఈసాధన చేస్తూనే ఉండాలి. నిరంతరంధ్యానం చెయ్యకపోతే బ్రహ్మ సాక్షాత్కార రూపమైన సమాధి స్థితి ఏర్పడదు. వడ్లు ఎంతసేపు దంపాలి అంటే ధాన్యం దంచేటప్పుడు ఒకటి రెండు సార్లు దెబ్బలు వేసినంత మాత్రాన సరిపోదు. బియ్యం వచ్చే వరకు దంచాలి.
ఛాందోగ్యోపనిషత్తు(6, 8, 7):-సఆత్మా తత్త్వమసి శ్వేతకేతోః" అదిఆత్మ దానిపట్ల నిష్ఠ ఉన్నవాడివికా. అని శ్వేత కేతువుకు ఎన్నో పర్యాయములు బోధించారు. అలాగే ఆత్మసాక్షాత్కారం అయ్యేవరకు వాటిని మననం చేస్తూనే ఉండాలి. భగవద్గీతలో వైరాగ్యంతో నిరంతరం చింతన చేస్తూంటేనే అభ్యాసవైరాగ్యాలు మోక్షసిద్ధిని కలిగిస్తాయని చెప్పబడింది.
ఆవృత్త్యధికరణం ( 4, 1, 2 )
సూత్రం :- 479
" లింగాచ్చ "
చ :- పైగా, లింగాత్ :- శాస్త్ర వచనాల వలన నిధి ధ్యాసనం ఆవృత్తి సిద్ధిస్తోంది.
భావం :- శాస్త్ర వచనాల వలన నిధి ధ్యాసనం ఆవృత్తి సిద్ధిస్తోంది. లింగాలు అంటే శబ్దాలు అని అర్థం. శబ్ద పూర్వకమైన వేదం అని అర్థం.
వివరణ:-ఈవిషయాన్ని నిరూపించే గుణాలు కూడా ఉన్నాయి. ఛాందోగ్యంలో ఆదిత్యుడే ఉద్గీత అంటూ ఒక ఆదిత్యోపాసన వలన ఒక్కపుత్రుడే కలుగుతాడు, కాబట్టి ఆదిత్యకిరణాలను ఆదిత్యునికన్నా భిన్నమైన వాటిని ధ్యానించు అని చెప్పబడింది. ఆత్మజ్ఞానం కావాలంటే విన్నవాటినే మళ్ళీమళ్ళీ వినాలి. మననం చెయ్యాలి. ఒక్క ఆదిత్యున్ని ఉపాసన చేస్తే ఒక్క కుమారుడే కలుగుతాడు. ఈశబ్దం ఒక్కడే కుమారుడు కలిగితే మోక్షం వస్తుంది. ఒక్కడు అంటే లేనట్లేనని చాలామంది పుత్రులను కోరుకునేవారు. ఆదిత్యునికంటే భిన్నంగా ఉండే ఆదిత్యకిరణాలను చాలా సార్లు ఉపాసన చేస్తుంటే మోక్ష సిద్ధి లభిస్తుంది.
బృహదారణ్యాకోపనిషత్తు(4, 5, 6):- బ్రహ్మ సాక్షాత్కారం మానవజీవన లక్ష్యం. కనుక శ్రవణ, మనన, నిధి ధ్యాసనాలు అనే సాధానాల వలన దానిని పొందవచ్చును.
తైత్తరీయెపనిషత్తు(2, 7):- ఉపాసకుడైన జీవుడికి అదృశ్య మైన బ్రహ్మంలో నిర్భాధ ప్రతిష్ట పొందినవాడికే నిర్భయ స్థితి కలుగుతుంది. అలాంటి అభయ స్థితి సంపాదించడానికి నిరంతరంగా ధ్యానం చెయ్యాలి. దీనికి పూర్వ పక్షం వారి వాదన ఉన్నది. సాధ్యములైన ఫలాలు గల ప్రత్యయాలలో అనగా సగుణోపాసనలలో ప్రత్యయాల ఆవృత్తి ఉంటే ఉండవచ్చును. అతిశయం ఉండటానికి అవకాశం ఉంది. పరబ్రహ్మకు సంబంధించిన ఏప్రక్రియ నిత్యశుద్ధబుద్ధముక్త స్వభావమైన ఆత్మ యైన పరబ్రహ్మను అందజేస్తుందో దానికి ఆవృత్తి ఎందుకు? ఆవృత్తి చేసిన కూడా ఆ ప్రతీతి కలగదు కదా! అని సందేహం. తత్త్వమసి అనే మాటకు ఒక్కసారి వినగానే బ్రహ్మజ్ఞానం కలిగించకపోతే దానిని ఆవృత్తి చేసినంత మాత్రాన జ్ఞానం కలిగిస్తుందనే నమ్మకం ఏమిటి అని వారివాదన. ఒకయుక్తివాక్యం చేత కూడా సామాన్యరూపం లోనే జ్ఞానం కలుగుతుంది. విశేషరూపమైన జ్ఞానం కలగదు. ఎలాగంటే నా గుండెలో నొప్పిగా ఉంది. అన్న వాక్యం వలన దేహం వణకడం మొదలైన లింగం వలన అతడు నొప్పితో బాధ పడుతున్నాడని తెలుస్తుంది. కాని ఆ బాధను తాను అనుభవించలేడు. అవిద్య తొలగాలంటే విశేషఅనుభవం ఉండాలి. అందుకే దాని అర్ధం ఆవృత్తి కావాలి. ఎన్ని సార్లు చేసిన విశేషంజ్ఞానం పుట్టదు. ఆ శాస్త్రయుక్తులను వంద సార్లు ప్రయోగించినా కూడా తెలుసుకోవడం శక్యం కాదు కదా! ఆత్మలో అంశాలేవి లేకపోయినా ఆఆత్మమీద ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి విషయాలు, వేదనలు అనేకమైన అంశాలు ఆరోపించబడతాయి. వాటిని తొలగించడానికి జ్ఞానం యుక్తమే. ఛాందోగ్యంలో తత్త్వమసి అని అనేక పర్యాయములు శ్వేత కేతువుకు ఉపదేశించారు. అది ఒకసారి శ్రవణం, మననం చేసినంత మాత్రాన జ్ఞానం కలగదు. సాధారణంగా శ్రవణం, మననం ద్వారా చిత్తాన్ని స్థిరపరచుకున్నప్పటికి ఆ స్థితిలో ఉండాలంటే నిధి ధ్యాసనం చేస్తూనే ఉండాలి. తత్త్వమసి అంటే దాని అర్ధాన్ని జీర్ణం చేసుకోవాలి. దేహేంద్రియ మనోబుద్ధులకు వేరుగా వున్నవాడు పరమాత్మయే. నేనే పరమాత్మ, పరమాత్మే నేను అనే స్థితికి చేరుకోవడానికి నిరంతరంగా నిధి ధ్యాసనం చేస్తూనే ఉండాలి.
ఆత్మత్వోపాసనాధికరణం ( 4, 1, 3 )
సూత్రం :- 480
" ఆత్మీతి తూప గచ్ఛంతి గ్రాహయంతి చ "
ఆత్మా ఇతి తు :- సర్వ వ్యాపక పరబ్రహ్మం అనే, ఉప గచ్ఛంతి :- వైదికులు అంగీకరిస్తారు, గ్రాహయంతి చ :- ఇలాగే ఉపనిషత్తులు, వేదాలు వెల్లడిస్తున్నాయి.
భావం :- నిధి ధ్యాసనానికి విషయం ఏది? సర్వ వ్యాపక పరబ్రహ్మం అనే వైదికులు అంగీకరిస్తారు. ఇలాగే ఉపనిషత్తులు, వేదాలు వెల్లడిస్తున్నాయి.
వివరణ:-గురువు గారు! పరబ్రహ్మోపాసన చేసేటప్పుడు ఆపరమాత్మను నేనే అని భావించలా? పరమాత్మ వేరు, నేను వేరు అని ధ్యానించాలా? అని అడిగాడు కృష్ణశర్మ, దానికి సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. నేనే పరమాత్మను అనే అహంప్రత్యయంతోనే ఉపాసనచెయ్యాలి. అప్పుడే పరబ్రహ్మసాక్షాత్కారం అవుతుంది. ఆపరమాత్మ కోసం సగుణోపాషన చేసినా, నిర్గుణోపాసన చేసినా, నేనే ఆపరమాత్మను అని ఉపాసన చెయ్యాలి. పరమాత్మ వేరు, నేను వేరు అనే ద్వైతం పనికి రాదు. అయమాత్మ బ్రహ్మ , తత్త్వమసి, వంటి మహా వాక్యాలు పరమాత్మ నిత్య, శుద్ధ, బుద్ధ, ముక్త స్వరూపుడని, జీవేశ్వరులు ఒక్కటేనని తెలియజేస్తాయి.
ముండకోపనిషత్తు ( 2, 2, 6 ) :- సర్వ వ్యాపక మైన పరమాత్మను ఓం అని ధ్యానించు.
యజుర్వేదం(32, 11):- వేదాభ్యాసం, ధర్మాచరణం, యోగానుష్ఠానాల మూలంగా చేతన, అచేతన పదార్ధాలస్వరూపాన్ని ఎరిగిన ఉపాసకుడు బ్రహ్మాన్ని ప్రవేశించి, ఆనందాన్ని అనుభవిస్తాడు. కనుక పరమపురుషప్రాప్తికి నిరంతర ఆవృత్తి అవసరం అని సూత్రార్ధం. ద్వైత భావనతో ఉపాసించడమే సమంజసమని పూర్వపక్షివాదన. పరమాత్మ నిరాకారుడు, నిర్గుణుడు, సర్వంతర్యామి. జీవుడు సాకారుడు, కర్త, భోక్త పాప పుణ్య ఫలాలు అనుభవించే వాడు. గుణాలున్నవాడు, దేహేంద్రియ మనోబుద్ధులకు పరిమితం మైనవాడు. జీవేశ్వరులిద్దరి మధ్య అనేక భేదాలుండటం వలన ఇద్దరూ ఒక్కటి కాదని వారి వాదన. అద్వైత భావనతోనే ఇద్దరూ ఒక్కటే అని చెప్పబడింది. ఇద్దరూ ఒక్కటే అయితే అహం బ్రహ్మస్మి అనే ధ్యానం వృధా అని వారి వాదన. ప్రకృతిలో జంతువులు, వృక్షాలు, పశు పక్ష్యాదులు, అంతటా నిండి ఉన్న ఆత్మయే నీలో ఉన్న ఆత్మ. ఆత్మ అంటే పరమాత్మ భావనతో ఉపసించాలి. ఆత్మకు పరమాత్మకు భేదాలు లేవు. నేను పరమాత్మను అనే జ్ఞానం లేకపోవడంతో జీవుడికి, ఈశ్వరుడికి మధ్య భేదాలు కనిపిస్తున్నాయి. ఆ అజ్ఞానంతోనే నేను ఆత్మను అనే సంగతి మరచిపోయి జీవుడినే అనుకుంటారు. ఓ పరమాత్మా నీవే నేను, నేనే నీవు అంటోంది జాబాలోపనిషత్తు. నిరంతర నిధి ధ్యాసనతో మననం చేస్తే దేహేంద్రియ మనోబుద్ధులు నశించి, నేను జీవుడిని కాదు పరమాత్మనే భావన కలుగుతుంది. ఆ తరువాతే మోక్షప్రాప్తి కలుగుతుంది.
ప్రతీకాధికరణం ( 4, 1, 4 )
సూత్రం :- 481
" న ప్రతీకే న హి సః "
ప్రతీకే :- ప్రాకృతిక పదార్ధాలను, న :- ధ్యానం చెయ్యకూడదు. హి :- ఎందుకంటే, సః :- ప్రతీక పదార్ధాలు, న :- ధ్యాన విషయం కానేరావు.
భావం :- ప్రాకృతిక పదార్ధాలను ధ్యానం చెయ్యకూడదు. ఎందుకంటే ప్రతీక పదార్ధాలు ధ్యాన విషయం కానేరావు.
వివరణ:- భగవంతుని బదులుగా ఒక ప్రతీక అంటే ప్రతిమను పెట్టుకొని, దానినే ఇష్టదైవంగా భావిస్తు ధ్యానం చెయ్యడాన్ని ప్రతీకోపాసన అంటారు. ఛాందోగ్యంలో మనస్సే బ్రహ్మ, ఆదిత్యుడే బ్రహ్మ, నామమే బ్రహ్మ అని ఉపాసించాలి. సృష్టిలో కనిపించే వృక్షాలు, మృగాలు, నదులు, పర్వతాలు, ఆకాశం, వాయువు అన్నీ పరమాత్మ సృష్టించినవే. కాని వాటిని ప్రతీకలుగా చేసుకొని ధ్యానించకూడదు. కాబట్టి నేనే బ్రహ్మను, నేనే మనస్సును, నేనే ఆదిత్యుణ్ణి అని ఉపాసించలా? లేక ప్రతీక రూపంలో ఉన్న బ్రహ్మాన్ని ఉపాసించలా? అని పూర్వపక్షంవారి సందేహం. ప్రతీకలో బ్రహ్మబుద్ధి పనికి రాదు. ఎందుచేత నంటే ఉపాసకుడు ప్రతీక స్వరూపుడు కాదు. బంగారు కిరీటం, బంగారు కంకణం రెండింటిలో ఉన్నది బంగారమే. కాని నామరూపాలలో తేడాఉన్నది. అదేవిధంగా ప్రతీకలన్ని బ్రహ్మదృష్టిలో ఏకత్వం ఉన్నప్పటికీ స్వరూపంలో తేడా ఉన్నది. అందువలన నేనే ప్రతీకాన్ని అని ఉపాసించకూడదు. ఆకాశం, వాయువు పరమాత్మచే సృష్టించబడినవి. కాని ఆకాశం బ్రహ్మం కాదు. బ్రహ్మంలక్షణాలను వర్ణించేటప్పుడు వాటిని ఉపమానాలుగా చేసికొని, బ్రహ్మఆకాశంలా విశ్వమంతటా సర్వవ్యాపకమై ఉన్నాడని చెబుతారు. ఏదైనా వ్రతం చేసేటప్పుడు ముందుగా పసుపుముద్దను వినాయకుడిగా ధ్యానిస్తాము. పసుపుముద్దను వినాయకుడు అనకూడదు. ఈప్రాకృతికమైన నామరూపాత్మకమైన జగత్తు సృష్టి వెనుక ఉన్న పరమాత్మతత్త్వాన్ని అవగాహన చేసుకొని, సమాధిస్థితిలో ఉన్న శుద్ధ చైతన్యాన్ని దర్శించి నేనే బ్రహ్మాన్ని అనే ఏకత్వభావనను ఉపాసకుడు పొందగలగాలి. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవి ఏమి నేను కాదు. జ్ఞానేంద్రియాలు నేను కాదు. చిదానందరూపమైన శివుణ్ణి నేను అనుకొని, ఉపాధి లేని స్థితిలో సూక్ష్మాతిసూక్ష్మ మైన, యదార్ధమైన బ్రహ్మాన్ని ఉపాసించాలి. ఉపాసకుడు ఉపాధులన్నీ వదిలించుకొని, ఉపాధులులేని ఆత్మను ఉపాసిం చాలి. ప్రతీకోపాసన చేసేవారికి ఇవిచెప్పబడలేదు. మోక్షాన్నికోరే ముముక్షువులు ఎలాఉపాసించాలో చెప్పబడింది.
బ్రహ్మదృష్ట్యధికరణం ( 4, 1, 5 )
సూత్రం :- 482
" బ్రహ్మ దృష్టి రుత్కర్షాత్ "
ఉత్కర్షాత్ :- ఎంతో ఉత్కృష్టం కావటం వలన, బ్రహ్మ దృష్టిః :- అన్నింటిలో బ్రహ్మాన్ని దర్శించాలి.
భావం :- ఎంతో ఉత్కృష్టం కావటం వలన అన్నింటిలో బ్రహ్మాన్ని దర్శించాలి.
వివరణ:-ఉత్కృష్టమైనవి కాబట్టి మనస్సు మొదలైన వాటి యందు బ్రహ్మ దృష్టి ఉంచి ఉపాసించాలి. నికృష్టమైన సేవకుణ్ణి నువ్వు గొప్పవాడివి, నువ్వే రాజువి అని పొగిడి పనిచేయించుకున్నట్లే, మనస్సును నువ్వే బ్రహ్మవి అని భావించి ఉపాసించాలి. ఛాందోగ్యంలో మనస్సు, ఆకాశం, ఆదిత్యుడులాంటి వాటిని బ్రహ్మభావంతో ఉపాసించాలని చెప్పారు. బ్రహ్మం సర్వవ్యాపకం. కనుక విశ్వం ప్రకటమౌతోంది. ఈవిశ్వంలో ఉండే ప్రాకృతిక పదార్ధాలలో మనస్సు, ఆకాశం, ఆదిత్యుడు మిగతా వాటి కన్నా ఉత్కృష్ట మైనవి. ఆదిత్యడు బ్రహ్మం జ్యోతిర్మ మయం, జ్ఞానాత్మకం అని స్ఫురణకు తెస్తుంది. ఆకాశం బ్రహ్మ వ్యాపకత్వాన్ని గుర్తు చేస్తుంది. ఈవస్తువులన్నీ బ్రహ్మం వలన ప్రకటమౌతు, తమలో ఉండే బ్రహ్మాన్ని స్ఫురణకు తేవడంవలన వాటిని ఉత్కృష్టాలు అన్నారు. శుద్ధమైన మనస్సు ధ్యానానికి సహకరిస్తుంది. తమకు ఇష్టమైన ప్రతీక పెట్టుకొని ఉపాసించాలి. మనస్సుని బ్రహ్మంగానా! బ్రహ్మాన్ని మనసుగా ఉపాసించలా! అలాచెప్పలేరు కనుక బ్రహ్మము నందు దృష్టి ఉంచి ధ్యానించాలని పూర్వపక్షివాదన. మనస్సు, బ్రహ్మం రెండింటిలో ఉత్కృష్టమైనది బ్రహ్మం. కనుక ఉత్కృష్టమైన దానిలో అల్పమైన మనస్సునుఉంచి ఉపాసించాలి. అల్పమైనవాటిలో ఉత్కృష్టమైనవివుంచి ఉపాసించ కూడదు. మనస్సు నందు బ్రహ్మాన్ని ఉంచి, అల్పమైన ప్రాణము నందు బ్రహ్మం పై దృష్టి ఉంచి ఉపాసించాలి. "మనోబ్రహ్మే త్యుపాసీతా" అనే శ్రుతిలో మనస్సుని బ్రహ్మ అని ఉపాసించు. బ్రహ్మాన్ని మనస్సుగా భావించరాదు. మనస్సు మొదలైన జడపదార్ధాలను బ్రహ్మంగాపరిగణించి ఉపశించాల్సిందేనని చెప్పారు. వాటి ఉత్కర్షవలన బ్రహ్మనుపాసించాలని మహర్షులు సూచించారు. కాని అవే బ్రహ్మం అని ఉపాసించడానికి కాదు.
ఆదిత్యాది మత్యధికరణం ( 4, 1, 6 )
సూత్రం :- 483
" ఆదిత్యాది మతయ శ్చాoగ ఉపపత్తేః "
ఉపపత్తేః :- సులభం కావటం వలన, అంగే :- కర్మాంగమైన ఉద్గీథంలో, ఆదిత్యాది మతయః :- ఆదిత్యాది భావనల్ని, చ :- కూడా చెప్పారు.
భావం :- మనస్సే బ్రహ్మ అని భావించి ఉపాసించడం సులభం కావడం వలన కర్మాంగమైన ఉద్గీథంలో ఆదిత్యాది భావనాలను కూడా చెప్పారు.
వివరణ:-కర్మాంగములయందు దేవతాభావం ఉండాలా? అని సంశయం. అంగమైన ఉద్గీథాదికర్మలయందు ఆదిత్య భావం ఉండి తీరాలి. అప్పుడే సంపూర్ణమైన ఫలం లభిస్తుంది. ఈరకమైన ఉపాసనలు కర్మఫలాన్ని సంపాదించు కోవడం కోసం ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి కర్మాంగలైన ఉద్గీథాదుల యందు దేవతాద్రుష్టి ఉండాలి. ఉత్ అంటే ప్రాణం. ఆ ప్రాణం మూలంగానే ఈజగత్తంతా స్థిరమై నిలబడింది. గీథ్ అంటే వాక్కు. ఈవిశ్వాసాన్ని ధరించే ప్రాణమే బ్రహ్మం. ఆయన్ని గానం చేసే గీథ్ అంటే వాక్కు (ఓం కారం)రూపంలో తెలుసుకోవాలి. ఓం పదంలో ఉపాసించి బ్రహ్మాన్ని పొందడమే ఉద్గీథ విద్య.
ఛాందోగ్యోపనిషత్తు:-(1, 3, 1):-"య ఏ వాసౌ తపతి తముద్గీత ముపాసీత" ఈతపించేవాణ్ణి ఉద్గీథబుద్ధితో ఉపాసించాలి అని అర్ధం. అయితే కర్మకు యజ్ఞానికిఅంగాలైన ఉపాసనలవిషయంలో కర్మాంగాలైన ఉద్గీథాదుల్ని ఆదిత్యులుగ పరిగణించాలా? లేక ఆదిత్యాదులను ఉద్గీథాలు అనుకోవాలా? అని సందేహంవస్తే కర్మాంగాలైన ఉద్గీథాదులలో ఆదిత్య భావనతో ఉపాసించడం వలన ఆకర్మలు ఎంతో శక్తిమంతమవుతాయి అంటున్నారు వ్యాసమహర్షి. ఉద్గీథం ఓం కారో చ్చారణ-జపం చెయ్యడంవలన హృదయంలోఉండే అజ్ఞానం, భయం దూరమౌతాయి. అలాగే ఆదిత్యోదయంవలన అంధకారం, భయం ఈలోకంలో అంతరిస్తాయి. కనుక ఉద్గీథాదికర్మాంగాలలో ఆదిత్యాదిభావనతో ఉపాసించాలని చెప్పారు.
ఆసీనాధికరణం ( 4, 1, 7 )
సూత్రం :- 484
" ఆసీనః సంభవాత్ "
ఆసీనః :- కూర్చుని ధ్యానం చెయ్యడం, సంభావత్ :- సులువుగా వీలవుతుంది.
భావం :- నిధి ధ్యాసనం ఎలా చెయ్యాలి? కూర్చుని ధ్యానం చెయ్యడం సులువుగా వీలవుతుంది.
వివరణ:-కర్మాంగాలకు సంబంధించిన ఉపాసనలలో ఉపాసనకర్మ మీద ఆధారపడి ఉంటుంది. కనుక ఆసనాన్ని గురించిన చింత అవసరం లేదు. సమ్యక్ దర్శనం విషయంలో కూడా అది వస్తువుమీద ఆధారపడి ఉంటుంది. అప్పుడు కూడా ఆసనం చింత ఉండదు. ఇతరమైన ఉపాసనలలో ఉపాసన మానసికం గాన కూర్చునే చెయ్యాలని చెబుతున్నారు. ఉపాసకుడు ఆసీనుడై, బ్రహ్మసాక్షాత్కారంకోసం నిత్యం ధ్యానంచెయ్యాలి. కూర్చునే ఉపాసనచేస్తే ద్యాస నేలమీద ఉంటుంది. ముందు ప్రశాంతంగా సిద్ధ పద్మాసనంలోనే స్థిరంగా కూర్చుని ఆతరువాత ఉపాసన చెయ్యాలి. నిలబడి గాని, నడుస్తూగాని, పడుకొనిగాని ధ్యానం చెయ్యకూడదు. అలా చేస్తే విక్షేపాదులు కలుగుతాయి. పడుకొని చేస్తే నిద్రావశుడు కావచ్చును. ఉపాసనఅనగా సమానమైన జ్ఞానప్రవాహాన్ని నడిపించడం అవి నడుస్తున్న వారికీ, పరుగేత్తే వారికీ సంభవం కాదు. నిలబడినప్పుడు మనస్సు దేహాన్ని నిలబెట్టుకోనడంలో వ్యాపకమై ఉంటుంది. సూక్ష్మవస్తువులు చూడజాలదు. శయనించిన వానిమనస్సు అకస్మాత్తుగా నిద్రచేత ఆక్రమింపబడుతుంది. కూర్చున్నప్పుడు ఇలాంటి దోషాలు అనాయాసంగా పరిహరించవచ్చును. గాన ఉపాసన సంభవమౌతుంది. జ్ఞానప్రవాహానికి పరమాత్మ భావనకు ఎటువంటి ఆటంకం లేకుండా ధ్యానంలో నిమగ్నమవ్వాలి. తైలధార ఏ ఆటంకం లేకుండా పై నుండి క్రిందికి ఎలా పడుతుందో, అదే విధంగా ఉపాసకుడు ధ్యానం కూడా కొనసాగాలి.
ఆసీనాధికరణం ( 4, 1, 8 )
సూత్రం :- 485
" ధ్యానాచ్చ "
చ :- పైగా, ధ్యానాత్ :- నిధి ధ్యాసనం అంటే ధ్యానమే.
భావం :- ధ్యానం కూర్చునే చెయ్యాలి. పైగా నిధి ధ్యాసనం అంటే ధ్యానమే.
వివరణ:-ఉపాసన ధ్యానరూపమైనది. కాబట్టి కూర్చునే చెయ్యాలి. ఉపాసన అంటేనే ధ్యానం. ఏకాగ్రచిత్తంతో స్థిరంగా తన యొక్క ఆసనాన్ని పవిత్రమైన ప్రదేశంలో స్థిరంగా ఉంచుకొని, ఆసనభద్దుడై, లక్ష్యాన్ని సాధించడానికి ధ్యానంచెయ్యాలి. అష్టాంగయోగంలో ధ్యానం ఏడవది. అది చిత్తఏకగ్రాత వలనే కలుగుతుంది. ఏకాగ్రతకు ఒక ఆసనంలో పరిమితం కావడం ముఖ్యం. అష్టాంగాలలో ఆసనం మూడవది. యోగశాస్త్రంలో పద్మాసనం మొదలైన ఆసనాలు చెప్పబడ్డాయి.
సూత్రం :- 486
" అచలత్వం చాపేక్ష్య "
ధ్యానంలో అచలత్వం చ :- నిశ్చలత్వం కూడా, అపేక్ష్య :- కావాలి.
భావం :- ధ్యానంలో నిశ్చలత్వం కూడా కావాలి.
వివరణ:-నిధిధ్యాసనం చేసే ముందు ముముక్షువు అంగ చంచత్వం పోగొట్టుకోవాలి. శరీరంలోని అవయవాలు చలిస్తుంటే చిత్త ఏకాగ్రత సాధించడం సాధ్యం కాదు. అచలం అంటే కదలలేనిది, నిశ్చలంగా కదలకుండా ఉండేది అని అర్ధం. అదే విధంగా పృధివి ధ్యానంచేస్తున్నట్లుగా ఉన్నది అంటే కదలకుండా, నిశ్చలంగా ఉండటం. ఒక చెట్టు కొమ్మ కదిలిస్తే చెట్టంతా కదులుతుంది. అవయవాలు చలిస్తుంటే చిత్తఏకగ్రాత సాధ్యం కాదు. కనుక ఉపాసన ధ్యాన సంబంధమైనది కనుక ధ్యానం చేసేటప్పుడు నిశ్చలత్వం అవసరమని, అది స్థిరంగా కూర్చుని ఉన్నప్పుడే సాధ్యమౌతుందని చెప్పబడింది.
సూత్రం :- 487
" స్మరంతి చ "
స్మరంతి చ :- పతంజలి మహర్షి కూడా కూర్చునే ధ్యానించాలని చెప్పాడు.
భావం :- పతంజలి మహర్షి కూడా కూర్చునే ధ్యానించాలని చెప్పాడు.
వివరణ:-స్మృతులలోకూడా ఇదే చెప్పబడింది. ఉపాసకుడు పరిశుద్ధమైన స్థలంలో ఆసనం ఏర్పాటు చేసుకోవాలని స్మృతులు చెబుతున్నాయి.
యోగదర్శనం(2, 29):- "యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణా, ధ్యాన సమాధయోష్టావంగాని " ఈ సోపానం క్రమంలో ఆసనం మూడవది, కాగా ధ్యానం ఏడవది. ఉపాసనకు అంగం అని శిస్టులు "శు చౌ... ఆత్మనః " తన యొక్క ఆసనాన్ని పవిత్రమైన ప్రదేశంలో స్థిరంగా ఉంచుకొని ధ్యానంచెయ్యాలి. అందువల్లనే యోగశాస్త్రంలో పద్మకం మొదలైన ఆసనాల గురించి చెప్పబడింది. ఉపాసకుడు తానే బ్రహ్మం అని తెలుసుకునే వరకు సమాధిపర్యంతం చేసే ధ్యానాన్ని నిధి ధ్యాసనం అంటారు.
ఏకాగ్రతాధికరణము ( 4, 1, 11 )
సూత్రం :- 488
" యత్రైకాగ్రతా తత్రా విశేషాత్ "
అవిశేషాత్ :- నిధి ధ్యాసనం, చిత్త ఏకాగ్రత :- వీటిలో విశేషమైన తేడా లేదు. యత్ర :- ఎక్కడ, ఏకాగ్రత్త :- చిత్త ఏకాగ్రత్త కలుగుతుందో, తత్ర :- అక్కడే ధ్యానం చెయ్యాలి.
భావం:- నిధిధ్యాసనం వీటిలో విశేషమైన తేడా లేదు. దాదాపు సమానం. అందువలన ఎక్కడ చిత్త ఏకాగ్రత కలుగుతుందో, అక్కడే ధ్యానం చెయ్యాలి.
వివరణ:- ఈఅధికరణంలో మనస్సు ఏకాగ్రతే ప్రధానం అని చెప్పబడింది. ఎప్పుడు, ఎక్కడ ఏ దిక్కుగా ఎలా అయితే మనస్సు ప్రశాంతంగా, ఏకాగ్రతగా ఉంటుందో ఆ విధంగానే ఉపాసన చెయ్యాలి. దిక్కులు, దేశకాలాలు అనే నియమాలు కర్మలకే ఉంటాయి కాని ఉపాసనలకు ఉండవు.
శ్వేతాశ్వరోపనిషత్తు(2, 10):- స్థలం, సమం శుద్ధంగా ఉండాలి. కంకర, అగ్ని, ఇసుక ఉండరాదు. ధ్వని, జలం, ప్రదేశం మనస్సుకు అనుకూలంగా ఉండాలి. ఇలాంటి కంటికి ఇంపైన గుహలో గాని, ఈదురుగాలులు వీచని ప్రదేశంలో గాని ధ్యానం చెయ్యాలి. ఇవన్నీ చిత్తఏకాగ్రతకు అనుకూలంగా ఉండాలని గ్రహించాలి. చిత్తఏకగ్రత ఎక్కడ లభిస్తుందో అక్కడే ధ్యానం చెయ్యాలి. దీనికి దేశ, కాలాది భేదాలు అంతగా పాటించవలసిన అవసరం లేదు. అయితే మనస్సుకు నచ్చిన ప్రదేశంలో ఆహ్లాదకరమైన ప్రశాంతవాతావరణంలో సుఖాసనంమీద కూర్చుని ఉపాసన చెయ్యాలి. ఇవి ఉన్నప్పటికీ ఏకాగ్రత లేనిదే ఫలితం రాదు. కాబట్టి ముందుగా ఏకాగ్రత ప్రధానమని చెప్పబడింది.
ఆప్రాయణాధికరణం ( 4, 1, 12 )
సూత్రం :- 489
ఆ ప్రాణాయాత్ తత్రాపి హి దృష్టమ్
" ఆ ప్రాణాయాత్ :- మరణం కలిగే వరకు ధ్యానం చెయ్యాలి. హి :- అని, తత్ర అపి దృష్టమ్ :- శాస్త్ర విధుల్లో నిర్దేశించారు.
భావం :- మరణం కలిగే వరకు ధ్యానం చెయ్యాలని శాస్త్ర విధుల్లో నిర్దేశించారు.
వివరణ:- ఈ అధికారణంలో మరణపర్యంతం ధ్యానం చెయ్యాలని చెప్పబడింది.
ప్రశ్నపనిషత్తు(5, 1):- మనుషులు మరణపర్యంతం వరకు ఓంకారాన్ని ధ్యానించాలి. కనుక, నిరంతరం సత్కారబుద్ధితో బ్రహ్మసాక్షాత్కారం కలిగే వరకు ధ్యానం చేయాలనీ తెలుస్తోంది. దేహపాతం జరిగేంతవరకు స్థిరత్వంకోసం యత్నించాలి. ఇలా నిరంతరం నిధి ధ్యాసనం చేయటం వలన జ్ఞానం కలుగుతుంది. ఉపాసకులు కర్మల లాగానే కొంతకాలం పాటు చేసి వదలివేయవచ్చును. జీవితాంతం చెయ్యవలసిన అవసరం లేదని ప్రతిపక్షవాదన. అది సరియైనది కాదు. ఉపాసనలు మరణం పర్యంతం చెయ్యవలసినదేనని వేదాలు చెబుతున్నాయి. మరణం సమయంలో ఏఆలోచనలతో ఉంటే జీవుడు ఆ లోకాలకే పోతాడు. ఆజన్మ ఎత్తుతాడు. జడభరతుడు ఎందుకు ఉదాహరణ. ప్రాణత్యాగ పర్యంతం ఆవర్తనం చేస్తూనే ఉండాలి. ఎందుకంటే చివరి ప్రయత్నాన్ని బట్టి అదృష్టఫలం లభిస్తుంది. జన్మాన్తరంలో అనుభవించదగిన ఫలాన్ని ప్రారంభిస్తున్న కర్మలుకూడా అలాంటి భావం ఉంటేనే కాని అవి ఫలప్రారంభం చెయ్యజాలవు. ఏలోకాన్ని గురించి సంకల్పం ఆసంకల్పించబడిన లోకంలో కూడా ఫలస్ఫూర్తి కలిగిన తరువాత మనస్సు ప్రాణంతో లీనం అవుతుంది. ప్రాణం తేజస్సుతో కూడి జీవునితో కూడా సంకల్పించబడిన లోకానికి తీసుకొని వెడుతుంది. తృణజలూకా న్యాయం కూడా చెప్పబడింది. గడ్డి మీద సంచరించే ఒక జలగ వంటి పురుగు అవతల నున్ను గడ్డి పరకను మునుగాళ్ళతో పట్టుకొని, తరువాత వెనుక నున్న గడ్డి పరక మీద తన పట్టును వదులుతుంది. అట్లే జీవుడు భావన ద్వారా రాబోయే శరీరాన్ని పట్టుకొని ఈ శరీరాన్ని వదులుతాడని శృతి వాక్యంలో చెప్పబడింది. అందువలన ప్రాణత్యాగ పర్యంతం ఉపాసకుడు నిత్యం ధ్యానిస్తూనే ఉండాలి.
తదధిగమాధికరణం ( 4, 1, 13 )
సూత్రం :- 490
" తదధిగమ ఉత్తర పూర్వఘయో రశ్లేష వినాశౌతత్ వ్యపదేశాత్ "
తత్ అధిగమ :- పరమాత్మ సాక్షాత్కారం కలిగిన తరువాత, ఉత్తర పూర్వ అఘయోః :- ఇది వరకటి, తరువాత పాపాలు సైతం, అశ్లేష వినాశౌ :- నిశ్శషంగా నశిస్తాయి., తత్ వ్యపదేశాత్ :- శాస్త్రాల్లో చెప్పారు.
భావం:-పరమాత్మసాక్షాత్కారం కలిగిన తరువాత ఇది వరకటి, తరువాత పాపాలు సైతం నిశ్శేషంగా నశిస్తాయని శాస్త్రాల్లో చెప్పారు.
వివరణ:-ఈఅధికరణంలో జ్ఞానికి పూర్వోత్తరకృతపాపాలు అంటవని చెప్పబడింది. బ్రహ్మ సాక్షాత్కారం వలన పాప మంతా నశిస్తుందా, నశించిందా? అని సంశయం. నిరంతర నిధి ధ్యాసనం అభ్యసించడం వలన పరబ్రహ్మ సాక్షాత్కారమవుతుంది. అప్పుడు పూర్వోత్తర పాపాలన్నీ నశిస్తాయి. వాటితో ఏసంబంధం ఉండదు. బ్రహ్మజ్ఞానం కలగడమే మోక్షం. అప్పుడు జ్ఞాని పాపకార్యాలు ఆచరించడు. అతనికి పాపసంబంధం తెగిపోతుంది. పూర్వకృతపాపాలు జ్ఞానాగ్నితో దగ్ధమౌతాయి. తామరాకుమీద నీటిబొట్టు ఏరకంగా దానికిఅంటదో, అలాగే బ్రహ్మజ్ఞానికి పాపం అంటదు. బ్రహ్మజ్ఞానికి వెనుకటి పాపాలతోను, రాబోయే పాపాలతోను ఎట్టి సంబంధం ఉండదు.
ఛాందోగ్యం(4, 14, 3):- కమలపత్రానికి జలం అంటనట్లు బ్రహ్మజ్ఞానికి పాపాలు అంటవు. (5,24,3) :-సన్నటి పుల్ల చివరలో ఉన్న దూదిలాంటి కోమల పుష్పం అగ్నిని తాకి వెంటనే దగ్ధమైనట్లుగా, బ్రహ్మజ్ఞాని పూర్వపాపాలాన్ని నశిస్తాయి అంటే పూర్వసంచితపాపాలు జ్ఞానంతో దగ్ధమౌతాయి. పాపసంబంధం లేదంటున్నారు. కర్మలకు క్షయం ఉండదు. పాపకర్మలైన పుణ్యకర్మలైన అనుభవించితీరాలి. కొన్ని కర్మలకు ప్రాయిశ్చిత్తంగా కొన్ని పరిష్కారమార్గాలు చెప్పబడ్డాయి. ప్రాయిశ్చిత్తo లేని కర్మలు అనుభవించాలి. ఎన్నియుగాలైన కర్మ ఫలితం అనుభవించవలసినదే అని పూర్వపక్షవాదన. బ్రహ్మజ్ఞానం కలిగిన తరువాత వెనుకటి పాపాలు నశించిపోతాయి. అజ్ఞానం తొలగిపోయిన తరువాత జీవుడు జీవభావం విడిచిన తరువాత, ఆత్మ భావం వచ్చిన తరువాత చేసిన కర్మలు, చేయబోయే కర్మలు నశిస్తాయి. కాని ఈ దేహం ఎంతకాలం ఉండాలో అంత వరకు ఏదో ఒక కర్మ చెయ్యకుండా ఉండరు. వారు చేసిన పుణ్యకర్మలు వారిని సేవించిన వారికీ, గురువు ఉపదేశం పొందిన వారికి చేరతాయి. ఒకవేళపాప కర్మ చేస్తే వారిని ధూషించిన వారికి, విమర్శించిన వారికీ, బాధ పెట్టిన వారికీ ఆ పాపకర్మల ఫలితం తగులుతుంది. బ్రహ్మజ్ఞానం వచ్చిన వారికీ ఏ కర్మ ఫలితాలు అంటవు.
ఇతర సంశ్లేషాధికరణం ( 4, 1, 14 )
సూత్రం :- 491
" ఇతరస్యా ప్లేవ మసంశ్లేషః పాతే తు "
ఇతరస్య అపి :- పుణ్యంతో కూడా బ్రహ్మ జ్ఞానికి, ఏవం :- అలాగే, అసంశ్లేషః :- సంబంధం ఉండదు, పాతే తు :- శరీరం పతనం తరువాత బ్రహ్మ ప్రాప్తి కలుగుతుంది.
భావం :- పూర్వోత్తర పాపాలతో సంబంధం లేనట్లుగానే పుణ్యంతో కూడా బ్రహ్మజ్ఞానికి సంబంధం ఉండదు.శరీరం పతనం తరువాత బ్రహ్మ ప్రాప్తి కలుగుతుంది.
వివరణ:-బ్రహ్మజ్ఞానికి పాపాలుఅంటవు. మరి చేసిన పుణ్యాల సంగతేమిటని సందేహం రావచ్చును. బ్రహ్మజ్ఞానికి పాపమే కాదు. పుణ్యంకూడా అంటదు. అవిరెండూ నశించిపోతాయి. ఆలా నశించకపోతే వాటిని అనుభవించడానికి అతను మళ్ళీ ఈ లోకంలో జన్మించాలి. కాబట్టి బ్రహ్మవేత్త పుణ్య,పాపాలు రెండింటి నుంచి తరిస్తాడు.
బృహదారణ్యాకోపనిషత్తు :- ( 4, 4, 22 ) :- బ్రహ్మజ్ఞాని పాప పుణ్యాలు రెండింటిని తరిస్తాడు.
ముండకోపనిషత్తు(2, 2, 8):- పరబ్రహ్మసాక్షాత్కారం చేసుకున్న వాడికి కర్మలన్నూ క్షయిస్తాయి. దేహాన్ని ప్రారబ్దకర్మలు విడిచిపెట్టవు. అవి అనుభవించితీరాలి. కాగా ఇతర సంచితకర్మలు బ్రహ్మజ్ఞానిని అంటవు. ప్రారబ్దకర్మల భోగానంతరం అతడికి దేహపాతం జరుగుతుంది. బ్రహ్మజ్ఞానం కలిగిన తరువాత అతడికి ముందు, తరువాత చేసిన పుణ్యాలతో సంబంధం ఉండదు. ప్రారబ్దకర్మఫలాన్ని అనుభవించిన తరువాత ముక్తుడౌతాడు. బ్రహ్మసాక్షాత్కారం పొందిన ఉపాసకుడు పుణ్యపాపాలతో బద్ధుడుకాక, ప్రారబ్దకర్మ ఫలభోగానంతరం దేహాన్నివిడిచి బ్రహ్మంతో నిరాటంకంగా ఆనందాన్ని అనుభ విస్తాడు. పుణ్యం నశించేది కాదు. ఎందుకంటే జ్ఞానానికి పుణ్యానికి విరోధం లేదు. పుణ్యం అలాగే ఉంటుందని పూర్వ పక్ష వాదన. బ్రహ్మజ్ఞానికి పాపంతో బాటే పుణ్యం కూడా నశిస్తుంది. పుణ్యఫలం పోకపోతే దానిని అనుభవించడానికి మరల జన్మ వస్తుంది. దొంగతనం చేస్తూ పట్టుబడిన ఒక దొంగను రాజభటులు తరుముకొని వస్తుంటే, అతనికి పెద్ద బండరాయి తలకి తగిలి చనిపోతాడు. ఇప్పుడు భటులు శిక్ష వేయడానికి దొంగ లేడు కదా! అదే విధంగా పాపకర్మలు, పుణ్య కర్మలు చేసిన జీవుడు బ్రహ్మజ్ఞానం పొందగానే అతనిలోని జీవుడు నశిస్తాడు కనుక చేసిన కర్మ ఫలాలు అనుభవించలేడు. అందుకే బ్రహ్మవేత్త రెండింటి నుంచి తరిస్తాడు.
అనారబ్దాధికరణము ( 4, 1, 15 )
సూత్రం :- 492
" అనారబ్ధ కార్యే ఏవతు పూర్వే తదవధేః "
అనారబ్ధ కార్యే :-ఏ పుణ్యపాపాలు తమ ఫలాన్ని అనుభవించేటట్లు చేయడానికి శరీర రూప కార్యాన్ని ప్రారంభించలేదో, ఆ పుణ్యపాపాలు, ఏవతు:- మాత్రమే, పూర్వే:- ఈజన్మలో చేసిన సంచితకర్మలు, తత్ అవధేః :-వాటికీ బ్రహ్మజ్ఞానమే అవధి.
భావం :- ఏ పుణ్య పాపాలు తమ ఫలాన్ని అనుభవించేటట్లు చేయడానికి శరీర రూప కార్యాన్ని ప్రారంభించలేదో, ఆ పుణ్య పాపాలు మాత్రమే ఈ జన్మలో చేసిన సంచిత కర్మలు, వాటికీ బ్రహ్మజ్ఞానమే అవధి.
వివరణ:-బ్రహ్మజ్ఞానికి అరబ్ద, అనారబ్దకర్మలు రెండూ నశిస్తాయి. అనారబ్ద కర్మలు అంటే పూర్వకర్మలు, సంచితకర్మలు మాత్రమే జ్ఞానం వలన నశిస్తాయి. అరబ్ద కర్మలనే ప్రారబ్ధ కర్మలు అంటారు.ఇవి ఫలితం ఆరంభించిన కార్యాలు అరబ్ద కర్మలు అనబడతాయి. ఫలితం ఇవ్వడం ప్రారంభించని కర్మలు అనారబ్జ కర్మలు అంటారు.
ఛాందోగ్యోపనిషత్తు(6, 14, 2):-బ్రహ్మజ్ఞానికి దేహపాతం కలిగేవరకు ముక్తి లభించడంలో ఆలస్యం అవుతుందన్నారు. కాగా సంచిత, పాపపుణ్యాలు రెండూ జ్ఞానాగ్నిలో నశిస్తాయంటున్నారు. మరి అగ్నిహోత్రాది శుభకర్మలను ఎవరు ఆచరించాలి. ప్రారబ్దకర్మలు వదలిపెట్టిన బాణంలాంటివి. వాటివేగం తగ్గించడం ఎవరివల్లా కాదు. అనారబ్ద కర్మలు అమ్ముల పొదిలోని బాణాల్లాంటివి. కాబట్టి జ్ఞాని అనారబ్దకర్మలను నాశనంచేసుకోగలడు. ప్రారబ్దకర్మల నుండి తప్పించుకోలేము. బ్రహ్మజ్ఞానికి శరీరపాతం వరకు ప్రారబ్దం ఉంటుంది. శరీరపాతం జరగగానే అతనికి ముక్తి లభిస్తుంది. అతడే జీవన్ముక్తుడు. కర్మ ఫలాన్ని అనుభవించడానికి ఒకానొక దేహం లభిస్తుందో అవి ప్రారబ్దాలు. ఇప్పుడున్న దేహంతో చేసే కర్మలు క్రియా మాణాలు. వీటిలో కొన్ని ప్రారబ్దకర్మలను అనుభవించడానికి తోడ్పడతాయి. ఈ క్రియమాణ కర్మలఫలాన్ని ప్రారబ్ద కర్మల్తో బాటు అనుభవించాలి. అలా ఈదేహంతో అనుభవించడానికి వీలులేని క్రియామాణాలు సంచితకర్మలలో జమ అవుతాయి. ఈజన్మలోనూ, పూర్వజన్మలోనూ చేసిన కర్మల్ని, ఈజన్మలో అనుభవించడానికి వీలుకాని కర్మలను సంచితాలు అంటారు. ఇలాంటి కర్మలనే అనారబ్దకర్మలు అన్నారు. బ్రహ్మజ్ఞానం కలిగిన తరువాత ఆజ్ఞానాగ్నివలన సంచిత కర్మలన్నీ నశిస్తాయి. ప్రారబ్దకర్మలు నశించవు. వాటిని అనుభవించి తీరాలి. భోగంవలన ప్రారబ్దకర్మలు నశించడం తోటే దేహం పతనమౌతుంది. అతనికి ముక్తి లభిస్తుంది. అతనే జీవన్ముక్తుడు.
అగ్ని హోత్రాధికరణం ( 4, 1, 16 )
సూత్రం :- 493
" అగ్ని హోత్రాది తు తత్కార్యాయైన తద్దర్శనాత్ "
అగ్ని హోత్రాది తు :- అగ్ని హోత్రం, అధ్యయనం లాంటి ఆశ్రమ విహిత శుభ కర్మలు మాత్రం, తత్ కార్యాయ ఏ వ :- జ్ఞాన ప్రాప్తి కొరకే అని, తద్దర్శనాత్ :- శాస్త్రాలంటున్నాయి.
భావం :- అగ్నిహోత్రం, అధ్యయనం లాంటి ఆశ్రమ విహిత శుభ కర్మలు మాత్రం జ్ఞాన ప్రాప్తి కొరకే అని శాస్త్రాలంటున్నాయి.
వివరణ:-నిత్యనైమిత్తికకర్మలు మోక్షంకోరుకునే వారు చెయ్యాలా? వద్దా? అని సందేహం. మోక్షాన్ని కోరుకునేవారు మోక్ష సాధనకి సంబంధించిన కర్మలు చెయ్యాలి కాని నిత్యనైమిత్తిక కర్మలు చెయ్యవలసిన అవసరం లేదు. జ్ఞాన ప్రాప్తి కలిగిన తరువాత కర్మలన్ని నశించిపోతాయి కదా అని పూర్వపక్షవాదన. అగ్నిహోత్రం, వేదాధ్యయనం, సంద్యోపాసన లాంటి కర్మల్ని ఆయా ఆశ్రమాలలో కర్తవ్యలుగా విధించారు. వాటి ఫలం నశించదు. ఈ నిత్యకర్మలు మనస్సుకి ప్రశాంతతను చేకూరుస్తాయి. ఆత్మజ్ఞానం సంపాదించడానికి సహాయపడతాయి. మనస్సు ప్రశంతంగా ఉంటే బుద్ధిసూక్ష్మత ఏర్పడి, ఉపనిషత్తులు అవగతమౌతాయి. వేదాధ్యయనంవలన ఆత్మజ్ఞానం పొందానికి పరోక్షంగా ఈ నిత్యనైమిత్తికకర్మలు అవసరం. ఈ నిత్యకర్మలు జ్ఞానోత్పత్తికొరకే చెయ్యాలి. వీటిని అనుష్ఠించడంవలన చిత్తశుద్ధి కలిగి జ్ఞానోదయం అవుతుంది. దాని వలన కర్మ నశిస్తుంది. అదే వీటి ఫలం. అందుకే వీటికి నాశనం లేదు. ఇలాంటి కర్మలను శాస్త్రం కూడా విధిస్తోంది.
బృహదారణ్యాకోపనిషత్తు(4, 4, 22):-బ్రాహ్మణులు వేదాధ్యయనం, యజ్ఞం, దానం, నశించని తపస్సు. వీటి వలన పరమాత్మను తెలుసుకోవాలనుకుంటారు. కనుక ఆశ్రమవిహితకర్మలు బ్రహ్మజ్ఞాన సాధకాలు, ఫలోత్పాదకాలు, అనాశకాలు. ఈ అగ్నిహోత్రాది నిత్యనైమిత్తిక కర్మలు అన్ని జ్ఞానంతో సాధించే మోక్షం కోసమే. కర్మ కనుక ఫలం ఇవ్వకుండా నశిస్తే అది నాశన మౌతుంది. ఈ నిత్య కర్మలు ఫలం ఇచ్చి నశిస్తాయి. ఆ ఫలమే జ్ఞానం.
అగ్నిహోత్రాద్యధికరణం ( 4, 1, 17 )
సూత్రం :- 494
" అతోన్యాపి హ్యేకేషా ముభయోః "
అతః :- అగ్ని హోత్రాదుల కన్నా, అన్యా అపి :- వేరేవి కూడా ఉన్నాయి, హి :- ఎందుకంటే, ఉభయోః :- వాటికీ శుభాశుభ కర్మల ఫలితాలున్నాయని, ఏకేషామ్ :- కొందరంటారు.
భావం :- అగ్ని హోత్రాదుల కన్నా వేరేవి కూడా ఉన్నాయి. ఎందుకంటే వాటికీ శుభాశుభ కర్మల ఫలితాలున్నాయని కొందరంటారు.
వివరణ:- కొన్ని శాఖల వారి అభిప్రాయంలో అగ్నిహోత్రాది నిత్య కర్మల కన్నా స్వర్గ ప్రాప్తి కోసం చేసే కర్మలు వేరు. ఈ విషయాన్ని జైమిని, వ్యాసుడు కూడా ఒప్పుకున్నారు. కర్మలు నాలుగు రకాలు.1. నిత్య కర్మలు, 2. నైమిత్తిక కర్మలు, 3. కామ్య కర్మలు, 4. నిషిద్ద కర్మలు. శాస్త్రం విధించిన ఆశ్రమ కర్మలు నిత్యకర్మలు, కామ్యకర్మలు అని రెండు రకాలు. అగ్ని హోత్రాదులు నిత్య కర్మలు. ఒక ఫలితాన్ని ఆశించి చేసేవి కామ్య కర్మలు. సంపద, సంతానం, హోదా, అధికారం కోసం చేసే కర్మలు, వాజపేయం, రాజసూయం లాంటి కర్మలు. ఈ కామ్య కర్మలు జీవాత్మను కర్మ చక్రంలో మరింత బంధించి వేస్తాయి. ఇవి పునర్జన్మకు కారణమౌతాయి. యజ్ఞ యాగాదులు నిష్కామ కర్మలు. వీటికి బ్రహ్మ జ్ఞానమే ఫలితం.
ముండకోపనిషత్తు ( 3, 1, 3 ) :- జ్ఞానికి పుణ్య పాపాలు నశిస్తాయి.
కౌషీతకీబ్రాహ్మణం (1, 4):- అప్పుడు పుణ్య పాపాలు రెండూ నశిస్తాయి. కనుక జ్ఞానం వలన కామ్య కర్మల వలన వచ్చే ఫలితాలు కూడా నశిస్తాయని అర్ధం చేసుకోవాలి. కామ్యకర్మలు జ్ఞానోత్పత్తికి కారకాలు కావు. అవి కోరికలను తీరుస్తాయి. కామ్య కర్మల ఫలాలు అనుభవించడానికి ముందే ఒక వ్యక్తి సాధన సంపత్తి వలన బ్రహ్మజ్ఞానం పొందాడని అనుకుందాం. అప్పుడు అతనికి ఆ వాజపేయాది కర్మలు నశిస్తాయి. నిత్య నైమిత్తిక కర్మలు మోక్షాపేక్ష కలవారు ఆచరించదగిన కర్మలే.
విద్యా జ్ఞాన సాధనాధికరణం ( 4, 1, 18 )
సూత్రం :- 495
" యదేవ విద్యయేతి హి "
యదేవ విద్య యేతి హి, యదేవ విద్యయా ఇతి :- ఏది విద్యతో అని ఛాందోగ్య వాక్యం వలన, హి :- నిశ్చయంగా, ఉపాసనతో కూడిన కర్మే జ్ఞానరూప ఫలం ఇస్తుంది.
భావం :- ఏది విద్యతో అని ఛాందోగ్య వాక్యం వలన నిశ్చయంగా, ఉపాసనతో కూడిన కర్మే జ్ఞానరూప ఫలం ఇస్తుంది.
వివరణ:-కర్మలు రెండు రకాలు 1. జ్ఞానంతో కూడిన ఉపసనా కర్మలు, 2.జ్ఞానం లేని ఉపాసన లేని కర్మలు. జ్ఞానంతో కూడిన ఉపాసనా కర్మలే మోక్షాన్ని ఇస్తాయి. కాని జ్ఞానంలేని కర్మల వలన ప్రయోజనం లేదు. వాటిని ఆచరించకూడదు అని పూర్వపక్షవాదన. జ్ఞానసహితకర్మలు, జ్ఞానరహితకర్మలు రెండూ బ్రహ్మ జ్ఞానానికి సాధనాలవుతాయని సూత్రకారుడి అభిప్రాయం.
ఛాందోగ్యోపనిషత్తు(1, 1, 10):-శ్రద్దాపూర్వకంగా విధిని అనుసరించి ఉపాసనసహితంగా చేసిన కర్మ ఎంతో బలవత్తరమైనది అని పఠిస్తున్నారు. ఉపాసన వేరు, కర్మ వేరు. ఉపాసనతో కూడిన కర్మ చిత్తశుద్ధిని కలిగించి జ్ఞానాన్ని ఇస్తుందా? లేక ఉపాసన లేని కర్మ జ్ఞానాన్నిస్తుందా? అని సందేహం. కామ్యకర్మలు, నిష్కామకర్మలు రెండూ చిత్తశుద్ధిని కలిగిస్తాయి. కాని శ్రద్ధతో చేసిన కర్మ, జ్ఞానసహితమైనకర్మ ఎక్కువ ఫల దాయకం ఇస్తుంది. శీఘ్రంగా కోరిన ఫలాన్ని ఇస్తుంది. ఉపాసనారహిత కర్మలైన యజ్ఞం, దానం, తపస్సు సైతం చిత్త శుద్ధిని ఏదో ఒక విధంగా మోక్షాన్ని ఇవ్వడానికి సహాయ పడుతాయి. శుభకర్మ కర్తని మంచి మార్గంలో నడిపిస్తుంది. ఆతరువాత నిష్కామకర్మ ఎక్కువ ఫలదాయకం. కేవలం కర్మవలన మాత్రమే జ్ఞానప్రాప్తికలగదు. ఉపాసనాసహితమైన ఓంకారోపాసన శీఘ్రంగా జ్ఞానం కలిగించడానికి హితకరమని చెప్పబడింది. జ్ఞానప్రాప్తి కలగాలంటే శాస్త్ర విహిత ఉపసనా సహిత కర్మలు నిర్వహించాలి.
ఇతరక్ష పణధికరణం ( 4, 1, 19 )
సూత్రం :- 496
" భోగేన, త్విత, రే క్షపయిత్వా, సంపద్యతే
భోగేన తు :- ఉపాసకుడు ప్రారబ్ద కర్మ ఫలాన్ని అనుభవించే, ఇతరే :- సుకృత, దుష్కృత కర్మలు, క్షపయిత్వా :- నాశనం అయిన తరువాత, సంపద్యతే :- బ్రహ్మాన్ని పొందుతాడు.
భావం :- ఉపాసకుడు ప్రారబ్ద కర్మ ఫలాన్ని అనుభవించే సుకృత, దుష్కృత కర్మలు నాశనం అయిన తరువాత బ్రహ్మాన్ని పొందుతాడు.
వివరణ:-గురువుగారు! బ్రహ్మజ్ఞానం పొంది, మోక్షానికి అధికారియై, ప్రారబ్దవశాన దేహపాతం వరకు జీవించి ఉన్నట్లే దేహపాతం తరువాత కూడా ప్రారబ్దం అనుభవించడం కోసం శరీరం ధరించవలసి వస్తే అప్పుడు ముక్తి కలుగుతుందా? అని అడిగాడు కృష్ణశర్మ. ప్రారబ్దకర్మ అనుభవించగానే, కర్మక్షయమై, దేహపాతం జరుగుతుంది. బ్రహ్మజ్ఞానం కలిగిన తరువాత సంచితకర్మలు నాశనమౌతాయి. ప్రారబ్దకర్మలు తప్పనిసరిగా అనుభవవించే వరకు దేహం ఉంటుంది. కర్మ క్షయం కాగానే, దేహపాతం జరిగిన తరువాత మరల జన్మరాదు. సంచితకర్మలు బ్రహ్మజ్ఞానంతో నశిస్తాయి. ప్రారబ్ద కర్మలు అనుభవిస్తేనే నశిస్తాయి. జీవుడు తాను ఏ పాపంచేశానో అని బాధ పడుతూ దుఃఖిస్తూ ప్రారబ్దకర్మలు అనుభవిస్తాడు. జీవన్ముక్తుడు ఈకర్మలు తాను విధిగా అనుభవించాలని, శరీరానికే బాధలు కాని తనకు వాటితో ఏ సంబంధం లేనట్లుగానే ప్రవర్తిస్తాడు.
ఛాందోగ్యోపనిషత్తు(6, 14, 2):-"తస్య తావదేవ చిరం " బ్రహ్మజ్ఞానం కలగగానే ముక్తి కలగదని, ప్రారబ్దకర్మ భోగం పూర్తి అయిన తరువాత శరీరపాతం జరిగి ముక్తుడౌతాడని స్పష్టమౌతోంది. పూర్వజన్మలో చేసిన ప్రారబ్దకర్మలను అనుభవించ డానికే ఈజన్మ. ప్రారబ్దభోగం పూర్తికానంత వరకు జీవుడు దేహం నుండి ముక్తుడుకాడని భావం. కర్మ, ఉపాసన, జ్ఞానం వీటిలో కర్మ, ఉపాసనలు జ్ఞాన సాధనాలు. జ్ఞానానికి ఫలం ముక్తి. పరబ్రహ్మ ప్రాప్తి. జన్మ రాహిత్యమే మోక్షం.
వాగధికరణం ( 4, 2, 1 )
సూత్రం :- 497
" వాజ్ మనసి దర్శనా చ్చబ్దాచ్చ "
వాక్ :- వాగింద్రియం, మనసి :- అంతరింద్రియమైన మనస్సుతో లయం అవుతుంది. దర్శనాత్ :- ప్రత్యక్షంగా గమనించడం వలన, శబ్దాత్ చ :- శబ్ద ప్రమాణం వలన తెలుస్తోంది.
భావం :- వాగింద్రియం అంతరింద్రియమైన మనస్సుతో లయమవుతుంది. ప్రత్యక్షంగా గమనించడం వలన, శబ్ద ప్రమాణం వలన తెలుస్తోంది.
వివరణ:-ఈఅధికరణంలో మరణసమయంలో ఇంద్రియ వృత్తిలన్నీ మనస్సులో లీనమవడం గురించి తెలియజేయబడింది. మరణానంతరం జీవాత్మ పరలోకాలకు వెడతాడు. దానినే ఉత్క్రాంతి అంటారు. మృత్యు సమయంలో ఇంద్రియాలు తమ పనులను చేయడం మానివేస్తాయి. మరణం ఆసన్నమైనప్పుడు ఎవరు పిలిచినా, ఎంత ప్రయత్నం చేసిన మాట్లాడలేరు. ఈ విషయం లోకంలో అందరికీ తెలిసినదే. అప్పుడే వాక్కు మనస్సులో లయమైనట్లు చెబుతారు.
ఛాందోగ్యోపనిషత్తు(6, 8, 6):- మరణించే పురుషుడి వాక్కు మనస్సుని చేరుతుందని ఉద్దాలకుడు శ్వేతకేతువుతో చెబుతాడు. అవసానదశలో వాక్కు మనస్సు నందు, మనస్సు ప్రాణం నందు, ప్రాణం తేజస్సు నందు లీనమౌతాయి. ఇదే ఉత్క్రాంతి క్రమం. ఇక్కడ వాక్కు లయమౌతోందా? వాగింద్రియం లయమౌతోందా? వాక్ వ్యాపారం లయమౌ తోందా? అని సందేహం. వాక్కులయమవడం అంటే వాగింద్రియ వ్యాపారం లయమవడమే. ఇక వాక్కు పుట్టకుండా ఉండటమే లయం కావడం. జీవి ఇక మాట్లాడలేడు. క్రమముక్తిలో జీవుడు పాంచ భౌతిక దేహం నుండి విడిపోయి, దేవయాన మార్గం ద్వారా బ్రహ్మలోకాన్నిచేరి, కల్పాంతంవరకు ఉండి, ఆతరువాత పరమాత్మలో లయమౌతాడు. పాపాత్ములైన, విద్వాంసు లైనప్పటికీ వారికి ఉత్క్రాంతితప్పదు. బ్రహ్మవిద్యోపాసకులు ఉపనిషత్తులద్వారా జ్ఞానాన్ని పొంది, సాధన చేస్తూ, జీవన్ముక్తిని పొందుతారు. వారికి ఉత్క్రాంతి ఉండదు. తాను ఆత్మ స్వరూపుడననే యదార్ధ సత్యాన్ని తెలుసుకుంటాడు.
సూత్రం :- 498
" అత ఏవ చ సర్వాణ్యమ "
అత ఏవ :- పై కారణాల వలేనే, సర్వాణి :- మిగిలిన నేత్రాదింద్రియాలన్నీ, అను :- వాక్కును అనుసరించి మనస్సును చేరతాయి.
భావం :- వాక్కు వలెనే మిగిలిన నేత్రాదింద్రియాలన్నీ వాక్కును అనుసరించి మనస్సును చేరతాయి.
వివరణ:- వాక్కుతో బాటే ఇతర ఇంద్రియ వ్యాపారాలు మనస్సుతో లయం అవుతాయి. వృత్తులు లయమౌతాయి, కాని వాటి స్వరూపాలు లయం కావు.
ప్రశ్నపనిషత్తు(3, 9):- శాంత తేజస్కుడైన జీవుడు మనసులో లీనమైన ఇంద్రియాలతో బాటు పునర్జన్మను పొందుతాడు. మరి మనస్సు ఎక్కడ లయమౌతుంది? చక్షురాది ఇంద్రియాలు చూడటం, వినడం, రుచి, స్పర్శ అన్నీ వాటి పనులను మాత్రమే లయం చేస్తాయి. ఇంద్రియాలు లయంకావు. దేహం వదలిన తరువాత మరొక శరీరం ధరించడానికి, కర్మలు అనుభవించాడానికి మనస్సు ఇంద్రియాలతో వెడుతుంది. ఇంద్రియాలు లయం అయితే పునర్జన్మ ఉండదు. మరణానికి ముందే మనస్సు పనిచేస్తున్నప్పుడే, తెలివిఉన్నప్పుడే, వాక్కుతో బాటు మిగిలిన ఇంద్రియాలు అన్ని ఒక్కొక్కటే పడిపోతాయి. మాట్లాడడానికి మాటలు రావు. రుచి చూడాలంటే ఏమి తినలేరు. కంటితోఎవరిని చూడలేరు. ఎవరైనా తట్టి లేపినా స్పర్శ తెలియదు. ఎందుకంటే ఇంద్రియ వ్యాపారమంతా మనస్సులో లయమౌతుంది.
మనోధికరణం ( 4, 2, 3 )
సూత్రం :- 499
" తన్మనః ప్రాణ ఉత్తరాత్ "
ఉత్తరాత్:-ఛాందోగ్యంలో తరువాతవాక్యంలో, తత్ మనః:- ఇంద్రియాలతో కూడిన మనస్సు, ప్రాణే :- ప్రాణాన్ని చేరుతుంది.
భావం :- ఛాందోగ్యలో తరువాత వాక్యంలో ఇంద్రియాలతో కూడిన మనస్సు ప్రాణాన్ని చేరుతుందని చెప్పబడింది.
వివరణ:- అన్ని ఇంద్రియాలను తనలో లయం చేసుకున్న తరువాత మనస్సు ప్రాణంలో లయమౌతుంది. అంటే మనో వ్యాపారాలన్నీ ప్రాణంలో లయమౌతాయని గుర్తించారు.
ఛాందోగ్యోపనిషత్తు(6, 8, 6):- తర్వాత మనఃప్రాణే అని ఉన్నది. మనస్సు ప్రాణాన్ని చేరుతుందని అర్ధం. ప్రాణమంటే ముఖ్యప్రాణం. ఇలా ఇంద్రియాలతో కూడిన మనస్సు ప్రాణంలో లయమౌతుందని సూత్రానికి అర్ధం. కార్యం ఎప్పుడు కారణంలోనే లయమౌతుంది. జలం కార్యం ప్రాణం కారణం, అన్నం కార్యం మనస్సు కారణం, జగత్తు కార్యం పరమాత్మ కారణం. మనస్సుకు ప్రాణం కారణం కనుక మనస్సు ప్రాణంలో లయమౌతుంది. మనస్సు స్వరూపలయమౌతుందని పూర్వపక్షవాదన. దీనికి సూత్రకారుడు సమాధానం చెప్పాడు. మరణ సమయంలో ఇంద్రియ వ్యాపారలన్నీ మనస్సులో లయమైన తరువాత మనస్సు ప్రాణంలో లయమౌతుంది.ఆ సమయంలో ఏ ఆలోచనలు ఉండవు. మనో వ్యాపారాలు లయమౌతాయి కాని మనస్సు స్వరూపం లయం కాదు. ఈ మనస్సు ఇంద్రియాలతో కలసి అన్ని అనుభవించి మరల పునర్జన్మకు కారణం అవడానికి దోహదపడుతుంది.
అధ్యక్షాధికరణం ( 4, 2, 4 )
సూత్రం :- 500
" సో ధ్యక్షే తదుప గమాదిభ్యః "
సః :- ఆ ప్రాణం, తత్ ఉపగమ ఆదిభ్యః :- జీవుడి ప్రాప్తి, అనుగమనం :- అవస్థానం ( స్థితి ), వీటి వల్ల, అధ్యక్షే :- ఇంద్రియాలకు అధ్యక్షుడైన జీవుణ్ణి చేరుతుంది.
భావం :- ఆ ప్రాణం జీవుడి ప్రాప్తి అవస్థానం వలన ఇంద్రియాలకు అధ్యక్షుడైన జీవుణ్ణి చేరుతుంది.
వివరణ:- ప్రాణం ఆత్మలో లీనమౌతుందని అర్ధం. దేహాన్ని విడిచి జీవాత్మతో చేరుతుంది.
బృహదారణ్యాకోపనిషత్తు(4, 3, 38):-అంత్యకాలంలో ప్రాణాలన్నీ ఆత్మను చేరతాయి. ఇదే ఉపగమనం. (4, 4, 2):- ఈ ఆత్మ శరీరం నుండి వెళ్ళిపోతుంది. ఆత్మ ముఖ్య ప్రాణం. దానిని ఉపప్రాణాలు అనుసరించి వెడతాయి. ఇది అనుగమనం. తరువాత ఆ జీవుడు సర్వేంద్రియాలతోనూ, చేసిన కర్మలతోనూ కూడి ఉంటాడు. ఇలా ప్రాణాదులు ఆత్మతో వెళ్ళిపోతాయి. మనస్సు ప్రాణాపానది వృత్తులు ఏవి కూడా శరీరంలో ఉండక అన్నీ జీవుణ్ణి చేరి జీవుడితో బాటు వెళ్ళిపోతాయి. ఇక్కడ తత్ అంటే ఇంద్రియాలకు అధిపతి జీవుడు అని అర్ధం. ఉపగమం అంటే ప్రాప్తి. అవస్థానం అంటే స్థితి. దేహానికి, ఇంద్రియాలకు అధ్యక్షుడైన జీవునియందు లయమౌతుంది. ఇంద్రియాలతో కూడిన అవిద్యా జన్యమైనట్టి ఈ శరీరం వృద్దాప్యం కారణంగా క్షీణిస్తుంది. అప్పుడు చెట్టు నుంచి పండు రాలినట్లుగా శరీరంలోని పురుషుడు ఈ అవయవాలను వదలించుకొని కర్మానుసారం మరియొక యోనిలో జన్మించడం కోసం వెడతాడు. ప్రాణం, అవయవాలు ఉంటే కాని కర్మ ఫలాన్ని అనుభవించలేరు. ఈ రకంగా ముఖ్యప్రాణం బయటకు వెళ్ళేటప్పుడు దానితో బాటుగా ఇంద్రియవ్యాపారాలన్నీ నిష్క్రమిస్తాయి. ప్రాణం తేజస్సులో లయమౌతుంది అంటే జీవుడిని పొందుతుందని అర్ధం. నిజంగా ప్రాణం లయమవు తుందా అంటే అవుతుందనే చెప్పారు. రాజుగారి వెంట భటులు, పరివారం వెళ్లినట్లుగా, నిష్క్రమించేటప్పుడు అన్ని ఇంద్రియవృత్తులు, మనస్సు ముఖ్య ప్రాణం జీవుడిని అనుసరిస్తాయి.
సూత్రం :- 501
" భూతేషు తచ్ఛ్రు తేః "
భూతేషు :- ప్రాణాలతో కూడిన ఆత్మ సూక్ష్మ భూతాల్లో చేరుతుందని, తత్ శృతేః :- శృతి వాక్యాల వలన తెలుస్తోంది.
భావం :- ప్రాణాలతో కూడిన ఆత్మ సూక్ష్మ భూతాలలో చేరుతుందని శృతి వాక్యాల వలన తెలుస్తోంది.
వివరణ:-ప్రారబ్దకర్మలు అనుభవించిన తరువాత జీవుడు ఈ స్థూలదేహాన్ని విడిచి నిరాధారుడిగా పైకిపోడు. అవసాన సమయంలో స్థూలదేహంవిడిపోతుంది. అప్పుడు జీవుడు సూక్ష్మశరీరంతో ప్రయాణిస్తాడు. దానిలో 13కరణాలు ఉంటాయి. 10 బాహ్య కరణాలు (5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం -వీటిని ప్రాణం అని సూచిస్తారు. వీటిని బుద్ధి, ముఖ్యప్రాణం, శ్రేష్ఠప్రాణం అని అంటారు) 3అంతఃకరణాలు, 5సూక్ష్మభూతాలు అన్నికలసి 18 తత్త్వాలతో కూడి ఉంటుంది. వీటితోనే జీవుడు ప్రయాణంచేస్తాడు. దానినే కారణశరీరం అంటారు. ఇదే జీవుడికి వాహకశరీరం. స్థూలదేహం కర్మానుష్టానానికి, భోగానికి ఆశ్రయం. స్థూలదేహంతోనే బ్రహ్మజ్ఞానం సంపాదించ వచ్చును. ప్రళయకాలంలోను, బ్రహ్మ జ్ఞానం కలిగి ముక్తిపొందినప్పుడు జీవుడికి ఈ సూక్ష్మశరీరం ఉండదు. జీవుడు అవసానసమయంలో తేజస్సుతో కూడి చరించే భూతసూక్ష్మలతో ప్రాణంతో కూడినవాడై ఉంటాడు. తేజస్సు అంటే అగ్ని అని అర్ధం. తేజస్సు లేకపోతే శక్తి లేక అన్ని జడమైపోతాయి. అగ్నిమొదలైన అన్నిభూతాలు తేజస్సు అని గ్రహించాలి. సూక్ష్మభూతాలే జీవుడికి ఉపాధులు. అవి జీవునిలో లయం అయినప్పటికీ, పునర్జన్మకి దోహదపడతాయి. ప్రాణం ఆ భూతసూక్ష్మాలను పొందినట్లే అని గుర్తించాలి. అందుకే ప్రాణాలు జీవునిలో లయం అవుతాయి.
సూత్రం :-502
" నైకస్మిన్ దర్శయతో హి "
ఏకస్మిన్ :- కేవలం ఒక్క తేజస్సు తోనే, న :- ప్రాణాలతో పాటుగా జీవాత్మ చేరడు. హి :- అని, దర్శయతః :- శాస్త్రాలు అంటున్నాయి.
భావం :- కేవలం ఒక్క తేజస్సు తోనే ప్రాణాలతో పాటుగా జీవాత్మ చేరడని శాస్త్రాలు అంటున్నాయి.
వివరణ:-జీవుడు అవసానసమయంలో ప్రాణాలు తేజస్సుతోకూడి వెడతాడని, తేజస్సులోనే ఉంటాడని పూర్వపక్ష వాదన. అది సరియైనదికాదు. అంత్యకాలంలో తేజస్సుఒక్కటే ఉండదు. సమస్తభూతలు ఉంటాయి. మరణసమయంలో శరీరాన్ని విడిచి మరొకశరీరాన్ని ధరించేటప్పుడు అన్నిభూతాలయొక్క సూక్ష్మాoశంయందు సూక్ష్మశరీరంతో ఉంటాడు. మరణ సమయంలో వాక్కు మొదలైన ప్రాణాల పరివారంతో పాటుగా జీవాత్మ పృదివ్యాది స్థూలభూతాలకు కారణమైన సూక్ష్మ భూతాలతోకూడి ఉంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి. మరొకజన్మ రావడానికి సూక్ష్మభూతాలన్నీ అవసరమే కనుక ప్రాణం జీవుని యందు లయమౌతుంది.
బృహదారణ్యాకోపనిషత్తు(4, 4, 5):- పాతదేహాన్ని విడిచి, కొత్త దేహాన్ని పొందడానికి సిద్ధమౌతున్నప్పుడు జీవాత్మ పృథవి మయం, జలమయం, వాయుమయం,ఆకాశమయం, తేజోమయం అవుతాడు.
మనుస్మృతి(1, 27):-సూక్ష్మాలైన పంచాతన్మాత్రాలతో ఇదంతా క్రమంగా జనిస్తుంది. కనుక జీవాత్మ కేవలం ఒక్క తేజస్సు తోనే చేరక, సమస్త భూతాలలో చేరి, పంచతన్మాత్రాలతో కూడి వేరే దేహంలో ప్రవేశిస్తాడు. ప్రాణస్తేజసి అన్నప్పుడు తేజస్సు ప్రధానమని, మిగిలిన భూతాలు ఉప లక్షణాలు అని గ్రహించాలి.
బృహదారణ్యకోపనిషత్తు(3, 2, 13):-అది కర్మే. జీవుడికి ఆశ్రయం. వాస్తవానికి జీవుడికి సూక్ష్మదేహం ఆశ్రయమైనా కర్మే జీవుణ్ణి ఉచ్ఛనీచజన్మలకు తీసుకువెడుతుంది. కనుక జీవుడికి కర్మ ఆశ్రయమని చెప్పారు. పుణ్యకర్మలవలన పుణ్య యోని పాపకర్మల వలన పాపయోని లభిస్తాయి. బృహదారణ్యాకంలో యాజ్ఞవల్క్యుడికి, ఆర్తబాగుడికి ఒక సంవాదం జరిగింది. మరణసమయంలో వాక్కు మొదలైన కరణాలన్నీ తమవ్యాపారాలు మానుకుంటాయి. అప్పుడు జీవాత్మ ఎక్కడ ఉంటాడు అనే ప్రశ్నఉంది. జీవాత్మ వాగాదికారణాలతో పాటుగా సూక్ష్మభూతాలతో కూడి మరో దేహానికి వెడతాడు.
ఆసృత్యుపక్రమాధికరణం ( 4, 2, 7 )
సూత్రం :- 503
" సమానా చాసృత్యుపక్రమా దమృతత్వం చామపోష్య "
ఆసృతిఉపక్రమాత్:-లోకాంతరగతి ప్రారంభంవరకు, సమానాచ:-ఉపాసకులకు, వేరే జీవులకు మరణకాల గతి సమానమే. చ :- ఎందుకంటే, అనుపోష్య :- శరీరాన్ని వదలి పెట్టి, అమృతత్వం :- ఉపాసకులు అమృతత్వాన్ని పొందుతారు.
భావం :- లోకాంతర గతి ప్రారంభం వరకు ఉపాసకులకు, వేరే జీవులకు మరణకాల గతి సమానమే. ఎందుకంటే, శరీరాన్ని వదలి పెట్టి ఉపాసకులు అమృతత్వాన్ని పొందుతారు.
వివరణ:-నిర్గుణబ్రహ్మోపాసకులకు, సగుణ బ్రహ్మోపాసకులకు వేరే వేరే మార్గాలలో ప్రయాణిస్తారు. నిర్గుణ బ్రహ్మోపాసకులు బ్రహ్మజ్ఞానం పొంది, దానిని అనుభవంలోనికి తెచ్చుకోవడానికి సద్గురువును ఆశ్రయించి, సాధనచేసే వారికీ ఉత్క్రాంతి ఉండదు. వారి ప్రాణాలు నిష్క్రమించవు. వారు ఎక్కడికి వెళ్లకుండానే బ్రహ్మంగానే మిగిలిపోతారు. సగుణబ్రహ్మోపాసకులు జీవుడి మరణానంతరం ఉత్క్రాంతి ఉంటుంది. వీరు క్రమముక్తిద్వారా శరీరాన్ని విడిచి, బయటకు వచ్చాక పితృయాన మార్గం ద్వారా స్వర్గలోకం, సూర్యలోకం, చంద్రలోకం ద్వారా బ్రహ్మలోకాన్ని చేరతారు. ఉపాసకులుకాని వారు చేసిన పుణ్య కర్మలను అనుసరించి స్వర్గలోక సుఖలను అనుభవించి తిరిగి భూమిపైన మరల జన్మిస్తారు. పాపాత్ములు సంసారం చక్రంలో అనేక జన్మలు ఎత్తి కర్మలను అనుభవిస్తుంటారు. సగుణ విద్యలో అమృతత్వం కేవలం గౌణమేనని పూర్వ పక్ష వాదన. ఎక్కడో వందశ్రుతులలో ఒక్కలాగే చెప్పి, ఏ ఒక్కదానిలోనో తేడా చెబితే, వారు దానినే నమ్మి,సమర్ధిస్తారు. దానిని గౌణమని అంటారు. క్రమముక్తి ద్వారా అమృతత్వం ఎప్పటికో వస్తుంది. నేను అనే జీవభావం పోయి నేను ఆత్మ స్వరూపమే అని అనుభూతి వచ్చిన తరువాత అమృతత్వం లభిస్తుంది. ఉపోష్య అంటే సమీపంలో నివసించడం, అనుపోష్య అంటే దగ్గరలో లేకపోవడం. జ్ఞాని మరణించిన తరువాత శరీరాన్ని విడిచి ముక్తుడై అమరత్వాన్ని పొందుతాడు. ఆత్మ సూక్ష్మదేహం దగ్గరలో ఉండి ఎప్పుడూ పయనిస్తూ వేరే శరీరానికి వెడుతుంది. బ్రహ్మసాక్షాత్కారం కలిగిన జీవుడు స్థూల దేహం విడవ వలసి వచ్చినప్పుడు సూక్ష్మ దేహం కూడా విడిపోతుంది. దీనినే అనుపోష్య అంటారు.
కఠోపనిషత్తు(6, 16):-హృదయనాడులు 101. వాటిలో ఒకటి బ్రహ్మరంద్రం వైపు వెడుతుంది. అదే సుషమ్ననాడి. ఆ నాడిలో ప్రవేశించి దేహంనుండి విడువడే జీవుడు అమృతత్వం పొందుతాడు. ఇది జ్ఞానికి కలిగే ఉత్క్రాంతి విధం. ఇతర అజ్ఞానులకు ఇతరనాడుల ద్వారా ఉత్క్రాంతి కలుగుతుంది. వారు వేరే శరీరాలలో ప్రవేశిస్తారు. ఇలా కరణాల ఉప సంహారానికి గతిసమానమే. నాడుల్ని చేరేవరకు జ్ఞానికి, అజ్ఞానికి ఉత్క్రాంతిసమయం సమానమే. దేవయానం ప్రారంభానికి జ్ఞానికి అజ్ఞానికి ఉత్క్రాంతి అనేది ఒకే రకంగా ఉంటుంది. జ్ఞానం లేనివాడి ప్రాణాలు దక్షిణమార్గాన పోతాయి. ఆయా మార్గాల వరకు ఉపాసకుడైనజ్ఞానికి, ఉపాసకుడుకాని అజ్ఞానికి కూడా భూతసూక్ష్మఅవయవాలు సమానమే. దేవయాన మార్గం ద్వారా వెళ్ళని వాళ్ళకి బ్రహ్మలోకప్రాప్తి కలగదు. ఉత్క్రమణవరకు ఇంద్రియాలు మనస్సులో లీనమవడం, మనస్సు ప్రాణంలో, ప్రాణాలు జీవంలో లీనం కావడం సమానమే.
సంసార వ్యప దేశాధికరణం ( 4, 2, 8 )
సూత్రం :- 504
" తదా పీతేః సంసార వ్యపదేశాత్ "
సంసారవ్యపదేశాత్ :- శరీరం ఉన్నంత వరకు ప్రపంచం ఉంటుంది. కనుక తత్ :- ఆ సూక్ష్మ శరీరం, ఆ అపీతేః :- ముక్తి పర్యంతం ఉంటుంది.
భావం :- శరీరం ఉన్నంత వరకు ప్రపంచం ఉంటుంది. ఆ సూక్ష్మ శరీరం ముక్తి పర్యంతం ఉంటుంది.
వివరణ:-ఈ అధికరణంలో దేహంలో వేడి సూక్ష్మశరీరం వల్లనే ఉంటుందని తెలియజేశారు. సృష్టి కాలంలో సూక్ష్మశరీరం వలనే జీవులకు సంపర్కం ఏర్పడుతుంది. అది ప్రళయం వరకు ఉంటుంది. జననమరణాలలో సూక్ష్మదేహం ఒక్కటే అయినా స్థూలదేహాలు మారుతూ ఉంటాయి. అజ్ఞానులు తాము చేసిన కర్మఫలాన్ని అనుభవించడానికి వేరొక యోనిలో ప్రవేశిస్తారు. పుణ్యకర్మలు ఉత్తమయోనులు పొందుతారు. పాపాత్ములు నీచయోనులైన క్రిమి కీటకాలుగా పుడతారు. అధమాధములు రాళ్లు, రప్పలు, చెట్లుగా పుడతారు. అజ్ఞానుల సూక్ష్మశరీరానికి కారణమైన తత్త్వాలు ప్రళయకాలంలో తమ కరణాల్లో లీనమౌతాయి. బ్రహ్మజ్ఞానం కలిగిన జీవుడికి స్థూల దేహపాతం జరిగే వరకు సూక్ష్మదేహంతో సంబంధం ఉంటుంది. జ్ఞానికి సంచితకర్మలు, ప్రారబ్దకర్మలు నశించినతరువాత స్థూలదేహంతో బాటు సూక్ష్మదేహం కూడా విడిపోతుంది. తేజస్సు మొదలైన భూతాలు మోక్షపర్యంతం ఉంటాయి. ఆత్మకు శరీరంతో సంబంధం ఉన్నంత వరకే విషయసుఖాలపై అనుభూతి ఉంటుంది. సంసారం అంటే దేహసంబంధమైనది. ప్రళయంలోను, మోక్షంలోను దేహ సంబంధం ఉండదు. ఇతరసమయాలలో సూక్ష్మశరీరంతో సంబంధం ఉంటుంది. తేజస్సు మొదలైన సూక్ష్మ, భూత సూక్ష్మాలకు పరమాత్మయందు లయం కావడమే మిగిలి ఉందని గ్రహించాలి.
సంసార వ్యపదేశాధికరణం ( 4, 2, 9 )
సూత్రం :- 505
" సూక్ష్మం ప్రమాణతశ్చ తధోప లబ్ధేః "
ప్రమాణతః చ :- ప్రమాణం వలన, తధా ఉపలబ్ధేః :- ఎంతో సూక్ష్మం కావటం వలన, సూక్ష్మం :- సూక్ష్మ శరీరం ఇంద్రియ గోచరం కాదు.
భావం :- ప్రమాణం వలన ఎంతో సూక్ష్మం కావటం వలన సూక్ష్మ శరీరం ఇంద్రియ గోచరం కాదు.
వివరణ:-సూక్ష్మ శరీరం ఇంద్రియాలకు గోచరం కాదు. సూక్ష్మ దేహం ఎంతో చిన్నది కనుక ఇంద్రియాలు తెలుసుకోలేవు. కేవలం అనుమానప్రమాణంతో గుర్తించాలి. శరీరం నుండి వెళ్లి పోతున్న జీవుడికి ఆశ్రయ భూతమైన తేజస్సు ప్రమాణాన్ని బట్టి, స్వరూపాన్ని బట్టి చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఆ సూక్ష్మశరీరం జీవుడికి జీవించి ఉన్నంత కాలం ఆధారభూతంగా ఉండి, ఈశరీరాన్ని వదలివెళ్లేటప్పుడు, వేరే శరీరంలో ప్రవేశించదానికి, బ్రహ్మ లోకానికి వెళ్లడానికి ఆధార భూత మౌతుంది. భూతసూక్ష్మాలతో కూడిన తేజస్సు చాలా సూక్ష్మమైన నాడీమండలం గుండా పోతుంది.
బృహదారణ్యకోపనిషత్తు(4, 4, 2):-సూక్ష్మశరీరంతో కూడిన జీవుడు చక్షురాది ఇంద్రియాల నుంచి, ఇతర నాడుల నుంచి వెళ్ళిపోతాడు. కనుక సూక్ష్మ శరీరం ఇంద్రియ గోచరం కాదు.
సూత్రం :- 506
" నోప మర్ధే నాతః "
అతః :- సూక్ష్మం కావటం వలన, ఉప మర్ధేన :- స్థూల శరీరం నశించినా, న :- సూక్ష్మ శరీరం నశించదు.
భావం :- సూక్ష్మ శరీరం సూక్ష్మం కావటం వలన స్థూల శరీరం నశించినా సూక్ష్మ శరీరం నశించదు.
వివరణ:-సూక్ష్మశరీరం అత్యంత సూక్ష్మమైనది. సన్నని దారపు పోగులో వెయ్యోవంతు కూడా ఉండదు. స్థూల శరీరానికి ఒరిపిడి కలిగినా, సూక్ష్మశరీరానికి బాధ కలగదు. అది స్వచ్ఛమైనది. సూక్ష్మమైనది. స్వచ్ఛమైనది కనుకనే స్థూల శరీరానికి ఏదైనా బాధకలిగినా అది సూక్ష్మశరీరానికి అంటదు. మరణించినప్పుడు స్థూలశరీరాన్ని అగ్నితో దహనం చేసినా సూక్ష్మశరీరం దహింపబడదు. ఉపమర్దనం అంటే దహనం లాంటి వాటి వలన నశించడం అని అర్ధం. దాహదులచే స్థూల శరీరాన్ని పీడించినా కూడా ఈ సూక్ష్మశరీరం పీడింప బడదు.
సూత్రం :- 507
" అ స్యైవ చోపపత్తే రేష ఊష్మా "
వేషః ఉష్మా:- ఈ స్థూల శరీరం మనకు తెలిపే వేడిమి, అస్య ఏ వ :- సూక్ష్మ దేహానికి సంబంధించినదే అని, ఉప పత్తేః :- యుక్తి వలన తెలుస్తోంది.
భావం :- ఈ స్థూల శరీరం మనకు తెలిపే వేడిమి, సూక్ష్మ దేహానికి సంబంధించినదే అని యుక్తి వలన తెలుస్తోంది.
వివరణ:-సూక్ష్మశరీరం ఉన్నదా, లేదా? అని ఎలా తెలుస్తుంది? అంటే ఈ స్థూలశరీరాల్లో అందరూ అనుభవించే ఆవిరి లేదా ఉష్ణం స్థూలదేహానికి సంబంధించినది కాదు. అది సూక్ష్మదేహానికి సంబంధించినది. స్థూల దేహానికి సంబంధించినదే. అయితే మృతదేహంలో కూడా వేడిఉండాలి. దేహధర్మాలైన రంగు లాంటి గుణాలు కొన్ని మృతదేహంలో కూడా ఉంటాయి. కాని ఉష్ణం మాత్రం ఉండదు. అది సూక్ష్మదేహంతో జీవుడి నుంచి ఉత్క్రమణ చేస్తుంది. సూక్ష్మ శరీరం ఉన్నప్పుడే ఆ ఆవిరి ఉంటుంది. అదే దేహంలోని వేడి. అవసానసమయంలో కాళ్ళు, చేతులు చల్లబడిపోతాయని అంటారు. అంటే సూక్ష్మ శరీరం వెళ్లిపోవడం వలన శరీరం చల్లబడిపోతుంది. జీవించి ఉన్నప్పుడు ఇది వేడిగాఉంటుంది. మరణించినప్పుడు చల్లగా ఉంటుంది. అలా అన్నిదేహలలో అందరికీ తెలిపే ఉష్ణతఆధారంగా ఒకసూక్ష్మదేహం ఉన్నదని యుక్తిమూలంగా తెలుస్తోంది.
ప్రతిషేదాధికరణం ( 4, 2, 12 )
సూత్రం :- 508
" ప్రతిషేధా దితి చేన్న శారీరాత్ "
ప్రతిషేధాద్ ఇతి చేత్ :- బృహదారణ్యకంలో జీవుడి ఉత్క్రమణం చేయడని నిరకరించడం వలన, న :- సరియైనది కాదు. శారీరాత్ :- అక్కడ జీవుడి నుంచి ఉత్క్రమణం నిషేదించారే కాని శరీరం నుంచి కాదు.
భావం :-బృహదారణ్యకంలో జీవుడు ఉత్క్రమణం చేయడని నిరాకరించడం వలన, ముక్తి దాకా సూక్ష్మ శరీరం ఉంటుంద నడం తగదు అని చెప్పడం సరియైనది కాదు. అక్కడ జీవుడి నుంచి ఉత్క్రమణం నిషేదించారే కాని, శరీరం నుంచి కాదు.
వివరణ:-గురువుగారు! అవసానదశలో ప్రాణాలు ఉత్క్రమిస్తాయా? అని అడిగాడు నారాయణభట్టు. సగుణారాధన చేసే వాడి ప్రాణాలు ఉత్క్రమిస్తాయి. కాని బ్రహ్మవేత్త ప్రాణాలు ఉత్క్రమించవు అని అనడం సరి కాదు. ఊత్క్రమణ అనేది జీవుడి నుంచి కాదు. అతని శరీరం నుంచి జరుగుతుంది.
బృహదారణ్యకోపనిషత్తు(3, 2, 11):-ఈపురుషుడు మరణించేటప్పుడు ప్రాణాలు ఉత్క్రమిస్తాయా లేదా అని ఆర్తభాగుడు యాజ్ఞవల్క్యుని అడిగాడు. అవి ఇక్కడే లీనంఅవుతాయి. అతను లావెక్కుతాడు. నిండిపోతాడు. నిండి చనిపోయి శయనిస్తాడు అని యాజ్ఞవల్క్యుడు సమాధానం ఇచ్చాడు. దీనినిబట్టి ప్రాణాలు జీవునితో బాటు ఉత్క్రమించవని తెలుస్తోంది కదా! అందుచేత ముక్తిపర్యంతం సూక్ష్మశరీరం జీవుడితో కూడి ఉంటుందనడం పొసగడం లేదుకదా! ఉపనిషత్తులలో చెప్పిన ప్రాణోత్క్రమణ నిరాకరించడం, శరీరం నుంచి ఉత్క్రమించదు అని అర్ధం కాదు. ప్రాణపదానికి అర్ధం సూక్ష్మశరీరం. అది స్థూలశరీరం నుంచి వెళ్ళిపోతుంది, కాని జీవాత్మ నుంచి కాదు. ఉపనిషత్తులలో పురుషుడు అంటే జీవుడు, శరీరం కాదు. జీవుడి నుంచి ప్రాణాలు ఉత్క్రమించవు. సూక్ష్మశరీరం ముక్తి వరకు జీవుడితోనే ఉంటుంది. జ్ఞాని సూక్ష్మ దేహం, స్థూల దేహంతో బాటు వాటి కరణాల్లో లీనమై నశిస్తుంది.
సూత్రం :- 509
" స్పస్టో హ్యే కేషామ్ "
ఏకే షామ్ :- కౌషీతకి శాఖకు సంబంధించిన వాళ్ల అభిప్రాయంలో, స్పష్ట హి :- జీవాత్మ ప్రాణాలతో పాటు శరీరం నుంచి ఉత్క్రమిస్తుంతుందని స్పష్టంగా అంటున్నారు.
భావం :- కౌషీతకీ శాఖకు సంబంధించిన వాళ్ల అభిప్రాయంలో జీవాత్మ ప్రాణాలతో పాటు శరీరం నుంచి ఉత్క్రమిస్తుందని స్పష్టంగా తెలియజేశారు.
వివరణ:-ఈఅధికరణంలో నిర్గుణబ్రహ్మవేత్త ప్రాణాలు ఉత్క్రమించవని చెప్పబడింది. కొంతమంది సూత్రకారులు బ్రహ్మవేత్తకు ఉత్క్రాంతి లేదని చెప్పారు. బృహదారణ్యకంలో మానవుడు చనిపోయినప్పుడు బ్రహ్మవేత్త ప్రాణాలు ఉత్క్రమిస్తాయా అని అడిగాడు ఆర్తభాగుడు. తత్త్వజ్ఞానియొక్క ప్రాణాలు పరమాత్మలో లీనంఅవుతాయి కాని అతనికి ఉత్క్రమణ లేదు.సామాన్య మానవుడి లాగానే బ్రహ్మవేత్తకూడా మరణిస్తాడు. కాని అతనికి పునర్జన్మ ఉండదని యాజ్ఞవల్క్యుడు సమాధానం ఇచ్చాడు. మరి మరణించిన వానికి ప్రాణాలు ఉత్క్రమిస్తాయి కదా అని సందేహం రావచ్చును. బ్రహ్మవేత్తకు ప్రాణాలు ఉత్క్రమించవు. అవి పరమాత్మలో లీనం అవుతాయి.
కౌషీతకీబ్రాహ్మణం(3, 4):- జీవుడు ఈశరీరం నుంచి ఉత్క్రమించేటప్పుడు జీవుడు, ప్రాణాలు రెండూ శరీరంలో కలిసి ఉంటాయి కనుక ప్రాణాలతోకలిసే ఉత్క్రమిస్తాడు. కనుక జీవుడితో బాటు లింగశరీరం ఉత్క్రమిస్తుందని ముక్తి పర్యంతం విడువదని తెలుస్తోంది.
సూత్రం :- 510
" స్మృర్యతే చ "
సూక్ష్మ శరీరంలో జీవుడు ఉత్క్రమిస్తాడని, స్మృర్యతే చ :- స్మృతిలో కూడా చెప్పారు.
భావం :- సూక్ష్మ శరీరం లో జీవుడు ఉత్క్రమిస్తాడని స్మృతిలో కూడా చెప్పారు.
వివరణ:-బ్రహ్మసాక్షాత్కారం పొందిన వాడికి ప్రాణాలు ఉత్క్రమించడం గాని, దేవయానాది మార్గాలు గాని లేవని పురాణాలూ చెబుతున్నాయి. కాబట్టి బ్రహ్మవేత్త ప్రాణాలు ఉత్క్రమించవు.
మనుస్మృతి(1, 56) :-మనుస్మృతిలో మృత్యుసమయం వర్ణన వున్నది. ఈజీవుడు ఇంద్రియాలతో కూడి చాలా కాలం ఉంటాడు. ఇంద్రియాలు, జీవుడు బ్రహ్మజ్ఞానం విడిచి తపస్సును ఆశ్రయించి ఉన్నప్పుడు తమ వ్యాపారాన్ని విడిచి పెడతాయి. అప్పుడా జీవుడు ఏ కార్యము చేయడు. స్థూల శరీరం నుంచి నిష్క్రమిస్తాడు.
మనుస్మృతి(1, 56):-అణుపరిమాణం ఉన్న జీవుడు తన్మాత్రాలు సూక్ష్మభూతాలతో కూడి స్థావరజంగమయోనుల్లో కర్మల ననుసరించి ప్రవేశించి, స్థూలశరీరాన్ని గ్రహిస్తూ, విడుస్తూ ఉంటాడు. ఇలా జీవుడు ముక్తి లభించే వరకు సూక్ష్మ లింగ శరీరంతో నానాయోనుల్లో చేరడానికి ఉత్క్రమిస్తాడని భావం. బ్రహ్మవేత్త శరీరంలోనే ఉండి యోగబలం చేత విశిష్టమైన ఒక ప్రదేశం చేరి అక్కడ శరీరం విడిచిపెట్టాడు అని గ్రహించాలి. అందుచేతనే అతనిని అన్నిభూతాలు చూచాయి అని చెప్పబడింది. శుకన్తు....అభవత్ అంతరిక్షంలో ఉన్న శుకుడైతే వాయువు కంటే శీఘ్రమైన గమనం చేసి తన ప్రభావాన్ని చూసి సర్వభూతాలలో లీనమైపోయాడు అని అర్థం. అందుచేతనే బ్రహ్మవేత్తకు ప్రాణాలు ఉత్క్రమించవు అని చెప్పబడింది.
కలాప్రళయాధికరణం ( 4, 2, 15 )
సూత్రం :- 511
" తాని పరే తథాహ్యా హ
తాని :- వాగాది ఇంద్రియాలు లీనం అయిన సూక్ష్మ భూతాలు, పరే :- బ్రహ్మంలో లీనం అవుతాయి. హి :- అని, తధా ఆహ :- ప్రమాణాలున్నాయి.
భావం :- వాగాది ఇంద్రియాలు లీనం అయిన సూక్ష్మభూతాలు బ్రహ్మంలో లీనం అవుతాయని ప్రమాణాలున్నాయి.
వివరణ:-గురువుగారు! బ్రహ్మవేత్త ప్రాణాలు ఉత్క్రమించవు అన్నారు. మరి అతని ఇంద్రియాలు, భూతాలు పరమాత్మలో లీనం అవుతాయా? లేక తమతమ ప్రకృతుల యందు లయమౌతాయా? అని అడిగాడు కృష్ణశర్మ. బ్రహ్మవేత్త ప్రాణాలు అంటే ఇంద్రియాలు, భూతాలు పరమాత్మలోనే లీనం అవుతాయి. ప్రశ్నోపనిషత్తులో పదహారుకళలకు పరమేశ్వరుడే ఆధారం. కనుక అతని యందే లయమౌతాయని చెప్పబడింది. జ్ఞానికి మోక్షం కలిగినప్పుడు పదిహేను కళలు వాటి వాటి ఉత్పత్తిస్థానాన్ని పొందుతాయని ముండకోపనిషత్తులో చెప్పబడింది. గంగా, యమున, సరస్వతి, గోదావరి, కృష్ణ ఇలా నామరూపాలున్న నదులన్నీ సముద్రంలో కలిసిపోయినప్పుడు వాటికున్న పేర్లు పోయి, సముద్రం అనే పేరే వస్తుంది. అలాగే పదహారుకళలు పరమేశ్వరుని చేరినప్పుడు వాటికి నామరూపాలుండవు. దానిని పురుషుడు అని అంటారు. సమాధిస్థితిలో ఉన్నప్పుడు ఈకళలన్నీ ఆత్మలో లీనం అవుతాయి.
ఛాందోగ్యోపనిషత్తు(6, 8, 8):- వాగాది ఇంద్రియాలు తమలో లీనం చేసుకున్న సూక్ష్మ భూతలు, లింగ శరీరం, దానితో ఉన్న జీవుడు పరబ్రహ్మంలో లీనమౌతాడు. ఆదశలో జీవుడికి ఎలాంటి సుఖదుఃఖాలు ఉండవు. సమాధి, ముక్త అవస్థలలో జీవుడు ఆనందం అనుభవిస్తాడు. బండిచక్రానికి ఉండే ఆకులన్నీ ఇరుసుమీద ఆధారపడినట్లుగా, ఈ కళలన్నీ పురుషుడి మీద ఆధారపడి ఉంటాయి. ఈ పదహారుకళలు అతను సృష్టించినవే. ఈ రకంగా నిర్గుణ పరబ్రహ్మ వేత్త ఇంద్రియాలు బ్రహ్మలో లీనం అవుతాయి.
కలా విభాగాధికరణం ( 4, 2, 16 )
సూత్రం :- 512
" అవిభాగో వచనాత్ "
వచనాత్ :- ఛాందోగ్యంలో ఇచ్చిన దృష్ఠాంతం వలన సంపత్తి అంటే ,అవిభాగః :- విభజించడానికి వీలులేని సంయోగ విశేషం.
భావం :- ఛాందోగ్యం లో ఇచ్చిన దృష్టాంతం వలన సంపత్తి అంటే విభజించడానికి వీలులేని సంయోగ విశేషం.
వివరణ:-"వాజ్ మనసి సంపద్యతే" వాగాదిఇంద్రియాలను మనస్సు మొదలైన వాటిలో సంపత్తి అన్నారు. ఈ సంపత్తి విభజించడానికి వీలులేనిదే కాని ఒకటై పోవడం, లయం అనికాదు. జ్ఞానియొక్క షోడశకళలు అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనస్సు బ్రహ్మంలో పుర్తిగా లయమౌతాయి. అప్పుడు వాటి నామరూపాలు నశించి అన్ని కలసి పురుషుడు అని వ్యవహరించబడతాడు. ఈ రకంగా లయమైనప్పుడు సాధకుడు కళలు లేనివాడు అవుతాడు. అంటే అతను ముక్తుడౌతాడు.
ఛాందోగ్యోపనిషత్తు(6, 9, 12):- సోమ్యా! తేనెటీగలు తేనెను చేకూరుస్తాయి. అనేక చోట్ల నుండి అనేక వృక్షాల నుండి పుష్ప రసాన్ని ఒకచోట చేర్చి, మధువును వృద్ధిచేస్తాయి. ఆతేనె వేర్వేరు చెట్లకు సంబంధించినవని అవి స్వయంగా గుర్తించలేవు. అలాగే సమస్తజీవులు లీనమై సత్ ను చేరి, భిన్న వ్యవహారాలకి లోను కారు. ఈస్థితినే లయం, సంపత్తి అంటారు. తేనెలో చేరిన విభిన్నరసాలను వేర్వేరుగా వ్యవహరించడానికి వీలు కానట్లే, బ్రహ్మంలో జీవులు లీనమై వేర్వేరుగా వ్యవహరించే వీల్లేనిస్థితిలో ఉంటారనడమే సంపత్తి, లయం, శబ్దార్ధం. అంతే కాని జీవులు బ్రహ్మం అవుతారని కాదు. జీవుల స్వరూపానికి హానికలగదని సూత్రం భావం. విద్వాంసుని కలా ప్రళయం ఇతరుల వలె సావశేషంగా ఉంటుందా? నిరవశేషంగా ఉంటుందా అని సందేహం. జ్ఞాని యొక్క ఇంద్రియాలు బ్రహ్మలో లయమౌతాయి కనుక దానిని నిరవశేషం అంటారు. అజ్ఞాని మరణించినా అతనితో బాటే షోడశకళలు వెంట ఉంటాయి. దానిని సావశేషం అంటారు. దోసపండు తోడిమ నుండి పూర్తిగా విడిపోయినట్లుగా ఉండదు. అలాగని అతుక్కొని ఉండదు. ఆదేవిధంగా జ్ఞాని ఇంద్రియాలు బ్రహ్మంలో ఒకటై పోయి లయం కావు. లేదా విభజించడానికి వీలుగా ఉండవు.
తదేకోధికరణం ( 4, 2, 17 )
సూత్రం :- 513
" తదేకోగ్ర జ్వలనం తత్ ప్రకాశితద్వారో విద్యాసామర్ధ్యత్, తచ్ఛేష గత్యనుస్మృతి యోగాచ్చ హార్ధానుగృహీతః శతాధికయా"
విద్యాసామర్ధ్యత్ :- ఉపాసనవిద్య మహత్తువలన, తత్ శేష గతి అనుస్మృతి యోగాత్:-అవిద్యాఫలితమైన గతిస్మరణ వలన, తత్ ఓకః అగ్రజ్వలనం:- బ్రహ్మంలో లీనమైన లింగశరీరంలో ఉన్న జీవాత్మకు స్థానంఅయిన హృదయఅగ్రభాగం ప్రకాశస్తుంది, తత్ ప్రకాశితద్వారః :- హృదయఅగ్రభాగ ప్రకాశంతో వెలుగొందే నిష్క్రమణ ధ్వారం వద్ద, హార్ధ అనుగ్రహీతః :- హృదయంలో ఉండే బ్రహ్మం అనుగ్రహించిన ఉపాసకుడు, శతాధికయా :- నూటికి మించి ఉన్న నాడుల్లో బ్రహ్మనాడి అనే సుషమ్ననాడితో శరీరం నుంచి నిష్క్రమిస్తాడు.
భావం :- ఉపసనా విద్య మహాత్తు వలన, ఆ విద్యా ఫలితమైన గతి స్మరణ వలన బ్రహ్మంలో లీనమైన లింగ శరీరంలో ఉన్న జీవాత్మకు స్థానం అయిన హృదయ అగ్ర భాగం, ప్రకాశంతో వెలుగొందే నిష్క్రమణ ధ్వారం వద్ద ఉపాసకుడు నూటికి మించి ఉన్న నాడుల్లో బ్రహ్మనాడి అనే సుషమ్నా నాడి ద్వారా శరీరం నుంచి నిష్క్రమిస్తాడు.
వివరణ:-ఈసూత్రంలో సగుణబ్రహ్మవేత్త యొక్క ఆత్మసుషమ్నానాడి ద్వారా నిర్గమిస్తుందని చెప్పబడింది. మరణ సమయంలో అన్నికరణాలు సంకుచితాలై జీవుడుకి నిలయమైన హృదయంలో లీనమౌతాయి. అన్ని కరణలు వాటి వ్యాపారాలు మానివేసి, హృదయంలో తమకు అధ్యక్షుడైన జీవాత్మను చేరతాయి. సగుణోపాసకుని ఆత్మ శరీరం నుంచి బయటకు వచ్చేటప్పుడు జీవునికి నివాసస్థానమైన హృదయం చివరిభాగంలో ఒక జ్వలన కలుగుతుంది. హృదయాన్ని అధిష్టించిన బ్రహ్మచేత అనుగ్రహింపబడి, బ్రహ్మవిద్యాసామర్ధ్యం వలన, గతిని ధ్యానించడం వలన, నూటఒకటవదైన సుషమ్నానాడి ద్వారా నిష్క్రమిస్తాడు.
కఠోపనిషత్తు(6, 16):- హృదయం నుండి 101 నాడులు బయలుదేరతాయి. అందులో సుషమ్నా మూర్ధవైపు వెడుతుంది. ఈశ్వరుడి వ్యవస్థ వలన కర్మలను అనుసరించి దేహాన్ని విడిచి పెట్టేటప్పుడు ప్రతి వ్యక్తి తనకు రాబోయే యోని గురించి తెలుస్తుంది. ఇది మృత్యుకాలపు కష్టాన్ని తగ్గిస్తుంది. దానిని స్మరిస్తూ జీవుడు ఈదేహాన్ని విడిచిపెడతాడు. పరమేశ్వరుడు కర్మలు చేసే వ్యక్తిని ఇలా అనుగ్రహిస్తాడు. ఉపాసకుడు సుషమ్నానాడి ద్వారా శరీర నుంచి నిష్క్రమిస్తాడు. ఇతర కర్మనుష్టానపరులు ఇతర నాడుల ద్వారాలను స్మరిస్తూ వాటిద్వారా దేహాన్ని విడుస్తారు.
బృహదారణ్యకోపనిషత్తు(4, 4, 1):-ఆజీవుడు వ్యాపారాలతోఉన్న తేజోమయకరణాలను మృత్యుకాలంలో తనతో చేర్చుకొని హృదయాన్ని తీసుకువెడతాడు. అప్పుడు లింగశరీరంతో బాటు జీవుడు హృదయంలో ఉంటాడు. దేహంలో అప్పుడు ఇంద్రియకార్యాలేవి జరగవు. అదే జీవుడు శరీరంనుంచి నిష్క్రమించేసమయం. అప్పుడు హృదయభాగం ప్రకాశవంత మౌతుంది. అక్కడ నుంచే హితా అనే హృదయనాడులు పైకి వస్థాయి. ఇవి 101. ఈ నాడుల నుంచే జీవులను వాళ్ళ కర్మలను అనుసరించి వివిధ గతులు కలుగుతాయి. వీటిలో సుషమ్నా ఒకటి. దానికి మూర్ధంలో ఉండే బ్రహ్మరంద్రంతో సంబంధం ఉంటుంది. ఇతరనాడులకు చక్షురాది ఇంద్రియాది ప్రదేశాలతో సంబంధం ఉంటుంది. దేహం నుంచి బయటకు వెళ్ళడానికి అనువైన ఈహృదయం తెరుచుకోనంతవరకు జ్ఞానులు, అజ్ఞానులు అందరూ సమానంగా వాగాది ఇంద్రియాలతో కూడిన సూక్ష్మశరీరంతో బాటు సమానంగా ఉత్క్రమణ చేస్తారు. ధ్వారం తెరుచుకున్న తరువాత వాళ్ళ వాళ్ళ కర్మలను అనుసరించి వేర్వేరు గతులు కలుగుతాయి. మార్గాలు వేరేవుతాయి. పూర్వజ్ఞానికి స్థూలసూక్ష్మదేహాలు రెండూ అక్కడే సమాప్తం అవుతాయి. అతను అమృతత్వం పొందుతాడు. అజ్ఞాని నవరంద్రాలలో ఏదో ఒక మార్గంలో నిష్క్రామిస్తాడు. అతనికి బ్రహ్మ లోక ప్రాప్తి లేదు.
రశ్మ్యధికరణం ( 4, 2, 18 )
సూత్రం :- 514
" రశ్మ్యనుసారీ "
రశ్మ్యనుసారీ :- బ్రహ్మనాడి ద్వారం గుండా ఉత్క్రమించే బ్రహ్మ జ్ఞాని సూర్యరశ్మిని అనుసరించి బ్రహ్మాన్ని పొందుతాడు.
భావం :- బ్రహ్మ నాడి ద్వారా ఉత్క్రమించే బ్రహ్మజ్ఞాని సూర్యరశ్మిని అనుసరించి బ్రహ్మాన్ని పొందుతాడు.
వివరణ:-ఉపాసకుడు ఈశరీరం నుంచి ఉత్క్రమించేటప్పుడు పగలు మరణించినా, రాత్రి మరణించినా విశేషం ఏది లేకుండా రశ్ములను అనుసరిస్తాడా? లేక పగలు మాత్రమేనా? ఈ తేజోసంబంధం పగలు, రాత్రి ఎప్పుడు మరణించినా ఉంటుందా? అని సంశయం కలుగుతుంది. ఉపాసకుడు ఈ శరీరంనుంచి నిష్క్రమించేటప్పుడు 101 వ నాడి అయిన బ్రహ్మనాడి ద్వారా పైకి వెళ్లి, పగలు మరణించినా, రాత్రి మరణించినా తేజోరశ్ములను అనుసరించి బ్రహ్మాన్ని పొందుతాడు.
ఛాందోగ్యోపనిషత్తు(8, 6, 5):-జ్ఞాని ఈ శరీరంనుంచి వెళ్ళేటప్పుడు సూర్యరశ్మలతో పైకి వెడతాడు. దీనిని బట్టి సుషమ్నా నాడికి రశ్ములతో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.
ముండకోపనిషత్తు(1, 2, 11):-బ్రహ్మోపాసకుల కర్మలు క్షీణిoచగా సూర్యుని ద్వారా పయనిస్తారు. కనుక సూర్య రశ్ములే బ్రహ్మలోకయాత్రకు ఉపకరిస్తాయని స్పష్టమౌతోంది. సుషమ్నాద్వారా ఈ దేహంనుండి నిష్క్రమించిన ఉపాసకుడు ఆ నాడితో సంబంధం ఉన్న సూర్యకిరణాలను అనుసరించి పగలు, రాత్రి అనే భేదం లేకుండా బ్రహ్మలోకం చేరతాడు.
సూత్రం :- 515
" నిశినేతి చేన్న సంబంధస్య యావద్దేహభావిత్వా ద్దర్శయతి చ
నిశినఇతిచేత్:-రాత్రిపూట రశ్మి సంబంధం ఉండదని అనడం, న:-సరియైనది కాదు, సంబంధస్య:-నాడీరశ్మి సంబంధం, యావత్ దేహభవిత్వాత్:-దేహం ఉన్నంతవరకు ఉండే స్వభావంఉన్నది అని దర్శయతిచ:-ఉపనిషత్తుకూడా తెలియజేస్తోంది.
భావం :- రాత్రి పూట రశ్మి సంబంధం ఉండదని అనడం సరియైనది కాదు. నాడీ రశ్మి సంబంధం దేహం ఉన్నంత వరకు ఉండే స్వభావం ఉన్నదని ఉపనిషత్తు తెలియజేస్తోంది.
వివరణ:-సాధారణంగా దేహానికి సూర్యరశ్మితో సంబంధం పగలు మాత్రమే ఉంటుందని అనుకుంటారు. కాని నాడులకు, సూర్యరశ్మికి దేహం ఉన్నంత వరకు సంబంధం ఎప్పుడు ఉంటుంది. అందుచేత రాత్రులందు జీవుడు కిరణాలను అనుసరించడని చెప్పడంలో అర్ధం లేదు. ఈవిషయాన్నే ఉపనిషత్తు తెలియజేస్తోంది.
నిరుక్తం(2, 2, 2):-సూర్యుడి రశ్మి చంద్రుడు ప్రకాశించేలా చేస్తోంది. ఆదిత్యునివల్లనే చంద్రునికి కాంతి లభిస్తుంది. అందువలన పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడు దేహానికి సూర్యరశ్మితో సంబంధం ఉంటుంది. ఉపాసకుడు మరణించినా, అతని గతిలో ఏమార్పు ఉండదు. రాత్రి పూట సూర్యుడు ఉండదు కదా! మరి రాత్రులందు మరణించిన వారికి సూర్యరశ్మితో సంబంధం ఉండదని కొంత మంది సందేహిస్తారు. అది నిజం కాదు. నాడులకు, సూర్యరశ్మికి ఉన్న సంబంధం వస్తూపోతూ ఉండేదికాదు. శరీరం ఉన్నంత వరకు ఇది ఉంటుంది. దేహంలో అన్ని నాడులలో వ్యాపించి ఉండే పిత్తరసం సూర్యుని తేజస్సే. జీవుడు పగలుమరణించినా, రాత్రిమరణించినా ఆసమయంలో సూర్యరశ్మి ఉన్నా లేకపోయినా మృతి చెందిన వెంటనే సూర్యరశ్మి ప్రాప్తి కలుగుతుంది.
దక్షిణాయనాధికరణం ( 4, 2, 20 )
సూత్రం :- 516
" అత శ్ఛాయనే పి దక్షిణే "
అతః చ :- అందువల్లే, దక్షిణే ఆయనే అపి :- కృష్ణ పక్షంలో కూడా దేహానికి సూర్య రశ్మి సంబంధం ఉంటుంది.
భావం :- దక్షిణాయనం కృష్ణపక్షంలో కూడా దేహానికి సూర్య రశ్మి సంబంధం ఉంటుంది.
వివరణ:-గురువర్యా! ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని, ఆకాలంలో మరణించిన వారు బ్రహ్మ లోకానికి వెడతారని, దక్షిణాయనంలో మరణించిన వారికి బ్రహ్మలోక ప్రాప్తి లేదంటారు? ఇది నిజమేనా? అని అడిగాడు కృష్ణశర్మ. ఉత్తరాయణం, దక్షిణయనం సూర్యగమనం వలన కలిగేవి కావు. అవి దేవయాన, పితృయాన మార్గాలు. ఈ జ్ఞానమనేది ఎప్పుడూ ఉండేదే. దక్షిణయానంలో చనిపోయినప్పటికీ బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. అలాగే అజ్ఞానులు ఏ కాలంలో మరణించినా బ్రహ్మలోకప్రాప్తి లభించదు. జ్ఞానిదేహంతో సూర్యరశ్మికి సంబంధం ఉంటుందని సమాధానం ఇచ్చాడు గురువుగారు. ఉత్తరాయణంలో మరణించిన వారికి బ్రహ్మలోక ప్రాప్తి వస్తుందని, దక్షిణాయానం లో మరణించిన వారు బ్రహ్మ లోకం చేరలేరని, అందుకే భీష్మడు సూర్యరశ్మి ఎక్కువగా ఉండే ఉత్తరాయణం వరకు వేచి ఉన్నాడని పూర్వ పక్ష వాదన. కృష్ణపక్షంలో దక్షిణాయానంలో ఎప్పుడు మరణించినా జ్ఞాని దేహంతో సూర్యరశ్మికి సంబంధం ఉంటుంది. ఉత్తరాయణం, దక్షిణాయానం సూర్యగమనం వలన కలిగే కాలాలు కావు. ఉత్తరాయణ దేవత, దక్షిణాయన దేవత అని వీరు కాలాధి దేవతలు. వీరు సంవత్సరం పొడవునా సంచరిస్తుంటారు. వీరిని అతివాహిక దేవతలు అంటారు. అంటే మోసుకొని పోయేవారు అని అర్ధం. సగుణోపాసన చేసిన వారు ఏ కాలంలో, ఏ పక్షంలో, పగలు, రాత్రి ఎప్పుడు పోయినా బ్రహ్మలోకం చేరతారు. ప్రారబ్ద కర్మలు నశించిన తరువాత జ్ఞాన సాధనతో చేసిన ఉపాసన దక్షిణయానంలో వృధా కావు. ఉత్తరాయణంలో మరణించినా వారందరు బ్రహ్మ లోకంపోతే, ఇక సత్కార్యాలు చెయ్యవలసిన అవసరం ఏముంటుంది. భీష్ముడు 58 రోజులు అంపశయ్య మీద వుండి, ఉత్తరాయణం లో మరణించడానికి కారణం శ్రీకృష్ణుడు చెంత నుండగా, పాండవులకు ధర్మ సూక్ష్మాలు, శాస్త్ర వచనాలు బోధించడానికి, తన తండ్రి శంతనుడు ఇచ్చిన వరం 'స్వచ్ఛంద మరణం ' యొక్క శక్తి తెలుసుకోవడానికి, తన తండ్రి వరం ఎంతో గొప్పదని, దాని ప్రభావం లోకానికి వెల్లడి చెయ్యడానికి, కొంత కాలం వేచి చూశాడు. కాని ఉత్తరాయణం కోసం కాదు. మరణం ఆసన్నమయ్యేవరకు ఎవరైనా ఎదురు చూడవలసిందే. మానవ జీవిత లక్ష్యం జన్మ రాహిత్యం, మోక్షం సాధించడం. అలాగే భీష్మడు తాను చెయ్యవలసిన కర్తవ్యం పూర్తి కాగానే బ్రహ్మ సాయుధ్యాన్ని పొందాడు.
దక్షిణాయనాధికరణం ( 4, 2, 21 )
సూత్రం :- 517
" యోగినః ప్రతిచ స్మర్యత్ స్మార్తే చైతే "
యోగినః ప్రతిచ :- కాల విశేషం వలన మరణించిన విషయంలో యోగికి ఆవృత్తి, అనావృత్తి కలుగుతాయని, స్మర్యతే :- చెప్పారు. ఏతే చస్మార్తే :- ఇవి రెండూ స్మార్తాలే.
భావం :- కాల విశేషం వలన మరణించిన విషయంలో యోగికి ఆవృత్తి, అనావృత్తి కలుగుతాయాని చెప్పారు. ఇవి రెండూ స్మార్తాలే. అంటే స్మృతులను అనుసరించినవే.
వివరణ:-కర్మత్యాగులైన జ్ఞానయోగులు కొందరు అనావృత్తిని, కర్మానుష్టానపరులైన కర్మయోగులు ఆవృత్తిని పొందే మరణకాలం గురించి స్మృతుల్లో చెప్పబడింది. ఆయోగుల కోసం చెప్పే స్మృతిలో కాలవిశేషాన్ని వివరించారు. ఈ యోగం సాంఖ్యం అనే పురాణాల్లో చెప్పబడింది. కాని వేదంలో చెప్పబడ లేదు. కనుక అవి వేదప్రమాణాలు కావు. అయితే వేదాలలో చెప్పబడిన దేవయాన, పితృయానాలు, పురాణాలలో చెప్పబడ్డ అర్చిరాది, దూమమార్గం ఒక్కటే అని చెప్పవచ్చును. భగవద్గీతలో యోగుల కోసం అర్చిరాది మార్గం, దూమమార్గం గురించి చెప్పబడింది. అగ్ని, జ్యోతి, దినం, శుక్ల పక్షం, ఉత్తరాయణం వీటిలో మరణించే జ్ఞానయోగి బ్రహ్మాన్ని పొందుతాడని చాలా మంది అనుకుంటారు. రాత్రి, కృష్ణ పక్షం, దక్షిణాయాణం వీటిలో మరణించిన వారు చంద్రరశ్మిని పొంది కర్మయోగి అనిపించుకుంటాడని అతను మళ్ళీ జన్మిస్తాడని భావిస్తారు. కాని ఇది వాస్తవం కాదు. ఈమార్గాల వాస్తవికతలు గుర్తించిన యోగి ఎన్నడూ మోహంలో పడిపోడు. కాలవిశేషం వలన మరణించడం చేత ముక్తికలుగదు. క్రమముక్తికి కాల నియమం లేదు. జ్ఞానియైన వాడు దక్షిణాయనంలో మరణించినా బ్రహ్మలోకం చేరతాడు. పూర్ణజ్ఞానికి ఎప్పుడు మృత్యువు వచ్చినా అతని సద్గతికి ఎలాంటి ప్రతి బంధకము ఉండదు.
అర్చిరాద్యధికరణం ( 4, 3, 1 )
సూత్రం :- 518
" అర్చిరాదినా తత్ ప్రధితేః "
అర్చిరాదినా:-శరీరంనుంచి మూర్ధన్య నాడిగుండా బయటపడి, ఉపాసకుడు దేవాయానం అయిన అర్చిరాది మార్గంలో బ్రహ్మలోకం చేరతాడని, తత్ ప్రధితే :- ప్రసిద్ధి ఉన్నది.
భావం :- ఉపాసకుడు శరీరం నుంచి మూర్ధన్యనాడి గుండా బయట పడి, దేవయానం అయిన అర్చిరాది మార్గంలో బ్రహ్మాన్ని చేరతాడని ప్రసిద్ధి ఉన్నది.
వివరణ:-బ్రహ్మలోకానికి వెళ్లే భిన్నమార్గాల గురించి వేదంలో చెప్పబడ్డాయి. బృహదారణ్యకంలో వీరు జ్యోతిరభిమాన దేవతనుపొందుతారు. ఉపాసకుడు ఈలోకంనుంచి వెళ్ళేటప్పుడు పురుషుడు వాయువుతోవస్తాడు. ముండకోపనిషత్తులో వారు పాపరహితులై సూర్యునిద్వారా ఉత్తరాయణమార్గాన బ్రహ్మలోకం చేరతారు. కౌషీతకిఉపనిషత్తులో దేవయాన మార్గం పొంది, అగ్నిలోకానికి వెడతాడు. ఈ మార్గలన్నింటికి సంబంధం ఉన్నదా? లేదా? అనేది సందేహం. ఉపాసకుడు ఉత్క్రమించడానికి శాస్త్రంలో ఒకమార్గం ప్రసిద్ధంగా ఉన్నది అదే అర్చిరాది మార్గం లేదా దేవయానమార్గం అంటారు. అన్ని చోట్ల అర్చిరాది మార్గమే చెప్పబడింది. బ్రహ్మ లోకానికి మార్గం అర్చిరాది మార్గమే.
ఛాందోగ్యోపనిషత్తు(5, 10, 1):- అర్చిపదం కిరణవాచకం. అంటే రశ్మి. దాని నుంచి విద్యత్తు వరకు ఉన్న మార్గాన్ని దీనిలో సూచించారు. దీనిని అనుసరించి ఉపాసకుడు బ్రహ్మలోకాన్ని చేరతాడు. ఛాందోగ్యంలో శ్వేతకేతువు ఉద్దాలకునితో " మానవుడు మరణించిన తరువాత ఈ నాలుగు భూతాలు ఆయా భూతలతో కలసి పోతాయి. మానవుని యోగ్యత అనేది అతను చేసిన కర్మలను మీద ఆధారపడివుంటుంది. అతను ఆత్మానుభావం పొందినట్లయితే వెలుగు బాట అయిన అర్చిరాదిమార్గంలో ప్రయాణిస్తాడు. అక్కడ పుణ్య ఫలాన్ని అనుభవించి మోక్షన్ని పొందుతాడు. అతనికి పునర్జన్మ ఉండదు. అతనికి అక్కడ శాశ్వత మైన ఆనందం లభిస్తుంది. వాయ్వాదిమార్గాలన్ని దీనిలోనే అన్వయింపబడతాయి. ఎక్కడైనా మార్గం చెప్పకపోతే అది కూడా ఆర్చిరాది మార్గమేనని గ్రహించాలి. ఉపాసనలు వేర్వేరు ఉన్నట్లే, బ్రహ్మాన్ని చేరే మార్గాలు కూడా వేరుగానే ఉంటాయి. అవిఅన్నీ ఒక్కటి కాదు అని పూర్వపక్ష వాదన. క్రమ ముక్తి లేదా జీవన్ముక్తి కోరుకునే ఉపాసకులు అర్చిరాదిమార్గం ద్వారా జ్యోతి, సూర్యుడు, వాయువు, అగ్నిని చేరతారని చెప్పారు. అర్చి అంటే వెలుగు అనిఅర్ధం. జీవన్ముక్తుడు మరణించిన తరువాత కల్పాంతం వరకు బ్రహ్మలోకంలో ఉండి, ఆ తరువాత బ్రహ్మంలో లీనం అవుతారు. ఉపాసనలు, బ్రహ్మాన్ని చేరే మార్గాలు, అన్ని ఒక్కటేనని, చేరే బ్రహ్మం ఒక్కటేనని గ్రహించాలి. కల్పం అంటే 14 మన్వంతరాలు, 1 మన్వంతరానికి - 71 మహాయుగాలు, 1మహాయుగానికి - 4 యుగాలు అని చెప్పబడింది. సూర్యలోకం, చంద్రలోకం అంటే మనం చూస్తున్న గ్రహాలుకాదు. ఉపాసకుడు గురుసేవ, ఉపదేశం, జ్ఞానసమపార్జన, సాధన, ఆత్మ ధ్యానంలో తానే బ్రహ్మాన్ని అని తెలుసుకుంటేనే జీవన్ముక్తుడౌతాడు.
వాయ్వధికరణం ( 4, 3, 2 )
సూత్రం :- 519
" వాయు మబ్దా ద విశేష విశేషాభ్యామ్ "
అబ్దాత్ :- సంవత్సరం నుంచి, వాయుమ్ :- వాయువును చేరతారని అంగీకరించాలి అని, అవిశేష విశేషాభ్యమ్ :- సామాన్య, విశేష వాక్యాల వలన తెలుస్తోంది.
భావం :- సంవత్సరం నుంచి వాయువును చేరతారని అంగీకరించాలని సామాన్య, విశేష వాక్యాల వలన తెలుస్తోంది.
వివరణ:-ఈఅధికరణంలో ఉత్క్రమించే జీవుడు సంవత్సరదేవత, తరువాత వాయువును పొందుతాడని చెప్పబడింది. మోక్షార్థులు అర్చిరాది మార్గం ద్వారా బ్రహ్మలోకం చేరే మార్గాల గురించి ఉపనిషత్తులలో చెప్పబడింది.
కౌషీతకిఉపనిషత్తు:-ఉపాసకుడు ముందుగా అగ్నిలోకానికి వెళ్లి, అక్కడ నుంచి వరుసగా వాయు, వరుణ, ఇంద్ర, ప్రజాపతి లోకాలకు పోయి, అక్కడ నుంచి బ్రహ్మలోకం చేరతాడు.
ఛాందోగ్యోపనిషత్తు:- ఉపాసకుడు వరుసగా అర్చిరభిమాన దేవతను, దినాభిమాన దేవతను, శుక్లపక్ష అభిమానదేవతను, ఉత్తరాయణదేవతను, సంవత్సరదేవతను, సూర్యలోకం, చంద్రలోకం, విద్యుత్తులోకం, ఆతరువాత బ్రహ్మలోకం చేరతారు. అమాయకపురుషుడు అంటే దేవత బ్రహ్మలోకంనుంచి విద్యుత్తులోకం వచ్చి, అతడిని బ్రహ్మలోకం తీసుకొని వెడుతుంది.
బృహదారణ్యకోపనిషత్తు(5, 10, 1):-ఈలోకంనుంచి నిష్క్రమించే పురుషుడు వాయువును పొందుతాడు. రధచక్రంలో మధ్య ఉండే రంధ్రంలాగా వాయువు అతనిని ఆదిత్యుని వైపు వెళ్ళడానికి సహకరిస్తుంది. ఆకాశంలో ఘనీభవించిన ఆ వాయువు పగిలిపోయి మార్గం ఇస్తుంది. ఆమార్గం గుండా ఉపాసకుడు సూర్యలోకం చేరతాడు. కౌషీతకి, ఛాందోగ్యంలో వాయుమార్గం చెప్పబడలేదు. ఛాందోగ్యంలో సంవత్సరం స్థానం, బృహదారణ్యకంలో దేవలోకం చెప్పారని తెలుస్తోంది. ఈ రెండింటిని సమానంగా పరిగణిoచి, బృహదారణ్యకంలో వాయుపదాన్ని విశేషంగా నిర్దేశించడం వలన, సంవత్సరం తరువాత ఆదిత్యపదానికి ముందు వాయుపదాన్ని చేర్చి సమన్వయం చేసుకోవాలి. అప్పుడు మాసం నుంచి సంవత్సరం, దాన్నుంచి దేవలోకం, అక్కడ నుంచి వాయువు, దాని నుంచి ఆదిత్యున్ని చేరతారని ఒక క్రమం ఏర్పడింది.
వరుణాధికరణం ( 4, 3, 3 )
సూత్రం :- 520
" తడితోధి వరుణః సంబంధాత్ "
తడితః:-విద్యుత్తుకు, అధి:-పైన, వరుణః:-వరుణలోకంఉందని తెలుసుకోవాలి సంబంధాత్:-ఈరెండింటికి సంబంధంఉన్నది.
భావం :- విద్యుత్తుకు పైన వరుణ లోకం ఉందని తెలుసుకోవాలి. ఈ రెండింటికి సంబంధం ఉన్నది.
వివరణ:-ఈఅధికరణంలో విద్యుత్ దేవత తరువాత జీవుడు వరుణలోకాన్ని చేరతాడని చెప్పబడింది. విద్యుత్తు తరువాత వరుణుడికి స్థానముంటుంది. విద్యుత్తు అంటే మెరుపు, వరుణుడు అంటే వర్షం. వరుణశబ్దం అంటే వరించ తగినవాడు, ఈశ్వర వాచకమైన జలానికి పర్యాయ పదంగా వాడతారు.
కౌషీతకిబ్రాహ్మణం(1, 3,):- ఇక్కడ వరుణఅంటే జలం. ఉపాసకుడు దేవయానమార్గంలో ముందు అర్చి అంటే అగ్ని లోకాన్ని పిదప క్రమంగా వాయువు, ఆదిత్యుడు, వరుణుడు, ఇంద్రుడు, ప్రజాపతి అనే లోకాలను చేరతాడు.
ఛాందోగ్యోపనిషత్తు(7, 11, 1):- మెరుపు మెరుస్తుంది. ఉరుముతుంది, వర్షిస్తుంది, అని వర్ణించారు. కనుక విద్యుత్తు తరువాత వరుణపదం రావాలి. అప్పుడు వరుణుడి నుంచి ఇంద్రుడు, ప్రజాపతి, బ్రహ్మలోకాల క్రమం ఏర్పడుతుంది. ఇదే దేవయానం. మెరుపుమెరిశాక వర్షం వస్తుంది. వరుణపదం విద్యుత్తు తరువాత ఉండాలని, విద్యుత్తుకు వరుణుడికి సంబంధం ఉందని చెప్పారు.
అతివాహికాధికరణం ( 4, 3, 4 )
సూత్రం :- 521
" అతి వాహికా స్తలింగాత్ "
తత్ లింగాత్ :- శాస్త్ర వచనాలను బట్టి అర్చిరాదులు, అతి వాహికః :- ఒక చోటు నుంచి మరొక చోటుకు చేర్చే వాహనాలు.
భావం:-శాస్త్రవచనాలను బట్టి అర్చిరాదులు ఒకచోటు నుంచి మరొకచోటుకు చేర్చే వాహనాలు. వీరు అతివాహక దేవతలే.
వివరణ:-అర్చిరాదిమార్గంలో అనేకమైన లోకాలు చెప్పబడ్డాయి. అవి గుర్తుకోసమా? భోగాలుఅనుభవించే లోకాలా? త్రోవలో విశ్రాంతి తీసుకోవడానికి స్థానాలా? లేక ఉపాసకుని బ్రహ్మలోకానికి తీసుకొని పోయే దేవతలా? అని సంశయం కలుగుతుంది. బ్రహ్మలోకానికి ప్రయాణమయ్యే వాడికి ఇవన్నీ అతివాహికలు. ఈఅర్చిరాదులన్నీ ఉపాసకుణ్ణి వెంట బెట్టుకొని బ్రహ్మలోకానికి తీసుకొని వెడతారు. విద్యుల్లోకం నుంచి దివ్య పురుషుడు బ్రహ్మలోకానికి తీసుకువెడతాడు. ప్రతి లోకంలోనూ ఆయా దేవతలు ఉపాసకుని జాగ్రత్తగా తరువాత లోకానికి చేరుస్తారు. అందువల్లనే వారందరు అతివాహికలే.
ఛాందోగ్యోపనిషత్తు(8, 6, 5):- ఆత్మ ఈశరీరం ద్వారా ఉత్క్రమించి రశ్ముల ద్వారా పైకి వెడుతుంది. మనోవేగంతో ఆదిత్యుణ్ణి చేరుతుంది. ఈ రశ్ములే అతివాహకాలు. ఇవి రశ్ముల రూపంలో గాని, విద్యుత్తరంగ రూపంలో గాని ఉండవచ్చును. వీరిని బ్రహ్మం వరకు చేర్చేవాడు అమానవపురుషుడు. అతను చేతనదేవుడని, దివ్యశక్తి అని అంటారు. అజ్ఞానస్వరూపం కావచ్చును. లేదా లింగ శరీరం కావచ్చును. అదే ఆత్మను బ్రహ్మం వరకు తీసుకెడుతుంది. లింగశరీరం సర్గారంభం నుంచి ఎప్పుడు ఆత్మతోనేఉంటుంది. జీవుడికి ముఖ్యాశ్రయం లింగశరీరమే. ఈసూక్ష్మదేహం సహకారంతోనే జీవుడు బ్రహ్మ సాక్షాత్కారం చేసుకుంటాడు. వీరికి ఉత్క్రమణఉండదు. స్థూలశరీరంతోబాటు సూక్ష్మశరీరం కూడా అతణ్ణి విడిచి వెళ్ళిపోతాయి.
బృహదారణ్యాకోపనిషత్తు 8, 13, 1):-ఉపాసకులకు దేవయానగతి పూర్వబ్రహ్మజ్ఞానం కలగక, పూర్ణత్వానికి దగ్గరలో ఉండే వారికీ, పూర్ణజ్ఞానికి సూక్ష్మదేహం ఉండదు. ఆస్థితి కలిగే వరకు ఉపాసకుడు సూక్ష్మదేహంతో ఉండి, ఉత్తమ శరరాలలోకి వెడుతుంటాడు. కనుక జీవుణ్ణి బ్రహ్మంలో చేర్చే అమానవ పురుషుడు లింగ శరీరమే అనడం సంగతంగా కనిపిస్తుంది. గ్రామానికిగాని, నగరానికిగాని బయలుదేరిన వాడు లోకంలో నువ్వు ఇక్కడ నుంచి ఆ పర్వతం దగ్గరకు వెళ్ళు, తరువాత మర్రిచెట్టు దగ్గరకు వెళ్ళు. తరువాత నది దగ్గరకు వెళ్ళు. అక్కడ నుంచి గ్రామం గాని నగరం కాని చేరుకుంటావు అని ఏ విధంగా ఉపదేశించబడతాడో, అట్లే ఆర్చిరాదిమార్గంలో లోకాల గురించి చెప్పబడింది. అవి మార్గ చిహ్నాలు. అవి ఆకాశ ప్రదేశప్రతీకలు మాత్రమే. ఆస్థలాలలో సూర్యరశ్మి ఆవరించి ఉంటుంది. ఆ వెలుగుమార్గంలోనే జీవాత్మ సూక్ష్మశరీరంతో దేశాంతరానికి వెడుతుంది. ఆత్మరశ్ముల్ని ఆశ్రయించి తాను వెళ్ళవలసిన ప్రదేశాన్ని చేరుతుందని శాస్త్రాలంటున్నాయి. సూక్ష్మ శరీరం జీవుడికి నిరంతరం వాహకం. సూర్యరశ్మికి తాత్కాలిక వాహనం అనవచ్చును. ఉపాసకుడికి నిర్దేశించిన గమ్యం ప్రకాశమానంగా ఉంటుంది. జీవుడు ఈ ప్రదేశాలను క్షణమాత్రంలో దాటి చేరుకుంటాడు. ఇవి భోగ భూములు కావు. విశ్రమించే స్థానాలు కావు. ఇతర ప్రాణులు పితృయాన మార్గంలో అంటే చీకటి మార్గంలో ప్రయాణిస్తారు.
సూత్రం :- 522
" ఉభయ వ్యామోహాత్తత్సిద్ధేః "
ఉభయ వ్యామోహత్:- రెండు రకాలైన మార్గ చిహ్నాల జ్ఞానం లేకపోవడం చేత, తత్ సిద్దే :- అర్చిరాదులు అతివాహకాలని సిద్ధిస్తోంది.
భావం :- రెండు రకాలైన మార్గచిహ్నాల జ్ఞానం లేకపోవడం చేత అర్చిరాదులు అతివాహకాలని సిద్ధిస్తోంది.
వివరణ:-మరణసమయంలో స్థూలశరీరాన్ని వదలి ఉపాసకుడు లోకాంతరాలకు వెళ్ళినప్పుడు, అతను వెళ్లే మార్గలన్నీ జడములు, అచేతనాలు. అందుచేత అవి వ్యామోహితీలు. వ్యామోహపదం వలన జీవుడు శరీరహీనుడు, మార్గజ్ఞానం లేనివాడని మహర్షి చెబుతున్నారు. సూక్ష్మశరీరాలు జడాలు కాబట్టి వాటికి సంకల్పంఉండదు. ఉపాసకుడు శరీరహీనుడు. మార్గజ్ఞానం లేనందున బ్రహ్మలోకం చేరలేడు. అర్చిరాదిమార్గంలో ఉన్న విద్వాంసునికి దేహం లేకపోవడం వలన ఇంద్రియాల సముదాయం ముద్దగా అయిపోయి, జీవుడు స్వయంగా ఏది చేయడానికి సమర్ధుడు కానందున అచేతనంగా ఉంటాడు. అర్చిరాదులు కూడా అచేతనాలే. అందుచేత అర్చిరాదుల అభిమానదేవతలు వారిని తమ యొక్క లోకాలకు తీసుకొని వెడతారు. అగ్నిస్వామిగా ఉన్న లోకానికి వెళ్లిన వాళ్ళను అగ్ని ముందుకు నడిపిస్తాడు. వాయువు స్వామిగా ఉన్న లోకానికి వెళ్లిన వాళ్ళను వాయువు ముందుకు నడిపిస్తాడు. ఈ దేవతలు అన్ని కాలాల యందు, అన్ని సమయాల యందు ఉంటారు. దక్షిణయాణం, రాత్రి పగలు ఎప్పుడైనా వారుంటారు.
సూత్రం :- 523
" వైద్యుతే నైవ తత స్తచ్చతేః "
తత్ శృతేః :- ఈ విషయంలో శాస్త్రాలు చెప్పడం వలన, తతః :- విద్యుత్తుకు తరువాత, వైద్యుతేన ఏవ :- విద్యుత్తు ఆవిర్భావం వల్లే ఉపాసకుడి ఆత్మ ముందుకు వెడుతుంది.
భావం :- ఈ విషయంలో శాస్త్రాలు చెప్పడం వలన విద్యుత్తుకు తరువాత, విద్యుత్తు ఆవిర్భావం వలనే ఉపాసకుడి ఆత్మ ముందుకు వెడుతుంది.
వివరణ:- ఉపాసకుడు స్థూలశరీరాన్ని విడిచి ఉత్క్రమించి, అర్చిరాదులమూలంగా విద్యుత్ లోకం చేరతాడు. ఉపాసనల ఫలితంగా సూక్ష్మశరీరం అర్చిరాదులను అనుసరిస్తూ ఉపాసకుణ్ణి బ్రహ్మంవరకు చేస్తుంది. దీనినే బ్రహ్మలోకప్రాప్తి అంటారు. పూర్వపక్షం వారి వాదన ఒకటుంది. బ్రహ్మ లోకం నుంచి అమానవ పురుషుడు అగ్ని లోకానికి వచ్చి, ఉపాసకుని సూక్ష్మ శరీరాన్ని బ్రహ్మలోకానికి తీసుకొని వెడతాడని చెప్పారు కదా! మధ్యలో వరుణ, ఇంద్ర, ప్రజాపతి లోకాలను ఎందుకు చెప్పారు? వారి అవసరం లేదు కనుక వారు అతివాహిక దేవతలు కారు అని విమర్శించారు. ప్రతిపక్షంవారు ఎంత సూక్ష్మంగా విమర్శిస్తే, సూత్రకారుడు అంత సూక్ష్మంగా సమాధానం చెప్పారు. అమానవపురుషుడు సూక్ష్మశరీరం తీసుకొని విద్యుత్లోకంనుండి బయలుదేరేటప్పుడు వరుణ, ఇంద్ర, ప్రజాపతి దేవతలు అమానవపురుషునికి సహాయకులుగా ఉండి, ముందులోకాలకు చేర్చుతారు. విద్యుత్తు, వరుణ ఇంద్ర, లోకాలు అర్చిరాది మార్గాలు, ఆ తరువాతవి దేవతా లోకాలు. దేవతా స్వరూపలైన అర్చిరాదులు అతివాహికలు అని యుక్తంగానే చెప్పబడింది. అర్చిరాదులలో అతివాహికలు మానవులు అని, విద్యుత్తు తరువాత మాత్రం అమానవ పురుషుడని చెప్పబడింది. కాని చివరకు వారందరు అర్చిరాద్యభిమాన దేవతలు అని చెప్పడం వలన వీళ్ళు కూడా అమానవులేనని చెప్పినట్లవుతుంది.
కార్యాధికరణం ( 4, 3, 7 )
సూత్రం :- 524
" కార్యం బాదరి రస్య గత్యుపపత్తేః "
అస్య గతి ఉపపత్తేః :- ఉపాసకుడి గతి నిర్ధారణ అయి ఉన్నది, కార్యం :- అతడి గతి కార్యబ్రహ్మమే అని, బాదరి :- బాదరి ఆచార్యుని అభిప్రాయం.
భావం :- ఉపాసకుడి గతి నిర్ధారణ అయి ఉన్నది. అతడి గతి కార్య బ్రహ్మమే అని బాదరి ఆచార్యుని అభిప్రాయం.
వివరణ:-దేవయానంద్వారా ఉపాసకుడు బ్రహ్మలోకం చేరతాడు కదా! ఒకచోట బ్రహ్మం అని, మరొక చోట బ్రహ్మ లోకం అని చెప్పారు. అక్కడ బ్రహ్మ అంటే పరబ్రహ్మా? లేక కార్య బ్రహ్మా? అని సంశయం కలుగుతుంది. అమానవపురుషుడు ఉపాసకుణ్ణి ముందుగా కార్యబ్రహ్మ దగ్గరకు చేరుస్తాడు. కార్యబ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ, అంటే సగుణబ్రహ్మ. పర బ్రహ్మ అంటే సర్వంతర్యామి, సర్వత్రావ్యాపకత్వం ఉన్నవాడు. ఈ తత్వాన్ని పొందడానికి ఉపాసకుడికి గతి అవసరం లేదు. ఇక్కడ ఉపాసకుడికి గతిని(మార్గాన్ని) వర్ణించారు కనుక ఇది ముఖ్యబ్రహ్మం కాదు. కార్య బ్రహ్మమేనని బాదరాయణుడి అభిప్రాయం. కార్యబ్రహ్మం అంటే ఒక విశేషప్రదేశం. ఉపాసకుడి ఆత్మ అక్కడకుచేరి, బ్రహ్మాన్ని పొందుతుంది. అనివార్యంగా ఉపాసకుడు ఆత్మ సాక్షాత్కారంతో బ్రహ్మప్రాప్తి పొందే ప్రదేశమే బ్రహ్మలోకం. ఛాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు లలో ఉపాసకుడి గతి బ్రహ్మలోకమనే చెప్పాయి. ఈ దేహంతో బ్రహ్మ సాక్షాత్కరించిన ఉపాసకుడి ఆత్మకు స్థూల సూక్ష్మ దేహాలు నశించి, శరీరం విడివడడంతోటే బ్రహ్మప్రాప్తి కలుగుతుంది. ఇక్కడ బ్రహ్మప్రాప్తి కలగని ఉపాసకుడు ఉత్క్రమించి, పొందే బ్రహ్మమే కార్య బ్రహ్మం అని బాదరాయణుని అభిప్రాయం.
సూత్రం :- 525
" విశేషితత్వా చ్చ "
" చ :- అలాగే, విశేషితత్వాత్ :- విశేషణాల వలన స్పష్టం చేసినందు చేత కార్యబ్రహ్మాన్నే ఉపాసకుడు చేరుకుంటాడని సూత్రానికి అర్ధం.
భావం :- ఉపాసకుడి గతి కార్యబ్రహ్మమేనని చెప్పబడింది. అలాగే విశేషణాల వలన స్పష్టం చేసినందువలన కార్య బ్రాహ్మన్నే ఉపాసకుడు చేరుకుంటాడని సూత్రార్ధం.
వివరణ:- ఇంకొక శ్రుతిలో కూడా ఉపాసకుడు ముందుగా సగుణ బ్రహ్మను చేరుకుంటాడని చెప్పబడింది.
బృహదారణ్యకోపనిషత్తు(6, 2, 15):- ఉపాసకఆత్మలు చాలాకాలం అక్కడ నివసిస్తారు. అక్కడ బ్రహ్మలోకానికి చాలా కాలం నివసించడం అనేవి విశేషణాలు. దీని వలన బ్రహ్మలోకాలు, అనే విశేషణం వలన అక్కడ ఉపాసకులు ఉండటం అనేవి తెలుస్తున్నాయి. 'బ్రహ్మ లోకాన్ 'అనడం లో వీటిలో చాలా లోకాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనిని బట్టి బ్రహ్మలోకాలకు ఒక అవధి, ఒక ప్రదేశం ఉన్నదని తెలుస్తోంది. బ్రహ్మప్రాప్తి అలాంటిది కాదు. బ్రహ్మను పొందిన ఆత్మ ఒక సీమితి. పరిమితం ప్రదేశంలో ఉండదు. బ్రహ్మానందం అనుభవిస్తూ సర్వత్రా విహరిస్తుంది. కనుక బ్రహ్మలోకాలు అనేకం ఉంటాయి కాని అవి బ్రహ్మ లోకాలు కావు. కార్యబ్రహ్మ విషయంలోనైతే కార్యబ్రహ్మలో ఉండే ఆయా అవస్థల భేదాన్ని బట్టి బహువచనంలో చెప్పబడింది. కాని అవి బ్రహ్మం కావు. బ్రహ్మ సృష్టించిన లోకాలు. అక్కడ కొంత కాలం ఉండి పిదప నిర్బాధగా బ్రహ్మాన్ని పొందుతాడు. కనుక బ్రహ్మలోకాలు అంటే కార్య బ్రహ్మo అని బాదరి అభిప్రాయపడటం సమంజసమే. పరబ్రహ్మ స్త్రీ, పురుష లింగ భేదం లేనివాడు, సర్వంతర్యామి, సర్వవ్యాపి, సృష్టి స్థితి లయలకు అధిపతి ఆయనే. కార్య బ్రహ్మగా సృష్టి కార్యక్రమం నిర్వహిస్తాడు. ఆయనే స్థితి కారకుడు విష్ణువు, లయం చేసేటప్పుడు లయకారకుడుగా శివుడు అని తెలియజేయబడింది. ఉన్నది పరబ్రహ్మ మొక్కటే , రెండవది లేదు అని గ్రహించాలి.
సూత్రం :- 526
" సామీప్యాత్తు తత్వ్యపదేశః "
సామీప్యాత్ తు :- సామీప్యం వలన, తత్ వ్యపదేశః :- ఆ పదం ఉపదేశిస్తుంది.
భావం :- సామీప్యం వలన బ్రహ్మపదం బ్రహ్మ సామీప్యాన్ని ఉపదేశిస్తుందని సూత్రార్ధం.
వివరణ:-సామీప్యాన్ని బట్టి అయితే కార్యబ్రహ్మకూడా బ్రహ్మ అని చెప్పబడుచున్నది. తు శబ్దం అశంకను నివర్తింప జేయడం కోసం, అపర బ్రహ్మకు సమీపంగా ఉండటం వలన దాని విషయంలో కూడా బ్రహ్మ శబ్ద ప్రయోగం విరుద్ధం కాదు.
ఉపాసన కోసం మనోమయత్వాది గుణాలతో కూడినదిగా చెప్పబడే నిర్వికారబ్రహ్మమే కార్యబ్రహ్మము. అందుచేతనే సగుణ బ్రహ్మను కూడా బ్రహ్మమనే అంటారు. బ్రహ్మం అందరికీ సమీపంలో ఉండే తత్త్వం. కాని అందరూ బ్రహ్మసమీపంలో ఉండరు. అజ్ఞానంతో కూడిన జీవుడు బ్రహ్మానికి దూరం అవుతాడు. ఒక వస్తువు దగ్గరలో ఉందని తెలియనప్పుడు అది దూరంగా ఉన్నట్లే అనిపిస్తుంది. ఉపాసకుడు పూర్ణంగా విరక్తుడైన స్థితిలోనే బ్రహ్మసామీప్యాన్ని గుర్తించి బ్రహ్మాన్ని పొందుతాడు. ఇక్కడ బ్రహ్మపదం బ్రహ్మసామీప్యాన్ని, కార్యబ్రహ్మాన్ని బోధిస్తుంది. దేవయాన మార్గంలో పయనించిన వాళ్లకు ఆవృత్తి లేదని చెబుతున్నది. బ్రహ్మం అందరికీ సమీపంలో ఉండే తత్త్వం.
సూత్రం :- 527
" కార్యాత్యయే తదధ్యక్షేణ సహాత్ః పరమభిధానాత్ "
అతః పరమ్ :- కార్యబ్రహ్మం తరువాత, అభిధానాత్ :- బ్రహ్మాన్ని పొందుతాడని చెప్పారు. అందువలన, కార్యా త్యయే :- కార్యబ్రహ్మ లోకాన్ని దాటిన తరువాత, తత్ అధ్యక్షేణ సహ :- ఆ లోకాలకు అధ్యక్షుడైన బ్రహ్మాన్ని చేరతాడు.
భావం :- కార్యబ్రహ్మాన్ని పొందిన ఉపాసకుడు బ్రహ్మాన్ని ఎప్పుడు పొందుతాడు అంటే కార్య బ్రహ్మం తరువాత బ్రహ్మాన్ని పొందుతాడని చెప్పారు. కార్య బ్రహ్మ లోకాన్ని దాటిన తరువాత ఆ లోకాలకు అధ్యక్షుడైన బ్రహ్మాన్ని చేరతాడు.
వివరణ:-కార్యబ్రహ్మకు కల్పాంతమునందు ప్రళయం సంభవించినప్పుడు, బ్రహ్మఆయుర్దాయం పూర్తైన తరువాత, ఆ కార్యబ్రహ్మ పరబ్రహ్మంలో లీనంఅవుతాడు. ఆ బ్రహ్మతోబాటే బ్రహ్మలోకం చేరిన జ్ఞానులుకూడా పరబ్రహ్మలో లీనం అవుతారు. అదే క్రమముక్తి.
బృహదారణ్యాకోపనిషత్తు(4, 4, 8):-ధ్యానశీలులైన బ్రహ్మజ్ఞానులు స్వర్గలోకం అంటే కార్యబ్రహ్మ లోకం పొంది, పిదప విముక్తులై బ్రహ్మాన్ని పొందుతారు.
ప్రశ్నోపనిషత్తు(5, ):-అతణ్ణి సామాలు బ్రహ్మలోకానికి చేరుస్తాయి. అప్పుడు అతను ప్రకృతికన్నా సూక్ష్మమైన, జీవ ఘనమైన, తన స్వరూపంకన్నా సూక్ష్మమైన, సర్వలోకవ్యాప్తమైన ఈశ్వరుణ్ణి సాక్షాత్కారం చేసుకుంటాడు. అదే బ్రహ్మ సాక్షాత్కారం.
తైత్తరీయోపనిషత్తు(2, 1):- బ్రహ్మజ్ఞాని పరాన్ని, బ్రహ్మదర్శనాన్ని పొందుతాడు. అదే మోక్షం. సామం అంటే త్రిమాత్రిక. ఓంకారరూప బ్రహ్మాన్ని ధ్యానించడం, ఓంకారం ఈశ్వరుడి సర్వోత్తమ నామం. ఉపాసనకు ఓం సర్వ శ్రేష్ఠ సాధనం. అలాంటి ఉపాసనకు ఫలం బ్రహ్మలోకప్రాప్తి. బ్రహ్మోపాసకుడు కార్యబ్రహ్మలోకాన్ని చేరి, నిరంతరం బ్రహ్మనిష్ఠుడై, బ్రహ్మాన్ని ఉపాసిస్తూ, కార్య బ్రహ్మ లోకంలో సుఖానుభావం పూర్తి కావడం తోటే, సర్వ లోకాధ్యక్షుడై బ్రహ్మాన్ని చేరతారు. ఇక్కడ పూర్వపక్షంవారి వాదన ఒకటుంది. కార్యబ్రహ్మ కల్పాంతంలో పరబ్రహ్మలో లీనం అవుతాడు కదా! అనిత్యమైన కార్యబ్రహ్మ క్రమముక్తిని ఇస్తున్నాడు కాని శాశ్వతమైన ముక్తిని ఇవ్వలేదు కదా? సగుణోపాసకులు వారి సాధనలో కృతకృత్యు లైనప్పుడు దేవయానమార్గంలోనే ముందుగా కార్యబ్రహ్మనే చేరుతారు. ప్రళయం సంభవించినప్పుడు కార్యబ్రహ్మతో బాటే కల్పాంతంలో పరబ్రహ్మలో లీనమౌతారు. ఒక్కొక్క కల్పంలో ఒక్కక్కరు బ్రహ్మగా అవతరిస్తారు.
సూత్రం :- 528
" స్మృతేశ్చ "
స్మృతేశ్చ:-స్మృతుల ప్రమాణం వలన కూడా ఉపాసకుడు కార్యబ్రహ్మ లోకాన్ని దాటి పరబ్రహ్మాన్ని చేరాతాడని తెలుస్తోంది.
భావం :- స్మృతులు ప్రమాణం వలన కూడా ఉపాసకుడు కార్యబ్రహ్మ లోకాన్ని చేరి,పరబ్రహ్మాన్ని చేరతాడని తెలుస్తోంది.
వివరణ:-బ్రహ్మలోకం చేరిన ఉపాసకులు ఆత్మజ్ఞానం పొంది, కల్పాంతంవరకు బ్రహ్మలోకంలో కార్యబ్రహ్మవద్దనే ఉండి, కల్పాంతమున, ఆబ్రహ్మతో కలసి పరబ్రహ్మలో చేరి పరమపదాన్ని పొందుతారు. ఈవిషయాన్ని స్మృతికూడా అంగీకరిస్తున్నది. కార్యబ్రహ్మకు మాత్రమే సంబంధించిన గతి శ్రుతులలో కూడా వినబడుచున్నది.
సూత్రం :- 529
" పరం జైమినిః ముఖ్యత్వాత్ "
ముఖ్యత్వాత్ :- ముఖ్యార్ధంలో ప్రయోగించడం వలన ఉపాసకుడు అర్చిరాది మార్గంలో, పరం :- పరబ్రహ్మలో చేరతాడని, జైమినిః :- జైమిని ఆచార్యుడు పేర్కొన్నాడు.
భావం :- బ్రహ్మ అంటే పరబ్రహ్మ అనే ముఖ్యార్ధoలో ప్రయోగించడం వలన ఉపాసకుడు అర్చిరాది మార్గంలో పర బ్రహ్మలో చేరతాడని జైమిని ఆచార్యుడు పేర్కొన్నాడు.
వివరణ:-ఈకార్యాధికరణంలో 4-3-7నుంచి 4-3-11వరకు తన సిద్ధాంతసూత్రాలలో సగుణోపాసకుడు దేవయాన మార్గంలో కార్యబ్రహ్మను చేరడం, కల్పాంతంలో పరబ్రహ్మలో పరమపదం చెందడం, స్మృతులు కూడా ఈ విషయాన్నీ అంగీకరించడం, గతి, గమనం, లోకాలు మొదలైన పదాలు కార్యబ్రహ్మకు సంబంధించినవేనని, పరబ్రహ్మకు కాదని బాదరాయణుడి అభిప్రాయం. 4-3-12నుంచి 14వరకు పూర్వపక్షంవారి అభిప్రాయాలను బాదరాయణుడే సూత్రాలరూపంలో తెలియజేస్తున్నారు.
ఛాందోగ్యోపనిషత్తు ( 4, 15, 6 ) :- " స ఏనాన్ బ్రహ్మ గమయతి " అతడు వీళ్ళని బ్రహ్మనికి చేరుస్తాడు. ఇక్కడ బ్రహ్మం అంటే ముఖ్యార్ధం పరబ్రహ్మం. కనుక ఉపాసకుడు దేవయాన మార్గంలో బ్రహ్మాన్ని చేరతాడు. కార్యబ్రహ్మాన్ని కాదు. బ్రహ్మ శబ్దానికి ముఖ్యమైన ఆలంబనం పరబ్రహ్మ కనుక ఇక్కడ గతి పరబ్రహ్మేనని జైమిని అభిప్రాయపడుతున్నాడు.
సూత్రం :- 530
" దర్శనాచ్చ "
చ :- పైగా, దర్శనాత్ :- శాస్త్రాల్లో పరబ్రహ్మం విషయంలోనే బ్రహ్మ పదాన్ని ప్రయోగించడం ఉపాసకుడు పరబ్రహ్మనే చేరతాడని సూత్రార్ధం.
భావం :- శాస్త్రాల్లో పరబ్రహ్మం విషయంలోనే బ్రహ్మ పదాన్ని ప్రయోగించడం, ఉపాసకుడు పరబ్రహ్మనే చేరతాడు, కాని కార్యబ్రహ్మని కాదు.
వివరణ:- ఇది పూర్వపక్షసూత్రం. బ్రహ్మనాడి ద్వారా వెళ్లిన ఉపాసకుడు ముక్తిని పొందుతాడు. అంటే అమృతత్త్వాన్ని పొందుతాడని వేదం చెబుతోంది. అమృతత్త్వమనేది పరబ్రహ్మం వలనే సంభవం. కార్యబ్రహ్మకు అమృతత్త్వాన్నిచ్చే శక్తి లేదు. కాబట్టి ఇక్కడ బ్రహ్మ అంటే పరబ్రహ్మే అని గ్రహించాలి.
తైత్తరీయోపనిషత్తు ( 2, 1 ) :- ఉపనిషత్తు పరబ్రహ్మాన్ని సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని వర్ణించాయి. సత్ శబ్దానికి అర్ధం ఈ సృష్టికి పూర్వం పరబ్రహ్మ ఒక్కడే ఉన్నాడు. సత్తు కాని అసత్తు కాని వాటికీ కారణలు కాని ఏమి లేవు. సృష్టిలో అన్ని నశించిపోయినా మిగిలి ఉండేవాడు, ఎల్లప్పుడూ ఒక్కడే ఉండేవాడు పరబ్రహమే అనేది సత్యం.జ్ఞాయతే ఇతి జ్ఞానం తెలిసేది కనుక జ్ఞానం. పరమాత్మకు సంబంధించిన నిజమైన జ్ఞానం వేదముల వలన తెలుస్తుంది. ఆయనే సర్వజ్ణుడు. "అంతం న విద్యతే ఇతి అనంతం " దేనికి అంతం లేదో, తెలియదో, అది అనంతం. బ్రహ్మనికి మొదలు కాని, చివర కాని లేవు. అందువలనే బ్రహ్మం అనాది, అనంతo అని చెప్పబడింది. ఈవాక్యాల్లో అంతటా బ్రహ్మపదం పరబ్రహ్మనే తెలుపుతూ, ముఖ్యార్థంగా ప్రయోహించడం వలన, బ్రహ్మఅంటే పరబ్రహ్మమేనని, కార్యబ్రహ్మ కాదని పూర్వపక్ష వాదన.
సూత్ర:-531
"న చ కార్యే ప్రతి పత్త్యభి సంధిః "
కార్యే :- కార్యబ్రహ్మంలో, ప్రతిపత్తి అభిసంధిః :- ఉపాసకుడు చేరతాడనే విషయం, న చ :- లేనే లేదు.
భావం :- కార్య బ్రహ్మంలో ఉపాసకుడు చేరతాడనే విషయం లేనే లేదు.
వివరణ:-ఇది పూర్వపక్షసూత్రం. సగుణోపాసకులకు బ్రహ్మలోకమేప్రాప్తి. ఇక్కడ బ్రహ్మఅంటే పరబ్రహ్మమే కాని కార్యబ్రహ్మ కాదని వారి వాదన. ఏ శాస్త్రంలో ఉపాసకుడు కార్యబ్రహ్మను చేరతాడనే విషయం లేదు. బ్రహ్మ పదం ముఖ్యార్థం పరబ్రహ్మమేనని తెలుపుతోంది.
ఛాందోగ్యోపనిషత్తు(8, 13, 1):-"అకృతం కృతాత్మా బ్రహ్మలోక మభిసంభవామీతి " నేను కృతకృత్యుడనై అకృతబ్రహ్మలోకానికి చేరుతున్నానని ఉపాసకుడు అంటున్నాడు. ఇక్కడ బ్రహ్మలోకానికి ముందు అకృత అనే విశేషణం ఉన్నందున అది బ్రహ్మదర్శనం అనే అర్ధం వస్తుంది. "ప్రజాపతేః.... ప్రపద్యే " ప్రజాపతి యొక్క సభాగృహాన్ని ప్రవేశస్తారు అనేది కార్యబ్రహ్మను పొందడానికి సంకల్పం కాదు. 'నామ రూపయో బ్రహ్మ' అని కార్యబ్రహ్మకంటే విలక్షణమైన పరబ్రహ్మయే ఇక్కడ చెప్పబడుతోంది. పరమాత్మకు యశః అంటే పరమాత్మకే యశస్సు అనే ప్రసిద్ధి ఉండటం వలన కూడా అది పరబ్రహ్మమే అని, గతి శ్రుతులు పరమాత్మను పొందాలనే విషయాన్ని తెలియజేస్తాయి. సగుణోపాసకుడు, ఆత్మ జ్ఞాన సంపన్నుడైనప్పుడు అతనికి పరబ్రహ్మే గతి. గత్యుపపత్త్యాదులచేత ఒక పక్షం, ముఖ్యత్వాది హేతువుల చేత మరొక పక్షం, ఈ విధంగా రెండు పక్షాలు ఆచార్యునిచేత సూత్రీకరించబడ్డాయి. కేవలం బుద్ధిని వికసింపజేయడం కోసం, సిద్ధాంత సూత్రాలపై నమ్మకం, గ్రహణ శక్తి, జ్ఞాన శక్తి కలిగి ఉండటం కోసమే ఈ సూత్రాలు చెప్పబడ్డాయి.
అప్రీతికాలంబనాధికరణం ( 4, 3, 15 )
సూత్రం :- 532
"అప్రతీకాలంబానా న్నయతీతి బాదరాయణ ఉభయధా దోషాత్తత్ క్రతుశ్చ "
అప్రతీక ఆలంబనాన్ :- సూర్యాది ప్రాకృతిక పదార్ధాలను ఆలంబనంగా చేసుకొని ఉపాసకులను, నయతి :- తీసుకొని వెడుతుంది. ఇతి :- అని, బాదరాయణః :- సూత్రకారుడైన వ్యాసుని మతం, ఉభయధా :- రెండు ప్రకారాలుగా, అదోషాత్ :- దోషం లేదు. కనుక తత్ క్రతుః :- ఇందులో బ్రహ్మ ప్రాప్తికి సంకల్పమే ప్రధానం, చ :- అంతే కాక, కార్య బ్రహ్మాన్ని ప్రాప్తించడం కూడా సరియైనదే.
భావం :- సూర్యాది ప్రాకృతిక పదార్ధాలను ఆలంబనంగా చేసుకొని, ఉపాసకులను తీసుకొని వెడుతుందని సూత్రకారుడైన వ్యాసుని మతం. రెండూ ప్రకారాలుగా దోషం లేదు. ఇందులో బ్రహ్మ ప్రాప్తికి సంకల్పమే ప్రధానం. కార్య బ్రహ్మం ప్రాప్తించడం కూడా సరియైనదే.
వివరణ:- ఉపాసకులంతా బ్రహ్మలోకం చేరుతారా? లేక వారిలో కొందరినే దివ్యపురుషుడు బ్రహ్మలోకానికి తీసుకొని వెడతాడా? అని సందేహం. జ్ఞానులైన వారందరిని ఆదివ్యపురుషుడు బ్రహ్మలోకం చేరుస్తాడు. ఏఉపాసన చేస్తే ఆఫలం లభిస్తుంది. పంచాగ్ని విద్య, దహర విద్య , వైశ్వానర విద్య మొదలైనవి ఉపాసించిన వారు బ్రహ్మలోకం చేరతారు. ప్రతీకోపాసకులు కాకుండా మిగిలిన వారంతా బ్రహ్మోపాసకులే వారు బ్రహ్మలోకం చేరటంలో సందేహం లేదు. ప్రతీకోపాసకులు నామము, వాక్కు, మనస్సు మొదలైన వాటిని ఉపాసిస్తారు. వాటిలో బ్రహ్మోపాసన లేదు. కనుక వారికి బ్రహ్మలోక ప్రాప్తి లేదు. కాని ప్రతీకాలను ఆలంబనంగా చేసుకొని సాక్షాత్ ఆనందస్వరూపబ్రహ్మాన్ని ఉపాసించే ఉపాసకులకు అమానవుడు దేవయాన మార్గంలో బ్రహ్మం వరకు చేరుస్తాడని, వారికీ బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందని వ్యాసుని అభిప్రాయం. బ్రహ్మోపాసనం సమర్ధమైన హేతువు అని అంగీకరించాలి. దానిని ఏ విధంగా సేవిస్తారో అదే అవుతుంది. బ్రహ్మను ఉపాసించిన వాడే బ్రహ్మకు సంబంధించిన ఐశ్వర్యాన్ని పొందుతాడు. ప్రతీకోపాసనలో బ్రహ్మక్రతుత్వం లేదు కనుక బ్రహ్మ అప్రధానంగా ఉంటుంది. బ్రహ్మ క్రతువు కానివాడు కూడా బ్రహ్మను పొందుతాడు అని చెప్పబడింది కదా! అని సందేహం. బ్రహ్మ క్రతువు కాని దానిని చెప్పిన చోట, ఉపాసకుడు దేనిని ధ్యానిస్తాడో, అతడు దానిని పొందుతాడు. కార్యబ్రహ్మ విషయకమైన ఉపాసన చేసినవాడే బ్రహ్మలోకం చేరతాడు.
సూత్రం :- 533
"విశేషం చ దర్శయతి "
విశేషం చ :- ప్రతీకాలను ఆలంబనంగా తీసుకొని ఉపాసించే వాళ్ల కన్నా, అప్రతీక బ్రహ్మోపాసకులకు విశేష ఫలం కలుగుతుందని, దర్శయతి :- శాస్త్ర ప్రమాణాలంటున్నాయి.
భావం :- ప్రతీకాలను ఆలంబనంగా తీసుకొని ఉపాసించే వాళ్ళ కన్నా, అప్రతీక బ్రహ్మోపాసకులకు విశేష ఫలం కలుగుతుందని శాస్త్ర ప్రమాణాలంటున్నాయి.
వివరణ:-అప్రతీకోపాసకులకు సాక్షాత్ బ్రహ్మప్రాప్తిరూప విశేషఫలం కలుగుతుందని ఛాందోగ్యం(5, 10, 2) లోను, బృహదారణ్యకం(6, 2, 15)లోను చెప్పబడింది. వారే అర్చిరాది దేవయానమార్గంలో బ్రహ్మాన్ని చేరతారనే విషయం నిశ్చయమైనది. ప్రాకృతిక పదార్ధాలను ఉపాసనకు ప్రతీకాలుగా గ్రహించకూడదని 4- 1-4 సూత్రంలో తెలియజేశారు. ప్రతీకలో బ్రహ్మభావన చేయడం, వాటిని బ్రహ్మఅని ఉపాసించకూడదు. ఒక ప్రతిమను ఇష్టదైవంగా భావించి ధ్యానం చెయ్యడాన్ని ప్రతీకోపాసన అంటారు. అవి బ్రహ్మ పదార్ధాలు అయినప్పటికీ, వాటిలో చేతనతత్త్వాలు లేవు. ఛాందోగ్యంలో మనస్సే బ్రహ్మ, ఆదిత్యుడే బ్రహ్మ, నామమే బ్రహ్మ అని ఉపాసించాలి. ఇవన్నీ పరమేశ్వరుడు సృష్టించినప్పటికీ, బ్రహ్మత్వదృష్టిలో ఏకత్వం ఉన్నప్పటికీ వాటిలో బ్రహ్మబుద్ధి పనికి రాదు. ఎందుకంటే ఉపాసకులూ ప్రతీకస్వరూపులు కారు. నేనే ప్రతీకాన్ని అని ఉపాసించలేరు. సనత్కుమారుడు నారదునికి ఆత్మజ్ఞానం బోధిస్తూ ప్రతీకోపాసన గురించి, ఫలవిశేషం గురించి వివరిస్తాడు. నామాన్ని బ్రహ్మగా ఉపాసిస్తే దాని ప్రభావం కొంతకాలమే ఉంటుంది. నామంకన్నా వాక్కు గొప్పది. వాక్కుకన్నా మనస్సు గొప్పది. ఫలవిశేషాన్ని బట్టి వాటిని ఉపాసించినప్పుడు ఒకదాని కన్నా మరొకటి ఎక్కువకాలం ప్రసరించడం వలన వారు ఫలితాన్ని బట్టి అవి ప్రసరించినంత వరకు స్వేచ్ఛగా విహరిస్తారు. కాని వారికీ బ్రహ్మలోకప్రాప్తి ఉండదని తెలియజేశాడు.
చతుర్ధ పాదం
సంపద్యావిర్భావాధికరణము ( 4, 4, 1 )
సూత్రం :- 534
"సంపద్యావిర్భావః స్వేన శబ్దాత్ "
స్వేన శబ్దాత్ :- ఛాందోగ్యంలో ఉన్న స్వేన పద ప్రయోగం శబ్ద ప్రమాణం వలన, సంపద్య :- బ్రహ్మాన్ని పొంది, ఆవిర్భావః :- తన స్వరూపంలో ఉండి ఆనందాన్ని అనుభవిస్తాడు.
భావం :- ఛాందోగ్యంలో ఉన్న స్వేన పద ప్రయోగం శబ్ద ప్రమాణం వలన బ్రహ్మాన్ని పొంది తన స్వరూపంలో ఉండి ఆనందాన్ని అనుభవిస్తాడు.
వివరణ:-ఈఅధికరణంలో ముక్తపురుషుడు స్వరూపంలో ఉంటాడని చెప్పబడింది.
ఛాందోగ్యోపనిషత్తు(8, 12, 3):- బ్రహ్మసాక్షాత్కారం పొందిన జీవుడు ఈశరీరం నుండి విడివడి, పరంజ్యోతి అయిన బ్రహ్మాన్నిపొంది, తన రూపంలో ఉంటాడు. అప్పుడు కైవల్యం ప్రకటమతుంది. ఇక్కడ స్వేన రూపేణా అనడం వలన జీవాత్మ సంసారదశలో ఉన్నప్పుడు అతణ్ణి స్థూల, సూక్ష్మ శరీరాలు ఆవరించి ఉంటాయి. అతను రాగద్వేషాలకు వశుడై ఉంటాడు. బ్రహ్మసాక్షాత్కారం పొందిన తరువాత ఆ శరీర బంధనాల నుంచి విడిపోయి, తనస్వరూపంలో తాను ఉంటాడని స్పష్టమౌతోంది. ఇలా బంధనాల నుంచి విముక్తుడు కావడం వలన జీవుడు స్వస్వరూపంలో బ్రహ్మంలో ఉంటాడు. గురువు గారు! జీవుడు శరీరాన్ని వదలి పరబ్రహ్మను పొంది స్వరూపంలో నిలుస్తాడు అని ఛాందోగ్యం లో చెప్పబడింది కదా! ముక్తి అంటే స్వర్గంలా ఉంటుందా? స్వర్గంపొందిన వారు సుఖాలనుభవించి ఉత్తరజన్మలు ఎత్తుతారు. అలాగే ఈ ముక్తుడుకూడా ఏదైనా ఆధిక్యాన్ని పొందుతాడా? లేక స్వస్వరూపంలోనే ఉంటాడా? అని అడిగాడు కృష్ణశర్మ. జీవుడు తానైన రూపంలో ఉండటమే ముక్తి. అదే స్వరూపస్థితి. అజ్ఞానం తొలగి పోగానే స్వస్వరూపం తెలుస్తుంది. ప్రకాశరూపమైన ఆత్మసాక్షాత్కారం పొంది, ఆ ఆత్మరూపంలో విద్వాంసుడు ఆవిర్భూతుడౌతాడు. ముక్తి అనేది పుట్టదు అని సమాధానం చెప్పాడు. స్వశబ్దం వలన ముక్తి పొందినవాడు స్వస్వరూపం, చైతన్యరూపంలో ఉంటాడు. అదే స్వస్వరూప స్థితి. జీవుడు తనలోని అజ్ఞానాన్ని తొలగించుకొని, ఆత్మజ్ఞానంతో సూక్ష్మాతి సూక్ష్మమైన ఆత్మను సాక్షాత్కరించుకొని, ముక్తిలోనే జీవాత్మ స్వస్వరూపంలో ఉంటాడు. ఈ స్థితికోసం ఎక్కడికి వెళ్లనవసరం లేదు.
సూత్రం :- 535
"ముక్తః ప్రతిజ్ఞానాత్ "
ప్రతిజ్ఞానాత్ :- శాస్త్రo ఘోషించడం వలన, ముక్తః :- ముక్తుడైన వాడి స్వరూపం తెలుసుకోవచ్చును.
భావం :- శాస్త్రం ఘోషించడం వలన ముక్తుడైనవాడి స్వరూపం తెలుసుకోవచ్చును.
వివరణ:-ముక్తిపొందిన పురుషుడు పూర్ణానంద స్వరూపంలో ఉండిపోతాడు. జీవుడు సంసార దశలో అవిద్యలో బంధించబడి, ఆత్మజ్ఞానం కలిగిన తరువాత శుద్ధుడు, ముక్తుడు అవుతాడు.
ఛాందోగ్యోపనిషత్తు(8,7,1):-ఈశుద్దాత్మ జరామృత్యువులు, ఆకలిదప్పులు అనే దుఃఖాలనుంచి దూరుడై, సత్యకాముడు, సత్య సంకల్పుడై ఉంటాడు. అలాంటి ఆత్మను అన్వేషించాలి. ఇది ఆత్మకు సంసారిక వ్యవస్థారహితమైన రూపం. ఈసంసారావస్థలో జీవాత్మ స్థూల, సూక్ష్మ శరీరాలతో ఉండి ప్రియా ప్రియములతో, ఆకలి దప్పికలతోను, రాగద్వేషాలతోను వికృతుడై, వాటికి వశమై ఉంటాడు. ఇది జీవాత్మ స్వస్వరూపం కాదు. ముక్తిలోనే జీవాత్మ స్వస్వరూపంలో ఉంటాడు. ఈవిషయాన్ని తెలిపే ప్రజాపతి వాక్యం ఒకటున్నది. ఛాందోగ్యోపనిషత్తు(8, 12, 3):- ఆ ఆత్మను తెలుసుకొని, ఆత్మజ్ఞానం ఆధారంగా బ్రహ్మసాక్షాత్కారం పొంది, ఆత్మ ఈ శరీరం నుంచి వెలువడి, పరంజ్యోతిని పొంది తన కైవల్య రూపంలో ప్రకటమౌతుంది. ఏది పరంజ్యోతో అదే ఉత్తమ పురుషుడు. అతడితో జీవాత్మ తన స్వస్వరూపంతో ప్రవేశిస్తుంది. ఇలా ఆత్మ పురుషుణ్ణి పొందడమే మోక్షం.
ముండకోపనిషత్తు(3,2,8):-ఆత్మ బ్రహ్మాన్ని సాక్షాత్కారం చేసుకున్నప్పుడు నామరూపాలను పోగొట్టు కొని, పరాత్పరుడైన పరమేశ్వరుణ్ణి పొందుతుంది. ప్రకృతి కన్నా జీవాత్మ పరం అంటే సూక్ష్మం. జీవాత్మ కన్నా పరమాత్మ పరం. ఆయన పరాత్పరుడు అంటే సూక్ష్మాతిసూక్ష్ముడు. అలాంటి పరమాత్మను పొందడమే ఆత్మకు ముక్తావస్థ. కైవల్య రూపంలో ఉండటం. పూర్వావస్థలోను, ఇప్పుడు కూడా స్వరూపం మారనప్పుడు, ఒకటే అయినప్పుడు విశేషం ఏమిటనే సందేహానికి సమాధానం చెప్పబడింది. ఇప్పుడు అతను ముక్తుడు. సర్వబంధాలనుండి విముక్తుడై శుద్ధ ఆత్మస్వరూపంలో ఉంటాడు. వెనుకటి అవస్థలలో జాగ్రదావస్థలో ఇంద్రియధర్మాలను తనపై ఆరోపించుకొని, స్థూల శరీరం గురించి అహంకారం కలిగివుంటాడు. అజ్ఞానంతో తాను ఆత్మ చైతన్యరూపమని తెలుసుకోలేక అంధుదౌతాడు. స్వప్నావస్థలో అలసి నిద్రించినప్పుడు, ఇంద్రియాలు నిశ్శబ్దంగా మనస్సులో లీనమై ఉంటాయి. కోరికలు అణచి వేయబడిన రాగద్వేషాల గురించి ఆలోచిస్తూ వాటిని స్వప్నంలో అనుభవిస్తాడు. సుషుప్తిలో స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు(అవిద్య) ఈ అవస్థలో ఉండవు. అందుకే ఏమి తెలియని స్థితిలో ఉంటాడు. ఈ విధంగా అవస్థాత్రయ కలుషితమైన స్వరూపంలో ఉంటాడు. అంతవరకుఉన్న బంధం తొలగిపోగానే మోక్షం అనే ఫలం లభిస్తుందని చెప్పారు. కాని వాస్తవంగా క్రొత్తగా ఏదో లభించడం వలన వచ్చిన ముక్తి కాదు. అది జీవన్ముక్తస్థితి. రోగం పోగానే ఆరోగ్యవంతుడైనట్లుగా, అజ్ఞానం తొలగి పోగానే ముక్తి లభిస్తుందని చెప్పడం కూడా అటువంటిదే.
సూత్రం :- 536
"ఆత్మ ప్రకరణాత్ "
ప్రకరణాత్.. ప్రకరణాన్ని బట్టి, ఆత్మా :- ఆత్మనే గ్రహించాలి.
భావం :- ఛాందోగ్యం ( 8, 12, 3 ) చెప్పినట్లుగా తన రూపంలో ప్రకటం కావటం అంటే సంప్రసాదం అన్నారు. అదొక అవస్థ కదా! దానిని ఎలా తెలుసుకోవాలి అంటే ప్రకరణాన్ని బట్టి ఆత్మనే గ్రహించాలి.
వివరణ:-ప్రకరణాన్నిబట్టి జ్యోతి అంటే ఆత్మ అనే అర్ధమే కాని భౌతికమైన వెలుగు కాదు. ఇది ఆత్మను గురించి చెప్పే ప్రకరణం. దానిని దేవతలు జ్యోతిగానే చూస్తారని చెప్పబడింది. ముక్త పురుషుడు ఆ స్వస్వరూపంలోనే అంటే ఆత్మ రూపంలోనే ఉంటాడు.
ఛాందోగ్యోపనిషత్తు(8,7,1):-ఆత్మప్రకరణం ప్రారంభమవుతుంది. ఈశరీరం నాశనంలేని ఆత్మకు అధిష్టాన మని చెప్పి, ఈశరీరంతో ఉన్నప్పుడు జీవుడికి ప్రియాప్రియములు కలుగుతాయి. శరీరంతో సంబంధం విడిపోయినప్పుడు సుఖదుఃఖాలుండవు. అలాంటి అవస్థను లక్యంగా ఉంచుకొని "ఏష సంప్రసాదో అస్మాత్ శరీరాత్" అని చెప్పినందుకు ఈప్రకరణాన్ని బట్టి సంప్రసాద శబ్దం ఆత్మ వాచకమని తెలుస్తోంది. ఆత్మ జ్ఞానం ఉన్నవాడు పరంజ్యోతిని చేరుకుంటాడు అని శ్రుతివాక్యం. జీవుడిగా పాపప్రక్షాళనం చేసుకొని జరామరణములు లేని ఆత్మస్వరూపంలో ఆత్మజ్ఞాని పరంజ్యోతిని చేరుకుంటాడు. స్వప్నంలో ఏదేహం సృష్టించుకుంటాడో, అదేవిధంగా స్వర్గంలో భావనాత్మాకమైన రూపాన్నిధరించి, నిర్గుణ పరబ్రహ్మ లో ఐక్యం చెంది, బ్రహ్మానందాన్ని అనుభవిస్తారు.
సూత్రం :- 537
” అవిభాగేన దృష్టత్వాత్ "
దృష్టత్వాత్:-శాస్త్రాలను పరిశీలిస్తే, అవిభాగేన:-ఆత్మ పరంజ్యోతినిచేరి, అవిభక్తంగాఉంటుందని తెలుస్తోంది.
భావం :- శాస్త్రాలను పరిశీలిస్తే, ఆత్మ పరంజ్యోతిని చేరి, అవిభక్తంగా ఉంటుందని తెలుస్తోంది.
వివరణ:-ఈప్రకరణంలో ముక్తునికి, పరబ్రహ్మకు తేడాలేదని తెలియజేస్తున్నారు. జీవుడు పరబ్రహ్మను పొందడం అంటే ఏమిటి? రాముడు ఊరు విడిచిపెట్టి, వేరేగా ఉండటం లాంటిదా? లేక నది సముద్రాన్ని చేరి, అవిభక్తంగా ఉండటం లాంటిదా? అని సందేహం. దీనికి వ్యాసమహర్షి సప్రమాణంగా సమాధానం ఇస్తున్నారు. వేదం ముక్తపురుషునికి, బ్రహ్మకు భేదంలేదని, ముక్తపురుషుడు బ్రహ్మతో అవిభక్త రూపంలో ఉండి, విడదీయడానికి వీలులేని విధంగా నిరతిశయానంద స్వరూపంగా ఉంటాడని చెప్పింది. "అహం బ్రహ్మ్మాస్మి" ముక్త పురుషుడు పరమాత్మయే.
ముండకోపనిషత్తు(3, 2, 8):- ప్రవహించుచున్న నదులు తమయొక్క నామరూపములను వదిలి సముద్రమునందు ఏరీతిగా లీనమైపోవునో, అదే రీతిగా ఆత్మజ్ఞానవంతుడు నామరూపముల నుండి విముక్తుడై పరాత్పరుడగు పరమాత్మను పొందుచున్నాడు. బ్రహ్మజ్ఞాని పుణ్యపాపాలను విడిచి నిర్మలుడై, పరమసామ్యాన్ని పొందుతాడు. ఆఅవస్థలో జీవాత్మకు ఆనందానుభూతి తప్ప మరొకటి ఉండదు. బ్రహ్మ సాక్షాత్కారం చేసుకున్న జీవుడు బ్రహ్మంలో అవిభక్తంగానే ఉంటాడు. రాముడు ఊరు విడిచి, వేరేచోటుకి వెళ్ళినప్పటికీ, తన నామరూపాలు కోల్పోయి, దానిలో ఐక్యంచెందే స్థితిలేదు. సముద్రంలో నదినీరు కలిస్తే అది నామరూపాలు కోల్పోయి అవిభక్తంగా ఉంటుంది. జ్ఞానంకల ముక్తుని ఆత్మకూడా స్వస్వరూపంలో అంటే ఆత్మరూపంలో ఉంటుందని గ్రహించాలి
బ్రహ్మాధికరణం ( 4, 4, 5 )
సూత్రం :- 538
" బ్రాహ్మేణ జైమిని రుపన్యాసాదిభ్యః "
ఉపన్యాసాధిభ్యః :- ఉపనిషత్తులలో ఉన్న వర్ణనల వలన, బ్రాహ్మేణ :- జీవాత్మ ముక్తావస్థలో బ్రహ్మ సంబంధిరూపంలో ఉంటాడని, జైమినిః :- జైమిని ఆచార్యుని అభిప్రాయం.
భావం:-ఉపనిషత్తులలోఉన్న వర్ణనలవలన జీవాత్మ ముక్తావస్థలో బ్రహ్మ సంబంధిరూపంలో ఉంటాడని జైమిని అభిప్రాయం.
వివరణ:-ఇది ప్రతిపక్షసూత్రం. ఈఅధికరణంలో ముక్తాత్ముడైనవాని లక్షణాలను గురించి తెలియ జేస్తున్నారు. ముక్తపురుషుడు సత్యసంకల్ప సర్వజ్ఞత్వాది లక్షణాలు కలవాడైఉంటాడా అని సందేహం. జైమిని అభిప్రాయం ప్రకారం సర్వజ్ఞత, సర్వేశ్వరత్వం, అనే లక్షణాలు కలిగి ఉంటాడు.
ఛాందోగ్యోపనిషత్తు(8, 7, 1):-బ్రహ్మం ఆనందరూపుడు. సత్యసంకల్పుడు, సత్యకాముడు అని వర్ణించారు. జీవుడు బ్రహ్మాన్ని పొంది ఆనందాన్ని అనుభవిస్తాడు అనే మాటను బ్రహ్మరూపంలో ఉంటాడని జైమిని అభిప్రాయం. (7, 25, 2) 'తస్య సర్వేషు లోకేషు కామచారో భవతి' ముక్తాత్మ అన్ని లోకాల్లో స్వేచ్ఛగా సంచరిస్తాడు. బ్రహ్మం సర్వత్రా వ్యాపించిఉంటాడు. బ్రహ్మనికి గతి, సంచారం ఉండదు. కాని ముక్తాత్మ సర్వలోకాలలో సంచారం చెయ్యగలడని చెప్పడం వలన ముక్తాత్మ బ్రహ్మం కన్నా భిన్నం అని స్పష్టంగా తెలుస్తోంది. బ్రహ్మ సర్వవ్యాపి. వ్యాపకత్వానికి గతి ఉండదు కదా! జీవుడు సంచారం చెయ్యగలడు. 'స్వేన రూపేణ ' అని అనడం వలన జీవుడు మోక్షంలో కూడా తన అస్థిత్వాన్ని పోగొట్టుకోడని అర్ధం. అంతే కాని బ్రహ్మ రూపాన్ని పొందుతాడని, బ్రహ్మంలో లీనమైపోతాడని కాదు. జీవుడు బ్రహ్మమే అనడం యదార్ధం కాదు. బ్రహ్మనికి సర్వజ్ఞత, సర్వేశ్వరత్వం అనే లక్షణాలు కలిగి ఉంటాడు. ముక్త పురుషుని ఆత్మ పాప రహితుడు, ముసలితనం, చావు, శోకము, ఆకలి, దప్పిక లేనివాడు, సత్య కాముడు, సత్య సంకల్పుడు అని ఛాందోగ్యం లో చెప్పబడింది.
సూత్రం :- 539
"చితితన్మాత్రేణ తదాత్మకత్వా దిత్యౌడు లోమిః "
తత్ ఆత్మకత్వాత్ :- చేతన స్వరూపం వలన, చితి తన్మాత్రేణ :- తన చేతనమాత్ర స్వరూపంతో మోక్షంలో జీవుడుంటాడు. ఔడులోమిః :- ఔడులోమి ఆచార్యుని అభిప్రాయం.
భావం :- చేతన స్వరూపం వలన తన చేతన మాత్ర స్వరూపంతో మోక్షంలో జీవుడుంటాడని ఔడులోమి ఆచార్యుని అభిప్రాయం.
వివరణ:- ఇది ప్రతిపక్షసూత్రం. జీవుడు చేతనస్వరూపుడు కాబట్టి ముక్తపురుషుడు కూడా చైతన్య రూపంలో ఉంటాడని ఔడులోమిఆచార్యుని అభిప్రాయం. జీవుడు మోక్షానికి ముందు, దేహేంద్రియాది ప్రాకృతిక పదార్ధాలతో పరివేష్టితుడై ఉంటాడు. ఈపదార్ధాలకు చేతనత్వం లేదు. మోక్షంలో వాటి సంబంధం ఉండదు. అప్పుడు జీవుడు కేవలం చేతన స్వరూపంతో ఉంటాడని శాస్త్రలంటున్నాయి.
బృహదారణ్యాకోపనిషత్తు(4, 5, 13) :- 'కృత్స్నః ప్రజ్ఞాన ఘన ఏవ, 'యోగదర్శనం ( 2, 20 ) దృష్టా దృశి మాత్రః ' ఈవాక్యాలలో జీవుడు చేతన రూపంలో ఉంటాడని తెలియజేస్తున్నాయి. తైత్తరీయంలో సత్యము, జ్ఞానము, అనంతమైనది పరబ్రహ్మ అని చెప్పబడింది. బృహదారణ్యాకంలో ఆత్మ బాహ్యభ్యంతరాలు లేనిది. సంపూర్ణమైనది. ప్రజ్ఞాన ఘనమైనది. ఆత్మజ్ఞానికి శోకము, మోహము, దుఃఖము ఉండవు. బ్రహ్మ చైతన్యస్వరూపుడు కనుక బ్రహ్మను పొందే ముక్తపురుషుడు కూడా చైతన్య స్వరూపుడై ఉంటాడని ఔడులోమి అభిప్రాయం.
సూత్రం :- 540
"ఏవ మప్యుపన్యాసాత్ పూర్వభావా దవిరోధం బాదరాయణః "
ఉపన్యాసాత్ :- శాస్త్ర ప్రమాణం వలన, ఏవం అపి :- చేతన మాత్ర స్వరూపంతో ఉంటాడని చెప్పినా, పూర్వ భావాత్ :- బ్రహ్మ రూపంలో ఉంటాడని చెప్పినా, అవిరోధం :- రెండింటిలో ఏ వైరుద్యం లేదని, బాదరాయణః :- బాదరాయణుడి అభిప్రాయం.
భావం :- శాస్త్ర ప్రమాణం వలన చేతన మాత్ర స్వరూపంతో ఉంటాడని చెప్పినా, బ్రహ్మ రూపంలో ఉంటాడని చెప్పినా, రెండింటిలో ఏ వైరధ్యం లేదని బాదరాయణుడి అభిప్రాయం.
వివరణ. ఈసూత్రంలో ప్రతిపక్షంవారి సూత్రాలకు వ్యాసమహర్షి సమాధానం చెబుతున్నారు. మోక్షంలో జీవుడు ప్రకృతి సంబంధాన్ని విడిచిపెట్టి కేవల చేతనరూపంలో ఉంటాడని ఔడులోమి చెప్పినది శాస్త్రానికి అనుకూలమే. బ్రహ్మానందం అనుభవించే జీవుడు బ్రహ్మసంబంధ రూపంలో ఉంటాడని జైమిని చెప్పినది శాస్త్ర విరుద్దం కాదు. ముక్తుడు చైతన్యస్వరూపుడు అని చెప్పినప్పటికీ, బ్రహ్మకుండే సత్యసంకల్పం, సర్వజ్ఞత మొదలైన గుణాలుకూడా ముక్తి యందు కూడా సంభవిస్తాయి. పరబ్రహ్మకుండే లక్షణాలన్నీ ముక్త పురుషునికి కూడా ఉంటాయని ప్రతిపక్షంవారు సమర్ధించలేదు. ముక్తాత్మ బ్రహ్మంకన్నా భిన్నo కాదు. జీవుడు మోక్షంలో తన అస్థిత్వాన్ని పోగొట్టుకొని, బ్రహ్మంలో లీనమై బ్రహ్మమైపోతాడు. బ్రహ్మానికున్న సత్య సంకల్పుడు, సత్య కాముడు, సర్వజ్ఞత, సర్వేశ్వరత్వం మొదలైన లక్షణాలు ముక్తాత్మకు కూడా సంక్రమిస్తాయని వ్యాస మహర్షి సమాధానం ఇచ్చాడు.
సంకల్పాధికరణం ( 4, 4, 8 )
సూత్రం :- 541
" సంకల్పాదేవ తు తచ్ఛ్రుతేః"
తత్ శ్రుతేః :- శ్రుతి కథనం వలన, సంకల్పాత్ ఏవ :- సంకల్పం తోటే కలుగుతుంది.
భావం:-మోక్షంలో జీవుడికి కామచారరూపంలో అనుభవం ఉంటుందని ఛాందోగ్యం(7,25,2)లో చెప్పారు. అది సంకల్పంవలన కలుగుతోందా? లేదా? అంటే శ్రుతి కథనం వలన సంకల్పంతోటే కలుగుతుంది.
వివరణ:- అర్చిరాదిమార్గాన బ్రహ్మలోకం చేరిన ఉపాసకుడికి భోగ్యవస్తువులను సృష్టించడం అనేది సంకల్పమాత్రం చేత సాధ్యమా? లేక ప్రయత్నపూర్వకంగా సాధ్యమా? అని సందేహం. లోకంలో ఏపని చెయ్యాలన్నా సంకల్పంతోబాటు ప్రయత్నంకూడా ఉండాలి. దానికి తగిన సాధనాసంపత్తి కూడా అవసరం. ఇవి సమకూరినప్పుడే ఆపని నెరవేరుతుంది. మోక్షంలో అలాకాక సంకల్పం మాత్రం చేతనే జీవుడికి సమాచారం కలుగుతుంది. వేరే ఏ సాధనాలు అవసరం లేదు. ఈ సంకల్పం అంతఃకరణ వృత్తి కాదు. కేవలం ఆత్మనుభూతే. జ్ఞానియైన వాడు కోరినంతనే అంటే సంకల్ప మాత్రం చేతనే పితృదేవతలు మొదలైన వారు ప్రత్యక్ష మౌతారు.
ఛాందోగ్యం(8, 2, 10):- ఏప్రదేశాన్ని ఏకోరికను జీవుడు కోరుకుంటాడో, అది అతనికి చేరుతుంది. దానిలో అతడు సంపన్నుడై ఆనందిస్తాడు. మోక్షంలో జీవుడికి అలాంటి స్వాభావిక సామర్ధ్యం కలుగుతుంది. అదే సంకల్పరూపం. దానితోనే అతడికి అనుభూతి కలుగుతుంది.
శతపధ బ్రాహ్మణం(14, 4, 2, 17):-ముక్తాత్మ తన శక్తిరూపసంకల్పంతో అన్ని అనుభవిస్తుంది. ఈ వాక్యాన్ని చూసి మోక్షంలో వాగాదిఇంద్రియాలు కలుగుతాయని పొరబడకూడదు. ఇంద్రియాలు ప్రాకృతికాలు కదా! అవి ఎక్కడ నుంచి వస్తాయి. కనుక మోక్షంలో సంకల్పమాత్రంతో జీవుడు అన్ని అనుభవిస్తాడని సూత్రతాత్పర్యం. ఛాందోగ్యంలో చెప్పినట్లుగా తానేబ్రహ్మ అని తెలుసుకున్నవాడు సమస్త లోకాలలో విహరించగలుగుతాడు. సత్యకాముడై దహరాకాశంలో బ్రహ్మను సేవించిన వాడు మరణానంతరం పితృలోకం కోరితే పితృగణం ప్రత్యక్షమౌతుంది. వారితోబాటుగా పితృలోకాలకు పోయి పితృలోక అనుభవాలతో సంపన్నుడై మహిమన్వితుడౌతాడు. అలా సమస్తలోకాలు చెరగలుగుతాడని చెప్పబడింది. కనుక జీవుడికి మోక్షంలో సంకల్పమాత్రం చేత సర్వమూ పొందగలుగుతారు. ముక్తుని సంకల్పం సామాన్య జనుల సంకల్పం కంటే విలక్షణమైనది.
సూత్రం :- 542
" అత ఏవ చానన్యాధిపతి "
అతఏవ:-సత్యసంకల్పంవల్లనే, అనన్యఅధిపతిః :- జీవుడికి మరో అధిపతి ఉండడు. స్వతంత్రు డౌతాడు.
భావం :- సత్య సంకల్పం వల్లనే జీవుడికి మరో అధిపతి ఉండడు. స్వతంత్రుడౌతాడు.
వివరణ:-మోక్షంలో సంకల్పమాత్రం చేత జీవుడు అన్ని అనుభవిస్తాడు. ఈ దశలో జీవుడికి అధిపతి అనేవాడు ఉంటాడా? అంటే సత్య సంకల్పం వలనే అతను స్వతంత్రుడౌతాడు. అతనికి బ్రహ్మం తప్ప మరొక అధిపతి ఉండడు. వ్యర్థం కాని సంకల్పం కలవాడు కనుకనే విద్వాంసుడు అనన్యాధిపతిగా గతి ఉన్నప్పుడు, తప్పనిసరి కానప్పుడు సంకల్పించడు కదా! 'అధ.. భవతి' ఇక్కడ సగుణోపాసన ద్వారా, ఎవరు వెడతారో, సత్యసంకల్పంతో వాటిని పొందుతారు. ఆత్మను తెలుసుకొన్న వారికి అతనికి వేరే ప్రభువు అంటూ ఎవరూ ఉండరు. అతనికి చక్రవర్తి వలెనే అన్ని లోకాలలో సంచారముంటుంది. అతను కోరినంత మాత్రానే అన్ని లోకాలు పొందగలుగుతాడు.
ఛాందోగ్యోపనిషత్తు(7,25,2):-సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడైన పరమాత్మను తెలుసుకుంటూ ఆత్మానందం అనుభవిస్తూ, స్వరాట్ అవుతాడు. అన్ని లోకాలలోనూ అతనికి యదేచ్ఛాసంచారం కలుగుతుంది. ఎక్కడా ప్రాకృతిక ప్రతి బంధకాలుండవు. ఈశ్వరుడే అతనికి అధిపతి.
అభావాధికరణం ( 4, 4, 10 )
సూత్రం :- 543
" అభావం బాదరి రాహ హ్యేవమ్ "
ఏవమ్ :- శాస్త్రాలు చెప్పినట్లుగా, అభావం :- మోక్షానందం అనుభవించడానికి శరీరాలుండవు, హి :- అని, బాదరిః :- బాదరముని, ఆహ :- అంటున్నాడు.
భావం:-శాస్త్రాలు చెప్పినట్లుగా మోక్షనందం అనుభవించడానికి శరీరాలుండవని బాదరముని అంటున్నాడు.
వివరణ:-ముక్తపురుషులకు సంకల్పమాత్రం చేతనే కోరిన లోకాలు పొందుతారని అన్నారు. సంకల్పం కావాలంటే మనస్సుకావాలి, అంటే ముక్తపురుషునికి మనస్సు, ఇంద్రియాలు అన్నీ ఉంటాయా అని సందేహం. ప్రాకృతిక సుఖదుఃఖాలు అనుభవించడానికి శరీరేంద్రియాలు అవసరం. మోక్షానందం అలాంటిది కాదు. కనుక అక్కడ శరీరాదుల అవసరం లేదని బాదరి ఆచార్యుని అభిప్రాయం. విద్వాంసుడు అంటే జ్ఞానియైనవాడికి మరణానంతరం శరీరం ఉండదు. ముక్తపురుషునికి శరీరం, ఇంద్రియాలు ఉండవు. విద్వాంసునికి మనస్సుకన్నా భిన్నమైన శరీరం, ఇంద్రియాలు ఏవి బ్రహ్మలోకంలో ఉండవని వ్యాసుడు తెలియజేశాడు. ముక్తునికి సంకల్పసాధనమైన మనస్సు ఉంటుందనే విషయం మాత్రం నిశ్చితమే. ఐశ్వర్యం పొందిన మహీయమానుడైన అంటే పూజ్యుడైన సగుణ బ్రహ్మోపాసకునికి శరీరేంద్రియలు ఉండవాని తలుస్తున్నాడు. ఎందువలనంటే ' మనసైతాన్.... బ్రహ్మ లోకే ' బ్రహ్మ లోకంలో ఉన్న కామాలను భోగ్య వస్తువులను మనస్సుతో చూస్తూ రమిస్తాడని శ్రుతి వాక్యం ఉన్నది. (ఈసందర్భంలో మాత్రం మనస్సు అంటే ఆత్మ అనే భావించాల్సివుంటుంది. ఎందుకంటే ముక్తపురుషునికి అంతఃకరణ వుండదు.)
సూత్రం :- 544
" భావం జైమినిర్వికల్పా మననాత్ "
మోక్షంలో శరీరాలు ఉంటాయని, వికల్ప అనుమానాత్ :- శాస్త్రల్లో వికల్పం చెప్పారని, జైమినిః :- జైమిని ఆచార్యుడు చెబుతున్నాడు.
భావం :- మోక్షంలో శరీరాలుంటాయని, శాస్త్రాల్లో వికల్పం చెప్పారని జైమిని ఆచార్యుడు చెబుతున్నాడు.
వివరణ:-ఇది ప్రతిపక్షసూత్రం. ముక్తపురుషునికి మనస్సుతోబాటు శరీరలుంటాయని జైమిని అభిప్రాయం. శాస్త్రంలో వికల్పాలు చెప్పడం వలన శరీరేంద్రియాల ఉనికిని జైమిని అంగీకరిస్తున్నాడు. ఎందువలనంటే ముక్తుని విషయంలో అనేక రూపాలలో ఉండటాన్ని వికల్పంగా చెబుతున్నారు. శరీరభేదం లేకుండా అనేక విధాలుగా ఉండడు కదా!
ఛాందోగ్యోపనిషత్తు(7,26,2):- ముక్తాత్మను గురించి వర్ణిస్తూ జీవుడు 1, 3, 5, 7, 9, 11, 10, 20, 100, 1000 రకాలుగా అవుతాడని చెప్పడం జరిగింది. ఈ అనేక విధాలు కావడానికి జీవుడికి శరీరం కావాలి. లేని పక్షంలో సంభవం కాదు. ఇలాంటి వికల్పవచనం వలన మోక్షంలో జీవుడికి శరీరాదులుంటాయని జైమిని అభిప్రాయపడుతున్నాడు. ఈవికల్పం నిర్గుణమైన భూమవిద్యలో చెప్పబడినా కూడా సగుణావస్థలో ఉన్న ఈ ఐశ్వర్యాన్ని సగుణ విద్యాఫలంగా ఇక్కడ గ్రహించబడుచున్నది.
సూత్రం :- 545
" ద్వాదశాహవ దుభయ విధః బాదరాయణో అతః "
అతః :- శాస్త్ర వచనం వలన, ద్వాదశాహావత్ :- ద్వాదశాహం లాగా, ఉభయ విధః :- రెండు రకాలుగా, బాదరాయణః :- సూత్రకారుడు అంగీకరిస్తున్నాడు.
భావం :- శాస్త్ర వచనం వలన, ద్వాదశాహం లాగా రెండు రకాలుగా సూత్రకారుడు అంగీకరిస్తున్నాడు.
వివరణ:-ఈసూత్రంలో ముక్తాత్మ అనేకవిధాలుగా శరీరాదులుంటాయని ఛాందోగ్యం(7, 26, 2)లో చెప్పిన శాస్త్రీయసమస్యను పరిష్కారించడానికి వ్యాసుడు ప్రమాణాలను ఉదాహరిస్తున్నాడు. రెండు విధాలైన శ్రుతులు కనిపిస్తున్నాయి. మనసా అనే విశేషణంవలన ఒకటి, వికల్పమవడం వలన ద్వాదశాహంలాగా ఒకటి. 2 రోజుల నుంచి 12 రోజుల వరకు జరిగే యజ్ఞానికి అహీనం అని పేరు. 12 అంతకన్నా ఎక్కువ దినాలు చేసే యజ్ఞానికి సత్త్రం అనిపేరు. అభివృద్ధిని, ఐశ్వర్యాన్ని కోరేవారు ద్వాదశాహాన్ని ఆశ్రయించాలనీ, సంతానం కోరేవారి చేత ద్వాదశాహం చేయించాలి అని శృతి యందు చెప్పబడింది. ఒక శృతి యందు కర్తలు అనేకమంది చేత చేయబడిన యాగాన్ని సత్త్రం అంటారు. దీనిని ద్వాదశాహ సత్త్రం అంటారు. రెండవశ్రుతిలో ఒక్కని చేత మాత్రమే చేయబడే యాగాన్ని అహీనము అంటారు. దీనిని ద్వాదశాహఅహీనము అంటారు.
బౌధాయనశ్రౌతసూత్రాలు(11, 3):- కాగా పన్నెండు దినాల్లో గాని, అంతకన్నా ఎక్కువ రోజుల్లో కాని పూర్తి అయ్యే యజ్ఞాలను సత్త్రాలు అంటారు. (11, 4):- 12 రోజుల్లో జరిపే ఇష్టులు సత్రం - అహీనం అని రెండూ విధాలుగా చెబుతారని కాత్యాయనశ్రౌతసూత్రం.
కాత్యాయనశ్రౌతసూత్రం(12, 1, 4):- పై శ్రౌతసూత్రాలు చూసినా ద్వాదశాదియాగాలను రెండు పేర్లతో చెప్పే వీలున్నది. అలాగే ముక్తాత్మలకు మోక్షంలో శరీరం ఉండదనడం శాస్త్రసమ్మతమే. నానా విధాల ఐశ్వర్యాలు అక్కడ జీవుడు అనుభవిస్తాడని చెప్పడం శాస్త్రవిహితమే. కాని ఇదంతా ముక్తజీవునికి సంకల్పమాత్రంతో లభిస్తుందనడం మరువకూడదు. ఆసంకల్పం ఆత్మకు మోక్షదశలో కలిగే సామర్ధ్యమే. శాస్త్రంలో మోక్షంలో జీవుడికి శరీరం ఉండదని స్పష్టంగా చెప్పినట్లుగా, శరీరం ఉంటుందని ఎక్కడా చెప్పలేదు. ఛాందోగ్యం(7,26,2)లో కూడా శరీర ఇంద్రియాలను శబ్దంతో నిర్దేశించక పోవడం గమనించాలి. రెండుచోట్ల చెప్పిన వాక్యాలు సంకల్పానుభవానికే వర్తిస్తాయి. మోక్షంలో శరీరేంద్రియలకు ఎన్నడూ ప్రసక్తిలేదని బాదరాయణుడి అభిప్రాయం. సంకల్పానుసారం ఇష్టమైనది చేయవచ్చునని పూర్వ మీమాంస శాస్త్ర కర్త సిద్ధాంతo చేశారు. బ్రహ్మ లోకాన్ని పొందినవారు స్వతంత్రులు. వారి సంకల్పం తిరుగులేనిది. అందుచేత శరీరం కావాలనుకుంటే సశరీరుడౌతాడు. శరీరం వదలదలుచుకున్నప్పుడు అశరీరుడౌతాడు. ఎందువలనంటే సంకల్పానికి అట్టి బలంఉంది. సంకల్పాలుకూడా విచిత్రంగా ఉండవచ్చును. ద్వాదశాహక్రతువు వలె రెండువిధాలైన లింగం గల శ్రుతులు కనబడటం వలన ద్వాదశాహ సత్త్రం అని, అహీనం అని కూడా ఎలా అంగీకరించ బడిందో, అట్లే ఇక్కడ కూడా వర్తిస్తుందని సూత్రకారుని అభిప్రాయం.
సూత్రం :- 546
" తన్వభావే సంధ్యవ దుపపత్తేః "
తను అభావే :- శరీరం లేకపోయినా, సంధ్యవత్ :- స్వప్నం లాగా, ఉపపత్తేః :- ముక్తాత్మకు అనుభూతి సిద్ధించే వీలున్నది.
భావం :- శరీరం లేకపోయినా, స్వప్నం లాగా ముక్తాత్మకు అనుభూతి సిద్ధించే వీలున్నది.
వివరణ :- ఇంద్రియ సహితమైన శరీరం లేనప్పుడు స్వప్నావస్థలో శరీరేంద్రియ విషయాలు లేకపోయినా కూడా పిత్రాదికామాలు ఏ విధంగా జ్ఞానరూపంలో కలుగుతాయో అదే విధంగా మోక్షంలో కూడా ఆ అనుభూతులు కలుగుతాయి. సంధ్య అంటే స్వప్నం లేదా స్వప్నావస్థలో ఉన్న పురుషుడు. జీవుడికి స్వప్నావస్థలో శరీరేంద్రియాలతో సంబంధం లేకుండానే అనుభూతి కలుగుతుంది. అలాగే ముక్తాత్మకు
కూడా ఇంద్రియాలతో నిమిత్తం లేకుండా అనుభూతి కలుగుతుంది. ఇక్కడ మోక్షాన్ని స్వప్నంతో పోల్చారు. స్వప్నంలో అంతఃకరణ మాత్రమే పనిచేస్తుంది. ఇతర ఇంద్రియాలు పనిచెయ్యవు. మోక్షంలో శరీరం, ఇంద్రియ, అంతఃకరణ ఏమి ఉండవు. బ్రహ్మలోకంలో ఇంద్రియాలతో కూడిన దేహం లేకపోయినప్పటికి స్వప్నం లాగా మానసికంగా విషయాలు పొందుతారు. స్వప్నంలో అనేక విషయాలు చూస్తారు. అనేక పదార్ధాలు తింటారు. భోగాలు అనుభవిస్తారు. కాని అక్కడ శరీరం, ఇంద్రియాలు ఏమి ఉండవు. అవన్నీ స్వప్నంలో యదార్ధమే.
అలాగే బ్రహ్మలోకంలో బ్రహ్మసాక్షాత్కారం వలన ఆత్మలో విలక్షణమైన సామర్ధ్యం ఏర్పడుతుంది. దాని వలన శరీరం లాంటివి లేకపోయినా, ఆత్మకి నేరుగా అనుభూతి కలగుతుంది. అందుచేత స్వరూప సామర్ధ్యం తోటే ఆనందం అనుభవిస్తాడని తెలియజేశారు.
సూత్రం :- 547
" భావే జాగ్రద్వత్ "
భావే :- శరీరం ఉన్నప్పుడు, జాగ్రత్ వత్ :- మేలుకొని ఉన్న పురుషునికి కలిగినట్లుగానే, జీవన్ముక్తునికి కూడా అనుభూతి కలుగుతుంది.
భావం:- శరీరం ఉన్నప్పుడు మేలుకొనిఉన్న పురుషునికి కలిగినట్లుగానే, జీవన్ముక్తునికి కూడా అనుభూతి కలుగుతుంది.
వివరణ:- శరీరం ఉన్నప్పుడు జాగ్రదావస్థలో వలె అనుభూతి కలుగుతుంది. స్వప్నావస్థలో శరీరం లేనప్పుడు మనస్సుతోనే అనుభవిస్తారు. ముక్తపురుషునికి శరీరం ఉండటం, లేకపోవడం అనేది అతని సంకల్పం వల్లనే జరుగుతుంది. జీవన్ముక్తదశలో ఆనందం అనుభవించడంలో జీవుడికి శరీరేంద్రియాలు, మనస్సుతో సంబంధం ఉండదు. అయినా బ్రహ్మజ్ఞాని జీవన్ముక్త దశలో స్వస్వరూపజ్ఞానంతోనే నిత్య వ్యవహారాలను నిర్వహిస్తూ, ఆనందానుభూతిలో నిమగ్నమై ఉంటాడు.
ప్రదీపాధికరణం ( 4, 4, 15 )
సూత్రం :- 548
" ప్రదీప వదావేశ స్తథా హి దర్శయతి "
ప్రదీపవత్ :- దీపం తన వెలుగులో అన్నిటికీ కాంతి ఇస్తున్నట్లుగా, ఆవేశః :- జీవన్ముక్తుడికి అన్ని వ్యవహారాలలో ప్రవేశం కలుగుతుందని, తథా హి దర్శయతి :- శాస్త్ర వాక్యాలంటున్నాయి.
భావం :- దీపం తన వెలుగులో అన్నిటికి కాంతి ఇస్తున్నట్లుగా ముక్తునికి అన్ని వ్యవహారాలలో ప్రవేశం కలుగుతుందని శాస్త్ర వాక్యాలంటున్నాయి.
వివరణ:- జీవన్ముక్తదశలో దేహవ్యాపారాలు ఎలా చేయగలుగుతాడో ఈ సూత్రంలో చెప్పబడింది. జ్ఞాని అయిన జీవన్ముక్తుడు ఒకశరీరాన్నే పొందుతాడా? లేక అనేక శరీరాలు పొందుతాడా? అవి ఆత్మతో కూడి ఉంటాయా? లేక ఆత్మలేకుండా మరబొమ్మాల్లా ఉంటాయా అని సందేహం. విద్వాంసునిచేత నిర్మించబడిన అనేక శరీరాలలో విద్వాంసుడు ప్రదీపంలాగా ఆవేశిస్తాడు. ముక్తుడు ఆత్మ భోగం కావాలనుకున్నప్పుడు అనేక శరీరాలను పొందుతాడు. ఒకేఆత్మతో ఒకేశరీరoతో భోగం అసంభవం. ఉన్నది ఒక్కటే ఆత్మ దానికి మినహాయింపు లేదు, కనుక అన్నిశరీరాలలో అన్నిఆత్మలు ఉండే అవకాశం లేదు. ఒక దీపం అనేక వత్తులకు అంటుకొని అనేక దీపాలుగా ప్రకాశిస్తునట్లుగా, ముక్తుడు తానొక్కడే అయినా అనేక రూపాలను పొంది, అనేక శరీరాలలో ఆవేశిస్తాడు.
ప్రశ్నోపనిషత్తు(4, 11):- సోమ్యా! ఈశ్వరుణ్ణి ఎరిగిన జ్ఞాని అంతా తెలిసిన వాడై అన్నిటిలో ప్రవేశిస్తాడు.
ఛాందోగ్యోపనిషత్తు(7, 26, 2):- బ్రహ్మజ్ఞానియైన జీవన్ముక్తుడు మృత్యువు, రోగం, దుఃఖాల నుండి దూరమౌతాడని తెలుసుకుంటే, అన్నిటిని అన్ని విధాలనుండి పొందుతాడు. ఇలా ఉపనిషత్తులు ముక్తాత్మ ప్రభావాన్ని వర్ణిస్తున్నాయి. దీపం ఒక చోట ఉండి, అన్నిటిని తన ప్రకాశంతో ఆవేశించి, వెలిగేలా చేస్తున్నట్లుగానే ముక్తుడిలో ఉద్భవించిన జ్ఞానైశ్వర్యంతో దైహికవ్యాపారాలు చేస్తూ, ఆనందానుభూతిలో నిమగ్నమై ఉంటాడు.
సూత్రం :- 549
" స్వాప్యయ సంపత్యో రన్యతరాపేక్ష మావిష్కృతం హి "
స్వాప్యయః:- సుషుప్తి, సంపత్తిః :- మోక్షం, ఈరెండు దశల్లోను, అన్యతర అపేక్షo :- వేరొకదాన్ని ఆపేక్షించి, బాహ్యఅభ్యంతరజ్ఞానం కలుగుతుందని శాస్త్రంఅంటున్నది. హి:-ఎందుకంటే, ఆవిష్కృతం:-ఈ విషయాన్ని బృహదారణ్యకం ఇది వరకే ఆవిష్కరించింది.
భావం:-సుషుప్తి, మోక్షం ఈరెండూదశల్లోను వేరొకదాన్ని ఆపేక్షించి బాహ్యభ్యంతర జ్ఞానం కలుగు తుందని శాస్త్రం అంటున్నది. ఎందుకంటే ఈ విషయాన్ని బృహదారణ్యకం ఇది వరకే ఆవిష్కరించింది.
వివరణ:-స్వాప్యయము అంటే సుషుప్తి, ఇక్కడ సుషుప్తి, మోక్షం ఈ రెండింటిలోను ఏదో ఒక దానిని ఉద్దేశించి మాత్రమే చెప్పబడింది. మోక్షంలో అతనికి ప్రాకృతిక పదార్ధజ్ఞానం ఉంటుందా అంటే ఉండదనే విషయాన్ని తెలియజేస్తున్నారు.
బృహదారణ్యాకోపనిషత్తు(4, 3, 21):- బ్రహ్మసంపర్కం కలిగిన ఈపురుషుడు బాహ్యఅభ్యంతరాలను ఎరుగడు అన్నారు. (4, 5, 15):-అక్కడ ఆత్మ అప్పుడు దేనిని దేనితో తెలుసుకుంటుంది? అన్నారు. ఇక్కడ జ్ఞానసాధనాలు లేవు. విషయము లేదు. అప్పుడు జ్ఞాన అభావమే కదా! అయితే ముక్తాత్మ సర్వజ్ఞసమానం అని ఎలా అంటారు? అంటే ఈవాక్యాలు సుషుప్తికో, మోక్షానికో సంబంధించినవి. మొదటి వాక్యంలో జీవుడికి సంబంధం కలిగినప్పుడు సుషుప్తిదశలోలాగా జీవుడు బాహ్యభ్యంతరాలను ఎరుగడు అన్నారు. ఇక రెండోవాక్యం మోక్షానికిచెందినది. అక్కడ జీవుడు ఆనందంలో మునిగి ఆనందా నుభూతిలోనే ఉంటాడు. (4, 5, 15):-అంతాఆత్మగా ఎక్కడఅనుభవం కలుగుతుందో అక్కడ ఏది తెలుసు కోవాలి? అనడంతో ఆత్మానందంలో మునిగితేలే ముక్తాత్మ వేరే తెలుసుకోవలసినది ఏమి ఉండదని భావం. మోక్షంలో ప్రాకృతికపదార్ధజ్ఞానం ఉండదు. కేవలం బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉంటారు. కనుకనే సర్వజ్ఞసమానత చూపారు. స్వసామర్ధ్యంతో అంతా తెలుసుకోగల శక్తి ఉంటుందని అర్ధం. సుషుప్తిలో జ్ఞానం అనేది మనోబుద్ధుల నుండి ఇంద్రియాల నుండి ఉపసంహరించబడుతుంది. అంటే అవి జ్ఞానంతో పనిచెయ్యవు. అది నిరూపయోగంగా ఉన్న జ్ఞానం. అందుకే సుషుప్తిలో ఉన్న జీవుణ్ణి ప్రాజ్నుడు అంటారు. ఆప్రాజ్నుడే ఆత్మ అని చెప్పబడింది. సుషుప్తిలో గాఢనిద్రలో బాహ్యఅభ్యంతరాలను ఎరుగడు. మోక్షంలో జీవన్ముక్తుడు స్వరూపజ్ఞానంతో, స్వసామర్ధ్యంతో అన్నిటిలో ఉన్న ఆత్మ చైతన్యాన్ని దర్శించి, బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు.
సూత్రం :- 550
" జగద్ వ్యాపార వర్ణం ప్రకారణాదసంహితత్వాచ్చ "
ప్రకారణాత్ :- శాస్త్రాల్లో, అసంవిహితత్వాత్ చ :- జగత్తు ఉత్పత్తి ప్రసంగంలో జీవాత్మ ప్రసక్తి లేనందువల్ల, జగద్ వ్యాపార వర్ణం :- జగద్రచనా వ్యాపారం తప్ప మిగిలిన ఐశ్వర్య ప్రాప్తి ముక్తాత్మలకు కలుగుతుంది.
భావం :- శాస్త్రాల్లో జగత్తు ఉత్పత్తి ప్రసంగాలలో జీవాత్మ ప్రసక్తి లేనందువల్ల, జగద్రచనా వ్యాపారం తప్ప మిగిలిన ఐశ్వర్య ప్రాప్తి ముక్తాత్మాలకు కలుగుతుంది..
వివరణ:-ముక్తపురుషుడు సంకల్పమాత్రం చేత జగత్తును సృష్టించగలడా? అని సందేహం. జగద్రచనా వ్యాపారం తప్ప మిగిలిన ఐశ్వర్యప్రాప్తి ముక్తాత్మాలకు కలుగుతుంది. విద్వాంసుడికి అణిమాది అష్ట సిద్ధులన్నీ లభిస్తాయి.
అష్టసిద్ధులు:-సాధకుడు యోగమార్గంలో ముందుకు సాగుతున్నప్పుడు, ఒకస్థాయిలో అతను భౌతికమైన సూత్రాలను దాటిపోతాడని చెబుతోంది యోగం. పంచేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, ఈ ఎనిమిదింటిని జయించిన వారికే అష్ట సిద్ధులు కలుగుతాయి.
1. అణిమ :- శరీరమును అతి చిన్నదిగా చేయుట.
2.మహిమ :- శరీరమును అతి పెద్దదిగా చేయుట,
3.గరిమ :- శరీరం బరువును విపరీతంగా పెంచుట.
4. లఘిమ :- శరీరమును అతి తేలిక చేయుట
5. ప్రాప్తి :- కావలసిన వస్తువులు పొందుట.
6. ప్రాకామ్యం :- కావలసిన భోగాలు అనుభవించడం.
7. ఈశత్వం :- ఎవరిపైనైనా, దీనిపైనైనా అధికారం పొందుట.
8. వశీత్వం :- అన్ని భూతాలను లోబరచుకొనుట.
ముక్తులందరూ ఆపరమేశ్వరుణ్ణి అన్వేషించి వారిస్వరూపం తెలుసుకోవడం కోసం ప్రయత్నించి, తద్వారా అణిమాద్యైశ్వర్యాలు పొందినట్లు చెప్పబడింది.అణిమాది అష్టసిద్ధులు లభిస్తాయి, కాని జగత్తును సృష్టించే శక్తి మాత్రం ఉండదు. జగదుత్పత్తిలయాలు, జగద్వ్యాపారం, కర్మఫలప్రధానం లాంటి కార్యాలు ఈశ్వర సామర్ధ్యనికి చెందినవి. సృష్టి సమయంలో పరమేశ్వరుడు ఒక్కడే ఉంటాడు. అతనికి సన్నిహితులు గాని, అతనితో సమానమైన వారు గాని ఎవరూ ఉండరు.
తైత్తరేయోపనిషత్తు ( 1, 6, 2 ) :- స్వరాజ్యాన్ని పొందుతాడు.
ఛాందొగ్యోపనిషత్తు ( 7, 25, 2 ) :- అతడు అన్ని లోకాల్లో స్వేచ్ఛగా విహరిస్తాడు. జగదుత్పత్తి లాంటి వాటిని వర్ణించే ఘట్టాల్లో బ్రహ్మకు సాక్షాత్ సంబంధాన్ని పేర్కొన్నారు. అక్కడ ముక్తాత్మల ప్రసక్తే లేదు.
సూత్రం :- 551
" ప్రత్యక్షోపదేశా దితి చేన్నాధికారిక మండల స్థోకేః
ప్రత్యక్షఉపదేశాత్ ఇతి చేత్ :- ఉపనిషత్తులలో ముక్తాత్మ సామర్ధ్యం ప్రత్యక్షంగా వర్ణించారు కదా అని అనడం, న :- సరియైనది కాదు. ఎందుకంటే, అధికారిక మండల స్థోకేః :- జగద్రచన లాంటి కార్యాలు జీవాత్మ అధికారిక పరిధిని మించినది.
భావం :- ఉపనిషత్తులలో ముక్తాత్మ సామర్ధ్యం ప్రత్యక్షంగా వర్ణించారు కదా! అని అనడం సరియైనది కాదు. ఎందుకంటే జగద్రచన లాంటి కార్యాలు జీవాత్మ అధికారిక పరిధిని మించినది.
వివరణ:-విద్వాంసుడికి ఈశ్వరునితోబాటు సమానమైన ఐశ్వర్యం కలుగుతోంది. అంతమాత్రం చేత జగద్వ్యాపారం, జగత్కర్తృత్వం కలగవు. వీరందరూ బ్రహ్మలోకంలో ఉంటూ, పరబ్రహ్మకు లోబడి ఉంటారే కాని లోకాలను సృష్టించే అధికారం వీరికిలేదు. సగుణ బ్రహ్మోపాసన చేయడం వలన ఈశ్వర సాయుధ్యం పొందినవాళ్లకు ఎలాంటి అడ్డులేని ఐశ్వర్యం లభిస్తుందా? లేదా కొన్ని అడ్డంకులు ఉన్న ఐశ్వర్యం లభిస్తుందా? అని సంశయం.' జగద్వ్యాపారి, జగద్వ్యాపారవర్జమ్ ' అని పఠించడం వలన జగత్తును సృష్టించడo మొదలైన పనులు మినహాయించి, అణిమాద్యైశ్వర్యం సంకల్పం కలగవచ్చును. కేవలం పరమేశ్వరుడొక్కడికే జగద్వ్యాపారవిషయంలో అధికృతులు అంటే అధికారం కలవాడుగా ఆ పరమేశ్వరుణ్ణి ప్రకృతంగా చేసుకొని జగత్కర్తృత్వాధికం చెప్పబడింది. అతడే నిత్యమైన వేదశబ్దం చేత మాత్రమే తెలియబడుచున్నాడు. మిగిలిన వారంతా ముక్తులే. జగద్రచన లాంటి కార్యాలు జీవాత్మ అధికార పరిధికి మించినవి. ముక్తాత్మ విషయంలో చెప్పిన విషయాలు బ్రహ్మం నిర్వర్తించే జగదుత్పత్తి కార్యాలకు సంబంధించినవికావు. స్వరాజ్యం పొందడం, కామాచారణం, ఆదరణీయత లాంటివి ముక్తాత్మకు సాధ్యమైనవే. ఏ ఒక్కని సంకల్పాన్ని అందరూ అంగీకరిస్తారో, అతడే నిత్య సిద్ధుడైన ఈశ్వరుడు. ఇతరులందరూ పరమేశ్వరుని అభిప్రాయాన్ని అనుసరించి ఉంటారని గ్రహించాలి.
సూత్రం :- 552
" వికారావర్తి చ తథా హి స్థితి మాహ "
ఇది ముక్తాత్మ ఐశ్వర్యం విషయం. వికారావర్తి :- ముక్తాత్మ ఐశ్వర్యం వికృత వస్తువులకే పరిమితం, చ :- అని, తాథా హి స్థితిం ఆహ :- శాస్త్రాలు చెబుతున్నాయి.
భావం :- ఇది ముక్తాత్మ ఐశ్వర్య విషయం. ముక్తాత్మ ఐశ్వర్యం వికృత వస్తువులకే పరిమితమని శాస్త్రాలు చెబుతున్నాయి.
వివరణ:-జీవుడి ఐశ్వర్యం రెండురకాలుగా ఉంటుంది. 1. జ్ఞాన రూపం, 2. క్రియా రూపం. జ్ఞాన రూపమైన ముక్తాత్మ ఐశ్వర్యం. బ్రహ్మం మొదలుకొని ప్రకృతి వరకు ఉండే అన్ని తత్త్వాలను తెలుసుకుంటాడు. భావ పదార్ధాలను తన విషయాలుగా చేసుకుంటాడు. కనుకనే సర్వజ్ఞ సమానుడన్నారు. క్రియారూప ఐశ్వర్యం అంటే జగత్వ్యాపార ప్రక్రియ. ప్రకృతి పరిణమించి వికృతమయ్యే కార్యకలాపం ఈశ్వర వ్యవస్థ. ఇందులో ముక్తాత్మ ప్రమేయం లేదు. ముక్తాత్మ స్వరాట్ కావడం, అన్ని లోకాల్లో సంచరించడం, వికృతికి సంబంధించినదే. బ్రహ్మనికి చెందిన ఐశ్వర్యం అంత కంటే మించినది.
యజుర్వేదం ( 31, 3 ) :- 'పరమేశ్వరుడి మహిమకు హద్దు లేదు ' అని వేదవచనం. పరమేశ్వరుడికి సగుణ రూపము, నిర్గుణ రూపము అని రెండు రకాల రూపాలు ఉన్నవని వేదంలో చెప్పబడింది.
సగుణ రూపం :- పరబ్రహ్మ సకల చరాచర సృష్టికి ఆధార భూతమై, సృష్టి కర్త కారణ బ్రహ్మగా, వారిని పోషించే స్థితి కర్త విష్ణువుగా, సృష్టిని లయం చేసే లయ కర్త శివుడిగా, ప్రకృతి అంతటా వ్యాపించి, సర్వ వ్యాపకమై, వికారరూపంలో ఆయారూపాలలో కనిపిస్తాడు. విశ్వం, సమస్తభూతాలు కలసి పరమేశ్వరుడి ఒకపాదం మాత్రమే. జీవుడికి దివ్యనేత్రాలు లేనందున, అతని చర్మచక్షవులకు, మాయా నేత్రలకు ప్రపంచమే కనిపిస్తుంది కాని వికారానికి ఆవల ఉన్న పరబ్రహ్మ గోచరించడు.
నిర్గుణరూపం:- పరమేశ్వరునిరూపం వికారమందు మాత్రమే ఉండేదికాదు. నిత్యమై, నిర్గుణుడై, నిర్వికారమై, స్వయంప్రకాశమై, ఎలాంటి వికారాలు లేకుండా ఆదిత్య మండలంలోని పరబ్రహ్మ స్వరూపం మూడు పాదాలతో ఉంటుంది. ఆ నిర్గుణ రూపాన్ని నిర్గుణ బ్రహ్మోపాసకులు మాత్రమే పొందగలరు, కాని సగుణోపాసకులు పొందడం అసంభవం.
సూత్రం :- 553
" దర్శయతి శ్చైవo ప్రత్యక్షానుమానే "
ప్రత్యక్షానుమానే :- ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలు రెండూ, దర్శయతిః చ :- తెలుపుతున్నాయి.
భావం:-బ్రహ్మానికిఉన్న ఐశ్వర్యం అపరిమితంఅని, ప్రత్యక్షఅనుమాన ప్రమాణాలు రెండూ తెలుపుతున్నాయి.
వివరణ:-ప్రత్యక్షం అంటే శ్రుతి, అనుమానం అంటే ఉపనిషత్తులు. జ్యోతిరూపుడైన పరబ్రహ్మయందు లోకాలను ప్రకాశింపజేసే సూర్యుడు ప్రకాశింపడు. చంద్రుడు కాంతులివ్వడు. తారలు ప్రకాశింపవని ఉపనిషత్తులు చెబుతున్నాయి. అవి వేదంలో భాగాలు. ఇదే విషయాన్ని పురాణాలూ చెబుతున్నాయి. స్వయంప్రకాశకుడైన పరమాత్మను సూర్యచంద్రాగ్నులు ప్రకాశింపజేయలేవని భగవద్గీత చెబుతోంది. పరమాత్మది అన్నితేజస్సులకన్నా అధికమైనతేజస్సు. కాబట్టి సగుణనిర్గుణరూపాలు రెండూ ఉన్నాయి.
యజుర్వేదం ( 40, 5 ) :- ఆ పరమేశ్వరుడు అన్నిటి లోపల, వెలుపలా ఉంటాడు.
ఋగ్వేదం ( 1, 52, 22 ) :- ఓ ఈశ్వరా! నీవు ఈ విస్తృత లోకాంతరాలను దాటి కూడా ఉన్నావు.
కఠోపనిషత్తు(5, 15), శ్వేతాశ్వరోపనిషత్తు(6, 14), ముండకోపనిషత్తు (2, 2, 10) :- సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇవేవి ఈశ్వరుణ్ణి ప్రకాశింపజేయలేవు. ఆయన ఉనికివల్లే అవన్నీ ప్రకాసిస్తున్నాయని ప్రమాణాలంటున్నాయి. విశ్వకర్త లేకపోతే ఇవన్నీ వెలగవు. కనుక బ్రహ్మం ఐశ్వర్యం వికృత ప్రపంచాన్ని కాక సమస్త కార్యకారణాత్మక ప్రపంచాన్ని మించిఉన్నది. ఆయన ఐశ్వర్యం పరిమితి లేనిది. పరబ్రహ్మకి ఉన్న ఐశ్వర్యం అపరిమితమని, వికారాలులేని సర్వవ్యాప్తమైన, స్వయం ప్రకాశమైన జ్యోతి స్వరూపుడైన పరబ్రహ్మ నిర్గుణరూపాన్ని, శ్రుతులు, స్మృతుల వలన తెలియజేయబడింది. సూర్యుని కన్నా పెద్దవైన నక్షత్రాలుకూడా పగలు సూర్యునివెలుగులో కనబడవు. పరజ్యోతిస్సు వికారాతీతంగాఉండటం ప్రసిద్ధమే. లోకాలను ప్రకాసింపజేసే సూర్యుడు, రాత్రి ప్రకాశించే చంద్రుడు, తారలు ఏమాత్రం పరబ్రహ్మను ప్రకాశింపజేయలేవు. స్వయంప్రకాశకుడైన పరబ్రహ్మ ఉనికివలనే సూర్యచంద్రాగ్నులు ప్రకాశిస్తు న్నాయని శ్రుతులు, స్మృతుల వలన తెలుస్తోంది.
సూత్రం :- 554
" భోగమాత్ర సామ్య లింగాచ్చ "
చ:- కాగా, భోగమాత్రసామ్యలింగాత్ :- ముక్తదశలో జీవుడు బ్రహ్మంలో ఉండి బ్రహ్మానందం అనుభవిస్తాడు.
భావం :- పరబ్రహ్మనికి అన్ని తేజస్సుల కన్నా అధికమైన తేజస్సు. ముక్త దశలో జీవుడు బ్రహ్మంలో ఉండి బ్రహ్మానందం అనుభవిస్తాడు.
వివరణ:-ముక్తాత్మ అలాంటి భోగం అనుభవించడంలో బ్రహ్మంతో పోలిక చెప్పారు. అక్కడే బ్రహ్మంతో సమానత్వం. ఉపాసకులకు ఈశ్వరునితో పాటుగా భోగమాత్రమైన స్వామ్యమే ఉన్నదని వేదాలు చెబుతున్నాయి. అందుచేత వారికి జగత్తును సృష్టించే శక్తి, అధికారం లేవు.
తైత్తరీయోపనిషత్తు(2, 1):-సత్యం, జ్ఞానం, చైతన్యం అయిన అనంతబ్రహ్మాన్ని ఎరిగినవాడు ఆనందరూప బ్రహ్మంతో బాటు అన్ని కామాలను అనుభవిస్తాడు. బ్రహ్మాన్ని పొందినవాడికి ఏకామనలు ఉండవు. నిష్కాముడై ఆనందాన్ని అనుభవిస్తాడని భావం. ఈసత్యఆప్త కామతే ముక్తాత్మలో బ్రహ్మనికి స్వామ్యం. సమస్తప్రాణులు హిరణ్యగర్భడిని పూజించినట్లే, ఉపాసకునికి కూడా భోగసాధనాలవుతాయి. బ్రహ్మ లోకంలో చేరిన ఉపాసకులతో బ్రహ్మ, ఓఉపాసకులారా! ఇక్కడ అమృతరూపమైన జాలాన్ని నేను ఉపయోగిస్తున్నట్లే మీరుకూడా ఉపయోగిస్తారు.' అంటే వీరికి భోగస్వామ్యమే తప్ప జగద్వ్యాపారం లేదు. భోగంలోమాత్రమే పరమేశ్వరునితో స్వామ్యం ఉన్నదని చెప్పే లింగం ఉండడంవలన ఉపాసకుడికి నిరంకుశైశ్వర్యం లేదని చెప్పబడింది. కార్యబ్రహ్మోద్యుపాసన చేసిన విద్వాంసులకు ఐశ్వర్యం నిరంకుశం కాదు. వీళ్ళ భోగంమాత్రమే అనాదిసిద్ధుడైన ఈశ్వరుని భోగంతో సమానంగా ఉంటుంది. బ్రహ్మ లోకానికి వెళ్లిన ఉపాసకులతో హిరణ్యగర్భుడు అంటాడు.
'తమాహ - - - అసౌ' ఈ అమృత రూపాలైన ఉదకాలు నా చేత భుజింపబడుతున్నాయి. ఏలోకం నీకు కూడా '. 'యథైతాం - - అవంతి'- ఈసగుణబ్రహ్మను సమస్తభూతాలు ఏవిధంగా సేవిస్తాయో, ఆ దేవతోపాసన చేసిన వానిని కూడా సేవిస్తాయి. తేనో - - జయంతి ' ఆ దేవత ( సగుణ బ్రహ్మకు) కొరకు సాయుధ్యాన్ని, సమాన రూపత్వాన్ని, సలోకత్వాన్నికూడా ఉపాసకులు జయిస్తారు (పొందుతారు). ఉపాసకునికి కార్యబ్రహ్మతో బాటుగా జగత్సృష్టితప్ప ఇతరభోగాలన్నీ అనుభవిస్తాడని, వానికీ నిరంకుశాధికారం ఉండదని, సమస్తమైన ప్రాణులు కార్యబ్రహ్మను ఎలా పూజిస్తాయో, ఉపాసకుని కూడా అదే విధంగా పూజిస్తాయని శ్రుతి వాక్యాల వలన తెలుస్తోంది.
సూత్రం :- 555
" అన్నావృత్తిః శబ్దాత్ అనావృత్తిః శబ్దాత్ "
అనావృత్తిః :- ముక్తాత్మ తిరిగిరాడని, శబ్దాత్ :-శబ్ద ప్రమాణమున్నది.
భావం :- ముక్తాత్మ తిరిగిరాడని శబ్ద ప్రమాణమున్నది.
వివరణ:- బృహదారణ్యకంలో చెప్పినట్లు ఈశరీరాన్ని విడవడంతోనే మోక్షాన్ని పొందినవాడు దేవయాన మార్గంలో బ్రహ్మాన్నిపొంది ముక్తుడౌతాడు. వీరంతా కల్పాంతం వరకు బ్రహ్మలోకంలో ఉండి, కల్పాంతాన పరబ్రహ్మలో లీనమౌతారు.ఈ సృష్టిలో మరల జన్మించడు. స్వస్వరూప సామర్ధ్యం వలన బ్రహ్మానందం అనుభవిస్తూ సర్వత్రావిహరిస్తాడు. అతనికి ప్రాకృతికబంధం ఏదిఉండదు. ముక్తాత్మ తన ఇచ్చానుసారం ఈవ్యవస్థను దాటలేడు. ఇది బ్రాహ్మివ్యవస్థ. స్వతంత్రంగా ఈ వ్యవస్థను ఉల్లంఘించలేడు. ముక్తులకు ఈ వ్యవస్థ లో జననమరణ పరంపర ఉండదు.
బృహదారణ్యాకోపనిషత్తు(6,2,19):- వాళ్ళు ఆబ్రహ్మలోకంలో చాలాకాలం వసిస్తారు. వాళ్లకు పునరావృత్తి లేదు.
ఛాందోగ్యోపనిషత్తు(4, 15, 5):-దేవయానమార్గంలో బ్రహ్మలోకంపొందిన జ్ఞానులు ఈ మానవఆవర్తనంలో తిరిగి రారు. అర్చిరాదిమార్గం గుండా బ్రహ్మ లోకం చేరిన వారికి పునరావృత్తి లేదు. కఠోపనిషత్తులో చెప్పినట్లుగా బ్రహ్మనాడి గుండా వెళ్లిన వారికి అమృతత్త్వం లభిస్తుంది. జ్ఞానసాధనలో స్వస్వరూప జ్ఞానంలో నిలిచి, ఆత్మజ్ఞానం పొందుతారో వారికి అఖండమైన బ్రహ్మానందం లభిస్తుంది. వీరంతా కల్పంతం వరకు బ్రహ్మ లోకంలో ఉండి, కల్పాంతాన పరబ్రహ్మలో లీనమౌతారు. ఒక సూత్రాన్ని రెండు సార్లు ప్రయోగిస్తే గ్రంధ పరిసమాప్తిని సూచిస్తుంది.మానవజీవిత పరమార్ధం మోక్షమేననే స్థిర నిశ్చయంతో ఉపాసకులు సమస్త ప్రతి బంధకాలు తొలగించుకొని, బ్రహ్మ సూత్రముల అంతరార్ధాన్ని గ్రహించి,అహం బ్రహ్మాస్మి అనే అనుభవాన్ని పొందితే, శాశ్వతమైన, అఖండమైన చిదానంద స్థితి లభిస్తుంది.
బ్రహ్మసూత్ర శాంకర భాష్యం సమాప్తం.