తత్త్వవిశ్లేషణ
ఇంతవరకూ మనం అజ్ఞానమంటే ఏమిటో తెలుసుకున్నాం. ఇప్పుడు జ్ఞానార్జనకు కావలసిన తత్త్వవిశ్లేషణ అంటే తత్త్వవిచారము గురించి తెలుసుకుందాం. తత్త్వ విచారమనేది అధ్యాత్మికవిద్యకు మూలస్తభం. ఇది పరమాత్మ అన్వేషణలోగల అన్నిస్థాయిలలోను అవుసరమైనది. బీజగణితంలో మూలసూత్రములైన '+' మరియు '-' లయొక్క సంబంధం ప్రతిచోట అవుసరమైనట్లు, ఈతత్త్వవిచారణకూడా ప్రతిస్థాయిలోను అవుసరమౌతుంది. పైపైస్థాయిలకు వెళ్ళేకొలది తత్త్వవిచారణ అత్యంతసునిశితము, సూక్ష్మము అవుతూ, ఏమాత్రం ఏమరుపాటుగావున్నా మనలను అపప్రథలవైపు, అజ్ఞానంవైపు పడవేస్తూ అసలైనత్రోవనుండి తప్పించివేస్తూవుంటుంది. (కేవలం ఒక్కస్వరం ఉచ్ఛారణతేడావల్ల ఇంద్రుని చంపవలసిన వృత్తాసురుడు, అదే ఇంద్రునిచేతిలో మరణిస్తాడు). అందువలన దీనియొక్క ప్రాధాన్యత గమనించి బుధులు, ద్రష్టలు అవుసరంవున్నా లేకపోయినా, దీనిగురించి చాలాచోట్ల చెప్పారు.
ఇంకాచెప్పాలంటే, "ఉత్తమం తత్త్వచింతనం" అన్నారు. ఈతత్త్వవిచారణ మనలను చాలాదగ్గరదారిలో పరమాత్మవద్దకు తీసుకొనిపోతుంది. ఈతత్త్వవిచారాన్ని ఉపయో గించే గజేంద్రుడు "ఎవ్వనిచే జనించు" అనిమొదలుపెట్టి, "లోకంబులు, లోకేశులు, లోకస్థులు తెగినతుది" అనితెలుసుకొని, "జిత్రచారునికి, సాక్షికి, నాత్మ రుచికిని" అనివిచారముచేసి, "నిఖిలకారణునకు, నిష్కారుణునకు నమస్కరింతు" అని, "విశ్వకరు, విశ్వదూరిని", "శాశ్వతు, నజుభజియింతున్" అని, "నీవేతప్ప ఇతఃపరం బెరుంగ" అనిస్వాత్మ సమర్పణచేసి కొని, ఆపరమాత్మని పొందాడు. మదానికి, తమస్సుకి, భూతత్త్వానికి, అజ్ఞానపరాకాష్ఠకి ప్రతినిధి అయిన ఒకఏనుగు, ఒకజంతువే, తత్త్వవిచారాన్నిచేసి, పరమాత్మను సాధించగా, యుక్తాయుక్తవిచక్షణ, మనస్సు, బుద్ధి, చైతన్యము, ఆత్మ గలిగినటువంటి మనము ఆపరమేశ్వరుని పొందలేమా? ఎవరికివారే ఈప్రశ్నవేసుకోండి. నాదృష్టిలోఅయితే, తత్త్వవిచారాన్ని చక్కగా ఉపయోగించి, పరమాత్మని పొందిన గజేంద్రుడే ఆదర్శనాయకుడు (Ideal Hero). వేరెవ్వరూకాదు. ఇదే తత్త్వవిచారణలోనున్న గమ్మత్తు. దీనినే "కించిత్ వ్యుత్పన్నచేతస్సు"తో "యుక్తిపూర్వకముగా" చేస్తే, "ఆకాశఫలపాతవత్" అనగా ఆకాశంనుండి పండుపడిన విధముగా పరమాత్మజ్ఞానం వస్తుందని యోగవాసిష్ఠంలో శ్రీవసిష్ఠులవారు శ్రీరామునికి ఉపదేశించారు. కాబట్టి తత్త్వవిశ్లేషణ గురించి మహనీయులు ఏవిధంగా తెలియజేశారో తెలుసుకుందాం! కొన్నివివరణలు బ్రాకెట్లలో ఇవ్వడమైనది.
కఠోపనిషత్:2వవల్లి:ప్రథమాధ్యాయం:
7. ఆత్మనుగురించి వినుటలకు అనేకులకు సాధ్యముకాదు. ఒకప్పుడు వినినప్పటికే దానిని సరిగా అర్థముచేసికొనలేరు. అట్టిస్థితిలో ఆత్మజ్ఞానమును బోధించువాడు లభించిన ఆశ్చర్యకరమైన విషయమే! తగినగురువుచేత బొధింప బడిన వాడై దానిని గ్రహింపగల శిష్యుడు లభించుటయు నాశ్చర్యకరమైన విషయమే!
3వవల్లి:14: నచికేతాలెమ్ము! మేల్కొనుము! సద్గురువును సమీపించి ఆత్మజ్ఞానమును సంపాదించుము. పదునుకలకత్తిఅంచు(అసిధార)వలె ఆ మార్గము చాలనిశితమైనది. దాటశక్యముకానిది. పొందశక్యముకానిది అని కవులు ప్రవచించుచున్నారు.
ద్వితీయాధ్యాయము:4వవల్లి:
1. పరమేశ్వరుడైన బ్రహ్మబయటకుపోవు స్వభావముగల యింద్రియములను సృష్టించెను. అందువలననే మానవుడు అంతరాత్మనుచూడక, బయటి విషయము లనే చుచుచున్నాడు. కానికొంతమంది ధీమంతులు ఆత్మాభిముఖముగ దృష్టిని మరలించి, యాప్రత్యగాత్మను దర్శించుచున్నారు.
6.జ్ఞానమునకు(చతుర్ముఖబ్రహ్మకు) ముందు జన్మించినవాడు, నీకంటె ముందుగా జన్మించినవాడు, పంచభూతములకు మధ్యనున్నవాడు, బ్రహ్మయొక్క తపస్సుచే పుట్టినవాడు, జలముకంటే పూర్వము సృష్టింపబడినవాడు, హృదయ కుహరమునందు నివసించువాడునగు ఆత్మను ఎవడు చూచుచున్నాడో, అట్టివాడే బ్రహ్మను దర్శించుచున్నాడు. ఇదియే అది(పరబ్రహ్మ). నీవింతకు ముందడిగి యున్నది.
14.నిర్మలమగు జలము దుర్గమములలోపడి దానిలో ఏకమగు నట్లు, జ్ఞానముకల యోగియొక్క ఆత్మకూడా పరబ్రహ్మమేయగుచున్నది.
6వవల్లి:13: ఉన్నది, లేదు అనురెండిటిలోను 'ఉన్నది' అనునదిమాత్రమే తత్త్వభావముతో పొందబడవలెను. ఇట్టిఅస్థిత్వమును అనుభవించువానికే తత్త్వము అనుభవమగుచున్నది.
ముండకోపనిషత్:ప్రథమముండకం:ద్వితీయఖండం:
10. సంసారాసక్తిగల మూఢులు యాగాదిశ్రౌతకర్మలను(ఇష్టి), వాపీకూపతటాకాది స్మార్తకర్మలను, అన్నిటికంటే ఉత్తమకర్మలుగా భావించుచూ, ఆత్మజ్ఞానమనెడి ఉత్తమశ్రేయసాధనమును తెలియలేకయున్నారు. అట్టివారు భోగస్థానమైన స్వర్గము నందు కర్మఫలమును అనుభవించి, ఈలోకములో మనుష్యజన్మముగాని, అంత కంటె నీచజన్మమునుగాని పొందుచున్నారు.
3-5: ఉపనిషత్సంబంధమైన ధనుస్సునుతీసుకొని, ఉపాసనతో తీక్ష్ణము చేయబడిన బాణమును సంధించి, బ్రహ్మచింతనమును విజ్ఞానముతో బాగుగాలాగి, ఆఅక్షరపరబ్రహ్మమును లక్ష్యముగాచేసికొని, ప్రయోగింపవలెను. ప్రణవమే ధనస్సు. ఆత్మ(మనస్సు) బాణము. బ్రహ్మ ఆఆత్మకులక్ష్యముగా చెప్పబడుచున్నది. ప్రమత్తత లేని సాధకునిచేత బ్రహ్మపొందదగినది. జ్ఞాని బాణమువలె లక్ష్యస్వరూపుడై సాధించ వలెను. దేనియందు ద్యులోకము, భూమి, అంతరిక్షము, సకల ప్రాణాధికరణములతో కూడిన మనస్సు సమర్పితమైయున్నదో, ఆఅక్షరపరబ్రహ్మనే అద్వితీయునిగాను, మీయొక్క ఆత్మనుగాను తెలుసుకొనుడు. ఇతరవిద్యలను వదిలివేయుడు. ఈఆత్మ జ్ఞానము మోక్షమునకు వారధియైయున్నది.
తృతీయముండకం:ప్రధమఖండం:
8. ఆపరబ్రహ్మము నేత్రములతోగాని, ఇంద్రియములతోగాని, తపస్సుతోగాని, సత్కర్మతోగాని గ్రహించుటకు సాధ్యముకాదు. ఆత్మజ్ఞానముతో పరిశుద్ధమగు అంతఃకరణముకలవాడై, ఆపిమ్మట పరబ్రహ్మను నిరాకారముగా ధ్యానించువాడు మాత్రమే ఆత్మను తెలిసికొనగలుగుచున్నాడు.
ద్వితీయఖండం:9:
ఎవడు సర్వోత్తముడగు పరమాత్మను తెలిసికొనిచున్నాడో, అట్టిజ్ఞాని సాక్షాత్ పరబ్రహ్మమే అగుచున్నాడు. ఆఆత్మవేత్తయొక్క వంశమందు ఆత్మవేత్తకానివాడు జన్మించడు. ఆత్మజ్ఞాని సకలదుఃఖములను దాటిపోవుచున్నాడు. పాపములను వదిలించుకొనగలుగుచున్నాడు. హృదయములోని అజ్ఞానగ్రంధులు త్రెంచుకొన్న వాడై, అమృతస్వరూపుడగుచున్నాడు.
తైత్తిరీయోపనిషత్:బ్రహ్మానందవల్లి:ద్వితీయాధ్యాయం:6వ అనువాకం:
పరబ్రహ్మము లేనిదనితెలిసికొనినవాడు లేనివాడుగనే అగుచున్నాడు. ఉన్నదని తెలిసికొనినయెడల, ఈతెలిసికొనినవానిని, ఉన్నవానినిగా తెలిసికొనియున్నాడు. పూర్వము చెప్పబడిన ఆవిజ్ఞానమయమునకు, విజ్ఞానమయకోశమందున్న ఆత్మ స్వరూపము ఈఆనందమయమే. ఆకారణమువలన అనుసరించిన ప్రశ్నలు విను చున్నాడు. విద్వాంసుడుకానివాడు మరణముపొంది ఈలోకమునుపొందు చున్నాడు.
బృహదారణ్యకోపనిషత్:తృతీయాధ్యాయం:చతుర్థబ్రాహ్మణం:
ఈసమస్తప్రపంచము పరబ్రహ్మజ్ఞానముకంటె (సృష్టికి)పూర్వము పరబ్రహ్మము గానే నుండెను. ఆపరబ్రహ్మము నేను పరబ్రహ్మమునైతినని తనను తాను తెలిసి కొనెను. ఈరీతిగా తెలిసికొనుటవలన, ఆపరబ్రహ్మసర్వస్వరూపముగా ఆయెను. దేవతలలోపల ఎవడెవడు ఆపరబ్రహ్మమును తెలిసికొనెనో, వాడే ఆపరబ్రహ్మముగా ఆయెను. మహర్షులలోను, మనుష్యులలోను ఆప్రకారమే. వామదేవుడను ఋషి ఈపరబ్రహ్మస్వరూపమునే చూచుచూ, నేను మనువునయితిని, సూర్యుడనయితిని అనిభావించి, సర్వస్వరూపమునుపొందెను. అటువంటి ఈపరబ్రహ్మమును, ఈ వర్తమానకాలమందు ఎవడు ఈప్రకారము, నేను పరబ్రహ్మము నైతినని తెలిసికొను చున్నాడో, అతడు ఈసమస్తమునగుచున్నాడు. అట్టిపరబ్రహ్మవేత్తకు దేవతలును విరోధముచేయుటకు సమర్థులుకారు. ఆపరబ్రహ్మవేత్త ఈదేవతలకు ఆత్మ స్వరూపముగానగుచున్నాడుకదా! బ్రహ్మవేత్తగాని పురుషుడు, ఉపాసన చేయ బడెడిదైవము, ఉపాసించెడి తనకంటెవేరుగా నెవడు భావించు చున్నాడో, అట్టిఅజ్ఞాని పరబ్రహ్మతత్త్వమును తెలిసికొనలేడు.
పంచమాధ్యాయం:అష్టమం బ్రాహ్మణం:
9. ఎవడు ఈఅక్షరపరబ్రహ్మమును తెలిసికొనక హోమమును చేయుచున్నాడో, యాగమును చేయుచున్నాడో, తపస్సును పెక్కుసంవత్సరములు చేయుచున్నాడో, అట్టివానియొక్క ఆకర్మఫలమంతయూ, అంతముకలదే అగుచున్నది. ఎవడు ఈఅక్షరపరబ్రహ్మమును తెలిసికొని, ఈలోకమునుండి మరణము పొందుచున్నాడో, అతడు ఆఅక్షరపరబ్రహ్మస్వరూపమే అగుచున్నాడు.
షష్ఠాధ్యాయం:చతుర్థ బ్రాహ్మణం:
12, 13: ఈఅత్మను నేనైయున్నాను అని తెలిసికొనిన మనుజుడు ఇకదేనినీ తనశరీరమును కష్టపెట్టవలసినపనిలేదు. దుఃఖపడవలసిన పనిలేదు. వాడు సర్వదా ఆత్మగానే యుండుటవలన, తదితరమైన కోరికయువారికిలేదు. సందేహముచే నిండిన గహనమగు సంసారమునందు ప్రవేశమొనర్చి, అత్మ తత్త్వమును ఎవడు తెలిసియున్నాడో, సాక్షాత్కారము నొందియున్నాడో, అతడే విశ్వకర్మ, సర్వకర్త. సమస్తలోకములు అతనివే! అతడే ఈలోకమంఅతయునూ! వానికిసర్వము ఆత్మే. సర్వమునకు వాడు ఆత్మీయుడగుచున్నాడు. గనుక అద్వితీయమును, ఏకమునగు పరమాత్మ నేనని భావించవలయును.
19. ఆపరబ్రహ్మమును మనస్సుచేతనే తెలుసుకొనవలెను. బ్రహ్మదర్శన విషయ మందు కొంచెముకూడ అనేకత్వము లేదు. పరబ్రహ్మదర్శనమునందు నానాత్వము చూచువాడు, మరణమువలన మరణము పొందుచున్నాడు. (అనగా జననమరణ చక్రబంధములో చిక్కుకొనుచున్నాడు.)
శ్వేతాశ్వతరోపనిషత్:చతుర్థాధ్యాయం:
16, 17: నెయ్యిలో దానికంటె సూక్ష్మమైన మీగడయున్నట్లు, సమస్తప్రాణులలోను నిగూఢముగా పరమేశ్వరుడున్నాడు. విశ్వవ్యాపకుడును, ఒక్కడును, మహా ప్రభువును నగు పరమాత్మను తెలిసికొనినవాడు, సకలపాపములనుండియు, విముక్తిని పొందుచున్నాడు. "నేతి, నేతి" (లేదు, లేదు)అని అనిత్యపదార్థములను విజ్ఞానబుద్ధితో, వేదాంతవిచారణవలన తిరస్కరించుటవలన, ప్రకాశస్వరూపుడగు పరమేశ్వరుడు తెలియబడుచున్నాడు. ఆపరమాత్మను తెలిసికొనినవాడు అమృత స్వరూపుడగుచున్నాడు.
షష్ఠోధ్యాయము:3, 4:
పరమేశ్వరుడు సృష్టినిచేసి, దానినిబాగుగ ఆలోచించి, మరల తత్ స్వరూపముతో సంబంధమునుపొంది, 1,2,3,8 అగువానితోను, కాలముతోను, సూక్ష్మమగు అంతః కరణగుణములతోను, త్రిగుణసహితమగు సకలవస్తువులను సృజించెను. ఈ సృజించిన సకలభావములను ఎవడు పరమేశ్వరునికే తిరిగి సమర్పిచునో, అతడు కర్మరహితుడగుచున్నాడు. (భగవద్గీతలో చెప్పినవిధముగా నిష్కామకర్మ చేసి నప్పుడే, ఆత్మసమర్పణ పుర్తిగా బోధపడుతుంది. పిళ్ళైకథలో సాయిబాబా ఇదే చెప్పారు. "వారిపాదములకడ నీసర్వస్వమును అర్పించుము, పిదపవారేమిచేసెదరో చూడుము" అని. ఒకానొకస్థాయిలో "యద్యత్కరోమిశంభో, సకలంతదీయా రాధనం" అన్నభావనలోకి ప్రవేశించాలి. అలాగే కొన్నిఉపనిషత్తులలో, శిష్యుడు తానుచేయు స్వాత్మసమర్పణే, నిజమైన గురుదక్షిణ అని తెలియజేశారు. ఇలా ఎవరైతే ఆ పరబ్రహ్మకు స్వాత్మసమర్పణ చేసుకొంటారో, వారు సకలపుణ్యపాపకర్మల ఫలితములనుండివిముక్తినొంది,జీవన్ముక్తదశకుఅర్హులవుతారు. శ్రీచైతన్యమహాప్రభుకూడా, మంత్రోపదేశ సమయంలో, తనగురువునకు స్వాత్మసమర్పణ చేసి కొన్నారు.) అట్టికర్మక్షయముగలవాడు పంచభూతతత్త్వములకంటె పరుడగు పరమాత్మను పొందుచున్నాడు.
సర్వసారోపనిషత్:19:
నేను శరీరమునుగాను, దశేంద్రియములుగాను, బుద్ధి, మనస్సు, ఈశ్వరుడు గాను, అదేరీతిగా అహంకారముగూడకాను. నేనుప్రాణరహితుడను. మనోరహితు డను. పరిశుద్ధుడను. బుద్ధ్యాదులకు సర్వదాసాక్షిరూపుడను. నేనుసదా నిత్యుడను. చిన్మాత్రుడను. ఇందులో సంశయములేదు. నేనుకర్తనుగాను, భోక్తను గాను, ప్రకృతికి సాక్షిస్వరూపముగా నుండువాడను. నాతో కలసియున్నందువలన దేహాదులు చైతన్యవంతములై కార్యములు చేయుచున్నవి. నేను నిశ్చలుడను, నిత్యుడను, సదా ఆనందస్వరుపుడను. సర్వవ్యాపకుడను, సాక్షిని, ఇందులో సందేహము లేదు. సర్వవేదాంతవేద్యమగు బ్రహ్మమును నేను. నేను అజ్ఞేయుడను. ఆకాశాది పంచభూతములు నేనుకాదు. నేనునామములను కాదు. సచ్చిదానంద మయమైన బ్రహ్మమునేను. నేనుదేహమునుకాను, కావున జననమరణములు నాకెట్లు? నేను ప్రాణమునుకాను. కావున ఆకలిదప్పులునాకెట్లు? నేనుచిత్తమును కాను. కావున శోకమోహములు ఇకనాకెట్లు? నేనుకర్తనుకాను, కావున బంధమోక్షములు ఇకనాకెక్కడనున్నవి?
పైంగలోపనిషత్:చతుర్థాధ్యాయము:
3,4,5: అమృతపానముతో సంతృప్తిపడువానుకి పాలతో ప్రయొజనమేమున్నది? స్వాత్మానందమునెరింగిన వానికి వేదములతో పనియేమున్నది? జ్ఞానామృత సంతృప్తుడగు యోగీంద్రునకు కర్తవ్యకర్మలేవియువుండవు. అత్మజ్ఞానము తెలిసిన వాడు తత్త్వవేత్తయగుచున్నాడు. బ్రహ్మవేత్తదూరస్తుడైననూ, దూరముగాలేడు. ప్రత్యగాత్మపిండస్థుడై(శరీరమునందు) ఉన్ననూ, పిండవర్జితుడై సర్వవ్యాపిగా నున్నాడు. హృదయమును నిర్మలముచేసికొని అనామయమగు పరమాత్మను ధ్యానించి, అపరమాత్మను నేనే అనితెలిసి, జీవుడు పరమానందమును పొంద వలెను. జలముతో చేర్చబడిన జలము, క్షీరముతో చేర్చబడిన క్షీరము, నేతితో చేర్చిన నెయ్యివలె జీవాత్మ పరమాత్మలోనేకమై భేదములేనిదగుచున్నది. దేహము నందు జ్ఞానదీపము ప్రకాశించగా, బుద్ధి అఖండాకారమగును. అప్పుడు విద్వాంసుడు బ్రహ్మజ్ఞానమను అగ్నితో కర్మబంధమును దహించును. ఆపిమ్మట బ్రహ్మవేత్త, పవిత్రుడును, విమలంబరాభరుడును, అద్వైతరూపుడునునగు పరమేశ్వరునిలో ఆత్మైక్యముపొంది, జలములో జలము కలిసిపోయినరీతిగా స్వాత్మ స్వరూపుడై నిరుపాధి సంస్థితుడగును. ఆకాశమువలె ఆత్మ సూక్ష్మశరీరముకలది. అది వాయువువలె దృష్టికి గోచరముకాదు. ఆత్మ బాహ్యాభ్యంతరములందును నిశ్చల మయినది. జ్ఞానమనుదీపముద్వారా జ్ఞాని అంతరాత్మను దర్శించు చున్నాడు. బ్రహ్మవేత్త ఎక్కడ ఏయేప్రదేశములలో మరణించుననూ, అక్కడనే సర్వగతమగు ఆకాశమువలె లయమును పొందుచున్నాడు. మహాకాశములో ఘటాకాశము లయమును పొందు రీతిగా తత్త్వజ్ఞాని ఆపరమాత్మయందు ఆత్మను లయముచేసి నిరాలంబ యోగదర్శనము చెందును.
సహస్రాదిసంవత్సరములు ఏకపాదస్థితుడై తపస్సుచేసిననూ, ఒక్క ధ్యాన యోగముయొక్క 16వభాగముతోగూడ సమానముకాలేదు. ఇదియే తెలియదగిన జ్ఞానము. ఇదియే జ్ఞేయము. సర్వమును తెలిసికొనుటకు ప్రయత్నించి మానవుడు వేలాదిసంవత్సరములు జీవించి కృషిచేసిననూ, శాస్త్రములయొక్కసారమును గ్రహించలేదు. ఆక్షరపరమాత్మను తెలిసికొనవలెను. జివితము బహుచంచలమైనది. శాస్త్రజాలములను విడచిపెట్టి సత్యమగు బ్రహ్మమునపాసించవలెను. మానవుడు బ్రహ్మతత్త్వమును తెలియక యున్నంతవరకునూ అనంతములగు కర్మలు, శౌచము, జపము, యజ్ఞము, తీర్థయాత్రాభిగమనము మున్నగునవి నాచరించు చుండును. మహాత్ములకు ఆపరబ్రహ్మానుభవమే నియతముగా మోక్షమే హేతువై యున్నది. బంధమునకు మోక్షమునకు 'మమ', 'నమమ' అను రెండుపదములే కారణములగుచున్నవి. జీవుడు 'మమ' అనుభావముచే బంధమును, 'నమమ' అను భావముచె మోక్షమును చెందుచున్నాడు. మనస్సు 'ఉన్మనీభావము' (మనస్సునుదాటినస్థితి)ని చెందగా, ద్వైతభావముకలగదు. మనస్సు ఉన్మనీ భావము జెందగనే జీవునకు పరమాత్మపదము లభించును. మనస్సు ఏఏప్రదేశములకుపోవునో, అచ్చటనే పరమపదములభించును. పరబ్రహ్మ సర్వత్ర సమవస్థితమైయున్నది. సమస్తము బ్రహ్మమే! బ్రహ్మముకాని వస్తువులేదు. ఆకాశమును ముష్టులతో త్రుంచవచ్చునేమో, క్షుధార్తుడు ఆకలిదపులు అస్సలురాకుండా చేసికొనవచ్చునేమో కాని, "నేనుబ్రహ్మమునుకాను" అనిభావించు జడుడు ఎప్పుడూ మోక్షమును పొందలేడు.
మహోపనిషత్:చతుర్థాధ్యాయము:
మోక్షద్వారములో నలుగురు ద్వారపాలకులున్నారని చెప్పబడినది. వారే శమము, విచారణ, సంతుష్టి, సజ్జనసాంగత్యము. ఆమోక్షద్వారపాలురలో ఏ ఒక్కరికైననూ సర్వప్రయత్నముచేతనూ, సమస్తమునూ వదలియైననూ, గట్టిగ ఆశ్రయింపవలెను. ఒకరువశమైన, తక్కినముగ్గురు నీకువశమయ్యెదరు. శాస్త్రా భ్యాసము, సజ్జనసంపర్కము అనుతపస్సుచేతను, దమముచేతను, ముందు సంసారబంధవిముక్తి నిమిత్తము ప్రజ్ఞను గట్టిగా అభివృద్ధిచేయవలెను. ఎవనికి అభ్యాసమువలన స్వానుభవము, శాస్త్రవాక్యము, సద్గురువాక్యము అను ఈమూడును సమన్యయత్వముతో అత్మలో నిరంతరము దర్శనమొసంగునో, అతనికి పరమాత్మ దర్శనమిచ్చును.
ప్రతిక్షణము సంకల్పములు, ఆశలు, విషయములను స్మరించుట అనువీటిని త్యజించుచున్ననూ, పరమపావనమగు అమస్కసిద్ధిని సాధించినవాడవగుదువు. మనస్సు అకర్తగానుండునట్టి తూష్ణీంస్థితియే సమాధి. అదియే కేవలభావనస్థితి. అయ్యది శుభంకరమగు ఉత్తమనిర్వాణము. మనస్సుతొ సకలసంకల్పములను పరిత్యజించి, మూగవానివలెను, అంధుని వలెను, బధిరునివలెను సంచరించుము. ఈసర్వము ప్రశాంతము, అజము, ఏకము, ఆదిమధ్యాంతరహితము, ప్రకాశ స్వరూపము, దృశ్యభావములేని అనుభవరూపము. ఈసమస్తము ఓంకారమే అనిచెప్పుటకూడ భ్రాంతియే. ఈసకల దృశ్యప్రపంచమంతయూ చిద్వస్తువే. చైతన్యముకన్నా యిక్కడ మరియొక్కటి లేదని భావనచేయుము. ఈరీతిగా నీవు సర్వదా జాగరూకతతో, నిండుమనస్సుతో, ఆత్మే అద్వితీయమని తెలుసుకొని, జగత్కార్యమునాచరించుచునే, విస్తరంగసముద్రము వలె నిశ్చలుడవైయుండుము. వాసనలను తృణమునకు అగ్నివంటిదైన ఆత్మతత్త్వవభోధనయే సమాధియని చెప్పబడినది. అంతియేకాని సమాధియనగా తూష్ణీంస్థితికాదు. జాతిరత్నము యిచ్ఛాశూన్యమే యున్ననూ, దానినుండి ప్రకాశము ప్రకటమగుచున్నరీతిగా పరబ్రహ్మతత్త్వము సత్తామాత్రమైయున్ననూ, బ్రహ్మభావముగా ఈజగత్సర్వము ప్రకటమగుచున్నది. ఆత్మయందు కర్తృత్వమున్నది, అకర్తృత్వముకూడ వున్నది. ఇచ్ఛలేకయున్నది కావున అకర్త. సన్నిధానమాత్రమున కర్తగాకూడ నున్నది. ఈ రీతిగా పరస్పరవిరోధముకల కర్తృత్వరూపములోనున్న చమత్కారము ఏపర బ్రహ్మములో నున్నదో తెలిసికొని, ఆబ్రహ్మమునే ఆశ్రయించి, ఆబ్రహ్మములోనే స్థిరుడవుగానుండుము. నేనునిత్యము అకర్తనైయున్నాను అనుభావనతో ఒప్పు నదియు, పరమామృతము అనబడునదియునగు సమత్వమే జ్ఞానికి శేషించి మిగులుచున్నది. ఎవరుఈభూమిలో సత్తామాత్రస్థితిలోనున్నారో, అట్టివారే మహాగుణవంతులు అట్టివారిస్థితి శాశ్వతమైనది. మహోన్నతమైనది. అట్టివారు గగనతలములోనున్న పూర్ణచంద్రునివలె ప్రసన్నవదనముతోనుందురు. వారికే శాశ్వతశాంతి, సుఖము, సమభావము సిద్ధించినమహాత్ములు. రాత్రిసమయములో స్వర్ణపద్మమువలె ఆపదలయందు కృశించిపోరు. శిష్టాచారులుపోవు మార్గములో, సత్ప్రవర్తనతో సంతోషముగానుందురు. అట్టివారిదేహము స్వభావముగా మైత్రి మున్నగు సద్గుణములతో శోభిల్లుచుండును. వారలు సమత్వభావముకలవారై సర్వదా సాధువృత్తికలవారై, సమరసులై మార్పులేకయుందురు. నిర్మలాత్ములగు మహాత్ములు సముద్రమురీతిగా మర్యాదనతిక్రమించకయుందురు. భాస్కరునివలె నియమములను విడిచిపెట్టకయుందురు. నేను ఎవరిని? ఈసంసారమాలిన్యము ఏరీతిగా వ్యాపించియున్నది? అనిప్రాజ్ఞుడును సాధువును అగు మహాత్ముని సన్నిధిలో చక్కగా ఆత్మవిచారముచేయవలెను. నిషిద్ధకర్మలను చేయరాదు. అనార్యులతోకలసి నివసించకూడదు. సర్వసంహార సంహార్తయగు మృత్యువును అలక్ష్యముగా హేళనచేయరాదు. ఈదేహము ఎముకలు, మాంసము, రక్తము మొదలగు అశోభనపదార్థముల సమూహమేయని గ్రహించి, యీదేహమునందు మమకారమును విడచిపెట్టి యీసకలజీవులను ముత్యాలహారమునందు దారము వలె చిన్మాత్రపరమాత్మను దర్శించవలెను.'ఇదికావలెను' అనిదానినే అనుసరిం చుట, 'ఇదివలదు' అనుదానిని ద్వేషించుట ఇదియే మనస్సుయొక్క స్వరూపము. ఆత్మఇట్టిమనస్సుకంటె వేరుగానున్నదనిగ్రహించుము. సద్గురువులు, శాస్త్రములు చూపిన మార్గమును అనుసరించుచూ, స్వానుభవముతో, నేను చిద్ఘనమునగు బ్రహ్మమునే అయివున్నాను అనితెలిసికొని ముని శోకములేని వాడగును. జీవన్ముక్తుని దుఃఖాతీతస్థితి అద్భుతమైనది. నిశితఖడ్గముతో నరుకు చున్ననూ, కలువపూలు పైనచల్లినరీతిగా భావించును. అగ్నితో దహించునపుడు హిమ బిందువులు పడునట్లు తలంచును. నిప్పులలో త్రిప్పినపుడు చందనశీతలము ననుభవించును. బాణవర్షము కురిపించినపుడు ఎండలో నిర్మించిన జలయంత్రము నీళ్ళుచల్లుచున్నదనుకొనుము. శిరచ్ఛేదము చేసినచో సుఖనిద్రగా భావించును. వాగ్బంధనము చేసినచో మౌనముద్రగా భావించును. ఇట్టిమహోన్నతస్థితి ఉపేక్షతో ప్రాప్తించునదికాదు. దృఢవైరాగ్యసాధనతో నిట్టిస్థితి సిద్ధించును. (ప్రహ్లాదుడు సరిగ్గా ఇట్టిస్థితినే అనుభవించాడు). గురువాక్యముచే సముధ్బూతమైన స్వానుభవము మున్నగువానిచేత పరిశుద్ధమైన బుద్ధితో నిరంతరము అభ్యాసముచేయుటచేత ఆత్మ చక్కగా దర్శించబడుచున్నది.
దిగ్భ్రమ పూర్తిగా పోయిననూ, పూర్వమురీతిగా దిక్కులయొక్క జ్ఞానముండును. అదేరీతిగా బ్రహ్మజ్ఞానముతో జగత్తులేదని తెలిసియున్నపిమ్మటకూడ జగత్తు కనిపించుచునేయుందును. అట్లుకనిపించిన జగత్తు లేదనియేభావించుము. ఆత్మ సాక్షాత్కారమునందు ధనాదులు సహాయముచేయలేవు. అదేవిధముగా స్నేహితులుగాని, బంధువులుగాని శరీరకష్టముగాని, తీర్థక్షేత్రాదులలో నివసించుట గాని నీకు సహాయపడజాలవు. కేవలము పరమాత్మలో తన్మయమునుపొందు మనస్సు కలవాడే బ్రహ్మానందముననుభవించగలడు. దుఃఖములు, తృష్ణ, సహింప రాని చింతలు, ఎన్నెన్నియున్నవో, అవన్నియు శాంతచేతస్కులగు మహాత్ములకు, సూర్యకిరణములతో అంధకారము నశించురీతిగా, నశించును. క్రూరజంతువులు, సౌమ్యజంతువులు అన్నియు శమముగల మహాత్ముని, కన్నతల్లినిచేరునట్లు విశ్వాసముతో సమీపించుచున్నవి. (పూర్వము ఋషుల, మునుల ఆశ్రమములో అన్నిజంతువులు కలసియుండెడివి) మనుష్యుడు శమమువలన పరమసుఖము ను అనుభవించుచున్నాడు. అట్టిపరమసుఖము అమృతపానముతో లభించదు. లక్ష్మియొక్క ఆలింగనముతోకూడ లభింపదు. ఎవడు శుభాశుభములను, శ్రవణము చేసియు స్పృశించియు, అనుభవించియు, దర్శించియు, తెలిసికొనియు, సంతోష దుఃఖములనుపొందడో, అట్టివాడే శాంతస్వరూపుడు. ఎవరిమనస్సు మరణసమయ మందును, ఉత్సవసమయమందును, యుద్ధసమయమందును, నిరాకులమై చంద్రబింబమురీతిగా స్వచ్ఛమై యుండునో, అట్టివాడు శాంతుడని చెప్పబడును. తపస్సంపన్నులయందును, బుద్ధిశాలురయందును, యజ్ఞములుచేసిన వారి యందును, చక్రవర్తులయందును, సద్గుణసంపన్నులయందును, శమముకలవాడే ప్రశస్తిని పొందుచున్నాడు. సంతోషామృతపానముతో ఎవరు శాంతులును, సంతృప్తి గలవారును అగుచున్నారో, అత్మారాములగు అట్టి మహాత్ములే పరమపదమును పొందుచున్నారు. ఎవడు ప్రాప్తముకానివాటికై దుఃఖింపడో, సంప్రాప్తించినవానితో సంతృప్తినిచెందునో, ఎవనికి భేదాభేదములు కనిపించవో, అతడు సంతుష్టుడని చెప్పబడును. ఎవడు ప్రాప్తము కాని వానిని వాంఛించక, ప్రాప్తమైనవాటిని అనుభ వించుచుండునో, అట్టివాడే సౌమ్యసమాచారుడు, సంతుష్టుడు. అంతఃపురములో నివసించు సాధ్వి ఏరీతిగా భర్తనుండి లభించినవాటితో తృప్తిచెంది ఆనందముగా నుండునో, అదేరీతిగా ప్రాప్తమగువానితో ఏబుద్ధి సంతృప్తిచెందునో, ఆబుద్ధి జీవన్ముక్త స్థితిని పొందినదని తెలియవలెను. అయ్యదియే స్వస్వరూపానందము.
ప్రాజ్ఞుడు శాస్త్రములను, దేశములను, కాలమును అనుసరించి, ఏదిసుఖమో, ఎట్లుప్రాప్తించునో, ఆరీతిగా సత్సంగమును చేయుచూ, ఆత్మవిశ్రాంతి లభించువరకు మోక్షపదక్రమమును విచారణ చేయుచుండవలెను. సంసారార్ణవమునుండి బయట పడి ఎవడు తురీయస్థితిలో విశ్రాంతినిపొందునో, అతడు గృహస్థుడుగాని, సన్యాసి గాని, జీవించియుండని, మరణించియుండని, అతడు కృతకృత్యుడేయగును. అట్టి జీవన్ముక్తుడు కర్మలు చేసినందున ప్రయోజనములేదు. చేయనందున అపకారము లేదు. మంథరపర్వతరహితమై, క్షోభరహితమైయుండు క్షీరసముద్రము రీతిగా ఆత్మ స్థితుడు ఉన్నవిధముగానే ఆనందముగానుండును. దృశ్యపదార్థము లన్నియు పరమాత్మగానే దర్శించుజ్ఞానము నీకు ఎప్పుడు ఏర్పడునో, అప్పుడు దేశకాల వస్తుపరిచ్ఛేదశూన్యమును, శుద్ధచిద్రూపమునగు స్వస్వరూపము ప్రకాశిం చును. ఈరీతిగా ఆత్మఎక్కడ ప్రభావితమగునో, ఆరీతిగా అక్కడ తక్షణమే ఆయాత్మ స్థిరముగా నుండును. నీవు భావించినరూపములలో ఆత్మ ప్రత్యక్షమగును. (ఇచ్ఛారూపసాకారదర్శనం). ఈస్థావరజంగమ సమస్తదృశ్యప్రపంచము గాఢనిద్రలో స్వప్నమురీతిగా ప్రళయ సమయములలో నశించుచున్నది. ఆత్మ, ఋతము, సత్యము, పరబ్రహ్మము అనుపదములు పరబ్రహ్మమునకు వ్యవహారసంజ్ఞలు. వీనిని మహాత్ములు వ్యవహారార్ధము కల్పించియేర్పరచిరి. కటకశబ్దార్థము సువర్ణము గాని మరియొక్కటికాదు. కడియముకంటె బంగారము ప్రత్యేకముగాలేని రీతిగా, ఈ జగత్త నునది పరమాత్మయేయగును. జగత్తేబ్రహ్మము, బ్రహ్మమేజగత్తు. ఆ చిత్బ్రహ్మము నుండియే జగత్తుగాకనిపించు ఈయింద్రజాలము విస్తారముగా నున్నది. దృశ్యము యొక్క స్థితియే ద్రష్టయగు ఆత్మకు బంధమని చెప్పబడు చున్నది. ద్రష్ట దృశ్య పదార్థములవలన బద్ధుడగుచున్నాడు. దృశ్యముయొక్క అభావముతో జీవన్ముక్తు డగుచున్నాడు. జగత్తు నేను, నీవు అనునీభేదములతో నున్న దృష్టియే దృశ్యమని వచింపబడును. మనస్సుతోడనే ఈజగత్తను ఇంద్ర జాలమువిస్తరించియున్నది. ఈమనస్సనే కల్పితభావము ఎన్నాళ్ళుండునో అంత వరకూ మోక్షముప్రాప్తించదు. స్వయంభువగు బ్రహ్మయొక్క మానసికసృష్టియే ఈదృశ్యమానవిశ్వము. కావున నామరూపములుగల దృశ్యమాన జగత్తంతయూ మనస్సే అయివున్నది. మనస్సు లేనప్పుడు జగత్తుకూడలేదు. మనస్సు హృదయముయొక్క లోపలగాని, బయట గాని, మరొకచోటగానిలేదు. దానికి సత్యమగు ఉనికియేలేదు. విషయసంకల్పమే, స్ఫురణయే మనస్సు. సంకల్పమే మనస్సుయొక్క రూపమని తెలుసుకొనుము. సంకల్పము, మనస్సు ఇవిరెండునూ ఎప్పుడూ వేరువేరుగానుండవు. సంకల్పమే మనస్సు. సంకల్పములన్నియూ నశించినపుడు పరమాత్మస్వరూపము శేషించును.
నేను, నీవు జగత్తుమున్నగు దృశ్యభ్రమ శమింపగా దృశ్యమంతయూ అసత్తుకాగా, మిగిలియున్నస్థితియే కైవల్యము. అదియే ఆత్మస్థితి. మహాప్రళయ సమయమున సకలదృశ్యజగత్తు సత్తాశూన్యమైపోవును. అప్పుడు సృష్టికిపూర్వము నున్న శాంతరూపమగు అద్వితీయ పరమాత్మయే శేషించియుండును. ఈసృష్టికి పూర్వము ఏదియున్నదో, అదియే ప్రళయముపిమ్మట మిగిలియుండును. ఆ పరమాత్మ అజుడు(జన్మము లేనివాడు). దేవుడు. సమస్త దోషరహితుడు. ఆపర మాత్మయే సర్వకర్త. సర్వస్వరూపుడు. ఎచటినుండి వాక్కులు వెనుకకు తిరిగివచ్చు నో, దేనిని ముక్తపురుషులు తెలిసికొనియున్నారో, దానికి ఆత్మ మొదలగు సంజ్ఞలు ఏర్పరుపబడెను. ఇవిబోధనిమిత్తము మాత్రమే చెప్పబడినవి. స్వభావజన్యములు కావు. చిత్తకాశము, చిదాకాశము, అవకాశములని 3 ఆకాశములు కలవు. వానిలో ఆకాశముకంటె, చిత్తాకాశముకంటె, చిదాకాశము అత్యంత సూక్ష్మమైనదని తెలియుము. మనస్సు ఒకచోటునుండి ఒకచోటునకు పోవునపుడు, ఆమధ్య సమయములో రెప్పపాటుకాలములో అనుభూతమగు ఆనందమే చిదాకాశమని తెలియవలెను. రెండుదృశ్యముల(వృత్తులు) మధ్యలోనుండుఉనికియే చిదా కాశము. (సినిమా ఫిల్మురోలులో, రెండుఫ్రేముల మధ్యనున్న గీతవలె, రెండు భావనల మధ్యనున్న అభావము, అంటే, ఆలోచనలేనిస్థితియే, చిదాకాశము లేదా అమన స్కము, లేదా సంకల్పములులేని ఉన్మనీస్థితి. ఆస్థితిని పెంచుకోవలెను). సర్వ సంకల్పములు త్రోసిపుచ్చినస్థితిలో నీవెప్పుడు స్థిరముగా నుందువో అప్పుడు సర్వాత్మకశాంతపదమును సంశయరహితముగా పొందగలవు. ఔదార్యము, సౌందర్యము, వైరాగ్యము, వీనితోగూడిన పరమానందస్థితియే సమాధిఅని చెప్ప బడినది. దృశ్యము లేనేలేదు అనుబోధతో రాగద్వేషములు నశించును. ఆ సమయములో మహత్తరస్వరూపానందము కలుగును. అట్టిస్థితియే సమాధి. దృశ్యము లేనేలేదు అనుబోధయే సత్యమైనజ్ఞానము. అదియే కేవలభావము. చిదాత్మకజ్ఞేయము. అదియే కేవలభావము. చిదాత్మకజ్ఞేయము. అదియే కైవల్యస్థితి. అంతకంటే అన్యమైనదంతయూ మిధ్యయే . మదించిన ఐరావతము ఆవగింజయొక్క రంధ్రములోబంధించబడినది. చిన్నదైనచెట్టుతొర్రలో ఒకదోమ సింహసముదాయము తో యుద్ధముచేసినది. పద్మాక్షములో (తామర పూస) మేరుపర్వతము పెట్టబడినది. ఆపద్మాక్షమును తుమ్మెదపిల్ల మ్రింగినది. ఇవన్నియూ అసంభవములు. భ్రమతోగూడిన వాక్యములు. ఈజగత్భ్రమకూడ అట్టిదే. ఈజగత్తునకు అస్తిత్వము లేదు. రాగద్వేషాదులతో దూషితమగు చిత్తమే సంసారము. ఆచిత్తము ఎప్పుడు రాగద్వేషాదిదోషరహితమగునో, అప్పుడు మోక్షము, సంసారనివృత్తియని చెప్పెదరు.
మనస్సుతో భావింపబడినవాడై జీవుడు దేహవాసన కలిగియుండును. దేహవాసన పోయినపుడు, ఆపిమ్మట అతడు దేహధర్మములతో అంటుకొనడు. మనస్సుఒక కల్పముయొక్క మహాకాలమును ఒక్కక్షణముగా చేయును. ఒక్కక్షణము ఒక కల్ప కాలముగా అనుభవింపజేయును. ఈసంసారమంతయూ మనోవిలాసము మాత్రమే యని నానిశ్చితాభిప్రాయము. దుష్ప్రవర్తనను విడచిపెట్టనివాడు అశాంతుడు, సమాధానములేనివాడు. అశాంతమనస్కుడు. కేవలము ప్రజ్ఞాబలముతో ఆత్మ సాక్షాత్కారమును పొందలేడు. ద్వంద్వరహితమై, నిర్గుణమై, సత్యమై, చిద్ఘనమైనట్టి బ్రహ్మానందమును ఆత్మరూపముగ తెలిసికొని ఇంక మానవుడు ఎప్పుడునూ భయపడడు. ఉత్తమోత్తమమైనదియును, మహత్తరమైనదియు, తేజోమయ మైనదియు, కళ్యాణకారకమైనదియు, శాశ్వతమైనదియు, సర్వజ్ఞమును, పురాణ మును, సనాతనమును, సకలదేవతాబృందముతో ఉపాస్యమైనదియునగు సర్వేశ్వర స్వరూపమును తెలిసికొనినపిమ్మట ఎప్పుడునూ భయములేదు. 'మమ', 'నమమ' ఈరెండుపదములు బంధమునకు మోక్షమునకు కారణములైయున్నవి. 'మమ' అనుకొని జీవుడుబద్ధుడగును. 'నమమ' అనుకొని ముక్తుడగును. చేతనా చేతనాత్మకమగు ఈజగత్తు జీవేశ్వరాదిరూపమున ప్రకాశింపుచున్నది. ఈక్షణాది ప్రవేశాంతమగు ఈసృష్టి ఈశ్వరకల్పితమైయున్నది. జాగ్రదవస్థనుండి మోక్షము వచ్చువరకునున్న సంసారము జీవకల్పితమైయున్నది. త్రిణాచికేతాగ్ని మొదలు కొని యోగము వరకునున్న మతములన్నియు ఈశ్వరునివిషయములో భ్రాంతిని ఆశ్రయించియున్నవి(పొరపాటు పడియున్నవి). అందువలన ముముక్షువులు జీవేశ్వరసిద్ధాంతములో బుద్ధిని ప్రవేశింపనీయగూడదు. నిశ్చలబుద్ధితో బ్రహ్మతత్త్వ విచారణమును సలుపవలెను. అన్వయ, వ్యతిరేక సిద్ధాంతములద్వారా ఎవడు ఈసర్వమును నిర్విశేషచిదాత్మగాదర్శించునో, అతడే సాక్షాత్తు విజ్ఞాని. అతడే శివుడు, శ్రీహరి, బ్రహ్మ. సద్గురువుయొక్క కరుణలేనిచో విషయములను త్యాగముచేయుట దుర్లభము. తత్త్వదర్శనము, సహజావస్థ దుర్లభము.
లక్ష్యాలక్ష్యబుద్ధులను త్యజించి, కేవలము ఆత్మమాత్రుడుగా నెవడుండునో, అతడు సాక్షాత్తు శివుడే అయివున్నాడు. అతడే ఉత్తముడగు బ్రహ్మజ్ఞాని. పరబ్రహ్మము సర్వమునకు అధిష్ఠానము. ఉపమానములేనిది. అవాంగ్మానసగోచరము, నిత్యము, విభువు, సర్వగతము, సూక్ష్మాతిసూక్ష్మము, అవ్యయము అయివున్నది. ఈజగత్తు సర్వశక్తియుతుడగు మహేశునియొక్క మనోవిలాసముగానున్నది. సంయమా సంయములతో ఈసంసారము శాంతిని పొందుచున్నది. మనోవ్యాధియొక్క చికిత్స నిమిత్తము నీకు ఉపాయముచెపుచున్నాను వినుము. ఎయేవస్తువునీకు ప్రియ మైనదో, ఆయావస్తువును త్యజించుచూపోయినచో, మోక్షములభించును. స్వాధీనములోనున్నదియు, ఏకంతహితమైనదియునగు ఇష్టవస్తుపరిత్యాగజ్ఞానము ఎవరికి కష్టముగనుండునో, ఆపురుషకీటమునకు ధిక్కారము. కేవలము తనయొక్క పురుషప్రయత్నముతో సాధింపవలసినదియు, తనయొక్క ఇష్టవస్తుపరిత్యాగ రూపముగానున్నదియునగు మనఃప్రశవాన మాత్రముతప్ప మరియొక శుభమార్గములేదు.
అసంకల్పమును శస్త్రముతో ఈచిత్తమును ఛేధించవలెను. అప్పుడే సర్వరూపమగు, సర్వగతమగు, శాంతమయమగు పరబ్రహ్మము ప్రాప్తించును. లోకవిషయభావనను విడచియుండుము. విశాలమగు బ్రహ్మబుద్ధియుక్తుడవై యుండుము. మనోనిగ్రహము కలిగియుండుము. శాంతమనస్కుడవై యుండుము. మనస్సు మ్రింగివేయబడిన పరిస్థితియే బ్రహ్మపదము. పరమగు పురుష ప్రయత్నమునాశ్రయించి, చిత్తమును అచిత్తముగచేసి, హృదయాకాశములో ఆత్మను ధ్యానించుచు, జ్ఞానచక్రముతో మనస్సును సంకోచములేకుండా ఛేధించవలెను. అప్పుడు కామరూపములోనున్న శత్రువులు నిన్ను బంధించలేరు. నేను, నాది అనునట్టి సంకల్పమే మనస్సు. అట్టి సంకల్పములు లేకుండజేసి, నిస్సంకల్పమను కొడవలితో మనస్సును ఛేదించవలెను. శరత్కాలగగనమునందలి మేఘమండలము వాయువేగముతో ఏరీతిగా ఛిన్నాభిన్నమై, విలీనమైపోవునో, అదేరీతిగా చక్కని ఆత్మవిచారముతో మనస్సు అమనస్సుకావలెను. అదియే మనస్సు అంతర్ధాన మైనస్థితి. అమనస్కము. ప్రళయకాలపవనములు వీచిననూ, సముద్రము లన్నియూ ఏకమైననూ, పన్నెండుగురు సూర్యులు ఏకకాలములో తపించిననూ, మనోనాశమైన మహనీయునకు ఏవిధమైన క్షితిలేదు. సంకల్పరాహిత్యముచేతనే సాధ్యమైనదియు, సమస్తమును సిద్ధింపజేయునదియునునగు అసంకల్పమోక్ష సామ్రాజ్యమునందు ఆసీనుడవైయుండుము. మనస్సు ఎప్పుడును చలనరహిత ముగనుండుట కనిపించదు. అగ్నికి ఉష్ణత్వము ధర్మముగానున్నట్లు, మనస్సుకు చంచలత్వమే ధర్మముగానున్నది. చిత్తును ఆధారముగాచేసికొనియున్నదియు, చంచలముగనున్నదియునగు స్పందనశక్తియే ఈమనోసంబంధచిత్తశక్తియని తెలిసి కొనుము. ఈజగదాడంబరము, ఈమనస్సునకు సంబంధించినదే. చలన రహితమగు మనస్సు అమృతమని చెప్పబడుచున్నది. అయ్యది తపస్సు. శాస్త్రసిద్ధాంతములో దానినే మోక్షమనిచెప్పుచున్నారు. మనస్సుయొక్క చంచలత్వమే వాసనారూప మగు అవిద్య. వాసనయను మారుపేరుగల ఈఅవిద్యను విచారణద్వారా నశింపజేయ వలెను. పురుషప్రయత్నముతో పరమపదమునందు మనస్సును విలీనంచేసి, ఆపరమపదమునుపొంది, నిర్వికల్పుడవుకమ్ము. (ప్రపంచరహితుడవునగుము). పురుషప్రయత్నము నాశ్రయించి, శుద్ధచిత్తముతో మలినచిత్తమునుజయించి, విశోక పదమునవలంభించి, నిరాంతకుడవై స్థిరుడవుకమ్ము. మనస్సును ధృఢముగా నిగ్రహించు విషయములో మనస్సే సమర్థమైయున్నది. రాజునిజయించుటకు రాజే సమర్థుడు. మరొకడు సమర్థుడుకాడు. సంసారసముద్రము మధ్యలో చిక్కుకొని, ఆశయనెడి గ్రాహముచే పట్టుకొనినవారికి తనయొక్క శుద్ధమనస్సే పడవగానున్నది. వివేకమనస్సుతో గొప్పబంధరూపములోనున్న మనస్సనుపాశమును ఖండించి, సంసార సాగరమునుండి నిన్ను నీవే సంరక్షించుకొనవలెను. తన్నుతానే ఉద్ధరించు కొనవలెను. ఇతరులుకాపాడలేరు. తనలోపల ఇష్టమురూపములో ఏయేవాసన నిలచునో, ఆయావాసనలను ప్రాజ్ఞుడు నశింపజేసికొనవలెను. దానితో అవిద్య నశించును. భోగవాసనను విడచిపెట్టి, భేదవాసనను త్యజించి, తదుపరి భావాభావా ములనుగూడ త్యజించి, నిర్వికల్పుడవై సుఖముగ నుండుము. ఏదేదినీకు అనుభవమునకు వచ్చునో, అట్టిదానికి నీలోపల అవకాశమీయవలదు. అట్టి అనుభవమునకు స్థానమీయగూడదు. ఇయ్యదియే మనోనాశము. ఇదియే అవిద్యా నాశము. దృశ్యవిషయములందు ప్రీతి, విశ్వాసము విడచిపెట్టియుండుటయే మోక్షము. దృశ్యమునందు విశ్వాసము, ప్రీతికలిగియుండుటయే దుఃఖము. అవిద్య యనునది లేనేలేదు. అయిననూ నష్టప్రజ్ఞలందు అవిద్య కన్పించుచున్నది. నామ మాత్రముగ యున్నదియగు ఈఅవిద్య, సమ్యక్ప్రజ్ఞ కలవారియందు ఏరీతిగా నుండ గలదు? సమ్యక్ప్రజ్ఞ సిద్ధించునంతవరకు ఈఅవిద్య అమాయకుడగు జీవునితనవెంట తీసికొనిపోయి దుఃఖములనే ముండ్లపొదలలో పడవేయును. (సమ్యక్ప్రజ్ఞకలవారిని అవిద్య ఏమియూచేయలేదు.) ఎంతవరకూ మోహసంక్షయకారకమగు అత్మా వలోకేచ్ఛ తీవ్రముగాకలగదో, అంతవరకు అవిద్య ఈజీవునివెంబడించుచునే యుండును. పరతత్త్వము నవలోకించినవెంటనే అవిద్య స్వాత్మనాశనమునందును. సర్వగతమగు జ్ఞానమును దర్శించినచో అవిద్యతనకు తానే నశించిపోవును. ఈ అవిద్య ఇచ్ఛామాత్రముగానున్నది. అవిద్యపోయినచో, మోక్షముసిద్ధించును. అటు వంటి స్థితిసంకల్పము నశించినచో సిద్ధించును.
చిత్తాకాశములో వాసనారూపములోనున్న రాత్రినశించిన పిమ్మట చిదాదిత్య ప్రకాశమువలన చంద్రకళ(జీవభావము) వెలవెలబోవుచున్నది. విషయములను దృశ్యసంబంధము లేనట్టిదియును, సామాన్యరూపములో సర్వవ్యాపకమును, అనిర్వచనీయమునగు ఏచైతన్యముకలదో, అదియే ఆత్మ, పరమేశ్వరుడు. ఈ సమస్తము నిత్యమై, చిద్ఘనమై, అక్షయమైనట్టి బ్రహ్మమేఅయివున్నది. మనస్సను పేరుకల మరియొకకల్పన ఎట్టిదియులేనేలేదు. ఈజగత్త్రయమునందు ఏదిగూడ జన్మించుటలేదు, మరణించుటలేదు. అందువలన షడ్భావవికారములు కనిపించు చున్నావీటన్నింటికీ కొంచెముకూడ అస్తిత్వములేదు. ఏకముగనున్నదియు, కేవలము సర్వతేజోరూపమును, స్వరూపమును, సర్వసమాన్యమును, అవ్యయ మును, చైతన్యానుపాతరహితమును, చిన్మాత్రమునగు పరబ్రహ్మమే యిచ్చట నున్నది. అట్టినిత్యమైన వ్యాపకముగానున్న శుద్ధమైన చిన్మాత్రముగానున్న నిరుపద్రవమైన, శాంతశమపూర్ణ నిర్వికారమైన చిదాత్మయందు మనస్సు విహరించు చున్నది. మనస్సుతన స్వభావమునకు అనుగుణ్యమైనదానిని సంకల్పించుచు, అమానసమునుచెందక, అన్నిదిక్కులకు పరుగులెత్తుచున్నది. సదామననము చేయుచుండుటచే దీనిని మనస్సనిచెప్పుచున్నారు. అందువలన నీమనస్సు సంకల్పముచేతనే సిద్ధించుచున్నది. సంకల్పము చేతనే నశించుచున్నది.
నేనుబ్రహ్మమునుకాను అనుఆలోచనతో మనస్సు బంధింపబడుచున్నది. సర్వము బ్రహ్మమేయను దృఢసంకల్పముతో మనస్సు విముక్తమగుచున్నది. నేను కృశించినవాడను, దుఃఖములతో బంధింపబడినవాడను. హస్తములు, పాదములు మున్నగునవి కలవాడను అనునిట్టి భవములలో వ్యవహారముచేయుచున్నచో, జీవుడు బద్ధుడగుచున్నాడు. నేను దుఃఖినికాను. నాకుదేహములేదు, ఆత్మయందు బంధము ఎక్కడయున్నది? అనునీవిధమగు భావములతో జరుగు వ్యవహారము లతో జీవుడు ముక్తుడగుచున్నాడు. నేనుమాంసమును, ఎముకలునుగాను, దేహముకంటె అన్యుడను. నేను పరతత్త్వమును అని అంతరంగమున నిశ్చయించు కొనువాడు అవిద్యారహితుడై విముక్తినిపొందును. అనాత్మయందు ఆత్మభావన పొందుటచే ఈఅవిద్య కల్పింపబడినది. తీవ్రపురుషప్రయత్నమునాశ్రయించి, ఉత్తమ బుద్ధితోగూడి భోగేచ్ఛను దూరముగవదలి నిర్వికల్పుడవై సుఖవంతుడవగుము. నాపుత్రుడు, నాధనము, నేను, అతడు, ఇదినాది, ఈప్రకారమైన ఇంద్రజాలమువలె వాసనయే విజృభించుచున్నది. (ఇక్కడ మనం 'సత్యహరిశ్చంద్ర' నాటకంలో ఒకపద్యం గుర్తుకు తెచ్చుకోవాలి. నిజానికి యిది శ్రీగుర్రంజాషువాగారి 'శ్మశానం' అను ఖండికలోనిది. దీన్నిఈనాటకంలో వాడుకున్నారు. "మాయామేయజగంబె నిత్యమనిసంభావించి మోహంబునన్, నాయిల్లాలని, నాకుమారుడని ప్రాణంబుండు నందాక ఎంతోయల్లాడిన ఈశరీరము ఇపుడిందును కట్టెలున్ కాలుచో, ఆయిల్లాలును రాదు, పుత్రుడునుతోడురాడు తప్పింపగన్"). నీవుఅజ్ఞుడవుకాకుము. విజ్ఞుడవు కమ్ము. సంసారభావనను విడచిపెట్టుము. అనాత్మయందు ఆత్మభావముకలిగి అజ్ఞునివలె ఎందుకు ఏడ్చుచున్నావు? ఎందువలన నీవుఅవశుడవై సుఖదుఃఖము తో పరాభవమును పొందుచున్నావో అట్టిజడమైన, మూగదైన, మాంసమయమైన, అశుచియైన, ఈశరీరము నీకుఏరీతిగా ప్రాప్తించినది? అహా! ఎంతచిత్రమైనది! ఏబ్రహ్మసత్యమైయున్నదో, ఆబ్రహ్మమునే ప్రజలు విస్మరించియున్నారు. లౌకిక కార్యములలోనున్ననీకు రాగానురంజనము లేకయుండునుగాక! ఆహా! ఎంత చిత్రము? తామరకాడలోనున్న దారముతో మహాపర్వతములు బంధింపబడి యున్నవి. యదార్థముగాలేనట్టి ఈఅవిద్యలో ఈవిశ్వమంతయూ, చిన్నాభిన్నమై పోయినది. తృణమాత్రముగనున్న జగత్త్రయము అవిద్యాప్రభావమువలన వజ్రము రీతిగ స్థిరముగ తోచుచున్నది.
రూపములేని గగనమునుండి శూన్యమును, అత్యంతరమణీయమునగు నీలత్వముకనిపించురీతిగ, పరమాత్మతత్త్వము నుండి ముందుగమనస్సు పుట్టినది. ఆమనస్సుతో దృశ్యరూపజగత్తు వ్యాప్తమైనది. ఆకాశములో నీలము ఆధ్యారూపము. నీలవర్ణములేదు ఆకాశమేయున్నది అనుట అపవాదము. అట్లేమనస్సేలేదు, చిదా కాశమున్నది. సంకల్పములు నశించునపుడు చిత్తముకూడ నశించును. శరత్కాలము వచ్చినపుడు ఆకాశము తనయొక్క సహజనిర్మలస్వరూపముతో ప్రకాశించురీతిగా ఏకమై జన్మరహితమై ఆద్యమై అనంతమైనట్టి చిన్మాత్రబ్రహ్మము తనలోనే అనుభవమగు చిత్రకారుడుగాని, రంగులుగాని ఏమియులేకనే గగన తలమందు చిత్రవిచిత్రచిత్రములు కనిపించురీతిగా ద్రష్టలేకయే, దృశ్యప్రపంచము వచ్చినా, నిద్రలేకయే స్వప్నమువచ్చెనా, అన్నట్లు అనుభవమగుచున్నది. సాక్షి భూతమై, సమమై, స్వచ్ఛమై, నిర్వికల్పమైయున్న చిదాత్మయందు, ఇష్టములేకయే అద్దములో వస్తువులు కనిపించుచున్నట్లు, ఈజగత్తులన్నియు ప్రతిబింబించు చున్నవి. ఏకమై చిదాకాశమై సర్వాత్మకమై అఖండమైయున్న పరాబ్రహ్మమును చిత్తచాంచల్యము నశించుటకు ప్రయత్నముతో భావనచేయుము. ఒకేఒకశిలా ఖండము రేఖలతోటి, చిన్నరేఖలతోటి కనిపించురీతిగా, ఒకేపరబ్రహ్మము మూడు లోకములలో నిండియున్నదని దర్శించుము. మనస్సుచేసియున్న కల్పనయే జగత్తు. మరియొక కారణములేదు. అందువలన జగత్తునకు జన్మములేదు. (ఈసృష్టిలేనేలేదు). ఇప్పుడు తెలిసికొనదగిన విషయమంతయూ తెలిసికొంటిని. ఆశ్చర్యము. దర్శించదగినదంతయూ దర్శించియుంటిని. బహుకాలమునకు ఇప్పుడు శ్రమపడి విశ్రాంతినిచెందితిని. చిన్మాత్రమగు ఆత్మతప్ప యింకేమియూ లేదు. పరమపదము సంశయశూన్యమని, సర్వకామనారహితమని, నిర్విశేషమని, మనస్సులేనిదని తెలిసికొనుము. సర్వపాపములు నశించినవారును, మహత్తర బుద్ధిశాలురును, ప్రశాంతచిత్తులను, అమనస్కయోగశీలురునగు మహాత్ములే భూమత్వప్రాప్తిని పొందినవారగుచున్నారు. నిత్యము ఆత్మవిచారణచేసి, చిత్తవృత్తులు జారిపోయి, మనస్సుయొక్క స్థాయినిదాటిపోయి మనస్సును త్యజించినవానికి బ్రహ్మభావము అనుభవమగును.
హేయమగుదృశ్యములను త్యజించువాడును, గ్రహింపదగిన ఆత్మవస్తువును గ్రహించువాడును, దృక్స్వరూపమును చూచువాడును, తెలియదగిన పరతత్త్వము నందు జాగరూకుడై జీవించువాడును, ఘనమోహమయమగు సంసారమార్గమందు నిద్రితుడైనవాడును, రస, అరస పదార్థములన్నిటియందు అత్యంత పరిపక్వవైరాగ్య తీవ్రతతో త్రెంచివేసినవాడును, హృదయగ్రంధి తెగిపోయినవాడును, చిల్లగింజచే జలము నిర్మలమగునట్లు విజ్ఞానవశమున అవిద్య తొలగినవాడునునగు మహ నీయునకు స్వస్వభావము(ఆత్మస్థితి) ప్రసన్నమగును. ఎపుడు మనస్సు రాగ శూన్యమును, ఆసక్తిరహితమును, ద్వంద్వరహితమును, నిరుపాశ్రయమును అగునో, దృశ్యమునాశ్రయింపకయుండునో, అప్పుడు పంజరమునుండి బయటకు వచ్చిన పక్షివలెనే, ఆమనస్సు బంధమునుండి బయటకువచ్చును. సందేహము, దుఃఖస్వభావము పోయినట్టియు, కౌతుకవిభ్రమములు నశించునట్టియు, లోపల కోరికలేనిదియు, పూర్వభావము కలదియునగు హృదయము పూర్ణిమనాటి చంద్రుని వలె ప్రకాశించును. ఇక్కడనేను లేను, ఇతరమునులేదు. నిరామయుడగు బ్రహ్మమునే నేనుగానున్నాను, అని ఈరీతిగా సదసత్తులనడుమ సత్తామాత్రమగు స్థితిని ఎవడు దర్శించునో అతడేజ్ఞాని. నేత్రేంద్రియములకు అప్రయత్నముగనే గోచరించు విషయములందు మనస్సు ఏరీతిగ రాగరహితముగనే వ్యాపించునో, అదేవిధముగా ధీరుని బుద్ధి కర్తవ్యకార్యములందు రాగశూన్యముగనే ప్రవృత్తికలిగి యుండును. తెలిసికొని అధీనములో నున్న ఇంద్రియములద్వారా ధర్మబద్ధముగ అనుభవించుచున్న సర్వవిషయములు సంతోషమునే కలిగించును. బంధమును కలిగించవు. మైత్రికలిగి, సేవచేసియున్న చోరుడు తనస్నేహితునకు ఉపకారము చేయునేగాని, అపకారము చేయజాలడు. తాముతలచకున్నను, ప్రయాణముచేయు బాటసారులకు గమ్యస్థానము ప్రాప్తించును. మార్గమధ్యములో కొన్ని సౌందర్య దృశ్యములుకూడ కనిపించును. అదేరీతిగా జ్ఞానులకు వారుభావించకున్ననూ భోగ సంపదలు మరియు పరమసుఖమును లక్ష్మి(మోక్షలక్ష్మి) నిస్సందేహముగ ప్రాప్తించును. మనోనిగ్రహముకలవారికి లీలాభోగములు లేకున్ననూ అనందమే, ఉన్ననూ ఆనందమే! అనాయాసముగా ప్రాప్తించిన స్వల్పభోగములనే ఆనందముగ అనుభవించి సంతృప్తినిచెందుదురు. బంధవిముక్తుడగు చక్రవర్తి కబళమాత్ర భోజనముతోనే సంతృప్తిచెందుచున్నాడు. శత్రురాజుల భయములేని రాజ్యమును కూడ అధికముగ భావించడు. హస్తములతో హస్తములను గట్టిగానలిపి, దంతము లను దంతములతో గట్టిగాకొరికి, అంగములను అంగములతో చరిచి, గట్టిపట్టుదలతో తనమనస్సును జయించవలెను. భవార్ణవమును దాటుటకు మనస్సుయొక్క విజయముతప్ప మరియొక మార్గములేదు.
నరకసామ్రాజ్యములో, పాపములనే మదించిన ఏనుగులు విచ్చలవిడిగా సంచరించు చున్నవి. ఆశలనే అస్త్రశస్త్రములను ధరించి, యింద్రియములనే శత్రువులను జయించుట సాధ్యముకాదు. జాగ్రత్తగానుండుము. మనస్సుయొక్క మదమును అణగద్రొక్కి యింద్రియములనే శత్రువులను శిక్షించినవానికి, హేమంతఋతువులో పద్మములు క్షీణించునట్లు భోగవాసనలు క్షీణించును. ఏకతత్త్వము, పరమాత్మ యొక్క దృఢతరాభ్యాసమువలన మనస్సు జయింపవలెను. అట్లు జయింప బడనంతవరకూ రాత్రియందు బేతాళములు తిరుగురీతిగా హృదయములో వాసనలు తిరుగుచుండును. వివేకియొక్క మనస్సు ఇష్టకార్యమును ఆచరించు విషయములో అతనికి భృత్యునివలె ప్రవర్తించును. సర్వార్థములును నెరవేర్చువిషయములో ఆ మనస్సు మంత్రివలె ఉపకారముచేయును. ఇంద్రియములన్నియు వశములో నున్నప్పుడు ఆమనస్సు సామంతరాజువలె సహాయముచేయు చుండును. ఆత్మవిచారణద్వారా ఆత్మనిశ్చయముగలవాని మనస్సు లాలించుటలో స్నేహశీల వలె మెలగును. ఉత్తమకార్యములు చేయుటలో ఉత్తమమిత్రునివలె నుండును. మంచిమనస్సు తండ్రివంటిది. ఎందువలననగా, తండ్రితన సుఖములను విడచి పెట్టుకొని, శాస్త్రదృష్టి, స్వబుద్ధి, ఆత్మభావన, స్వానుభవము వీనిలో ప్రవృత్తి గలవాడై పరమసిద్ధికి సహాయముచేయును. శుద్ధమనస్సుగూడ యిదేరీతిగా సహకరించును.
మిక్కిలిహర్షముకలది, మిక్కిలి దృఢమైనది, స్వచ్ఛమైనది, మంచిక్రాంతికలది, మంచిమెలకువకలది, ఆత్మగుణములతో సంపన్నమైనది, రమణీయమైనది అగు మనస్సు అనుమణి, హృదయములో హృద్యముగా ప్రకాశించును. బహుదోషములు, పాపములుఅను బురదతో కళంకితమైన ఈమనోమణిని మోక్షప్రాప్తినిమిత్తము జలముతో ప్రక్షాళనముచేసి, ఉత్తమదృష్టి కలవాడవునగుము. పరమవివేకము నాశ్రయించి, బుద్ధితో సత్యమును అన్వేషించి, యింద్రియములను శత్రువులను బాగుగాఛేధించి భవార్ణవమునుదాటుము. ఆశయొక్కటియే అనంతమని విజ్ఞులు తెలిసికొనిరి. వాసనలను తంతువులతో కట్టబడి, ఈలోకము జననమరణచక్రమున పరిభ్రమించుచున్నది. అందువలన ఈఆశ ఉండినచో మహాదుఃఖమునకు, ఛేధింప బడినచో మహాసుఖమునకు కారణమగుచున్నది. ధీరుడైననూ, బహుజ్ఞుడైననూ, కులీనుడైననూ, మహత్తుకలవాడైననూ, సింహము సంకెళ్ళతో బంధింపబడినట్లు మనుష్యుడు తృష్ణచే బంధింపబడినాడు. దీక్షతో పురుషప్రయత్నశీలుడై, యధా శాస్త్రముగా స్థిరచిత్తముతో కృషిచేసినచో, ఎవడు మోక్షసిద్దినిపొందడు.
అస్త్రము అస్త్రముచేతనే శాంతించును. మలినము మలినముచేతనే శుభ్రము చేయబడును. విషము విషముచేతనే విరుగును. శత్రువు శత్రువుచేతనే సంహరింప బడును. భూతమాయ(అవిద్య) ఈరీతిగానున్నది. ఈమాయావనము ఒక్క నాశనమువలననే హర్షమును ప్రసాదించుచున్నది. విచారణతో చూసినచో, ఈమాయ లేనేలేదు. పరమార్థదృష్టితో చూచినచో ఈమాయ నశించిపోవునదియేయగును. 'అంతయూబ్రహ్మమే' అనుభావన ఎవనిహృదయమున జనించునో, అదియతనికి మోక్షమునొసంగును. భేదదృష్టియే అవిద్య, దానిని ఎల్లప్పుడూ విసర్జించవలయును. ఈమాయ ఎట్లుకలిగినది?అనువిచారణ నీవుచేయవలదు. నేనీమాయను ఏరీతిగా నశింపజేయగలను? అనిమాత్రమే విచారణచేయవలెను. ఈఅవిద్య నశించినచో నీవు బ్రహ్మపదవినితెలుసుకొనగలవు. పరబ్రహ్మను తెలిసికొన్నప్పుడు ఈఅవిద్య ఎందు వలన కలిగినది? ఏరీతిగా కలిగినది? ఎట్లునశించును? ఈవిషయములన్నియు నీకుపూర్తిగా తెలియగలవు. వ్యాధిరూపములోనున్న ఈఅవిద్య నశించుటకై చికిత్స చేయుము. అవిద్యను నశింపజేసినచో, అదినిన్ను జననమరణదుఃఖములలో పడ వేయదు. ఈచిదర్ణవము (చిత్ అనుసముద్రము) తనలో తనరూపములే యైయున్న స్పందనములతోస్పందించుచున్నది. ఈచైతన్యముఏకాత్మకము, అఖండము. అద్వితీయముయను విషయమును నీవులోపల దృఢముగా అనుసంధానము చేయుము. చిన్మయార్ణవమునందు ఆచిద్రూపములోనున్న చిచ్ఛక్తి కొంచెము సంక్షోభముగలది యగుచున్నది. సాగరములో స్వచ్ఛముగానున్న చిద్రూపశక్తి చిద్రూపముగానే స్పందించుచున్నది. ఆకాశములో వాయువురీతిగా, సరోవరములో అలలవలెను ఈచిచ్ఛక్తి తనకుతానే తనయందు వ్యక్తమగుచున్నది.
యోగశిఖోపనిషత్:ద్వితీయాధ్యాయము:
6.మనుష్యులకు దేహాంతరప్రాప్తికి భావనకారణమైనటుల, విషయమును ధ్యానించు పురుషునియొక్క మనస్సు విషయమునందే రమించును. (ముని జడభరతుడు తానుపెంచిన లేడిపై మమకారముతో దానినినే చూచుచూ మరణిం చుటవలన దానికడుపునే జన్మనొందవలసిన అగత్యము ఏర్పడినది.) నన్ను స్మరించువానిచిత్తము నాయందేలీనమగును. సర్వజ్ఞత్వము, పరేశత్వము, సంపూర్ణ శక్తిత్త్వమును, అనంతశక్తిమత్త్వమును నన్ను స్మరించినందువలన కల్గును. సర్వమును ఆత్మయేయని, శాశనమువలన వ్యాప్తవ్యాపకభావము మిధ్యయేయని పరతత్త్వము తెలిసినపుడు భేదమునకవసరమేమున్నది? పరమాత్మయైన బ్రహ్మమునుండి సర్వభూతములు పుట్టుచున్నవి. కావున యివన్నియూ బ్రహ్మమే యని తెలిసికొనుము. బ్రహ్మమే సర్వనామములను, సర్వరూపములును, సర్వ కర్మలను భాసింపజేయుచున్నదని భావించవలెను. బంగారమునుండి తయారైన సర్వాభరణములకు సువర్ణత్వము శాశ్వతమైనట్లే, బ్రహ్మమునుండి పుట్టిన ప్రపంచమునకు బ్రహ్మత్వముకలదు. జీవాత్మాపరమాత్మలకు కొద్దిగానైన అంతరమునుచేసి ఎవడుండునో, అతడు మూఢుడు. వానికేభయము. అజ్ఞానము వలన ఇతరములను ద్వైతముగాచూచును. ఆత్మగా సర్వమును చూడవలెను. ఇతరమైనది అణుమాత్రమైనలేదు. ఈలోకమంతయూ అనుభవింపబదుచున్నది. వ్యవహారయోగ్యమే అయిననూ, స్వప్నమువలె ఉత్తరక్షణమున బాధకలదై, అసద్రూపముకలదే. స్వప్నమందు జాగరూకతలేదు. జాగ్రత్తయందు స్వప్నము లేదు. లయమందు ఆరెండునూలేవు. పరమాత్మకు ఆలయమున్నూలేదు.
గుణత్రయముచే నిర్మించబడినమూడునూ మిథ్యయే. అట్టిదృష్టితో గుణాతీతుడైన చిదాత్మకుడు నిత్యుడు. మృత్తునందు ఘటభ్రాంతి, శుక్తియందు రజతభ్రాంతి యెట్టిదో, బ్రహ్మయందు జీవత్వభ్రాంతియునట్టిదే. మట్టికి ఘటమని, బంగారమునకు కుండలమని పేరెట్లున్నదో, పరమాత్మయందు జీవశబ్దమున్ను వర్తించుచున్నది. ఆకాశమున నీలియే యున్నట్లు, ఎండమావిలో నీరున్నట్లు, స్థాణువునందు పురుష త్వమున్నట్లు, ఈవిశ్వము చిదాత్మయందున్నది. శూన్యమున బేతాళుడున్నట్లు, గంధర్వనగరమువలెను, ఆకాశమున ఇద్దరు చంద్రులున్నట్లు, సత్యమందు జగత్తున్నది. కెరటములరూపమున నీరే స్ఫురించునట్లు, ఘటమనుపేరుతో మట్టియున్నట్లు, జగత్తనుపేరుతో సర్వమును చిత్బ్రహ్మయే కేవలము భాసించు చున్నది. వంధ్యాసుతుడెట్లులేడో, ఎండమావిలో నీరెట్లులేదో, ఆకాశవృక్షమెట్లులేదో, అట్లేజగత్తుకు స్థితిలేదు. ఘటమునుచూడగా మృత్తికయే కన్పడునట్లు, ప్రపంచము ను చూడగా బ్రహ్మయే ప్రకాశించుచూ కన్పడును. ఎప్పుడు అపరిశుద్ధమైన ఆత్మ పరిశుద్ధముగా కన్పడునో, అప్పుడు అజ్ఞానికి రజ్జువు రెండువిధములుగా కన్పడును. కుండ ఎట్లు మృణ్మయమో, అట్లుదేహము చిన్మయము. ఈఆత్మానాత్మవివేకము పండితులచే వృధాగా చేయబడుచున్నది. రజ్జువు సర్పముగాను, శుక్తిరజతము గాను నిర్ణయించబడినట్లు, మూఢునిచే ఆత్మదేహముగా నిర్ణయింపబడినది. మట్టిని ఘటముగాను, ఎండమావులను జలముగాను, కట్టెలను గృహముగాను, ఇనుము ను లోహముగాను చూచినట్లే, అజ్ఞానమువలన, ఆత్మయందు దేహత్వమును చూచుచున్నాడు. చిత్తముచలించుచుండగా, సంసారము కల్గును. నిశ్చలమైనచో మోక్షముకల్గును. కావున గొప్పప్రజ్ఞచే చిత్తమును స్థిరముచేయవలెను. చిత్తమే అర్థములకు కారణము. అదిఉన్నప్పుడే జగత్రయమున్నది. అది క్షీణించిన జగత్తు క్షీణించును. కావున అదిప్రయత్నముచే చికిత్స జేయదగినది. గగనాకారమైన మనస్సేనేను. సర్వతోముఖమైన మనస్సేనేను, ఆత్మయు. మనస్సు కేవలుడైన పరుడుకాడు. మనస్సువలననే కర్మలు పుట్టుచున్నవి. మనస్సు పాతకములచే పూయబడుచున్నది. మనస్సు సదాఉన్మీనమైన పుణ్యములేదు, పాపములేదు. మనస్సుచే మనస్సునిచూచి, వృత్తిశూన్యమెప్పుడునగునో, అంతట సుదుర్లభమైన పరబ్రహ్మ చూడబడును.
అష్టావక్రగీత:మొదటి ప్రకరణము:
5. నీవు బ్రాహ్మణుడు మొదలగు వర్ణములు(జాతి)గలవాడవుకావు. నాలుగు ఆశ్రమములకు చెందినవాడవుకావు, ఇంద్రియవిషయముకావు. అయితే సంగ రహితుడవు కావు. నిరాకారుడవు. విశ్వమునకు సాక్షివిఅగుచున్నావు అనితలచి సుఖివికమ్ము.
18.శరీరాదికములగు దృశ్యములని మిథ్యగాతెలిసికొనుము. నిరాకారమగు ఆత్మతత్త్వమును నిశ్చలమైనదిగా ఎరుగుము. ఈయదార్థోపదేశముచేత, మరల సంసారమునందు పుట్టుట జరుగదు.
రెండవప్రకరణము:
1.నేను దోషరహితుడను. శాంతస్వరూపుడను. జ్ఞానరూపుడను. ప్రకృతికి పరుడను. అయినప్పటికి, ఇంతకాలము అజ్ఞానముచేత నానిజస్వరూపము తెలుసుకొనలేక మోసపోతిని.
8.ప్రకాశమే నాయొక్క నిజస్వరూపము. ప్రకాశమున కంటె నెను అతిరిక్తుడనుకాను. ఈజగత్తు నావలననే ప్రకాశింపజేయబడుచున్నది.
11. బ్రహ్మాదిస్తంబపర్యంతం 'నేను' ఉపాదానకారణముతో నున్నప్పటికినీ, యీజగత్తు నశించిననూ, నేనునశించను. కావున నాశరహితుడగునాకునేనే నమస్కరించుచున్నాను.
నాల్గవప్రకరణము:
5. చతుర్ముఖబ్రహ్మ మొదలుకొని తృణపర్యంతముగల నాలుగువిధములైన (జరాయుజ, అండజ, స్వేదజ, ఉద్బిజములను) భూతసమూహమునందు జ్ఞానికొక్కనికే ఇచ్ఛానిచ్ఛ్లను త్యజించుటయందు సామర్థ్యమున్నది.
తొమ్మిదవప్రకరణము:
6.వైరాగ్యము, సమత్వము, యుక్తులచేత చైతన్యముయొక్క ఆకారవిశేష జ్ఞానమును ఎవ్వరు తెలుసుకొని సంసారమునుండి తరింజేసికొనుచున్నాడో, అట్టివాడు గురువుకాడా ఏమి?
18వ ప్రకరణము:
35-37: హఠయోగాదులందు అభ్యాసులగుజనులు, శుద్ధమైనటువంటిదియు, జ్ఞానస్వరూపమైనటువంటిదియు, ప్రియమైనట్టిదియు, పూర్ణమైనట్టిదియు, ఆ ఆత్మను తెలిసికొనజాలరు. అజ్ఞాని అభ్యాసరూపమైన కర్మచేత మోక్షమును పొంద జాలడు. క్రియారహితుడైన పుణ్యపురుషుడు కేవలజ్ఞానమాత్రముచేతనే, ముక్తుడైయుంటున్నాడు. ఏకారణమువలన అజ్ఞానిబ్రహ్మము అగుటకు కోరుచున్నాడో, ఆకారణములవలననే అతడు ఆబ్రహ్మమును పొందజాలకున్నాడు. జ్ఞానికోరకున్ననూ పరబ్రహ్మస్వరూపమును పొందువాడుగా అగుచున్నాడు.
71. దృశ్యభావమును చూడనటువంటి శుద్ధప్రకాశస్వరూపుడగు జ్ఞానికి విహితకర్మానుష్ఠానరూపవిధి ఎక్కడ? వైరాగ్యముఎక్కడ? త్యాగముఎక్కడ? శమముగూడ ఎక్కడ?
100. ఉపశాంతచిత్తముగల జ్ఞాని జనముతో వ్యాప్తమైన ప్రదేశముగూర్చిగాని, ఆకలినిగూర్చిగాని పరిగిడడు. మరేమనగా, ఎక్కడో ఒకచోట ఏదోఒకవిధముగా సమభావముగలవాడై ఉంటున్నాడు.
బ్రహ్మసూత్రదర్శనం:
బ్రహ్మజ్ఞానమనేది అపరోక్షానుభావరూపమైనది. సిద్ధ(భూత) వస్తువిషయక మైనట్టిది కాబట్టి శృతి, స్మృతి, అనుభవాదులన్నియూ కూడాదానికి ప్రమాణాలే. బ్రహ్మవిషయంలో శృతితోపాటు బ్రహ్మవేత్తల సాక్షాత్కారరూపమైన అనుభవంకూడా ప్రమాణమే అవుతుంది.
శరీరమే ఆత్మ అనడంయుక్తంకాదు. ఆత్మ అనేది శరీరంకంటే విలక్షణమైనది. దేహేంద్రియ విషయములను ప్రకాశింపజేసే విజ్ఞానం, ఆదేహాదులకంటే ఎట్లుభిన్నమైనదో, ఆవిజ్ఞానానికి ఆశ్రయమైన ఆత్మసైతం వాటికంటె విలక్షణమైనది, భిన్నమైనది. ఆత్మజ్ఞానం అనేది కర్మలకు ఉపయోగించేదికాదు. తత్త్వజ్ఞానమనేది కర్మలకు అంగంకాదు.
"ఆచార్యకులంనుండి వేదాధ్యయనంచేసి ---" అంటూవిధింపబడినది కర్మాధికారి విషయంలోనేతప్ప అత్మాధికారికోసం కాదు. కర్మాధికారులు ఉపనిషవిద్యలు చదివినా, అర్థంతెలుసుకున్నా, వారికికలిగే ప్రయోజనం ఎట్లావుండదో, అట్లాగే అత్మజ్ఞానికి వేదార్థజ్ఞానం, వేదాధ్యయనంవల్ల ప్రయోజనం ఉండదుకాబట్టి, వేదాంత విద్యలకు కర్మసంబంధమైన విద్యలతో సంబంధంవుండదు. పరబ్రహ్మాన్ని ఎరిగిన వారు ఏషణాత్రయరహితులై పరమసుఖాన్ని బ్రహ్మభావాన్ని పొందుతారు కాబట్టి బ్రాహ్మణుడైనవాడు, బ్రహ్మమునెరుగగోరువాడు మొదట శాస్త్రజ్ఞానాన్ని సంపాదించాలి. ఆతర్వాత ఆజ్ఞానాన్ని దృఢపరచడం కోసం యుక్తులతో మననం చేయాలి. తరువాత మౌనరూపమైన నిధిధ్యాసనం చేయాలి. అపుడు బ్రహ్మవేత్త అవుతాడు. అత్యంత సూక్ష్మమైన బ్రహ్మతత్త్వ సాక్షాత్కారానికి బ్రహ్మధ్యానమే సాధనమని, ఆధ్యానానికి ఆసనాది నియమాలు అక్కరలేదని, బిక్షాటనసమయంలో సైతం ధ్యానం చేయవచ్చునని విధిచెబుతోంది. గృహస్థుకు యజ్ఞాదులతోపాటు శమదమాదులు కూడా విధింపబడేవున్నాయి. అతనికి చిత్తదోషంవల్ల స్వర్గాదులయందు కాంక్ష ఎక్కువయితే యజ్ఞాదులుచేసి వాటిని పొందవచ్చును. మోక్షమందు కోరిక అధికమైతే నిత్యనైమిత్తికకర్మలతోపాటు జపాదులాచరించి, బ్రహ్మజ్ఞానసిద్ధిని పొందవచ్చును. బ్రహ్మసాక్షాత్కారమనేది దృష్టఫలం. దృష్టఫల మనేది ఫలసిద్ధి కలిగేదాకా, అవఘాతాదులు తండులనిష్పత్తిపర్యంతం చేసినట్లు (బియ్యంవచ్చేదాకా ధాన్యాన్ని దంపినట్లుగా), సాక్షాత్కారంకలిగేదాకా శ్రవణాదుల్ని ఆవృత్తి చేయాలి. నిధిధ్యాసనమనేది ఆవృత్తిగుణకం అవుతుంది.
సూ॥ ఆత్మేతి తూపగచ్ఛన్తి గ్రాహయన్తి చ.
'నేనే పరమాత్మను' అనే అహంప్రత్యయంలోనే ఉపాసనచేయాలి. అప్పుడే పరమాత్మను పొందుతారు. పరమాత్మ నిత్యశుద్ధబుద్ధముక్తస్వరూపుడు. అటువంటి పరమాత్మ సాక్షాత్కారంకోసం సగుణోపాసనచేసినా, నిర్గుణోపాసనచేసినా, ధ్యానదులయందు 'నేనే ఆపరమాత్మను' (సోహం) అని, తనకు ఆపరమాత్మకు బేధంలేదని గ్రహించి ధ్యానంచేయాలి. అంతేతప్ప నేనువేరు, ఆపరమాత్మవేరు అనేభావంతో ధ్యానోపాసనాదులు చేయరాదు. ఎందుచేతనంటే, ఉపాసకుడైన జీవాత్మ, ఉపాస్యుడైన పరమాత్మ అభిన్నులే!
సూ॥ బ్రహ్మదృష్టి రుత్కర్తాత్. ఉత్కర్షవల్ల (ఉత్కృష్టమైనది కాబట్టి) మనస్సు మొదలైనవాటియందు బ్రహ్మదృష్టినుంచి ఉపాసించాలి.
సూ॥ ప్రాయణాత్తత్రాపి హి దృష్టమ్ మరణపర్యంతం ఉపాసనల ఆవృత్తి చేయవలసినదే! ఎందుచేత? మరణకాలంలోకూడా చేయాలి అని "సమావత్క్రతు" ఇత్యాది శృతులు చెబుతున్నాయి.
యోగవాశిష్ఠం:ముముక్షువ్యవహారప్రకరణం:18వ సర్గ:
68. అనుభవవ్యతిరేకము అని అపవిత్రకుతర్కమునొనరించి, తత్త్వజ్ఞానమును పాడుజేయుట పాడికాదు.
70.రామా! బ్రహ్మసాక్షాత్కారము నొనరించుకొనగల శక్తితోగూడిన బుద్ధి మనకున్నది. దీనివలన పూర్వోక్తరూపమున సమస్తశాస్త్రముల ఏకవాక్యత (అనగా అఖండమగు బ్రహ్మతత్త్వముననే తాత్పర్యము) నిర్ణయించితిమి. దీనిని గ్రహించిన పరమపురుషార్థము లభించును. వేదాంతవిరోధములగు శాస్త్రములు శృతివ్యతిరేకములగు తర్కములతో నిండియున్నవి. "తత్త్వమసి" ఇత్యాదులకు మహావాక్యములు వారిమతములను సమర్థింపజాలవు. అందువలన ఇదియే వేదానుగతమని గ్రహింపుము.
19వ సర్గ:24. విచారపరుడు ఆత్మను గ్రహింపగల్గినచో, విచారమునకును, శబ్దము నకును అతీతుడగు పరబ్రహ్మమున బర్యవసించును.
33. జన్యవస్తువుమాత్రమే మిధ్య. అందువలన సత్యస్వరూపమగు బ్రహ్మము కారణరహితము. ప్రత్యక్షతత్త్వము నాలోచించిన ఆ అద్వితీయ బ్రహ్మము సిద్ధించు చున్నది. ఇక అనుమానాదులు ప్రత్యక్షముయొక్క అంశికబేధములే కనుక బ్రహ్మ సర్వప్రమాణతత్త్వము.
35.ఓరామా! స్వీయబుద్ధిబలమున అనంతబ్రహ్మమును సాక్షాత్కరింప జేసికొనజాలనంతవరకు ఆచార్యుల ప్రమాణసిద్ధి, సత్యమతముననుసరించుచూ, తత్త్వవిచారము నొనరించుము.
20వసర్గ:9. జ్ఞానసదాచారముల రెంటిని ఒకేమారు అభ్యసింపనియెడల ఈరెంటిలో నెద్దియూ పట్టుబడదు.
ఉత్పత్తిప్రకరణము:1వసర్గ:
1. బ్రహ్మమే మహావాక్య ప్రభావమున బ్రహ్మవేత్తయగును. అనగా జీవుడుగ తోచువాడు మహావాక్యములభ్యసించిన కలుగు అఖండాకారమును వృత్తివలనతన్ను ఆశ్రయించియుండు అజ్ఞానమునాశనమొనర్చి, బ్రహ్మభావంబున బ్రకాశితుడగును. అట్టి ఆత్మప్రకాశమునే బ్రహ్మజ్ఞానము కప్పియుంచి, దృశ్యప్రపంచమును దోపింప జేయు మాయ స్వప్నము వంటిది. ఇది ప్రత్యగాత్మయందు అనగా జీవచైతన్యము నందే తోచుచున్నది. "ఇదంతయూ బ్రహ్మమే" అనిచెప్పు స్వబొధక మహా వాక్యముల వలన పైనచెప్పినట్లు స్వాత్మరహస్యమును గ్రహించువాడే బ్రహ్మజ్ఞుడనం బడుచున్నాడు.
4వ సర్గ:55. ఏచైతన్యమయజ్ఞానమున దిక్కులు, భూమి, ఆకాశాదివస్తువులు ప్రకాశించుచున్నవో, ఆప్రకాశము దిగాదిరహితమై దానిని ఆత్మ ప్రకాశమనవచ్చును.
6వసర్గ:1. దేవదేవుడగు పరమాత్మునితో ఏకత్వము జ్ఞానయోగమువలననే లభించును. ఇతరములును, క్లేశకరములునగు కర్మాదుల అనుష్టానము వలన నిది లభింపదు
.
3.ఈపరమాత్మ దూరస్థుడుకాడు, నికటస్థుడు కాడు. సులభుడుకాడు, దుర్లభుడుకాడు. స్వానందప్రకాశరూపమగు ఈబ్రహ్మమును నిజశరీరమందే లభింపజేసికొనవచ్చును.
4.తపోదానవ్రతాదులలో నేయొక్కటియు తత్త్వజ్ఞానమునుగూర్ప సాయపడ జాలదు. స్వస్వరూపమున నిల్చుటగాక వేరొక్క ఉపాయములేదు.
5. సాధుసంగమ సచ్ఛాస్త్రములే మోహజాలముల నాశమొనర్చుటకనువైన ఉపాయములు. వీటివలననే స్వాభావికమగు తత్త్వజ్ఞానము లభించును.
6. ఇతడే దేవదేవుడగు పరమాత్మ అనుజ్ఞానము లభించిన, దుఃఖముల ననుభవింపవలసియుండదు. ఈజ్ఞానము పొందినవాడు జీవన్ముక్తుడనబడును.
9. పురుషుడు తన పౌరుషబలమున వివేకమను ఉపాయమును నాశ్రయించి, బ్రహ్మ సాక్షాత్కార మొనర్చు కొనుచున్నాడు.
16.తత్త్వజ్ఞానమునంద గోరువాడు మొమ్మొదట వీలైనంతవరకూ, లోకశాస్త్రవిరుద్ధముగాని జీవిక నవలంభించి, సంతుష్టుడగును. మరియు భోగవాసన లను పరిత్యజించవలెను.
20-21: పదిమంది మంచివారు అనగా శృతిస్మృతినిష్ఠాపరులు ఎవనిని సాధు పురుషుడని పేర్కొందురో, అతడే జ్ఞానవైరాగ్యాది విశిష్టగుణములతో గూడిన సాధు పురుషుడు. ఇట్టివానిని పరమప్రయత్నముతో నాశ్రయింపనగును. ఆధ్యాత్మవిద్య విద్యలన్నింటిలోను శ్రేష్ఠమైనది. ఇట్టి ఆత్మవిద్యను నుడువు శాస్త్రమే సచ్ఛాస్త్రము. ఇట్టి శాస్త్రము బఠించిన ముక్తి లభించును.
7వ సర్గ:8, 9: ఈజీవుడజ్ఞుడై దుఃఖము ననుభవించుచున్నాడు. తన్నశరీరిగా తలపజాలకున్నాడు. అంతఃకరణచైతన్యమునబడి వ్యర్థముగా అనర్థముల ననుభవించు చున్నాడు. పూర్ణస్వభావమును, నిత్యచేతనమునునగు నాఆత్మ యొక్క చేత్యదర్శనము నివృత్తమైన, బహిర్ముఖ చిత్తవృత్తులు నశించి, అంతర్ముఖీ నములైన ఏపూర్ణత్వము ప్రకాశించునో, దానినే తత్త్వసాక్షాత్కారమందురు. దీనిని బొందినచో, శోకమోహాదుల బొందనవుసరములేదు.
17. జన్మయను అరణ్యమున పరిభ్రమించుచున్న చేతన జీవునియందు పరమాత్మ బుద్ధినుంచువారు పండితులైననూ మూర్ఖులే. ఏలయన, జీవభ్రాంతియే ఈసంసారమునకును, తదంతర్గత దుఃఖములకును గారణమగుచున్నది. ఈతని నెరింగిన లాభమేమియూలేదు. జీవుని జీవత్వమువిడచి, పరమాత్మభావమును గ్రహించిన, విషవేగము శాంతివల్ల విషూచిక ఉపశమించినట్లు దుఃఖములన్నియూ ఉపశమించును.
13వ సర్గ:53, 54: స్వప్నమున మరణముగాంచి, నిద్రావసానమున నది అళీకమని ఎరుంగునట్లు, జ్ఞానముగలిగిన ఈసంసారము మిధ్యయనిబాధపడును. అప్పుడు కేవలము అఖండమును, అనాదియును, అనంతమునగు బ్రహ్మమునే జ్ఞానాకాశమున దర్శింపగలము. ఆపరమాకాశమున స్వయముగ శూన్య స్వరూపమున వెలయు ఆదిప్రజాపతి, అతివాహికదేహధారి. అతనిదేహము పాంచ భౌతికముగాదు. అందువలన అజాతములగు శశశృంగాదులవలె తత్సంభూతము లగు పృథ్వ్యాదులుగూడ సత్తులుగావని గ్రహించుచున్నది.
ఉత్పత్తిప్రకరణము:63వసర్గ:
27,28: బుద్ధిమంతుడైనవాడు నియతిననుసరించి, పురుషకారమును పరిత్యజించ కూడదు. ఎలయన, నియతి పురుషకారరూపముననే కర్మలను నియమించు చున్నది. (అనగా ఆయాకర్మలనాచరించిన ఆయాఫలితములు లభించుచున్నవి). ఇయ్యది పురుషప్రయత్నముతో వివక్షింపబడక, ఈశ్వరసంకల్పరూపమున నరుదెంచినపుడు నియతియనియు, సృష్టిరూపమున నరుదెంచినపుడు పురుషకార రూపమును(ప్రయత్నము) గ్రహింపకున్న నిష్ఫలము. పురుషకారరూపము దాల్చిననే సఫలమగుచున్నది.
30.నిర్వికల్పసమాధియందు, వాయువునిరోధించి, తత్త్వజ్ఞుడు ముక్తినొందుట కూడ పురుషకారము వలననే. అందువలన పురుషకారములేకుండగనే ఫలము లభించునని ఎట్లుచెప్పగలము?
96వసర్గ:73: నిర్మలమగు చైతన్యమొక్కటియే జీవమనోబుద్ధ్యహంకారముల బ్రసిద్ధికెక్కెను. అదియే లోకమున చేతన, జీవ, చిత్తాదిసంజ్ఞలచే పిలువబడుచున్నది. ఈవిషయమున సంశయముగాని, వాదముగానిలేదు.
114వసర్గ:72: నిరతిశయానందరూపమగు బ్రహ్మమునెరింగిన తత్త్వవేత్తల సంసర్గముచేయుచూ, మరల మరల ఆత్మవిచారణచేయుచూ, బ్రహ్మభావము దృఢపరచి, అట్టి దృఢనిశ్చయముచే శోభించుచూ, సమత్వసౌశీల్యముకలిగి, ఆసక్తి రహితుడవై, ఉత్తమవివేకబుద్ధితో గూడి సదా వ్యవహరించుచో, మిధ్యాజనితములగు జననమరణాదివికారములులేక, నిత్యము ముక్తుడవైయుండుము. మరియు నట్టి స్థితియందున్ననీకు హరి, హర, బ్రహ్మాదులైననూ సాటికానేరరు.
115వసర్గ:35, 36: ఈమనస్సను పురుషుడు దేశకాలవస్తువులచే పరిచ్ఛిన్నముకానట్టి తనయాత్మనవలంభించి, అద్దానియందు ప్రతిష్టుడగుచో, పరిపూర్ణుడవగలడు. వేదాంతాదిశాస్త్రములవల్లను, ఆచార్యునివద్ద కావించిన సమ్యగ్విచారణ వల్లను, సారాసారములనెరిగిన వివేకముయొక్క ప్రబుద్ధచిత్తమున, నశ్వరమగు దేహమునేనుకాను, పూర్ణానందస్వప్రకాశైకరూపుడగు బ్రహ్మము మాత్రమగుదునను నిశ్చయము కలుగును. బ్రహ్మకారవృత్తి కలిగియుండునట్టి యధికారిజీవునకు దుఃఖమంతయూ పూర్ణముగ నశించును.
స్థితిప్రకరణము:18వసర్గ:
29-31: ఆకాశమువలె విశాలమగు స్వరూపముకల్గి, సర్వత్రవ్యాపించి, సర్వమును ప్రకాశింపజేయునదైననూ, ద్రష్టనేత్రమువలె యదార్థముగ తన్నుతాను గాంచుటలేదు. ఆహా! మాయ ఎంతప్రబలమైనది? భ్రమరహితుడగు ముక్తపురుషుడు దృశ్యరూపమగు ద్వైతముగాంచనట్లు, ఆకాశమువలె సర్వవ్యాపకమగు ద్రష్ట తన పరమార్థస్వరూపమువంటిదేనగు ఇతరుల పరమార్థస్వరూపమును గాంచుటలేదు. ఆకాశమువలె సర్వత్రవ్యాపించియున్ననూ, బ్రహ్మము యత్నముచేనైననూ కన్పించుటలేదు. ఏలయన దృశ్యమును దృశ్యరూపముగ జూచునంతవరకూ బ్రహ్మస్వరూపప్రాప్తి యతిదూరమున నున్నదనియే యెంచవలెను.
33. దృశ్యముకన్పించును, ఇదిగాని, ద్రష్టగాని కన్పించుటలేదు. కాని యదార్థముగ ద్రష్టయేగలడు. దృశ్యములేదు.
65. ఏసద్బుద్ధియగు మనుజునకు భోగలాలస దినదినము క్షీణించుచుండునో, అట్టివానిచే చేయబడు తత్త్వవిచారమే సఫలమగునని యెరుగవలయును.
22వసర్గ:16: తత్త్వవిచారముచే ఆత్మస్వరూపసాక్షాత్కారమొందినవాని దృష్టి యందు బ్రహ్మవిష్ణుహరాదులున్ను దీనులేయగుదురు. ఏలయన, సృష్టి అధికారా దులయందు క్లేశమేకలదు.
32వసర్గ:35: కేవలము తర్కశాస్త్రమునాశ్రయించువారు పరమపురుషార్థమగు తమ ఆత్మలాభమును నశింపజేసికొనువారగుచున్నారు. కాని స్వానుభవముచే శృతిప్రసిద్ధమార్గము ననుసరించి యుత్తమగతి బొందనుంకించువానికి వినాశమెన్నటికి చేకూరదు.
55. విషయాకారవృత్తులందలి ప్రతిబింబభూతులగు చిదాభాసులయొక్క అంతః కరణావచ్ఛిన్నమగు చైతన్యమేబింబము. అనగా అంతఃకరణోపహితమగు చిదాభాసు ని బ్రహ్మచైతన్యమే బింబమగును. అంతఃకరణ ప్రతిబింబితుడగు చిదాభానుడే ప్రతిబింబము. ప్రతిబింబములు, నామనిరుపాధులు రెండునూ మిధ్యారూపములే. అభిన్నమగు బింబముమాత్రము సత్యమైనది. ఇవ్విధమున తత్త్వవిచారము సలుపవలెను. అర్హతాదులచే ప్రేరితమగు బుద్ధికలవాడై పశుత్వము నొందకుము.
33వసర్గ:1: ఓరామా! అతిశయముగ నొనర్పబడు యుత్తమసాధనలన్నియు నియమపూర్వకముగ సఫలమగుటచే లౌకికములగు కృషిసేవాది సాధనము లందును, శాస్త్రీయములగు మోక్షాదులందును, శుభోద్యోగములందును సర్వత్ర తదనుకూలమగు ఫలమవశ్యము సంభవించును. కావున మోక్షపహలముకై నీవును ప్రయత్నమును విడువకుము.
43. ఆత్మ, చిన్మాత్రస్వరూపమును, నిర్మలదర్పణము వంటిదియునైయున్నది. అట్టి శుద్ధచిన్మాత్రమగు ఆత్మస్వభావమును నిరంతరము ధ్యానించుచుండుటచే అహంకారము వృద్ధినొందకుండును.
33వసర్గ:10-17: ఓరామా! ఉత్తమభావానుసంధానముచే మనస్సు ప్రశాంతి నొంద, అజ్ఞానమను దట్టమైన మేఘము క్రమముగ నశింప, అపుడు శుక్లపక్ష చంద్రునివలె సౌజన్యము వృద్ధినొందును. మరియు ఆకాశమునందు సూర్యతేజము వలె వివేకము వ్యాపించును. వెదురునందు ముత్యమువలె, అపుడాత్మలాభముచే హృదయమున ధైర్యము వృద్ధినొందును. మరియు వసంతకాలమునాటి చంద్రునివలె ఆత్మానందలాభముచే కృతార్థత సంభవించును. అపుడు శీతలచాయాయుక్తమగు సత్సాంగత్యమను ఫలవృక్షము ఫలించును. సమాధియను ఉత్తమతరువునుండి సచ్చిదానందమను శ్రేష్ఠరసము ప్రవహించును. మరియు మనస్సు నిర్ద్వందమును, నిష్కామమును, నిరుపద్రవమును, ప్రశాంతమును, చపలత్వాది అనర్థరహితము ను, శోకమోహభయరోగవర్జితమునునగును. అపుడు మనంబు శాస్త్రార్థసంశయ రహి తమును, విషయవైచిత్ర్యదర్శనేచ్ఛవర్జితమును, మోహకల్పనాజాలవినిర్ముక్తమును, నిర్లిప్తమును, ఆశావర్జితమునును, ప్రవృత్తిచ్ఛారహితమును, మానసికచింతా విరహితమును, ప్రచలితశోకనీహారయుక్తమును, కనుకనే స్వచ్ఛమును, విషయా సక్తిగ్రంధివర్జితమునగును. సంశయములను దుష్టపుత్రులు కలదియును, శాఖా వంతములగు పలువిథమనోరథములతో కూడినదియు, తృష్ణయనుభార్యచే సంపన్న మును, స్థూలదేహమను పంజరముకలదియునగు స్వమనోరూపమును నశింప జేసి, యామనస్సు ఈశ్వరరూపమును, ప్రత్యగాత్మసంబంధమునునగు జీవన్ముక్తి పదమును సాధించుచున్నది. నిగ్రహమునందలి స్వసామర్థ్యమును యోచించి, యీమనస్సు తన్నుపోషించు శత్రుమిత్రసాధ్వసాధ్వాది వికల్పములను త్యజించివైచి, పిమ్మట కల్పితమగు తనరూపమునుకూడ తృణమువలె పరిత్యజించుచున్నది.
34.క్షయించుచున్ననూ ప్రయత్నశీలుడగు చంద్రుడు నిరంతరమెట్లుపూర్ణత్వము గూర్చినయాశను త్యజింపకుండునో, అటులనే, నిర్మలచిత్తముచే దారిద్యాదులచే పీడితుడైననూ, శాంతి మనస్సమాధానరూపమగు తన యుత్తమగతిని త్యజింపకయే యుండును.
69. తత్త్వవిచారణచే ఆత్మయను దీపజ్యోతిప్రాప్తింప, శరీరమునకు ప్రభువగు అయాత్మ సమస్తదోషములను రహితమొనర్చి, ధైర్యయుక్తమై, ప్రపంచమున జననమరణదశలందు, ఐహిక, పారలౌకిక, నీరసస్థితులగాంచుచూ, స్వదేహ నగరమున తాపత్రయరహితుడై విలాసముగ చరించుచుండును.
36వసర్గ:11: చైతన్యమేదేని విషయము సంభవించునపుడు, తనస్వరూపమునే యనుభవించుచున్నదగును. కానచైతన్యము తనయాత్మస్వరూపముననే స్థితికలిగి యున్నదని విద్వాంసులయనుభవమైయున్నది. అట్లైననూ, ఈజగత్తంతయూ, ఆత్మకంటెవేరుగనున్నదని అజ్ఞులు కల్పనమొనర్చుచున్నారు.
14. ఈచైతన్యమెపుడునూ నశించుటలేదు. ఉత్పన్నమగుటలేదు. లేచుటలేదు. కూర్చుండుటలేదు. వచ్చుటలేదు. పోవుటలేదు. ఈస్థానమునగాని, లేక సర్వత్ర వ్యాపించి యేకరూపముననున్నది.
ఉపశమప్రకరణము:26వసర్గ:
11-14:ఈజగత్తు చైతన్యస్వరూపము. చిత్తుయొక్క ఆధీనమగుటచే, దృశ్య మంతయునూ, చిన్మాత్రమే. చిత్తునందే అభ్యసింపబడినదగుటచే, అంతయునూ చిన్మయమే. నీవున్నూ చిన్మయుడవే. నేనున్నూ చిన్మయుడనే. ఈసమస్త లోకములున్నూ చిన్మయములే. ఇదియే తత్త్వమంతటిసారము. నివు శ్రద్ధా వంతుడవును, వివేకియునైనచో, ఈనిశ్చయముచేతనే సమస్తమును పొందగలవు. అట్లుగానిచో, అధికముగా వెచ్చించిననూ, భస్మమందలిఆహుతివలె వ్యర్థమగును. చిత్తుయొక్క విషయకారకల్పనయేబంధము. అట్టికల్పనలేకుండుటయే ముక్తి. చిత్త్య(విషయాకార)నిర్ముక్తమగు చిత్తు పూర్ణాత్మస్వరూపమేయగును. ఇదియే సమస్తసిద్ధాంతముల సారము. ఇట్టినిశ్చయమునవలంభించి, అఖండాకారవృత్తిచే నీజగబంతయూ నవలోకించుచూ, నీవు స్వయముగనే బ్రహ్మపదమును నిక్కముగపొందగలవు.
64వసర్గ:3-6: ధీరులగువిజ్ఞులతోగలసి విచారించుటవలనకలుగు ఉత్తమ తీక్ష్ణబుద్ధిచే అహంకారమను కాలమేఘము హృదయాకాశమున లెస్సగనశింప, సర్వలోక వ్యాప్తమును, ఫలసహితమును ఆనందకరమునగు నిర్మలచిత్తమను శరత్కాలము ప్రవేశింప, ద్యానయోగ్యమును, శరణ్యమును, ఆత్మరూపమగుటచే సుగమమును, సర్వానందసంపత్తిస్వరూపమును, సుప్రసన్నమును, చిదాకాశరూపమునగు పరమాత్మయందెవడు స్థితినొందునో, మరియు నెవడు నిత్యమాత్మవిచారతత్పరుడై, సుఖస్వరూపుడై, చిదాస్వాదనపరుడైయుండునో, యాతనిచిత్తము దుఃఖముతో పీడింపబడదు.
19.వైరాగ్యోల్లాసయుక్తమై, ఆత్మాకారవృత్తిరూపమై, చిత్తముయొక్క అభ్యుద యము స్పష్టరీతియేరిచే సంభవించునో, ఆమిత్రులే మిత్రులు. ఆశాస్త్రములే శాస్త్రములు. ఆదినములే దినములు
.
79వసర్గ:2: ఆద్యంతరహితుడును, అసాధారణుడునగు పరమాత్మయొక్కడే ఈజగత్తునకలడు. అతనికన్యమెట్టిదియును లేదను నీమహత్తరనిశ్చయమునే విజ్ఞులు సమ్యగ్జ్ఞానమందురు.
5-7: సంకల్పాంశవినురుక్తమును, విషయవర్జితమునునగు సంవిత్తే, తన ప్రకాశరూపస్వభావమునే మోక్షార్థమంతటను విఖ్యాతమైయున్నదిగాని, యన్యము గాదు. శుద్ధరూపమున నెరుంగబడిన యసంవిత్తే పరమాత్మయని వచింపబడినది. శుద్ధరూపమైనప్పటికి, అశుద్ధరూపకల్పనచే నదియే అవిద్యయగునని విజ్ఞులచే యెన్నబడినది. సంవిత్తే(జ్ఞానమే) సంవేద్యము(జ్ఞేయము). ఈరెంటియందునూ ద్వైతకల్పన లేదు. అజ్ఞానవశమున ఆత్మ తన్నుతాను జాగద్రూపముగా సంచయ మొనర్చుకొనుచున్నది గాని, యదార్థముగ యిట ఆత్మకన్యముగ యేమియూలేదు.
11.మహత్తుకున్ను మహత్తైనట్టి బ్రహ్మమే విశాలమగు యీదృశ్యరూపమున నున్నది. ఇక్కారణమున జ్ఞానముచే ద్వైతమును రహితమొనర్చి యత్నముచే నాత్మస్వరూపుడవుకమ్ము.
13. ఆద్యంతములందును నాశరహితమైన స్వరూపమెద్దికలదో, అదియే వస్తువని ప్రసిద్ధికెక్కినది. అదియే ఆత్మయొక్క స్వరూపమున్ను అగును. కావుననోరామా! నీవాత్మమయుడవు కమ్ము.
80వసర్గ:5: అంతఃస్థితమగు ఏచిదాత్మచే బాహ్యాభ్యంతర పదార్థములు ప్రకాశించుచున్నవో, దేనిచే అనాత్మభూతములగు పంచకోశములు ఆత్మతోటి అభిన్న రూపము ననుగమింపబడుచున్నదో, అట్టిఆత్మసంబంధమగు కర్మలచేతను, ఔదాసీన్యముచే యధాప్రాప్తములగు పదార్థములనుభవించుట మున్నగు క్రియల చేతను, తీక్ష్ణబుద్ధిగల ప్రాజ్ఞుడు సంబంధితుడగునేగాని, మూఢులవలె రూపపంకము నాస్వాదించు కర్మలచేగాడు.
93వసర్గ:20: బ్రహ్మతత్త్వమెరింగింపజేయునదియు, జ్ఞేయముతోటి యభిన్న రూపమునన్నదియునగు శాస్త్రవిచారమే జ్ఞానమనబడును.
ఇంతవరకూ మనం అజ్ఞానమంటే ఏమిటో తెలుసుకున్నాం. ఇప్పుడు జ్ఞానార్జనకు కావలసిన తత్త్వవిశ్లేషణ అంటే తత్త్వవిచారము గురించి తెలుసుకుందాం. తత్త్వ విచారమనేది అధ్యాత్మికవిద్యకు మూలస్తభం. ఇది పరమాత్మ అన్వేషణలోగల అన్నిస్థాయిలలోను అవుసరమైనది. బీజగణితంలో మూలసూత్రములైన '+' మరియు '-' లయొక్క సంబంధం ప్రతిచోట అవుసరమైనట్లు, ఈతత్త్వవిచారణకూడా ప్రతిస్థాయిలోను అవుసరమౌతుంది. పైపైస్థాయిలకు వెళ్ళేకొలది తత్త్వవిచారణ అత్యంతసునిశితము, సూక్ష్మము అవుతూ, ఏమాత్రం ఏమరుపాటుగావున్నా మనలను అపప్రథలవైపు, అజ్ఞానంవైపు పడవేస్తూ అసలైనత్రోవనుండి తప్పించివేస్తూవుంటుంది. (కేవలం ఒక్కస్వరం ఉచ్ఛారణతేడావల్ల ఇంద్రుని చంపవలసిన వృత్తాసురుడు, అదే ఇంద్రునిచేతిలో మరణిస్తాడు). అందువలన దీనియొక్క ప్రాధాన్యత గమనించి బుధులు, ద్రష్టలు అవుసరంవున్నా లేకపోయినా, దీనిగురించి చాలాచోట్ల చెప్పారు.
ఇంకాచెప్పాలంటే, "ఉత్తమం తత్త్వచింతనం" అన్నారు. ఈతత్త్వవిచారణ మనలను చాలాదగ్గరదారిలో పరమాత్మవద్దకు తీసుకొనిపోతుంది. ఈతత్త్వవిచారాన్ని ఉపయో గించే గజేంద్రుడు "ఎవ్వనిచే జనించు" అనిమొదలుపెట్టి, "లోకంబులు, లోకేశులు, లోకస్థులు తెగినతుది" అనితెలుసుకొని, "జిత్రచారునికి, సాక్షికి, నాత్మ రుచికిని" అనివిచారముచేసి, "నిఖిలకారణునకు, నిష్కారుణునకు నమస్కరింతు" అని, "విశ్వకరు, విశ్వదూరిని", "శాశ్వతు, నజుభజియింతున్" అని, "నీవేతప్ప ఇతఃపరం బెరుంగ" అనిస్వాత్మ సమర్పణచేసి కొని, ఆపరమాత్మని పొందాడు. మదానికి, తమస్సుకి, భూతత్త్వానికి, అజ్ఞానపరాకాష్ఠకి ప్రతినిధి అయిన ఒకఏనుగు, ఒకజంతువే, తత్త్వవిచారాన్నిచేసి, పరమాత్మను సాధించగా, యుక్తాయుక్తవిచక్షణ, మనస్సు, బుద్ధి, చైతన్యము, ఆత్మ గలిగినటువంటి మనము ఆపరమేశ్వరుని పొందలేమా? ఎవరికివారే ఈప్రశ్నవేసుకోండి. నాదృష్టిలోఅయితే, తత్త్వవిచారాన్ని చక్కగా ఉపయోగించి, పరమాత్మని పొందిన గజేంద్రుడే ఆదర్శనాయకుడు (Ideal Hero). వేరెవ్వరూకాదు. ఇదే తత్త్వవిచారణలోనున్న గమ్మత్తు. దీనినే "కించిత్ వ్యుత్పన్నచేతస్సు"తో "యుక్తిపూర్వకముగా" చేస్తే, "ఆకాశఫలపాతవత్" అనగా ఆకాశంనుండి పండుపడిన విధముగా పరమాత్మజ్ఞానం వస్తుందని యోగవాసిష్ఠంలో శ్రీవసిష్ఠులవారు శ్రీరామునికి ఉపదేశించారు. కాబట్టి తత్త్వవిశ్లేషణ గురించి మహనీయులు ఏవిధంగా తెలియజేశారో తెలుసుకుందాం! కొన్నివివరణలు బ్రాకెట్లలో ఇవ్వడమైనది.
కఠోపనిషత్:2వవల్లి:ప్రథమాధ్యాయం:
7. ఆత్మనుగురించి వినుటలకు అనేకులకు సాధ్యముకాదు. ఒకప్పుడు వినినప్పటికే దానిని సరిగా అర్థముచేసికొనలేరు. అట్టిస్థితిలో ఆత్మజ్ఞానమును బోధించువాడు లభించిన ఆశ్చర్యకరమైన విషయమే! తగినగురువుచేత బొధింప బడిన వాడై దానిని గ్రహింపగల శిష్యుడు లభించుటయు నాశ్చర్యకరమైన విషయమే!
3వవల్లి:14: నచికేతాలెమ్ము! మేల్కొనుము! సద్గురువును సమీపించి ఆత్మజ్ఞానమును సంపాదించుము. పదునుకలకత్తిఅంచు(అసిధార)వలె ఆ మార్గము చాలనిశితమైనది. దాటశక్యముకానిది. పొందశక్యముకానిది అని కవులు ప్రవచించుచున్నారు.
ద్వితీయాధ్యాయము:4వవల్లి:
1. పరమేశ్వరుడైన బ్రహ్మబయటకుపోవు స్వభావముగల యింద్రియములను సృష్టించెను. అందువలననే మానవుడు అంతరాత్మనుచూడక, బయటి విషయము లనే చుచుచున్నాడు. కానికొంతమంది ధీమంతులు ఆత్మాభిముఖముగ దృష్టిని మరలించి, యాప్రత్యగాత్మను దర్శించుచున్నారు.
6.జ్ఞానమునకు(చతుర్ముఖబ్రహ్మకు) ముందు జన్మించినవాడు, నీకంటె ముందుగా జన్మించినవాడు, పంచభూతములకు మధ్యనున్నవాడు, బ్రహ్మయొక్క తపస్సుచే పుట్టినవాడు, జలముకంటే పూర్వము సృష్టింపబడినవాడు, హృదయ కుహరమునందు నివసించువాడునగు ఆత్మను ఎవడు చూచుచున్నాడో, అట్టివాడే బ్రహ్మను దర్శించుచున్నాడు. ఇదియే అది(పరబ్రహ్మ). నీవింతకు ముందడిగి యున్నది.
14.నిర్మలమగు జలము దుర్గమములలోపడి దానిలో ఏకమగు నట్లు, జ్ఞానముకల యోగియొక్క ఆత్మకూడా పరబ్రహ్మమేయగుచున్నది.
6వవల్లి:13: ఉన్నది, లేదు అనురెండిటిలోను 'ఉన్నది' అనునదిమాత్రమే తత్త్వభావముతో పొందబడవలెను. ఇట్టిఅస్థిత్వమును అనుభవించువానికే తత్త్వము అనుభవమగుచున్నది.
ముండకోపనిషత్:ప్రథమముండకం:ద్వితీయఖండం:
10. సంసారాసక్తిగల మూఢులు యాగాదిశ్రౌతకర్మలను(ఇష్టి), వాపీకూపతటాకాది స్మార్తకర్మలను, అన్నిటికంటే ఉత్తమకర్మలుగా భావించుచూ, ఆత్మజ్ఞానమనెడి ఉత్తమశ్రేయసాధనమును తెలియలేకయున్నారు. అట్టివారు భోగస్థానమైన స్వర్గము నందు కర్మఫలమును అనుభవించి, ఈలోకములో మనుష్యజన్మముగాని, అంత కంటె నీచజన్మమునుగాని పొందుచున్నారు.
3-5: ఉపనిషత్సంబంధమైన ధనుస్సునుతీసుకొని, ఉపాసనతో తీక్ష్ణము చేయబడిన బాణమును సంధించి, బ్రహ్మచింతనమును విజ్ఞానముతో బాగుగాలాగి, ఆఅక్షరపరబ్రహ్మమును లక్ష్యముగాచేసికొని, ప్రయోగింపవలెను. ప్రణవమే ధనస్సు. ఆత్మ(మనస్సు) బాణము. బ్రహ్మ ఆఆత్మకులక్ష్యముగా చెప్పబడుచున్నది. ప్రమత్తత లేని సాధకునిచేత బ్రహ్మపొందదగినది. జ్ఞాని బాణమువలె లక్ష్యస్వరూపుడై సాధించ వలెను. దేనియందు ద్యులోకము, భూమి, అంతరిక్షము, సకల ప్రాణాధికరణములతో కూడిన మనస్సు సమర్పితమైయున్నదో, ఆఅక్షరపరబ్రహ్మనే అద్వితీయునిగాను, మీయొక్క ఆత్మనుగాను తెలుసుకొనుడు. ఇతరవిద్యలను వదిలివేయుడు. ఈఆత్మ జ్ఞానము మోక్షమునకు వారధియైయున్నది.
తృతీయముండకం:ప్రధమఖండం:
8. ఆపరబ్రహ్మము నేత్రములతోగాని, ఇంద్రియములతోగాని, తపస్సుతోగాని, సత్కర్మతోగాని గ్రహించుటకు సాధ్యముకాదు. ఆత్మజ్ఞానముతో పరిశుద్ధమగు అంతఃకరణముకలవాడై, ఆపిమ్మట పరబ్రహ్మను నిరాకారముగా ధ్యానించువాడు మాత్రమే ఆత్మను తెలిసికొనగలుగుచున్నాడు.
ద్వితీయఖండం:9:
ఎవడు సర్వోత్తముడగు పరమాత్మను తెలిసికొనిచున్నాడో, అట్టిజ్ఞాని సాక్షాత్ పరబ్రహ్మమే అగుచున్నాడు. ఆఆత్మవేత్తయొక్క వంశమందు ఆత్మవేత్తకానివాడు జన్మించడు. ఆత్మజ్ఞాని సకలదుఃఖములను దాటిపోవుచున్నాడు. పాపములను వదిలించుకొనగలుగుచున్నాడు. హృదయములోని అజ్ఞానగ్రంధులు త్రెంచుకొన్న వాడై, అమృతస్వరూపుడగుచున్నాడు.
తైత్తిరీయోపనిషత్:బ్రహ్మానందవల్లి:ద్వితీయాధ్యాయం:6వ అనువాకం:
పరబ్రహ్మము లేనిదనితెలిసికొనినవాడు లేనివాడుగనే అగుచున్నాడు. ఉన్నదని తెలిసికొనినయెడల, ఈతెలిసికొనినవానిని, ఉన్నవానినిగా తెలిసికొనియున్నాడు. పూర్వము చెప్పబడిన ఆవిజ్ఞానమయమునకు, విజ్ఞానమయకోశమందున్న ఆత్మ స్వరూపము ఈఆనందమయమే. ఆకారణమువలన అనుసరించిన ప్రశ్నలు విను చున్నాడు. విద్వాంసుడుకానివాడు మరణముపొంది ఈలోకమునుపొందు చున్నాడు.
బృహదారణ్యకోపనిషత్:తృతీయాధ్యాయం:చతుర్థబ్రాహ్మణం:
ఈసమస్తప్రపంచము పరబ్రహ్మజ్ఞానముకంటె (సృష్టికి)పూర్వము పరబ్రహ్మము గానే నుండెను. ఆపరబ్రహ్మము నేను పరబ్రహ్మమునైతినని తనను తాను తెలిసి కొనెను. ఈరీతిగా తెలిసికొనుటవలన, ఆపరబ్రహ్మసర్వస్వరూపముగా ఆయెను. దేవతలలోపల ఎవడెవడు ఆపరబ్రహ్మమును తెలిసికొనెనో, వాడే ఆపరబ్రహ్మముగా ఆయెను. మహర్షులలోను, మనుష్యులలోను ఆప్రకారమే. వామదేవుడను ఋషి ఈపరబ్రహ్మస్వరూపమునే చూచుచూ, నేను మనువునయితిని, సూర్యుడనయితిని అనిభావించి, సర్వస్వరూపమునుపొందెను. అటువంటి ఈపరబ్రహ్మమును, ఈ వర్తమానకాలమందు ఎవడు ఈప్రకారము, నేను పరబ్రహ్మము నైతినని తెలిసికొను చున్నాడో, అతడు ఈసమస్తమునగుచున్నాడు. అట్టిపరబ్రహ్మవేత్తకు దేవతలును విరోధముచేయుటకు సమర్థులుకారు. ఆపరబ్రహ్మవేత్త ఈదేవతలకు ఆత్మ స్వరూపముగానగుచున్నాడుకదా! బ్రహ్మవేత్తగాని పురుషుడు, ఉపాసన చేయ బడెడిదైవము, ఉపాసించెడి తనకంటెవేరుగా నెవడు భావించు చున్నాడో, అట్టిఅజ్ఞాని పరబ్రహ్మతత్త్వమును తెలిసికొనలేడు.
పంచమాధ్యాయం:అష్టమం బ్రాహ్మణం:
9. ఎవడు ఈఅక్షరపరబ్రహ్మమును తెలిసికొనక హోమమును చేయుచున్నాడో, యాగమును చేయుచున్నాడో, తపస్సును పెక్కుసంవత్సరములు చేయుచున్నాడో, అట్టివానియొక్క ఆకర్మఫలమంతయూ, అంతముకలదే అగుచున్నది. ఎవడు ఈఅక్షరపరబ్రహ్మమును తెలిసికొని, ఈలోకమునుండి మరణము పొందుచున్నాడో, అతడు ఆఅక్షరపరబ్రహ్మస్వరూపమే అగుచున్నాడు.
షష్ఠాధ్యాయం:చతుర్థ బ్రాహ్మణం:
12, 13: ఈఅత్మను నేనైయున్నాను అని తెలిసికొనిన మనుజుడు ఇకదేనినీ తనశరీరమును కష్టపెట్టవలసినపనిలేదు. దుఃఖపడవలసిన పనిలేదు. వాడు సర్వదా ఆత్మగానే యుండుటవలన, తదితరమైన కోరికయువారికిలేదు. సందేహముచే నిండిన గహనమగు సంసారమునందు ప్రవేశమొనర్చి, అత్మ తత్త్వమును ఎవడు తెలిసియున్నాడో, సాక్షాత్కారము నొందియున్నాడో, అతడే విశ్వకర్మ, సర్వకర్త. సమస్తలోకములు అతనివే! అతడే ఈలోకమంఅతయునూ! వానికిసర్వము ఆత్మే. సర్వమునకు వాడు ఆత్మీయుడగుచున్నాడు. గనుక అద్వితీయమును, ఏకమునగు పరమాత్మ నేనని భావించవలయును.
19. ఆపరబ్రహ్మమును మనస్సుచేతనే తెలుసుకొనవలెను. బ్రహ్మదర్శన విషయ మందు కొంచెముకూడ అనేకత్వము లేదు. పరబ్రహ్మదర్శనమునందు నానాత్వము చూచువాడు, మరణమువలన మరణము పొందుచున్నాడు. (అనగా జననమరణ చక్రబంధములో చిక్కుకొనుచున్నాడు.)
శ్వేతాశ్వతరోపనిషత్:చతుర్థాధ్యాయం:
16, 17: నెయ్యిలో దానికంటె సూక్ష్మమైన మీగడయున్నట్లు, సమస్తప్రాణులలోను నిగూఢముగా పరమేశ్వరుడున్నాడు. విశ్వవ్యాపకుడును, ఒక్కడును, మహా ప్రభువును నగు పరమాత్మను తెలిసికొనినవాడు, సకలపాపములనుండియు, విముక్తిని పొందుచున్నాడు. "నేతి, నేతి" (లేదు, లేదు)అని అనిత్యపదార్థములను విజ్ఞానబుద్ధితో, వేదాంతవిచారణవలన తిరస్కరించుటవలన, ప్రకాశస్వరూపుడగు పరమేశ్వరుడు తెలియబడుచున్నాడు. ఆపరమాత్మను తెలిసికొనినవాడు అమృత స్వరూపుడగుచున్నాడు.
షష్ఠోధ్యాయము:3, 4:
పరమేశ్వరుడు సృష్టినిచేసి, దానినిబాగుగ ఆలోచించి, మరల తత్ స్వరూపముతో సంబంధమునుపొంది, 1,2,3,8 అగువానితోను, కాలముతోను, సూక్ష్మమగు అంతః కరణగుణములతోను, త్రిగుణసహితమగు సకలవస్తువులను సృజించెను. ఈ సృజించిన సకలభావములను ఎవడు పరమేశ్వరునికే తిరిగి సమర్పిచునో, అతడు కర్మరహితుడగుచున్నాడు. (భగవద్గీతలో చెప్పినవిధముగా నిష్కామకర్మ చేసి నప్పుడే, ఆత్మసమర్పణ పుర్తిగా బోధపడుతుంది. పిళ్ళైకథలో సాయిబాబా ఇదే చెప్పారు. "వారిపాదములకడ నీసర్వస్వమును అర్పించుము, పిదపవారేమిచేసెదరో చూడుము" అని. ఒకానొకస్థాయిలో "యద్యత్కరోమిశంభో, సకలంతదీయా రాధనం" అన్నభావనలోకి ప్రవేశించాలి. అలాగే కొన్నిఉపనిషత్తులలో, శిష్యుడు తానుచేయు స్వాత్మసమర్పణే, నిజమైన గురుదక్షిణ అని తెలియజేశారు. ఇలా ఎవరైతే ఆ పరబ్రహ్మకు స్వాత్మసమర్పణ చేసుకొంటారో, వారు సకలపుణ్యపాపకర్మల ఫలితములనుండివిముక్తినొంది,జీవన్ముక్తదశకుఅర్హులవుతారు. శ్రీచైతన్యమహాప్రభుకూడా, మంత్రోపదేశ సమయంలో, తనగురువునకు స్వాత్మసమర్పణ చేసి కొన్నారు.) అట్టికర్మక్షయముగలవాడు పంచభూతతత్త్వములకంటె పరుడగు పరమాత్మను పొందుచున్నాడు.
సర్వసారోపనిషత్:19:
నేను శరీరమునుగాను, దశేంద్రియములుగాను, బుద్ధి, మనస్సు, ఈశ్వరుడు గాను, అదేరీతిగా అహంకారముగూడకాను. నేనుప్రాణరహితుడను. మనోరహితు డను. పరిశుద్ధుడను. బుద్ధ్యాదులకు సర్వదాసాక్షిరూపుడను. నేనుసదా నిత్యుడను. చిన్మాత్రుడను. ఇందులో సంశయములేదు. నేనుకర్తనుగాను, భోక్తను గాను, ప్రకృతికి సాక్షిస్వరూపముగా నుండువాడను. నాతో కలసియున్నందువలన దేహాదులు చైతన్యవంతములై కార్యములు చేయుచున్నవి. నేను నిశ్చలుడను, నిత్యుడను, సదా ఆనందస్వరుపుడను. సర్వవ్యాపకుడను, సాక్షిని, ఇందులో సందేహము లేదు. సర్వవేదాంతవేద్యమగు బ్రహ్మమును నేను. నేను అజ్ఞేయుడను. ఆకాశాది పంచభూతములు నేనుకాదు. నేనునామములను కాదు. సచ్చిదానంద మయమైన బ్రహ్మమునేను. నేనుదేహమునుకాను, కావున జననమరణములు నాకెట్లు? నేను ప్రాణమునుకాను. కావున ఆకలిదప్పులునాకెట్లు? నేనుచిత్తమును కాను. కావున శోకమోహములు ఇకనాకెట్లు? నేనుకర్తనుకాను, కావున బంధమోక్షములు ఇకనాకెక్కడనున్నవి?
పైంగలోపనిషత్:చతుర్థాధ్యాయము:
3,4,5: అమృతపానముతో సంతృప్తిపడువానుకి పాలతో ప్రయొజనమేమున్నది? స్వాత్మానందమునెరింగిన వానికి వేదములతో పనియేమున్నది? జ్ఞానామృత సంతృప్తుడగు యోగీంద్రునకు కర్తవ్యకర్మలేవియువుండవు. అత్మజ్ఞానము తెలిసిన వాడు తత్త్వవేత్తయగుచున్నాడు. బ్రహ్మవేత్తదూరస్తుడైననూ, దూరముగాలేడు. ప్రత్యగాత్మపిండస్థుడై(శరీరమునందు) ఉన్ననూ, పిండవర్జితుడై సర్వవ్యాపిగా నున్నాడు. హృదయమును నిర్మలముచేసికొని అనామయమగు పరమాత్మను ధ్యానించి, అపరమాత్మను నేనే అనితెలిసి, జీవుడు పరమానందమును పొంద వలెను. జలముతో చేర్చబడిన జలము, క్షీరముతో చేర్చబడిన క్షీరము, నేతితో చేర్చిన నెయ్యివలె జీవాత్మ పరమాత్మలోనేకమై భేదములేనిదగుచున్నది. దేహము నందు జ్ఞానదీపము ప్రకాశించగా, బుద్ధి అఖండాకారమగును. అప్పుడు విద్వాంసుడు బ్రహ్మజ్ఞానమను అగ్నితో కర్మబంధమును దహించును. ఆపిమ్మట బ్రహ్మవేత్త, పవిత్రుడును, విమలంబరాభరుడును, అద్వైతరూపుడునునగు పరమేశ్వరునిలో ఆత్మైక్యముపొంది, జలములో జలము కలిసిపోయినరీతిగా స్వాత్మ స్వరూపుడై నిరుపాధి సంస్థితుడగును. ఆకాశమువలె ఆత్మ సూక్ష్మశరీరముకలది. అది వాయువువలె దృష్టికి గోచరముకాదు. ఆత్మ బాహ్యాభ్యంతరములందును నిశ్చల మయినది. జ్ఞానమనుదీపముద్వారా జ్ఞాని అంతరాత్మను దర్శించు చున్నాడు. బ్రహ్మవేత్త ఎక్కడ ఏయేప్రదేశములలో మరణించుననూ, అక్కడనే సర్వగతమగు ఆకాశమువలె లయమును పొందుచున్నాడు. మహాకాశములో ఘటాకాశము లయమును పొందు రీతిగా తత్త్వజ్ఞాని ఆపరమాత్మయందు ఆత్మను లయముచేసి నిరాలంబ యోగదర్శనము చెందును.
సహస్రాదిసంవత్సరములు ఏకపాదస్థితుడై తపస్సుచేసిననూ, ఒక్క ధ్యాన యోగముయొక్క 16వభాగముతోగూడ సమానముకాలేదు. ఇదియే తెలియదగిన జ్ఞానము. ఇదియే జ్ఞేయము. సర్వమును తెలిసికొనుటకు ప్రయత్నించి మానవుడు వేలాదిసంవత్సరములు జీవించి కృషిచేసిననూ, శాస్త్రములయొక్కసారమును గ్రహించలేదు. ఆక్షరపరమాత్మను తెలిసికొనవలెను. జివితము బహుచంచలమైనది. శాస్త్రజాలములను విడచిపెట్టి సత్యమగు బ్రహ్మమునపాసించవలెను. మానవుడు బ్రహ్మతత్త్వమును తెలియక యున్నంతవరకునూ అనంతములగు కర్మలు, శౌచము, జపము, యజ్ఞము, తీర్థయాత్రాభిగమనము మున్నగునవి నాచరించు చుండును. మహాత్ములకు ఆపరబ్రహ్మానుభవమే నియతముగా మోక్షమే హేతువై యున్నది. బంధమునకు మోక్షమునకు 'మమ', 'నమమ' అను రెండుపదములే కారణములగుచున్నవి. జీవుడు 'మమ' అనుభావముచే బంధమును, 'నమమ' అను భావముచె మోక్షమును చెందుచున్నాడు. మనస్సు 'ఉన్మనీభావము' (మనస్సునుదాటినస్థితి)ని చెందగా, ద్వైతభావముకలగదు. మనస్సు ఉన్మనీ భావము జెందగనే జీవునకు పరమాత్మపదము లభించును. మనస్సు ఏఏప్రదేశములకుపోవునో, అచ్చటనే పరమపదములభించును. పరబ్రహ్మ సర్వత్ర సమవస్థితమైయున్నది. సమస్తము బ్రహ్మమే! బ్రహ్మముకాని వస్తువులేదు. ఆకాశమును ముష్టులతో త్రుంచవచ్చునేమో, క్షుధార్తుడు ఆకలిదపులు అస్సలురాకుండా చేసికొనవచ్చునేమో కాని, "నేనుబ్రహ్మమునుకాను" అనిభావించు జడుడు ఎప్పుడూ మోక్షమును పొందలేడు.
మహోపనిషత్:చతుర్థాధ్యాయము:
మోక్షద్వారములో నలుగురు ద్వారపాలకులున్నారని చెప్పబడినది. వారే శమము, విచారణ, సంతుష్టి, సజ్జనసాంగత్యము. ఆమోక్షద్వారపాలురలో ఏ ఒక్కరికైననూ సర్వప్రయత్నముచేతనూ, సమస్తమునూ వదలియైననూ, గట్టిగ ఆశ్రయింపవలెను. ఒకరువశమైన, తక్కినముగ్గురు నీకువశమయ్యెదరు. శాస్త్రా భ్యాసము, సజ్జనసంపర్కము అనుతపస్సుచేతను, దమముచేతను, ముందు సంసారబంధవిముక్తి నిమిత్తము ప్రజ్ఞను గట్టిగా అభివృద్ధిచేయవలెను. ఎవనికి అభ్యాసమువలన స్వానుభవము, శాస్త్రవాక్యము, సద్గురువాక్యము అను ఈమూడును సమన్యయత్వముతో అత్మలో నిరంతరము దర్శనమొసంగునో, అతనికి పరమాత్మ దర్శనమిచ్చును.
ప్రతిక్షణము సంకల్పములు, ఆశలు, విషయములను స్మరించుట అనువీటిని త్యజించుచున్ననూ, పరమపావనమగు అమస్కసిద్ధిని సాధించినవాడవగుదువు. మనస్సు అకర్తగానుండునట్టి తూష్ణీంస్థితియే సమాధి. అదియే కేవలభావనస్థితి. అయ్యది శుభంకరమగు ఉత్తమనిర్వాణము. మనస్సుతొ సకలసంకల్పములను పరిత్యజించి, మూగవానివలెను, అంధుని వలెను, బధిరునివలెను సంచరించుము. ఈసర్వము ప్రశాంతము, అజము, ఏకము, ఆదిమధ్యాంతరహితము, ప్రకాశ స్వరూపము, దృశ్యభావములేని అనుభవరూపము. ఈసమస్తము ఓంకారమే అనిచెప్పుటకూడ భ్రాంతియే. ఈసకల దృశ్యప్రపంచమంతయూ చిద్వస్తువే. చైతన్యముకన్నా యిక్కడ మరియొక్కటి లేదని భావనచేయుము. ఈరీతిగా నీవు సర్వదా జాగరూకతతో, నిండుమనస్సుతో, ఆత్మే అద్వితీయమని తెలుసుకొని, జగత్కార్యమునాచరించుచునే, విస్తరంగసముద్రము వలె నిశ్చలుడవైయుండుము. వాసనలను తృణమునకు అగ్నివంటిదైన ఆత్మతత్త్వవభోధనయే సమాధియని చెప్పబడినది. అంతియేకాని సమాధియనగా తూష్ణీంస్థితికాదు. జాతిరత్నము యిచ్ఛాశూన్యమే యున్ననూ, దానినుండి ప్రకాశము ప్రకటమగుచున్నరీతిగా పరబ్రహ్మతత్త్వము సత్తామాత్రమైయున్ననూ, బ్రహ్మభావముగా ఈజగత్సర్వము ప్రకటమగుచున్నది. ఆత్మయందు కర్తృత్వమున్నది, అకర్తృత్వముకూడ వున్నది. ఇచ్ఛలేకయున్నది కావున అకర్త. సన్నిధానమాత్రమున కర్తగాకూడ నున్నది. ఈ రీతిగా పరస్పరవిరోధముకల కర్తృత్వరూపములోనున్న చమత్కారము ఏపర బ్రహ్మములో నున్నదో తెలిసికొని, ఆబ్రహ్మమునే ఆశ్రయించి, ఆబ్రహ్మములోనే స్థిరుడవుగానుండుము. నేనునిత్యము అకర్తనైయున్నాను అనుభావనతో ఒప్పు నదియు, పరమామృతము అనబడునదియునగు సమత్వమే జ్ఞానికి శేషించి మిగులుచున్నది. ఎవరుఈభూమిలో సత్తామాత్రస్థితిలోనున్నారో, అట్టివారే మహాగుణవంతులు అట్టివారిస్థితి శాశ్వతమైనది. మహోన్నతమైనది. అట్టివారు గగనతలములోనున్న పూర్ణచంద్రునివలె ప్రసన్నవదనముతోనుందురు. వారికే శాశ్వతశాంతి, సుఖము, సమభావము సిద్ధించినమహాత్ములు. రాత్రిసమయములో స్వర్ణపద్మమువలె ఆపదలయందు కృశించిపోరు. శిష్టాచారులుపోవు మార్గములో, సత్ప్రవర్తనతో సంతోషముగానుందురు. అట్టివారిదేహము స్వభావముగా మైత్రి మున్నగు సద్గుణములతో శోభిల్లుచుండును. వారలు సమత్వభావముకలవారై సర్వదా సాధువృత్తికలవారై, సమరసులై మార్పులేకయుందురు. నిర్మలాత్ములగు మహాత్ములు సముద్రమురీతిగా మర్యాదనతిక్రమించకయుందురు. భాస్కరునివలె నియమములను విడిచిపెట్టకయుందురు. నేను ఎవరిని? ఈసంసారమాలిన్యము ఏరీతిగా వ్యాపించియున్నది? అనిప్రాజ్ఞుడును సాధువును అగు మహాత్ముని సన్నిధిలో చక్కగా ఆత్మవిచారముచేయవలెను. నిషిద్ధకర్మలను చేయరాదు. అనార్యులతోకలసి నివసించకూడదు. సర్వసంహార సంహార్తయగు మృత్యువును అలక్ష్యముగా హేళనచేయరాదు. ఈదేహము ఎముకలు, మాంసము, రక్తము మొదలగు అశోభనపదార్థముల సమూహమేయని గ్రహించి, యీదేహమునందు మమకారమును విడచిపెట్టి యీసకలజీవులను ముత్యాలహారమునందు దారము వలె చిన్మాత్రపరమాత్మను దర్శించవలెను.'ఇదికావలెను' అనిదానినే అనుసరిం చుట, 'ఇదివలదు' అనుదానిని ద్వేషించుట ఇదియే మనస్సుయొక్క స్వరూపము. ఆత్మఇట్టిమనస్సుకంటె వేరుగానున్నదనిగ్రహించుము. సద్గురువులు, శాస్త్రములు చూపిన మార్గమును అనుసరించుచూ, స్వానుభవముతో, నేను చిద్ఘనమునగు బ్రహ్మమునే అయివున్నాను అనితెలిసికొని ముని శోకములేని వాడగును. జీవన్ముక్తుని దుఃఖాతీతస్థితి అద్భుతమైనది. నిశితఖడ్గముతో నరుకు చున్ననూ, కలువపూలు పైనచల్లినరీతిగా భావించును. అగ్నితో దహించునపుడు హిమ బిందువులు పడునట్లు తలంచును. నిప్పులలో త్రిప్పినపుడు చందనశీతలము ననుభవించును. బాణవర్షము కురిపించినపుడు ఎండలో నిర్మించిన జలయంత్రము నీళ్ళుచల్లుచున్నదనుకొనుము. శిరచ్ఛేదము చేసినచో సుఖనిద్రగా భావించును. వాగ్బంధనము చేసినచో మౌనముద్రగా భావించును. ఇట్టిమహోన్నతస్థితి ఉపేక్షతో ప్రాప్తించునదికాదు. దృఢవైరాగ్యసాధనతో నిట్టిస్థితి సిద్ధించును. (ప్రహ్లాదుడు సరిగ్గా ఇట్టిస్థితినే అనుభవించాడు). గురువాక్యముచే సముధ్బూతమైన స్వానుభవము మున్నగువానిచేత పరిశుద్ధమైన బుద్ధితో నిరంతరము అభ్యాసముచేయుటచేత ఆత్మ చక్కగా దర్శించబడుచున్నది.
దిగ్భ్రమ పూర్తిగా పోయిననూ, పూర్వమురీతిగా దిక్కులయొక్క జ్ఞానముండును. అదేరీతిగా బ్రహ్మజ్ఞానముతో జగత్తులేదని తెలిసియున్నపిమ్మటకూడ జగత్తు కనిపించుచునేయుందును. అట్లుకనిపించిన జగత్తు లేదనియేభావించుము. ఆత్మ సాక్షాత్కారమునందు ధనాదులు సహాయముచేయలేవు. అదేవిధముగా స్నేహితులుగాని, బంధువులుగాని శరీరకష్టముగాని, తీర్థక్షేత్రాదులలో నివసించుట గాని నీకు సహాయపడజాలవు. కేవలము పరమాత్మలో తన్మయమునుపొందు మనస్సు కలవాడే బ్రహ్మానందముననుభవించగలడు. దుఃఖములు, తృష్ణ, సహింప రాని చింతలు, ఎన్నెన్నియున్నవో, అవన్నియు శాంతచేతస్కులగు మహాత్ములకు, సూర్యకిరణములతో అంధకారము నశించురీతిగా, నశించును. క్రూరజంతువులు, సౌమ్యజంతువులు అన్నియు శమముగల మహాత్ముని, కన్నతల్లినిచేరునట్లు విశ్వాసముతో సమీపించుచున్నవి. (పూర్వము ఋషుల, మునుల ఆశ్రమములో అన్నిజంతువులు కలసియుండెడివి) మనుష్యుడు శమమువలన పరమసుఖము ను అనుభవించుచున్నాడు. అట్టిపరమసుఖము అమృతపానముతో లభించదు. లక్ష్మియొక్క ఆలింగనముతోకూడ లభింపదు. ఎవడు శుభాశుభములను, శ్రవణము చేసియు స్పృశించియు, అనుభవించియు, దర్శించియు, తెలిసికొనియు, సంతోష దుఃఖములనుపొందడో, అట్టివాడే శాంతస్వరూపుడు. ఎవరిమనస్సు మరణసమయ మందును, ఉత్సవసమయమందును, యుద్ధసమయమందును, నిరాకులమై చంద్రబింబమురీతిగా స్వచ్ఛమై యుండునో, అట్టివాడు శాంతుడని చెప్పబడును. తపస్సంపన్నులయందును, బుద్ధిశాలురయందును, యజ్ఞములుచేసిన వారి యందును, చక్రవర్తులయందును, సద్గుణసంపన్నులయందును, శమముకలవాడే ప్రశస్తిని పొందుచున్నాడు. సంతోషామృతపానముతో ఎవరు శాంతులును, సంతృప్తి గలవారును అగుచున్నారో, అత్మారాములగు అట్టి మహాత్ములే పరమపదమును పొందుచున్నారు. ఎవడు ప్రాప్తముకానివాటికై దుఃఖింపడో, సంప్రాప్తించినవానితో సంతృప్తినిచెందునో, ఎవనికి భేదాభేదములు కనిపించవో, అతడు సంతుష్టుడని చెప్పబడును. ఎవడు ప్రాప్తము కాని వానిని వాంఛించక, ప్రాప్తమైనవాటిని అనుభ వించుచుండునో, అట్టివాడే సౌమ్యసమాచారుడు, సంతుష్టుడు. అంతఃపురములో నివసించు సాధ్వి ఏరీతిగా భర్తనుండి లభించినవాటితో తృప్తిచెంది ఆనందముగా నుండునో, అదేరీతిగా ప్రాప్తమగువానితో ఏబుద్ధి సంతృప్తిచెందునో, ఆబుద్ధి జీవన్ముక్త స్థితిని పొందినదని తెలియవలెను. అయ్యదియే స్వస్వరూపానందము.
ప్రాజ్ఞుడు శాస్త్రములను, దేశములను, కాలమును అనుసరించి, ఏదిసుఖమో, ఎట్లుప్రాప్తించునో, ఆరీతిగా సత్సంగమును చేయుచూ, ఆత్మవిశ్రాంతి లభించువరకు మోక్షపదక్రమమును విచారణ చేయుచుండవలెను. సంసారార్ణవమునుండి బయట పడి ఎవడు తురీయస్థితిలో విశ్రాంతినిపొందునో, అతడు గృహస్థుడుగాని, సన్యాసి గాని, జీవించియుండని, మరణించియుండని, అతడు కృతకృత్యుడేయగును. అట్టి జీవన్ముక్తుడు కర్మలు చేసినందున ప్రయోజనములేదు. చేయనందున అపకారము లేదు. మంథరపర్వతరహితమై, క్షోభరహితమైయుండు క్షీరసముద్రము రీతిగా ఆత్మ స్థితుడు ఉన్నవిధముగానే ఆనందముగానుండును. దృశ్యపదార్థము లన్నియు పరమాత్మగానే దర్శించుజ్ఞానము నీకు ఎప్పుడు ఏర్పడునో, అప్పుడు దేశకాల వస్తుపరిచ్ఛేదశూన్యమును, శుద్ధచిద్రూపమునగు స్వస్వరూపము ప్రకాశిం చును. ఈరీతిగా ఆత్మఎక్కడ ప్రభావితమగునో, ఆరీతిగా అక్కడ తక్షణమే ఆయాత్మ స్థిరముగా నుండును. నీవు భావించినరూపములలో ఆత్మ ప్రత్యక్షమగును. (ఇచ్ఛారూపసాకారదర్శనం). ఈస్థావరజంగమ సమస్తదృశ్యప్రపంచము గాఢనిద్రలో స్వప్నమురీతిగా ప్రళయ సమయములలో నశించుచున్నది. ఆత్మ, ఋతము, సత్యము, పరబ్రహ్మము అనుపదములు పరబ్రహ్మమునకు వ్యవహారసంజ్ఞలు. వీనిని మహాత్ములు వ్యవహారార్ధము కల్పించియేర్పరచిరి. కటకశబ్దార్థము సువర్ణము గాని మరియొక్కటికాదు. కడియముకంటె బంగారము ప్రత్యేకముగాలేని రీతిగా, ఈ జగత్త నునది పరమాత్మయేయగును. జగత్తేబ్రహ్మము, బ్రహ్మమేజగత్తు. ఆ చిత్బ్రహ్మము నుండియే జగత్తుగాకనిపించు ఈయింద్రజాలము విస్తారముగా నున్నది. దృశ్యము యొక్క స్థితియే ద్రష్టయగు ఆత్మకు బంధమని చెప్పబడు చున్నది. ద్రష్ట దృశ్య పదార్థములవలన బద్ధుడగుచున్నాడు. దృశ్యముయొక్క అభావముతో జీవన్ముక్తు డగుచున్నాడు. జగత్తు నేను, నీవు అనునీభేదములతో నున్న దృష్టియే దృశ్యమని వచింపబడును. మనస్సుతోడనే ఈజగత్తను ఇంద్ర జాలమువిస్తరించియున్నది. ఈమనస్సనే కల్పితభావము ఎన్నాళ్ళుండునో అంత వరకూ మోక్షముప్రాప్తించదు. స్వయంభువగు బ్రహ్మయొక్క మానసికసృష్టియే ఈదృశ్యమానవిశ్వము. కావున నామరూపములుగల దృశ్యమాన జగత్తంతయూ మనస్సే అయివున్నది. మనస్సు లేనప్పుడు జగత్తుకూడలేదు. మనస్సు హృదయముయొక్క లోపలగాని, బయట గాని, మరొకచోటగానిలేదు. దానికి సత్యమగు ఉనికియేలేదు. విషయసంకల్పమే, స్ఫురణయే మనస్సు. సంకల్పమే మనస్సుయొక్క రూపమని తెలుసుకొనుము. సంకల్పము, మనస్సు ఇవిరెండునూ ఎప్పుడూ వేరువేరుగానుండవు. సంకల్పమే మనస్సు. సంకల్పములన్నియూ నశించినపుడు పరమాత్మస్వరూపము శేషించును.
నేను, నీవు జగత్తుమున్నగు దృశ్యభ్రమ శమింపగా దృశ్యమంతయూ అసత్తుకాగా, మిగిలియున్నస్థితియే కైవల్యము. అదియే ఆత్మస్థితి. మహాప్రళయ సమయమున సకలదృశ్యజగత్తు సత్తాశూన్యమైపోవును. అప్పుడు సృష్టికిపూర్వము నున్న శాంతరూపమగు అద్వితీయ పరమాత్మయే శేషించియుండును. ఈసృష్టికి పూర్వము ఏదియున్నదో, అదియే ప్రళయముపిమ్మట మిగిలియుండును. ఆ పరమాత్మ అజుడు(జన్మము లేనివాడు). దేవుడు. సమస్త దోషరహితుడు. ఆపర మాత్మయే సర్వకర్త. సర్వస్వరూపుడు. ఎచటినుండి వాక్కులు వెనుకకు తిరిగివచ్చు నో, దేనిని ముక్తపురుషులు తెలిసికొనియున్నారో, దానికి ఆత్మ మొదలగు సంజ్ఞలు ఏర్పరుపబడెను. ఇవిబోధనిమిత్తము మాత్రమే చెప్పబడినవి. స్వభావజన్యములు కావు. చిత్తకాశము, చిదాకాశము, అవకాశములని 3 ఆకాశములు కలవు. వానిలో ఆకాశముకంటె, చిత్తాకాశముకంటె, చిదాకాశము అత్యంత సూక్ష్మమైనదని తెలియుము. మనస్సు ఒకచోటునుండి ఒకచోటునకు పోవునపుడు, ఆమధ్య సమయములో రెప్పపాటుకాలములో అనుభూతమగు ఆనందమే చిదాకాశమని తెలియవలెను. రెండుదృశ్యముల(వృత్తులు) మధ్యలోనుండుఉనికియే చిదా కాశము. (సినిమా ఫిల్మురోలులో, రెండుఫ్రేముల మధ్యనున్న గీతవలె, రెండు భావనల మధ్యనున్న అభావము, అంటే, ఆలోచనలేనిస్థితియే, చిదాకాశము లేదా అమన స్కము, లేదా సంకల్పములులేని ఉన్మనీస్థితి. ఆస్థితిని పెంచుకోవలెను). సర్వ సంకల్పములు త్రోసిపుచ్చినస్థితిలో నీవెప్పుడు స్థిరముగా నుందువో అప్పుడు సర్వాత్మకశాంతపదమును సంశయరహితముగా పొందగలవు. ఔదార్యము, సౌందర్యము, వైరాగ్యము, వీనితోగూడిన పరమానందస్థితియే సమాధిఅని చెప్ప బడినది. దృశ్యము లేనేలేదు అనుబోధతో రాగద్వేషములు నశించును. ఆ సమయములో మహత్తరస్వరూపానందము కలుగును. అట్టిస్థితియే సమాధి. దృశ్యము లేనేలేదు అనుబోధయే సత్యమైనజ్ఞానము. అదియే కేవలభావము. చిదాత్మకజ్ఞేయము. అదియే కేవలభావము. చిదాత్మకజ్ఞేయము. అదియే కైవల్యస్థితి. అంతకంటే అన్యమైనదంతయూ మిధ్యయే . మదించిన ఐరావతము ఆవగింజయొక్క రంధ్రములోబంధించబడినది. చిన్నదైనచెట్టుతొర్రలో ఒకదోమ సింహసముదాయము తో యుద్ధముచేసినది. పద్మాక్షములో (తామర పూస) మేరుపర్వతము పెట్టబడినది. ఆపద్మాక్షమును తుమ్మెదపిల్ల మ్రింగినది. ఇవన్నియూ అసంభవములు. భ్రమతోగూడిన వాక్యములు. ఈజగత్భ్రమకూడ అట్టిదే. ఈజగత్తునకు అస్తిత్వము లేదు. రాగద్వేషాదులతో దూషితమగు చిత్తమే సంసారము. ఆచిత్తము ఎప్పుడు రాగద్వేషాదిదోషరహితమగునో, అప్పుడు మోక్షము, సంసారనివృత్తియని చెప్పెదరు.
మనస్సుతో భావింపబడినవాడై జీవుడు దేహవాసన కలిగియుండును. దేహవాసన పోయినపుడు, ఆపిమ్మట అతడు దేహధర్మములతో అంటుకొనడు. మనస్సుఒక కల్పముయొక్క మహాకాలమును ఒక్కక్షణముగా చేయును. ఒక్కక్షణము ఒక కల్ప కాలముగా అనుభవింపజేయును. ఈసంసారమంతయూ మనోవిలాసము మాత్రమే యని నానిశ్చితాభిప్రాయము. దుష్ప్రవర్తనను విడచిపెట్టనివాడు అశాంతుడు, సమాధానములేనివాడు. అశాంతమనస్కుడు. కేవలము ప్రజ్ఞాబలముతో ఆత్మ సాక్షాత్కారమును పొందలేడు. ద్వంద్వరహితమై, నిర్గుణమై, సత్యమై, చిద్ఘనమైనట్టి బ్రహ్మానందమును ఆత్మరూపముగ తెలిసికొని ఇంక మానవుడు ఎప్పుడునూ భయపడడు. ఉత్తమోత్తమమైనదియును, మహత్తరమైనదియు, తేజోమయ మైనదియు, కళ్యాణకారకమైనదియు, శాశ్వతమైనదియు, సర్వజ్ఞమును, పురాణ మును, సనాతనమును, సకలదేవతాబృందముతో ఉపాస్యమైనదియునగు సర్వేశ్వర స్వరూపమును తెలిసికొనినపిమ్మట ఎప్పుడునూ భయములేదు. 'మమ', 'నమమ' ఈరెండుపదములు బంధమునకు మోక్షమునకు కారణములైయున్నవి. 'మమ' అనుకొని జీవుడుబద్ధుడగును. 'నమమ' అనుకొని ముక్తుడగును. చేతనా చేతనాత్మకమగు ఈజగత్తు జీవేశ్వరాదిరూపమున ప్రకాశింపుచున్నది. ఈక్షణాది ప్రవేశాంతమగు ఈసృష్టి ఈశ్వరకల్పితమైయున్నది. జాగ్రదవస్థనుండి మోక్షము వచ్చువరకునున్న సంసారము జీవకల్పితమైయున్నది. త్రిణాచికేతాగ్ని మొదలు కొని యోగము వరకునున్న మతములన్నియు ఈశ్వరునివిషయములో భ్రాంతిని ఆశ్రయించియున్నవి(పొరపాటు పడియున్నవి). అందువలన ముముక్షువులు జీవేశ్వరసిద్ధాంతములో బుద్ధిని ప్రవేశింపనీయగూడదు. నిశ్చలబుద్ధితో బ్రహ్మతత్త్వ విచారణమును సలుపవలెను. అన్వయ, వ్యతిరేక సిద్ధాంతములద్వారా ఎవడు ఈసర్వమును నిర్విశేషచిదాత్మగాదర్శించునో, అతడే సాక్షాత్తు విజ్ఞాని. అతడే శివుడు, శ్రీహరి, బ్రహ్మ. సద్గురువుయొక్క కరుణలేనిచో విషయములను త్యాగముచేయుట దుర్లభము. తత్త్వదర్శనము, సహజావస్థ దుర్లభము.
లక్ష్యాలక్ష్యబుద్ధులను త్యజించి, కేవలము ఆత్మమాత్రుడుగా నెవడుండునో, అతడు సాక్షాత్తు శివుడే అయివున్నాడు. అతడే ఉత్తముడగు బ్రహ్మజ్ఞాని. పరబ్రహ్మము సర్వమునకు అధిష్ఠానము. ఉపమానములేనిది. అవాంగ్మానసగోచరము, నిత్యము, విభువు, సర్వగతము, సూక్ష్మాతిసూక్ష్మము, అవ్యయము అయివున్నది. ఈజగత్తు సర్వశక్తియుతుడగు మహేశునియొక్క మనోవిలాసముగానున్నది. సంయమా సంయములతో ఈసంసారము శాంతిని పొందుచున్నది. మనోవ్యాధియొక్క చికిత్స నిమిత్తము నీకు ఉపాయముచెపుచున్నాను వినుము. ఎయేవస్తువునీకు ప్రియ మైనదో, ఆయావస్తువును త్యజించుచూపోయినచో, మోక్షములభించును. స్వాధీనములోనున్నదియు, ఏకంతహితమైనదియునగు ఇష్టవస్తుపరిత్యాగజ్ఞానము ఎవరికి కష్టముగనుండునో, ఆపురుషకీటమునకు ధిక్కారము. కేవలము తనయొక్క పురుషప్రయత్నముతో సాధింపవలసినదియు, తనయొక్క ఇష్టవస్తుపరిత్యాగ రూపముగానున్నదియునగు మనఃప్రశవాన మాత్రముతప్ప మరియొక శుభమార్గములేదు.
అసంకల్పమును శస్త్రముతో ఈచిత్తమును ఛేధించవలెను. అప్పుడే సర్వరూపమగు, సర్వగతమగు, శాంతమయమగు పరబ్రహ్మము ప్రాప్తించును. లోకవిషయభావనను విడచియుండుము. విశాలమగు బ్రహ్మబుద్ధియుక్తుడవై యుండుము. మనోనిగ్రహము కలిగియుండుము. శాంతమనస్కుడవై యుండుము. మనస్సు మ్రింగివేయబడిన పరిస్థితియే బ్రహ్మపదము. పరమగు పురుష ప్రయత్నమునాశ్రయించి, చిత్తమును అచిత్తముగచేసి, హృదయాకాశములో ఆత్మను ధ్యానించుచు, జ్ఞానచక్రముతో మనస్సును సంకోచములేకుండా ఛేధించవలెను. అప్పుడు కామరూపములోనున్న శత్రువులు నిన్ను బంధించలేరు. నేను, నాది అనునట్టి సంకల్పమే మనస్సు. అట్టి సంకల్పములు లేకుండజేసి, నిస్సంకల్పమను కొడవలితో మనస్సును ఛేదించవలెను. శరత్కాలగగనమునందలి మేఘమండలము వాయువేగముతో ఏరీతిగా ఛిన్నాభిన్నమై, విలీనమైపోవునో, అదేరీతిగా చక్కని ఆత్మవిచారముతో మనస్సు అమనస్సుకావలెను. అదియే మనస్సు అంతర్ధాన మైనస్థితి. అమనస్కము. ప్రళయకాలపవనములు వీచిననూ, సముద్రము లన్నియూ ఏకమైననూ, పన్నెండుగురు సూర్యులు ఏకకాలములో తపించిననూ, మనోనాశమైన మహనీయునకు ఏవిధమైన క్షితిలేదు. సంకల్పరాహిత్యముచేతనే సాధ్యమైనదియు, సమస్తమును సిద్ధింపజేయునదియునునగు అసంకల్పమోక్ష సామ్రాజ్యమునందు ఆసీనుడవైయుండుము. మనస్సు ఎప్పుడును చలనరహిత ముగనుండుట కనిపించదు. అగ్నికి ఉష్ణత్వము ధర్మముగానున్నట్లు, మనస్సుకు చంచలత్వమే ధర్మముగానున్నది. చిత్తును ఆధారముగాచేసికొనియున్నదియు, చంచలముగనున్నదియునగు స్పందనశక్తియే ఈమనోసంబంధచిత్తశక్తియని తెలిసి కొనుము. ఈజగదాడంబరము, ఈమనస్సునకు సంబంధించినదే. చలన రహితమగు మనస్సు అమృతమని చెప్పబడుచున్నది. అయ్యది తపస్సు. శాస్త్రసిద్ధాంతములో దానినే మోక్షమనిచెప్పుచున్నారు. మనస్సుయొక్క చంచలత్వమే వాసనారూప మగు అవిద్య. వాసనయను మారుపేరుగల ఈఅవిద్యను విచారణద్వారా నశింపజేయ వలెను. పురుషప్రయత్నముతో పరమపదమునందు మనస్సును విలీనంచేసి, ఆపరమపదమునుపొంది, నిర్వికల్పుడవుకమ్ము. (ప్రపంచరహితుడవునగుము). పురుషప్రయత్నము నాశ్రయించి, శుద్ధచిత్తముతో మలినచిత్తమునుజయించి, విశోక పదమునవలంభించి, నిరాంతకుడవై స్థిరుడవుకమ్ము. మనస్సును ధృఢముగా నిగ్రహించు విషయములో మనస్సే సమర్థమైయున్నది. రాజునిజయించుటకు రాజే సమర్థుడు. మరొకడు సమర్థుడుకాడు. సంసారసముద్రము మధ్యలో చిక్కుకొని, ఆశయనెడి గ్రాహముచే పట్టుకొనినవారికి తనయొక్క శుద్ధమనస్సే పడవగానున్నది. వివేకమనస్సుతో గొప్పబంధరూపములోనున్న మనస్సనుపాశమును ఖండించి, సంసార సాగరమునుండి నిన్ను నీవే సంరక్షించుకొనవలెను. తన్నుతానే ఉద్ధరించు కొనవలెను. ఇతరులుకాపాడలేరు. తనలోపల ఇష్టమురూపములో ఏయేవాసన నిలచునో, ఆయావాసనలను ప్రాజ్ఞుడు నశింపజేసికొనవలెను. దానితో అవిద్య నశించును. భోగవాసనను విడచిపెట్టి, భేదవాసనను త్యజించి, తదుపరి భావాభావా ములనుగూడ త్యజించి, నిర్వికల్పుడవై సుఖముగ నుండుము. ఏదేదినీకు అనుభవమునకు వచ్చునో, అట్టిదానికి నీలోపల అవకాశమీయవలదు. అట్టి అనుభవమునకు స్థానమీయగూడదు. ఇయ్యదియే మనోనాశము. ఇదియే అవిద్యా నాశము. దృశ్యవిషయములందు ప్రీతి, విశ్వాసము విడచిపెట్టియుండుటయే మోక్షము. దృశ్యమునందు విశ్వాసము, ప్రీతికలిగియుండుటయే దుఃఖము. అవిద్య యనునది లేనేలేదు. అయిననూ నష్టప్రజ్ఞలందు అవిద్య కన్పించుచున్నది. నామ మాత్రముగ యున్నదియగు ఈఅవిద్య, సమ్యక్ప్రజ్ఞ కలవారియందు ఏరీతిగా నుండ గలదు? సమ్యక్ప్రజ్ఞ సిద్ధించునంతవరకు ఈఅవిద్య అమాయకుడగు జీవునితనవెంట తీసికొనిపోయి దుఃఖములనే ముండ్లపొదలలో పడవేయును. (సమ్యక్ప్రజ్ఞకలవారిని అవిద్య ఏమియూచేయలేదు.) ఎంతవరకూ మోహసంక్షయకారకమగు అత్మా వలోకేచ్ఛ తీవ్రముగాకలగదో, అంతవరకు అవిద్య ఈజీవునివెంబడించుచునే యుండును. పరతత్త్వము నవలోకించినవెంటనే అవిద్య స్వాత్మనాశనమునందును. సర్వగతమగు జ్ఞానమును దర్శించినచో అవిద్యతనకు తానే నశించిపోవును. ఈ అవిద్య ఇచ్ఛామాత్రముగానున్నది. అవిద్యపోయినచో, మోక్షముసిద్ధించును. అటు వంటి స్థితిసంకల్పము నశించినచో సిద్ధించును.
చిత్తాకాశములో వాసనారూపములోనున్న రాత్రినశించిన పిమ్మట చిదాదిత్య ప్రకాశమువలన చంద్రకళ(జీవభావము) వెలవెలబోవుచున్నది. విషయములను దృశ్యసంబంధము లేనట్టిదియును, సామాన్యరూపములో సర్వవ్యాపకమును, అనిర్వచనీయమునగు ఏచైతన్యముకలదో, అదియే ఆత్మ, పరమేశ్వరుడు. ఈ సమస్తము నిత్యమై, చిద్ఘనమై, అక్షయమైనట్టి బ్రహ్మమేఅయివున్నది. మనస్సను పేరుకల మరియొకకల్పన ఎట్టిదియులేనేలేదు. ఈజగత్త్రయమునందు ఏదిగూడ జన్మించుటలేదు, మరణించుటలేదు. అందువలన షడ్భావవికారములు కనిపించు చున్నావీటన్నింటికీ కొంచెముకూడ అస్తిత్వములేదు. ఏకముగనున్నదియు, కేవలము సర్వతేజోరూపమును, స్వరూపమును, సర్వసమాన్యమును, అవ్యయ మును, చైతన్యానుపాతరహితమును, చిన్మాత్రమునగు పరబ్రహ్మమే యిచ్చట నున్నది. అట్టినిత్యమైన వ్యాపకముగానున్న శుద్ధమైన చిన్మాత్రముగానున్న నిరుపద్రవమైన, శాంతశమపూర్ణ నిర్వికారమైన చిదాత్మయందు మనస్సు విహరించు చున్నది. మనస్సుతన స్వభావమునకు అనుగుణ్యమైనదానిని సంకల్పించుచు, అమానసమునుచెందక, అన్నిదిక్కులకు పరుగులెత్తుచున్నది. సదామననము చేయుచుండుటచే దీనిని మనస్సనిచెప్పుచున్నారు. అందువలన నీమనస్సు సంకల్పముచేతనే సిద్ధించుచున్నది. సంకల్పము చేతనే నశించుచున్నది.
నేనుబ్రహ్మమునుకాను అనుఆలోచనతో మనస్సు బంధింపబడుచున్నది. సర్వము బ్రహ్మమేయను దృఢసంకల్పముతో మనస్సు విముక్తమగుచున్నది. నేను కృశించినవాడను, దుఃఖములతో బంధింపబడినవాడను. హస్తములు, పాదములు మున్నగునవి కలవాడను అనునిట్టి భవములలో వ్యవహారముచేయుచున్నచో, జీవుడు బద్ధుడగుచున్నాడు. నేను దుఃఖినికాను. నాకుదేహములేదు, ఆత్మయందు బంధము ఎక్కడయున్నది? అనునీవిధమగు భావములతో జరుగు వ్యవహారము లతో జీవుడు ముక్తుడగుచున్నాడు. నేనుమాంసమును, ఎముకలునుగాను, దేహముకంటె అన్యుడను. నేను పరతత్త్వమును అని అంతరంగమున నిశ్చయించు కొనువాడు అవిద్యారహితుడై విముక్తినిపొందును. అనాత్మయందు ఆత్మభావన పొందుటచే ఈఅవిద్య కల్పింపబడినది. తీవ్రపురుషప్రయత్నమునాశ్రయించి, ఉత్తమ బుద్ధితోగూడి భోగేచ్ఛను దూరముగవదలి నిర్వికల్పుడవై సుఖవంతుడవగుము. నాపుత్రుడు, నాధనము, నేను, అతడు, ఇదినాది, ఈప్రకారమైన ఇంద్రజాలమువలె వాసనయే విజృభించుచున్నది. (ఇక్కడ మనం 'సత్యహరిశ్చంద్ర' నాటకంలో ఒకపద్యం గుర్తుకు తెచ్చుకోవాలి. నిజానికి యిది శ్రీగుర్రంజాషువాగారి 'శ్మశానం' అను ఖండికలోనిది. దీన్నిఈనాటకంలో వాడుకున్నారు. "మాయామేయజగంబె నిత్యమనిసంభావించి మోహంబునన్, నాయిల్లాలని, నాకుమారుడని ప్రాణంబుండు నందాక ఎంతోయల్లాడిన ఈశరీరము ఇపుడిందును కట్టెలున్ కాలుచో, ఆయిల్లాలును రాదు, పుత్రుడునుతోడురాడు తప్పింపగన్"). నీవుఅజ్ఞుడవుకాకుము. విజ్ఞుడవు కమ్ము. సంసారభావనను విడచిపెట్టుము. అనాత్మయందు ఆత్మభావముకలిగి అజ్ఞునివలె ఎందుకు ఏడ్చుచున్నావు? ఎందువలన నీవుఅవశుడవై సుఖదుఃఖము తో పరాభవమును పొందుచున్నావో అట్టిజడమైన, మూగదైన, మాంసమయమైన, అశుచియైన, ఈశరీరము నీకుఏరీతిగా ప్రాప్తించినది? అహా! ఎంతచిత్రమైనది! ఏబ్రహ్మసత్యమైయున్నదో, ఆబ్రహ్మమునే ప్రజలు విస్మరించియున్నారు. లౌకిక కార్యములలోనున్ననీకు రాగానురంజనము లేకయుండునుగాక! ఆహా! ఎంత చిత్రము? తామరకాడలోనున్న దారముతో మహాపర్వతములు బంధింపబడి యున్నవి. యదార్థముగాలేనట్టి ఈఅవిద్యలో ఈవిశ్వమంతయూ, చిన్నాభిన్నమై పోయినది. తృణమాత్రముగనున్న జగత్త్రయము అవిద్యాప్రభావమువలన వజ్రము రీతిగ స్థిరముగ తోచుచున్నది.
రూపములేని గగనమునుండి శూన్యమును, అత్యంతరమణీయమునగు నీలత్వముకనిపించురీతిగ, పరమాత్మతత్త్వము నుండి ముందుగమనస్సు పుట్టినది. ఆమనస్సుతో దృశ్యరూపజగత్తు వ్యాప్తమైనది. ఆకాశములో నీలము ఆధ్యారూపము. నీలవర్ణములేదు ఆకాశమేయున్నది అనుట అపవాదము. అట్లేమనస్సేలేదు, చిదా కాశమున్నది. సంకల్పములు నశించునపుడు చిత్తముకూడ నశించును. శరత్కాలము వచ్చినపుడు ఆకాశము తనయొక్క సహజనిర్మలస్వరూపముతో ప్రకాశించురీతిగా ఏకమై జన్మరహితమై ఆద్యమై అనంతమైనట్టి చిన్మాత్రబ్రహ్మము తనలోనే అనుభవమగు చిత్రకారుడుగాని, రంగులుగాని ఏమియులేకనే గగన తలమందు చిత్రవిచిత్రచిత్రములు కనిపించురీతిగా ద్రష్టలేకయే, దృశ్యప్రపంచము వచ్చినా, నిద్రలేకయే స్వప్నమువచ్చెనా, అన్నట్లు అనుభవమగుచున్నది. సాక్షి భూతమై, సమమై, స్వచ్ఛమై, నిర్వికల్పమైయున్న చిదాత్మయందు, ఇష్టములేకయే అద్దములో వస్తువులు కనిపించుచున్నట్లు, ఈజగత్తులన్నియు ప్రతిబింబించు చున్నవి. ఏకమై చిదాకాశమై సర్వాత్మకమై అఖండమైయున్న పరాబ్రహ్మమును చిత్తచాంచల్యము నశించుటకు ప్రయత్నముతో భావనచేయుము. ఒకేఒకశిలా ఖండము రేఖలతోటి, చిన్నరేఖలతోటి కనిపించురీతిగా, ఒకేపరబ్రహ్మము మూడు లోకములలో నిండియున్నదని దర్శించుము. మనస్సుచేసియున్న కల్పనయే జగత్తు. మరియొక కారణములేదు. అందువలన జగత్తునకు జన్మములేదు. (ఈసృష్టిలేనేలేదు). ఇప్పుడు తెలిసికొనదగిన విషయమంతయూ తెలిసికొంటిని. ఆశ్చర్యము. దర్శించదగినదంతయూ దర్శించియుంటిని. బహుకాలమునకు ఇప్పుడు శ్రమపడి విశ్రాంతినిచెందితిని. చిన్మాత్రమగు ఆత్మతప్ప యింకేమియూ లేదు. పరమపదము సంశయశూన్యమని, సర్వకామనారహితమని, నిర్విశేషమని, మనస్సులేనిదని తెలిసికొనుము. సర్వపాపములు నశించినవారును, మహత్తర బుద్ధిశాలురును, ప్రశాంతచిత్తులను, అమనస్కయోగశీలురునగు మహాత్ములే భూమత్వప్రాప్తిని పొందినవారగుచున్నారు. నిత్యము ఆత్మవిచారణచేసి, చిత్తవృత్తులు జారిపోయి, మనస్సుయొక్క స్థాయినిదాటిపోయి మనస్సును త్యజించినవానికి బ్రహ్మభావము అనుభవమగును.
హేయమగుదృశ్యములను త్యజించువాడును, గ్రహింపదగిన ఆత్మవస్తువును గ్రహించువాడును, దృక్స్వరూపమును చూచువాడును, తెలియదగిన పరతత్త్వము నందు జాగరూకుడై జీవించువాడును, ఘనమోహమయమగు సంసారమార్గమందు నిద్రితుడైనవాడును, రస, అరస పదార్థములన్నిటియందు అత్యంత పరిపక్వవైరాగ్య తీవ్రతతో త్రెంచివేసినవాడును, హృదయగ్రంధి తెగిపోయినవాడును, చిల్లగింజచే జలము నిర్మలమగునట్లు విజ్ఞానవశమున అవిద్య తొలగినవాడునునగు మహ నీయునకు స్వస్వభావము(ఆత్మస్థితి) ప్రసన్నమగును. ఎపుడు మనస్సు రాగ శూన్యమును, ఆసక్తిరహితమును, ద్వంద్వరహితమును, నిరుపాశ్రయమును అగునో, దృశ్యమునాశ్రయింపకయుండునో, అప్పుడు పంజరమునుండి బయటకు వచ్చిన పక్షివలెనే, ఆమనస్సు బంధమునుండి బయటకువచ్చును. సందేహము, దుఃఖస్వభావము పోయినట్టియు, కౌతుకవిభ్రమములు నశించునట్టియు, లోపల కోరికలేనిదియు, పూర్వభావము కలదియునగు హృదయము పూర్ణిమనాటి చంద్రుని వలె ప్రకాశించును. ఇక్కడనేను లేను, ఇతరమునులేదు. నిరామయుడగు బ్రహ్మమునే నేనుగానున్నాను, అని ఈరీతిగా సదసత్తులనడుమ సత్తామాత్రమగు స్థితిని ఎవడు దర్శించునో అతడేజ్ఞాని. నేత్రేంద్రియములకు అప్రయత్నముగనే గోచరించు విషయములందు మనస్సు ఏరీతిగ రాగరహితముగనే వ్యాపించునో, అదేవిధముగా ధీరుని బుద్ధి కర్తవ్యకార్యములందు రాగశూన్యముగనే ప్రవృత్తికలిగి యుండును. తెలిసికొని అధీనములో నున్న ఇంద్రియములద్వారా ధర్మబద్ధముగ అనుభవించుచున్న సర్వవిషయములు సంతోషమునే కలిగించును. బంధమును కలిగించవు. మైత్రికలిగి, సేవచేసియున్న చోరుడు తనస్నేహితునకు ఉపకారము చేయునేగాని, అపకారము చేయజాలడు. తాముతలచకున్నను, ప్రయాణముచేయు బాటసారులకు గమ్యస్థానము ప్రాప్తించును. మార్గమధ్యములో కొన్ని సౌందర్య దృశ్యములుకూడ కనిపించును. అదేరీతిగా జ్ఞానులకు వారుభావించకున్ననూ భోగ సంపదలు మరియు పరమసుఖమును లక్ష్మి(మోక్షలక్ష్మి) నిస్సందేహముగ ప్రాప్తించును. మనోనిగ్రహముకలవారికి లీలాభోగములు లేకున్ననూ అనందమే, ఉన్ననూ ఆనందమే! అనాయాసముగా ప్రాప్తించిన స్వల్పభోగములనే ఆనందముగ అనుభవించి సంతృప్తినిచెందుదురు. బంధవిముక్తుడగు చక్రవర్తి కబళమాత్ర భోజనముతోనే సంతృప్తిచెందుచున్నాడు. శత్రురాజుల భయములేని రాజ్యమును కూడ అధికముగ భావించడు. హస్తములతో హస్తములను గట్టిగానలిపి, దంతము లను దంతములతో గట్టిగాకొరికి, అంగములను అంగములతో చరిచి, గట్టిపట్టుదలతో తనమనస్సును జయించవలెను. భవార్ణవమును దాటుటకు మనస్సుయొక్క విజయముతప్ప మరియొక మార్గములేదు.
నరకసామ్రాజ్యములో, పాపములనే మదించిన ఏనుగులు విచ్చలవిడిగా సంచరించు చున్నవి. ఆశలనే అస్త్రశస్త్రములను ధరించి, యింద్రియములనే శత్రువులను జయించుట సాధ్యముకాదు. జాగ్రత్తగానుండుము. మనస్సుయొక్క మదమును అణగద్రొక్కి యింద్రియములనే శత్రువులను శిక్షించినవానికి, హేమంతఋతువులో పద్మములు క్షీణించునట్లు భోగవాసనలు క్షీణించును. ఏకతత్త్వము, పరమాత్మ యొక్క దృఢతరాభ్యాసమువలన మనస్సు జయింపవలెను. అట్లు జయింప బడనంతవరకూ రాత్రియందు బేతాళములు తిరుగురీతిగా హృదయములో వాసనలు తిరుగుచుండును. వివేకియొక్క మనస్సు ఇష్టకార్యమును ఆచరించు విషయములో అతనికి భృత్యునివలె ప్రవర్తించును. సర్వార్థములును నెరవేర్చువిషయములో ఆ మనస్సు మంత్రివలె ఉపకారముచేయును. ఇంద్రియములన్నియు వశములో నున్నప్పుడు ఆమనస్సు సామంతరాజువలె సహాయముచేయు చుండును. ఆత్మవిచారణద్వారా ఆత్మనిశ్చయముగలవాని మనస్సు లాలించుటలో స్నేహశీల వలె మెలగును. ఉత్తమకార్యములు చేయుటలో ఉత్తమమిత్రునివలె నుండును. మంచిమనస్సు తండ్రివంటిది. ఎందువలననగా, తండ్రితన సుఖములను విడచి పెట్టుకొని, శాస్త్రదృష్టి, స్వబుద్ధి, ఆత్మభావన, స్వానుభవము వీనిలో ప్రవృత్తి గలవాడై పరమసిద్ధికి సహాయముచేయును. శుద్ధమనస్సుగూడ యిదేరీతిగా సహకరించును.
మిక్కిలిహర్షముకలది, మిక్కిలి దృఢమైనది, స్వచ్ఛమైనది, మంచిక్రాంతికలది, మంచిమెలకువకలది, ఆత్మగుణములతో సంపన్నమైనది, రమణీయమైనది అగు మనస్సు అనుమణి, హృదయములో హృద్యముగా ప్రకాశించును. బహుదోషములు, పాపములుఅను బురదతో కళంకితమైన ఈమనోమణిని మోక్షప్రాప్తినిమిత్తము జలముతో ప్రక్షాళనముచేసి, ఉత్తమదృష్టి కలవాడవునగుము. పరమవివేకము నాశ్రయించి, బుద్ధితో సత్యమును అన్వేషించి, యింద్రియములను శత్రువులను బాగుగాఛేధించి భవార్ణవమునుదాటుము. ఆశయొక్కటియే అనంతమని విజ్ఞులు తెలిసికొనిరి. వాసనలను తంతువులతో కట్టబడి, ఈలోకము జననమరణచక్రమున పరిభ్రమించుచున్నది. అందువలన ఈఆశ ఉండినచో మహాదుఃఖమునకు, ఛేధింప బడినచో మహాసుఖమునకు కారణమగుచున్నది. ధీరుడైననూ, బహుజ్ఞుడైననూ, కులీనుడైననూ, మహత్తుకలవాడైననూ, సింహము సంకెళ్ళతో బంధింపబడినట్లు మనుష్యుడు తృష్ణచే బంధింపబడినాడు. దీక్షతో పురుషప్రయత్నశీలుడై, యధా శాస్త్రముగా స్థిరచిత్తముతో కృషిచేసినచో, ఎవడు మోక్షసిద్దినిపొందడు.
అస్త్రము అస్త్రముచేతనే శాంతించును. మలినము మలినముచేతనే శుభ్రము చేయబడును. విషము విషముచేతనే విరుగును. శత్రువు శత్రువుచేతనే సంహరింప బడును. భూతమాయ(అవిద్య) ఈరీతిగానున్నది. ఈమాయావనము ఒక్క నాశనమువలననే హర్షమును ప్రసాదించుచున్నది. విచారణతో చూసినచో, ఈమాయ లేనేలేదు. పరమార్థదృష్టితో చూచినచో ఈమాయ నశించిపోవునదియేయగును. 'అంతయూబ్రహ్మమే' అనుభావన ఎవనిహృదయమున జనించునో, అదియతనికి మోక్షమునొసంగును. భేదదృష్టియే అవిద్య, దానిని ఎల్లప్పుడూ విసర్జించవలయును. ఈమాయ ఎట్లుకలిగినది?అనువిచారణ నీవుచేయవలదు. నేనీమాయను ఏరీతిగా నశింపజేయగలను? అనిమాత్రమే విచారణచేయవలెను. ఈఅవిద్య నశించినచో నీవు బ్రహ్మపదవినితెలుసుకొనగలవు. పరబ్రహ్మను తెలిసికొన్నప్పుడు ఈఅవిద్య ఎందు వలన కలిగినది? ఏరీతిగా కలిగినది? ఎట్లునశించును? ఈవిషయములన్నియు నీకుపూర్తిగా తెలియగలవు. వ్యాధిరూపములోనున్న ఈఅవిద్య నశించుటకై చికిత్స చేయుము. అవిద్యను నశింపజేసినచో, అదినిన్ను జననమరణదుఃఖములలో పడ వేయదు. ఈచిదర్ణవము (చిత్ అనుసముద్రము) తనలో తనరూపములే యైయున్న స్పందనములతోస్పందించుచున్నది. ఈచైతన్యముఏకాత్మకము, అఖండము. అద్వితీయముయను విషయమును నీవులోపల దృఢముగా అనుసంధానము చేయుము. చిన్మయార్ణవమునందు ఆచిద్రూపములోనున్న చిచ్ఛక్తి కొంచెము సంక్షోభముగలది యగుచున్నది. సాగరములో స్వచ్ఛముగానున్న చిద్రూపశక్తి చిద్రూపముగానే స్పందించుచున్నది. ఆకాశములో వాయువురీతిగా, సరోవరములో అలలవలెను ఈచిచ్ఛక్తి తనకుతానే తనయందు వ్యక్తమగుచున్నది.
యోగశిఖోపనిషత్:ద్వితీయాధ్యాయము:
6.మనుష్యులకు దేహాంతరప్రాప్తికి భావనకారణమైనటుల, విషయమును ధ్యానించు పురుషునియొక్క మనస్సు విషయమునందే రమించును. (ముని జడభరతుడు తానుపెంచిన లేడిపై మమకారముతో దానినినే చూచుచూ మరణిం చుటవలన దానికడుపునే జన్మనొందవలసిన అగత్యము ఏర్పడినది.) నన్ను స్మరించువానిచిత్తము నాయందేలీనమగును. సర్వజ్ఞత్వము, పరేశత్వము, సంపూర్ణ శక్తిత్త్వమును, అనంతశక్తిమత్త్వమును నన్ను స్మరించినందువలన కల్గును. సర్వమును ఆత్మయేయని, శాశనమువలన వ్యాప్తవ్యాపకభావము మిధ్యయేయని పరతత్త్వము తెలిసినపుడు భేదమునకవసరమేమున్నది? పరమాత్మయైన బ్రహ్మమునుండి సర్వభూతములు పుట్టుచున్నవి. కావున యివన్నియూ బ్రహ్మమే యని తెలిసికొనుము. బ్రహ్మమే సర్వనామములను, సర్వరూపములును, సర్వ కర్మలను భాసింపజేయుచున్నదని భావించవలెను. బంగారమునుండి తయారైన సర్వాభరణములకు సువర్ణత్వము శాశ్వతమైనట్లే, బ్రహ్మమునుండి పుట్టిన ప్రపంచమునకు బ్రహ్మత్వముకలదు. జీవాత్మాపరమాత్మలకు కొద్దిగానైన అంతరమునుచేసి ఎవడుండునో, అతడు మూఢుడు. వానికేభయము. అజ్ఞానము వలన ఇతరములను ద్వైతముగాచూచును. ఆత్మగా సర్వమును చూడవలెను. ఇతరమైనది అణుమాత్రమైనలేదు. ఈలోకమంతయూ అనుభవింపబదుచున్నది. వ్యవహారయోగ్యమే అయిననూ, స్వప్నమువలె ఉత్తరక్షణమున బాధకలదై, అసద్రూపముకలదే. స్వప్నమందు జాగరూకతలేదు. జాగ్రత్తయందు స్వప్నము లేదు. లయమందు ఆరెండునూలేవు. పరమాత్మకు ఆలయమున్నూలేదు.
గుణత్రయముచే నిర్మించబడినమూడునూ మిథ్యయే. అట్టిదృష్టితో గుణాతీతుడైన చిదాత్మకుడు నిత్యుడు. మృత్తునందు ఘటభ్రాంతి, శుక్తియందు రజతభ్రాంతి యెట్టిదో, బ్రహ్మయందు జీవత్వభ్రాంతియునట్టిదే. మట్టికి ఘటమని, బంగారమునకు కుండలమని పేరెట్లున్నదో, పరమాత్మయందు జీవశబ్దమున్ను వర్తించుచున్నది. ఆకాశమున నీలియే యున్నట్లు, ఎండమావిలో నీరున్నట్లు, స్థాణువునందు పురుష త్వమున్నట్లు, ఈవిశ్వము చిదాత్మయందున్నది. శూన్యమున బేతాళుడున్నట్లు, గంధర్వనగరమువలెను, ఆకాశమున ఇద్దరు చంద్రులున్నట్లు, సత్యమందు జగత్తున్నది. కెరటములరూపమున నీరే స్ఫురించునట్లు, ఘటమనుపేరుతో మట్టియున్నట్లు, జగత్తనుపేరుతో సర్వమును చిత్బ్రహ్మయే కేవలము భాసించు చున్నది. వంధ్యాసుతుడెట్లులేడో, ఎండమావిలో నీరెట్లులేదో, ఆకాశవృక్షమెట్లులేదో, అట్లేజగత్తుకు స్థితిలేదు. ఘటమునుచూడగా మృత్తికయే కన్పడునట్లు, ప్రపంచము ను చూడగా బ్రహ్మయే ప్రకాశించుచూ కన్పడును. ఎప్పుడు అపరిశుద్ధమైన ఆత్మ పరిశుద్ధముగా కన్పడునో, అప్పుడు అజ్ఞానికి రజ్జువు రెండువిధములుగా కన్పడును. కుండ ఎట్లు మృణ్మయమో, అట్లుదేహము చిన్మయము. ఈఆత్మానాత్మవివేకము పండితులచే వృధాగా చేయబడుచున్నది. రజ్జువు సర్పముగాను, శుక్తిరజతము గాను నిర్ణయించబడినట్లు, మూఢునిచే ఆత్మదేహముగా నిర్ణయింపబడినది. మట్టిని ఘటముగాను, ఎండమావులను జలముగాను, కట్టెలను గృహముగాను, ఇనుము ను లోహముగాను చూచినట్లే, అజ్ఞానమువలన, ఆత్మయందు దేహత్వమును చూచుచున్నాడు. చిత్తముచలించుచుండగా, సంసారము కల్గును. నిశ్చలమైనచో మోక్షముకల్గును. కావున గొప్పప్రజ్ఞచే చిత్తమును స్థిరముచేయవలెను. చిత్తమే అర్థములకు కారణము. అదిఉన్నప్పుడే జగత్రయమున్నది. అది క్షీణించిన జగత్తు క్షీణించును. కావున అదిప్రయత్నముచే చికిత్స జేయదగినది. గగనాకారమైన మనస్సేనేను. సర్వతోముఖమైన మనస్సేనేను, ఆత్మయు. మనస్సు కేవలుడైన పరుడుకాడు. మనస్సువలననే కర్మలు పుట్టుచున్నవి. మనస్సు పాతకములచే పూయబడుచున్నది. మనస్సు సదాఉన్మీనమైన పుణ్యములేదు, పాపములేదు. మనస్సుచే మనస్సునిచూచి, వృత్తిశూన్యమెప్పుడునగునో, అంతట సుదుర్లభమైన పరబ్రహ్మ చూడబడును.
అష్టావక్రగీత:మొదటి ప్రకరణము:
5. నీవు బ్రాహ్మణుడు మొదలగు వర్ణములు(జాతి)గలవాడవుకావు. నాలుగు ఆశ్రమములకు చెందినవాడవుకావు, ఇంద్రియవిషయముకావు. అయితే సంగ రహితుడవు కావు. నిరాకారుడవు. విశ్వమునకు సాక్షివిఅగుచున్నావు అనితలచి సుఖివికమ్ము.
18.శరీరాదికములగు దృశ్యములని మిథ్యగాతెలిసికొనుము. నిరాకారమగు ఆత్మతత్త్వమును నిశ్చలమైనదిగా ఎరుగుము. ఈయదార్థోపదేశముచేత, మరల సంసారమునందు పుట్టుట జరుగదు.
రెండవప్రకరణము:
1.నేను దోషరహితుడను. శాంతస్వరూపుడను. జ్ఞానరూపుడను. ప్రకృతికి పరుడను. అయినప్పటికి, ఇంతకాలము అజ్ఞానముచేత నానిజస్వరూపము తెలుసుకొనలేక మోసపోతిని.
8.ప్రకాశమే నాయొక్క నిజస్వరూపము. ప్రకాశమున కంటె నెను అతిరిక్తుడనుకాను. ఈజగత్తు నావలననే ప్రకాశింపజేయబడుచున్నది.
11. బ్రహ్మాదిస్తంబపర్యంతం 'నేను' ఉపాదానకారణముతో నున్నప్పటికినీ, యీజగత్తు నశించిననూ, నేనునశించను. కావున నాశరహితుడగునాకునేనే నమస్కరించుచున్నాను.
నాల్గవప్రకరణము:
5. చతుర్ముఖబ్రహ్మ మొదలుకొని తృణపర్యంతముగల నాలుగువిధములైన (జరాయుజ, అండజ, స్వేదజ, ఉద్బిజములను) భూతసమూహమునందు జ్ఞానికొక్కనికే ఇచ్ఛానిచ్ఛ్లను త్యజించుటయందు సామర్థ్యమున్నది.
తొమ్మిదవప్రకరణము:
6.వైరాగ్యము, సమత్వము, యుక్తులచేత చైతన్యముయొక్క ఆకారవిశేష జ్ఞానమును ఎవ్వరు తెలుసుకొని సంసారమునుండి తరింజేసికొనుచున్నాడో, అట్టివాడు గురువుకాడా ఏమి?
18వ ప్రకరణము:
35-37: హఠయోగాదులందు అభ్యాసులగుజనులు, శుద్ధమైనటువంటిదియు, జ్ఞానస్వరూపమైనటువంటిదియు, ప్రియమైనట్టిదియు, పూర్ణమైనట్టిదియు, ఆ ఆత్మను తెలిసికొనజాలరు. అజ్ఞాని అభ్యాసరూపమైన కర్మచేత మోక్షమును పొంద జాలడు. క్రియారహితుడైన పుణ్యపురుషుడు కేవలజ్ఞానమాత్రముచేతనే, ముక్తుడైయుంటున్నాడు. ఏకారణమువలన అజ్ఞానిబ్రహ్మము అగుటకు కోరుచున్నాడో, ఆకారణములవలననే అతడు ఆబ్రహ్మమును పొందజాలకున్నాడు. జ్ఞానికోరకున్ననూ పరబ్రహ్మస్వరూపమును పొందువాడుగా అగుచున్నాడు.
71. దృశ్యభావమును చూడనటువంటి శుద్ధప్రకాశస్వరూపుడగు జ్ఞానికి విహితకర్మానుష్ఠానరూపవిధి ఎక్కడ? వైరాగ్యముఎక్కడ? త్యాగముఎక్కడ? శమముగూడ ఎక్కడ?
100. ఉపశాంతచిత్తముగల జ్ఞాని జనముతో వ్యాప్తమైన ప్రదేశముగూర్చిగాని, ఆకలినిగూర్చిగాని పరిగిడడు. మరేమనగా, ఎక్కడో ఒకచోట ఏదోఒకవిధముగా సమభావముగలవాడై ఉంటున్నాడు.
బ్రహ్మసూత్రదర్శనం:
బ్రహ్మజ్ఞానమనేది అపరోక్షానుభావరూపమైనది. సిద్ధ(భూత) వస్తువిషయక మైనట్టిది కాబట్టి శృతి, స్మృతి, అనుభవాదులన్నియూ కూడాదానికి ప్రమాణాలే. బ్రహ్మవిషయంలో శృతితోపాటు బ్రహ్మవేత్తల సాక్షాత్కారరూపమైన అనుభవంకూడా ప్రమాణమే అవుతుంది.
శరీరమే ఆత్మ అనడంయుక్తంకాదు. ఆత్మ అనేది శరీరంకంటే విలక్షణమైనది. దేహేంద్రియ విషయములను ప్రకాశింపజేసే విజ్ఞానం, ఆదేహాదులకంటే ఎట్లుభిన్నమైనదో, ఆవిజ్ఞానానికి ఆశ్రయమైన ఆత్మసైతం వాటికంటె విలక్షణమైనది, భిన్నమైనది. ఆత్మజ్ఞానం అనేది కర్మలకు ఉపయోగించేదికాదు. తత్త్వజ్ఞానమనేది కర్మలకు అంగంకాదు.
"ఆచార్యకులంనుండి వేదాధ్యయనంచేసి ---" అంటూవిధింపబడినది కర్మాధికారి విషయంలోనేతప్ప అత్మాధికారికోసం కాదు. కర్మాధికారులు ఉపనిషవిద్యలు చదివినా, అర్థంతెలుసుకున్నా, వారికికలిగే ప్రయోజనం ఎట్లావుండదో, అట్లాగే అత్మజ్ఞానికి వేదార్థజ్ఞానం, వేదాధ్యయనంవల్ల ప్రయోజనం ఉండదుకాబట్టి, వేదాంత విద్యలకు కర్మసంబంధమైన విద్యలతో సంబంధంవుండదు. పరబ్రహ్మాన్ని ఎరిగిన వారు ఏషణాత్రయరహితులై పరమసుఖాన్ని బ్రహ్మభావాన్ని పొందుతారు కాబట్టి బ్రాహ్మణుడైనవాడు, బ్రహ్మమునెరుగగోరువాడు మొదట శాస్త్రజ్ఞానాన్ని సంపాదించాలి. ఆతర్వాత ఆజ్ఞానాన్ని దృఢపరచడం కోసం యుక్తులతో మననం చేయాలి. తరువాత మౌనరూపమైన నిధిధ్యాసనం చేయాలి. అపుడు బ్రహ్మవేత్త అవుతాడు. అత్యంత సూక్ష్మమైన బ్రహ్మతత్త్వ సాక్షాత్కారానికి బ్రహ్మధ్యానమే సాధనమని, ఆధ్యానానికి ఆసనాది నియమాలు అక్కరలేదని, బిక్షాటనసమయంలో సైతం ధ్యానం చేయవచ్చునని విధిచెబుతోంది. గృహస్థుకు యజ్ఞాదులతోపాటు శమదమాదులు కూడా విధింపబడేవున్నాయి. అతనికి చిత్తదోషంవల్ల స్వర్గాదులయందు కాంక్ష ఎక్కువయితే యజ్ఞాదులుచేసి వాటిని పొందవచ్చును. మోక్షమందు కోరిక అధికమైతే నిత్యనైమిత్తికకర్మలతోపాటు జపాదులాచరించి, బ్రహ్మజ్ఞానసిద్ధిని పొందవచ్చును. బ్రహ్మసాక్షాత్కారమనేది దృష్టఫలం. దృష్టఫల మనేది ఫలసిద్ధి కలిగేదాకా, అవఘాతాదులు తండులనిష్పత్తిపర్యంతం చేసినట్లు (బియ్యంవచ్చేదాకా ధాన్యాన్ని దంపినట్లుగా), సాక్షాత్కారంకలిగేదాకా శ్రవణాదుల్ని ఆవృత్తి చేయాలి. నిధిధ్యాసనమనేది ఆవృత్తిగుణకం అవుతుంది.
సూ॥ ఆత్మేతి తూపగచ్ఛన్తి గ్రాహయన్తి చ.
'నేనే పరమాత్మను' అనే అహంప్రత్యయంలోనే ఉపాసనచేయాలి. అప్పుడే పరమాత్మను పొందుతారు. పరమాత్మ నిత్యశుద్ధబుద్ధముక్తస్వరూపుడు. అటువంటి పరమాత్మ సాక్షాత్కారంకోసం సగుణోపాసనచేసినా, నిర్గుణోపాసనచేసినా, ధ్యానదులయందు 'నేనే ఆపరమాత్మను' (సోహం) అని, తనకు ఆపరమాత్మకు బేధంలేదని గ్రహించి ధ్యానంచేయాలి. అంతేతప్ప నేనువేరు, ఆపరమాత్మవేరు అనేభావంతో ధ్యానోపాసనాదులు చేయరాదు. ఎందుచేతనంటే, ఉపాసకుడైన జీవాత్మ, ఉపాస్యుడైన పరమాత్మ అభిన్నులే!
సూ॥ బ్రహ్మదృష్టి రుత్కర్తాత్. ఉత్కర్షవల్ల (ఉత్కృష్టమైనది కాబట్టి) మనస్సు మొదలైనవాటియందు బ్రహ్మదృష్టినుంచి ఉపాసించాలి.
సూ॥ ప్రాయణాత్తత్రాపి హి దృష్టమ్ మరణపర్యంతం ఉపాసనల ఆవృత్తి చేయవలసినదే! ఎందుచేత? మరణకాలంలోకూడా చేయాలి అని "సమావత్క్రతు" ఇత్యాది శృతులు చెబుతున్నాయి.
యోగవాశిష్ఠం:ముముక్షువ్యవహారప్రకరణం:18వ సర్గ:
68. అనుభవవ్యతిరేకము అని అపవిత్రకుతర్కమునొనరించి, తత్త్వజ్ఞానమును పాడుజేయుట పాడికాదు.
70.రామా! బ్రహ్మసాక్షాత్కారము నొనరించుకొనగల శక్తితోగూడిన బుద్ధి మనకున్నది. దీనివలన పూర్వోక్తరూపమున సమస్తశాస్త్రముల ఏకవాక్యత (అనగా అఖండమగు బ్రహ్మతత్త్వముననే తాత్పర్యము) నిర్ణయించితిమి. దీనిని గ్రహించిన పరమపురుషార్థము లభించును. వేదాంతవిరోధములగు శాస్త్రములు శృతివ్యతిరేకములగు తర్కములతో నిండియున్నవి. "తత్త్వమసి" ఇత్యాదులకు మహావాక్యములు వారిమతములను సమర్థింపజాలవు. అందువలన ఇదియే వేదానుగతమని గ్రహింపుము.
19వ సర్గ:24. విచారపరుడు ఆత్మను గ్రహింపగల్గినచో, విచారమునకును, శబ్దము నకును అతీతుడగు పరబ్రహ్మమున బర్యవసించును.
33. జన్యవస్తువుమాత్రమే మిధ్య. అందువలన సత్యస్వరూపమగు బ్రహ్మము కారణరహితము. ప్రత్యక్షతత్త్వము నాలోచించిన ఆ అద్వితీయ బ్రహ్మము సిద్ధించు చున్నది. ఇక అనుమానాదులు ప్రత్యక్షముయొక్క అంశికబేధములే కనుక బ్రహ్మ సర్వప్రమాణతత్త్వము.
35.ఓరామా! స్వీయబుద్ధిబలమున అనంతబ్రహ్మమును సాక్షాత్కరింప జేసికొనజాలనంతవరకు ఆచార్యుల ప్రమాణసిద్ధి, సత్యమతముననుసరించుచూ, తత్త్వవిచారము నొనరించుము.
20వసర్గ:9. జ్ఞానసదాచారముల రెంటిని ఒకేమారు అభ్యసింపనియెడల ఈరెంటిలో నెద్దియూ పట్టుబడదు.
ఉత్పత్తిప్రకరణము:1వసర్గ:
1. బ్రహ్మమే మహావాక్య ప్రభావమున బ్రహ్మవేత్తయగును. అనగా జీవుడుగ తోచువాడు మహావాక్యములభ్యసించిన కలుగు అఖండాకారమును వృత్తివలనతన్ను ఆశ్రయించియుండు అజ్ఞానమునాశనమొనర్చి, బ్రహ్మభావంబున బ్రకాశితుడగును. అట్టి ఆత్మప్రకాశమునే బ్రహ్మజ్ఞానము కప్పియుంచి, దృశ్యప్రపంచమును దోపింప జేయు మాయ స్వప్నము వంటిది. ఇది ప్రత్యగాత్మయందు అనగా జీవచైతన్యము నందే తోచుచున్నది. "ఇదంతయూ బ్రహ్మమే" అనిచెప్పు స్వబొధక మహా వాక్యముల వలన పైనచెప్పినట్లు స్వాత్మరహస్యమును గ్రహించువాడే బ్రహ్మజ్ఞుడనం బడుచున్నాడు.
4వ సర్గ:55. ఏచైతన్యమయజ్ఞానమున దిక్కులు, భూమి, ఆకాశాదివస్తువులు ప్రకాశించుచున్నవో, ఆప్రకాశము దిగాదిరహితమై దానిని ఆత్మ ప్రకాశమనవచ్చును.
6వసర్గ:1. దేవదేవుడగు పరమాత్మునితో ఏకత్వము జ్ఞానయోగమువలననే లభించును. ఇతరములును, క్లేశకరములునగు కర్మాదుల అనుష్టానము వలన నిది లభింపదు
.
3.ఈపరమాత్మ దూరస్థుడుకాడు, నికటస్థుడు కాడు. సులభుడుకాడు, దుర్లభుడుకాడు. స్వానందప్రకాశరూపమగు ఈబ్రహ్మమును నిజశరీరమందే లభింపజేసికొనవచ్చును.
4.తపోదానవ్రతాదులలో నేయొక్కటియు తత్త్వజ్ఞానమునుగూర్ప సాయపడ జాలదు. స్వస్వరూపమున నిల్చుటగాక వేరొక్క ఉపాయములేదు.
5. సాధుసంగమ సచ్ఛాస్త్రములే మోహజాలముల నాశమొనర్చుటకనువైన ఉపాయములు. వీటివలననే స్వాభావికమగు తత్త్వజ్ఞానము లభించును.
6. ఇతడే దేవదేవుడగు పరమాత్మ అనుజ్ఞానము లభించిన, దుఃఖముల ననుభవింపవలసియుండదు. ఈజ్ఞానము పొందినవాడు జీవన్ముక్తుడనబడును.
9. పురుషుడు తన పౌరుషబలమున వివేకమను ఉపాయమును నాశ్రయించి, బ్రహ్మ సాక్షాత్కార మొనర్చు కొనుచున్నాడు.
16.తత్త్వజ్ఞానమునంద గోరువాడు మొమ్మొదట వీలైనంతవరకూ, లోకశాస్త్రవిరుద్ధముగాని జీవిక నవలంభించి, సంతుష్టుడగును. మరియు భోగవాసన లను పరిత్యజించవలెను.
20-21: పదిమంది మంచివారు అనగా శృతిస్మృతినిష్ఠాపరులు ఎవనిని సాధు పురుషుడని పేర్కొందురో, అతడే జ్ఞానవైరాగ్యాది విశిష్టగుణములతో గూడిన సాధు పురుషుడు. ఇట్టివానిని పరమప్రయత్నముతో నాశ్రయింపనగును. ఆధ్యాత్మవిద్య విద్యలన్నింటిలోను శ్రేష్ఠమైనది. ఇట్టి ఆత్మవిద్యను నుడువు శాస్త్రమే సచ్ఛాస్త్రము. ఇట్టి శాస్త్రము బఠించిన ముక్తి లభించును.
7వ సర్గ:8, 9: ఈజీవుడజ్ఞుడై దుఃఖము ననుభవించుచున్నాడు. తన్నశరీరిగా తలపజాలకున్నాడు. అంతఃకరణచైతన్యమునబడి వ్యర్థముగా అనర్థముల ననుభవించు చున్నాడు. పూర్ణస్వభావమును, నిత్యచేతనమునునగు నాఆత్మ యొక్క చేత్యదర్శనము నివృత్తమైన, బహిర్ముఖ చిత్తవృత్తులు నశించి, అంతర్ముఖీ నములైన ఏపూర్ణత్వము ప్రకాశించునో, దానినే తత్త్వసాక్షాత్కారమందురు. దీనిని బొందినచో, శోకమోహాదుల బొందనవుసరములేదు.
17. జన్మయను అరణ్యమున పరిభ్రమించుచున్న చేతన జీవునియందు పరమాత్మ బుద్ధినుంచువారు పండితులైననూ మూర్ఖులే. ఏలయన, జీవభ్రాంతియే ఈసంసారమునకును, తదంతర్గత దుఃఖములకును గారణమగుచున్నది. ఈతని నెరింగిన లాభమేమియూలేదు. జీవుని జీవత్వమువిడచి, పరమాత్మభావమును గ్రహించిన, విషవేగము శాంతివల్ల విషూచిక ఉపశమించినట్లు దుఃఖములన్నియూ ఉపశమించును.
13వ సర్గ:53, 54: స్వప్నమున మరణముగాంచి, నిద్రావసానమున నది అళీకమని ఎరుంగునట్లు, జ్ఞానముగలిగిన ఈసంసారము మిధ్యయనిబాధపడును. అప్పుడు కేవలము అఖండమును, అనాదియును, అనంతమునగు బ్రహ్మమునే జ్ఞానాకాశమున దర్శింపగలము. ఆపరమాకాశమున స్వయముగ శూన్య స్వరూపమున వెలయు ఆదిప్రజాపతి, అతివాహికదేహధారి. అతనిదేహము పాంచ భౌతికముగాదు. అందువలన అజాతములగు శశశృంగాదులవలె తత్సంభూతము లగు పృథ్వ్యాదులుగూడ సత్తులుగావని గ్రహించుచున్నది.
ఉత్పత్తిప్రకరణము:63వసర్గ:
27,28: బుద్ధిమంతుడైనవాడు నియతిననుసరించి, పురుషకారమును పరిత్యజించ కూడదు. ఎలయన, నియతి పురుషకారరూపముననే కర్మలను నియమించు చున్నది. (అనగా ఆయాకర్మలనాచరించిన ఆయాఫలితములు లభించుచున్నవి). ఇయ్యది పురుషప్రయత్నముతో వివక్షింపబడక, ఈశ్వరసంకల్పరూపమున నరుదెంచినపుడు నియతియనియు, సృష్టిరూపమున నరుదెంచినపుడు పురుషకార రూపమును(ప్రయత్నము) గ్రహింపకున్న నిష్ఫలము. పురుషకారరూపము దాల్చిననే సఫలమగుచున్నది.
30.నిర్వికల్పసమాధియందు, వాయువునిరోధించి, తత్త్వజ్ఞుడు ముక్తినొందుట కూడ పురుషకారము వలననే. అందువలన పురుషకారములేకుండగనే ఫలము లభించునని ఎట్లుచెప్పగలము?
96వసర్గ:73: నిర్మలమగు చైతన్యమొక్కటియే జీవమనోబుద్ధ్యహంకారముల బ్రసిద్ధికెక్కెను. అదియే లోకమున చేతన, జీవ, చిత్తాదిసంజ్ఞలచే పిలువబడుచున్నది. ఈవిషయమున సంశయముగాని, వాదముగానిలేదు.
114వసర్గ:72: నిరతిశయానందరూపమగు బ్రహ్మమునెరింగిన తత్త్వవేత్తల సంసర్గముచేయుచూ, మరల మరల ఆత్మవిచారణచేయుచూ, బ్రహ్మభావము దృఢపరచి, అట్టి దృఢనిశ్చయముచే శోభించుచూ, సమత్వసౌశీల్యముకలిగి, ఆసక్తి రహితుడవై, ఉత్తమవివేకబుద్ధితో గూడి సదా వ్యవహరించుచో, మిధ్యాజనితములగు జననమరణాదివికారములులేక, నిత్యము ముక్తుడవైయుండుము. మరియు నట్టి స్థితియందున్ననీకు హరి, హర, బ్రహ్మాదులైననూ సాటికానేరరు.
115వసర్గ:35, 36: ఈమనస్సను పురుషుడు దేశకాలవస్తువులచే పరిచ్ఛిన్నముకానట్టి తనయాత్మనవలంభించి, అద్దానియందు ప్రతిష్టుడగుచో, పరిపూర్ణుడవగలడు. వేదాంతాదిశాస్త్రములవల్లను, ఆచార్యునివద్ద కావించిన సమ్యగ్విచారణ వల్లను, సారాసారములనెరిగిన వివేకముయొక్క ప్రబుద్ధచిత్తమున, నశ్వరమగు దేహమునేనుకాను, పూర్ణానందస్వప్రకాశైకరూపుడగు బ్రహ్మము మాత్రమగుదునను నిశ్చయము కలుగును. బ్రహ్మకారవృత్తి కలిగియుండునట్టి యధికారిజీవునకు దుఃఖమంతయూ పూర్ణముగ నశించును.
స్థితిప్రకరణము:18వసర్గ:
29-31: ఆకాశమువలె విశాలమగు స్వరూపముకల్గి, సర్వత్రవ్యాపించి, సర్వమును ప్రకాశింపజేయునదైననూ, ద్రష్టనేత్రమువలె యదార్థముగ తన్నుతాను గాంచుటలేదు. ఆహా! మాయ ఎంతప్రబలమైనది? భ్రమరహితుడగు ముక్తపురుషుడు దృశ్యరూపమగు ద్వైతముగాంచనట్లు, ఆకాశమువలె సర్వవ్యాపకమగు ద్రష్ట తన పరమార్థస్వరూపమువంటిదేనగు ఇతరుల పరమార్థస్వరూపమును గాంచుటలేదు. ఆకాశమువలె సర్వత్రవ్యాపించియున్ననూ, బ్రహ్మము యత్నముచేనైననూ కన్పించుటలేదు. ఏలయన దృశ్యమును దృశ్యరూపముగ జూచునంతవరకూ బ్రహ్మస్వరూపప్రాప్తి యతిదూరమున నున్నదనియే యెంచవలెను.
33. దృశ్యముకన్పించును, ఇదిగాని, ద్రష్టగాని కన్పించుటలేదు. కాని యదార్థముగ ద్రష్టయేగలడు. దృశ్యములేదు.
65. ఏసద్బుద్ధియగు మనుజునకు భోగలాలస దినదినము క్షీణించుచుండునో, అట్టివానిచే చేయబడు తత్త్వవిచారమే సఫలమగునని యెరుగవలయును.
22వసర్గ:16: తత్త్వవిచారముచే ఆత్మస్వరూపసాక్షాత్కారమొందినవాని దృష్టి యందు బ్రహ్మవిష్ణుహరాదులున్ను దీనులేయగుదురు. ఏలయన, సృష్టి అధికారా దులయందు క్లేశమేకలదు.
32వసర్గ:35: కేవలము తర్కశాస్త్రమునాశ్రయించువారు పరమపురుషార్థమగు తమ ఆత్మలాభమును నశింపజేసికొనువారగుచున్నారు. కాని స్వానుభవముచే శృతిప్రసిద్ధమార్గము ననుసరించి యుత్తమగతి బొందనుంకించువానికి వినాశమెన్నటికి చేకూరదు.
55. విషయాకారవృత్తులందలి ప్రతిబింబభూతులగు చిదాభాసులయొక్క అంతః కరణావచ్ఛిన్నమగు చైతన్యమేబింబము. అనగా అంతఃకరణోపహితమగు చిదాభాసు ని బ్రహ్మచైతన్యమే బింబమగును. అంతఃకరణ ప్రతిబింబితుడగు చిదాభానుడే ప్రతిబింబము. ప్రతిబింబములు, నామనిరుపాధులు రెండునూ మిధ్యారూపములే. అభిన్నమగు బింబముమాత్రము సత్యమైనది. ఇవ్విధమున తత్త్వవిచారము సలుపవలెను. అర్హతాదులచే ప్రేరితమగు బుద్ధికలవాడై పశుత్వము నొందకుము.
33వసర్గ:1: ఓరామా! అతిశయముగ నొనర్పబడు యుత్తమసాధనలన్నియు నియమపూర్వకముగ సఫలమగుటచే లౌకికములగు కృషిసేవాది సాధనము లందును, శాస్త్రీయములగు మోక్షాదులందును, శుభోద్యోగములందును సర్వత్ర తదనుకూలమగు ఫలమవశ్యము సంభవించును. కావున మోక్షపహలముకై నీవును ప్రయత్నమును విడువకుము.
43. ఆత్మ, చిన్మాత్రస్వరూపమును, నిర్మలదర్పణము వంటిదియునైయున్నది. అట్టి శుద్ధచిన్మాత్రమగు ఆత్మస్వభావమును నిరంతరము ధ్యానించుచుండుటచే అహంకారము వృద్ధినొందకుండును.
33వసర్గ:10-17: ఓరామా! ఉత్తమభావానుసంధానముచే మనస్సు ప్రశాంతి నొంద, అజ్ఞానమను దట్టమైన మేఘము క్రమముగ నశింప, అపుడు శుక్లపక్ష చంద్రునివలె సౌజన్యము వృద్ధినొందును. మరియు ఆకాశమునందు సూర్యతేజము వలె వివేకము వ్యాపించును. వెదురునందు ముత్యమువలె, అపుడాత్మలాభముచే హృదయమున ధైర్యము వృద్ధినొందును. మరియు వసంతకాలమునాటి చంద్రునివలె ఆత్మానందలాభముచే కృతార్థత సంభవించును. అపుడు శీతలచాయాయుక్తమగు సత్సాంగత్యమను ఫలవృక్షము ఫలించును. సమాధియను ఉత్తమతరువునుండి సచ్చిదానందమను శ్రేష్ఠరసము ప్రవహించును. మరియు మనస్సు నిర్ద్వందమును, నిష్కామమును, నిరుపద్రవమును, ప్రశాంతమును, చపలత్వాది అనర్థరహితము ను, శోకమోహభయరోగవర్జితమునునగును. అపుడు మనంబు శాస్త్రార్థసంశయ రహి తమును, విషయవైచిత్ర్యదర్శనేచ్ఛవర్జితమును, మోహకల్పనాజాలవినిర్ముక్తమును, నిర్లిప్తమును, ఆశావర్జితమునును, ప్రవృత్తిచ్ఛారహితమును, మానసికచింతా విరహితమును, ప్రచలితశోకనీహారయుక్తమును, కనుకనే స్వచ్ఛమును, విషయా సక్తిగ్రంధివర్జితమునగును. సంశయములను దుష్టపుత్రులు కలదియును, శాఖా వంతములగు పలువిథమనోరథములతో కూడినదియు, తృష్ణయనుభార్యచే సంపన్న మును, స్థూలదేహమను పంజరముకలదియునగు స్వమనోరూపమును నశింప జేసి, యామనస్సు ఈశ్వరరూపమును, ప్రత్యగాత్మసంబంధమునునగు జీవన్ముక్తి పదమును సాధించుచున్నది. నిగ్రహమునందలి స్వసామర్థ్యమును యోచించి, యీమనస్సు తన్నుపోషించు శత్రుమిత్రసాధ్వసాధ్వాది వికల్పములను త్యజించివైచి, పిమ్మట కల్పితమగు తనరూపమునుకూడ తృణమువలె పరిత్యజించుచున్నది.
34.క్షయించుచున్ననూ ప్రయత్నశీలుడగు చంద్రుడు నిరంతరమెట్లుపూర్ణత్వము గూర్చినయాశను త్యజింపకుండునో, అటులనే, నిర్మలచిత్తముచే దారిద్యాదులచే పీడితుడైననూ, శాంతి మనస్సమాధానరూపమగు తన యుత్తమగతిని త్యజింపకయే యుండును.
69. తత్త్వవిచారణచే ఆత్మయను దీపజ్యోతిప్రాప్తింప, శరీరమునకు ప్రభువగు అయాత్మ సమస్తదోషములను రహితమొనర్చి, ధైర్యయుక్తమై, ప్రపంచమున జననమరణదశలందు, ఐహిక, పారలౌకిక, నీరసస్థితులగాంచుచూ, స్వదేహ నగరమున తాపత్రయరహితుడై విలాసముగ చరించుచుండును.
36వసర్గ:11: చైతన్యమేదేని విషయము సంభవించునపుడు, తనస్వరూపమునే యనుభవించుచున్నదగును. కానచైతన్యము తనయాత్మస్వరూపముననే స్థితికలిగి యున్నదని విద్వాంసులయనుభవమైయున్నది. అట్లైననూ, ఈజగత్తంతయూ, ఆత్మకంటెవేరుగనున్నదని అజ్ఞులు కల్పనమొనర్చుచున్నారు.
14. ఈచైతన్యమెపుడునూ నశించుటలేదు. ఉత్పన్నమగుటలేదు. లేచుటలేదు. కూర్చుండుటలేదు. వచ్చుటలేదు. పోవుటలేదు. ఈస్థానమునగాని, లేక సర్వత్ర వ్యాపించి యేకరూపముననున్నది.
ఉపశమప్రకరణము:26వసర్గ:
11-14:ఈజగత్తు చైతన్యస్వరూపము. చిత్తుయొక్క ఆధీనమగుటచే, దృశ్య మంతయునూ, చిన్మాత్రమే. చిత్తునందే అభ్యసింపబడినదగుటచే, అంతయునూ చిన్మయమే. నీవున్నూ చిన్మయుడవే. నేనున్నూ చిన్మయుడనే. ఈసమస్త లోకములున్నూ చిన్మయములే. ఇదియే తత్త్వమంతటిసారము. నివు శ్రద్ధా వంతుడవును, వివేకియునైనచో, ఈనిశ్చయముచేతనే సమస్తమును పొందగలవు. అట్లుగానిచో, అధికముగా వెచ్చించిననూ, భస్మమందలిఆహుతివలె వ్యర్థమగును. చిత్తుయొక్క విషయకారకల్పనయేబంధము. అట్టికల్పనలేకుండుటయే ముక్తి. చిత్త్య(విషయాకార)నిర్ముక్తమగు చిత్తు పూర్ణాత్మస్వరూపమేయగును. ఇదియే సమస్తసిద్ధాంతముల సారము. ఇట్టినిశ్చయమునవలంభించి, అఖండాకారవృత్తిచే నీజగబంతయూ నవలోకించుచూ, నీవు స్వయముగనే బ్రహ్మపదమును నిక్కముగపొందగలవు.
64వసర్గ:3-6: ధీరులగువిజ్ఞులతోగలసి విచారించుటవలనకలుగు ఉత్తమ తీక్ష్ణబుద్ధిచే అహంకారమను కాలమేఘము హృదయాకాశమున లెస్సగనశింప, సర్వలోక వ్యాప్తమును, ఫలసహితమును ఆనందకరమునగు నిర్మలచిత్తమను శరత్కాలము ప్రవేశింప, ద్యానయోగ్యమును, శరణ్యమును, ఆత్మరూపమగుటచే సుగమమును, సర్వానందసంపత్తిస్వరూపమును, సుప్రసన్నమును, చిదాకాశరూపమునగు పరమాత్మయందెవడు స్థితినొందునో, మరియు నెవడు నిత్యమాత్మవిచారతత్పరుడై, సుఖస్వరూపుడై, చిదాస్వాదనపరుడైయుండునో, యాతనిచిత్తము దుఃఖముతో పీడింపబడదు.
19.వైరాగ్యోల్లాసయుక్తమై, ఆత్మాకారవృత్తిరూపమై, చిత్తముయొక్క అభ్యుద యము స్పష్టరీతియేరిచే సంభవించునో, ఆమిత్రులే మిత్రులు. ఆశాస్త్రములే శాస్త్రములు. ఆదినములే దినములు
.
79వసర్గ:2: ఆద్యంతరహితుడును, అసాధారణుడునగు పరమాత్మయొక్కడే ఈజగత్తునకలడు. అతనికన్యమెట్టిదియును లేదను నీమహత్తరనిశ్చయమునే విజ్ఞులు సమ్యగ్జ్ఞానమందురు.
5-7: సంకల్పాంశవినురుక్తమును, విషయవర్జితమునునగు సంవిత్తే, తన ప్రకాశరూపస్వభావమునే మోక్షార్థమంతటను విఖ్యాతమైయున్నదిగాని, యన్యము గాదు. శుద్ధరూపమున నెరుంగబడిన యసంవిత్తే పరమాత్మయని వచింపబడినది. శుద్ధరూపమైనప్పటికి, అశుద్ధరూపకల్పనచే నదియే అవిద్యయగునని విజ్ఞులచే యెన్నబడినది. సంవిత్తే(జ్ఞానమే) సంవేద్యము(జ్ఞేయము). ఈరెంటియందునూ ద్వైతకల్పన లేదు. అజ్ఞానవశమున ఆత్మ తన్నుతాను జాగద్రూపముగా సంచయ మొనర్చుకొనుచున్నది గాని, యదార్థముగ యిట ఆత్మకన్యముగ యేమియూలేదు.
11.మహత్తుకున్ను మహత్తైనట్టి బ్రహ్మమే విశాలమగు యీదృశ్యరూపమున నున్నది. ఇక్కారణమున జ్ఞానముచే ద్వైతమును రహితమొనర్చి యత్నముచే నాత్మస్వరూపుడవుకమ్ము.
13. ఆద్యంతములందును నాశరహితమైన స్వరూపమెద్దికలదో, అదియే వస్తువని ప్రసిద్ధికెక్కినది. అదియే ఆత్మయొక్క స్వరూపమున్ను అగును. కావుననోరామా! నీవాత్మమయుడవు కమ్ము.
80వసర్గ:5: అంతఃస్థితమగు ఏచిదాత్మచే బాహ్యాభ్యంతర పదార్థములు ప్రకాశించుచున్నవో, దేనిచే అనాత్మభూతములగు పంచకోశములు ఆత్మతోటి అభిన్న రూపము ననుగమింపబడుచున్నదో, అట్టిఆత్మసంబంధమగు కర్మలచేతను, ఔదాసీన్యముచే యధాప్రాప్తములగు పదార్థములనుభవించుట మున్నగు క్రియల చేతను, తీక్ష్ణబుద్ధిగల ప్రాజ్ఞుడు సంబంధితుడగునేగాని, మూఢులవలె రూపపంకము నాస్వాదించు కర్మలచేగాడు.
93వసర్గ:20: బ్రహ్మతత్త్వమెరింగింపజేయునదియు, జ్ఞేయముతోటి యభిన్న రూపమునన్నదియునగు శాస్త్రవిచారమే జ్ఞానమనబడును.
|
|