విదేహ ముక్తి - మోక్షము
మనం జీవన్ముక్త లక్షణాలు, ప్రాణోత్క్రమణముల గురించి తెలుసుకున్నతర్వాత ఇక మిగిలింది విదేహముక్తి. అంటే మోక్షమే. దీనిగురించి తెలిసింది చాలాతక్కువే. పరబ్రహ్మస్వరూపమన్నా, మోక్ష మన్నా ఒక్కటే. కాని మనలాటి వాళ్ళకోసం పెద్దలు, ఆత్మవంతులు కొంత తెలియచెప్పారు. లభ్యమైనంత వరకు దానిగురించి తెలుసుకుందాము.
మహోపనిషత్:తృతీయాధ్యాయము:
జీవన్ముక్తుడు తన శరీరము పడిపోయిన సమయములో, శ్వాస ఆగిపోయిన వెంటనే జీవన్ముక్త పదవిని దాటి, విదేహముక్తపదవిని అధిష్టించుచున్నాడు. విదేహముక్తుడు జన్మించడు, మరణించడు. అతడు నిర్వికారుడై యున్నాడు. సత్తు, అసత్తుకాడు. దూరము దగ్గరకాడు. అహముకాడు. తదితరము కాడు. ఆజీవన్ముక్తుని స్థితి ఎట్టిదనగా, అత్యంతనిశ్చలము, మహాగంభీరమునై యుండును. అది ప్రకాశము, చీకటియు కాదు. మహావ్యాపకమై, అద్వితీయమై సర్వత్ర నిండియుండును. అనాఖముగా, అనభివ్యక్తముగా అతీతముగ నొక్కటి శేషించియుండును. అది శూన్యము, సాకారము, దృశ్యము, దర్శనము కాదు. భూతపదార్థసముదాయము కాదు. కేవలసత్తామాత్రము. అనంతరూపములో సంస్థి తమై యుండును. ఇదమిత్థమని వచించుటకు సాధ్యము కాదు. పూర్ణము కంటే అధికపూర్ణముగా నుండును. అది సత్తు, అసత్తు, సదసత్తు కాదు. భావము, భావనకాదు. కేవలచిత్పదార్థము. మహా చైతన్యము. అనంతమై, అజరమై, శివమై, ఆదిమధ్యాంతరహితమై, నిరామయమై యున్నది. అనాది సత్యపదార్థము. ద్రష్టృదర్శనదృశ్యమనేది త్రిపుటి మధ్యభాగములో కేవలదర్శనమేది కలదో అదే అది. (జీవితములొ, చూచెడిది, చూసెడివాడు, చూచుట అనే ప్రక్రియ మూడూ వుంటాయి. కాని ముక్తదశలో ఈమూడూ ఒక్కటే అయి వుంటాయి. ముక్తికి కారణమైన పరబ్రహ్మ, ముక్తమయ్యే ఆత్మ, ముక్తిపొందుట అనే ప్రక్రియలు మూడూఒక్కటే. విడివిడిగా ఏమివుండవు.) దీనికంటే గొప్పది, ఉత్తమమైనది, మరి యేదియులేదు. ఇదియే నిశ్చయము. ఇదియే సిద్దాంతము. ఇంతకుమించి యెద్దియునూలేదు. జీవుడు తనసంకల్పముతో బద్ధుడగుచున్నాడు. సంకల్పశూన్యుడై విముక్తుడగుచున్నాడు. ఏ మహాత్మునకు సర్వభోగవిరక్తి కలిగియున్నదో, సర్వదృశ్యవస్తువులయందును విరక్తి కలిగియున్నదో అట్టివానికి కూడ నియ్యది స్వసంవేద్యమే. పూర్ణహృదయముగల నీకు ప్రాప్తవ్యమంతయూ ప్రాప్తించి యున్నది. నీస్వరూపమై, తపస్సైయున్నది. నీవు ముక్తుడవై యున్నావు. భ్రాంతిని విడచిపెట్టుము. బాహ్యము నతిక్రమించినదియు, బాహ్యరహితమైనదియు బుద్ధిలోపల నున్నదియునగు తత్త్వమును దర్శించుచు, దర్శిమ్పని వాడవుగానగుము. (అనగా దానితో తాదాత్మ్యము చెందవలెనని భావము.) సాక్షిగా నున్న నీవు పరిపూర్ణుడుగా నున్నావు.
బ్రహ్మసూత్రదర్శనం:
సూ: తదధిగమ ఉత్తర పూర్వాఘయోరశ్లేష వినాశౌ తదవ్యపదేశాత్|బ్రహ్మజ్ఞానం కలిగిన మీదట పూర్వోత్తరపాపాలన్నీ నశిస్తాయి. బ్రహ్మజ్ఞానం,బ్రహ్మసాక్షాత్కారం కలిగినప్పుడు వెనుకటిపాపాలతో, రాబోయేపాపాలతో ఎట్టి సంబంధమూ వుండదు. ఆపాపాలు అతనిని(బ్రహ్మజ్ఞానిని) అంటవు. క్రమంగా ఉత్తరపాపం అంటదని, పూర్వపాపంనశిస్తుందని, గ్రహించాలి. బ్రహ్మజ్ఞానియొక్క పాపములు జ్ఞానాగ్నిలో పడి భస్మమై పోతాయి.
సూ: ఇతర ఇతర స్యాప్యేనమ సంశ్లేషః పాతేయ| పాపం కంటే ఇతరమైన పుణ్యానికిసైతం అంటక పోవటం, నాశనమవటంవున్నాయి. అంటే బ్రహ్మజ్ఞానియొక్క పాపపుణ్యాలు రెండూ నశించిపోతాయి. అతనికి రెండూ అంటవు. పుణ్యమనేది నశించకపొతే, ఆపుణ్యాలవల్ల వచ్చే ఫలాన్ని అనుభవించటానికై మళ్లీ శరీరం ధరించాల్సివస్తుంది. ఆస్థితిలో ఇక మోక్షమనేది అసంభవమవుతుంది. అందుకే ముండకో పనిషత్తులో అతని కర్మలన్నీ పుణ్యపాపకర్మలన్నీ క్షీణించిపోతాయి అని, బృహదారణ్యకోపనిషత్తులో బ్రహ్మవేత్త పుణ్యపాపాలు రెంటినీ తరిస్తాడనీ, ఇట్లు పాపపుణ్యాలు రెండిటికీ నాశము చెప్పబడింది. ఇక మోక్షమో, శరీరపాతమైన తర్వాత మోక్షమే! ఇక జన్మమనేది ఉండదు.
సూ: భోగేన త్వితరేక్షపయిత్వా సంపద్యతే| ఆరబ్దాలైన పుణ్యపాపాలు అనుభవించడం ద్వారా క్షయం కావించుకొనే బ్రహ్మను పొందుతున్నాడు. బ్రహ్మజ్ఞానం కలిగినంతనే అనారబ్దాలైన (సంచితములైన) పుణ్యపాపాలన్నీ నశించిపోతున్నాయి. ఆరబ్దమనేది దేహపాతంవరకే వుంటుంది. దేహపాతం, ఆరబ్ద కర్మసమాప్తి రెండు ఒకేసారి జరుగుతాయి. ఈవిషయమే "తస్యతావదేవచిరం" అనే శృతివాక్యంలో చెప్ప బడ్డది. కాబట్టి ప్రారబ్దభోగానంతరం ఇంకా అనేకదేహాల్ని ధరించడం అనేది వుండదు. దేహపాతం కలగడం ఆలశ్యం, మోక్షమే.
యోగ వాసిష్టం: ఉత్పత్తి ప్రకరణం: 9 వ సర్గ:
14.జీవన్ముక్తపురుషుడే దేహమును వదిలినపిమ్మట విదేహముక్తుడగును. వాయువు స్పందమును వీడి నిశ్చలమగునట్లు విదేహముక్తుడు మరల జన్మింపడు, మరణింపడు. వ్యక్తముకాడు. దూరమున గాని, దగ్గరగాని యుండడు. నేను, ఇతరులు అనే దృష్టి అతనికుండదు. ఈ విదేహముక్తుడే పరబ్రహ్మమై వెలయును.
ఉపశమ ప్రకరణం: 71వ సర్గ:
1-5: అవస్థాత్రయంబుల విచారించి, సాక్షియగు చిన్మాత్రమున వాటిని లయమొందించి, శేషించు నట్టి చిన్మాత్రస్థితి రూపమగు తురీయావస్థయొక్క యనుభవమెంత వరకూనుండునో, అంతవరకే జీవన్ముక్తుల యొక్కయు, వేదవాక్యముల యొక్కయు కేవలపదముండును. మనుజులకాకాశము విషయము కానట్లు, తురీయమునకు తురీయాతీతపదము, విదేహ, జీవన్ముక్తులకు వేదవాక్యముకూడ విషయము కానేరదు. ఆవిశ్రాంతపదవి అన్నింటికంటే యతిదూరమున కలదు. వాయువునకాకాశము వలె, విదేహముక్తులకు గమ్యమై యలరుచున్నది. జ్ఞాని కొంతకాలము సుషుప్తావస్థ యందు, కొంతకాలము జాగ్రత్ స్థితి ననుభవించియుండి, పిదప పరమానందపూరితుడై తురీయపదమును పొందును. తురీయాతీతపదమెరింగిన ఆత్మజ్ఞులెట్లా తురియాతీతదశ నొందుచున్నారో, అటులనే నివున్నూ ద్వంద్వరహితమగు యాపదము నొందుము.
52-56: ఆశరీరములన్నింటియందు నామరూపముగ పరమాత్మయొక్క (కల్పితయజ్ఞానముచే ప్రసిద్ధమగు)సర్వశక్తికలదు. ఇక్కారణమున స్వయముగా నాపరమాత్మకల్పితయజ్ఞానరూపుడై సుషుప్తి ప్రళయములందు స్థితి కలిగియున్నాడు. ప్రతిబింబదశనొందిన పరమాత్మచే భూషితమగు నాయజ్ఞానమే జీవుడనబడుచున్నది. (ఎప్పుడైతే ఆత్మ అజ్ఞానములో పడిందో, అప్పుడది జీవుడని పిలువబడుతోంది. ఆ అజ్ఞానం తొలిగితే, అదేఆత్మ, పరమాత్మ కూడా.) ఆజీవుడే సంసారమున మహామోహామయాత్మకమగు 'మాయ' యను పంజరమందలి గజమగును. జీవ(ప్రాణ)ధారచే నది జీవుడనంబడుచున్నది. అటులనే యహంకరించుటచే, అహంకారమనియు, నిశ్చయించుటచే బుద్ధియనియు, సంకల్పవికల్పముల నొన ర్చుటచే మనంబనియు, మనోదేహాదులకు కారణమగుటచే ప్రకృతియనియు, వర్థిల్లుటచే దేహమనియు, అజ్ఞానాధిక్యముచే జడమనియు, చైతన్యప్రాదాన్యముచే చేతనమనియు, వచింపబడుచున్నది. అజ్ఞాన తత్సాక్షుల మధ్యగల పరమాత్మభావసహితమగు మనస్సను తత్త్వమే అనేకత్వము నొంది, జీవ, బుద్ధి, చిత్తాహంకారాది నానాసంజ్ఞల ధరించుచున్నది. (ఇక్కడ చాలాస్పష్టంగా చెప్పారు. ఒకానొక సున్నిత మైన, సంక్లిష్టమైన తురీయదశకు వెళ్లేసరికి, ఆత్మ, జీవుడు, అంతఃకరణలు ఇవన్నీ ఒక్కటే! వేరు వేరు కావు. ఆయా దశలలో ఆయా పేర్లతో పిలువబడే 'ఆత్మ' అదొక్కటే! జ్ఞానసంహితమైతే అదే పరమాత్మ కూడా!)
72వ సర్గ:32-43: అసమ్యక్(మిధ్యా) దర్శనముత్యజించి, సమ్యక్దర్శనము నవలంభింపుము. సమ్యక్దర్శనమున స్థిరుడగువాడెచటను విమోహితుడుకాడు. దృశ్యదర్శనసంబంధ విస్తారముచే మనో రూపమగు ఆత్మయే ప్రకాశించుచున్నది.దృశ్యదర్శనసంబంధమున గల్గు పరమాత్మ సంబంధమగు అనుభవరూప సుఖవృత్తియు ఉపాధికృతభేద నిరసముచే గలుగు సుఖమున్ను అఖండబ్రహ్మమే యగును. కాన యనుభవమే సారమగు బ్రహ్మమని పేర్కొనబడినది. దృశ్యదర్శనసంబంధమున గల సర్వోత్తమమగు సుఖానుభవమే అజ్ఞానులకు సంసారమున్ను, జ్ఞానులకు మహాభ్యుదయయుక్తమగు మోక్షమున్ను గలుగజేయుచున్నది. మరియు దృశ్యదర్శన సంబంధమునగల యనుభవరూపమగు సుఖమే ఆత్మయొక్క దేహమని ఎన్నబడినది. ఆసుఖమే దృశ్య(విషయ)ముతో గూడినచొ బంధన మనియు, దృశ్యరహితమయినచో ముక్తియనియు వచింపబడినది. దృశ్యదర్శనసంబంధమున గల సుఖసంపత్తు వికారరహితమై, వృద్ధిక్షయములు లేనిదగుచో, ముక్తియనియే విజ్ఞులచే దలంపబడినది. దృశ్యదర్శనసంబంధమున గల యనుభవమే అఖండపూర్ణానంద స్వరూపమగు (పర)బ్రహ్మమగును. దృశ్యదర్శనవర్జితమగు సుఖమునవలంభించి, సంసారబంధరహితుడవు గమ్ము. ఇట్లు తన సుఖ స్వరూపము నాశ్రయించుటనే సుషుప్తివృత్తినాశ్రయించి, జీవునకు స్వస్వరూపదృష్టి ప్రకాశించును. ఇవ్విధమున తురీయావస్థ సంప్రాప్తించును. ఈస్థితియే ముక్తమని పేర్కొనబడినది.దృశ్యదర్శనవర్జితుడై పరమాత్మబుద్ధితో గూడుకొనియున్న జీవుడట్టి స్థితినొందును. ముక్తిరూపమగు నాతురీయావస్థయందు ఆత్మ స్థూలముగాని, సూక్ష్మముగాని, ప్రత్యక్షముగాని, అప్రత్యక్షము గాని, చైతన్యము గాని, జడము గాని, సత్తుగాని, అసత్తుగాని, అహంకారరూపముగాని, దన్యరూపముగాని, ఏకముగాని, అనేకము గాని, సమీపస్థముగాని, దూరస్థముగాని, ప్రాప్యాముగాని, అప్రాప్యముగాని, సర్వరూపముగాని, సర్వ వ్యాపకముగాని,పదార్థరూపముగాని, అపదార్థరూపముగాని, పంచభూతాత్మగాని, పంచభూతరూపము గాని, గాక యుండును.
ఉత్పత్తి ప్రకరణము:9వ సర్గ:
26. ముక్తి యని చెప్పబడునదే బ్రహ్మము, నిర్వాణము గూడనైయున్నది. దీనిని బడయగల ఉపాయముని చెప్పెదను వినుము. అహం బుద్ధితోగూడి కనపడు దృశ్యజగత్తంతయూ వంధ్యాపుత్రుని వలె అళీకమను(స్వప్నమువలె లేనిదను) జ్ఞానము వలననే ఈముక్తి కలుగును.
అన్నపూర్ణోపనిషత్:ద్వితీయాధ్యాయము:
దృశ్యముతో కూడినది బంధము. దీనినుండి విముక్తికల్గిన ముక్తి వచ్చును.దృశ్యదర్శన సంబం ధమున అనామయమైన ఏయనుభూతియున్నదో, ఆసౌషుప్తిని స్తంభింపజేసి, నీవుండుము. అప్పుడే స్థితికల్గునో, అదే తుర్యత్త్వమును పొందుము. దానియందు దృష్టిని స్థిరముగాజేయుము. ఆత్మ స్థూలము కాదు. అణువుకాదు. ప్రత్యక్షముకాదు. ఇతరమునుకాదు. అచేతనుడు, జడుడుకాదు. ఆసన్న, సన్మయుడునుకాదు. నేనుకాదు. అన్యుడకాను. ఏకుడను, అనేకుడనుకాను. అద్వయు డను, అవ్యయుడును, సర్వేంద్రియములనుకాను. స్థానమైన మనస్సు దృశ్యత్వమును పొందినది. దృశ్యదర్శన సంబంధమున పారమార్థిక సుఖమేదియున్నదో, ఆ అతీతమైనపదము దేనివలన కల్గునో అది ఇక్కడనే ఉన్నది. మోక్షము ఆకాశము పై భాగమున లేదు. పాతాళమున లేదు. భూమిమీద లేదు. అన్ని ఆశలు క్షయమును పొందగా చిత్తము క్షయమగును. అదే మోక్షమన బడును.
"న విద్యతే యస్య చ జన్మకర్మవా న నామరూపే గుణదోష ఏవ వా తథాపి లోకావ్యయసంభవాయ యః స్వమాయయా తాన్యనుకాలమృచ్ఛతి తస్మైనమః పరేశాయ బ్రహ్మణే-ననంతశక్తయే అరూపాయోరురూపాయ నమః ఆశ్చర్య కర్మణే
నమఆత్మప్రదీపాయసాక్షిణేపరమాత్మననమో గిరాం విదూరాయ మనసశ్చేతసామపి
సత్త్వేనప్రతిలభ్యాయనైష్కర్మ్యేణవిపశ్చితానమః కైవల్యనాధాయ నిర్వాణసుఖసంవిదే"
ఎవరి జన్మము మనవలె కర్మబంధముతో జరుగదో, ఎవరిచే నహంకారప్రేరితకర్మ కావింపబడదో, ఎవరి నిర్గుణస్వరూపమునకు నామదేయంబులులేవో, రూపములేదో, అయిననూ ఎవ్వరు సమయాను సారంబున జగత్సృష్టిలయంబుల గావించుచూ, స్వేచ్ఛతో జన్మంబు తనకుతా పొందునో, అట్టి అనంతశక్తి సంపన్న పరబ్రహ్మపరమేశ్వరునకు నమస్కారము చేయుచున్నాను. ఆప్రకృతి ఆకారరహితమైయ్యూ అనేకాకారంబులు గల్గియుండు అద్భుతకర్మాచరణుడైన భగవానునకు పలుమార్లు నమస్కరించు చున్నాను. స్వయంప్రకాశమూర్తి, సాక్షీభూతుడైన పరమాత్మకు నమస్కారములు చేయుచున్నాను. ఏ ప్రభువు మనోవాక్చిత్తవృత్తులకతీతుడై సర్వత్రవ్యాపించియుండునో వానికి పలుమార్లు నమస్కరించు చున్నాను. వివేకియైన పురుషునిచే, సత్వగుణవిశిష్టనివృత్తి ధర్మాచరణముచే ప్రాప్తయోగ్యమైన మోక్ష సుఖంబునిచ్చువాడు, మరియు మోక్షసుఖానుభూతి రూపుడైన ప్రభువునకు నమస్కారము చేయు చున్నాను. (వ్యాస భాగవతము)
"భవము దోషంబు రూపంబు గర్మంబు నాహ్వయమును గుణము లెవ్వనికి లేక
జగముల గలిగించు సమయించు కొరకునై నిజమాయ నెవ్వడిన్నియును దాల్చు
నా పరేశునకు ననంతశక్తికి బ్రహ్మకిద్ధరూపికి రుపహీనునకును
జిత్రచారునికి సాక్షికి నాత్మరుచికిని బరమాత్మునకు బరబ్రహ్మమునకు
మాటలను నెరుకల మనముల జేరంగగాని శుచికి సత్త్వగమ్యు డగుచు
నిపుణుడైన వాని నిష్కర్మతకు మెచ్చు, వాని కే నొనర్తు వందనములు."
భగవంతునికి పుట్టుకా, పాపమూ, ఆకారమూ, కర్మా, నామాలూ, గుణాలూ లేవు. అతడు లోకాలను పుట్టించి నశింపజేయడంకోసం తనమాయాప్రభావంతో యివన్నీధరిస్తాడు. రూపంలేనివాడైనా ఆశ్చర్యకరంగా అంతులేని శక్తితో నిండైన రూపాన్ని పొందుతాడు. అన్నింటినీ చూస్తాడు. ఆత్మకాంతిలో వెలుగుతాడు. అతడే ఆత్మకుమూలం. అతడే మోక్షానికి అధికారి. అతడు మాటలకూ వూహలకూ అందరానివాడు, పరిశుద్ధుడు. సత్వగుణంతో దరిచేరదగినవాడు. నేర్పరులు చేసే ఫలాపేక్షలేని కర్మలకు సంతోషిస్తాడు. అటువంటి దేవునికి నేను నమస్కారాలు చేస్తాను. (పోతన భాగవతము)
"ఒక మనవి"
ఇంతవరకూ గతించిన విషయాలన్నీ చదివిజీర్ణించుకున్న పాఠకోత్తములకు వేనవేలనమస్కారములు. మాపరమగురువుల ఆశయమిదియే. దీపంతోదీపం వెలిగించినట్లు, తత్త్వజ్ఞానయోగాలను అందరికి అందించడమే వారి ఆశయం. మన దగ్గరున్నది ఏమిచ్చినా అదిఅయిపోతుంది. కాని ఇచ్చినకొద్దీపెరిగేవి విద్య, జ్ఞానం మాత్రమే. ఎలాగంటే, ఒకదీపంతో ఎన్నిలక్షల, కోట్ల దీపాలు వెలిగించినా, మొదటి దీపంయొక్క కాంతితగ్గదు, సరికదా, మిగతా దీపాలతో కలసి, మహోజ్జ్వలకాంతి వెదజల్లుతుంది. కాబట్టి మనమందరం కూడ ఈతత్త్వజ్ఞానయోగ దీపాలను వెలిగించి అందరికి అందిద్దాం. అశాంతితో కొట్టుకుపోతున్న ప్రపంచజనులలో, యోగులశాతాన్ని పెంచి, సమతుల్యతను సాధించి, ఆధ్యాత్మిక తత్త్వజ్ఞానయోగపరంగా మన భారతవర్షాన్ని ప్రపంచంలో ప్రప్రధమంగా నిలబెడదాం! ఈ ప్రక్రియలో మీరందరూ మీమీవంతుగా ప్రయత్నిస్తారని ఆశిస్తు న్నాము. ఈప్రయత్నంలో మేము పరిశీలించిన గ్రంధములు: ఉపనిషత్తులు, శ్రీవివేకచూడామణి, శ్రీఅష్టావక్రగీత, శ్రీయోగ వాసిష్ఠము, శ్రీనోరి శ్రీనాధవెంకటసోమయాజులు వారి 'బ్రహ్మసూత్ర దర్శనం'. అనన్యులైన ఈ గ్రంధకర్తలకు మా శరణాగతిని ప్రకటించు చున్నాము. ఈ విషయ పరంపర ఇంకా కొనసాగుతుంది. ఆదరించ ప్రార్థన. మీ అందరకూ తగు ఆధ్యాత్మిక తత్త్వ జ్ఞాన యోగములను ప్రసాదించాలని ఆ మహాగురుతత్త్వాన్ని, శ్రీగురుపరంపరని ప్రార్థిస్తున్నాము. = తత్వవిశ్లేషణ టీం.
|
|